Dr. Reddys Laboratories
-
7% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం
క్యూ3లో నికర లాభం రూ. 574 కోట్లు... ⇒ రష్యా వ్యాపారంలో 10 శాతం క్షీణత ⇒ 9% వృద్ధితో రూ. 3,843 కోట్లకు చేరిన కంపెనీ ఆదాయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 7% క్షీణతను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 618 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 574 కోట్లకు పడిపోయింది. ప్రధాన ఆదాయ వనరైన అమెరికా మార్కెట్లో వృద్ధి అంతగా లేకపోవడం, ఇదే సమయంలో రష్యా వ్యాపారంలో 10%క్షీణత, ఆర్అండ్డీ వ్యయం పెరగడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి గురువారంనాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 3,534 కోట్ల నుంచి రూ. 3,843 కోట్లకు పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ ప్రధాన ఆదాయ వనరైన గ్లోబల్ జెనరిక్ వ్యాపారం 8 శాతం పెరిగి రూ. 2,936 కోట్ల నుంచి రూ. 3,169 కోట్లకు చేరింది. ఇందులో 53 శాతం వాటా కలిగిన ఉత్తర అమెరికా మార్కెట్లో మాత్రం కేవలం నాలుగు శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం, ధరలపై ఒత్తిడి ఉండటం లాభాలపై ప్రభావం చూపిందన్నారు. గతేడాదితో పోలిస్తే అభివృద్ధి, పరిశోధనల కేటాయింపులు (ఆర్ అండ్ డీ) 45 శాతం పెంచినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో ఆర్ అండ్ డీపై రూ. 430 కోట్లు వ్యయం చేశారు. అలాగే ఈ త్రైమాసికంలో కొత్తగా ఆరు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయగా, రెండు ఏఎన్డీఏలను ఫైల్ చేసినట్లు ముఖర్జీ తెలిపారు. ప్రస్తుతం 68 ఏఎన్డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వీటికి వచ్చిన అనుమతులను బట్టి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఈ సమీక్షా కాలంలో దేశీయ వ్యాపారం 11 శాతం వృద్ధితో రూ. 485 కోట్ల నుంచి రూ. 526 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనాల కంటే లాభాల్లో క్షీణత తక్కువగా ఉండటంతో గురువారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు ధర సుమారు నాలుగు శాతం పెరిగి రూ. 3,359 వద్ద ముగిసింది. -
బయో ఏషియా...40 దాకా ఒప్పందాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న బయోఏషియా 2014 సదస్సు లో కంపెనీల మధ్య దాదాపు 30-40 దాకా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డెరైక్టర్-జనరల్ పీవీ అప్పాజీ తెలిపారు. సుమారు, 16 దేశాల నుంచి 100 కంపెనీలు పైగా ఇందులో పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు. వీటిలో చాలా మటుకు సంస్థలు భారత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని బయోఏషియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అప్పాజీ మంగళవారం ఇక్కడ తెలిపారు. ఇందులో సుమారు 15-20 ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్కి చెందిన సంస్థలకే దక్కవచ్చని ఆయన వివరించారు. విదేశీ సంస్థలు ఎక్కువగా టీకాలు, ఫార్ములేషన్స్, వైద్య పరికరాలు తదితర విభాగాల్లో ఒప్పందాలు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. బయోఏషియా సదస్సులో రెండో రోజున సుమారు 600 మంది దాకా ప్రతినిధులు పాల్గొన్నారు. నవకల్పనలతో వ్యాపారావకాశాలు తదితర అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ చైర్మన్ జీవీ ప్రసాద్, జీవీకే బయోసెన్సైస్ సీఈవో మణి కంటిపూడి మొదలైనవారు పాల్గొన్నారు. ఈ ఏడాదిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్-జీఎస్కే ఔషధానికి పేటెంటు దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, గ్లాక్సోస్మిత్క్లైన్ (జీఎస్కే) తాము సంయుక్తంగా రూపొందించిన తొలి ఔషధాన్ని ఈ ఏడాది రిజిస్టర్ చేయనున్నాయి. బయోఏషియా 2014 సదస్సులో మంగళవారం పాల్గొన్న సందర్భంగా జీఎస్కే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోజెరియో రిబెయిరో ఈ విషయం వెల్లడించారు. ముందుగా యూరప్లో ఈ ఔషధాన్ని నమోదు చేసి వర్ధమాన దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఇది కార్డియోవాస్క్యులర్ సంబంధిత ఔషధం కావొచ్చన్నట్లు సూచనప్రాయంగా చెప్పిన రిబె యిరో మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. పేటెంటు వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కనీసం రెండేళ్లు పట్టేయవచ్చని ఆయన చెప్పారు. 2009లో కుదిరిన ఒప్పందం ప్రకారం మధుమేహం, కార్డియోవాస్క్యులర్ తదితర విభాగాలకు సంబంధించిన ఔషధాలను జీఎస్కే, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంయుక్తంగా రూపొందించనున్నాయి.