-
ఉద్యోగులకు బంపరాఫర్, జీతం ఎంత పెరగనుందంటే?
ఆర్ధిక మాంద్యం భయాలు. ప్రాజెక్ట్ల కొరత, అవధుల్లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం, వరుస లేఆఫ్స్, వేతనాల కోతల వంటి సంస్థలు వరుస నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గుడ్న్యూస్ చెప్పింది. ‘డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్లుక్ 2024’ నివేదిక ప్రకారం..ఆయా కంపెనీల్లో పని చేస్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లకు 9 శాతం శాలరీ పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీ, బీపీఓలు మినహా అన్ని రంగాలలో కోవిడ్కు ముందు స్థాయిల కంటే మెరుగుగానే జీతాల పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, ఈ అంచనా 2023లో వేసిన 9.2శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. కంపెనీలు జూనియర్ మేనేజ్మెంట్కు గణనీయమైన ఇంక్రిమెంట్లను అందించే అవకాశం ఉండగా.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేతనాల చెల్లింపు ఉండనుంది. ఇంక్రిమెంట్లు డెలాయిట్ ఇండియా శాలరీ నివేదిక ప్రకారం.. టాప్ పెర్ఫార్మర్లు సగటు రేటెడ్ ఉద్యోగులకు చెల్లించే ఇంక్రిమెంట్ల కంటే 1.8 రెట్లు ఎక్కువ పొందే అవకాశం ఉంది. 2023లో 0.6 రెట్లుతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులు 0.4 రెట్లు పెరగనున్నారు. బోనస్లు 2024లో దాదాపు సగం కంపెనీలు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి అదనంగా బోనస్లు ఇవ్వనున్నట్లు డెలాయిట్ ఇండియా నివేదిక హైలెట్చేస్తోంది. ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు సంస్థలు 7.5శాతంతో ప్రమోషన్ల పెంపును కొనసాగించాలని కూడా భావిస్తున్నట్లు వెల్లడించింది. పదోన్నతులు నివేదిక ప్రకారం, పదోన్నతులు పొందగలరని అంచనా వేసిన ఉద్యోగుల శాతం 2023లో 12.3శాతం నుండి తగ్గింది. -
యూపీ ఉద్యోగులకు యోగీ సర్కారు హోలీ కానుక!
ఈ నెల 25న దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు యూపీ సర్కారు శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ డీఏ పెంపుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించనుంది. యూపీలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపునకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ కరువు భత్యం పెంపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా పెరగనుంది. ఈ డియర్నెస్ అలవెన్స్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.314 కోట్ల అదనపు భారం పడనుంది. -
ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకూ సంక్షేమం
ఎర్రుపాలెం: ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈనెల ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందించామని, రాష్ట్రంలోని 3.65 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2.85 లక్షల మంది పెన్షన్దారులకు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. 2019 ఆగస్టు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చిన చరిత్ర లేదని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యం వచ్చాకే ఇది సాధ్యమైందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉద్యోగులు సైతం పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని చెప్పారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ఆరు గ్యారంటీల అమలులో అలసత్వం లేకుండా పనిచేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, 3 నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గ్రూప్–1, డీఎస్సీ తదితర నోటిఫికేషన్లు కూడా జారీ చేశామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. హైదరాబాద్లోని జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో అద్భుతమైన స్టూడియో నిర్మించి నిష్ణాతులైన అధ్యాపకులతో టైమ్ టేబుల్ ప్రకటించి నిరుద్యోగులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. భట్టి వెంట ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ సబ్కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్లో కమిషనర్కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
టైమ్కు వచ్చి కూర్చుంటే సరిపోదు!.. అదే ఇంపార్టెంట్
చాలామంది ఉద్యోగులు.. కంపెనీ రూల్స్ ప్రకారం ఆఫీసులకు వచ్చామా.. ఏదో పని చేసి వెళ్లిపోయామా అన్నట్టు ఉంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, అలాంటి కాలక్షేపాలకు సంస్థలు చరమగీతం పాడుతున్నాయి. దీంతో కొత్త రూల్స్ పుట్టుకొచ్చాయి. ఆఫీసుకు సమయానికి వస్తే సరిపోదు, ఉన్నంత సేపు ఎంత క్వాలిటీ వర్క్ చేసావు అనేది ప్రధానమని 10 సంస్థల్లో 7 చెబుతున్నట్లు.. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ 'అప్నా.కామ్' అధ్యయనంలో వెల్లడించింది. యాజమాన్యం మెప్పు కోసం, గుర్తింపు కోసం మాత్రం కాకుండా చేస్తున్న పనిలో ఎంత వరకు నాణ్యత ఉందనేది ఇక్కడ ప్రధానమని స్పష్టమవుతోంది. సమయానికి ఆఫీసులకు వచ్చి పనిచేయకపోతే ఎవరికీ లాభం ఉండదు. కాబట్టి సంస్థలో కొంత వెనుకబడిన వారిని గుర్తించి వారికి శిక్షణ ఇప్పంచడం లేదా వారి పనిలో నాణ్యతను పెంచడానికి కావలసిన సదుపాయాలను అందించడం వంటికి సంస్థలు చేపట్టాయి. ఉద్యోగి నుంచి ఏమి రాబట్టుకోవాలనేది సంస్థకు తెలిసి ఉండటం ప్రధానమని అప్నా.కామ్ సర్వే ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీలు తమ ఉద్యోగులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. పని చేసిన వారికి మంచి ప్రోత్సాహాలను అందిస్తే.. తప్పకుండా మరింత అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని 77 శాతం యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: 'హనూమన్' ఏఐ గురించి ఆసక్తికర విషయాలు.. రోజూ సమయానికి ఆఫీసులకు వచ్చి, విరామం తీసుకోకుండా, సెలవులు పెట్టకుండా పనిచేయాలనే సంస్థలు మంచి ఫలితాలను పొందవని, దీనికి భిన్నమైన సంస్కృతిని పెంపొందించడానికి సంస్థలకు కూడా పాటుపడాలని సర్వేలో తెలుసుకున్నట్లు అప్నా కో ఫౌండర్ అండ్ సీఈఓ సీఈవో నిర్మిత్ పరీఖ్ తెలిపారు. -
ఉద్యోగుల తొలగింపు.. ప్రముఖ టెలికం కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా భారీ షాకిచ్చింది. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా భారత్లో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా పలు టెలికాం సంస్థలు 5జీ కార్యాకలాపాల్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్నంత డిమాండ్ నోకియా 5జీ పట్ల లేదు. దీంతో 5జీ మార్కెట్ లో నోకియా సత్తా చాటుతుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో నోకియా ఉద్యోగులకు ఉద్వాసన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మనీ, టెక్నాలజీ, లీగల్ స్టఫ్ ఇన్ఛార్జ్ల వంటి పలు కీలక విభాగాల్లో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మొబైల్ నెట్వర్క్స్, క్లౌడ్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మూడు విభాగాలుగా విభజించనుంది. ప్రతి విభాగం భారత్లో నోకియా వ్యాపారాల్లో వివిధ విభాగాలపై దృష్టి సారించనుంది. -
‘తెలంగాణ ఇంక్రిమెంట్’ రికవరీ
సాక్షి, హైదరాబాద్: జలమండలిలో ‘తెలంగాణ ఇంక్రిమెంట్’రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదేళ్ల తర్వాత ఆ శాఖ పరిధిలో రెగ్యులరైజ్ అయిన 658 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని, ఉద్యోగుల సర్విస్ బుక్ లు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంక్రిమెంట్ ఇలా.. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యోగులందరికీ ‘తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‘మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2014 సెప్టెంబర్ 1న చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచే ప్రత్యేక ఇంక్రిమెంట్ను అమలు చేస్తూ వస్తోంది. ప్రతి నెలా వేతనంలో భాగంగా ఈ ఇంక్రిమెంట్ సర్విస్ ముగిసే వరకు వర్తింస్తుందని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జలమండలిలో వర్తింపు ఇలా జలమండలి పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా సేవలిందిస్తున్న సుమారు 658 మంది హెచ్ఆర్, ఎన్ఎంఆర్లను ప్రభుత్వం 2014 జూన్ 23న రెగ్యులరైజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు 13న జీఓ నెంబర్ 23 ఆర్డర్తో ప్రభుత్వ సర్విస్లో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జలమండలిలోని పారిశుధ్య విభాగంలో రెగ్యులర్ అయి సర్వీస్లో ఉన్నవారికి కూడా ఈ ఇంక్రిమెంట్ను వర్తింపజేశారు. జీఓ తేదీని పరిగణనలోకి తీసుకోవాలి తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిన 2014 ఆగస్టు 13 తేదీని కటాఫ్ పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్ అయిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన నాటికే ప్రభుత్వ సర్విస్లో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ తమకు కూడా వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులైన తమ వేతనాలు ఉండడమే తక్కువని, అందులో నుంచి ఇంక్రిమెంట్ సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ ఎందుకంటే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ రోజైన జూన్ 2ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్ అమలుచేస్తోంది. అయితే జలమండలిలో ఉద్యోగుల రెగ్యులరైజ్ జూన్ 23న జరిగింది. దీంతో వారి వేతనాల నుంచి ఈ ఇంక్రిమెంట్ రికవరీకి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగులు మాత్రం ఇంక్రిమెంట్ జీఓ వచ్చిన ఆగస్టు 13వ తేదీన పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. -
అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు..
సిస్కో సిస్టమ్స్ సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు రెండు రోజులకు ముందే ప్రకటించింది. ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు చెప్పినట్లుగానే.. కంపెనీ గ్లోబల్ వర్క్ఫోర్స్లో 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది. 2023లో కంపెనీలోని మొత్తం పనిచేసే ఉద్యోగుల సంఖ్య 85000. ఇందులో ఈ ఏడాది ఏకంగా 4000 మందిని ఇంటికి పంపేసింది. ఉద్యోగుల తొలగింపులపైన కూడా కంపెనీ 800 మిలియన్ డాలర్ల ఖర్చును భరించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఉద్యోగుల తొలగింపు చెల్లింపులు, ఇతర సంబంధిత ఖర్చులకు నిధులుగా సమకూర్చుతుంది. ఇదీ చదవండి: టీసీఎస్ బాటలో హెచ్సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు.. సిస్కో కంపెనీ ఇతర కంపెనీల మాదిరిగానే అనేక ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండవ త్రైమాసికంలో ఆదాయం 52.5 బిలియన్ డాలర్ల నుంచి 51.5 బిలియన్ల డాలర్లకు తగ్గింది. దీంతో కంపెనీ షేర్స్ కూడా 5 శాతానికిపైగా పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగానే.. తాజాగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది. -
రూ.6200 కోట్లు ఉద్యోగులకు దానం, చిన్న ఇంట్లో నివాసం, ఎవరీ బిజినెస్ టైకూన్
సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం చాలామందికి అలవాటు. భారతదేశంలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా తమ సంపదలో చాలా దాతృత్వానికి వినియోగిస్తారు. మరి కొంతమంది తమ కంపెనీ అభివృద్ధికి పనిచేసిన ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపిస్తారు. బోనస్లు, బహుమతులతో వారిని ఆనందింపజేస్తారు. కానీ తన సంపదనంతా ఉద్యోగులకు దానం చేసేసి అతి నిరాడంబరంగా జీవనాన్ని గడుపుతున్న ఒక బిజినెస్ టైకూన్ గురించి తెలుసా. ఆయనే ఆర్.త్యాగరాజన్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్ అందుకున్న ఆయన గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం. సాయం చేయడం అంటే అపారమైన ఆనందం. అందుకే దాదాపు మొత్తం సంపదను రూ. 62,262 కోట్లు (750 మిలియన్ డాలర్లు) తన ఉద్యోగులకి పంచి ఇచ్చారు. సరసమైన ధరలకు రుణాలను అందించే లక్ష్యంతో శ్రీరామ్ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించారు త్యాగరాజన్. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న సాధారణ ప్రజలకు వెలుగు బాట చూపించారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు, షేర్హోల్డర్లకు కూడా ఎనలేని సంతోషాన్ని మిగిల్చారు. త్యాగరాజన్ చెన్నైలో 1974లో శ్రీరామ్ గ్రూప్ను స్థాపించారు. 37 ఏళ్ళ వయసులో స్నేహితులు, బంధువులతో కలసి మొదలు పెట్టి, తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆర్. త్యాగరాజన్ 1937, ఆగస్టు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో జన్మించారు. గణితంలో గ్రాడ్యుయేషన్, కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1961సంవత్సరంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేరిన త్యాగరాజన్, దాదాపు 20 ఏళ్లు పలు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పనిచేశాడు. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. వడ్డీలు బాధలు, వివిధ రుణాల కోసం ఎదురు చూస్తున్న అల్పాదాయ వర్గాల ఇబ్బందులను చూసి చలించిపోయారు. దీనికి తోడు త్యాగరాజన్ నివసిస్తున్న చెన్నై చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు తమ జీవనోపాధికోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడడాన్ని ఆయన గమనించారు. అందుకే సులువుగా, తక్కువ వడ్డీతో రుణాలు అందించేలా శ్రీరామ్ చిట్ఫండ్ సంస్తను ఏర్పాటు చేశారు. శ్రీరామ్ చిట్ ఫండ్స్ ద్వారా పిల్లల పాఠశాల ఫీజులు కట్టడానికో, వ్యవదారులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు అందిస్తూ ఆదరణ పొందింది. బ్యాంకులు పైనాన్స్ కంపెనీలలో వడ్డీరేట్లు 30-35శాతం ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ లో 17-18 శాతానికే రుణాలందించేది. అలా ప్రారంభమైన శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి 30 కంటే ఎక్కువ కంపెనీలతో అలరారుతోంది. ( Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! 2023 ఆగస్టు నాటికి కంపెనీ 108,000 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. 2006లో 85సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తులను అన్నింటిని శ్రీరామ్ యాజమాన్య ట్రస్ట్ కుబదిలీ చేశారు. దీని విలువ రూ. 62వేల కోట్లకు పైమాటే. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ 2023 జూన్ త్రైమాసికంలో 200 మిలియన్ డాలర్లు. సెల్ ఫోనూ లేదు, ఖరీదైన కారూ లేదు శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకుంటూ 86 ఏళ్ల వయసులో చిన్న ఇంటిలో, రూ. 6 లక్షల విలువైన కారుతో అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు త్యాగరాజన్. అంతేకాదు ఆయన సెల్పోన్ కూడా వాడరు. తనకు ఆ అవసరమే లేదంటారు. పత్రికలు, సాహిత్యం, సంగీతం ఇదే ఆయన కాలక్షేపం. అలాగే కంపెనీ సీనియర్ మేనేజర్లతో ప్రతి 15రోజులకొకసారి మాట్లాడుతో సలహాలు, సూచనలు అందిస్తూ కంపెనీ అభివృద్దికి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు. ‘‘లాభం అనేది ఒక కొలమానం మాత్రమే’’ లాభం ఎప్పటికీ అంతిమ లక్ష్యం కాదు. కస్టమర్దే తొలిస్థానం. లాభం అనేది మనం సమాజానికి ఎంత బాగా సేవ చేస్తున్నామో తెలుసుకునే ఒక మార్గం మాత్రమే. మంచి సేవ చేస్తే లాభంగా కూడా అలానే వస్తుంది అదే తన సక్సెస్ సీక్రెట్ అంటారాయాన.. బిజినెస్లో రిస్క్లు చాలా సాధారణం. వాటిని అర్థం చేసుకోవాలి తప్పితే భయ పడకూడదంటారు. -
ఏపీలో ఉద్యోగులు పెరిగారు.. ఆదాయం పెరిగింది! ఇవిగో లెక్కలు
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్లో వివిధ రంగాల్లో ఉద్యోగులు పెరిగారు. వారి సంపాదన, ఆదాయం పెరిగింది. ఇవి ఎవరో చెప్పిన మాటలు కావు. ఇన్కమ్ రిటర్న్స్ ఫైలింగ్స్ ఆధారంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ( SBI ) తాజా నివేదిక వెల్లడించిన గణాంకాలివి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. కొత్తగా ఏమీ రావట్లేదు.. యువత బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్నారంటూ అరకొర, అసత్య విమర్శలు చేసేవారికి ఈ గణాంకాలు చెంపపెట్టు. అసెస్మెంట్ సంవత్సరం 2020 నుంచి 2023 మధ్య కొత్తగా పన్ను దాఖలు చేసినవారి సంఖ్య ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో 18 లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. అసెస్మెంట్ ఇయర్స్ 2020 నుంచి 2023 మధ్య కాలంలో దాఖలైన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ నివేదిక ప్రకారం మూడేళ్లలో కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 18 లక్షలు ఉండగా ఆ తర్వాత మహారాష్ట్ర (13.9 లక్షలు), ఉత్తరప్రదేశ్ (12.7 లక్షలు), గుజరాత్ (8.8 లక్షలు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇతర దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సంఖ్య తమిళనాడులో 4 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, కేరళలో 3 లక్షలు ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రతికూల వృద్ధిని సాధించింది. ఈ కాలంలో 12 లక్షల మంది ఐటీఆర్ ఫైలర్లు తగ్గిపోయారు. పెరిగిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఈపీఎఫ్ ఖాతాల ద్వారా తెలిసింది ఏమిటంటే.. ఏపీలో కొత్తగా 16 లక్షల మంది ఉద్యోగాల్లో చేరినట్టు రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గతేడాది డిసెంబర్ 22న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, వారి ఆదాయాలు పెరిగినట్లు చట్టబద్ధమైన కేంద్ర సంస్థల గణాంకాలు చెబుతుంటే.. కొందరు మాత్రం పనికట్టుకుని ఏపీపై విష ప్రచారం చేస్తున్నారు. ఆదాయాలు పెరిగితేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తారు. వీరిలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు ఈపీఎఫ్ ఖాతాల ఆధారంగా కేంద్ర మంత్రి సైతం వెల్లడించారు. ❑ Post the release of SBI Research report on 15 August 2023 ('Deciphering emerging Trends in ITR Filing: The Ascent of the new Middle Class in circular migration') compiled with limited data available then, Income Tax department subsequently released granular data of taxpayers’… — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) January 8, 2024 విద్యుత్తు శాఖలో ఇలా.. వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత కొత్తగా సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగాలు: 1.34 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా మిగిలిన కేటగిరి పోస్టులు: 1,26,728 2019లో తొలి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 1,05,869 2020–21 మధ్య రెండో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 13,136 రెండు విడతల నోటిఫికేషన్ తర్వాత ఖాళీగా ఉన్నవి: 8,529 తొలి విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్మెంట్ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్కు అర్హత సాధించారని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని గతంలో సీఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిందని గతంలో సీఎం చెప్పారు. ఇవికాక కాంట్రాక్ట్ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని వివరించారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించామని, ఇందులో 83–84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని వివరించారు. ఆర్బీఐ నివేదికలోనూ.. చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గినట్లు ఆర్బీఐ ఇదివరకే తెలిపింది. అలాగే 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని నివేదిక వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని పేర్కొంది. -
తగ్గిన నిరుద్యోగిత రేటు - క్యూ3 బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా పట్టణ ప్రాంతాల్లో 2023 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 15 ఏళ్లకు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 6.5 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో రేటు 7.2 శాతంగా నమోదైంది. కార్మిక శక్తి సర్వేకు (పీఎల్ఎఫ్ఎస్) సంబంధించి ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన త్రైమాసిక బులెటిన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘2022 అక్టోబర్–డిసెంబర్లో పురుషుల్లో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉండగా 2023 డిసెంబర్ త్రైమాసికంలో 5.8 శాతానికి తగ్గింది. మహిళలలో ఇది 9.6 శాతం నుంచి 8.6 శాతానికి దిగి వచ్చింది‘ అని బులెటిన్ పేర్కొంది. ఇక పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వర్కర్ల జనాభా నిష్పత్తి 44.7 శాతం నుంచి 46.6 శాతానికి పెరిగినట్లు వివరించింది. పురుషుల్లో ఇది 68.6 శాతం నుంచి 69.8 శాతానికి మహిళల్లో 20.2 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. ఎప్పటికప్పుడు కార్మిక శక్తి వివరాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2017లో పీఎల్ఎఫ్ఎస్ను ప్రారంభించింది. -
ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 'యాన్ అన్కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' బుక్ ఆవిష్కరించిన తరువాత, సంస్థలో చాలా మంది ఉద్యోగులకు తగినన్ని రివార్డ్ ఇవ్వలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. సంస్థ ఉన్నతికి ఉద్యోగుల సహకారం ప్రధానమని వెల్లడించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఉన్నతికి ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని, వీరికి కంపెనీ కో-ఫౌండర్లకు ఇచ్చినంత స్టాక్ను ఇవ్వలేకపోయానని చింతించారు. ఉద్యోగులు కూడా సంస్థ వల్ల ప్రయోజనాలను పొందాలని, నేను కోరుకుంటున్నానని నారాయణ మూర్తి కోరారు. వారానికి 85 నుంచి 90 గంటలు 1981లో పూణేలో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు బెంగళూరులో ఉంది. నాతో (నారాయణ మూర్తి) పాటు, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, శిబులాల్, కే దినేష్, ఎన్రాఎస్ ఘవన్, అశోక్ అరోరా సంస్థ ఏర్పాటుకు సహకరించారు. ప్రారంభంలో నేను వారానికి 85 నుంచి 90 గంటలు పనిచేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! టాయిలెట్స్ శుభ్రం చేయడంపై నారాయణమూర్తి వ్యాఖ్యలు ఇటీవల నారాయణ మూర్తి తన టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, ఎందుకు శుభ్రం చేయాలనే విషయాలను వెల్లడిస్తూ.. నా పిల్లలకు కూడా మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పినట్లు తెలిపారు. చాలామంది ధనవంతుల పిల్లలు ఇప్పటికి కూడా టాయిలెట్లను శిబిరం చేసుకోవడం మన పనికాదని భావిస్తారని అది కరెక్ట్ కాదని అన్నారు. -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి..
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దిగ్గజ కంపెనీలు 2024లో కూడా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'సిస్కో' కంపెనీ ఇప్పుడు వేలాదిమందిని ఇంటికి పంపే యోచనలో ఉంది. లేఆఫ్ల వల్ల ప్రభావితం అయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్యపై కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది. 2023లో కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 84900. ఇందులో ఈ ఏడాది ఎంతమందిని తీసేయాలని విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 14న కంపెనీ తన ఫలితాలను వెల్లడించనుంది, ఆ సమయంలో ఎంతమందిని కంపెనీ నుంచి ఇంటికి పంపిందనే విషయం తెలుస్తుంది. ఇదీ చదవండి: 'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్సైట్ ఇదే.. ప్రస్తుతం కంపెనీలోని ఉద్యోగులలో కనీసం 5 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని అంచనా. గతంలో నోకియా, ఎరిక్సన్ వంటి టెలికామ్ దిగ్గజాలు కూడా నష్టాల్లో ఉన్నప్పుడు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఇటీవల స్నాప్చాట్ మాతృసంస్థ స్నాప్ కూడా తన మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి బదిలీల అనంతరం కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య 8మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నింటిలో తక్కువ మంది ఉన్నారు. అన్ని చోట్లా సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్ (సర్దుబాటు)కు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయాల్లో 8 మందికంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన చోట్ల 8 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు. 8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు తెలిపారు. ఈ çసుమారు 5,000 మందికి స్థానచలనం కలుగుతుందని వెల్లడించారు. జిల్లాల ప్రాతిపదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుందని తెలిపారు. ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. విధివిధానాలివీ.. ♦ ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు ♦ జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు ♦ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయాలకే బదిలీ ♦ ఎక్కడైనా భార్య, భర్త వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే, వారి అభ్యర్ధన మేరకు ఇరువురికీ ఒకే చోటకు బదిలీకి అవకాశం కల్పిస్తారు. వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో.. మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో సర్దుబాటు ప్రక్రియ సాగుతుంది. అప్పటికీ సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)తో సర్దుబాటు చేస్తారు. మూడో ప్రాధాన్యతలో డిజిటల్ అసిస్టెంట్లు, అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి. ఇలా ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు. ♦ వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి. ♦ ఉద్యోగులతో నేరుగా కౌన్సెలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు -
ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైన మరో కంపెనీ - 10 శాతం మందిపై వేటు!
Snapchat Layoff: 2024 ప్రారంభం నుంచి అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 32000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ (Snapchat) మాతృ సంస్థ, స్నాప్ కూడా 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తున్న కంపెనీల జాబితాలో.. స్నాప్ కూడా చేరింది. రెగ్యులేటరీ ఫైలింగ్లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. సంస్థలో ఇప్పటికి 5367 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 10 శాతం, అంటే సుమారు 540 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. స్నాప్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో 20 శాతం ఉద్యోగులను, 2023లో 3 శాతం ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన 'టాటా' - ఏకంగా రూ.30 లక్షల కోట్లు.. కంపెనీ 10 శాతం ఉద్యోగులను తొలగిస్తుందన్న విషయం ప్రకటించినప్పటికీ.. ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తూ.. రాబోయే రోజుల్లో మంచి వృద్ధిని సాధించడానికి సంస్థ ఈ లే ఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు పోతాయేమో అని భయపడుతున్నారు. కంపెనీ భవిష్యత్తు గురించి, ఉద్యోగుల ఉద్యోగాల గురించి సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు కోసం ఆర్బీఐతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ ఉన్నతి కోసం పలు బ్యాంకులతో చర్చలు జరపడానికి కూడా సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని సీఈఓ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత.. కంపెనీ సీఈఓ తన ఉద్యోగులతో సమావేశమై.. పేటీఎం కుటుంబంలో ఉద్యోగులు చాలా ముఖ్యమైన భాగమని, వారు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇక నుంచి కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పూర్తిగా పాటిస్తోందని, కాబట్టి ఉద్యోగులు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. -
విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!
2024 ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. టెక్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం విప్రో వందలాదిమందిని తొలగించడానికి సిద్ధమైంది. సంస్థ లాభాల మార్జిన్లను మెరుగుపరచుకోవాలనుకుంటున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విప్రో కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపడుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం ఖర్చులను ఆదా చేయడానికి లేఆప్స్ ప్రక్రియను మొదలుపెట్టాయి. విప్రో కంపెనీ కూడా ఈ సంస్థలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల వెల్లడైన క్యూ3 ఫలితాలలో విప్రో ఆశించిన లాభాలను పొందలేకపోయింది. ఫలితాల ప్రకారం విప్రో లాభం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ. కాబట్టి కంపెనీ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్యోగులను తొలగించడానికి సంకల్పించింది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా.. ప్రస్తుతం విప్రో కంపెనీ లాభాలు పొందే దిశగా అడుగులు వేస్తోంది. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'అపర్ణ అయ్యర్' రాబోయే త్రైమాసికంలో కంపెనీ లాభాల మార్జిన్లను మెరుగుపరిచే బాధ్యతను తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. సంస్థ తొలగించనున్న ఉద్యోగులలో ఆన్సైట్లో పని చేసే మధ్య స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. -
Layoffs In 2024: వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 2024లో పోయే జాబ్స్ వీళ్లవే..!
టెక్ పరిశ్రమలో 2024లోనూ లేఆఫ్లు కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే, ఆల్ఫాబెట్, అమెజాన్, సిటీ గ్రూప్, ఈబే, మాకీస్, మైక్రోసాఫ్ట్, షెల్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్, వేఫెయిర్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. తాజగా యునైటెడ్ పార్సెల్ సర్వీస్ 12,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి ఐదు రోజులు కార్మికులను ఆఫీసులకు రప్పించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ మిశ్రమ సంకేతాలను పంపుతున్న క్రమంలో లేఆఫ్ ప్రకటనలు వస్తున్నాయి. ఒకవైపు యూఎస్ ఉద్యోగ అవకాశాలు కాస్త పెరిగాయి. మరోవైపు హై ప్రొఫైల్ ఉద్యోగాల కోతల జాబితా పెరుగుతున్న వైట్ కాలర్ ప్రపంచానికి అనిశ్చితిని జోడిస్తోంది. రిమోట్ వర్క్పై పెరుగుతున్న అణచివేత కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్ ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుంకు వ్యూహాలను పొందడానికి దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలు, రిక్రూటర్లు, కన్సల్టెంట్లు, కెరీర్ కోచ్లను బ్లూమ్బెర్గ్ న్యూస్ ఇంటర్వ్యూ చేసింది. వారు ఏం చెప్పారు.. కోతల ప్రమాదం ఎక్కువ ఉన్నది ఎలాంటి ఉద్యోగులకు అన్నది ఇక్కడ చూద్దాం.. మిడిల్ మేనేజర్లు, రిమోట్ వర్కర్లు జాగ్రత్త కంపెనీలు తొలగింపులకు తరచుగా మిడిల్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ‘గ్లాస్డోర్’ ప్రధాన ఆర్థికవేత్త డేనియల్ జావో చెప్పారు. ఇలాంటి సమయంలో మిడిల్ మేజేజర్లు బాధితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత తొలగింపుల రౌండ్ వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్న తరుణంలో లేఆఫ్లలో రిమోట్గా పనిచేస్తున్నవారినే లక్ష్యంగా చేసుకుంటారని కొన్ని నివేదికలు సూచించాయి. రిమోట్గా పనిచేస్తున్నవారిని తొలగించడం కంపెనీలకు సులువవుతుందని న్యూయార్క్లోని ఏబీఎస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏరియల్ షుర్ అభిప్రాయపడ్డారు. కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్లో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ పెన్ మాట్లాడుతూ ఎవరిని తొలగించాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యుత్తమ సంస్థలు రెండు అంశాలను చూస్తాయని చెప్పారు. ఒకటి ఆ ఉద్యోగి వల్ల సంస్థకు ప్రస్తుతమైనా లాభదాయకంగా ఉండాలి లేదా భవిష్యత్తులో అయినా లాభం ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా అలాంటి ఉద్యోగులు ఇంటికిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. -
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
ఉద్యోగులపై నిఘా అమెజాన్ కు భారీ జరిమానా
-
టీసీఎస్ లో భారీగా తగ్గిన ఉద్యోగులు..
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పేనా?
ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్లో సుధీర్ఘ కాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం ‘భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్’ జనరల్ సెక్రటరీ ముఖేసింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే.. దేశం మహమ్మారి నుంచి కోలుకుని ఆర్ధిక పరిస్థితులు చక్కబడ్డాయని అన్నారు. పునసమీక్షించాలని లేఖ కాబట్టి, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు విడుతల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునసమీకక్షించాలని లేఖ రాశారు. నిలిపివేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విమరణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కరువు భత్యం నిలిపివేసింది కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు చెల్లించేందుకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను జనవరి 2020 నుంచి జూన్ 2021 అంటే సుమారు 18 నెలలు పాటు నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్-19 విజృంభణ కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. -
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: ► సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఫెయిల్ కావటంతో ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించారు. కండక్టర్ బస్సు ముందు నిలబడి ఆ వివరాలను రిపోర్టులో రాస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది.. దీంతో బస్సు దూసుకొచ్చి ముందు నిలబడిన కండక్టర్ను ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే ఆయన కుటుంబానికి ప్రమాద సాయంగా రూ.40 లక్షలు అందాయి. ► మెహిదీపట్నంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్పై ఓ చిన్న కారణంతో గతంలో ఆర్టీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించింది. దానిపై ఆ డ్రైవర్ లేబర్ కోర్టును ఆశ్రయించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో అతను దుర్మరణం చెందాడు. సర్వీసులో లేకపోవటంతో ఆర్టీసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చిన్న పిల్లలను చదివించేందుకు ఆయన భార్య ఇళ్లల్లో పాచి పనులు చేయాల్సి వచ్చింది. ఆ దీనావస్థకు చలించి కొందరు జోక్యం చేసుకోవటంతో చివరకు ఆ ఉద్యోగి కుటుంబానికి కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సాయం అందింది. ఇలా అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. సంపాదించే కుటుంబ పెద్ద చనిపోతే అల్పాదాయ కుటుంబాలు ఆర్థికంగా ఎదు ర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆస్తులు లేని కుటుంబాలు, సంపాదించే ఇతర వ్యక్తులు లేని కుటుంబాలు రోడ్డున పడటమే. ఇలాంటి సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వారి ఖాతాలున్న బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబాలకు ఇకపై ఏకంగా రూ.కోటి సాయం అందనుంది. ఆ ఉద్యోగి పేరుతో రూపే కార్డు ఉంటే మరో రూ.15 లక్షలు అందుతుంది. వెరసి, రూ.1.15 కోట్లు అందటం ద్వారా ఆ కుటుంబానికి ఆర్ధికంగా వెసులుబాటు కలగబోతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది. ఖాతాలు యూబీఐలోకి రావడంతో.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా ఊరటనిచ్చే ప్రమాద బీమా లేదు. సంస్థ పరంగా అందే సాయం కూడా నామమాత్రమే. ఇలాంటి తరుణంలో, సూపర్ సేవింగ్ శాలరీ ఖాతా ద్వారా యూబీఐ పెద్ద వెసులుబాటు కల్పించింది. గతంలో ఆర్టీసీ జీతాల ఖాతాలు మరో బ్యాంకులో ఉండేవి. ఏడాదిన్నర క్రితం ఎండీ సజ్జనార్ వాటిని యూబీఐలోకి మార్చారు. ఆ సమయంలో ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందే వెసులుబాటు గురించి చెప్పిన బ్యాంకు అధికారులు, ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాలను సూపర్ సేవింగ్ సాలరీ ఖాతాలుగా మార్చాలని సూచించారు. ఆ వెంటనే ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు పొందే వీలు కల్పించింది. దాదాపు ఏడాదిగా అది అమలవుతోంది. ఈ సమయంలో దాదాపు 20 మంది ఆర్టీసీ ఉద్యోగులుకు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. వీరి కుటుంబాలకు దశలవారీగా ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని బ్యాంకు అందజేసింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ, ప్రతినెలా ఠంచన్గా జీతం అందే వారికి ఈ ఖాతా పొందే వీలును బ్యాంకు కల్పిస్తోంది. బ్యాంకుల మధ్య పోటీతో పెంపు బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం నేపథ్యంలో, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.కోటికి పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 47 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ప్రతినెలా రూ.220 కోట్ల వరకు వారి జీతాల పద్దు ఉంటుంది. నిత్యం ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు టికెట్ల రూపంలో ఆదాయం (మహిళలకు అందించే జీరో టికెట్ల మొత్తం కాకుండా) ఉంటుంది. ఇవన్నీ ఆ బ్యాంకులోనే డిపాజిట్ అవుతాయి. ఇది పెద్ద మొత్తం కావటంతో సంస్థను ఆకట్టుకునేందుకు ఆ బ్యాంకు ఈ ప్రమాద బీమా మొత్తాన్ని పెంచింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇక బ్యాంకు అందించే రూపే కార్డు ఉన్న వారికి అదనంగా మరో రూ.15 లక్షలు కూడా అందుతుంది. ఇప్పటికీ అవగాహన లేని ఉద్యోగులెందరో.. ఈ ప్రమాద బీమా గురించి దాదాపు ఉద్యోగులందరికి తెలిసినా, అది వర్తించాలంటే ఏం చేయాలన్న విషయంలో కొందరికి ఇప్పటికీ అవగాహన లేదు. తమ ఖాతాలను సూపర్ సేవింగ్స్ సాలరీ ఖాతాగా మార్చాలంటూ ప్రతి ఉద్యోగి సంబంధిత బ్యాంకు బ్రాంచీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ, ఆ ఖాతాలోకి మారని ఉద్యోగులెందరో ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి ఈ పథకం వర్తించదు. దాదాపు ఏడాదిగా ఆ బ్యాంకు ప్రమాద బీమా వసతిని అమలు చేస్తున్నా, ఉద్యోగులకు అవగాహన కల్పించటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఇక రూపే కార్డు తీసుకోవాలని, దాన్ని ప్రతి 45 రోజుల్లోపు ఒకసారన్నా కచ్చితంగా వాడాలన్న నిబంధన గురించి కూడా అవగాహన లేదు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈడీ కృష్ణకాంత్ చర్యలు ప్రారంభించారు. ఈ పథకం వివరాలు, ఉద్యోగులు అనుసరించాల్సిన విషయాలను తెలియ చెప్తూ ఫ్లెక్సీలు రూపొందించి అన్ని డిపోలకు పంపుతున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల అర్జీలు సకాలంలో పరిష్కారం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలపై అప్పీళ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి.. ► ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి ► క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి ► సిక్ లీవుకు సంబంధించిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మంజూరు చేయాలి ► ఉద్యోగులపై దాడికి పాల్పడ్డవారిపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలి ► కేఎంపీఎల్, ఈపీకేలపై ఉద్యోగులను కౌన్సెలింగ్కు పంపించడం నిలిపివేయాలి ► తక్కువ రాబడి వచ్చే బస్ షెడ్యూళ్లను రీ షెడ్యూల్ చేయాలి ► బీఎస్ 4, బీఎస్ 6 వాహనాల వీల్బోల్ట్ మెషిన్లు, మయాటిక్ గన్స్, ఎలక్ట్రికల్ పరికరాలను అన్ని గ్యారేజీలలో అందుబాటులో ఉంచాలి ► ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలి ► మూడు, నాలుగు షెడ్యూళ్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి ► వైఫల్యాలను కారణంగా చూపుతూ గ్యారేజ్ ఉద్యోగులను బదిలీ చేయకూడదు ► తగిన శిక్షణ లేకుండా డ్రైవర్లకు టిమ్ డ్యూటీలను అప్పగించకూడదు ► జీతాల కోత విధిస్తూ సెలవులు మంజూరు చేయకూడదు.