engineering colleges
-
బీబీఏ, బీసీఏ కోర్సు కనీస ఫీజు రూ.18 వేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏడాదికి కనీస ఫీజును రూ.18 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుమారు 35 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ డిగ్రీ కోర్సులు తొలిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గరిష్ట ఫీజు రూ.30 వేలుగా నిర్ణయించారు. వాస్తవానికి బీబీఏ, బీసీఏ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి రావడంతో డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాగా, రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఏఐసీటీఈ బీబీఏ, బీసీఏ కోర్సులు కోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్ కళాశాలలు అనుమతివ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తొలిసారిగా ఫీజులు నిర్ణయించడంలో డిగ్రీ అడ్మిషన్లు అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. గురువారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకుంటున్నారు. 5వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించగా.. 6వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. 10వ తేదీన డిగ్రీ సీట్లు కేటాయింపు చేపట్టి 12వ తేదీ తరగతులు ప్రారంభించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 16వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 1.63 లక్షల దరఖాస్తులు ఏపీలోని డిగ్రీ కోర్సుల్లో మొత్తం 3.50 లక్షల సీట్లుండగా.. ఏటా 50 శాతం లోపు సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది 1.63 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల బీబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్ పెరగడంతోనే ఇంజనీరింగ్ కాలేజీలు సైతం ఈ కోర్సులను ప్రవేశపెట్టడం గమనార్హం. వీటితో పాటు మొత్తం డిగ్రీ కాలేజీల్లో దాదాపు 800 కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
సీఎస్ఈ సీట్లు పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీట్లు పెంచాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిందని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ (కోర్) బ్రాంచీల్లో సీట్లు తగ్గించైనా, సీఎస్ఈ సహా అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు ఉన్నా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసిన కొన్ని యాజమాన్యాలు.. అధికారులు ఉద్దేశపూర్వకంగా సీట్లు పెంచేందుకు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు ఏటా డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 125 కాలేజీలు సీట్ల పెంపు ప్రతిపాదన తెచ్చాయి. సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే..కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పకపోయినా.. కోర్ గ్రూప్ కోర్సులకు కోత పెట్టడాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఈ కోర్సులు అసలుకే తెరమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భవిష్యత్లో ఈ కోర్సులకు మళ్లీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు బోధన ప్రణాళికను మారుస్తున్నారని, కోర్ గ్రూపులో జాయిన్ అయినా, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే వీలుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గత ఏడాది తగ్గిన చేరికలుగత ఏడాది 58 శాతం విద్యార్థులు సీఎస్సీ, అనుబంధ కోర్సుల్లోనే చేరారు. సివిల్, మెకానికల్ ఈఈఈ కోర్సుల్లో 12,751 సీట్లు ఉంటే, కేవలం 5,838 మంది మాత్రమే (45.78 శాతం) చేరారు. ఈఈఈలో 5,051 సీట్లు ఉంటే 2,777 సీట్లు, సివిల్లో 4,043 సీట్లు ఉంటే 1,761 సీట్లు, మెకానికల్లో 3,657 సీట్లు ఉంటే, 1,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ఆయా కోర్సులను మరింత బలహీనపరిచే ప్రైవేటు కాలేజీల ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. కాగా ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తిని అంగీకరిస్తే ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో దాదాపు 21 వేల సీట్లు పెరిగే వీలుంది. అదే సమయంలో కోర్ గ్రూపుల్లో దాదాపు 5 వేల సీట్లు తగ్గే అవకాశం కన్పిస్తోందని అంటున్నారు.రీయింబర్స్మెంట్ వద్దు..రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని బ్రాంచీలకు కలిపి గత ఏడాది లెక్కల ప్రకారం 1.22 లక్షల సీట్లున్నాయి. ఇందులో 82 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతావి మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో చాలావరకూ ఫీజును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సీట్లు పెంచితే ఎక్కువ నిధులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపునకు కొన్నేళ్ళుగా ప్రభుత్వం పెద్దగా అనుమతించడం లేదు. అయితే డిమాండ్ లేని కోర్సుల్లో తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల క్రితం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే సంబంధిత యూనివర్సిటీలు కూడా ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ సీట్లు పెంచడం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ పెరగడంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చే కోర్సులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్కు మరో నాలుగేళ్ళ పాటు సరైన బోధనా సిబ్బంది దొరకడం కష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాన్ రీయింబర్స్మెంట్ సీట్ల పెంపు చేపట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నాయి. అంటే పెరిగిన సీట్లకు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన మేరకు విద్యార్థే ఫీజు చెల్లించాలన్న మాట. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయదు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఈ తరహాలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుస్తున్నాయి. ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. -
9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. జిల్లాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో మూతపడుతున్నాయి. కొన్ని రాజధాని పరిసర ప్రాంతాలకు మారుతున్నాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఉంటాయనేది అధికార వర్గాలే స్పష్టత ఇవ్వడం లేదు. కనీస స్థాయి విద్యార్థుల ప్రవేశాలు లేని కాలేజీలు కౌన్సెలింగ్లో నిలబడటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ప్రతి ప్రైవేటు కాలేజీకి సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రక్రియ ఇంతవరకూ మొదలవ్వలేదు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా కాలేజీల తనిఖీలు చేపట్టాలనే యోచనలో ఉంది. దీంతో యూనివర్సిటీలు అఫ్లియేషన్ విధానాన్ని మొదలు పెట్టలేదు. మరోవైపు ఎక్కువ కాలేజీలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ని సీట్లు ఉంటాయనేది ఇప్పటివరకు స్పష్టత కరువైంది. ఏటా తగ్గుతున్న కాలేజీలు... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు మినహా, జిల్లాల్లోని కాలేజీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అనివార్యంగా మూతపడే పరిస్థితి కన్పిస్తోంది. 2014లో రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2023 కౌన్సెలింగ్ నాటికి ఈ సంఖ్య 159కి పడిపోయింది. తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు 75 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. 2017 నుంచి కాలేజీలు కనుమరుగవ్వడం ఎక్కువైంది. నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లల్లో తప్ప, ఇతర బ్రాంచీల్లో పది మంది కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. పలు జిల్లాలకు చెందిన కాలేజీ యాజమాన్యాలు దాదాపు 15 కాలేజీలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మార్చుకునేందుకు దరఖాస్తులు పెట్టాయి. మరో పది కాలేజీలు ఈసారి అఫ్లియేషన్ నిబంధనలకు దూరంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల విముఖతే సమస్య.. జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సీట్లను పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత సమస్య కాలేజీలను వేధిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ జిల్లాల్లో ఉండటం లేదు. ఈ కారణంగా కాలేజీల నిర్వహణ అతికష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. ఆలోచనల్లో మార్పు విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వీటికే మార్కెట్ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్లో ఉంటే ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమనే ఆలోచనలతో ఉన్నారు. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణను కష్టంగా మారుస్తున్నాయి. అన్ని బ్రాంచీల్లోనూ సరికొత్త సాంకేతిక బోధన విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఒత్తిడి తగ్గాలి..నైపుణ్యం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యే ముందే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాలకు విడుదల చేసింది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు దీన్ని పాటించాలంది. మారిన బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏఐసీటీఈ రెండేళ్లుగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను కూడా కౌన్సిల్ పరిగణనలోనికి తీసుకుంది. జాతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై విద్యార్థులకు తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే మానసిక ఒత్తిడికి కారణమని భావిస్తోంది. ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక్కసారిగా మూస విధానం నుంచి స్వతహాగా ఆలోచించే విద్యావిధానంలో అడుగుపెడుతున్నారు. ఇది కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతోందని ఏఐసీటీఈ అధ్యయనంలో తేలింది. బ్యాక్లాగ్స్తోపెరుగుతున్నఒత్తిడి... అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మానసిక నిపుణులను నియమించాలి. ఇంటర్మీడియట్ విద్య వరకూ విద్యార్థులు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజనీరింగ్ విద్య ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టే పద్ధతి ఉండదు. కంప్యూటర్ సైన్స్లో గణితం భాష ఒక్కసారిగా మారిపోతోంది. రెండో ఏడాదికి వచ్చేసరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్లను విద్యార్థి నేర్చుకోవడమే కాకుండా, దాని ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్లోనూ బేసిక్ ఇంటర్ విద్య స్థానంలో ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టం. ఈ కారణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులకు బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే విద్యార్థి మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. నిపుణులు విద్యార్థి మానసిక స్థితిని కౌన్సెలింగ్ ద్వారా మెరుగుపరచాలని మండలి సూచిస్తోంది. నైపుణ్య కొరత కూడా కారణమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువ శాతం ప్రతిభ కనబర్చడం లేదని మండలి భావిస్తోంది. ప్రతి ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మాత్రమే అవసరమైన నైపుణ్యం కలిగిఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్టులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇది కూడా నామమాత్రంగా జరగడం వల్ల విద్యార్థులు ఉపాధి పొందే విషయంలో, ఉద్యోగంలో రాణించే విషయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్తో టాపర్గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
ఇంజనీరింగ్ కాలేజీల ఎదురీత
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. దశాబ్ద కాలంగా ఏటా కళాశాలలు మూతపడు తున్నాయి. 2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 11కుగాను ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ఇలా ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆఖరుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్లో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి? సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో డిమాండ్ బాగా తగ్గింది. ఈ కోర్సుల్లో 40 శాతం కంటే తక్కువే అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో మెకానికల్, సివిల్ బ్రాంచీల జోలికే వెళ్లడం లేదు. 2023 ప్రవేశాల్లో దాదాపు 30 కాలేజీల్లో సివిల్ బ్రాంచ్లో సగానికి పైగానే సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ప్రవేశాలుంటున్నాయి. సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యకు ఎక్కువ మంది హైదరా బాద్ను ఎంపిక చేసుకుంటుండగా, ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యనూ ఇక్కడే పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదువుకునే సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కునే అవకాశం నగరంలో ఉందని భావిస్తున్నారు. అరకొర విద్యార్థులతో జిల్లాల్లో కాలేజీలను నడిపే పరిస్థితి లేదని నిర్వాహకులు అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులకు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో విద్యార్థులు ఆ కాలేజీల వైపు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల అవి క్రమంగా మూతపడుతున్నాయి. ప్రైవేటు వర్సిటీలొస్తే మరీ ప్రమాదం ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ ఆహ్వానం పలుకుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలోని ప్రధాన కాలేజీలు ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఈ పోటీని మన ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం కాలేజీల నాణ్యత పెంచాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రానికి సూచించింది. న్యాక్ అక్రిడిటేషన్ పరిధిలోకి వస్తేనే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తరహా పోటీని తట్టుకునే ప్రైవేటు కాలేజీలు 20కి మించి లేవు. ఇంజనీరింగ్ విద్యలోనూ మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్లో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. పోటీ పెరిగితే మనుగడ ప్రైవేటు యూనివర్సిటీలు పెరుగు తున్నాయి. కొత్త కోర్సుల దిశగా అవి దూసుకెళ్తున్నాయి. భవిష్యత్ లోనూ ఇదే ట్రెండ్ కన్పిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్య మిస్తున్నారు. జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీలు ఈ పోటీని తట్టుకునేలా లేవు. ఇందుకు తగ్గట్టుగా ముందుకెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే వాటికి మనుగడ ఉంటుంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ -
సాఫ్ట్వేర్ నిపుణులకు ‘పార్ట్టైమ్’ ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ కొలువులిస్తామంటూ ఇంజినీరింగ్ కాలేజీల వెంటపడే ఐటీ కంపెనీలు కామన్! కట్ చేస్తే... పాఠాలు చెప్పాలంటూ సాఫ్ట్ వేర్ నిపుణుల కోసం వేట మొదలెట్టాయి కాలేజీలు. ఫ్యాకల్టీగా చేరాలని.. కనీసం పార్ట్టైమ్గా అయినా విద్యార్థులకు బోధించాలంటూ ఇంజనీరింగ్ కాలేజీలు వారిని ఆహ్వానిస్తున్నాయి. ఆన్లైన్లోనైనా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి. మంచి వేతనాలివ్వడానికీ సిద్ధపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. మరోపక్క సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. విద్యార్థుల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను డిమాండ్ పెరగడమే దీనికి కారణం. అయితే, వీటిని బోధించే ఫ్యాకల్టీకి మాత్రం తీవ్రంగా కొరత నెలకొంది. ఈ విభాగాల్లో ఎంఎస్ చేసిన వాళ్లు కూడా బోధన వైపు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఇప్పటివరకూ సీఎస్సీ బోధించే వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. దీనివల్ల నాణ్య త పెరగడం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) గుర్తించింది. సాఫ్ట్వేర్ రంగం లో నిపుణులతో బోధించే ఏర్పాటు చేయాలని సూ చించింది. ఈ తరహా బోధన ఉంటే తప్ప వచ్చే ఏ డాది నుంచి కంప్యూటర్ కోర్సులకు అనుమతించవ ద్దని రాష్ట్రాల కౌన్సిళ్లకు తెలిపింది. దీంతో సాఫ్ట్వేర్ నిపుణులకు గాలంవేసే పనిలోపడ్డాయి కాలేజీలు. వాళ్లెవరో చెప్పాల్సిందే... రాష్ట్రంలోని 174 కాలేజీల్లో కంప్యూటర్ కొత్త కోర్సులను బోధించే వారి జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్శిటీకి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆయా ఫ్యాకల్టీ అర్హతలను యూనివర్సిటీ కమిటీలు పరిశీలిస్తాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీకి ఆయా రంగాల్లో నిష్ణాతులను నియమించాలని ఏఐసీటీఈ సూచించింది. అయితే, వాళ్ల అర్హతలేంటనేది స్పష్టం చేయలేదు. దీని స్థానంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్తో బోధన చేయించాలని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం కంప్యూటర్ కోర్సులున్నాయి. ప్రతీ కాలేజీలోనూ ఒక ఏఐ బ్రాంచీ ఉంటోంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రతీ కాలేజీ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇతర కోర్సుల కోసం కనీసం ఐదుగురి చొప్పున ప్రొఫెషనల్స్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో దాదాపు 250 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు అవకాశాలు దక్కే వీలుంది. ఆన్లైన్ క్లాసులు... ఫుల్టైమ్ ఫ్యాకల్టీ కొరత నేపథ్యంలో... ఆన్లైన్ ద్వారా కొత్త కోర్సులను బోధించేందుకు యూనివర్సిటీలు, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు అనుమతిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారిని బోధనకు ఒప్పించేందుకు కాలేజీలు కృషి చేస్తున్నాయి. వారానికి కనీసం 10 క్లాసులు చెప్పించే ఏర్పాటు చేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు కూడా ఇదే బాట పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి శని, ఆదివారాల్లో సెలవులుంటాయి. అయితే, కోవిడ్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులను కంపెనీలు తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ కారణంగా వారాంతపు సెలవుల్లో బోధనకు నిపుణులు సిద్ధపడటం లేదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. దీంతో అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏఐ కోసం నియమించినట్టు తెలిపారు. సాధారణ ఫ్యాకల్టీకి ఇచ్చే వేతనం కన్నా పార్ట్టైమ్ పనిచేసే నిపుణులు రెండింతలు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. -
టాపర్లంతా క్యాంపస్ కాలేజీలకే.. ఎక్కువ మంది మొగ్గు చూపింది ఈ కోర్సుకే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆప్షన్లు ఇచ్చే గడువు బుధవారంతో ముగిసింది. ఈ నెల 16న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. తొలి దశలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సీట్లు పెరగడం, సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు వస్తాయని భావించడంతో ఎక్కువ మంది ఈ కోర్సును ఎంచుకున్నారు. విద్యార్థులు మొత్తం 49,42,005 ఆప్షన్లు ఇవ్వగా, వీటిలో 38 లక్షల వరకూ కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో 3,777 సీట్లు ఉంటే, విద్యార్థుల నుంచి 10 లక్షలకు మించి ఆప్షన్లు రాలేదు. గడువు ముగిసే నాటికి మొత్తం 75,172 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఒకే విద్యార్థి అత్యధికంగా 1,109 ఆప్షన్లు ఇచ్చారు. వాస్తవానికి 12వ తేదీన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గడువును పొడిగించారు. ర్యాంకర్ల నుంచి కన్పించని స్పందన తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్లో ఎక్కువ ర్యాంకులు పొందిన వారు తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లు అతి కొద్ది ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. విశ్వవిద్యాలయాల క్యాంపస్ పరిధిలో ఉండే సీట్లకు పోటీ పడ్డారు. 500 ర్యాంకు దాటిన వారు మాత్రం టాప్ టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. ఎంసెట్లో వెయ్యి వరకూ ర్యాంకు సాధించిన విద్యార్థులు తొలి కౌన్సెలింగ్లో 500లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా ర్యాంకర్ల చేతే దరఖాస్తు చేయించి, సీటు వచ్చిన తర్వాత స్పాట్ అడ్మిషన్ సమయంలో రద్దు చేయించడం ఆనవాయితీగా సాగుతోంది. ఈ సంవత్సరం దీనిపై దృష్టి పెట్టిన ఉన్నత విద్యామండలి.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో వారు పొందిన సీట్ల వివరాలు తెప్పించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది. దీంతో సీట్లను బ్లాక్ చేసే యాజమా న్యాలకు సహరించేందుకు విద్యార్థులు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో ఉండే సీట్ల కోసమే ర్యాంకర్లు పోటీప డ్డారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలో 2,580, కాకతీయ పరిధిలోని 1,080 సీట్లతో కలుపుకొని రాష్ట్రంలోని 9 వర్సిటీల పరిధిలో మొత్తం 4,773 సీట్లున్నాయి. వీటికే టాపర్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. తొలి విడతలో 76,359 సీట్లు ఈ ఏడాది సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. 7 వేల వరకూ సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్లో తగ్గించుకున్న కాలేజీలు, ఆ మేర కంప్యూటర్ బ్రాంచీల్లో పెంచుకున్నాయి. దీంతోపాటు అదనంగా మరో 7 వేల వరకూ సీఎస్సీలో సీట్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి విడత కౌన్సెలింగ్లో 76,359 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 42,087 సీట్లు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ బ్రాంచీల్లో ఉన్నాయి. -
కంప్యూటర్ సైన్స్లో పెరిగాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీ లలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించిన సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తి మేరకు పెద్దగా డిమాండ్ లేని బ్రాంచీల నుంచి ఇతర బ్రాంచీలకు 7,635 సీట్లను మార్చగా.. అద నంగా 6,930 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలకు సంబంధించిన సీట్లేకావడం గమనార్హం. మొత్తంగా డిమాండ్ ఉన్న బ్రాంచీలకు సంబంధించి ఈసారి (2023–24) కొత్తగా 14,565 ఇంజనీరింగ్ సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్లో చేర్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సీట్లలో దాదాపు 10,195 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఇలా ఇంజనీరింగ్లో సీట్ల పెంపుతో రూ.27.39 కోట్ల మేర అదనంగా ఫీజు రీయింబర్స్మెంట్ భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని బ్రాంచీలు, సీట్లు రద్దు చేసుకుని.. ఆ మేర డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకోవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 50కిపైగా కాలేజీలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో భారీగా సీట్లు పెంచుకున్నాయి. మొత్తం 1.15 లక్షలకు చేరిన సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్లో 66,112 సీట్లను అందుబాటులో పెట్టారు. తాజాగా పెరిగిన సీట్లను కూడా చేరిస్తే ఈ సంఖ్య 80,677 సీట్లకు పెరుగుతోంది. యాజమాన్య కోటా సీట్లనూ కలిపితే రాష్ట్రంలో 1.15 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్తోపాటు మరికొన్ని కంప్యూటర్ కోర్సుల్లో గత సంవత్సరం 41,506 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 56 వేల వరకూ చేరనున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్తోపాటు ఇతర బ్రాంచీల్లో గత ఏడాది 29,780 సీట్లు ఉండగా.. ఈసారి 22,145 సీట్లకు తగ్గిపోనున్నాయి. ఎంసెట్ షెడ్యూల్లో మార్పు ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ చివరి దశకు చేరకుంది. ఈ నెల 12న సీట్ల కేటా యింపు జరగాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇవ్వడంతో.. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు చేశారు. దీని ప్రకారం ఈ నెల 8 వరకూ అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 12 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 16న సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. పెంపు మంచి నిర్ణయం.. ఇంజనీరింగ్ సీట్ల పెంపు నిర్ణయం ఆహ్వాని ంచదగ్గ పరిణామం. దీనివల్ల అదనంగా 10వేల మందికిపైగా సీట్లు పొందే అవ కాశం వస్తుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఇది ప్రయోజనకరం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించాలి సంప్రదాయ బ్రాంచీల్లో సీట్లు తగ్గించడం వల్ల కొన్ని సెక్షన్లు రద్దవు తాయి. ఈ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అధ్యాపకులను తొలగించే ప్రమాదం ఉంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మిగతా బ్రాంచీల్లో బోధించే నైపుణ్యం కల్పించాలి. – వి.బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్యా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఎంసెట్ కౌన్సెలింగ్.. గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనుంది. ఎంసెట్ అర్హులు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 28 నుంచి అభ్యర్థులు అవసరమైన ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉన్నత విద్యామండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకూ కౌన్సెలింగ్లో పాల్గొనే కాలేజీలు, ఉండే సీట్ల వివరాలు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ విభాగానికి అందలేదు. ఎంసెట్ కౌన్సెలింగ్లో దాదాపు 145 కాలేజీలు పాల్గొంటాయి. వాటికి సంబంధించిన జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఎంసెట్ కౌన్సెలింగ్కు పంపాల్సి ఉంటుంది. వాటిల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏయే బ్రాంచీల్లో సీట్లు ఉన్నాయి? అనే వివరాలు అందించాలి. దీని ఆధారంగా కౌన్సెలింగ్ చేపడతారు. సకాలంలో అప్షన్లు ఇస్తే తప్ప వచ్చే నెల మొదటి వారంలో తొలిదశ సీట్లు వెల్లడించడం సాధ్యం కాదు. ఆప్షన్లు ఇవ్వడానికి అన్ని కాలేజీలు, సీట్ల వివరాలు పొందుపర్చకపోతే ఎలా సాధ్యమని అధికారులే అంటున్నారు. కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. ఈ ఏడాది ఎంసెట్కు 1,95,275 మంది హాజరైతే 1,56,879 మంది అర్హత సాధించారు. వారంతా ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు ఉంటాయో? అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చాలా కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకొనేందుకు అనుమతి కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకొని, సీఎస్సీ, సీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి. గతేడాది 95 శాతం కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అయితే ఒకేసారి సంప్రదాయ కోర్సులను ఎత్తేస్తే ఇబ్బంది ఉంటుందని విశ్వవిద్యాలయాలు అనుమతులు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా దాదాపు 100 కాలేజీలు బ్రాంచీల మార్పు కోసం ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు సంబంధిత కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మౌలికవసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపుతోపాటు సీట్ల మారి్పడిని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఏయే కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. స్పష్టత లేకుండా ముందుకెళ్లడం ఎలా? రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. తొలిదశలో సాధారణంగా 75 వేల సీట్లను కౌన్సెలింగ్లో ఉంచుతారు. కొన్ని కాలేజీల్లో అఫిలియేషన్ పూర్తవ్వకపోవడం, మౌలికవసతులు, ఫ్యాకల్టీ సమకూర్చుకొనేందుకు ఆయా కాలేజీలకు మరికొంత అవకాశం ఇవ్వడంతో మొదటి విడత కౌన్సెలింగ్లో కొన్ని కాలేజీలను చేర్చరు. అయితే ఈసారి పెద్ద మొత్తంలో కాలేజీల జాబితా అందలేదని అధికారులు చెబుతున్నారు. వాటిని రెండో విడతలో చేర్చడం వల్ల కొందరు విద్యార్థులకు నష్టం జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. సాధారణంగా తొలి విడతలో కొంతమంది ఆప్షన్లు ఇవ్వరు. దీనివల్ల తక్కువ ర్యాంకు ఉన్న వాళ్లకు కూడా మంచి కాలేజీ, మంచి బ్రాంచీల్లో సీట్లు వచ్చే వీలుంది. ఇప్పుడు అన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులో లేకపోతే అలాంటి వాళ్లకు ఇబ్బంది కలిగే వీలుంది. ఆప్షన్లు ఇచ్చే సమయానికైనా అన్ని సీట్లు, కాలేజీల వివరాలు పంపాలని ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. లేనిపక్షంలో ఆప్షన్లు ఇచ్చే గడువు పొడిగింపుపై ఆలోచించక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. -
జేఎన్టీయూ(ఏ) పరిధిలో కొత్తగా 3 కళాశాలలు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నూతనంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. చిత్తూరు, రాయచోటిలో ఒక్కొక్క ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులో ఒక ఫార్మసీ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యావిధానం–2020ని దృష్టిలో ఉంచుకుని అనుమతుల ప్రక్రియలో వెసులుబాటుతోపాటు కొన్ని మార్పులు చేసింది. ప్రొఫెషనల్ కోర్సులపై ఉన్న మారిటోరియాన్ని ఎత్తేసింది. దీంతో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) పరిధిలో రెండు ఇంజినీరింగ్, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. ఇప్పటికే జేఎన్టీయూ(ఏ) పరిధిలో 98 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. ఫార్మసీ కళాశాలల సంఖ్య కూడా 34కు చేరింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయం మేరకు బీటెక్ కోర్సుల్లో బీఈ, బీటెక్ గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచారు. నూతన నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్లలో ఇన్టేక్ను 180 నుంచి 300 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. తక్కిన 60 సీట్లు.. 30 సీట్లు చొప్పున సివిల్, మెకానికల్ వంటి కోర్ గ్రూప్లలో భర్తీ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్సెస్ ప్రోగ్రామ్ను సైతం తాజాగా కోర్ గ్రూప్గా పరిగణించారు. విద్యార్థుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. యూసీఎస్ బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ వర్సిటీకి చెల్లించాల్సిన యూనివర్సిటీ కామన్ సర్విసెస్ (యూసీఎస్) ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే నో అబ్జెక్షన్ సర్టీఫికెట్ (ఎన్వోసీ) జారీచేస్తామని జేఎన్టీయూ (ఏ) ఉన్నతాధికారులు గతంలో స్పష్టం చేశారు. వర్సిటీ ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్వోసీ జారీచేస్తేనే ఏఐసీటీఈ 2023–24 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇస్తుంది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) ఎన్వోసీ జారీకి యూసీఎస్ బకాయిలతో ముడిపెట్టింది. వర్సిటీ పరిధిలోని 98 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే 88 కాలేజీలు యూసీఎస్ బకాయిలు చెల్లించాయి. 10 ఇంజినీరింగ్ కళాశాలలు రూ.1.50 కోట్ల బకాయిలున్నాయి. వీటికి కూడా బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. పోర్టల్లో వివరాలు ఏఐసీటీఈ నుంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు వర్సిటీ అనుబంధ హోదాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కళాశాలకు సంబంధించిన వివరాలన్నీ పోర్టల్లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా వర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగానే ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఏపీ ఈఏపీసెట్ జరుగుతోంది. పరీక్ష పూర్తయి ర్యాంకులు ప్రకటించి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేలోపు సీట్ల కేటాయింపు పూర్తికావాల్సి ఉంది. అన్ని వసతులు ఉన్న కళాశాలలకే గుర్తింపు బోధన ప్రమాణాలు, మౌలిక వసతులు, అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ ఉన్న కళాశాలకే అనుబంధ గుర్తింపు జారీచేస్తాం. నిబంధనలకు లోబడి ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తాం. గత ఐదేళ్ల పురోగతి, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొలువులు తదితర అంశాలను బేరీజు వేసి కళాశాల స్థితిగతులను అంచనావేస్తాం. అన్ని రకాల సదుపాయాలున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలనే పరిగణనలోకి తీసుకుంటాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్ధన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ సిబ్బందిని రిక్రూట్ చేసుకునే క్రమంలో ఆటోమొబైల్ కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. దీంతో గౌహతి, మండీ లాంటి ప్రాంతాల్లోని ఐఐటీల్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఈసారి గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులను మరింతగా నియమించు కోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో హైరింగ్ను పెంచుకుంటున్నట్లు వివరించాయి. అనలిటిక్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇండస్ట్రీ 5.0 నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 2024 బ్యాచ్ నుంచి మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ట్రైనీలను తీసుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 15-20శాతం ఎక్కువమందిని తీసుకోబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్న వారికి కొత్త టెక్నాలజీలు, ప్లాట్ఫాంలపై తగు శిక్షణ ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసం సిద్ధం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే డేటా అనలిటిక్స్ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించింది. డేటా మైనింగ్ తదితర సాంకేతికతలతో ఈ–కామర్స్ చానల్స్ను అభివృద్ధి చేసేందుకు, బ్యాక్–ఎండ్ సిస్టమ్స్ను అభివృద్ధి చేసేందుకు వీరిని వినియోగించుకోవాలనేది కంపెఈ యోచన. మారుతీ కూడా.. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాల ఊతంతో భవిష్యత్ అవసరాల కోసం నియామకాలను మరింతగా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కూడా సన్నద్ధమవుతోంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా క్యాంపస్ నుంచి నియామకాలను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది క్యాంపస్ల నుంచి 1,000 మంది వరకూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలో అంతర్గతంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం, డిజిటల్ పరివర్తన మొదలైన వాటిని వేగంగా అమలు చేస్తున్నామని, ఇందుకోసం తత్సంబంధ నైపుణ్యాలున్న ప్రతిభావంతుల అవసరం చాలా ఉంటోందని వివరించాయి. (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇటీవలే తమ క్యాంపస్ హైరింగ్ల జాబితాలో మరిన్ని కొత్త ఐఐటీలు, ఎంబీయే సంస్థలను కూడా చేర్చింది. 2022లో దాదాపు 50 పైగా ఇంజినీరింగ్, ఎంబీఏ సంస్థల నుంచి మహీంద్రా ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకుంది. సగటున 500-600 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు హీరో మోటోకార్ప్ సంస్థ డిప్లొమా ఇంజినీర్ల నియామకం కోసం ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యూనివర్సిటీతో జట్టు కట్టింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే తాము 40 శాతం ఎక్కువ మందిని క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. వీరిలో ఎక్కువగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, ఎంబీఏలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ భారత్లో తన కార్యకలాపాల కోసం వివిధ విభాగాల్లో, హోదాల్లో 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసే యత్నాల్లో ఉంది. క్యాంపస్ల విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభించనుంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) క్యాంపస్లలోనూ ఆసక్తి.. ఆటోమొబైల్ కంపెనీల నియామకాల ప్రణాళికలపై క్యాంపస్లలో కూడా ఆసక్తి నెలకొంది. ఐఐటీ–గౌహతిలో గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్ ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారికి ఆఫర్లు గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితరుల కోసం డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి తమ దగ్గర నుంచి రిక్రూట్ చేసుకునే ఆటోమొబైల్ కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఐఐటీ-మండీ వర్గాలు తెలిపాయి. కోవిడ్పరమైన మందగమనం ప్రభావం తగ్గడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు వివరించాయి. -
55,000 వరకు నేషనల్ లెవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 30 నుంచి దరఖాస్తులకు అవకాశం... ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించనున్నారు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి. గతేడాది పర్సంటైల్ను పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 88.41 పర్సంటేల్ వస్తే జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్సీఎల్కు 67.00, ఈడబ్ల్యూఎస్కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్తో అడ్వాన్స్డ్ కటాఫ్ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి.. జేఈఈ మెయిన్లో టాప్ పర్సంటైల్ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్డ్కు వెళ్తారు. మెయిన్లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి. కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది. – ఎంఎన్ రావు, జేఈఈ మెయిన్ బోధన నిపుణుడు -
ప్రమాణాల్లేకున్నా సీట్లు పెంచాలట! ఇంజనీరింగ్ కాలేజీల తీరిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సరైన నాణ్యతా ప్రమాణాల్లేకుండానే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ తాజా పరిశీలనలో వెల్లడైంది. పదేళ్ల నాటి కంప్యూటర్లు... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో దాదాపు 50 కాలేజీల్లో అన్ని సదుపాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన కాలేజీలు సమర్పించిన సదుపాయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా కంప్యూటర్ సైన్స్ కోర్సు బోధనకు కనీసం 10 మంది విద్యార్థులకు ఒక అత్యాధునిక కంప్యూటర్ ఉండాల్సి ఉండగా సెక్షన్ మొత్తానికి రెండు కంప్యూటర్లు కూడా లేవని తేలింది. అవి కూడా అతితక్కువ ప్రమాణాలతో ఉన్నాయని, సరికొత్త టెక్నాలజీ బోధించేందుకు ఏమాత్రం పనికి రావని అధికారులు గుర్తించారు. పదేళ్ల నాటి కాన్ఫిగరేషన్తో వాడే కంప్యూటర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీకి వాడే అత్యాధునిక సాఫ్ట్వేర్ రన్ కావడానికి ఉపకరించే ఆధునిక కంప్యూటర్ల స్థానంలో నాసిరకం వాటితోనే కాలేజీలు బోధన సాగిస్తున్నట్లు తేలింది. ఇక అధ్యాపకుల విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చిన కొత్తలో ఉన్న వారే ఇప్పుడూ బోధకులుగా ఉన్నారు. వారు నైపణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు ఎలాంటి ఆధారాలను యాజమాన్యాలు చూపలేదని తెలిసింది. ప్రతిరోజూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ప్రముఖ కంపెనీల్లో అధ్యాపకులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ దిశగా ఎలాంటి కసరత్తు జరగలేదు. అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే గుర్తింపు.. ఈ నెల 18 నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మొదలుపెడతాం. ప్రతి కాలేజీని పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే కాలేజీలకు గుర్తింపు ఇస్తాం. కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని ఎక్కువ కాలేజీలే కోరుతున్నాయి. వాటి సామర్థ్యం, బోధన విధానాలను లోతుగా పరిశీలించే ఉద్దేశంతోనే ఈసారి అఫిలియేషన్ ప్రక్రియను ముందే చేపడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ 78 కాలేజీల డొల్లతనం.. ఈసారి దాదాపు వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సివిల్లో 40 శాతం, మెకానికల్లో 35 శాతం, ఎలక్ట్రికల్లో 34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడంతో ఈసారి ఆయా బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్లు తగ్గించుకుంటామని కోరాయి. వాటి స్థానంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఆయా కాలేజీలు సమర్పించిన వివరాలను జేఎన్టీయూహెచ్ అధికారులు పరిశీలించగా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. కంప్యూటర్ కోర్సులు కోరుతున్న వంద కాలేజీలకుగాను 78 కాలేజీల్లో అత్యాధునిక కంప్యూటర్లు లేవని, కంప్యూటర్ లాంగ్వేజ్పై పట్టున్న ఫ్యాకల్టీ లేదని తేలింది. -
అటు మూత.. ఇటు కోత
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా కనీసం 50కిపైగా ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరికొన్ని వేల సంఖ్యలో కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఏర్పాటు కావడం, కొన్ని కోర్సులకే ఆదరణ ఉండటం, చేరికలు తగ్గి కాలేజీల నిర్వహణ భారంగా మారడం, నైపుణ్యాలు కొరవడి ప్లేస్మెంట్లు తగ్గిపోవడం ఈ దుస్థితికి కారణమని నిపుణుల కమిటీలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల కమిటీల సూచనల మేరకు ఏఐసీటీఈ 2019లో కొత్త కాలేజీలకు అనుమతులపై మారటోరియం విధించింది. 2014–15 నుంచి జాతీయస్థాయిలో 767 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడినట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2021–22 నివేదికలో వెల్లడించింది. మరికొన్ని కాలేజీలు ఆదరణ లేకపోవడంతో 10,539 కోర్సులను రద్దు చేసుకున్నాయి. 2021–22 నాటికి దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక కోర్సుల్లో 24 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో మొత్తం సీట్ల సంఖ్య 31.8 లక్షలు కాగా తరువాత నుంచి ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడెనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇదీ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సుల పరిస్థితి నేడు రాష్ట్రంలో వెన్నుతట్టి ప్రోత్సాహం విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉన్నత చదువులు ఏమాత్రం భారం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు అయ్యే మొత్తం ఫీజును జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి త్రైమాసికంలో నిర్దిష్టంగా చెల్లిస్తూ చదువులకు భరోసా కల్పిస్తోంది. అంతేకాకుండా వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున విద్యార్థులకు అందజేస్తోంది. మరోవైపు గత సర్కారు బకాయిపెట్టిన ఫీజులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 తరువాత రాష్ట్రం నుంచి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా మూసివేత కోసం దరఖాస్తు చేయలేదని ఏఐసీటీఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ► అన్ని కాలేజీల్లో నిబంధనల ప్రకారం సదుపాయాలు, బోధనా సిబ్బంది, న్యాక్ అక్రిడిటేషన్ తప్పనిసరి. ► సిలబస్లో సంస్కరణలు. కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి. ► ఇంటర్న్షిప్ తప్పనిసరి. స్కిల్ ఆధారంగా 30 శాతం కోర్సులకు రూపకల్పన. ► మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధిపై ఉచిత శిక్షణ. ► నాస్కామ్, ఏపీఎస్ఎస్డీసీ సంస్థల ద్వారా యువతకు శిక్షణ కార్యక్రమాలు. ► 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య 37 వేలు కాగా 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనేందుకు నిదర్శనం. నాడు 65 కాలేజీల మూసివేత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 65 కాలేజీల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను మూసివేసినట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సర్కారు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కొరవడి అధ్వానంగా మారింది. కాలేజీల ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్గా ఇస్తామనడం, అరకొర ఫీజులు కూడా ఏటా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ విద్య అస్తవ్యస్థమైంది. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి కాలేజీలకు రూ.1,800 కోట్ల మేర ఫీజులు బకాయి పెట్టడం గమనార్హం. దీంతో మూసివేత దిశగా విద్యాసంస్థలు సాగాయి. ► పుట్టగొడుగుల్లా వెలిసిన కాలేజీల్లో ఏఐసీటీఈ / ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఉండడం లేదు. ధనార్జనే ధ్యేయంగా మొక్కుబడిగా నిర్వహించడంతో ప్రమాణాలు పడిపోయి విద్యార్థులకు నైపుణ్యాలు కొరవడ్డాయి. ఫలితంగా ప్లేస్మెంట్లు సన్నగిల్లాయి. చదువులు ముగియగానే ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారింది. అదనపు నైపుణ్యాలు, సర్టిఫికేషన్ కోర్సులను కూడా పూర్తి చేస్తే కానీ ఉద్యోగాలు దక్కడం లేదు. ► ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ నిరంతరం కొత్త అంశాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో నైపుణ్యాలను సాధించిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. పలు కాలేజీల్లో కోర్సులు, బోధనా వనరులు, సదుపాయాలు లేవు. వరుసగా మూడేళ్లు 25 శాతం కన్నా చేరికలు తక్కువగా ఉండే కాలేజీలు, కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు రద్దు చేస్తోంది. ► ఇండియా స్కిల్ నివేదిక ప్రకారం ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారిలో 48శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. -
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్లో సగం సీట్లు ఖాళీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడంలేదు. గత పదేళ్లుగా కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ ఏటా ప్రకటించే గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40 నుంచి 48 శాతం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. 2013–14లో 39 శాతం సీట్లు మిగిలిపోగా, 2016–18 నాటికి 48 శాతానికి పెరిగింది. ఆ తరువాత రెండేళ్లూ ఇదే పరిస్థితి. కరోనా తరువాత చేరికలు కొంతమేర పెరగడంతో మిగులు సీట్లు 42 శాతానికి చేరాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గత మూడేళ్లుగా 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 85 శాతం సీట్లు భర్తీ అవడం విశేషం. ఇన్టేక్ తగ్గినా చేరికలు మాత్రం అంతే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా తగ్గింది. పదేళ్లక్రితం 30 లక్షల నుంచి 31 లక్షల వరకు సీట్లు ఉండగా ఇప్పుడది 23 లక్షలకు తగ్గింది. సీట్ల సంఖ్య తగ్గినా చేరికల్లో మాత్రం మార్పు లేదు. గతంలో పలు విద్యా సంస్థలు సదుపాయాలు లేకున్నా కోర్సులకు అనుమతులు తెచ్చుకొనేవి. వీటివల్ల సాంకేతిక విద్య నాసిరకంగా మారుతుండడంతో సదుపాయాలున్న వాటికే ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ప్రమాణాల మేరకు సదుపాయాలు లేకున్నా, చేరికలు వరుసగా మూడేళ్లు 25 శాతానికి లోపు ఉన్నా వాటికి అనుమతులను రద్దు చేస్తోంది. దీంతో పలు కాలేజీలు మూతపడ్డాయి. కంప్యూటర్ సైన్సు సీట్లకే డిమాండ్ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత కోర్సులవైపు దృష్టి సారిస్తున్నారు. దానికోసం కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. ఇతర కోర్సుల్లో చేరికలు అంతంతమాత్రమే. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), బిగ్ డేటా వంటి అంశాలలో నేరుగా లేదా కాంబినేషన్లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి బోధనకు అవసరమైన సదుపాయాలను కొన్ని ప్రముఖ కాలేజీలు మాత్రమే కల్పిస్తున్నాయి. మిగతా కళాశాలలు సంప్రదాయ కోర్సులతోనే నెట్టుకొస్తున్నాయి. సంప్రదాయ కోర్ గ్రూప్ కోర్సుల వైపు విద్యార్థులను మళ్లించడానికి ఇతర అంశాలను వీటికి మైనర్ కోర్సులుగా జతచేయాలని ఏఐసీటీఈ ఆలోచిస్తోంది. ఈ కోర్సుల్లోని నూతన అంశాలపై అధ్యాపకులకు శిక్షణ కూడా ఇస్తోంది. లెక్చరర్ల కోసం ఇంటర్న్షిప్ కోర్సులు కూడా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో చేరికలు 80 శాతం పైనే దేశంలోని పరిస్థితులకు భిన్నంగా రాష్ట్రంలో చేరికలు 80 శాతానికి పైగా ఉండటం విశేషం. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆర్థిక భారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్లో చేరుతున్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తున్నారు. ఇంజనీరింగ్ సిలబస్ను సంస్కరించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త అంశాలను జోడించారు. ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.9051.57కోట్లు అందించారు. దీని ద్వారా ఇంజనీరింగ్తో పాటు ఇతర కోర్సులకు చెందిన 24,74,544 మంది విద్యార్థులకు మేలు చేకూరింది. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు రూ.3,349.57కోట్లు అందించగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. కాలేజీలకు న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేశారు. ప్రమాణాలు మెరుగుపరుచుకోని కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు సరిగా లేని 28 కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ఒక్క విద్యార్థీ చేరని మరో 22 కాలేజీల అనుమతులు రద్దు చేశారు. దీంతో కాలేజీల్లో వసతులు, బోధనలో నాణ్యత మెరుగుపడుతున్నాయి. ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా సీట్లు 1,13,403 కాగా, అందులో 95,968 (85 శాతం) భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా, స్పాట్ అడ్మిషన్లతో పాటు చూస్తే 1,21,836 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఏటా భర్తీ అయ్యే సీట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్ఈ డేటా సైన్స్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్టీయూ తరఫు న్యాయవాది మయూర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కనీ్వనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది. చదవండి: అదో చిన్న సమస్య..పెద్దది చేయొద్దు: మంత్రి మల్లారెడ్డి -
కొత్త కొలువుకు ఇరకాటం!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్రెడ్డి (పేరు మార్చాం) ఇటీవల ఆ కాలేజీలో కొలువుకు రాజీనామా చేశారు. అదే ప్రాంతంలో మరో కాలేజీలో మంచి వేతనానికి ఉద్యోగంలో చేరారు. అయితే ఇదివరకు పనిచేసిన కాలేజీ ఆన్లైన్ రికార్డులో వెంకట్రెడ్డి పేరు తొలగించలేదు. ఈ ప్రొఫైల్ తొలగింపు అధికారం కాలేజీ యాజమాన్యానికి మాత్రమే ఉండటంతో పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఆ కాలేజీ రికార్డులో ఆయన పేరు తొలగించలేదు. పూర్వపు కాలేజీలో పేరు తొలగిస్తే తప్ప కొత్త కాలేజీలో కొలువులో చేరే అవకాశం లేదు. దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆయన ప్రొఫైల్ డిలీట్ కాకపోవటంతో కొత్త కాలేజీ యాజమాన్యం అతనికి ఇచ్చిన అవకాశాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వెంకట్రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అనేకమంది బోధన సిబ్బంది ఎదుర్కొంటున్న సంకటస్థితి. ఈ సమస్యతో మెరు గైన అవకాశాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య, ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బందికి సంబంధించిన నియామక నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం.. ప్రతి బోధకుడి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడంతోపాటు రోజువారీ హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ నంబర్సహా బోధకుడి పూర్తి సమాచారాన్ని ఆయా కాలేజీ యాజమాన్యాలు కంప్యూటరీకరించి.. వివరాలను వర్సిటీ లేదా సంబంధిత బోర్డు పోర్టల్లో నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ విధానంతో ఒక వ్యక్తి ఒకేచోట మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి కాలేజీ మారితే అతని వివరాలను పాత యాజమాన్యం వెబ్సైట్నుంచి తొలగిస్తేనే మరో కాలేజీలో చేరేందుకు వీలుంటుంది. కొత్త కాలేజీలో కూడా ఆన్లైన్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశాక కొలువులో చేరాల్సి ఉంటుంది. కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చి న ఈ అధికారం తమకు కొత్త అవకాశాలు రాకుండా చేస్తోందని అధ్యాపకులు గగ్గోలు పెడుతున్నారు. నిర్లక్ష్యంతో ఇబ్బందులు.. రాష్ట్రంలో మూడు వందలకుపైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో దాదాపు 80 వేల మంది బోధన సిబ్బంది అవసరం. కానీ చాలాచోట్ల సిబ్బందిని రికార్డుల్లో మాత్రమే కాలేజీ యాజమాన్యాలు చూపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 30 వేల నుంచి 35 వేల మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెపు తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి యాజమాన్యాలు తగిన వేతనాలు ఇవ్వకపోవడం, కొందరికి మంచి అవకాశాలు రావడంతో ఇతర సంస్థల్లో చేరడం వంటి ఘటనలు సహజంగా జరిగిపోతుంటాయి. కాలేజీ మారాలనుకున్న వారి వేతనాన్ని పూర్తిగా చెల్లించి, వారి వివరాలను తమ వెబ్సైట్ నుంచి తొలగించాలి. కానీ, పలు కాలేజీలు ఉద్యోగుల వివరాలను తొలగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టించుకోని వర్సిటీ అధికారులు.. కొలువు మారాలనుకున్న కొందరు ఉద్యోగులు రాజీనామాలు సమర్పించినప్పటికీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించడం లేదంటూ ఇటీవల పెద్ద సంఖ్యలో జేఎన్టీయూహెచ్కు ఫిర్యాదులు వచ్చాయి. కొందరైతే నేరుగా వర్సిటీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కాలేజీ అనుబంధ గుర్తింపు ప్రక్రియ సమయంలో వర్సిటీ అధికారుల తనిఖీలో కాలేజీ వెబ్సైట్లో పేర్కొన్న ఉద్యోగులంతా ప్రత్యక్షంగా హాజరు కావాలి. జాబితా ప్రకారం ఉద్యోగులు పనిచేయకుంటే గుర్తింపును నిలిపివేయాలి. కానీ పలు కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారులకు తాయిలాలిస్తూ మొక్కుబడి తనిఖీ చేయించి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. తాము ఆ కాలేజీలో పనిచేయడం లేదని ఉద్యోగులు వర్సిటీకి ఫిర్యాదు చేస్తే.. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తనిఖీలతోనే నిజాలు వెల్లడి ఉద్యోగుల సంఖ్య, హాజరు, పనితీరుపైన ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో జేఎన్టీయూ, సంబంధిత అధికారులు తనిఖీ లు నిర్వహించాలి. వీటిల్లో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఫిర్యాదులు వచ్చిన కాలేజీల్లోనైనా తనిఖీలు చేపడితే బాగుంటుంది. ఉద్యోగుల ప్రొఫైల్ యాడింగ్ ఆప్షన్ యాజమాన్యానికి ఇచ్చి, డిలీషన్ ఆప్షన్ ఉద్యోగికే ఇవ్వాలి. దీంతో యాజమాన్యాలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తాయి. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ప్రొఫైల్ డిలీట్ చేయడం లేదనే అంశంపై వర్సిటీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం శోచనీయం. – డాక్టర్ శ్రీనివాస్ వర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
‘ఐటీ’ టెన్షన్.. రహస్య ప్రాంతాలకు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ కాలేజీపై ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్లు దాడి చేయనున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతుండటం, శివారు జిల్లాల్లోని మెజార్టీ కాలేజీలు రాజకీయ నేతలు, వారి బినామీలు, బంధువులకు సంబంధించినవే కావడం ఇందుకు కారణం. శివారులోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి సమీప బంధువుకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి సహా బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండటం, వారు పెట్టుబడులు పెట్టిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలపై దాడులు నిర్వహిస్తుండటంతో యాజమాన్యాలు సహా పరిపాలనా విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఐటీ పేరు చెబితేనే హడలెత్తిపోతుండటం గమనార్హం. మెజార్టీ కాలేజీలు వారివే.. రాష్ట్ర వ్యాప్తంగా 179 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 80కిపైగా ఉన్నట్లు అంచనా. మెజార్టీ కాలేజీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు సంబంధించినవే. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర విద్యా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువులు వాటాదారులుగా ఉన్న ఇతర కాలేజీల్లోని లావాదేవీలపై కూడా ఐటీ దృష్టి సారించింది. ఐటీ దాడులతో ఆయా యాజమాన్యాలు అప్రమత్తమవుతున్నాయి. ఇన్కం ట్యాక్స్ అధికారులు కాలేజీలో అడుగు పెట్టక ముందే కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, హార్డ్ డిస్కులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండు రోజుల నుంచి ఆయా కాలేజీలు గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు మినహా ఇతర వ్యక్తులను వీటి ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు.. ఇంజినీరింగ్ విద్యకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తమ పిల్లలను క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉండే కాలేజీల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోని ఈ బలహీనతను యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. ఎంసెట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి కూడా ల్యాబ్, ప్రాక్టికల్స్, లైబ్రరీ, ఇతర ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వడం లేదు. ఇక మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు పది రెట్లకు అదనంగా అమ్ముతున్నారు. వీరు ఫీజు చెల్లింపు సమయంలో బ్యాంకు చెక్కులు, ఏటీఎం, పేటీఎం సేవలను నిరాకరిస్తున్నారు. నగదు రూపంలోనే ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా శివారులోని ఓ ప్రముఖ కాలేజీ యాజమాన్యం సహా మేడ్చల్ జిల్లాలోని కాలేజీల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. ఐటీ అధికారులు ఫోన్ చేసి ఆరా తీస్తే.. అడ్మిషన్ సమయంలో ఎలాంటి డొనేషన్లు చెల్లించలేదని చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తుండటం గమనార్హం. ‘వర్ధమాన్’లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం శంషాబాద్ రూరల్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో భాగంగా శంషాబాద్ మండలంలోని కాచారం సమీపంలో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి వర్ధమాన్ కళాశాలకు వైస్ చైర్మన్గా ఉన్నారు. దీంతో ఈ కళాశాలలో గురువారం మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించి ప్రత్యేక పహారాతో ఐటీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. -
తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల మోత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరిగాయి. ఇంజనీరింగ్తోపాటు ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ఫీజులను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులు ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. ‘రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)’ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 2019 నుంచి అమల్లో ఉన్న ఫీజులతో పోలిస్తే.. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో సగటున 20 శాతం వరకూ ఫీజులు పెరిగాయి. పెద్ద కాలేజీల్లో 10 నుంచి 15 శాతం పెంచగా.. రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు పెంచారు. రాష్ట్రంలో గరిష్టంగా మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)కి గరిష్టంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇక ఎంసీఏ కోర్సుల వార్షిక ఫీజులను కనిష్టంగా రూ.27 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు.. ఎంటెక్ ఫీజులను కనిష్టంగా రూ.57 వేల నుంచి గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు పెంచారు. మొత్తం 153 కాలేజీలకు మాత్రమే ఫీజులు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగతా కాలేజీల్లో కొన్నింటికి అనుబంధ గుర్తింపు రావాల్సి ఉండటంతో ఫీజుల నిర్థారణ చేయలేదని తెలిపారు. 40 కాలేజీల్లో లక్షపైనే.. తాజా ఫీజుల పెంపును పరిశీలిస్తే.. రూ.లక్ష, ఆపైన ఫీజు ఉండే జాబితాలో ఇంతకుముందు 18 కాలేజీలుంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 40కి పెరిగింది. రూ.75వేలపైన వార్షిక ఫీజున్న కాలేజీలు 24 నుంచి 38కి చేరాయి. తొమ్మిది కాలేజీల్లో కనీస ఫీజు రూ.35 వేల నుంచి రూ. 45వేలకు పెరిగింది. మరో 66 కాలేజీల్లో రూ.45 వేల నుంచి రూ.75 వేల మధ్య ఫీజులు ఉండబోతున్నాయి. -
నవంబర్ నుంచే.. ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కాలపట్టికను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 25 నుంచే 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వలేదు. మొదటి దశ సీట్ల భర్తీ జరిగినా రెండో దశను గత నెల 27న పూర్తి చేయాలని తొలుత భావించారు. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలో ఎఫ్ఆర్సీ ఎటూ తేల్చకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 11 నుంచి మొదలు పెట్టారు. ఈ నెల 16వ తేదీన సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ దశలో కూడా మిగిలిపోయిన సీట్లకు నెలాఖరులోగా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఈ నెల 25లోగా పూర్తి చేసి. ఆ తర్వాత కాలేజీల్లో ఐదు రోజుల పాటు పరిచయ కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్ 1 నుంచి బోధన చేపట్టాలని భావిçÜ్తున్నారు. జాతీయ స్థాయిలోనూ... ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో కూడా ఈ నెల 16తో సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తవుతుంది. దీంతో జాతీయ స్థాయిలో కూడా నవంబర్ మొదటి వారంలోనే క్లాసులు మొదలయ్యే వీలుంది. జోసా కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ముగించాలని ఉన్నత విద్య మండలి రెండేళ్ళుగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జేఈఈ ర్యాంకు ద్వారా జాతీయ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈలోగానే సీట్ల భర్తీ ముగిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాస్త ఆలస్యంగానే ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇతర కోర్సులూ నవంబర్లోనే ఎంటెక్, ఎంబీఏ, బీఈడీ, న్యాయవాద కోర్సుల్లో కామన్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు. ఎంటెక్, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది మరో పది రోజుల్లో ముగిసే వీలుంది. బీఈడీ సీట్ల భర్తీ కూడా త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాసెట్ ముగిసినప్పటికీ నేషనల్ బార్ కౌన్సిల్ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కారణంగా లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం ఉండొచ్చని భావిస్తున్నారు. దోస్త్ ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లక్షన్నర మంది డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ తర్వాత మరో 50 వేల మంది డిగ్రీ కోర్సుల్లో చేరే వీలుందని భావిస్తున్నారు. మొత్తం మీద నవంబర్ మొదటి వారంలో ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కోర్సులు మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలో షెడ్యూల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధనకు సంబంధించిన కాలపట్టికను త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాం. జోసా కౌన్సెలింగ్ను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ చేపడుతున్నాం. – ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
ఇంజనీరింగ్ ఫీజు పెంపు ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజు పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. తమ జమా ఖర్చులన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రవే శాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఎస్ఎఫ్ఆర్సీ) ముందు వాదన వినిపిస్తున్నాయి. హైకోర్టు సూచన మేరకు ఫీజుల నిర్ధారణపై ప్రైవేటు కాలేజీల మూడేళ్ల ఖర్చును సోమవారం నుంచి తిరిగి పరిశీలించడం మొదలుపెట్టింది. దాదాపు 19 కాలేజీలు ఫీజుల పెంపును కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాయి. తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, వారి జమా ఖర్చులను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని ఎఫ్ఆర్సీకి సూచించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవానికి ప్రతీ మూడేళ్లకోసారి ఎఫ్ ఆర్సీ ఇంజనీరింగ్ ఫీజులను సమీక్షిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. లాక్డౌన్ ఉన్నా ఖర్చులు పెరిగాయా? 2023లో ఇంజనీరింగ్ ఫీజుల పెంపు కోసం కాలేజీలు ఆరునెలల క్రితమే ఆడిట్ నివేదికలు సమర్పించాయి. గత మూడేళ్లుగా కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొన్నాయి. కరోనా కారణంగా కాలేజీలు సరిగా నడవకపోయినా, కొన్ని కాలేజీలు భారీగానే వ్యయం చేసినట్టు లెక్కలు చూపించాయి. సాంకేతికత అందిపుచ్చుకోవడం, ప్రత్యేక ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పించామనే వాదనను తెరమీదకు తెచ్చాయి. కొన్ని కాలేజీలు న్యాయ సంబంధమైన లావాదేవీలకు అయిన ఖర్చును కూడా లెక్కల్లో చూపించాయి. వీటన్నింటిపైనా ఎఫ్ఆర్సీ కొన్నినెలల క్రితమే అభ్యంతరం తెలిపింది. వాటిని తొలగించి వాస్తవ ఖర్చుతో పెంపును నిర్ధారించింది. అయితే, ఇదే సమయంలో విద్యార్థులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది పాత ఫీజులే అమలు చేయాలని ప్రభుత్వానికి ఎఫ్ఆర్సీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, ఎఫ్ఆర్సీ అంగీకరించిన ఫీజునే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కావాలంటే కాస్త్త తగ్గిస్తాం... ఎఫ్ఆర్సీ దగ్గర జరిగిన సంప్రదింపుల్లో కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కొంత తగ్గినట్టు తెలిసింది. రూ. 1.73 లక్షలు డిమాండ్ చేస్తున్న కాలేజీ రూ.10 వేలు తగ్గించుకునేందుకు, రూ.1.50 పైన ఫీజులు డిమాండ్ చేసే కాలేజీలు రూ. 5 వేలు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీన్నిబట్టి కనిష్ట ఫీజు రూ 45 వేలు, గరిష్ట ఫీజు రూ.1.63 లక్షల వరకూ ఉండొచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. అయితే ఈ వాదనను మాత్రం ఎఫ్ఆర్సీ వర్గాలు అంగీకరించడం లేదు. కాలేజీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా మని, ఏమేర ఫీజులను నిర్ధారించాలనే దిశగా అడుగులు వేస్తున్నామని ఎఫ్ఆర్సీకి చెందిన ఓ అధికారి తెలిపారు. -
30 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు జేఎన్టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు. 39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి 2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది. కంప్యూటర్ సైన్సెస్తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి. సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
ఇంజనీరింగ్లో సీట్లపై ఉత్కంఠ! పదివేలు దాటినా సీఎస్సీ పక్కా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి? కన్వీనర్ కోటా కటాఫ్ ఎంత? వర్సిటీ క్యాంపస్లో సీటొచ్చే పరిస్థితి ఉందా? ఇలా ప్రతి విద్యార్థినీ ఎన్నో సందేహాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఈ సందేహాలతోనే చాలామంది మంచి ర్యాంకు వచ్చినా ప్రైవేటు కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీటు కోసం ప్రయత్నిస్తుంటారు. నిజానికి గత ఏడాది ర్యాంకులు, కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు, ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఏ బ్రాంచిలో సీటు వచ్చింది తదితరాలు క్షుణ్ణంగా తెలుసుకుని, కౌన్సెలింగ్పై కాస్త అవగాహన పెంచుకుంటే కచ్చితమైన అంచనా తేలికే అంటున్నారు నిపుణులు. విద్యార్థుల డిమాండ్, కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఈసారి కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సుల్లో కొద్దిగా సీట్లు పెరిగే వీలుంది. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్ సీట్లు తగ్గబోతున్నాయి. అయితే ఈ వివరాలను యూనివర్సిటీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. సీఎస్సీకి పెరిగిన డిమాండ్ గత కొన్నేళ్ళ సీట్ల కేటాయింపును పరిశీలిస్తే రాజధాని పరిసరాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్సీ సీటుకు డిమాండ్ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సుల్లో సీటు రావాలంటే ఓపెన్ కేటగిరీలో అయితే 3 వేల లోపు ర్యాంకు మాత్రమే రావాలి. కానీ జేఎన్టీయూహెచ్ వర్సిటీ కాలేజీలున్న మంథనిలో 10 వేలు దాటినా, సుల్తాన్పూర్ క్యాంపస్లో 5 వేలు దాటినా సీఎస్సీ సీటు పక్కాగా వస్తోంది. ఇక టాప్టెన్ ప్రైవేటు కాలేజీల్లో 10 వేల ర్యాంకు వరకు కూడా సీఎస్సీ సీటు వచ్చే చాన్స్ ఉంది. ఒక కాలేజీలో మాత్రం గత ఏడాది 25 వేలు దాటిన ర్యాంకుకు కూడా ఆఖరి కౌన్సెలింగ్లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చింది. రిజర్వేషన్ కేటగిరీల్లో 20 వేలు దాటినా సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది. కసరత్తు తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి ఎంసెట్ ర్యాంకు వచ్చిన తర్వాత విద్యార్థులు ప్రధానంగా కౌన్సెలింగ్పై దృష్టి పెట్టాలి. వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందనేది గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించి అంచనాకు రావాలి. ఈ కసరత్తు చేసిన తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి. – ఎంఎన్ రావ్ (గణిత శాస్త్ర విశ్లేషకులు) -
Telangana: ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు నో! ఈ ఏడాది కూడా పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు సర్కార్ నో చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ ఏడాది కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఫీజులనే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం ఎఫ్ఆర్సీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎఫ్ఆర్సీ ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపును సమీక్షిస్తుంది. ఈ విధంగా 2019లో పెరిగిన ఫీజులు 2022 వరకు అమల్లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి గత మూడు నెలలుగా కసరత్తు చేస్తోంది. ఎఫ్ఆర్సీ పెంపు ప్రతిపాదించినా.. కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన జమాఖర్చులు మదింపు చేసింది. వారితో చర్చలూ జరిపింది. చివరకు కని ష్ట వార్షిక ఫీజును రూ. 45 వేలుగా, గరిష్ట ఫీజును రూ.1.73 లక్షలుగా నిర్ణయించింది. ఈ మేరకు ఏ కాలేజీకి ఎంత ఫీజు పెంచాలనే ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపింది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఫీజుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. వ్యతిరేకతే కారణమా? కరోనా వల్ల గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఈ సమయంలో ఫీజుల పెంపు సరికాదంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజీల ఫీజులు కూడా ఈ ఏడాది పెంచలేదన్న విషయం చర్చకు వచ్చింది. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఫీజుల పెంపుతో ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది.