-
రుణం కోసం ఐఎంఎఫ్ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
‘ప్రచార బుల్లెట్’ ఎక్కిన బెంగాల్ బీజేపీ చీఫ్
పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుల్లెట్ వాహనంపై బాలూర్ఘాట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు బాలూర్ఘాట్ రైల్వేస్టేషన్లో రైలు దిగిన మజుందార్కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల నినాదాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ నడుపుతూ మజుందార్ ప్రచారం నిర్వహించారు . మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎంసీపై పలు విమర్శలు చేశారు. ‘ఓ వైపు ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తృణమూల్ ఇక్కడి నుంచి అనేక కుంభకోణాలు చేసిన దొంగను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది దొంగలు, మంచి వ్యక్తుల మధ్య పోరు. తృణమూల్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది’ అన్నారు. బాలూర్ఘాట్ నియోజకవర్గం నుండి టీఎంసీ తన లోక్సభ అభ్యర్థిగా బిప్లబ్ మిత్రను నిలబెట్టింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. -
Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్ హత్య..మరో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గొగామెడి హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు అశోక్ కుమార్ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ హత్యకు సంబంధించి రాజస్థాన్, హర్యానాల్లోని 31 ప్రదేశాల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. తాజాగా అరెస్టయిన నిందితుడు అశోక్కుమార్ కర్ణిసేన చీఫ్ హత్య తామే చేశామని క్లెయిమ్ చేసుకున్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోడారాకు సన్నిహితుడు. ‘కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం(జనవరి 3)న హర్యానా, రాజస్థాన్లోని 31 ప్రాంతాల్లో సోదాలు జరిపాం. వీటిలో నిందితులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సోదాల్లో భాగంగానే అశోక్ కుమార్ అనే నిందితుడిని రాజస్ధాన్లోని జున్జున్లో అరెస్టు చేశాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జైపూర్లోని శ్యామ్నగర్లో ఉన్న ఆయన ఇంట్లోనే కర్ణిసేన చీఫ్ గొగామెడిని ముగ్గురు షూటర్లు కాల్చిచంపారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. హత్య తర్వాత రాజస్థాన్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇదీచదవండి..మహువా పిటిషన్..లోక్సభ సెక్రెటరీకి సుప్రీం నోటీసు -
జేడీయూ చీఫ్ పదవికి లలన్ సింగ్ రాజీనామా
పట్నా: జనతా దళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన జేడీయూ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్ పార్టీ చీఫ్గా ఎన్నికయ్యారు. నితీష్ కుమార్ ఎన్నికకు ముందు లలన్ సింగ్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసి.. నితీష్ కుమార్ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. మరో వైపు లలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అతనిపై అసంతృప్తితో ఉన్న సీఎం నితీశ్ కుమార్.. ఆయన్ని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. ఇక.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను నితీశ్ కుమార్ చేపట్టడం గమనార్హం. -
యాపిల్కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్ డిజైనర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్లు, యాపిల్ వాచీల డిజైన్ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు. కీలకమైన టాన్ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్ వర్గాలు బ్లూమ్బెర్గ్కి వెల్లడించాయి. యాపిల్కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు. మరిన్ని నాయకత్వ మార్పులు కంపెనీకి చెందిన ఇతర మ్యాక్ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్వేర్ ఎగ్జిక్యూటివ్లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్లో తీసుకువచ్చింది. విప్రో వెబ్సైట్లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి
పాకిస్తాన్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే(72) మృతి చెందాడు. ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్)తో పాటు ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్కు చీఫ్. లఖ్బీర్ గుండెపోటుతో మృతి చెందాడు. లఖ్బీర్ సింగ్ రోడే.. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మేనల్లుడు. భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు, అకల్ తఖ్త్ మాజీ నేత జస్బీర్ సింగ్ రోడే.. లఖ్బీర్ మరణాన్ని ధృవీకరించారు. లఖ్బీర్ సింగ్ రోడేకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వారు కెనడాలో నివసిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ రోడే భారతదేశంలోని పంజాబ్లోని మోగా జిల్లాలోని రోడే గ్రామంలో ఉండేవాడు. భారతదేశం నుండి దుబాయ్కి పారిపోయాడు. తరువాత దుబాయ్ నుండి పాకిస్తాన్కు చేరుకున్నాడు. తన కుటుంబాన్ని కెనడాలో ఉంచాడు. 2002లో 20 మంది టెర్రరిస్టులను భారత్కు అప్పగించేందుకు పాక్కు భారత్ ఒక జాబితాను అందజేసింది. అందులో లఖ్బీర్ సింగ్ రోడే పేరు కూడా ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం లఖ్బీర్ సింగ్ రోడే తన అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ శాఖలను బ్రిటన్, జర్మనీ, కెనడా,అమెరికాతో సహా అనేక ప్రాంతాలలో ప్రారంభించాడు. భారత్కు అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపినట్లు రోడేపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్పై ఇజ్రాయెల్ ఆగ్రహం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 19 రోజులు దాటింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఏడువేలు దాటింది. ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)లో కూడా ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. వీటినడుమ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ సాగిస్తున్న దారుణాలపై ఆంటోనియో గుటెర్రెస్ ఉపేక్ష వహిస్తున్నట్టు కనిపిస్తున్నారని, అందుకే ఆయన ఐక్యరాజ్యసమితికి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇజ్రాయెల్, యూదు ప్రజలపై దురాగతాలకు తెగబడుతున్న వారిపై సానుభూతి తెలిపేవారితో తాను మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హమాస్ ఎటువంటి కారణం లేకుండా దాడులు చేసి ఉండదని తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని అన్నారు. పాలస్తీనా ప్రజలు 56 ఏళ్లుగా దురాక్రమణలను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ హమాస్ దాడులను సమర్థించలేమని కూడా ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు! -
'యుద్ధాల్లో హీరోలు ఉండరు.. కేవలం బాధితులే'
రియాద్: యుద్ధాల్లో హీరోలు ఉండరని కేవలం బాధితులు మాత్రమే మిగులుతారని సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టర్కీ ఆల్ ఫైసల్ అన్నారు. ప్రజాపోరాటాలు, శాసనోల్లంఘన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్, తూర్పు యూరప్లో సోవియట్ రాజ్యాధికారాలను కూలదోశాయని ఆయన గుర్తుచేశారు. దురాక్రమణ ప్రాంతాల్లో ప్రజలకు సహాయనిరాకరణ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం దురంహకారం గాజాలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫైసల్ అభిప్రాయం విలువైనదిగా పేర్కొంటూ ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. హమాస్ తీరు శోచనీయం ఇస్లామిక్ ప్రతినిధిగా పేర్కొంటూ పిల్లలు, మహిళలపై క్రూరంగా దాడులకు పాల్పడుతున్న హమాస్ చర్యలను ఖండిస్తున్నానని ఫైసల్ అన్నారు. అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులను హతమార్చడం ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన.. పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని కూడా ఇస్లాం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై నైతికతను ప్రదర్శించడం పట్ల ఆయన హమాస్ను విమర్శించారు. ఇజ్రాయెల్లాగే హమాస్ కూడా పాలస్తీనా అధికార వర్గాలను తక్కువ అంచనా వేయడంపై ఆయన మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల దుస్థితికి శాంతియుత పరిష్కారం కోసం సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాన్ని విధ్వంసం చేసిన హమాస్ తీరును ఫైసల్ తప్పుబట్టారు. The legendary chief of Saudi Intelligence Turki -Al- Faisal could not have said it better. Worth a listen 👇🏾 pic.twitter.com/0YjQAd158I — Manish Tewari (@ManishTewari) October 19, 2023 ఇజ్రాయెల్ రక్తపాతం.. పాలస్తీనా ప్రజలపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై ఫైసల్ మండిపడ్డారు. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లో పిల్లలు, మహిళల పట్ల ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న మారణకాండపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు అమెరికా సైతం వంతపాడటాన్ని తప్పుబట్టారు. దాదాపు 75 ఏళ్లుగా ఈ దారుణాన్ని పాలస్తీనా ప్రజలు భరిస్తున్నట్లు చెప్పారు. 1948 నాటి పాలస్తీనా దురంతం పేరుతో వెలుగులోకి వచ్చిన 2014 నాటి ఓ పత్రికా కథనంలో ఇజ్రాయెల్ సేనల పాత్రను ఆయన ఎండగట్టారు. ఈ ఏడాది కూడా మే నుంచి జులై మధ్య 67 మంది పిల్లలతో సహా దాదాపు 450 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రాశ్చాత్య మీడియా తీరు సరికాదు.. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నానని ఫైసల్ తెలిపారు. అల్-అక్సా మసీదులోని ప్రార్థనా స్థలాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని తీవ్రంగా విమర్శించారు. పాలస్తీనా స్త్రీలు, పిల్లలు పురుషులను నిర్బంధించారని మండిపడ్డారు. పాలస్తీనియన్ల చేతుల్లో చనిపోతున్న ఇజ్రాయెలీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాలస్తీనియన్ల హత్యలపై కనీసం విచారం వ్యక్తం చేయని ప్రాశ్చాత్య మీడియా తీరును ఆయన ఖండించారు. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చీఫ్ డాక్టర్ కె శివన్ తన మొదటి ప్రయత్నంలో అంతరిక్ష సంస్థలో జాబ్ పొందలేకపోయాయని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (NIT) గోవా తొమ్మిదవ కాన్వకేషన్లో వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదువు పూర్తయిన తరువాత నేను టీచర్ అవ్వాలనుకున్నాను, అయితే అంతరిక్ష సంస్థకు ఛైర్మన్గా మారాను అంటూ గుర్తు చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్లెస్ ఫెలో.. నీకు జాబ్ రాదు.. గెట్ లాస్ట్ అన్నారని వెల్లడించాడు. ఇలా అనిపించుకున్న తరువాత, చివరకు అదే సెంటర్కు చైర్మన్ అయ్యానని చెప్పుకొచ్చాడు. మొదట శాటిలైట్ సెంటర్లో ఉద్యోగం రాకపోవడంతో రాకెట్ సెంటర్లో ఉద్యోగం సంపాదించి ఆ తరువాత అప్పటికే నాలుగు సార్లు విఫలమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు, సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ విమర్శించారని వెల్లడించారు. ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని జీఎస్ఎల్వీ ప్రాజెక్టును విజయవంతం చేసానని శివన్ చెప్పాడు. ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడేలా చేయడంతో ఇస్రో చైర్మన్ పదవి కూడా వరించిందని తెలిపాడు. నిజానికి నా జీవితంలో ఓ గొప్ప విషయం నేర్చుకున్నాను, అదేంటంటే.. మీరు ఎక్కడైనా విమర్శలకు, తిరస్కరణకు గురైతే తప్పకుండా మీ కోసం మరో గొప్ప అవకాశం మరొకటి వేచి ఉంటుందని శివన్ చెప్పారు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఆ తరువాత చంద్రయాన్ 2 మిషన్ ప్రారంభమైంది. దీనిని 2019 జూలై 22న అంతరిక్షంలో పంపించారు, కానీ అది 2019 సెప్టెంబరు 7 విఫలమైనట్లు తెలిసింది. ఆ తరువాత చంద్రయాన్-3తో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆమోదం లభించిందని చెప్పారు. డాక్టర్ కె శివన్ గురించి ఏప్రిల్ 1957లో కన్యాకుమారిలోని తారక్కన్విలై గ్రామంలో ఒక మామిడి రైతుకు జన్మించిన 'శివన్' పాఠశాల విద్యను తమిళ మాధ్యమ పాఠశాల నుంచి, ఆ తరువాత 1980లో మద్రాస్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ డిగ్రీ పూర్తి చేసాడు.1982లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొంది ఇస్రోతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. 2006లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో డాక్టరల్ డిగ్రీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన పీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి MkIII వంటి ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. ఆ తరువాత 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్గా ఎస్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించాడు. -
ఇస్రో చీఫ్ సోమనాథ్కు బుడ్డోడు సర్ప్రైజ్ గిఫ్ట్
ఢిల్లీ:చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్కు ఓ చిన్నారి నుంచి అరుదైన బహుమతి అందింది. జాబిల్లిపై వాలిన విక్రమ్ ల్యాండర్ నమూనాను చేతితో తయారు చేసిన పిల్లాడు.. దానిని ఇస్రో చీఫ్ సోమనాథ్కు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చంద్రయాన్ 3 విజయంతో దేశంలో వచ్చే తరాలకు ఎంతో ప్రోత్సాహం అందించారని సోమనాథ్ను కొనియాడారు. ఆ బాలున్ని ఆసక్తిని మెచ్చుకున్నారు. భవిష్యత్లో ఎందరో పిల్లలు శాస్త్రవేత్తగా ఎదగాలనుకుంటారు. బాలునికి శుభాకాంక్షలు అని తెలిపారు. ISRO Chief Sri Somanath today had a surprise visitor,A young neighbour boy has handed over own made Vikram Lander model to the ISRO chief on behalf of all the neighbours. pic.twitter.com/BcyHYO0pDW — Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 2, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఆగష్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ విమానంలోకి ఎక్కగానే.. ఫ్లైట్లో ప్రయాణికులందరూ ఆయన్ని అభినందించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3తో పాటు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1ను కూడా ప్రయోగించింది. సూర్యూనిపై పరిశోధనలు జరపడానికి ఈ మిషన్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. 125 రోజుల పాటు ప్రయాణం చేసి సూర్యుని గుట్టు విప్పే పనిలో ఆదిత్య ఎల్ 1 నిమగ్నమవనుంది. ఇదీ చదవండి: Chandrayaan-3: స్లీప్ మోడ్లోకి ప్రజ్ఞాన్.. -
'బతికే ఉన్న..' వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కొత్త వీడియో వైరల్..
వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణానికి ముందు ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టెలిగ్రామ్ ఛానల్లో విడుదలైన వీడియోలో ప్రిగోజిన్ తన యోగక్షేమాల గురించి అలాగే తన భద్రతపై ఉన్న అనుమానాలపై మాట్లాడారు. ఆర్మీ దుస్తులు ధరించి, చేతికి వాచ్ పెట్టి ఉన్న ఆయన మృతికి ముందు ఆగష్టు 21నాటి వీడియోగా భావిస్తున్నారు. వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ..' నేను బతికానా? ఇంకా చనిపోయానా..? ఎలా ఉన్నాను.. ఏం చేస్తున్నాను? అని చర్చించుకునేవారి కోసమే ఈ వీడియో. ఇది వీకెండ్ ఆగష్టు 2023 చివరి భాగంలో ఉన్నాం. నా జీవితాన్ని అంతం చేయడానికి నిరంతరం చర్చించుకుంటున్నారు. నా వ్యక్తిగత జీవితం, సంపాదన అంతా బాగానే ఉన్నాయ్' అని ప్రిగోజిన్ చెప్పారు. ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో షేర్ చేయగా.. ట్విట్టర్(ఎక్స్) లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భూగర్భంలో ఉన్నట్లు కామెంట్ బాక్స్లో తమ అభిప్రాయాలను రాసుకొచ్చారు. ప్రిగోజిన్కు సంబంధించిన మరిన్ని వీడియోలు షేర్ చేయండని మరొక నెటిజన్ స్పందించాడు. A video of Prigozhin appeared that is reportedly filmed in Africa not long before his death. "So, fans of discussing my death, intimate life, earnings, etc., I am doing fine," Prigozhin says. pic.twitter.com/UcIKpgLNZi — Anton Gerashchenko (@Gerashchenko_en) August 31, 2023 రష్యా అధ్యక్షుడు పుతిన్పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత ఆయన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా మృతి చెందారు. వీరి మరణ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు స్పష్టం చేసింది. ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలపై క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్ని అవాస్తవాలని పేర్కొంది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
ప్రిగోజిన్ మృతి.. రష్యా అధికారిక ప్రకటన..
పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు జన్యు పరీక్షల రిపోర్టును బహిర్గతం చేసింది. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడనే వార్తల అనంతరం అనేక పుకార్లు వెలుగులోకి వచ్చాయి. ప్రిగోజిన్ మరణం వెనక రష్యానే కుట్ర పన్నిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల అనంతరం క్రెమ్లిన్ జన్యు పరీక్షలకు అనుమతినిచ్చింది. 'విమాన ప్రమాద ఘటన ద్యర్యాప్తులో భాగంగా జన్యు పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో ప్రిగోజిన్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారు.' అని ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికార ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్తో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో డిమిత్రి ఉట్కిన్ ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా ఇంటెలిజెన్స్లో పనిచేసి, ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ నిర్వహణలో ప్రధాన వ్యక్తిగా అయన్ను చెప్పుకుంటారు. విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ట్రాఫిక్ ఉల్లంఘణలపై రష్యా దర్యాప్తు చేపట్టింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విమాన ప్రమాదం.. పుతిన్పై తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్.. రష్యాలోని మాస్కో నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి విమానం గాల్లో నుంచి కూలిపోయింది. ఈ ఘటనలో చెలరేగిన మంటల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యా మీడియా వెల్లడించింది. ఇందులో ప్రిగోజిన్తో పాటు ఆయన అనుచరులు మొత్తం పది మంది ఉన్నట్లు మీడియా తెలిపింది. "The plane will fall apart in mid-air", a video of Prigozhin predicting his death has appeared. 💬"You better kill me, but I won't lie. I have to be honest: Russia is on the brink of disaster. If these cogs are not adjusted today, the plane will fall apart in mid-air", Prigozhin… pic.twitter.com/sG8beb2HLp — Anton Gerashchenko (@Gerashchenko_en) August 27, 2023 పుకార్లపై క్రెమ్లిన్ రియాక్షన్.. తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకులు ఆరోపణలు చేశారు. దీనిపై క్రెమ్లిన్ ఇటీవల స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. ప్రస్తుతం ఆ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇదీ చదవండి: Biden On Yevgeny Prigozhin Death: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ -
భద్రకాళి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు..
తిరువనంతపురం: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. గత బుధవారమే విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరింది. ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్.. కేరళ, తిరువనంతపురంలోని పౌర్ణమికవు-భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్ని అమ్మవారికి ప్రార్థనలు చేశారు. #WATCH | Kerala: ISRO chief S Somanath offers prayers at Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram. pic.twitter.com/8MjqllHeYb — ANI (@ANI) August 27, 2023 'చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించగల సామర్థ్యాన్ని మనకు ఉంది. అంతరిక్ష రంగం ఇంకా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి.. అదే మా లక్ష్యం. ప్రధాని మోదీ అందించిన దార్శనికతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం' అని సోమనాథ్ అన్నారు. బుదవారం భారతదేశ అంతరిక్షయాన చరిత్రలో లిఖించతగ్గ రోజుగా మారింది. చంద్రునిపై కాలుమోపిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా రికార్డ్ సృష్టించాం. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్గా కూడా పేరుపెట్టారు ప్రధాని మోదీ. చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదీ చదవండి: మోదీ మన్కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్
పుతిన్ ఒకప్పటి సన్నిహితుడు, రష్యాలో తిరుగుబాటు ఎగరేసిన కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసిన రెండు నెలల్లోనే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ నుంచి గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులందరూ తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడ్డారని, ఈ క్రమంలో కిటికీలకు దూరంగా ఉండాలనే స్థాయిలో సూచనలు వచ్చాయి. అయినప్పటికీ ధైర్యంగా రష్యాలోనే తిరుగుతున్న ప్రిగోజిన్.. ఇంతలోనే విమాన ప్రమాదంలో మరణించారు. 🚨#BREAKING: Wagner chief Prigozhin has died along with 10 other passengers on the jet that just crashed in Russia's Tver region pic.twitter.com/4kPLrsGANb — R A W S A L E R T S (@rawsalerts) August 23, 2023 30 సెకన్లలోనే.. ప్రిగోజిన్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం మాస్కోకు మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో జరిగింది. సవ్యంగా సాగుతున్న విమాన ప్రయాణం అప్పటివరకు బాగానే ఉన్నా.. కేవలం 30 సెకన్ల వ్యవదిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశం నుంచి విమానం పొగలు వెదజల్లుతూ కిందకు పడుతున్న దృశ్యాలు తాజాగా వైరల్గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అందులో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. పుతిన్పై తిరుగుబాటు.. ఉక్రెయిన్పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్ను.. పుతిన్ షెఫ్గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్కు-ప్రిగోజిన్కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇదీ చదవండి: ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు -
వంటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ..ఏకంగా వంద గంటల పాటు..
ఇంతవరకు ఎన్నో రకాలు వరల్డ్ రికార్డులను చూశాం. విభిన్నంగా ఉండటం లేదా ఎవరూ చేయలేని సాహసానికి యత్నించడం వంటివి చూశాం. వాటన్నింటికంటే ఇంకాస్త విభిన్నంగా ఓ మహిళ వంటలతో కూడా రికార్డు సృష్టించొచ్చని నిరూపించింది. పైగా ఇంతకమునుపు అదే ఫీట్ని చేసిన మహిళ వరల్ఢ్ రికార్డుని సైతం బ్రేక్ చేసి ఔరా! అనినిపించుకుంది. వివరాల్లోకెళ్తే..నైజీరియాకి చెందిన చెఫ్ హిల్డా బాసి నాన్స్టాప్గా వంటలు చేస్తూ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆమె గత గురువారం నుంచి నాన్స్టాప్గా వంటలు చేస్తూ గతంలో భారతీయ చెఫ్ లతా టాండన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. గతంలో లతా సుమారు 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టిస్తే..హిల్డా సుమారు 100 గంటల పాటు నాన్స్టాప్గా వంటలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉండగా, గిన్నిస్ వరల్డ్ రికార్డు సదరు చెఫ్ హిల్డా బేక్ చేసిన రికార్డు గురించి తెలిసిందని, ఐతే ఆ రికార్డును అధికారికంగా ధృవీకరించే ముందు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో సదరు నైజీరియన్ చెఫ్ హిల్డా మాట్లాడుతూ..నైజీరియన్ యువత ఎంతలా కష్టపడి పనిచేస్తారో ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది. సమాజానికి దూరంగా ఉంటున్న ఆఫ్రికన్ యువతులు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. మీరు ఏ పనిచేయాలనుకుంటున్నా.. దాన్ని సీరియస్గా తీసుకుని అందరికంటే మెరుగ్గా చేయలన్నారు. అందుకోసం అదనపు మైళ్లు దాటి రావల్సిందేననిఝ(కష్టాలను అధిగమించి) నైజీరియన్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు. అంతేగాదు నైజీరియన్ వంటకాలు గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా హిల్డా తన వంటకాల్లో సూప్ దగ్గర నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ప్రసిద్ధ వంటకాలన్ని హిల్డా తయారు చేసింది. అంతేగాదు ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ..తన వ్యక్తిగత విషయాల కోసం 12 గంటల కొకసారి ఒక గంట చొప్పున తీసుకుని ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నైజీరియాకు ఈ రోజు చాలా గొప్ప రోజు అంటూ హిల్డాను ప్రశంసించాడు. ఆమె ఆశయం చాలా గొప్పదని అభినందించాడు. నైజీరియన్ వంటకాలు తోపాటు ఇక్కడి వ్యక్తులు గురించి తెలుసుకునేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా వంద గంటల పాటు చేయడమనేది అసామాన్య విషయమని అన్నాడు. ఆ మహిళ ఇక్కడ శక్తి చాలా ఎక్కువ ఉందని అనుమానించాల్సిన పని లేదని బల్లగుద్దినట్లు చెప్పింది అంటూ ట్విట్టర్లో హిల్డాని ప్రశంసలతో ముంచెత్తారు అధ్యక్షుడు బుహారీ. View this post on Instagram A post shared by Hilda Baci (@hildabaci) (చదవండి: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం) -
ఐఎస్ఐఎస్ చీఫ్ మృతి..ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు
అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సేన్ అల్ ఖురాషి సిరియాలో మృతి చెందినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆపరేషన్లో హతమయ్యినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద సంస్థలపై ఎలాంటి వివక్ష లేకుండా టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎర్గోగాన్ అన్నారు. 2013లో డేష్/ఐసిస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటిగా నిలిచింది. ఇంటిలిజెన్స్ ఏజెంట్లు స్థానిక మిలటరీ పోలీసుల సాయంతో సిరియాలో ఆఫ్రిన్ వాయవ్య ప్రాంతంలో జిండిరెస్లోని ఒక జోన్ని మూసివేసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు ఎర్డోగాన్. ఈ ఆపరేషన్లో ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తున్న పాడుపడిన పోలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. టర్కీ 2020 నుంచి ఉత్తర సిరియాలో దళాలను మోహరించి ఈ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో సిరియన్ సహాయకుల సాయంతో మొత్తం జోన్లను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఐఎస్ఐఎస్ మునుపటి చీఫ్ అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి మరణించినట్లు నవంబర్ 30న ప్రకటించింది టర్కీ. అతని స్థానంలోకి ప్రస్తుతం టర్కీ చనిపోయినట్లు ప్రకటించిన ఐఎస్ఐఎస్ అబూ హుస్సేన్ అల్-ఖురాషీ వచ్చాడు. కాగా, అమెరికా కూడా ఏప్రిల్ మధ్యలో హెలికాప్టర్ దాడులతో ఒక ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్లో ఐఎస్ఐఎస్కు చెందిన అబ్ద్-అల్ హదీ మహ్మద్ అల్-హాజీ అలీని హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అంతేగాదు 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్లో ఐఎస్ఐఎస్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చంపినట్లు యూఎస్ ప్రకిటించింది. ఆ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఒకప్పుడూ నియంత్రించి తరిమికొట్టినప్పటికీ ఇప్పటికీ సిరియాలో దాడలు చేస్తుండటం గమనార్హం. (చదవండి: ఏ మూడ్లో ఉందో సింహం! సడెన్గా కీపర్పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..) -
తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం
తమిళనాట రాజకీయం ఆడియో క్లిప్లతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేసీ చీఫ్ అన్నామలై విడుదల చేసిన ఆడియో క్లిప్స్.. హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి సంబంధించి అవినీతి అరోపణల క్లిప్ని ట్విట్టర్లో విడుదల చేశారు. అందుకు సంబంధించి.. 'డిఎంకే ఫైల్స్' పేరుతో వరుసగా రెండు ఆడియో క్లిప్లను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ అధికార డీఎంకేను కించపరుస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో దోచుకున్న మొత్తంలో ఎక్కువ భాగం స్థాలిన్ కొడుకు, అల్లుడు అధిక భాగం తీసుకున్నట్లు స్వీకర్ చెబుతున్నట్లు వినిపిస్తుంది. అంతేగాదు ఒక వ్యక్తి ఒకే పాలన అని ప్రశంసస్తూ వ్యవస్థ లోపానికి అర్థం డీఎంకేనే అని ఆరోపణలు చేస్తున్నట్లు ఆ స్పష్టంగా వినిపిస్తోంది. అంతేగాదు ఆ వీడియో క్లిప్ ఆధారంగా స్టాలిన్ తనయుడు.. క్రీడా మంత్రి అయిన ఉదయ్ స్టాలిన్, అల్లుడు శబరీశన్ 30 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయంపై స్పందించిన ఆర్థిక మంత్రి పళనివేల్ మా మధ్య విభేదాలు సృష్టించి విడదీసేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా రావొచ్చు అన్నారు. ఈ వీడియో క్లిప్ మొత్తం డీఎంకే నేతలు దాదాపు 1.34 లక్షల కోట్లు వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పేర్కొంది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి కుటుంబంతో సహా ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పొన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జగత్రక్షకన్ తదితరులపై ఆరోపణలు వచ్చాయి. అంతకుమునుపు 2011లో డీఎంకే హయాంలో చెన్నై మెట్రో రైలు కోచ్ల నియమాక విషయమై ఓ ప్రెవేట్ కంపెనీ స్టాలిన్కి సుమారు రూ. 200 కోట్లు ముట్టచెప్పినట్లు కూడా ఆ వీడియో క్లిప్లో ఆరోపణలు వచ్చాయి. Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai. Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa — K.Annamalai (@annamalai_k) April 25, 2023 ఐతే రైల్వే సంస్థ దీన్ని ఖండించడమే గాక న్యాయమార్గంలోనే నియామకాలు జరిగినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అధికార డీఎంకే ఆ ఆరోపణలను ఖండించింది. అంతేగాక ఈ అంశమై అన్నామలైకి లీగల్గా నోటీసులు జారీ చేయడే గాక, క్షమాపణలతో సహా రూ. 500 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐతే అన్నామలై తానెలాంటి పరువు నష్టం చట్టాన్ని ఉల్లంఘించ లేదంటూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. తన వాయిస్తో నేరారోపణ చేసే కంటెంట్ ఉన్న వీడియోని రూపొందించమని కూడా సవాలు విసిరారు. ఆ వీడియో క్లిప్పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా పట్టుబట్టారు. ఈ మేరకు ఆ ఆడియో క్లిప్పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. తమిళనాడులో బీజేపి హవా అంతమాత్రంగా ఉన్న ఈ తరుణంలో మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో సంబంధాలు సైతం తెగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. (చదవండి: సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష) -
ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు : రేవంత్ రెడ్డి
-
రెండోసారి డీఎంకే చీఫ్గా స్టాలిన్!...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ జరిగింది. ఇటీవలే కొత్తగా ఏర్పడిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే స్థాలిన్ని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. అలాగే పార్టీ నేతలు దురైమరుగన్, టీఆర్ బాలులు కూడా జనరల్ సెక్రటరీ, ట్రెజరీ అధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు నేతలు కూడా వరసగా రెండోసారి పార్టీ అత్యున్నత పదవులను చేపట్టడం విశేషం. అంతేగాదు కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన స్టాలిన్కి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీఎంకే పార్టీ 15వ సంస్థగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ పదవులకు ఎన్నికలు జరిపిన తర్వాత ఆ ముగ్గురు నేతలని పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అంతేగాదు డీఎంకే పార్టీ పితామహుడు, దివగంత ఎం కరుణానిధిన్ హయాంలో స్టాలిన్ కోశాధికారిగా, యువజన కార్యదర్శిగా పలు పదవులను చేపట్టారు. 2018లో కరుణానిధి మరణాంతరం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. అంతేగాదు 1969లో తొలిసారిగా సృష్టించిన పార్టీ అధ్యక్షుడి పదవికి కరుణానిధే తొలి అధ్యక్షుడయ్యారు. అంతకు ముందు వరకు పార్టీ కార్యదర్శి పదవే అత్యున్నత పదవి. 1949లో ఏర్పాటైన డిఎంకే పార్టీకి అన్నాదురై పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చనిపోయేంత వరకు ఈ అత్యున్నత పదవిలోనే కొనసాగారు. (చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్) -
ఫిన్లాండ్, స్వీడన్లకు రూట్ క్లియర్... కూటమిలోకి ఆహ్వానం
Agreement that paves the way for Finland and Sweden to join NATO: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మాడ్రిడ్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అదీగాక టర్కీ తన అభ్యంతరాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదుర్చోకోవడంతో ఆయా దేశాలు నాటోలో చేరే మార్గం సుగమం అయ్యిందని నాటో చీఫ్ స్టోలెన్బర్గ్ చెప్పారు. ఈ మేరకు టర్కీ, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆయుధాల ఎగుమతులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంతో సహా టర్కీ ఆందోళనలను పరిష్కరించే దిశగా మెమోరాండంపై సంతంకం చేశాయని చెప్పారు. తదనంతరం నాటో నాయకులు ఫిన్లాండ్, స్వీడన్ దేశాలను అధికారికంగా కూటమిలోకి చేరాలని ఆహ్వానిస్తారని స్టోలెన్బర్గ్ తెలిపారు. దీంతో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకు నాటోలో చేరేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాని కూడా అన్నారు. -
ఆయిల్ ఇండియా చీఫ్గా రంజిత్ రాత్ ఎంపిక
న్యూఢిల్లీ: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ– ఆయిల్ ఇండియా చీఫ్గా రంజిత్ రాత్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ నియామకాల బోర్డ్ (పీఈఎస్బీ) ఒక ప్రకటన విడుదల చేసింది. 50 సంవత్సరాల రాత్ ప్రస్తుతం మినీరత్న కంపెనీగా గుర్తింపు పొందిన మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ (ఎంఈసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలకుగాను జరిగిన ఇంటర్వ్యూకు హాజరైన ఐదుగురు అభ్యర్థుల్లో రాత్ ఒకరు. ఆయిల్ ఇండియా ప్రస్తుత సీఎండీగా సుశీల్ చంద్ర మిశ్రా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అటు తర్వాత రాత్ ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఇందుకు తొలుత ఆయన సచ్చీలతపై సీవీసీ, సీబీఐ వంటి అవినీతి నిరోధక శాఖల నుంచి క్లియరెన్స్లు ఇవ్వాలి. అటు తర్వాత రాత్ ఎంపికకు నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయాలి. -
నేవీ కొత్త చీఫ్గా హరికుమార్
న్యూఢిల్లీ: భారత నావికాదళం కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. హరికుమార్ ప్రస్తుతం వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్గా ఉన్నారు. ఈనెల 30వ తేదీన రిటైర్ కానున్న నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి అదే రోజు మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. కేరళకు చెందిన హరికుమార్కు కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది. -
నాసా బాస్.. భవ్యా లాల్
వాషింగ్టన్: నాసా అంటే అదెక్కడో అంతరిక్షంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అమెరికాలోనే ఉంది. అయితే అమెరికానే నాసాలో ఉన్నంతగా ప్రసిద్ధి చెందింది 63 ఏళ్ల వయసు కలిగిన ఈ ‘నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (నాసా) సంస్థ. యూఎస్ వారి స్పేస్ ఏజెన్సీనే నాసా. పాలనకు వైట్ హౌస్ ఎలాగో అంతరిక్ష పరిశోధనలకు నాసా అలాగ. అంతటి నాసాకు ఇప్పుడు భారత సంతతి మహిళ భవ్యాలాల్ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా అపాయింట్ అయ్యారు. పెద్ద విషయమే. వాడుకగా చెప్పాలంటే... మహిళావనికి భవ్య నియామకం ఒక ‘విశ్వ’ విజయం. ‘ఆ.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పోస్ట్ ఏముందీ’ అని ఎవరైనా నోరు చప్పరించవచ్చు! నాసా స్టాఫ్ అంతా సైంటిస్టులు, ఖగోళ శాస్త్ర నిపుణులు, ఇంకా ప్రత్యేకమైన ప్రతిభా ప్రావీణ్యాలు కలిగిన వారు. అక్కడి చిన్న ఉద్యోగికైనా పెద్ద చదువే ఉండి ఉంటుంది. వాళ్లందరి చీఫ్ ఇప్పుడు భవ్య. ప్రమోషన్ పై వచ్చారు. ఆమె కొత్త డిజిగ్నేషన్ను సరిగ్గా చెప్పాలంటే ‘యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్’! నాసా సిబ్బంది వ్యవహారాలలో ఇకపై కీలకమైన నిర్ణయాలన్నీ ఆమెవే. ఈ హోదాతోపాటు భవ్యకు ఇంకొక ముఖ్యమైన బాధ్యతను కూడా అదనంగా అప్పగించింది బైడన్ ప్రభుత్వం. అవును. ప్రభుత్వమే. నాసా అమెరికన్ ఏజెన్సీ కనుక అందులోని ముఖ్యమైన నియామకాలన్నీ స్వయంగా అమెరికా అధ్యక్షుడే చూస్తారు. సరే, భవ్య అదనంగా చూడవలసింది.. నాసా ‘బడ్జెట్ అండ్ ఫైనాన్స్’ విభాగానికి సలహాలు ఇవ్వడం.. ‘సీనియర్ అడ్వైజర్’ పోస్ట్! చీఫ్ ఆఫ్ స్టాఫ్గా, సీనియర్ అడ్వైజర్గా రెండు బాధ్యతల్ని ఆమె నిర్వహించగలరన్న నమ్మకంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ((చదవండి: నాసాకు తొలి మహిళా చీఫ్?)) ఇంజినీరింగ్, స్పేస్ టెక్నాలజీలో భవ్యకు ఉన్న అనుభవం ముందు ఆమె వయసు ఎంతైనా అది చిన్నబోతుంది. వాషింగ్టన్లోని ప్రతిష్టాత్మక ఎస్టీపీఐ (సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్స్టిట్యూట్)లో 2005 నుంచి 2020 వరకు పరిశోధనలు చేశారు భవ్య. ఎస్టీపీఐ నాసాతో సమన్వయమై పని చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటికీ ఎప్పటికప్పుడు అవసరమైన సాంకేతికను వృద్ధి చేయడంలోనూ ఆమె ఏనాడో సీనియర్ స్థాయికి చేరుకున్నారు. భవ్య న్యూక్లియర్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. టెక్నాలజీ అండ్ పాలసీలో ఇంకో మాస్టర్ డిగ్రీ! జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డాక్టరేట్ చే శారు. ఎస్టీపీఐలో చేరక ముందు ఎస్టీపీఎస్ అనే మరొక టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విభాగానికి ప్రెసిడెంట్గా, అంతకన్నా ముందు ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టడీస్’ కి (మాసచుసెట్స్లోని కేంబ్రిడ్జి ప్రాంతంలో ఉంటుంది) డైరెక్టర్గా ఉన్నారు. ఇవన్నీ చెప్పకుంటూ వెళితే భవ్య ఒక చదువుకున్న రోబో అనిపిస్తారు. ఈ మాట నెగటివ్గా అంటున్నది కాదు. ఇలాంటి టెక్నికల్ విషయాలే ఆమె ప్రొఫైల్ నిండా మనకు కనిపించేవి. ఖగోళ పరిజ్ఞానం ఉన్న విధాన నిర్ణేత.. భవ్య. స్పేస్ సైన్స్ పాలసీ మేకర్! నాసాలో ఉండేవాళ్ల వ్యక్తిగత వివరాలేవీ భూగోళం మీద కనిపించనంత గోప్యంగా ఉంటాయి. భవ్య కూడా అంతే. ఒక నాసా తార. అంతమాత్రమే లోకానికి. ఈమె గురించి మనం ఒక పది విషయాలను అదనంగా తెలుసుకోగలిగినా అవి ఆమె వ్యక్తిగతమైనవి కాక, వృత్తి పరమైనవి మాత్రమే అయి ఉంటాయి. అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహాలు, అంతరిక్ష అణుశక్తి, ఖోగోళ శోధన ఆమెకు కలలోనైనా ఇష్టమైన అంశాలు. ఆ అంశాలలో తన అధ్యయన, పరిశోధనల సారాంశాన్ని తరచు ఆమె ది ఎకనమిస్ట్, నేషనల్ జియోగ్రఫిక్, స్పేస్ వంటి ప్రఖ్యాత పత్రికలకు వ్యాసాలుగా రాస్తుంటారు. ఇంటర్నేషనల్ ఆకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాట్స్లో ఆమెకు సభ్యత్వాన్ని సంపాదించి పెట్టింది ఆమె శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే. -
నాసాకు తొలి మహిళా చీఫ్?
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు తదుపరి అధిపతిగా ఒక మహిళ రాబోతుందా? అంటే అవునంటున్నాయి అమెరికా మీడియా వర్గాలు. జోబైడెన్ అధ్యక్షుడిగా పదవి చేపట్టడంతో ఇప్పటివరకు నాసా అధిపతిగా ఉన్న జిమ్ బ్రిండెన్స్టైన్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. జిమ్ స్థానంలో నాసా చీఫ్గా ఒక మహిళ ను ఎంచుకోవాలని బైడెన్ భావిస్తున్నట్లు సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రిక తెలిపింది. ఇదే నిజమైతే 1958లో ఏర్పాటైన తర్వాత తొలిసారి నాసాకు ఒక మహిళాధిపతి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం జిమ్ స్థానంలో స్టీవ్ జుర్జెక్ను నాసా తాత్కాలిక అధిపతిగా బైడెన్ నియమించారు. మీడియా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే బైడెన్ టీమ్లో పనిచేస్తున్న ఎల్లెన్ స్టోఫాన్, పామ్మెల్ రాయ్ తదితరులు ఈ రేసులో ఉన్నారు. వీరిలో స్టోఫాన్ ప్లానెటరీ జియాలజిస్టు, 2013–16లో నాసా చీఫ్ సైంటిస్టుగా పని చేశారు. ఇప్పటికే స్మిత్ సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకు పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సాధించారు. మెల్రాయ్ యూఎస్ వైమానిక దళంలో, నాసాలో పనిచేశారు. టీటీఓ, యూఎస్డీఏఆర్పీఏ సంస్థలకు డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. వీరితోపాటు క్లైమేట్ సైంటిస్టు షానన్ వాలీ, టెక్నాలజీ అనలిస్టు భవ్యా లాల్, ఆస్ట్రోఫిజిస్ట్ జెడిదా ఐలర్ పేర్లు సైతం నాసా రేసులో వినిపిస్తున్నాయి. కేబినెట్లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించిన బైడెన్– హారిస్ ప్రభుత్వం ఇదే ధోరణిని నాసాకు కూడా విస్తరించాలని యోచిస్తోందని ప్రముఖ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్, నాసా ప్యానెల్స్లో మెంబర్గా పనిచేసిన జాక్ బర్న్స్ అభిప్రాయపడ్డారు. నిజానికి నాసాకు ఎప్పుడో మహిళాధిపతిని నియమించాల్సి ఉందన్నారు. నాసా చీఫ్గా నియమించే అవకాశాలున్న కొందరి పేర్లను తాను అంచనా వేస్తున్నానని, కానీ ఇప్పుడు బహిర్గతం చేయనని తెలిపారు. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం కరోనా కట్టడిపై అధిక శ్రద్ధ పెడుతున్నందున కొత్త చీఫ్ ఎంపిక 2021 మధ్యలో ఉండొచ్చని అంచనా.