-
సివిల్స్లో మెరుపులు
విజయనగరం అర్బన్, ఎల్.కోట: జిల్లాకు చెందిన ఇద్దరికి సివిల్స్లో మంచి ర్యాంకులు లభించాయి. ఎల్.కోటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకుడు కూరాకుల సూర్యారావు కుమార్తె శ్రావణి 544 ర్యాంక్, బొండపల్లి మండలం కొవ్వడిపేట గ్రామానికి చెందిన లండ సాయి శంకర్ 937వ ర్యాంక్ సాధించారు. శ్రావణి ప్రస్తుతం రాజమండ్రిలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె రాజస్థాన్ బిట్స్ఫిలానిలో ఇంజినీయరింగ్ పూర్తి చేసి, గ్రూఫ్ -1లో ఉత్తమ ప్రతిభ కనబర్చి డీఎస్పీగా సెలక్టయ్యరు. డీఎస్పీగా ట్రైనింగ్ సమయంలో రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ చేతులు మీదగా నాలుగు మెడల్స్ను పొందారు. 937వ ర్యాంకర్ లండ సాయి శంకర్ ఇంటర్మీడియెట్ వరకు తెలుగుమీడియంలోనే చదివారు. ఈయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. పదేళ్లుగా ఈ ఉద్యోగం చేస్తూ నాలుగుసార్లు సివిల్స్ పరీక్షలకు వెళ్లి రెండుసార్లు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యారు. తాజా ఫలితాల్లో వచ్చిన ర్యాంక్కు ఇండియన్ రెవెన్యూ సర్వీసు (ఐఆర్ఎస్) కేటగిరిలో పోస్టు లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సాయి శంకర్ మాట్లాడుతూ ఒకసారి ఫెయిల్ అయ్యామని యువత నిరాశపడరాదన్నారు. సివిల్స్ రాయడానికి ఇచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకొనేలా సానుకూల ధోరణలో ప్రిపేరైతే విజయం సాధించవచ్చన్నారు. -
కాసులిస్తే నో కేస్!
పోలీస్ స్టేషన్కొస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే ఏ కేసైనా సెటిల్ చేసేస్తారు చెలరేగిపోతున్న కొందరు ఎస్ఐలు, సీఐలు ప్రక్షాళనకు నడుంకట్టిన ఇన్చార్జి సీపీ నలుగురిపై వేటుతో శ్రీకారం కేసులొస్తే కాసులు రాలాల్సిందే. స్టేషన్కు వస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే. ఎంత పెద్ద కేసైనా స్టేషన్లోనే సెటిల్ చేసేస్తారు. సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు ఆదేశించినా ఖాతరు చేయరు. ఆక్రమణదారులు, రౌడీ షీటర్లకు కొమ్ముకాస్తున్నారు.. ఇదీ నగర పరిధిలోని స్టేషన్లలో కొందరు ఎస్ఐలు, సీఐల తీరు. పోలీసుశాఖకు అప్రతిష్ట తెస్తున్న ఇటువంటి వారిపై చర్యలకు ఇన్చార్జి సీపీ అతుల్ సింగ్ ఉపక్రమించారు. ఇప్పటికే నలుగురిపై వేటు వేశారు. సాక్షి, విశాఖపట్నం : కొద్ది నెలల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి, మరో వ్యక్తికి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కొంత కాలానికి ఇద్దరూ రాజీ పడ్డారు. తామిచ్చి న ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటామని, కేసులు కొట్టేయమని స్టేషన్ చుట్టూ తిరి గారు. కానీ అక్కడి అధికారి దానికి అంగీకరించలేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నగర డీసీపీని కలిసి జరిగిందంతా చెప్పారు. ఫిర్యాదుదారులే కేసు వద్దంటుంటే కొట్టివేయడానికి ఆ స్టేషన్ అధికారికి ఉన్న ఇబ్బందిపై డీసీపీ ఆరా తీశారు. వెంటనే లోక్ అదాలత్ ద్వారా కేసు క్లోజ్ చేయమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోమని ఆ అధికారిని ఫోన్లో మందలించారు. ఇదే కాదు..ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇలాంటి వ్యవహారంలోనే ఏసీబీకి చిక్కారు. నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లయితే కొందరు భూ కబ్జాదారులు, రౌడీ షీటర్ల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు ఆక్రమించి, నకిలీ ధ్రువపత్రాలతో స్థల యజమానులను బెదించే వారికి కొమ్ముకాస్తూ బాధితుల నుంచి సొమ్ములు గుంజుతున్న ఉదంతాలు అక్కడ నిత్యకృత్యమైపోయాయి. కలిసొస్తున్న స్టేషన్ బెయిల్: సెక్షన్ సీఆర్పీసీ 41ఎ ప్రకారం నిందితుల్ని అరెస్ట్ చేయడానికి 48 గంటల ముందు వారికి నోటీసు ఇవ్వాలి. అదే విధంగా 7ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల ప్రకారం కేసు నమోదైతే నిందితులకు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ప్రజల ప్రాథమిక హక్కును, వారి శ్రేయస్సును కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనలను తమకు అనుకూలంగా మలుచుకుని పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. కేసు పెడతామని నిందితుడ్ని బెదిరిస్తూ, సెటిల్ చేసుకోకపోతే బెయిల్పై వెళ్లిపోతారని బాధితుల్ని భయపెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నలుగురిపై వేటుతో శ్రీకారం: అవినీతి ఆరోపణలున్న అధికారులపై వేటు వేయాలని ఇన్చార్జి సీపీ అతుల్సింగ్ నిర్ణయించుకున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు. గత నెల 30వ తేదీన రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ రమేష్బాబును, ఈ నెల 25న లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావులతో పాటు ఈ నేరంలో భాగస్వామ్యం, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలతో సీఐ జి.వి.రమణలను ఇన్చార్జి సీపీ సస్పెండ్ చేశారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన వారిపై వేటు సహజంగా జరిగే ప్రక్రియే అయినా ఆ దాడిలో పట్టుబడని సీఐను సస్పెండ్ చేయడంతో అవినీతిని ప్రోత్సహించేవారికి దండన తప్పదనే సంకేతాలను ఇచ్చారు. గత సంఘటనలు గతేడాది ప్రథమార్ధంలో పెందుర్తి సీఐ జి.రాజశేఖర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీంతో ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. నవంబర్ 27న రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ భగీరథ్ విశ్వాస్ రూ.5వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ వలకు చిక్కారు. నవంబర్ 30న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ రమేష్బాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. డిసెంబర్ 25న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ వాల్తేరు జోన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావు రూ.లక్ష డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు దొరికారు. ఇదే కేసులో వీరితో పాటు సీఐ జి.వి.రమణ సస్పెండయ్యారు. డిసెంబర్ 2న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్.రమేష్కుమార్ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఇక రోజూ పర్యవేక్షణ పోలీస్ స్టేషన్లలో అవినీతిపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవినీతికి పాల్పడుతున్నవారి గురించి ఆరా తీస్తున్నాం. ఇక మీదట డీసీపీ, ఏసీసీలు రోజూ స్టేషన్లతో మీడియో, టెలీ కాన్ఫరెన్స్లు జరుపుతారు. స్టేషన్కు వచ్చే ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఎవరి పనితీరు సరిగ్గా లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవి నీతి నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. - అతుల్సింగ్, ఇన్చార్జి సీపీ -
స్థూల‘గాయం’
సాక్షి, కర్నూలు : ప్రతి 300 మంది పౌరులకు ఒక పోలీసు కానిస్టేబుల్ ఉండాలి. ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక పోలీసు స్టేషన్ ఉండాలి. ఈ లెక్కన 40 లక్షలకు పైచిలుకు జనాభా ఉన్న మన జిల్లాలో 11 వేల మంది పోలీసులు ఉండాలి. కాని ప్రస్తుతం పనిచేస్తున్నది కేవలం 2,600 మంది సివిల్ పోలీసులు. అంటే సగటున జిల్లా జనాభాకు రక్షణ కల్పిస్తున్నది పావలా వంతు పోలీసులే. దీంతో ఒక్కో పోలీసుపై పనిభారం నానాటికీ రెట్టింపవుతోంది. ఈ పని ఒత్తిడితో పోలీసులు వ్యాయామానికి దూరమవుతున్నారు. వ్యాధులకు దగ్గరవుతున్నారు. పొట్ట పెరిగి స్థూలకాయులుగా మారుతున్నారు. నియామక సమయంలో సన్నగా కనిపించే పోలీసులు విధుల్లో చేరాక వారి శరీర ఆకృతిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ప్రతి ఉద్యోగి రోజుకు 8 గంటలు పని చేస్తారు. కానీ పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడే వారికిచ్చే మాన్యువల్లో అవసరమైతే 24 గంటలూ పనిచేయడానికి సిద్ధంగా ఉండాలనే నిబంధన ఉంటుంది. అలాంటి పరిస్థితులు అప్పుడప్పుడుంటే ఫర్వాలేదు. నిత్యం అలాగే విధులు నిర్వహించాలంటే కష్టమే. జిల్లాలో పోలీసుల పని గంటలు మిగతా వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం జిల్లా జనాభాలోని ప్రతి 1,538 మందికి ఒక్క పోలీసు చొప్పున పనిచేస్తున్నారు. పనిభారం పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని పోలీసులు వాపోతున్నారు. సర్వసాధారణం.. బీపీ.. షుగర్.. జిల్లాలో మొత్తం 2,600 మంది సివిల్ పోలీసులు పనిచేస్తుండగా.. వారిలో ఎక్కువ మంది రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) వ్యాధులతో బాధపడుతున్నారు. సమయానికి భోజనం లేకపోవడం.. నిద్రలేమి.. పని ఒత్తిడి ఉండడంతో అధికశాతం పోలీసులు ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. సెక్యూరిటీ విభాగంలో పనిచేసే మరికొందరు మూత్రపిండాలు, కండరాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఆహార పద్ధతులు పాటిస్తూ సరైన వ్యాయామం, క్రమం తప్పకుండా పరేడ్లో పాల్గొంటే శారీరక ధారుడ్యం పెరుగుతుంది. వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చు. అయితే పోలీసుశాఖలో పరేడ్లు నామ్కే వాస్తేగానే మారాయి. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన రోజుల్లో వారాంతపు సెలవులు పెట్టుకోవచ్చనే నిబంధన ఉన్నా.. అది ఎక్కడా అమలు కావడం లేదు. గతంలో ఈ అంశాన్ని నాటి డీజీపీ ప్రసాదరావు ప్రస్తావించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వారాంతపు సెలవులు అమల్లోకి తెచ్చింది. మన జిల్లాలో కూడా గతంలో ఎస్పీగా పనిచేసిన రఘురామిరెడ్డి వారాంతపు సెలవుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఎన్ని వినతులు అందజేస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. వారాంతపు సెలవుల గురించి గతంలోనే మాజీ డీజీపీ ప్రసాదరావు ప్రకటించారు. రాష్ట్ర విభజనతో అది అమలుకు నోచుకోలేదు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాంతపు సెలవు కర్నూలు జిల్లాలో ఇచ్చేలా నిర్ణయం జరిగింది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికతో కొంత ఆలస్యమైంది. కోడ్ ముగియగానే వారాంతపు సెలవులు అమలవుతాయి. - నారాయణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వారానికోసారి పరేడ్.. పోలీసు సిబ్బంది శారీరకంగా దృఢంగా ఉండేందుకు వారానికి ఒకసారి పరేడ్ నిర్వహిస్తున్నాం. దీనికి క్రమం తప్పకుండా సిబ్బంది మొత్తం హాజరుకావాల్సిందే. దీంతోపాటు యోగా, క్రీడా పోటీలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. సిబ్బంది దేహాధారుడ్యంపై దృష్టి సారించి.. వారు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు ఉన్నాయి. అధికారులకు ఇవ్వమని చెబుతున్నాం. అయితే కొన్ని చోట్ల సిబ్బంది సరిపడకపోవడం.. శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం వంటి కారణాలతో కొంత మందికి సెలవులు దొరకని పరిస్థితి ఉంటుంది. కర్నూలు నగరంలోనూ షిఫ్ట్ డ్యూటీ అమలవుతోంది. పోలీసు సిబ్బందికి సరిపడా విశ్రాంతి ఇస్తున్నాం. - ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ -
రెండుసార్లు విఫలమైనా పట్టువదల్లేదు..
ఇంటర్వ్యూ సంకల్ప బలంతోనే ఐఏఎస్ సాధించా వైద్యశాఖలో ఉద్యోగం చేస్తూ, కోచింగ్ లేకుండా లక్ష్యానికి చేరుకున్నా సమాజానికి సేవ చేయాలనే తలంపే ముందుకు నడిపింది మా నాన్న బలరామయ్యే స్ఫూర్తి ట్రైనీ కలెక్టర్ గుమళ్ల సృజన ప్రశ్న : ఐఏఎస్కు ఎలా సన్నద్ధమయ్యారు...? జవాబు : నా చదవంతా హైదరాబాదులోనే కొనసాగింది. బీఏ సైకాలజీ డిగ్రీ హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ, పీహెచ్డీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పూర్తి చేశాను. ఐఏఎస్ అధికారి కావాలనే సంకల్పంతో పట్టుదలతో చదివాను. పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్టులను ఎంచుకుని సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ఎంత సబ్జెక్టు ఉంది, ఎన్ని గంటలు చదవాలి అన్న అంశాలను ముందస్తుగానే ప్రణాళిక రూపొందించుకుని రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు చదివాను. ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. ప్రశ్న : ఐఏఎస్ అధికారే ఎందుకు కావాలని అనుకున్నారు? జవాబు : మా నాన్న బలరామయ్య ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఐఏఎస్ అధికారికి ఎన్ని అధికారాలు ఉంటాయో, ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ఎంత అవకాశం ఉంటుందో ఆయన పనిచేసినప్పుడే గమనించాను. ఆయన స్ఫూర్తితో నేను కూడా ఐఏఎస్ అధికారి కావాలనుకున్నా. ఆ సంకల్ప బలం నన్ను ముందుకు నడిపింది. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్ రాయడంతో తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యా. ఓ సంవత్సరం సివిల్స్ రాయకుండా గ్రూప్-1 పరీక్ష రాసి వైద్యశాఖలో ఉద్యోగం సాధించా. ఆ ఉద్యోగం చేస్తూనే ఆఖరి ప్రయత్నంగా 2013లో సివిల్స్రాసి 44వ ర్యాంకు సాధించా. ప్రశ్న : రాజకీయాలపై మా అభిప్రాయం? జవాబు : మా అమ్మ సుగుణశీల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం పూడి గ్రామ సర్పంచిగా ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అనేక మార్గాలున్నాయి. రాజకీయాల్లోకి వెళితే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలనే పరీక్షలను ఎదుర్కోవాలి. అదే ఐఏఎస్ అధికారిగా ఏంపికైతే ప్రజాసేవ చేయడానికి 30 సంవత్సరాల సమయం ఉంటుంది. ప్రజాసమస్యలను అర్థం చేసుకుని నూతన పథకాలను ప్రవేశపెడితే దీర్ఘకాలంపాటు ప్రజలకు ఉపయోగ పడతాయనేది నా నమ్మకం. ప్రశ్న : ఇంటర్వ్యూ ఎలా సాగింది..? జవాబు : ఇంటర్వ్యూ కమిటీకి పురుషోత్తమ్ అగర్వాల్ నాయకత్వం వహించారు. కమిటీ సభ్యులు నన్ను ఇంటర్వూ చేసే సమయంలో తెలంగాణ అంశంతోపాటు వరకట్న వేధింపులు, త్యాగరాజస్వామి, అన్నమయ్య తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ సరైన సమాధానాలు చెప్పడంతో 2013 బ్యాచ్లో ఐఏఎస్కు ఎంపికయ్యాను. ప్రశ్న : కుటుంబ నేపథ్యం.? జవాబు : భర్త రవితేజ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. సోదరుడు చార్విక్ ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్నారు. -
విస్తృత అవగాహనతో ముందుకు...
సివిల్స్ మహాయజ్ఞంలో మొదటి అంకమైన ప్రిలిమ్స్ ఈ ఏడాది ఆగస్టులో యూపీఎస్సీ నిర్వహించనుంది. విజయానికి తొలి అడుగైన ఈ పరీక్షలో నెగ్గి మెయిన్స్ ముంగిట నిలవాలని అభ్యర్థులు పరితపిస్తున్నారు. పరీక్ష రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుబాటులో ఉన్న కొద్దిరోజులను సిలబస్ పునశ్చరణకు సద్వినియోగపరుచుకుంటున్నారు. అయితే ప్రిలిమినరీ పేపర్లో ప్రధాన సబ్జెక్ట్, కొంచెం క్లిష్టమైన దిగా భావించే ఎకానమీ అంశాన్ని ఏ విధంగా చదవాలి? ఏ అంశాలపై ఎక్కువ దృష్టిపెడితే పరీక్షను పభావవంతంగా రాయవచ్చనే విషయాలపై ప్రత్యేకం. సివిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించే సబ్జెక్ట్లలో ఎకానమీ ఒకటి.. ప్రిలిమ్స్తోపాటు మెయిన్స్లో కూడా ఎకానమీ ప్రధాన భూమిక పోషిస్తుంది.. కాబట్టి ఈ సబ్జెక్ట్లో సాధించే మార్కులు చివరి అంకంగా నిలిచే ఇంటర్వ్యూకు అర్హత సాధించడంలో కీలకంగా ఉంటాయి. ప్రాధాన్యత: ప్రిలిమ్స్లో భాగమైన జనరల్ స్టడీస్ పేపర్లోని ఎకానమీ సబ్జెక్ట్ ప్రాధాన్యత మెయిన్సలోనూ కనిపిస్తుంది. గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే... ప్రిలిమ్స్లో ఎకానమీ సంబంధిత అంశాలపై సగటున 15-20 ప్రశ్నల వరకు అడగడాన్ని గమనించవచ్చు. ప్రిలిమ్స్కు సన్నద్ధమయ్యే విద్యార్థులు మెయిన్సలో జనరల్ స్టడీస్లో భాగంగా ఉన్న ఎకానమీ సిలబస్ను పరిశీలిస్తూ ఆ దిశగా అధ్యయనాన్ని కొనసాగించడం ఉత్తమం. గత ప్రశ్న పత్రాలను గమనిస్తే... ప్రశ్నలు అధికంగా ఉపాధి, ప్రణాళికలు, అభివృద్ధి, ద్రవ్యం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం, వ్యవసాయం, అవస్థాపనా సౌకర్యాలు, ప్రభుత్వ విత్తం, జనాభా, పేదరికం లాంటి అంశాల నుంచి ఎక్కువగా ఇస్తున్నారు. కాన్సెప్ట్ల ఆధారంగా: 2013 ప్రిలిమ్స్లో ఎకానమీకి సంబంధించి అడిగిన ప్రశ్నలన్నీ కాన్సెప్ట్స్ ఆధారంగా ఉన్నవే. దీన్ని బట్టి చూస్తే ప్రిలిమ్స్కు హాజరయ్యే విద్యార్థులు సంబంధిత అంశాల్లోని ప్రాథమిక భావనల (కాన్సెప్ట్స్) పట్ల విస్తృత అవగాహన ఏర్పరచుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ప్రాథమిక భావనలపై అవగాహన కోసం ఎన్సీఈఆర్టీ 6వ తరగతి నుంచి 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మరో కీలక అంశం.. పేపర్-1కు సంబంధించి ప్రశ్నలను కాన్సెప్ట్యువల్ బేస్డ్గా అడుగుతున్నారు. కాబట్టి ఒక అంశాన్ని చదివేటప్పుడు దాని నేపథ్యం నుంచి తాజా పరిణామాల వరకు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ చదవాలి. అధ్యయనం చేయాల్సినవి: ప్రిలిమ్స్కు హాజరయ్యే విద్యార్థులు ఎకానమీ అధ్యయనంలో భాగంగా వివిధ కమిటీలు- నివేదికలు, వ్యవసాయ రంగం, పారిశ్రామికరంగం, సేవారంగం, బ్యాంకింగ్, పన్నుల వ్యవస్థ, జాతీయాదాయం, యుఎన్డీపీ మానవాభివృద్ధి నివేదిక, 12వ ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం-బ్యాంకింగ్, పేదరికం, సాంఘిక భద్రత, సుస్థిర అభివృద్ధి, ద్రవ్యోల్బణం వంటి అంశాలను అధ్యయనం చేయాలి. ఈ అంశాలపై విద్యార్థులకు ఉన్న అవగాహన మెయిన్స్లోనూ ఉపకరించే అవకాశం ఉంది. విదేశీ వాణిజ్యం, ప్రణాళికలు, పన్నుల వ్యవస్థ, పేదరికం, సుస్థిర వృద్ధి లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు మెయిన్స్లోనూ తరచుగా ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అధ్యయనంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: తరుచుగా సబ్జెక్ట్ పట్ల విసృ్తత అవగాహన పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి.పరీక్ష ప్రక్రియకు అనుగుణంగా సబ్జెక్ట్ను అధ్యయనం చేయాలి.ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి. మోడల్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్నంగా పరిశీలించాలి. తద్వారా గత కొంత కాలంగా అడుగుతున్న ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది. ప్రతి అంశాన్ని పరిశీలించేటప్పుడు విమర్శనాత్మక విశ్లేషణను పెంపొందించుకోవడం వల్ల ప్రిపరేషన్ ప్రభావవంతంగా ఉంటుంది.ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు అభ్యర్థి తన నిష్పాదన (పర్ఫార్మెన్స)ను ఎప్పటికప్పుడూ సమీక్షించుకోవాలి. ఈ దశలో విజయం లేదా అపజయం లాంటి విషయాల గురించి ఆలోచన తగ్గించుకోవాలి.బహుళైచ్ఛిక ప్రశ్న (ఆబ్జెక్టివ్ క్వశ్చన్)లలో ఒకే విధమైన ఐచ్ఛికాలు (ఆప్షన్స) ఉండే ప్రశ్నల పట్ల అవగాహన పెంచుకోవాలి.ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రతి ఐచ్ఛికాన్ని పూర్తిగా చదవడం నేర్చుకోవాలి. మెయిన్స్, ప్రిలిమినరీ రెండింటికీ: కొన్ని అంశాలు ప్రిలిమ్స్తోపాటు మెయిన్స్లోనూ ఉపకరిస్తాయి. వీటిపై అవగాహన పెంచుకోవడంతో ప్రిలిమ్స్, మెయిన్స్కు ఏకకాలంలో ప్రిపరేషన్ సాగించవచ్చు. ప్రణాళిక ఇలా: ప్రణాళిక వృద్ధి-ఆర్థికాభివృద్ధి అనే అంశంపై అధ్యయనం చేసే క్రమంలో ముఖ్య పదకోశాలైన ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ప్రణాళిక సంఘం, మల్టీ లెవల్ ప్లానింగ్, కేంద్రీకృత ప్రణాళిక లాంటి అంశాలను అవగాహన చేసుకుంటూ నోట్స్ రూపొందించుకోవాలి. కాన్సెప్ట్లతో పాటు ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగం, ప్రణాళిక లక్ష్యాలు, వికేంద్రీకృత ప్రణాళిక ప్రాధాన్యత, ఆర్థిక సంస్కరణలు లాంటి అంశాలపై అధ్యయనం అవసరం. మెయిన్స్లోను జనరల్ స్టడీస్-3లో ఈ అంశాలను ఎకానమీ సిలబస్లో భాగంగా ఇవ్వడం జరిగింది. పన్ను వ్యవస్థపై పట్టు: భారత్లో పన్నుల వ్యవస్థలో భాగంగా వివిధ పదకోశాలైన రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన రాబడి, మూల ధన వ్యయం, ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు లాంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రామాణిక పుస్తకాల నుంచి ఆర్థిక సంఘం, విలువ ఆధారిత పన్ను (వాల్యూ యాడెడ్ ట్యాక్స్-వ్యాట్), వస్తువులు, సేవలపై పన్ను, ప్రభుత్వ రుణం- ఆర్థిక వ్యవస్థపై ప్రభావం లాంటి టాపిక్స్ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మెయిన్స్ జనరల్ స్టడీస్లో ఎకానమీలో భాగంగా పన్నుల వ్యవస్థను పొందుపరిచారు. మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో జనరల్ బడ్జెటింగ్ పేరుతో ఈ సిలబస్ను పొందుపరిచారు. సమగ్ర నోట్స్: పేదరికం, సాంఘిక భద్రత, సుస్థిర వృద్ధికి సంబంధించిన అంశాలపై అవగాహన ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో సమ్మిళిత వృద్ధి, మానవాభివృద్ధి, పేదరికం-సమ్మిళిత వృద్ధి, ఉపాధి, సాంఘిక భద్రత, గ్రామీణ అవ స్థాపనా సౌకర్యాలు, విద్య, ఆరోగ్యం, మహిళ, శిశుసంక్షేమ అభివృద్ధి, అసమానతలు లాంటి అంశాలకు సంబంధించి సమగ్రమైన నోట్స్ రూపొందించుకోవాలి. మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశాలను సిలబస్గా పొందుపరచడం జరిగింది. జనరల్ స్టడీస్-2లోనూ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సిలబస్లో భాగంగా పై అంశాల పట్ల అవగాహన అవసరం. వ్యవసాయం: వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రిలిమ్స్లో పలు అంశాలపై అధ్యయనం మెయిన్స్లోనూ ఉపకరిస్తుంది. మెయిన్స్లో జనరల్ స్టడీస్-2, జనరల్ స్టడీస్-3లో ఈ రంగానికి సంబంధించిన వివిధ అంశాలను సిలబస్లో పొందుపరిచారు. వ్యవసాయ రంగం అధ్యయనంలో భాగంగా భూ సంస్కరణలు, హరితవిప్లవం, మద్దతుధరలు, ఆహారభద్రత, ఆహార రాయితీలు, ఈ-చౌపల్, జాతీయ ఆహార భద్రతామిషన్, జాతీయ వ్యవసాయ విధానం, వ్యవసాయ బీమా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ), వ్యవసాయ రాయితీలకు సంబంధించి సమగ్ర నోట్స్ సిద్ధం చేసుకోవాలి. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పరిశ్రమలు: పరిశ్రమలు, అవస్థాపనా సౌకర్యాలకు సంబంధించి పారిశ్రామిక తీర్మానాలు, పెట్టుబడుల ఉపసంహరణ, నూతన తయారీ విధానం, ఎలక్ట్రానిక్పై నూతన విధానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, భారత నిర్మాణరంగం (ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి విషయ పరిజ్ఞానం అవసరం. ఈ అంశాలతో కూడిన సిలబస్ను మెయిన్స్ జనరల్ స్టడీస్-3లోనూ గమనించవచ్చు. విదేశీ వాణిజ్యం - అవగాహన: ప్రిలిమ్స్లో భాగంగా విదేశీ వాణిజ్యం పట్ల అవగాహన అవసరం. భారత్ ఎగుమతులు, దిగుమతులు, చెల్లింపుల శేషం, వాణిజ్య విధానం, వర్తక నిబంధనలు, స్థిర వినిమయ రేటు, అస్థిర వినిమయ రేటు, కరెంట్ అకౌంట్ లోటు, రూపాయి మూల్యహీనీకరణ లాంటి అంశాలపై అవగాహన అవసరం. మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో ప్రపంచీకరణ అంశాన్ని పొందుపరిచారు. వివిధ పదకోశాలపై అవగాహన మెయిన్లోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిలిమ్స్లో భాగంగా ద్రవ్యం, బ్యాంకింగ్కు సంబంధించిన అంశాలను పరిశీలించాలి. ద్రవ్యమార్కెట్, ఎన్.ఎ. ఎఫ్.సిలు, కేంద్ర బ్యాంక్ పరపతి విధానం, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి), బ్యాంకింగ్ సంస్కరణలు, బీమా సంస్కరణలు, సి.ఎ.ఆర్, బేస్రేటు, ఎం.ఎస్. ఎఫ్, మ్యూచువల్ ఫండ్స్లాంటి అంశాలను పరిశీలించాలి. ఇవి చదివితే మేలు కరెంట్ అఫైర్సలో భాగంగా: ప్రిపరేషన్లో కేవలం సిలబస్కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను సమకాలీన సంఘటనల (కరెంట్ అఫైర్స్)తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. తద్వారా ప్రిపరేషన్ అర్థవంతంగా ఉంటుంది. సమకాలీన అంశాల్లో భాగంగా పరిశీలించాల్సినవి.. కార్పొరేట్ గవర్నెన్సపై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు ఇటీవల టోకు ధరల సూచీ (గ్కిఐ), వినియోగదారుని ధరల సూచీ (ఇ్కఐ) 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వృద్ధి రేట్లు, ద్రవ్య లోటు సామాజిక అభివృద్ధి సూచిక (సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్) ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ -2014 కేంద్ర బ్యాంకు కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్ల మంజూరు కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానంలో భాగంగా విధాన రేట్లలో మార్పు బేసల్ -3 (ఆ్చట్ఛఐఐఐ ) నియమాలు పీఎఫ్నకు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఎన్నికల వ్యయం కరెంట్ అకౌంట్ లోటు రూపాయి మూల్యహీనీకరణ రిఫరెన్స్ బుక్స్ జనరల్ స్టడీస్: ఎస్సీఈఆర్టీ 6నుంచి 12వ తరగతి పుస్తకాలు ఇండియా ఇయర్బుక్ ఇండియా ఎకనమిక్ సర్వే ఇండియన్ ఎకానమీ-ఎస్కే మిశ్రా అండ్ పూరి ఇండియన్ ఎకానమీ- ఉమా కపిల ఇండియాస్ ఎకానమీ ఇన్ ద 21 సెంచరీ - రాజ్ కపిల అండ్ ఉమా కపిల -
ప్రముఖ ఎన్ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు
మరికొద్ది రోజుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కానున్నాయి. జూలై 1 నుంచి జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 30 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు; కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం); ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లు, ఇతర సంస్థల్లో వివిధ కోర్సుల్లో దాదాపు 40,000 సీట్లున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్ఐటీల్లో .. బీటెక్లో టాప్ బ్రాంచ్ల్లో గతేడాది క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుందాం.. EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రోజుకో కొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మార్కెట్లో వచ్చిపడుతున్న తరుణంలో రెండు రకాల అవకాశాల వేదికలను (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్) అందుకునేందుకు దోహదం చేస్తుంది ఈఈఈ. స్థూలంగా డిజైన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డివెసైస్ అండ్ సర్క్యూట్స్, అనాలసిస్ అండ్ ఆపరేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ పవర్ సిస్టమ్ అనాలసిస్, యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కోర్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణనిస్తారు. అవకాశాలు: మనదేశంలో విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను భారీ స్థాయిలో చేపడుతున్నాయి. వీటితోపాటు హైడ్రో ఎలక్ట్రిసిటీ రంగం, నేచురల్ గ్యాస్ పాంట్లు, పవర్ కార్పొరేషన్లు, అణు విద్యుత్ కర్మాగారాలు, రైల్వేలు, విద్యుత్ ఉపకరణ ఉత్పత్తుల సంస్థలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఈఈఈ ఉత్తీర్ణులకు అపార అవకాశాలు ఉన్నాయి. గతేడాది కటాఫ్స్: కోర్ బ్రాంచ్ల్లో ఒకటి కావడం.. భవిష్యత్ అవకాశాల నేపథ్యంలో ఈ కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఉంది. గతేడాది ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరిలో సీటు లభించిన చివరి ర్యాంకు 3601. అదర్స్టేట్ కోటాలో కూడా చాలా తక్కువ ర్యాంకుకే (4131) సీట్లు భర్తీ అవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా చేరే ఎన్ఐటీ తిరుచిరాపల్లి (తమిళనాడు), సూరత్కల్ (కర్ణాటక), కాలికట్ (కేరళ)లలో కూడా వరుసగా సీట్లు లభించిన చివరి ర్యాంకులు.. 3067, 3723, 6460. వీటిని బట్టి చూస్తేనే తెలుస్తోంది ఈఈఈకి ఎంత డిమాండ్ ఉందో! ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే బ్రాంచ్ ఈసీఈ. పరిధి విస్తృతంగా ఉండే ఈసీఈ ద్వారా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, టెలికాం, సెమీకండక్టర్ డిజైన్ తదితర రంగాల గురించిన పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు. ఈసీఈలో అనలాగ్ ట్రాన్స్మిషన్, డిజిటల్ ట్రాన్స్మిషన్, వాయిస్ అండ్ డాటా, బేసిక్ ఎలక్ట్రానిక్స్, సాలిడ్ స్టేట్ డివెసైస్, మైక్రో ప్రాసెసర్స్, డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఆంటెన్నా అండ్ వేవ్ ప్రొగ్రెషన్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్స్, ప్రసార ఉపకరణాలైన ట్రాన్స్మీటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రోవేవ్స్, ఫైబర్ వంటి వాటి తయారీలో ఈసీఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోనూ, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతం. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరొచ్చు. టీచింగ్ రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారతీయ రైల్వేలు, అణు విద్యుత్ కంపెనీలు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్మెంట్స్.. మొదలైనవాటిలో ఉద్యోగాలు పొందొచ్చు. గతేడాది ర్యాంకుల విశ్లేషణ: కోర్ బ్రాంచ్ల్లో ఒకటి కావడం, ఉన్నత విద్య, ఉద్యోగావ కాశాల విషయంలో ఎలాంటి ఢోకా లేకపోవడంతో ప్రధాన ర్యాంకర్లలో ఎక్కువ శాతం ఈసీఈనే ఎంచుకుంటున్నారు. గతేడాది సీట్లు లభించిన చివరి ర్యాంకులను గమనిస్తే ఈ విషయం అవగతమవుతోంది. ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీ విద్యార్థికి సీటు లభించిన చివరి ర్యాంకు.. 2543. కాగా ఇతర రాష్ట్ర కోటాలో సీటు కూడా 3364కే భర్తీ అయింది. ఇక దక్షిణ భారత ఎన్ఐటీలు.. తిరుచిరాపల్లిలో 2076, సూరత్కల్లో 2456, కాలికట్లో 4966 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. CIVILసివిల్ ఇంజనీరింగ్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాయి. మనదేశంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా, మానవ అవసరాలకనుగుణంగా ఇళ్లు, రహదారులు, మురుగునీటి కాలువలు, భూ అంతర్గత రహదారులు , ఫ్లై ఓవర్లు నిర్మాణంతోపాటు నదులపై ప్రాజెక్టులు చేపడుతున్నారు. భారీ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నింటి నిర్మాణంలో తప్పనిసరిగా సివిల్ ఇంజనీర్ల సేవలు అవసరం. ఈ క్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు హాట్ ఫేవరెట్ బ్రాంచ్గా నిలుస్తోంది. ఉద్యోగావకాశాలు: సివిల్ ఇంజనీర్లకు అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, వివిధ పరిశోధన సంస్థలు, భారతీయ రైల్వేలు, జాతీయ రహదారుల విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం, ఎల్ అండ్ టీ, డీఎల్ఎఫ్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇవే కాకుండా ప్రతి ఏటా యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో పాగా వేయొచ్చు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ-వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 4954 వరకు, అదర్ స్టేట్ కోటాలో 7483 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు భర్తీ అయిన చివరి ర్యాంకులు 6814, 7411, 11206. MECHANICALమెకానికల్ ఇంజనీరింగ్ ఒక ప్రొడక్ట్ డిజైన్లో, తయారీలో మెకానికల్ ఇంజనీర్లది కీలక పాత్ర. ఇది కేవలం యంత్ర పరికరాలకే కాకుండా.. ఎయిర్ కండీషన్లు, గ్యాస్ టర్బైన్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాలకు విస్తరించింది. ప్రొడక్ట్స్, కాంపొనెంట్స్, సిస్టమ్స్.. ఇలా అనేక యంత్ర పరికరాల తయారీలో ప్రతి దశలోనూ మెకానికల్ ఇంజనీర్ల ప్రతిభ ఎంతో అవసరం. మెకానికల్ ఇంజినీరింగ్ పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎయిరోప్లేన్ నుంచి ఎయిర్ కండీషనర్ దాకా.. రాకెట్ నుంచి రోబోల తయారీ వరకూ.. స్టీలు పరిశ్రమలలో, కార్ల డిజైన్లో.. ఇలా అనేక విభాగాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ పాత్ర కీలకం..! వచ్చే 5-10 ఏళ్లలో భారత్లో ఆటోమొబైల్స్, పవర్, ఏరోస్పేస్ పరిశ్రమ గణనీయ వృద్ధిని నమోదు చేసుకోనుంది. గెయిల్, ఎన్టీపీసీ, డీఆర్డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హోండా, తదితర సంస్థల్లో ఉపాధికి కొదవ లేదు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో సీటు లభించిన చివరి ర్యాంకు 3780 కాగా.. అదర్ స్టేట్ కోటాలో చివరి ర్యాంకు 3530. ఇక ఎన్ఐటీ - తిరుచిరాపల్లి, ఎన్ఐటీ - సూరత్కల్, ఎన్ఐటీ - కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 2818, 3178, 6203. CHEMICAL కెమికల్ ఇంజనీరింగ్ పరిశ్రమల విస్తరణ శరవేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కెమికల్ ఇంజనీర్ల అవసరం బాగా పెరుగుతోంది. మరోవైపు ముడివనరుల కొరత పెరుగుదలతో సహజ వనరుల స్థానంలో సింథటిక్ వనరుల సృష్టికి కెమికల్ ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంది. కెమికల్ ఇంజనీర్గా ఒక పరిశ్రమలో అనేక క్లిష్టతరమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత పరిశ్రమకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి, డిజైన్, అమలు, నిర్వహణ పనులు కెమికల్ ఇంజనీర్ విధిలో భాగాలే. నిజానికి కెమికల్ ఇంజనీరు ఒక పరిశ్రమలో అనేక ఇంజనీరింగ్ శాఖలను.. అంటే కెమిస్ట్, ఇండస్ట్రియల్ ఇంజనీర్, మెటీరియల్స్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల సమ్మిళిత పాత్రను నిర్వహించాలి. ఉద్యోగావకాశాలు: ఉత్పాదక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. పెట్రోలియం, పెట్రోకెమికల్స్ నుంచి ఆహార పరిశ్రమల వరకు కెమికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. మెటీరియల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్, పవర్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, లేబొరేటరీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఎరువులు-రసాయనాల కర్మాగారాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. గతేడాది కటాఫ్ ర్యాంకులు: కెమికల్ ఇంజనీరింగ్లో గతేడాది ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 8061 వరకు, ఇతర రాష్ట్ర కోటాలో 10,500 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్న ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 8174, 8369, 14,463. CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. దైనందిన వ్యవహారాల నుంచి వ్యాపార అవసరాల వరకు మానవ జీవితంలో కంప్యూటర్ పెనవేసుకుపోయింది. ఏ స్థాయిలో అంటే ఆన్లైన్లోనే బస్, రైలు, విమాన, సినిమా టికెట్ల బుకింగ్ నుంచి ఆన్లైన్ చాటింగ్ వరకు పెరిగిపోయింది. ఇక కంపెనీలు, పరిశ్రమల అవసరాలు చెప్పాల్సిన పనే లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో అవకాశాలు విస్తృతమయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్స్ డిజైన్, నిర్మాణం, నిర్వహణ కంప్యూటర్ ఇంజనీర్ల పని. డెస్క్టాప్, ల్యాప్టాప్ కంప్యూటర్లు, సర్వర్లతోపాటు మొబైల్ ఫోన్లలో వినియోగించే వివిధ అప్లికేషన్స్ రూపకల్పన, వివిధ పరిశ్రమల్లో ఉపయోగించే అప్లికేషన్స్, ఇంటిగ్రేటెడ్ మైక్రోచిప్స్ను కంప్యూటర్ ఇంజనీర్లు రూపొందిస్తారు. కంప్యూటర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్తోపాటు హార్డ్వేర్ విభాగాల్లోనూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జాబ్ ప్రొఫైల్స్: టెక్నికల్ రైటర్, సాఫ్ట్వేర్ డిజైనర్, మల్టీమీడియా ప్రోగ్రామర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, సిస్టమ్స్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, గేమ్ డిజైనర్, కంప్యూటర్ ఇంజనీర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, డేటా నెట్వర్క్ డిజైనర్, సెక్యూరిటీ అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్సైట్ డెవలపర్/డిజైనర్. గతేడాది కటాఫ్ ర్యాంకుల విశ్లేషణ: అన్ని కోర్ బ్రాంచ్ల కంటే సీఎస్ఈని విద్యార్థుల ఫేవరెట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. ఇందుకు గతేడాది కటాఫ్ ర్యాంకులే నిదర్శనం. గతేడాది ఎన్ఐటీ- వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో కేవలం 2411, అదర్ స్టేట్ కోటాలో 1921 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. మిగిలిన ప్రధాన ఎన్ఐటీల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్ఐటీ-తిరుచిరాపల్లిలో 1344 ర్యాంకు వరకు, ఎన్ఐటీ-సూరత్కల్లో 1785 ర్యాంకు వరకు, ఎన్ఐటీ- కాలికట్లో 4552 వరకు సీట్లు లభించాయి. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్: జూలై 1 నుంచి జూలై 9 వరకు ఛాయిస్ లాకింగ్: జూలై 6 నుంచి జూలై 9 వరకు మొదటి రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 11 ఫీజు చెల్లింపు: జూలై 11 నుంచి జూలై 14 వరకు రెండో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 16 ఫీజు చెల్లింపు: జూలై 16 నుంచి జూలై 19 వరకు మూడో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 21 ఫీజు చెల్లింపు: జూలై 21 నుంచి జూలై 23 వరకు సీటు సరెండర్ (1, 2, 3 రౌండల్లో లభించిన సీటు నచ్చకపోతే): జూలై 21 నుంచి జూలై 23 వరకు మొదటి మూడు రౌండ్లలో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్టింగ్: జూలై 21 నుంచి జూలై 24 వరకు నాలుగో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 26 నాలుగో రౌండ్లో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లో రిపోర్టింగ్: జూలై 26 నుంచి జూలై 29 ఇంటర్నల్ స్లైడింగ్: జూలై 31 స్పాట్ రౌండ్ (జీఎఫ్టీఐ, ఎస్ఎఫ్టీఐ) ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్, ఆన్లైన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ఛాయిస్ లాకింగ్: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు స్పాట్ రౌండ్ సీట్ ఎలాట్మెంట్: ఆగస్టు 4 కౌన్సెలింగ్ ముగింపు: ఆగస్టు 7 వెబ్సైట్: www.ccab.nic.in జేఈఈ మెయిన్ ర్యాంకుతో ప్రవేశం కల్పించే ఎన్ఐటీలు 1. ఎన్ఐటీ- అగర్తలా 2. మోతీలాల్ నెహ్రూ ఎన్ఐటీ - అలహాబాద్ 3. ఎన్ఐటీ - అరుణాచల్ ప్రదేశ్ 4. మౌలానా ఆజాద్ ఎన్ఐటీ - భోపాల్ 5. ఎన్ఐటీ - కాలికట్ 6. ఎన్ఐటీ - ఢిల్లీ 7. ఎన్ఐటీ - దుర్గాపూర్ 8. ఎన్ఐటీ - గోవా 9. ఎన్ఐటీ - హమీర్పూర్ 10. మాలవీయ ఎన్ఐటీ - జైపూర్ 11. బీఆర్ అంబేద్కర్ ఎన్ఐటీ - జలంధర్ 12. ఎన్ఐటీ - జంషెడ్పూర్ 13. ఎన్ఐటీ - కురుక్షేత్ర 14. ఎన్ఐటీ - మణిపూర్ 15. ఎన్ఐటీ - మేఘాలయా 16. ఎన్ఐటీ- మిజోరాం 17. ఎన్ఐటీ - నాగాలాండ్ 18. విశ్వేశ్వరాయ ఎన్ఐటీ - నాగ్పూర్ 19. ఎన్ఐటీ - పాట్నా 20. ఎన్ఐటీ - పుదుచ్చేరి 21. ఎన్ఐటీ - రాయ్పూర్ 22. ఎన్ఐటీ - రూర్కెలా 23. ఎన్ఐటీ - సిక్కిం 24. ఎన్ఐటీ - సిల్చార్ 25. ఎన్ఐటీ - శ్రీనగర్ 26. సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటీ - సూరత్ 27. ఎన్ఐటీ - సూరత్కల్ 28. ఎన్ఐటీ - తిరుచిరాపల్లి 29. ఎన్ఐటీ - ఉత్తరాఖండ్ 30. ఎన్ఐటీ - వరంగల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ, ఐఐఐటీఎం అండ్ ఐఐఐటీడీఎం)లు 1.అటల్ బిహారి వాజ్పాయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ - గ్వాలియర్ 2.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం 3.రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అమేథి 4.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - గువహటి 5.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అలహాబాద్ 6.పండిట్ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - జబల్పూర్ 7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - కోటా, రాజస్థాన్ 8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - శ్రీ సిటీ, సత్యవేడు, ఆంధ్రప్రదేశ్ 9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - వడోదరా 10. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉనా, హిమాచల్ప్రదేశ్ 11. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కల్యాణి, పశ్చిమ బెంగాల్ 12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - త్రిపుర 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోనేపట్, హర్యానా -
సివిల్స్లో మెరిసిన మాజీ ఎమ్మెల్యే మనువడు
నంద్యాల టౌన్, న్యూస్లైన్: నంద్యాల మాజీ ఎమ్మెల్యే, దివంగత నబీ సాహెబ్ మనువడు ముషఫ్ ్రఅలి ఫారుకి సివిల్స్లో 80వ ర్యాంకును సాధించారు. దీంతో నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే నబీ సాహెబ్ ఇంట్లో గురువారం బంధువులు సంబరాలను చేసుకున్నారు. నబీ సాహెబ్ కుమార్తె రహ్మతున్నిసా కుమారుడు ముషఫ్ ్రఅలి. ఈయన తండ్రి ముర్తుజ ఫారుకి హైదరాబాద్లోని ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ హోదాలో పని చేస్తున్నారు. ముషఫ్ ్రఅలి ఫారుకి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది. టెన్త్ వరకు హైదరాబాద్ హైస్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కాలేజిలో, ఇంజినీరింగ్ బంజారా హిల్స్లోని ఎంజె.కాలేజిలో చదివారు. తర్వాత ఐఐటీలో సీటు సాధించి చెన్నైలో చదివారు. తర్వాత బెంగుళూరులోని ఇంటెల్ కంపెనీలో కంప్యూటర్ చీఫ్ డిజైనర్గా పని చేశారు. ఏడాది తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. దాదాపు ఏడు నెలలు కష్టపడి చదివారు. దీంతో 80వ ర్యాంకును సాధించారు. ఆత్మవిశ్వాసం, ఖచ్చితమైన లక్ష్యం, నిరంతర శ్రమతో తాను సివిల్స్లో ర్యాంకు సాధించానని చెప్పారు. రోజుకు 8 గంటలు చదివేవాడినని, తల్లిదండ్రులు, స్నేహితులు ప్రోత్సహించారని చెప్పారు. ఐఏఎస్ చదివి పేద బడుగు, బలహీన వర్గాల వారికి చేయూతనివ్వాలనేది లక్ష్యమని తెలిపారు. -
కొత్త పుస్తకాలు
న్యూ రిలీజ్ పవర్ ఆఫ్ ఎ కామన్ మేన్ ప్రపంచంలోని నటులందరిలోనూ షారూక్ఖాన్ అధిక సంపన్నుడని ఈ మధ్యే ఎవరో తేల్చారు. హాలీవుడ్వాళ్లు కూడా మనవాడి వెనుక నిలబడి ఎక్కడ వెనుకబడ్డామా అని లెక్కలేసుకుంటున్నారట. ఆ మాట నిజమో కాదోగాని భారత ఉపఖండంలో ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా షారూక్ఖాన్ మూట గట్టుకున్న అభిమానులు తక్కువేం కాదు. చాలామంది ఇంతటితో ఆగిపోతారు. అయితే షారూక్ వాళ్లందరినీ అభిమానులుగా కాక వినియోగదారులుగా కూడా చూశాడు. అందుకే తనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారి చాలా ప్రాడక్ట్స్కు ప్రమోషన్ ఇచ్చాడు. ఇవాళ షారూక్ మైనస్ మార్కెట్ను ఊహించడం కష్టం అంటారు మార్కెట్ రంగ నిపుణులు. పుస్తకాలు రాసేవాళ్లు కూడా మార్కెట్నే దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఇదంతా గమనించిన కొరల్ దాస్గుప్తా అనే రచయిత్రి షారూక్ మీద తాజాగా ‘పవర్ ఆఫ్ ఎ కామన్ మేన్’ అనే పుస్తకాన్ని వెలువరించింది. ఇది ఇటీవల ‘చెన్నై ఎక్స్ప్రెస్’లో షారూక్ వాడిన డైలాగ్. షారూక్ని కేవలం నటుడిగా కాకుండా అతడి వెనుక ఉన్న వ్యాపార వ్యూహాలను ఆమె ఈ పుస్తకంలో చర్చించింది. ఒక సాదాసీదా ఢిల్లీ కామన్ మేన్ ఇవాళ ఇంత పెద్ద విజేత ఎలా అయ్యాడో తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి. పబ్లిషర్: Westland వెల: రూ. 395 సివిల్స్ తెలుగు అభ్యర్థుల కోసం వ్యాస కల్హారాలు గుణనిధి కథ, సుగాత్రీ శాలీనుల కథ, ఆంధ్రప్రశస్తి, జాషువా గబ్బిలం, కర్పూర వసంతరాయలు, మహాప్రస్థానం ఆధ్యాత్మికత, అల్పజీవి నవల తదితర అంశాలపై పోటీ పరీక్షలకు తగినట్టుగా వ్యాసాలు. రచయిత్రి సర్వమంగళ గౌరి దశాబ్దాలుగా పోటీ పరీక్షల బోధనా రంగంలో ఉండటం వల్ల విద్యార్థులు తప్పక పరిశీలించదగ్గ పుస్తకం. వెల: రూ.120 ప్రతులకు: 9866222978 కారంచేడు నుంచి లక్షింపేట దాకా 1985 కారంచేడు నరమేధం నుంచి 2012 లక్షింపేట మారణ కాండ దాకా దళితులపై జరిగిన సామూహిక దాడులు, హంతకుల శిక్షకై జరిగిన పోరాటాలు, చర్చలు... వీటన్నింటి సమగ్ర కూర్పు ఇది. దళిత పోరాటాల నేపధ్యం తెలియాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు. ఎన్నో వ్యయప్రయాసలతో ఈ భారీ సంకలనాన్ని తీర్చిదిద్దిన పాపని నాగరాజు అభినందనీయుడు. వెల: ఇవ్వలేదు ప్రతులకు: 9948872190 -
‘ఔటర్’పై వేగానికి కళ్లెం
ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసుల ప్రతిపాదనలు నాలుగు లేన్లకు నిర్ణీత వేగం ఆమోదిస్తే అమలు చేయడమే తరువాయి స్పీడ్ పెరిగినా.. తగ్గినా ఫైన్ కట్టాల్సిందే సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రమాదాలను నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు ‘స్పీడ్ లిమిట్’ అనే కొత్త విధానానికి తెర తీశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. హెచ్ఎండీఏ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. నాలుగు లైన్ల ఔటర్పై ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 నుంచి 120 కి.మీ. వేగంతో పోవచ్చు. అయితే ఒక్కోలైన్కు ఒక్కో స్పీడ్ నియంత్రణ పెడితే ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఎంత వేగంతో వెళ్లాలో నిర్ధారించుకున్న వాహనం ఏ దారిలో వెళ్లాలో అదే దారిలో వెళ్లాలి. వేగం తగ్గినా పెరిగినా స్పీడ్ గన్ పరిగెడుతుంది. తద్వారా చలానా రాస్తారు. ఇలా చేయడం వల్ల ఒకరి దారికి ఒకరు అడ్డురాకండా మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్పై నాలుగు లైన్లలోను 120 కి.మీ. స్పీడ్తో వెళ్లవచ్చనే నిబంధన వల్ల 120 కి.మీ. స్పీడ్తో వచ్చే వాహనానికి ముందు 50 కి.మీ. స్పీడ్తో వెళ్తున్న వాహనం అడ్డు వస్తోంది. దీంతో 120 కి.మీ. స్పీడ్తో వెళ్తున్న వాహ నం ఓవర్టేక్ చేసి మరో లైన్ద్వారా ముందుకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా పలుసార్లు ఓవర్టేక్లు చేస్తూ లైన్లు మార్చుతున్న క్రమంలోనే వాహనం అదుపు తప్పడం గాని, మరో వాహనాన్ని ఢీ కొట్టడం గాని జరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై పోస్టుమార్టం రోడ్డు ప్రమాదాలు జరగడం ఆ తరువాత అందరు మరచిపోవడం ఇది నిన్నటి మాట. సైబరాబాద్లో ఇక నుంచి ప్రతి రోడ్డు ప్రమాదాలపై ఘటన జరిగిన వెంటనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. ప్రమాదం ఎలా జరిగింది..? అందుకు కారణాలు ఏమిటి..? ఎవరిది తప్పు..? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? తదితర అంశాలకు జవాబులు వెంటనే పోలీసు వెబ్సైట్లో పొందుపర్చాలి. ఈ వివరాలను పోలీసు బాస్లు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇక నుంచి ప్రమాదాలు నివారించవచ్చంటున్నారు అధికారులు. అయితే ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను త్వరలో రూపొందించి అమలుల్లోకి తెస్తామని ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సైబరాబాద్లో ఏఏ ప్రాంతాల్లో వాహనాలు ప్రమాదాలకు గురికాకండా ఎలా వెళ్లాలనే అంశాలను కూడా పోలీసు వెబ్సైట్లో చేరుస్తామన్నారు. ట్రాఫిక్కు 22 మంది ఎస్ఐలు ట్రాఫిక్ విభాగానికి కొత్తగా 22 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు వచ్చారని ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. వీరిలో ఐదుగురు ఎస్ఐలను త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రారంభించే పెట్రోలింగ్కు ఉపయోగిస్తామన్నారు. ఒక్కో వాహనంలో ఒక ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. ప్రత్యేకంగా 16 మంది కానిస్టేబుళ్లకు కూడా ఇందుకోసం శిక్షణ ఇచ్చామన్నారు. సీట్బెల్డ్, పార్కింగ్, రాంగ్రూట్, ఓవర్ స్పీడ్లపై వీరు దృష్టి పెడతారు. త్వరలో రెండు స్పీడ్ గన్స్, రెండు క్రేన్లు కూడా వస్తున్నాయన్నారు. - అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ -
సివిల్ వివాదంలో సీఐ సస్పెన్షన్
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్లైన్ :సివిల్ వివాదంలో తలదూర్చడమే కాకుండా నిందితులతో కుమ్మక్కై బాధితుడి ఫిర్యాదును పక్కన పడేసిన ఓ సీఐని గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్కుమార్ సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. సంబంధిత డీఎస్పీ ఉదాసీనంగా వ్యవహరించినందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సిఫారసు చేయడంతోపాటు, అప్పటి ఎస్పీకి మెమో జారీచేశారు. వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని శ్యామలానగర్లో అదేప్రాంతానికి చెందిన నల్లపాటి సౌజన్యకుమార్, కొడాలి లలితకుమారి మధ్య రూ.6 కోట్ల విలువచేసే 1800 గజాల స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ స్థలం తనదనీ, తన ఆధీనంలోనే ఉందని సౌజన్యకుమార్ కోర్టును ఆశ్రయించాడు. సౌజన్యకుమార్ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు తన మర్యాదకు భంగం కలిగించాడంటూ జనవరి 26న లలితకుమారి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదుచేసింది. విచారణ చేపట్టిన సీఐ డి.దుర్గాప్రసాద్ కోర్టులో విచారణలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడికావడంతో తప్పుడు కేసుగా నిర్ధారించి కేసును మూసివేశారు. లలితకుమారి వ్యూహం పనిచేయకపోవడం, కోర్టులో తీర్పు సౌజన్యకుమార్కు అనుకూలంగా వస్తుందని ముందే పసిగట్టింది. దీంతో ఏప్రిల్ 5న కొందరు అనుచరులతో కలిసి పొక్లెయిన్, ట్రాక్టర్లతో అక్రమంగా ప్రవేశించి స్థలంలో ఉన్న షెడ్లను కూల్చివేయడం ప్రారంభించింది. కోర్టు విచారణలో ఉండగా తన ఆస్తులకు నష్టం కలిగించి, స్థలాన్ని లలితకుమారి ఆక్రమిస్తోందంటూ బాధితుడు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసిన సీఐ స్వయంగా పరిశీలించకపోగా.. లలితకుమారి తదితరులను స్టేషన్కు పిలిపించి వారితో కుమ్మక్కయ్యారు. వారంతా దర్జాగా వెళ్లి షెడ్ల కూల్చివేతను పూర్తిచేశారు. తనకు సీఐ అన్యాయం చేశాడనీ, నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనీ అప్పటి అర్బన్ ఎస్పీ ఆకే రవికృష్ణ, వెస్ట్ జోన్ డీఎస్పీ సీహెచ్ వెంకటేశ్వరరావులను బాధితుడు ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఏప్రిల్ 20న సౌజన్యకుమార్కు అనుకూలంగా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీచేసింది. వెలుగు చూసిందిలా.. సివిల్ వివాదంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచి నిందితులకు కొమ్ము కాసి అన్యాయం చేశారంటూ ఆగస్టు 12న సౌజన్యకుమార్ హైదరాబాద్లోని శాంతిభద్రతల విభా గం అదనపు డీజీ వి.ఎస్.కె.కౌముదిని న్యాయంచేయాలని కోరాడు. దీనిని సీరియస్గా పరి గణించిన అదనపు డీజీ దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఐజీ, అర్బన్ ఎస్పీలను ఆదేశిం చారు. ఏఎస్పీ జెట్టి గోపీనాథ్ విచారణాధికారిగా దర్యాప్తు జరిపారు. సివిల్ కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగించాల్సి వుండగా సీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైంది. ఏఎస్పీ నివేదిక ఆధారంగా సీఐ దుర్గాప్రసాద్ను ఐజీ సునీల్కుమార్ శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. పర్యవేక్షించాల్సిన డీఎస్పీ వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి నివేదిక పంపారు. సమస్య తీవ్రతను గుర్తించి చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు అప్పటి ఎస్పీ ఆకే రవికృష్ణకు మెమో జారీచేశారు.