duleep trophy
-
దులీప్ ట్రోఫీ ఆడండి.. టెస్ట్ స్పెషలిస్ట్లకు బీసీసీఐ ఆదేశం
సెప్టెంబర్లో స్వదేశంలో మొదలయ్యే టెస్ట్ సీజన్కు ముందు భారత టెస్ట్ స్పెషలిస్ట్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులందరూ ఆగస్ట్ నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో పాల్గొనాలని సూచించింది. ప్రతి ఆటగాడు కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు మినహాయింపు ఉన్నట్లు తెలుస్తుంది. కీలక ఆటగాళ్లైన ఈ ముగ్గురు గాయాల బారిన పడకుండా ఉండేందుకే మినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం.కాగా, భారత టెస్ట్ సీజన్ సెప్టెంబర్లో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో మొదలవుతుంది. అనంతరం భారత్.. స్వదేశంలోనే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. నవంబర్ 22-వచ్చే ఏడాది జనవరి 7 మధ్యలో భారత్.. ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్తుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగనుంది.ఇదిలా ఉంటే, టీమిండియా టీ20 వరల్డ్కప్ విజయానంతరం బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. పొట్టి ప్రపంచకప్ ముగిశాక జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడిన భారత్.. జులై 27 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం సెప్టెంబర్లో బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించనుంది. లంకతో టీ20, వన్డే సిరీస్ల కోసం భారత జట్టుకు ఇవాళ (జులై 16) ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. -
2024-25 దేశవాళీ సీజన్ షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐ
2024-25 దేశవాళీ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ నిన్న (జూన్ 6) విడుదల చేసింది. ఈ సీజన్ సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్ 1న జరిగే సీనియర్ మహిళల ఛాలెంజర్ ట్రోఫీతో ముగుస్తుంది. ఈ మధ్యలో సీనియర్ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్ ట్రోఫీలతో పాటు పలు జూనియర్ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి. 2024-25 క్యాలెండర్ ఇయర్కు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.దేశవాళీ క్రికెట్లో ప్రముఖ టోర్నీలైన రంజీ ట్రోఫీ ఈ ఏడాది అక్టోబర్ 11న మొదలై వచ్చే ఏడాది మార్చి 2న ముగుస్తుంది. రంజీ ట్రోఫీకి ముందు దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్.. రంజీ ట్రోఫీ మధ్యలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ జరుగనున్నాయి.2024-25 దేశవాళీ సీజన్ క్యాలెండర్..ముఖ్యమైన టోర్నీలకు సంబంధించిన వేదికల వివరాలు..VENUES & DATES OF INDIAN DOMESTIC CRICKET 2024-25...!!!! pic.twitter.com/LBuRy4hSjg— Johns. (@CricCrazyJohns) June 6, 2024 -
ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2023 విజేతగా సౌత్ జోన్ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్జోన్పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్జోన్కు 14వ దులీప్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్జోన్.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్జోన్ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్జోన్ తన మొదటి ఇన్నింగ్స్లో 146 పరుగులకే చాపచుట్టేసింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో వెస్ట్జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు. చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్! -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్ను త్వరగా పెవిలియన్కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో లభించిన 67 పరుగుల లీడ్తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్కుమార్ వైశాఖ్ (1) క్రీజ్లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్ను దెబ్బకొట్టారు. -
Test Match: విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. 8 పరుగులకే అవుట్..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్ పృథ్వీ షా అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో 101 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులతో రాణించాడు ఈ ఓపెనర్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి పృథ్వీ షాకు సహకారం లభించలేదు. 8 పరుగులకే అవుట్ మరో ఓపెనర్, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్ 21 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో స్థానంలో దిగిన టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా పోరాడుతుండగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన మరో భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొన్న ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సౌత్ జోన్ బౌలర్ విధ్వత్ కవెరప్ప బౌలింగ్లో కెప్టెన్ హనుమ విహారికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ను కవెరప్ప వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. తిలక్, విహారి ఇన్నింగ్స్తో ఇలా కీలక బ్యాటర్లు విఫలం కావడంతో వెస్ట్ జోన్ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ రెండో రోజు ఆటను వెలుతురులేమి కారణంగా నిలిపివేసే సమయానికి పుజారా 7, అతిత్ సేత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్ జోన్ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వెస్ట్ జోన్ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాగైతే.. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో విఫలమైన కారణంగా పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇక వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన సూర్యకుమార్ యాదవ్కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా, సూర్య దేశవాళీ క్రికెట్పై దృష్టి సారించడం గమనార్హం. ఇక దులిప్ ట్రోఫీ ముగిసిన తర్వాత సూర్య కరేబియన్ దీవికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్ -
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి! ఫైనల్లో జట్టును..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి వన్డౌన్లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్వల్లా బౌలింగ్లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు. వాషింగ్టన్ సుందర్(9), విజయ్కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. విహారి 46వ ఫిఫ్టీ వెస్ట్ జోన్తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్క్లాస్ క్రికెట్లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్
Ind Vs WI Test Series 2023: ‘‘జట్టు నుంచి నన్నెందుకు తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంతగా నిరాశ చెందానో.. అందుకు గల కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నాను. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మొదట్లో చాలా బాధపడేవాడిని. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం’’ అని టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో లండన్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్లోనే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2022లో బర్మింగ్హాంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత హనుమ విహారికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ అతడికి అవకాశాలు కరువయ్యాయి. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఛాన్స్ వస్తుందని ఎదురుచూసిన 29 ఏళ్ల విహారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సౌత్ జోన్ కెప్టెన్గా ఇదిలా ఉంటే.. దులిప్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్ జోన్తో ఆరంభమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన హనుమ విహారి 839 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 111. చదవండి: అర్జున్ టెండూల్కర్కు గోల్డెన్ చాన్స్ -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్తో తొలి టెస్టు.. ఓపెనర్గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా!
Rinku Singh Highlights Of 40 Off 30 Balls In Duleep Trophy Video: కోల్కతా నైట్ రైడర్స్ సంచలనం రింకూ సింగ్ బీసీసీఐ సెలక్టర్లపై పరోక్షంగా విమర్శలు సంధించాడు. దేశవాళీ క్రికెట్లో సిక్సర్లు బాదుతున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేశాడు. తన ఆటలో ఎలాంటి లోపం లేదని.. మరి తనకెందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. కాగా ఐపీఎల్-2023లో రింకూ సింగ్ అద్భుత ఆట తీరు కనబరిచిన విషయం తెలిసిందే. కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బ్యాటర్.. 14 మ్యాచ్లలో కలిపి 474 పరుగులు సాధించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చిన తీరు అభిమానులను ఫిదా చేసింది. ఫినిషర్గా తానున్నానంటూ కేకేఆర్ స్టార్లంతా విఫలమైన వేళ డెత్ ఓవర్లలో రింకూ చూపిన తెగువ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్కు టీమిండియాలో చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారి ఆడనున్న వెస్టిండీస్తో టీ20 సిరీస్ నేపథ్యంలో రింకూ సెలక్టర్ల పిలుపు అందుకుంటాడని అంతా భావించారు. కానీ ఐపీఎల్-2023లో అదరగొట్టిన యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), తిలక్ వర్మ(ముంబై ఇండియన్స్)కు ఎంపిక చేశారే తప్ప రింకూకు మాత్రం మొండిచేయి చూపారు. దులిప్ ట్రోఫీలో ఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్కు ప్రాతినిథ్యం వహించిన రింకూ సింగ్.. వెస్ట్ జోన్తో సెమీ ఫైనల్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 48 పరుగులు సాధించిన 25 ఏళ్ల ఈ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్లో తన ఇన్నింగ్స్కు సంబంధించిన హైలైట్స్ వీడియోను రింకూ సింగ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లకు దిమ్మతిరిగేలా బ్యాట్తోనే సమాధానం ఇచ్చావు కదా బ్రో అంటూ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా రింకూకు విండీస్ చోటు దక్కని నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తగా.. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Ind Vs WI: విండీస్తో తొలి టెస్టు.. అత్యంత అరుదైన రికార్డు ముంగిట కోహ్లి రహానే వైస్ కెప్టెన్ అయినపుడు మరి కోహ్లి ఎందుకు..?: మాజీ చీఫ్ సెలక్టర్ View this post on Instagram A post shared by Rinku 🧿 (@rinkukumar12) -
''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!'
కెరీర్ ఆరంభంలో ఒక మెరుపులా వచ్చి భవిష్యత్తు స్టార్ క్రికెటర్గా తయారవుతాడనుకున్న పృథ్వీ షా పాతాళానికి పడిపోయాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ఆకట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటవలే ముగిసిన ఐపీఎల్లోనూ పృథ్వీ షా పెద్దగా రాణించింది లేదు. దీనికి తోడు వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ పుజారాకు ఆఖరిది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా దులీప్ ట్రోపీలో వెస్ట్జోన్ తరపున పాల్గొంటున్న పృథ్వీ షా ఆ తర్వాత దేవదర్ ట్రోపీలోనూ ఆడాలనుకుంటున్నాడు. అటుపై ఇంగ్లండ్లో జరిగే కౌంటీ క్రికెట్లో తొలిసారి నార్తంప్టన్షైర్ తరపున బరిలోకి దిగనున్నాడు. కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. జూలై 12 నుంచి వెస్ట్జోన్, సౌత్జోన్ల మధ్య దులీప్ ట్రోపీ ఫైనల్ జరగనుంది. ఇక సెంట్రల్ జోన్తో సెమీఫైనల్ ముగిశాకా విజయంపై స్పందించిన పృథ్వీ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా ఆటను మార్చుకోవాలనుకోవడం లేదు. కాకపోతే నా గేమ్కు కాస్త స్మార్ట్నెస్ను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను పుజారా సార్లా బ్యాటింగ్ చేయలేను.. ఆయన నాలా బ్యాటింగ్ చేయలేడు. ఈ విషయంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. ఇన్నేళ్లుగా నాకున్న అగ్రెసివ్నెస్ బ్యాటింగ్ను వదులుకోలేను.. కానీ స్మార్ట్గా ఆడడానికి ప్రయత్నిస్తా. ఇక వెస్ట్జోన్ దులీప్ ట్రోపీలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. నేను ముంబైకి ఆడొచ్చు.. లేదంటే వెస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు.. కానీ ఆట అనేది చాలా ముఖ్యం. ఒక రకంగా నా కెరీర్కు ఈ ఫైనల్ ఉపయోగపడుతుందంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఇక గత ఏడాదిగా రెడ్బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా. ఒక మ్యాచ్లో త్రిబుల్ సెంచరీ(370 పరుగులు Vs అస్సాం) మరిచిపోలేని ఇన్నింగ్స్. కానీ వైట్బాల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయా. కానీ రెడ్బాల్ క్రికెట్లో నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: #DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా? -
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్కు 6.05 పరుగుల రన్రేట్తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్లోనే భారీ సిక్స్తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్లో ఆసీస్ ఓటమి -
మయాంక్ అగర్వాల్ సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్లో సౌత్జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ విజయలక్ష్యం 215 పరుగులు...మూడో రోజు 21 పరుగులు చేయగా, చివరి రోజు శనివారం చేతిలో 10 వికెట్లతో మరో 194 పరుగులు సాధించాలి. అయితే రెండు సార్లు మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. చివర్లో కూడా వర్షసూచన కనిపించింది. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్కు 6.05 పరుగుల రన్రేట్తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరి రోజు సౌత్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. విహారి వెనుదిరిగే సమయానికి సౌత్ మరో 74 పరుగులు చేయాలి. ఈ దశలో భుయ్, తిలక్ 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించి మళ్లీ గెలుపు బాట వేశారు. సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెపె్టన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. అయితే చివరకు జయంత్ బౌలింగ్లోనే భారీ సిక్స్తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. ఫైనల్లో వెస్ట్జోన్... సెంట్రల్ జోన్, వెస్ట్జోన్ మధ్య జరిగిన మరో సెమీస్ ‘డ్రా’గా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో 92 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్ట్జోన్ ఫైనల్ చేరింది. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ 4 వికెట్లకు 128 పరుగులే చేసింది. రింకూ సింగ్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్జోన్ సీమర్ వైశాక్ విజయ్కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్తో నార్త్జోన్ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్జోన్ రెండో ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పుజారాకు మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్ను అందించాడు. ఈ ఇన్నింగ్స్లో నోటెడ్ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
Duleep Trophy: ఆదుకున్న మయాంక్, తిలక్..
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్జోన్ జట్టును హైదరాబాద్ రైజింగ్ స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్జోన్ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్నైట్ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్జోన్ను మయాంక్, తిలక్ నడిపించారు. ఐదో వికెట్కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్జోన్ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రికెట్కు తమీమ్ గుడ్బై చిట్టోగ్రామ్: వన్డే ప్రపంచకప్కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు. బుధవారం అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. జట్టులో చోటు కొట్టేశాడు!
దులీప్ ట్రోఫీ-2023లో భాగంగా సెంట్రల్ జోన్తో సెమీఫైనల్కు ముందు వెస్ట్జోన్కు బిగ్ షాక్ తగిలింది. వెస్ట్జోన్ ఫాస్ట్ బౌలర్, సౌరాష్ట్ర పేసర్ చేతన్ సకారియా గాయం కారణంగా సెమీఫైనల్ మ్యాచ్కు దూరమమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సకారియాకు నెట్ప్రాక్టీస్లో చేతికి గాయమైంది. అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అతడు సెమీఫైనల్కు దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా సెమీఫైనల్కు దూరమైన సకారియా స్ధానాన్ని ముంబై పేసర్ తుషార్ దేశ్పాండేతో భర్తీ చేశారు. 28 ఏళ్ల దేశ్పాండే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన దేశ్పాండే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అతడు 21 వికెట్లు పడగొట్టాడు. దేశ్పాండేకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన దేశ్పాండే 3.16 ఎకానమీతో 80 వికెట్లు సాధించాడు. ఇక వెస్ట్జోన్, సెంట్రల్ జోన్ మధ్య దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ జూలై 5నుంచి ప్రారంభం కానుంది. చదవండి: WC 2023: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? -
11 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్.. సెమీస్లో నార్త్, సెంట్రల్ జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్లో సౌత్ జోన్తో నార్త్ జోన్; వెస్ట్ జోన్తో సెంట్రల్ జోన్ తలపడతాయి. సెంట్రల్ జోన్తో జరిగిన మ్యాచ్లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్తో మ్యాచ్లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్ కుమార్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో సెంట్రల్ జోన్, నార్త్జోన్ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్జోన్తో జరుగుతున్న పోరులో సెంట్రల్ ఆటగాళ్లు హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్లో రాణించగా, సౌరభ్ కుమార్ (4/33) స్పిన్ బౌలింగ్తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్జోన్ రెండో ఇన్నింగ్స్లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్సింగ్ తొలి వికెట్కు 124 పరుగులు జోడించారు. అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈస్ట్జోన్ సౌరభ్ స్పిన్ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. నార్త్ ఆల్రౌండ్ దెబ్బకు... నార్త్జోన్ ఆల్రౌండ్ దెబ్బకు నార్త్ ఈస్ట్జోన్ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్ ఈస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన నార్త్ ఈస్ట్జోన్ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో నార్త్కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను నార్త్జోన్ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రభ్ సిమ్రన్సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్ ఈస్ట్జోన్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. -
నిశాంత్, హర్షిత్ సెంచరీలు.. ప్రత్యర్థి జట్టుకు తప్పని తిప్పలు
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. నిశాంత్ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్లు), హర్షిత్ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్తో కలిసి హర్షిత్ ఎనిమిదో వికెట్కు 104 పరుగులు... సిద్ధార్థ్ కౌల్ (9 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్కు ఆధిక్యం ఈస్ట్ జోన్ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది. -
కేకేఆర్ బౌలర్ ఊచకోత.. తొమ్మిదో నంబర్లో వచ్చి విధ్వంసకర శతకం
దులీప్ ట్రోఫీ-2023లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా విధ్వంసం సృష్టించాడు. తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ షాట్లతో విరుచుకుపడి సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 86 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ జోన్ జట్టు భారీ స్కోర్ చేసింది. హర్షిత్ కంటే ముందు ఇదే ఇన్నింగ్స్లో మరో ఐపీఎల్ ఆటగాడు కూడా శతక్కొట్టాడు. సీఎస్కే ఆటగాడు నిశాంత్ సింధు (150) భారీ శతకం బాదాడు. వీరిద్దరి కంటే ముందు సీఎస్కేకే చెందిన మాజీ ప్లేయర్ ధృవ్ షోరే (135) కూడా సెంచరీ చేశాడు. ఫలితంగా నార్త్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ను 540/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ఈ స్కోర్ నమోదైంది. ఇదిలా ఉంటే, 21 ఏళ్ల హర్షిత్ రాణాను 2022 ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ సొంతం చేసుకుంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అడపాదడపా బ్యాటింగ్ చేసే హర్షిత్.. ఐపీఎల్లో 8 మ్యాచ్లు ఆడి 6 వికెట్టు పడగొట్టాడు. -
సీఎస్కే ప్లేయర్ సూపర్ సెంచరీ
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడిగా ఉన్న ఆటగాడు దులీప్ ట్రోఫీ-2023లో సూపర్ సెంచరీతో మెరిశాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ ఆటగాడు నిశాంత్ సింధు (111 నాటౌట్) అద్భుతమైన శతకం బాదాడు. రెండో రోజు ఆటలో (ఇవాళ) నిశాంత్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో ధృవ్ షోరే (135) సెంచరీ చేశాడు. రెండో రోజు తొలి సెషన్ సమయానికి (103 ఓవర్లు) నార్త్ జోన్ 6 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నిశాంత్కు జతగా పుల్కిత్ నారంగ్ (39) క్రీజ్లో ఉన్నాడు. కాగా, ఐపీఎల్-2023 వేలంలో నిశాంత్ సింధును చెన్నై సూపర్ కింగ్స్ 60 లక్షల ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో అతని ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2022 అండర్-19 వరల్డ్కప్లో కనబర్చిన అద్భుతమైన ప్రదర్శన కారణంగా నిశాంత్కు ఐపీఎల్ ఆఫర్ వచ్చింది. నాటి వరల్డ్కప్ ఫైనల్లో నిషాంత్ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ సాధించాడు. నిషాంత్ దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు (2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు), 7 లిస్ట్-ఏ మ్యాచ్లు, 8 టీ20లు ఆడాడు. -
శతక్కొట్టిన సీఎస్కే మాజీ ప్లేయర్.. తుస్సుమన్న రింకూ సింగ్
దులీప్ ట్రోఫీ 2023లో ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ మాజీ ఆటగాడు సెంచరీతో కదంతొక్కితే.. మరొకరు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. సీఎస్కే మాజీ ఆటగాడు, నార్త్ జోన్ ఓపెనర్ ధృవ్ షోరే సెంచరీతో కదంతొక్కగా.. 2023 సీజన్ కేకేఆర్ స్టార్, సెంట్రల్ జోన్ ఆటగాడు రింకూ సింగ్ (38) ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యాడు. బెంగళూరు: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2023–2024 దులీప్ ట్రోఫీ మ్యాచ్లతో బుధవారం మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో నార్త్ ఈస్ట్ జోన్తో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. 90 ఓవర్లు ఆడిన నార్త్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఓపెనర్ ధ్రువ్ షోరే (211 బంతుల్లో 136; 22 ఫోర్లు) సెంచరీ సాధించాడు. నిశాంత్ సింధు (113 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్లు), పుల్కిత్ నారంగ్ (23 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. సెంట్రల్ జోన్ 182 ఆలౌట్ ఆలూర్లో ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 71.4 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ (38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈస్ట్ జోన్ బౌలర్ మణిశంకర్ మురాసింగ్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు సాధించింది. -
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రారంభంకానున్న దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్ల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం ఉండటం లేదు. బీసీసీఐ లోకల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు దులీప్ ట్రోఫీ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించలేకపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ (వెస్ట్ జోన్), చతేశ్వర్ పుజారా (వెస్ట్ జోన్) లాంటి అంతర్జాతీయ స్టార్లు, రింకూ సింగ్ (సెంట్రల్ జోన్), తిలక్ వర్మ (సౌత్ జోన్), సాయి సుదర్శన్ (సౌత్) లాంటి ఐపీఎల్ స్టార్లు ఉండటంతో ఈ మ్యాచ్లపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు ఎంపిక కాలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్ (వెస్ట్) దులీప్ ట్రోఫీ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలువనున్నాడు. కాగా, దులీప్ ట్రోఫీలో ఇవాళ సెంట్రల్ జోన్-ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ KSCA క్రికెట్ గ్రౌండ్లో, ఆలుర్ (కర్ణాటక), రెండో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి. ఈస్ట్ జోన్తో మ్యాచ్లో సెంట్రల్ జోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్తో మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.