CS Somesh Kumar
-
గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందని, దీనికి ముందు ముఖ్యమంత్రి పోలీస్ గౌరవవందనం స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా దాదాపు వెయ్యిమంది కళాకారులు స్వాగతం పలుకుతారన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
భద్రాద్రి జిల్లాలో మండలానికో అధికారి
సాక్షి,హైదరాబాద్: వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికీ ఒక సీనియర్ అధికారిని నియమించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్య, విద్యుత్, పారిశుద్ధ్య తదితర విభాగాల బృందాలను నియమించినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో మంగళవారం సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4,100 మందిని, మున్సిపల్ శాఖ నుంచి 400 మంది శానిటేషన్ సిబ్బందితోపాటు మొబైల్ టాయిలెట్లు, ఎమర్జెన్సీ సామగ్రిని తరలించామని పేర్కొన్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతోపాటు పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల డైరెక్టర్లు, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీలు ఈ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 436 వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి వైద్య సేవలందించామన్నారు. -
నిరుద్యోగులకు గుడ్న్యూస్! ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా సంక్షేమ శాఖల ద్వారా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ తెరవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. అందులోనూ కేవలం ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు మాత్రమే స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తుండగా... మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలు మాత్రం స్టడీ సర్కిళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా అన్ని సంక్షేమ శాఖలకు జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్కుమార్కు పలు సూచనలు చేయగా... గత వారం సీఎస్ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకొక స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రస్తుతం కొనసాగుతున్నవి, ఎక్కడెక్కడ అవసరం ఉంది తదితర సమగ్ర వివరాలతో సంక్షేమ శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే స్టడీ సర్కిళ్లు శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిరంతరంగా శిక్షణ ఇకపై ప్రతి జిల్లాలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తే వాటిని నిరంతరంగా కొనసాగించేలా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోంది. సంక్షేమ శాఖల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా వీటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయి వెంటనే ఉద్యోగార్థులతో ఒక బ్యాచ్ను ఎంపిక చేసి శిక్షణ మొదలు పెడతారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్లు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లు రెగ్యులర్గా ఉండటంతో వీటికి నిరంతరంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ శాఖల వారీగా ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రిహార్సల్స్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల డ్రెస్ రిహార్సల్స్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్స్ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిడ్–19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
గ్రూప్–4పై తేల్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్–4 కొలువుల ప్రకటనకు ఇప్పట్లో అడుగు ముందుకు పడే అవకాశం కనిపించడంలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,163 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి కదలిక లేదు. సీఎస్ ఆదేశాల ప్రకారం ఈనెల 29 నాటికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి శాఖల వారీగా ఇండెంట్లు (ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్ వారీగాకొలువుల భర్తీకి ప్రతిపాదనలు) సమ ర్పించాల్సి ఉంది. ఈమేరకు సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సీఎస్ డెడ్లైన్ కూడా విధించారు. అయినా ఒక్క శాఖ నుంచి కూడా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు చేరకపోవడం గమనార్హం. కారణం ఇదేనా? ప్రభుత్వ శాఖల వద్ద గ్రూప్–4 కేటగిరీలోకి వచ్చే కొలువుల ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంది. అయితే నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు, రోస్టర్ వారీగా భర్తీ చేయాల్సినవెన్ని? తదితర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ ఇటీవల ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ శాఖలు ఆ దిశగా గణాంకాలను సిద్ధం చేసుకోగా, వాటిని టీఎస్పీఎస్సీకి సమర్పించాల్సి ఉంది. టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పించే ముందు ఆయా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన ఖాళీలకు తగినట్లుగా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిస్తారు. సాధారణంగా ఇదే పద్ధతి ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 29లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఆమేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూసిన శాఖలు, నిర్దేశించిన గడువులోగా అవి వెలువడకపోవడంతో ప్రతిపాదనలు సమర్పించలేదని తెలుస్తోంది. హడావుడిగా సాగి.. వివిధ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9,163 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిని రిజర్వేషన్లకు అనుగుణంగా విభజించి నూతన జోనల్ విధానం ప్రకారంభర్తీ చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో రెండు వారాల క్రితం ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్రెడ్డి కూడా హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ చైర్మన్ దీనికి హాజరు కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో సైతం హడావుడి నెలకొంది. ప్రభుత్వ సమావేశాలకు ఆయన రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగాల భర్తీ వేగిరమైందని భావించారు. దీంతో దాదాపు అన్ని శాఖలు నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. కానీ తీరా గడువులోగా జీవోలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. -
పన్ను బకాయా.. ‘సెటిల్మెంట్’ చేస్కోండి
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రూ. 3 వేల కోట్లకు పైగా పన్నులను రాబట్టేందుకు వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్–1957, తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్–2005, సెంట్రల్ ట్యాక్స్ యాక్ట్–1956, తెలంగాణ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ఇన్టు లోకల్ ఏరియాస్–2001 చట్టాల పరిధిలోకి వచ్చే పన్నుల చెల్లింపునకు సంబంధించి పన్నుల శాఖతో వివాదం ఉంటే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. వివాదాల్లో ఉన్న పన్ను చెల్లింపులకు సంబం ధించి సాధారణ పన్నులో 60 శాతం మాఫీ కానుంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 50 శాతం, ఎంట్రీ ట్యాక్స్ 40 శాతం మాఫీ అవుతుంది. పెండింగ్లో ఉన్న పన్నులను 100 శాతం కట్టాల్సి ఉంటుంది. అయితే వీటిపై వేసిన జరిమానాలు, వడ్డీలు రద్దవుతాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యాపారి సదరు మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం రూ.25 లక్షల కంటే ఎక్కువుంటే 4 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశమిస్తారు. ఈ వాయిదాల వరకు వడ్డీలు ఉండవు. 4 కన్నా ఎక్కువ వాయిదాలైతే పెంచిన వాయిదాల కు బ్యాంకు వడ్డీ వర్తిస్తుంది. పథకం కింద ఈ నెల 16 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను జూలై 1 నుంచి 15 వరకు స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీకి సర్కిల్ ఏసీ, డీసీ, జేసీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీదే తుది నిర్ణయం. మాఫీ పోను మిగిలిన సొమ్మును అదే నెల 16 నుంచి ఆగస్టు 15 వరకు చెల్లించాలి. -
సీఎస్ సోమేశ్ బదిలీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ బదిలీకి రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే సోమేశ్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2023లో ఎన్నికలు జరిగే వరకు సోమేశ్ కుమార్ సీఎస్గా కొనసాగుతారని భావించినా.. ఇటీవలి పరిణామాలను చూస్తే ఆయన బదిలీ తప్పదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల సోమేశ్ కుమార్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఢిల్లీలో గత వారం నిర్వహించిన సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సీఎస్ తీరును వివరించారు. సీఎం కేసీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సోమేశ్ కుమార్తో ఇటీవల తాను సమావేశమైనప్పుడు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలను వారికి వివరించానని, వాటిపై కేసీఆర్ స్పందించి.. రెండు రోజుల్లో పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ను ఆదేశించారని, అయినా నేటి వరకు సీఎస్ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు సీజే.. జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సీజేఐ.. ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్లో పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితోపాటు సీఎస్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని, కొంతమంది ఉన్నతాధికారులను మినహా ఇతరులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్లోని పొరపాట్లను దిద్దడంలో విపరీతమైన జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. హైకోర్టులో కూడా సీఎస్పై అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. దీనికితోడు ఆయనను ఏపీకి పంపించాలని కేంద్రం సైతం పిటిషన్ వేయడంపై విచారణ జరుగుతోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సోమేశ్ బదిలీ జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన స్థానంలో భర్తీ చేయడానికి సీనియర్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. -
నూకల పరిహారం ఎంతిద్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని మరపట్టిస్తే సాధారణంగా వచ్చే 25 శాతం నూకలకు అదనంగా మరో 25 శాతం నూకలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నష్టాన్ని భరించే మిల్లర్లకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వింటాల్ ధాన్యానికి నూకల పరిహారంగా రూ. 300 ఇస్తే నష్టం ఉండదని మిల్లర్లు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్తో భేటీలో కోరగా ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలవారీగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఆయా జిల్లాల వాతావరణ పరిస్థితులు, నూకల శాతాన్ని లెక్కించి మిల్లర్లకు క్వింటాల్కు ఇచ్చే పరిహారాన్ని నిర్ణయించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎస్ కమిటీ 2–3 రోజుల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా గరిష్టంగా క్వింటాల్కు రూ. 150–200 వరకు పరిహారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యంతోపాటు వచ్చే అనుబంధ సరుకు (బియ్యపు పిండి, తౌడు, ఊక)ను కూడా పరిగణనలోకి తీసుకొని మిల్లింగ్ చార్జీల పేరిట నూకల నష్టాన్ని చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో నూకలకు పరిహారం కింద మిల్లర్లకు అక్కడి ప్రభుత్వాలు ఏమైనా చెల్లింపులు చేస్తున్నాయా అనే కోణంలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే ప్రారంభమైన 1,565 కొనుగోలు కేంద్రాల్లో 94 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్..
ED Files Contempt Of Court Petition Against Telangana CS Excise Director: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వట్లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్పై పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరిన వివరాలను ఈడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తర్వాత మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు తగ్గట్లు రాష్ట్రంలో అనేక వినూత్న పథకాలు అమలు చేస్తూ తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014–15లో జీఎస్డీపీ రూ.4.16 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి 130 శాతం వృద్ధితో రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ. 2.78 లక్షలకు చేరిందన్నారు. 2014–15లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ 2021–22 నాటికి 3వ స్థానానికి చేరుకుందని చెప్పారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక అధ్యయనం కోర్సులో భాగంగా ఎయిర్ వైస్ మార్షల్ తేజ్బీర్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ ఫ్యాకల్టీ బృందం సోమవారం బీఆర్కేఆర్ భవన్ను సందర్శించి అధికారులతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఈ బృందానికి సోమేశ్కుమార్ వివరించారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, ఇతర వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కూడా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. పలు ఫ్లాగ్షిప్ కార్యక్రమాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
వీఆర్వోలకు గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను గ్రేడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వారి వివరాలను పంపాలని కోరుతూ సీఎస్ సోమేశ్కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపారు. ప్రత్యేక ఫార్మాట్లో ఆదివారం మధ్యాహ్నంకల్లా వివరాలు పంపాలని.. ఆయా మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. వీఆర్వో పనిచేస్తున్న మండలం, క్లస్టర్, ఉద్యోగి ఐడీ నంబర్, స్వగ్రామం, పాత జిల్లా, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటినుంచి పనిచేస్తున్నారు, చివరగా పనిచేసిన మూడు ప్రాంతాలు, పుట్టినతేదీ, వీఆర్వోగా రిక్రూటైన తేదీ, రిటైర్మెంట్ తేదీ, వీఆర్వోగా నియామకమైన పద్ధతి, కులం, రిజర్వేషన్, మొబైల్ నంబర్తోపాటు సదరు వీఆర్వోకు ఏ/బీ/సీ/డీ గ్రేడింగ్ ఇస్తూ వివరాలు పంపాలని ఆదేశించారు. సస్పెన్షన్లో ఉన్న, దీర్ఘకాలికంగా సమాచారం లేకుండా సెలవులో ఉన్న వారి వివరాలనూ పంపాలన్నారు. 15 ఇతర శాఖల్లో సర్దుబాటు! రెవెన్యూ శాఖ పరిధిలోని వీఆర్వోలను 15 శాఖల్లో సర్దు బాటు చేసేందుకే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 5,384 మంది వీఆర్వోలు పనిచేస్తుండగా.. అందులో 1,300 మంది వరకు నేరుగా రిక్రూటైనవారు ఉన్నారు. వారిని రెవెన్యూశాఖలో కొనసాగించి మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తారా? అందరినీ ఇతర శాఖలకే పంపుతారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గాను వీఆర్వోలను ఆప్షన్లు అడుగుతారనే ప్రచారమున్నా.. అది సాధ్యం కాకపోవచ్చని, ప్రభుత్వమే అవసరాలకు అనుగుణంగా ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. కాగా.. వీఆర్వోల విషయంగా ప్రభుత్వం ఒక అడుగు వేయడంతో.. తమ పేస్కేల్, పదోన్నతుల సమస్యకు కూడా త్వరలో పరిష్కారం లభించవచ్చని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఆశిస్తున్నారు. -
విద్యార్థులను తీసుకొచ్చే పనిలో ఉన్నాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు, ప్రవాసు లను రాష్ట్రానికి తీసుకురావ డానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు మొత్తం 150 కాల్స్ వచ్చాయని, అందులో ఉక్రెయిన్ నుంచి 10–12 కాల్స్ ఉన్నాయన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలు నమోదు చేసుకుని, విదేశీ వ్యవహారా లశాఖ, ఉక్రెయిన్లోని భారత ఎంబసీకి అందజేస్తు న్నామని తెలిపారు. విద్యార్థులు, ఇతర ప్రవాసు లను ఉక్రెయిన్ నుంచి సరిహద్దులకు, అక్కడి నుంచి విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందన్నారు. విమానాల సమాచారంసహా పూర్తి వివరాలను అక్కడి తెలంగాణ విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. ఇప్ప టికే ఆయా అంశాలపై ఉక్రెయిన్లోని భారత ఎంబసీ ఫస్ట్ సెక్రటరీతో మాట్లాడామని వివరిం చారు. తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువ మంది చదువుతున్న జఫరోజియా వర్సిటీకి సంబం ధించిన భారత ప్రతినిధితోనూ మాట్లాడామన్నారు. -
ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారానికి ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశం నిర్వహించా లని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కాగా త్వరలో అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ప్రకటించారు. సమావేశం అజెండాను పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఆయా అంశాలను పరిశీలించి తుది అజెండాను ఖరారు చేస్తామని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి సమావేశం తేదీని నిర్ణయిస్తారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పంకజ్కుమార్ మంగళవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. సీడ్ మనీ మొత్తంపై పునరాలోచన కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు గెజిట్లో పేర్కొన్న మేరకు ఒక్కో బోర్డు ఖాతాలో ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా తక్షణమే డిపాజిట్ చేయాలని రెండు రాష్ట్రాలను పంకజ్కుమార్ కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి రూ.200 కోట్లను డిపాజిట్ చేయలేమని తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ నిధులను ఏం చేస్తారో చెప్పాలని సోమేశ్కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీడ్ మనీ తగ్గింపుపై పునరాలోచన చేస్తామని పంకజ్కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు అప్పగించం: తెలంగాణ కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–3 పరిధిలోని ప్రాజెక్టులను తక్షణమే ఆయా బోర్డులకు అప్పగించాలని పంకజ్కుమార్ ఆదేశించారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కొత్త ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎస్ కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టులను కూడా అప్పగించబోమని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మాత్రమేనని, ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు అవసరమే లేదని చెప్పారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని ఏపీ పేర్కొంది. గోదావరి బోర్డు అత్యంత ఆవశ్యకమని.. తక్షణమే శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్లను అప్పగించాల్సిందే: కేంద్రం రెండు రాష్ట్రాల అధికారుల వాదనల అనంతరం పంకజ్కుమార్ స్పందించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను తక్షమే కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. ఏకాభిప్రాయంతో వాటిని బోర్డుకు అప్పగించాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ను మార్చే ప్రసక్తే లేదని.. గోదావరి బోర్డు అత్యంతావశ్యకమని స్పష్టం చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇలావుండగా గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి ఆమోదం పొందడం కోసం తక్షణమే వాటి డీపీఆర్లను కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) పంపాలని రెండు రాష్ట్రాలను పంకజ్కుమార్ ఆదేశించారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులపై ఒక నివేదిక ఇస్తే.. కొత్తగా అనుమతి తీసుకోవాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుతామని చెప్పారు. -
ఉద్యోగుల విభజన త్వరగా చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన, జిల్లాలు, జోన్ల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులతో ఉద్యోగుల విభజన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించే ప్రక్రియ పూర్తయిందని, అన్ని కేడర్లలో సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశామని ఉన్నతాధికారులు సీఎస్కు వివరించారు. అనంతరం సోమేశ్ మాట్లాడుతూ విభజన ప్రక్రియ గురించి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య, మహిళా శిశు సంక్షేమ, యువజన సర్వీసులు, పర్యాటక–సాం స్కృతిక, అన్ని సంక్షేమ శాఖలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక, విద్యుత్, అటవీ, వ్యవసాయ, రోడ్లు భవనాలు, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు, అలాగే ప్రమాదాల్లో మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఈ విషయంలో రవాణా, పోలీసు, వైద్య శాఖలు సమష్టిగా పనిచేస్తున్నాయని వివరించారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో రోడ్డు భద్రతపై సమావేశమయ్యారు. వాహనాల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపార. -
16లోగా విభజన ప్రక్రియ పూర్తి..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం రాత్రి రెండు జీవోలను జారీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సీనియారిటీ జాబితాపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విభజన పూర్తి చేయాలని, 20వ తేదీలోగా సంబంధిత అధికారులు కేటాయింపు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది పూర్తయిన వారం రోజుల్లో ఉద్యోగులు కేటాయించిన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా అధికారుల నేతృత్వంలో కమి టీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోనల్ పరిధిలో రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జీవోల్లో వివరించారు. -
ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై వారి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్కుమార్తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో సమావేశమైంది. కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై చర్చించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317లో ఈ కింది అంశాలను చేర్చాలని బృందం సూచించింది. ►ఉద్యోగులు/కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకోవడం, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి ఉంటే ప్రత్యేక కేటగిరీ కింద ప్రాధాన్యత ఇవ్వాలి. ►45 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ►కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీకి గురైన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించాలి. n సొంత జిల్లా, ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాతో పాటు మొదటి నియామక జిల్లాను దరఖాస్తు నమూనాలో చేర్చాలి. ►రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు గరిష్ట కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించాలి. ట్రెసా చేసిన ఇతర విజ్ఞప్తులు.. ♦పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. ♦డీపీసీ ఆమోదం పొంది తహశీల్దార్లుగా పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న డిప్యూటీ తహశీల్దార్లకు పోస్టింగులు ఇవ్వాలి. 2017–18 నుండి డిప్యూటీ తహసీల్దార్ల కొత్త ప్యానెల్స్ తయారు చేయాలి. ♦సుదూర ప్రాంతాలోని ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలి. ∙వీఆర్వోలకు కూడా బదిలీ ఆప్షన్లు ఇవ్వాలి. ∙వీఆర్ఏలకు స్కేల్ వర్తింప చేయాలి. -
ఒప్పందాలుంటేనే వరి.. యాసంగిలో వరి వేయొద్దని సీఎస్ సోమేశ్కుమార్ సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి పారాబాయిల్డ్ (ఉప్పుడు) బియ్యం సేకరించబోమని భారత ఆహార సంస్థ నిర్ణయించినందున రాష్ట్ర రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సీజన్లో పండే వరి ఉప్పుడు బియ్యానికే అనుకూలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం డీజీపీ ఎం. మహేందర్రెడ్డితో కలసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఒకవేళ విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం లేదా సొంత అవసరాల కోసం అయితే సాగు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జిల్లాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట కొత్తగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు ఇతర ప్రాంతాల ధాన్యం వస్తున్నట్లు గుర్తించామని, దీన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు నిరోధించాలని ఆదేశించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శులు సందీప్కుమార్ సుల్తానియా, ఎస్ఏఎం రిజ్వీ, పోలీస్ అధికారులు జితేందర్, అనిల్కుమార్, కార్యదర్శులు రఘునందన్రావు, క్రిస్టినా జెడ్. చొంగ్తు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పాల్గొన్నారు. -
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎస్
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయం వద్ద సోమేశ్కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్టా బంగారు కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజలు చేశారు. సీఎస్కు ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్ ప్రధానాలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రధానాలయం దాదాపు పూర్తయిందని, కొండ కింద రోడ్లు, తదితర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 28న జరిగే ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. -
భూ పరిపాలనా రంగంలో అతిపెద్ద సంస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూపరిపాలనా రంగంలో వచ్చిన అతి పెద్ద సంస్కరణ ధరణి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో పలు శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే ధరణి సాధ్యమైందని, ఈ సాహసాన్ని కేసీఆర్ తప్ప ఎవరూ చేయలేరని కొనియాడారు. సంవత్సర కాలంలో ఊహించినదాని కన్నా విజయవంతమైందని, 5.14 కోట్ల మంది ధరణి పోర్టల్ను చూడటం, 10 లక్షలకు పైగా లావాదేవీలు జరగడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న విప్లవాత్మక పథకాల కారణంగా రాష్ట్రంలోని భూముల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ధరణి పోర్టల్ కారణంగా భూ రికార్డులు పటిష్టంగా మారాయని, రికార్డులను తారుమారు చేసే పరిస్థితి లేకుండా భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు 574 తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు చెప్పారు. ధరణి విజయవంతం కావడంలో సీనియర్ అధికారులు, ఐటీ నిపుణుల శ్రమ ఉందని, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈ విజయంలో కీలక భూమిక పోషించారని ప్రశంసించారు. ఏడాది కాలంలో ధరణి సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని సీఎస్ సోమేశ్కుమార్ ఆవిష్కరించారు. సమావేశంలో పలు శాఖల కార్యదర్శులు సందీప్కుమార్ సుల్తానియా, ఎస్.ఎం.రిజ్వీ, రాహుల్ బొజ్జా, శేషాద్రి, రఘునందన్రావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రె జిల్, జర్మనీ, నెదర్లాండ్, చైనా తదితర దేశాల్లో కోవిడ్–19 మరో రూపంలో ప్రబలిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి నుంచి కా పాడేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని, ఈ మేరకు రాష్ట్రంలో 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వ్యాక్సినేషన్ను మరింత ఉధృతంగా చేపట్టేందుకు గ్రామ/వార్డు స్థాయి ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక బృందంలో ఆశ వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులకు వసతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతో పాటు వచ్చే సహాయకులకు వసతి కల్పించేందుకు ఆస్పత్రుల పరిసర ప్రాంతాల్లో తగిన ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతోపాటు వస్తున్న సహాయకులు సరైన వసతి, సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు శనివారం సీఎస్ సోమేశ్కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దసరా పండుగ నుంచే వసతి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే ఈ కేంద్రాల్లో హరేకృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో తాగునీరు, శానిటేషన్తోపాటు మహిళా అటెండెంట్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ కౌంతేయ దాస్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎం.డి. చంద్రశేఖర్, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ‘ఇటీవల జమ్మూ, కశ్మీర్ పర్యటన సందర్భంగా ‘కుంకుమ పువ్వు’ల సాగు కేంద్రంలో ఓ రైతు నాతో మాట్లాడుతూ గతంలో తమకు కిలో కుంకుమపువ్వుకు రూ.లక్ష వరకూ అందేదని, ‘కేసర్ పార్క్’ఏర్పాటైన తరువాత, సాగు, మార్కెటింగ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చిన తరువాత రెట్టింపు ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశార’ని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (2023) వేడుక సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు బియ్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ఎఫ్సీఐ ద్వారా సేకరించే బియ్యం మళ్లీ ప్రజలకే పంచుతున్నాం. ఈ క్రమంలో సేకరించే బియ్యం నాణ్యమైందా? కాదా? అన్నది చూస్తాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’’అని అన్నారు. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రయత్నం చేస్తారా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సరఫరా చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం అనుమతి పొందితే తాము సేకరించేందుకు సిద్ధమే’’అని తెలిపారు. -
15 రోజుల్లో కోటి టీకాలు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: థర్డ్వేవ్ హెచ్చరికలతో రాష్ట్రంలో అందరికీ టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో కోటి కరోనా టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కార్యాచరణ ప్రకటించి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. టీకాలు వేసేందుకు గురువారం నుంచి రోజు వారీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రెండు డోసులూ పూర్తి చేయాలని నిర్ణయించింది. టీకా ప్రక్రియ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్ల టీకా డోసులు వేశారు. కోటి డోసులు 165 రోజుల్లో వేశారు. తర్వాత 2 కోట్ల డోసుల మార్కును 78 రోజుల్లో చేరుకున్నారు. రాష్ట్రంలో 52 శాతం అర్హులకు మొదటి డోసు ఇచ్చారు. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు కూడా.. కనీసం పది ఇరవై మంది ఉన్న ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు, దుకాణాల వంటి చోట్లకు కూడా వెళ్తారు. వారందరికీ అక్కడికక్కడే టీకా ఇస్తారు. ఎవరైనా తమ కార్యాలయంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటే, సంబంధిత స్థానిక అధికారులకు తెలియజేస్తే నిర్ణీత తేదీన వ్యాక్సినేషన్ చేపడతారు. గ్రామాల్లో వ్యాక్సిన్ వేసే రోజున ప్రత్యేకంగా చాటింపు వేస్తారు. మొత్తం మీద రోజుకు ఆరేడు లక్షల మందికి వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అధికారుల కృషి అభినందనీయం: సీఎస్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో 2 కోట్ల టీకాల లక్ష్యాన్ని సాధించడంపై సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. అర్హులైన వ్యక్తులకు టీకాలు వేసేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలో దాదాపు అందరికీ మొదటి డోసు టీకాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హై ఎక్స్పోజర్ గ్రూప్లలో ఉన్న 38 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ మార్గదర్శకాలు – నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీకాల శిబిరాలు ప్రారంభించాలి – గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు యూనిట్గా ఉంటాయి. – సబ్–సెంటర్లోని అన్ని ఆవాసాలను ముందుగా షెడ్యూల్ చేసిన క్యాంప్ల ద్వారా కవర్ చేయాలి. నివాసాల వారీగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేయాలి. – పట్టణ ప్రాంతాల్లో వార్డులు యూనిట్గా ఉంటాయి. – వార్డులోని అన్ని కాలనీలు/మురికివాడల్లో ముందుగా షెడ్యూల్ చేసిన క్యాంపుల ద్వారా కవర్ చేయాలి. కాలనీ/మురికివాడల వారీగా సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలి. – టీకా శిబిరం కోసం భవనం లేదా టెంట్లు, కుర్చీలు మొదలైనవి సమకూర్చాలి. – టీకా కేంద్రాల వద్ద సైడ్ ఎఫెక్టŠస్ వచ్చే కేసులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు 108 లేదా ఆర్బీఎస్కే వాహనాలను సిద్ధంగా ఉంచాలి. అలాగే జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. – సైడ్ ఎఫెక్టŠస్ కేసుల కోసం అన్ని ఏరియా, జిల్లా ఆసుపత్రులలో పడకలు, వైద్యులను 24 ్ఠ7 అందుబాటులో ఉంచాలి. మొబైల్ వ్యాన్లతో ఇంటింటికీ వెళ్లి పదిహేను రోజుల్లో కోటి టీకాల కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను చేపడతారు. మొబైల్ వ్యాన్లతో వీధివీధికీ, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్లు వేయాలని భావిస్తున్నారు. ఒక వీధికి వెళ్లాక వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వారు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా? అని ఆరా తీస్తారు. ఎవరైనా వేసుకోవాల్సి ఉంటే వారికి అక్కడికక్కడే వేస్తారు. ఇంట్లో అర్హులంతా వ్యాక్సిన్ వేసుకుంటే ఆ ఇంటి డోర్పై ‘ఫుల్లీ వ్యాక్సినేటెడ్ హోం’అనే స్టిక్కర్ను వేయాలని కూడా యోచిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఎవరికైనా టీకాలపై అనుమానాలుంటే అవగాహన కల్పిస్తారు. స్వచ్ఛందం పేరిట వారి ఇష్టానికి వదిలేయకూడదని అధికారులు భావిస్తున్నారు. త్వరలో 12–18 వయసున్న వారికీ 12–18 ఏళ్ల వయసున్న దాదాపు 48 లక్షల మందికి కూడా టీకా వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో వేసే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. -
తెలంగాణ నుంచి ఏపీకి బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి శాశ్వత బదిలీపై వెళ్లదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్ 15లోగా తమ విభాగాధిపతి/శాఖాధిపతికి దరఖాస్తు చేసుకో వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఏపీకి వెళ్లాలనుకుంటున్న అధికారుల విష యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. ఈమేరకు ఏపీకి అంతర్రాష్ట బదిలీలకు సీఎస్ సోమేశ్ కుమార్ తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను ఏపీకి పంపేందుకు సంబంధిత శాఖ కార్యదర్శి నిరభ్యంతర పత్రం జారీచేస్తారు. చదవండి: అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం