-
ఎన్సీఎల్టీలో డెలాయిట్కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ కేసుకు సంబంధించి ఆడిటింగ్ సంస్థలు డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, బీఎస్ఆర్ అసోసియేట్స్కు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో చుక్కెదురైంది. వాటిపై విధించిన నిషేధానికి సంబంధించి తాత్కాలికంగానైనా ఊరటనిచ్చేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఫ్రాడ్ కేసులో ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్ 20న జరిగే తదుపరి విచారణ దాకా తుది ఉత్తర్వులేవీ జారీ చేయబోమని పేర్కొంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ ఆడిటింగ్ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను రెండు సంస్థలపైనా అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీన్ని సవాలు చేస్తూ డెలాయిట్, బీఎస్ఆర్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దాదాపు రూ. 95,000 కోట్ల మేర రుణాలు బాకీపడిన సంగతి తెలిసిందే. -
డెలాయిట్పై ఐదేళ్ల నిషేధం?
ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్అండ్ఎఫ్ఎస్లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం డెలాయిట్ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఖాతాల ఆడిటింగ్ ప్రక్రియ విషయంలో డెలాయిట్ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ ప్రకారం డెలాయిట్పై నిషేధం విధించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది. కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్(ఐఎఫ్ఐఎన్)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్ సంస్థలే ఆడిటింగ్ను నిర్వహించాయని కూడా డెలాయిట్ అంటోంది. అంతేకాకుండా గ్రూప్లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్అండ్ఎఫ్ఎస్, ఐఎల్అండ్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అయిన ఎస్ఆర్బీసీ అండ్కో 2017–18, 2018–19లో ఆడిట్ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్ఐఎన్కు 2018–19లో కేపీఎంజీ పార్ట్నర్ అయిన బీఎస్ఆర్ ఆడిట్ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ ఆడిటింగ్ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్ వాదన. నైట్ఫ్రాంక్ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్ కూడా జరిగిందని అంటోంది. నిషేధం ఎన్నాళ్లు... సత్యం స్కామ్లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్ అగ్రగామి ప్రైస్ వాటర్హౌస్(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్నర్ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్ సంస్థగా నిలవనుంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్పై అంతర్గత వేగు(విజిల్బ్లోయర్) ఎస్ఎఫ్ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్లతో డెలాయిట్ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్బ్లోయర్ ఆరోపణ. ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ మాజీ చీఫ్ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్ఎఫ్ఐఓ విచారించింది. డెలాయిట్పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఐటీ దిగ్గజం డెలాయిట్పై హ్యాకర్ల దాడి
వాషింగ్టన్ : డెలాయిట్ కంపెనీకి చెందిన సర్వర్ హ్యాక్ అయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. డెలాయిట్కు చెందిన 350 క్లయింట్ల వివరాలు తస్కరణకు గురైనట్లు సమాచారం. సమాచారం చోరికి గురైన క్లయింట్లలో అమెరికా ప్రభుత్వానికి చెందిన నాలుగు డిపార్ట్మెంట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. డెలాయిట్ ఊహించిన దాని కంటే పెద్ద మొత్తంలో డేటా చోరికి గురైందని హ్యాకింగ్ నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఏంత మొత్తంలో సమాచారం చోరికి గురైందన్న విషయంపై డెలాయిట్ ఇంకా పెదవి విప్పడం లేదు. కేవలం ఆరుగురు క్లయింట్లకు చెందిన సమాచారమే హ్యాకింగ్కు గురైనట్లు డెలాయిట్ చెబుతోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పిన సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన రాష్ట్ర, ఎనర్జీ, హోం ల్యాండ్ సెక్యూరిటీ, రక్షణ శాఖ డిపార్ట్మెంట్లకు చెందిన వివరాలు తస్కరణకు గురయ్యాయి. -
డెలాయిట్పై భారీ సైబర్ దాడి
ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్కు సైబర్ షాక్ తగిలింది. సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ మెయిల్ వ్యవస్థపై సైబర్దాడి జరిగింది. దీంతో క్లయింట్లకు చెందిన విలువైన సమాచారం, రహస్యమైన మెయిల్స్ హ్యాకర్ల బారిన పడ్డాయి. దీనిపై పూర్తిగా విచారణ ప్రారంభించామని డెలాయిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా కొద్ది మంది ఖాతాదారులను మాత్రమే ఈ దాడి ప్రభావితం చేసిందనీ, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించామని తెలిపింది. క్లయింట్ బిజినెస్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేదనీ పూర్తి విచారణ జరిపిస్తున్నామని ప్రకటించింది. అలాగే తమ సైబర్-సెక్యూరిటీ వ్యవస్థ చాలా ఉత్తమమైందనీ, ఖాతాదారుల రహస్య సమాచారాన్ని రక్షించడంలోనూ, వారి సైబర్సెక్యూరిటీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని సంస్థ పేర్కొంది. అయితే చాలా పెద్ద సంఖ్యలో ఖాతాదారుల నుండి సమాచారం లీక్ అయిందనీ ది గార్డియన్ దినపత్రిక సోమవారం నివేదించింది. ఇందులో పెద్ద సంస్థలు, అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయని తెలిపింది. అమెరికాలోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ డెలాయిట్ డేటాపై గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకూ హ్యాకర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే భారీ సైబర్దాడికి గురైందట. -
భారత్లో పన్ను వ్యవస్థ సంక్లిష్టం: డెలాయిట్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతి క్లిష్టమైన పన్ను వ్యవస్థను కలిగిన రెండో దేశం భారత్ అని డెలాయిట్ సర్వే స్పష్టం చేసింది. పన్నులకు సంబంధించి క్లిష్టమైన చట్టం కలిగిన దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్ తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా వరుసగా ఉన్నాయి. చైనా, భారత్ విషయంలో పన్నుల పరంగా జటిలత్వం గత మూడేళ్లలో పెరిగిపోయినట్టు సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైగా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్లిష్టత అంటే పన్ను చట్టాలు, నిబంధనలు అర్థం చేసుకోవడం, వివరించడంలో ఉన్న కఠినత్వం. సర్వేలో 90 శాతానికి పైగా భారత్, చైనా, ఇండోనేషియాలో పన్ను సంస్కరణలను కోరుకుంటున్నట్టు చెప్పారు. మరీ ముఖ్యంగా భారత్లో కాలానుగుణంగా సంస్కరణలు, ఆడిట్లలో నాణ్యత, బీఈపీఎస్ సిఫారసుల అమలును ఆశిస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 300 మందికిపైగా ట్యాక్స్ ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాలను డెలాయిట్ ఈ సర్వేలో భాగంగా సేకరించింది. -
కార్పొరేట్ మోసాలు పెరుగుతాయ్
• వచ్చే రెండేళ్లలో మరింత పైకి... • డెలాయిట్ సర్వే నివేదిక... ముంబై: దేశీయంగా కార్పొరేట్ మోసాలు వచ్చే రెండేళ్లలో మరింత పెరగనున్నాయని గ్లోబల్ అకౌంటింగ్ దిగ్గజం డెలాయిట్ పేర్కొంది. నైతిక విలువలు అంతకంతకూ దిగజారుతుండమే దీనికి ప్రధాన కారణంగా కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడించింది. డెలాయిట్ నిర్వహించిన ‘ఇండియా ఫ్రాడ్ సర్వే’లో 309 కార్పొరేట్ కంపెనీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలివీ... ⇔ నైతిక విలువలు దిగజారడమే మోసాలు పెరిగేందుకు దారితీస్తోందని సర్వేలో పాల్గొన్న బడా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్లలో 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎస్ఎంఈ)లకు చెందిన 68 శాతం మంది ఎగ్జిక్యూటివ్లు, వృత్తి నిపుణుల్లో 42 శాతం మంది ఇదే కారణాన్ని పేర్కొన్నారు. ⇔ అవినీతి, లంచాలు, వెండార్లకు అనుకూలంగా వ్యవహరిం చడం, స్వప్రయోజనాలు వంటివి గడిచిన రెండేళ్లలో జరిగిన కార్పొరేట్ మోసాల్లో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ⇔ ఒకేవిధమైన మోసాలను ఎదుర్కోవడంలో కంపెనీలు అనుసరిస్తున్న విధానాల్లో తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. దీనిప్రకారం చూస్తే.. మోసాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని.. వీటికి అడ్డుకట్టవేయడంలోకంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నట్లు అవగతమవుతోంది. ⇔ పెద్ద కంపెనీల్లో చాలావరకూ అందరికీ తెలిసిన మోసాలను అరికట్టడంపైనే దృష్టిపెడుతున్నాయి. సోషల్ మీడియా, పోటీ కంపెనీలు అనురిస్తున్న కొత్తరకం మోసాలను ఎదుర్కోవడానికి సమాయత్తంగా లేవు. ⇔ మోసం తీవ్రత ఆధారంగానే దర్యాప్తులను మొదలుపెడుతున్నట్లు 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక మోసం చేసిన సిబ్బంది రాజీనామాకు అనుమతిస్తున్నట్లు 36 శాతం మంది వెల్లడించారు. ఇతరఉద్యోగులు, కంపెనీ బోర్డు, నియంత్రణ సంస్థలకు సబంధిత మోసం గురించిన సమాచారాన్ని అందిస్తున్నట్లు 33 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు వివరించారు. ⇔ ఎస్ఎంఈలకు సంబంధించి మోసాలను ఎదుర్కొనే సమాయత్తత, సంకల్పం లేదని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇటువంటి కార్యకలాపాలను నివారించేందుకు తగిన బడ్జెట్, వనరుల కేటాయింపులేదని 42 శాతం మంది చెప్పారు. -
పొద్దున లేస్తే అదే పని
న్యూఢిల్లీ: గతంలో పొద్దున్నే లేవగానే హా... అంటూ కళ్లు తుడుముకునే వారంతా ఇప్పుడు మాత్రం నిద్రనుంచి మేల్కొంటుండగా కళ్లు తెరవకుండానే ముందు వారి చేతులు ముందు స్మార్ట్ ఫోన్ను వెతుకుతున్నాయట. అలా తీసుకునేది టైం ఎంతయిందో చూసుకోవడానికి కాదండోయ్.. వెంటనే డేటా ఆన్ చేసి వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పడిపోతుంటారట. డెలాయిట్ లోని ఓ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ ఈ మేరకు అధ్యయనం చేసి దాని వివరాలు తెలిపింది. డెలాయిట్ మొబైల్ వినియోగదారుల సర్వే 2015 ప్రకారం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న 78 శాతం మంది కూడా నిద్ర నుంచి మేల్కొండగా, మేల్కొన్న తర్వాత కనీసం పదిహేను నిమిషాల్లోనే కచ్చితంగా సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తారని తెలిపింది. మరో 52శాతంమంది మాత్రం నిద్రలోకి జారుకునే ముందు ఓ ఐదు నిమిషాలపాటు అందులో విహరిస్తారని తెలిపింది. ఇలా వారు చెక్ చేసే సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, చాట్ బాక్సెస్, మెయిల్స్ వాటిని ఎక్కువగా తనిఖీ చేస్తుంటారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. -
5 లక్షల నిర్మాణ కూలీలు కావలెను!
దుబాయ్: గల్ఫ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో నిర్మాణ కూలీల కొరత రియల్ ఎస్టేట్ రంగాన్ని పట్టిపీడిస్తోందని ఓ మీడియా నివేదికలో వెల్లడైంది. 2015 నాటికి నిర్మాణ కూలీల కొరత భారీగా పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి 5 లక్షల మంది నిర్మాణ కూలీల కొరత ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీ(డీఐఏసీ), డెల్లాయిట్ కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాజెక్ట్ లకు ఊహించని డిమాండ్ ఏర్పడటంతో నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల్లో కూలీ, ఇతర సాంకేతిక నిపుణల కొరత ఏర్పడిందని నివేదికలో తెలిపారు. డిజైన్ ఇంజనీరింగ్, మధ్య స్థాయి నిపుణుల అవసరం ఉంటుందని మల్టీ నేషనల్ కంపెనీలు తెలిపాయి. వరల్డ్ ఎక్స్ పో 2020 నిర్వహించడానికి దుబాయ్ బిడ్ గెలుచుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున నిర్వహించే వరల్డ్ ఎక్స్ పో 2020 కు 45 వేల హోటల్ రూమ్ లు అవసరం ఉంటుందని హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ తెలిపింది. వరల్డ్ ఎక్స్ పో 2020 కోసం 3.40 బిలియన్ డాలర్ల మేరకు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని.. అందుచేత స్కిల్డ్ లేబర్ కు యూఏఈలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. -
బిగ్ 4 ఆడిటింగ్ నుంచి నిరుద్యోగులకు గుడ్న్యూస్
-
ట్యాబ్లెట్స్లో ఇంటర్నెట్ వాడకం తక్కువే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగం విషయంలో ట్యాబ్లెట్స్ కంటే ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటర్నెట్ కోసం 69 శాతం మంది ల్యాప్టాప్లపై, 64 శాతం మంది స్మార్ట్ఫోన్లపై ఆధారపడుతున్నారట. కేవలం 24 శాతం మంది ట్యాబ్లెట్లను వాడుతున్నారట. హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణే, అహ్మదాబాద్ నగరాల్లోని 2 వేల మంది వినియోగదార్లపై డెలాయిట్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. స్మార్ట్ఫోన్ వినియోగదార్లలో 60 శాతం మంది డేటా కోసం మొబైల్ నెట్వర్క్ను వినియోగిస్తున్నారు. ల్యాప్టాప్ వినియోగిస్తున్న వారిలో 80 శాతం మంది ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ను వాడుతున్నారు. విభిన్న డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది మొబైల్ కస్టమర్లు వైఫైకి మళ్లుతున్నారట. 12 నెలలుగా అంచనాలకు మంచి మొబైల్ బిల్లు వస్తోందని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది తెలిపారు. ఇక ట్యాబ్లెట్ కొనుగోలు సమయంలో కస్టమర్లకు బ్రాండ్ తొలి ప్రాధాన్యత కాగా, మన్నిక, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ జీవిత కాలం, డిజైన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే స్మార్ట్ఫోన్లకైతే బ్యాటరీ సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తోంది. డిజైన్, మన్నిక, బ్రాండ్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా సామర్థ్యం తర్వాతి ప్రాధాన్యతలని డెలాయిట్ వెల్లడించింది. -
ఓవరాల్ చాంప్ డెలాయిట్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఒలింపిక్స్లో డెలాయిట్ ఉద్యోగులు సత్తాచాటారు. దీంతో డెలాయిట్ ఓవరాల్ చాంపియన్షిప్ను నిలబెట్టుకుంది. మొత్తం 17 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో డెలాయిట్ క్రీడాకారులు 26 స్వర్ణాలు, 17 రజతాలు, 25 కాంస్య పతకాలతో కలిపి 68 పతకాలు సాధించారు. ఈ పోటీల్లో హెచ్ఎస్బీసీ-ఈడీపీ ఓవరాల్ రన్నరప్గా నిలిచింది. వికలాంగ అథ్లెట్ కిరణ్ కానోజియా బ్లేడ్ సాయంతో పరుగెత్తి అందరినీ ఆకట్టుకుంది. 800 మీటర్ల పరుగులో ఆమె కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా నిర్వాహకులు ప్రత్యేక బహుమతిని అందజేశారు. పురుషుల 100 మీ. పరుగులో సమిరన్ భరద్వాజ్ (డెలాయిట్) 12.66 సెకన్లలో పోటీని పూర్తిచేసి స్వర్ణం సాధించాడు. చార్లెస్ బిన్నీ, రాజ్ కుమార్లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. 200 మీటర్ల పరుగు పందెంలో అర్జున్ మారి (డెలాయిట్) పోటీని 25.12 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రాజ్ కుమార్ (డెలాయిట్), కశ్యప్ (హెచ్ఎస్బీసీ-ఈడీపీ) వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. రవీందర్ (డెలాయింట్) ఉత్తమ పురుష అథ్లెట్గా, జయంతి పాఠక్ (వెరిజాన్) ఉత్తమ మహిళా అథ్లెట్గా అవార్డులు గెలుపొందారు. ఏడీపీ బృందం స్ఫూర్తిదాయక జట్టుగా, టీసీఎస్ క్రమశిక్షణ జట్టుగా, వెరిజాన్ ప్రేరణ ఇచ్చిన జట్టుగా అవార్డులు దక్కించుకున్నాయి.