Advertisement
e-market
-
మన ఎగుమతులు భేష్
న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులకు ప్రపంచమంతటా డిమాండ్ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువుల కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయని, మన సప్లై చైన్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రతి భారతీయుడు అందిపుచ్చుకుంటే లోకల్ గ్లోబల్గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏడాదిగా ప్రభుత్వం ఈ–మార్కెట్ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. 1.25 లక్షల మంది చిన్నతరహా వ్యాపారవేత్తలు, దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని తెలిపారు. గతంలో బడా వ్యాపారులే ప్రభుత్వానికి సరుకులను విక్రయించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఆ అవకాశం లభిస్తోందని వెల్లడించారు. భారతీయులంతా చేతులు కలిపితే ఆత్మనిర్భర్భారత్ లక్ష్యసాధన సులువేనన్నారు. ఆయుష్కు అద్భుత అవకాశాలు ఆయుష్ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరిస్తుండడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుష్ పరిశ్రమ మార్కెట్ విలువ రూ.22,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. మన ఉత్పత్తుల ప్రతిష్టను, గిరాకీని మరింత పెంచుకొనేలా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 126 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద జీవితం నుంచి దేశం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని మోదీ అన్నారు. ప్రతి చుక్కనూ ఆదా చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు నిర్మించుకోవాలన్నారు. ఏప్రిల్ 1న పరీక్షా పే చర్చ ఏప్రిల్ 1న ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ‘పరీక్షా పే చర్చ’లో మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. పరీక్షల పండుగ జరుపుకుందామంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మెట్ల బావి ప్రస్తావన తెలంగాణలోని సికింద్రాబాద్లో ఇటీవల బయటపడిన మెట్ల బావి గురించి మన్కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మెట్లబావి పునరుద్ధరణకు ప్రజలు చూపిన చొరవను అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లు దక్షిణ కొరియాకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ ఆయన ప్రశంసించారు. -
ఈ–మార్కెట్ కొనుగోళ్లు
నేటినుంచి వనపర్తి మార్కెట్యార్డులో ప్రారంభం ఆన్లైన్లోనే కొనుగోళ్లు - లాభపడనున్న రైతన్నలు వనపర్తి: శాస్త్రీయ పద్ధతిలో పంట ఉత్పత్తులకు నాణ్యతను బట్టి ధర నిర్ణయించాలని ప్రభుత్వం రూపొందిస్తున్న నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ఈ–కొనుగోలు విధానాన్ని గురువారం నుంచి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో అమలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 44మార్కెట్ యార్డుల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. గురువారం తాజాగా మరికొన్ని మార్కెట్లలో ఈ–కొనుగోలు విధానం అమలుకానుంది. ఇందుకోసం మార్కెట్యార్డు అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు వ్యాపారులకు, కమీషన్ ఏజెంట్లకు ఆన్లైన్ కొనుగోళ్లపై శిక్షణ ఇవ్వనున్నట్లు వనపర్తి మార్కెట్ యార్డు కార్యదర్శి నరసింహ తెలిపారు. అధికారులు బుధవారం ఆన్లైన్ కొనుగోళ్ల ప్రాక్టీస్ కోసం కమీషన్ ఏజెంట్లకు, ట్రేడర్లకు ఆన్లైన్లో టెండర్లు వేయాలని మొదటి ట్రైనింగ్ తరహాలో టెండర్లు పంపించాలని సూచించారు. గురువారం నుంచి అధికారికంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ– కొనుగోళ్ల విధానం ఇలా.. ఇదివరకు ఇబ్బడిముబ్బడిగా రైతులు మార్కెట్ యార్డుకు సరుకులు తీసుకురావటం, కమీషన్ ఏజెంట్లు సరుకును చేతిలోకి తీసుకుని పరిశీలించి ధర నిర్ణయించేవారు. మార్కెట్లో ఈ– కొనుగోలు విధానం ప్రారంభించిన తర్వాత పూర్తిగా కాగితరహిత విక్రయాలు నిర్వహించాల్సి ఉంటుంది. రైతులు మార్కెట్కు తీసుకువచ్చే పంట ఉత్పత్తులను అధికారులు పంట రకం, ఎన్ని క్వింటాళ్లు తదితర వివరాలతో పాటు రైతు సెల్ నంబర్ను సేకరిస్తారు. సరుకు నాణ్యతను పరీక్షించి ఆన్లైన్లో వివరాలను పొందుపరుస్తారు. కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్స్ ఆయా సరుకుల వివరాలను ఆన్లైన్లో చూసి, వాటిని కొనడానికి ధరలను నిర్ణయించి ఆన్లైన్లో టెండర్లు సమర్పించాలి. వచ్చిన ధరలలో కెల్లా ఎక్కువ ధర కోడ్ చేసిన వారికి రైతులు సరుకు విక్రయించవచ్చు. ఈ–కొనుగోళ్లు ప్రారంభించగానే ధాన్యం నాణ్యత పరీక్షించించే ప్రత్యేక ల్యాబ్, కమీషన్ ఏజెంట్లు టెండర్లు వేసేందుకు కంప్యూటర్లను స్థానిక మార్కెట్ యార్డు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆన్లైన్ మొబైల్ ఉన్నవారు ఇంటర్నెట్ సౌకర్యంతో మొబైల్ ద్వారానే టెండర్లు పంపించుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్ ఉపయోగాలు.. – ఈ విధానం ద్వారా రైతులు విక్రయానికి తీసుకువచ్చిన సరుకు కొనుగోలు కోసం కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్స్ సమర్పించే టెండర్ దరఖాస్తుల్లో ఎక్కువగా కనిపించే దిద్దుకాలు, కొట్టివేతలు, పరిస్థితిని బట్టి మార్చేసే పరిస్థితి ఇక నుంచి చెక్పడనుంది. – ఆన్లైన్ కొనుగోళ్ల వల్లlపంటల నాణ్యతను బట్టి ధర లభించే అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉండే కమీషన్ ఏజెంట్లతో పాటు, ఆన్లైన్లో దేశ, విదేశాల నుంచి టెండర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన కొనుగోలుదారుల్లో పోటీ పెరిగి అన్నదాతకు ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యత పేరుతో జరిగే మోసాలకు చెక్ పడే అవకాశం ఉంది. అధికారికంగా నేడు ప్రారంభం వనపర్తి మార్కెట్లో గురువారం నుంచి ఆన్లైన్ కొనుగోళ్లు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ– కొనుగోళ్లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వ్యాపారులకు అవగాహన కల్పిస్తాం. – నరసింహ, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్యార్డు, వనపర్తి