-
బిగ్ డిబేట్కు ముందు ట్రంప్కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్లోని మన్హట్టన్ కోర్టు గతంలో ట్రంప్పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. -
బైడెన్ వర్సెస్ ట్రంప్.. ‘బిగ్ డిబేట్’ వైపే అందరి చూపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వారిద్దరి మధ్య జూన్ 27న తొలి పబ్లిక్ డిబేట్(చర్చ) జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ డిబేట్ జరగనుంది. డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వారిద్దరు చెప్పనున్నారు. డిబేట్లో బైడెన్,ట్రంప్ ఇద్దరు కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ వయసు కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా బైడెన్ ఇటీవల తన మతిమరుపును పదే పదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ట్రంప్ దూకుడు తట్టుకోగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధనేతల మధ్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అన్ని ఒపినీయన్ పోల్ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర షిఫ్ట్ అవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ట్రంప్ కోర్టు పోలింగ్ బూతేనా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను న్యాయస్థానం దోషిగా తేల్చిన తర్వాత ఆ దేశ రాజకీయాలు మరింత విభజనకు గురయ్యాయి. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను నొక్కిచెప్పింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ జరిగితే అది ఆయన విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. విషయాలు అక్కడ భిన్నంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే తన దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ట్రంప్తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ, గత మూడేళ్లలో జరుగుతున్నట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి మాత్రం ఆయన హయాంలో జరగలేదు.అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ను తప్పుడు వ్యాపార రికార్డులపై 34 అంశాల్లో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత అమెరికా మరింతగా విభజనకు గురయింది. స్వభావ రీత్యా, ఈ కేసు చిన్నదే. కానీ న్యాయప్రక్రియను అపహాస్యం చేయడం ద్వారా, ప్రాసిక్యూటర్లపై, న్యాయమూర్తిపై కూడా ఎదురుదాడికి దిగుతూ కేసును ఎదుర్కొనాలని ట్రంప్ బృందం తీసుకున్న నిర్ణయం ఈ కేసును విషపూరితం చేసింది. ట్రంప్ ఇప్పుడు దీనిపై అప్పీల్ చేయనున్నారు. అయితే దీనిపై విచారణ జరగడానికి సంవత్సరాలు కాకపోయినా, నెలల సమయం పడుతుంది. ఒకవేళ తాను ఓడిపోయి, ఆ తర్వాత కేసు తారుమారైతే, అది అమెరికా న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నమైనదనే ట్రంప్ మద్దతుదారుల అభిప్రాయాలను ధ్రువీకరిస్తుంది. మరోవైపు, ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రంప్ గెలిచినట్లయితే, ఆ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అది వెల్లడిస్తుంది. ట్రంప్ న్యాయ ప్రక్రియను కొట్టిపడేస్తూ, ‘మనం ఫాసిస్ట్ రాజ్యంలో జీవిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తనను తాను అభివర్ణించుకున్నట్లుగా ‘ఎంతో అమాయకపు వ్యక్తి’పై జరుగుతున్న ఈ విచారణ ఒక బూటకమని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఆయన తనను ’రాజకీయ ఖైదీ’గా చెప్పుకొంటున్నారు. పైగా అవకాశం వచ్చినప్పుడు తన ప్రత్యర్థులందరూ కూడా నేరారోపణలను ఎదుర్కొనే దశలోకి అమెరికా ప్రవేశిస్తోందని ట్రంప్ పార్టీ(రిపబ్లికన్) హెచ్చరించింది.ప్రత్యేకించి ఓటర్లలో ఆదరణ లేని ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య జరుగుతున్న విచిత్రమైన రేసులో ఈ తీర్పు ఒక అస్థిరమైన, నాటకీయమైన అంశాన్ని ప్రవేశపెట్టింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ అతని లేదా ఆమె అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. ఇక్కడ విషయాలు భిన్నంగా జరుగుతున్నాయి. ఈ తీర్పు నిజానికి ఆయనకు రిపబ్లికన్ పార్టీ మద్దతును మరింతగా బలపరిచింది. తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ప్రచారానికి వచ్చిన 52.8 మిలియన్ అమెరికన్ డాలర్ల రూపంలో ఇది వ్యక్తమయింది.మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రత్యర్థిని, ప్రస్తుతం అగ్రగామిగా ఉన్న వ్యక్తిని న్యాయస్థ్ధానం దోషిగా నిర్ధారించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశంపై వ్యాఖ్యానించడంలో జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఆయన న్యాయవ్యవస్థను సమర్థించారు. పైగా, తీర్పు తమకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఎవరైనా ప్రశ్నించడం అనేది ‘నిర్లక్ష్యపూరితమైనది, ప్రమాదకరమైనది, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నది’ అని అన్నారు.ఈ కేసుకి సంబంధించిన అంశాలు చిన్నవిగానే ఉన్నప్పటికీ, ఇది బూటకపు విచారణ కాదు. సమర్పించిన సాక్ష్యాలు చేసిన నేరాలను నిర్ధారిస్తాయి. అవి ట్రంప్ జీవించే నీచమైన ప్రపంచానికి చెందిన సంగ్రహావలోకనాన్ని కూడా అందించాయి. ఆయన మద్దతుదారులు ఏం చెప్పినా సరే... జ్యూరీ ఆయన్ని ఏకగ్రీవంగానూ చాలా త్వరితంగానూ మొత్తం 34 అంశాల్లో దోషిగా నిర్ధారించింది. పైగా ఇది ట్రంప్ ఎదుర్కొనే ఆరోపణలలో ఒకటి మాత్రమే; మరో మూడు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ రిపబ్లికన్ల మనస్సులో, ఈ కేసులు ‘న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ’ ఫలితం మాత్రమే.వీటిలో రెండు కేసులు 2020 ఎన్నికల ప్రక్రియకు నష్టం గావించడంలో ట్రంప్ పాత్రకు సంబంధించినవి. ఇక మూడవ కేసు, వైట్ హౌస్ నుండి నిష్క్రమించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రహస్య పత్రాలను ట్రంప్ తన వద్ద ఉంచుకున్నట్లు చెబుతోంది. అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక భాగం ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ, అమెరికా సుప్రీంకోర్టుతో సహా ఇతర విభాగాల పక్షపాత దృష్టి కారణంగా ట్రంప్పై ఇతర కేసులను అధ్యక్ష ఎన్నికలకు ముందుగా విచారించలేరని న్యూయార్క్ కోర్టు తీర్పు సూచించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమైన ‘న్యాయస్థానం’ పోలింగ్ బూత్ మాత్రమే.ట్రంప్నకు ఉన్మాదపూరితమైన ఓటర్ బలం ఉంది. ఇది ఈ తీర్పు ద్వారా మరింత పెరిగింది. కానీ అది మాత్రమే ఆయనకు ఎన్నికల్లో గెలుపును ఇవ్వలేదు. తక్కువ ఉత్సాహవంతులైన, నేరారోపణలను బట్టి దూరం జరిగే వ్యక్తుల మద్దతు ఆయనకు అవసరం. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను, కుంభకోణాలతోపాటు ఆయన అసభ్య ప్రవర్తనను నొక్కిచెప్పింది.ఈ తీర్పు వెలువడిన వెంటనే నిర్వహించిన ‘యూ–గవ్’ పోల్లో 27 శాతం మంది ట్రంప్నకు ఓటు వేసే అవకాశం తక్కువగా ఉందనీ, 26 శాతం మంది అలా వేసే అవకాశం ఎక్కువగా ఉందనీ, 39 శాతం మంది తీర్పు తమ ఓటు విధానాన్ని ప్రభావితం చేయదనీ చెప్పారు. ఇవి పూర్తిగా విభజనకు గురైన అమెరికన్ రాజకీయ వ్యవస్థ క్షీణత లోతును పట్టి చూపే భయంకరమైన సంకేతాలు. దేశంలోని సగం మంది మరొకరి అభిప్రాయాలను సహించటానికి ఇష్టపడకపోవటంతో, పెద్ద సంఖ్యలో అమెరికన్లు మూడవ పార్టీలకు ఓటు వేయడం లేదా ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా మనం చూడవచ్చు.ట్రంప్ పదవికి పూర్తిగా అనర్హుడన్న విషయం ఈపాటికే స్పష్టం అయింది. అయినా సరే... ఆయన తిరిగి ఎన్నికైతే, తన దేశానికే కాదు, ప్రపంచానికి, భారతదేశానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పైగా తైవాన్ లో ఒక ప్రమాదం పొంచి ఉన్నందున, అమెరికా నాయకత్వ పాత్ర చాలా ముఖ్యమైనది. చైనాతో తలపడుతున్న భారత్ భద్రతకు అమెరికా భాగస్వామ్యం ముఖ్యం.అధ్యక్షుడు బైడెన్ హయాంలో... దక్షిణ కొరియా, జపాన్లతో మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్, భారతదేశంతో కూడా పొత్తులు పెట్టుకోవడం ద్వారా అమెరికా తన ఇండో–పసిఫిక్ ముఖచిత్రాన్ని భారీగా బలోపేతం చేసింది. ఈశాన్య ఆసియాలో బైడెన్ ముఖ్యంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాతో కూడిన త్రైపాక్షిక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.ముఖ్యంగా, ఆయన ‘ఆకస్’(ఏయూకేయూఎస్–ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) సైనిక కూటమిని రూపొందించడానికి కూడా చొరవ తీసుకున్నారు. ఇది భారత్ సభ్యురాలిగా ఉన్న క్వాడ్ సంస్థకు భిన్నం. ఇది ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్య భద్రత, సరఫరా గొలుసు స్థితిస్థాపకత, వాతావరణ మార్పులు, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సైబర్ భద్రత, సముద్ర భద్రత వంటివాటిపై దృష్టి సారిస్తోంది. 2023 జూన్లో, బైడెన్ ఇండో–పసిఫిక్ ప్రాంతం మరొక అంచులో యూఎస్–ఇండియా రక్షణ, భద్రతా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు. ట్రంప్తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ గత మూడేళ్లలో జరిగినట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి జరగలేదు.మనోజ్ జోషివ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లో డిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇజ్రాయెల్పై అడ్డుకట్టకు ఖతార్తో జోబైడెన్ భేటీ
గత ఆరు నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం.. గాజా స్ట్రిప్లోని ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. గాజాలో తలెత్తుతున్న విధ్వంసకర పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అమెరికాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇది అధ్యక్షుడు జో బైడెన్కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టేదిగా మారింది. దీంతో బైడెన్ గాజాలో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదనను బైడెన్ ఇటీవలే ప్రకటించాడు.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి ఈ ఒప్పందానికి సంబంధించి ఖతార్ ఎమిరేట్స్తో మాట్లాడారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించేలా హమాస్పై ఒత్తిడి తేవాలని కోరారు. గాజాలో సంక్షోభాన్ని అంతం చేయడానికి, కాల్పుల విరమణ, బందీ ఒప్పందాన్ని అమలు చేయడంపై ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో చర్చించారు.‘నేను ఈ రోజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడాను’ అని బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కాల్పుల విరమణ, బందీ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించాలనే దానిపై చర్చించానన్నారు. హమాస్ ఒప్పందాన్ని ఆమోదించేలా అన్ని తగిన చర్యలను తీసుకోవాలని తాను అమీర్ తమీమ్ను కోరానన్నారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ ఒప్పందం అమలుకు ఈజిప్ట్, ఖతార్లతో కలిసి యునైటెడ్ స్టేట్స్ పని చేస్తుందని బైడెన్ పేర్కొన్నారు.ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగిస్తూ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నగరాలపై దాడి మొదలుపెట్టింది. అనంతరం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి అక్కడి ప్రజలపై దాడులు జరిపారు. దీనికి ప్రతిగా గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో గాజాలోని హమాస్ స్థావరాలపై భారీ బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా గాజాలోని పలు ప్రాంతాలు శిథిలమయ్యాయి. ఇజ్రాయెల్,గాజాలలో ఇప్పటివరకు మొత్తం 34,622 మంది మృతి చెందారు. The United States has worked relentlessly to support Israelis’ security, to get humanitarian supplies into Gaza, and to get a ceasefire and a hostage deal to bring this war to an end. pic.twitter.com/eGXgV3KSbV— President Biden (@POTUS) June 1, 2024 -
రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్ పార్టీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇచ్చిన మొత్తం సుమారు 3.4 లక్షల డాలర్లు(రూ.2.8 కోట్లు) విరాళాలను నిలిపేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. పొలిటికో కథనం ప్రకారం.. బిడెన్ విక్టరీ ఫండ్(బీవీఎఫ్) కోసం తాజాగా ఇండో అమెరికన్ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ 50,000 డాలర్లు(రూ.41 లక్షలు) విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యంకాదని, ఆ విరాళాన్ని నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ ప్రచార అధికారి తెలిపారు. గతంలోనూ డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీ (డీసీసీసీ)కు తాను ఇచ్చిన 2.9లక్షల డాలర్లను హోల్డ్లో పెడుతున్నట్లు చెప్పారు. లాస్ ఏంజిల్స్కు చెందిన శ్రీవాస్తవ తన భార్య గౌరవ్ షారన్ పేరుతో, శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తనకు ఇతర కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ సంస్థలు నిత్యం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అవి ఎలాంటి వివాదాలో మాత్రం తెలియరాలేదు. 2022లో బాలిలో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా ఫోరమ్కు తన ఫ్యామిలీ 1 మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించింది. అనంతరం అతడి సంస్థల్లో వివాదాలు నెలకొన్నాయి. ఆ అంశాలు కోర్టు వరకు వెళ్లడంతో థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అతనితో సంబంధాలు తెంచుకుంది. అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం..ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఒక వ్యక్తి 3,300 డాలర్లకు మించి విరాళం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రచార కమిటీలకు మాత్రం విరాళాలు ఇవ్వడానికి అనుమతులున్నాయి. దాంతో డీసీసీసీకు శ్రీవాస్తవ భారీగా విరాళం ఇచ్చారు. ఆ విరాళాలను బీవీఎఫ్ బైడెన్ ప్రచారానికి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి, స్టేట్ పార్టీ యూనిట్లకు విభజించింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న వివాదాలతో ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థలకు బదిలీచేస్తున్నట్లు డెమోక్రాట్ల ప్రతినిధి చెప్పారు. డీసీసీసీకు విరాళం ఇచ్చిన సమయంలో గౌరవ్ తాను యూనిటీ రిసోర్స్ గ్రూప్ (యూఆర్జీ) ఛైర్మన్ను అంటూ చెప్పుకున్నారని కథనం ద్వారా తెలిసింది. ప్రతికూల వాతావరణంలో విజయాన్ని సాధించే వ్యాపారాలు, ప్రభుత్వాలు, సంస్థల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ యూఆర్జీ అంటూ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! బైడెన్ సెనేటర్గా ఉన్న సమయంలో అతడికి సహాయకుడిగా పనిచేసిన అంకిత్ దేశాయ్ నిర్వహించిన లాబీయింగ్ సంస్థ ఏర్పాటులో యూనిటీ రిసోర్స్ గ్రూప్ భాగమైందని పొలిటికో నివేదించింది. నాటో మిత్రపక్ష కమాండర్గా పనిచేసి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజార్చుకున్న రిటైర్డ్ జనరల్ వెస్లీ క్లార్క్ను గౌరవ్ శ్రీవాస్తవ కన్సల్టెంట్గా నియమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని పొలిటికో తెలిపింది. గౌరవ్ శ్రీవాస్తవకు వ్యక్తిగతంగా ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి ‘హాయ్.. నేనో ఫిలాంథ్రోఫిస్ట్(పరోపకారిని)’ అంటూ రావడం విశేషం. -
USA: ‘నేను మళ్లీ గెలిస్తే’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను తొలుత చేసే పనులేంటో దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టయి జైళ్లలో ఉన్నవారిని వెంటనే విడుదల చేస్తానని, మెక్సికోతో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డకట్ట వేస్తామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా ఒక పోస్టు పెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జో బైడెన్ గెలుపు అక్రమమని ట్రంప్ ఒక ప్రసంగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న వాషింగ్టన్లోని చారిత్రాత్మక క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేశారు. ఈ కేసులో వందల మంది అరెస్టయి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. క్యాపిటల్ హిల్ తిరుగుబాటు కేసులో అధ్యక్షునికి రాజ్యాంగ రక్షణ ఉంటుందా లేదా అనే కేసులో ట్రంప్పై వచ్చే ఏప్రిల్ 25న అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే ట్రంప్నకు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత ఉందా లేదా అనేది తేలిపోనుంది. కాగా, ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తలపడనున్నారు. అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే ఘన విజయం సాధించారు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
సరైన కార్యాచరణ ఎక్కడ?!
నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు. ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు? అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు. ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రా యెల్కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా? గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది. అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ. -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలోని న్యూయార్క్లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్ జయసుఖ్ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్లోని తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతి న్యాయమూర్తిని నామినేట్ చేశారు. న్యూయార్క్లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. 46 ఏళ్ల బల్సరా 2017 నుంచి న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్లో యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యూఎస్ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు. బల్సరా న్యూ రోషెల్లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి ఇంజనీర్గా పనిచేశారు. తల్లి నర్సు. బల్సరా 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుండి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుండి ఏబీ పట్టా పొందాడు. ప్రస్తుతం బల్సరా తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో ఉంటున్నారు. -
బైడెన్ మళ్లీ నెగ్గుతారా?.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా నిర్వహించిన గాల్లప్ పోల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు కేవలం 38 శాతం మాత్రమే అంగీకరిస్తున్నట్లు పోల్లో వెల్లడయ్యింది. ఇదే సమయంలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు 50 శాతం మంది అమెరికన్లు మద్దతిస్తున్నారు. బైడెన్ అధిక వయసు వల్లే రెండోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు చాలా మంది అంగీకరించకపోవడం గమనార్హం. వయసుతో పాటు మెక్సికోతో బోర్డర్ వివాదం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు బైడెన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వయసుపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బైడెన్తో పోల్చినపుడు వయసు విషయంలో సర్వేల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే గతంలో గాలప్ పోల్స్ అంచనాలు చాలాసార్లు మిస్సయ్యాయి. ఇదీచదవండి.. న్యూజిలాండ్లో భారత విద్యార్థి మృతి -
అమెరికాలో తగ్గని ట్రంప్ హవా?
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై చాలామందికి సందేహాలు ఉండవచ్చు. కానీ, ఆయనకు దేశంలో మద్దతుదారులు పెరుగుతున్నారనే చెప్పాలి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ట్రంప్కు రెండు రకాల ఇమేజ్లు ఉండటం. ఒకవైపేమో చట్టాలను కఠినంగా అమలు చేసే వ్యక్తిగా, సుస్థిర ఆర్థిక వ్యవస్థను అందించగలిగేవాడిగా, యుద్ధాలకు దూరంగా ఉండేవాడిగా చూస్తూంటే... ఇంకోవైపేమో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేవాడిగా, వ్యవస్థలపై దాడి చేసేవాడిగా, దేశ ప్రాథమ్యాలను మార్చేసే వ్యక్తిగా చూస్తున్నారు. ఏమైనా ట్రంప్కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెబుతున్నారు. అమెరికాలోని ఈశాన్య కారిడార్లో ఇటీవల జరిగిన పలు సంభాషణలు డోనాల్డ్ ట్రంప్కు ఆదరణ పెరిగిన విషయాన్ని నిరూపిస్తాయి. కేంబ్రిడ్జ్లోని మసాచూ సెట్స్లో తొలితరం అమెరికన్ , హైతీ సంతతి మహిళ తన రోజువారీ కష్టాలను వెళ్లగక్కుతోంది. రెండ్రెండు ఉద్యోగాలు చేస్తున్నా తన ముగ్గురు పిల్లలతో జీవనం దుర్భరమవుతోందని ఆమె వాపోయింది. అంతేకాదు... ఉక్రెయిన్ , ఇజ్రాయెల్ యుద్ధాలకు అమెరికా మద్దతుగా నిలవడాన్ని కూడా ప్రశ్నిస్తోంది. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నా మంటూ ఆక్షేపిస్తోంది. అదే సమయంలో దేశంలో అక్రమ చొరబాటు దారులు పెరిగిపోతూండటం కూడా ఆమెకు రుచించడం లేదు. చట్ట బద్ధంగా దేశంలోకి వస్తున్న వాళ్లు పౌరసత్వం పొందేందుకు ఏళ్ల తరబడి తంటాలు పడుతూంటే, అక్రమ వలసదారులు మాత్రంఎంచక్కా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారన్నది ఆమె ఆరోపణ. ఈ ఆర్థిక, వలసల సమస్యలకు బాధ్యుడు జో బైడెన్ అని ఆమె నిశ్చితా భిప్రాయం. అందుకే తాను ఈసారి ట్రంప్కు ఓటేస్తానని చెబుతోంది. ట్రంప్పై క్రిమినల్ కేసులున్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. వ్యవస్థ తమలాంటి ప్రజల మాదిరే ట్రంప్ను కూడా హింసిస్తోందని అంటోంది. న్యూయార్క్లోని ఓ యువ ఊబర్ డ్రైవర్ ఏమంటున్నాడో చూడండి. డొమినికన్ రిపబ్లిక్ నుంచి వలస వచ్చిన ఈ యువకుడు 2016లో ట్రంప్కు ఓటేయవద్దని తన మిత్రులందరికీ చెప్పాడు. ఇప్పుడు మాత్రం తన ఆలోచనలు మారిపోయాయని అంటున్నాడు. బైడెన్ ఏలుబడిలో నేరాలు పెరిగిపోయాయని అతడి ఆరోపణ (నిజా నికి తగ్గాయి). అమెరికా యుద్ధాల్లో చిక్కుకుపోవడం కూడా ఇతడికి ఇష్టం లేదు. బైడెన్ వృద్ధుడు అయ్యాడని ఈ యువకుడి నమ్మకం (బైడెన్కు 81 ఏళ్లు. ట్రంప్కు 77). జనవరి 6 (2021) ఘటన (క్యాపి టల్పై ట్రంప్ అనుచరుల దాడి) మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్ప టికీ, వలసదారుల సమస్య అతడిని పీడిస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకూ న్యూయార్క్ నగరం దాదాపు 16,000 కాందిశీకుల నివాసానికి అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే పనిభారంతో ఉన్న నగర పరి పాలన వ్యవస్థ మరో 68,000 మంది బాగోగులు చూసుకుంటోంది. ఈ చర్యలు కాస్తా అక్రమ వలసల విషయంలో ప్రజల్లోని వ్యతిరేక భావనలను మరింత పెంచుతున్నాయి. ఈ వ్యతిరేకత అటు డెమొక్రా ట్లతోపాటు ఇటు రిపబ్లికన్లలోనూ కొనసాగుతూండటం గమనార్హం. వాషింగ్టన్ డీసీలో ఉంటున్న సియెర్రా లియోన్ జాతీయుడి ఆలో చనలు ఎలా ఉన్నాయో చూడండి. 2008లో వలస వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికన్ పౌరుడు. ట్రంప్కు ఓటేసేందుకు ఎదురు చూస్తు న్నాడు. ఉక్రెయిన్ , ఇజ్రాయెల్లకు అమెరికా ఎందుకు మద్దతిస్తోందో ఇతడికి అర్థం కావడం లేదు. బైడెన్ చాలా యుద్ధాలు చేస్తున్నాడంటాడు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఇజ్రాయెల్కు మద్దతు మరింత పెరుగుతుందన్న వాదనను తిప్పికొడుతున్నాడు. బైడెన్ ఏలుబడిలో రోజువారి వెచ్చాల ధరలు, అద్దెలు పెరిగిపోయాయనీ, ఆఫ్రికా దేశపు వ్యక్తిగా, ముస్లింగా జాతి వివక్ష విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో తేడా ఏమీ లేదంటాడు. రిపబ్లికన్ల వైపు అనూహ్య మొగ్గు ఎక్కడైనా సరే, రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలుసు కోవాలంటే ఆయా పార్టీల మూలభూతమైన మద్దతుదారులు నమ్మ కంగా ఉన్నారా, లేదా? అన్నది ఒక ప్రామాణికమవుతుంది. తన ప్రాబ ల్యాన్ని విస్తరించుకోవడం ఇంకో కొలమానం. ఇప్పటివరకూ చెప్పు కున్న సంభాషణలన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే ట్రంప్కు ప్రాథమిక స్థాయిలో ఉన్న ఆదరణ తగ్గలేదు సరికదా... ఎంతో కొంత పెరిగిందని స్పష్టమవుతుంది. హైతి, డొమినికన్ రిపబ్లిక్, సియెర్రా లియోన్ లకు చెందిన అమెరికన్ పౌరులు ట్రంప్ మద్దతుదారులుగా మారతారని ఎవరూ ఊహించరు. అయితే సర్వేలు, ఇతర అంశాలను పరిశీలిస్తే స్పానిష్, నల్లజాతీయుల్లో ఒక వర్గం కూడా నెమ్మదిగానైనా డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్ల వైపునకు మొగ్గుతున్నట్లు తెలుస్తుంది. జాతి ఆధారిత సమూహాలను కాసేపు పక్కనబెడితే... మిగిలిన వర్గాల్లో మాత్రం ట్రంప్ మాటలు బలమైన ముద్రే వేశాయని చెప్పాలి. కొంత తప్పుడు సమాచారం, ఎన్నికల సంవత్సరంలో జోబైడెన్ ప్రభుత్వ పోకడలపై నెలకొన్న అసంతృప్తి వీటికి ఆజ్యం పోస్తున్నాయి. వేర్వేరు వర్గాలు ట్రంప్ నుంచి వేర్వేరు రకాల సందేశాలు అందుకుంటున్నాయి. ఒక్కటైతే వాస్తవం. ట్రంప్ ఆదరణ పైపైకి పోతోంది. కాక పోతే ఇందుకు భిన్నమైన పార్శా్వలు ఉన్నాయి. బాగున్న బైడెన్ రికార్డ్ మొదటిది... ప్రస్తుతమున్న ప్రజల మూడ్ ఈ క్షణానికి సంబంధించింది మాత్రమే. ప్రచారం చేసేవారికి ఫీడ్బ్యాక్ లూప్గా ఉపయో గపడుతుంది కానీ విలువ తక్కువ. 2024 నవంబరులో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ట్రంప్ మళ్లీ ఈ స్థాయిలో పుంజుకుంటా డని గత ఏడాది ఎవరు ఊహించారు? రెండు... ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు పెద్ద సవాళ్లే విసర నున్నాయి. కొలరాడో, మైన్ లలో నమోదైన కేసుల్లో ఓటుపై నిషేధం పడటం ట్రంప్కు లాభిస్తోంది. బాధితుడిగా ప్రచారం చేసుకుంటు న్నారు. సుప్రీంకోర్టు ఈ తీర్పులను రద్దు చేయవచ్చు. కానీ ఓ పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వ్యక్తి నాలుగు క్రిమినల్ శిక్షలు ఎదుర్కొంటున్నాడన్నా, పోలింగ్ రోజుకు ముందు మరిన్ని కేసులు ఎదుర్కునే అవకాశం ఉందన్నా దాని ప్రభావం ఓటింగ్పై కచ్చితంగా ఉంటుంది. మూడు... బైడెన్ స్థానిక ఎన్నికల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయినప్పటికీ 1973లో తొలిసారి సెనేటర్గా ఎన్నికై అంచ లంచెలుగా ఎదిగిన బైడెన్ ఇలాంటి స్థితి నుంచి బయటపడటం చాలా సార్లు చూశాము. పాలన విషయంలో ఆయనపై ఎలాంటి మచ్చ లేకపోవడం, కోవిడ్ నుంచి సమర్థంగా బయటపడటం, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వంటి అంశాల్లో చక్కటి సమ తౌల్యం కనిపిస్తూండటం బైడెన్ కు కలిసివచ్చే అంశాలు. ఈ చర్య లన్నింటి ఫలితం కూడా వడ్డీరేట్లు, ధరలు తగ్గడంలో ప్రతిఫలిస్తోంది. అదే సమయంలో మార్కెట్ కూడా పుంజుకుంటూండటం గమనార్హం. మౌలిక సదుపాయాలు, వాతావరణం, తయారీ రంగాలకు సంబంధించి బైడెన్ ఇప్పటికే విప్లవాత్మకమైన కొన్ని చట్టాలను ఆమోదింప జేసుకున్నారు. బైడెన్ కు ఇంకో రెండు సానుకూల అంశాలున్నాయి. అబార్షన్ పై వచ్చిన తీర్పు విషయంలో రిపబ్లికన్లపై బోలెడంత వ్యతిరేకత ఉంది. ట్రంప్ ఒంటెత్తు పోకడలపై కూడా ప్రజల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యుద్ధం కొంతమంది వామపక్ష, ముస్లింల ఉత్సాహాన్ని దెబ్బకొట్టినప్పటికీ, యూదుల మద్దతు బైడెన్ కు లభించేలా చేసింది. అందుకేనేమో బైడెన్ చైనా అధ్యక్షుడికి సైతం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెప్పారు. చివరగా... అమెరికాలోని రెండు పార్టీలకూ దాదాపుగా సమ స్థాయిలో మద్దతు ఉంది. అందుకే అమెరికాను 47 శాతం– 47 శాతం దేశమంటారు. రాష్ట్రాలకు రాష్ట్రాలు అటు ఇటో మొగ్గి ఉంటాయి. అన్ని అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అటు ఇటూ మారిపోయే ఆరు లేదా ఏడు స్వింగ్ స్టేట్స్పై ఆధారపడి ఉంటాయి. అరిజోనా, నెవడా, మిషిగన్ , విస్కాన్సిన్ , జార్జియా, పెన్సెల్వేనియాల్లోని కొన్ని వేలమంది ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారన్న అంశంపై అధ్యక్షుడి ఎన్నిక ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి డోనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా ఉందని చెప్పకతప్పదు. వ్యాసకర్త వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) - ప్రశాంత్ ఝా -
Hamas: అమెరికా బందీ మృతి.. బైడెన్ కీలక ప్రకటన
వాషింగ్టన్: హమాస్ చెరలో బందీగా ఉన్న తమ దేశ పౌరుడు గాడి హగ్గాయ్ మరణించాడన్న వార్తతో తన గుండె పగిలిపోయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. హగ్గాయ్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైట్హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘హగ్గాయ్ గాజాలో హమాస్ చెరలోనే చనిపోయాడని తెలిసిన వెంటనే నా, నాభార్య జిల్ బైడెన్ హృదయాలు తీవ్ర విషాదంతో నిండిపోయాయి. హమాస్ వద్ద బందీగా ఉన్న హగ్గాయ్ భార్య క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాం’ అని జో బైడెన్ పేర్కొన్నారు. హగ్గాయ్ భార్య ఇప్పటికీ హమాస్ చెరలోనే బందీగా ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూపు హగ్గాయ్ మరణాన్ని ధృవీకరించింది. అయితే ఆయన ఎందుకు చనిపోయాడన్న కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద గ్రూపు హమాస్ మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. బాంబు దాడులతో పాటు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్లోని ప్రాంతం నుంచి కొంత మందిని హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. ఇదీచదవండి..గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మళ్లీ ఆయనే హాట్ ఫేవరెట్!
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫేవరెట్గా మారుతున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో ప్రస్తుత అధ్యకక్షుడు జో బైడెన్కంటే 4 శాతం ఎక్కువ అప్రూవల్ రేటుతో ట్రంప్ ముందున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ను 43 శాతం మంది ప్రజలు ఆమోదించగా ట్రంప్ను 47 శాతం మంది ఆమోదించడం విశేషం. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జో బైడెన్ అప్రూవల్ రేటు 43 శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైమ్ ఉండడంతో డెమొక్రాట్లకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెమొక్రాట్లు రెండోసారి అధ్యక్షపదవికి జోబైడెన్ పోటీలో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ రెండోసారి పోటీచేయవద్దనేందుకు వాళ్లు మరో కారణం కూడా చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన వయసు 81కి చేరనుందని, ఈ వయసులో మళ్లీ పోటీ ఎందుకని కొందరు డెమొక్రాట్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీలో ట్రంప్కు తిరుగులేని మద్దతు లభిస్తోంది. పార్టీలో ట్రంప్ పోటీదారులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అయితే ట్రంప్ మీదున్న క్రిమినల్ కేసులు, గతంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి వంటి అంశాలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి..ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు! -
ఇజ్రాయెల్-హమాస్ సంధిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంగీకరించిన కాల్పుల విరమణను పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలు విడదల కావడంపై స్పందిస్తూ.. ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. తమ చెరలో ఉన్న 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడు ఉన్నారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. కాగా.. నేడు మరో దఫా బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హమాస్ డిమాండ్ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ గాజాపై దూకుడుగా ప్రవర్తించింది. గాజాను ఖాలీ చేయించింది. స్వతంత్ర్య పాలస్తీనాను నినదిస్తూ పశ్చిమాసియా దేశాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రంగంలోకి దిగారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని కోరారు. ఈ డిమాండ్ల తర్వాత నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు బదులుగా హమాస్ తమ చెరలో ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజా వైపు 15,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ -
జిన్పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట!
వాషింగ్టన్: రెండు అగ్రరాజ్యాల అధ్యక్షులు జో బైడెన్, జిన్పింగ్ బుధవారం భేటీ అయ్యారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం, తమ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని అన్నారు. జిన్పింగ్ను నియంతలాగే చూస్తున్నారా..? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్లోనూ బైడెన్ ఇదే మాట మాట్లాడారు. అప్పట్లోనే బైడెన్ తీరును చైనా ఖండించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. కాగా.. కాలిఫోర్నియాలోని ఒక విశాలమైన భవనంలో ఈ సమ్మిట్ ముగిసింది. రెండు దేశాల మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాల వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటానని జిన్పింగ్ హామీ ఇచ్చారు. అమెరికాను ఇరుకున పెట్టాలనే ఉద్దేశం లేదని జిన్పింగ్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. అమెరికా కూడా చైనాను అణగదొక్కే చర్యలకు పాల్పడకూడదని పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు వివాదాలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని ఇద్దరు అధ్యక్షులు అంగీకారానికి వచ్చారు. తైవాన్ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ.. ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: బైడెన్తో జిన్పింగ్ భేటీ -
ఉపన్యాసం వద్దు.. ట్రంప్పై న్యాయమూర్తి ఆగ్రహం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను న్యాయమూర్తి మందలించారు.కోర్టులో రాజకీయ ప్రసంగాలు ఇవ్వరాదని చివాట్లు పెట్టారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పారు. బ్యాంకులు, బీమా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందడానికి ట్రంప్ తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను ఎక్కువ చూపించారనే ఆరోపణల కేసులో విచారణ జరిగింది. "ఇది రాజకీయ ర్యాలీ కాదు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రసంగాలు వద్దు.' అని ట్రంప్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోరోన్ హెచ్చరించారు. ట్రంప్ను ఎక్కువ మాట్లాడకుండా నియంత్రించాలని పిటిషనర్ తరుపు లాయర్పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోర్టు హాల్లో ట్రంప్ అన్నారు. కోర్టుల్లో కాలయాపన చేస్తూ తన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ అసంబద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో ట్రంప్ బ్రాండ్ విలువను కలపకుండానే ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం తన బ్రాండ్తోనే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. ట్రంప్ ప్రసంగంతో విసిగిన న్యాయమూర్తి మందలించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తరుపున ట్రంప్ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: 17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు -
ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్లో అమెరికా కాన్సుల్ జనరల్గా ఆమె పనిచేశారు. 1991లో ఫారిన్ సర్వీస్లో చేరిన లఖ్దీర్.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్కు డిప్యూటీ కోఆర్డినేటర్గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్ఎస్ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు -
రష్యా, హమాస్ ఒక్కటే: బైడెన్
న్యూయార్క్: హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందని చెప్పారు. హమాస్, పుతిన్ వేరువేరు బెదిరింపులకు పాల్పడుతారు.. కానీ వారిరువురి లక్ష్యం ఒకటేనని దుయ్యబట్టారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 'ప్రపంచ పెద్దగా విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోము. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోము. వారి లక్ష్యాలను ఎప్పటికీ నేను అంగీకరించను. ప్రపంచాన్ని అమెరికా ఐక్యంగా ఉంచుతుంది. మన భాగస్వాములే అమెరికాను సురక్షితంగా ఉంచుతారు. మన విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయి.' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి నిధులను మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్ను అభ్యర్థించారు. ప్రపంచ నాయకునిగా ఉండటానికి ఈ నిధులే పెట్టుబడులని అన్నారు. ప్రపంచానికి అమెరికానే దీపపు స్తంభం అని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో పర్యటించి వచ్చారు. కల్లోల పరిస్థితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ అగ్రనేతగా తన ప్రాబల్యాన్ని చూపుతూ అమెరికా ఎన్నికల్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నంలో బైడెన్ ఉన్నారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్లకు రూ.83,1,720 కోట్లు సహాయంగా ఇవ్వడానికి అమెరికా కాంగ్రెస్ను ఇప్పటికే అభ్యర్థించారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్లో నోవా పండుగ వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్ తిరగబడి ధీటుగా బదులిస్తోంది. గాజాను ఖాలీ చేయించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో ఇప్పటికే దాదాపు 5000 వేలకు పైగా మంది మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతునిస్తోంది. అటు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిక్రితం నుంచి కొనసాగుతోంది. ఇదీ చదవండి: Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ -
అలా అయితే.. ఇజ్రాయెల్పై దాడి జరిగుండేది కాదు: ట్రంప్
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మాజీ ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడులకు బైడెన్ బాధ్యత వహించాలంటూ దుయ్యబట్టారు. తాను అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నట్లు చెప్పారు. న్యూ హాంప్షైర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. 'అమెరికాకు ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. ఆ డేటా మనదగ్గర ఉండదు. చాలా కేసుల్లో ఇలా మనదగ్గర ఉండి వెళ్లినవారే వివిధ దేశాల్లో దాడులు చేస్తుంటారు. ఇజ్రాయెల్లోనూ ఇలాంటివారే దాడులకు పాల్పడుతున్నారు. బైడెన్ అమెరికాకు ఏమీ ప్రయోజనం చేకూర్చే పనులు చేయలేదు. నేను అధ్యక్షునిగా ఉంటే.. ఇజ్రాయెల్పై దాడి జరిగి ఉండేది కాదు.' అని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న హమాస్ దళాలు.. పిల్లలను, మహిళలను దారుణంగా హింసిస్తున్నారని ట్రంప్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్న కాలంలో స్థిరమైన శాంతిని నెలకొల్పినట్లు వెల్లడించారు. పెద్దన్నగా మారణోమాలకు అమెరికా అడ్డుకట్ట వేసేదని తెలిపారు. "హమాస్ దాడులు అవమానకరం. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఎంతో పోరాడుతోంది. పాపం, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డాలర్లు ఈ దాడులకు నిధులు సమకూర్చాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన అనేక నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అమెరికా బలహీనమవుతుందని చెప్పడానికి ప్రస్తుత ఘటనలే నిదర్శనం" అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆధీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
అమెరికా అధ్యక్షులపై స్మార్ట్ గాడ్జెట్ల నిషేధం ఎందుకు?
అమెరికా అధ్యక్షులను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. అటువంటిప్పుడు వారు తమకు నచ్చిన ఏదైనా గాడ్జెట్ను ఉపయోగించగలుగుతారని మనం అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. వారు నూతన సాంకేతికత పరికరాలకు దూరంగా ఉంటారు. వారు తమకు నచ్చిన ప్రతి గాడ్జెట్ను ఉపయోగించలేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లకు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలే కీలక టార్గెట్ అని అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలు గాఢంగా నమ్ముతాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షులు పరిమిత గాడ్జెట్లను మాత్రమే ఉపయోగించగలుగుతారు. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైన తర్వాత తాను బ్లాక్బెర్రీని ఉపయోగించడానికి భద్రతా సలహాదారులతో చాలా కాలం పోరాడారు. చివరికి భద్రతా సలహాదారులు అధ్యక్షుడు ఒబామా బ్లాక్బెర్రీని వినియోగించేందుకు ఆమోదించారు. అయితే సీనియర్ ఉద్యోగులు, దగ్గరి స్నేహితులతో టచ్లో ఉండేందుకు మాత్రమే ఒబామా దీనిని వినియోగించాలనే షరతు విధించారు. 2010లో ఐప్యాడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అధ్యక్షుడు బరాక్ ఒబామా దానిని తన వద్ద ఉంచుకోవాలని భావించారు. ఒబామా కోరిక మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మరింత సురక్షితమైన ఐప్యాడ్ ‘ఒబామాప్యాడ్’ని రూపొందించారు. ఒబామాప్యాడ్ను అధ్యక్షుని వ్యక్తిగత సిబ్బందికి కూడా ఇచ్చారని సమాచారం. గతంలో వైట్ హౌస్లో వైఫై ఉండేది కాదు. దీంతో అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్హౌస్లో వైఫై ఇన్స్టాల్ చేయడం గురించి చర్చించారు. అయితే భద్రతా సలహాదారులు వైఫైని ఇన్స్టాల్ చేయడం భద్రతా ఉల్లంఘనను దారితీస్తుందని ఒబామాకు తెలిపారు. చివరకు అధికారులు బరాక్ ఒబామా పట్టుదలకు తలొగ్గవలసి వచ్చింది. ఎట్టకేలకు ఒబామా నివాసంలో వైఫైని ఏర్పాటు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో ట్విట్టర్ను విరివిగా ఉపయోగించారు. అతను వ్యక్తిగత పనుల కోసం బర్నర్ ఫోన్లు వాడినట్లు సమాచారం. తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా వాటిని తొలగించారు. ట్రంప్ కంప్యూటర్లు, ఈమెయిల్ వాడకంపై సందేహించేవారు. దీంతో ట్రంప్ కమ్యూనికేషన్ కోసం పేపర్ను వినియోగించేవారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ లిన్ తెలిపిన వివరాల ప్రకారం హ్యాక్ చేయలేని స్మార్ట్ గాడ్జెలు చాలా అరుదుగా ఉన్నాయి. అయితే ఇవి కమ్యూనికేషన్లో సమస్యలను సృష్టిస్తుంటాయి. అమెరికా అధ్యక్షుని విషయానికొస్తే అతనికి రక్షణ అత్యంత అవసరం. అందుకే అతను ఏ స్మార్ట్ గాడ్జెట్ను ఉపయోగించకూడదు. అందుకే అమెరికా మాజీ అధ్యక్షులు అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ స్మార్ట్ గాడ్జెట్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యాపిల్ న్యూస్ యాప్ వినియోగిస్తున్నారు. ఇది ఎప్పుడైనా సమస్యలను సృష్టించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా స్మార్ట్ గాడ్జెట్లు అంత సురక్షితం కావని, వాటితో ఎప్పటికైనా ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
బైడెన్ డ్రైవర్ నిర్బంధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్లో ఓ కారు డ్రైవర్ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్ హోటల్కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్ను తాజ్ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్ను వదిలేశారు. జీ20 మీటింగ్కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ -
G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం
న్యూఢిల్లీ: అద్భుతమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధనే పరమావధిగా సాగే జీ20 అగ్రరాజ్యాల కూటమి సమావేశానికి హస్తిన సర్వాంగ సుందరంగా ముస్తాబై సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర ప్రపంచ దేశాల ఆగమనంతో జీ20 శిఖరాగ్ర సదస్సు హడావిడి మరింత పెరిగింది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టగానే బైడెన్తో మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడతామని ప్రకటించారు. మానవ కేంద్రిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా సదస్సు కొత్త బాటలుపరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం సాధిస్తామని భారత్ ధీమా వ్యక్తంచేసింది. 9, 10 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరిగే సదస్సుకు హాజరయ్యే నేతల రాక, సాదర స్వాగతం, అతిథులకు ఆతిథ్యంతో ఢిల్లీలో కోలాహలం పెరిగింది. పసందైన వంటకాలు, భిన్న సంప్రదాయ వాయిద్యాలతో సంగీత విభావరి ఇలా పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలతో అధినేతలకు మరెప్పుడూ మరిచిపోలేని రీతిలో అద్భుతంగా అతిథ్యం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆర్థిక అనిశి్చతి, మాంద్యం భయాలు వంటి కీలక అంశాలతో చర్చలు శిఖరాగ్రానికి చేరుకోనున్నాయి. ఎలాగైనా సరే సదస్సు ముగిసేనాటికి అందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన విడుదల చేసేందుకు భారత్ శాయశక్తులా కృషిచేస్తోంది. నేడు మొదలయ్యే ఈ చర్చా సమరంలో నేతలు చివరకు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో, ఏమేం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం..!! దుర్భేద్యమైన భద్రత ముఖ్యనేతలంతా ఢిల్లీకి వచ్చేస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో భద్రతా బలగాలను మొహరించారు. చర్చలకు ప్రధాన వేదిక అయిన ‘భారత్ మండపం’ కాంప్లెక్స్ వద్ద భద్రతను పోలీసులు, పారామిలటరీ, నిఘా వర్గాలతో కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేసేందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదస్సు వివరాలను జీ20లో భారత షెర్పా అమితాబ్ కాంత్ శుక్రవారం ఢిల్లీలో వివరించారు. ‘ మన న్యూఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధం. దానిని ఇప్పుడు బహిర్గతం చేయలేం. ఎందుకంటే డిక్లరేషన్ తాలూకు ప్రతిపాదలను అధినేతలకు సమరి్పస్తాం. వారి సూచనలు, సవరణల తర్వాతే దానికి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే డిక్లరేషన్ ద్వారా సాధించబోయే విజయాలను వివరిస్తాం’ అని అమితాబ్ చెప్పారు. ‘ ఐక్యరాజ్యసమితి తర్వాత అత్యంత క్రియాశీలకమైన కూటమిగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చుకునేందుకు దాదాపు అందరినీ ఒప్పించడం భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్ ఆగమనం మాకు సంతోషదాయకమే అని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తంగా 55 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమిది మహా ఉపనిషత్తు నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు ఇతివృత్తం’ నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. కాగా, చర్చల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించి చర్చించాలని బ్రిటన్ భావిస్తోంది. దీంతో ఈ చర్చలో భారత్ పాత్ర కీలకంగా మారనుంది. ‘ ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, మానవ హక్కుల హననంపై ఇండియా తన నిర్ణయం వెలువరచాలని చర్చలో పట్టుబడతాం. మోదీతో, ఇతరులతో భేటీలను పుతిన్ దారుణ అకృత్యాలను ఆపేందుకు సాధనాలుగా వినియోగిస్తాం’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూటమి సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయానికి ప్రయతి్నస్తామని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ చెప్పారు. కాగా, భారత్ తమకు వ్యతిరేకంగా జీ20 వేదికగా ప్రకటన చేయాలని జీ7 దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. డిజిటల్ మౌలిక వసతులు, వాతావరణ సంబంధ నిధులు, సుస్థిరాభివృద్ధి, శుద్ధ ఇంథనం వంటి అంశాల్లో జీ20 వేదికగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కూటమి సారథ్య బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న భారత్ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా భిన్న నగరాలు, వేదికలపై 200 సమావేశాలను నిర్వహించింది. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనసంఖ్య జీ20 దేశాల్లోనే ఉంది. అందుకే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు పెను ప్రభావం చూపిస్తాయి. సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం జీ20 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సంప్రదాయ నృత్యాల నడుమ వీరికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జియెవా విమానాశ్రయంలో డ్యాన్స్ చేశారు. భారతీయ సంస్కృతిపై క్రిస్టలినా చూపిన మక్కువను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రశంసించారు. వచ్చే రెండు రోజుల్లో వివిధ దేశాల నేతలతో ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం భారత్కు వచ్చారు. ఆయన సతీమణి జిల్ బైడెన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బైడెన్కు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్గా రావడం పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, దర్శనా జర్దోష్ స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్కు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. కొమరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ కూడా అయిన అజలి అస్సౌమనీ, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఒమన్ డిప్యూటీ ప్రధాని సయ్యిద్ ఫహద్, ఈజిప్టు అధ్యక్షుడు ఫతా ఎల్–సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, యూఏఈ ప్రెసిడెంట్ అల్ నహ్యాన్లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్కు అధికారులు స్వాగతం పలికారు. జీ20(గ్రూఫ్ ఆఫ్ 20)లో అర్జెంటినా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)సభ్యులన్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్థులతో సునాక్ ముఖాముఖి శుక్రవారం యూకే ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్కు వెళ్లి సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. -
రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
ఢిల్లీ: జీ20 సమావేశానికి హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు. భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే జీ20 కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే. రిషి సునాక్.. బ్రిటన్కు చెందిన తొలి భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ సెప్టెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో రిషి సునాక్కు బస ఏర్పాట్లు చేశారు. జో బైడెన్.. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి VK సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా..? లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్కు కరోనా నెగటివ్ రావడంతో ఆయన భారత్కు రానున్నారు. జస్టిన్ ట్రూడో.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీలోని లలిత్ హోటల్లో బస చేస్తారు. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన భారత్కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. జపాన్ ప్రధాని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రేపు భారత్కు వస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగుతారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రధాని మోదీతో సమావేశమై భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇదీ చదవండి: Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. -
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్కు మాత్రం నెగెటివ్గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్లోని రెహోబోత్ బీచ్లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
‘ఆరోపణలతో మరింత ఆదరణ’.. ట్రంప్ వింత వ్యాఖ్యానం!
వచ్చే ఏడాది(2024) నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత ఫిబ్రవరిలో జరిగిన డెమొక్రాటిక్ పార్టీ సమావేశంలో రెండవసారి అధ్యక్షుడిగా తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని పార్టీ సభ్యులను కోరారు. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రచార వేగం కొనసాగించాలని తన మద్దతుదారులకు సూచించారు. కాగా ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అవుతారని, రిపబ్లికన్ల తరపున పోటీచేస్తే ఎన్నికల్లో ఓడిపోతారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పెరుగుతున్న ఆరోపణలపై ట్రంప్ వ్యంగ్యం తనపై వస్తున్న ఆరోపణల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా తన పాపులారిటీ కూడా పెరుగుతోందని, ఇది ఎన్నికల ప్రచారానికి ఎంతగానో దోహదపడుతుందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అతని మద్దతుదారులు కూడా ట్రంప్ వ్యాఖ్యలకు వంతపాడుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తనకు కావాల్సింది ఒక్క ఆరోపణ మాత్రమేనని ట్రంప్ వ్యంగ్య ధోరణిలో వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి అభ్యర్థిత్వానికి తాను ముందున్నానని, తనపై క్రిమినల్ కేసుల ఫలితం ఎలా ఉన్నా రేసులో ఉంటానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ‘ఆరోపణలతో ప్రచారానికి ఉత్సాహం’ తనపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు, తన ఎన్నికల ప్రచారం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే తనకు ఆరోపణలు అవసరమని సరదాగా అన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలేవీ చెల్లవని, సరైనవి కాదని ట్రంప్ మరోమారు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు ప్రత్యర్థుల నిరాశ నుంచి వచ్చినవేనని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ప్రత్యర్థులను ఉద్దేశిస్తూ.. ‘మీరు నన్ను వెంబడిస్తే.. నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తాను’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ విజేతగా నిలిచారు. అయితే ఈ ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగలేదంటూ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు పలు విమర్శలు చేశారు. అనంతరం అమెరికాలోని కాపిటల్ హిల్పై వారు దాడి చేశారు. ఇటువంటి ఎదురుదాడుల మధ్య 2020, జనవరి 20 న జో బైడెన్ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కూడా చదవండి: ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడాడని... ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా?