deposits
-
రుణాల్లో 13 శాతం వృద్ధి; ఇండియా రేటింగ్స్ అంచనా
ముంబై: బ్యాంక్ డిపాజిట్ రేట్లు మరింత పెరుగుతాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో బ్యాంక్ రుణాల్లో 13 శాతం వృద్ధి నమోదవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. గత అంచనా 10 శాతాన్ని పెంచింది. ‘‘ఆగస్ట్ 26 నాటికి బ్యాకింగ్ వ్యవస్థలో రుణ వృద్ధి 15.5 శాతంగా ఉంది. డిపాజిట్లలో వృద్ధి 9.5 శాతంగా ఉంది. రుణ డిమాండ్ను అందుకునేందుకు బ్యాంక్లు మరిన్ని డిపాజిట్ల సమీకరణకు ప్రయత్నిస్తాయి. దీంతో రుణదాతల మధ్య డిపాజిట్ల కోసం పోటీ పెరగనుంది. డిపాజిట్ల వృద్ధి కంటే రుణాల డిమాండ్ అధిగమించనుంది’’అని రేటింగ్ ఏజెన్సీ తన తాజా నివేదికలో వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంక్లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్లు మరిన్ని డిపాజిట్లను సమీకరిస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్ రంగలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 2023 మార్చి నాటికి 6.8 శాతానికి పెరుగుతాయని అంచనా వేసింది. 2021–22 నాటికి జీఎన్పీఏలు 6.1 శాతానికి తగ్గడాన్ని ప్రస్తావించింది. చిన్న వ్యాపార సంస్థల రుణ విభాగంలో ఒత్తిళ్లు ఉన్నట్టు తెలిపింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నందున నికర వడ్డీ మార్జిన్లు కూడా మెరుగుపడతాయని పేర్కొంది. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
ఆర్బీఐ వద్ద రూ.48వేల కోట్లు.. పది సంవత్సరాల నుంచి ఎవరూరారే!
ముంబై: బ్యాంకింగ్లో క్లెయిమ్ చేయని నిధుల మొత్తం భారీగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,264 కోట్లుగా ఉన్న ఈ నిధులు ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.48,262 కోట్లకు ఎగశాయి. ఈ నిధుల్లో అధిక మొత్తం తెలుగురాష్ట్రాలుసహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్లు జాబితాలో ఉన్న మిగిలిన ప్రధాన రాష్ట్రాలు. దీనితో ఈ అంశంపై ఆయా రాష్ట్రాల్లో విస్తృత ప్రాతిపదికన ప్రచారం నిర్వహించి, క్లెయిమ్ చేయని వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు బ్యాంకింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్లెయిమ్ చేయని నిధులు అంటే.. సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, 10 సంవత్సరాల పాటు ఎవ్వరూ నిర్వహించని సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలలోని నిల్వలు లేదా మెచ్యూరిటీ తేదీ నుండి 10 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను ‘ క్లెయిమ్ చేయని డిపాజిట్లు‘గా వర్గీకరిస్తారు. ఈ తరహా డబ్బును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్’కి బదిలీ చేస్తాయి. అయితే, డిపాజిటర్లు తమ డబ్బు ను వడ్డీతో పాటు బ్యాంక్ వద్ద ఎప్పటికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకులు, అలాగే ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు చేపట్టినప్పటికీ, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం పెరుగుతున్న ధోరణి కనబడ్డం గమనించాల్సిన అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కారణాలు ఏమిటి? క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం ప్రధానంగా సేవింగ్స్, కరెంట్ ఖాతాలను మూసివేయకపోవడం వల్ల పెరుగుతోంది. డిపాజిటర్లు కొద్దో గొప్పో బ్యాంక్ ఖాతాల్లో వదిలివేసి ఆపరేట్ చేయకూడదనుకోవడం లేదా మెచ్యూర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం బ్యాంకులకు రిడెంప్షన్ క్లెయిమ్లను సమర్పించకపోవడం వంటి అంశాలు ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కొన్ని సందర్భాల్లో మరణించిన డిపాజిటర్లకు సంబంధించిన ఖాతాల విషయంలో నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు డబ్బును వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. క్లెయిమ్ చేయడంలో సహాయపడటం తమ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. చదవండి: EV: ఈవీ జోరు.. ముందుంది మంచి కాలం.. ఏకంగా 72 వేల కోట్ల వ్యాపారం! -
ఏడాదికి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే..
సాక్షి, ముంబై: అక్రమ నగదు లావాదేవీలకు అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 20 లక్షలకుమంచి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి. 2022, మే 10 నాటి నోటిఫికేషన్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటా) రూపొందించిన కొత్త నియమాలు, నిబంధనల సవరించింది. ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి. ఆర్థికం స్కాంలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం వార్షిక నగదు పరిమితి నిబంధనలను సవరించింది. ఇప్పటికి వరకు రోజుకు రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను అందించే నిబంధన ఉంది. ఇకపై ఏడాదికి 20 లక్షలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ నెంబరు, ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ పాన్ నంబర్ లేకుంటే. ఆ లావాదేవీ చేయడానికి వారం ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రశీదును బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. సన్నిహిత కుటుంబ సభ్యులనుంచి తప్ప రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదును స్వీకరించడం కూడా నిషేధం. నిబంధనలకు విరుద్థంగా పరిమితికి మించి నగదు చెల్లించినా, స్వీకరించినా లావాదేవీ మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీలు , ఇతర డబ్బు నేరాల ప్రమాదాన్ని తగ్గించేలా ఆదాయపు పన్ను శాఖ, ఇతర కేంద్రం కసరత్తులో భాగంగా నిబంధనలను సవరిస్తోన్న సంగతి తెలిసిందే. -
యూనియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెంపు
ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అన్ని కాలపరిమితులకు సంబంధించి డిపాజిట్లపై వడ్డీరేట్లను శుక్రవారం పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లకు పెంపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం దేశీయ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్ రేటు(రూ.2 కోట్లు లోపు)పై 46–90 రోజుల మధ్య 55 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 3.50 శాతం నుంచి 4.05 శాతానికి చేరింది. ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను మే, జూన్ నెలల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. -
‘సొమ్ము’సిల్లుతున్న విశ్రాంత ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: వెంకటయ్య ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి.. పదేళ్ల కింద పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని వడ్డీ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేశారు. ఇప్పుడు వెంకటయ్య దంపతులు ఆ డిపాజిట్పై వచ్చే వడ్డీతోనే రోజులు గడుపుతున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు వడ్డీ రావటం ఆగింది. సీసీఎస్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే, ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి 7 శాతం చొప్పున మినహాయించి సీసీఎస్కు జమ చేయాల్సిన మొత్తం సరిగా రావటం లేదన్నారు. అందుకే వడ్డీ చెల్లించేందుకు డబ్బు లేదన్న సమాధానం వచ్చింది. తన డిపాజిట్ మొత్తం తిరిగి ఇమ్మంటే.. ఆర్టీసీ బకాయి పడ్డ మొత్తం చెల్లిస్తేగాని ఇవ్వలేమని చెప్పడంతో ప్రతినెలా నెట్టుకొచ్చేది ఎలా అన్న ఆందోళనలో పడిపోయారు. ఇది ఒక వెంకటయ్య దుస్థితే కాదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొంది తమ రిటైర్మెంట్ సాయం మొత్తాన్ని సీసీఎస్లో దాచుకున్న దాదాపు 8 వేల మంది ఆవేదన. ఇందులో దాదాపు 4వేల మంది సీసీఎస్ అందించే వడ్డీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆందోళనలో ఉన్న ఈ ఉద్యోగులు రోడ్డెక్కబోతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ అందించే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ సీసీఎస్ నుంచి బస్భవన్ వరకు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. రావాల్సిన రూ.25 కోట్లు రాకపోవడంతో.. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత.. నెలనెలా సీసీఎస్లో జమ చేసుకున్న మొత్తంతో పాటు వడ్డీ పొందుతారు. దీన్ని చాలా మంది సీసీఎస్లోనే డిపాజిట్ చేసి వడ్డీ పొందుతుంటారు. దాన్నే పింఛన్లా భావిస్తుంటారు. ఇలా ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల మొత్తం సీసీఎస్లో రూ.250 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతంలోంచి మినహాయించే 7 శాతం మొత్తం నెలకు రూ.25 కోట్లవుతుంది. దీన్ని ప్రతినెలా ఆర్టీసీ సీసీఎస్కు సరిగా చెల్లించలేకపోతోంది. దీంతో డిపాజిట్లపై వడ్డీగా చెల్లించాల్సిన నెలవారీ మొత్తం రూ.2.5 కోట్లు చెల్లించడం సీసీఎస్కు కష్టంగా మారి.. నిలిపివేసింది. విశ్రాంత జీవితంలో చీకూచింతా లేకుండా గడపాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఏడాది క్రితం ఇలాంటి సమస్యే ఏర్పడి కొన్ని నెలల పాటు వీరికి వడ్డీ అందలేదు. సజ్జనార్ ఎండీగా వచ్చిన తర్వాత సమస్య పరిష్కారమైంది. మళ్లీ ఇప్పుడు ఎదురుకావటంతో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
రూ.110 కోట్ల ‘మైత్రీ ప్లాంటేషన్స్’ ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి మదుపరులను మోసగించిన కేసులో మైత్రీ ప్లాంటేషన్స్–హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ.110 కోట్ల విలువైన 210 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఆ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీలైన శ్రీనక్షత్ర బిల్డర్స్–డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైత్రీ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థల డైరెక్టర్లు లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రిరెడ్డి, లక్కు మాధవరెడ్డి, కొలికపూడి బ్రహ్మారెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2013లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన 210 స్థిరాస్తుల్లో ఆంధ్రప్రదేశ్లో 196, తెలంగాణలో 13, కర్ణాటకలో ఒకటి ఉన్నాయి. మైత్రీ ప్లాంటేషన్స్–హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లక్కు కొండారెడ్డి, ఇతరులు నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి డిపాజిట్లు సేకరించారని ఏపీ పోలీసులు 2013లో 12 ఎఫ్ఐఆర్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టడంతో కుంభకోణం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. లక్కు కొండారెడ్డి, తదితరులు అధిక కమీషన్లు ఎరజూపి ఏజెంట్లను నియమించుకుని మరీ డిపాజిట్ల సేకరణ చేపట్టారు. మదుపరులకు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి ఏకంగా రూ.288.42 కోట్లను డిపాజిట్లుగా సేకరించారు. అనంతరం ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా తమ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి మళ్లించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఈ కేసులో ఆస్తులను జప్తు చేసిన ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. -
‘‘పాన్’’ కంపల్సరీ.. కాదంటే కుదరదు..
రాను రాను పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేకపోయినా, వాడకపోయినా, పేర్కొనకపోయినా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నోసార్లు మనం ప్రస్తావించాం. ఏయే సందర్భాల్లో పాన్ని తెలియజేయాలో .. ఇప్పుడు అదే దిశలో ఆదాయపు పన్ను శాఖ మరో పెద్ద ముందడుగు వేసింది. మే 10వ తేదీన ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో పేర్కొన్న నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయి. ఆ మార్పులు, చేర్పుల సారాంశం ఏమిటంటే .. కొన్ని నిర్దేశిత వ్యవహారాలకు నిర్దిష్ట పరిమితులను పొందుపర్చారు. ఆ లావాదేవీలు చేసే ముందు విధిగా పాన్ లేదా ఆధార్ గురించి ప్రస్తావించాలి. ఈ లావాదేవీలు ఏ సంస్థతో జరుపుతారో ఆ సంస్థ పాన్ / ఆధార్తో పాటు ఆ వ్యక్తి యొక్క ‘‘వివరాలు’’ (ఉదాహరణకు వయస్సు, లింగభేదం, చదువు, జాతీయత, మతం మొదలైనవి) అడిగే అవకాశం ఉంది. డెమోగ్రాఫిక్ సమాచారంలో అన్ని వివరాలు అడగవచ్చు. బయోమెట్రిక్ సమాచారం కూడా అడుగుతారు. అంటే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు ఏమిటంటే.. - ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా ఇతర డిపాజిట్లకు సంబంధించి ఒకటి లేదా ఎన్ని బ్యాంకు ఖాతాల్లోనైనా లేదా పోస్టాఫీసులో రూ. 20,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే, డిపాజిట్దారు పాన్/ఆధార్ సంఖ్య వేయాలి. పుచ్చుకున్న బ్యాంకు/పోస్టాఫీసు ముందుగా పేర్కొన్నట్లు ఆదాయపు పన్ను శాఖలోని ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారాన్ని అందించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక బ్రాంచ్ కాదు.. ఒక బ్యాంకు కాదు అన్ని బ్యాంకుల్లోనూ ఎక్కడ డిపాజిట్ చేసినా ఈ రూలు వర్తిస్తుంది. - ఇదే మాదిరిగా బ్యాంకు నుంచి, పోస్టాఫీస్ నుంచి మనం చేసే విత్డ్రాయల్స్, అకౌంట్ నుంచి .. ఒకసారి కాదు అనేక దఫాలుగా ఒక ఆర్థిక సంవత్సరంలో తీసినది, డెబిట్ అయినది, నగదు విత్డ్రాయల్ కాకుండా చెక్, బదిలీ ద్వారా విత్డ్రా చేసినది ఇలాంటి వాటన్నింటికీ కలిపి మొత్తం పరిమితి రూ. 20,00,000గాఉంటుంది. ఇటువంటి సందర్భంలోనూ అవే రూల్సు వర్తిస్తాయి. - బ్యాంకులో కరెంటు అకౌంటు తెరిచినా, క్యాష్ క్రెడిట్ అకౌంటు తెరిచినా, అలాగే పోస్టాఫీసులో కరెంటు ఖాతా తెరిచినా ఎటువంటి పరిమితులు లేవు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. తగిన జాగ్రత్త వహించి అడుగేయండి. ఎన్ని నిబంధనలు ఎంత కఠినంగా అమలుపర్చినా మీ డిపాజిట్లకు సరైన ‘‘సోర్స్’’ ఉంటే .. సరిలేరు మీకెవ్వరు. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙
సాక్షి, హైదరాబాద్: కరక్కాయ పొడి విక్రయం పేరిట సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించి, కుచ్చుటోపీ పెట్టిన సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ (ఓపీసీ)కు చెందిన మినీ బస్సు వేలానికి సైబరాబాద్ కాంపిటెంట్ అథారిటీ (సీసీఏ) మరోసారి సిద్ధమైంది. ఈసారి 40 సీట్ల సామర్థ్యం ఉన్న అశోక్ లేల్యాండ్ బస్సు (ఏపీ16 టీసీ 4691) రిజర్వ్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తొలిసారి బస్సు వేలం నిర్వహించినప్పుడు రిజర్వ్ ధర రూ.5 లక్షలుగా, రెండోసారి ఏప్రిల్ 20న ధర రూ.4.50 లక్షలుగా నిర్ధారించారు. అయితే రెండు సందర్భాల్లోనూ బిడ్డింగ్లో ఎవరూ పాల్గొనకపోవటం గమనార్హం. దీంతో మూడోసారి బస్సు వేలం నిర్వహించేందుకు సీసీఏ ప్రతినిధులు సిద్ధమయ్యారు. వచ్చే నెల 17, మధ్యాహ్నం 1 గంటలోగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), డాక్యుమెంట్లను సమర్పించాలి. 18న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్లైన్లో వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ పూర్తయ్యాక వచ్చిన నగదును దామాషా ప్రాతిపదికన బాధితులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. ఓపీసీ కంపెనీ కరక్కాయ పొడి చేస్తే కమీషన్ ఇస్తామని నమ్మించి 425 మంది నుంచి రూ.3 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. ఈ కేసులో నిందితులు మాటూరి దేవ్రాజ్ అనిల్ కుమార్ అలియాస్ రాజన్, ముప్పాల మల్లికార్జున, వడ్డె వెంకయ్య నాయుడు అలియాస్ వెంకయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.59.5 లక్షల నగదు, 80 గ్రాముల బంగారం ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకు న్నారు. గోల్డ్, బైక్ వేలం పూర్త యిన విషయం తెలిసిందే. (చదవండి: నూకల పరిహారం ఎంతిద్దాం? ) -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్ మాల్
-
రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు శనివారం కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47% అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 66.69% అంటే 28.70 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివేనని ఆర్థిక శాఖ పేర్కొంది. 43.04 కోట్ల ఖాతాల్లో 85.6% అంటే, 36.86 కోట్ల ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయి. వీటిలో సరాసరి డిపాజిట్ మొత్తం రూ.3,398గా ఉంది. అంతేకాదు, ఈ ఖాతాల్లో సరాసరి డిపాజిట్ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు తెలిపింది. జన్ధన్ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందని పీఎంజేడీఐ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పారదర్శకతను పెంచిన ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని తెలిపారు. చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
ఫిక్స్డ్ డిపాజిట్లను వదలని కరోనా
కరోనా తగ్గిపోయినా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇంకో సమస్యను కూడా కరోనా మోసుకొచ్చింది. అదే అప్పులు, ఆర్థిక సమస్యలు. ఖరీదైన కరోనా వైద్యం కోసం అందినకాడల్లా అప్పులు చేశారు. బంగారం లాంటి వస్తువులు తాకట్టు పెట్టారు. ఆస్తులు అమ్ముకున్నారు. దేశవ్యాప్తంగా ఏకంగా 5.5 కోట్ల మంది ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి పేదలుగా మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 159 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు భారీగా తగ్గిపోయాయి. ఫిక్స్డ్పై కోవిడ్ ఎఫెక్ట్ ఈ ఏడాది జనవరి నుంచి మార్చి (గత ఆర్థిక సంవత్సరం 2020–2021) త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ ఈ డేటాను విడుదల చేసింది. 2018 ఏప్రిల్ – జూన్ తో 53 జిల్లాల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లు తగ్గిపోతే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు మూడు రెట్టు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 22 జిల్లాల్లోనే ఎఫ్డీలు తగ్గడం గమనార్హం. డిపాజిట్లు భారీగా తగ్గిన జిల్లాల్లో యూపీవే 23 ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లో 21, కర్ణాటక 16, మహారాష్ట్రలో 11 జిల్లాల్లో జనాలు ఫిక్స్ డ్ డిపాజిట్లను డ్రా చేసుకున్నారు. అయితే, అత్యధికంగా డిపాజిట్లను డ్రా చేసిన జిల్లాగా తమిళనాడులోని నాగపట్టణం నిలిచింది. అక్కడ 24 శాతం డిపాజిట్లను జనం బ్యాంకుల నుంచి తీసేసుకున్నారు మనదగ్గర ఆర్బీఐ లెక్కల ప్రకారం భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు తగ్గిపోయిన జిల్లాలు తెలంగాణలోని 4 , ఆంధ్రప్రదేశ్ లోని 2 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం రెండు వరుస త్రైమాసికాల్లో 15 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు తగ్గాయి. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లూ ఉన్నాయి. ఇందులోనూ భద్రాద్రి, జనగామ, కరీంనగర్ సహా దేశంలోని ఏడు జిల్లాల్లో వరుసగా మూడు త్రైమాసికాల పాటు డిపాజిట్లు తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది. డబ్బులు డ్రా కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక అవసరాలు పెరగడంతో డబ్బును బ్యాంకు నుంచి ప్రజలు ఉపసంహరించుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2020 మార్చి 13 నుంచి 2021 మే 21 మధ్య జనం వద్ద ఉన్న నగదులో 5.54 లక్షల కోట్ల పెరుగుదల నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనం వద్ద చెలామణిలో ఉన్న నగదు రూ.28.62 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో సగానికి పైగా నగదు కేవలం కోవిడ్ వల్లనే ప్రజలు ఖర్చు చేయాల్సి వచ్చింది. చదవండి : Covid Crisis: రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం -
స్పెక్ట్రం బిడ్డింగ్కు రూ. 13,475 కోట్ల డిపాజిట్
న్యూఢిల్లీ: రాబోయే విడత స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు మొత్తం రూ. 13,475 కోట్ల డిపాజిట్ (ఈఎండీ) సమర్పించాయి. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 10,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ ఇచ్చాయి. టెలికం శాఖ (డాట్) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం దీని ఆధారంగానే నిర్దిష్ట పరిమాణం స్పెక్ట్రం కోసం పోటీపడేందుకు అనుమతిస్తారు. మొత్తం అన్ని స్పెక్ట్రం బ్లాకుల కోసం బిడ్ చేయాలంటే రూ. 48,141 కోట్ల ఈఎండీ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వేలంలో పెద్దయెత్తున స్పెక్ట్రం అమ్ముడు కాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు... కళకళ!
ముంబై: తానిచ్చే రుణాలపై రిటర్న్స్, తన వద్ద డిపాజిట్లపై చెల్లించే వడ్డీల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. రుణ నాణ్యత విషయంలోనూ వాటికి అవే సాటిగా కొనసాగుతున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ– కేర్ రేటింగ్స్ విడుదల చేసిన ఒక విశ్లేషణాత్మక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... -తానిచ్చే రుణాలపై 19.87 శాతం రిటర్న్స్ను చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొందుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఈ రేటు 8.16 శాతంగా ఉంది. ప్రైవేటు రంగ బ్యాంకులు 10.10 శాతం రిటర్న్స్ పొందుతుండగా, ఫారిన్ బ్యాంకింగ్కు 8.45 శాతం వడ్డీ వస్తోంది. -నిధుల సమీకరణ వ్యయం మాత్రం చిన్న ఫైనాన్స్ బ్యాంకుల విషయంలో అత్యధికంగా 8.66 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై నిధుల సమీకరణ భారం 4.92 శాతంగా ఉంటే, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల విషయంలో ఈ వడ్డీరేట్లు వరుసగా 5.41 శాతం, 3.73 శాతాలుగా ఉన్నాయి. -ఒక్క డిపాజిట్లపై ఎస్ఎఫ్బీలు చెల్లించే వడ్డీ 8.20 శాతం. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.96 శాతం వడ్డీని చెల్లిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 5.26 శాతం ఇస్తున్నాయి. ఫారిన్ బ్యాంకుల విషయంలో మరీ తక్కువగా 3.65 శాతంగా ఉంది. -ఒక్క అసెట్స్ చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులకు రిటర్న్స్ మైనస్ 0.23 శాతంగా ఉంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఇది 0.51 శాతం ఉంటే, ఎస్ఎఫ్బీలు మాత్రం అత్యధికంగా 1.70 శాతం రిటరŠస్న్ ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీ రుణదాతలు 1.55 శాతం రిటర్న్స్ పొందుతున్నారు. నగదు, ప్రభుత్వ బాండ్లు, తనఖాలు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, ఇంటర్ బ్యాంక్ రుణాలు అసెట్స్ విభాగం లోకి వస్తాయి. -ఈక్విటీ ఆదాయాలపై చెల్లింపుల విషయానికి వస్తే, 15 శాతంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మైనస్ 4.16 శాతంతో ఉంటే, ప్రైవేటు బ్యాంకింగ్ ఆదాయం 3.30 శాతంగా ఉంది. ఫారిన్స్ బ్యాంకింగ్ తమ ఇన్వెస్టర్లకు 8.76 శాతం చెల్లిస్తోంది. -చిన్న ఫైనాన్స్ బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ల విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8.34 శాతం. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శాతాలు వరుసగా 2.27 శాతం, 3.42 శాతం, 3.26 శాతాలుగా ఉన్నాయి. -బ్యాంకింగ్ ప్రమాణాల విషయంలోనూ ఇవి మెరుగైన స్థానంలో ఉన్నాయి. క్యాపిటల్ అడిక్వెసీ రేషియో 20.2 శాతంగా ఉంటే, ఎన్పీఏల భారం 1.9 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్ బ్యాంకుల విషయంలో క్యాపిటల్ అడిక్వెసీ వరుసగా 12.9 శాతం, 16.5 శాతం, 17.7 శాతంగా ఉన్నాయి. ఇక ఎన్పీఏల విషయంలో ఈ రేట్లు వరుసగా 10.3 శాతం, 5.5 శాతం, 2.3 శాతాలుగా ఉన్నాయి. 10 ఎస్ఎఫ్బీల క్రియాశీలక పాత్ర 2016 తరువాత 10 చిన్న ఫైనాన్స్ బ్యాంకులు దేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. రుణ లభ్యత సరిగా లేని రంగాలకు అలాగే చిన్న వ్యాపారాలు, రైతులకు సకాలంలో తగిన రుణ సౌలభ్యత కల్పించడం లక్ష్యంగా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ 10 ఎస్ఎఫ్బీల మొత్తం బ్యాలెన్స్ షీట్ 2019–20 ఆర్థిక సంవత్సరానికి 1.33 లక్షల కోట్లు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో వీటి వాటా 0.7 శాతం. ఈ విషయంలో ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 58 శాతం వృద్ధి రేటు నమోదుకావడం గమనార్హం. మొత్తం బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లో వృద్ధి 8.5 శాతం మాత్రమే. ఇక మొత్తం 1.33 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్లో రూ.5,151 కోట్లు మూలధనం. రూ.11,047 కోట్లు నిల్వలు. డిపాజిట్లు రూ.82,488 కోట్లు. వీటిలో టర్మ్ డిపాజిట్ల విలువ రూ.69,823 కోట్లు. రిటర్న్స్, చెల్లించే వడ్డీల విషయంలో అధిక ధర ఎందుకు ఉందన్న అంశాన్ని కూడా నివేదిక వివరించింది. ఈ బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో 60 శాతం ఏడాదికన్నా తక్కువ కాలానికి సంబంధించినవే. ఒకటి నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్లు 37.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇందుకు సంబంధించి శాతాలు వరుసగా 40.4 శాతం, 22.8 శాతాలుగా ఉన్నాయి. ఇక ఇచ్చే రుణాల విషయంలో ఏడాది కన్నా తక్కువ కాలానికి సంబంధించిన రుణాలు 38.1 శాతం. 1 నుంచి మూడేళ్ల మధ్య రుణాలు 42.4 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇవి వరుసగా 25.2 శాతం, 40.3 శాతాలుగా ఉన్నాయి. -
డిపాజిటర్ల సొమ్ము భద్రం!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) తమ ఖాతాదారులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ టీఎన్ మనోహరన్ తెలిపారు. ఖాతాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన గడువులోగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీన ప్రక్రియ పూర్తి చేయగలమని మనోహరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్వీబీ వద్ద రూ. 20,000 కోట్ల మేర డిపాజిట్లు ఉండగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 17,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా భారీ చెల్లింపులు చెల్లించకుండా నెల రోజుల పాటు (డిసెంబర్ 16 దాకా) బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఖాతాదారులు రూ. 25,000కు మించి విత్డ్రా చేసుకోవడానికి లేదు. డీబీఎస్లో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించి నవంబర్ 20న ఆర్బీఐ తుది ప్రకటన చేయనుంది. దీని ప్రకారం ఎల్వీబీలో డీబీఎస్ సుమారు రూ. 2,500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. డీబీఎస్కు సానుకూలం: మూడీస్ సింగపూర్కి చెందిన డీబీఎస్ బ్యాంక్.. భారత్లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎల్వీబీ విలీనం ఉపయోగపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్య స్థాయి కస్టమర్లను చేర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని వివరించింది. ‘విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50–70 శాతం దాకా పెరగవచ్చు‘ అని అంచనా వేసింది. డీబీఎస్ ఇండియాకు 27 శాఖలు ఉండగా విలీనంతో ఎల్వీబీకి చెందిన సుమారు 500 పైచిలుకు శాఖలు కూడా జత కానున్నాయి. డీబీఎస్కు కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావడంతో, ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఎల్వీబీ డీల్ ఉండగలదని మూడీస్ తెలిపింది. ‘పటిష్టమైన మాతృసంస్థ దన్ను ఉంటుంది కాబట్టి డీబీఎస్లో విలీనం అంశం ఎల్వీబీ డిపాజిటర్లకు సానుకూలంగా ఉంటుంది‘ అని పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను చూపే విధంగా .. ఎల్వీబీని గట్టెక్కించే ప్రక్రియ ఉందని తెలిపింది. మారటోరియం కారణంగా డిపాజిటర్లు, రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల బ్యాంకు తాత్కాలికంగా దివాలా తీసినట్లే అవుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం విధించే దాకా పరిస్థితి వెళ్లకుండా సమస్యాత్మక బ్యాంకులను చక్కదిద్దేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇటీవలే పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ ఇలా జరగడం గమనార్హమని వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలతో బుధవారం బీఎస్ఈలో ఎల్వీబీ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్ను తాకి రూ. 12.40 వద్ద క్లోజయ్యింది. విదేశీ బ్యాంకులో విలీనం వద్దు: ఏఐబీవోసీ డిమాండ్ విదేశీ బ్యాంకులో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్ల యూనియన్ ఏఐబీవోసీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన చూస్తుంటే విదేశీ బ్యాంకులకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీబీఎస్లో ఎల్వీబీని విలీనం చేసే విషయంపై పునరాలోచన చేయాలంటూ ఆర్బీఐకి ఏఐబీవోసీ విజ్ఞప్తి చేసింది. పాతతరం బ్యాంకులు.. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లాగానే దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో ముందు నుంచీ సేవలు అందిస్తున్నాయని ఏఐబీవోసీ ప్రెసిడెంట్ సునీల్కుమార్ తెలిపారు. -
ఆర్బీఐ రివ్యూ, ఎస్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్ఆర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్లో ఎస్బీఐ ప్రకటించిన వరుసగా తొమ్మిదవ కోత ఇది. ఈ తగ్గింపుతో, ఫండ్-బేస్డ్ రేట్ (ఎంసిఎల్ఆర్) ఒక సంవత్సరం ఉపాంత వ్యయం 7.90 శాతం నుండి సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటన తెలిపింది. ఆర్బీఐ రెపో రేటును 5.15 శాతం, రివర్స్రెపోను 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే బ్యాంకుల రుణాల రేట్లను తగ్గించేందుకు వీలుగా రూ. లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ను ప్రకటించడంతో ఈ ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మిగులు ద్రవ్యత దృష్ట్యా, టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత విధించింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను రిటైల్ విభాగంలో 10-50 బీపీఎస్ పాయింట్లు, బల్క్ విభాగంలో 25-50 బిపిఎస్ తగ్గించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల కన్నా తక్కువ), బల్క్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) పై సవరించిన వడ్డీ రేటున ఫిబ్రవరి 10నుంచి అమలవుతుందని తెలిపింది. చదవండి : రియల్టీకి భారీ రిలీఫ్: వడ్డీరేట్లు యథాతథం మారని రేట్లు.. వృద్ధికి చర్యలు -
డీహెచ్ఎఫ్ఎల్ 4,800 కోట్ల డిపాజిట్ల క్లెయిమ్లకు ఆమోదం
ముంబై: నిధుల సంక్షోభంలో ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) ఇప్పటి వరకు రూ.4,800 కోట్ల డిపాజిట్ల చెల్లింపుల క్లెయిమ్లను ఆమోదించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సమారు 55,000 మంది డిపాజిట్ హోల్డర్లు రూ.5,200 కోట్ల డిపాజిట్లకు సంబంధించి క్లెయిమ్లను డిసెంబర్ 17 నాటికి దాఖలు చేయగా.. రూ.4,800 కోట్ల క్లెయిమ్లను అనుమతించినట్టు వెల్లడించాయి. వీరిలో రిటైలర్లతోపాటు యూపీ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు సైతం ఉన్నారు. వీటితో పాటు అన్ని రకాల క్లెయిమ్లు (రుణదాతలు సహా) కలపి రూ.93,105 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిందే..
ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీవోఎం)ను ఏడాదిలోపు ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. నిర్వహణను పర్యవేక్షించేందుకు నిపుణుల కలయికతో బీవోఎం ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. డైరెక్టర్ల బోర్డుకు ఇది అదనం. పీఎంసీ బ్యాంకు సంక్షోభం కారణంగా 9 లక్షల మంది డిపాజిటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో తదనంతరం కోపరేటివ్ బ్యాంకుల నిర్వహణకు సంబంధించి ఆర్బీఐ పలు దిద్దుబాటు చర్యలను అమల్లోకి తీసుకొస్తోంది. ‘‘అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు ప్రజల డిపాజిట్లను స్వీకరిస్తున్నందున, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల్లో బ్యాంకింగ్ లావాదేవీలను బీవోఎం పర్యవేక్షిస్తూ, సరైన నిర్వహణ దిశగా డైరెక్టర్ల బోర్డుకు సాయం అందిస్తుందని తెలిపింది. -
బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్లు భద్రమేనా..?
బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి కారణం. కావాలనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా డిపాజిట్ను వెనక్కి తీసుకోవచ్చు. లిక్విడిటీ విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ఈ వెసులుబాట్లే ఎఫ్డీల ఆదరణకు కారణమని చెప్పొచ్చు. కానీ, బ్యాంకు సంక్షోభంలో పడితే, మీ డిపాజిట్ పరిస్థితి ఏంటి..? మీ ఇష్టానికి అనుగుణంగా దానిని వెంటనే వెనక్కి తీసుకోలేరు.! బ్యాంకు పరిస్థితులు చక్కబడిన తర్వాతే తీసుకునేందుకు అనుమతిస్తామంటే..? తలచుకుంటేనే భయమేస్తోంది కదూ..! డిపాజిట్దారులకు ఉన్న రక్షణ కవచం ఏంటి? ఆర్బీఐకి ఉన్న అధికారాలు, పరిమితులు... ఇలాంటి వివరాలన్నీ మీ కోసం... తాజాగా ముంబైకి చెందిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు(పీఎంసీ)లో అవకతవకల గురించి వార్తల్లో చూసే ఉంటారు. మొండి బాకీలను ఈ బ్యాంకు తక్కువ చేసి చూపించింది. ఈ బ్యాంకు మొత్తం రుణ పోర్ట్ఫోలియో రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్లను ఒక్క హెచ్డీఐఎల్ ఖాతాకు ఇవ్వడమే కాదు... దాన్ని ఆర్బీఐకి తెలియకుండా దాచిపెట్టింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు అమల్లో పెట్టింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 మాత్రమే వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. రెండు రోజుల తర్వాత రూ.10,000కు పెం చింది. వారం రోజుల తర్వాత తాజాగా రూ.25,000కు పెంచింది. దీంతో డిపాజిట్ దారుల్లో ఆందోళన పెరిగిపోయింది. బ్యాంకు శాఖల వద్దకు చేరుకుని తమ డిపాజిట్లు వెనక్కిచ్చేయాలంటూ వారు డిమాండ్ చేయడం కూడా చూశాం. ఈ తరహా సందర్భాలు ఎదురైతే ఏంటన్న విషయమై ఖాతాదారులు, డిపాజిట్ దారు ల్లో అవగాహన తక్కువే. రోజువారీ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ తరహా పరిస్థితులు దిక్కుతోచనీయవు. కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు వాణిజ్య బ్యాంకులపైనా ఆర్బీఐ ఈ విధమైన ఆంక్షలు విధించేందుకు అధికారాలు ఉంటాయి. ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) బీమా కవరేజీ పరిధిలో ఉంటాయి. ప్రాథమిక సహకార సొసైటీలు మాత్రం దీని పరిధిలోకి రావు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని కోఆపరేటివ్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా డీఐసీజీసీ కింద బీమా తీసుకోవాల్సి ఉంటుందని ‘మైమనీమంత్రా డాట్ ఇన్’ వ్యవస్థాపకుడు రాజ్ఖోస్లా తెలిపారు. ‘‘ప్రతీ డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ. లక్ష బీమా ఉంటుంది. ఒకవేళ పీఎంసీ బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ.లక్ష లభిస్తుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు తమ డిపాజిట్లు పొందేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంటుంది’’ అని ఖోస్లా వివరించారు. అసలు డిపాజిట్, దానిపై వడ్డీ సహా మొత్తం రూ.లక్ష పరిహారమే డీఐసీజీసీ ద్వారా లభిస్తుంది. పైగా ఒక్కో ఖాతాదారునికి సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో ఉన్నా కానీ దక్కే పరిహారం గరిష్టంగా రూ.లక్ష మాత్రమే. ఏ తరహా డిపాజిట్లకు రక్షణ? సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంటు, రికరింగ్ డిపాజిట్లు అన్నీ కూడా డీఐసీజీసీ పరిధిలో బీమా కవరేజీ కిందకు వస్తాయి. కాకపోతే విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, ఇంటర్బ్యాంక్ డిపాజిట్లు, విదేశాల నుంచి స్వీకరించిన డిపాజిట్లు డీఐసీజీసీ పరిధిలోకి రావు. ఒకే బ్యాంకుకు సంబంధించి ఒకటికి మించిన శాఖల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు డిపాజిట్లు ఉంటే..? అప్పుడు కూడా గరిష్టంగా రూ.లక్ష వరకే డీఐసీజీసీ కింద దక్కుతుంది. అదే వివిధ బ్యాంకుల్లో ఒకే వ్యక్తికి డిపాజిట్లు ఉంటే మాత్రం అప్పుడు ప్రతీ బ్యాంకులోని డిపాజిట్లపై గరిష్టంగా రూ.లక్ష పొందొచ్చు. ఉదాహరణకు ఎస్బీఐలో, పీఎన్బీలో ఒక వ్యక్తికి డిపాజిట్లు ఉంటే, అప్పుడు రెండు బ్యాంకుల్లోనూ బీమా కవరేజీ కింద గరిష్టంగా ఒక్కో రూ.లక్ష చొప్పున లభిస్తుంది. ఉమ్మడి ఖాతాలు అయితే... ఒక్కరి పేరు మీద (సింగిల్) లేదా ఉమ్మడి ఖాతాల (జాయింట్) విషయంలో కవరేజీ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు రవికి తన పేరుతో ఒక సేవింగ్స్ ఖాతా ఉంది. అలాగే, భార్య పేరుతోనూ రవికి జాయింట్ ఖాతా ఉందనుకోండి. బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు డీఐసీజీసీ కింద రెండు ఖాతాలకూ బీమా కవరేజీ ఉంటుంది. సిప్లు, ఈసీఎస్ల పరిస్థితి..? బ్యాంకు సంక్షోభంలో పడి ఆర్బీఐ ఆంక్షలు అమల్లోకి వస్తే... అప్పటికే మీ ఖాతా నుంచి రిజిస్టర్ అయి ఉన్న ఈసీఎస్లు, సిప్లు ఆగిపోయినట్టే. వాటికి సంబంధించిన మొత్తాలను మీ ఖాతా నుంచి డెబిట్ కావని రాజ్ఖోస్లా తెలిపారు. కనుక మీరు మరో ఖాతా నుంచి సిప్, ఈఎంఐలకు సంబంధించి ఈసీఎస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తలే కాపాడతాయి... పీఎంసీ బ్యాంకు అనుభవం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే కోపరేటివ్ బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. అంటే రిస్క్ కొంచెం ఎక్కువే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వీటిని ఆర్బీఐతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యవేక్షిస్తుంటాయి. ‘‘కోఆపరేటివ్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల విషయంలో నిబంధనల పరంగా ఆర్బీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తుంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చినప్పుడు ఆర్బీఐ కఠినంగానే వ్యవహరించింది. కనుక వ్యక్తులు ఒకే బ్యాంకులో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ఆర్బీఐ ఆంక్షలతో నిధులు పొందలేని పరిస్థితి ఎదురవుతుంది’’అని ఖోస్లా సూచించారు. బ్యాంకు కస్టమర్లు తమ బ్యాంకుల ఆరోగ్య పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచడం ఎంతో అవసరమని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లు అయితే ఇది ఇంకా అవసరం. బ్యాంకుకు సంబంధించి ఆస్తులపై రాబడులు (ఆర్వోఏ), నికర ఎన్పీఏల రేషియోను గమనించడం ద్వారా ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సామాన్యులు అయినా కానీ, వ్యాపారులు అయినా కానీ ఒకే ఖాతాపై ఆధారపడకుండా, వేర్వేరు బ్యాంకుల్లో కనీసం రెండు ఖాతాల పరిధిలో తమ డిపాజిట్లను వేరు చేసుకోవడం ద్వారా ఈ తరహా సంక్షోభ పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. -
ఆర్బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ నేతృత్వంలోని బిమల్జలాన్ కమిటీ కేంద్రానికి తన నివేదికను ఇవ్వడానికి కసరత్తు చేస్తున్న తరుణంలోనే దువ్వూరి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతార ని పేరున్న దువ్వూరి సీఎఫ్ఏ సొసైటీ ఇండియా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ బాండ్ల జారీ ద్వారా సమీకరించుకోవాలన్న 2019–2020 బడ్జెట్ ప్రకటన బాగానే ఉంది. అయితే ఇది ఒకసారికైతే పర్వాలేదు. పదేపదే ఇదే ప్రయోగం అయితే కష్టమవుతుంది. ► సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్పై దాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, అది సరికాదు. ఇది ప్రభుత్వ తీవ్ర ఇబ్బందికర నైరాశ్య ధోరణిని ప్రతిబింబిస్తుంది. ► ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకులతో ఆర్బీఐని పోల్చిచూడటం సరికాదు. వాటితో పోల్చితే ఆర్బీఐ పనివిధానం, ఇబ్బందులను ఎదుర్కొనే ధోరణి వేరు. అందువల్ల ‘మిగులు నిధుల బదలాయింపుల విషయంలో’ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలనే భారత్లోనూ అనుసరించాలనుకోవడం సరికాదు. ► అటు ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్స్తో ఇటు సెంట్రల్బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ను కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. ఇందుకు తగినట్లు నిర్ణయం తీసుకుంటారు. ట ఆర్బీఐ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. ఎన్నికలు, గెలుపు వంటి కొన్ని అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ విషయంలో ఇలాంటివి ఏవీ ఉండవు. కనుక ఆర్బీఐకి ఎప్పుడూ స్వయంప్రతిపత్తి కీలకాంశం. ► ప్రస్తుతం ఆర్బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా. నిధుల బదిలీ అంశమై బిమల్ జలాన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయాంలో ఈ అంశమై ఆర్బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరట్ కమిటీ, 2013లో మాలేగామ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఆర్బీఐ 12–18% వరకు రిజర్వులుంచుకొని మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లు : ఎస్బీఐ బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంకు ఆఫ్ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు షాకిచ్చింది. వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటును తగ్గించింది. 45 రోజుల -10 ఏళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను భారీగా కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. దాదాపు అన్ని కాలపరిమితి గత ఫిక్స్డ్ డిపాజిట్లపై రేటును తగ్గించింది. 2-3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. 3-5 ఏళ్ల డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్లను తగ్గింపు అనంతరం వడ్డీరేటు 6.60 శాతంగా ఉంది. 7 రోజుల నుండి 45 రోజుల డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. 46-179 రోజుల ఎఫ్డిలపై వడ్డీ రేటు మే 6.25 శాతం నుండి 5.75 శాతానికి తగ్గించింది. 180-210 కాలపరిమితిగల డిపాజిట్లపై వడ్డీరేటు 6.25గా ఉంటుంది. 2 కోట్ల రూపాయలకు మించిన బల్క్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును తగ్గించింది. రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో చేపట్టనున్న పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీరేటు కోతకు కేంద్ర బ్యాంకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తాజాగా ఇలాంటి సంకేతాలను అందించారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్బీఐ మరో సారి వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని భావిస్తున్నానని ఆమె పేర్కొనడం గమనార్హం. -
జన్ధన్ ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఆరంభమైన జన్ధన్ యోజన పథకం ఓ రికార్డును చేరుకుంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో సామాన్యుల డిపాజిట్లు రూ.లక్ష కోట్ల మార్కును చేరాయి. జూలై 3 నాటికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 6 నాటికి ఈ డిపాజిట్లు రూ.99,649.84 కోట్లుగా ఉండగా, క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పీఎంజేడీవై పథకాన్ని మోదీ సర్కారు తొలిసారి కేంద్రంలో కొలువు దీరిన సంవత్సరం 2014 ఆగస్ట్ 28న ప్రారంభించిన విషయం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బ్యాంకు సేవలను అందించడమే దీని ఉద్దేశ్యం. ఇవన్నీ జీరో బ్యాలన్స్ సదుపాయంతో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డుతోపాటు, బ్యాలన్స్ లేకపోయినా రూ.5 వేల ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్: డిపాజిట్లపై వడ్డీరేటు కోత
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మానిటరీ రివ్యూలో 25 పాయింట్ల రెపో రేట్ కట్ తరువాత దేశీయ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిప్ బ్యాంకు, కోటక్ మహీంద్ర , హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై వినియోగదారులకు చెల్లించే వడ్డీరేటు స్వల్పంగా తగ్గించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్ల కోసం ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై 10 -25 బిపిఎస్ మధ్య వడ్డీ రేట్లను తగ్గించింది. 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అదేవిధంగా, 390 రోజుల నుండి 2 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై కొత్త రేటు 7.10 శాతం నుండి 7 శాతానికి పడిపోయింది, 2-3 సంవత్సరాల డిపాజిట్లపై 20 బిపిఎస్ నుండి 7.3 శాతానికి తగ్గింది. యాక్సిస్ బ్యాంకు దేశీయ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ రూ .2 కోట్ల లోపు ఒక సంవత్సరం మెచ్యూరిటీలపై డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించామని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు, బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ సవరించిన రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసి, బిల్ల డిపాజిట్ కాలాన్ని ఆఫర్లో ఉన్న మొత్తం పదవీకాలం 20 నుండి 18నెలలకు తగ్గించింది. 18 నెలలు- 2 సంవత్సరాల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు 7.10 శాతంగా ఉంది. గతంలో మూడు వేర్వేరు 391 రోజుల నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ 7.20 శాతంగా ఉంది. అదేవిధంగా, 2-3 సంవత్సరాల దేవిధంగా, 2-3 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లు ఇప్పుడు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించి ప్రస్తుతం 7శాత వడ్డీని చెల్లిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కూడా డిపాజట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఈ సవరించిన రేట్లు జూన్12నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 2కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై చెల్లించేవడ్డీరేటు 7.30శాతంగా ఉంది. 2-3 ఏళ్ల డిపాజిట్లపై 7.25 శాతానికి తగ్గించింది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5శాతం వడ్డీని చెల్లిస్తుంది. -
మీకొక నామినీ కావాలి..?
ఎన్నో రకాల ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమనే అలవాటు నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు ఆర్జించే ప్రతీ వ్యక్తి పేరిట బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో పెట్టుబడులు ఉంటుంటాయి. భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం వీటిని ఆశ్రయించే వారు ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్ చేయడమనే కాకుండా, సంబంధిత వ్యక్తికి ప్రాణ ప్రమాదం జరిగితే పెట్టుబడులన్నీ కుటుంబానికి చెందేలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పెట్టుబడి సాధనంలో నామినీ పేరును రిజిస్టర్ చేయడం లేదా విల్లు రాయడం... ఈ రెండింటిలో ఏదో ఒక్కటైనా తప్పనిసరిగా చేయడాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడినట్టు అవుతుంది. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది... ఓ ఇన్వెస్టర్ తను మరణం సంభవిస్తే, తన పేరిట ఉన్న పెట్టుబడులను స్వీకరించేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఫలానా అంటూ వారి పేరును నమోదు చేయడమే నామినేషన్ . ఆర్థిక సేవల సంస్థ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ, బీమా సంస్థలకు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ఇది. నామినీ నమోదు చేయడం వల్ల పెట్టుబడులను వారి పేరిట బదిలీ చేయడం సులభతరం అవుతుంది. ఇన్వెస్టర్ మరణించిన తర్వాత వారి పేరిట ఉన్న పెట్టుబడులను నామినీగా ఉన్న వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ నమోదు చేసుకోకుండా, ఓ ఇన్వెస్టర్ మరణించినట్టయితే అప్పుడు వారసులు ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తుంది. క్లెయిమ్ చేసుకునే వారు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, ఇన్వెస్టర్తో తనకున్న అనుబంధం (లీగర్ హేర్ సర్టిఫికెట్), తనకున్న హక్కులను రుజువు చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కువ సమయం, శ్రమతో కూడిన పని. ప్రతీ ఇన్వెస్టర్ నామినీ పేరును నమోదుతో పాటు, నిర్ణీత కాలానికి ఓసారి సమీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే, ఉదాహరణకు... వివాహానికి పూర్వం బ్యాంకు ఖాతా తెరిచిన వారు, పెట్టుబడులు పెట్టిన వారు తమ తండ్రి లేదా తల్లి లేదా సోదరుల్లో ఒకరి పేరును నామినీగా ఇచ్చి ఉండొచ్చు. వివాహం అయిన తర్వాత నామినీగా తన భార్యను చేర్చుకోవడం సరైన చర్య. మరో ప్రత్యామ్నాయంగా విల్లు రాసుకోవడం కూడా మంచిదే. తన తదనంతరం తన పేరిట ఉన్న పెట్టుబడులు, ఆస్తులు ఎవరికి ఎంత మేర చెందాలనేది విల్లులో స్పష్టం చేసినా సరిపోతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... విల్లు రాసినట్టయితే, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన నామినేషన్ రద్దయినట్టే. షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో మాత్రం నామినేషన్కు ప్రాధాన్యం ఉంటుంది. భిన్న సాధనాల్లో నామినేషన్ , క్లెయిమ్ ప్రక్రియ వివరాలను పరిశీలిద్దాం... జీవిత బీమా కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల పాలవకుండా ఆదుకునే సాధనమే జీవిత బీమా. కనుక జీవిత బీమా పాలసీల్లో నామినీ పేరును నమోదు చేయడం ఎంతో అవసరం. ఎవరిని: పాలసీ హోల్డర్ మరణిస్తే బీమా పరిహారం ఎవరికి చెందాలని భావిస్తే వారి పేరును నామినీగా పేర్కొనాలి. సాధారణంగా వారసులు లేదా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులను బీమా సంస్థ సూచిస్తుంది. రక్త సంబంధీకులను అయినా నామినీగా నమోదు చేయవచ్చు. రక్త సంబంధీకులు కాని వారిని నామినీగా నమోదు చేయడానికి అవకాశం లేదు. నామినీ ఎన్ఆర్ఐ అయినా నమోదుకు అనుమతి ఉంటుంది. కాకపోతే క్లెయిమ్ మొత్తాన్ని భారత్లోని బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించడం జరుగుతుంది. ప్రక్రియ: నామినీ పూర్తి పేరు, వయసు, వారితో ఇన్వెస్టర్కు ఉన్న అనుబంధం వివరాలను బీమా పాలసీ తీసుకునే సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా నామినీలుగా పేర్కొనవచ్చు. అప్పుడు విడిగా ఒక్కో నామినీకి ఎంత మొత్తం అనేది శాతం వారీగా ఆప్షన్ ఇవ్వాలి. పాలసీ కాల వ్యవధిలో నామినీని ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. చివరిగా ఇచ్చిన నామినేషనే వ్యాలిడేషన్ లో ఉంటుంది. బీమా పాలసీ తీసుకున్న తర్వాత మూడేళ్లు ముగిసేలోపు క్లెయిమ్ దరఖాస్తు వస్తే బీమా సంస్థలు 120 రోజుల్లోపు పరిష్కరిస్తాయి. మూడేళ్లు దాటితే 15 రోజుల్లోపు క్లెయిమ్ పరిష్కారాన్ని పూర్తి చేస్తాయి. ఎవరికి: నామినీకి క్లెయిమ్ హక్కు ఉంటుంది. ఒకవేళ విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తులకే పరిహారం చెల్లిం స్తారు. గందరగోళానికి అవకాశం లేకుండా ఉండాలంటే, నామినీగా, విల్లులోనూ ఒకే పేరును పేర్కొనడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిబంధనల మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు నామినీ ఆప్షన్ ఇవ్వాలి. అయితే, నామినేషన్తప్పనిసరేమీ కాదు. ఇన్వెస్టర్లు స్వీయ ప్రయోజనాల కోణంలోనే నామినీని తప్పనిసరిగా రికార్డు చేసుకోవడం అవసరం. ఎవరిని: ఫండ్స్లో పెట్టుబడులు కలిగిన వ్యక్తి ఎవరినైనా నామినీగా పేర్కొనవచ్చు. కాకపోతే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. మైనర్లనూ నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఎన్ర్ఐలను కూడా నామినీగా నమోదు చేసుకోవచ్చు. అయితే, సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్త, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్లను నామినీగాలు పేర్కొనరాదు. నమోదు ప్రక్రియ: పెట్టుబడులకు సంబంధించి తొలుత దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ నామినేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లయినా నామినీలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఒక్కో నామినీకి మొత్తం విలువలో ఎంత మేర చెల్లించాలన్న శాతాన్ని కూడా పేర్కొనవచ్చు. ఎంతన్నది పేర్కొనకపోతే ఒకరికి మించి నామినీలు ఉంటే అప్పుడు అందరు నామినీలకు సమానంగా చెల్లిస్తారు. నామినీ పేరును పేర్కొంటూ దరఖాస్తుపై ఇన్వెస్టర్ సంతకం చేయాలి. జాయింట్ హోల్డర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే అందరి సంతకాలు అవసరం. ముఖ్యంగా ఫండ్స్లో ప్రతీ ఫోలియోకు విడిగా నామినేషన్ రిజస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అన్నింటికీ ఒకటే వర్తించదు. క్లెయిమ్: నామినీ ఎవరైనా కానీ, ఇన్వెస్టర్ మరణించిన తర్వాత క్లెయిమ్ చేసుకునే మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టబద్ధమైన వారసులకు అందించాల్సి ఉంటుంది. అందుకే వారసులనే నామినీగా పేర్కొనడం మంచిదనేది నిపుణుల మాట. ఈక్విటీ షేర్లు కంపెనీల చట్టం, వాటాదారులు తమ పేరిట నామినేషన్ నమోదుచేసుకునేందుకు అనుమతిస్తోంది. కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు, జాయింట్ అకౌంట్ హోల్డర్స్ సైతం నామినేట్ చేయవచ్చు. అయితే, వ్యక్తులనే నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది. సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్తను నామినీగా నమోదు చేయడం కుదరదు. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా నమోదు చేయొచ్చు. నమోదు ప్రక్రియ: డీమ్యాట్ రూపంలో షేర్లను కలిగి ఉంటే డీమ్యాట్ ఖాతాను నిర్వహించే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) నామినేషన్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా ప్రారంభ సమయంలో నామినీ కోసం ప్రత్యేకంగా ఒక పేజీ కూడా ఉంటుంది. అక్కడే నామినీ పేరు, ఫొటో, వయసు, ఈ మెయిల్ ఐడీ, అనుబంధం, బ్యాంకు ఖాతా, చిరునామా వివరాలు ఉంటాయి. ఖాతా ప్రారంభంలో నామినీ వివరాలను ఇవ్వని వారు ఆ తర్వాత ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లెయిమ్: ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లో నామినీ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే వారి పేరిట డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. నామినేషన్ లేకపోతే సంబంధిత షేర్లను ఇన్వెస్టర్ వారసులకు అందించడం జరుగుతుంది. ఇన్వెస్టర్ నామినేషన్ తోపాటు విల్లు కూడా రాసి ఉంటే కేవలం నామినేషన్నే పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకు డిపాజిట్లు గతంలో అయితే నామినేషన్ను బ్యాంకులు అంతగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలి కాలంలో ఖాతా ప్రారంభ సమయంలో, డిపాజిట్ సమయంలోనూ బ్యాంకు సిబ్బంది నామినేషన్ గురించి కస్టమర్లకు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ నామినేషన్లేకుండానే ఖాతా తెరిచేందుకు, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నామినీ ఎవరిని?: వ్యక్తులను నామినీగా నమోదు చేసుకోవచ్చు. అసోసియేట్, ట్రస్ట్, సొసైటీ లేదా ఇతర ఆర్గనైజేషన్ ఆఫీసుబేరర్ అయితే నామినీగా అవకాశం ఉండదు. ప్రక్రియ: నామినేషన్ నమోదు కోసం నామినీ పేరు, అనుబంధం, చిరునామా వివరాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు పాస్బుక్లో, అకౌంట్ స్టేట్మెంట్, డిపాజిట్లో నామినేషన్ రిజిస్టర్డ్ అని పేర్కొనడం తప్పనిసరి. నామినీ నమోదు, మార్పులకు, రద్దుకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. క్లెయిమ్: ఖాతాదారుడు లేదా డిపాజిట్ దారుడు మరణిస్తే నామినీలకు బ్యాంకులు బ్యాలన్స్ను చెల్లిస్తాయి. డిపాజిట్దారుని వారుసుల తరఫున ట్రస్టీగానే నామినీ వ్యవహరించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినట్టు బ్యాంకులో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీకి సంబంధించి కేవైసీ ఇతర ధ్రువీకరణలు కూడా అవసరం. నామినేషనన్ రిజిస్టర్ కాకపోతే, వారసులకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. అందుకు వారసత్వ ధ్రువీకణ పత్రం, డెత్ సర్టిఫికెట్వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోవాలి... బీమా పాలసీలు, మ్యూచువల్ఫండ్స్, షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో జాయింట్ అకౌంట్ హోల్డర్స్గా ఉంటే, అప్పుడు జాయింట్ హోల్డర్స్ అందరూ ఒకే సందర్భంలో మరణించినట్టయితేనే నామినేషన్ అమల్లోకి వస్తుంది. మైనర్ను నామినీగా నమోదు చేసేవారు, ఆ మైనర్ సంరక్షణ చూసే వారి పేరు వివరాలనూ నమోదు చేయాల్సి ఉంటుంది. బీమా పాలసీలయితే నామినీ క్లెయిమ్ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇందుకు క్లెయిమ్ ఫామ్ను పూర్తి చేసి, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం(ఒరిజినల్), పాలసీ డాక్యుమెంట్ ఒరిజినల్ను జత చేయాలి. ఒకవేళ ప్రమాదంలో మరణించినట్టయితే ఎఫ్ఐఆర్/పోస్ట్మార్టం రిపోర్ట్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీ తనకు సంబంధించి కేవైసీ వివరాలను కూడా సమర్పించాలి. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ విషయంలోనూ క్లెయిమ్ కోసం ఇవే పత్రాలు అవసరం అవుతాయి. అదే షేర్లు అనుకుంటే, నామినీ అకౌంట్ క్లోజర్ ఫామ్(మరణించిన ఇన్వెస్టర్ అకౌంట్), ట్రాన్సమిషన్ రిక్వెస్ట్ (ఇన్వెస్టర్ పేరిట ఉన్న షేర్లను బదిలీ కోరుతూ), డెత్ సర్టిఫికెట్, క్లయింట్ మాస్టర్ రిపోర్ట్(డీమ్యాట్ ఖాతాకు సంబంధించి) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, క్లెయిమ్ దాఖలు చేసే నామినీలు తమ డీమ్యాట్ ఖాతాను జాయింట్గా కలిగి ఉండరాదు. ఒకవేళ ఇన్వెస్టర్ నామినీని నమోదు చేసి లేకపోతే, ఇక్కడ పేర్కొన్న పత్రాలతోపాటు, వారసులు వారసత్వ సర్టిఫికెట్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధ వారసుల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ లేదా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ మైనర్ అయితే, గార్డియన్ గా ఉన్న వారు నామినీ తరఫున ఈ డాక్యుమెంట్లు అన్నీ ఇవ్వాలి. -
రుణాలు@ 5.15 లక్షల కోట్లు
హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్యాలయంలో జరిగిన 22వ ఎస్ఎల్బీసీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జే.స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి (సీడీ రేషియో) 100% పైనే ఉంది. తాజాగా 119.05 శాతానికి చేరుకుంది. ఎంఎస్ఎంఈ విభాగం అనుకున్న విధంగా 134.31 శాతానికి చేరింది. ముద్రా రుణాలు సైతం నిర్థేశిత లక్ష్యం మేర పెరిగాయి’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనరు, ఎస్బీఐ జీఎం ఉన్ మయ్యాతో పాటు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, జనరల్ మేనేజర్ ఎస్.శంకర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్ సుల్తానియా, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.