-
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్ డయల్ను కొనుగోలు చేయడానికి పావులు కదుపుతోంది. సుమారు 900 మిలియన్ డాలర్లతో జస్ట్డయల్ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే..జస్ట్ డయల్కు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల డేటాబేస్ రిటైల్ మార్కెట్లో రిలయన్స్ వేగంగా పుంజుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గతంలో జస్ట్ డయల్ టాటాతో చర్చలు జరపగా, ఆ చర్చలకు జస్ట్ డయల్ ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. 2021 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో జస్ట్డయల్ నికర లాభం సంవత్సరానికి 55.9% (రూ. 33.6 కోట్లకు), ఆపరేటింగ్ ఆదాయం 25.2% తగ్గి 175.7 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం జస్ట్డయల్ విలువ రూ .2,387.9 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ జస్ట్డయల్ను కొనుగోలు చేస్తోందన్న ఊహగానాలతో జస్ట్డయల్ స్టాక్ ధర గురువారం రోజున 2.5 శాతం పెరిగి రూ .1,107 వద్ద ముగిసింది. -
మైక్రోసాఫ్ట్ బిగ్ ప్లాన్స్ : భారీ కొనుగోలుకు సన్నాహాలు
వాషింగ్టన్: ప్రముఖ మెసేజింగ్ సైట్ డిస్కార్డ్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ పావులు కదుపుతోంది. డిస్కార్డ్ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్లతో డిస్కార్డ్ను కొనుగోలు చేయాలనుకుంటునట్లు సమాచారం. చాలా సంస్థలు డిస్కార్డ్ ను కొనేందుకు ప్రయత్నిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ముందు వరుసలో ఉందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇరు కంపెనీల ప్రతినిధులు కొనుగోలు విషయంపై క్లారీటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్, గిట్ హబ్, మైన్క్రాఫ్ట్ను కొనుగోలు చేసింది. ఈ వేదికలు కేవలం ప్రొఫెషనల్స్ కు మాత్రమే అందుబాటులో ఉండడంతో, సాధారణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ సోషల్ మీడియా సైట్ ను సొంతం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.గతంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టిక్టాక్ను సొంతం చేసుకోవాలకున్న, అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే డిస్కార్డ్ పై దృష్టి పెట్టింది. డిస్కార్డ్ మెసేజింగ్ యాప్తో యూజర్లకు వీడియో, వాయిస్, టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ సేవలను అందిస్తుంది. ఈ యాప్ కరోనా మహమ్మారి సమయంలో అత్యంత ప్రజాదరణ పొందింది.100 మిలియన్లకు పైగా యూజర్లను డిస్కార్డ్ కలిగి ఉంది.ప్రముఖ గేమింగ్ బ్రాండ్ ఎక్స్ బాక్స్ కు రూపకల్పన చేసింది డిస్కార్డే. గత ఏడాది డిసెంబరు వరకు కంపెనీ విలువ 7 బిలియన్ల డాలర్లకు చేరింది.అంతేకాకుండా దీనిని ఐపీవో కంపెనీగా మార్చాలని నిర్వహకులు భావిస్తున్నారు. గతంలో డిస్కార్డే ఏపిక్ గేమ్స్, అమెజాన్ కంపెనీలతో చర్చలు జరిపింది. (చదవండి: గూగుల్పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి!) -
ఆర్ఐఎల్ సెల్ - ఎయిర్టెల్, ఎస్బీఐ.. బయ్
ముంబై: దేశంలోనే రెండో పెద్ద మనీ మేనేజింగ్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ.. గత ఏడు నెలలుగా పోర్ట్ఫోలియో పెట్టుబడులలో పలు మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగా ఇటీవల భారీగా ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లలో అమ్మకాలు చేపట్టగా.. వెనకడుగులో ఉన్న కొన్ని కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఐవో ప్రశాంత్ జైన్ ఒక ఇంటర్వ్యూలో తమ పెట్టుబడు తీరుతోపాటు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేదీ వివరించారు. జైన్ తెలిపిన వివరాలు, అభిప్రాయాల ప్రకారం.. నిఫ్టీలో 26 స్టాక్స్ ఈ ఏడాది మార్చి 24 మొదలు అక్టోబర్ 30వరకూ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ నిఫ్టీ-50కు ప్రాతినిధ్యంవహించే కనీసం 26 బ్లూచిప్ స్టాక్స్లో విక్రయాలు చేపట్టింది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు ప్రయాణించిన నేపథ్యంలో పోర్ట్ఫోలియోలను పునర్నిర్మించుకుంది. మార్చి 24న 7,511కు పతనమైన నిఫ్టీ అక్టోబర్ చివరికల్లా 11,642కు చేరింది. దీంతో నిఫ్టీ పీఈ 34ను దాటేసింది. 10ఏళ్ల సగటు పీఈ 22.6 రెట్లుకావడం గమనార్హం. ఫలితంగా మార్చి కనిష్టాల నుంచి 120 శాతం ర్యాలీ చేసిన ఆర్ఐఎల్ కంపెనీలో6.57 లక్షల షేర్లను విక్రయించింది. ఈ బాటలో జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, విప్రో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టైటన్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫసీ తదితరాలలో కొంతమేర వాటాలను తగ్గించుకుంది. ఈ కౌంటర్లు 28-110 శాతం మధ్య ర్యాలీ చేశాయి. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) పెట్టుబడుల జాబితా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ ఉన్నాయి. మార్చి నుంచి చూస్తే కోల్ ఇండియా 10 శాతం క్షీణించగా.. ఎయిర్టెల్ 7 శాతం, ఎస్బీఐ 3 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చూపాయి. ఇదే విధంగా కొన్ని పీఎస్యూ బ్యాంకులు చౌకగా లభిస్తుంటే.. మంచి టెక్నాలజీ కలిగిన అతిపెద్ద బ్యాంకులు కొన్ని అందుబాటులో ట్రేడవుతున్నాయి. దీంతో భవిష్యత్లో ఈ రంగం నుంచి రిటర్నులు లభించే అవకాశముంది. కాగా.. గత నెలలో 107 స్టాక్స్లో వాటాల విక్రయాన్ని చేపట్టగా.. 68 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. చదవండి: (సెన్సెక్స్ప్రెస్- 44,000 దాటేసింది!) ఫార్మాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇటీవల సన్ ఫార్మా, సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలలో వాటాలు పెంచుకోగా.. హిందాల్కో, మిశ్రధాతులో సైతం అదనపు పెట్టుబడులు చేపట్టింది. ఇదేవిధంగా టీసీఐ, ఆర్ఈసీ, చోళమండలం, టాటా కన్జూమర్, ఎండ్యూరెన్స్ తదితర కౌంటర్లలో వాటాలు సొంతం చేసుకుంది. మిడ్ క్యాప్ స్టాక్స్లో భారత్ ఫోర్జ్, కెమ్కాన్ స్పెషాలిటీ, డాబర్ ఇండియా, ఈఐహెచ్- రైట్స్, ఎంఆర్ఎఫ్, ఎన్ఎండీసీ, సన్ టీవీలలో వాటాలు మొత్తంగా విక్రయించింది. తాజాగా ఏబీ ఫ్యాషన్, సైయెంట్, డిక్సన్ టెక్నాలజీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసింది. -
ఐటీసీ ఫలితాలు వచ్చాయ్... కొనాలా? అమ్మాలా?
ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్డౌన్ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు 4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 1.బ్రోకరేజ్ సంస్థ: జెఫ్పారీస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.240 విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్ అమ్మకాల వ్యాల్యూమ్స్ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 2. బ్రోకరేజ్ సంస్థ: మెక్వ్యెరీ రేటింగ్: అవుట్ఫెర్ఫామ్ టార్గెట్ ధర: రూ.232 విశ్లేషణ: కోవిడ్-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్లో సిగరెట్ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది. 3. బ్రోకరేజ్ సంస్థ: సీఎల్ఎస్ఏ రేటింగ్: అవుట్ఫెర్ఫామ్ టార్గెట్ ధర: రూ.220 విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 4.బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రేటింగ్: న్యూట్రల్ టార్గెట్ ధర: రూ.190 విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్డౌన్తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్స్ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది. 2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్ రేటింగ్ను కేటాయించడమైంది. -
జెఫ్పారీస్ బ్రోకరేజ్ నుంచి 3 స్టాక్ సిఫార్సులు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పారీస్ మూడు స్టాకులపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఫినోలాక్స్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అందులో ఉన్నాయి. ఈ 3షేర్లకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్ను కొనసాగించడంతో పాటు షేర్ల టార్గెట్ ధరలను పెంచింది. ఈ 3 షేర్లు మార్చి కనిష్టస్థాయిల నుంచి 29-71శాతం లాభపడ్డాయి. ఇప్పుడు ఈ 3కంపెనీల షేర్లపై బ్రోకరేజ్ సంస్థ విశ్లేషణలను చూద్దాం..! 1.ఫినోలాక్స్ ఇండస్ట్రీస్: ఈ క్యూ4లో కంపెనీ అమ్మకాలు 21శాతం క్షీణించగా, నికరలాభం 39శాతం నష్టాన్ని చవిచూసింది. వార్షిక ప్రాతిపాదిక ఈ క్వార్టర్లో పైప్స్లు/పీవీసీ రెసిస్ అమ్మకాల వాల్యూమ్స్ 20శాతం క్షీణించాయి. అయితే ఇదే సమయంలో పైప్ల విభాగపు మార్జిన్ అధిక స్థాయిలో మెరుగైంది. ఎర్నింగ్ గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ.., కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇప్పటికీ బలంగానే ఉంది. నికర రుణం ఈక్విటీ నిష్పత్తి 0.03గా ఉంది. నేపథ్యంలో షేరు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్ను కొనసాగిస్తూ., షేరు టార్గెట్ ధరను రూ.500కు పెంచింది. ఈ షేరు మార్చి కనిష్టం నుంచి 71.4శాతంగా రికవరిని సాధించింది. 2.కేఈఐ ఇండస్ట్రీస్: సంస్థకు అప్పులు తక్కువగా ఉన్నాయి. వినియోగ సామర్థ్యం 60-65శాతాన్ని చేరుకుంది. వినియోగం ఇంజనీరింగ్ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల దృష్ట్యా డిమాండ్ వైపు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సవాళ్లను ఎదుర్కోవడానికి కంపెనీకి గల బలమైన బ్యాలెన్స్ షీట్ సహకరిస్తుంది. ఈ సానుకూల పరిణామాలతో షేరు ‘‘బై’’ రేటింగ్ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.400కు పెంచడమైంది. మార్చి కనిష్టం నుంచి షేరు 68శాతం లాభపడింది. 3.ఐసీఐసీఐ బ్యాంక్: నాణ్యమైన అస్తులను కలిగి ఉంది. ప్రస్తుత ధర వాల్యూయేషన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థలో వాటాను విక్రయించి రూ.3900 కోట్లను సమీకరించింది. గత కొంతకాలంగా ప్రైవేట్రంగ బ్యాంక్ సెక్టార్లో కెల్లా మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ షేరు గతంలో కేటాయించిన రూ.450ల కొనుగోలు టార్గెట్ ధరను రూ.460కి పెంచింది. ఈ టార్గెట్ ధర ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 25శాతం అధికంగా ఉంది. -
3రంగాల నుంచి 3స్టాక్ సిఫార్సులు
మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ షేర్లు క్యాచ్ అప్ ర్యాలీకి సిద్ధమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ విశ్లేషకుడు వినయ్ రజనీ అంటున్నారు. ఇప్పటికి వరకు లార్జ్ క్యాప్ షేర్లు మార్కెట్ ర్యాలీకి సహకరించాయని ఆయన్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ర్యాలీ చేసేందుకు మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. డైలీ ఛార్ట్ల్లో నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కన్సాలిడేషన్ ప్యాట్రన్ నుంచి బయటపడేందుకు రజనీ అన్నారు. నిఫ్టీకి అప్సైడ్లో 9,970 నిరోధాన్ని, దాన్ని అధగమిస్తే 10,550 వద్ద తదుపరి నిరోధాన్ని కలిగి ఉంది. డౌన్సైడ్లో 9500, 9580 వద్ద కీలకమైన మద్దతు స్థాయిలను కలిగి ఉన్నాయని రజనీ తెలిపారు. డైలీ ఛార్ట్లో 9,889 వద్ద ఉన్న కీలకమైన నిరోధాన్ని అధిగమించింది. ఇది రోజువారీ ఛార్ట్లో హయ్యర్ టాప్, హయ్యర్ ఫార్మేషన్ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 3రంగాల నుంచి చెందిన 3 షేర్లు సిఫార్సు చేస్తున్నారు. 1.షేరు పేరు: అపోలో టైర్స్ టార్గెట్ ధర: రూ.118 స్టాప్ లాస్: రూ.96 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: గత 4వారాలుగా కనిపించిన కన్షాలిడేషన్ ప్యాట్రన్ నుంచి షేరు బయటపడింది. బోలింగర్ ఎగువ బ్యాండ్పై ముగిసింది. ఇది అప్ట్రెండ్లో మూమెంటంకు సంకేతం. అటో రంగానికి చెందిన షేర్లు అవుట్ఫర్ఫామ్ చేస్తున్నాయి. తాజాగా అటో యాన్సలరీ , టైర్ స్టాకుల ఛార్ట్లో అప్ట్రెండ్ను సూచిస్తున్నాయి. షార్ట్ టర్మ్ ఛార్ట్స్లో ఇండికేటర్లు, ఓస్కిలేటర్లు బుల్లిష్గా మారాయి. 2.షేరు పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ టార్గెట్ ధర: రూ.96 స్టాప్ లాస్: 78 అప్ సైడ్: 11శాతం విశ్లేషణ: 2020 మార్చి 29 ముగిసిన నెలవారీ ఛార్ట్లో బుల్లిష్ హ్యమర్ క్యాండింల్ స్టి్క్ ప్యాట్రన్ను నమోదు చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం బాటమ్ నుంచి బయటపడింది. అలాగే అయిల్ మార్కెటింగ్ కంపెనీల ఛార్ట్ల్లో మరింత పెరిగే సంకేతాలు కన్పిస్తాయి. ఈ షేరు షార్ట్-టర్మ్ మూవింగ్ రిసిస్టెంట్ దాటి ముగిసింది. ఇది రోజువారీ చార్టులలో రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ కూడా నమోదైంది. 3.షేరు పేరు: కేడిలా హెల్త్కేర్ టార్గెట్ ధర: రూ.375 స్టాప్ లాస్: రూ.333 అప్ సైడ్: 7శాతం విశ్లేషణ: ఇటీవల మార్కెట్ పతనం నుంచి ఫార్మా షేర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నాయి. అలాగే మార్కెట్ బుల్లిష్ ర్యాలీలో బలమైన ర్యాలీని ప్రదర్శిస్తున్నాయి. చివరి 8వారాలుగా ఈ షేరు చాలా తక్కువ వాల్యూమ్స్తో కన్సాలిడేషన్ను చూస్తోంది. వీక్లీ, డైలీ ఛార్ట్స్లో మూవింగ్ యావరేజ్, ఓస్కిలేటర్ సెటప్లు బలంగా ఉన్నాయి. ఈ స్టాక్ దాని మూమెంటంను తిరిగి పొందుతుంది. -
స్వల్పకాలంలో 13శాతం ర్యాలీ చేసే 3స్టాక్లు ఇవే..!
స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప గ్యాప్ అప్తో మొదలైంది. అయితే ప్రారంభంలో అనూహ్య కొనుగోళ్లతో సూచీలు భారీ లాభాల్ని మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ ఒకదశలో 400 పాయింట్ల లాభపడి 30,596.17 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 9వేల స్థాయిని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 స్టాక్లకు ‘‘బై’’ రేటింగ్ను కేటాయించారు. ఈ మూడు షేర్లు స్వల్పకాలంలో 13శాతం వరకు ర్యాలీ చేయవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. షేరు పేరు: మారికో బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.354 స్టాప్ లాస్: 285 అప్సైడ్: 13.40శాతం విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ చార్టులలో హయ్యర్ హై.., హయ్యర్ బాటమ్ ఫార్మాషన్ ఏర్పాటుతో ట్రేడ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా షేరు 100 రోజులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.306 వద్ద, అలాగే 200 రోజులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.323 మధ్య కన్సాలిడేట్ అవుతోంది. బోర్డర్ స్ట్రక్చర్పై..., స్టాక్ డైలీ ఛార్ట్లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ నమూనా ఏర్పాటు చేసింది. ప్యాట్రన్ ఫార్మేషన్ నెక్లైన్పై తాజా బ్రేక్ అవుట్ అంచనా ఉంది. అదనంగా, మూమెంటమ్ ఇండికేటర్స్, ఓసిలేటర్స్ డైలీ, వీక్లీ స్కేల్ పై సానుకూల సంకేతాలను సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.285 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.354 టార్గెట్ ధరగా రూ.310-312 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడెక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.627 స్టాప్ లాస్: రూ.505 అప్సైడ్: 12.77శాతం విశ్లేషణ: రూ.485 వద్ద సపోర్ట్ తీసుకున్న తర్వాత, షేరు వీ-ఆకారపు రీకవరీని తీసుకుంది. మరోసారి రూ.550 ధరను అధిగమించిన తర్వాత వెనక్కి వచ్చింది.ప్రస్తుత దశలో, ఈ స్టాక్ డైలీ చార్టులలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్స్ను ఏర్పాటు చేసింది. స్వల్ప హయ్యర్ వాల్యూమ్లతో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది స్టాక్స్లో లాంగ్-బిల్డప్ నిర్మాణాన్ని సూచిస్తుంది. షేరు ధరలో తరువాత అప్స్వింగ్ ఉంటుందని మూమెంటమ్ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.505 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.627 టార్గెట్ ధరగా రూ.రూ.550-553 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: భారతి ఇన్ఫ్రాటెల్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.240 స్టాప్ లాస్: 185 అప్సైడ్: 11.63శాతం విశ్లేషణ: సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాట్రన్కు పైన బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత షేరులో తదుపరి కొనుగోళ్లను చూస్తున్నాము. ఈ వారం, స్టాక్ డైలీ ఇంటర్వెల్లో 100రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ట్రేడైంది. ఇది ధరలలో స్వల్పకాలిక రివర్సల్ను, రాబోయే సెషన్లలో మరింత అప్సైడ్ ట్రెండ్ను సూచిస్తుంది. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.185 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.240 టార్గెట్ ధరగా రూ.రూ.205-210 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. -
‘యస్’ వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం
సాక్షి, ముంబై: యస్ సంక్షోభం, ఆర్బీఐ డ్రాప్ట్ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్బీఐ వద్దకు చేరిందని తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ బృందం కృషి చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైనల్ నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల కాలానికి తమ రూ.5500 కోట్లుగా (26 శాతం) వుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడుల నిమిత్తం దేశీయ, అంతర్జాతీయంగా 23 మంది పెట్టుబడిదారులు తమను సంప్రదించారని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్బీఐ ముందు ఉంచుతామని చైర్మన్ చెప్పారు. 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకు 24 గంటలూ పని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు పూర్తి భద్రంగా వుంటుందని యస్ బ్యాంకు కస్టమర్లు, డిపాజిట్దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు. అలాగే ఎస్బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం వుండబోదమని ఆయన స్పష్టం చేశారు. చదవండి : ‘యస్’ సంక్షోభం : రాణా కపూర్కు లుక్ అవుట్ నోటీసు -
వాటా కొనుగోలు : యస్ బ్యాంకుకు ఊరట
సాక్షి, ముంబై: సంక్షోభంలో పడిన ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు ఊరట లభించనుంది. యస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేసే కన్సార్షియంకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నాయకత్వం వహించనుందని బ్లూం బర్గ్ నివేదించింది. దీనికి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని పేర్కొంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు షేర్లు 29 శాతం ర్యాలీ అయ్యాయి. యస్ బ్యాంక్లో వాటా కొనుగోలు చేసేందుకు ఒక కన్సార్షియం ఏర్పాటుకు ఆమోదం లభించిందని కన్సార్షియంలో సభ్యులను ఎంపిక చేసేందుకు కూడా ఎస్బీఐ గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు యస్ బ్యాంకు కానీ, ఇటు ఎస్బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరోవైపు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కనీసం ఒక నెల ఆలస్యంగా ప్రకటించనున్నామని యస్ బ్యాంకు ఫిబ్రవరిలో రెగ్యులేటరీకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా బ్యాడ్ లోన్ల బెడదకు తోడు, బోర్డులో ఏర్పడ్డ విభేదాలతో యస్ బ్యాంకు ఇటీవల కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోమూలధనాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టపడుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ స్టాక్గా భారీ పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
గృహరుణంపై వడ్డీ రాయితీ 2020 మార్చి వరకూ...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద మధ్యాదాయ వర్గాల (ఎంఐజీ) వారికి ఇస్తున్న క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని (సీఎల్ఎస్ఎస్) 2020 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం కూడా చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద గృహ రుణం తీసుకున్న వారికి రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీని ఇస్తారు. డిసెంబర్ 30 నాటికి 3,39,713 మంది లబ్ధిదారులు సీఎల్ఎస్ఎస్ను వినియోగించుకున్నట్టు మంత్రి తెలిపారు. తొలుత వడ్డీ రాయితీతో కూడిన రుణ పథకాన్ని 2017 డిసెంబర్ వరకు ఏడాది కాల పరిమితితో కేంద్రం తీసుకొచ్చింది. నూతన నిర్మాణం, తిరిగి కొనుగోలు చేసే గృహాలపైనా దీన్ని పొందేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత దీన్ని 2019 మార్చి వరకు పొడిగించింది. తాజాగా దీన్ని మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయించింది. వార్షికంగా రూ.6– 12 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 20 ఏళ్ల కాలానికి సంబంధించి రూ.9 లక్షల రుణం మొత్తంపై 4 శాతాన్ని రాయితీగా పొందొచ్చు. రూ.12– 18 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి వడ్డీ రాయితీ మూడు శాతమే లభిస్తుంది. -
సన్ ఫార్మా చేతికి జపాన్ పోలా ఫార్మా
న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా... జపాన్కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్ చేస్తున్నామని సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ కీర్తి గనోర్కార్ తెలిపారు. దీని కోసం పోలా ఫార్మాతో ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కంపెనీ టేకోవర్ వచ్చే ఏడాది జనవరి 31 కల్లా పూర్తవుతుందన్నారు. పోలా ఫార్మా స్థానిక నైపుణ్యం, సన్ ఫార్మా అంతర్జాతీయ పటిష్టతలు కలగలసి జపాన్లో మరింత వృద్ధిని సాధిస్తామని సన్ ఫార్మా జపాన్ హెడ్ జునిచి నకమిచి వ్యాఖ్యానించారు. పోలా ఫార్మా ఆదాయం 11 కోట్ల డాలర్లు.... పోలా ఫార్మా కంపెనీ జపాన్లో జనరిక్, బ్రాండెడ్ ఔషధాలకు సంబంధించి పరిశోధన, తయారీ, విక్రయం, మార్కెటింగ్ కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రధానంగా చర్మ సంబంధిత ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి జపాన్లో రెండు ప్లాంట్లున్నాయి. గత ఏడాదిలో ఈ కంపెనీ 11 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, 70 లక్షల డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది. సన్ ఫార్మా కంపెనీ జపాన్ ఫార్మా మార్కెట్లోకి 2016లో ప్రవేశించింది. నొవార్టిస్కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్ల కొనుగోళ్ల ద్వారా సన్ ఫార్మా జపాన్ మార్కెట్లోకి అడుగిడింది. జపాన్ ఫార్మా మార్కెట్ 8,480 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంటుందని అంచనా. 1.13 లక్ష కోట్ల డాలర్ల ప్రపంచ ఫార్మా మార్కెట్లో జపాన్ ఫార్మా మార్కెట్ వాటా 7.5 శాతంగా ఉంది. పోలా ఫార్మా టేకోవర్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం వరకూ నష్టపోయి రూ.511 వద్ద ముగిసింది. -
రీటైల్ రంగంలోకి అమెజాన్ : భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను భారీగా వేస్తోంది. ఈ కామర్స్వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ రంగంపై కన్నేసింది. దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు అమెజాన్ యోచిస్తోంది.ఇందుకు సంబంధించిన డీల్ను ఈ నెలలోనే పూర్తి చేయనుంది. ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుంది. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి.దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెజాన్ షాపర్స్ స్టాప్లో 5శాతం వాటాలనుసొంతం చేసుకుంది. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనుంది. కాగా మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ ఎఫ్పీఐగా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఆన్లైన్ ఫుడ్ అండ్ కిరాణా రిటైల్ మార్కెట్ 2020 నాటికి 141శాతం వార్షిక వృద్ధిరేటును సాధించనుంది. -
కార్లు, బైక్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులు థర్డ్ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఇకపై కార్ల కొనుగోలు సమయంలో ఏడాది బీమా కాకుండా మూడేళ్ల కాలానికి బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే ద్విచక్ర వాహనాలు అయితే కొనుగోలు సమయంలోనే ఐదేళ్ల బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాహనాల కొనుగోలు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోనుంది. ఇది వాహనదారులకు కాస్తంత రుచించనిదే. అయితే, ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తప్పనుంది. ఈ భారం ఏ స్థాయిలో ఉంటుందంటే... 1500సీసీ సామర్థ్యంపైన ఉన్న కార్లకు ఏడాది బీమా పాలసీ ప్రీమియం ప్రస్తుతం రూ.7,890 స్థాయిలో ఉండగా, మూడేళ్లకు తీసుకోవాలంటే ఇక మీదట ఒకేసారి రూ.24,305ను జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 350సీసీ సామర్థ్యంపైన ఉన్న బైకులకు ఏడాది ప్రీమియం రూ.2,323గా ఉంటే, ఇక మీదట ఐదేళ్ల పాలసీ కోసం రూ.13,034 ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ సామర్థ్యం కలిగిన మోడళ్ల ఆధారంగా ఈ ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానమే. కొత్త కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలంటూ ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ కవరేజీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో, దీర్ఘకాల పాలసీలను వాహనాలను కొన్నప్పుడే తీసుకునే విధంగా సుప్రీం ఆదేశించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి. థర్డ్ పార్టీ బీమా అనేది, వాహనదారుడు, అతని వాహనం కారణంగా మూడో పార్టీకి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేది. దీన్ని వాహనదారులు అందరూ తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టానికి బాధిత కుటుంబాలు పెద్ద మొత్తంలో పరిహారం అందుకోగలవు. ఆస్తి నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. బీమా విస్తరణకు దోహదం వాహనం వయసు పెరుగుతున్న కొద్దీ దానికి బీమా కవరేజీ విలువ తగ్గుతూ వెళుతుంది. పైగా ప్రీమియం పెరుగుతూ వెళుతుండడం గమనించొచ్చు. ముఖ్యంగా థర్డ్ పార్టీ బీమా విషయంలో పరిహార చెల్లింపులు పెరుగుతుండటంతో, ప్రీమియంలను బీమా కంపెనీలు ఏటా సవరిస్తుండటం వల్ల భారం అధికం అవుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు బీమా పాలసీని రెన్యువల్ చేయించుకోకుండా వదిలిపెట్డడం, రిస్క్ను పూర్తిగా కవర్ చేయని పాలసీలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘‘దీర్ఘకాలిక పాలసీల కారణంగా బీమా ఉత్పత్తుల విస్తరణ పెరుగుతుంది. మరిన్ని వాహనాలు కవరేజీ పరిధిలోకి వస్తాయి’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్రైటింగ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు. బీమా పరిధిలో ఉన్నవి, పరిధిలో లేనివి అన్న ప్రశ్నకు తావుండదని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ పెద్ద మొత్తంలో, మెరుగ్గా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2015లో ప్రతిరోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు క్లెయిమ్ దాఖలకు సమయ పరిమితి కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిధిలో లేదా తన నివాస ప్రాంత పరిధిలోనూ క్లెయిమ్ దాఖలకు అవకాశం ఉంటుంది. టూవీలర్ల డిమాండ్కు దెబ్బ! నూతన నిబంధనలు ద్విచక్ర వాహన కొనుగోళ్ల డిమాండ్పై ప్రభావం చూపిస్తుందంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇప్పటి వరకు బీమా కోసం వెచ్చించిన మొత్తానికి ఇకపై నాలుగు రెట్లు అదనంగా (ఐదేళ్ల పాలసీ) ప్రీమియంను భరించాల్సి రావడమే ఇందుకు కారణం. కానీ, కార్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100సీసీ ఇంజిన్ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఎందుకంటే తక్కువ ధర కారణంగానే వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోని బైక్లపై రూ.720గా ఉన్న ప్రీమియం కాస్తా ఇకపై రూ.3,285 అవుతోంది. అంటే మూడున్నరరెట్లు పెరిగినట్టు. ప్రతీ5 మోటారుసైకిళ్ల అమ్మకాల్లో మూడు 100సీసీ విభాగంలోనివే. ఇక 150సీసీ ఆపైన 350సీసీ సామర్థ్యంలోపు బైకులకు నాలుగున్నర రెట్లు పెరిగి రూ.5,453 కానుంది. ఇక ఈ పెరిగే మొత్తంపై జీఎస్టీ భారం అదనం. రెండు రకాల పాలసీలు సుప్రీం ఆదేశాలతో కొత్త కార్లకు మూడేళ్లు, ్జకొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కొనుగోలు సమయంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయాలని బీమా కంపెనీల ను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. దీంతో బీమా సంస్థలు ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ కవరేజ్ను దీర్ఘకాలానికి లేదా ఏడాది కాలానికి ఓన్ డ్యామేజీ కవర్, దీర్ఘకాలానికి థర్డ్ పార్టీ బీమాతోనూ పాలసీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ బీమానే దీర్ఘకాలానికి తీసుకోవడం తప్పనిసరి. చోరీ, ఇతర నష్టాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీని ఏడాది లేదా ఐదేళ్ల కోసం ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉంటుంది. బిల్లులో మాత్రం ఒక్కో ఏడాదికి విడిగా కవరేజీని పేర్కొనడం జరుగుతుంది. రెండో ఏడాది, ఆ తర్వాత కాలానికి ప్రీమియంను ‘ముందస్తు ప్రీమియం’గా పేర్కొటాయి. పాలసీ కాల వ్యవధి మధ్యలో సాధారణంగా థర్డ్ పార్టీ కవర్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వాహనం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడం, అమ్మేయడం, బదిలీ వంటి సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. -
ఇల్లు కొంటున్నారా?
‘ఇల్లు మన ఆశలు, ఆకాంక్షలు, అభిరుచికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటాం. నగరాల్లో ఇప్పటి బిజీ లైఫ్లో ఎవరి ఇల్లు వాళ్లు కట్టుకోవడం ఊహకే అందదు. పైగా మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ హవా నడుస్తున్న పరిస్థితుల్లో తప్పని సరిగా బిల్డర్ను వెతుక్కోవలసిందే. 1. ఇల్లు కట్టించుకోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ముందుగా బిల్డర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు. ఎ. అవును బి. కాదు 2. బ్రోచర్లో సూచించిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారా లేదా అని, ముందుగా పూర్తి చేసిన వెంచర్స్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ల ద్వారా (అడ్వాన్సు ఇవ్వడానికి ముందే) తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. కొనుగోలు దారులకు చూపించడానికి కట్టిన మోడల్ ఫ్లాట్ను నిశితంగా పరిశీలిస్తారు. అందులో ఇంటీరియర్ డెకరేషన్ను కాకుండా నిర్మాణంలో నాణ్యతను గమనిస్తారు. ఎ. అవును బి. కాదు 4. నిర్మాణానికి ప్రభుత్వశాఖల నుంచి అన్ని ఆమోదాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. నిర్మాణ దశలో స్వయంగా వెళ్లి బ్రోచర్లో చెప్పిన క్వాలిటీ పరికరాలను వాడుతున్నారా అని చూసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఇంట్లోకి చేరేముందుగానే కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 7. పైకి కనిపిస్తున్న ధరలతోపాటు అంతర్లీనంగా ఉన్న చెల్లింపుల వివరాలను ముందుగానే బిల్డర్ను అడిగి స్పష్టంగా తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. మీకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూనిట్, సోలార్ ఎక్విప్మెంట్ అమర్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి తగిన విలువను రాబట్టుకోవడం తెలుసు. ‘బి’లు ఎక్కువైతే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అరకొర సౌకర్యాలతో ఏదో ఒకలా పూర్తయిందనిపించిన ఇంటిని స్వాధీనం చేసుకుంటే తర్వాత ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
మంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే !
ప్రొద్దుటూరు :‘‘రైతులు పండించిన కందులన్నీ కొనుగోలు చేస్తాం, కేంద్రం నాఫెడ్ ద్వారా కొనగా మిగిలే కందులను రాష్ట్రమే సొంతంగా కొనుగోలు చేస్తుంది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 25 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 45వేల టన్నుల కందుల కొనుగోళ్లకే అనుమతి ఇచ్చింది, అదనంగా 55వేల టన్నులు కొనుగోలు చేయాలని కోరినా అంగీకరించలేదు. కందుల దిగుబడి పెరిగిన నేపథ్యంలో మొత్తం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి గత సోమవారం అమరావతిలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో వెల్లడించారు. అయితే గురువారం ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. దీంతో రైతులు మంత్రుల మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని విమర్శిస్తున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ అధికారులు మినుముల కొనుగోలుకు సం బంధించి కడప మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా కందుల కొ నుగోలుకు కడప, రాయచోటి, ఎర్రగుంట్ల, శనగ కొనుగోలుకు సంబంధించి కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కమలాపురం మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల పేరుతో వ్యాపారులు మినుములు అమ్ముతున్నారని అధికారులు బుధవారం కడప మార్కెట్ యార్డులో దాడులు చేయడంతో అక్కడ కొనుగోలు తాత్కాలికంగా నిలిపేశారు. మిగతా కొనుగోలు కేంద్రాలతో పోల్చితే చివరగా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగలు, కందులు, మినుములు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నుంచి టోకన్లు జారీ చేస్తున్నారు. వాస్తవానికి ముందే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందనే విషయం తెలుసుకున్న రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మిగతా కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో ఎలాగైనా తాము పండించిన పంటను అమ్ముకోవాలని ఆశతో వచ్చారు. కందులు, మినుములు క్వింటాలు ధర బయట మార్కెట్లో రూ.4వేలు మాత్రమే ఉండగా కొనుగోలు కేంద్రంలో కందులు రూ.5,450, మినుములు రూ.5,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ప్రొద్దుటూరు, రాజుపాళెం, జమ్మలమడుగు, కమలాపురం, ఖాజీపేట, వీరపునాయునిపల్లె, లింగాల, వేంపల్లి తదితర దూరప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కొనుగోలు కేంద్రంలోని డీసీఎంఎస్ అధికారులు ససేమిరా అంగీకరించలేదు. కేవలం శనగల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఉండటంతో టోకన్లు ఇస్తున్నామని, తొలి రోజు కందుల కొనుగోలుకు టోకన్లు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. పై అధికారుల అనుమతి వచ్చేంత వరకు కందులు, మినుములను కొనుగోలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నిరాశతో రైతులు వెనక్కి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువగా వ్యాపారుల హవా నడుస్తోందని, ఈ కారణంగానే తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్కు ‘ట్రయంఫ్’ రక్షణ!
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్కు ఆకాశ్, బరాక్–8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్–400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్–రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్–400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్–400 ట్రయంఫ్ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్–400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్ర్ను ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. భారత్ వద్ద ఉన్న క్షిపణులు స్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్డీవో ప్రయత్నిస్తోంది. ఆకాశ్ డీఆర్డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. బరాక్–8 డీఆర్డీవో–ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది. -
ఓలా చేతికి ఫుడ్పాండా: భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఫుడ్పాండా భారత వ్యాపార్యాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఓలా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్కు చెందిన డెలివరీ హీరో గ్రూప్ నుంచి ఫుడ్పాండా భారత వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఓలా ప్రకటించింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆహారపదార్ధాల వ్యాపారం ఓలాకు బదిలీ అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. షేర్ల బదలాయింపులో భాగంగా ఈ ఒప్పందం జరిగిందని పేర్కొంది. అయితే, లావాదేవీలో భాగమైన వాటాల సంఖ్య వివరాలను అందించలేదు. 2014 లో, ఓలా కేఫేతో ఓలా ఆహార పంపిణీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తన సేవలను విస్తరించింది. తరువాత మూసివేసింది. అయితే ఉబెర్ ఈట్స్కు పోటీగా ఫుడ్ పంపిణీ వ్యాపారంలోకి రావాలని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో ఫుడ్పాండాను కొనుగోలు చేయడం కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆన్లైన ఫుడ్ సర్వీసుల సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటి సారి. ఇండియాలో ఫుడ్ సర్వీసులను మరింత అభివృద్ధి చేసే కృషిలో ఈ భాగస్వామ్యంపై సంతోషిస్తున్నామని, ఫుడ్ పాండా ఇండియాలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. తమ తాజా భాగస్వామ్యం మార్కెట్ల ఏకీకరణకు అనుమతిస్తుందని డెలివరీ హీరో గ్రూపు సహ-వ్యవస్థాపకుడు, సీఈవో నిక్లాస్ ఓస్టర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఓలాలో తమ వాటా చాలా విలువైన ఆస్తిగా పరిగణిస్తామన్నారు. -
రైతుల ఆందోళన కనపడదా: డీకే అరుణ
పంటలు కొనుగోలు చేసేవారు లేక రైతులు ఆందోళన పడుతున్నారని, రైతుల గోస టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనపడదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రశ్నించారు. రైతును రాజు చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వేరుశనగ ధర గతేడాది ఇదే సమయంలో క్వింటాలుకు రూ.4,600 ఉందని, ఇప్పుడు గద్వాల మార్కెట్లో రూ.1,600కే కొంటున్నారని అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
గూగుల్ చేతికి హాలీ ల్యాబ్స్
న్యూఢిల్లీ: సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ .. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ హాలీ ల్యాబ్స్ను ’ఆక్వి–హైరింగ్’ ప్రాతిపదికన కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. భారత్లో గూగుల్ ఏదైనా సంస్థను కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో కొత్త యూజర్లకి ఇంటర్నెట్ను చేరువ చేసేందుకు హాలీ ల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడనుంది. గూగుల్కి చెందిన నెక్స్ట్ బిలియన్ యూజర్స్ టీమ్లో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషంగా ఉందని హాలీ ల్యాబ్స్ తమ బ్లాగ్లో పేర్కొంది. ఏదైనా కంపెనీ అందించే ఉత్పత్తులు, సర్వీసుల కన్నా.. అందులోని సిబ్బంది కోసమే కొనుగోలు చేయడాన్ని ఆక్వి–హైరింగ్గా వ్యవహరిస్తారు. గూగుల్ ఇటీవలి కాలంలో కంపెనీల కొనుగోలు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. -
స్నాప్డీల్కి ఫ్లిప్కార్ట్ మరో ఆఫర్!!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’.. స్నాప్డీల్కు అతిత్వరలోనే మరొక ఆఫర్ను ప్రకటించే అవకాశముంది. కాగా ఫ్లిప్కార్ట్ 800–850 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,500 కోట్లు) కొనుగోలు ప్రతిపాదనను స్నాప్డీల్ బోర్డు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్ ఆఫర్... కంపెనీ వాస్తవ విలువ కన్నా తక్కువగా ఉందని స్నాప్డీల్ పేర్కొంది. కాగా కొత్త ఆఫర్ 1 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి ఆఫర్ తిరస్కరణ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవేళ అన్ని కుదిరితే డీల్ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశముంది. కాగా ఈ అంశాలపై అటు స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్ కానీ, ఇటు ఫ్లిప్కార్ట్ కానీ స్పందించలేదు. కాగా స్నాప్డీల్.. ఫ్రీచార్జ్ (మొబైల్ వాలెట్ విభాగం), వుల్కాన్ ఎక్స్ప్రెస్ (లాజిస్టిక్ విభాగం) విక్రయానికి సంబంధించి ప్రత్యేకమైన మంతనాలు జరుపుతోంది. ఈ డీల్స్ కూడా వచ్చే కొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశముంది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్ ఓకే అయితే ఇది దేశీ ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద విలీనంగా అవతరించనుంది. -
అలా కాదు.. ఇంకో మాట చెప్పండి!!
మరికాస్త వేల్యుయేషన్ కోసం ఫ్లిప్కార్ట్తో స్నాప్డీల్ చర్చలు న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత అధిక వేల్యుయేషన్ కట్టడంపై ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఫ్లిప్కార్ట్ ఆ తర్వాత అన్ని అంశాలు మదింపు చేసుకున్న తర్వాత దాన్ని 850 మిలియన్ డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీన్ని స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. ముందుగా చెప్పిన 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్కు తగ్గట్లుగా అదనంగా 150–200 మిలియన్ డాలర్ల విలువ కోసం ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయితే దేశీ ఈ–కామర్స్ విభాగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కానుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో తీవ్ర పోటీలో స్నాప్డీల్ గణనీయంగా వెనుకబడిపోయింది. 2016 ఫిబ్రవరిలో 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులు సమీకరించిన స్నాప్డీల్ విలువ ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను రైటాఫ్ చేసేసి.. స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్కు విక్రయించేందుకు మిగతా ఇన్వెస్టర్ల మద్దతు సమీకరించింది. -
బుక్మైషో చేతికి బర్ప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టికెట్ సేవల సంస్థ బుక్మైషో (బీఎంఎస్) తాజాగా ముంబైకి చెందిన బర్ప్ సంస్థను కొనుగోలు చేసింది. స్థానిక రెస్టారెంట్ల సమాచార వివరాలు అందించే ఈ సంస్థను నెట్వర్క్18 నుంచి దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ బిగ్ట్రీలో భాగమైన ఫుడ్ఫెస్టా వెల్కేర్ ద్వారా ఈ డీల్ పూర్తి చేస్తున్నట్లు బీఎంఎస్ తెలిపింది. నెట్వర్క్18కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూప్ కాగా.. బీఎంఎస్ బిగ్ట్రీ నిర్వహణలో ఉంది. 2006లో ప్రారంభమైన బర్ప్లో ప్రస్తుతం 12 నగరాల్లోని 56,000 పైచిలుకు రెస్టారెంట్లు లిస్ట్ అయి ఉన్నాయి. 2016–17లో సంస్థ ఆదాయం రూ. 56.67 లక్షలు. నెట్వర్క్18 టర్నోవర్లో ఇది 0.69 శాతం. 2017 మార్చి ఆఖరు నాటికి బర్ప్ నికర విలువ మైనస్ రూ. 28.89 కోట్లుగా ఉంది. స్లంప్ సేల్ ప్రాతిపదికన కన్సల్టెన్సీ సంస్థ ఈవై.. బర్ప్ విలువను రూ. 6.7 లక్షలుగా లెక్కగట్టినట్లు నెట్వర్క్18 పేర్కొంది. -
బిగ్ బాస్కెట్పై అమెజాన్ కన్ను!
ప్రాథమిక స్థాయిలో చర్చలు న్యూఢిల్లీ: అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా నిత్యావసర సరుకుల విక్రయ ఆన్లైన్ సంస్థ బిగ్బాస్కెట్ కొనుగోలుపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇవి ఫలవంతం కావొచ్చు లేక కాకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూపర్మార్కెట్ గ్రాసరీ సప్లైస్ సంస్థలో భాగమైన బిగ్బాస్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన అబ్రాజ్ గ్రూప్, హీలియోన్ వెంచర్ పార్ట్నర్స్, బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన ఇన్వెస్టర్ల నుంచి గతేడాది 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. కొత్తగా గిడ్డంగుల ఏర్పాటుకు, డెలివరీ నెట్వర్క్ను పటిష్టం చేసుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ట్రైఫెక్టా క్యాపిటల్ నుంచి మరో 7 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆదాయాలు గణనీయంగా మెరుగుపర్చుకుంటున్న బిగ్బాస్కెట్ ఇప్పటికే రెండు నగరాల్లో బ్రేక్ఈవెన్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ భారత్లో భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. -
అలీబాబా పిక్చర్స్కి టికెట్న్యూలో మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: ఆన్లైన్ టికెటింగ్ సంస్థ టికెట్న్యూలో చైనాకి చెందిన అలీబాబా గ్రూప్ సంస్థ అలీబాబా పిక్చర్స్ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో తమ కార్యకలాపాలు, సర్వీసుల పోర్ట్ఫోలియో మరింత పటిష్టం కాగలదని టికెట్న్యూ పేర్కొంది. అలీబాబా విడతలవారీగా రూ. 120 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు టికెట్న్యూ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్కుమార్ నమ్మాళ్వార్ తెలిపారు. ఈ డీల్తో తమ సిబ్బందికి, కంపెనీకి ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. 2007లో రామ్కుమార్ నమ్మాళ్వార్ .. టికెట్న్యూని చెన్నై కేంద్రంగా ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 నగరాల్లో సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. -
ఎన్డీటీవీనీ రాందేవ్ బాబా కొంటున్నారా?
ముంబై: ఒకవైపు ఎన్డీటీవీపై సీబీఐ లనూహ్య దాడులపై దుమారం రేగుతుండగా మరో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఎన్డీవీని కొనుగోలు చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మేరకు సంప్రదింపులు జరిగాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈవార్తలను ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ప్రముఖ యాంకర్ నిధి రాజ్దాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.ఈ వార్తలతో ఎన్డీటీవీ షేరు దాదాపు 7 శాతానికిపైగా నష్టపోయింది. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ దాడులపై వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యదేశంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఈ పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. Fake news from @e4mtweets: https://t.co/sc9JdSKGxD — VISHAL (@VishalManve12) June 5, 2017 Hello people, Ramdev is not buying NDTV. Thank you — Nidhi Razdan (@RazdanNidhi) June 5, 2017