-
వెతుక్కుంటూ వెళ్లి మరీ ఓనర్ను కరిచిన కుక్క?!
విశ్వాసంలో కుక్కను మించిన ప్రాణి మరొకటి లేదంటారు. అలాంటిది ఫిన్లాండ్కు చెందిన ఓ కుక్క పాపం వందల కిలోమీటర్లు ప్రయాణించింది. తీరా ఓనర్ కనిపించిన ఆనందంలో కసి తీరా కరిచేసింది!. ఇంటర్నెట్లో ఈ మధ్య బాగా వైరల్ అయిన పోస్ట్ ఇది. దీంతో రకరకాల రియాక్షన్లు వ్యక్తం అయ్యాయి. కానీ.. జులై 18న ఫేస్బుక్లో బాగా వైరల్ అయిన వార్త ఇది. తనను అనాథగా వదిలేసిన ఓనర్పై పగబట్టి కుక్క అలా చేసిందనేది ఆ వార్త సారాంశం. నిజానికి ఇదేం కొత్త కాదు.. మూడేళ్ల క్రితం జపాన్లో, రెండేళ్ల క్రితం మెక్సికోలో, పోయినేడాది ఉగాండాలో.. ఇలా ఏడాదికో ఊరి చొప్పున అదే టైటిల్తో వార్త వైరల్ అవుతూనే వస్తోంది. పైగా ఈ వార్తకు అఫీషియల్ సోర్స్ కూడా ఏం లేదు. సో.. ఇదొక అనామకమైన కథనం అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ ఈ కుక్క కథ ఎలా పుట్టిందంటే.. 1924లో ఓరేగావ్ సిల్వర్టన్కు చెందిన ఫ్రాంక్-ఎలిజబెత్ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి.. ఇండియానా వోల్కట్ట్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఓరోజు రెండేళ్ల వయసున్న వాళ్ల పెంపుడు కుక్క బాబీ.. వీధి కుక్కలు తరమడంతో పారిపోయింది. దాని కోసం వెతికి వెతికి విసిగిపోయి.. చివరికి ఇంటికి వచ్చేశారు. ఆరు నెలల తర్వాత ఓరోజు మట్టికొట్టుకుపోయి.. ఒంటి నిండా గాయాలతో సిల్వర్టన్లోకి యజమాని ఇంటికి తిరిగి వచ్చేసింది బాబీ. మొత్తం 2,551 మైళ్లు(4,105 కిలోమీటర్లు) ప్రయాణించింది అది. అన్ని రోజులు అది ప్రయాణించిన తీరును.. ఓ పెద్దావిడ కొన్నాళ్లపాటు దానికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని పరిశోధించి అప్పటి ప్రముఖ పత్రికలు సైతం కథనాలు వచ్చాయి. దీంతో ‘బాబీ ది వండర్ డాగ్’ పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. పెంచిన ప్రేమ కోసం తన ప్రాణాలకు తెగించి ఆ మూగ జీవి చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోయింది కూడా. ఇక బాబీ స్టోరీకి సెటైర్గా 2018లో దేర్ ఈజ్ న్యూస్ అనే వెబ్ సైట్ సెటైరిక్ స్టోరీ రాసింది. అందులో కుక్క తనను వదిలేసి వెళ్లిన ఓనర్ను వెతుక్కుంటూ వంద కిలోమీటర్లు ప్రయాణించిందని, కనబడగానే కరిచేసిందని రాసి ఉంది. అలా ఆ సెటైర్ ఆర్టికల్ ఇన్నేళ్లుగా వైరల్ అవుతూ.. ఏదో కొత్త విషయంలా చక్కర్లు కొడుతూ వస్తోందన్నమాట. సో.. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే.. ఓనర్ మీద ప్రేమతో ప్రయాణించిన కుక్క ఉంది కానీ, పగ పెంచుకుని వెళ్లి మరీ కరిచిన కుక్క మాత్రం ఇప్పటివరకైతే వార్తల్లోకి ఎక్కలేదు. -
తన భార్యను కరిచిందని కుక్కపై ప్రతీకారం..
భోపాల్: మధ్య ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను పక్కింట్లోని పెంపుడు కుక్క కరిచిందని రివాల్వర్తో కాల్చిచంపాడో వ్యక్తి. వివరాలు.. ఇండోర్లోని సుదామ నగర్ అపార్ట్ మెంట్లో నరేంద్ర విశ్వయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని పక్కింట్లో ఒక వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, అది విశ్వయ్య భార్యను కరిచింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి, వెంటనే తన లైసెన్స్డ్ తుపాకితో ఆ కుక్కను కాల్చిచంపాడు. దీనిపై ఆ శునకం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, నరేంద్రను అదుపులోకి తీసుకొని జంతువులపై క్రూరత్వంగా ప్రవర్తించడం, లైసెన్స్గన్ను దుర్వినియోగం చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇండోర్ పోలీసు అధికారి మనీష్ మహోర్ తెలిపారు. పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఆ కుక్క ఇది వరకే చాలా మందిని కరిచి, గాయ పర్చిందని తెలింది. ఒక వేళ నిందితుడి వాదనే నిజమైతే శునకం యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి బిత్తరపోయిన వరుడు! -
కుక్క కాటుకు గురైతే... ఇదీ ప్రథమ చికిత్స
►కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం (రన్నింగ్ వాటర్) కింద కడగాలి. అంటే... మగ్తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్తో వీలైనంత శుభ్రంగా కడగాలి. ►కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్గానే ఉంచాలి. ►కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్ను సంప్రదించి యాంటీరేబీస్ వ్యాక్సిన్ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి. ►గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ నిర్ణయిస్తారు. ►గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ను ఇస్తారు. -
కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో తెలుసా?
చిన్న పిల్లల మీద కుక్కల దాడులు అధికమతున్నాయి. వాటి దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో, ఎలాంటి జగ్రత్తలు తెలుసుకోండి. ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే.. గాయం తీవ్రతను తగ్గించవచ్చు. ►కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం కింద కడగాలి. అంటే... మగ్తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్తో వీలైనంత శుభ్రంగా కడగాలి. ► కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్గా ఉంచాలి. ►కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్ను సంప్రదించి యాంటీరేబీస్ వ్యాక్సిన్ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి. ► గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది. ► గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ను ఇవ్వాలి. -
పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం..
-
పాము కాటుకు కుక్క కాటు ఇంజక్షన్ ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పాము కాటేసిందని ఆసుపత్రికి వస్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్ను వేసారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే భరత్ రెడ్డి అనే యువకుడు ఈ నెల 2వ తేదీన పాము కాటేయడంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిపక్షన్ను చూపి చికిత్స చేయవలసిందిగా సిబ్బందిని కోరాడు. అయితే ప్రిస్క్రిపక్షన్ను సరిగా పరశీలించని సిబ్బంది పాము కాటు ఇంజక్షన్కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ను ఇచ్చి, రెండో డోసుకు 5వ తేదీ రావాలని సదరు యువకుడికి సూచించారు. సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడికి అనుమానం కలిగి పాము కాటుకు ఒక్కసారే ఇంజక్షన్ ఇస్తారు కదా అని నిలదీశాడు. దానికి బదులుగా సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడు అవాక్కయ్యాడు. పాము కరిచిందని వస్తే కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ ఇస్తారా అని సిబ్బందిపై మండిపడ్డాడు. బాధితుడు ఒక్కసారిగా విరుచుకుపడటంతో సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. సిబ్బంది నిర్వాకానికి షాక్కు గురైన యువకుడు బోరున విలపిస్తూ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కుక్కకాటు వైద్యానికి ప్రత్యేక క్లినిక్లు
సాక్షి, అమరావతి: కుక్కకాటు బాధితులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ప్రభుత్వ కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఎక్కడో ఒక చోటకు వెళ్లి యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. దీంతో ప్రత్యేక క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ సహకారంతో ఈ క్లినిక్లలో ప్రత్యేక డాక్టర్తో పాటు ఒక స్టాఫ్నర్సు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. క్లినిక్లు ఎక్కడంటే? వైద్య విధాన పరిషత్ పరిధిలో: టెక్కలి, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, మార్కాపురం, ఆత్మకూరు, మదనపల్లె, ప్రొద్దుటూరు, హిందూపురం, నంద్యాల. బోధనాసుపత్రుల్లో: విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు క్లినిక్లలో ఎలాంటి సేవలు? ► ఇతర జంతువుల కాట్లకు వైద్యం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లినిక్లు. ► యాంటీరేబిస్ వ్యాక్సిన్తో పాటు యాంటీ స్నేక్ వీనం (పాము కాటు) మందు అందుబాటులో ఉంటుంది. -
ఇంటికి తీసుకెళ్లి కుక్కతో కరిపించాడని..
పెర్త్ : ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతానికి చెందిన జాషువా వాకర్ తన పెంపుడు కుక్క చేసిన పనికి తాను కోర్టు ముందు హాజరవ్వాల్సి వచ్చింది. అంతేకాదు తన ఇంటికి వచ్చిన మహిళపై పెంపుడు కుక్క దాడి చేసినందుకు గానూ బాధితురాలికి నష్ట పరిహారంతో పాటు శిక్షను కూడా అనుభవించాలంటూ తీర్పు ఇచ్చింది. తన కుక్క చేసిన పనికి తాను శిక్షను అనుభవించడం కొంచెం గిల్టీ ఫీలింగ్ కలుగుతుందని జాషువా తెలిపాడు. (చదవండి : ‘నమ్మలేకపోతున్నాం.. ఇది అరుదైన అనుభవం’) ఇక అసలు విషయానికి వస్తే... పెర్త్కు చెందిన జాషువా వాకర్తో గతేడాది ఒక మహిళతో పరిచయం అయింది. గతేడాది క్రిస్మస్ రోజున సరదాగా కలిసిన ఈ ఇద్దరు హోటల్కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. జాషువా ఆ తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో నా పెంపుడు కుక్క అయిన టెక్సాస్ను కట్టేస్తానని.. అంతవరకు లోపలకు రావొద్దని హెచ్చరించాడు. అయితే ఆ మహిళ అతని మాట వినకుండా టెక్సాస్ను నిమురుదామని దగ్గరికి వచ్చింది. ఇంతలో టెక్సాస్ ఆ మహిళ ముఖంపై దాడి చేసి పీక్కుతింది. దీంతో తీవ్రరక్తస్రావంతో మహిళ ముఖంపై పెద్ద హోల్ తయారైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు 21 కుట్లు వేశారు. అనంతరం సదరు మహిళ జాషువా తో పాటు అతని పెంపుడు కుక్కపై కేసు పెట్టింది. మర్యాదపూర్వకంగా ఇంటికి తీసుకెళ్లి ఇలా కుక్కతో కరిపించడంమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తాజాగా కోర్టుకు రావడంతో జాషువా, బాధితురాలు తమ తమ న్యాయవాదులతో హాజరయ్యారు. జాషువా తరపు లాయర్ అలెక్స్ స్మిత్ మాట్లాడుతూ.. జాషువా తన ఇంటికి ఆమెను మర్యాదపూర్వకంగా పిలిచిన మాట నిజమే కాని అతను తన కుక్కతో కరిపించలేదు. నిజానికి దానిని నిమురకుండా దాని మీద పడిపోవడంతోనే అది దాడి చేసిందని తెలిపాడు. అయినా జాషువా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడని పేర్కొన్నాడు. అయితే ఉద్దేశపూర్వకంగానే మహిళను ఇంటికి పిలిపించి కావాలనే టెక్సాస్తో కరిపించినట్టు బాధితురాలి తరపు న్యాయవాది టిమ్ హౌలింగ్ తెలిపాడు. జాషువాకు భారీ ఫెనాల్టీ విధించడంతో పాటు శిక్ష ఖరారు చేయాలని పేర్కొన్నాడు. అన్ని వాదనలు విన్న జడ్జి మహిళకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని, జైలుశిక్ష కూడా అనుభవించాలని తీర్పు ఇచ్చాడు. కాగా జాషువా వాకర్కు ఎన్ని రోజుల జైలు శిక్ష ఉంటుందనేది తెలియదు.(చదవండి : ‘వాళ్లను ఎంతగానో ప్రేమిస్తున్నా అని చెప్పండి’) -
అర్ధరాత్రి అమానుష ఘటన..!
కర్నూలు, ఆళ్లగడ్డ: పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి అమానుష ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని వీధికుక్కలు బలితీసుకున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు..సుమారు పది కుక్కలు మీదపడి కరిచాయి. చిన్నారి హాహాకారాలు చేస్తున్నా విడిచిపెట్టలేదు. తీవ్రంగా గాయపడిన అతన్ని వైద్యశాలకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు వదిలాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన నరసింహ అనే నాలుగేళ్ల బాలుడికి మతిస్థిమితం సరిగా లేదు. తండ్రి కొన్ని నెలలుగా ఓ కేసులో మచిలీపట్నం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తల్లి వరలక్ష్మి నాలుగు నెలల పాపను తీసుకుని మూడు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లింది. నరసింహ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే వదిలివెళ్లింది. ఈ చిన్నారి అప్పటి నుంచి రోజూ వీధుల వెంట తిరుగుతూ ఎవరైనా ఒక ముద్ద పెడితే తిని..ఇంటి వరండాలో నిద్రపోయేవాడు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆకలేసిందో.. ఏమో తెలియదు గానీ ఇంటి గేటు దూకి వీధిలోకి వచ్చాడు. పోలీస్ క్వార్టర్స్ సమీపంలోని రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. సుమారు 10 కుక్కలుమీద పడి కరిచాయి. శరీరమంతటా గాయపరిచాయి. ముఖ్యంగా తల భాగంలో పీక్కుతిన్నాయి. ఈ క్రమంలో కుక్కల అరుపులు విన్న స్థానికులు బయటకొచ్చి చూశారు. చిన్నారిని కరుస్తున్న దృశ్యాన్ని గమనించి..వెంటనే కర్రలు తీసుకొచ్చి వాటిని తరిమారు. అప్పటికే చిన్నారిని తీవ్రంగా గాయపర్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలోపే చిన్నారి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. కాగా.. తల్లి ఎక్కడుందో సమాచారం లేకపోవడంతో బాబాయి ఓబులేసు చిన్నారి అంత్యక్రియలు నిర్వహించాడు. బాలుడి మృతి బాధాకరం ఆళ్లగడ్డలో వీధికుక్కల దాడిలో నరసింహ అనే చిన్నారి చనిపోవడం బాధాకరమని శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. వీధికుక్కలను వెంటనే సంహరించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్బాబును ఆదేశించారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కలను సంహరిస్తాం పట్టణంలో కుక్కల దాడిలో చిన్నారి నరసింహ మృతి చెందడం తమను కలిచివేసిందని ఆళ్లగడ్డ మునిసిపల్ కమిషనర్ రమేష్బాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని వీధి కుక్కలను పూర్తిగా సంహరిస్తామన్నారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
పట్టుకో చూద్దాం...
లాక్డౌన్ ఉండటంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో ఓ నెమలి కేబీఆర్ పార్కులోంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుక్క నెమలిని చూసి వెంటపడింది. ఇది గమనించి నెమలి నేను.. దొరకనుపో అన్నట్లు పార్కులోకి ఎగిరి వెళ్లిపోయింది. (మనుషులు కనిపించగానే వెర్రెత్తినట్లు దూకుడు) -
మనుషులను చూడగానే వెర్రెత్తినట్లు..
సాక్షి, సిటీబ్యూరో: ఆహారం దొరకకపోవడం.. రహదారులు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారడంతో వీధి కుక్కలు గంగవెర్రులెత్తుతున్నాయి. విపరీత ప్రవర్తనతో మనుషులపై ఎగబడుతున్నాయి. వాహనాల వెంట పరుగెత్తి బెంబేలెత్తిస్తున్నాయి. హోటళ్లు, బార్లు, ఫంక్షన్ హాళ్లు , హాస్టళ్లు వంటి వాటితో వీటికి నిత్యం ఆహారం దొరికేది. లాక్డౌన్తో ఇవి మూతపడటంతో ఆకలితో నకనకలాడుతున్నాయి. తాగునీరు కూడా దొరక్కడీహైడ్రేషన్కు గురవుతున్నాయి. అడపాదడపా మనుషులు కనిపిస్తేపిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో అత్యవసర పనుల మీదబయటకు వెళ్లేవారు, రాత్రుళ్లు విధులు నిర్వహించే వారు కుక్కల భయంతో వణికిపోతున్నారు. పగలు బిక్కుబిక్కుమంటున్న కుక్కలు రాత్రిళ్లు ఆకలికి తాళలేక తీవ్రంగా అరుస్తున్నాయని వివిధ ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. నగరంలో తగ్గని కుక్కల సంఖ్య.. కుక్కల జీవిత కాలం సుమారు 10 ఏళ్లు. 8 నెలలు వచ్చినప్పటి నుంచే కుక్కలకు సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది. గర్భస్థ సమయం దాదాపు రెండు నెలలు. ఒక్కో కుక్క ఏటా రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. తడవకు 4– 8 పిల్లలు పుడతాయి. ఇలా ఒక కుక్క ద్వారా ఏటా 40కిపైగా కుక్కలు జనం మధ్యకు వస్తున్నాయి. గ్రేటర్లో దాదాపు 10 లక్షల కుక్కలున్నాయి. అంటే ఏటా ఎన్ని కుక్కలు పుడతాయో అంచనా వేసుకోవచ్చు. వీటి సంతతిని అరికట్టే యంత్రాంగం, వనరులు, సామర్థ్యం జీహెచ్ఎంసీ వద్ద లేవు. దీంతో కుక్కల సంతాన నిరోధక ఆపరేషన్లు, వ్యాధి సోకకుండా యాంటీరేబిస్ వ్యాక్సిన్లు వంటివి వేస్తున్నా అవి సరిపోవడం లేదు. ఏటా దాదాపు 60వేల కుక్కలకు ఆపరేషన్లు చేస్తున్నా, వ్యాక్సిన్లు వేస్తున్నా నగరంలో కుక్కల సమస్య తగ్గడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్లో తగ్గిన ఆపరేషన్లు.. లాక్డౌన్ సమయాన్ని వినియోగించుకొని ఎస్సార్డీపీ కింద ఫ్లై ఓవర్లు, రోడ్ల మరమ్మతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అదే తరహాలో ఎక్కువ కుక్కలకు ఆపరేషన్లు, వ్యాక్సిన్లు వంటివి చేస్తే సమస్య తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. కానీ.. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. సాధారణ రోజుల్లో ఒక్కో ఆపరేషన్ కేంద్రంలో సగటున రోజుకు 50 ఆపరేషన్ల వంతున ఐదు ఆపరేషన్ సెంటర్లలో 250 ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం రెండు కేంద్రాల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. వీటికి ఆపరేషన్లు చేసే ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్లు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావడంతో లాక్డౌన్తో వారు రావడం మానేశారు. కుక్కలను పట్టుకునే సిబ్బందిదీ అదే పరిస్థితి కావడంతో వారిలో చాలామంది రావడం లేదు. దీంతో ఆపరేషన్లు, వ్యాక్సినేషన్లు రెండు కార్యక్రమాలు గతంలో కంటే కుంటుపడ్డాయి. జనం బెంబేలు.. కుక్కలు కరవకపోయినా వాటిని చూసి జనం బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ ప్రభుత్వ డ్యూటీలకు వెళ్లేవారు, డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లేవారిని చూసి వాహనం లైటు వెలుతురుకు పడుకున్న కుక్కలు గుంపులుగా ఒకేసారి పైకి లేవడంతో భయానికి వాహనం అదుపు తప్పిగాయాల పాలవుతున్నారు. తీవ్ర గాయాలతో మరణించిన వారూ ఉన్నారు. స్వచ్ఛంంద సంస్థల ఆసరా.. లాక్డౌన్లో అల్లాడుతున్న కుక్కల పరిస్థితిని గ్రహించిన డాగ్ లవర్స్, స్వచ్ఛంద సంస్థలు పోలీసు అధికారుల నుంచి అనుమతి పొంది, ఆయా ప్రాంతాల్లో వాటికి ఆహారం అందజేస్తున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వకీల్ తెలిపారు. వీధి కుక్కల బారినపడి మృత్యువాత చార్మినార్: కుక్కలు అడ్డురావడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మామిడి రాజు (35) అనే పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన చాదర్ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సైదాబాద్ మూడుగుళ్లు ప్రాంతానికి చెందిన మామిడి రాజు సుల్తాన్బజార్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్. లాక్డౌన్లో ఆయన సుల్తాన్బజార్లోని ఓ బ్యాంక్ కూడలి వద్ద విధి నిర్వహణలో ఉన్నాడు. ఈ నెల 8న డ్యూటీ చేసి.. 9న ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. మూసీపై ఉన్న చాదర్ఘాట్ కాజ్వే మీదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. సగం దూరం రాగానే నడి రోడుప్డై ఉన్న కుక్కలు వాహనం చప్పుడుకు లేచి వాహనానికి అడ్డువచ్చాయి. దీంతో రాజు ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. హెల్మెట్ సైతం దూరంగా పడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో అధిక రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. వెంటనే మలక్పేట్లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు బ్రెయిన్డెడ్గా డిక్లేర్ చేశారు. ఆయన ఈ నెల 13న మృతి చెందాడు. కాగా.. మరో సంఘటనలో బుధవారం ఉదయం గాంధీనగర్లో వీధి కుక్కల బారిన పడిన ఓ గుర్తు తెలియని వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. -
చిన్నారిపై కుక్క దాడి
సాక్షి, పటాన్చెరు : అమీన్పూర్లోని నవ్యనగర్లో బుధవారం ఉదయం స్కూల్కు వెళ్తున్న ఓ చిన్నారిపై కుక్క దాడి చేసి గాయపర్చింది. అమీన్పూర్ పట్టణం, మండల పరిధిలో ప్రతి రోజూ ఏదో ఒక చోట కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కిష్టారెడ్డిపేట, బీఎస్ఆర్ కాలనీలో, అమీన్ఫNర్ పట్టణంలోని బీరంగూడ ఇతర ప్రాంతాల్లో జరిగిన కుక్క కాట్ల సంఘటనలు మరువక ముందే అమీన్పూర్ నవ్యనగర్లో బుధవారం చక్రధర్ కూతురు అద్వైత అనే చిన్నారిపై దాడి చేసింది. తల్లితో కలిసి గేటు వద్ద స్కూల్ బస్సు కోసం ఎదరు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వచ్చిన కుక్క ఆ చిన్నారికాలిపై గాయం చేసింది. అంతలోనే ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఆ కుక్కను తరిమేశారు. మొరపెట్టుకున్నా.. కాలనీలో కుక్కల దాడులు పెరిగాయని స్థానికులు అమీన్పూర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని నవ్యనగర్ కాలనీవాసులు తెలిపారు. ఈ విషయమై స్థానిక కమిషనర్ సుజాత వివరణ కోరగా కుక్కలను పట్టుకునే వ్యక్తులకు ఆ పని అప్పగించామని, గురువారం సాయంత్రానికి కుక్కలను అక్కడ నుంచి తరలిస్తామన్నారు. అయితే అమీన్పూర్లో కుక్కల దాడుల సంఘటనలు పెరుగుతున్నాయని వాట్సప్ గ్రూపుల్లో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. శునకాల దాడుల సంఘటనలకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను పరస్పరం షేర్ చేసుకుంటున్నారు. -
కుక్క' గొడవ' తీసింది ప్రాణం
తుమకూరు: అప్పు చెల్లించడం లేదనే కారణంగా యువకుడిని హత్య చేసిన ఘటనలో మంగళవారం క్యాత్సంద్ర పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తుమకూరుకు చెందిన భరత్, కాంతరాజు,పాలనేత్రయ్య (27) చాలా కాలంగా పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటుండడంతో ముగ్గురు స్నేహితులుగా మారారు. గతనెల 29వ తేదీన పాతనేత్రయ్య ఇంట్లో పెంపుడు కుక్క కాంతరాజును కరిచింది. దీనిపై కాంతరాజు, భరత్లు పాలనేత్రయ్య తల్లితో గొడవ పడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాలనేత్రయ్య గొడవలకు దిగొద్దని స్నేహితులను హెచ్చరించాడు. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసి :దీంతో పాలనేత్రయ్యపై కక్ష పెంచుకున్న నిందితులు అతడిని అంతమొందించడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గతంలో తనవద్ద తీసుకున్న రూ.5వేల అప్పు చెల్లించాలని నిందితులు పాలనేత్రయ్యను అడిగారు. తనవద్ద డబ్బులు లేవని తరువాత చెల్లిస్తానని చెప్పడంతో అదేరోజు రాత్రి మాట్లాడాలని బస్టాండ్కు తీసుకెళ్లి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పాలనేత్రయ్య అక్కడిక్కడే మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేశారు. -
అమీర్పేటలో పిచ్చికుక్క స్వైరవిహారం..
అమీర్పేట: పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్లపై పరుగులు తీస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు 50 మందిని కరిచింది. మంగళవారం జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాయంత్ర 3.30 గంటల సమయంలో మొదటగా సోమాజిగూడలో రోడ్డుపై వెళుతున్న ఆరుగురు యువకులను పిచ్చికుక్క కరిచింది. సీఎం క్యాంపు కార్యాలయం మీదుగా వచ్చి అమీర్పేట గ్రీన్ల్యాండ్ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన ముగ్గురిని వెంటపడి మరీ కరిచింది. అక్కడి నుంచి నేరుగా ఇండో యూఎస్ ఆస్పత్రి నిల్చున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చింది. సిస్టర్ నివేదిత స్కూల్ సమీపంలో ఇద్దరు విద్యార్థులను కరిచింది. ఇంట్లో నుంచి ట్యూషన్కు వెళుతున్న చిన్నారుల వెంటపడి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కొందరు యువకులు కుక్కను తరిమేందుకు ప్రయత్నించడంతో వారిపైకి దూకి మరీ కరిచింది. దీంతో వారు రాళ్లతో కొట్టి తరిమారు. అక్కడి నుంచి కన్యాగురుకుల్ పాఠశాల మీదుగా అమీర్పేట మున్సిపల్ గ్రౌండ్ చౌరస్తాకు వచ్చి ఇద్దరు విద్యార్థులను కరిచింది. చిరు వ్యాపారులు కర్రలతో కొట్టి తరిమివేశారు. చల్లా నర్సింగ్ హోం వద్ద ఓ వైద్యుడితో పాటు ఇద్దరు సేల్స్మెన్లను కరిచింది. అనంతరం అమీర్పేట సత్యం థియేటర్ వద్ద మరో ఇద్దరిని కరిచింది. ఆగ్రహంతో కొందరు యువకులు రాళ్లు, కర్రలు పట్టుకుని వెంటపడి కొట్టడంతో హెచ్డీఎఫ్సి బ్యాంకు సమీపంలో పడిపోయింది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళ చెందారు. ఇటీవల కుక్కల సంఖ్య ఎక్కువైందని, వీటి భయంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తచేశారు. 18 మందికి చికిత్సలు.. కుక్కకాటుకు గురైన అనేక మంది ఆస్పత్రుల బాట పట్టారు. అమీర్పేట ధరం కరం రోడ్డులోని చల్లానర్సింగ్ హోంలో 18 మందికి చికిత్స అందించారు. వీరిలో నలుగురు విద్యార్థులతో పాటు ఓ వైద్యుడు ఉన్నారు. ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో చాలా మందిని ఇతర ఆస్పత్రులకు పంపించినట్లు వైద్యుడు విజేయ్కుమార్ తెలిపారు. యువకులతో మహిళ గొడవ.. రోడ్లపై కనిపించిన వారినందరినీ కరుస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు యువకులు కర్రలు, రాళ్లతో కొట్టి పిచ్చికుక్కను మట్టుపెట్టారు. ఈ సమయంలో అమీర్పేట సత్యంథియేటర్ వద్దకు వచ్చిన ఓ మహిళ కుక్కను కొట్టి చంపుతున్నారెందుకని ప్రశ్నించింది.అంతటితో ఆగకుండా కుక్కను కొట్టిన వారిని తన సెల్ఫోన్తో వీడియో తీసింది. దీంతో సదరు యువకులు ఆమెతో గొడవకు దిగారు. పిచ్చికుక్క మనుషులను కరిచి గాయాలపాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సదరు మహిళ వినిపించుకోకుండా తాను కమిషనర్ కూతురునని, కుక్క మృతికి కారకులైన వారిపై కేసు పెడతానంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది. -
విశ్వాసమే రక్షించింది!
చెన్నై,తిరువొత్తియూరు : వ్యవసాయ పొలంలో వెళ్తున్న సమయంలో యజమానిని రక్షించడానికి మూడు శునకాలు పాముపై దాడి చేసి కొరికి చంపేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కోవై సమీపం ఒత్తకాల్ మండపం పూంగా నగర్కు చెందిన రామలింగం రైతు. అతని ఇంటికి సమీపంలోనే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంలో కట్టేసిన పశువులకు గడ్డి వేయడానికి తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో తాను పెంచుతున్న మూడు కుక్కలు అతని వెంట వెళ్లాయి. వారు వెళుతున్న మార్గంలో సుమారు 6 అడుగుల పాము దాడికి యత్నించింది. దాని నుంచి రామలింగం, అతని స్నేహితుడు తృటిలో తప్పించుకున్నారు. వెంటనే మూడు శునకాలు పాముపై దాడి చేసి పామును చుట్టిముట్టి కొరికి చంపేశాయి. ఈ దృశ్యాన్ని రామలింగంతో వచ్చిన స్నేహితుడు సెల్ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. తన ప్రాణాలకు తెగించి శునకాలు చేసిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. -
వామ్మో కుక్క
కుత్బుల్లాపూర్: నగరంలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా దాడులకు తెగబడుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు 3.5 లక్షలున్న వీటి సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా 8 లక్షలకు పెరిగిపోయింది. నిధులు లేవన్న కారణంతో ప్రభుత్వం వీధి శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తగ్గించడంతో వాటి సంతానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. మంగళవారం కుత్బుల్లాపూర్ పరిధి ప్రసూననగర్లోపాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఏడుగురు చిన్నారులపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రసూననగర్ రామాలయం వీధికి చెందిన చిన్నారులు జ్ఞానేశ్వర్, హరిణి, లీనా, శ్రవణ్ తదితరులు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగావీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో సురేష్కుమార్ అనే వ్యక్తి దానిని తరిమికొట్టి చిన్నారులను కాపాడారు. సంక్షేమ సంఘం ప్రతినిధులు నాగశేఖర్గౌడ్, నాగేశ్వరరావు, నారాయణలకు సమాచారం అందించడంతో వారు చిన్నారులను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికితరలించారు. -
పాపం..పసి పాప
బంజారాహిల్స్: బంజారాహిల్స్లో దారుణం చోటు చేసుకుంది. వారం రోజులు నిండని ఒక మగ శిశువును కుక్కలు పీక్కు తింటుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అలీ అస్గర్ అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజమున బంజారాహిల్స్ రోడ్ నెం. 13లోని హిందూ శ్మశాన వాటిక ముందు నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కొన్ని కుక్కలు అరుస్తుడటంతో వాటిని తరిమేయగా ఓ శిశువు కాళ్ళు, చేతులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండగా మెడంతా కోసుకుపోయింది. కుక్కలు శిశువును పీక్కు తింటున్నట్లుగా గుర్తించిన అతను బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు శరీర భాగాలను ఒక్క చోటకు చేర్చి ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిశువు వారం రోజుల క్రితం జన్మించి ఉండవచ్చునని శ్మశాన వాటిక పక్కన పడేసి వెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి ఈ దారుణానికి ఒడిగట్టినవారిని గుర్తిస్తామన్నారు. -
‘కుక్కకాటు’కు మందు లేదు!
సాక్షి, అనంతపురం : జిల్లాలో కుక్కకాటుకు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోయింది. ప్రధానంగా పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ లేదనే సమాధానాలు వినవస్తున్నాయి. దీంతో కుక్కకాటు బాధితులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి వస్తున్నారు. ఇక్కడి ఏపీఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్లోనూ సూది మందులు అందుబాటులో లేవంటూ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్గా ఈ మందు కొనుగోలు చేయాలంటూ ఒక్కొ వెయిల్ రూ.350 ధర పలుకుతోంది. నెలకు 10 వేల వెయిల్స్ జిల్లాలో సర్వజనాస్పత్రితో పాటు 88 పీహెచ్సీలు, 15 సీహెచ్సీలు, రెండు ఏరియా ఆస్పత్రులు, అనంతపురం సీడీ ఆస్పత్రి, హిందూపురం జిల్లా కేంద్రం ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రులకు నెలకు సగటున 10వేల ఏఆర్వీ వెయిల్స్ అవసరమని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఆరు నెలలుగా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఏడాది జూన్ 20న కర్నూలు సీడీ ఆస్పత్రి నుంచి ఒక వెయ్యి వెయిల్స్, జూలై 29న భరత్ బయోటెక్ ఇంటర్నేషనల్ నుంచి 4,160 వెయిల్స్ తెప్పించారు. ఈ నెల 19న 3,700, 21న మరో 3,700 వెయిల్స్ కోసం కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇవి ఆస్పత్రులకు చేరేందుకు మరింత సమయం పడుతుందని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు చెబుతున్నారు. రెండు వెయిల్స్తో ఐదుగురికి కుక్కకాటుకు గురైన వారికి ఐదు డోసుల్లో ఏఆర్వీ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు వెయిల్స్ ద్వారా ఐదుగురికి ఒక్కసారిగా వ్యాక్సిన్ వేయవచ్చు. ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో 20 వెయిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బుధవారం (నేడు)తో అవి కూడా అయిపోతాయి. గతంలో రోజుకు 20 నుంచి 30 మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ను వేసేవారు. అయితే ఇటీవల కుక్కకాటు బాధితుల సంఖ్య పెరగడంతో రోజూ 80 మందికి వేయాల్సి వస్తోంది. అనంతపురం రూరల్, ధర్మవరం, తాడిపత్రి, బత్తలపల్లి, పామిడి, మామిళ్లపల్లి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కుక్కకాటు బాధితులు సర్వజనాస్పత్రికి వస్తున్నారు. సంగీత అనె మహిళ కళ్యాణదుర్గం మండలం నర్సాపురం గ్రామం. కొన్ని రోజుల క్రితం కుక్కకాటుకు గురైన తన కుమారుడు వేదవ్యాస్ నాయక్కు రెండు డోస్ల యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ)ను బెళుగుప్పలోని పీహెచ్సీలో వేయించారు. మంగళవారం మూడో డోస్ వేయించేందుకు అక్కడకు వెళితే.. వ్యాక్సిన్ లేదని చెప్పారు. దీంతో కుమారుడిని తీసుకుని సర్వజనాస్పత్రికి మధ్యాహ్నం 1.09 గంటలకు చేరుకున్నారు. డ్యూటీలో ఉన్న హెడ్నర్స్ను కలిసి విషయం చెబితే.. వ్యాక్సిన్ అయిపోయిందని చేతులెత్తేశారు. కళ్యాణదుర్గం నుంచి ఇక్కడకు రానుపోనూ రూ.200కు పైగా ఖర్చు అవుతుందని, ఇక్కడకు వచ్చాక లేదని చెబితే పిల్లాడి పరిస్థితి ఏమిటంటూ ఆవేదనతో ఆమె వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లోనూ ఉంది. కుక్కకాటుకు గురైన వారు సూది మందు దొరక్క అవస్థలు పడుతున్నారు. ధర్మవరం నుంచి 12 మంది కుక్కకాటుకు గురై సర్వజనాస్పత్రికి రాగా అందులో 8 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. మిగిలిన వారిని వెనక్కు పంపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 100 వెయిల్స్ కొనుగోలు చేస్తున్నాం ఆస్పత్రిలో ఏఆర్వీ వ్యాక్సిన్ కొరత ఉండేది వాస్తవమే. ఆస్పత్రి బడ్జెట్ నుంచి గుంటూరులోని ఓ ఫార్మసీ ద్వారా వంద వెయిల్స్ కొనుగోలు చేయబోతున్నాం. వ్యాక్సిన్ కొరతను ఇప్పటికే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ రామస్వామి నాయక్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ రెండు నెలలుగా ఇదే పరిస్థితి రెండు నెలలుగా ఏఆర్వీ వ్యాక్సిన్ కొరత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య. దేశంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఈ వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరతను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో వ్యాక్సిన్ రావచ్చు. – ఐవీఎస్ రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ -
పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు..
చిలకలగూడ: పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరి ధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్మండికి చెందిన శిరీష తన కుమార్తెతో కలిసి ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన అనిత పెంపుడు కుక్క చిన్నారి వెంటబడి కుడి చెవి వెనుక కరిచింది. దీంతో చిన్నారికి తీవ్ర రక్తగాయమైంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం బాధితురాలి తల్లి శిరీష పోలీసులను ఆశ్రయించింది. రెండు రోజుల క్రితం అదే పెంపుడు కుక్క తన కుమారుడిని కూడా కరిచిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ 336 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు
సాక్షి, హుజూరాబాద్( కరీంనగర్) : గ్రామాన్ని రక్షించే గ్రామ సింహాలే ఇప్పుడు ప్రజల పాలిట మృత్యు సింహా లుగా మారుతున్నాయి. విశ్వాసానికి కేరాఫ్గా అడ్రస్గా నిలిచే కుక్కలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 107 గ్రామాలు ఉండగా, ప్రతి గ్రామంలో సుమారు 200 నుంచి 500 వరకు వీధి కుక్కలు ఉన్నాయి. గ్రామాల్లో స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తూ, కనబడినవారిపై దాడి చేస్తుండడంతో ప్రజలు కంటి మీద కనుకు లేకుండా పోయింది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ నెల వరకు ఆయా పీహెచ్సీలలో కుక్కకాటుకు గురైన బాధితులు హుజూరాబాద్లో 119, జమ్మికుంటలో 201, వీణవంకలో 62, సైదాపూర్లో 107, ఇల్లందకుంటలో49 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛగా సంచారం.. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. నియోజకవర్గంలోని వీణవంక, హుజూరా బాద్, జమ్మికుంట మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కుక్క కాటుకు గురవుతున్న బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కుక్కల సమస్యకు నిలయంగా సిర్సపల్లి గ్రామం నిలిచింది. తాజాగా మంగళవారం గ్రామానికి చెందిన శ్రీశాంత్(3) అనే చిన్నారిపై గ్రామంలో కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. బయపడుతున్న జనం.. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు సరిగ్గా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా సేద తీరుతున్నాయి. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణీంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూగజీవాలపైనా దాడి.. నియోజకవర్గ వ్యాప్తంగా కుక్కల దాడిలో జనవరి నుంచి జూన్ మాసం వరకు పలువురి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. హుజూరాబాద్ మండలంలో గత వారం రోజుల వ్యవధిలో 6 పాడి గేదెలు, 4 ఆవులు, 8 లేగ దూడలు కుక్కల దాడిలో మృత్యువాత చెందటంతో పాడిపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పట్టించుకోని అధికార యంత్రాంగం.. కుక్కల సంఖ్య పెరగకుండా మున్సిపాలిటీల్లో, పీహెచ్సీ పరిధిలో జంతు సంతాన నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి. శునకాల నియంత్రణకు జంతు సంతాన నింయత్రణ ప్రాజెక్టు కింద 50 శాతం నిధులను ప్రభుత్వం అందజేస్తుంది. మరో 50 శాతం నిధులను మున్సిపాలిటీల నుంచి సమకూర్చుకోని, వీధి కుక్కలకు టీకాలు వేయాల్సి ఉండగా, అధికా రులు పట్టించుకోకపోవడంతో కుక్కల బెడద తీవ్రమైందని పలువురు ఆరోపిస్తున్నారు. -
33 మందిపై పిచ్చికుక్క దాడి
సాక్షి, పరకాల(వరంగల్) : ఒకే కుక్క 33మందిని తీవ్రంగా గాయపరిచి భయాందోళనకు గురిచేసిన సంఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది. పరకాల, నడికూడ మండలంలో గత కొద్ది రోజులుగా పిచ్చికుక్కల దాడులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఓ పిచ్చికుక్క వరికోల్ గ్రామస్తులను వనికించింది. 33 మందికి తీవ్రంగా గాయపరిచి వారి రక్తం కళ్లచూసింది. ఈ దాడిలో 15 మంది వృద్ధులు, ముగ్గురు బాలికలు ఉండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో గ్రామ శివారు నుంచి వచ్చిన పిచ్చి కుక్క కనబడిన వృద్ధులు, చిన్నారులపై దాడి చేసింది. అంతేకాకుండా గ్రామంలోని ఇతర కుక్కలు, పశువులుపై సైతం దాడిచేసి గాయపరిచింది. దాడిలో గాయపడిన వారిలో 17 మందిని వెంటనే పరకాల సివిల్ ఆస్పత్రికి, మిగతా వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, మరికొందరిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పరకాల సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పోచంపల్లి వెంకటనర్సమ్మ, రాచమల్ల చేరాలు, పోచంపల్లి చిన్నమల్లారెడ్డి, దిడ్డి కొమ్మాలు, రామంచ స్వర్ణలత, దాట్ల సరోజన, వంగ రామయ్య, పోశాలు సరోజన, శంకర్రావు, కుసుమ సాంబశివరావు, చెనుమల్ల శంకరమ్మ, లడె సునిత, గుండెకారి లచ్చమ్మ, బల్గు రవిందర్, గుండెకారి శంకరమ్మ, చిన్నారులు పర్శ గౌతమి, పకిడె అమ్ములు, దొగ్గె విక్టోరియాలు ఉన్నారు. వీరందరికీ ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు సిఫారసు చేశారు. రెండు కుక్కలు హతం పచ్చి కుక్క దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తమ వారిని కుక్క కరించిందని తెలియగానే పొలం పనులు వదిలి గ్రామంలోకి చేరుకున్నారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తరలించగా, గ్రామస్తులతో దాడిచేసిన పిచ్చి కుక్క కోసం గాలించారు. అనుమానంగా ఉన్న రెండు కుక్కలను హతమార్చారు. -
శునకాలకు..సారీ..!
ఛీ కుక్క..అనే ముందు ఏం కుక్కా బాగున్నావా అని ఎవరైనా అంటారా? రాత్రుల్లో గూర్ఖాలా కాపలా కాస్తుంది దొంగలొస్తే భౌ..భౌ మంటుంది యజమాని నిద్రపోతుంటే చుట్టూ చక్కర్లు కొడుతుంది ఊరికెళుతుంటే ఏడుస్తుంది ఆకలైతే అన్ని ఇళ్లకూ తిరిగి జాలిగా చూస్తుంది.. చంటి పిల్లలకు చక్కిలిగింతలు పెడుతుంది పోలీసు కేసులను ఛేదిస్తుంది సర్కస్లో ఫీట్లు చేస్తుంది చివరకు యజమాని మరణిస్తే సమాధి దగ్గర కూర్చుని రోదిస్తుంది.. మళ్లీ ఆయన కనిపించాలని కాళ్లతో మట్టి తవ్వుతుంది ఇలాంటి కుక్కలను ఛీ అందామా.. శభాష్ అందామా.. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు మీ ప్రియ శునకాలకు వేయిస్తే నిశ్చంతగా ఉండొచ్చు వ్యాధి వస్తుందనే భయం వీడొచ్చు... సాక్షి, చీరాల అర్బన్: ర్యాబిస్ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ.. అన్ని కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుందనేని అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ర్యాబిస్ వ్యాధి రాబ్డో అనే వైరస్ వలన సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్ గాలి, నీటి ద్వారా మార్పిడి చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వలన వాటిలో ఉన్న వైరస్ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఉన్న కుక్కలు మనుషులను, పశువులపు కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. ర్యాబిస్ వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఈ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన వ్యాధి సోకి వింతగా ప్రవర్తిస్తారు. వ్యాధిని గుర్తించకపోవడం వలన కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులు, మనుషుల్లో లక్షణాలు ► ర్యాబిస్ వ్యాధి సోకడం వలన పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం ► శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం ► అరుపులు ఆవలింతలా వస్తాయి, నీటిని తీసుకోవు, పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11రోజుల్లో జరిగిపోతాయి. మనుషుల్లో... జ్వరం రావడం, కాళ్ళు పట్టుకుపోవడం, నీరు తాగలేకపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణించడం జరుగుతుంది. నివారణ చర్యలు : ►ఈ వైరస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి. ►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు మున్సిపల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాటికి వ్యాక్సినేషన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. ►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురంచి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వలన కలిగిన వ్యాధులను గురించి వివరించాలి. ►ర్యాబిస్ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. అందుబాటులో రేబీస్ వ్యాక్సిన్ ► పెంపుడు కుక్కల యజమానులు రేబిస్ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి ► జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని అన్ని ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారన్నారు. మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ప్రధానమైనది రేబిస్ వ్యాధి అని పేర్కొన్నారు. దీంతో పాటు ఆంత్రాక్స్, బ్రూసుల్లో సిస్, లెఫ్టాస్ ఫైరోసిస్ వ్యాధులు కూడా పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. అయితే కొన్నింటికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. జిల్లాలోని మొత్తం 27 ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా అన్ని పశువైద్యశాలల్లో కుక్కలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కుక్క పిల్లకు 90 రోజుల వయస్సు వచ్చేటప్పటికి మొదటి విడతగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. మూడు నెలలకు బూస్టర్ డోస్ వేయించుకోవాలని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదే రోజుకి యాంటీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రెగ్యులర్గా వ్యాక్సిన్ వేయించుకుంటే పెంపుడు కుక్కలకు వ్యాధి రాదన్నారు. అన్ని పశువైద్యశాలలతో పాటు ఒంగోలులోని సంతపేటలో ఉన్న జిల్లా పశువైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పశువైద్యశాలలో కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒంగోలు వైద్యశాలకు 800 డోసులు అందించామని వివరించారు. అదే విధంగా జిల్లాలోని ప్రధాన పశువైద్యశాలలకు ఒక్కోదానికి 100 డోసుల వంతున ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పిచ్చికుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► కుక్క కరిచిన వెంటనే గాయాన్ని 4,5సార్లు నీటిని ధారగా పోస్తూ గాయాన్ని శుభ్రంగా కడగాలి. ► టించర్ అయోడిన్తో శుభ్రంగా కడగాలి. ► ఈ వైరస్ కుక్క కరిచిన 11 రోజుల నుంచి 6 సంవత్సరాల్లోపు లక్షణాలను ప్రదర్శిస్తుంది. ► ఈ వైరస్ రక్తంలో కలవకుండా నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ► సంబంధిత వైద్యుల సూచన మేరకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. -
పేద రోగులంటే నిర్లక్ష్యమా?
సాక్షి, బలిజిపేట (విజయనగరం): వైద్యసేవల నిమిత్తం స్థానిక పీహెచ్సీకి వచ్చే రోగులంటే సిబ్బందికి లెక్కలేకుండా పోతోందని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పీహెచ్సీకి ఎక్కువగా నిరుపేదలే వస్తుంటారు. అయితే వీరిపట్ల వైద్యసిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. బలిజిపేట గొల్లవీధికి చెందిన బూర్ల భవాని శని వారం మధ్యాహ్నం కుక్కకాటుకు గురైంది. చికిత్స నిమిత్తం బలిజిపేట పీహెచ్సీకి రాగా కుక్కకాటు ఇంజక్షన్ లేదని చెప్పి టీటీ ఇంజక్షన్ చేసి పంపించేశారు. శనివారం అర్ధరాత్రి అదే గొల్లవీధికి చెందిన ఎన్ లక్ష్మణకు అదేకుక్క కాటు వేయగా స్థానికులు వెంటనే పీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు కుక్కకాటు ఇంజక్షన్ చేసి అవసరమైన చికిత్స చేశారు. మధ్యాహ్నం ఇంజక్షన్ లేదన్నారు కదా? ఇప్పుడు ఎలా వచ్చిందని వారు ప్రశ్నించగా, ఇప్పుడే దొరికిందని సిబ్బంది సమాదానం చెప్పారు. కాగా ఆదివారం ఉదయం భవాని మళ్లీ పీహెచ్సీకి ఇంజెక్షన్ కోసం వెళ్లింది. ‘ఇంజక్షన్ లేదని చెప్పాం కదా మళ్లీ ఎందుకు వచ్చావు’ అంటూ వైద్య సిబ్బంది రుసరుసలాడారు. శనివారం రాత్రి కుక్కకాటుకు గురైన లక్ష్మణరావు ఆస్పత్రికి వచ్చినపుడు ఇంజక్షన్ చేశారు కదా, ఇప్పడు లేదని ఎందువల్ల బుకాయిస్తున్నారని బాధితురాలు నిలదీయగా ‘ఆ విషయం డాక్టర్ను అడుగు’ అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాదానం చెప్పడంపై బాధితురాలు భవాని, ఆమె బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం లేని ఇంజక్షన్ రాత్రి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పేదరోగులపై వైద్య సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైద్యాధికారి మహీపాల్ను వివరణ కోరగా సోమవారం వరకు తాను సెలవులో ఉన్నానని వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
అమ్మో ‘భౌ’బోయ్...
సాక్షి, పలమనేరు : పలమనేరులో కుక్కల బెడద పెద్ద సమస్యగా మారింది. గత ప్రభుత్వం వీధికుక్కల సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగింది. వీటిని చంపేందుకు నిబంధనలు ఒప్పుకోనందున ఖచ్చితంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీలకు, మున్సిపాలిటీకి ఈ నిధులు అందక సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గతంలో కొన్ని కుక్కలను పట్టి వాటిని మదనపల్లికి తీసుకుని వెళ్లి స్టెరిలైజేషన్ చేయించి వదిలిపెట్టారు. మిగిలిన కుక్కలను పట్టించుకోలేదు. దీంతో సమస్య మళ్లి మొదటికొచ్చింది. రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్న జనం.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధుల్లో కుక్కల బెడద ఎక్కువయ్యింది. రాత్రిపూట వీధుల్లోకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా జనంపైకి వచ్చి పడుతున్నాయి. పలమనేరు పట్టణంలో గత రెండు సంవత్సరాల్లో కుక్కకాటుకు గురైన కేసులు 500 దాకా ఉన్నాయంటే వీటి బెడద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసులను సైతం ఈ కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకి రాత్రి సమయంలో ఏవైన పనులు ఉంటే వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. బైక్పై వెలుతున్న వారికి తప్పడం లేదు.. రాత్రిపూట బైక్లపై ప్రయాణిస్తున్న వారిని రోడ్లపై కాచుకున్న కుక్కలు తరముకుంటూ వెళ్లి కాటేస్తున్నాయి. కుక్కలను చూసి వేగం పెంచడంతో బైక్ అదుపుతప్పి గాయపడిన సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం రోడ్డులో నక్కపల్లి, కొలమాసనపల్లి, కూర్మాయి, మదనపల్లి రోడ్డులో కల్లుపల్లి, మబ్బువాళ్లపేట, గుడియాత్తం రోడ్డులో డిగ్రీ కళాశాల, టి.వడ్డూరు, కాలువపల్లితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీలకు విడుదల కాని నిధులు.. ఒక్కో కుక్కకు కు.ని శస్త్రచికిత్స చేయాలంటే రూ.500 దాకా ఖర్చు అవుతుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 20వేల కుక్కలకు రూ.కోటి అవసరముంది. కానీ పంచాయతీలకు కుక్కల స్టెరిలైజేషన్కోసం గత మూడు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గత సంవత్సరం ‘మిషన్ రాబిస్’ అనే పథకంలో భాగంగా 600 కుక్కలను మదనపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి పట్టణంలో వదిలిపెట్టారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులు కొనసాగి ఆ తర్వాత నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి సదరు ఏజెన్సీకి నిధులు విడుదల కాకపోవడంతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పశువులనూ వదలడం లేదు.. నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 152 పశువులు కుక్క కాటుకు గురి కాగా ఇందులో 20 దాకా మృతి చెందాయి. వీటిని సంబందిత మండలాల్లోని వెటర్నరీ ఆస్పత్రులకు తోలుకెలితే అక్కడ వైల్స్ అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటుగానే వీటిని రైతులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మొత్తం మీద ప్రభుత్వం నుంచి అటు పంచాయతీలకు, ఇటు మున్సిపాలిటీలకు పూర్తి స్థాయిలో నిధులు మంజురైనప్పుడే కుక్కల సమస్య అదపులోకి వచ్చే అవకాశం ఉంది. -
బాలుడిపై 15 కుక్కల దాడి..
సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు మండుటెండలు.. మరోవైపు వీధి కుక్కలునగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగాఉండడంతో వీధి కుక్కలు విపరీతంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై పంజా విసురుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా మంగళవారం మల్కాజిగిరిలో ఓ బాలుడిపై ఏకంగా 15 వీధి కుక్కలు దాడి చేయడం కలకలం సృష్టించింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా 43 డిగ్రీలకు పైగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలే వీధి కుక్కల వింత ప్రవర్తనకు కారణమని వెటర్నరీ వైద్యులు పేర్కొంటున్నారు. జాగ్రత్తలు అవసరం... ♦ అధిక ఎండలో పెంపుడు జంతువులు విపరీతంగా ప్రవర్తిస్తాయి. ♦ పార్కింగ్ చేసిన కార్లలో పెంపుడు జంతువులు ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ అనారోగ్యం పాలైతే పెట్ క్లినిక్స్కు తీసుకెళ్లండి. అవసరమైన మేర వ్యాక్సిన్లు ఇప్పించండి. ♦ ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు అవి ఎండకు తిరగకుండా చూడాలి. ♦ ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిగా ఎండ తగ్గిన తర్వాతే వాటితో వాకింగ్కు వెళ్లండి. ♦ వేసవిలో వాటికి పెట్ డాక్టర్స్ సూచించిన మేరకు సమపాళ్లలో ప్రత్యేక ఆహారం అందించాలి. ♦ పెట్స్ను ఉంచే ప్రదేశం చల్లగా ఉండేలా చూసుకోవాలి. గోనె సంచులతో రక్షణ కల్పించాలి. వడగాడ్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ప్రతిరోజు 20–25 నిమిషాల పాటు పెట్స్పై నీటిని చల్లే ఏర్పాట్లు చేయండి. ♦ క్లోరిన్ కలిపిన నీటిలో పెట్స్ అధిక సమయం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ పెట్ తరుచూ సొల్లు కార్చడం, శ్వాస ఎక్కువగా తీసుకుంటూ శబ్దం చేయడం, గుండె రేటు పెరుగుతుండటం, నాలుక ఎరుపు రంగులోకి రావడం, టెంపరేచర్ 105–106 వరకు ఉండటం.. లాంటివి కనిపిస్తే ట్రీట్మెంట్ చేయించాలి. ♦ ఇంటి వద్ద ఐస్ప్యాక్ ఉంచుకోవాలి. ఐస్ప్యాక్ను పొట్టపై పెడితే చాలా వరకు టెంపరేచర్ సులభంగా పోతుంది. ♦ సమ్మర్లో పెట్స్ ‘పార్వో’కి గురవుతాయి. ‘పార్వో’ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది సోకితే వాంతులు, మోషన్స్కు గురవుతాయి. దీంతో డీహైడ్రేషన్ అవుతుంది. టిక్స్ కారణంగా టిక్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులను సంప్రదించాలి. ♦ చిన్న పెట్స్, పెద్ద పెట్స్కు శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిపై యజమానులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పగ్ బ్రీడ్ పెట్స్ శ్వాసనాళాలు చాలా చిన్నవిగా ఉంటాయి. దీనిద్వారా టెంపరేచర్ని అవి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. సెయింట్ బెర్నోడ్ బ్రీడ్ పెట్ చాలా పెద్దగా ఉంటుంది. దీని శ్వాసనాళాలు పెద్దవిగా ఉండటం కారణంగా టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకోలేవు. ♦ పెట్స్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సమ్మర్ హీట్ను తట్టుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో 25–30 డిగ్రీల మేర టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి. అవకాశం ఉంటే ఏసీ లేదా కూలర్ వెసులుబాటు కల్పించాలి. ఈ రెండూ లేకపోతే ఫ్యాన్ గాలి నిరంతరం వచ్చేలా చూసుకోవాలి. కిటికీలను తెరిచి ఉంచాలి. అవే కిటికీలకు కటన్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ♦ కమర్షియల్ ఫుడ్గా పిలిచే ‘క్యాలిబ్రా, రాయల్కేన్, పెడిగ్రీ’ వంటివి పెట్టొచ్చు. పెట్ బరువుకు తగ్గట్టుగా ఫుడ్ని పెట్టాలి. తక్కువ, చల్లని సమయాల్లో పెడితే అవి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎండ ప్రభావం ఎక్కువ... వీధి కుక్కలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తదితర కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. వేసవి సెలవుల నేపథ్యంలో అవి అధికంగా సంచరించే ప్రాంతాల్లో చిన్నారులు ఆడుకునే సమయంలో పిచ్చిగా ప్రవర్తిస్తూ కాటేస్తున్నాయి. అసలే కుక్కలకు వేట సహజ లక్షణం. ఆ లక్షణమే వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి కారణమవుతోంది. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదవుతుండడానికి కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండా కుళాయి నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. లేదంటే రేబీస్ సోకి చనిపోయే ప్రమాదం ఉంది. వీధి కుక్కల బెడద అధికంగా ఉంటే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయాలి. – స్వాతిరెడ్డి, వెటర్నరీ డాక్టర్ చిన్నారిపై 15 కుక్కల దాడి మౌలాలి: ఓ చిన్నారిపై 15 వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి మౌలాలిలో జరిగింది. వివరాలు... మౌలాలి గుట్టపైనున్న దర్గాలో రెండు రోజులుగా అజ్రత్ అలీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో అఖిల్ అనే ఆరేళ్ల చిన్నారి కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అయితే అఖిల్ అక్కడ ఆడుకుంటున్న సమయంలో 15 వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అఖిల్ను కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనరల్ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న అఖిల్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి వెటర్నరీ విభాగం అధికారులు మౌలాలి గుట్టను సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. మున్సిపల్ వెటర్నరీ అధికారి శ్రీనివాస్రెడ్డి అక్కడి కుక్కలను వెటర్నరీ కేంద్రానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు అమినుద్దీన్, కాంగ్రెస్ నాయకులు వంశీముదిరాజ్, షరీఫ్, కాలనీ వాసులు అక్కడికొచ్చి అధికారులను నిలదీశారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించి, రూ.5లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. ఎన్జీఆర్ఐలో వీధి కుక్కల వీరంగం ఉప్పల్: ఉప్పల్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ఆవరణలో ఈ నెల 24న వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. వీటి దాడిలో దాదాపు 10 మంది గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడికి కన్నుపై గాయమవగా, మరో మహిళ రాధా (58) తీవ్ర గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. 24న ఎన్జీఆర్ఐ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఓ శుభకార్యం జరగ్గా.. అక్కడికి వచ్చిన వారిపై కుక్కలు దాడి చేశాయి. కాలనీలో కుక్కల బెడద ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. నాలుగు కళేబరాలు లభ్యం... కుక్కలు దాడులు చేస్తున్నాయన్న నెపంతో ఎన్జీఆర్ క్యాంపస్లో దాదాపు 10కి పైగా కుక్కలను కొట్టి చంపారని ఆరోపిస్తూ పీపుల్స్ ఫర్ పెట్, యానిమల్స్ సీఈవో జోషి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ వెటర్నరీ డా.కృష్ణ ఆధ్వర్యంలో ఎన్జీఆర్ఐ ప్రాంగణంలో మంగళవారం పరిశీలించగా... నాలుగు కుక్కల కళేబరాలు లభ్యమయ్యాయని డాక్టర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.