-
ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్)లో గల వాటాల విక్రయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం బీపీసీఎల్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్లో మెజారిటీ వాటా విక్రయ సన్నాహాల్లో ఉన్న నేపథ్యంలో కంపెనీ తాజా వివరణ ఇచ్చింది. బీపీసీఎల్ను సొంతం చేసుకోనున్న కొత్త ప్రమోటర్ పెట్రోనెట్, ఐజీఎల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపును కోరామని, స్పందన వెలువడవలసి ఉన్నదని కంపెనీ సీఎఫ్వో వీఆర్కే గుప్తా పేర్కొన్నారు. బీపీసీఎల్కు ఐజీఎల్లో 22.5 శాతం, పెట్రోనెట్లో 12.5%చొప్పున వాటాలు న్నాయి. ఈ 2 కంపెనీలకూ ప్రమోటర్గా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్లోగల 52.98 శాతం వాటాను డిజిన్వెస్ట్ చేస్తున్న విషయం విదితమే. -
డీజిల్ డోర్ డెలివరీ... ఎప్పుడు? ఎక్కడ?
ఢిల్లీ: వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీజిల్ డోర్ డెలవరీ స్కీంని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అమల్లోకి తెచ్చింది. ఢిల్లీకి చెందిన స్టార్టప్ సంస్థతో కలిసి సేఫ్20 పేరుతో డీజిల్ డోర్ డెలివరీ చేస్తోంది. 20 లీటర్ల క్యాన్ ఢిల్లీ కేంద్రంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 20 లీటర్ల జెర్రీ క్యాన్లను ఢోర్ డెలివరీగా బీపీసీఎల్ అందిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న హమ్ సఫర్ సంస్థతో బీపీసీఎల్ టై అప్ అయ్యింది. 20 లీటర్ల సామర్థ్యం కల జెర్రీ క్యాన్లలో డీజిల్ని డోర్ డెలివరీ చేస్తోంది. డోర్ డెలివరీ కావాలంటే కనీసం 20 లీటర్లు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఉపయోగకరం డోర్ డెలివరీ పథకం వల్ల అపార్ట్మెంట్లు, సెల్ఫోన్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, హాస్పటిల్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్ సైట్లు, హోటళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీపీసీఎల్ అంటోంది. గతంలో డీజిల్ కావాలంటే పెట్రోల్ పంప్కు రాక తప్పని పరిస్థితి నెలకొని ఉండేది. పైగా ఫ్యూయల్ స్టేషన్ నుంచి డీజిల్ రవాణా చేయడం ప్రయాసతో కూడిన వ్యవహరం. మార్గమధ్యంలో డీజిల్ ఒలకడం సర్వ సాధారణంగా జరిగేది. అయితే తాజా డోర్ డెలివరీతో ఈ కష్టాలు తీరనున్నాయి. ఇంటి వద్దకే డీజిల్ తెప్పించుకుని జనరేటర్, లిఫ్టు, క్రేన్లు, భారీ యంత్రాలు తదితర అవసరాలకు సులభంగా ఉపయోగించవచ్చు. మొదట అక్కడే గతంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేవ్, ఉత్తరఖండ్ ప్రాంతాల్లో ఈ డోర్ డెలివరీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉండే హోటళ్లు, రిసార్టులకు ఈ స్కీం చాలా ప్రయోజనకారిగా మారింది. ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు ఎక్కువగా ఉండే పంజాబ్, హర్యానాల్లోనూ అమలు చేశారు. దేశమంతటా డీజిల్ డోర్ డెలివరీని మొదటగా అమలు చేసిన నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ఈ సారి డిమాండ్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో డీజిల్ డోర్ డెలివరీని అమల్లోకి తెచ్చారు. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే క్రమంగా దేశమంతటా విస్తరించనున్నారు. -
బీపీసీఎల్ కొత్త యజమాని ఓపెన్ ఆఫర్ ఇస్తే?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణలో ఓ అంశం కీలకంగా మారింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్)లో 22.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీలో 12.5 శాతం చొప్పున బీపీసీఎల్కు వాటాలున్నాయి. బీపీసీఎల్లో ప్రభుత్వం తనకున్న 52.98 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరించే కసరత్తులో ఉన్న విషయం తెలిసిందే. బీపీసీఎల్ను కొనుగోలు చేసిన కొత్త యజమాని.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్లో వాటాదారులకు 26 శాతం వాటాలను అదనంగా కొనుగోలు చేసేందుకు నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది విజయవంతం అయితే అప్పుడు ఐజీఎల్లో బీపీసీఎల్కు 48.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 38.5 శాతానికి వాటాలు పెరుగుతాయి. దీంతో ఈ కంపెనీల్లో ఇప్పటికే వాటాలు కలిగిన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), ఓఎన్జీసీ, గెయిల్ కంటే కూడా బీపీసీఎల్ పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా ఐజీఎల్, పెట్రోనెట్ రెండూ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలన్నది కేంద్రం యోచన. కనుక ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెబీని కోరింది. ఈ అభ్యర్థన బీపీసీఎల్ నుంచి రావాలని సెబీ సూచించడంతో.. బీపీసీఎల్ ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ సెబీ నుంచి మినహాయింపు రాని పక్షంలో.. అప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్ వాటాదారులకు ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా పాల్గొని అదనపు వాటాలను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పెట్రెనెట్, ఐజీఎల్కు ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా ప్రమోటర్లుగానే ఉండడంతో ఓపెన్ ఆఫర్లో పాల్గొనే అర్హత వాటికి కూడా ఉంటుంది. దీంతో బీపీసీఎల్ ప్రైవేటు పరం అయినా.. ఐజీఎల్, పెట్రోనెట్పై పీఎస్యూల ఆధిపత్యం కొనసాగే వీలుంటుంది. -
పీఎస్యూ రిఫైనరీల్లో 100% ఎఫ్డీఐ
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వరంగ రిఫైనరీ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్డీఐ) 100 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ చమురు కంపెనీల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్డీఐ పరిమితి 49 శాతంగానే అమలవుతోంది. తాజా నిర్ణయంతో బీపీసీఎల్కు విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు బిడ్లు వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. బీపీసీఎల్లో కేంద్ర సర్కారుకు 52.98 శాతం వాటా ఉండగా.. ఇందుకోసం రెండు విదేశీ కంపెనీలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేశాయి. ప్రభుత్వ వాటాను పూర్తిగా కొనుగోలు చేసిన సంస్థ.. అదనంగా 26 శాతం వాటా కొనుగోలుకు వీలుగా ప్రస్తుత వాటాదారులకు ఆఫర్ను ఇవ్వాల్సి వస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ కోణంలోనే ఎఫ్డీఐ పరిమితి పెంచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీపీసీఎల్ మినహా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒక్కటే నేరుగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది. హెచ్పీసీఎల్ను మరో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బీపీసీఎల్ కోసం వేదాంత, అమెరికాకు చెందిన పీఈ సంస్థ అపోలో గ్లోబల్, ఐ స్కేర్డ్ క్యాపిటల్కు చెందిన థింక్ గ్యాస్ ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేశాయి. వృద్ధికి ఊతం... ప్రభుత్వ నిర్ణయం దేశీయంగా తయారీ కేంద్రాల ఏర్పాటుకు, పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి, టెక్నాలజీలకు మద్దతునిస్తుందని పరిశ్రమల మండళ్లు అభిప్రాయపడ్డాయి. లిస్టెడ్ స్పెషాలిటీ స్టీల్ కంపెనీలకు భారీ అవకాశాలకు వీలు కల్పిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్కు దారి చూపుతుందని పీహెచ్డీసీసీఐ చైర్మన్ (మినరల్స్, మెటల్స్ కమిటీ) అనిల్కుమార్చౌదరి అభిప్రాయపడ్డారు. స్పెషాలిటీ స్టీల్కు మద్దతు ఆత్మ నిర్భర్ భారత్, భారత్లో తయారీ లక్ష్యాలతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద స్పెషాలిటీ స్టీల్ రంగాన్ని కూడా చేరుస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ స్టీల్ను తయారు చేసే కంపెనీలకు ఐదేళ్ల కాల వ్యవధిలో రూ.6,322 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనివల్ల 5.25 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం దేశీయంగా తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కోటెడ్, ప్లేటెడ్ స్టీల్ ఉత్పత్తులు, హై స్ట్రెంత్/వేర్ రెసిస్టెంట్ స్టీల్, స్పెషాలిటీ రేల్స్, అలాయ్ స్టీల్, స్టీల్వైర్స్, ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తులు పీఎల్ఐ పథకం కిందకు వస్తాయి. ఈ స్టీల్ ఉత్పత్తులను ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆయిల్, గ్యాస్ రవాణా పైపులు, రక్షణ రంగ ఉత్పత్తులు, అధిక వేగంతో కూడిన రైల్వే మార్గాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో వినియోగిస్తారు. ఒక కంపెనీకి గరిష్ట రాయితీల పరిమితిని రూ.200 కోట్లుగా నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో స్టీల్ రంగంలోకి రూ.40,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, అదనంగా 25 మిలియన్ టన్నుల తయారీ సామర్థ్యం పెరుగుతుందంటూ కేంద్ర ఉక్కు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
పెట్రోల్కి ప్రత్యామ్నాయం ఇథనాల్, అడ్డా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న ఇథనాల్ తయారీకి తెలంగాణ అడ్డా కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఇథనాల్ తయారీ ప్లాంటు స్థాపనకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువే. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ‘ఇంధన గ్రేడ్’ఇథనాల్ తయారీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదిస్తోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసే 1జీ (ఫస్ట్ జనరేషన్) ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రూ.1000 కోట్లతో స్థాపించే ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్ తయారవుతుంది. ప్లాంటు ఏర్పాటుకు వంద ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా. ఈ ప్లాంటు రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు 4 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇథనాల్ తయారీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధికారులతో సమావేశం తెలంగాణలో ఇథనాల్ తయారీ పరిశ్రమ నెలకొల్పే అంశంపై బీపీసీఎల్ ఎగ్జిక్టూటివ్ డైరెక్టర్ (జీవ ఇంధనాలు) అనురాగ్ సరోగి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో భేటీ అయ్యారు. జయేశ్ను కలసిన వారిలో బీపీసీఎల్ ఈడీ (ఇంజనీరింగ్, ప్రాజెక్టులు) ఎల్ఆర్ జైన్, కేహెచ్పీఎల్ ప్రాజెక్టు లీడర్ బి.మనోహర్ ఉన్నారు. భవిష్యత్తులో ఇథనాల్ ఇథనాల్ తయారీ పరిశ్రమకు తమ మద్దతు ఉంటుందని కేంద్ర మంతత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. పెటట్రోలు ఇథనాల్తో నడిచేలా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలంటూ వాహన తయారీదారులకు సూచించారు. అంతకు ముందు పెట్రోల్లో కలిపే ఇథనాల్ శాతం పెంచాలంటూ ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రం నుంచి ఇథనాల్ తయారీకి భారీగా మద్దతు దక్కుతున్న తరుణంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు బీసీసీఎల్ తెలంగాణను ఎంచుకోవడం గమనార్హం -
సబ్సిడీలేని సిలిండర్లపై మళ్లీ బాదుడు
ముంబై, సాక్షి: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ వర్తించని 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలు తాజాగా రూ. 50 చొప్పున ఎగశాయి. దీంతో ఢిల్లీలో వీటి ధరలు ప్రస్తుతం రూ. 644ను తాకాయి. ఇక కోల్కతాలో అయితే రూ. 670.5కు చేరాయి. ఈ ధరలు ముంబైలో రూ. 644కాగా.. చెన్నైలో రూ. 660గా నమోదయ్యాయి. సుమారు రెండు వారాల క్రితం సైతం సబ్సిడీలేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ. 50 చొప్పున పెరిగిన విషయం విదితమే. సాధారణంగా విదేశాలలో ధరలు, రూపాయి మారకం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను నెలకోసారి సమీక్షిస్తుంటాయి. కాగా.. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందించే సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం.. ఇతర సిలిండర్లకూ తాజాగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇతర వంట గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్లపైనా పెంపును ప్రకటించాయి. 5 కేజీల సిలిండర్పై తాజాగా రూ. 18 వడ్డించగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్పైనా రూ. 36.5 పెంపును చేపట్టాయి. ఇంతక్రితం 19 కేజీల సిలిండర్పై రూ. 54.5ను పెంచడంతో రెండు వారాల్లోనే వీటి ధరలు రూ. 100 పెరిగినట్లయ్యింది. వెరసి ప్రస్తుతం వీటి ధరలు రూ. 1,296కు చేరాయి. -
నేడు బీపీసీఎల్ బిడ్ల పరిశీలన!
న్యూఢిల్లీ: బీపీసీఎల్ ప్రైవేటీకరణలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కంపెనీలో తనకున్న 52.98 శాతం వాటాను కేంద్రం విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా కొనుగోలు కోసం దరఖాస్తు చేసిన కంపెనీల బిడ్లను నేడు (మంగళవారం) అత్యున్నత సంఘం మదింపు చేయనున్నదని సమాచారం. ఈ వాటా కొనుగోలు కోసం వేదాంతతో పాటు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ (థింక్ గ్యాస్ మాతృసంస్థ)లు బిడ్లు సమర్పించాయి. ఈ బిడ్లను తనిఖీ చేసి డెలాయిట్ సంస్థ రూపొందించిన నివేదికపై ఈ అత్యున్నత సంఘం చర్చిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ లావాదేవీకి సలహాదారుగా డెలాయిట్ సంస్థ వ్యవహరిస్తోంది. కేంద్రానికి రూ.46,600 కోట్లు...! బీపీసీఎల్లో వాటా విక్రయానికి గత ఏడాది నవంబర్లోనే ఆమోదం లభించింది. అప్పటి నుంచి చూస్తే, షేర్ ధర 20 శాతం మేర పడిపోయింది. బీఎస్ఈలో సోమవారం నాడు బీపీసీఎల్ షేర్ రూ.406 వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం చూస్తే 52.98 శాతం వాటాకు కేంద్ర ప్రభుత్వానికి రూ.46,600 కోట్లు లభిస్తాయి. కాగా ఈ వాటాను కొనగోలు చేసిన ఏ కంపెనీ అయినా మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ ఆఫర్కోసం మరో రూ.22,800 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. భారత్లో రెండో అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇదే. భారత ముడి చమురు రిఫైనరీలో బీపీసీఎల్ వాటా 15.33 శాతంగా ఉంది. ఇంధనాల మార్కెటింగ్లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 22 శాతం. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా నాలుగు రిఫైనరీలున్నాయి. ముంబై(మహారాష్ట్ర), కోచి(కేరళ), బినా(మధ్యప్రదేశ్), నుమాలిఘర్(అస్సాం)లోని నాలుగు రిఫైనరీల వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్ టన్నులు. ఈ కంపెనీ మొత్తం 17,355 పెట్రోల్ పంపులు, 6,159 ఎల్పీజీ డీలర్లు, 61 విమానయాన ఇంధన స్టేషన్లను నిర్వహిస్తోంది. -
రెండో రోజూ పెట్రో ధరల వడ్డింపు
న్యూఢిల్లీ, సాక్షి: వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో సగటున 15-25 పైసల మధ్య ధరలు ఎగశాయి. తాజాగా న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 81.38ను తాకింది. ఈ బాటలో డీజిల్ ధరలు సైతం లీటర్కు 20 పైసలు అధికమై 70.88కు చేరాయి. ఇదే విధంగా ముంబైలో పెట్రోల్ లీటర్ 17 పైసలు పెరిగి రూ. 88.09కు చేరగా.. డీజిల్ 23 పైసలు పెరిగి రూ. 77.34ను తాకింది. చెన్నైలో పెట్రోల్ ధర 15పైసలు బలపడి రూ. 84.46కాగా.. డీజిల్ 20 పైసలు పెరిగి రూ. 76.37కు చేరింది. ఇక కోల్కతాలో పెట్రోల్ ధర 16 పైసలు బలపడి రూ. 82.95ను తాకగా.. డీజిల్ 21 పైసలు హెచ్చి రూ. 74.45కు చేరింది. ముందు రోజు సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 17-28 పైసల స్థాయిలో ఎగసిన విషయం విదితమే. వ్యాట్ తదితరాల నేపథ్యంలో రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలలో వ్యత్యాసాలు నమోదవుతుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలు తిరిగి శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి! విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ దాదాపు 2 శాతం జంప్చేసి 45 డాలర్ల చేరువలో ముగిసింది. ఇక న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1 శాతం ఎగసి 42.15 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు పీఎస్యూలు.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ సవరిస్తుంటాయి. -
బీపీసీఎల్ బిడ్ గడువు నాలుగోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: బీపీసీఎల్ ప్రైవేటీకరణ మరింత ఆలస్యమవుతోంది. బీపీసీఎల్లో వాటాను కొనుగోలు చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) దరఖాస్తులను సమర్పించే తేదీని కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ గడువును నవంబర్ 16 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. గడువు పొడిగించడం ఇది నాలుగోసారి. మొదటి గడువు మే 2 కాగా, ఆ తర్వాత జూన్ 13కు, అటు పిమ్మట జూలై 31కు, ఆ తర్వాత సెప్టెంబర్ 30కు, తాజాగా నవంబర్ 16కు గడువును పొడిగించింది. ఆసక్తి గల సంస్థల విన్నపం మేరకు, కరోనా కల్లోలం కారణంగా గడువును పొడిగిస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడం కోసం బీపీసీఎల్లో వాటాను త్వరిత గతిన విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ గడువుల పొడిగింపు కారణంగా ఈ వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర నిధులు వస్తాయని అంచనా. ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం తనకున్న పూర్తి (52.98 శాతం)వాటాను విక్రయించనున్నది. గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం నష్టంతో రూ. 353 వద్ద ముగిసింది. -
బీపీసీఎల్ పతనం- రామ్కో సిస్టమ్స్ జోరు
తొలి సెషన్లో కన్సాలిడేట్ అయిన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్సెషన్కల్లా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 209 పాయింట్లు జంప్చేసి 38,182ను తాకగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగసి 11,245 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చమురు దిగ్గజం బీపీసీఎల్ విక్రయానికి వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పెంచింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క గ్లోబల్ లాజిస్టిక్స్ దిగ్గజం నుంచి ఆర్డర్ను పొందినట్లు వెల్లడించడంతో ఐటీ సేవల కంపెనీ రామ్కో సిస్టమ్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. వెరసి బీపీసీఎల్ కౌంటర్ భారీగా నష్టపోగా.. రామ్కో సిస్టమ్స్ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. బీపీసీఎల్ చమురు పీఎస్యూ.. బీపీసీఎల్ను ప్రయివేటైజ్ చేసే బాటలో కేంద్ర ప్రభుత్వం ఈవోఐల దాఖలుకు తాజాగా గడువును నవంబర్ 16వరకూ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 7న తొలిసారి కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్లో మెజారిటీ వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కొనుగోలుకి ఆసక్తి చూపగల కంపెనీల నుంచి వినతులమేరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 53 శాతం వాటా ఉంది. కాగా.. బీపీసీఎల్ కొనుగోలుపట్ల విదేశీ దిగ్గజాలు రాస్నెఫ్ట్, సౌదీ అరామ్కో విముఖత చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం పతనమై రూ. 352 దిగువకు చేరింది. రామ్కో సిస్టమ్స్ లాజిస్టిక్స్ రంగంలోని గ్లోబల్ కంపెనీతో డీల్ను కుదుర్చుకున్నట్లు రామ్కో సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన అంతర్జాతీయ పేరోల్ నిర్వహణలో ఆధునీకరణ, ట్రాన్స్ఫార్మేషన్కు వీలుగా ఐటీ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలలో గల పేరోల్ కార్యకలాపాలను లాజిస్టిక్స్ కంపెనీ ఏకీకృతం చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రామ్కో సిస్టమ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 425 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! -
హెచ్పీసీఎల్, బీపీసీఎల్కు భారీ జరిమానా
సాక్షి, ముంబై: ప్రమాదకర వాయు కాలుష్య కారకాలను వెదజల్లుతున్న కంపెనీలకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాకిచ్చింది. ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్నారంటూ హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సహా నాలుగు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. తమ ఇళ్లకు కేవలం మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన యూనిట్, కాలుష్యంపై 2014 లో మహుల్, అంబపాడ గ్రామాల నివాసితులు దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా ఎన్జీటీ ఈ తీర్పు నిచ్చింది ముంబైలోని మహుల్, అంబపాడ, చెంబూర్ ప్రాంతాలలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని, గ్యాస్ చాంబర్ లాంటి పరిస్థితి ఏర్పడిందని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో రానున్న ఐదేళ్లలో గాలి నాణ్యతను పునరుద్ధరించేలా 286 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఈ కంపెనీలను కోరింది. హెచ్పీసీఎల్కు 76.5 కోట్లు, బీపీసీఎల్కు 7.5 కోట్లు, ఏఇజిఐఎస్ 142 కోట్లు, ఎస్ఎల్సిఎల్కు 2 0.2 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీపీబీ),సంబంధిత కంపెనీల డేటా ఆధారంగా ఉద్గారాల విలువలను అంచనా వేసినట్లు గ్రీన్ ప్యానెల్ తెలిపింది. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు పది మంది సభ్యులతో కూడిన ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ అధ్యక్షుడు జస్టిస్ఏకే గోయల్ వెల్లడించారు. -
‘ఉద్యోగులకు బీపీసీఎల్ ఆఫర్’
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటడ్(బీపీసీఎల్)సంస్థ స్వచ్చంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) రాజధాని ఢిల్లీలో అమలు చేయనుంది. అయితే వీఆర్ఎస్ స్కీమ్ను ఉద్యోగులు వినియోగించుకునేందుకు దరఖాస్తు ప్రక్రియ జులై 23న ప్రారంభమయి ఆగస్ట్ 13న పూర్తవుతుందని సంస్థ తెలిపింది. అయితే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్ను 52శాతం ప్రయివేటీకరణ చేయనుంది. ప్రస్తుతం సంస్థలో 20,000మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కాగా 45ఏళ్లు దాటిన ఉద్యోగులు వీఆర్ఎస్ స్కీమ్కు అర్హులుగా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రయివేట్ యాజమాన్యం నేతృత్వంలో ఉద్యోగం చేయడానికి ఇష్టం లేనివారు వీఆర్ఎస్ స్కీమ్ను వినియోగించుకోవచ్చని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులు కంపెనీలో ఎలాంటి పదవి చేపట్టడానికి అనర్హులని తెలిపింది. బీపీసీఎల్ ప్రయివేటీకరణ ద్వారా 2లక్షల కోట్ల టార్గెట్ను కేంద్ర ఆర్థిక శాఖ ఆశిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: బీపీసీఎల్ మళ్లీ ‘విదేశీ’ పరం!) -
ప్రభుత్వరంగ షేర్లలో అనూహ్య ర్యాలీ ఎందుకంటే..?
బీపీసీఎల్తో సహా సుమారు 12 ప్రభుత్వరంగ షేర్లు శుక్రవారం 5శాతం నుంచి 13శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజ కంపెనీలు బీపీసీఎల్లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది అండర్వాల్యూ వేయబడిన పీఎస్యూ స్టాక్స్ల రీ-రేటింగ్కు దారీతీయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పీఎస్యూ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్న మార్కెట్ ముగిసేసరికి బీపీఎసీఎల్ 12.50శాతం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ 12శాతం, భారత్ డైనమిక్స్, చెన్నై పెట్రోలియం, హెచ్పీసీఎల్, హిందూస్థాన్ కాపర్, ఎన్బీసీసీ షేర్లు 10శాతం నుంచి 5శాతం లాభడపడ్డాయి. ఈ అంశాలూ సహకరించాయ్: వ్యూహాత్మక వాటాల ఉపసంహరణతో పాటు, మెరుగైన వాల్యుయేషన్ లిక్విడిటీ కూడా పీఎస్యు స్టాక్స్ల ర్యాలీని నడిపించాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. హెచ్పీసీఎల్, ఇక్రాన్ ఇంటర్నేషనల్, బీఈఎంఎల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎన్ఎండీసీ షేర్లు ప్రస్తుతం వాటి బుక్ వాల్యూ వద్ద లేదా బుక్వాల్యూ దిగువునన ట్రేడ్ అవుతున్నాయి. అన్ని ఓఎంసీలకు కలిసొస్తుంది: రిలయన్స్ సెక్యూరిటీస్ పెట్రోల్, డీజిల్పై అధిక నికర మార్కెటింగ్ మార్జిన్ల ద్వారా పటిష్టమైన ఫైనాన్సియల్ కొనసాగిస్తూ బీపీసీఎల్లో అధిక వ్యాల్యూను పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అధిక నికర మార్కెటింగ్ మార్జిన్లు కేవలం బీపీసీఎల్కు మాత్రమే లాభాన్ని చేకూర్చడమే కాకుండా, హెచ్పీసీఎల్, ఆయిల్ కార్పోరేషన్ ఇండియాతో పాటు అన్ని అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సానుకూలమే అవుతుందని రియలన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. బిడ్ల దాఖలకు చివరి తేది పొడగింపు: బీపీసీఎల్లో 51శాతం నియంత్రణ వాటాను దక్కించుకునేందుకు గ్లోబల్ ఇంధన సంస్థలైన సౌదీ అరేబియాకు చెందిన ఆర్కామ్కో, రష్యాకు చెందిన రాస్నెఫ్ట్,, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల బీపీసీఎల్ వాటా కోసం ముగింపు బిడ్ల తేదీని జూలై 31కు పొడిగించింది. బీపీసీఎల్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .96,000 కోట్లుగా ఉంది. వాటాను చేజిక్కుంచుకునేందుకు కంపెనీలు సమర్పించిన బిడ్ విలువ రూ.1.2లక్షల కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
విదేశీ ఆసక్తి: చమురు షేర్లకు డిమాండ్
ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో వాటా కొనుగోలుకి గ్లోబల్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్న వార్తలతో పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 39 ఎగసి రూ. 433 ఎగువన ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. ఉదయం 11.40 కల్లా ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.6 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీలో భాగంకావడంతో బీపీసీఎల్ కౌంటర్.. తదుపరి సర్క్యూట్ నుంచి రిలీజ్అయ్యింది. ప్రస్తుతం 11 శాతం ఎగసి రూ. 437 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 442ను తాకింది. 2 రోజులుగా.. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో గత రెండు రోజుల్లో బీపీసీఎల్ షేరు 14 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఈ బాటలో ప్రస్తుతం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్) షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్చేసి రూ. 224 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సైతం 3 శాతం లాభపడి రూ. 87 వద్ద కదులుతోంది. ఇతర వివరాలు చూద్దాం.. సౌదీ అరామ్కో.. ఇంధన రంగ పీఎస్యూ.. బీపీసీఎల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం ఇటీవల ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకి ఆసక్తి ఉన్న కంపెనీలకు ఆహ్వానం(ఈవోఐ) పలికింది. ఇందుకు ఈవోఐలను దాఖలు చేసేందుకు ఈ నెల(జులై) 31వరకూ గడువు ఇచ్చింది. బీపీసీఎల్ కొనుగోలుకి విదేశీ ఇంధన దిగ్గజాలు సౌదీ అరామ్కో, రాస్నెఫ్ట్, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం బీపీసీఎల్లో ఉన్న 114.9 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. వెరసి 52.98 శాతం వాటా విక్రయం ద్వారా కొనుగోలుదారుకు యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనుంది. అయితే నుమాలిగఢ్ రిఫైనరీలో బీపీసీఎల్కున్న 61.65 శాతం వాటాను మరో ఆయిల్ పీఎస్యూకు ప్రభుత్వం బదిలీ చేయనుంది. -
బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ జూమ్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో లాక్డవున్ను ఎత్తివేస్తున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 42 డాలర్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి ప్రపంచవ్యాప్తంగా లాక్డవున్కు తెరతీయడంతో ఏప్రిల్లో రెండు దశాబ్దాల కనిష్టం 16 డాలర్లకు పడిపోయిన విషయం విదితమే. గత రెండు వారాలలో బ్రెంట్ చమురు 109 శాతం బలపడటం గమనార్హం! కాగా.. దేశీయంగానూ ఆర్థిక కార్యకలాపాల అన్లాకింగ్ను మొదలుపెట్టడంతో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇంధన రంగ ప్రభుత్వ కంపెనీలు భారత్ పెట్రోలియం(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఖుషీ ఖుషీగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు 6.4 శాతం దూసుకెళ్లి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 398ను అధిగమించింది. ఈ బాటలో హెచ్పీసీఎల్ 6.7 శాతం జంప్చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 222ను దాటింది. ఇక ఐవోసీ 4 శాతం పుంజుకుని రూ. 93 వద్ద కదులుతోంది. తొలుత రూ. 96ను అధిగమించింది. రెస్టారెంట్లు, మాల్స్, హోటళ్లతోపాటు పూర్తిస్థాయిలో దుకాణాలు, కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం ఊపందుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదీ తీరు పెట్రోలియం ప్రొడక్టులకు మే నెలలో డిమాండ్ 65-70 శాతానికి చేరగా.. కోవిడ్కు ముందు స్థాయికంటే ఇది 30-35 శాతమే తక్కువని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇక ఏప్రిల్లో 50-60 శాతం క్షీణించిన ఆటో ఇంధన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ప్రస్తుతం 25 శాతమే తక్కువగా నమోదవుతున్నట్లు వివరించాయి. ఈ బాటలో వైమానిక ఇంధన(జెట్ ఫ్యూయల్) డిమాండ్ సైతం 50 శాతం రికవర్ అయినట్లు ఐడీబీఐ క్యాపిటల్ తెలియజేసింది. ఏప్రిల్లో 63 శాతం సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించుకున్న బీపీసీఎల్ రిఫైనరీ మే నెలలో 77 శాతం, ప్రస్తుతం 83 శాతం ఉత్పత్తికి చేరింది. ఇదే విధంగా ఐవోసీ, హెచ్పీసీఎల్ సైతం 80 శాతానికిపైగా సామర్థ్య వినియోగంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. -
బీపీసీఎల్ షేరు 3శాతం డౌన్
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) షేరు గురువారం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈలో బీపీసీఎల్ షేరు 3.2 శాతం నష్టపోయి రూ.337.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం ఫలితాల్లో బీపీసీఎల్ కన్సాలిడేటెడ్ ఇబిటా నష్టం రూ. 2,958.91 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ ప్రకటించడంతో బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో పీబీటీ రూ.4,961.79 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో ఆయిల్ ధరలు తగ్గడంతో బీపీసీఎల్ నష్టం రూ.1,081 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ తెలిపింది. కోవిడ్-19 కారణంగా బీపీసీఎల్ క్రూడ్ డిమాండ్ 0.23 శాతం తగ్గి 8.39 మిలియన్ టన్నులకు చేరింది. విక్రయాలు సైతం 9 శాతం పతనమై 11.24 మిలియన్ టన్నులకు చేరాయి. ఏప్రిల్ నెలలో క్రూడ్ డిమాండ్ 55 శాతం తగ్గింది. మేనెలలో లాక్డౌన్కు కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ వార్షిక ప్రాతిపదికన 30 శాతం తక్కువగానే విక్రయాలు జరిగాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. కాగా ఉదయం 11:45 గంటల ప్రాంతంలో బీపీసీఎల్ షేరు 2.4 శాతం నష్టపోయి రూ.357.60 వద్ద ట్రేడ్ అవుతోంది. -
బీపీసీఎల్ అమ్మకానికి గడువు పొడిగింపు
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ప్రైవేటీకరణకు బిడ్ల దరఖాస్తుకు మరోసారి ప్రభుత్వం గడువు పొడిగించింది. దేశీయ రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ బీపీసీఎల్ను సొంతం చేసుకోవడాని ఆసక్తిగల బిడ్డర్లు దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. గతేడాది నవంబర్లో బీపీసీఎల్లో ఉన్న 52.98 శాతం ప్రభుత్వ వాటా విక్రయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులను మార్చి 7 నుంచి చేసుకోవచ్చని చెబుతూ తొలుత మే 2వ తేదీని ముగింపు గడువుగా ప్రకటించారు. అయితే కోవిడ్-19 విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో మార్చి 31న బిడ్ల దాఖలకు ముగింపు గడువును జూన్ 13వరకు పొడిగించారు. ఇప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో బిడ్ల దరఖాస్తుకు జులై 31 వరకు గడువును పొడిగిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(డీఐపీఏఎం) ప్రకటిస్తూ ఈ మేరకు బుధవారం నోటీసును విడుదల చేసింది. బీపీసీఎల్లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాకు సమానమైన 114.91 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచినట్లు డీఐపీఏఎం తెలిపింది. కాగా బీపీసీఎల్ నాలుగు రిఫైనరీలను నిర్వహిస్తోంది. అవి ముంబై(మహారాష్ట్ర), కొచి(కేరళ), బైన(మధ్యప్రదేశ్)నుమాలీఘర్(అసోం)లలో ఉన్నాయి. ఈ నాలుగు రిఫైనరీలలో ఏడాదికి 38.3 మిలియన్ టన్నుల చమురును శుద్ధిచేస్తారు. ఇది దేశ చమురు శుద్ధి సామర్థ్యంలో 15 శాతం అంటే 249.4 మిలియన్ టన్నులుగా ఉంది. బీపీసీఎల్కు దేశవ్యాప్తంగా 15,177 పెట్రోల్ పంప్స్,6,011 ఎల్పీజీ డిస్టిబ్యూటర్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటితో పాటు 51 ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో బీపీసీఎల్ షేరు దాదాపు 5 శాతం లాభపడి రూ.328.25 వద్ద ట్రేడ్ అవుతోంది. -
బీపీసీఎల్ విక్రయం: బిడ్డింగ్లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశపు రెండవ అతిపెద్ద చమురు శుద్ధిదారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరణలో సంస్థలో సగానికిపైగా వాటాల విక్రయానికి కేంద్రం శనివారం బిడ్డింగ్లను ఆహ్వానించింది. మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం (డిపామ్) బిడ్నోట్ ప్రకారం బీపీసీఎల్ వ్యూహాత్మక అమ్మకం కోసం ఆసక్తి గల వారు మే 2వ తేదీలోగా తమ బిడ్డింగ్లను సమర్పించాల్సి వుంటుంది. భారత ప్రభుత్వం 114.91 కోట్ల (52.98శాతం ఈక్విటీ వాటా)ఈక్విటీ షేర్లతో కూడిన బీపీసీఎల్ మొత్తం వాటాను వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదిస్తోంది. తద్వారా బీపీసీఎల్ ఈక్విటీ వాటా 61.65 శాతం వాటా వున్న ఎన్ఆర్ఎల్ తప్ప, మిగిలిన నిర్వహణ నియంత్రణ వ్యూహాత్మక కొనుగోలుదారుకు బదిలీ అవుతుందని తెలిపింది. బిడ్డింగ్ రెండు దశల్లో వుంది మొదటి దశలో ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి, అనంతరం రెండవ రౌండ్లో ఫైనాన్స్ బిడ్డింగ్ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం లేదు. 10 బిలియన్ డాలర్ల నెట్వర్త్ ఉన్న ఏ ప్రైవేట్ సంస్థ అయినా బిడ్డింగ్కు అర్హులు . అలాగే నాలుగు సంస్థలకు మించని కన్సార్షియానికి అనుమతి వుండదు. బిడ్డింగ్ ప్రమాణాల ప్రకారం, కన్సార్టియం లీడర్ 40శాతం వాటాను కలిగి ఉండాలి. ఇతరులు కనీసం ఒక బిలియన్ డాలర్ల నెట్వర్త్ కలిగి ఉండాలి. 45 రోజుల్లో కన్సార్షియంల మార్పులు అనుమతించబడతాయి. కానీ కన్సార్షియానికి నేతృత్వం వహించే సంస్థను మార్చడానికి వీల్లేదు. కాగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థను ఆదుకునేందుకు రూ.లక్ష కోట్లు సమీకరించే లక్ష్యంగా భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!
ముంబై: ఎయిరిండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్ ఇండియాతో పాటు బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా. వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం.... ఎయిరిండియా, బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రయత్నాలు జరుగుతున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ కంపెనీల వాటా విక్రయానికి సంబంధించి ఆర్థిక వివరాలను సిద్ధం చేస్తున్నామని, దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అదనపు వివరాలను అడుగుతున్నాయని వివరించారు. మరోవైపు భారత్ బాండ్ ఈటీఎఫ్ స్వల్ప నష్టంతో ఎన్ఎస్ఈలో లిస్టయింది. సగం కూడా సాకారం కాని లక్ష్యం..... ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకూ దీంట్లో సగం కూడా సమీకరించలేకపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.12,359 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మరోవైపు ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలను మించింది. మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికి, ఇప్పటికే ద్రవ్యలోటు 115%కి ఎగబాకింది. బీపీసీఎల్ వాటా రూ.60,000 కోట్లు. బీపీసీఎల్(భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో కేంద్రానికి 53 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం కారణంగా ఖజానాకి రూ.60,000 కోట్లు లభిస్తాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు లభించనున్నాయి. ఇక కంటైనర్ కార్పొ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.13,000 కోట్లు లభించే అవకాశాలున్నాయి. -
బీపీసీఎల్, కాంకర్ విక్రయానికి బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బీపీసీఎల్, కంటెయినర్ కార్పొరేషన్ (కాంకర్)లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. బీపీసీఎల్లో ప్రభుత్వం పూర్తి వాటాను విక్రయించనుండగా, కాంకర్లో మాత్రం 24 శాతం మేర వాటాను తన వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. బీపీసీఎల్కు అసోంలో ఉన్న నుమాలిగఢ్ రిఫైనరీని మాత్రం ప్రభుత్వరంగ సంస్థకే విక్రయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ప్రైవేట్...‘సై’రన్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్యూ) డిజిన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్ సంస్థ ఎస్సీఐ, కార్గో సేవల సంస్థ కాన్కర్లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29% వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్ రిఫైనరీని మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రైవేటీకరణపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన తలెత్తకుండా చూసేందుకు దీన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థ పరిధిలోకి చేర్చనున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు, కార్పొరేట్ ట్యాక్స్ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర ఊరట చర్యల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. క్యాబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు.. ► షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లో మొత్తం 63.75% వాటాలను.. అలాగే కంటెయినర్ కార్పొరేషన్(కాన్కర్)లో 30.9% వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్కర్లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి. ► టీహెచ్డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్కో)లో మొత్తం వాటాలను ఎన్టీపీసీకి కేంద్రం విక్రయించనుంది. ► నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్ ఆయిల్(ఐవోసీ)లో వాటాలను 51% లోపునకు తగ్గించుకోనుంది. ఇందులో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకున్న వాటాల కారణంగా నియంత్రణాధికారాలు కేంద్రానికే ఉంటాయి. ఐవోసీలో కేంద్రానికి ప్రస్తుతం 51.5% వాటా ఉండగా... 26.4% వాటాలను దాదాపు రూ. 33,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ► కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నెలకొనే చెల్లింపుల వివాదాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు ఆర్బిట్రేషన్ ఉత్తర్వులను సవాల్ చేసినా.. చెల్లించాల్సి న మొత్తంలో 75%(బ్యాంకు పూచీకత్తుకు ప్రతి గా) కాంట్రాక్టరుకు చెల్లించేందుకు ఓకే చెప్పింది. టెల్కోలకు ఊరట.. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
కీలక విషయాన్ని వెల్లడించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ల విక్రయ ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు చాలా ఆసక్తిగా ఉన్నారని అన్నారు. కంపెనీల విక్రయాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఇటీవల పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి క్యాబినెట్లో పలు సంస్కరణలను ఆమోదించిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా పలు ఆర్థిక సమస్యలను ఇదుర్కొంటొంది. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను సమకూర్చే చమురు కంపెనీలకు రూ 4500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి. బకాయిల చెల్లింపులలో ఎయిర్ ఇండియా విఫలమవడంతో ఇంధన సరఫరాలను చమురు సంస్థలు నిలిపివేశాయి. నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల క్లియరెన్స్లో ఎయిర్ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటొందని ఆర్థిక నిపుణులు అభిప్రామపడుతున్నారు. మరోవైపు భారత పెట్రోలియం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1.02 లక్షల కోట్లు ఉండగా, ప్రభుత్వం 65,000 కోట్లు విక్రయానికి పెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
బీపీసీఎల్కు ‘డౌన్గ్రేడ్’ ముప్పు!
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరించిన పక్షంలో రేటింగ్ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. ప్రస్తుతం సార్వభౌమ రేటింగ్ స్థాయిలో ఉన్న ట్రిపుల్ బి మైనస్ స్థాయిని బీఏ1 స్థాయికి తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రైవేటీకరణతో బీపీసీఎల్కు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయి.. బాండ్ల ఉపసంహరణ కోసం ఒత్తిడి పెరుగుతుందని, ఇది కంపెనీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ తెలిపింది. కొనుగోలు చేసే సంస్థ ప్రభుత్వ రంగంలోనిదా లేక ప్రైవేట్ కంపెనీయా అన్న దానిపై బీపీసీఎల్ క్రెడిట్ రేటింగ్స్ ఆధారపడి ఉంటాయని మూడీస్ వెల్లడించింది. బీపీసీఎల్లో ఉన్న మొత్తం 53.29 శాతం ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సెప్టెంబర్ 30న జరిగిన సమావేశంలో కార్యదర్శుల బృందం ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ప్రస్తుత షేరు ధరల ప్రకారం బీపీసీఎల్లో ప్రభుత్వ వాటా విలువ సుమారు రూ. 57,500 కోట్లకు పైగా ఉంటుంది. సెప్టెంబర్ 30 నాటి గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ బాండ్లకు సంబంధించి బీపీసీఎల్ 1.7 బిలియన్ డాలర్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. కంపెనీ ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బాగా లేదు. ఇలాంటప్పుడు విదేశీ కరెన్సీ బాండ్లను తిరిగి చెల్లించాల్సి వస్తే బీపీసీఎల్కు రీఫైనాన్సింగ్పరమైన రిస్కులు గణనీయంగా ఉంటాయని అంచనా. 2019 మార్చి ఆఖరు నాటికి బీపీసీఎల్ దగ్గర రూ. 5,300 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉండగా.. వచ్చే 15 నెలల్లో రూ. 10,900 కోట్ల మేర రుణాలను చెల్లించాల్సి రానుంది. -
బీపీసీఎల్ మళ్లీ ‘విదేశీ’ పరం!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ, బీపీసీఎల్లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ సంస్థలకు విక్రయించాలని, తద్వారా భారత ఇంధన రిటైల్ రంగంలోకి బహుళ జాతి సంస్థలను ఆకర్షించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, దీనికి స్వస్తి చెప్పడానికి, మరోవైపు ఈ రంగంలో పోటీని పెంచడానికి ఈ చర్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,05 లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీసీఎల్లో వాటా విక్రయం కారణంగా ఈ లక్ష్యంలో 40 శాతం మొత్తాన్ని సమీకరించే అవకాశముందని అంచనా. (శుక్రవారం నాటి ముగింపు ధరతో పోల్చితే) అలాగే ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేసుకోవాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో మౌలిక, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత దుర్లభమవుతోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బీపీసీఎల్ వాటా విక్రయం ఒకింత ఊరటనివ్వగలదని నిపుణుల అంచనా. ప్రారంభ స్థాయిలోనే చర్చలు.. అయితే విదేశీ సంస్థకు వాటా విక్రయ చర్చలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయని, ఈ చర్చలు పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్ను ఐఓసీకి విక్రయించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బీపీసీఎల్ను కొనుగోలు చేయడానికి ఐఓసీ మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం తదితర తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనను అటకెక్కించింది. గతంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్)లో తన వాటాను కేంద్రం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీకి విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓఎన్జీసీ భారీగా నిధులను సమీకరించాల్సి వచి్చంది. ఇక బీపీసీఎల్ వాటా విక్రయానికి ఏ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందో ఇంత వరకైతే స్పష్టత లేదని నిపుణులంటున్నారు. అయితే బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్ కంపెనీని కేంద్రం 1970లో జాతీయం చేసి బీపీసీఎల్గా పేరు మార్చింది. మళ్లీ బీపీసీఎల్ విదేశీ సంస్థల పరమయ్యే అవకాశాలు ఉండటం విశేషం. భారత్పై చమురు దిగ్గజాల కన్ను... ఇక పలు బహుళ జాతి సంస్థలు భారత ఇంధన రిటైల్ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. సౌదీ ఆరామ్కో, రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ పీజేఎస్సీ, టోటల్ ఎస్, షెల్, బ్రిటిష్ పెట్రోలియమ్(బీపీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్లో ఇంధన డిమాండ్ 2040 కల్లా రెట్టింపవ్వగలదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది, వచ్చే ఏడాది... ఈ రెండేళ్లలో ప్రపంచంలోనే చమురుకు అత్యంత డిమాండ్ భారత్లోనే ఉండగలదని ఇటీవలే ఒపెక్ కూడా తన నెలవారీ ఆయిల్ డిమాండ్ నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్లో ప్రభుత్వ వాటా విక్రయం ఆ సంస్థలకు ఆయాచిత వరంగా అందివచి్చంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన రిటైల్ వ్యాపారంలో 49% వాటాను బీపీ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ శుక్రవారం 6.4 శాతం లాభంతో రూ. 409 వద్ద ముగిసింది. రిఫైనరీల సంఖ్య (నుమాలీగఢ్, బినా, ముంబై, కోచి) =4 దేశవ్యాప్తంగా బంకులు =13,439 భారత్ గ్యాస్ కస్టమర్ల సంఖ్య కోట్లలో=4.2 ఆదాయం రూ. కోట్లలో 2018–19= 3,37,623 2018–19 నికర లాభం రూ. కోట్లలో=7,132 -
బీఎస్–6 ఇంధనం రెడీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్–6 (బీఎస్) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్లైన్ లోగానే బీఎస్–6 ఫ్యూయెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్–6 ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. ముందు వరుసలో బీపీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్ స్టేషన్లలో బీఎస్–4 స్థానంలో బీఎస్–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్–3 నుంచి బీఎస్–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్ కాస్త ముందుగా బీఎస్–6 ఫ్యూయెల్ విషయంలో పావులు కదుపుతోంది. మార్చికల్లా రెడీ.. మరో సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్ ఔట్లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. డెడ్లైన్ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు ఫ్యూయెల్ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) చైర్మన్ ముకేష్ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు. వ్యయం రూ.30,000 కోట్లు.. బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6 ప్రమాణాలకు అప్గ్రేడ్ అయ్యేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్–4 నుంచి బీఎస్–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వెహికిల్స్ విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి.