Advertisement
farewell
-
Roger Federer: రోజర్ ఫెడరర్ వీడ్కోలు..
టెన్నిస్ను ఎంత అందంగా ఆడవచ్చో అతను చూపించాడు... బేస్లైన్నుంచి ఆడినా, నెట్పైకి దూసుకొచ్చినా అతని ఆటలో కళాత్మకత కనిపించింది...అతని ఫోర్హ్యాండ్ ఘనత గురించి చెప్పాలంటే అది ‘టెన్నిస్లోనే గొప్ప షాట్’...స్మాష్, స్కై హుక్, హాఫ్ వాలీ, స్లామ్ డంక్...పేరు ఏదైనా అతను ఏ షాట్ కొడితే దానికి ప్రపంచం జేజేలు పలికింది... అద్భుతమైన ఫుట్వర్క్తో పాదరసంలా జారుతూ మైదానమంతా చుట్టేసి అతను ప్రత్యర్థుల పని పట్టినప్పుడు చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించింది... సుదీర్ఘ కెరీర్లో ఘనమైన రికార్డులెన్నో సాధించినా ఏనాడూ వివాదం దరి చేరనివ్వని అసలైన జెంటిల్మన్ అతను... ఒక్క మాటలో చెప్పాలంటే టెన్నిస్లో రాముడు మంచి బాలుడు ఎవరంటే మరో మాటకు తావు లేకుండా అందరూ అతని పేరే చెబుతారు. అందుకే అతను గెలిచిననాడు వహ్వా అని సంబరాన్ని ప్రదర్శించిన ఫ్యాన్స్...అతను ఓడి అందరి ముందు చిన్నపిల్లాడిగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తమకే ఏదో జరిగినంతగా బాధపడ్డారు... రెండు దశాబ్దాలకు పైగా ఆటపై చెరగని ముద్ర వేసిన ఆ దిగ్గజం పేరు రోజర్ ఫెడరర్. చరిత్రలో నిలిచిపోయే విజయాలను తన బయోడేటాగా మార్చుకున్న ఈ స్విస్ స్టార్ ఆటకు వీడ్కోలు పలికాడు...చిరస్మరణీయ జ్ఞాపకాలను అభిమానులకు పంచి నిష్క్రమించాడు. బాసెల్: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన ఆటతో అభిమానులను అలరించి, ఆటను శాసించిన దిగ్గజ ప్లేయర్ రోజర్ ఫెడరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెల 23నుంచి 25 వరకు లండన్లో జరిగే లేవర్ కప్లో తాను చివరిసారిగా బరిలోకి దిగుతానని, ఆపై ప్రొఫెషనల్ టెన్నిస్నుంచి పూర్తిగా తప్పుకుంటానని అతను వెల్లడించాడు. వరుస గాయాలు, ఆపై శస్త్రచికిత్సలతో చాలా కాలంగా కోర్టుకు దూరంగా ఉంటూ వచ్చిన ఫెడరర్ ఎప్పుడైనా తప్పుకోవచ్చనే సంకేతాలు వినిపించాయి. అయితే గత జూలైలో వింబుల్డన్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరై ఇక్కడ మరోసారి ఆడాలని ఉందని చెప్పినప్పుడు మళ్లీ బరిలోకి దిగవచ్చని అనిపించింది. కానీ ఆ ఆలోచనను పక్కన పెడుతూ 41 ఏళ్ల రోజర్ తన వీడ్కోలు వివరాలను సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించాడు. 1998లో ప్రొఫెషనల్గా మారిన ఈ స్విట్జర్లాండ్ స్టార్ 2021 జూలైలో చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో హ్యూబర్ట్ హర్కాజ్ (పోలండ్) చేతిలో 3–6, 6–7 (4/7), 0–6 తేడాతో ఓడిపోయాక మళ్లీ రాకెట్ పట్టుకోలేదు. 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్ కొన్నాళ్ల క్రితం వరకు అత్యధిక స్లామ్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడిని నాదల్ (22), జొకోవిచ్ (21) అధిగమించారు. ‘గత మూడేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. నేను పునరాగమనం చేసేందుకు చాలా ప్రయత్నించాను. కానీ శరీరం సహకరించడం లేదని నాకు అర్థమైంది. గత 24 ఏళ్లలో 40 దేశాల్లో 1500కు పైగా మ్యాచ్లు ఆడాను. టెన్నిస్ నేను ఊహించినదానికంటే ఎక్కువ స్థాయిలో గొప్ప జ్ఞాపకాలు అందించింది. లేవర్ కప్ తర్వాత ప్రొఫెషనల్గా కాకుండా ఆసక్తి కొద్దీ ఎప్పుడైనా టెన్నిస్ ఆడుతూనే ఉంటా. ఇది చాలా బాధాకరమైన నిర్ణయమే అయినా నేను సాధించినవాటితో చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. దేవుడు నాకు టెన్నిస్ బాగా ఆడే ప్రత్యేక ప్రతిభను ఇచ్చాడు. అందులో నేను ఊహించని ఎత్తులకు వెళ్లగలిగాను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో పోటీ పడగలగడం నా అదృష్టం. నా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, భార్య, కోచ్లు, అభిమానులకు కృతజ్ఞతలు. 24 ఏళ్లు 24 గంటల్లా గడిచినట్లు అనిపిస్తున్నాయి. ఆటగాడిగా విజయాలు ఆస్వాదించాను. నవ్వాను, ఏడ్చాను, బాధను భరించాను, భావోద్వేగాలు ప్రదర్శించాను. నా సొంత నగరం బాసెల్లో బాల్బాయ్గా ఉన్నప్పుడు కన్న కలలు నేను పడిన శ్రమతో నిజమయ్యాయి. టెన్నిస్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ – ఫెడరర్ ►కెరీర్లో గెలిచిన మొత్తం టైటిల్స్ – 103 ►గెలుపు–ఓటములు – 1251–275 ►కెరీర్ ప్రైజ్మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) ►తొలిసారి వరల్డ్ నంబర్వన్ – 02/02/2004 ►ఒలింపిక్ పతకాలు (2) – 2008 బీజింగ్లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్లో సింగిల్స్ కాంస్యం ►వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు) ►గ్రాండ్స్లామ్ మ్యాచ్ విజయాల సంఖ్య – 369 ►కెరీర్లో కొట్టిన ఏస్లు – 11,478 కెరీర్ స్లామ్ పూర్తి ఆల్టైమ్ గ్రేట్గా అన్ని రకాల కోర్టుల్లో సత్తా చాటినా...ఫెడరర్ కెరీర్లో ఫ్రెంచ్ ఓపెన్ ఎప్పుడూ సవాల్గానే కనిపించింది. అప్పటికే 13 గ్రాండ్స్లామ్లు సాధించి ఫ్రెంచ్ ఓపెన్లోకి ఫెడరర్ అడుగు పెట్టాడు. మరో టైటిల్ గెలిస్తే ఆ సమయంలో అగ్ర స్థానంలో ఉన్న పీట్ సంప్రాస్ (14) రికార్డును సమం చేస్తాడు. అయితే ఎర్రమట్టిపై వరుసగా నాలుగేళ్లు టైటిల్ సాధించిన నాదల్ జోరు కొనసాగుతోంది. ఈ దశలో ఫెడరర్కు మళ్లీ కష్టమే అనిపించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో సొదర్లింగ్ చేతిలో నాదల్ అనూహ్యంగా ఓడటంతో రోజర్కు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని వృథా చేయని అతను ఫైనల్లో సొదర్లింగ్నే ఓడించి తొలిసారి (ఏకైక) ఫ్రెంచ్ ఓపెన్ సాధించాడు. తన ‘కెరీర్ స్లామ్’ను పూర్తి చేసుకోవడంతో పాటు సంప్రాస్తో సమంగా నిలిచాడు. ‘గ్రాండ్’ ఫెడెక్స్ ఆస్ట్రేలియా ఓపెన్ (6) – 2004, 2006, 2007, 2010, 2017, 2018 ఫ్రెంచ్ ఓపెన్ (1) – 2009 వింబుల్డన్ (8) – 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 యూఎస్ ఓపెన్ (5) – 2004, 2005, 2006, 2007, 2008 తన కెరీర్ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్లు ఆడిన ఫెడరర్ ఒక్కసారి కూడా మ్యాచ్ మధ్యలో రిటైర్ కాలేదు. కవలల జోడి... ఫెడరర్ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్’. తన విజయాల ఘనతల్లో భార్య మిరొస్లావా (మిర్కా)కు ప్రధాన పాత్ర ఉందని తరచూ చెబుతుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. వీరికి 13 ఏళ్ల కవల అమ్మాయిలు, 8 ఏళ్ల కవల అబ్బాయిలు ఉన్నారు. -
టీమిండియా సీనియర్ పేసర్ రీఎంట్రీ.. లార్డ్స్లో ఫేర్వెల్!
ఇంగ్లండ్ గడ్డపై మూడు టి20లు, 3 వన్డేల్లో తలపడే భారత మహిళల జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. గత శ్రీలంక సిరీస్కు దూరంగా ఉండి రిటైర్మెంట్పై అనుమానాలు పెంచిన సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఇప్పుడు జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. అయితే ఇదే సిరీస్లో సెప్టెంబర్ 24న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే ఆమెకు ఆఖరి మ్యాచ్ కానుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్లాన్లో భాగంగానే ఝులన్ గోస్వామికి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఏడాది తర్వాత వన్డే టీమ్లో జెమీమా రోడ్రిగ్స్కు చోటు దక్కగా, దేశవాళీ క్రికెట్లో మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటిన నాగాలాండ్ బ్యాటర్ కిరణ్ ప్రభు నవ్గిరేకు తొలిసారి భారత టి20 జట్టులో చోటు లభించింది. రెండేళ్ల తర్వాత హేమలత మళ్లీ వన్డే టీమ్కు ఎంపిక కాగా, లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్కు రెండు టీమ్లలోనూ స్థానం లభించలేదు. ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 టీమ్లలోనూ అవకాశం దక్కించుకోగలిగింది. Jhulan Goswami's 20-year international career is set to conclude at Lord's, after the third and final ODI of India's tour of England on September 24 — ESPNcricinfo (@ESPNcricinfo) August 20, 2022 చదవండి: అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ Eugenie Bouchard: ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్ స్టార్ -
వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వెంకయ్యకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కు తీసుకున్న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను 2020, సెప్టెంబరు 20న ఎగువ సభ ఆమోదించినప్పుడు రాజ్యసభ చైర్మన్ స్థానంలో వెంకయ్య లేరని డెరెక్ ఓబ్రెయిన్ గుర్తు చేశారు. ‘బహుశా ఏదో ఒక రోజు మీరు మీ ఆత్మకథలో దీనికి సమాధానం ఇస్తార’ని ఆయన చమత్కరించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సెప్టెంబర్ 2013న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వెంకయ్య నాయుడు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గురించి కూడా ప్రస్తావించి.. దీనికి కూడా ఆత్మకథలోనే సమాధానం చెబుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై 2013లో ఎగువ సభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తాను రాజ్యసభ చైర్మన్ ఉన్న సమయంలో మాత్రం పెగాసస్పై చర్చకు అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘మార్చి 1, 2013న, మీరు సభలో 5-6 నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్పై జోక్యం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా పెగాసస్ అంశాన్ని సభలో చర్చించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేద’ని అన్నారు. కాగా, వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియడంతో నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 6న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ధన్కర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. (క్లిక్: ఇది ఉద్వేగభరితమైన క్షణం.. ప్రధాని మోదీ) -
పార్లమెంటు సమావేశాలు ముందుగానే నిరవధిక వాయిదా?
సాక్షి,న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలో వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు వీడ్కోలు ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం పార్లమెంటు సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొహర్రం , రక్షాబంధన్ సెలవుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం సెషన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం, మధ్యాహ్నం తర్వాత రెండు బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సభను ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉంది. కానీ సెలవుల వల్ల ముందే ముగించే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ? -
నాగ చైతన్య 'థ్యాంక్యూ' నుంచి 'ఫేర్వెల్..'
Naga Chaitanya Thank You Movie Farewell Lyrical Song Released: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'ఫేర్ వెల్..' అంటూ సాగే పాటను హైదరాబాద్లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సోమవారం (జూన్ 28) విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ- 'ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం.. ఆ తర్వాత స్కూల్మేట్స్తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజ్ లైఫ్ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ 'ఫేర్వెల్..' పాట ద్వారా చెప్పాం' అన్నారు. 'ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని విక్రమ్ కె. కుమార్ అభిప్రాయపడ్డారు. ''మూడేళ్లు 'థ్యాంక్యూ' కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం'' అని నాగచైతన్య పేర్కొన్నాడు. ''ఫేర్వెల్..' సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు'' అని తమన్ తెలిపాడు. చదవండి: హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. -
ప్రాణమిత్రుడి పాడె మోసిన ఉస్తాద్ జకీర్ హుస్సేన్
ముంబై: భారత సంగీత విద్వాంసుడు.. సంతూర్ వాయిద్యాకారుడు పండిట్ శివకుమార్ శర్మ మరణం సంగీత ప్రపంచంలో తీరని విషాదం నింపింది. 84 ఏళ్ల సంతూర్ దిగ్గజం మే 10వ తేదీన గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆ మరుసటి రోజే ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే అంత్యక్రియల్లో ఓ ప్రముఖుడి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయనెవరో కాదు.. తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్(71). శివకుమార్ శర్మ, జకీర్ హుస్సేన్లు సంయుక్తంగా ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. వయసులో తేడాలున్నా.. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడి అంత్యక్రియలు జకీర్ హుస్సేన్ హజరయ్యారు. అంతేకాదు.. శివకుమార్ పాడె మోసిన జకీర్ హుస్సేన్.. అంత్యక్రియల సమయంలోనూ ఒంటరిగా కాసేపు చితి వద్దే ఉండిపోవడం కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ అంత్యక్రియలు ప్రముఖులెవరూ హాజరుకాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా తమ నివాళులు అర్పించారు. చదవండి: ‘సంతూర్' శివకుమార్ శర్మ కన్నుమూత.. నేపథ్యం ఏంటంటే.. -
Ross Taylor: రాస్టేలర్ వీడ్కోలు
హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రాస్ టేలర్కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. టేలర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన మూడో వన్డేలో కివీస్ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను ఓడించింది. ఫలితంగా సిరీస్ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్స్లు), మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించారు. రాస్ టేలర్ తన చివరి ఇన్నింగ్స్లో 16 బంతుల్లో 1 సిక్స్తో 14 పరుగులు సాధించాడు. అనంతరం నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. స్టెఫాన్ మైబర్గ్ (43 బంతుల్లో 64; 13 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా, మ్యాట్ హెన్రీకి 4 వికెట్లు దక్కాయి. రాస్ టేలర్ వన్డే రికార్డు: 236 వన్డేల్లో 47.55 సగటుతో టేలర్ 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉండగా...అత్యుత్తమ స్కోరు 181 నాటౌట్. -
ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్
న్యూఢిల్లీ: పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు రాజ్యసభ గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికింది. రిటైర్ అవుతున్న సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫొటో సెషన్లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఫొటో సెషన్లో ఉన్నారు. ఈ సభ ఎంతో ఇచ్చింది: మోదీ పదవీ విరమణ చేసిన సభ్యులు మాట్లాడేందుకు వీలుగా రాజ్యసభలో ఈరోజు జీరో అవర్, ప్రశ్నోత్తరాలను వెంకయ్య నాయుడు రద్దు చేశారు. రిటైర్ అయిన సభ్యులు మళ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మన రాజ్యసభ సభ్యులకు అపార అనుభవం ఉంది. కొన్నిసార్లు అకడమిక్ నాలెడ్జ్ కంటే అనుభవానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ పార్లమెంట్లో చాలా కాలం గడిపాం. మనం ఇచ్చిన దాని కంటే ఎంతో ఎక్కువ ఈ సభ మనకు ఇచ్చింది. ఇక్కడ గడించిన అనుభవాన్ని దేశంలోని నాలుగు దిశలకు తీసుకెళ్లాల’ని మోదీ అన్నారు. ఆంటోనీ, స్వామి, గుప్తా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ.. బీజేపీ నేతలు సుబ్రమణ్యస్వామి, స్వపన్ దాస్గుప్తాలతో సహా మొత్తం 72 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. నిర్మలా సీతారామన్ జూన్లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనుండగా.. పియూష్ గోయల్, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం, కపిల్ సిబల్.. శివసేన నేత సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఫుల్ పటేల్ కూడా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. (క్లిక్: అఖిలేష్కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఎంపీలకు వెంకయ్య విందు వెంకయ్య నాయుడు తన నివాసంలో రాజ్యసభ సభ్యులందరికీ ఈ రాత్రి విందు ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు ‘పీటీఐ’కి వెల్లడించాయి. పదవీ విరమణ చేస్తున్న 72 మంది సభ్యులకు, ఇంతకు ముందు పదవీ విరమణ చేసిన మరో 19 మందికి జ్ఞాపికలను వెంకయ్య నాయుడు అందజేస్తారు. ఈ విందులో ఆరుగురు ఎంపీలు తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శిస్తారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: థ్యాంక్యూ మోదీ జీ: కేటీఆర్ సెటైర్లు) -
కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. ఆయనతోపాటు రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్న్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్ సభ్యులు నరేష్ గుజ్రాల్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. It has been an honour raising issues relating to Andhra Pradesh's welfare in the Rajya Sabha in my 1st term, and as it comes to an end, I thank Sri @YSJagan garu for this honour & his faith in me. pic.twitter.com/opsHJrT8zm — Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2022 చదవండి: (అఖిలేష్కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఈ సందర్భంగా ఆయన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మల సీతారామన్తో సమావేశమయ్యానని ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసే వారని అభినందించారు. టూరిజం, ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్ కమిటీని అధిగమించడానికి కామర్స్ కమిటీ చైర్మన్గా తాను తాపత్రయపడుతుండే వాడినని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్ అవుతున్న సహచర సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు. చదవండి: (కర్ణాటకలో మొఘలుల పాఠ్యాంశాలకు గుడ్బై!) -
బీసీసీఐ క్రేజీ ఆఫర్.. నో చెప్పిన కోహ్లి..!
BCCI Fare Well Test Offer To Kohli: అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కోహ్లి సంచలన ప్రకటనకు కొద్ది గంటల ముందు బీసీసీఐ నుంచి కోహ్లికి ఓ ఆఫర్ వచ్చిందట. తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్కు సారధిగా వ్యవహరించిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐ ప్రతినిధి కోహ్లిని కోరాడట. అయితే ఈ ఆఫర్ను కోహ్లి సున్నితంగా తిరస్కరిస్తూ.. తనకెటువంటి ఫేర్వెల్ టెస్ట్ అవసరం లేదని, నేను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని, తనకు మొదటి మ్యాచైనా, వందో మ్యాచైనా ఒకటేనని సదరు అధికారికి బదులిచ్చాడట. కాగా, కోహ్లి వచ్చే నెలలో(ఫిబ్రవరి 25-30) శ్రీలంకతో తలపడబోయే తొలి టెస్ట్ ద్వారా వంద టెస్ట్ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ టెస్ట్కు బెంగళూరు వేదిక కానుంది. కోహ్లికి ఐపీఎల్ వల్ల ఈ నగరంతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. దీంతో అతని గౌరవార్ధం ఈ నగరంలో ఫేర్వెల్ టెస్ట్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదివరకు జరిగిన పరిణామాల దృష్ట్యా బీసీసీఐ ఇచ్చిన అఫర్ను కోహ్లి తిరస్కరించాడని సమాచారం. కాగా, 68 టెస్ట్ల్లో టీమిండియాకు సారధిగా వ్యవహరించిన కోహ్లి.. ఏకంగా 40 మ్యాచ్ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో అతను భారత్ తరఫున అత్యధిక విజయాలు అందుకున్న సారథిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Test Captain: భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా అతడే! -
మండలి ప్రొటెమ్ చైర్మన్కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో మెదక్ ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి చేసుకున్న శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వి.భూపాల్రెడ్డికి మంగళవారం వీడ్కోలు పలికారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో భూపాల్రెడ్డిని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, తేరా చిన్నపరెడ్డి సన్మానించారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి తదితరులు భూపాల్రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. కాగా, ప్రొటెమ్ చైర్మన్ భూపాల్రెడ్డి ఎమ్మెల్సీగా కాలపరిమితి పూర్తి చేసు కోవడంతో ఆయన స్థానంలో మండలిలో సీనియర్ సభ్యుడిని ప్రొటెమ్ చైర్మన్గా నియమించనున్నారు. నూతన ప్రొటెమ్ చైర్మన్గా రాజేశ్వర్ పేరు ఖరారైనట్లు సమాచారం. అయితే ఆయన్ను నామినేట్ చేయడానికి సంబంధించి మంగళవారం రాత్రి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ధోని ఫ్యాన్స్కు శుభవార్త.. ఫేర్వెల్ గేమ్ అక్కడే..!
Dhoni Hints Playing Fare Well Game In Chennai: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన నాటి నుంచి అతని ఐపీఎల్ రిటైర్మెంట్పై కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు, అప్పుడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే వీటన్నిటిపై మాహీ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. తన ఐపీఎల్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని.. వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడతానని.. తన ఫేర్వెల్ గేమ్ చెన్నైలోని చెపాక్లోనే ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించాడు. తాజాగా తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇండియా సిమెంట్స్కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ.. తన ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటనతో సీఎస్కే అభిమానులతో పాటు ధోని వ్యక్తిగత అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సోషల్మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తున్నారు. కాగా, ధోని.. 2019 ఐపీఎల్లో చివరిసారిగా చెన్నైలో ఆడాడు. గతేడాది ఐపీఎల్ యూఏఈలో జరగగా.. ఈ ఏడాది తొలి అంచె పోటీలు భారత్లో జరిగినా కరోనా కేసుల కారణంగా తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. ఇదిలా ఉంటే, వచ్చే సీజన్ కోసం జరుగబోయే మెగా వేలానికి ముందు ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్లను సీఎస్కే జట్టు రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చదవండి: పాక్తో పోరుకు ముందు అగ్రశ్రేణి జట్లను ఢీకొట్టనున్న కోహ్లి సేన.. షెడ్యూల్ ఇదే -
రాజకీయాలకు బాబుల్ గుడ్బై!
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు సుప్రియోతో పార్టీ మంత్రి పదవికి రాజీనామా చేయించింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ‘రాజకీయాలు వీడాలని నిర్ణయించుకున్నాను. నేను టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం సహా మరే ఇతర పార్టీలోకి వెళ్లడం లేదు. ఎప్పటికీ బీజేపీతోనే ఉంటా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం సాధ్యం కాదు’ అంటూ బాబుల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తనకు అవకాశమిచ్చినందుకు అమిత్షా, నడ్డాలకు బాబుల్ కృతజ్ఞత చెప్పారు. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని వీరు అడిగారని, కానీ తనను మన్నించి తన కోరికను ఆమోదించాలని కోరారు. బాబుల్ ప్రస్థానం ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసన్సోల్ నుంచి రెండోసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో అధిష్టానం ఆయన్ను మంత్రి పదవి నుంచి దిగిపొమ్మని కోరింది. ‘పదవి పోవడం వల్ల రాజకీయాలు వదిలేస్తున్నావా అని ఎవరైనా అడిగితే కొంతమేరకు అవుననే అంటాను. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వంతో విబేధాలు కూడా కొంత వరకు కారణమే’ అని బాబుల్ తెలిపారు. బాబుల్ రాజీనామాపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందించలేదు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు తనకు తెలియదని, సోషల్ మీడియాను తాను ఫాలో కానని చెప్పారు. ఇదంతా డ్రామా అని టీఎంసీ ఎద్దేవా చేసింది. మంత్రి పదవి దక్కనందుకే బాబుల్ ఇలా చేస్తున్నారని, రాజీనామా చేసేట్లయితే స్పీకర్కు ఫార్మెట్లో పంపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అభిప్రాయపడ్డారు. -
అపురూపమైన కానుకతో స్టోక్స్కు వీడ్కోలు..
ముంబై: పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. ఐపీఎల్ 2021 ప్రయాణాన్ని ఒక్క మ్యాచ్తోనే ముగించాడు. పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ క్యాచ్ను అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో అతను శుక్రవారం రాత్రి స్వదేశానికి బయల్దేరాడు. ఈ క్రమంలో రాజస్థాన్ యాజమాన్యం తమ ముఖ్యమైన ఆటగాడికి ఘనంగా వీడ్కోలు పలికింది. తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగా జట్టును వీడుతున్న స్టోక్స్కు అపురూపమైన కానుకను అందించింది. ఇటీవల మరణించిన అతని తండ్రి జెడ్ స్టోక్స్ పేరిట జెర్సీని రూపొందించి అతన్ని సర్ప్రైజ్ చేసింది. స్టోక్స్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. Bye, Ben. 🥺 The all-rounder flew back home last night after a scan revealed that he'll have to undergo surgery on his finger. Speedy recovery, champ. 💪🏻#HallaBol | #RoyalsFamily | @benstokes38 pic.twitter.com/o1vRi5iO95 — Rajasthan Royals (@rajasthanroyals) April 17, 2021 ఇదిలా ఉంటే, స్టోక్స్కు రాజస్థాన్ రాయల్స్ను వీడి వెళ్లడానికి అస్సలు ఇష్టంలేదని, సర్జరీ అనివార్యం కావడంతో అతను బలవంతంగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. తొలుత అతను జట్టుతో పాటే ఉండి సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని, ఇదే విషయాన్ని ఫ్రాంచైజీకి తెలుపగా, వారు కూడా సమ్మతం వ్యక్తం చేశారని ఆర్ఆర్ యాజమాన్యం ముఖ్యులొకరు వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ తప్పనిసరి కాబట్టి స్టోక్స్ స్వదేశానికి బయల్దేరక తప్పలేదని ఆయన పేర్కొన్నాడు. స్టోక్స్కు వీడ్కోలు పలికిన అనంతరం అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'సర్జరీ అనివార్యం కావడంతో ఈ ఐపీఎల్ సీజన్లో నీ మెరుపుల్ని మిస్సవుతాం' అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, 'అవును డ్యూడ్. నువ్వు రాజస్థాన్కు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్వి. టేక్ కేర్' అంటూ మరొకరు ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఐపీఎల్లో కూడా స్టోక్స్ రాజస్థాన్ రాయల్స్తోనే కొనసాగాలని అభిమానులు భారీ ఎత్తున ట్వీట్లు చేశారు. కాగా, 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న స్టోక్స్.. ఇప్పటి వరకు 31 మ్యాచ్ల్లో 604 పరుగులు చేశాడు. బౌలింగ్లో 16 వికెట్లు తీశాడు. చదవండి: ఆ జట్టుకు గెలిచే అర్హతే లేదు: మంజ్రేకర్ -
మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ ఓటమి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విధిలేని పరిస్థితుల్లో శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు బుధవారం ఉదయం ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలు వైట్హౌస్ వీడి ఫ్లోరిడాకు వెళ్లారు. ముందుగా చెప్పినట్టుగానే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరు కాలేదు. అధ్యక్షులు మాత్రమే వినియోగించే మెరైన్ వన్ హెలికాప్ట్టర్లో ఫ్లోరిడాలోని తాను నివాసం ఉండబోయే మార్ ఏ లాగో ఎస్టేట్కి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. వైట్హౌస్లోని సౌత్ లాన్లో మెరైన్ వన్ హెలికాప్టర్లోకి వెళ్లడానికి ముందు ట్రంప్ తనకు వీడ్కోలు చెప్పిన మద్దతుదారులు, సిబ్బందిని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడారు. ఏదో ఒక రూపంలో తాను మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్లు చాలా గొప్పగా గడిచాయన్న ట్రంప్ తాము ఎంతో సాధించామని గర్వంగా ప్రకటించుకున్నారు. ‘‘ఇది నాకెంతో గౌరవం, జీవితకాలంలో లభించిన గౌరవం. ప్రపంచంలోనే మీరంతా గొప్ప ప్రజలు. ఈ జగత్తులోనే గొప్ప ఇల్లు ఇది’’ అని కొనియాడారు. ‘‘నేను మీ కోసం ఇంకా పోరాటం చేస్తాను. ఏదో ఒక రకంగా మళ్లీ వస్తా’’ అని ట్రంప్ అన్నారు. నిండైన ఆత్మవిశ్వాసంతో వెళుతున్నా వైట్ హౌస్ మంగళవారం విడుదల చేసిన ట్రంప్ ప్రసంగం వీడియోలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ‘‘నేను ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నాను. గట్టి పోరాటాలే చేశాను. మీరు అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. ఇప్పుడు నిండైన ఆత్మ విశ్వాసంతో శ్వేతసౌధాన్ని వీడుతున్నా. మా ప్రభుత్వం సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ గర్వంగా మీ ముందు నిలబడ్డాను. వైట్హౌస్ వీడి వెళుతున్నప్పటికీ తాను ప్రజాసేవలోనే ఉంటా’’ అని ట్రంప్ చెప్పారు. ఈ చివరి వీడ్కోలు ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. ట్రంప్ నోట్ న్యూయార్క్: నూతన అధ్యక్షుడి ప్ర మాణస్వీకార సమయంలో పదవి వీడుతున్న అధ్యక్షుడు పాటించాల్సిన దాదాపు అన్ని సంప్రదాయాలను పక్కనబెట్టిన ట్రంప్.. ఒక సంప్రదా యాన్ని మాత్రం పాటిం చారు. కొత్త అధ్యక్షుడి కోసం వైట్హౌస్లోని అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో ఒక సందేశాన్ని ఉంచారు. ఓవల్ ఆఫీస్లోని రెజొల్యూట్ డెస్క్లో ఈ నోట్ను ట్రంప్ పెట్టారు. బైడెన్ ప్రమాణ స్వీకారం కన్నా ముందే ట్రంప్ వాషింగ్టన్ను, వైట్హౌస్ను వీడి ఫ్లారిడాకు పయనమయ్యారు. బైడెన్కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు. -
ఒక్క మ్యాచ్, ఒకే ఒక్క మ్యాచ్!
న్యూఢిల్లీ: భారత జట్టుకు విశేష సేవలందించి సరైన రీతిలో వీడ్కోలు లభించని క్రికెటర్ల కోసం టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర ఆలోచనతో ముందుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలికిన క్రీడాకారులందరికీ చివరగా ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందంటూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే రిటైరైన తనతో పాటు ధోని, సెహ్వాగ్, రైనా, గంభీర్, లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ లాంటి ప్లేయర్లతో కోహ్లి సేన ఎగ్జిబిషన్ మ్యాచ్లో తలపడితే అందరికీ వీడ్కోలు మ్యాచ్ దక్కినట్లవుతుందని పఠాన్ వ్యాఖ్యానించాడు. (చదవండి: సురేశ్ రైనా.. దుబాయ్ లైఫ్) ‘టీమిండియాకు గొప్ప విజయాలు అందించిన దిగ్గజ ఆటగాళ్లకు సరైన వీడ్కోలు దక్కలేదని ఇప్పటికీ అభిమానులు అసంతృప్తిగానే ఉన్నారు. ప్రస్తుత టీమిండియా జట్టుతో రిటైర్డ్ ఆటగాళ్ల జట్టు చారిటీ మ్యాచ్లో ఆడితే అందరికీ చివరి మ్యాచ్ ఆడినట్లు ఉంటుంది’ అని పఠాన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ మేరకు రిటైర్డ్ ప్లేయర్ల జట్టును కూడా పఠాన్ ప్రకటించాడు. అయితే ఈ కరోనా పరిస్థితుల్లోఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ ముందుకు వచ్చే అవకాశమే లేదు. పఠాన్ ప్రకటించిన రిటైర్మెంట్ టీమ్ ఆటగాళ్లు: ధోని, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, గంభీర్, లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, ప్రజ్ఞాన్ ఓజా, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్. (చదవండి: ‘అతనేమీ వార్న్ కాదు.. కుంబ్లే అనుకోండి’) -
వీడ్కోలు మ్యాచ్పై బోర్డు ఆలోచన!
న్యూఢిల్లీ: ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఒక ఇన్స్ట పోస్ట్తో ఎమ్మెస్ ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినా... బీసీసీఐ మాత్రం తగిన రీతిలో అతనికి వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. భారత క్రికెట్కు అతను చేసిన సేవలకు గుర్తింపుగా వీడ్కోలు మ్యాచ్ లేదా సిరీస్ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ‘ఐపీఎల్ ముగిశాక ధోని కోసం చేయాల్సిందంతా చేస్తాం. దేశానికి అతను ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాడు. అదే స్థాయిలో ధోనికి కూడా గౌరవం దక్కాలి. మేమెప్పుడూ ధోనికి వీడ్కోలు మ్యాచ్ ఉండాలనే అనుకున్నాం. కానీ ఎవరూ ఊహించని రీతిలో అతి సాధారణంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ సందర్భంగా ధోనితో మాట్లాడి తనకు నచ్చినట్లు మ్యాచ్ లేదా సిరీస్ ఏర్పాటు చేస్తాం. అనంతరం అతనికి నచ్చినా నచ్చకపోయినా మేం ధోనిని సత్కరిస్తాం. ధోనికి సన్మానించడం మాకు దక్కిన గౌరవం’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత మాజీ వికెట్ కీపర్ మదన్ లాల్ కూడా ధోనికి తగిన గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ వీడ్కోలు మ్యాచ్ నిర్వహిస్తే తనతో పాటు అభిమానులు చాలా సంతోషిస్తారని అన్నారు. ‘అతనో దిగ్గజం. ధోనిని ఒక్క ప్రకటనతో క్రికెట్ నుంచి వెళ్లనివ్వకూడదు. అభిమానులంతా అతని చివరి మ్యాచ్ చూడాలని కోరుకుంటున్నారు’ అని మదన్లాల్ వ్యాఖ్యానించాడు. -
‘సచిన్లానే.. ధోనికి వీడ్కోలు ఉంటుంది’
న్యూఢిల్లీ : టీమీండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు ఫేర్వెల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై పలు ఊహాగాహానాలు తెరమీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. ‘వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ ఎలా అయితే చివరి మ్యాచ్ ముగించాడో ధోని కూడా చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడతాడని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. 'ధోనికి సీఎస్కే ( చెన్నై సూపర్ కింగ్స్ ) పట్ల అమితమైన ప్రేమ, మక్కువ ఉన్నాయని మనమందరం గుర్తించాలి. సీఎస్కే జట్టుకు ట్రోఫీ అందించడానికి సాధ్యమైనవన్నీ ధోని చేశాడు. ధోని లాంటి గొప్ప నాయకత్వం వల్లే సీఎస్కె అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా మన్ననలు అందుకుంది. (ధోని అధ్యాయం ఎన్నటికీ చెరిగిపోనిది) చెన్నైలోని చెపాక్ స్టేడియంలోనే ధోని తన చివరి మ్యాచ్ ఆడతారని భావిస్తున్నాను. క్రికెట్ స్టేడియంలో ధోనీ గడిపే ప్రతీ క్షణాన్ని ఆనందించేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. సచిన్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియంలో అతని చివరి మ్యాచ్ ఎలా జరిగిందో, ధోని కూడా చెపాక్లో ఫేర్వెల్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది' అని వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం చెప్పాడు. గతేడాది వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోని మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు నిర్ణయం తీసుకున్నాడు.16 ఏళ్ల క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు స్వయంగా ధోని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. దీంతో ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు అతని స్వస్థలం రాంచీలో ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే. (‘ధోని ఆడకపోతే నేనూ మ్యాచ్లు చూడను’) -
మలింగకు ఘనంగా వీడ్కోలు
కొలంబో: యార్కర్ల కింగ్ లసిత్ మలింగ వీడ్కోలు వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. తద్వారా తమ వెటరన్ పేసర్కు మంచి బహుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో లంక 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు వన్డౌన్ బ్యాట్స్మన్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ పెరీరా (99 బంతుల్లో 111; 17 ఫోర్లు, సిక్స్) సెంచరీకి తోడు, కుశాల్ మెండిస్ (49 బంతుల్లో 43; 4 ఫోర్లు), ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (52 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. భారీ స్కోరు ఛేదనలో బంగ్లాను మలింగ (3/38) వరుస యార్కర్లతో కంగారుపెట్టాడు. ఓపెనర్లు, కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ (0), సౌమ్య సర్కార్ (15)లను అతడు ఈ విధంగానే బౌల్డ్ చేశాడు. మొదట్లోనే కష్టాల్లో పడిన జట్టును ముష్ఫికర్ రహీమ్ (86 బంతుల్లో 67; 5 ఫోర్లు), షబ్బీర్ రెహ్మాన్ (56 బంతుల్లో 60; 7 ఫోర్లు)లు ఐదో వికెట్కు 111 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు వెనుదిరిగాక బంగ్లా పోరాటం ఎంతోసేపు సాగలేదు. తన చివరి ఓవర్లో ముస్తఫిజుర్ (18)ను ఔట్ చేసి ప్రత్యర్థి ఇన్నింగ్స్కు తెరదించి మ్యాచ్తో పాటు వన్డేలకు మలింగ సగర్వంగా బై బై చెప్పాడు. మలింగ వన్డే కెరీర్ 226 వన్డేల్లో 338 వికెట్లు బౌలింగ్ సగటు 28.87 అత్యధిక వికెట్ల జాబితాలో 9వ స్థానం అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/38 -
వేధింపులపై గూగుల్ ఉక్కుపాదం
న్యూయార్క్: సహోద్యోగులపై లైంగిక వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 2016 నుంచి ఇప్పటివరకూ 48 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఉపాధ్యక్షురాలు(ప్రజా వ్యవహారాలు) ఐలీన్ నాటన్ వెల్లడించారు. వీరిలో 13 మంది సీనియర్ మేనేజర్, అంతకంటే ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. సాగనంపినవారిలో ఎవ్వరికీ ఎగ్జిట్ ప్యాకేజీ ఇవ్వలేదు. లైంగికవేధింపుల కారణంగా గూగుల్ నుంచి వైదొలిగిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబీన్కు రూ.659.38 కోట్లు(90 మిలియన్ డాలర్లు) ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో పిచాయ్, ఐలీన్ కంపెనీ ఉద్యోగులకు సంయుక్తంగా లేఖ రాశారు. ఉద్యోగులకు సురక్షితమైన పని ప్రదేశాన్ని కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని లేఖలో పిచాయ్ పేర్కొన్నారు. బాధితుల గోప్యతను పరిరక్షించేందుకు వీలుగా వ్యక్తిగత వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓ మహిళా ఉద్యోగిపై 2013లో హోటల్లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆండీ రూబీన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి ఏడాది కంపెనీ నుంచి తప్పుకున్న ఆయనకు గూగుల్ వీడ్కోలు పలికిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన ఇష్టప్రకారమే గూగుల్ను వీడినట్లు రూబీన్ వివరణ ఇచ్చారు. -
విలక్షణ న్యాయమూర్తి
-
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తేనే మరిన్ని పతకాలు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పతకం సాధించాలంటే... ఆ మెగా టోర్నీకి సరితూగే శిక్షణ సౌకర్యాలను రెజ్లర్లకు అందించాలని అంటోంది వినేశ్ ఫొగాట్. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడలు, స్పెయిన్ గ్రాండ్ప్రి టోర్నీల్లో స్వర్ణాలు సాధించి మంచి ఫామ్లో ఉన్న 23 ఏళ్ల ఈ హరియాణా రెజ్లర్ జాతీయ శిబిరాల్లో క్రీడాకారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. రెజ్లర్లకు అత్యుత్తమ సౌకర్యాలు అందడం లేదని వాపోయింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నూతన స్పాన్సర్ టాటా మోటార్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఆసియా క్రీడల వీడ్కోలు సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న వినేశ్ ఫొగాట్ గతంతో పోలిస్తే రెజ్లర్ల పరిస్థితి కాస్త మెరుగైందని తెలిపింది. ‘ఆసియా క్రీడల కోసం లక్నోలో నిర్వహిస్తోన్న జాతీయ శిబిరంలో తగిన సౌకర్యాలు లేవు. రెజ్లింగ్ హాల్లో బాగా ఉక్కపోతగా ఉంటోంది. కరెంట్ కూడా ఉండకపోవడంతో ప్రాక్టీస్కు డుమ్మా కొట్టాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే ఇక్కడ ఆహారం నాణ్యత పెరిగింది. కానీ చాలా విషయాల్లో ఇంకా మార్పు రావాలి. కుస్తీలో ఒలింపిక్స్ పతకం ఆశిస్తారు. కానీ రెజ్లర్లకు అందించే సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. డబ్ల్యూఎఫ్ఐ రెజ్లర్లకు అండగా నిలుస్తున్నప్పటికీ మిగతా వ్యవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మెరుగైన ప్రదర్శనకు మెరుగైన శిక్షణ పరిస్థితులుండాలి’ అని ఆమె వివరించింది. -
ఏకాభిప్రాయానికి రావాలి
న్యూఢిల్లీ: రాజ్యసభకు తదుపరి డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఏకాభిప్రాయానికి రావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆదివారం కోరారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఆదివారం పదవీ విరమణ పొందిన పీజే కురియన్కు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య ఈ విజ్ఞప్తి చేశారు. వీడ్కోలు కార్యక్రమానికి పార్టీలకతీతంగా పలువురు నేతలు హాజరయ్యారు. వెంకయ్య మాట్లాడుతూ ‘తదుపరి డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఉండాలనేదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని నేను ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కురియన్ తనకు మంచి సహోద్యోగిగా ఉన్నారనీ, ఎంతో ఉత్సాహంతో సభను నడిపేవారని వెంకయ్య కొనియాడారు. అనంతరం కురియన్ మాట్లాడుతూ పెద్ద ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేలా చూడాలని సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే ఇరుపక్షాలు కలసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప అస్తమానం సభా కార్యకలాపాలకు అడ్డుతగలకూడదని హితవు చెప్పారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, విజయ్ గోయెల్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
గెలుస్తాననుకున్నా..!
బెంగళూరు: రాజీనామా చేసే ముందు, సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రాజీనామా చేయడం తథ్యమని నిర్ణయించుకున్న తరువాత చేసిన ఈ వీడ్కోలు ప్రసంగంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. అధికారంలో కొనసాగితే రైతు సంక్షేమం కోసం పాటు పడ్తామనుకున్నానని, అది సాధ్యం కాకపోతున్నందుకు బాధపడ్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు అతిపెద్ద పార్టీగా బీజేపీకే పట్టం కట్టారని, కాంగ్రెస్, జేడీఎస్ కుట్రపూరితంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడి ప్రజాతీర్పును కాలరాశాయన్నారు. అయినా, రాష్ట్రాభివృద్ధికోసం కలసి వస్తారన్న ఆశతో కొందరు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడానని ఆయన వెల్లడించారు. విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తాననుకున్నానన్న యడ్యూరప్ప.. ఆశించినవన్నీ జరగవు కదా! అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కాంగ్రెస్–జేడీఎస్ అవకాశవాద కూటమి. కుట్ర చేసి ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారు. మీరు ఎమ్మెల్యేలను బంధించారు. పాపం వారు తమ కుటుంబసభ్యులతోనూ మాట్లాడుకోకుండా చేశారు. మీ ఎమ్మెల్యేలంతా వాళ్ల కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం దక్కినందుకు ఇవాళ సంతోషంగా ఉండుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఇది వాస్తవం. ఆత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని వారిని కోరాను. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న పార్టీ. అందుకే ఆ ఎమ్మెల్యేలు నేటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను. కేంద్రంలో మోదీ ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని వారితో అన్నాను. కొందరు ఇందుకు అంగీకరించారు కూడా. కాంగ్రెస్కు గానీ, జేడీఎస్కు గానీ ప్రజామోదం దక్కలేదనేది వాస్తవం. అతిపెద్ద పార్టీగా నిలిచినందునే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించారు. నావి ప్రజా రాజకీయాలు. ఇకపైనా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈ విశ్వాస పరీక్షను అగ్నిపరీక్షలా భావించాను. ఇదేం తొలిసారి కాదు. నా జీవితమంతా అగ్నిపరీక్షే. ఇద్దరు సభ్యులున్న బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మనం అనుకునేది వేరు. దేవుడి ఆలోచన వేరు’ అని వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు ‘నా చివరి శ్వాస వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా. ఇక కర్ణాటక రాష్ట్రమంతా పర్యటిస్తా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్సభ స్థానాలను, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను బీజేపీ గెలుచుకోవటంలో చిత్తశుద్ధితో పనిచేస్తా. ఈ సీట్లను ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తా. నేను పోరాడుతూనే పైకొచ్చాను. నాకు అధికారం ఇవ్వకపోతే చనిపోతానని ఒకరు (కుమారస్వామి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ)చెప్పారు. నాకు అధికారం దక్కినా, దక్కకపోయినా నేను మాత్రం అలా అనను. మన కాంగ్రెస్ మిత్రుల కుట్ర కారణంగా ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నేను విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రజల వద్దకు వెళ్లి న్యాయం అడుగుతాను. గవర్నర్ దగ్గరికెళ్లి రాజీనామా సమర్పించబోతున్నాను’ అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సందర్శకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్తో కరచాలనం చేసి సభ నుంచి యడ్యూరప్ప బయటకెళ్లారు. నాడు వాజ్పేయి..నేడు యడ్యూరప్ప! అది 1996.. కేవలం 13రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్పేయి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే రాజీనామాకు ముందు ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. నాటి ప్రసంగాన్ని డీడీ ప్రత్యక్ష ప్రసారంలో అందించటంతో దేశ ప్రజల మనసుల్లో అది చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ సుదీర్ఘ, ఉద్వేగపూరిత ప్రసంగంతో సభ్యుల విశ్వాసాన్ని పొందలేకపోయినా.. దేశ ప్రజల నమ్మకాన్ని వాజ్పేయి చూరగొన్నారు. ‘నేను పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్పేయి విపక్షాలకు చురకలు అంటించా రు. శనివారం నాడు అసెంబ్లీలోనూ యడ్యూరప్ప ఇదే రీతిలో మాట్లాడారు. ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినా నా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. -
జస్టిస్ చలమేశ్వర్.. విధులకు వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన చివరి పనిదినం నాడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ వేదిక పంచుకున్నారు. సీజేఐతో కలిసి వేదిక పంచుకోరంటూ వచ్చిన ఊహాగానాలకు ఆయన తెరదించారు. జూన్ 22న జస్టిస్ చలమేశ్వర్ పదవీ విరమణ చేస్తున్నప్పటికీ.. శుక్రవారమే ఆయనకు చివరి పనిదినం. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు సుదీర్ఘ వేసవి సెలవులు. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు మరో న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కలసి కోర్టు నంబర్–1లో జస్టిస్ చలమేశ్వర్ కూర్చున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసే వారు తమ చివరి పనిదినం నాడు ప్రధాన న్యాయమూర్తితో కోర్టు నంబర్–1ను పంచుకోవడం ఆనవాయితీ. బెంచ్పై ఉన్నంతసేపూ సీజేఐ జస్టిస్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ స్నేహపూర్వకంగా కనిపించారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్.. తమ ముందుకొచ్చిన 11 కేసుల్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా కూడా జస్టిస్ చలమేశ్వర్తో చర్చించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, గోపాల్ శంకరనారాయణన్ తదితరులు వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం అందరికీ నమస్కరిస్తూ కోర్టు హాలు నుంచి సీజేఐతో కలసి జస్టిస్ చలమేశ్వర్ వెళ్లిపోయారు. 2011 అక్టోబర్ 11వ తేదీన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్లు ఇద్దరూ ఒకేరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కావడం గమనార్హం. నిబద్ధతలో ఆయన ‘సుప్రీం’ సంచలనాలకు కేంద్ర బిందువైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ భారత న్యాయవ్యవస్థపై చెరగని ముద్రవేశారు. సుప్రీంకోర్టు జడ్జీగా దాదాపు ఏడేళ్లలో ఎన్నో కీలక తీర్పుల్లో ప్రధాన భాగస్వామిగా పేరొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యాక ఆయన అదే కోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. 2007–11 మధ్య గువాహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అక్టోబర్ 17, 2015.. ఎన్జేఏసీ కేసులో అసమ్మతి తీర్పు నుంచి జనవరి 12, 2018న మరో ముగ్గురు సుప్రీం జడ్జిలతో కలిసి విలేకరుల సమావేశంలో సుప్రీంలో పాలనా వ్యవహారాల్ని ప్రశ్నించే వరకూ న్యాయవ్యవస్థ గౌరవం పెరగడానికి ఆయన కృషిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహారశైలిపై అసమ్మతి వ్యక్తంచేస్తూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జనవరి 12న చలమేశ్వర్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం ఒక సంచలనం. కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి మిశ్రా ధోరణిని జస్టిస్ చలమేశ్వర్తో పాటు కొలీజియం సభ్యులైన జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు తప్పుపట్టారు. జస్టిస్ మిశ్రాకు రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. సుప్రీం జడ్జిగా రిటైరయ్యాక తానే పదవి తీసుకోనని చలమేశ్వర్ ముందే ప్రకటించారు. జస్టిస్ చలమేశ్వర్ చరిత్రాత్మక తీర్పులు ►జడ్జిల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్జేఏసీ)ను ఏర్పాటు చేస్తూ చేసిన చట్టం చెల్లదని అక్టోబర్ 17, 2015న ధర్మాసనంలోని నలుగురు జడ్జిలు మెజారిటీ తీర్పు ఇవ్వగా, దానిని సమర్థించిన ఏకైక జడ్జిగా చలమేశ్వర్ నిలిచారు. కొలీజియం వ్యవస్థ పనితీరు పారదర్శకంగా లేదని తీర్పులో విమర్శించారు. ►ఎవరికైనా ‘చికాకు లేదా ఇబ్బంది’ కలిగించే ఈ మెయిల్ సందేశాలు ఇచ్చేవారిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అధికారం ఇచ్చే ఐటీ చట్టంలోని 66 ఏ సెక్షన్ చెల్లదని జస్టిస్ నారిమన్తో కలిసి జస్టిస్ చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. ఈ సెక్షన్ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని.. రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ►ఆధార్ కార్డు లేదనే సాకుతో ఏ పౌరునికి మౌలిక సేవలు, ప్రభుత్వ సబ్సిడీలు నిరాకరించరాదని జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగప్పన్లతో కలిసి చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. జస్టిస్ జేజే పుట్టస్వామి కేసులో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కని తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు. ►అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులే కాకుండా జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడ్డవారు కూడా ఆస్తులు, ఆదాయం వివరాలు వెల్లడించాలని ఆయన తీర్పునిచ్చారు.