-
IPL 2023: ముంబై ఇండియన్స్కు భారీ షాక్! 17 కోట్ల ‘ఆల్రౌండర్’ దూరం?!
IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్ చేస్తాడని సమాచారం. ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడకపోతే మాత్రం ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వేలికి గాయం! దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా గ్రీన్ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అనంతరం ఎక్స్రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసీస్.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్లు ఆడనుంది. గాయం ఇబ్బంది పెడితే.. ఈ నేపథ్యంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రీన్ గనుక టెస్టు సిరీస్ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్తో అన్నింటికి చెక్
గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియా క్రికెట్ మీడియాలో డేవిడ్ వార్నర్ పేరు హాట్ టాపిక్. కారణం కెప్టెన్సీ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడమే. 2018లో బాల్ టాంపరింగ్ వివాదం అతని మెడకు చుట్టుకొని రెండేళ్ల నిషేధంతో పాటు ఆసీస్కు కెప్టెన్ కాకుండా లైఫ్టైమ్ బ్యాన్ విధించింది. అయితే తనపై కెప్టెన్సీ లైఫ్టైమ్ బ్యాన్ ఎత్తివేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేసుకుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. సొంత బోర్డు నుంచే కనీస మద్దతు కరువవడంతో తెగ బాధపడిపోయిన వార్నర్..'' మీ కెప్టెన్సీకో దండం.. నా అప్పీల్ను వెనక్కి తీసుకుంటున్నాని.. ఇకపై ఆ విషయం కూడా ఎత్తను'' అంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్నర్ తీరుపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ''కెప్టెన్సీ కాదు ముందు మీ ఆటతీరులో దమ్ము చూపించండి.. అప్పుడు కెప్టెన్సీపై చర్చకు రండి'' అంటూ పరోక్షంగా వార్నర్కు సవాల్ విసిరింది. నిజానికి వార్నర్ కూడా అంత గొప్ప ఫామ్లో అయితే లేడనే చెప్పాలి. ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్కప్లోనూ వార్నర్ పెద్దగా ప్రభావం చూపించింది లేదు. అందునా టెస్టుల్లో వార్నర్ మెరిసి చాలా కాలమైపోయింది. వార్నర్ బ్యాట్ నుంచి శతకం జాలువారి మూడేళ్లు కావొస్తుంది. దీనికి తోడు ఆటను పక్కనబెట్టి కెప్టెన్సీ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడం సొంత అభిమానులకు కూడా నచ్చలేదు. అన్ని వైపుల నుంచి వార్నర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన కామెంట్స్ను వార్నర్ సీరియస్గా తీసుకున్నాడనిపించింది. ఒకే ఒక్క ఇన్నింగ్స్తో తనపై వస్తున్న విమర్శలన్నింటికి చెక్ పెట్టాడు. మెల్బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టు వార్నర్ కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. తన వందో టెస్టులో సెంచరీతో మెరిసి అన్నింటికి సమాధానం చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తన పంతం నెరవేర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. శతకంతో మెరవడమే సూపర్ అనుకుంటే.. ఏకంగా డబుల్ సెంచరీతో కథం తొక్కి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. దాదాపు 1089 రోజులు శతకం లేకుండా కొనసాగిన వార్నర్ ఇన్నింగ్స్లకు ఇది మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏ బోర్డు అయితే తనకు సవాల్ విసిరిందో అదే బోర్డుతో చప్పట్లు కొట్టించుకున్నాడు వార్నర్. ఇది అందరికి సాధ్యం కాదు. కచ్చితంగా వార్నర్ కెరీర్లో ఈ ఇన్నింగ్స్ ఎప్పటికి మధురానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. A double century for David Warner! But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa — cricket.com.au (@cricketcomau) December 27, 2022 చదవండి: వారీ ఎంత పని జరిగే.. గట్టిగా తాకుంటే ప్రాణం పోయేదే! -
'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం
ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ శనివారం సొంత బోర్డు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా లైఫ్టైమ్ బ్యాన్ విధించడంపై అప్పీల్కు వెళ్తే కనీస మద్దతు లభించకపోవడం దారుణమని పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన టెస్టు సిరీస్లో ఈ అంశం నన్ను మానసిక వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో బాల్ టాంపరింగ్(SandpaperGate) వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరున్ బెన్క్రాప్ట్లు కలిసి బాల్ టాంపరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వారిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్పై ఏడాది నిషేధంతో పాటు కెప్టెన్ కాకుండా లైఫ్టైమ్ బ్యాన్ విధించింది. ఇటీవలే వెస్టిండీస్ పర్యటన సందర్భంగా.. రెండో టెస్టుకు ముందు వార్నర్ తన కెప్టెన్సీపై లైఫ్టైమ్ బ్యాన్ ఎత్తేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేశాడు. దానిపై అతను బోర్డుతో తీవ్రంగా పోరాడినప్పటికి మద్దతు కరువయిపోయింది. అయితే తన వాదనలను బోర్డు ఎదుట చెప్పేందుకు సిద్ధమని.. కానీ బోర్డు మాత్రం బహిరంగంగా చర్చించాలని పట్టుబట్టింది. ఇదంతా నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే అంశంలా కనిపించింది. అందుకే కెప్టెన్సీ బ్యాన్ను ఎత్తేయాలనే అభ్యర్థనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం వార్నర్ను మానసిక వేదనకు గురి చేసింది. ఆ ప్రభావం ఆటపై కూడా పడింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 5, 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియాపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.'' కొంతమంది పనిగట్టుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంతలా అంటే అది నా ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది. కెప్టెన్సీపై లైఫ్టైమ్ బ్యాన్ ఎత్తేయాలని అప్పీల్ చేస్తే బోర్డు నుంచి మద్దతు కరువయింది. ఇది నన్ను మానసిక వేదనకు గురి చేసింది. నావైపు నుంచి సమస్యను విన్నవించుకున్నప్పటికి.. క్రికెట్ ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు ఎలాంటి మద్దతు రాలేదు. నా జట్టు సహచరులు, సిబ్బంది నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియాకు నేను కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదని స్పష్టంగా అర్థమైంది. ఇది నాకు నిజంగా కష్టకాలంలా ఉంది. దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు ద్వారా డేవిడ్ వార్నర్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ వార్నర్కు వందో మ్యాచ్ కానుంది. అయితే జనవరి 2020 నుంచి వార్నర్ బ్యాట్ నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా రాలేదు. ప్రస్తుతం జట్టులో సీనియర్ క్రికెటర్గా ఉన్న వార్నర్.. ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు 99 టెస్టులు, 141 వన్డేలు, 99 టి20 మ్యాచ్లు ఆడాడు. చదవండి: Virat Kohli: శ్రుతి మించిన బంగ్లా ఆటగాళ్ల చర్య.. కోహ్లి ఆగ్రహం షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు -
సూర్యను కొనగలిగేంత డబ్బు మా దగ్గర లేదు.. ఆటగాళ్లందరిపై వేటు వేస్తేనే!
Suryakuma Yadav: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. బిగ్బాష్ లీగ్లలో సూర్య సంచలన ఇన్నింగ్స్ చూడాలని ఉన్నా.. అతడిని కొనే స్థోమత క్రికెట్ ఆస్ట్రేలియాకు లేదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్న సూర్యకుమార్ను అందుకోవడం ప్రపంచంలోని ఏ ఆటగాడకి సాధ్యం కాదని కొనియాడాడు. లేట్గా ఎంట్రీ ఇచ్చినా మూడు పదుల వయసులో టీమిండియా తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. టీ20 ఫార్మాట్లో అత్యుత్తమంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022లో 239 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్లోనూ మెరిశాడు. కివీస్తో రెండో టీ20 సందర్భంగా పొట్టి ఫార్మాట్లో రెండో శతకం నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో టీ20 ర్యాంకింగ్స్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న సూర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో ది గ్రేడ్ క్రికెటర్ పాడ్కాస్ట్లో మాట్లాడిన గ్లెన్ మాక్స్వెల్ ‘స్కై’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్లెన్ మాక్స్వెల్ (PC: Glenn Maxwell Twitter) సూర్య.. వేరే లెవెల్.. అంతే! ‘‘నిలకడైన ఆటకు మారుపేరుగా మారి మాకు తలనొప్పి తెప్పిస్తున్నాడంటే నమ్మండి! ఆస్ట్రేలియా.. కాదు కాదు ప్రపంచంలోనే ఇప్పుడు తన దరిదాపుల్లోకి వెళ్లే ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, ఐపీఎల్లో తన ప్రదర్శనతో ఒక్కోసారి జోస్ బట్లర్.. యాదవ్తో పోటీపడగలడు. ఏదైమైనా ‘స్కై’ది వేరే లెవల్!’’ అంటూ ఈ పవర్ హిట్టర్ సూర్యను కొనియాడాడు. ఆ స్థోమత మాకు లేదు! ఇక బిగ్బాష్ లీగ్ ప్రస్తావన నేపథ్యంలో.. ‘‘మా దగ్గర సూర్యకుమార్ను కొనగలిగేంత డబ్బు లేదు. ఒకవేళ తనను సొంతం చేసుకోవాలనుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఆటగాడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లను తొలగించాల్సి వస్తుందేమో! అందరి జీతం కట్చేస్తే.. అప్పుడైనా తనను కొనగలిగే స్థోమత వస్తుందనుకుంటా’’ అంటూ మాక్సీ.. సూర్యకుమార్ను ఆకాశానికెత్తాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్న సూర్య త్వరలోనే టెస్టుల్లోనూ అరంగేట్రం చేస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బోర్డుతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే ప్రపంచంలోని ఇతర క్రికెట్ లీగ్లలో ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సూర్య గురించి మాక్స్వెల్ సరదాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఇటీవల కాలు విరగ్గొట్టుకున్న మాక్సీ.. మూడు నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. చదవండి: NZC: సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న మరో న్యూజిలాండ్ ప్లేయర్! దేశం తరఫున ఆడటం.. Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! -
'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ తీరును ఎండగట్టాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారని.. మరో అవకాశం ఇవ్వాలని అడిగితే పదవి నుంచి తొలగించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. విషయంలోకి వెళితే.. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్డాగ్స్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్ను ఎగురేసుకుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. దీని వెనకాల ప్రధాన కారణం అప్పటి కోచ్ జస్టిన్ లాంగర్. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను 4-0తేడాతో గెలవడంలోనూ లాంగర్దే ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. అతని హయాంలోనే ఆస్ట్రేలియా మళ్లీ టెస్టుల్లో నెంబర్వన్ ర్యాంక్కు చేరుకుంది. ఇప్పటికీ ఆస్ట్రేలియానే టెస్టుల్లో నెంబర్వన్గా ఉంది. ఎంత కాదన్నా కోచ్, ఆటగాళ్లు కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలా ఏడాది వ్యవధిలో రెండు గొప్ప ఫీట్లు సాధించిన కోచ్గా లాంగర్ పేరు గడించాడు. ఆ తర్వాత తన పదవిని పొడిగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం లాంగర్ పదవిని మరో ఆరు నెలల పాటు మాత్రమే పొడిగించింది. పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన సమయంలోనే లాంగర్ను తొలగించి ఆండ్రూ మెక్డొనాల్డ్ను కొత్త కోచ్గా ఎంపిక చేసింది. అలా లాంగర్కు క్రికెట్ ఆస్ట్రేలియాతో బంధం ముగిసింది. తాజాగా తనకు జరిగిన అన్యాయంపై లాంగర్ డెయిలీ మెయిల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.''తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు పిరికివాళ్లని.. కానీ మెజారిటీ ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. పాట్ కమిన్స్ సహా కొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించి వెనుక మత్రం గోతులు తవ్వినట్లుగా అనిపించింది. కోచ్గా నేను నచ్చకపోతే ముఖం మీద చెప్పాల్సింది.. ఇలా వెనుక మాట్లాడడం తగదు. కోచ్కు, ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం కామన్. నాకు తెలియకుండా పాట్ కమిన్స్ లాంటి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం మాలో జరిగిన కొన్ని విషయాలను లీక్ చేశారు. ఇది నా దృష్టిలో పెద్ద తప్పు. ఇక నేను పదవికి రాజీనామా చేసే సమయానికి జట్టు నెంబర్వన్లో ఉంది. దానిని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయకుండానే నన్ను కోచ్ పదవి నుంచి తప్పించారు.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు సరికొత్త ఫార్మాట్లో 2024 టి20 వరల్డ్కప్ -
నేనేమీ క్రిమినల్ను కాదు.. నాయకుడినే.. నరకం అనుభవించా: మండిపడ్డ వార్నర్
David Warner Can Request Review Of His Leadership Ban Now: ‘‘2018లో కేవలం నాలుగు రోజుల్లోనే నిర్ణయం జరిగిపోయింది. కానీ దానికి సంబంధించిన అభ్యర్థనపై స్పందించేందుకు తొమ్మిది నెలల సమయం తీసుకున్నారు’’ అంటూ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తానేమీ క్రిమినల్ను కాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(ఏఈ) తీరును విమర్శించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా 2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్ భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే వీల్లేకుండా సీఏ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఏ తీసుకున్న నిర్ణయంతో తన విషయంలో పునరాలోచన చేయాల్సిందగా డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి చేసే అవకాశం లభించింది. 9 నెలల తర్వాత జీవితకాల నిషేధాల ఎత్తివేతపై ఆటగాళ్లు, సిబ్బంది బోర్డును ఆశ్రయించేలా నిబంధనలు సులభతరం చేయాలంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్ల యూనియన్ గతంలో సీఏను అభ్యర్థించింది. ఈ క్రమంలో దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఏ వెల్లడించింది. స్పందించిన వార్నర్ ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా మీడియాతో మాట్లాడుతూ.. తన విషయంలో బోర్డును ఆశ్రయించే అవకాశం రావడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నాడు. అయితే, నిషేధం విధించడంలో ఉన్నంత తొందర.. ఇలాంటి అంశాలను సమీక్షించే అంశంలో మాత్రం లేకపోవడం దురదృష్టకరమన్నాడు. బాల్ టాంపరింగ్ వివాద సమయంలో తాను, తన కుటుంబం తీవ్ర వేదనకు గురయ్యామంటూ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నేనేమీ క్రిమినల్ను కాదు ‘‘నేనేమీ నేరస్తుడిని కాదు.. ప్రతీ వ్యక్తికి తన తప్పు ఏమిటో.. అందుకు ఎంతకాలం శిక్ష అనుభవించాలో.. తెలుసుకునే అవకాశం ఇవ్వాలి. ఇందుకు సంబంధించి తదుపరి పరిణామాలేమిటో తెలుసుకునేందుకు.. పునరాలోచన చేయమని అప్పీలు చేసుకునే హక్కు కల్పించాలి. వాళ్లు నాపై నిషేధం విధించారు. కానీ జీవితకాల నిషేధం విధించడం నా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడమే. నా పేరు పక్కన సీ(కెప్టెన్) లేదంటే వీసీ(వైస్ కెప్టెన్) అన్న హోదా ఉన్నా లేకపోయినా నేను మా జట్టుకు నాయకుడినే’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. బాల్ టాంపరింగ్ వివాదం వల్లే 2018లో కేప్టౌన్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా డేవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్లపై వేటు పడిన విషయం తెలిసిందే. చదవండి: ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ Suryakumar Yadav: సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్ కాదా!? కివీస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
టీ20 వరల్డ్ కప్ బెస్ట్ టీమ్.. వాళ్లకు మాత్రం స్థానం లేదు! హవా ఎవరిదంటే!
టీ20 ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్ 13)తో ముగిసిపోయింది. ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను సోమవారం ప్రకటించింది. ఇప్పటికే ఐసీసీ కూడా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటిచింది. తాజగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్కు చోటుదక్కింది. అదే విధంగా ఛాంపియన్స్గా నిలిచిన ఇంగ్లండ్ నుంచి గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపికచేసింది. వారిలో కెప్టెన్ జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ ఉన్నారు. ఇక రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్ నుంచి షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదికి స్థానం దక్కింది. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్, జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా, బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తిఫిజర్ రెహ్మన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ అన్రీచ్ నోర్జేకు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టు: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, విరాట్ కోహ్లి, గ్లెన్ ఫిలిఫ్స్ సూర్యకుమార్ యాదవ్, సికిందర్ రజా, షాదాబ్ ఖాన్, సామ్ కర్రాన్, షాహీన్ ఆఫ్రిది, ముస్తాఫిజుర్ రెహ్మన్, అన్రీచ్ నోర్జే చదవండి: టీ20 వరల్డ్కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు -
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్గా పాట్ కమిన్స్
ఆస్ట్రేలియా వన్డే జట్టు కొత్త కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్గా ఉన్న పాట్ కమిన్స్.. తాజాగా వన్డే జట్టు కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. గత నెలలో ఆరోన్ ఫించ్ టి20లపై దృష్టి వన్డేల నుంచి రిటైర్ కావడంతో అప్పటినుంచి కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఆసీస్ క్రికెట్లో చర్చ నడిచింది. తాజాగా నిరీక్షణకు తెరదించుతూ కమిన్స్ను వన్డే కెప్టెన్గా ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇక టి20 జట్టును ఆరోన్ ఫించ్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టి20 ప్రపంచకప్ తర్వాత ఫించ్ రిటైర్ అయ్యే అవకాశం ఉండడంతో మరో కొత్త కెప్టెన్ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కమిన్స్ను మూడు ఫార్మట్లకు కెప్టెన్ను చేస్తారా లేక టి20 కెప్టెన్గా మరొకరిని నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఫించ్ స్థానంలో డేవిడ్ వార్నర్కు వన్డే జట్టు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. కానీ 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా శాండ్ పేపర్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. గత వారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంపై చర్చ జరిగింది. నిషేధాన్ని ఎత్తివేయడానికి అవసరమైన కోడ్ సవరణను సమీక్షించారు. కానీ కోడ్ను ఇంకా సవరించలేదు. దీంతో వార్నర్కు కెప్టెన్సీని అప్పగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తోన్న కమిన్స్కే వన్డే బాధ్యతలను కూడా అప్పగించారు. జట్టులో స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లకు బదులు.. ఇద్దరు కెప్టెన్లు ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆసీస్ బోర్డు కమిన్స్ వైపు మొగ్గు చూపింది. ఆస్ట్రేలియాకు కమిన్స్ 27వ వన్డే కెప్టెన్ కాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆసీస్ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగా.. జట్లన్నీ పొట్టి ఫార్మాట్పైనే ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. రాబోయే ఆరు నెలల కాలంలో ఆస్ట్రేలియా జట్టు 15 టెస్టులు ఆడనుంది. Pat Cummins has been named Australia's 27th ODI captain 🙌 pic.twitter.com/T0p02wwjiP — Cricket Australia (@CricketAus) October 17, 2022 చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్ కోహ్లి -
డేవిడ్ వార్నర్కు భారీ ఊరట
టీ20 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు భారీ ఊరట లభించింది. 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఎదుర్కొంటున్న అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ తియ్యటి కబురు చెప్పనుందని తెలుస్తుంది. సీఏ.. వార్నర్పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు ఫించ్ తర్వాత ఆసీస్ పరిమిత ఓవర్ల పగ్గాలు కూడా అప్పజెప్పాలని డిసైడైనట్లు కధనాలు వినిపిస్తున్నాయి. రేపు జరుగబోయే సీఏ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. వార్నర్పై కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయాలని అభిమానులు, ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల నుంచి భారీ స్థాయిలో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సీఏ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇదే బాల్ టాంపరింగ్ ఉదంతంలో వార్నర్తో పాటు నాటి ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్, ఓపెనర్ కామెరాన్ బాన్క్రాఫ్ట్లపై కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లు నేరం అంగీకరించిన నేపథ్యంలో బాన్క్రాఫ్ట్పై 9 నెలలు, స్టీవ్ స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం పడింది. అయితే ఈ కేసులో వార్నర్ను కీలక సూత్రధారిగా పరిగణించిన సీఏ.. అతనిపై లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్ను విధించింది. -
ఆస్ట్రేలియా జట్టు హెడ్కోచ్గా షెల్లీ నిట్ష్కే..
ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్గా ఆ దేశ మాజీ క్రికెటర్ షెల్లీ నిట్ష్కే ఎంపికయ్యంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది . షెల్లీ నిట్ష్కే నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా మహిళలల జట్టుకు హెడ్కోచ్గా పనిచేయనుంది. కాగా అంతకుముందు ఆసీస్ హెడ్ కోచ్గా పనిచేసిన మథ్యూ మాట్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది. ప్రపంచంలోనే అత్యత్తుమ ఆల్రౌండర్గా పేరొందిన షెల్లీ నిట్ష్కే.. ఆస్ట్రేలియా తరపున 80 వన్డేలు, 36 టీ20లు, 6 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించింది. ఆమె తన కెరీర్లో 3000 పైగా పరుగులతో పాటు, 150 వికెట్లు పడగొట్టింది. ఇక కోచ్గా కూడా షెల్లీ నిట్ష్కేకు అపారమైన అనుభవం ఉంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ఆమె దేశీవాళీ జట్టు సౌత్ ఆస్ట్రేలియాకు కోచ్గా కూడా పని చేసింది. అదే విధంగా 2018లో ఆస్ట్రేలియా జట్టు మహిళలల ఆస్టెంట్ కోచ్గా ఆమె పనిచేసింది. మరోవైపు 2019 నుంచి బిగ్బాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్కోచ్గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే తాజాగా ఆసీస్ కోచ్గా ఎంపిక కావడంతో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్కోచ్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోనుంది. చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. -
అంతర్జాతీయ క్రికెట్కు ఆస్ట్రేలియా సీనియర్ గుడ్బై
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మరో శకం ముగిసింది. ఆ జట్టు సీనియర్ క్రికెటర్ రేచల్ హేన్స్ గురువారం అంతర్జాతీయం సహా అన్ని రకాల క్రికెట్కు గుడ్బై ప్రకటించింది. 2009లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రేచల్ హేన్స్ దశాబ్దానికి పైగా ఆసీస్ క్రికెట్లో ప్రధాన బ్యాటర్గా సేవలందించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలిచిన ఆరు మేజర్ టోర్నీల్లో రేచల్ హేన్స్ ఉండడం విశేషం. ఇక ఆస్ట్రేలియా తరపున రేచల్ హేన్స్ 6 టెస్టుల్లో 383 పరుగులు, 77 వన్డేల్లో 2585 పరుగులు, 84 టి20ల్లో 850 పరుగులు చేసింది. హేన్స్ ఖాతాలో రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. కాగా టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన డెబ్యూ మ్యాచ్లోనే హేన్స్ 98 పరుగులు చేసి ఆకట్టుకుంది. హేన్స్ కెరీర్ను రెండు భాగాలుగా విడదీయొచ్చు. 2009 నుంచి 2013 వరకు, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు క్రికెట్కు దూరమైన హేన్స్ 2017 నుంచి 2022 వరకు ఆటలో కొనసాగింది. ఇక హేన్స్ చివరగా బర్మింగ్హమ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆడింది. ఈ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా స్వర్ణ పతకం గెలిచింది. ఇక హేన్స్ పలు సందర్భాల్లో జట్టును నడిపించింది. 2017 వన్డే వరల్డ్కప్లో ఒక మ్యాచ్లో జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ భుజం గాయంతో పక్కకు తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత 2018లో తొలిసారి వైస్ కెప్టెన్ అయిన రేచల్ హేన్స్ 2020లో టి20 వరల్డ్ కప్, 2022లో వన్డే వరల్డ్కప్ను గెలవడంలో.. కామన్వెల్త్ గేమ్స్లో ఆస్ట్రేలియా స్వర్ణం గెలవడంలోనూ కీలకపాత్ర పోషించింది. ''ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఒక రేచల్ హేన్స్ సేవలు కోల్పోనుంది. దాదాపు దశాబ్దానికి పైగా క్రికెట్లో సేవలందించిన రేచల్ హేన్స్ ఇవాళ ఆటకు వీడ్కోలు పలకడం మా దురదృష్టం. ఇన్నేళ్లలో ఆమె జట్టు తరపున ఎన్నో విజయాల్లో పాలు పంచుకుంది. రేచల్ హేన్స్ ఆడిన కాలంలో ఆస్ట్రేలియా ఆరు మేజర్ టోర్నీలు గెలవడం ఆమెకు గర్వకారణం. మలి ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం'' అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హాక్లీ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేచల్ హేన్స్ ఈ సీజన్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనుంది. చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! క్రికెట్లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ హఠాన్మరణం -
కొత్త జెర్సీ విడుదల చేసిన ఆస్ట్రేలియా.. 'సంక్రాంతి ముగ్గులాగే ఉంది'
అక్టోబర్-నవంబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా 2022 టి20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్ ఎగురేసుకపోయింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న ఆసీస్ బుధవారం ప్రపంచకప్కు ధరించబోయే నూతన జెర్సీని ఆవిష్కరించింది. బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్లో కాస్త కొత్తగా కనిపిస్తున్న జెర్సీపై ఎడమవైపు టి20 ప్రపంచకప్ 2022 అని రాసి ఉండగా.. మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్లో.. కుడివైపు ఆస్ట్రేలియా చిహ్నం ఉంటుంది. ఇక జెర్సీ కింది బాగంలో గ్రీన్, గోల్డ్ కాంబినేషన్లో ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. జెర్సీకి సంబంధించిన విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. ''టి20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన జెర్సీపై క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''ఆస్ట్రేలియా కొత్త జెర్సీలోని డిజైన్ సంక్రాంతి ముగ్గును తలపిస్తుంది'' అంటూ పేర్కొన్నారు. ఇక అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 16 నుంచి 23 వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయింగ్లో భాగంగా గ్రూఫ్-ఏలో శ్రీలంక, నమీబియా, ఊఏఈ, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూఫ్-బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వేలు ఉన్నాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరుకుంటాయి. ఇక సూపర్-12 దశలో గ్రూఫ్-1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్తో పాటు ఎ1, బి2 క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్-2లో టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్తో పాటు బి1, ఏ2 క్వాలిఫయింగ్ జట్లు ఉండనున్నాయి. ఇక అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 23న(ఆదివారం) జరగనుంది. View this post on Instagram A post shared by Cricket Australia (@cricketaustralia) చదవండి: సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్.. టి20 ప్రపంచకప్కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. -
ఆసీస్ కెప్టెన్గా వార్నర్.. ఫించ్ మద్దతు కూడా ఇతనికే..!
ఆసీస్ వన్డే కెప్టెన్గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న డిస్కషన్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కొందరేమో టెస్ట్ సారధి పాట్ కమిన్స్కే వన్డే కెప్టెన్సీ కూడా కట్టబెట్టాలని అంటుంటే.. మరికొందరేమో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరును సూచిస్తున్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉండేందుకు వార్నర్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్పై జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఉన్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏ విధంగా స్పందిస్తుందో వేచి చేడాల్సి ఉంది. సమస్యను పరిష్కరించుకునేందుకు (బ్యాన్ ఎత్తివేత) డేవిడ్ భాయ్ స్వయంగా రంగంలోకి దిగి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో అతనికి తాజాగా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అలాగే పలువురు క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫించ్ స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా వైదొలుగుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసమే వార్నర్ కూడా ఎదురుచూస్తున్నాడని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మెగా టోర్నీ తర్వాత ఫించ్ పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటే.. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ మొత్తం కోసం పావులు కదపాలన్నది వార్నర్ ప్లాన్గా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వార్నర్ టీ20 వరల్డ్కప్ అనంతరం ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. -
ఆండ్రూ సైమండ్స్కు నివాళి ప్రకటించనున్న ఆసీస్, జింబాబ్వే క్రికెటర్లు
ఆండ్రూ సైమండ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆటలో ఎన్ని వివాదాలున్నా గొప్ప ఆల్రౌండర్గా ఎదిగాడు. అతని ఆటకు ఫిదా అయిన అభిమానులు చాలా మందే ఉన్నారు. కానీ మే 14.. 2022.. ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నింపింది. ఎందుకంటే అదే రోజు 46 ఏళ్ల వయసులో ఆండ్రూ సైమండ్స్ భౌతికంగా దూరమయ్యాడు. టౌన్స్విల్లే నగరం బయట జరిగిన యాక్సిడెంట్లో కారు తునకాతునకలు అవడంతో సైమండ్స్ మృతి చెందినట్లు పోలీసులు దృవీకరించారు. అయితే అంతకముందే ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా గుండెపోటుతో మరణించడం.. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు క్రికెటర్లు దూరమవడం ఆసీస్ అభిమానులను కలచివేసింది. Photo Credit: Getty Images ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. కాగా ఆదివారం ఆసీస్, జింబాబ్వేలు తొలి వన్డే ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఆండ్రూ సైమండ్స్ స్వస్థలమైన టౌన్స్విల్లేలో జరగనుంది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆండ్రూ సైమండ్స్కు ఘన నివాళి ప్రకటించనుంది. ఈ కార్యక్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు సైమండ్స్ భార్య, పిల్లలు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు పాల్గొననున్నారు. కాగా ఈ సిరీస్లో మూడు వన్డేలు టౌన్స్విల్లే వేదికగానే జరగనున్నాయి. Photo Credit: Getty Images ఇక 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
క్రికెట్లో 'ఆ' స్వరం ఇక వినపడదు..!
ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ సుదీర్ఘ కాలం తర్వాత తన క్రికెట్ వ్యాఖ్యానానికి ముగింపు పలికారు. ఇకపై తాను కామెంటరీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఆరోగ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయాన్ వెల్లడించారు. 78 ఏళ్ల చాపెల్ ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత ప్రతిష్టాత్మక చానల్ 9 ద్వారా తన కామెంటరీని మొదలు పెట్టారు. తన అద్భుత వ్యాఖ్యానంతో క్రికెట్ ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేశారు. సూటి విమర్శలు, సునిశిత విశ్లేషణతో అత్యుత్తమ వ్యాఖ్యాతగా ఎదిగిన చాపెల్ 45 ఏళ్ల పాటు ఈ రంగాన్ని శాసించారు. ఆస్ట్రేలియా తరఫున 75 టెస్టులు ఆడి 5345 పరుగులు చేసిన ఇయాన్ చాపెల్ ఇందులో 30 మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరించారు. 16 వన్డేల్లో కూడా ఆయన ఆసీస్కు ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సార్లు స్టార్ ఆటగాళ్లనుంచి విమర్శలు ఎదుర్కొన్నానని...అయితే ఏనాడూ తాను సూటి వ్యాఖ్యానం విషయంలో వెనక్కి తగ్గలేదన్న చాపెల్, క్రికెట్ బాగు కోసమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. -
'లంక దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పెద్ద మనుసు చాటుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్కు(UNICEF) తమ వంతు విరాళాన్ని ప్రకటించింది. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్లు ఆడిన సంగతి తెలిసిందే. లంకలో నెలకొన్న పరిస్థితులను ఆసీస్ ఆటగాళ్లు దగ్గరుండి చూశారు. ఎన్ని కష్టాలున్నా లంక, ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్లను లంక ప్రేక్షకులు బాగా ఆదరించారు. లంక ప్రజల అభిమానం చూరగొన్న ఆసీస్ క్రికెటర్లు వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లు లంక చిన్నారులకు అందించనుంది. ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం’ అని అన్నాడు. కాగా కమిన్స్ ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. చదవండి: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్కున్న ట్యాగ్లైన్ ఉత్తదేనా! Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ -
ఆస్ట్రేలియా కెప్టెన్ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెగ్ లానింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపింది. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరపున బిజీ క్రికెట్ ఆడాను. కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు మానసికంగా అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అందుకే ఈ లాంగ్ బ్రేక్. త్వరలో మళ్లీ జట్టులోకి వస్తా అంటూ 30 ఏళ్ల లానింగ్ పేర్కొంది. ''వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న మెగ్ లానింగ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం.. మా క్రికెట్లో బ్రేక్ అనే పదానికి మెగ్ లానింగ్ అర్హురాలు'' అంటూ ట్విటర్లో పేర్కొంటూ ఆమెకు మద్దతిచ్చింది. ఇటీవలే నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ మహిళల జట్టు స్వర్ణం పతకం ఎగురేసుకుపోయిన సంగతి తెలిసింది. టీమిండియా మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్స్ విజయం సాధించిన స్వర్ణం కొల్లగొట్టగా.. భారత్ రజతం కైసవం చేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మెగ్ లానింగ్ తనదైన ముద్ర వేసింది. లానింగ్ ఖాతాలో రెండు మహిళల వన్డే ప్రపంచకప్లతో పాటు.. నాలుగు టి20 ప్రపంచకప్లు ఉండడం విశేషం. ఇందులో మూడు టి20 ప్రపంచకప్లు(2014, 2018, 2020)లానింగ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా గెలవడం విశేషం. మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డులు.. ►వన్డేల్లో అత్యధిక సెంచరీలు మెగ్ లానింగ్ పేరిటే ఉన్నాయి. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు సాధించింది. ►టి20ల్లో ఆస్ట్రేలియా మహిళల తరపున 2వేల పరుగుల మార్క్ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్గా రికార్డు. ►మిథాలీ రాజ్(భారత్), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) తర్వాత 150 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు ►ఓవరాల్గా మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 6 టెస్టుల్లో 93 పరుగులు, 100 వన్డేల్లో 4463 పరుగులు, 115 టి20ల్లో 3007 పరుగులు సాధించింది. If anyone deserves a break, it's Meg Lanning. pic.twitter.com/BC8fKTwSDw — Cricket Australia (@CricketAus) August 10, 2022 చదవండి: విదేశీ లీగ్స్లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఐసీసీ ర్యాంకింగ్స్లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి! -
ఆటగాళ్లకు కోట్లలో ఆఫర్.. సొంత లీగ్కు తూట్లు పొడిచే యత్నం!
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్వహించే బిగ్బాష్ లీగ్(బీబీఎల్)కు ఆటగాళ్లు తూట్లు పొడిచే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జనవరిలో ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ 20) ప్రారంభం కానుంది. ఈ లీగ్లో కోట్ల రూపాయలు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను ఆడించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్లో ఆడే 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐఎల్టీలో ఆడేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రతీఏటా బీబీఎల్ డిసెంబర్లో మొదలై.. ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ 13న మొదలుకానున్న బీబీఎల్ ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.ఇదే సమయంలో ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ 20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి ఎడిషన్ జరగనుంది. మొత్తం ఆరుజట్లు ఉండగా.. ఈ జట్లను దాదాపు ఐపీఎల్తో సంబంధమున్న సంస్థలే కొనుగోలు చేయడం విశేషం. యూఏఈ వేదికగా జరుగుతున్న తొలి సీజన్ను విజయవంత చేసేందుకు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని అన్ని జట్లు టార్గెట్గా పెట్టుకున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్లో ఆడుతున్న 15 మంది ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లకు బీబీఎల్ వదిలేసి.. ఐఎల్టీ లీగ్లో పాల్గొనేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈ టి20 లీగ్లో ఒక్కో టీమ్కి 2.5 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్లు) పర్సు వాల్యూని కేటాయించారు. దీంతో స్టార్ ప్లేయర్లను 450000 డాలర్లు (దాదాపు 3.5 కోట్లు) ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐపీఎల్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ మిగిలిన క్రికెట్ లీగులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. పొరుగుదేశం పాక్లో పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధికంగా చెల్లించే మొత్తం రూ.1.9 కోట్లు మాత్రమే... ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న బిగ్బాష్ లీగ్ (బీబీఎల్)లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. దీంతో యూఏఈ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్లు, బిగ్బాష్ లీగ్ ఆడకుండా అదే సమయంలో యూఏఈ టీ20 లీగ్లో ఆడేందుకు 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు రూ.4 కోట్ల దాకా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆశచూపిస్తున్నారని సమాచారం. రూ.4 కోట్లంటే ఐపీఎల్లో అన్క్యాప్డ్ రిజర్వు ప్లేయర్కి ఇచ్చే మొత్తం. అయితే బీబీఎల్ ద్వారా వచ్చే దానితో పోల్చుకుంటే, ఆసీస్ క్రికెటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తమే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకి భయం పట్టుకుంది. అయితే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు విదేశీ లీగ్ల్లో ఆడాలంటే అనుమతి తప్పనిసరి. కానీ బిగ్బాష్ లీగ్లో ఆటగాళ్లకు అలాంటి అవసరం లేదు. లీగ్లో ఆడాలా వద్దా అనేది ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేస్తుంది అక్కడి సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా). అందుకే 2014 నుంచి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు బీబీఎల్ ఆడింది లేదు. వార్నర్ ఒక్కడే కాదు.. చాలా మంది ఆసీస్ క్రికెటర్లు బీబీఎల్ను మధ్యలోనే వదిలేసి వేరే లీగ్ ఆడేందుకు వెళ్లిపోతుంటారు. ఆసీస్ క్రికెటర్లు ఆ డబ్బుకి ఆశపడి యూఏఈ టీ20 లీగ్లో ఆడాలని నిర్ణయం తీసుకుంటే, స్టార్ ప్లేయర్లు లేకుండా బీబీఎల్ని నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాల ప్లేయర్లు కూడా యూఏఈ టీ20 లీగ్ ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తే బీబీఎల్ నిర్వహణే కష్టమైపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీసీసీఐ మాదిరిగానే తమ ప్లేయర్లు, విదేశీ టీ20ల్లో లీగుల్లో పాల్గొనకుండా నియంత్రించాలనే ఆలోచనలో కూడా సమాచారం. ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కి యూఏఈ నుంచి 7 లక్షల డాలర్లు (దాదాపు 5.5 కోట్లు) ఆఫర్ వచ్చిందని, అలాగే ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్కి కూడా దాదాపు రూ.6 లక్షల డాలర్లకు పైగా ఆఫర్ వచ్చందని... ఈ ఇద్దరూ యూఏఈ టీ20 లీగ్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాని అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: NED vs NZ: పసికూనపై కివీస్ ప్రతాపం.. సిరీస్ క్లీన్స్వీప్ Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! -
డేవిడ్ వార్నర్కు భారీ ఆఫర్.. 'ఆ లీగ్'లో ఆడించేందుకు విశ్వ ప్రయత్నాలు
David Warner: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ను బిగ్ బాష్ లీగ్లో (బీబీఎల్) ఆడించే నిమిత్తం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్తో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వార్నర్ బీబీఎల్లో ఆడేందుకు ఒప్పుకుంటే 5 లక్షల డాలర్ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఏకు చెందిన కీలక ప్రతినిధి వెల్లడించారు. నివేదికల ప్రకారం..బీబీఎల్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ అయిన ఛానెల్ 7తో క్రికెట్ ఆస్ట్రేలియాకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఛానల్ 7తో ఒప్పందం సమయంలో బీబీఎల్ భారీ సంఖ్యలో వ్యూయర్ షిప్ దక్కించుకుంటుందని సీఏ హామీ ఇచ్చింది. అయితే ఊహించిన దాంట్లో సగం వ్యూయర్ షిప్ కూడా రాకపోవడంతో సీఏపై ఛానల్ 7 దావా వేసింది. బీబీఎల్లో క్వాలిటీ ఆటగాళ్లు లేరని, అందు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఛానల్ 7 వాదిస్తుంది. దీంతో సీఏ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ఆటగాళ్లను బీబీఎల్ బరిలోకి దించితే వ్యూయర్ షిప్ భారీగా పెరుగుతుందని భావిస్తుంది. ఇందుకోసం వార్నర్కు ఊహకందని భారీ మొత్తం ఆఫర్ చేయాలని నిర్ణయించుకుంది. అంతర్జాతీయ షెడ్యూల్, తదితర కారణాల వల్ల వార్నర్ ఇప్పటివరకు కేవలం మూడే మూడు బీబీఎల్ మ్యాచ్లు ఆడాడు. అతను చివరిసారిగా బీబీఎల్ 2014 సీజన్లో కనిపించాడు. ఇదిలా ఉంటే, వార్నర్ వచ్చే ఏడాది బీబీఎల్ సమయానికి యూఏఈలో జరిగే టీ20 లీగ్లో ఆడాలని భావిస్తున్నట్లు అతని మేనేజర్ తెలిపాడు. యూఏఈ లీగ్లో పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వార్నర్కు యూఏఈ లీగ్లోని ఫ్రాంచైజీలు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వార్నర్ బీబీఎల్ను కాదని యూఏఈ లీగ్లో ఆడితే బీబీఎల్ ప్రసారదారు ఛానల్ 7కు భారీ నష్టం వస్తుందని అంచనా. ఆసీస్ ప్రేక్షకులు వార్నర్ కోసం బీబీఎల్ను కాదని యూఏఈ లీగ్ను చూసే అవకాశాలే ఎక్కువ. చదవండి: అదరగొట్టిన సూర్యకుమార్.. నెం1 స్థానానికి చేరువలో! -
ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కన్నుమూత..!
క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ లారీ సాల్(96) మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో పెర్త్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాల్ మరణించినట్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 1982 నుంచి 1995 వరకు ఆస్ట్రేలియా జట్టుకు జాతీయ సెలెక్టర్గా పనిచేశారు. అతని పని చేసిన కాలంలోనే స్టీవ్ వా,మార్క్ వా, మార్క్ టేలర్, ఇయాన్ హీలీ, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వార్న్, డామియన్ మార్టిన్, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్ వంటి ఆసీసీ దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 35 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడిన సాల్ 1701 పరుగులు చేశాడు. అతని కెరీర్లో ఒక ఫస్ట్ క్లాస్ సెంచరీ ఉంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 7వ ఆస్ట్రేలియన్ ఇన్ఫాంట్రీ బెటాలియన్లో పనిచేసినందున లారీ సాల్కు 'కల్నల్' అనే మారుపేరు కూడా ఉంది. చదవండి: TNPL: మురళీ విజయ్కు చేదు అనుభవం.. డీకే..డీకే అంటూ ఫాన్స్ కేకలు.. అతనేం చేశాడంటే..! -
డిస్నీ–స్టార్తో సీఏ ఒప్పందం
మెల్బోర్న్: భారత ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ సంస్థ ‘డిస్నీ–స్టార్’తో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సుదీర్ఘ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే క్రికెట్ మ్యాచ్ల్ని భారత్లో ఏడేళ్లపాటు ప్రసారం చేసే ఒప్పందాన్ని డిస్నీ స్టార్తో కుదుర్చుకుంది. వచ్చే సీజన్ (2023–24) నుంచి ఒప్పందంలో భాగంగా ఆసీస్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు బిగ్బాష్ లీగ్ (బీబీఎల్), మహిళల బీబీఎల్ టోర్నమెంట్లను భారత్లో డిస్నీ–స్టార్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. ప్రస్తుతం సోనీ నెట్వర్క్ వద్ద సీఏ బ్రాడ్కాస్టింగ్ హక్కులున్నాయి. 2017–18 సీజన్ నుంచి సోనీ చానెళ్లు ఆస్ట్రేలియా మ్యాచ్లను ప్రసారం చేస్తున్నాయి. క్రికెట్ క్రేజ్ ఉన్న భారత్లో తమ మ్యాచ్ల ఆదరణ మరింత పెరిగేందుకు స్టార్ నెట్వర్క్తో ఒప్పందం దోహదం చేస్తుందని సీఏ సీఈఓ నిక్ హాక్లీ తెలిపారు. -
BBL 2022-23: మరో మహా సంగ్రామం ఎప్పటి నుంచి అంటే..?
Big Bash League 2022-23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహా సంగ్రామానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. 2022-23 సీజన్ పురుషుల వెర్షన్ ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి ప్రారంభంకానుండగా.. మహిళల బీబీఎల్ అంతకంటే రెండు నెలల ముందు అక్టోబర్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. Our heroes are returning home! For the first time in three years, every Club is playing at home and we couldn't be more pumped 🤩 Full #WBBL08 schedule deets: https://t.co/oUaicm0FOH pic.twitter.com/oXPyYwRr71 — Weber Women's Big Bash League (@WBBL) July 6, 2022 సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్తో పురుషుల బీబీఎల్ మొదలుకానుండగా.. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్ మధ్య మ్యాచ్తో మహిళల టోర్నీ ప్రారంభంకానుంది. మహిళల టోర్నీ అక్టోబర్ 13న మొదలై నవంబర్ 27 వరకు జరుగనుండగా.. పురుషుల లీగ్ డిసెంబర్ 13 నుంచి వచ్చే ఏడాది (2023) జనవరి 25 వరకు జరుగుతుంది. ఈ రెండు లీగ్లకు సంబంధించిన ఫిక్షర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. 🗓 #BBL12 SCHEDULE 🗓 The 12th instalment of the Big Bash is coming your way this summer! pic.twitter.com/npDQAd7U7c — KFC Big Bash League (@BBL) July 14, 2022 చదవండి: BBL: మరోసారి రెనెగేడ్స్తో జట్టు కట్టిన భారత కెప్టెన్! -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఐదేళ్ల తర్వాత మాక్స్వెల్ రీ ఎంట్రీ..!
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపికైన ట్రావిస్ హెడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో మాక్స్వెల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 29న ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్టులు కూడా గాలే వేదికగానే జరగనున్నాయి. ఇక మాక్స్వెల్ చివరి సారిగా 2017 సెప్టెంబర్లో బంగ్లాదేశ్పై ఆడాడు. 2013లో భారత్పై టెస్టుల్లో మాక్స్వెల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడిన మాక్స్వెల్ 339 పరుగులతో పాటు 8 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (విసి), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ చదవండి: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..! -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..!
నాలుగేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్ క్రాఫ్ట్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది కాలం పాటు నిషేదం విధించింది. ఇక నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. అదే విధంగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై క్రికెట్ ఆస్ట్రేలియా జీవిత కాల నిషేదం విధించింది. అయితే తాజా పరిణామాల ప్రకారం.. వార్నర్ కెప్టెన్సీపై జీవిత కాల నిషేదం ఎత్తి వేసే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు బెన్ హార్న్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 2018 బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్పై విధించిన కెప్టెన్సీ నిషేదాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పునః పరిశీలిస్తుంది. ఈ నిషేదంతో టీ20 లీగ్లలో వార్నర్ తన కెప్టెన్సీ అవకాశాలు కోల్పోతున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఆ దేశ మేజర్ టోర్నీ బిగ్బాష్ లీగ్లో కూడా కేవలం ఆటగాడిగానే వార్నర్ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై నిషేదం ఎత్తి వేయనున్నట్లు సమాచారం. చదవండి: IND-W Vs SL-W: రాణించిన షఫాలీ, రోడ్రిగ్స్.. శ్రీలంకపై భారత్ ఘనవిజయం -
కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణం క్రీడాభిమానులను కలచివేసింది. ఎన్ని వివాదాలున్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్కు.. ఢిపరెంట్గా ఉండే హెయిర్స్టైల్కు అభిమానులు చాలా మందే ఉన్నారు. గత శనివారం రాత్రి టౌన్స్విల్లీలోని క్వీన్స్ల్యాండ్లో సైమండ్స్ కారు భయంకరమైన యాక్సిడెంట్కు గురవ్వడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్డించారు. బ్రిస్బేన్ కొరియర్ మెయిల్ అనే పత్రిక సైమండ్స్ కారు యాక్సిడెంట్ ఫోటోలు రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు నెలల వ్యవధిలోనే ఆసీస్ క్రికెట్ ఇద్దరు ఆటగాళ్లను కోల్పోవడం క్రీడాలోకాన్ని దిగ్ర్బాంతికి గురి చేసింది. ఇక సైమండ్స్ మృతిపై అతని సోదరి లూయిస్ విచారం వ్యక్తం చేసింది. తన సోదరుడు చనిపోయిన స్థలాన్ని సందర్శించిన లూయిస్.. ఒక ఎమోషనల్ నోట్ను అక్కడ ఉంచింది. ''చాలా తొందరగా వెళ్లిపోయావ్.. రెస్ట్ ఇన్ పీస్ ఆండ్రూ సైమండ్స్. నీ జీవితంలో ఒక రోజు మిగిలి ఉన్నా బాగుండేది.. ఇకపై నీ ఫోన్కాల్ నాకు వినపడదు. నా హృదయం ముక్కలయింది. నేను నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను బ్రదర్'' అంటూ రాసుకొచ్చింది. లూయిస్ రాసిన నోట్ను మియా గ్లోవర్ అనే రిపోర్టర్ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం సైమండ్స్కు తన సోదరి రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా సైమండ్స్ పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్రౌండర్.. 133 వికెట్లు పడగొట్టాడు.2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్.. మొత్తం 26 మ్యాచ్ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో సైమండ్స్ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. 2012లో అంతర్జాతీయ క్రికెట్కు సైమండ్స్ వీడ్కోలు పలికాడు. చదవండి: ఆ క్రికెటర్ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..! ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..? Floral tributes lay at the crash site where Andrew “Roy” Symonds lost his life on Saturday night, outside of Townsville. The letter, penned by his sister, reads “I will always love you my brother” @TheTodayShow pic.twitter.com/Wt3EZGc6Ty — Mia Glover (@miaglover_9) May 15, 2022