-
చల్లగా దాడిచేస్తాయ్...!
విజయనగరం మున్సిపాలిటీ: వేసవి వచ్చేసింది. వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు 35–40 డిగ్రీల మార్కు మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఔషధాలు వాడుతున్నవారు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు, కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటితో ముప్పు ♦ ఆస్తమా, బ్రాంకైటీస్, ఇస్నోఫీలియా బాధితులు అప్రమత్తంగా ఉండాలి. బాగా చల్లని పదా ర్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకుపోయే ట్యూబ్లు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. వీరు ఇంట్లో ఫ్రిజ్లో ఉన్న పదార్థాల జోలికి సైతం వెళ్లొద్దు. ♦ చిన్నపిల్లలు, వద్ధులు అదే పనిగా చల్లని ద్రవాలు, రోడ్డు పక్కన దొరికేవి తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులకు కారణమవుతాయి. సరైన ఐస్ను ఉపయోగించకపోవడం ఒక కారణమైతే... వీటిని అమ్మే వారు శుభ్రత పాటించకపోవడం.. రోడ్లపై ఉండే దుమ్ము, ధూళి వీటిపై పడటం మరో కారణం. ♦ తొలుత గొంతు నొప్పితో సమస్య ప్రారంభమవుతుంది. తర్వాత గొంతు బొంగురుపోవడం, కఫం పట్టడం, దగ్గు, జలుబుతోపాటు తీవ్ర జ్వరం వస్తుంది. ఆస్తమా, అవయవ మార్పిడి చేయించుకున్నవారు.. కిడ్నీ, సుగర్, లివర్, సీవోపీడీ సమస్యలున్నవారిలో న్యూమెనియాకు దారి తీస్తుంది. ♦ చిన్నపిల్లల్లో దీర్ఘకాలిక దగ్గు, పొడిదగ్గు, ఆయాసం, కఫం పట్టడం, ఛాతి బిగుసుకుపోయి ఆస్తమా కింద మారుతుంది. ♦ ఏసీల ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. దీర్ఘకాలిక రోగాలకు మందులువాడుతుంటే... ♦ అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక సమస్యలకు వాడే మందుల కారణంగా చెమట తక్కువగా వస్తుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యత ఉండదు. ఫలితంగా ఎండలోకి వచ్చినప్పుడు త్వరగా వడదెబ్బ బారిన పడతారు. ♦ ఈ మందులు వాడే రోగులు వేసవిలో వైద్యులను సంప్రదించి డోసులు మార్చుకోవాలి. యూరిన్ ముదురు రంగులోకి మారితే శరీరంలో నీటి శాతం తగ్గినట్లు గుర్తించాలి. ఆ మేరకు భర్తీ చేస్తూ ఉండాలి. ♦ మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచూ మూత్రానికి పోతుంటారు. దీంతో శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోతుంటాయి. వేసవిలో ఇది మరింత ప్రమాదకరం. శరీరంలో నీరు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. ♦ అధిక రక్తపోటు ఉంటే ఉప్పు కలిపిన నీళ్లు అదే పనిగా తీసుకోవద్దు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, యూరిన్ పసుపు పచ్చగా వచ్చినప్పుడు నీటిని తీసుకుంటూ ఉండాలి. ♦ వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు నిద్ర అవసరం. పెద్దలు 6–7 గంటలు, పిల్లలు 9 గంటల పాటు నిద్రపోవాలి. జాగ్రత్తగా ఉండాలి.. రోడ్ల పక్కన దొరికే నిమ్మరసం, ఐస్ క్రీమ్లు, పుచ్చకాయ ముక్కలు తీసుకునేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లదనం కోసం చాలా మంది ఐస్ కలుపుతుంటారు. ఐస్ తయారీలో కంపెనీలు ప్రమాణాలు పాటించవు. స్వచ్ఛమైన నీటితో తయారుచేయవు.–పి. ఉదయ్కిరణ్, వైద్యులు, విజయనగరం -
మల్టీప్లెక్స్లకు మొట్టికాయ
విజయవాడ లీగల్: మల్టీప్లెక్స్లలో అధిక ధరలకు కూల్డ్రింక్స్ అమ్మకాలు సాగించడంపై కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్లో ఒక ధరతో, మల్టీప్లెక్స్లో మరో ధరతో కూల్డ్రింక్స్ అమ్మినందుకు వాటి తయారీ సంస్థలకు భారీ జరిమానా విధించింది. రూ.ఐదేసి లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఐదు కూల్డ్రింక్స్ తయారీ కంపెనీలను ఆదేశించింది. అదే సమయంలో మల్టీప్లెక్స్లకు సైతం మొట్టికాయలు వేసింది. తినుబండారాలు, మంచి నీళ్ల బాటిళ్లను లోపలికి అనుమతించాలని.. వినియోగదారులకు మంచి నీరు అందుబాటులో ఉంచాలని మల్టీప్లె్లక్స్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం–2 అధ్యక్షుడు సీహెచ్ మాధవరావు గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. తినుబండారాలు, కూల్డ్రింక్స్, వాటర్ బాటిళ్లను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని గతేడాది ఏప్రిల్ 2న విజయవాడకు చెందిన గరికపాటి ప్రభాకరరావు గాంధీనగర్లోని ఐనాక్స్ థియేటర్పై, వేమూరి వెంకట శ్రీరామ్కుమార్ పటమటలోని ఐనాక్స్ థియేటర్పై, లింగారెడ్డి విద్యాప్రకాష్.. ట్రెండ్సెట్పై, బి.నరసింహమూర్తి పీవీఆర్పై, చెన్నుపాటి మణినాగేందర్ పీవీపీ మాల్స్పై వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. మల్టీప్లెక్స్లతో పాటు కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్ బుల్, పల్పీ ఆరెంజ్.. అలాగే తూనికలు, కొలతల శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫిర్యాదును విచారించిన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు.. కూల్డ్రింక్స్ కంపెనీలు, మల్టీప్లెక్స్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలు వసూలు చేసిన కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్బుల్, పల్పీ ఆరెంజ్ కంపెనీలకు రూ.ఐదేసి లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని స్పష్టం చేశారు. సెలెక్ట్ చానల్ పేరిట తినుబండారాలు, పానీయాలపై మార్కెట్ ధర కంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని.. 9 శాతం వడ్డీతో సహా ఫిర్యాదుదారులకు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ధరల పట్టిక అందరికీ కనిపించాలని, వినియోగదారులు ఫిర్యాదు చేయడం కోసం అధికారుల నంబర్లు ఏర్పాటు చేయాలని.. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్కు స్పష్టం చేశారు. -
శీతలపానీయం అనుకుని..
కోదాడఅర్బన్ : కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్డులో గల గణేశ్నగర్లో ట్యూషన్ కోసం వెళ్లిన విద్యార్థి శీతల పానీయం అనుకుని బాటిల్లోని క్రిమిసంహారక మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెం దాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గణేషనగర్లో నివాసముండే గుంటా మహేశ్వరరావు కుమారుడు నాగసాయి(7) స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. మహేశ్వరరావు తన కుమారుడిని అదే కాలనీలోని తోమారెడ్డి ఇంట్లోని ట్యూషన్కు పంపిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన ట్యూషన్కు వెళ్లిన సమయంలో అక్కడ స్ప్రైట్ బాటిల్ కనిపించడంతో దానిని శీతలపానీయంగా భావించి తాగాడు. అయితే ఆ బాటిల్లో క్రిముల నివారణకు క్రిమిసంహారక మందును కలిపి ఉం చారు. ఈ విషయం తెలియని నాగసాయి దానిని తాగడంతో వాంతులు ప్రారంభమయ్యాయి. దీం తో నాగసాయిని పట్టణంలోని సిద్ధార్థ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి మిషమంగా ఉండడంతో మొదట ఖమ్మం, తరువాత గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగసాయి గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనలో ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ నాగసాయి తండ్రి మహేశ్వరరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఏఎస్ఐ సైదా తెలిపారు. -
ఈ థియేటర్లకు ఏమైంది?
మధురవాడ ప్రాంతానికి చెందిన రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలసి సీఎంఆర్ సెంట్రల్లోని మల్టీప్లెక్స్ థియేటర్కు వెళ్లాడు. నలుగురు సభ్యులకు రూ.150 చొప్పున ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాడు. ట్యాక్స్తో కలిపి రూ. 687 అయింది. విరామ సమయంలో బయటకు పిల్లలను తీసుకుని వచ్చి రెండు పాప్కార్న్లు, రెండు కూల్ డ్రింక్లు ఇవ్వమన్నాడు. వాస్తవానికి వాటి ధర రూ.200కు మించి ఉండదని రాజేష్ ఊహించాడు. కానీ రూ.900 బిల్లు వేసి అతని చేతిలో వాటిని పెట్టారు. ఒక్కసారిగా కంగుతిన్న రాజేష్ పిల్లలను బాధపెట్టలేక ఆ సమయానికి డబ్బులు చెల్లించేశాడు. ఇది ఆయన ఒక్కడికే కాదు.. మల్టీప్లెక్స్ థియేటర్లకు వినోదం కోసం వెళుతున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎదురవుతున్న అనుభవం. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తనకు వచ్చే జీతంలో 15 శాతం ఒక్క సినిమాకు ఖర్చు అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. జగదాంబ ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్కు లక్ష్మణ్ తన భార్యతో సినిమాకు వెళ్లాడు. సినిమా టికెట్ రూ.118( ఇద్దరి రూ.236), బైక్ పార్కింగ్ రూ.20, కూల్ డ్రింక్రూ.60 (ఇద్దరికి రూ.120), సమోసాలు రూ.30 (నాలుగు), పాప్కార్న్ రూ.30 (ఇద్దరికి రూ.60) ఖర్చు అయింది. రూ. 500 నోటుతో వెళ్లిన ఆయనకు తిరిగి వచ్చేటప్పుడు కాస్తా చిల్లర మిగిలింది. సినిమా పూర్తయ్యేలోగా ఆయనకు సినిమా కనిపించింది. సినిమా ప్రేక్షకుడి ప్రస్తుత పరిస్థితిని సంఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి. టికెట్ల ధరలతో పాటు తినుబండారాల విషయంలో ప్రేక్షకుడు నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. పైగా జీఎస్టీ బాధుడు. ఎమ్మార్పీకే తినుబండారాలు విక్రయించాలన్న అధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): అలసిన మనసుకు సాంత్వన చేకూర్చేది వినోదం. అందులోనూ ప్రతి ఒక్కరినీ రంజింపజేసే మాధ్యమం సినిమా. అలాంటి సినీ వినోదం మరింత ఖరీదైపోయింది. సింగిల్ థియేటర్ల స్థానాన్ని మల్టీప్లెక్స్లు ఆక్రమిస్తున్న తరుణంలో సగటు ప్రేక్షకుడిని దోపిడీ చేయడమనేది సర్వసాధారణమైపోయింది. పార్కింగ్ కష్టాలు మొదలుకొని, టికెట్ ధరలు, ఫుడ్ అండ్ బేవరేజెస్ వరకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమాకు సొంత కారులో వెళ్లిరావాలంటేనే రూ.2వేల వరకు ఖర్చవుతున్నాయి. అందులో టికెట్లకు రూ.600 అయితే, మిగిలినదంతా ఫుడ్ అండ్ బేవరేజెస్కే! అలాగని ఇంటి నుంచి బిస్కెట్ ప్యాకెట్టో, వాటర్ బాటిలో తీసుకువెళ్దామంటే థియేటర్ డోర్ దగ్గరే ఆపేస్తున్నారు. దాంతో రెండున్నర గంటల వినోదానికి వేలల్లో వదిలించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిస్తూ ముంబై హైకోర్టు మల్టీప్లెక్స్ల్లోకి స్నాక్స్ తీసుకువెళ్లేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. మార్గదర్శకాలు రూపొందించాలని సూచించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి మల్టీప్లెక్స్ల్లో బయట ఫుడ్ అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని థియేటర్లలో బయట ఫుడ్ అనుమతించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. నగరంలోని కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా చిప్స్ ప్యాకెట్లను రూ.10 నుంచి విక్రయిస్తున్నారు. ఇవి బయట మార్కెట్లో కనిపించవు. వాటి నాణ్యతను బట్టి చూస్తే రూ.5 కూడా ఎక్కువే. నాణ్యత లేని తినుబండారాలను నచ్చిన ధరకు అమ్ముతూ ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. సీఎంఆర్ లాంటి అతి పెద్ద మాల్లో మనకు నచ్చిన పాప్కార్న్ ప్లేవర్ రూ.25 మాత్రమే. కానీ సినిమా థియేటర్లలో రూ.30(మల్టీప్లెక్స్లో రూ.60 నుంచి). నగరంలో ఎక్కడ తీసుకున్న సమోసా ధర రూ.5 నుంచి రూ.7. మల్టీప్లెక్స్లో మాత్రం వీటి ధర ఒక్కొక్కటి రూ.50. ఎగ్ పఫ్ ప్రముఖ ఫుడ్ జోన్ల్లో రూ.15 దాటదు. కానీ సినిమా థియేటర్లలో రూ. 30. కేఎఫ్సీలో రూ.80లకు మీడియం సైజ్ కూల్ డ్రింక్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తుంది. కానీ థియేటర్లలో కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ రూ.60కు అమ్ముతున్నారు. స్వీట్ కార్న్ నగరంలోని ఎక్కడైనా రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. కాని సినిమా థియేటర్లలో మాత్రం రూ.50. మిగతా తినుబండారాలు కూడా ఇలానే విక్రయిస్తున్నారు. ఫుడ్ అండ్ బేవరేజెస్ మీదే అధికాదాయం ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు మల్టీప్లెక్స్లు, థియేటర్లకు పెనుభారంగా పరిణమించే అవకాశముందన్నది మల్టీప్లెక్స్ మేనేజర్ల మాట. మల్టీప్లెక్స్ల ఆదాయంలో 30 శాతం ఫుడ్ అండ్ బేవరేజెస్ అమ్మకాల ద్వారానే లభిస్తోంది. ఈ కారణం వల్లే ఆదాయం మరింత పెంచుకోవడానికి లైవ్ కిచెన్ కౌంటర్లు, ఎఫ్ అండ్ బీ మెనూ వంటి కార్యక్రమాలను చేపడుతు న్నాయి. ఫిక్కీ–కేపీఎంజీ 2017లో విడుదల చేసిన అధ్యయనంలోనూ ఎఫ్ అండ్ బీ ఆదాయం ద్వారానే మల్టీప్లెక్స్లు తమ ఆదాయం స్థిరంగా వృద్ధి చేసుకుంటున్నాయని వెల్లడించింది. కోర్టు తీర్పు ఇచ్చినా మారని యాజమన్యాలు సినిమా థియేటర్లలో ప్రత్యేక ప్యాకేజీల ధరలతో తినుబండారాలను గతంలో విక్రయించేవారు. దీనిపై వినియోగదారుల కోర్టు గతేడాది నవంబర్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 జనవరి నుంచి అన్ని థియేటర్లలో సాధారణ ధరలకే తినుబండారాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్ని థియేటర్ల యాజమాన్యాలను పిలిచి సాధారణ ధరలకే తినుబండారాలు విక్రయించాలని సూచించారు. మొదట్లో వాటర్ బాటిల్ మాత్రమే ఎమ్మార్పీకి విక్రయించారు. తర్వాత కోర్టు, కలెక్టర్ ఆదేశాలకు తమకు వర్తించవు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాగా..వాణిజ్య సంస్థల్లో, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని కోర్టు చెప్పినా.. థియేటర్ల యాజమాన్యాలు మాత్రం విచ్చలవిడిగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదులు చేస్తే తనిఖీలు చేస్తారటా.. ప్రేక్షకుల నుంచి థియేటర్ల యాజమాన్యాలు అడ్డంగా దోచుకుంటున్నా.. తమకు ఏం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారులు. సినిమా థియేటర్లపై నియంత్రణకు కలెక్టరేట్లో సీ సెక్షన్ ఉంది. వారు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేస్తుండాలి. యాజమాన్యాలు తమ కార్యాలయాలకు పిలిపించుకుని మాట్లాడటం తప్పితే.. ఇటీవల కాలంలో థియేటర్లను తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. థియేటర్లలో జరుగుతున్న ధరల దోపిడీపై వివరణ అడిగితే.. వారు చెప్పే సమాధానం ‘మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు’. ఫిర్యాదు చేస్తే అప్పుడు తనిఖీలు చేస్తాం అంటూ సెలవిస్తున్నారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో థియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సినిమా హాళ్లకు వెళ్లి తినుబండరాలను కొనేవారికి కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఉందని అందరికీ తెలిసినా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇంత ధరలతో వినోదమా.. వినోదాన్ని ఎవరు కోరుకోరు. కానీ మరి ఇంత మూల్యానికా.. ధరలు పెంచడం వలనే పైరసీ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. సరసమైన ధరలు ఉంటే ప్రతీ ఒక్కరూ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్లు, తినుబండారాల ధరలు పెరిగితే సామాన్యుడు థియేటర్ల వైపు చూడడు. –దినేష్, ప్రేక్షకుడు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం ఏ సినిమా థియేటర్లలో అయినా అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నట్టు 1100, 18004250082, 18004252977 నంబర్లకు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం. నిజంగానే అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడప్పుడు తూనికలు– కొలతల అధి కారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. – ఆర్.నరసింహమూర్తి, సి–సెక్షన్ సూపరింటెండెంట్ చుక్కలు చూపిస్తున్నారు సరదాగా సినిమా కోసం వస్తే ప్రత్యేక ధరలంటూ చుక్కలు చూపిస్తున్నారు. కుటుంబంతో కలసి సినిమాకు రావాలంటే భయం వేస్తుంది. మా నుంచి యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకుంటున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. అధికారులు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేయాలి. –కల్యాణ్,ప్రేక్షకుడు థియేటర్లను తనిఖీ చేయాలి సినిమా థియేటర్లలో లభించే ఆహార పదార్థాలు తినాలంటే భయం వేస్తుంది. ఒక వైపు అధికంగా ధరలు ఉంటే మరో వైపు ఎలాంటి నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారు. కొన్ని చిప్స్ ప్యాకెట్ల థియేటర్లలో తప్పితే.. ఎక్కడా లభించవు. వాటిని తినడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు థియేటర్లను తనిఖీ చేయాలి. –కిశోర్ వర్మ, ప్రేక్షకుడు -
అనుమతులు లేకుండా స్వీట్ డ్రింక్ తయారీ
విశాఖ సిటీ ,చోడవరం: అనుమతులు లేకుండా స్వీట్ డ్రింక్స్ తయారుచేస్తున్న సెంటర్పై విజిలెన్స్, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు గురువారం దాడులు చేశారు. చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఈ సెంటర్పై రెండు శాఖల అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. లోకల్ డ్రింక్ పేరుతో ఇక్కడ తయారుచేస్తున్న స్వీట్ డ్రింక్ను పాత పెప్సీ, బ్రీజర్, ఇతర సీసాల్లోనింపి గ్రామీణ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. నీటిలో పంచదార, ఎసెన్స్, కొన్ని రంగులు ఒక మిషన్ ద్వారా మిక్స్చేసి ఆ ద్రావణాన్ని సీసాల్లో నింపి అమ్ముతున్నారు. సంపత్ వినాయక సంతోషిమాత డ్రింక్ పేరున నడుస్తున్న ఈ లోకల్ డ్రింక్ తయారు చేసేందుకు ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో దాడులు చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా శీతల పానీయం తయారీ చేయడం వల్ల ప్రజలకు ప్రమాదమని, ఈ మేరకు ఈ సెంటర్పై దాడి చేసి కేసు నమోదుచేసినట్టు విజిలెన్స్ డీఎస్పీ పి.ఎం. నాయుడు, ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి బి.వేణుగోపాల్, గజిటెడ్ ఫుడ్ ఇనస్పెక్టర్ కె. వెంకటరత్నం తెలిపారు. అయితే ఉత్పత్తి చేసిన డ్రింక్స్, శీతలపానీయాలను విక్రియించేం దుకు ఫుడ్ కంట్రోల్ శాఖ నుంచి ఈ సెంటర్కు అనుమతి ఇస్తూ లైసెన్సు ఉంది. దీనిని పరిశీలించిన అధికారులను ఇక్కడ ఏ లేబుల్ లేకుండా స్వీట్ డ్రింక్స్ సీసాల్లో నింపి ఉన్న 15 కేసులను అధికారులు సీజ్చేశారు. కొన్ని బాటిళ్లను శాంపిల్స్ కోసం సీజ్చేసి తీసుకెళ్తున్నట్టు ఫుడ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. -
కూల్ డ్రింక్స్ కేంద్రంపై విజిలెన్స్ దాడులు
కంచరపాలెం(విశాఖ ఉత్తర): జీవీఎంసీ 36వ వార్డు కంచరపాలెం పరిధి గోకుల్నగర్లో నిర్వహిస్తున్న వనజాక్షి శీతల పానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ వనజాక్షి కూల్ పాయింట్ నిర్వాహకులు డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించడం లేదన్న సమాచారం మేరకు జీవీఎంసీ ఆహార భద్రత అధికారులతో కలిసి దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో కూల్ డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించనట్లుగా గుర్తించామని తెలిపారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉన్నప్పటికీ నేరుగా బోరు నీటిని వినియోగించి అందులో హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్, సాల్ట్ ప్లేవర్స్తో పాటుగా ఎసెన్స్, కూల్డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించామన్నారు. శీతల పానీయాలు తయారీ కేంద్రంలో సేకరించిన శ్యాంపిల్స్ను హైదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి నివేదిక అధారంగా చర్యలు చేపడతామన్నారు. కూల్ పాయింట్ నిర్వాహకుడు కె.ఈశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీఎం.నాయుడు, ఎస్ఐ రమేష్, డీసీటీవోలు రేవతి, మోహన్రావు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు కోటేశ్వరరావు, జనార్థన్, జి.వి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
బోరు నీటితో కూల్డ్రింక్స్..అధికారుల దాడులు
-
కూల్ కిల్లర్..
దురాజ్పల్లి (సూర్యాపేట) :ఎండాకాలంలో ప్రజలంతా చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్, క్యూలర్, ఏసీలను వినియోగించక తప్పడం లేదు. భయటకు వెలితే నీడ కోసం వెతుకులాడుతుంటారు. ఈ సమయంలో ముఖ్యంగా ప్రజలకు చల్లటి నీరు, పానీయాలు తాగుతుంటారు. అయితే చల్లని పానీయాల కోసం వ్యాపారులు ఐస్ వాడుతారనేది అందరికీ తెలిసిన విషయమే.. రోడ్లపై ఉన్న బండ్ల దగ్గర నుంచి దుకాణాల వరకు అందరు ఐస్ ముక్కలను ఉపయోగించి పానీ యాలు తయారుచేస్తుంటారు. వాటిని మనం తాగేస్తుంటాము కానీ.. అందులో వాడుతున్న ఐస్ ఎంతమాత్రం నాణ్యమైనదని ఆలోచించం. ఈ ఐస్ ఏ మాత్రం నాణ్యమైనది కాదని, ప్రజలు అనారోగ్యం బారిన పడేలా చేస్తోందని వైద్యులు, నిపుణులు అంటున్నారు. అవగాహన లేక.. ప్రజలకు సరైన అవగాహన లేక ఆర్యోగానికి ప్రమాదకరమైన ఐస్ కలిపిన శీతల పానీయాలు తాగి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఐస్ నాణ్యమైనది కాదని వ్యాపారులకు కూడా తెలిసే వాడుతున్నారు. ప్రజల ఆర్యోగాలతో వారికి పని లేదు తమ వ్యాపారాలు నడిస్తే చాలు. సాధారణగా పండ్ల రసాలు ఆర్యోగానికి చాలా మంచివి. కాని అందులో కలిపే ఐస్తో మొత్తం ప్రమాదం పొంచి ఉన్నది. సాధారణంగా శీతల పానీయాలలో ఎడిబుల్ ఐస్ ప్లాంట్లలో తయారైన ఐస్ను మాత్రమే వాడాలి. కాని జిల్లాలో ఎక్కడా ఎడిబుల్ ఐస్ ప్లాంట్లు లేవు. ఉన్నవన్నీ పారిశ్రామిక అవసరాల కోసం ఐస్ తయారు చేసే ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఐస్ కేవలం చేపలు, రొయ్యలు, మృతదేహాలు నిల్వ చేయడం కోసమే వాడాలి. ఐస్ కలిపిన పానీయాలు తాగితే అంతే.. ఐస్ తయారీ బ్లాకులలో వాడే ఉప్పు నీరు చాలా కాలం పాటు ప్లాంట్లో కదలకుండా ఉండిపోతుంది. ఈ నీటిలో ప్రమాదకరం బ్యాక్టీరియాలు ఉంటాయి. అందరూ ఐస్లో బ్యాక్టీరియా ఉండదని భావిస్తారు. కాని అది నిజం కాదు. నీరు గడ్డ కట్టినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు నిద్రావస్థలోనికి వెలుతాయి. సాధారణ ఉష్ణోగ్రత రాగానే అవి తమ జీవన ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తాయి. ఐస్ ప్యాక్టరీలలో ఎటువంటి సురక్షిత విధానాలు పాటించరు. అందువల్ల ఐస్లో కొల్లి బ్యాక్టీరియా, రోటా, హెపటైటిస్ వంటి వైరస్లు ఉంటాయి. ఇలాంటి ఐస్ కలిపిన పానీయాలు తాగితే జలుబు, దగ్గు, కామెర్లు, విరేచనాలు వంటి జబ్బులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్లో నీటిని ఉంచుకొని తాగడమే మేలు. రోజూ రూ.75వేల వ్యాపారం జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి, హుజూర్నగర్ వంటి ప్రధాన పట్టణాలలో పారిశ్రామిక, సాధారణ అవసరాలకు వినియోగించే ఐస్ ఫ్యాక్టరీలు సుమారు 15వరకు ఉన్నాయి. వీటిలో జిల్లా కేంద్రంతో పాటు కోదాడలో ఉన్న ఐస్ఫ్యాక్టరీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రోజు సుమారు రూ.5వేల నుంచి ఏడు వేల వరకు వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. సరాసరి రోజుకు రూ.5వేల చొప్పున బేరం జరిగితే రూ.75వేల ఠివరకు ఐస్ను అమ్ముతున్నట్టు తెలుస్తోంది. నెలకు రూ.22.50లక్షల వ్యాపారం చేస్తున్నారు. అలాగే జిల్లాలో పండ్ల రసాలను, నిమ్మ సోడాలను ఇతర పదార్థాలను ఐస్ వేసి అమ్మే వ్యాపారులు సుమారు 700పైనే ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా సూర్యాపేట, కోదాడలో 500 వరకు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వ్యాపారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క ఐస్ సాధారణ బాక్స్ సుమారు పది కేజీలు రూ.100పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరం..! పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేసిన ఐస్ను ప్రజలు నేరుగా తీసుకోకూడదు. కాని వ్యాపారులు తమ అవసరాకోసం ఈ ఐస్నే వాడుతున్నారు. చెరుకు రసం, లస్సీ, ఫ్రూట్ జ్యూస్లు, నిమ్మరసం, షోడా, సుగంధ పానీయాల తయారీలో ఈ ఐస్ను వాడుతున్నారు. ఈ ఐస్ అతి సాధారణమైన నీటితో తయారు చేస్తారు. అంతే కాకుండా ఈ ఐస్ తయారి సమయంలో ఐస్ బ్యాకులు ఉప్పు నీటిలో మునిగి ఉంటాయి. ఉప్పునీరు తీసుకున్న చల్లదానాన్ని ఈ బ్లాక్ గ్రహించి దీనిలో దీనిలో ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తున్నది. కొన్ని సందర్భలాలో ఉప్పు నీరు బ్లాక్లోకి నేరుగా చేరుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంమైనది. -
పరి పరిశోధన
తాగుడును దూరం చేసే జన్యుమార్పులు! తాగుడు అలవాటును అధిగమించేలా మనిషి పరిణమిస్తున్నాడా? అవునంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మానవుల్లో ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపారు. ఇప్పటికే పూర్తయిన దాదాపు వెయ్యి జన్యుక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని ఇందుకోసం విశ్లేషించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన 2500 మంది డీఎన్ఏ వివరాలను పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఆఫ్రికా సంతతి వ్యక్తుల్లో మలేరియా వ్యాధికి నిరోధకత పెరుగుతూండగా, యూరోపియన్లలో ఒక అమినో యాసిడ్లో మార్పులు నమోదయ్యాయి. అలాగే నియాండెర్తల్ జాతికి సంబంధించిన మానవులతో కలవడం వల్ల వచ్చిన రెండు డీఎన్ఏ ముక్కలు అలాగే ఉన్నట్లు తెలిసింది. చివరగా ఏడీహెచ్ అనే జన్యువులో వచ్చిన మార్పు. ఈ జన్యువు శరీరంలో ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది మద్యాన్ని విడగొట్టి అసిటాల్డీహైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జన్యువులో వచ్చిన మార్పులు భవిష్యత్తులో శరీరాన్ని మద్యం ప్రభావం నుంచి రక్షించేదిగా ఉందని శాస్త్రవేత్తల అంచనా. మద్యాన్ని వేగంగా విడగొట్టడం ద్వారా తాగుబోతులకు జబ్బు పడిన అనుభూతిని ఇవ్వడం ద్వారా ఈ జన్యువు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాంటీబయాటిక్ల ప్రభావాన్ని పెంచే కార్బన్ మోనాక్సైడ్! కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు కారణంగా యాంటీబయాటిక్ మందుల ప్రభావం గణనీయంగా వృద్ధి చెందుతుందని జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. మెట్రోనైడజాల్ అనే యాంటీబయాటిక్కు కార్బన్ మోనాక్సైడ్ను జోడించి ప్రయోగించినప్పుడు హెచ్.పైలోరీ రకం బ్యాక్టీరియా వేగంగా నాశనమైందని వీరు జరిపిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కడుపులో పుండ్లు అయ్యేందుకు ఈ హెచ్.పైలోరీ కారణమవుతుందన్నది తెలిసిన విషయమే. కార్బన్ మోనాక్సైడ్తో కలిపి ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ ప్రభావం 25 రెట్ల వరకూ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ బింగే వాంగ్ తెలిపారు. బ్యాక్టీరియా యాంటీబయాటిక్కు స్పందించకపోవడం నిరోధకత కాదని, చాలా సందర్భాల్లో అవి మందులకు అలవాటుపడిపోవడం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయని ఆయన వివరించారు. బ్యాక్టీరియాను మళ్లీ మందులకు సున్నితంగా మారిస్తే అవి వాటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. గాఢత ఎక్కువగా ఉండే విషంలా పనిచేసే కార్బన్ మోనాక్సైడ్ను అతి తక్కువ సాంద్రతల్లో వాడినప్పుడు మాత్రం చికిత్సకు ఉపయోగపడుతుందని తాము గుర్తించినట్లు చెప్పారు. శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఈ వాయువు వాపును తగ్గించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్లకు కణాలు ప్రతిస్పందించే గుణాన్ని కూడా పెంచుతాయని చెప్పారు. కూల్డ్రింక్స్తో కేన్సర్ ముప్పు... చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్డ్రింక్స్ తాగే అలవాటు ఉన్న వారికి ఊబకాయ సంబంధిత కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని మెల్బోర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఒకటి తెలిపింది. దాదాపు 35 వేల మంది అలవాట్లను పరిశీలించి జరిపిన విశ్లేషణ ద్వారా కూల్డ్రింక్స్ 11 రకాల కేన్సర్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఊబకాయానికి సంబంధించినవే అయినప్పటికీ అధ్యయనంలో పాల్గొన్న వారు మాత్రం ఊబకాయులు కాకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం కూల్డ్రింక్స్ తాగేవారితో పోలిస్తే కృత్రిమ చక్కెరలతో కూడిన డైట్ కూల్డ్రింక్స్ తాగే వారికి వ్యాధి ముప్పు తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని అలిసన్ హాడ్జ్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. అధిక చక్కెర... ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేస్తూండగా.. కేన్సర్ కారకమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఒక పరిశోధనలో చక్కెరలు కేన్సర్ కణాలను ఎలా ప్రేరేపితం చేస్తాయో స్పష్టం అవడమే కాకుండా.. చక్కెరలు కణతి ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కేన్సర్ల నివారణకు చక్కెరలను పూర్తిస్థాయిలో త్యజించడమూ అంత మంచిదేమీ కాదని, కణాలకు అవసరమైన శక్తి గ్లూకోజ్ ద్వారానే లభిస్తుందన్న విషయం మరువరాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
ఆ షాపుల్లో... చాక్లెట్లు, కూల్డ్రింక్లకు ‘నో’
భావితరాలను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కేంద్రం ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కాలను అమ్మే షాపులు స్థానిక సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకొని... విక్రయాలకు అనుమతి పొందాలని ప్రతిపాదించింది. అలాగే మైనర్లు వీటి పట్ల ఆకర్షితులు కాకూడదనే ఉద్దేశంతో పాన్షాపుల్లో చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్, కూల్డ్రింక్స్ లాంటివి అమ్మకూడదని స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపులకు స్థానిక సంస్థల ద్వారా అనుమతిని జారీచేసే ప్రక్రియకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఈనెల 21న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా మైనర్లకు పొగాకు ఉత్పత్తుల అమ్మకుండా ఓ కన్నేసి ఉంచడానికి ఈ విధానం పనికి వస్తుందని ఆరోగ్యశాఖ సలహాదారు అరుణ్ ఝా అన్నారు. అయితే మన దేశంలో పాన్షాపుల్లో కాకుండా ప్రతిచిన్న కిరాణా కొట్టులోనూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగే వారిలో 90 శాతం మందికి 20 ఏళ్ల వయసులోపే దమ్ము అలవాటైందని గణాంకాలు చెబుతున్నాయి. మొక్కగా ఉన్నపుడే వంచడం సులువు కాబట్టి యుక్త వయసులో అటు వైపు ఆకర్షితులు కాకుండా నిరోధిస్తే... ఈ మహమ్మారి బారినపడకుండా యువ శక్తిని కాపాడుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. – భారత్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి పొగాకు నమిలే అలవాటు ఉందని ప్రభుత్వ సర్వే తేల్చింది. – 10 కోట్లు: భారత్లో పొగాకు తాగే అలవాటు ఉన్నవారు. – 1 కోటి: పొగాకు తాగే అలవాటు కారణంగా... క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధం వ్యాధుల బారినపడి ప్రతియేటా మనదేశంలో మరణించే వారి సంఖ్య. – 60 శాతం నివారించొచ్చు: క్యాన్సర్లలో 60 శాతం నివారించదగ్గవే. వీటిలో పొగాకు సంబంధింత క్యాన్సర్లు 40 శాతం. – 16 ఏళ్లు: భారత్లో పొగాకు అలవాటుపడుతున్న పిల్లలు 16 ఏళ్ల సగటు వయసులో దీన్ని మొదలుపెడుతున్నారు. – 4.4 శాతం: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్లో విడుదల చేసిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (గాట్స్) నివేదిక ప్రకారం 2010 నుంచి 2016 మధ్యకాలంలో 15–17 ఏళ్ల మధ్యలో పొగాకుకు అలవాటుపడుతున్న వారి సంఖ్య 9.6 శాతం నుంచి 4.4 శాతానికి పడిపోయింది. – 15.4 శాతం: ఇదే కాలంలో 18–24 ఏళ్ల వయసు వారిలో పొగాకు అలవాటున్న వారి శాతం 21.4 నుంచి 15.4 శాతానికి పడిపోయింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదో ఆరోగ్యకర పరిణామంగా భావించిన కేంద్రం... యువతను ఈ అలవాటుకు దూరంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాజా చర్యలు చేపట్టింది. – 7 ఏళ్లు: 2015లో ఆమోదించిన జువనైల్ చట్టం ప్రకారం... మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే గరిష్టంగా ఏడేళ్ల దాకా కఠినకారాగార శిక్షను విధించే అవకాశముంది. 100 మీటర్లు: విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలోపు పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదు. – 4వ స్థానం: ప్రపంచంలో అత్యధికంగా సిగరెట్లు అమ్ముడయ్యే దేశాల్లో భారత్ది నాలుగోస్థానం. చైనా, అమెరికా, జపాన్ల తర్వాత మనమున్నాం. 9,900 కోట్లు: 2016లో భారత్లో అమ్ముడైన సిగరెట్ల సంఖ్య. 51 శాతం: ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల వినయోగంలో టాప్–4 దేశాలు ( చైనా, అమెరికా, జపాన్, భారత్) ఏకంగా 51 శాతం వినియోగిస్తున్నాయి. 11.2 శాతం: ప్రపంచవ్యాప్తంగా మొత్తం పొగరాయుళ్లలో భారతీయులు 11.2 శాతం. – ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానంలో 2020 కల్లా పొగాకు వినియోగాన్ని 15 శాతం తగ్గించాలని, 2025 కల్లా 30 శాతం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రెండాకులు ఎక్కువే పిండాం..!
టేస్ట్ ద థండర్ ... గుట గుటమనిపించే ఉంటారు ఓపెన్ హ్యాపీనెస్... సిప్పు కొట్టే ఉంటారు. యే దిల్ మాంగే మోర్... ఆస్వాదించే ఉంటారు జ్యాదా మస్తి ... లాగించే ఉంటారు క్లియర్ హై ... క్లియర్ చేసే ఉంటారు ఇవి... అన్నీ కూల్డ్రింక్స్ ట్యాగ్లైన్లు. కానీ, మేం ఆరులైన్లు ఎక్కువే చదివాం. అందుకే, రెండాకులు ఎక్కువే పిండాం. ఆకుకూరలతో జ్యూసులు టేస్ట్ ద వండర్! పుదీనా జ్యూస్ కావల్సినవి: పుదీనా ఆకులు – ఒకటిన్నర కప్పు; బెల్లం లేదా పంచదార – 6 టేబుల్ స్పూన్లు (తగినంత); నీళ్లు – అర కప్పు; నల్లుప్పు – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – టీ స్పూన్; నిమ్మరసం – 3 టీ స్పూన్లు తయారీ: పుదీనా కాడల నుంచి ఆకులను వేరు చేసి, నీళ్లలో వేసి కడగాలి. తర్వాత జల్లిలో వేసి నీళ్లన్నీ పోయేదాకా ఆరనివ్వాలి. అన్ని పదార్థాలు మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్రమం పూర్తిగా పేస్ట్ అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పుదీనా జ్యూస్ పావు కప్పు తీసుకుంటే 3 కప్పుల నీళ్లు దీనికి కలపాలి. గ్లాస్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సేవించాలి. (తీపి కావాలనుకుంటే మరికాస్త కలుపుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం లేదంటే తేనెను కూడా వాడుకోవచ్చు.) మునగాకు జ్యూస్ కావల్సినవి: మునగాకు – అర కప్పుతేనె – టేబుల్ స్పూన్ నిమ్మరసం – టేబుల్ స్పూన్ నీళ్లు – అర గ్లాసు తయారీ: మునగాకు మెత్తగా రుబ్బి, అందులో నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. గ్లాసులో పోసి నిమ్మరసం, తేనె కలపాలి. క్యాల్షియం సమృద్ధిగా లభించే మునగాకు ఎముకల బలానికి మేలు చేస్తుంది. వీట్గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్గ్రాస్ తరుగు – అరకప్పుపైనాపిల్ ముక్కలు – 6 కప్పులుపుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి.గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. కొత్తిమీర జ్యూస్ కావల్సినవి: పాలకూర తరుగు – కప్పు ఏదైనా మరో ఆకు కూర – ఒక ఆకు యాపిల్ – 1 నిమ్మరసం – టీ స్పూన్నీళ్లు – కప్పు తయారీ: ఆకు కూరను, యాపిల్ను శుభ్రపరచాలి. యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి, మెత్తగా బ్లెండ్ చేయాలి. నిమ్మరసం కలిపి సర్వింగ్ గ్లాస్లో పోసి అందించాలి. చల్లగా కావాలనుకునేవారికి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి. తమలపాకు జ్యూస్ కావల్సినవి: కొత్తిమీర తరుగు – అర కప్పు పుదీనా ఆకులు – గుప్పెడు నీళ్లు – కప్పు నిమ్మరసం – టీ స్పూన్ ఉప్పు – తగినంత తయారీ: కప్పు నీళ్లు మరిగించాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి, పైన మూత పెట్టి, మంట తీసేయాలి. ఐదు నిమిషాలు ఉంచి, ఆ నీటిని వడకట్టాలి. ఆకులను గ్రైండర్లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో వడకట్టిన నీళ్లు కలిపి ఆకులను మెత్తగా అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ జ్యూస్ ఫ్రిజ్లో పెట్టి, చల్లగా అయ్యాక అందించాలి. వీట్గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్గ్రాస్ తరుగు – అరకప్పు పైనాపిల్ ముక్కలు – 6 కప్పులు పుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి. గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. పాలకూర జ్యూస్ కావల్సినవి: తమలపాకులు – 2 గులాబీ పూల రేకలు – కొన్ని బెల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు లవంగం – 1 దాల్చిన చెక్క – చిన్న ముక్క నీళ్లు – కప్పు తయారీ: తమలపాకులు, గులాబీ పువ్వు రేకలు శుభ్రం చేయాలి. అన్నీ కలిపి, జ్యూస్ మిక్సర్లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. వడకట్టి, సేవించాలి. నోట్ : ఆకుకూరలను తప్పనిసరిగా తగినన్ని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కనీసం 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మరో రెండు సార్లు మంచి నీళ్లతో శుభ్రపరచాలి. ఆకుల మీద పురుగుమందుల అవశేషాలు పోయే వరకు శుభ్రం చేయాలి. -
అలా అమ్మితే.. ఇక జైలుకే
మామూలు దుకాణాల్లో తప్ప బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టులు, థియేటర్లు.. ఇలా ఎక్కడకు వెళ్లినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి కూల్ డ్రింకుల వరకు ఏవీ ఎంఆర్పీ ధరకు అమ్మరు. దానికంటే ఎంతో కొంత ఎక్కువ ధర పెడితే తప్ప దాహం తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక ముందు ఇలా అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా పంపుతామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎక్కడ చూసినా మంచినీళ్ల బాటిళ్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పి) కంటే 10-20 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారని పాశ్వాన్ అన్నారు. అసలు కొన్ని బాటిళ్ల మీద అయితే దాని ధర ఎంతో కూడా ముద్రించడం లేదని మండిపడ్డారు. 47వ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తూనికలు కొలతల చట్టంలోని సెక్షన్ 36 ప్రకారం.. ముందుగానే ప్యాక్ చేసిన వస్తువులో ప్రమాణాలు దాని మీద పేర్కొన్నట్లు లేకపోతే.. రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా అలాంటి నేరం చేస్తే.. విధించే జరిమానాను ఇప్పుడు రూ. 50 వేలకు పెంచుతున్నారు. ఇంకా పదే పదే అలాగే చేస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, లేదా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ కూడా విధిస్తారు. 2009 నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చినా.. దాని గురించిన పరిజ్ఞానం పౌరులకు పెద్దగా లేదు. ఎంఆర్పి కూడా లేబుల్ మీద ముద్రించే ఉంటుంది కాబట్టి దాన్ని ఉల్లంఘించినా కూడా జైలుశిక్ష, జరిమానా విధిస్తారని పాశ్వాన్ ఈ సందర్భంగా చెప్పారు. వినియోగదారులు అవగాహన పెంచుకుని ఫిర్యాదులు చేయాలని, ఫిర్యాదు అన్నదే లేకపోతే చర్యలు ఎలా తీసుకుంటామని ఆయన అడిగారు. ఈ విషయంలో 2007లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. గత ఫిబ్రవరి నెలలో ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్సులో నీళ్ల బాటిల్ను ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు జాతీయ వినియోగదారుల కమిషన్ రూ. 5 లక్షల జరిమానా విధించింది. -
కూల్డ్రింక్స్తో శరీరం చల్లబడుతుందా?
అవాస్తవం అపోహ: వేసవిలో కూల్డ్రింక్స్ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వాస్తవం: చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్డ్రింక్స్లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫరిక్ యాసిడ్తో కాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనల నివేదికలు చెబుతున్నాయి. పైగా కూల్ డ్రింక్స్ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాల (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందట. అందుకే కూల్డ్రింక్స్కు బదులు తాజా పళ్లరసాలు, మజ్జిగ, క్యారట్ జ్యూస్, టొమాటో జ్యూస్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం మేలు. ఒకవేళ కూల్డ్రింక్స్ తాగాల్సి వచ్చినా వాటిని చాలా తక్కువ పరిమితిలో ఎప్పుడో ఒకసారి తాగాలి. ముఖ్యంగా పిల్లలకు కూల్డ్రింక్స్కు బదులుగా పళ్లరసాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది. -
కూల్డ్రింక్స్తో డయాబెటిస్ ముప్పు
కొత్త పరిశోధన వేడి వాతావరణంలో చల్లచల్లగా తీపితీపిగా దాహార్తిని చల్లార్చే కూల్డ్రింక్స్ను పిల్లలు, పెద్దలు అంతా ఇష్టపడతారు. అయితే, తరచు కూల్డ్రింక్స్ తాగేవారికి డయాబెటిస్ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కనీసం ఒక కూల్డ్రింక్ అయినా తాగే అలవాటు ఉన్న వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 18 శాతం ఎక్కువగా ఉంటాయని తమ అధ్యయనంలో తేలినట్లు కేంబ్రిడ్జి వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. కూల్డ్రింక్స్ తాగే అలవాటు కారణంగానే బ్రిటన్లో ప్రతిఏటా కొత్తగా 8 వేలకు పైగా డయాబెటిస్ కేసులు నమోదవుతున్నాయని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 32,500 మందిపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా తరచుగా కూల్డ్రింక్స్ తాగేవారు డయాబెటిస్కు లోనవుతున్నారనే నిర్ధారణకు వచ్చామని చెబుతున్నారు. కూల్డ్రింక్స్లో మోతాదుకు మించి చక్కెర ఉండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. -
గుడ్డు ముందా... కోడి ముందా...?
‘‘ఇంతకూ... గుడ్డు ముందా... కోడి ముందా...? నీ దృష్టిలో ఏది ముందో నువ్వు చెప్పు’’ అంటూ అడిగారు మా శ్రీవారు. అంతకు ముందు ఆ అంశంపై మా శ్రీవారూ, వారి స్నేహితులు కొందరు కలిసి ఓ రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. పెరట్లో సాగిన ఈ చర్చల సమయంలో వారు తినడానికి వీలుగా చిప్స్, కారప్పూసా, చివరన కూల్డ్రింక్స్... ఆ మధ్య ఒకసారి బ్రేక్లో కాసింత కాఫీ నీళ్లూ... ఇవన్నీ వాళ్లకు నేనే సర్వ్ చేశా. ‘‘ఏం... మీ సుదీర్ఘ చర్చల్లో ఏ విషయమూ తేలలేదా? పైగా రెండు గంటలకు పైగా సాగింది కదా ఆ సంభాషణ’’ అన్నాను కాస్త వ్యంగ్యం ధ్వనించేలా. ఆయనకు అది అర్థం కాలేదు. అర్థం అవుతుందని కూడా నేననుకోలేదనుకోండి! ‘‘ఏవిటోనోయ్... మేమందరమూ కాస్త బుద్ధిజీవులమే. పైగా సైన్స్ కోణంలో కొద్దిసేపూ, చివరన ఆధ్యాత్మిక-లౌకిక-పారలౌకిక-అలౌకిక దృష్టితో మరికాసేపూ... ఇలా అన్ని కోణాల నుంచి ఒక నిబద్ధత కూడిన అర్థవంతమైన చర్చసాగించి, బలవంతంగా ప్రయత్నించినా ఫలవంతమైన ఫలితం రాలేదోయ్. అందుకే అడుగుతున్నా. గుడ్డు ముందా? కోడి ముందా నువ్వైనా చెప్పు’’ అంటూనే... ‘‘అయినా నీ కోడిమెదడుకు ఇంతటి లోతైన సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకోవడం నా పొరబాటేనోయ్’’ అంటూ ఒక సెటైరు విసిరారు. ‘‘అవునండీ... నా కోడిమెదడుకు ఇలాంటి చర్చలూ, వాటి ఫలితాలూ పెద్దగా పట్టవు. కానీ కోడి ముందా, గుడ్డు ముందా అనే ఓ సైంటిఫికల్ మిక్స్డ్ తాత్విక సమస్య కంటే నేను చాలా చిన్న విషయాలకే ప్రాధాన్యమిస్తా’’ అన్నాన్నేను. ‘‘అంటే?’’ అడిగారాయన. ‘‘అంటేనా? మనింట్లో అరడజను కోడి గుడ్లుంటే... మన పిల్లలు ఆరోగ్యంగా, బలంగా, ఎత్తుగా పెరగాలంటే వాటిని బాయిల్డ్ ఎగ్స్ రూపంలో పిల్లలకు పెట్టాలా? లేక రుచిగా తినిపించడానికి ఆమ్లెట్లు వేయాలా అన్నదే నాలో అంతర్గతంగా జరిగే చర్చ. ఒకవేళ బాయిల్డ్ ఎగ్స్ చేస్తే... నలభై దాటిన మీ ఆరోగ్యం దృష్ట్యా మీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకూ, ఎగ్ కలర్ తాలూకు ఎల్లో మెరుగులు నా ముఖాన నిగారింపులా పదికాలాలపాటు పదిలంగా నిలిచేందుకు దాని పసుపుసొన ఉండను... మన పిల్లలకు పెట్టి మీకు ఎగ్ వైట్ మాత్రమే పెట్టాలా అనేది కూడా నా మనసులో జరిగే చర్చ. ఇక పిల్లలు ఆరోగ్యకరంగా పెరుగుతూ, మీకూ గుండె చుట్టూ కొవ్వు పెరగకుండా ఉండాలంటే వేటమాంసానికి బదులు వైట్మీటైన చికెన్ పెడితేనే మంచిది కదా అన్న చిన్న విషయాలే నాకు పెద్ద సందేహాలు. వీటితోనే నేను సతమతమవుతూ ఉంటే మేధావులైన మీరూ-మీ మిత్రుల్లా కోడి ముందా, గుడ్డు ముందా అనే అంశంపై తాత్విక, శాస్త్రీయ, గతితార్కికవాద.. లాంటి అనేక కోణాలకు తావెక్కడుంటుందండీ’’అంటూ నా ముఖాన అమాయకత్వాన్ని ఒలికిస్తూ జవాబిచ్చాను. -వై! -
ఓహో.. బాటిల్నూ తినేయొచ్చు..!
లండన్: ఇకపై నీళ్లు తాగేసి వాటర్ బాటిళ్లను చెత్తకుప్పల్లో... కూల్డ్రింక్ టిన్నులను రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు. చిత్రంలో చూస్తున్న ఈ ‘ఓహో’ ఆల్గే బెలూన్లను బాటిల్గా ఉపయోగిస్తే చాలు.. తాగాల్సింది తాగేసి, బాటిల్ను కూడా లొట్టలేసుకుంటూ తినేయొచ్చు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్పెయిన్కు చెందిన పరిశోధకులు ఈ ‘తినే బాటిల్’ను రూపొందించారు. గోధుమ రంగు నాచు (బ్రౌన్ ఆల్గే) నుంచి సోడియం అల్జినేట్ అనే పదార్థాన్ని తీసుకుని దానికి కాల్షియం క్లోరైడ్, జెల్ పదార్థాన్ని కలిపి జిగురు పొరలతో కూడిన ఈ ఓహో బెలూన్లను తయారు చేశారు. వివిధ ఆకారాల్లోకి మార్చి వీటి జిగురు పొరల మధ్య ద్రవాలను సురక్షితంగా నిల్వచేయొచ్చు. ప్యాకింగ్కూ అనుకూలంగా ఉండే ‘ఓహో’ ఆల్గే బెలూన్లు పర్యావరణహితమైనవే కాకుండా ఎంతో చవకైనవి కూడా. -
ఆగని అకృత్యాలు
ఈ ఏడు నేర సంస్కృతి మరింత జడలు విప్పింది. నిత్యం ఏదో ఓ చోట చోరీలు, ఒకరిపై ఒకరు దాడులు, చీటింగ్ తదితర నేరాలు పెచ్చుమీరాయి. మహిళలపై దాడులు పెరిగిపోయాయి. నిర్భయ కేసులు కలవరపెడుతున్నాయి. వరకట్న, శారీరక వేధింపుల సంఖ్య పెరిగింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒకే ఘటనలో ఇద్దరు, ముగ్గురు దుర్మరణం పొందిన కేసులు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం రూ.7.46 కోట్ల సొత్తు దొంగలు అపహరించారు. గతేడాదితో పోల్చుంటే తక్కువే అయినప్పటికీ.. రికవరీ చేయడంలో పోలీసులు చాలా వెనుకబడ్డారు. - సాక్షి, నల్లగొండ రాలిన ప్రేమసుమాలు... జనవరి 8 : వరంగల్ జిల్లాకు చెందిన ప్రేమికులు రాజు, పూజ ఆలేరులో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లికి పెద్దలు నిరాకరించారని మనస్తాపం చెందిన వీరు కలిసి ప్రాణం తీసుకున్నారు. జనవరి 15 : పెళ్లికి కుటుంసభ్యులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన కర్ణాకర్, రత్నకుమారి కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపితాగి అవని నుంచి దూరమయ్యారు. ఫిబ్రవరి 22 : చిట్యాల శివారులో ప్రేమికుల జంట ఆత్మహత్యకు ఒడిగట్టింది. విజయవాడకు చెందిన నాగరాజు, పద్మ పురుగు మందుతాగి బలవర్మరణానికి పాల్పడ్డారు. నెత్తురోడిన రహదారులు ఫిబ్రవరి 2 : కేతేపల్లి ఇనుపాముల శివారులో ఆటోను తవేరా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి. ఫిబ్రవరి 7 : కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద స్కార్పియో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు భార్యాభర్తలున్నారు. మే 29 : నకిరేకల్ బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యు ఒడికిచేశారు. 12 మంది క్షతగాత్రులయ్యారు. మృతి చెందినవారిలో నలుగురు ప్రయాణికులు, కండక్టర్ ఉన్నారు. జూలై 2 : చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టింది. కూతురిని మెడికల్ కళాశాలలో చేర్పించడానికి హైదరాబాద్ నుంచి నార్కట్పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తల్లి, కూతురు, కొడుకు, ఆడపడుచు, డ్రైవర్ విగత జీవులయ్యారు. ఆగస్టు 14 : నార్కట్పల్లి - అద్దంకి బైపాస్ రోడ్డులో వేములపల్లి వద్ద ఆంబులెన్స్ను రాంగ్ రూట్లో వెళ్లి డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 15 : ప్రజలంతా ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవాల్లో మునగగా.. నార్కట్పల్లి వద్ద టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు లాన్జాన్బాషా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతివేగంగా ప్రయాణిస్తున్న అతని కారు రోడ్డు రేలింగ్కు ఢీ కొట్టింది. తీవ్రగాయాలవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సెప్టెంబర్ 19 : హైదరాబాద్ - సాగార్జునసాగర్ రహదారిలో ఉన్న చింతపల్లి మండలం రాజ్యాతండా వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 11 మంది దుర్మరణం చెందగా... 15 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తుల రికవరీ నామమాత్రమే.. ఏటేటా దొంగలు కొల్లగొడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే వాటిని రికవరీ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఈ ఏడాది రికవరీ మరింత దిగజారింది. మొత్తం రూ.7.46కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించగా... రూ.3.49 కోట్ల ఆస్తిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. రికవరీ ఈ ఏడాది 46.79 శాతానికి పడిపోయింది. తగ్గిన ప్రమాదాలు జిల్లాలో ఈ ఏడాది కూడా నెత్తుటేరులు పారాయి. రోడ్డు ప్రమాదాలు గతేడాది కంటే స్వల్పంగా తగ్గినా.. ప్రమాదాలు జరిగిన తీరు భీతిగొల్పాయి. ఒకే ప్రమాదంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది దుర్మరణం చెందిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ, నార్కట్పల్లి - అద్దంకి రహదారులపై ఘోర ప్రమాదాలు సంభవించాయి. గతేడాది కంటే దాదాపు 8 శాతం ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జరిగిన 1,958 రోడ్డు ప్రమాదాల్లో 775 మంది మృత్యువాత పడ్డారు. గత నాలుగేళ్లుగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అమ్మో కిడ్నాపా...! కిడ్నాప్ అంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కిడ్నాప్కు గురైన వ్యక్తులు చాలా సార్లు హత్యకు గురికావడమే ఇందుకు ముఖ్య కారణం. కిడ్నాప్ల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది 88 కిడ్నాప్ కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఎస్సీ, ఎస్టీ నేరాలు.. గతేడాది కంటే ఈసారి ఎస్సీ, ఎస్టీ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 248 ఫిర్యాదులు రాగా.. అందులో 52 తప్పుడు ఫిర్యాదులను పోలీసులు నిర్ధరించి కొట్టి వేశారు. ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు 44 నమోదు కాగా.. 14 కేసులు కొట్టివేశారు. మహిళలపై పెచ్చుమీరిన నేరాలు మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. దీంతో వారి మనుగుడే ప్రశ్నార్థకంగా మారుతోంది. గడిచిన రెండేళ్ల కంటే ఈ ఏడాది మహిళలపై దాడులు అధికమయ్యాయి. గతేడాది 1,327 కేసులు నమోదుకాగా.. ఈఏడాది 1,426కు పెరిగాయి. కట్నం కోసం మూడు హత్యలు జరిగాయి. గతంతో పోల్చుకుంటే ఈ హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం వంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. వరకట్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టణం శుభపరిణామం. వేధింపులు, లైంగికదాడులు మాత్రం తగ్గగపోగా... రోజురోజుకూ పెరుగుతున్నాయి. తగ్గిన హత్యలు.. హత్య ఘటనలు గతంతో పోల్చుకుంటే కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది హత్యలు 84 జరిగాయి. హత్యాయత్నాలు గతేడాది కంటే 5 పెరిగాయి. హత్యకు కుట్రపన్నిన కేసుల సంఖ్య గత రెండేళ్ల కంటే ఎగబాకింది. ‘నిర్భయ’ వచ్చినా.. మృగాళ్ల కన్ను పసిమెగ్గలపై పడింది. చిన్నారులపై లైంగిక దాడులు, లైంగికదాడికి యత్నాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఓబాలికపై లైంగికదాడి చేసి కిరాతకంగా మట్టుబెట్టాడో దుర్మార్గుడు. 18 ఏళ్లలోపు బాలికలపై లైంగికదాడులకు సంబంధించి 17 కేసులు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మరో 17 కేసులు నమోదు చేశారు. ఇలామొత్తం 38 కేసులు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి. 18 ఏళ్లు పైబడి న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్పడినందుకు నిర్భయ చట్టం కింద 14 కేసులు నమోదయ్యాయి. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ‘నిర్భయ’ కింద మొత్తం 52 కేసులు నమోదయ్యాయి. సంచలన హత్యలు, ఘటనలు... మార్చి 1 : నల్లగొండ మండలం పానగల్ చెరువు వద్ద ముగ్గురు యువకులు దారుణహత్యకు గురయ్యారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని పీఏపల్లి మండలానికి చెందిన ఇద్దరితో పాటు హైదరాబాద్కు చెందిన ఒకర్ని వెంటాడి హతమార్చారు. ఏప్రిల్ 29 : జిల్లాకేంద్రంలోని మాన్యంచెల్కకు చె ందిన 11 ఏళ్ల బాలిక ఉస్మతున్నిసా కామాంధుడి చేతిలో బలైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి అతికిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఈ ఘటనపై జిల్లాలో ‘నిర్భయ చట్టం’ కింద కేసు నమోదైంది. ఇదేరోజు వేధింపులు భరించలేక కనగల్ మండలం తుర్కపల్లికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెలో ఎనిమిదేళ్ల బాలిక లైంగికదాడికి గురైంది. నవంబర్ 5 : నల్లగొండ మండలంలోని శేషమ్మగూడెంలో ఇద్దరు వ్యక్తుల్ని మంత్రాల నెపంతో అతిదారుణ ంగా హత్యచేశారు. నవంబర్ 6 : చిలుకూరు మండలం రామాపురం ఉన్నత పాఠశాల విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాడు కీచకంగా ప్రవర్తించాడు. అభంశుభం తెలియని వయసులో ఆమెను గర్భవతి చేసి ఆపై ఆబార్షన్ చేయించాడు. ఈ ఘటనలో ఆ హెచ్ఎంతోపాటు ఐదుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యవర్తులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. న వంబర్ 23 : సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సులోంచి 2.60 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 15 రోజులపాటు పోలీసులు కష్టపడి ఈ కేసును ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. డిసెంబర్ 17 : జిల్లాకేంద్రంలో బీటెక్ విద్యార్థిని తలారి అరుణపై ఓ ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆరు రోజులపాటు నరకం అనుభవించి మృత్యుఒడికి చేరింది. ఈ ఘటన జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెరిగిన నేరాల సంఖ్య.. జిల్లాలో ఈ ఏడాది నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాది మొత్తం 8,499 కేసులు నమోదు కాగా.. ప్రస్తుత ఏడాదిలో 9,590 కేసులు నమోదు చేశారు. ఇందులో 427 కేసులకు సంబంధించి శిక్షలు ఖరార య్యాయి. 119 కేసులను కోర్టు కొట్టివేంది. 5,465 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. వీటిపై కోర్టు తీర్పు వె ల్లడించాల్సి ఉంది. 2,66 కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయి. అంతేగాక ప్రత్యేక, స్థానిక శాంతిభద్రతల (ఎస్ఎల్ఎల్), సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ల కింద 4,848 కేసులు, ఎస్ఎల్ఎల్ కింద 122 కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు. సైబర్ నేరాల సంఖ్య పెరిగింది. గతేడాది 5 జరగగా.. ఈ ఏడాదిలో 9 నమోదయ్యాయి. రాత్రి పూట చోరీలు, సాధారణ దొంగతనాలు, దోపిడీల సంఖ్య కూడా పెరిగింది. -
బాబుకు బ్రాంకైటిస్... తగ్గడం ఎలా?
మా బాబు వయసు ఆరేళ్లు. గత మూడు నెలలుగా దగ్గుతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడూ జ్వరం, కొద్దిపాటి కళ్లె కూడా కనిపిస్తున్నాయి. పరీక్షలన్నీ చేసి డాక్టర్లు ‘బ్రాంకైటిస్’గా నిర్ధారణ చేసి మందులిచ్చారు. అయినా పెద్దగా ఫలితం కనబడటం లేదు. పూర్తిగా తగ్గాలంటే ఆయుర్వేద చికిత్స సూచింప ప్రార్థన. కె. రాధిక, సిరిసిల్ల మీరు చెప్పిన లక్షణాలను బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘పిత్తజ కాస’గా పరిగణించవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ అసాత్మ్యత (అలర్జీ) కూడా చోటు చేసుకుంటుంది. సాధారణంగా పిల్లలను ఆకర్షించే చాక్లెట్లు, నూడిల్స్, లాలీపాప్స్ ఐస్క్రీములు, కూల్డ్రింక్స్ వంటి చిరుతిళ్లను పూర్తిగా నిషేధించాలి. బయటి తిండిని మానేయాలి. ఇంట్లో వండే వంటకాలలో వాడే నూనెలు, రంగులు మొదలైనవాటిల్లో కల్తీ లేకుండా చూసుకోవాలి. బలకరమైన ఆహారంతో బాటు బాదం, జీడిపప్పు వంటి ఎండుఫలాలను తినిపించండి. పాలు, పెరుగు తగు రీతిలో సేవించాలి. ఈ కింద వివరించిన మందుల్ని ఒక నెలపాటు వాడి ఫలితాన్ని సమీక్షించండి. రస పీపరీ రస (మాత్రలు) ... ఉదయం 1, రాత్రి 1. అతిమధురం చూర్ణం రెండు గ్రాములు, ప్రవాళ పిష్ఠి ఒక చిటికెడు కలిపి తేనెతో రెండుపూటలా తినిపించండి. వాసారిష్ట (ద్రావకం) ... ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి, రెండు లేక మూడు పూటలా తాగించాలి. నా వయసు 68. శీతాకాలంలో చర్మం పొడిగా మారి దురదలు రాకుండా ఉండాలంటే ఆయుర్వేద సూచనలీయగలరు. - ఎస్. మేరీ, విశాఖపట్నం ఆయుర్వేద సూత్రాల రీత్యా ‘రూక్షత్వక’ (పొడిచర్మం)ను నివారించడానికి ఈ కింది విధానాలను పాటించండి. రోజుకి నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఆహారంలో ఆకుకూరలు, మునగకాడలు విరివిగా వాడండి. రోజూ రెండు చెంచాలు నువ్వుల పప్పు (పచ్చిది) నమిలి తినండి. ఉప్పు, కారం తగ్గించాలి. స్నానం కోసం సబ్బులేమీ వాడవద్దు. ముఖాలంకరణకు పౌడర్లు, క్రీములు వాడవద్దు. చెమటపట్టేటట్టు తేలికపాటి వ్యాయామం అవసరం. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా ప్రాణాయామం ఉపయోగకరం. స్వచ్ఛమైన నువ్వులనూనెతో శరీరమంతా అభ్యంగనం చేసుకొని, అనంతరం సున్నిపిండి లేదా శనగపిండితో నలుగుపెట్టుకొని, పిదప గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ ప్రక్రియ రోజు విడిచి రోజు చేసినా సరిపోతుంది. ముఖానికి: పాలమీగడ, శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపిన ముద్దను పూసుకొని, 20 నిమిషాల అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ‘కుమార్యాసవం, శారిబాద్యాసవం’ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకొని, సమానంగా నీళ్ల్లు కలిపి, రెండుపూటలా తాగాలి. నా వయసు 73. మలబద్దకానికి ‘త్రిఫలాచూర్ణం’ వాడవచ్చా? - సిద్ధప్ప, అనంతపురం ‘కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ’... ఈమూడింటిని విడివిడిగా చూర్ణం చేసి సమానంగా కలుపుకుంటే త్రిఫలాచూర్ణం తయారవుతుంది. దీంతో కషాయం కాచుకుని రాత్రి పడుకునేప్పుడు 30 మి.లీ. తాగండి. రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. ఈ ఔషధం గుండెకు, కంటికి, రక్తనాళాలకు, కాలేయానికి, మెదడుకు బలం కలిగించే చక్కటి రసాయనంగా ఆయుర్వేదం వర్ణించింది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
మా వాడి బరువు తగ్గడం ఎలా..?
మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 68 కిలోలు. కొంతకాలంగా వాడి బరువు 62 కిలోల నుంచి క్రమంగా పెరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగదేమోనని, బరువు ఇంకా పెరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి. - సూర్యారావు, హైదరాబాద్ ప్రస్తుతం టీనేజ్లో ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికి ముందుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. స్వీట్లు, సాఫ్ట్డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్డ్రింక్స్లోని ఫాస్ఫారిక్ ఆసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్డ్రింక్స్కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు. తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది. పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనపాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది. పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్