-
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు అవమానం జరిగేలా వ్యవహరిస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయన భారీ విగ్రహ ఏర్పాటుతో గౌరవిస్తోందని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేయబోతున్న భారీ విగ్రహ పనులను ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతారని మేం ఊహించలేదు. ఇంత ఖరీదైన స్థలంలో విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విగ్రహ తయారీ హర్యానాలో జరుగుతోంది. విగ్రహ ఏర్పాటు కోసం నిర్మాణ వ్యయం పెరిగినా.. ముందుకే వెళ్తున్నాం. సీఎం జగన్ నిర్ణయం నభూతో.. నభవిష్యత్. ఇచ్చిన మాటమీద నిలబడే నాయకుడు సీఎం జగన్. 2023 ఏప్రిల్ 14 నాటికి విగ్రహం ఏర్పాటు చేసి తీరతాం అని ఉద్ఘాటించారు మంత్రి నాగార్జున. గత ప్రభుత్వం అంబేద్కర్ ను అగౌరవ పరిచేలా వ్యవహరించింది. అంబేద్కర్ ఆలోచనలను అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు. దళిత జాతిని అవమాన పరిచిన చరిత్ర చంద్రబాబుది. అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు గురించి మాట్లాడటం కూడా అవమానమే అంటూ పేర్కొన్నారు. టీడీపీపై ఫైర్ టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర ఇప్పుడు గుర్తుకొచ్చిందా?. 14 ఏళ్లలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా?. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు గుర్తుకు రాలేదు?. మూడు రాజధానుల పై జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాకే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చిందా?. చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయ్. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు యాత్ర చేయిస్తున్నాడు. అమరావతి ప్రాంతంలో రైతుల కోసం కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు అని మంత్రి మేరుగ విమర్శించారు. -
కేసీఆర్ ‘విజన్ డాక్యుమెంట్’ రైతులు, దళితుల పురోభివృద్ధికి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహాలు వేగవంతం చేసిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు రైతులు, దళితులపై కొత్త పార్టీ అనుసరించే విధానంపై కసరత్తు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు దసరాను ముహూర్తంగా ఎంచుకోగా, అంతలోగానే ఈ రెండు వర్గాల అభ్యున్నతికి ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికీ ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తి జాతీయ పార్టీ ఎజెండాలో ప్రతిబింబించాలని సంకల్పిస్తున్నారు. ఈ పథకాలకు మరికొన్ని జోడించి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, ఎస్సీలతో భేటీ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల్లో ఆచరణ సాధ్యమైన వాటికి విజన్ డాక్యుమెంట్లో చోటుకల్పిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మోడల్ను పరిచయం చేసేలా... దేశంలో సాగుకు యోగ్యమైన భూమి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతు అనుకూల సాగు చట్టాల రూపకల్పన తదితరాల్లో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్.. వ్యవసాయ రంగంపై రూపొందిస్తున్న ‘విజన్ డాక్యుమెంట్’లో కొత్త పార్టీ విధానాలపై స్పష్టత ఇస్తారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, దళితబంధు వంటి వాటితోపాటు దేశవ్యాప్తంగా కాళేశ్వరం తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, వనరుల వినియోగం తదితరాలను ప్రస్తావిస్తారు. తెలంగాణ రైతుల కేస్ స్టడీలు, గణాంకాలు, నిపుణుల అభిప్రాయాలు తదితరాలను పొందుపరుస్తారు. త్వరలో దేశవ్యాప్తంగా దళిత సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా విజన్ డాక్యుమెంట్కు తుది రూపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ చేసిన డిమాండ్పై జాతీయస్థాయిలో చర్చ జరిగిందని, విజన్ డాక్యుమెంట్ మరింత చర్చకు దోహదం చేస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. -
వాసాలమర్రిలో వడివడి.. హుజూరాబాద్లో తడబడి..
హుజూరాబాద్ నుండి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధిలో ఓ విప్లవం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో ఉపాధి మార్గాన్ని చూపే ఓ కొత్త వెలుగు. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం హుజూర్బాద్లో విస్తరించి ఏడాదిని పూర్తి చేసు కుంటోంది. అయితే లక్ష్యాలు, నిబంధనలు ఒక్కటే అయినా, యాదాద్రి జిల్లా వాసాలమర్రి లబ్ధిదారుల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకం..హుజూరాబాద్లో మాత్రం తడబడుతోంది. తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు, సరైన యూనిట్ల ఎంపిక, అధికారుల పర్యవేక్షణ, మెరుగైన అమలు తీరు వాసాలమర్రి దళితులను విజయపథంలో నడిపిస్తుంటే..యూనిట్ల ఎంపికలో అవగాహన లోపం, సరైన మార్గదర్శకత్వ లేమి కారణంగా హుజూరాబాద్లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రత్యేక సర్వే.. పకడ్బందీగా అమలు వాసాలమర్రిలో స్థానిక మార్కెట్ పరిస్థితి, లబ్ధిదారుల అభిరుచులు, వారి సాంకేతిక సామర్థ్యాల పరిశీలన అనంతరం యూనిట్లను మంజూరు చేశారు. ఆపై వారు నిలదొ క్కుకునేందుకు ప్రత్యేక శిక్షణ, పరిశీలనతో ముందుకు వెళ్తుండటంతో ఇక్కడ సక్సెస్ రేటు ఊహించినదానికంటే అధికంగా ఉంది. మెజారిటీ లబ్ధిదారుల పరిస్థితి ప్రభుత్వం ఆశించిన విధంగా మెరుగుపడుతోంది. స్థానిక అవసరాల మేరకు యూనిట్లు ‘వాసాలమర్రిలో తొలుత ప్రత్యేకంగా సర్వే చేసి స్థానిక పరిస్థితులు, అవసరాలను గుర్తించాం. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో సామర్థ్యాన్ని పరిశీలించి వారు కోరుకున్నవి కాకుండా అక్కడ అవసరం ఉన్న యూనిట్లు పెట్టించాం. 75 మందికి 19 రకాల పనులు అప్పగించి చేయూతనిస్తున్నాం. మెజారిటీ లబ్ధిదారుల ఆర్థికస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది..’ అని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ చెప్పారు. ఇక్కడ కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా..! హుజూరాబాద్లో 15,710 కుటుంబాలకు దళితబంధు అందజేయాలన్న లక్ష్యంతో ఇప్పటికి 12,007 మందికి అందజేశారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు, లబ్ధిదారుల సామర్ధ్యం, మార్కెట్లో డిమాండ్ – సప్లయితో సంబంధం లేకుండా యూనిట్ల పంపిణీ సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో తమకు రూ.10 లక్షల సహాయం అందుతుందన్న సంతోషం ఉన్నా, ఆశించిన ఆదాయం రావటం లేదన్న అసంతృప్తి వెంటాడుతోంది. హుజూరాబాద్ మండలం చిల్పూరులో 324 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేస్తే అందులో 142 యూనిట్లు వాహనాలే కావటం విశేషం. ఇక ఎక్కువ సంఖ్యలో బర్రెలు తీసుకున్నవారూ సంతృప్తిగా లేరు. హరియాణాæ నుండి తెచ్చిన బర్రెలు ఆశించిన విధంగా పాలు ఇవ్వకపోగా, అనారోగ్యం పాలవున్న తీరు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లబ్ధిదారుల అవగాహన లోపం, సరైన చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాసాలమర్రిలో ‘లక్ష్మీ’ కటాక్షం దళితబంధు పథకంతో తన పేరు నిజంగా సార్ధకమైందని అంటోంది..వాసాలమర్రికి చెందిన చెన్నూరి లక్ష్మి. నలుగురు పిల్లల తల్లయిన లక్ష్మి గతంలో అద్దెకు తీసుకున్న ఆటోలో భర్తతో కలిసి ఊరూరూ తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసేది. కానీ వచ్చిన లాభంలో 75 శాతం ఆటో అద్దెకే పోయేది. ఈ నేపథ్యంలో దళితబంధు కింద లక్ష్మి ఆటో ట్రాలీ తీసుకుంది. కూరగాయలు కొని అమ్మితే లాభం ఉండదని భావించింది. తనకున్న భూమిలో బోరు వేసి తాను కూడా కాయగూరల సాగు మొదలుపెట్టింది. ఇప్పటికే నలుగురు కూతుళ్లలో ఇద్దరి వివాహాలు చేయగా, బీటెక్, ఎంబీఏ చదువుతున్న ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న కుమార్తె మానసతో కలిసి లక్ష్మి చుట్టుపక్కల పల్లెలకు ఆటోలో వెళ్లి వస్తూ వ్యాపారం చేస్తోంది. సొంత ఆటో, వ్యవసాయ పంటలతో ప్రస్తుతం లక్ష్మిఆదాయం నెలకు రూ.50 వేల వరకు చేరింది. ఇక దీపం వత్తులు చేస్తున్న బొల్లారం లావణ్య, పేపర్ గ్లాస్లు తయారు చేసి విక్రయిస్తున్న బొల్లారం రేఖలు చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఈ తరహా మార్పు వాసాలమర్రిలోని 80 శాతం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. వరినాటు మెషీన్ తీసుకున్నాం కానీ.. గతంలో కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం. దళితబంధులో మా చిన్నాన్న అయిలయ్యతో కలిసి వరి నాటు వేసే మెషీన్ తీసుకున్నం. ఇప్పటివరకు 80 ఎకరాల్లో నాట్లు వేసినం. గంటకు ఎకరం వరకు నాటు వేస్తుంది. అయితే ఆ యంత్రాన్ని నడపడం మాకు రాకపోవడంతో బాపట్ల నుంచి డ్రైవర్, టెక్నీషియన్లను తీసుకొచ్చాం. వచ్చిన ఆదాయంలో అత్యధికం డ్రైవర్, టెక్నీషియన్తో పాటు డీజిల్కే పోయింది. మాకు సరిపడా మిగిలే పరిస్థితి ఉంటే బాగుంటుంది. –పాంకుంట అనిల్, ధర్మరాజుపల్లి (హుజూరాబాద్) కేసీఆర్కు రుణపడి ఉంటాం మాకు ఎకరన్నర పొలం ఉంది. మా ఆయన వ్యవసాయం చేస్తోంటే నేను ఊళ్లోనే కూలి పనికి పోయి బతికేది. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. దళితబంధులో నెల క్రితం 4 బర్రెలు వచ్చినై. రెండు బర్లు పాలిస్తున్నై. 15 రోజులకు రూ.6 వేల వరకు వచ్చినయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. అయితే పాల దిగుబడి ఊహించినట్టుగా లేదు. – పుల్ల సరోజని, చెల్పూరు (హుజూరాబాద్) అడ్డా మీద పెట్టనివ్వలేదు.. రెండు నెలల క్రితం మాకు మా నాన్న పేరుమీద ఆటో ట్రాలీ ఇచ్చారు. ఊరిలో సరిపడా గిరాకీ దొరకటం లేదు. జమ్మికుంట అటో అడ్డాకు పోతే.. సభ్యత్వం కోసం 7 వేలు కట్టమన్నారు. అంతమొత్తం లేక ఆటో ఊరిలోనే పెట్టా. ఇక్కడ గిరాకీ దొరికితే పోతున్న. – గోపీచంద్, చెల్పూరు (హుజూరాబాద్) చేయి విడువని వ్యవస్థ కావాలి దళితబంధు అనేది సంక్షేమ రంగంలోనే అత్యద్భుతం. అయితే యూనిట్ ఎంపిక, నిర్వహణ, భవిష్యత్తులో వచ్చే సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అవసరం. ఇది ప్రభుత్వంతో పాటు దళిత ప్రజాస్వామిక సంఘాల బాధ్యత. వచ్చే ఐదేళ్ల పాటు లబ్ధిదారులకు అన్నివిధాలా సహాయకారిగా ఉండేలా చేయి విడువని వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అన్నివిధాలా అండగా ఉండాలి రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయి. రూ.3,100 కోట్లతో 29 వేల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు సూచిస్తున్నారు. ►యూనిట్ల మంజూరుతోనే సరి పెట్టుకోకుండా లబ్ధిదారులకు అన్నివిధాలా అండగా నిలవాలి. అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►లబ్ధిదారులు స్థానిక పరిస్థితులు, వారి సామర్థ్యానికి అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకునేలా చూడాలి. యూనిట్ల పంపిణీ కంటే ముందుగానే వాటిపై పూర్తి అవగాహన కల్పించాలి. అవసరమైన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. మార్కెట్ మెలకువలు కూడా వివరించాలి. ►దళితబంధు లబ్ధిదారుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించి యూనిట్లు లాభాల బాట పట్టేలా మిగతా విభాగాలతో సమన్వయం చేయాలి. ►ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, లోపాలు సరిదిద్దడంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►ప్రభుత్వ విభాగాల్లో ప్రైవేటు వాహనాల వినియోగం స్థానే.. దళితబంధు యూనిట్లకు ప్రాధాన్యవ్వాలి. ►జిల్లా స్థాయిలో గ్రీవెన్స్సెల్ పెట్టి వచ్చే ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం చూపాలి. -
వారు నమ్మనివే... నేడు జీవనాడులు
స్వాతంత్య్రం వచ్చాక అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలి రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. నిజానికి, మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన జెండాను ఆర్ఎస్ఎస్ చాలాకాలం వ్యతిరేకించింది. సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్కు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. కానీ ఆ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. అశోక చక్రంతో కూడిన మువ్వన్నెల జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► 75ఏళ్ళ స్వాతంత్య్ర మహోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో భారత జాతీయ పతాకం ప్రాముఖ్యంపై దేశవ్యాప్తంగా కీలకమైన చర్చ ఒకటి నడుస్తోంది. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రంతో కూడిన పతాకాన్ని ట్విట్టర్లో పంచుకుంది. కమ్యూనిస్టులు అసలు జాతీయ పతాకం తాలూకు చర్చ పట్టనట్టుగా వ్యవహరించారు. బహుశా వారికి త్రివర్ణ పతాకం కంటే తమ ఎర్రజెండానే ముద్దేమో మరి! ► బీజేపీ, కాంగ్రెస్లు తమ వాళ్ల చిత్రాలతో ప్రదర్శించుకునేందుకు వారికే సొంతమైన పార్టీ జెండాలు ఉండనే ఉన్నాయి. అవసరమైతే వారు వీటిని తమ ఇళ్లపై ఎగరేయడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటుకోవచ్చు. అయితే ఈ దేశంలో ఉత్పాదక వర్గం దృష్టిలో జాతీయ పతాకం ప్రాముఖ్యం ఏమిటన్నది చూడాలి. కులాల ప్రాతిపదికన చూస్తే ఈ ఉత్పాదక వర్గం శూద్ర/ దళిత/ ఆదివాసీ వర్గాలతో కూడినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వాతంత్య్రం తరువాత ఈ దేశంలో నమోదైన అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలే విజయవంతమైన రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. రైతు నాయకులు తమ సంఘర్షణకు ప్రతీకగా జాతీయ పతాకం మినహా మరేదీ లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ ఉద్యమం జాతీయ పతాకం అసలు వారసులు ఎవరో నిర్ణయించిన ఉద్యమం. జాతీయ పతాకం మాదే అన్న రైతుల ధీమా అసలైనది. సాధికారికమైనది కూడా! ► మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన మన జెండాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చాలాకాలం పాటు వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ‘‘మన నేతలు ఈ దేశానికి ఓ కొత్త జాతీయ జెండాను సిద్ధం చేశారు. ఎందుకిలా? కేవలం పక్కదోవ పట్టించేందుకు, ఇంకొకరిని అనుకరించేందుకు మాత్రమే! అసలీ జెండా ఉనికిలోకి ఎలా వచ్చింది? ఫ్రెంచ్ విప్లవ సమయంలో ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ’’ భావనలకు ప్రతీకలుగా ఫ్రెంచి వారు మూడు రంగుల జెండాను సిద్ధం చేసుకున్నారు. దాదాపు ఇవే సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమెరికన్ విప్లవకారులూ కొన్ని మార్పులతో ఫ్రెంచి వారి మూడు వర్ణాల జెండాను తయారు చేసుకున్నారు. మన ఉద్యమకారులకూ ఈ మూడు వర్ణాలపై ఓ వ్యామోహం ఉందన్నమాట. దీన్నే కాంగ్రెస్ పార్టీ భుజానికెత్తుకుంది’’ అని రాసుకున్నారు. ► ఆర్ఎస్ఎస్ గురూజీకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. వీటితో కులం, వర్ణం, ధర్మ వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నది ఆయన ఆలోచన. ఇస్లామిక్ జెండాలోని పచ్చదనం మాదిరిగానే కమ్యూనిస్టుల ఎర్రజెండాలోని ముదురు ఎరుపు రంగు ఉందని ఆర్ఎస్ఎస్ అనుకునేది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి కూడా శ్రామిక విప్లవానికి ప్రతీకగా నిలిచే ఎర్రజెండా మినహా మరే జెండా పట్ల గౌరవం ఉండేది కాదు. ఎరుపు, తెలుపు, పచ్చదనాల మేళవింపుతో కూడిన జాతీయ పతాకాన్ని ఆమోదించిన తరువాత రాజ్యాంగ విధానసభ చర్చల్లో అంబేడ్కర్ ఆ పతాకం మధ్యలో గాంధీ ప్రతిపాదించిన చరఖాకు బదులు అశోకుడి చక్రం ఉండాలని కోరారు. అంబేడ్కర్ అప్పటికే బౌద్ధ మతం వైపు ఆకర్షితుడై ఉన్నారు. ► 1947 జూలై 22న జాతీయ పతాకం ప్రస్తుత రూపంలో ఆమోదం పొందగా, ఆగస్టు 15 అర్ధరాత్రి తొలిసారి దాన్ని ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్/బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉండివుంటే జెండా ఈ రూపంలో ఉండేది కాదు. కాషాయ ధ్వజం మన జెండా అయ్యుండేది. బహుశా దాని మధ్యలో ఓ స్వస్తిక్ చిహ్నం చేరి ఉండేదేమో! దేశవ్యాప్తంగా ముస్లిమ్లు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుంటే విభజన సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలిసేది కాదు. ద్విజుల ఆధిపత్యంలో హిందూ/హిందూత్వ వాతావరణం నిండుకున్న సమయంలో శూద్ర/దళిత/ఆదివాసీ సమూహాల పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది కాదు. అయితే అంబేడ్కర్ తన సంస్థ జెండా కోసమూ నీలి వర్ణాన్నే ఎన్నుకున్నాడు. ఇప్పుడు బహుజన సమాజ్పార్టీ జెండాలోనూ కనిపిస్తుంది. నాకైతే 2021–22లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక రైతు ఉద్యమంతోనే జాతీయ పతాకానికి కొత్త అర్థం లభించిందని అనిపిస్తుంది. ► 1947 ఆగస్టు 15న మువ్వన్నెల జెండాను ఎగురవేసింది మొదలు వర్ణధర్మం వల్ల ఇబ్బందులు పడ్డ శూద్రులు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో ఒక కొత్త దశ మొదలైందని నా నమ్మకం. అందుకే ఈ వర్గాల వారు త్రివర్ణ పతాకంపై మరింత నమ్మకం పెంచుకోవాలని భావిస్తున్నా. అదృష్టవశాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా మువ్వన్నెల్లోని మూడు రంగులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలుగా రాజ్యాంగ రచన సమయంలో పలు సందర్భాల్లో రూఢి చేయడం గమనార్హం. గోల్వాల్కర్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అతడికి ఎంత ద్వేషం ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. కానీ ఈ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. ► జాతీయ పతాకం పైభాగంలోని ఎరుపు లాంటి రంగు సూచించే విప్లవమే దేశంలోని ఉత్పాదక వర్గం కోరిక కూడా! తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కులాధిపత్యం, శోషణ, అస్పృశ్యత, హింస వంటివాటికి ఫుల్స్టాప్ పెట్టి శాంతి నెలకొనాలని శూద్ర, దళిత, ఆదివాసీలూ కాంక్షించారు. ఆకుపచ్చదనం గురించి ఆర్ఎస్ఎస్ మేధావులు ఊహించినట్లు ఇస్లామ్ను సూచించలేదీ రంగు. పైరుపచ్చలు, పర్యావరణ హిత జీవనవిధానం, పాడి పశువుల వంటి వాటిని మాత్రమే సూచించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోరుకుంటున్న హరిత పర్యావరణ ఉద్యమాలే మన జాతీయ జెండాలోని పచ్చ రంగు అన్నమాట. ఈ పచ్చదనాన్ని సూచించేదెవరు? ఈ దేశపు రైతన్నలు! ► ఆధునిక చరిత్రలో రైతులకు అసలు సిసలైన ప్రతినిధి మహాత్మా జ్యోతీరావు ఫూలే. శూద్రులు, అతిశూద్రులుగా జ్యోతిరావు ఫూలే అభివర్ణించే రైతుల సమస్యల కేంద్రంగానే ఆయన రచనలన్నీ సాగాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఇలాంటి రచనలు చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. 1873లో ‘గులామ్గిరి’ పేరుతో ఆయన రాసిన తొలి పుస్తకం దేశంలోని ఉత్పాదక సమూహాలు ఆకాంక్షిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబించింది. అశోక చక్రంతో కూడిన జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► మన రాజ్యాంగం, జాతీయ జెండా, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కాపాడుకోవాల్సిన... కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. భిన్నాభిప్రాయాలు, ఆకాంక్షలు కలిగి ఉన్నా స్వాతంత్య్ర ఉద్యమకారులు కలసికట్టుగా ఆధునిక భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆలోచనలు, రాజ్యాంగాలతో రూపొందించారు. పల్లెలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, స్వాతంత్య్ర ఉద్యమకారుల త్యాగ గుణాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంచె ఐలయ్య షెపర్డ్ – వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మేము ఈ దేశ పౌరులమేనా?
స్వాతంత్య్ర పోరాటాన్ని విజయవంతంగా నడిపిన గాంధీని ఆఫ్రికాలో తెల్లవాళ్ళు ఎక్కిన రైలు బోగీ నుంచి కిందికి తోసేసిన ఘటన చదివినప్పుడల్లా భారతీయులం రగిలిపోతుంటాం. బ్రిటిష్ వారి జాత్యహంకారానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి, స్వాతంత్య్రం సాధించుకున్నాం. అయితే మన దేశంలో ఉన్న కుల సమాజపు అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? దళిత సోదరులపై ఏటేటా పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు దేన్ని సూచిస్తున్నాయి? నేనీ దేశ పౌరుడినేనా? ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఓ దళితుడిగా నేనెక్కడున్నాను? ► ఏ దేశానికైనా పరాయి పాలన నుంచి విముక్తి లభిస్తే పండుగే! దేశ ప్రజలమైన మనం ఆజాదీ అమృతోత్సవాలు చేసుకోవడం అంతులేని ఆనందాన్నే ఇస్తుంది. అయితే కొద్ది రోజులుగా నా మనసును ఓ ప్రశ్న వేధిస్తూ ఉంది. ఈ స్వర్ణోత్సవాల్లో భాగస్వామిని కాగలనా? లేదా? అసలు నేనీ దేశ పౌరుడినేనా? అయితే ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో దళితుడిగా నేనెక్కడున్నాను? దేశంలో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవించిన వేదన ఏదో కట్టిపడేస్తోంది. ఈ సంబరాలకూ, నీకూ ఏ సంబంధం లేదంటోంది. ► మన దేశం ఇప్పటికే రెండు పండుగలు జరుపుకొంది. ఇప్పుడు మూడో పండుగ ‘ఆజాదీ కా అమృతోత్సవ్’. సంవత్సరకాలంగా ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. 1972లో వెండిపండగ, 1997లో బంగారు పండుగ, ఇప్పుడు ఏకంగా అమృతోత్సవాల్లో మునిగితేలుతున్నాం. 1972కు ముందు అంటే 25 ఏళ్ళల్లో ఎంతో మార్పు వస్తుందని అంతా భావించారు. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలో, ఆర్థిక రంగంలో కొంత మెరుగైన ఫలాలు వచ్చినమాట నిజమే. అది ఈ దేశప్రజల చైతన్య పునాదులపై ఆధారపడి జరిగిందే తప్ప, అప్పణంగా ఎవరూ అప్పజెప్పింది కాదు. అయితే ఎంత ప్రగతి సా«ధించినా సాటి మనిషి నన్ను జంతువుల కన్నా హీనంగా చూస్తోంటే, నోరెత్తి న్యాయం అడిగితే అరెస్టులు, దాడులు. రాజ్యాంగ బద్ధ సమాన హక్కుల కోసం అడిగితే, ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. నా జీవితంలోని సంఘటన పాతికేళ్ళ స్వాతంత్య్రం వట్టి బూటకమని ఎలా తేల్చిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ► నేటి పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామం నా సొంత ఊరు. మా నాన్నకు ముగ్గురు తమ్ముళ్ళు. అందులో చిన్నవాడి పేరు మల్లెపల్లి రాజం. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి గని కార్మికుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. 1960లో మా గ్రామం శివారులోనే బొగ్గు గనులు ప్రారంభం కావడంతో ఇక్కడ పనిచేయడానికి తిరిగి వచ్చాడు. అటు బొగ్గు గనుల్లో పనిచేస్తూ, గ్రామంలో కూలీల, పాలేర్ల జీతాల పెరుగుదల కోసం పనిచేశాడు. అదేవిధంగా భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రజలకు పంచడానికి ఉద్యమాలు నడిపాడు. అది భూస్వాములకు కడుపుమండేలా చేసింది. 1963లో జరిగిన సంఘటన ఆయనను మా నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ► మా ఊరి మధ్యలో ఒక మర్రిచెట్టు ఉండేది. దానిచుట్టూ బండలతో ఒక గద్దె కట్టి ఉండేది. దాన్ని కచ్చేరీ గద్దె అనేవాళ్ళం. దాని మీద అగ్రవర్ణ దొరలు మాత్రమే కూర్చునేవారు. మా చిన్నాన్న మల్లెపల్లి రాజం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. అందువల్ల ఆ చైతన్యం ఇచ్చిన ధైర్యంతో దొరలు కూర్చునే కచ్చేరీ గద్దె దగ్గరకు వెళ్ళి, ‘కచ్చేరీ గద్దె మీద మేం కూడా కూర్చుంటాం’ అని అడిగాడు. అక్కడ ఘర్షణ జరిగింది. రెండు రోజుల తర్వాత మా చిన్నాయన కనిపించకుండా పోయాడు. మూడు రోజుల వరకు ఆచూకీ తెలియలేదు. నిజానికి మా చిన్నాయనను కిడ్నాప్ చేసి, మూడు రోజులు పొగాకు బ్యారెన్లో బంధించి, చిత్రహింసలకు గురిచేశారు. కసితీరా చంపి ఊరి చివర కుంటలో పడేశారు. కుటుంబ సభ్యులు వెతగ్గా, వెతగ్గా, మూడు రోజుల తర్వాత శవమై తేలాడు. ‘కచ్చేరీ గద్దెపై మేం కూడా కూర్చుంటాం’ అన్నందుకు స్వతంత్ర భారతావనిలో ఓ దళితుడికి జరిగిన శాస్తి అది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. వేలాది కార్మికులు నిరసనగా పెద్ద ఊరేగింపు చేశారు. అయినా సరే నిందితులపై కేసు కూడా నమోదు కాలేదు. ఇదీ ఈ దేశ స్వాతంత్య్రం ఓ దళితుడికి అందించిన స్వేచ్ఛ. ► అంతటితో ఆగలేదు. 1968లో 25 డిసెంబర్న కీలవేన్మణిలోని 44 మంది దళితులను అక్కడి ఆధిపత్య కులాలైన భూస్వాములు సజీవ దహనం చేశారు. దీంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణాజిల్లా కంచికచర్లలో కోటేశ్ అనే దళిత యువకుడిని గుంజకు కట్టి, కిరోసిన్ పోసి, కాల్చారు. ఇది కలవరపాటుకు గురిచేసింది. ఇంకా ఎన్నో జరిగాయి కానీ అంతగా బయటకు రాలేదు. అయినా భవిష్యత్తులోనైనా అంతరాలు తొలగిపోతాయన్న ఆశతో దళితులు ముందుకు నడిచారు. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల్లో భాగస్వాములయ్యారు. ► ఇట్లా వెండిపండుగ జరుపుకొన్నామో లేదో, బీహార్లోని బెల్చిలో 1977 మే 27న ఎనిమిది మంది దళితులను చేతులు కట్టేసి కాల్చి చంపి, ఒక చితి మీద తగులబెట్టారు. ఇదంతా ఒక ఆధిపత్యకుల భూస్వాములు చేసిన నీతిమాలిన చర్య. 1985లో కారంచేడులో, 1991లో చుండూరులో దళితులను ఊచకోత కోసిన ఘటనలు ఇంకా కళ్ళ ముందు రక్తమోడుతున్నాయి. గుండెగాయాల్ని కెలుకుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మన స్వతంత్ర భారతావని మరో మైలురాయిను దాటి స్వర్ణోత్సవం జరుపుకొంది 1997లో. అదే ఏడాది బీహార్లోని లక్ష్మణ్పూర్ బాతేలో 58 మంది దళితులు ఊచకోతకు గురయ్యారు. అయినా దళితులు రాజ్యాంగంపై అంతులేని విశ్వాసంతో ఆ ఉత్సవాల్లోనూ భాగస్వాములయ్యారు. ప్రతి ఏటా జెండా పండుగను ఈ దేశ దళితులు చేసుకుంటూనే ఉన్నారు. 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి ఘటన సహా చెప్పుకుంటూ పోతే... కొన్ని వేల ఘటనలు స్వాతంత్య్ర సంబరాలతో దగాపడ్డ దళితన్నల గుండెలు చీల్చుకొస్తాయి. ► సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సేకరించిన లెక్కల ప్రకారం 1994 నుంచి 2020 మధ్య 26 ఏళ్ళలో 17,835 మంది దళితులు హత్యకు గురయ్యారు. 44,506 మంది దళిత మహిళలు ఆధిపత్య కులాల చేతుల్లో అత్యాచారాలకు బలయ్యారు. అంతేకాక 85,219 మంది దళితులపైన తీవ్ర భౌతిక దాడులు జరిగాయి. ఇందులో ఎక్కువ మంది అంగవికలురు అయ్యారు. మనదేశం స్వాతంత్య్రం కోసం పోరాడడానికి బ్రిటì ష్ వాడు వాళ్ళతో మనల్ని సమానంగా చూడక అవమానాలకు గురిచేయడమే కారణమంటాం. మరి, మన దేశంలో ఉన్న కుల సమాజ అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? వీటినెవరు ప్రశ్నిస్తారు? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? నా దళిత సోదరులపై ఏటేటా దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతోన్నస్థితి దేన్ని సూచిస్తోంది? నేనీ దేశ పౌరుడినేనా? అందుకే అమృతోత్సవాన్ని తలచుకున్న ప్రతిసారీ ఈ అనుమానం వెంటాడుతూనే ఉంది. ► అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2004లో 546 మంది దళితులు హత్యకు గురైతే, 2014లో 704 మంది, 2020లో 902 మంది అగ్రకుల దాడుల్లో మరణించారు. 16 ఏళ్ళలో దళితులపై అఘాయిత్యాలు రెండింతలు పెరిగాయి. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడి ఉంటే, ఈ దాడులు తగ్గాలి. కానీ ఏటేటా పెరుగుతూనే ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఈ స్వాతంత్య్రానికి అర్థం ఏమిటి? 2004లో 1157 మంది అత్యాచారాలకు బలైతే, 2020లో ఆ సంఖ్య 3396కి చేరింది. అంటే దళిత స్త్రీలపై అత్యాచారాలు మూడు రెట్లు పెరిగాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులు చాలా విషయాల్లో తమ ఆందోళన ప్రకటిస్తుంటారు. దళితుల విషయానికి వస్తే నిజంగా ఉండాల్సినంత స్పందన లేదన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వాలూ అంతే. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో మా ఇంటిపైన ఏ జెండా ఎగురవేయాలి? ఫోన్లో డీపీని మార్చుకోమంటారా? ఆ పని ఎలా చేయగలను? ఇప్పుడు ఈ విషయం రాయడంతో అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ దేశంలోని ఇతర కులమతాల పెద్దలు, విద్యావేత్తలు, న్యాయాధీశులు, రాజకీయ వేత్తలు ఆలోచిస్తారని ఆశ. రాబోయే తరాలు ఈ స్వాతంత్య్ర సంబరాల్లో తమ పాత్రను ఎంచుకుంటారనే భావన. అంతే! వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
‘ఎంపీ రఘురామను అడుగు పెట్టనివ్వం’
సాక్షి, భీమవరం: దళితుల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి పత్రికలు, టీవీల్లో అవాకులు చవాకులు పేలుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఏపీ బహుజన జేఏసీ నాయకులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేశ్బాబు మీడియాతో మాట్లాడారు. జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అవహేళన చేశారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజు గోబ్యాక్ అని నినదించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ గెలిపించిన పార్టీకే కళంకం తెస్తున్న ఎంపీ.. గతంలో దళితుల పైన, దళిత అధికారుల పైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, శాంతియుతంగా నిరనన తెలియజేస్తామన్నారు. దుండి అశోక్, ప్రశాంత్, బేతాళ కమలాకర్, ఏలేటి న్యూటన్ పాల్గొన్నారు. -
దళిత రచనలతోనే సినీ ప్రయాణం ప్రారంభించాను: పా.రంజిత్
సాక్షి, చెన్నై: దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని దర్శక, నిర్మాత పా.రంజిత్ పేర్కొన్నారు. తన చిత్రాల ద్వారా సమాజంలోని అసమానతలు, అణగారిన జీవితాలను ఆవిష్కృతం చేసే దర్శకుడీయన. అలా తనకంటూ ప్రత్యేక బాటను ఏర్పరచుకుని సక్సెస్ఫుల్గా పయనిస్తున్న పా.రంజిత్ తన నీలం ఫౌండేషన్ ద్వారా ఏప్రిల్ నెల అంతా దళిత చరిత్ర మాసం పేరుతో చెన్నైలో సాంస్కృతిక కళలు, ఫొటో ఎగ్జిబిషన్, చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అందులో భాగంగా మదురైలో శుక్ర, శనివారాల్లో దళితుల రచయితల కోసం దళిత సాహితీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని తెలిపారు. దళితుల ఉన్నతికి దళిత సాహితీవేత్తలే దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1990 ప్రాంతంలో దళిత సాహిత్యం మొదలైనప్పుడు పలు ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు. ఇప్పుడు దళిత సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందిందని పా.రంజిత్ పేర్కొన్నారు. -
సీఎంకు దళిత, బహుజనులు వెన్నుదన్నుగా ఉండాలి
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో దళిత, బహుజనులకు లభిస్తున్న ఆదరణ చరిత్రాత్మకమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరితను గుంటూరులోని ఆమె నివాసంలో నాగార్జున శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళిత, బహుజనులందరూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన నాగార్జునను సుచరిత అభినందించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో మేరుగు నాగార్జున తన శాఖ బాధ్యతలు చేపడతారని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘సామాజిక న్యాయం’లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ‘బహుజన హితాయా.. బహుజన సుఖాయా’ అని చాటిన బుద్ధుడి వ్యాఖ్యలను ఆచరణలో నిజం చేసి చూపిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించారని బహుజన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్ కితాబిచ్చారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు కేటాయించడంపై స్పందించిన ఆయన.. శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. బుద్ధిజం, అంబేడ్కరిజం, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను సీఎం జగన్ సాకారం చేయడం గొప్ప విషయమన్నారు. దేశంలో బహుజనుల కోసం ఏర్పడిన బీఎస్పీ సైతం రాజకీయ మనుగడ కోసం అగ్రవర్ణాలకు సీట్లిచ్చిందని, అగ్రవర్ణానికి చెందిన సీఎం జగన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రాతిపదికన నామినేటెడ్, మంత్రి పదవులు కేటాయించి యుగపురుషుడిగా నిలిచారని ప్రశంసించారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరుతో మాల, మాదిగలకు, రాజకీయ పదవుల పేరుతో గౌడ–శెట్టిబలిజలకు, రిజర్వేషన్ పేరుతో కాపులకు ఇతర కులాలతో తగవులు పెట్టిందని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేసేలా ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా చర్యలు చేపట్టారని గురుప్రసాద్ గుర్తు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా బీసీ కులాల మేలు కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. కనీసం ఓటుకు, వార్డు మెంబర్కు కూడా అర్హతలేని సంచార జాతులకు ఏకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని, బహుజనులు ఎల్లప్పుడూ ఆయన వెంటనే ఉంటారని గురుప్రసాద్ స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంనే మేం కోరుకున్నాం.. ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య రాష్ట్రంలో దళిత బహుజనులకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘకాలం కొనసాగాలని, ఇలాంటి ముఖ్యమంత్రే తమకు కావాలని కోరుకున్నామని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య చెప్పారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అనేక రాష్ట్రాల్లో బీసీ, దళితులు ముఖ్యమంత్రులైనా.. సీఎం వైఎస్ జగన్ మాదిరిగా అణగారిన వర్గాలకు అగ్రపీఠం వేసిన వారు లేరన్నారు. దళితుల పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్లో సైతం అట్టడుగు వర్గాలకు అంతంత మాత్రంగానే ఉన్నత పదవులు దక్కాయని గుర్తుచేశారు. బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చిన సందర్భాలు తక్కువేనని అన్నారు. దళిత బహుజనులకు చంద్రబాబు ఏనాడూ ప్రాధాన్యత శాఖలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రం తన వారితో త్యాగాలు చేయించి మరీ ఆయా పదవుల్లో ఎస్సీ, బీసీలను కూర్చోబెడుతుండటం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని చెంగయ్య కితాబిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీఎం వైఎస్ జగన్ రెండు పర్యాయాలు ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాష్ట్ర హోం మంత్రి పదవులివ్వడం ఆయనకే చెల్లిందన్నారు. సామాజిక విప్లవాన్ని సృష్టిస్తున్న సీఎం వైఎస్ జగన్కు దళితబహుజనులు అండగా ఉంటారని తెలిపారు. -
సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్తో కలిసి డ్రా ద్వారా ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దళితులు కూలీకి పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేడ్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా, ఆ యూనిట్ను గ్రౌండ్ చేసేలా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. గతంలో నీటిపారుదలశాఖ టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం కేటాయించామని, ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కేటాయిస్తున్నామని, వంద పడకలలోపు ఆసుపత్రులను ఒక కేటగిరీగా, వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులను మరో కేటగిరీగా విభజించామని వివరించారు. మొత్తం 56 ఆసుపత్రుల ఎంపిక పారదర్శకంగా చేశామని, వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని తెలిపారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్ల నిబంధనల్లోనూ మార్పులు చేశామని, ఒక్క టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించా మని చెప్పారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దళితబంధులో అన్యాయం చేశారు
జూలూరుపాడు: దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దళితులు, యువకులు ఆందోళనకు దిగారు. అర్హులైన వారికి కాకుండా భూములు, భవనాలు, ఉద్యోగాలు ఉన్నవారికి, గతంలో ప్రభుత్వ రుణాలు పొందిన వారికి దళితబంధు జాబితాలో చోటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జూలూరుపాడు, వెంగన్నపాలెం, పెద్దహరిజనవాడ, చిన్నహరిజనవాడ గ్రామాల దళిత మహిళలు, యువత మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబితాలోని అనర్హుల పేర్లు ఇస్తే పరిశీలించి ప్రభుత్వానికి నివేదికిస్తామని తహసీల్దార్ చెప్పడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. అనర్హుల పేర్లు తొలగించి అర్హుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించాలని, ఎమ్మెల్యే అనుచరుల పేర్లు తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. -
పార్టీ గెలుపోటములలో దళితులే నిర్ణేతలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు నిర్ణయించడంలో దళితులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వీరికి రిజర్వ్ చేసిన స్థానాల్లో అధిక స్థానాలను దక్కించుకున్న పార్టీలే అధికార పీఠం ఎక్కిన నేపథ్యంలో అందరూ వీరిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో మునిగితేలుతున్నారు. గత ఎన్నికల్లో 84 ఎస్సీ రిజర్వ్డ్ (రెండు ఎస్టీలకు రిజర్వు అయి ఉన్నాయి) స్థానాల్లో ఏకంగా 70 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరోమారు తమ ఓటుబ్యాంకు స్థిరంగా ఉంచుకునేందుకు నానాతంటాలు పడుతుండగా, వాటిని కొల్లగొట్టేందుకు సమాజ్వాదీ అనేక ఎత్తులు వేస్తోంది. ఇక తన సామాజిక వర్గానికే చెందిన సీట్లలో గత ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఎస్పీ అధినేత మాయావతి తన బలాన్ని చూపేందుకు తహతహలాడుతున్నారు. 68 శాతం సీట్లు కొడితే అధికారమే... యూపీలో 15 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో కనీసంగా 21 శాతం మంది అంటే సుమారు 3.15 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 2.25 కోట్ల మంది జాతవ్ వర్గానికే చెందిన వారు కాగా, 16 శాతం మందితో పాసీలు 70 నుంచి 80 లక్షల మంది వరకు ఉంటారు. మిగతా కులాల వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 84 ఉన్నాయి. ఇందులో 68శాతానికి మించి సీట్లు సాధించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని గత గణాంకాలు చెబుతున్నాయి. 2007లో బీఎస్పీ 61 స్థానాల(69శాతం)ను సాధించి అధికారంలోకి వస్తే, 2012లో ఎస్పీ 58 స్థానాలు (68శాతం) సాధించి అధికార పీఠమెక్కింది. ఇక 2017లో అయితే బీజేపీ ఏకంగా 70 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ కనీసంగా 58 స్థానాలను దక్కించుకునే పార్టీనే అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలు వీరిని ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆకర్షణ మంత్రాల్లో పార్టీలు... ముఖ్యంగా ఈ స్థానాల్లో తమ పట్టు ఏమాత్రం సడలకుండా చూసుకునేందుకు అధికార పార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. 2012 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు 14 శాతం మాత్రమే బీజేపీ దక్కించుకోగా, అది 2017లో ఏకంగా 40శాతానికి పెరిగింది. 84 రిజర్వ్డ్ స్థానాలకు గానూ 65 మంది జాతవేతర వర్గాల వారికే సీట్లు కేటాయించి ఆ స్థానాల్లో గెలిచి చూపించింది. నిజానికి జాతవ్లంతా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో ఉన్నప్పటికీ దోబీ, ఖాటిక్, పాసీ, వాల్మీకి వంటి జాతవేతర వర్గాలను ఆకర్షించి ఏకంగా 70 స్థానాలను దక్కించుకుంది. దక్కిన స్థానాలను దృష్టి పెట్టుకొనే యూపీ కేబినెట్లో ఏకంగా ఎనిమిది మందిని మంత్రులను చేసింది. ప్రస్తుతం ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారు ప్రభుత్వ పథకాల నుండి పొందిన ప్రయోజనాలను నొక్కి చెప్పేలా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎస్పీ వర్గాలు పొందుతున్న గృహాలు, మరుగుదొడ్లు, ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీ సౌకర్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తూ వారి ఓట్లకు గాలమేస్తోంది. దళితులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని బీజేపీ చెప్పుకుంటున్నా ఓట్లను తెచ్చిపెట్టే నేతలు లేకపోవడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీలో యోగికి ఉన్న ప్రజాదరణ, పథకాలతోనే ఎస్సీలను ఆకర్షించే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దళితులను ఆకట్టుకునేలా అంబేడ్కర్ జయంతిని ‘దళిత్ దివాళి’గా ప్రకటించాలని చేసిన వినతి పెద్ద చర్చకే దారితీసింది. దీనికి తోడు గడిచిన సెప్టెంబర్లో 15 రోజుల పాటు గ్రామీణ దళిత ఓటర్లే లక్ష్యంగా ‘గ్రామగ్రామాన దళితులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది. తాను ప్రకటించిన గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి హామీలు ఎక్కువగా దళిత వర్గాలకే లాభం చేస్తాయని ఆయన పదేపదే తన సమావేశాల్లో అఖిలేశ్ ప్రస్తావిస్తున్నారు. మరోపక్క బీఎస్పీ 2007 ఎన్నికల్లో అమలు చేసిన ’బ్రదర్హుడ్’ విధానాన్ని అనుసరించేలా నిర్ణయాలు చేసింది. వివిధ మండలాల్లో సమావేశాల ద్వారా ప్రజలను సమావేశపరిచి సంప్రదాయ దళితుల ఓట్లతో పాటు బ్రాహ్మణ, వెనుకబడిన తరగతులు, ముస్లిం సమాజం మద్దతు కూడగట్టే ప్రణాళికలు అమలుపరుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సితాపూర్లోని సిధౌలీ, అజంగఢ్లోని లాల్గంజ్ స్థానాలను మాత్రమే పొందిన బీఎస్పీ ఈమారు తన సత్తా చాటుకునేలా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. -
దళితులు అవసరం లేదు!... దళిత ఓటు బ్యాంకే లక్ష్యం!
అఖిలేష్ యాదవ్కు దళితులు అక్కర్లేదు, దళితుల ఓటు బ్యాంకు మాత్రమే కావాలి అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు చర్చల అనంతరం మాట్లాడిన ఆజాద్.. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఎస్పీతో పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్పై మండిపడ్డారు ఆజాద్. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించాడు అని విమర్శించారు. పైగా అతను బహుజన సమాజ్ ప్రజలను కించపరిచాడని ఆరోపించారు. తాను గత ఆరు నెలలుగా యాదవ్తో అనేక చర్చలు నిర్వహించిన పొత్తు కుదరలేదని చెప్పారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలలో సమాజవాదీ పార్టీ(ఎస్పీ) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలను బలోపేతం చేయడానికి అఖిలేష్ యాదవ్ అనేక చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారనేది గమనార్హం. అయితే వెనుకబడిన తరగతులు, దళితులు తమకు సామాజిక న్యాయం చేస్తాడనే నమ్మకంతో యాదవ్కు మద్దతు ఇస్తున్నారని ఆజాద్ అన్నారు. కానీ అఖిలేష్ యాదవ్కి సామాజిక న్యాయం అంటే అర్థం కావడం లేదని, అది మాటలతో జరగదంటూ ఆజాద్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై యాదవ్ మౌనం వహిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లాగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయితే ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలసిందే. (చదవండి: కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ) -
జాగు చేయక.. బాగు చేసేలా..
జాతీయ స్థాయి టోల్ఫ్రీ నం: 18002021989 హెల్ప్లైన్ నం:14566 రాష్ట్రస్థాయి హెల్ప్లైన్ నం: 040–23450923 సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనులపై అత్యాచారాల (అట్రాసిటీస్) నిరోధక చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బాధితులకు పరిహారం అందించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన హెల్ప్డెస్క్ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా వెబ్పోర్టల్తో పాటు ప్రతి రాష్ట్రంలో ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా అన్ని కాల్సెంటర్లను ప్రారంభించేందుకు ఆ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల విషయంలో ఆయా వర్గాల్లో అవగాహన కల్పించేలా మరింత ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ హెల్ప్డెస్క్ ప్రారంభించిన ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 4,776 మంది యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా... 295 మంది వినతులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 27 వినతులు (గ్రీవెన్స్) నమోదు అయ్యాయి. ఫిర్యాదుల నమోదు ఇలా... హెల్ప్డెస్క్లో ఫిర్యాదులను అత్యంత సులభంగా సమర్పించవచ్చు. ముందుగా https://nhapoa.gov.in/ లింకు ద్వారా అత్యాచారాల నిరోధానికి జాతీయ సహాయ కేంద్రం (నేషనల్ హెల్ప్డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) పేజీ తెరవాలి. అనంతరం రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ ఆప్షన్ను ఎంచుకుని బాధితుడి వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ తదితర పూర్తి సమాచారాన్ని అందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తంగా ఏడు దశల్లో జరుగుతుంది. అనంతరం బాధితుడి ధ్రువీకరణతో ఫిర్యాదు సమర్పణ పూర్తవుతుంది. వినతుల నమోదు తర్వాత వెబ్పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు క్షణాల్లో వినతులు/ఫిర్యాదుల చిట్టా మొత్తం చేరుతుంది. అక్కడ పరిశీలన పూర్తి చేసిన తర్వాత అంచెలంచెలుగా అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టు (చేపట్టిన చర్యలతో నివేదిక) సమర్పించాల్సి ఉంటుంది. వినతులు, ఫిర్యాదుల నమోదులో కేవలం బాధితులే కాకుండా అట్రాసిటీ చట్టాల అమలుపై పనిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థలు కూడా భాగస్వాములు కావొచ్చు. వెబ్పోర్టల్ ద్వారానే కాకుండా జాతీయ స్థాయి టోల్ఫ్రీ నంబర్, హెల్ప్లైన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఇక రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులకు కూడా ఫిర్యాదులు పంపవచ్చు. రాష్ట్రంలో secyscdts@gmail.com ద్వారా మెయిల్ పంపడంతో పాటు 040–23450923 ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వినతులు చెప్పుకోవచ్చు. కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్, వెబ్పోర్టల్, కాల్ సెంటర్ల నిర్వహణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 చొప్పున నిధులు ఖర్చు చేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం వందశాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్స్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పూర్తిస్థాయి ప్రత్యేక కోర్టులు (ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్), స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పూర్తిస్థాయి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర కేటగిరీల్లో ఖర్చు చేయాలి. బాధితులకు న్యాయ సహాయం, పరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని ఈ నిధుల కింద ఖర్చు చేయకూడదు. -
దళితులు శూద్రులే... విడగొట్టారంతే!
మానవ చరిత్రలో ఒక్క భారతదేశంలోనే అత్యంత హేయమైన అంటరానితనం వేళ్లూనుకొని ఉంది. దాదాపు అన్ని మతాలూ మనుషుల మధ్య ప్రేమను ప్రోదిచేసి, ఇహపరమైన జీవితాన్ని సమానత్వం, సౌభాతృత్వం వంటి గొప్ప ఆదర్శాలతో ఆనందమయం చేసుకోవడానికి మార్గాలు చూపించినవే. కానీ హిందు మతం మాత్రం అంటరానితనం ప్రాతిపదికన భారతీయ సమాజంలో అసమానతలకు బీజం వేసి కొనసాగేలా ఆంక్షలు విధించడం.. విడ్డూరమేకాదు అమానవీయం కూడా. ఒకప్పుడు శూద్రుల్లో భాగంగా ఉన్న దళితులను వారి నుంచి వేరుచేసిన వైనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దళితులు చారిత్రక శూద్రులు. ఆర్యులకంటే ముందు క్రీ.పూ. 3000 నాటికే వ్యవ సాయ–పట్టణ నాగరికతను అభివృద్ధి చేసు కున్న హరప్పా ప్రజా సమూహంలో వారూ భాగంగా ఉన్నారు. కానీ ఇంత ఆధునిక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకు తున్నప్పటికీ, ద్విజులతో పాటు శూద్రులు కూడా వారిని అంటరాని వారుగా చూస్తున్నారు. మనకు గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఒక దళితుడనే ఎరుక భారతీయుల్లో కనిపిం చడం లేదు. అంబేడ్కర్ తనను తాను విముక్తి గావించుకొని, కులము, అంటరానితనం లేని ‘భారతదేశం అనే ఆలోచన’కు రూపమిచ్చాడు. అయితే ఇది సాకారం కావాలంటే, తమ సాటి ఉత్పాదక శూద్రులైన దళితులు తమ నుంచి ఎలా వెలికి గురయ్యారనే సంగతిని శూద్రులు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ విభజన సృష్టించడం ద్వారా ద్విజులు.. తమ ఇరువురిపైనా ఎంత పటిష్టమైన నియంత్రణ కలిగి ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. దళితులను శూద్రుల నుంచి వేరుచేసి వారికి ప్రతికూల ఆధ్యా త్మిక భావజాలాన్ని ఆపాదించింది బ్రాహ్మణవాదం. అది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక మూఢ నమ్మకం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత మొత్తం జనాభాలో శూద్రులు 52 శాతం ఉన్నారు. దళితులు 16.6 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖత్రీలు, వంటి వారందరూ కలిసి దాదాపు 5 శాతం మాత్రమే ఉన్నా. తమకన్నా అధిక సంఖ్యలో ఉన్న దళితులను వీరు ఆధునిక అంటరాని బానిసలను చేశారు. 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. శూద్రులు/ఓబీసీలు, ద్విజులు కచ్చితంగా ఎంతమంది ఉన్నారన్న సంగతి భవిష్యత్తులో కులాలవారీ జనాభా గణన చేసినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం అనుకుంటున్న సంఖ్యలు గాలిలో రాతల లాంటివే. చర్రితను పరిశీలించినప్పుడు, కుల విభేదాలు భారత అభివృద్ధిపై చాలా ప్రతికూల ప్రభావం కలిగి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. క్రీ.పూ. 1500 ప్రాంతంలో బ్రాహ్మ ణుల ఆధ్యాత్మిక గ్రంథంగా రుగ్వేదాన్ని రాయడంతో అసలు సమస్య ప్రారంభమైంది. ఆహార అనుత్పాదక వర్గాలవారు హరప్పా నాగరికత నిర్మాతలను శాశ్వతంగా తమ బానిసలుగా చేసుకున్నారు. వారు మొదట్లో ఈ బానిసలను అంటదగిన, అంటరానివారుగా; ఆ తర్వాత అనేక కులాలుగా విభజించారు. అంటరానితనం అనే సామాజిక జాడ్యం రుగ్వేదకాలంలో లేనే లేదనిపిస్తుంది. ఎక్కడా దాని ప్రస్తావన కనిపించదు. నాలుగు వర్ణాల్లో చిట్టచివరిదైన శూద్ర వర్ణం వారు మిగిలిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి అన్ని రకాల సేవలూ అందిస్తూ సేవించాలి. దీన్నిబట్టి అంటరానివారుగా భావిస్తున్న పంచములు మొదట్లో శూద్రులలో భాగంగా ఉండేవారని అర్థమవుతుంది. జంతు చర్మాలు, వాటితో తయారు చేసిన వస్తువులు అపవిత్రమైనవి (అంటరానివి)గా బ్రాహ్మ ణవాదం ప్రçకటించిన తర్వాతే తోళ్లతో సంబంధం ఉన్న శూద్రు లందరినీ అంటరానివారుగా పరిగణించారని అనిపిస్తుంది. వేద కాలపు ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ అయినప్పటికీ తోళ్ల పరిశ్రమ కూడా వారి ఆర్థిక జీవనంలో ఒక భాగమే అని చెప్పవచ్చు. వేదకాలపు పశుపోషణ ఆర్థిక వ్యవస్థను పోలిన ప్రస్తుత ఆదివాసీ వ్యవస్థలను పరిశీలిస్తే అందుకు సంబంధించిన సాక్ష్యాలు లభిస్తాయి. దట్టమైన అరణ్యాల్లో ఉన్న మనకాలపు ఆదివాసీ సమాజాల్లో కూడా వృత్తుల ప్రత్యేకీకరణ కనిపిస్తుంది. అక్కడా వేటాడటం, చర్మా లను సేకరించడం, ఆ చర్మాల నుంచి రకరకాల తాళ్లు, బ్యాగులు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం కనిపిస్తుంది. కానీ ఆ ఆదివాసీ సమాజాల్లో ఈ తోళ్లతో సంబంధం ఉన్న పనివారిని అంట రానివారుగా పరిగణించకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల అభివృద్ధి క్రమంలో అతి సహజంగా కనిపించే దృశ్యం ఇది. కానీ భారత దేశంలో బ్రాహ్మణవాదం మానవుల్లో బానిసత్వం కన్నా ఘోరమైన అంటరానితనం అనే కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది. అంటరానితనానికి గీటురాయి తోలు ఆధునిక భారతం అంతటా తోళ్ల పరిశ్రమ మొత్తం దళితుల పరి శ్రమగా ఉంది. ఇందులో పనిచేసేవారందరూ దళితులే. గ్రామీణ భారతావనిలో తోలు పని.. శూద్రులు, దళితులకు మధ్య అంటరాని తనానికి గీటురాయిగా ఉంది. అయితే ఇస్లాం రాకతో అందులోకి మారినవారు కుల పరమైన గుర్తింపు లేకుండానే తోలు పరిశ్రమలో భాగమయ్యారనుకోండి. ఇతర వెనుకబడిన తరగతులవారు, ద్విజులు ఎవరూ తోలు పరిశ్రమలో పనిచేయడం లేదు. అయితే ఏ దశలో తోలుపని అంటరానిదానిగా మారిందనేది స్పష్టంగా తెలియదు. శూద్రుల ఆచార వ్యవహారాల్లో కొత్తగా కులాల ప్రాతిపదికన బ్రాహ్మణ కర్మకాండలను బ్రాహ్మణవాదం ప్రవేశ పెట్టింది. తోలు అపవిత్రం, దానికి సంబంధించిన పని కలుషిత మైనదని ఈవాదం వారి బుర్రల్లో చొప్పించింది. ఫలితంగా అంటరాని తనం పాదుకుంది. కర్మకాండలు మూఢనమ్మకాలుగా మారి పోయాయి. ఇందుకు వేలాది సంవత్సరాల కాలం పట్టింది. అందుకే బ్రాహ్మణవాదం ఒక మతం కాదు. అది ఒక మూఢ నమ్మకం. పరంపరగా వస్తున్న బ్రాహ్మణ వాదం ఆధారంగా పనిచేసే ఆర్ఎస్ఎస్/బీజేపీ శ్రేణులకు అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఎజెండా లేదు. దళిత, శూద్ర తత్వవేత్తలు కలిసి కూర్చొని భారత చర్రితను జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంటరానివారు, అంటదగినవారి మధ్య ఉండే సంబంధం శాశ్వత మానవ సంబంధం కాదు. ఈ అమానవీయ సంబంధాన్ని నాశనం చేయడానికి నడుం బిగిస్తే తప్పనిసరిగా ఈ భూమిపై నుంచి అది మాయమవుతుంది. బ్రాహ్మణ వాద సాహిత్యానికి చెందిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల్లో అంటరానితనానికి ఎటువంటి పరిష్కారం లేదు. అసలు సమస్యను సృష్టించిందే ఈ సాహిత్యం కాబట్టి పరిష్కార మార్గాలు అందులో ఎందుకుంటాయి? ఇవ్వాళ ఆర్ఎస్ఎస్, బీజేపీలు బ్రాహ్మణ వాద గ్రంథాలన్నీ శూద్రులు, దళితుల అసలైన సంస్కృతిని నిక్షిప్తం చేశాయని, వాటిని అనుసరించాలని, వాళ్లంతా తమవారేనని.. తమ రాజకీయ ప్రాపగాండాలో భాగంగా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి భారత దేశంలో తప్ప, ప్రపంచంలోని ఏ మత గ్రంథం కూడా ప్రజ లను కులాలుగా విభజించి అమానవీయమైన అంటరానితనాన్ని ప్రబోధించలేదు. తోలుపై రాయడాన్ని ఎందుకు నిరాకరించినట్లు? భారతదేశంలో తోలుతో సంబంధం ఉన్న వారందరినీ అంటరాని వారిగా చిత్రించిన బ్రాహ్మణీయ వ్యవస్థ, చివరికి తోళ్లను రాత సాధనంగానూ ఉపయోగించడానికి నిరాకరించింది. తోలుకు అపవ్రి తతను ఆపాదించిన బ్రాహ్మణవాదులు తొందరగా పాడైపోయే తాళ పత్రాలపై రాసేవారు. దీంతో మన ప్రాచీన జీవనానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని కోల్పోయాం. ప్రాచీన ప్రపంచంలో మొదటగా బైబిల్ని లిఖించింది సాపుచేసిన చర్మం మీదే. అలాగే గ్రీకు తత్వ వేత్తలు, ఈజిప్టు వాసులూ తోలుపైనే రాశారు. కన్ఫ్యూసియస్ వంటి చైనా తత్వవేత్తలు కూడా చర్మంపైనే తమ రచనలు చేశారు. టావో మతం చర్మంపై రాసిన రచనల ఆధారంగానే ఉనికిలోకి వచ్చింది. సమకాలీన ప్రాచీన ప్రపంచంలో భారతీయులు తప్ప వేరే ఎవరూ తాళపత్రాలను రాతకోసం ఉపయోగించలేదు. పోనీ దేశంలో తోలు పరిశ్రమలో ఉన్నవారన్నా చర్మంపై రాశారా అంటే అదీ లేదు. ఇందుకు కూడా నిందించవలసింది బ్రాహ్మణ వాదు లనే. ఎందుకంటే దళితులు, శూద్రుల చదువుపై నిషేధం విధించింది వారే గనుక. మానవుల మధ్య అసమానత్వాన్ని సృష్టించడానికి దైవత్వ భావాలను సాధనాలుగా ఉపయోగించడం వల్ల ప్రజల్లో ఉత్పాదకతా సామర్థ్యం దెబ్బతింటుంది. సరిగ్గా భారత దేశంలో జరి గిందీ ఇదే. ఈ బ్రాహ్మణీయ భావజాలం వల్ల కేవలం దళితులే కాదు శూద్రులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఉత్పాదక శక్తులు బాగా బలహీనమయ్యాయి. ఇతర శక్తులు భారతదేశంలో జోక్యం చేసుకుని ఉండకపోతే ఇండియా మరింతగా వెనకబడిపోయి ఉండేది. విశ్లేషకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
దళితులంతా సీఎం జగన్కు అండగా నిలబడాలి: సురేశ్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దళితులకు భరోసా, నమ్మకం, గౌరవం కల్పించారు. దళితుడైన నన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్సార్ కడప జిల్లాలో మంగళవారం జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘దళితుల వెనుకబాటుకు ప్రధాన కారణమైన చదువుపైన సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.. అణిచివేతకు గురైన దళితులకు సమాజంలో సమానత్వం అందించేలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. దళితులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందిచడానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు. (చదవండి: సెలవు రోజూ ‘ఆసరా’ సంబరాలు) ‘‘సీఎం జగన్ దళితుల కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతోంది. అందుకే వాటిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బడుగు వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నం. దళితుల కుటుంబాల గుండెల్లో వైఎస్ జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. దళితులపైన చంద్రబాబుకు చులకన భావన, నీచ దృష్టి ఉంటుంది. అయితే దళితుల ఓట్లు మాత్రం కావాలనే నీచమైన ఆలోచనతో దళితులకు ద్రోహం చేశారు. బీజేపీ నేతలు తమ స్వార్థం కోసం దళితుల ఓటు బ్యాంకు కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దళితులంతా కలిసికట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలబడదాం’’ అని సురేశ్ పిలుపునిచ్చారు. చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’ -
సీఎంపై సభాహక్కుల నోటీస్ పరిశీలిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు వెనక్కు తగ్గిన సీఎం కేసీఆర్పై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదని సీఎం అవాస్తవాలు మాట్లాడారని, భగ వద్గీత, ఖురాన్, బైబిల్పై సీఎం ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఆ విధంగా చేయ లేని పక్షంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ తప్పుగా ప్రచురితమైందని, దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్తారా అని నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో అప్పటి మంత్రి కోనేరు రంగారావు అధ్యక్షతన సభాసంఘం సమ ర్పించిన నివేదికను శాసనసభ ఎదుట ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్ల క్రితమే రాష్ట్రంలో కులాల వారీగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టడంలేదో చెప్పాలన్నారు. -
మీ రక్తం మాకొద్దు.. సీఎం కుర్చీ కావాలి
సాక్షి, హైదరాబాద్: దళితులకు సీఎం కేసీఆర్ రక్తం అవసరం లేదని, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ కావాలని, ఆ కుర్చీ ఇస్తే తమను తామే అభివృద్ధి చేసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు వారు రాసిన బహిరంగలేఖను శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. రాహుల్గాంధీకి టీఆర్ఎస్ నేతలు లేఖ రాయడం ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టే ఉందని ఆ లేఖలో తెలిపారు. ఏడేళ్లుగా దళితులకు టీఆర్ఎస్ చేసిన మోసంపై, ఆ పార్టీ నేతలు వాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎస్సీ సబ్ప్లాన్ కింద ఈ ఏడేళ్లలో రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, వాటిని ఖర్చు పెట్టకుండా దళితులకు ద్రోహం చేశారని, కేసీఆర్కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఏకకాలంలో వారి అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల నాయకులను మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాల కోసం 9 లక్షల మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారికి రక్తం ధారబోయాల్సిన పనిలేదని, లోన్లు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. -
దళితులపై దాడులకు చంద్రబాబే గ్యాంగ్ లీడర్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్యాంగ్లీడర్లా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం గుంటూరులో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసిన అనంతరం ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి కూడా వారి వెంట ఉన్నారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, రమ్య హత్య కేసు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకుందని, 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. రమ్య హత్య ఘటన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగంగా స్పందించిన తీరు, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను ఎస్సీ కమిషన్ అభినందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసిందని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలూ ఇంతగా స్పందించలేదని కమిషన్ సభ్యులు చెప్పారన్నారు. రమ్య కుటుంబానికి చట్ట ప్రకారం న్యాయం చేస్తామని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి వారం లోపే సాయాన్ని అందచేశామని చెప్పారు. కమిషన్ దృష్టికి గత సర్కారు అఘాయిత్యాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులకు జరిగిన తీవ్ర అన్యాయాలు, అఘాయిత్యాలను ఎస్సీ కమిషన్కు వివరించినట్లు జూపూడి ప్రభాకర్ తెలిపారు. రమ్య కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేశారని చెబుతున్నారని, ఇకనైనా చంద్రబాబు నీచ రాజకీయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై వ్యాఖ్యలు గుర్తున్నాయ్ బాబూ: ఎమ్మెల్యే నాగార్జున రమ్య హత్య ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచిందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఇంత వేగంగా న్యాయం చేయడం బహుశా దేశంలో ఎక్కడా జరగలేదని, రమ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతోపాటు ఇంటి స్థలం పట్టా కూడా ఇచ్చినట్లు చెప్పారు. గత సర్కారు దళితులను అంటరానివారిగా చూసిందని ఎమ్మెల్యే నాగార్జున గుర్తు చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ అధికారంలో ఉండగా చంద్రబాబు దురహంకారంతో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఎస్సీలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆయన్ను విచారించాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలను సైతం అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. చంద్రబాబు దళితులను మోసగించి లాక్కునన్ని భూములు చరిత్రలోనే ఎవరూ లాక్కోలేదన్నారు. ఆయన కులమతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం తక్షణమే స్పందిస్తున్నారు: మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ అందరికంటే ముందే స్పందించి బాధితురాలు రమ్య కుటుంబానికి ఆసరాగా నిలిచారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, పేదలు, దళితులపై ఏ చిన్న ఘటన జరిగినా ముఖ్యమంత్రి తక్షణమే స్పందిస్తున్నారని గుర్తు చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచిన దళిత సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. దళితులపై ఈగ వాలకుండా చూస్తున్నారు: ఎమ్మెల్యే రజని దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ స్పందించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రమ్య కుటుంబానికి కొండంత అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులపై ఈగ కూడా వాలకుండా అండగా నిలుస్తున్నారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి పరిహారం, ఇంటి స్థలంతోపాటు వ్యవసాయ భూమి కూడా ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతురాలు రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడేలా న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన ఫోన్లో స్వయంగా దిశ యాప్ పనితీరును ఎస్సీ కమిషన్ బృందానికి వివరించారు. దళితులకు అన్యాయం జరిగిన సమయాల్లో ప్రభుత్వాలు ఇలానే శరవేగంగా స్పందిస్తే సమాజం బాగుంటుందని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఎన్నాళ్లీ లాఠీ దెబ్బలు.. తెగించి కొట్లాడదాం
సాక్షి, హైదరాబాద్: ‘అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. కర్ణాటక తరహాలో ఉద్యమిద్దాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెద్దాం. బీజేపీ కార్య కర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 2023లో బీజేపీని అధి కారంలోకి తెచ్చే వరకు తాను దశల వారీగా పాద యాత్రను కొనసాగించనున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనతో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని, ఆ తల్లిని విముక్తి చేయడమే లక్ష్యంగా తెగించి పోరాడాలన్నారు. నీళ్లు–నిధులు–నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడితే 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా గడీల పాలనతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. ఈ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలు, బాధలు తెలుసుకోవాలనే ఈనెల 24 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నట్టు చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో తన పాదయాత్రలో పాల్గొనే కార్యకర్తలకు నిర్వహించిన వర్క్షాపులో బండి సంజయ్ మాట్లాడారు. ‘కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం?’ అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు కర్ణాటకలో పాలకులు కాషాయ జెండాపై కక్ష కట్టి కార్యకర్తలను జైల్లో వేశారని గుర్తుచేశారు. అయినా అక్కడి కార్యకర్తలు వెరవకుండా పాలకులపై తెగించి యుద్ధం చేసిన ఫలితంగానే కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ‘పార్టీ కోసం బూత్స్థాయి నుంచి ఎవరు శ్రమిస్తున్నారనే విషయాన్ని పరిశీలించేందుకే కేంద్రం నన్ను ప్రతినిధిగా పంపింది. అందరూ కష్టపడి పనిచేయాలి’ అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి, ఎంపీ మునుస్వామి చెప్పారు. ఈ వర్క్షాపులో పాదయాత్ర ప్రముఖ్ డా.గంగిడి మనోహర్ రెడ్డి, సహప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డా. మల్లారెడ్డి, కట్టాసుధాకర్ పాల్గొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయండి రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇలాంటివి జరిగినపుడు జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడంతోపాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఒత్తిడి తేవాలని పార్టీ ఎస్సీ మోర్చా నాయకులకు సూచించారు. -
వైఎస్సార్సీపీ నుంచి దళితులను వేరు చేయలేరు : మంత్రి అవంతి
-
దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. నటి అరెస్ట్
చెన్నై: తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా తన విచిత్రమైన వ్యవహర శైలితో తరచూ వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. ఇతర నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్టాపిక్గా మారుతుంటారు. సెలబ్రిటీల గురించి అంటే పర్లేదు కానీ ఈ సారి ఏకంగా ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరా మిథున్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో మీరా మిథున్ను అరెస్ట్ చేయాల్సిందిగా నెటిజనులు డిమాండ్ చేశారు. మీరా మిథున్ షేర్ చేసిన వీడియోలో.. ఆమె ఓ డైరెక్టర్ అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఊరుకోక.. ‘‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్గా ప్రవర్తిస్తారు’’ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు మీరా మిథున్సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. ఇక మీరా తమిళ్ బిగ్బాస్ సీజన్3లో పాల్గొన్నారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. Actress Meera Mithun has used very derogatory term against SC/ST people in her video. This shows her caste conceit mindset. She must be arrested soon. @mkstalin #CrushTheCaste pic.twitter.com/LghONRsKPv — Mission Ambedkar (@MissionAmbedkar) August 7, 2021 -
ఇదో ఉద్యమం.. దేశానికే వెలుతురునిస్తుంది: సీఎం కేసీఆర్
మూడు దశల్లో పథకం.. ►దళితుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు దశలను పాటించాలి. మొదట దళితుల అసైన్డ్, గ్రామ కంఠం తదితర భూసమస్యలను పరిష్కరించాలి. తర్వాత దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగుపర్చాలి. అనంతరం ‘దళిత బంధు’పథకాన్ని అమలు చేయాలి. దళిత బంధు లబ్ధిదారులకు బీమా ►‘దళిత బంధు’ లబ్ధిదారులకు ‘దళిత బీమా’ను వర్తింపచేసే దిశగా సర్కారు ఆలోచన చేస్తోంది. రైతుబీమా మాదిరి వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలుచేద్దాం. మంత్రి, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి, ఆమోదయోగ్య కార్యాచరణ రూపొందించాలి. కొంచెం ఆలస్యమైనా సరే దళిత బీమాను అమలు చేసుకుందాం. సాక్షి, హైదరాబాద్: ‘‘దళితబంధు ఒక కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమం.. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ఇప్పుడు దళితబంధు కార్యక్రమం దళితుల అభి వృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తుంది. అవకాశం, సహకారం లేక బాధపడు తున్న వర్గాలకు మార్గం చూపుతుంది. ఇక్కడి దళితుల విజయం ఇతర కులాలు, వర్గాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశానికి వెలుతురు ప్రసరింప చేస్తుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. ‘దళిత బంధు’ పథకంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 427 మందితో ప్రగతిభవన్లో సోమవారం నిర్వహించిన అవగా హన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనిషిపై తోటి మనిషి వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీ ద్వారా తాను కూడా అధ్యయనం చేశానని కేసీఆర్ వివరించారు. కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోయి పరస్పర విశ్వాసం పెంచుకుని ఒకరికొకరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దళిత మహిళ మరియమ్మ మరణానికి కారకులైన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రభుత్వమే అండ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో వర్గాన్ని, ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు స్వీయ అభివృద్ధి కోసం దళిత సమాజం పట్టుదలతో పనిచేయాలి. తమలో ఇమిడి ఉన్న పులిలాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. దళారులకు, ప్రతీప శక్తులకు దూరంగా ఉండాలి. దళితవాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను వాపస్ తీసుకుని పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన విజయానికి బాటలు పడతాయి. వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో దళిత సమాజం తమకు ఇష్టమైన పరిశ్రమ, ఉపాధి, వ్యాపారాన్ని ఎంచుకుని వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి. గ్రామంలోని ఇతర వర్గాలు దళితుల వద్దకు అప్పుకోసం వచ్చేలా ఆర్థిక సాధికారత సాధించాలి. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో విద్యావంతులైన దళితులు కదిలి రావాలి. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న దళితబంధును విజయవంతం చేసేందుకు పట్టుదలగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించాలి. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలి. ఏది కోరుకుంటే అదే.. వివిధ రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి లబ్ధిదారుల ఇష్టాన్ని బట్టి ఆర్థిక సాయం అందిస్తాం. దానితోపాటు లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల కమిటీ దానిని నిర్వహిస్తుంది. ఆ నిధిలో ఏటా కనీస మొత్తాన్ని జమ చేస్తూ దళితులు మరింత పటిష్టంగా నిలదొక్కుకునేందుకు వినియోగిస్తాం. ప్రతీ లబ్ధిదారుడికి గుర్తింపు కార్డు దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందేవారికి గుర్తింపు కార్డు ఇస్తాం. ప్రత్యేకమైన బార్కోడ్తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ను ఆ ఐడీ కార్డులో చేర్చి పథకం అమలుతీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారుడు తను ఎంచుకున్న పనిద్వారా ఆర్థికంగా ఎదగాలే తప్ప జారి పడనివ్వం. సోమవారం ప్రగతిభవన్లో హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులతో కలసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో దళితుల సమస్యలన్నీ తీర్చాలి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత వాడల స్థితిగతులను తెలియజేసేలా ప్రొఫైల్ తయారు చేయాలి. హుజూరాబాద్లో ఇల్లు లేని దళిత కుటుంబం లేకుండా వంద శాతం పూర్తికావాలి. ఖాళీ స్థలాలున్న వారు ఇండ్ల నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దీనిని అమలు చేస్తాం. నియోజకవర్గంలోని దళితవాడల్లో రేషన్కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను గుర్తించి అధికారులు నివేదిక తయారు చేయాలి. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం చేస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో వారం పదిరోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి, అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూసమస్యలను పరిష్కరించాలి..’’అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా సదస్సులో ప్రసంగం తర్వాత దళిత బంధు పథకంలో మార్పులు, చేర్పులపై హుజూరాబాద్ నుంచి వచ్చిన దళితుల నుంచి సీఎం అభిప్రాయాలు సేకరించారు. సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు ప్రగతిభవన్లో అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11.30కు సమావేశం ప్రారంభంకాగా దళితబంధు పథకం ప్రత్యేకతలను సీఎం కేసీఆర్ వివరించారు. మధ్యాహ్నం సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి సీఎం భోజనం చేశారు. నాటుకోడి, చేపలు, మాంసాహారం, ఇతర ప్రత్యేక వంటకాలు వడ్డించారు. ఈ సందర్భంగా ‘గొర్రెల మందల పెరిగిన పులి’, ‘పైరవీకారుల మీద రామాయణం’అంటూ సీఎం హాస్యోక్తులు పండించినట్టు దళిత ప్రతినిధులు వెల్లడించారు. 17 వేల పొదుపు సంఘాలను తయారుచేసిన బంగ్లాదేశ్ ప్రొఫెసర్ హాష్మి గురించి కేసీఆర్ వివరించారని తెలిపారు. సదస్సులో హుజూరాబాద్ ఉప ఎన్నిక, అభ్యర్థులు వంటి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్నది వీరే.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్రావు.. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గా>్యదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకటవీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, కె.మానిక్రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఇక సీపీఎం, సీపీఐ నేతలు వెంకట్, బాలనర్సింహ, ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరేమన్నారంటే.. ►నేను ట్రాక్టర్ డ్రైవర్ను. పథకంలో అర్హత పొందితే ట్రాక్టర్ను కొనుక్కుంటా: సమ్మయ్య, కిష్టంపల్లి, వీణవంక మండలం ►నేను కారు డ్రైవర్ను. టాక్సీ కారు కొనుక్కుని స్వయంగా కిరాయికి నడుపుకొంటా: దాసర్ల చిరంజీవి, లస్మక్కపల్లి, వీణవంక మండలం ►తెలంగాణలో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ‘దళిత బంధు’లాంటి పథకాన్ని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: వెంకట్, సీపీఎం ►రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తున్న దళితబంధు దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు బాటలు వేస్తుంది. దేశవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు కోసం పోరాడుతాం: బాల నర్సింహ, సీపీఐ ►దళితబంధు పథకం ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతారు. అరవై లక్షల మంది తెలంగాణ దళితులæ జీవితాల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉంది: రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే ►పథకం పటిష్ట అమలు కోసం నోడల్ ఏజెన్సీని నియమించాలి. దళిత ప్రజాప్రతినిధులు పైలట్ నియోజకవర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తే నేర్చుకుంటం: గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ ►బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటీ లేకుండా నేరుగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే: కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి ►చిన్నలోన్ కోసం తండ్లాడిన దళితులకు ఉపాధి కోసం రూ.10 లక్షలు పూర్తి ఉచితంగా ఇవ్వడం మానవీయ నిర్ణయం. ఇది దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది. ఉద్యమ స్పూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో మాలాంటి వాళ్లను ప్రజాప్రతినిధులను చేసి భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు -గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ 16 బస్సులు.. 427 మంది హుజూరాబాద్: ప్రగతిభవన్లో జరిగిన ‘దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్పర్సన్లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు. మొదట ఆయా మండలాల నుంచి బస్సుల్లో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మరికొందరు బాణసంచా డప్పు చప్పుళ్ల మధ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత బస్సులను కలెక్టర్ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నియోజవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డు నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఎంపిక చేసి పంపినట్టు కలెక్టర్ తెలిపారు. -
9న ఇంద్రవెల్లిలో లక్షమందితో దండోరా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా దళితులు, గిరిజనులకు చేస్తున్న మోసాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టేందుకు ఆగస్టు 9న ఇంద్రవెల్లి నుంచి లక్షమందితో దండోరా మోగించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని చిరాన్పోర్ట్ క్లబ్లో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కె. ప్రేంసాగర్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కె.సురేఖ, జాతీయ యువజన కాం గ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్కుమార్ యాదవ్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ ఒక్క హుజూరాబాద్లోనే దళితబంధు పథకం అమలు చేస్తే, మిగిలిన 118 నియోజకవర్గాల్లోని దళితుల పరి స్థితి ఏంటని ప్రశ్నిం చారు. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకు ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి డబ్బాల్లో ఓట్లు వేసుకుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ ప్రభుత్వంపై ‘దళిత, గిరిజన దండోరా’మోగిస్తామని చెప్పారు. ప్రేంసాగర్రావుతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలెవ్వరితోనూ తనకు విభేదాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు బోనాల సందర్భంగా ఉజ్జయిని అమ్మవారిని రేవంత్రెడ్డి దర్శించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన నిజాంపేటకు చెందిన వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం చేశారు.