-
బ్రిక్స్ అధ్యక్షుడుగా కె.వి.కామత్
న్యూ ఢిల్లీ: బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వాణిజ్యాభివృద్ధికి ఉద్దేశించిన బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడుగా కే వీ కామత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కామత్ ఈ పదవిలో ఐదేళ్ళు కొనసాగుతారు . ఐదు దేశాల కూటమికి 2001లో బ్రిక్స్ గా నామకరణం చేశారు. ఈ బ్యాంకుకు అధ్యక్షుడిని నామినేట్ చేసే అవకాశం భారత్కు లభించింది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ బ్యాంకును భవిష్యత్తు ప్రపంచ బ్యాంకుగా గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ గోల్డ్మన్ సాచే అసెట్ మేనేజ్మెంట్ గతంలో అభివర్ణించింది. ఆర్థిక విశ్లేషకులు కూడా బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావంపై హర్షం వ్యక్తం చేశారు. -
దూరం భారం కాదు..
* దక్షిణ అమెరికా దేశాలతో సంబంధాలపై మోడీ * భారత్కు చేరుకున్న ప్రధాని బ్రసీలియా (బ్రెజిల్): బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాత్రి స్వదేశం చేరుకున్నారు. అంతకుముందు ఆయన దక్షిణ అమెరికా దేశాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దక్షిణ అమెరికా దేశాలతో గతంలో కంటే మరింత సన్నిహితంగా కలసి పనిచేస్తామని చెప్పారు. దానికి ఇరు ప్రాంతాల మధ్య దూరం అడ్డంకి కాబోదన్నారు. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుతో అవకాశాలు మరిన్ని పుట్టుకొస్తాయన్నారు. ద్వైపాక్షిక స్థాయిలోనేగాక, బ్రిక్స్, జీ-77తో పాటు ఇతర అంతర్జాతీయ వేదికల సభ్యదేశంగా తాము దక్షిణ అమెరికా దేశాలతో కలసి పనిచేస్తామని ఆయా దేశాల నేతలకు ప్రధాని హామీఇచ్చారు. తమ ఖండంలోని సహ దేశాల నేతలతో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. దక్షిణ అమెరికాలో పెట్టుబడులకు భారత ఇన్వెస్టర్లు పెరగడమే ఆ దేశాల సామర్థ్యానికి సూచిక అన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంతతి అధికంగా నివసించే గయానా దేశ అధ్యక్షుడు రామోతార్తో మోడీ సమావేశమయ్యారు. కాగా, వచ్చే ఏడాది ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) సదస్సుకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో మోడీ సమావేశమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బ్రెజిల్లోని భారత రాయభార కార్యాలయంలో న్యాయస్థానం (చాన్సెరీ)ని మోడీ ప్రారంభించారు. భారత్కు తిరుగు ప్రయాణంలో జర్మనీలోని ఫ్రాంక్ఫుర్ట్లో ఆగిన సందర్భంగా జర్మనీ చాన్స్లర్ మెర్కెల్తో మోడీ ఫోన్లో సంభాషించారు. 60వ పడిలో అడుగుపెట్టిన ఆమెకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. -
బ్రిక్స్ బ్యాంక్కు ఆరేళ్లు భారత్ సారథ్యం
ఫోర్టలేజా (బ్రెజిల్): బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకుకు మొదటి ఆరు సంవత్సరాలు భారత్ అధ్యక్షత వహించనుంది. రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం షాంఘై (చైనా)లో ఉంటుంది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్యాంకును నెలకొల్పాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సదస్సు మంగళవారం నిర్ణయించిన సంగతి విదితమే. బ్యాంకుతో పాటు 10 వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయనున్న కరెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ)తో బ్రిక్స్ దేశాలు స్వల్పకాలిక లిక్విడిటీ ఒత్తిడులను తట్టుకోగలుగుతాయి. ఇండియా మినహా బ్రిక్స్ సభ్య దేశాల పార్లమెంట్లు సీఆర్ఏకు ఆమోదముద్ర వేయడానికి ఆరు నెలలు గడువుందని అధికార వర్గాలు తెలిపాయి. సీఆర్ఏకు అవసరమైన నిధుల్లో భాగంగా చైనా అత్యధికంగా 4,100 కోట్ల డాలర్లు, ఇండియా, రష్యా, బ్రెజిల్లు 1,800 కోట్ల డాలర్ల చొప్పున, దక్షిణ ఆఫ్రికా 500 కోట్ల డాలర్లు అందించనున్నాయి. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చర్చించిన డెవలప్మెంట్ బ్యాంక్ ఇపుడు వాస్తవరూపం దాల్చిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర వర్థమాన దేశాలకు సైతం ఈ బ్యాంకు సహకరిస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగం హర్షం...: బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటుతో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారం వృద్ధిచెందుతుందని భారతీయ పారిశ్రామికరంగం హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలను అధిగమించడానికి, మౌలిక సౌకర్యాల వృద్ధికి బ్యాంకు దోహదపడుతుందని పేర్కొంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చరిత్రాత్మకమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా అభివర్ణించారు. బ్యాంకు ఏర్పాటు ఇండియా సాధించిన విజయమని అన్నారు. వర్థమాన ఆర్థిక వ్యవస్థల పురోగతికి భారీగా నిధులు అవసరమనీ, 10 వేల కోట్ల డాలర్ల కంటే మరిన్ని రెట్ల నిధుల సమీకరణ మార్గాలను బ్యాంకు అన్వేషించాలని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సదస్సు రష్యాలో.. వచ్చే సంవత్సరం బ్రిక్స్ ఏడో సదస్సును రష్యాలోని ఊఫా నగరంలో నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణకు ముందుకొచ్చిన రష్యాను భారత్, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికాలు అభినందించాయి. -
‘బ్రిక్స్’ తో వర్ధమాన దేశాలకు మేలు: స్టిగ్లిట్జ్
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఏర్పాటు వర్ధమాన దేశాలు చేసిన మంచి పనుల్లో ఒకటని నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ వ్యాఖ్యానించారు. మెరుగైన వృద్ధి సాధించేందుకు ఈ దేశాల వద్ద పుష్కలంగా వనరులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం-వర్ధమాన దేశాలపై ప్రభావం’ అంశంపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్టిగ్లిట్జ్ ఈ విషయాలు తెలిపారు. భారత్తో పాటు ఇతర వర్ధమాన దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపన్న దేశాల రికవరీ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో .. వర్ధమాన దేశాలు వృద్ధి కోసం వాటిపై ఆధారపడజాలవని స్టిగ్లిట్జ్ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధించేందుకు వర్ధమాన దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, దేశీయ డిమాండ్పైన ఆధారపడాలని సూచించారు. పాశ్చా త్య దేశాలు కేవలం ద్రవ్యోల్బణ కట్టడే ధ్యేయంగా పనిచేయడం తగదని, ఉపాధి కల్పన..వృద్ధి సాధనపై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. -
కుబేర భారతం!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ, భారత్లో కుబేరులు మాత్రం పెరుగుతున్నారు. బ్రిక్స్ దేశాలతో పోల్చితే భారత్లోనే అల్ట్రా-హై నెట్వర్త్ ఇండివిడ్యువల్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) అధికంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూహెచ్ఎన్డబ్ల్యూఐ మహిళలు మనదేశంలోనే అధికంగా ఉన్నారు. ఈ వివరాలను అంతర్జాతీయ వెల్త్ ఇంటెలిజెన్స్, ప్రాస్పెక్టింగ్ కంపెనీ వెల్త్-ఎక్స్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 3 కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు(ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉన్న షేర్లు, రెసిడెన్షియల్, ఇన్వెస్ట్మెంట్ ఆస్తులు, ఆర్ట్ కలెక్షన్లు, విమానాలు, నగదు, ఇతర ఆస్తులు కలిపి) పైబడి ఉన్న వారిని అల్ట్రా-హై నెట్వర్త్ ఇండివిడ్యువల్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐగా పరిగణించి ఈ సంస్థ ఈ ఏడాదికి ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక పేర్కొన్న మరి కొన్ని ముఖ్యాంశాలు.., బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో భారత్లోనే యూహెచ్ఎన్ఐడబ్ల్యూలు ఎక్కువగా ఉన్నారు. వీరి సంఖ్య 7,850గా ఉంది. వీరిలో 90 శాతానికి పైగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూర్, కోల్కత, చెన్నై, అహ్మదాబాద్, పుణే, గుర్గావ్, జైపూర్ల్లోనే నివసిస్తున్నారు. వీరందరి ఆస్తుల విలువ 93,500 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూహెచ్ఎన్డబ్ల్యూఐ మహిళలు భారత్లోనే అధికం. మన దేశంలో వీరి సంఖ్య 1,250 గా ఉంది. వీరందరి ఆస్తుల విలువ 9,500 కోట్ల డాలర్లు. ఏడాది కాలంలో దేశ జనాభా 1.6% వృద్ధి సాధించగా, 120 మంది కొత్తగా యూహెచ్ఎన్ఐడబ్ల్యూ హోదా పొందారు. బిలియనీర్ల సంఖ్య మాత్రం ఏడాది కాలంలో 109 నుంచి 103కు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 2,170 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాది 19,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత బిలియనీర్ల మొత్తం సంపద ఈ ఏడాదిలో 5.3 శాతం క్షీణించి 18,000 కోట్ల డాలర్లకు తగ్గింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్వర్త్ వ్యక్తుల సంఖ్య 1,99,235కు చేరింది. ఇదే ఇప్పటివరకూ అత్యంత గరిష్టం కావడం గమనార్హం. వీరిలో 1,75,730 మంది పురుషులు కాగా, 23,505 మంది మహిళలు.