-
నేవీలో 10వేల మందికి పైగా సిబ్బంది కొరత
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో కీలక విభాగమైన భారత నావికాదళంలో సిబ్బంది కొరత భారీస్థాయిలో ఉంది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం పార్లమెంట్లో కేంద్రం తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్ 31వ తేదీ నాటికి నౌకాదళంలో మొత్తంగా 10,896 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆఫీసర్ ర్యాంక్ పోస్టులే 1,777 దాకా ఉన్నాయని లోక్సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. -
Madhavi Kattekola: జై జవాన్కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్ఆర్ఎల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
G20 Summit: బైడెన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా ప్రకటించారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం భారత్కు విచ్చేసిన బైడెన్ను ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7, కళ్యాణ్మార్గ్కు సాదరంగా ఆహా్వనించారు. దాదాపు 50 నిమిషాలకుపైగా జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇరువురు అగ్రనేతలు కీలకమైన అంశాలపై చర్చించి పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు ఖరారుచేశారు. అమెరికా నుంచి 31 అత్యాధునిక డ్రోన్ల కొనుగోలు, ఆధునిక జెట్ ఇంజిన్ల సంయుక్త తయారీపై రెండు దేశాలు అవగాహనకు వచ్చాయి. జీ20 సారథ్యం, అణుఇంధనంలో సహకారం, 6జీ, కృత్రిమ మేథ వంటి సంక్లిష్ట, అధునాతన సాంకేతికతల్లో పరస్పర సహకారం, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అమెరికా రక్షణ రంగ దిగ్గజం జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి ఎంక్యూ–9బీ రకం 31 డ్రోన్లను కొనేందుకు భారత రక్షణ శాఖ పంపిన విజ్ఞప్తి లేఖకు బైడెన్ తన సమ్మతి తెలిపారు. చదవండి: G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం అమెరికాలోని జీఈ ఏరోస్పేస్, భారత్లోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హాల్)లు సంయుక్తంగా జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్లోనే తయారుచేసేందుకు ఇరునేతలు అంగీకరించారు. సాంకేతికత బదలాయింపు, జెట్ ఇంజన్ల తయారీకి పచ్చజెండా ఊపారు. ‘జీ20 కూటమి అనేది ఏ విధంగా గొప్ప ఫలితాలను రాబట్టగలదన్న దానిని జీ20 సారథిగా భారత్ నిరూపించి చూపింది. సదస్సు తాలూకు ఫలితాలు మున్ముందు మరిన్ని ఉమ్మడి లక్ష్యాలను నిర్ధేశిస్తాయి’ అని బైడెన్ భారత్ను పొగిడారు. స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత ఇండో–పసిఫిక్ కోసం క్వాడ్ కూటమి అత్యవశ్యకమని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది భారత్లో జరిగే క్వాడ్(అమెరికా, జపాన్, ఇండియా, ఆ్రస్టేలియా) చతుర్భుజ కూటమి సదస్సుకు రావాలని బైడెన్ను మోదీ కోరారు. ‘ స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, బహుళత్వం, సమాన అవకాశాలనే విలువలు రెండు దేశాల పౌరుల విజయానికి ఎంతో కీలకం. ఈ విలువలే రెండు దేశాల మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేశాయి’ అని సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు పేర్కొన్నాయి. ‘సదస్సు తుది నిర్ణయాలు సుస్థిరాభివృద్ధి, బహుపాక్షిక సహకారం, సమ్మిళిత ఆర్థిక విధానాల్లో ఏకరూపత సాధనకు తద్వారా పెను ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడతాయి’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. బైడెన్తో చర్చలు ఫలప్రదమయ్యాయని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఏఏ అంశాల్లో ఒప్పందం కుదిరిందంటే.. ► ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు బలోపేతం ► భారత్లో పరిశోధనాభివృద్ధి కోసం మైక్రోచిఫ్ టెక్నాలజీ సంస్థ దాదాపు 30 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడం ► వచ్చే ఐదేళ్లలో అధునాతన మైక్రో డివైజ్ల కోసం 40 కోట్ల డాలర్ల పెట్టుబడి ► భారత్ 6జీ కూటమి, నెక్ట్స్ జీ కూటమి మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ► ఇండో–పసిఫిక్లో స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ కోసం మరింత సహకారం ► భద్రత, టెలీ కమ్యూనికేషన్స్ రంగాల్లో సహకారం ► సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేయడం -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్లో అమెరికా ఎయిర్ బేస్కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
రక్షణ రంగానికి వెన్నెముక విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణశాఖ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ సతీశ్రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే రక్షణరంగ ఎగుమతులు గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానం, ఆవిష్కరణలు’ అనే అంశంపై విశాఖలో నిర్వహించిన సదస్సులో సతీశ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపారమైన అవకాశాలున్న విశాఖ రక్షణ రంగానికి వెన్నెముకగా ఉందని చెప్పారు. తూర్పు నౌకాదళం, డాక్యార్డ్, షిప్యార్డు, ఎన్ఎస్టీఎల్ తదితర రక్షణ రంగం, అనుబంధ సంస్థలు ఉన్న విశాఖ భవిష్యత్తులో రక్షణ రంగం, ఏరోసిస్టమ్కు కేంద్రంగా మారనుందని చెప్పారు. రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విశాఖలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతికత బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా.. డిఫెన్స్ మెటీరియల్ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. దేశీయ తయారీరంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువగా ఉన్న డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని, భవిష్యత్తులో రూ.25 వేల కోట్ల మార్క్ని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టార్పెడోలు, క్షిపణులు, పరికరాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో అగ్రభాగంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఎగుమతుల్లో అగ్రస్థానం దిశగా పరుగులు పెడుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఒకప్పుడు సప్లై చైన్గా ఉన్న ప్రైవేటు కంపెనీలు డెవలప్మెంట్ ప్రొడక్షన్ సెక్టార్గా మారాయని, క్రమంగా డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్టనర్స్ (డీసీపీపీ)గా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ తయారీ సంస్థలు ఏడు మిసైళ్లను తయారు చేశాయన్నారు. రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోందన్నారు. రక్షణ రంగం వైపుగా ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నా యని చెప్పారు. దేశంలో 2016 నాటికి 400 స్టార్టప్లుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు చేరుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో సీఐఐ ఎస్ఐడీఎం చైర్మన్ జె.శ్రీనివాసరాజు, సీఐఐ ఏపీ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య పరస్పర సహకారానికి రోడ్డు మ్యాప్ ఖరారైంది. ఢిల్లీలో సోమవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సుదీర్ఘంగా చర్చించి, ఈ మేరకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. రక్షణ పారిశ్రామిక రంగంతోపాటు రక్షణ ఉత్పత్తుల తయారీలో ఇకపై ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఫాస్ట్–ట్రాక్ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. గగతతల, భూ ఉపరితల యుద్ధానికి అవసరమైన ఆయుధాలను కలిసికట్టుగా తయారు చేసుకుంటాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ దేశం చైనా దూకుడు పెరుగుతున్న సమయంలో భారత్, అమెరికా మధ్య ఈ రోడ్డు మ్యాప్ ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు వారాల తర్వాత అమెరికాలో పర్యటించబోతున్నారు. రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ చెప్పారు. రాజ్నాథ్ సింగ్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్కు భారత్–అమెరికా బంధం ఒక మూలస్తంభమని అభివర్ణించారు. భారత సైన్యం ఆధునీకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికా నడుమ రక్షణ రంగంలో సహకారం విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడానికే రోడ్డు మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్’ వెల్లడించింది. ఫైటర్ జెట్ ఇంజన్లకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని భారత్కు అందజేయానికి జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే 30 ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లను అమెరికా రక్షణ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ రెండు అంశాల గురించి లాయిన్ అస్టిన్ వద్ద రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ద్వైపాకిక్ష రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి 2020 అక్టోబర్లో బేసిక్ ఎక్సే్ఛంజ్, కో–ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ) కుదిరింది. -
ఉపాధికి రక్షణ కవచం!
సాక్షి, అమరావతి : పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. మరో వైపు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి మార్గాలు చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాల సముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు వేగం అందుకున్నాయి. ఐదు దశల్లో ఈ యూనిట్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన దశలకు సంబంధించి ఆమోదం లభించనుందని బీఈఎల్ అధికారులు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్లో రాడార్, మిసైల్, సబ్మెరైన్లకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేయడమే కాకుండా వీటిని పరీక్షించేలా టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశకు సంబంధించి క్షిపణుల అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను రూ.148 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బిడ్ దక్కించుకున్న సంస్థ క్షిపణుల తయారీకి సంబంధించి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డ్లతో పాటు ఒక ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వరద నీటి కాల్వలు, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాలు వంటి వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు మే 23లోగా బిడ్లను దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే ఈ 914 ఎకరాల చుట్టూ సుమారు రూ.50 కోట్లతో ప్రహరీ నిర్మించింది. గోడ చుట్టూ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, సొంత అవసరాల కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. చకచకా అనుమతులు గత ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి బీఈఎల్ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 2016లోనే బీఈఎల్ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టిలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా, కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బీఈఎల్ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, తొలి దశలో రూ.384 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 2025 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిఫెన్స్ హబ్గా ఏపీ దేశ రక్షణ అవసరాల తయారీ హబ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర రక్షణ సంస్థ 914 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తుండగా ఏపీఐఐసీ కూడా 1,200 ఎకరాల్లో ఏపీ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ (ఏపీ–ఏడీఈ) పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరిగే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు రాష్ట్రం రక్షణ రంగ ఉత్పత్తులకు తయారీ కేంద్రంగా తయారవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా 2,800 మందికి, పరోక్షంగా 8,000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. యాంకర్ యూనిట్గా బీఈఎల్ భారీ ప్రాజెక్టును చేపడుతుండటంతో అనేక అనుబంధ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కానున్నాయి. -
యుద్ధ విమానం స్వదేశీ గర్జన!
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అంకుర సంస్థలకు ప్రోత్సాహం రక్షణ రంగంలో స్టార్టప్స్ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్పీ సామర్థ్యం కలిగిన ఇంజన్ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు. 2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్సీఏ ఎంకే–2 ఇండక్షన్కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ఎలైట్ క్లబ్లో చేరడం గర్వకారణం ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్లో చేరడం గర్వకారణం. యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది. -
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని, ఇతర రక్షణ రంగ కర్మాగారాలను ప్రైవేటుపరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రతతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న74 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హరీశ్రావు శనివారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. ‘డిఫెన్స్ రంగానికి చెందిన ఏడు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది’అని తన లేఖలో పేర్కొన్నారు. ‘ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి గతేడాదిలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సిబ్బంది సమయానికి పూర్తి చేశారు. కానీ ఈ ఏడాదిలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ‘ఖాయిలా పరిశ్రమ’’(సిక్ ఇండస్ట్రీ)గా ప్రకటిస్తారని కారి్మకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులతో పాటు పరోక్షంగా మరో ఐదువేల మంది ఉపాధి దెబ్బతింటుంది’అని హరీశ్రావు లేఖలో పేర్కొన్నారు. ఎద్దుమైలారం ఫ్యాక్టరీలో యంత్రాలను ఆధునీకరించాలని, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. -
హెచ్ఏఎల్లో 3.5% వాటా అమ్మకం
ముంబై: రక్షణ రంగ పీఎస్యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2,450 ధరలో ప్రభుత్వం అమ్మనున్నట్లు హెచ్ఏఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు సమకూరే వీలుంది. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం తొలుత 1.75 శాతం ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచనుంది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75 శాతం వాటాను సైతం ఇన్వెస్టర్లకు బదిలీ చేయనుంది. ఈ నెల 23న సంస్థాగత ఇన్వెస్టర్లకు, 24న రిటైలర్లకు ఓఎఫ్ఎస్ విండో ఓపెన్ కానుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7 శాతం(రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది. 2020లో ప్రభుత్వం కంపెనీలో 15 శాతం ఈక్విటీని షేరుకి రూ. 1,001 ధరలో విక్రయించింది. దీంతో రూ. 5,000 కోట్లు అందుకుంది. 2018 మార్చిలో లిస్టయిన కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్మెంట్, సీపీఎస్ఈల షేర్ల బైబ్యాక్ల ద్వారా దాదాపు రూ. 31,107 కోట్లు సమకూర్చుకుంది. హెచ్ఏఎల్ వాటా ద్వారా మరో రూ. 2,867 కోట్లు జమ చేసుకునే వీలుంది. బడ్జెట్ అంచనాలు రూ. 65,000 కోట్లుకాగా.. ప్రభుత్వం గత నెలలో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ. 50,000 కోట్లకు కుదించిన విషయం విదితమే. -
సత్యసాయి జిల్లాలో క్షిపణుల తయారీ
సాక్షి, అమరావతి: దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన అధునాతన క్షిపణులు (మిస్సైల్స్) రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. క్షిపణులతోపాటు రాడార్ టెస్ట్ బెడ్, ఇతర రక్షణ రంగ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనుంది. ఈ యూనిట్కు రూ.384 కోట్లు కేటాయిస్తూ శనివారం మచిలీపట్నంలోని బీఈఎల్లో జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించింది. 2016లో ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద కేటాయించిన భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంతో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. దీంతో ఈ యూనిట్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దీనిపై దృష్టి సారించారు. త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టీలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బోర్డు సమావేశం అనంతరం బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్, మనోజ్ జైన్, డాక్టర్ పార్థసారధి మంగళగిరిలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసి ప్రభుత్వం చొరవను అభినందించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు మొదలుపెడతామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. -
రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీష్రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెరుగుతున్న ఎగుమతులు దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది. సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అందించాం. డిఫెన్స్ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నాయి. పరిశోధనల అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి డీఆర్డీవోకి చెందిన నేవల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్ఎంఆర్ఎల్)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) ల్యాండ్ బేస్డ్ ప్రోటోటైప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్ బేస్డ్ ఏఐపీ సబ్మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది. శారదాపీఠంలో సతీష్రెడ్డి పూజలు సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. -
రక్షణ రంగంలో సహకారం బలోపేతం
టోక్యో: రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్లు నిర్ణయించుకున్నాయి. జపాన్ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాల అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలుపుతూ మంత్రులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్ భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం. ‘రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి’ అని రాజ్నాథ్ ట్వీట్చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పరిశ్రమలను రాజ్నాథ్ కోరారు. మరోవైపు, భారత్–జపాన్ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు.‘ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇతర దేశాలతో విభేదాలను పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, సైనిక చర్యలకు పాల్పడకూడదు. దేశాల మధ్య తగాదాలు, వాతావరణ మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతోంది. దీంతో ఇంథన, ఆహార భద్రత సంక్షోభంలో పడుతోంది’ అని జైశంకర్ అన్నారు. -
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. ఏకంగా 14 అంతస్తులు, 2,300 కంపార్ట్మెంట్లు
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఘనంగా చాటే రోజు రానే వచ్చింది. ఇప్పటిదాకా మన దగ్గరున్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలు అందించింది. 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీ–1కు కూడా అదే పేరు పెట్టారు. నాటి విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రమే కానుంది. అత్యాధునిక సాంకేతికత విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. మేజర్ మాడ్యులర్ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్ ఓటీ, ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్బాక్స్లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ తదితరాలున్నాయి. టేకాఫ్ సమయంలో ఎయిర్క్రాఫ్ట్కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్ వీలవుతుంది. ఏ భాగమైనా మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. 550 సంస్థలు, 100 ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం కేరళలోని కొచ్చి షిప్యార్డ్లో 2005లో విక్రాంత్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్ షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. బీఈఎల్, భెల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్, ఎస్ఆర్ గ్రూప్, మిథానీ, జీఆర్ఎస్ఈ, కెల్ట్రాన్, కిర్లోస్కర్, ఎల్ అండ్ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్ఎంఈలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 23 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ ప్లాంట్లు, స్టీరింగ్ గేర్స్ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ఉపాధి దొరికింది. పరోక్షంగా పలు తయారీ సంస్థల్లో 40 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. గంటలో వెయ్యిమందికి చపాతీ, ఇడ్లీ రెడీ ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. ఎందుకంత కీలకం? రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయి. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిగేట్లు, 20 కార్వెట్లున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు మరో యుద్ధనౌకను నిర్మించగలం విక్రాంత్ తయారీలో ప్రతి రోజూ ఉత్కంఠగానే గడిచింది. కరోనాతో కాస్త ఆలస్యమైనా అద్భుతంగా నిర్మించాం. మరో యుద్ధనౌకను కూడా నిర్మించగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాం. విక్రాంత్ తయారీలో 76 శాతం స్వదేశీ పరిజ్ఞానమే. తర్వాతి క్యారియర్ నిర్మాణానికల్లా దీన్ని 85 శాతం వరకు పెంచుకోగలం. – మధునాయర్, కొచ్చి షిప్యార్డు సీఎండీ – సాక్షి, విశాఖపట్నం -
ప్రపంచ సంక్షేమానికే రక్షణ ఉత్పత్తులు
పటాన్చెరు: రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో సాధిస్తున్న విజయాలు, మిస్సైళ్లు, ఇతర సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఏ దేశాన్నో భయపెట్టేందుకు కాదని.. అవి కేవలం ప్రపంచ సంక్షేమానికేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్ హెడ్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో బీడీఎల్ కంచన్ బాగ్లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ రంగ సాంకేతికత ఆర్ఎఫ్ సీకర్ను.. ఏపీలోని వైజాగ్లో నెలకొల్పిన రక్షణ రంగం సెంట్రల్ స్టోర్స్ను, పశ్చిమ గోదావరిలోని మిలటరీ, మాధవరంలో బీడీఎల్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన స్కూల్, జిమ్, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం దేశ రక్షణ రంగంలో ఎవరూ ఊహించని విధంగా గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని.. అందులో అగ్నిపథ్ కూడా ఒకటని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లోని విధివిధానాలను అధ్యయనం చేశాకే అగ్నిపథ్ను ప్రవేశపెట్టామన్నారు. బీడీఎల్ పరిశోధనలు, యుద్ధ ట్యాంకుల తయారీ, సాంకేతికతలో రక్షణ రంగానికి తోడ్పాటునందిస్తున్న తీరు హర్షణీయమని చెప్పారు. శాస్త్రవేత్తలను, బీడీఎల్ ఉద్యోగుల పనితీరును అభినందించారు. రక్షణ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం రక్షణ రంగ పరిశోధనలకు, విద్యా సంస్థల అనుసంధానం అవసరమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఉండేవని.. ఇప్పుడు 250 సీపీఎస్ఈలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులతో కొనసాగుతున్నాయని రాజ్నాథ్ చెప్పారు. -
జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో కీలకమైన సమాచారం లీకైన కేసులో సీబీఐ మంగళవారం రెండు చార్జిషీటుల్ని దాఖలు చేసింది. ఒక కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై అభియోగాలు నమోదు చేయగా, రెండో చార్జిషీటులో మరో నలుగురిపై అభియోగాల్ని మోపింది. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో వాయువేగంతో సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 3న తొలి అరెస్ట్ చేసిన సీబీఐ 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్ సింగ్, ఎస్జే సింగ్లు ఉంటే మరో కేసులో హైదరాబాద్కు చెందిన అలెన్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్బి రావు, కె.చంద్రశేఖర్లు నిందితులుగా ఉన్నారు. -
ఆర్మీ ఆధునీకరణకు రూ.13,165 కోట్లు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ. 13,165 కోట్ల కేటాయింపులకు రక్షణశాఖ బుధవారం ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఎఎల్హెచ్ మార్క్–3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సంస్థ హెలికాఫ్టర్ల కోసం రూ. 3,850 కోట్లు, రాకెట్లు, ఇతర ఆయుధాల కోసం రూ.4,962 కోట్లు వ్యవయం అవుతుందని అంచనా వేసినట్టుగా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.7,523 కోట్లతో అర్జున్ ట్యాంకులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే హెలికాప్టర్ల కొనుగోలుకి రక్షణ శాఖ భారీగా కేటాయింపులు జరిపింది. డబుల్ ఇంజిన్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ హెలికాప్టర్లు 5.5 టన్నుల బరువున్న కేటగిరీలోకి వస్తాయి. మొత్తమ్మీద భారత్ ఆర్మీ ఆధునీకరణ కోసం రూ.13,165 కోట్లు కేటాయింపులు జరిపితే, అందులో రూ.11,486 కోట్లు స్వదేశీ సంస్థలకే వెళతాయని ఆ ప్రకటన వివరించింది. -
రక్షణ రంగాన్ని మోదీ బలోపేతం చేశారు
డెహ్రాడూన్: రక్షణ రంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులను పెంచడం ద్వారా ప్రధాని మోదీ రక్షణ రంగాన్ని బలోపేతం చేశారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం వ్యాఖ్యానిం చారు. ఉత్తరాఖండ్లోని రైవాలాలో మాజీ సైనికు లతో ఆయన చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ రక్షణ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. 2011–12లో రూ. 1,45,000 కోట్లుగా ఉన్న రక్షణరంగ బడ్జెట్ నేడు రూ. 4,78,000 కోట్లకు చేరుకుందని అన్నారు. ప్రధాని మోదీ రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో చెప్పడానికి ఈ అంకెలు చాలని పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శంకుస్థాపన చేసిన ప్రపంచ పొడవైన సొరంగ హైవే (9.02 కిమీ) మోదీ హయాంలో పూర్తయిందన్నారు. 10 వేల అడుగుల ఎత్తులో మనాలిని లేహ్తో కలుపుతున్న ఈ సొరంగ మార్గం యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు స్తబ్ధుగా ఉండిపోయిందన్నారు. నిర్ణయాత్మ కతతో పాటు ముందుచూపు కలిగిన ప్రధాని మోదీ ఢిల్లీలోని వార్ మెమోరియల్ నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఆర్మీలో ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేశారని చెప్పారు. నిర్ణయాలు తీసుకొనే అధికారా న్ని మోదీ సాయుధ బలగాలకు ఇచ్చారని చెప్పారు. పదేళ్ల క్రితం అలాంటి నిర్ణయాల కోసం ప్రభుత్వం చెప్పే వరకు బలగాలు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. -
డ్రోన్ విధ్వంసక వ్యవస్థ త్వరలోనే సైన్యానికి..
భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. సాక్షి, అమరావతి: శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు, అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేసిందని సంస్థ చైర్మన్ జి. సతీశ్రెడ్డి వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు ఈ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ విధ్వంసక వ్యవస్థతోపాటు రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్న తీరును ఇలా వివరించారు.. ►డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ►ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. ►టీటీడీతో సహా ఎవరైనా సరే ఆ పరిశ్రమల నుంచి డ్రోన్ విధ్వంసక టెక్నాలజీని కొనుగోలు చేసి అవసరమైనచోట్ల నెలకొల్పుకోవచ్చు. టాప్ ఫైవ్లో భారత్ ►రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే మొదటి ఐదు అగ్రరాజ్యాల జాబితాలో స్థానం సాధించింది. ►బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. ►అత్యాధునిక తేజస్ యుద్ధ విమానాలను రూపొందించిన ఆరు దేశాల్లో మన దేశం ఉంది. ►అణు ట్యాంకర్లు కలిగిన ఏడు దేశాల్లో భారత్ ఉంది. ►క్షిపణి విధ్వంసకర వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆరు దేశాల్లో భారత్కు చోటు దక్కింది. ►ఉపగ్రహాలను న్యూట్రలైజ్ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉండటం గర్వకారణం. ►ప్రపంచంలోనే అత్యంత దూరంలోని అంటే 48 వేల కి.మీ. వరకు షెల్స్ ప్రయోగించే 155 ఎంఎం గన్ను రూపొందించాం. ►దేశంలో 2 వేల ప్రధాన పరిశ్రమలతోపాటు మొత్తం 11వేల పరిశ్రమలు రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. ►రాబోయే ఐదారేళ్లలో రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడాలన్నదే ప్రస్తుత లక్ష్యం. ►కృష్ణాజిల్లాలోని నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం దేశంలో కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం, డీఆర్డీఓ పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని సతీశ్రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతుండటంతోపాటు లిక్విడ్ ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ట్యాంకర్లను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. కరోనాను అరికట్టేందుకు మొత్తం 75 రకాల ఉత్పత్తులను కనిపెట్టడంతోపాటు 190 రకాల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. -
సౌదీలో రక్షణ రంగంలోకి తొలిసారిగా మహిళలు
రియాద్: మహిళాభ్యున్నతిలో సౌదీ అరేబి యా రాచరిక వ్యవస్థ మరో అడుగు ముం దుకు వేసింది. శతాబ్దాలుగా పురుషులకు మాత్రమే పరిమితమైన సౌదీ రక్షణ రంగంలోకి తొలిసారిగా మహిళలు అడుగుపెట్టి, దేశ రక్షణ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇకపై సౌదీనారీమణులు రక్షణ రంగంలో స్త్రీపురుష వివక్షకి చెరమగీతం పాడుతూ నావికా దళం మొదలుకొని, గగనతల రక్షణ వ్యవస్థ వరకు అన్నింటా అడుగుపెట్టబోతున్నారు. సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో భాగంగా సౌదీ మహిళలకు విభిన్న విభాగాల్లో ప్రవేశం కల్పిస్తూ మహిళా సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగానే తాజాగా సౌదీ రక్షణ శాఖ పకటన చేసింది.సౌదీ అరేబియన్ ఆర్మీ, రాయల్ సౌదీ వైమానిక దళం, రాయల్ సౌదీ నావికాదళం, రాయల్ సౌదీ వ్యూహాత్మక మిస్సైల్ ఫోర్స్, ఇతర సాయుధ బలగాలు, సైనిక వైద్య సేవారంగంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సౌదీ రక్షణ శాఖ ప్రకటించింది. -
భారత్ లక్ష్యం.. ‘మేక్ ఫర్ వరల్డ్’
సాక్షి, బెంగళూరు: రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని సాకారం చేసిన భారత్ తదుపరి లక్ష్యం ‘మేక్ ఫర్ వరల్డ్’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక సమీపంలో బుధవారం ప్రారంభమైన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగళూరులో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు యుద్ధ సామగ్రిని ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. దేశంలో రక్షణ సామగ్రి ఉత్పత్తి కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దాదాపు 500 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాల కోసం 1.3 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. దేశ సరిహద్దులతో పాటు నీరు, నేల రక్షణ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. భారత వాయుసేన తేజస్ ఎంకే1 లఘు యుద్ధ విమాన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా, ఏరో ఇండియా ప్రదర్శనలో భారత వైమానిక దళ పాటవం అబ్బురపరిచింది. యుద్ధ హెలికాప్టర్లు, విమానాలు, సూర్యకిరణ్ జెట్ల విన్యాసాలు సందర్శకులను అలరించాయి. ఏరో ఇండియా ప్రదర్శన ద్వారా భారత ఖ్యాతి మరింత వెలుగులోకి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్తో రూ.48వేల కోట్ల డీల్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రూ.48వేల కోట్లతో 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల(ఎల్సీఏ) కొను గోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సమక్షంలో ఒప్పంద పత్రాలను రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు హెచ్ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్కు అందజేశారు. -
‘ఆత్మ నిర్భర్’తో నూతనోత్తేజం
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగంలో స్వావలం బనకు సరికొత్త ప్రయత్నం మొదలైంది. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా 108 వ్యవస్థలు, ఉపవ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు డీఆర్డీవో శ్రీకారం చుట్టింది. ఈ టెక్నాల జీలు మనకు చేసే మేలు ఏమిటి? ఆత్మ నిర్భర్ భారత్తో రక్షణ రంగంలో వచ్చిన మార్పులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనేందుకు డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీశ్రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: రక్షణ రంగంలో స్వావలంబన కోసం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో వచ్చిన మార్పులేమిటి? జవాబు: స్వావలంబన సాధించాలన్నది దేశ చిరకాల వాంఛ. నిజానికి డీఆర్డీవో ఏర్పాటు ఉద్దేశాల్లో ఇది ఒకటి. ఆరు దశాబ్దాలుగా డీఆర్ డీవో కీలకమైన రక్షణరంగ వ్యవస్థల్లో ఇతరు లపై ఆధారపడకుండా ఉండేందుకు పరిశోధ నలు సాగిస్తోంది. స్వావలంబన సాధించేం దుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా పిలుపునిచ్చారు. దీనివల్ల అక్కడక్కడా జరుగుతున్న వేర్వేరు ప్రయత్నాలు ఏకతాటి పైకి వస్తాయి. ఫలితంగా లక్ష్యాన్ని వేగంగా అందుకోవచ్చు. ప్రధాని పిలుపు రక్షణ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో కొత్త చైతన్యం నింపిందనడంలో సందేహం లేదు. శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పును నేను కూడా ప్రత్యక్షంగా గమనిస్తున్నా. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం డీఆర్డీవో అంతర్గత శక్తియుక్తులను బహిర్గతం చేస్తోందంటే అతిశయోక్తి కాదు. ప్ర: దేశానికి అవసరమైన అన్ని రకాల మైక్రోప్రాసెసర్లు, ఆపరేటింగ్ సిస్టమ్లను సొంతంగా తయారు చేసుకొనే అవకాశం ఉందా? జ: కచ్చితంగా ఉంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధం తీరుతెన్నులు మారిపోతున్నాయి. సైబర్ యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మక వ్యవస్థలు, ఆస్తులను కాపాడుకోవడం అత్యవసరం. డీఆర్డీవో ఇందుకోసం అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తోంది. మనదైన ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. డీఆర్డీవో ఇప్పటికే సొంత ఓఎస్ను అంతర్గతంగా ఉపయోగిస్తోంది. మైక్రోప్రాసెసర్ల తయారీలో కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని తప్పించుకొనేందుకు పరిశ్రమ వర్గాలతో కలసి సిస్టమ్ ఆన్ చిప్తోపాటు కొన్ని ప్రాసెసర్ల అభివృద్ధి కూడా చేపట్టాం. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితాలను మనం త్వరలోనే చూడబోతున్నాం. ప్ర: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కోసం డీఆర్డీవో గుర్తించిన 108 రకాల రక్షణ వ్యవస్థల వల్ల లాభాలేమిటి? జ: భారతీయ పరిశ్రమ వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఈ 108 రక్షణ వ్యవస్థలు, ఉప వ్యవస్థలపై పనిచేసే క్రమంలో పరిశ్రమ వర్గాలు అత్యాధునిక టెక్నాలజీల డిజైనింగ్, డెవలప్మెంట్ సామర్థ్యాన్ని సంపాదించుకుంటాయి. ఈ సామర్థ్యం కాస్తా పరిశ్రమ మరింత ప్రగతి సాధించేందుకు తద్వారా భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాలను తీర్చగలిగేవిగా మారతాయి. ఆత్మనిర్భర్ భారత్కు పరిశ్రమ తోడ్పాటు అందించడమే కాకుండా రక్షణ రంగంలో మరిన్ని ఎగుమతులు సాధించేందుకు వీలు ఏర్పడుతుంది. ప్ర: డీఆర్డీవో టెక్నాలజీలను సామాన్యులకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ: సరిహద్దు ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ప్రజలు చాలా మంది ఇప్పటికే డీఆర్డీవో టెక్నాలజీలతో లాభం పొందుతున్నారు. కొండ ప్రాంతాల్లోనూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అనువైన టెక్నాలజీలను మేం రూపొందించాం. ఈ పద్ధతిలో పండిస్తున్న పంటలను సమీపంలోని భద్రతా దళాలు వినియోగిస్తున్నాయి. డెంగీ, చికన్ గున్యా, దోమల్లాంటి కీటకాలను పారదోలే మందు, ఆహార కాలుష్యాన్ని గుర్తించే కిట్లను చాలా మంది వాడుతున్నారు. మానవ వ్యర్థాలను ఇంధనంగా మార్చేందుకు డీఆర్డీవో బయో డైజెస్టర్ను అభివృద్ధి చేసింది. హిమాలయాల్లో విధులు నిర్వహించే సైనికుల కోసం సిద్ధం చేసిన ఈ టెక్నాలజీ ఇప్పుడు సమాజం మొత్తానికి ఉపయోగపడుతోంది. తాజాగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గుర్తించిన 108 వ్యవస్థల్లోనూ కొన్నింటిని సామాన్య ప్రజల వినియోగానికి తెచ్చే ప్రతిపాదన ఉంది. పౌరుల వాడకానికి ఉపయోగపడే టెక్నాలజీలను డీఆర్డీవో పరిశ్రమలకు ఉచితంగా బదలాయిస్తోంది. ప్ర: రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం వల్ల ధరలు ఎక్కువ కావా? జ: కానేకావు. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... ఇందుకోసం పలు మార్పులు చేశాం. ఆరోగ్యకరమైన పోటీ కారణంగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా రక్షణ వ్యవస్థల ధరలు తక్కువగానే ఉంటాయి. ఎగుమతులు చేసుకొనేందుకూ అవకాశం కల్పిస్తుండటం వల్ల పరిశ్రమలకూ తగిన లాభాలు ఉంటాయి. ప్ర: ఆత్మనిర్భర భారత్ సాకారమైతే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు? జ: రక్షణరంగ వ్యవస్థల అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది కొనసాగుతూనే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పులను జోడించడం, మెరుగైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవడం అవసరం. అయితే దిగుమతుల ఖర్చులతో పోలిస్తే స్థానికంగా తయారు చేసుకోవడం వల్ల మూడింట రెండొంతులు ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. విదేశీ మారకద్రవ్యం రూపేణా పెద్ద మొత్తంలోనే ఆదా చేసుకోవచ్చు. -
స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్ స్థాయి పెరుగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచశాంతి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సుస్థిరంగా ఉండేందుకు ఇది సాయపడుతుందని పేర్కొన్నారు. రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి గురువారం ప్రధాని ప్రసంగించారు. రక్షణ సామర్థ్యాల్లో స్వావలంబన సాధించడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతం రక్షణ కల్పనలో భారత్ పాత్ర పెరుగుతుందన్నారు. వ్యూహాత్మక సంబంధాలను బట్టి పలు మిత్ర దేశాలకు రక్షణ సరఫరాదారుగా కూడా మారుతుందని తెలిపారు. ‘ప్రపంచదేశాల్లో భారత్ అతిపెద్ద రక్షణ వస్తువుల దిగుమతిదారుగా ఉంది. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు గతంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రక్షణ పరికరాల దిగుమతులపై విధించిన నిషేధంతో దిగుమతులకు అడ్డుకట్ట పడటంతోపాటు దేశీయ పరిశ్రమ బలోపేతం అవుతుంది. నిషేధం జాబితాలో మరిన్ని వస్తువులను కూడా త్వరలో చేరుస్తాం’అని తెలిపారు. నూతన విధానంతో దేశీయ ఉత్పత్తి పెరగడంతోపాటు ప్రైవేట్ రంగం సాయంతో సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆటోమేటిక్ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఉభయతారకంగా పనిచేస్తుందని వివరించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. దేశీయ సాంకేతికత, సామగ్రిని ఉపయోగించుకుని యుద్ధంలో పోరాడి, విజయం సాధించడానికి మించిన సంతృప్తి మన జవాన్లకు మరేదీ లేదన్నారు. తరువాతి తరం సైనిక సంపత్తి అభివృద్ధిలో దేశీయ పరిశ్రమతో కలిసి ముందుకు సాగుతామన్నారు. -
ఆస్ట్రేలియాతో ఏడు ఒప్పందాలు
న్యూఢిల్లీ–మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మధ్య గురువారం ఆన్లైన్ సదస్సు జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇరువురు నేతలు ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. మిలటరీ స్థావరాల్లో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎమ్ఎల్ఎస్ఏ)పై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో పరస్పరం సహకారం అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాలు మరొకరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇకపై మరమ్మతులు, సైనికుల అవసరాలను తీర్చే సామగ్రి సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాన్ని మరొకరు వినియోగించుకోవచ్చు. ఎమ్ఎల్ఎస్ఏ ఒప్పందంతో పాటుగా సైబర్ టెక్నాలజీ, ఖనిజాలు తవ్వకాలు, మిలటరీ టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులు, జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ► ఇండో పసిఫిక్ తీర ప్రాంతం భద్రతపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. ‘‘షేర్డ్ విజన్ ఫర్ మ్యారీ టైమ్ కోపరేషన్ ఇన్ ది ఇండో పసిఫిక్’’అన్న పేరుతో ఒక డిక్లరేషన్ను ఆవిష్కరించాయి. సంక్షోభాల నుంచి అవకాశాలు ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపించిన తీవ్రమైన సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి బయటపడడానికి సమన్వయంతో, సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. దానికనుగుణంగా అన్ని రంగాల్లోనూ సమగ్రమైన సంస్కరణలు తీసుకువచ్చే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ► అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా సంపూర్ణ మద్దతుని ప్రకటించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్ని శాశ్వత సభ్యదేశంగా చేయడానికి మద్దతునిస్తామని చెప్పింది. సమోసా కిచిడీ దౌత్యం స్కాట్ మారిసన్ గుజరాతీ కిచిడి వండి వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. మోదీతో ఆన్లైన్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈసారి ఇరువురి సమావేశం జరిగినప్పుడు తానే స్వయంగా కిచిడి వండి తినిపిస్తానన్నారు. భారతీయ సమోసా, మాంగో చెట్నీలు స్వయంగా తయారు చేసిన మారిసన్ వాటి రుచిని ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తానే స్వయంగా భారత్కు వచ్చి మోదీని కలుసుకొని సమోసా తినిపించాలని అనుకున్నానని మారిసన్ చెప్పారు. మోదీ ఆలింగనాన్ని కూడా మిస్ అయ్యానన్నారు. ఈ సారి కలిసినప్పుడు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని గుజరాతీ కిచిడీని స్వయంగా వండి తినిపిస్తానని చెప్పారు. దీనికి మోదీ బదులిస్తూ ‘మీరు సమోసాలు షేర్ చేయగానే దేశమంతా దాని గురించే మాట్లాడారు. ఇంక అందరూ గుజరాతీ కిచిడీ గురించే మాట్లాడుకుంటారు. గుజరాతీయులు చాలా ఆనందపడతారు. ఈ కిచిడీని దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు’అని మోదీ బదులిచ్చారు. -
మాటల కోటల్లో.. రక్షణకు అరకొరే..
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.18 లక్షలకోట్లు కేటాయించింది. కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించారు. 2019–20 సవరించిన రూ. 3.31 లక్షల కోట్ల అంచనా ప్రకారం అయితే ఈ పెంపుదల కేవలం 1.8 శాతం మాత్రమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చైనా–భారత్ యుద్ధం1962 తరువాత రక్షణ రంగానికి జరిపిన అతితక్కువ బడ్జెట్ కేటాయింపులు. ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణకు రూ.2.09 లక్షల కోట్లు అవుతుంది. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే ఈ మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి. చైనా తన రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటున్న నేపథ్యంలోనూ, మారుతున్న దేశభద్రత రీత్యా, సుదీర్ఘకాలంగా పెండింగ్లో రక్షణ రంగ ఆధునికీకరణకు ఇంకా ఎక్కువ నిధులు అవసరమవుతాయి. గత ఏడాది బాలకోట్ దాడుల అనంతరం బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం అయ్యింది. అయితే ఊహించిన దానికంటే భిన్నంగా తక్కువ నిధులే కేటాయించారు.అవసరాలను అనుగుణంగా కేటాయింపులు లేకపోయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే ఈ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ‘‘రక్షణ రంగానికి కేటాయించిన ని«ధులు సరిపోక పోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్ కి చెందిన డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.1,03,394 కోట్లను రూ.1,13,734 కోట్లకు పెంచారు. ఇది గతం కంటే 10,340 కోట్ల రూపాయలు అధికం. ఇక ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణ విభాగాలను కలిపితే రూ.2,09,319 కోట్ల రూపాయలవుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం 2019–20లో వేతనాలూ, తదితరాలకు 2,01,901 కోట్ల రూపాయలు కేటాయించారు. గత పదేళ్లలో రక్షణ రంగ కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతియేటా సుమారు రక్షణ రంగం నుంచి దాదాపు 60,000 మంది పదవీ విరమణ చేస్తున్నందున ఈ రంగంలో పెన్షన్లకు కేటాయించే నిధుల శాతం పెరుగుతున్నట్టు 2019లో స్టాండింగ్ కమిటీ పేర్కొన్నది. దీంతో సాయుధ దళాల ఆధునీకరణకు నిధులు తగ్గుతున్నాయి. గత పదేళ్ళలో రక్షణరంగంలోని ఉద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్న మొత్తం 12 శాతానికి పెరిగింది. ప్రభుత్వం పెన్షన్ బిల్లును, కొన్ని ఇతర పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా లేదా ముందస్తు పదవీ విరమణ ద్వారా ప్రభుత్వం పెన్షన్ బిల్లుని తగ్గిస్తుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది.