-
టీడీపీ ఈవెంట్గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!
తాడేపల్లి, సాక్షి: వలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు పది వేల రూపాయాలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక.. నెల తిరగక ముందే ఆ హామీని తుంగలో తొక్కేశారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుందనే చర్చ మొదలైంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మారిందది. పెన్షన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తూ హల్ చల్ చేస్తున్నారు.‘‘వలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ, ఒక్కరోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు’’ అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ టైంలో వలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసిందెవరో అందరికీ తెలుసు.ఇదీ చదవండి: పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్మెంట్కు ఎసరుచంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి.. టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ వ్యవహారమంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు.. ఇప్పుడు జగన్ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీలో ముందు ముందు కూడా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి. -
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్మెంట్కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
మూడు వారాల్లో రూ.7 వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారం అప్పు చేయందే గడవదంటూ ఇన్నాళ్లూ వైఎస్ జగన్ సర్కారుపై రాసిందే పదే పదే రాస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా విషం కక్కాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రతీ మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బాబు సర్కారు ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాకు సంపద సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందా.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పులు చేయడానికి వెసులు బాటు కల్పిస్తూ ప్రతి మూడు నెలలకు ఆర్బీఐ వేలం వేసే తేదీలను ముందుగానే ప్రకటిస్తుంది. ఆయా తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర అప్పు చేస్తాయో.. ఎన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఆ అప్పు తీరుస్తాయో ఆర్బీఐకి తెలియజేస్తాయి. అదే తరహాలో గత వైఎస్ జగన్ సర్కారు పరిమితికి లోబడి అప్పులు చేస్తే.. ప్రతి మంగళవారం అప్పు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా నిత్యం దు్రష్పచారం చేస్తూ కథనాలు వండి వారుస్తూ నానా యాగీ చేశాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు 20 రోజుల వ్యవధిలోనే రూ.7000 కోట్లు అప్పు చేసినా.. అదీ ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. దాని గురించి ఒక్క ముక్క రాయడం లేదు. అంటే తమకు ఇషు్టడైన చంద్రబాబు అధికారంలో ఉన్నందున, ఎన్ని అప్పులు చేసినా.. ఆ పత్రికలకు సంపద సృష్టిలా కనిపిస్తుందేమోనని ఉన్నతాధికారి ఒకరు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ అంటే ఇష్టం లేనందున పరిమితికి లోబడి అప్పులు తెచ్చినా సరే ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ పెద్ద నేరం చేసినట్లు నిత్యం ఆ పత్రికలు కథనాలు రాసినట్లు ఇప్పుడు స్పష్టం అవుతోందని ఆ అధికారి విశ్లేషించారు. సంపద సృష్టి ఏమైందో! వైఎస్ జగన్ సర్కారు అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్లు విషం కక్కారు. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి అప్పులు చేయడం కాదు.. సంపద సృష్టిస్తానని, ఆ సంపద ఎలా సృష్టించాలో తనకే తెలుసంటూ ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతి మంగళవారం అప్పులు చేస్తామంటూ ఆర్బీఐకి స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో ప్రతి మంగళవారం అప్పులతో పాటు ఎంత సంపద సృష్టిస్తారో కూడా చెబితే బాగుంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన సెక్యురిటీల వేలం ద్వారా రూ.2,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కారు.. వచ్చే నెల 2వ తేదీన మంగళవారం మరో రూ.5,000 కోట్లు అప్పు చేస్తోంది. వచ్చే నెల 2వ తేదీన రూ.1,000 కోట్లు తమ్మిది సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 12 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 17 ఏళ్ల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 21 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 24 ఏళ్ల కాల వ్యవధికి సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పు చేయనుంది. ఆ తర్వాత మంగళవారం కూడా అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలియజేసింది. -
పయ్యావుల వ్యాఖ్యలతో కుట్ర బట్టబయలు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమానించిందే జరుగుతోంది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అణగదొక్కాలని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర.. సాక్షాత్తూ మంత్రి పయ్యావుల వ్యాఖ్యలతో బయటపడింది. వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మంగళవారం వైఎస్ జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో ఎన్నో కీలకాంశాలను ప్రస్తావించారాయన. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని, గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పలు పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాల్ని సైతం ఆయన ఉటంకించారు. అయినప్పటికీ.. ప్రతిపక్ష హోదాను వైఎస్సార్సీపీకి దక్కనివ్వకుండా ప్రభుత్వం బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.ఈ లేఖపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను మీడియా స్పందించాలని కోరింది. దానికి పయ్యావుల వివరణ ఇస్తూ.. "అసెంబ్లీలో జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కే అవకాశమే లేదని" అన్నారు. అంతేకాదు ఆయన ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు. పైగా "స్పీకర్ కి లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కేందుకు పదేళ్లు పట్టిందంటూ" వెటకారంగా మాట్లాడారు.దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంశాన్ని గనుక పరిశీలిస్తే.. ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ/ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ, ఏపీ అసెంబ్లీలో ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పీకర్కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12-బీ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించిందని లేఖలోనే స్పష్టం చేశారు.ఇక.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్ పరిధిలోని అంశం. జగన్ రాసిన లేఖపై ఇంకా స్పీకర్ నుంచి బదులు రాలేదు. ఈలోపే పయ్యావుల, వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పడం దేనికి సంకేతం? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా.. అసలు వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్రగా ఇప్పుడు తేటతెల్లమయ్యింది. -
రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించటానికీ, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వంటి ఉదాత్త అంశాలను అందుబాటులోకి తేవడానికీ మన ‘రాజ్యాంగ పరిషత్’ రాజ్యాంగాన్ని రూపొందించింది. ప్రజాస్వామ్య సాధారణ లక్ష్యాల గురించి రాజ్యాంగ ప్రవేశికలో స్పష్టంగా ఉంది. ప్రధానంగా నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన అందులో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంచుతామని ప్రమాణం చేస్తారు. కానీ ఇటీవలి (2024) సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనల గురించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మారిందో చెప్పక తప్పదు. ఆధునిక విజ్ఞాన చక్రవర్తి ‘ఎలెన్ మస్క్’ లాంటి వాళ్ళు ఈవీఎమ్ల పనితీరును ఆక్షేపించారంటేనే ఎంత ఘోరంగా ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా కూడా ఈసారి మన ఎన్నికలను తప్పు పట్టింది. 20 లక్షల ఈవీఎమ్లు ఎటుపోయాయో ఎవరూ సమాధానం చెప్పరు. న్యాయబద్ధంగా గెలవాల్సిన ఆంధ్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మాయాజాలం జరిగింది. ‘మాకు మంచి చేసిన జగన్ ప్రభుత్వానికి వేసిన మా ఓటు ఏమయ్యింద’ని సామాన్య ఓటరు అడుగుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడి చేతిలో 1995 లోనూ ప్రజాస్వామ్యం కుప్ప కూలటం చూశాం. కానీ ఏకంగా ఎన్నికల కమిషన్ సాయం అందించి కూటమి గెలుపు కోసం శ్రమించడం ఇప్పుడే చూస్తున్నాం. ‘దారులన్నీ పెట్టుబడిదారి యంత్రాల కోరల్లోకే అని అర్థమయ్యాక నా వాదనే నాకు బలహీనంగా అనిపిస్తున్నది’ అంటారు కార్ల్ మార్క్స్. ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అధికారం, డబ్బుల మయం అయిన వైనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ‘గెలవటానికి ఏ అడ్డదారైనా ఫర్వాలేదు, గెలవటమే ప్రధానం. ఎన్ని అవినీతి మార్గాలున్నాయో వాటన్నిటి ద్వారా డబ్బు సంపాదించు, వ్యవస్థల్ని అదుపులో పెట్టుకో’ అనే ఎత్తుగడతో చంద్రబాబులాంటి వారు వ్యవహరించారు. వీరి నిఘంటువులో న్యాయం, ధర్మం, మానవత్వం అనేవి లేవు. అబద్ధాలు, అక్రమాలు వీరి ప్రాథమిక సూత్రాలు. గెలుస్తుందన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డ దారిలో ఓడించారు. గత ఐదేళ్లుగా జగన్ ఏ మంచి చేసినా దానిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా గోబెల్స్ ప్రచారాలు సాగిస్తూ, అరాచకాలూ వాళ్ళే చేస్తూ వాటిని జగన్ ప్రభుత్వం మీద రుద్దుతూ వచ్చారు. కూటమి గెలుపు తర్వాత ఇప్పుడు దానిదైన నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో రెడ్బుక్ పాలసీ కూడా ఒకటి. దానిలో భాగంగానే వీళ్ళు చేయబోయే ఆకృత్యాలను ప్రజలకు చేరకుండా ఉండటానికి ముందుగా పచ్చమీడియా తప్ప మిగిలిన అన్ని ఛానెల్స్ను బ్యాన్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే వీళ్ళు ప్రేరేపించిన రౌడీమూకలు రాష్ట్ర్రంలో చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన... ఓటర్ల దగ్గర నుండి నాయకుల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టటం లేదు. ఏకంగా ఈ మూక ఇళ్ళ మీదకు ఎగబడుతూ తమ వ్యతిరేకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కత్తిపోట్లతో ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలను కొడుతున్నారు. నాయకులను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి బిహార్లో ఉన్న అరాచకం నేడు ఆంధ్రాలో వర్ధిల్లుతోంది. చివరకు చంద్రబాబు నిరంకుశత్వం ఎంత పరాకాష్టకు చేరిందంటే... వైఎస్సార్సీపీ ఆఫీసును కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ఉత్తర ప్రదేశ్లో లాగా పొక్లెయిన్ లతో తెల్లవారేసరికి కూల్చేశారు. కానీ ఏ వార్తా పచ్చ మీడియా రాయదు. చూపించదు. ఈ దుర్ఘటనలు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్నీ పోగొడుతున్నాయి. ఇక్కడ గ్రీకు తత్త్వవేత్త ‘ఎపిక్యురస్’ అన్న మాటలు... ‘పదే పదే దుర్మార్గాలు చేస్తున్న వారిని చూస్తుంటే దేవుడు చెడును ఆపాలనుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే ఈ సృష్టి స్థితిలయలు అతని అదుపులో లేవన్నమాట. సమర్థుడే అనుకుంటే చెడును ఎందుకు నివారించటం లేదు. ఈ పగ, ద్వేషాలను, చెడును ఆపే సామర్థ్యం లేకపోతే ఇక ఎందుకండీ దేవుడు. రక్షకుడనే బిరుదులు?’ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం అన్న ఈ మాటలు నిజంగా ఆలోచించతగినవే కదా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఒక్కసారి జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి పద్యాల్లో చూద్దాం. పోలిక ఎంత బాగా సరిపోతుందో– కర్కశ కరాళ కారుమేఘాల నీడలెగురుతున్నవి/ప్రజల నెమ్ముగములందు/క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి /క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల నిజంగానే ‘ఏ నిరర్థ్ధక నిర్భాగ్య నీరస గళాలు ఎలుగెత్తి వాపోతున్నయ్యో– వెలయవో ప్రాభాతశోభావళుల్ అన్నట్లు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం సుపరిపాలన అందించిన జగన్ మోహన్ రెడ్డి పునరాగమనం కోసం ఆశతో ఎదురుచూద్దాం.డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి -
సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది ఫించన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యో గుల ద్వారా ఇంటివద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు జూలై 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం చంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి విలేకరులకు వెల్లడించారు. డీఎస్సీ 2024 ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎస్జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ఇకపై నిరంతర ప్రక్రియగా ఏటా నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)ను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నియామకాల కంటే ముందే టీచర్లకు శిక్షణ డిసెంబర్ 10వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుత విద్యా విధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అధ్యయనం చేసే దిశగా అధికారులు సమాయత్తం కావాలని నిర్దేశించారు.⇒ ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్ట్ 27 ఆఫ్ 2023) రద్దు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ‘సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారులు అనవసర సమస్యలు సృష్టిస్తారని గుర్తించాం. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి వైరుధ్యం ఉంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. భూ యజమానులు ఒరిజినల్ డాక్యుమెంట్ను పొందే అవకాశాన్ని కల్పిస్తాం’ అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ⇒ సామాజిక పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి మొత్తంగా రూ.7 వేలను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ రూ. 3 వేల నుంచి రూ.6 వేలకు, పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ రూ.15 వేలకు, కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరగనుంది. డయాలసిస్, సికిల్సెల్ ఎనీమియా, థలసేమియా, హెచ్ఐవీ తదితర బాధితులకు పెన్షన్ పంపిణీ డీబీటీ ద్వారా చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పెన్షన్ పెంపు నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 65.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.⇒ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 4.4 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. డిమాండ్, సప్లై, అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్ గ్యాప్ను అంచనా వేయడం, అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో నైపుణ్య సర్వేను 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ⇒ రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది. ⇒ విజయవాడలోని డా.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా తిరిగి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈమేరకు నిర్ణయం తీసుకుంది.⇒ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్వ అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి రాజీనామాలను ఆమోదించింది.⇒ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని, చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించేలా కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని పేర్కొన్నారు. రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్యం, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.7 శ్వేత పత్రాలుగత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం (ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్, ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి వీటిని విడుదల చేయనున్నారు. -
వలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్నదానిపై సోమవారం కొంత స్పష్టత వస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వలంటీర్ల వ్యవస్థపై చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నాయి.చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. గత ఐదేళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా వివరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు) సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.65 లక్షలమంది వలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 ఆక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2.65 లక్షల మంది వలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు లక్షన్నరమంది వలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’ అంటూ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. -
పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'
సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. పక్కాగా లీజున్నా దౌర్జన్యం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్ యార్డు వద్ద సర్వే నంబర్ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్డీఏ కమిషనర్కు వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి ఫోన్ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు. నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణంగుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్ప్రసాద్.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు కేబినెట్ తొలి భేటీ ముహూర్తం ఖరారు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో కొలువు దీరిన కొత్త మంత్రి వర్గ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన ఉదయం సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక కొత్త మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తూ వస్తున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన శాసన సభ సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్-డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. బుధవారం శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.ఇదీ చదవండి: డిప్యూటీ సీఎంగా పవన్, తొలి సంతకం దేని మీద అంటే.. -
సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆరు పథకాలకు టీడీపీ ప్రభుత్వం పేర్లు మార్చింది. ఈ మేరకు సాంఘిక సంకేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్గా ‘నాడు–నేడు’ డాష్ బోర్డు పేరు మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది.]ఈ పనుల పురోగతితో పాటు అన్ని అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రత్యేక కమిషనర్ను కూడా నియమించింది. అయితే, ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖలో ‘నాడు–నేడు’ పేరుతో ఉన్న వెబ్సైట్ను ‘స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్’గా పేరు మార్చారు. ఈ విభాగంలో రాష్ట్రంలోని సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల పునర్ నిర్మాణంతో పాటు 11 రకాల సదుపాయాలను కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ విభాగం చేపట్టింది. -
ఏపీలో ఫించన్ పథకం పేరు మార్పు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అందుకు తగ్గట్లే మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తాలుకా గుర్తులనూ చెరిపేసే అడుగులు వేశారు. ఇందులో ఒకటే.. ఫించన్ల పథకం పేరు మార్పు. 2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఫించన్లు అందించేది. కాకపోతే.. లబ్ధిదారులు స్వయంగా వెళ్లి క్యూ లైన్లలో నిలబడి ఆ డబ్బును అందుకోవాల్సి వచ్చేది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితి మారింది. ఫలితంగా.. గత ఐదేళ్లుగా వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట వలంటీర్ వ్యవస్థ ద్వారా..అదీ ఒకటో తేదీనే.. ఇంటికే పెన్షన్లు చేరేవి. అయితే ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పథకం పేరు మార్చేశారు. ఏపీలో ఫించన్ పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధిరించారు. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది.రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది. సీఎంగా చంద్రబాబు ఆ పింఛన్ ను రూ.4వేలకు పెంచుతూ దస్త్రంపై గురువారం సంతకం చేశారు. దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనుండటంతో జులై 1న పింఛన్ కింద వీరికి రూ. 7వేలు (జులై1న ఇచ్చే రూ.4వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ వెయ్యి చొప్పున) అందివ్వనున్నారు. అలాగే.. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3వేలు అందుతుంది.. జులై నెల నుంచి వారికి రూ. 6వేలు అందివ్వనున్నారు. -
నారా లోకేష్ కోసమేనా ఈ క్లియరెన్స్ అంతా!
ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం కూర్పు గమనిస్తే తెలుగుదేశం పార్టీలో తరం మారుతోందన్న స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు అనిపిస్తుంది. బహుశా ఈ టరమ్ లోనే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉండవచ్చనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా కొత్త టీమ్ ను తయారు చేసే ప్రక్రియ ఆరంభించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే తొలివిడత ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురికి మంత్రి పదవులు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. తద్వారా లోకేష్ కు సొంత టీమ్ తయారు అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా 1995లో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో అత్యంత కీలకభూమిక పోషించిన యనమల రామకృష్ణుడుకు ప్రస్తుత మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. యనమల ఎమ్మెల్సీగా ,మండలిలో ఇంతకాలం ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రకంగా కూడా ఒక తరం మారినట్లు లెక్క. యనమల 1999,2014 టరమ్ ల లో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. 1983 లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కీలకంగా ఉన్నారు. అలాగే 1983 లో శాసనసభకు ఎన్నికైన బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్యేలు అయిన గద్దె రామ్మోహన్, ధూళిపాళ్ల నరేంద్ర,జ్యోతుల నెహ్రూ వంటివారికి కూడా అవకాశం దక్కలేదు. ఎంత సీనియర్లు యినా అందరికి అవకాశాలు రావడం కష్టమే.కాని ఓవరాల్ గా చూసినప్పుడు మంత్రివర్గ స్వరూపాన్ని బట్టి ఈ విశ్లేషణలు వస్తాయి. అప్పట్లో యువకులే అయినా, ప్రస్తుతం వీరంతా వృద్దాప్యానికి చేరువ అవడాన్ని కూడా కొట్టిపారేయలేం. 1985లో తొలిసారి ఎన్నికై టీడీపీలోనే కొనసాగుతున్న ఎన్ ఎమ్ డి ఫరూక్ కు ఈ సారి కూడా మంత్రి పదవి వచ్చింది. విశేషంగా 1983లో టిడిపిలో ఉండి,1989 నుంచి కాంగ్రెస్ లో,తిరిగి 2014 టరమ్ లో టీడీపీలో, 2019లో వైఎస్సార్సీపీలో ఉండి, 2024 ఎన్నికల నాటికి టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కడం ఆసక్తికరంగా ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఏ శాఖ ఎవరికి?.. కొనసాగుతున్న లీక్స్మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు ,కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేరి ఈసారి ఢోన్ లో గెలిచారు. అయినా ఆయనకు మంత్రి చాన్స్ రాలేదు. మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు, చంద్రబాబుకు మధ్య ఉప్పు,నిప్పుగా ఉంటుంది. కాని భాస్కరరావు కుమారుడు మనోహర్ జనసేన తరపున గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి కావడం ఇంకో ప్రత్యేకత. ఇతర కోణాలను పరిశీలిస్తే, గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాబినెట్ కూర్పునకు ఈ క్యాబినెట్ కు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అప్పట్లో జగన్ బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా, చంద్రబాబు ఆ స్థాయిలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోయారు. జగన్ ఐదుగురికి,అందులో నలుగురు బలహీనవర్గాలవారికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించగా,చంద్రబాబు క్యాబినెట్ లో ఆ అవకాశం ఉండదు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. ఆయనకు కాకుండా ఇతరులకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ప్రాధాన్యత తగ్గించినట్లవుతుందని భావించి ఇలా చేశారట. జగన్ అధికారంలోకి రాగానే ఏభైశాతం మందికి బలహీనవర్గాలవారికి మంత్రి పదవులు ఇచ్చి, తదుపరి పునర్వ్యవస్థీకరణలో దానిని అరవై ఎనిమిది శాతానికి పెంచారు. ఆయన క్యాబినెట్ లో ఎస్సి,ఎస్టి, బిసి,మైనార్టీ వర్గాల వారు పదిహేడు మంది ఉండేవారు. ప్రస్తుతం చంద్రబాబు టీమ్ లో ఆ సంఖ్య పన్నెండుగానే ఉంది. జగన్ ఐదుగురు ఎస్సిలకు పదవులు ఇవ్వగా,ఇప్పుడు ఇద్దరికే అవకాశం వచ్చింది. జగన్ బిసిలు పదకుండు మందికి చాన్స్ ఇస్తే, చంద్రబాబు ఎనిమిది మందికే ఇచ్చారు.అప్పట్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒకరు కొంతకాలం మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం నలుగురు కమ్మ నేతలకు మంత్రిపదవులు దక్కాయి. కాపులకు సంబంధించి అప్పటి మాదిరే నలుగురికి అవకాశం వచ్చింది. అప్పట్లో రెడ్లు నలుగురు ఉంటే,చంద్రబాబు వద్ద ముగ్గురు రెడ్లకే పదవులు దక్కాయి. స్థూలంగా చూస్తే అగ్రవర్ణాలకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు.జనసేన నుంచి ముగ్గురికి అవకాశం వస్తే ఇద్దరు కాపు,ఒక కమ్మ నేతకు పదవులు వచ్చాయి. బీజేపీ ఒక బిసి కి మంత్రి పదవి ఇచ్చింది. 2014 టరమ్ లో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. కాని ఈ టరమ్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రస్తుతానికి ఒకరికే అవకాశం ఇచ్చారు. కేంద్రంలో తాను ఆశించినన్ని పదవులు మోడీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఏమైనా ఇలా చేశారా?లేక మరో స్థానం ఖాళీగా ఉంది కనుక ,బీజేపీకి రిజర్వు చేసి ఉంచారా అన్నది చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు పదమూడు మంది అగ్రవర్ణాల వారికి పదవులు ఇచ్చారు. తొలిసారి మంత్రి పదవులు పొందినవారి సంఖ్య పదహారుగా ఉండడం విశేషం. వీరిలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురికి పదవులు రావడం విశేషం.కాగా గతంలో ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవులు నిర్వహించిన ఇద్దరు లోకేష్, పి.నారాయణలు ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులు పొందారు.వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన ఇద్దరు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారధిలకు చంద్రబాబు క్యాబినెట్ లో అవకాశం రావడం విశేషం. కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర,పి.నారాయణ,ఫరూఖ్ , రామనారాయణరెడ్డి, పార్ధసారధి,లోకేష్ లకు మంత్రి పదవులు చేసిన అనుభవం ఉంది.నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో డిప్యూటి స్పీకర్, స్పీకర్ పదవులు చేశారు. పవన్ కళ్యాణ్ తో సహా వంగలపూడి అనిత,సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా వీరాంజనేయ స్వామి,గొట్టిపాటి రవి,కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బిసి జనార్ధనరెడ్డి, టిజి భరత్, ఎస్.సవిత,వాసంశెట్టి సుభాష్,కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లె రాంప్రసాదరెడ్డి లు తొలిసారి మంత్రులు అయ్యారు. వీరిలో పయ్యావుల కేశవ్ తొలిసారి 1994 లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఇంతకాలం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఓటమిపాలవడం, లేదా ఈయన గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోవడం జరుగుతుండేది. ఈసారి ఆ ఇబ్బంది రాలేదు. గొట్టిపాటి రవి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తదుపరి 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు టీడీపీలోకి వెళ్లి 2019లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. ఈసారి మంత్రి పదవి పొందగలిగారు. సత్యకుమార్ యాదవ్ పూర్వం బీజేపీ అగ్రనేతలలో ఒకరైన ఎమ్..వెంకయ్య నాయుడు వద్ద పిఎ గా జీవితాన్ని ఆరంభించి, ఆ తర్వాత నేరుగా అమిత్ షా అండతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అయ్యారు. ఈ విడత బీజేపీ టిక్కెట్ పొంది, గెలిచి మంత్రి కాగలిగారు.రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత ఓటమి ఎరుగని గంటా శ్రీనివాసరావుకు కూడా మంత్రి పదవి రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరో నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి హామీ ఉందని చెబుతారు. కాని ఆయనకు ఇవ్వకుండా ఆనం వైపు మొగ్గు చూపారు.బీజేపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరో సీనియర్ నేత ఆరుసార్లు ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణకు కూడా చాన్స్ రాలేదు. సహజంగానే మంత్రి పదవులు దక్కని సీనియర్లకు కొంత అసంతృప్తి ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు బహిర్గతం కాకపోయినా, భవిష్యత్తులో వెల్లడి కావచ్చు. మంత్రి పదవులు ఇవ్వడం అన్నది ఒక సవాలు.అందరిని సంతృప్తిపరచడం ఏ సీఎం వల్ల కాదు. బలహీనవర్గాలవారికి ఆశించిన రీతిలో పదవులు రాలేదన్న భావన ప్రచారం కాకుండా జాగ్రత్త పడడంలో చంద్రబాబు నేర్పరే అయినప్పటికీ, జగన్ క్యాబినెట్తో ఈ విషయంలో అంతా పోల్చుకుంటారని చెప్పకతప్పదు.లోకేష్ సహజంగానే మంత్రివర్గంలో తన ముద్ర ఉండాలని కోరుకుంటారు.అందుకు తగ్గట్లుగానే చంద్రబాబు మంత్రుల ఎంపిక చేసి ఉండవచ్చు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న పలువురు కీలక నేతలకు మంత్రులుగా అవకాశం రాకపోవడం తరం మార్పునకు ఒక సూచనగా పరిగణిస్తున్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ల్యాండ్ టైట్లింగ్ కేంద్రం అమలు చేసే చట్టం
అవనిగడ్డ: ల్యాండ్ టైట్లింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే చట్టమని, రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాని ఈ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలకు ఏమీ దొరక్క, ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఈ చట్టంపై దిగజారుడు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్లో ఎలాంటి లోపాలు కనబడకపోవడంతో ఈ చట్టం అమలైతే జగన్మోహన్రెడ్డి మీ భూములన్నింటినీ తాకట్టు పెట్టుకుంటారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనుకునే వారు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అయినా ఇలా చేస్తుందా, అలా చేస్తే వ్యవస్ధ నడుస్తుందా అన్నారు. ప్రజల మెదళ్లలో విషం ఎక్కించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయర్టీని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకునే బాబు అంత అసహ్యంగా మాట్లాడటానికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మోసగించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. సమగ్ర భూ సర్వే సాహసోపేతమైన చర్య అని.. 6 వేల గ్రామాల్లో ప్రయోగాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం పూర్తిస్ధాయిలో అమల్లోకి వస్తే రాష్ట్రంలో భూములకు సంబంధించి వివాదాలు, ఎలాంటి గొడవలు ఉండవని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు చెబుతున్న మాటలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతున్న విషయం తెలిసి చంద్రబాబు ఎంత ఆందోళనకు గురవుతున్నారో ఆయన మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక వందేళ్ల నుంచి ఉన్న భూ సమస్యను పరిష్కరించారని, లక్షలాది ఎకరాల్లో చుక్కల భూముల అంశాన్ని పరిష్కరించారన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ దు్రష్పచారాన్ని ప్రజలు నమ్మొద్దని, 10 రోజుల తరువాత టీడీపీ, జనసేన మైకులు, వాళ్ల నోళ్లు మూగబోతాయని జోస్యం చెప్పారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, నియోజవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వి నర్ రేపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్ అంటే మంట...మంచి చేసిన జగన్ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్ ఇచ్చే సమాధానాలివి...సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను సీఎం వైఎస్ జగన్ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్లో ఒక్కో మాదిరిగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ టెస్ట్లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్ జగన్పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది.స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించింది.ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్ట్స్బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.-వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది. -
FactCheck: ‘అంధుడి’ సర్టిఫికెట్ అందుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రాజ గురువు రామోజీ పదే పదే విషం కక్కుతూ చివరికి కోర్టుల్ని సైతం పక్కదారి పట్టించేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. అధికారులు ఇసుకపై కోర్టులకు ఇవ్వాల్సిన నివేదికలు తనకే ఇచ్చినట్లు ఊహించుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే.. కృష్ణా జిల్లా గనుల శాఖాధికారి సంచలన నివేదిక’ పేరుతో రామోజీ రోత పత్రిక వాస్తవాలకు మసి పూసి పూర్తిగా వక్రీకరించి అడ్డగోలు కథనాన్ని ప్రచురించింది.నివేదికలో అంతా అక్రమాలే జరిగాయని ఒక అధికారి నివేదిక ఇచ్చారంట.. అది ఈయనగారికి చెప్పారంట? దాన్నే ఏ ఆధారం లేకుండా అబద్దాలతో అచ్చేశారు. కోర్టులకు వెళ్లాల్సిన నివేదికలు అంతకంటె ముందు రామోజీ, ఈనాడు కార్యాలయాలకు వెళుతున్నాయంటే అది నమ్మాలా? ఒకవేళ నిజంగా అలా జరిగితే రామోజీరావు కోర్టుల్ని కూడా డిక్టేట్ చేస్తున్నారా?. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారణ జరుగుతుంటే దానిపై కోర్టును ధిక్కరించేలా అడ్డగోలు కథనాలు రాసి మరీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.జిల్లా కలెక్టర్లు ఇసుక రీచ్లను మరోసారి పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లా గనుల శాఖ అధికారితో సహా సంబంధిత అధికారుల బృందం ఇసుక రీచ్లను సందర్శించి నివేదికలను రూపొందిస్తున్నాయి. రూపొందించాక కోర్టుకు సమర్పించనున్నారు. ఈలోపే అక్రమ తవ్వకాలు జరిగాయని ఈనాడుకు తెలిసిపోతుందా? నివేదిక తయారు కాకుండానే అందులో ఏం రాస్తారో ఊహించుకుని తన ఇష్టానుసారం వార్తలు రాస్తారా?ఈ కథనాల ద్వారా కోర్టుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడమేగా? జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు చేసి, సమర్పించిన నివేదికలు మార్చేందుకు వీలుంటుందా? అలా మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా? ఈనాడు మాత్రం కనీస అవగాహన లేకుండా అక్రమాలు జరిగిపోతున్నాయని ఊహించుకుని, నివేదికలో అవి జరిగాయని ఊహించుకుని కథనాలు రాసేసింది. అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగకుండా గనులశాఖ, ఎస్ఇబి నిరంతరం పర్యవేక్షణ జరుపుతోంది.ఎక్కడ అక్రమాలు జరిగినా ఉక్కుపాదం మోపుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా అబద్ధాలు రాసింది. కేవలం రాజకీయ దురుద్ధేశంతో ప్రభుత్వంపై బుదరచల్లే పనిలో భాగంగా తరచూ ఇలాంటి కథనాలు రాస్తోంది. అందుబాటు ధరలోనే ఎక్కడా ఇసుక కొరత లేకుండా ప్రజలకు అందించడాన్ని తట్టుకోలేక అడ్డగోలుగా బురదజల్లుతున్నారు. పర్యావరణ అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ రాష్ట్రంలో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎస్ఇబిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరగకుండా అన్ని చోట్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇంత పకడ్భందీగా ఇసుక ఆపరేషన్స్ జరుగుతుంటే దానిపై అదే పనిగా అబద్ధపు ప్రచారం చేస్తోంది. 4 వేల కోట్ల విలువ లేని ఇసుక కాంట్రాక్టులో రూ.40 వేల కోట్ల దోపిడీయా? రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ఏపీఎండీసీ సహకారం అందిస్తోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం కామెడీ షో నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం టెండర్లు పిలిచిన మొత్తం కాంట్రాక్ట్ విలువే రూ.4 వేల కోట్ల లోపు ఉంటే, ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీ ఎలా జరుగుతుందో ఆ మహా మేధావికే తెలియాలి.ఏపీఎండీసీ శరవేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా మార్కెట్ నుంచి సేకరించేందుకు ఏపీఎండీసీ నిర్ణయించింది. బాండ్ల కోసం సేకరించే మొత్తం, దానికి చెల్లించే వడ్డీ కన్నా అధికంగా రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టనుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి వాణిజ్య ప్రయోజనం అందించే ప్రాజెక్టులనే బాండ్ల ద్వారా సేకరించిన సొమ్మును పెట్టుబడి వ్యయంగా పెట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.ఈ బాండ్ల సేకరణ ప్రక్రియ ఇంకా నడుస్తుండగానే ఏపీఎండీసీ రూ.7 వేల కోట్లకు బాండ్లు జారీ చేసిందని ఆరోపణలు చేయడం విడ్డూరమే. బాండ్ల కోసం ఆసక్తి వ్యక్తం చేసిన వారి వివరాలే తెలియకుండా, బాండ్ల జారీనే జరగకుండా, రూ.7 వేల కోట్లు ఎలా సేకరిస్తారో ఆ ప్రతినిధికే తెలియాలి? అసలు సేకరణే జరగని సొమ్మును ప్రభుత్వానికి ఎలా బదిలీ చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు మెప్పు కోసం ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
సేనానీ.. నీ ప్రాణాలకు ఉంది హాని ..
అయిపోయాయి.. అన్ని రకాల భూతవైద్యాలు.. చేతబడులు.. బాణామతి.. ఎత్తులు.. జిత్తులు ముగిశాయి. కూటమి విజయానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసేశారు. ఎన్ని సపర్యలు చేసినా పక్షవాతం రోగికి చెయ్యి కాలు నోరు రానట్లే కూటమి కూడా నిస్తేజంగా మంచానపడిన రోగిమాదిరి చూస్తుందే తప్ప ప్రయోజనం లేదు. ఈ గుడ్డిగుర్రాన్ని పంచకల్యాణి మాదిరిగా మార్చి యుద్ధానికి బయల్దేరుదాం అనుకున్న చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది. పవన్ కల్యాణ్కు చేర్చుకోవడం ద్వారా కాపుల ఓట్లు గంప గుత్తగా కొట్టేద్దాం. దాదాపు యాభై నియోజకవర్గాల్లో కాపులకు ప్రాబల్యం ఉంది కాబట్టి అవనీ హోల్సేల్ లాక్కోవచ్చని భావించి 21 సీట్లు ఇచ్చినా అదీ పెద్ద వర్కవుట్ కావడం లేదు.పవన్ ప్రభావం భారీగా ఉంటుందని ఆశించిన తూర్పు గోదావరి జిల్లాలోనే దాని ఫలితం అంతంతమాత్రం అని తెలుస్తోంది. గోదావరికి వరదలు తెచ్చే స్థాయిలో ఓట్లు తెస్తాడు అనుకున్న పవన్ సైతం పిఠాపురంలో గెలుపు కష్టమే అని ఎదురీదుతున్న తరుణంలో ఇక బాబులో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఏమి చేస్తే ఈ బతుకు బాగవుతుంది దేవుడా అనుకుంటున్నా తరుణంలో అయన ఇంకో కుట్రకు కూడా పాల్పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కు హాని తలపెట్టి ఆ అఘాయిత్యాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేసేందుకు సైతం కుట్ర పన్నుతున్నట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగానే తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు, కథనాలు రాయించి ఎన్నికల ముందు పవన్ మీద దాడి చేయించి దాన్ని ప్రభుత్వం వైఫల్యం అని బుకాయించి ఆ గాయాల నుంచి లభ్ది పొందాలని టీడీపీ, చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు సందేహాలున్నాయి. ఈమేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఒక అవగాహనా కుదిరిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే పవన్ కూడా పలు సార్లు కామెంట్లు చేశారు. తనమీద దాడులు చేసేందుకు రౌడీలు సిద్ధంగా ఉన్నారని, బ్లేడ్లు పట్టుకుని తమవాళ్లను కోస్తున్నారని కూడా అన్నారు. అంతే కాకుండా తానూ ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రెచ్చగొడుతున్నారు. చూస్తుంది బయటివాళ్ల సంగతి ఏమోకానీ చంద్రబాబు పురమాయించినవాళ్ళే పవన్ మీద దాడి చేసి, అయ్యో..మన బిడ్డకు ఘోరం జరిగిందని కొందరు అద్దె మనుషుల ద్వారా డ్రామా నడిపించి కాపుల ఓట్లు దండుకునేందుకు కుట్రలకు తెగబడవచ్చని జనసైనికులు, ఇంకా చంద్రబాబు నైజం తెలిసినవాళ్ళు అంటున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో చంద్రబాబును మించినవాళ్లు లేరని, రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతటికైనా దిగజారుతారని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందుకే పవన్... నువ్వు జరంత పైలం బిడ్డా అని జాగ్రత్తలు చెబుతున్నారు.- సిమ్మాదిరప్పన్న -
మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ
గతం ముద్దన్నం...నీళ్ల సాంబారు... అదీ అరకొర... ఇదీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బడిపిల్లలకు అందించే మధ్యాహ్న భోజన తీరు. ఆయన పాలనంటేనే కరువు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య రాష్ట్రంలో చాలావరకు కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలకు ఉపాధి కూడా కరువైంది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే.. అక్కడా ఆకలితో అలమటించేలా చేశారు. రోజూ ఒకేరకమైన మెనూవల్ల దానిని తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఈ అన్నం తిన్నవారికి కడుపునొప్పి సర్వ సాధారణం. కౌమారదశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచి్చన పిల్లల్లో 30 శాతంలోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున రూ.450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించే వారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు రూ.3.59 మాత్రమే కేటాయించారు. అదీ ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. ప్రస్తుతం పాలనపై చిత్తశుద్ధి... విద్యారంగంపై సరికొత్త విజన్గల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు అమలుచేశారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ‘గోరుముద్ద’ పథకాన్ని స్వయంగా రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వంట ఖర్చును రూ.8.57 పెంచారు. బడ్జెట్ కూడా ఏడాదికి సగటున రూ.1,400 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోరి్టఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు ఐదు రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోను శ్రద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలు పిల్లలకు వడ్డిస్తున్నారు. ఉపాధ్యాయులు మొబైల్ యాప్లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. భోజనం చేశాక, వంటపై విద్యార్థులే స్వయంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల్లో 43 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రతిరోజు హాజరైనవారిలో సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ యాప్ ద్వారా తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. సోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం:ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ ‘గోరుముద్ద’కు జాతీయ అవార్డు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద అమలుకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. రక్తహీనత నివారణ, మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయడాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి గతేడాది నవంబర్లో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి రాష్ట్రానికి అందజేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్ల పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ(వేరుశనగ బార్) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ అవార్డు వేడుకలో అభినందించడం గమనార్హం. వంట ఏజెన్సీలకు ఖర్చులు పెంపు గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. 2014–18 వరకు వంటపాత్రల సరఫరా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,617 పాఠశాలలకు రూ.41 కోట్ల వ్యయంతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం 2014–18 మధ్య పిల్లల భోజన ఏడాది వ్యయం రూ.450 కోట్లు అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది సగటున రూ.1449 కోట్లకు పెంచింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ.3.59 నుంచి రూ.6.51 మధ్య మాత్రమే కాగా.. ప్రస్తుతం ఆ ఖర్చు రూ.8.57కు పెంచి చెల్లిస్తున్నారు. ఏటా సగటున రూ.1449 కోట్ల ఖర్చు ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది ఒంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘గోరుముద్ద’కు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు. ప్రభుత్వ బడుల్లోని 43 లక్షల మంది విద్యార్థుల కోసం రోజుకో మెనూ చొప్పున 16 రకాల ఐటమ్స్తో ‘జగనన్న గోరుముద్ద’ అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ‘గుడ్’ అని ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. గత ప్రభుత్వంలో నీళ్ల సాంబారు, ముద్ద అన్నం కోసం ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. గోరుముద్ద కోసం ప్రభుత్వం ఏటా సగటున రూ.1449 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.7,244.6 కోట్ల నిధులు వెచి్చంచింది. పౌష్టికాహారం కోసం ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు వారంలో మూడురోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడురోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే మెనూ పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు, దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీలు పాత్రలు అందించింది. -
జగన్ పాలనలో జనం హ్యాపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయమే కొలమానం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోకన్నా గత ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ, దాన్ని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.88,448 పెరిగింది. కోవిడ్ సంక్షోభం లేకపోయినప్పటికీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల రూ.60,128 మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాది 2018–19 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా, సీఎం జగన్ పాలనలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,42,479కి పెరిగింది. అంతేకాకుండా 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లలో జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది. 2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,14,000కు చేరింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,60,341 ఉండగా 2023–24 నాటికి రూ.2,42,479 కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 తో దేశంలో 17వ స్థానంలో ఉంది. కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం వరుసగా పెరుగుతూ 2022–23 నా టికి దేశంలోనే 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తలసరి ఆదాయం అంటే.. తలసరి ఆదాయం అనేది రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సు ముఖ్యమైన సూచిక. ఇది వ్యక్తులు, కుటుంబాలపై ఆచరణాత్మక ప్రభావాలను కలిగి ఉంటుంది. తలసరి ఆదాయం అంటే సాధారణంగా ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి డబ్బుని కలిగి ఉండటం. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఏదైనా రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కొలమానం తలసరి ఆదాయమే. జగన్ సర్కారు కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించిందిలా.. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల పథకాలను యథాతథంగా అమలు చేసింది. ఈ సమయంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. జీవనోపాధి కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంది. వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. ప్రజల ఆదాయ మార్గాలను పెంచేందుకు అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగే వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా నమోదైంది. -
భూ బకాసురుడు!
తమ సొమ్ము సోమవారం.. ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం... ముప్పొద్దుల తింటారు..అనే నానుడి చంద్రబాబు నాయుడికి అక్షరాలా సరిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విశాఖపట్నం, దొనకొండ, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కడో ఒక చోట రాజధానిని ఏర్పాటు చేస్తే తనకు మిగిలేదేముండదనే దురాలోచన బాబు మెదడులో మొలకెత్తింది. ఇంకేముంది.. ఆ 29 గ్రామాల ప్రాంతంలో మూడు పంటలు పండే జరీ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో తన సహచరుడు పొంగూరు నారాయణను ముందు పెట్టి సరికొత్త డ్రామాకు తెరలేపారు. తన పరివారం చెవిలో అసలు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పేశారు. వారి ద్వారా ఆ ప్రాంతంలో భూములు కొనిపించి, ఆ భూములకు కోట్ల విలువ వచ్చేలా కుట్ర పన్నారు. బాబు అమరావతి నాటకంలో అసైన్డ్ భూముల్ని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమిధలయ్యారు. బాబు అండ్ కో మాత్రం లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి... భూముల లభ్యత, వ్యవసాయ అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను శాస్త్రీయంగా విశ్లేషించి సహేతుకమైన సిఫార్సులు చేసింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, రాయలసీమలోని తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. తన బినామీ, సన్నిహితుడైన మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. పలు నాటకీయ పరిణామాల మధ్య రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. సామాన్య రియల్టర్లను ముంచిన బాబు... అమరావతిలో భూ దోపిడీకి పాల్పడటానికి ముందు రాజధాని లీక్స్ పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని సామాన్య రియల్టర్లు, సాధారణ ప్రజలను బురిడీ కొట్టించారు. రాజధానిగా ఏలూరు అని ఓసారి... నూజివీడు అని మరోసారి... కాదు కాదు... నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అని ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చారు. తన ఎల్లో మీడియా ద్వారా ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇప్పించి వార్తలు రాయించారు. ఆ పచ్చమాటలు నమ్మి సాధారణ రియల్టర్లు అప్పులు చేసి మరీ ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొద్దికొద్దిగా పొదుపు చేసిన మొత్తాలతో అక్కడ స్థలాలు కొన్నారు. చివరికి చంద్రబాబు ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని నామకరణం చేశారు. చంద్రబాబు కుట్రను గ్రహించలేక ఏలూరు, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన రియల్టర్లు వందల కోట్ల రూపాయలు నష్టపోయి నిండా మునిగారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ముందస్తు పన్నాగంతోనే... ► చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల చుట్టుపక్కల ఆయన, తన సన్నిహితులు, బినామీలు అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే సరికి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా కేవలం రాజధాని ప్రకటనతోనే చంద్రబాబు రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారు. ► రాజధాని కోసం భూ సమీకరణ పేరిట చంద్రబాబు బరితెగించి రైతుల భూములపై దండయాత్రకు పాల్పడ్డారు. రైతులను మభ్య పెట్టి వారి భూములు కొల్లగొట్టడం... అసైన్డ్ భూముల దోపిడీ... ప్రభుత్వ భూముల కబ్జా... లంక భూముల ఆక్రమణ... ఇలా యథేచ్ఛగా దోపిడీకి బరితెగించారు. తద్వారా మరో రూ.లక్ష కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు తానొక భూబకాసురుడినని నిరూపించుకున్నారు. ► అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి, వారి అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. భూ సమీకరణ కింద అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని బెదిరించి.. వాటినీ చెరబట్టింది. తర్వాత ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలోనే దాదాపు 1,500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీకి పాల్పడ్డారు. సింగపూర్ ముసుగులో స్విస్ చాలెంజ్ ► రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు అంతర్జాతీయ భూ కుంభకోణానికి తెరతీశారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన స్విస్ చాలెంజ్ విధానం ద్వారా భారీ కుంభకోణానికి తెగబడ్డారు. ► సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెబుతూ... తన సన్నిహితుడైన సింగపూర్ మంత్రికి చెందిన ప్రైవేటు కంపెనీతో వ్యవహారం నడిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిని సింగపూర్ కంపెనీకి అప్పగించి ప్రభుత్వమే రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే.. సింగపూర్ కంపెనీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుందనే ఓ మాయామోహ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ► భూములు, నిధులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా... సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా కల్పించేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు. సింగపూర్ కంపెనీ ముసుగులో తమ కుటుంబం గుప్పిట్లోనే స్టార్టప్ ఏరియా ఉండేలా చంద్రబాబు కుతంత్రం రచించి రూ.66 వేల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారు. ► కట్టని రాజధాని... అమరావతిలో నిరి్మంచని ఇన్నర్ రింగ్ (ఐఆర్ఆర్) రోడ్డు పేరిట చంద్రబాబు, నారాయణ ద్వయం తమ భూముల ధరలను అమాంతం పెంచేలా కుట్ర పన్నింది. ఇందుకు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. ► లింగమనేని, చంద్రబాబు, నారాయణ కుటుంబాలకు చెందిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఐఆర్ఆర్ అలైన్మెంట్ను అష్ట వంకర్లు తిప్పింది. తద్వారా కృష్ణా నదికి అటు వైపు, ఇటువైపు ఉన్న తమ భూముల విలువ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగేలా స్కెచ్ వేసింది. లింగమనేని కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం కలి్పంచినందుకు ప్రతిఫలంగా ఆ కుటుంబం నుంచి చంద్రబాబుకు కరకట్ట నివాసం, హెరిటేజ్ ఫుడ్స్కు భూములను పొంది క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. నిర్మాణాలు తాత్కాలికం.. దోపిడీ శాశ్వతం ► మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. ► అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారు. శాసన మండలి, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, ఇతర నిర్మాణాల పేరిట అస్మదీయులకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంచనా వ్యయం కంటే భారీగా అధిక శాతానికి టెండర్లు ఖరారు చేసి భారీగా కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టు సంస్థలు అత్యంత నాసిరకంగా తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి చేతులు దులుపుకున్నాయి. చిన్నపాటి చినుకులకే కారిపోయేలా.. ఎక్కడికక్కడ పెచ్చులు, ఫ్లోరింగ్ ఊడిపోతూ ఉన్న ఆ భవనాలు చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయి. ► రైతులను మభ్యపెట్టి తీసుకున్న అమరావతిలోని భూములను చంద్రబాబు తన అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించేశారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు అధిక ధరలకు భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ పారీ్టకి సన్నిహితులైన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కేటాయించడం చంద్రబాబు వంటి కుంభకోణాల సామ్రాట్కే సాధ్యమైంది. -
Ap: బాబు హయాం.. స్కాముల మయం !
నవ్యాంధ్రలో 2014 నుంచి 2019వరకూ చంద్రబాబు పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి. ప్రజాధనాన్ని దోచుకోవడం దాచుకోవడంతోనే చంద్రబాబు ఐదేళ్ల పాలన ముగిసిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించింది ఫైబర్ నెట్ కుంభకోణం. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఇంటింటికీ ఇంటర్నెట్ ఇస్తానని చెప్పుకున్న చంద్రబాబు ఫైబర్నెట్ పేరుతో ఎంత దోచుకున్నారు..? నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన మనుషులకు చెందిన కంపెనీల ద్వారా ఫైబర్ నెట్ పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తానంటూ ప్రారంభించిన ఫైబర్నెట్ ప్రాజెక్టు తొలిదశ టెండర్లలోనే అక్రమాలు జరిగాయి. 330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ను అనుకూలమైన కంపెనీకి కేటాయించేందుకు టెండర్ ప్రక్రియను తారుమారు చేయడం సహా టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయి. ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖకు బదులు ఇంధన, మౌలిక సదుపాయాల శాఖ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సిఫార్సు చేసారు. పాలక మండలి-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ను చంద్రబాబు నియమించారు. సీఎం హోదాలో చంద్రబాబే మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం తెలిపారు. సీఐడీ ఛార్జ్షీట్లో బాబుపై తీవ్ర అభియోగాలు.. ‘వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్వేర్ను బ్లాక్లిస్ట్లో పెట్టినప్పటికీ..నిబంధనలకు వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించాలంటూ అధికారులపై నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఫైబర్నెట్కు పారదర్శకంగా, పక్కాగా టెండర్లు నిర్వహించాలని కోరిన అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో తనకు అనుకూలమైనవారిని చంద్రబాబు నియమించారని సీఐడీ ఛార్జ్ షీట్లో తెలిపింది. ఫైబర్నెట్ కేసులో అప్పటి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, హైదరాబాద్లోని నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ ప్రసాద్పై మోసం, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి ఐపీసీ సెక్షన్లతో పాటు..అవినీతి నిరోధక చట్టం కింద ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేసిందని, ఈ కేసులో నాటి సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి’ అని న్యాయవాది సాయిరాం చెప్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం.. ‘నాసిరకం మెటీరియల్ని ఉపయోగించడం, షరతులను ఉల్లంఘించడం, ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నప్పుడు ఆర్ఎఫ్పీలో పేర్కొన్న స్పెసిఫికేషన్లకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ప్రాజెక్టులోని మొత్తం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సమారు 80 శాతం నిరుపయోగంగా మారిందని సీఐడీ పేర్కొంది. ఇది ఏపీ ఫైబర్ నెట్ జీవిత కాలానికి శాశ్వతమైన నష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీ ఫైబర్గ్రిడ్ ఫేజ్-1 ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 114 కోట్ల నష్టం వాటిల్లింది. 80 శాతం ఉపయోగించలేని ఆప్టిక్ ఫైబర్ వల్ల ఆపరేషన్, నిర్వహణ పనులు మరింత ఖరీదవుతాయి. దీంతో మరింత నష్టం వాటిల్లుతుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేశామని, మారుమూల ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలను విస్తరించడంతో పాటు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాం. ఆర్బీకేలు, స్కూల్స్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనేక ఆన్ లైన్ సౌకర్యాలను కల్పిస్తూ.. పాలనను మెరుగుపరిచాం’ అని ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్రెడ్డి చెప్పారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ..వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటైన చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనా కాలంలో అందినమేరకు దోచుకున్నారు. పైగా తాను ఎక్కడా ఎవరికీ దొరకనని గర్వంగా చెప్పుకుంటారు చంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన అవినీతి పనులన్నీ వెలికి తీయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో పాలనా వ్యవస్థలన్నిటినీ వైఎస్ఆర్సీపీ చక్కదిద్దింది. చంద్రబాబు నాశనం చేసిన ఫైబర్ నెట్ను గాడిలో పెట్టి నెట్ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇదీ చదవండి.. టీడీపీలో టికెట్ల కుమ్ములాట.. చంద్రబాబుపై అసమ్మతి నేతల ఫైర్ -
మోసం చేయడానికే రంగురంగుల మేనిఫెస్టో
గుంటూరు, సాక్షి: నోరు తెరిస్తే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని అంటారని.. అనుభవం అనేది రాష్ట్రాలకు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని.. ఏ అనుభవం లేకుండానే రాష్ట్రానికి సుపరిపాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగిస్తూ.. గత 57 నెలల్లో జరిగిన మంచిని ప్రస్తావిస్తూనే చంద్రబాబు తీరను ఎండగట్టారు. ఇప్పటివరకు ఐదు బడ్జెట్ లు ప్రవేశపెట్టాం. ఇదే బడ్జెట్ కు మరిన్ని మెరుగులతో వచ్చే ప్రభుత్వంలో పెట్టుకుందాం. 2024 జూన్ లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయి. కఠినమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చాం. ఇప్పటివరకు ఐదు ప్రజాబడ్జెట్లు ప్రవేశపెట్టాం. కరోనా కారణంగా ఆదాయం తగ్గింది.. ఖర్చులు పెరిగాయి. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కరోనా మూడేళ్లలో రాష్ట్రం రూ.66,116 కోట్లు నష్టపోయింది. కరోనా వల్ల ఇతర రాష్ట్రాలు కూడా బాగా నష్టపోయాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాలను ఈ పరిస్థితులు కుదిపేశాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి. 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 35 శాతం. ఈ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 31.5 శాతమే. ప్రతి ఏటా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గుతూ వచ్చాయి గత ప్రభుత్వ విధానాల కారణంగా విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాలు కుదేలయ్యాయి. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా చంద్రబాబు రైతులకు ఇవ్వలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనమిక్ పవర్ హౌస్ ఉండాలి. అలాంటి పవర్ హౌస్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ ను కోల్పోయాం. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది. అందుకోసమే విశాఖ గురించి పదేపదే చెప్తున్నా విభజన కారణంగా రాష్ట్రం ఏటా రూ.13 వేలకోట్లు నష్టపోతున్నాం. లక్షా 30 వేల కోట్లు అదనపు ఆదాయాన్ని కోల్పోయాం. మనకు ఆ వెసులుబాటు లేకుండా చేశారు. కనీసం చట్టంలోనూ ఆ వెసులుబాటు కల్పించలేదు. అందుకే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 57 నెలల మన ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదు. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన చేశాం. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి రూపాయి ప్రజలకు చేరుతోంది. రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులేస్తున్నారు. నాన్ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం. ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్తోంది. ఇలాంటి వారిపై మనం యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో కంటే అభివృద్ధి కోసం మేం అదనంగా ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే మా హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం. అప్పులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కువ అప్పులు చేశామని అబద్ధాల బ్యాచ్ ప్రచారం చేస్తోంది. విభజన నాటికి లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే... చంద్రబాబు దిగిపోయే సమయానికి 4.12 లక్షల కోట్లకు చేరింది. రూ.4.12 లక్షల కోట్ల అప్పులతో మన ప్రయాణం ప్రారంభించాం. చంద్రబాబు హయాంలో అప్పులు రూ.4,12,288 కోట్లు చంద్రబాబు హయాంలో అప్పులు 21.87 శాతం పెరిగితే .. మన హయాంలో అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశాం. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఒక్కరికీ మంచి చేసింది లేదు. మన పాలనలో అందరికీ సంక్షేమం అందించాం. బాబు హయాంలో అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మనం అక్కచెల్లెమ్మల ఖాతాలో రూ.2 లక్షల 55 వేల కోట్లు వేశాం. పేదలకు అండగా నిలబడ్డాం. ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. చంద్రబాబు పొత్తులకోసం వెంపర్లాడుతున్నారు. జాతీయ పార్టీలతో కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా అంటకాగుతున్నారు. చంద్రబాబు మళ్లీ మోసపూరిత వాగ్ధానాలు ఇస్తున్నాడు. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయినా... ప్రజలకు చేసిందేమీ లేదు. ఇప్పటికీ బాబు ఏంచేశాడో చెప్పి ఓటు అడగలేకపోతున్నాడు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే స్కీం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది.. వెన్నుపోటు. అన్ని సామాజిక వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్ తెస్తారు. ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా చంద్రబాబు చేసిందేమీ కనిపించదు. నమ్మినవాడు మునుగుతాడు... నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. పేదలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. పక్క రాష్ట్రాల్లోని వాగ్ధానాలను తీసుకొచ్చి మళ్లీ మేనిఫెస్టోలో పెట్టారు. బాబు కనీసం మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు ఎందుకు?. వేరే రాష్ట్రాల్లో ఆకట్టుకున్న హామీలను చంద్రబాబు తీసుకొచ్చారు. మా హయాంలో ఎవరూ టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చాం. 8 పథకాలకే రూ.52 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 650 వాగ్దానాలతో గత మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు అందులో 10 శాతం మాత్రమే అమలు చేశారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు అవుతుంది. ఇప్పటివరకు ఇచ్చిన వాగ్ధానాలకు రూ.లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్లు అమలు చేస్తే రాష్ట్రం ఏమవుతుంది?. దీనిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా. ఏమైనా అంటే చంద్రబాబు సంపద సృష్టిస్తాడని అంటారు. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రంలో రెవెన్యూ ద్రవ్య లోటు వాగ్ధానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు. విశ్వసనీయతకు అర్ధం జగనే. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశాం. మేలు చేశాం కాబట్టే ప్రతి గడపకు ధైర్యంగా పోగలుగుతున్నాం అని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. చంద్రబాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
CBN Petition: 17ఏ అవినీతిని కాపాడేందుకు కాదు
-
స్కామ్ కారకులనే నాడు అప్రమత్తం చేశారు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంను చాలా స్కిల్ ఫుల్గా జరిపించి.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. గురువారం స్కిల్డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. సీమెన్స్ ఏజీ అనే జర్మన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ. 3,300 కోట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం సీమెన్స్ కంపెనీ ఇస్తుందని.. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు. రూల్స్ ప్రకారం అది వీలుకాదని అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా ఏపీ ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్టెక్కు చెల్లించారు. చాలా నైపుణ్యంగా జరిగిన స్కామ్ ఇది. ప్రభుత్వ సంపదను చాలా సులభంగా దోచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన.. స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ అవకతవకల గురించి పుణే నుంచి జీఎస్టీ అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారు. అంటే.. పుణే నుంచి ఈ స్కామ్ బయటపడింది. చూస్కోండి బాబూ.. రూ. 371 కోట్లు హాంఫట్ అయ్యాయని లేఖ ద్వారా అలర్ట్ చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ స్కాంకు కర్తనో.. ఆ ప్రభుత్వానికే ఆ లేఖ అందింది. అంటే.. కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్నమాట. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది అని ఏఏజీ సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు అడగబోతుండగా.. తానేం దర్యాప్తు అధికారిని కానని.. కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వాదనలు మాత్రమే వినిపిస్తున్నానని.. అందుకే తనకు చేరిన పత్రాలు, వివరాల ఆధారంగా మీడియాకు సమాచారం ఇస్తున్నానని ఆయన తెలిపారు.