-
ఒబామా ఫోటోగ్రాఫర్కు అంతర్జాతీయ అవార్డ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పీట్ సౌజాకు ది వే ఐ సీ ఇట్ చిత్రానికి 45 టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది. అయితే పీట్ సౌజా గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వ్యక్తిగత, వైట్ హౌస్ ఫోటోగ్రాఫర్గా దశాబ్ద కాలం పాటు పని చేశారు. కాగా పీట్ సౌజా మే 2019 సంవత్సరం హైదరాబాద్ పర్యటనలో అమెరికన్ ఫిల్మ్ మేకర్ డాన్ పోర్టర్ డాక్యుమెంటరీని రూపొందించారు. అయితే గతంలో బ్రాండ్ ఒబామాను మీరు ప్రమోట్ చేశారా అన్న ప్రశ్నకు సౌజా స్పందిసూ ఒబామా పాలనలో రాజకీయ, సామాజిక అంశాలను దృష్య రూపంలో చూపెట్టినట్లు తెలిపాడు. అయితే తాను కేవలం ఫోటోగ్రాఫర్ను మాత్రమే కాదని తన కెమెరా పనితనం చారిత్రక అంశాలతో ముడిపడి ఉంటుందని సౌజా పేర్కొన్నాడు. కానీ ప్రస్తుతం వైట్ హౌస్ జర్నలిస్ట్లుల పై ఏ విధంగా స్పందిస్తుందని సౌజాను అడగగా జర్నలిస్టుందరూ నిరాధార వార్తలు రాస్తున్నారంటూ ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ ఆరోపిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ది వే ఐ సీ ఇట్ చిత్రంబపై సౌజా స్పందిస్తు ఇందులో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా, వ్యక్తిగా విభిన్న కోణాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ చిత్రంలో సామాజిక, రాజకీయ కోణాలు ఉంటాయని పీట్ సౌజా పేర్కొన్నాడు. (చదవండి: ట్రంప్పై ఒబామా సంచలన వ్యాఖ్యలు) -
అమెరికాలో ‘కమల’ వికాసం
జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, వాదనా పటిమతో ప్రత్యర్థుల్ని తికమకపెట్టే సామర్థ్యం, అద్భుతమైన నాయకత్వ లక్షణం.. ఇవే కమలా హ్యారిస్ రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల తీరకపోయినా, ఎప్పటికైనా అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో నిండిపోయింది. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర తిరగరాయడానికి బాటలు కూడా వేస్తోంది. భారత సంతతి మహిళకు గొప్ప గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం తలుపు తట్టింది. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్ను తన లెఫ్ట్నెంట్గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని, పాలనా తీరును, వలస విధానాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక వ్యూహాత్మకంగా మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయంతో బైడెన్ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక అత్యుత్తమం అని మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా.. మేమిద్దరం కలిసి ట్రంప్ను ఓడించబోతున్నాం అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్కు అరుదైన గౌరవం లభించింది. ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు, నల్లజాతీయులు, ప్రవాస భారతీయుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగంగానే కమలా హ్యారిస్ ఎంపిక జరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మంగళవారం నాడు కమలా హ్యారిస్ను ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తూ డెమొక్రాట్ సహచరులందరికీ మెసేజ్లు పంపించారు. ఒక నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేసి బైడెన్ చరిత్ర సృషించారు. 55 ఏళ్ల కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాధ్యక్ష పదవికి మొట్టమొదటి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా. మొదటి ఆసియా అమెరికన్గా రికార్డులకెక్కుతారు. భారతీయ– జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం బైడెన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. భయం లేని పోరాటయోధురాలు: బైడెన్ కమలా హ్యారిస్ను భయం బెరుకు లేని పోరాటయోధురాలిగా, దేశంలో అత్యద్భుతమైన ప్రజాసేవకురాలిగా బైడెన్ అభివర్ణించారు. ‘‘కమలా హ్యారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశాను. ఎన్నికల ప్రక్రియలో ఆమె నాకు అత్యుత్తమ భాగస్వామి. మేమిద్దరం కలిసి ట్రంప్ని ఓడించబోతున్నాం. హ్యారిస్కు పార్టీ సహచరు లందరూ ఘనంగా స్వాగతం పలకండి’’అని తన సందేశంలో బైడెన్∙పేర్కొన్నారు. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు దక్కిన అత్యంత గౌరవం అని కమలా హ్యారిస్ అన్నారు. ఒబామా సలహా మేరకే ! కమలా హ్యారిస్ను ఎంపిక చేయడానికి జో బైడెన్ పార్టీలో అందరితోనూ విస్తృతంగా సంప్రదించారు. ఉపాధ్యక్ష పదవికి మహిళనే ఎంపిక చేస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరికొందరు పార్టీ ప్రతినిధులతో కూడిన బోర్డు కమలా హ్యారిస్ను ఎంపిక చేయాలని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమల అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేశానికి ఇవాళ ఎంతో శుభ దినం. ఒక సెనేటర్గా కమలా హ్యారిస్ నాకు చాలా కాలంగా తెలుసు. మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆమె జీవితాన్నే ధారపోస్తున్నారు. కమలా హ్యారిస్ను గెలిపించుకుందాం‘‘అని ట్వీట్ చేశారు. కాగా, కమలా హ్యారిస్ ఎంపికపై అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక సెనేటర్గా హ్యారిస్ అత్యంత భయంకరమైన వ్యక్తి అని తీవ్రంగా విమర్శించారు. కమలా ఎంపికకి కారణాలివే ! అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను అందులోనూ నల్లజాతీయురాలిని, ప్రవాస భారతీయురాలిని ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఆఫ్రికన్ అమెరికన్లు, ఎన్నారైలు, ఏ పార్టీకి చెందని తటస్థుల ఓట్లు కొల్లగొట్టాలంటే హ్యారిసే సరైన ఎంపికన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కమలా దేవి హ్యారిస్ మాటలు తూటాల్లా పేలతాయి. ఒక అటార్నీ జనరల్గా, ప్రజాప్రతినిధిగా ఆమె వాదనా పటిమకి ప్రత్యర్థి ఎంతటివాడైనా చిత్తయిపోవాల్సిందే. జాతి వివక్ష పోరాటాల్లో, వలసదారులకి అండగా నిలవడంలో కమలా హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. అన్నింటికి మించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని సమర్థంగా ఢీ కొనే సత్తా కలిగిన నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ వైఫల్యాలను, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా లైంగిక వివాదాల్లో చిక్కుకున్న బ్రెట్ని నియమించిన సమయంలోనూ కమలా హ్యారిస్ కాంగ్రెస్ సమావేశాల్లో తన వాక్పటిమతో అందరినీ ఆకర్షించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రిలిమినరీ స్థాయి ఎన్నికల్లో కమలా పోటీ పడినప్పుడు ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయి. బైడెన్ వయసు 77 ఏళ్లు కావడంతో చురుగ్గా ఉంటూ, ప్రగతిశీల భావాలు కలిగిన వారినే ఎంపిక చేయాలని ఆయన భావించారు. ఇవన్నీ కమలకి కలిసొచ్చాయి. వారి ఓట్లే కీలకం అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లు 13శాతం ఉన్నాయి. ఒకే పార్టీకి మద్దతుగా నిలవని రాష్ట్రాల్లో వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అధ్యక్ష ప్రిలిమినరీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు జో బైడెన్కే మద్దతు పలికారు. అప్పట్నుంచి నల్లజాతికి చెందిన వారినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా పోలీసు అధికారి దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల్లో హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. ఇక కమలా దేవికున్న భారతీయ మూలాలు కూడా ఆమెను ఎంపిక చేయడానికి కారణమే. ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఒక అంచనా. పెన్సిల్వేనియాలో 2 లక్షలు, మిషిగావ్లో లక్షా 25 వేల ఎన్నారై ఓట్లు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకం. 2016లో 77% మంది ఇండియన్ అమెరికన్లు డెమోక్రట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్కి ఓటు వేశారని అంచనాలున్నాయి. ఇవన్నీ కమలా రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పాయి. అమ్మ చెప్పిన మాట ‘ఊరకే కూర్చొని ఫిర్యాదులు చేయడం మానెయ్. ఏదో ఒకటి చేయడం ప్రారంభించు’’. తల్లి శ్యామల గోపాలన్ ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఇప్పటికీ తు.చ. తప్పకుండా పాటిస్తోంది డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్. అవే ఆమెను ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి. ప్రతీ రోజూ ఆ మాటలే గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉంటానని కమల గర్వంగా చెప్పుకుంటారు. ఆమె తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. ఆరు దశాబ్దాల క్రితమే శ్యామల అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే డేవిడ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కమల, మాయ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. దీంతో ఆమె బాల్యమంతా హిందూ తల్లి సంరక్షణలోనే గడిచింది. అందుకే భారతీయ తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు. నల్లజాతీయుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని బ్లాక్ గర్ల్స్గానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్మవిశ్వాసంతో పెంచింది. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్ను పెళ్లాడారు. డగ్లస్కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ వీరితోనే ఉంటారు. ఎలా, కోల్ అనే ఆ ఇద్దరు పిల్లల ప్రేమ తనకెంతో శక్తినిస్తుందని కమల చెప్తారు. నేను అమెరికన్నే కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్లో జన్మించారు. బెర్కెలేలో పెరిగారు. కెనడాలో పాఠశాల విద్యనభ్యసించారు. వాషింగ్టన్ హోవార్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, కాలిఫోర్నియా వర్సిటీలో లా చదివారు. శానిఫ్రాన్సిస్కోలో పెద్ద ప్రాసిక్యూటర్గా ఎదిగారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్గా ఆమె ప్రదర్శించిన వాక్పటిమ రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా సెనేటర్గా ఎన్నికయ్యారు. సెనేట్లో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళ ఆమె. ఇద్దరు వలసదారులకు పుట్టినప్పటికీ తనని తాను అమెరికన్గానే హ్యారిస్ చెప్పుకుంటారు. అధ్యక్షురాలు కావాలని కలలు సెనేటర్గా పేరు తెచ్చుకున్న కమలా అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్తోనే పోటీపడ్డారు. తనవాదనా పటిమతో బైడెన్ను ఇరుకున పెట్టారు. ఆయన్ను జాతి విద్వేషిఅంటూ తిట్టిపోశారు. కానీ బైడెన్ ధాటికి నిలబడలేక రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడె గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈసారి ఉపాధ్యక్షురాలిగా కమలా నెగ్గితే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మూడో మహిళ కమల. ఇడ్లీ సాంబార్ అంటే ప్రాణం కమలాకు భారతీయ రుచులు అంటే అమితమైన ఇష్టం. ఇడ్లీ సాంబారు ఇష్టంగా లాగించేస్తారు. చిన్నతనంలో పప్పు, బంగాళదుంపల వేపుడు, పెరుగన్నం తింటూనే ఆమె పెరిగారు. తల్లితో కలిసి తరచూ చెన్నైకి వస్తూ ఉండేవారు. తాత పీవీ గోపాలన్ ప్రభావం తనపై ఉందని బయోగ్రఫీలో హ్యారిస్ రాసుకున్నారు. తల్లి శ్యామలతో కమల (ఫైల్) -
సెనెటర్ శారమ్మ
ఇంకా సెనెటర్ కాలేదు. కానీ అయ్యేలా ఉన్నారు. అవుతారు కూడా. మంచికోసం పోరాడాలి. మంచి దారిలో పెట్టాలి. మంచికి తోడు అవ్వాలి. ఇన్ని హోప్స్ ఉన్నాయి... ఒబామాకు శారా మీద. ఆ ఆశలే ఆమె గెలుపు. గొప్పగా అనిపిస్తుంది.. ఇక్కడి వాళ్లు ఎక్కడికో వెళ్లి అక్కడి రాజకీయాల్లో ప్రముఖులు అయిపోవడం. పారిశ్రామికవేత్తలైతే ‘తెలివుంది కనుక’ అనుకోవచ్చు. నటీనటులైతే ‘టాలెంట్ ఉంది కనుక’ అనుకోవచ్చు. ఇంకా ఏ రంగానికి ఆ రంగంలో ఎవరికి వారు కష్టపడితే సుప్రసిద్ధ ఎన్నారైలు అయిపోవచ్చు. కానీ మనవాళ్లు పాలకులుగా కూడా ఎదుగుతున్నారే! అదీ అమెరికా వంటి అగ్రరాజ్యాలలో!! ప్రజలు ఎన్నుకుంటేనే ఎక్కడైనా సభల్లోకి ప్రవేశం. మరి భారతీయులు.. దేశంకాని దేశంలో.. ఎలా చట్టసభల ప్రతినిధులు అవుతున్నారు? ఎలా అంటే.. అక్కడి ప్రజల్లో కలిసిపోయి. అక్కడి ప్రజలకు సేవలు అందించి, సదుపాయాలను కల్పించి! వ్యాపారికి తెలివి, నటులకు టాలెంట్.. ఉన్నట్లే.. రాజకీయంగా ‘నాయకత్వ సమర్థత’ మనవాళ్లను నిలబెడుతోంది. యు.ఎస్.లోని మైన్ రాష్ట అసెంబ్లీకి ప్రస్తుతం స్పీకర్గా ఉన్న 48 ఏళ్ల శారా గిడియన్.. మన భారతీయ సంతతి మహిళే. ఇప్పుడామె ఆ పై స్థానానికి పోటీ చేయబోతున్నారు. అమెరికన్ ‘సెనెటర్’గా! సెనెటర్గా శారా అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం మద్దతు ఇవ్వగానే (‘ఎండార్స్’ అంటారు ఇలా మద్దతు ఇవ్వడాన్ని) వెనువెంటనే ఆమె తరఫున పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆమె కొత్తగా ప్రచారం గానీ, పరిచయం కానీ చేసుకోవలసిందేమీ లేదు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడన్ కూడా శారాకు మద్దతు పలికారు. ఇద్దరు దిగ్గజాలు ఇటొకరు, అటొకరు ఉండి (ఒబామా, బైడన్) శారాను సెనెట్కు పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమె పని తీరు మీద వారికున్న నమ్మకం, విశ్వాసం అది. 2012 లో మైన్ అసెంబ్లీలో దిగువ సభకు ఎన్నికయ్యారు శారా. అది ఆమె ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం. తర్వాత 2016లో అదే సభకు స్పీకర్ అయ్యారు. ఇప్పుడు మైన్ రాష్ట్రం నుంచి వాషింగ్టన్ వెళ్లేందుకు.. ప్రస్తుతం ఇదే రాష్ట్రం నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా సెనెట్లో ఉండి, మళ్లీ పోటీ పడుతున్న సీనియర్ సెనెటర్ 67 ఏళ్ల సుజేన్ కాలిన్స్ను డీకొనబోతున్నారు! ఆమెపై గెలిస్తే అమెరికన్ సెనెట్లో శారా రెండో భారతీయ సంతతి సభ్యురాలు అవడం అటుంచి, సుజేన్పై గెలవడం పెద్ద విషయం అవుతుంది. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న రోజే అమెరికన్ సెనెట్లోని మూడింట ఒక వంతు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సభ్యులకు ఆరేళ్ల పదవీ కాలం ఉండే సెనెట్.. ప్రతి ‘సరి’ సంవత్సరంలో ఎన్నికలకు వెళుతుంది. శారా తండ్రి ఇండియా నుంచి వెళ్లి యు.ఎస్.లోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో స్థిరపడిన పిల్లల వైద్యుడు. నలుగురు పిల్లల్లో శారా ఆఖరి సంతానం. రోడ్ ఐలాండ్లోనే పెరిగింది. శారా తల్లి రెండో తరం ఆర్మేనియన్ సంతతి మహిళ. శారా అంతర్జాతీయ వ్యవహారాలలో డిగ్రీ చేశారు. చదువు అయ్యాక ఓ సెనెటర్ దగ్గర ఇంటెర్న్గా ఉన్నారు. తర్వాత మైన్స్టేట్లోని ఫ్రీపోర్ట్ టౌన్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు! అరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పోలిస్ సంస్కరణలు, తుపాకీ సంస్కృతి నియంత్రణ.. వీటికోసం శారా చాలా కృషి చేశారు. ఇలాంటి వారు సెనెట్లో ఉంటే అమెరికాకు మంచి జరుగుతుందని ఒబామా తన ఎండార్స్మెంట్లో రాశారు. శారా సెనెటర్గా ఎన్నికైతే కమలా హ్యారిస్ తర్వాత సెనెటర్ అయిన రెండో భారత సంతతి మహిళ అవుతారు. శారా భర్త, ఆమె ముగ్గురు పిల్లలు ఫ్రీపోర్ట్లో నివాసం ఉంటారు. భర్త బెంజమిన్ లాయర్. భర్త, పిల్లలతో శారా -
వణికిన ట్విట్టర్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. బిట్కాయిన్ వాలెట్లోకి లక్షకు పైగా డాలర్లు సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్కాయిన్ వాలెట్లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యం త భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ట్వీట్ చేశారు. ఎలా హ్యాక్ చేశారంటే బిట్కాయిన్ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్వర్డ్లు తెలుసుకొని మెసేజ్లు పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
డీఏసీఏపై ట్రంప్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: వలస వ్యతిరేక ఎజెండాతో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఉన్న 6.50 లక్షల యువ వలసదారులకు ప్రభుత్వపరమైన రక్షణల రద్దుకు ట్రంప్ చేస్తున్న యత్నాలకు బ్రేక్ పడింది. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతోపాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం 2012లో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ) తీసుకువచ్చింది. దీన్ని ట్రంప్ వ్యతిరేకించారు.తాజాగా డీఏసీఏ విధానం అక్రమమనీ, దీనిపై సమీక్షించేందుకు కోర్టులకు అధికారం లేదని ట్రంప్ ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనను ప్రధాన జడ్జి జాన్ రాబర్ట్స్, మరో నలుగురు జడ్జీలు తిరస్కరించారు. ‘డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన
జార్జి ఫ్లాయిడ్ హత్యకు, సమాజంలో కొనసాగుతున్న అసమ న్యాయం సమస్యకు వ్యతిరేకంగా అమెరికాలో లక్షలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి గళమెత్తుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నిజమైన మార్పు తీసుకొచ్చేలా ఈ ఉద్వేగాలను ఎలా కొనసాగించాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించేలా వ్యూహాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తదుపరి తరం కార్యకర్తల మీదే ఉంటుంది. అయితే గతంలో ఈ విషయంపై జరిగిన ప్రయత్నాలనుంచి గ్రహించవలసిన కొన్ని ప్రాథమిక పాఠాలు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మొదటగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్లువలా పెల్లుబుకుతున్న ప్రజా నిరసన కార్యక్రమాలు అనేవి.. పోలీసుల పనితీరులో, నేర న్యాయవ్యవస్థలో విస్తృత ప్రాతిపదికన సంస్కరణలు తీసుకురావడంలో అమెరికాలో దశాబ్దాలుగా సాగుతున్న వైఫల్యం పట్ల నిజమైన, సహేతుకమైన నిరాశా నిస్పృహలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారిలో చాలామంది శాంతియుతంగా, సాహసోపేతంగా, బాధ్యతాయుతంగా ఉంటూ స్ఫూర్తి కలిగిస్తున్నారు. కనుక వీరి నిరసనలను ఖండించడానికి బదులుగా మనందరం గౌరవించాలి. మద్ధతుగా నిలవాలి. నిజానికి కామ్డెన్, ఫ్లింట్ వంటి నగరాల్లోని పోలీసులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు వారిని ప్రశంసించాలి కూడా. మరోవైపున, అనేకరూపాల్లో హింసకు పాల్పడిన అతి చిన్న మైనారిటీ బృందాలు నిజమైన ఆగ్రహంతో లేక కేవల అవకాశవాదంతో అలా చేస్తున్నప్పటికీ అమాయకులను వీరు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే తమ పొరుగున ఉన్న వారికి ఈ హింసాత్మక చర్యల ద్వారా కనీస సేవలు కూడా అందకుండా చేసేలా వీరి చర్యలు ఉంటున్నాయి. పైగా దీర్ఘకాలిక లక్ష్య సాధన నుంచి ఇలాంటి చర్యలు పక్కదోవ పట్టిస్తాయి. నిన్ననే కన్నీళ్లు పెట్టుకున్న ఒక నల్లజాతి మహిళ ఇంటర్వ్యూను చూశాను. తన పొరుగునే ఉన్న కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేయడం ఆమెను విషాదంలో ముంచెత్తింది. నిజానికి ఆ దుకాణం మళ్లీ యథాస్థితికి వచ్చి సేవలందించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టే హింసను మనం సమర్థించవద్దు, దాన్ని హేతుబద్ధం చేయవద్దు లేక దాంట్లో పాల్గొనకుండా జాగ్రత్తపడదాం. మన నేర న్యాయవ్యవస్థ కానీ, అమెరికన్ సమాజం కానీ అత్యున్నత నైతిక నియమావళితో పనిచేయాలని మనం కోరుకుంటున్నట్లయితే అలాంటి నైతిక నియమావళిని ముందుగా మనం ఆచరించి చూపాల్సి ఉంది. రెండో విషయం, మన నేరన్యాయ వ్యవస్థలో పదేపదే సాగుతున్న జాతివివక్షా ధోరణిని ఇలాంటి నిరసనలు, ప్రత్యక్ష పోరాటం మాత్రమే మార్చగలుగుతాయని.. ఓట్లు వేయడం, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం శుద్ధ దండగమారి వ్యవహారమని కొంతమంది సూచిస్తుండటాన్ని కూడా నేను విన్నాను. ఈ అభిప్రాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రజల్లో జాగరూకత పెంచడం, అన్యాయాన్ని అక్కడికక్కడే ఎత్తి చూపడం, అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించడమే నిరసనల లక్ష్యంగా ఉండాలి. అమెరికా చరిత్ర పొడవునా ఇలాంటి ప్రజా నిరసనలు, సహాయ నిరాకరణకు స్పందించడం వల్లే, దేశంలోని రాజకీయ వ్యవస్థ అణగారిన బృందాల సమస్యల పట్ల ఆసక్తి చూపిందని గుర్తుంచుకోవాలి. కాబట్టే ప్రజల ఆకాంక్షలు, వారి ఉద్వేగాలు నిర్దిష్ట చట్టాలుగా, సంస్థాగత ఆచరణగా పరివర్తన చెందాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మన డిమాండ్ల పట్ల స్పందించేవారిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాకారమవుతుంది. అంతకంటే మించి, మన నేరన్యాయ వ్యవస్థపై, పోలీసుల పనితీరుపై ఎలాంటి ప్రభుత్వం అత్యధిక ప్రభావం వేయగలుగుతుందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనలో చాలామంది అధ్యక్షుడు, ఫెడరల్ ప్రభుత్వం పట్ల మాత్రమే ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు. నిజమే. మన సమాజంలో జాతి వివక్ష పాటిస్తున్న అణచివేత స్వభావాన్ని వాస్తవంగానే అర్థం చేసుకుని దానిపై ఏదో ఒక చర్య తీసుకోవాలంటే.. అధ్యక్షుడు, కాంగ్రెస్, అమెరికన్ న్యాయ విభాగం, ఫెడరల్ న్యాయవ్యవస్థ మనకు తప్పకుండా ఉండితీరాలి. అయితే రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ఎన్నికైనవారే చాలావరకు పోలీసు శాఖలో, నేరన్యాయవ్యవస్థలో సంస్కరణల గురించి చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారని మాత్రం మర్చిపోవద్దు. చాలావరకు పోలీసువిభాగం అధిపతులను మేయర్లు, కౌంటీ కార్యనిర్వాహకులే ఎక్కువగా నియమిస్తుంటారు, పోలీసు యూనియన్లతో సమష్టి ఒప్పందాలపై చర్చిస్తుంటారు. పోలీసుల దుష్ప్రవర్తనపై విచారించాలా వద్దా, అంతిమంగా వారిపై నేరారోపణ చేయాలా వద్దా వంటి విధులను జిల్లా అటార్నీలు, రాష్ట్రాల అటార్నీలు నిర్వహిస్తుంటారు. వీరంతా ఎన్నికైనవారే. కొన్ని చోట్ల పోలీసుల వ్యవహార శైలిని పర్యవేక్షించే అధికారాన్ని పోలీసు సమీక్షా మండళ్లకు ఉంటుంది. కానీ ఈ స్థానిక పోటీల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య.. ప్రత్యేకించి యువతీయువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలపై నేరుగా ప్రభావం చూపే ఇలాంటి పదవులను పట్టించుకోకపోవడం తెలివిలేని పని. పైగా.. ఈ కీలకమైన స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంశాన్ని కొన్ని వేలమంది ఓటర్లు లేక కొన్ని వందలమంది ఓటర్లు మాత్రమే నిర్ణయిస్తుంటారు. కాబట్టి నిజమైన మార్పు తీసుకురావాలని మనం కోరుకుంటున్నట్లయితే, అలాంటి అవకాశం నిరసనలు లేక రాజకీయాల్లో ఏదో ఒకదానిపై ఆధారపడి ఉండదు. ఈ రెండూ మనకు కావాలి. ప్రజల్లో జాగరూకతను పెంచడానికి మనం జనాల్ని కూడగట్టాలి. పాలనా సంస్కరణలు తీసుకురాగల అభ్యర్థులను మాత్రమే మనం ఎన్నుకునేలా మన ఓటుహక్కును వినియోగించుకునేలా మనం సంఘటితం కావాలి. చివరగా నేర న్యాయవ్యవస్థలో, పోలీసు విభాగంలో సంస్కరణలపై మనం నిర్దిష్టంగా డిమాండ్లు పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకురానట్లయితే ఎన్నికైనవారు ఈ కీలకమైన సంస్కరణ పట్ల నామమాత్రంగా మాత్రమే స్పందిస్తూ, ప్రజా నిరసనలు తగ్గుముఖం పట్టాక యధావిధిగా తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోతారు. కాబట్టి సంస్కరణల ఎజెండా విషయం వివిధ సామాజిక బృందాలకు సంబంధించినంతవరకూ వేరువేరుగా ఉంటుంది. మహానగరం విషయంలో ఒక తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. గ్రామీణ ప్రజానీకానికి మరో తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా పునరావాసం అవసరం కావచ్చు. ఇతరులకు కొన్ని సంస్కరణలే అవసరం కావచ్చు. అందుకే ప్రతి శాసన అమలు విభాగం కూడా స్పష్టమైన విధానాలు కలిగి ఉండాలి. ఎక్కడైనా దుష్ప్రవర్తనకు సంబంధించిన పరిశీలనకు స్వతంత్ర విభాగం అవసరం కూడా దీనిలో భాగమే. ప్రతి కమ్యూనిటీ అవసరాలకు తగినట్లుగా సంస్కరణలను మార్చాలంటే స్థానిక కార్యకర్తలు, సంస్థలు పరిశోధనలు చేసి ఎలాంటి వ్యూహాలు చేపడితే ఉత్తమంగా ఉంటుంది అనే విషయంపై తోటి పౌరులను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రారంభ ఘట్టంగా, నేను వైట్హౌస్లో ఉన్నప్పుడు ఏర్పర్చిన ‘21వ శతాబ్ది విధానాలపై టాస్క్ఫోర్స్’ చేసిన కృషిపై ఆధారపడి పౌర, మానవ హక్కులపై లీడర్షిప్ కాన్ఫరెన్స్ అభివృద్ది చేసిన టూల్ కిట్, దానిగురించిన నివేదికను ముందుగా పరిశీ లించాలి. నిర్దిష్ట చర్యలు తీసుకోవడంపై మీకు శ్రద్ధాసక్తులు ఉంటే, ఒబామా ఫౌండేషన్లో ఒక నిబద్ధత కలిగిన సైట్ను రూపొందిం చాము. సంవత్సరాలుగా స్థానిక, జాతీయ స్థాయిల్లో మంచికోసం పోరాడుతూ వస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఇది ఉపయోగకరమైన వనరుగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా అమెరికా కఠిన పరిస్థితులను ఎదుర్కొందని, సమాజంలో స్ఫూర్తి కాస్త తగ్గుముఖం పట్టిందని నేను గుర్తిస్తున్నాను. కరోనా సాంక్రమిక వ్యాధి తీసుకొచ్చిన భయం, విషాదం, అనిశ్చితి, కష్టభూయిష్టమైన పరిస్థితులు వంటివి.. అమెరికా సామాజిక జీవితం ఇప్పటికీ దురభిప్రాయాలు, అసమానత్వంతో నిండివుందని విషాదకరంగా మనందరికీ గుర్తు తెస్తున్నాయి. కానీ గత కొన్ని వారాలుగా ప్రతి జాతిలో, ప్రతి ప్రాంతంలో మన యువతీయువకుల క్రియాశీలతను ఎత్తిపడుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు మాత్రం నాకు పరిస్థితి పట్ల ఆశావహంగానే ఉంది. మనం ముందుకు పోవాలంటే మన ధర్మాగ్రహాన్ని శాంతిమార్గంవైపు మళ్లించాలి. నిలకడతో కూడిన సమర్థ కార్యాచరణను చేపట్టాలి. అప్పుడు మాత్రమే మన అత్యున్నత లక్ష్యాలకు అనుగుణంగా మన దేశం సాగించే సుదీర్ఘ ప్రయాణంలో ప్రస్తుత ఘట్టం నిజమైన మూలమలుపు అవుతుంది. బరాక్ ఒబామా, అమెరికా పూర్వ అధ్యక్షుడు -
ఒబామా అసమర్థుడు : ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసలే తనపై ఈగ వాలినా సహించని ట్రంప్ ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒబామా అసమర్థుడని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒబామాను అసమర్థ అధ్యక్షుడుగా అభివర్ణించారు. అంతకుమించి ఏమీ చెప్పలేను అని వ్యాఖ్యానించారు. కాగా శనివారం నాడు ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవంలో పాల్గొన్న బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. (ట్రంప్పై ఒబామా సంచలన వ్యాఖ్యలు) కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ ఎద్దేవా చేశారు. గతంలోనూ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆయన వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా అమెరికాలో ఇప్పటివరకు 14,84,804 కరోనా కేసులు నమోదవగా 89,399 మరణించారు. (కరోనా పోరులో ట్రంప్ విఫలం) -
ట్రంప్పై ఒబామా సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ కాలేజీలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో పాల్గొన్న ఒబామా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 75,000 మందికి పైగా అమెరికన్ల ప్రాణాలను తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు లేవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ ఒబామా మండిపడ్డారు. చదవండి: భారతీయులు భళా: ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది తమను తాము ఇన్చార్జ్లుగా చెప్పుకుంటున్నా వారు చేస్తున్న పనులు వారికే అర్థం కావడంలేదు. అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 23న జార్జియాలో 25ఏళ్ల అహ్మద్ ఆర్బెరిని కాల్చి చంపిన ఘటనని గుర్తు చేశారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న సమయంలోనూ.. బయటికి వచ్చిన నల్లజాతీయులను చంపేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ' ఒబామా విమర్శలు గుప్పించారు. కాగా.. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించిన విషయం తెలిసిందే. చదవండి: వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్వో -
కరోనా పోరులో ట్రంప్ విఫలం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు. వైట్హౌస్లో తనతో కలిసి పనిచేసిన సిబ్బందితో శుక్రవారం రాత్రి ఒబామా మాట్లాడారు. దీనిని అమెరికా మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. సమర్థవంతమైన పాలకులు అధికారంలో ఉన్నప్పటికీ కరోనా వంటి ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడం కత్తి మీద సామేనని, అలాంటిది నాకేంటి అన్న ధోరణిలో అధ్యక్షుడు ఉండడంతో అగ్రరాజ్యం కొంప మునిగిందని ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాతో వచ్చే ముప్పేమీ లేదని ఫిబ్రవరిలో వాదించిన ట్రంప్, మార్చికల్లా అది ఎంతో ప్రమాదకరమైందని అన్నారని ఇలా ఊగిసలాట ధోరణిలోనే ఆయన కాలం గడిపేశారని విమర్శించారు. కరోనాని ట్రంప్ ఎదుర్కొన్న తీరు ఈ విపత్తుని మరింత గందరగోళానికి గురి చేసి అందరిలోనూ తీవ్రమైన నిరాశ నిస్పృహలను నింపిందని ఒబామా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నవంబర్లో జరగనుండగా ట్రంప్పై డెమొక్రాట్ అయిన ఒబామా తీవ్రంగా విమర్శలు చేయడం చర్చకు దారితీసింది. వైట్హౌస్ సభ్యులతో మాట్లాడుతూ ఒబామా పదే పదే డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్కు మద్దతునివ్వాలని కోరారు. క్వారంటైన్లో వైట్హౌస్ సిబ్బంది వైట్హౌస్లో కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సిబ్బందిలో ముగ్గురు క్వారంటైన్లోకి వెళ్లారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోని ఫాసీతో పాటు మరో ఇద్దరు ముందు జాగ్రత్తగా క్వారంటైన్లోకి వెళ్లారు. ► కరోనాతో అమెరికాలో 24 గంటల్లో 1,568 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80 వేలకి చేరువలో ఉంది. ళీ దక్షిణ కొరియా ఆంక్షలు సడలించడంతో నైట్ క్లబ్స్కి వెళ్లిన 50 మందికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం క్లబ్బులను మూసివేయాలని వెంటనే ఆదేశాలిచ్చింది. ► చైనాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. వూహాన్లో కూడా ఒక కేసు నమోదు అయింది. చైనాలో ఏప్రిల్ 28 తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ► రష్యాలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. గత 24 గంటల్లోనే 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. -
ట్రంప్పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్
న్యూయార్క్ : మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శల దాడి మొదలుపెట్టారు. కరోనా వైరస్ను అరికట్టడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఒబామా ఆరోపించారు. గత శుక్రవారం తన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో ఒబామా వెబ్ కాల్ ద్వారా మాట్లాడారు. ఈ వెబ్ కాల్ ఆడియో కాస్తా లీకైంది. ఈ లీకైన వెబ్ కాల్ ఆడియోలో.. మైకేల్ ఫ్లైన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయవ్యవస్థను దిగజార్చిందని ఒబామా అన్నారు. ( ట్రంప్ ట్వీట్పై నెటిజన్ల మండిపాటు.. ) నవంబర్ ఎన్నికలలో ట్రంప్పై గెలిచేందుకు తనతో కలిసి, జోయ్ బైడెన్ తరపున జరిగే ర్యాలీలో పాల్గొనాలని తన మాజీ ఉద్యోగులను ఆయన కోరారు. స్వార్థం, అనాగరికం, విభజించి పాలించటం, ఇతరులను శత్రువులుగా చూసే పద్ధతులతో పోరాడుతున్నామని, ఇవన్నీ అమెరికా పౌరుల జీవితంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే అమెరికా కరోనాను అడ్డుకునే విషయంలో విఫలమైందని అన్నారు. -
అగ్రరాజ్యాధీశుల భారతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు వస్తున్నారంటే ఊరూవాడా ఒకటే సంబరం. ఇంట్లో పెళ్లి జరుగుతున్న హడావుడి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి అయిన ట్రంప్ని సాదరంగా ఆహ్వానించడానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు భారత్కి వచ్చారు ? ఆనాటి విశేషాలేంటో ఓ సారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం.. డ్వైట్ డి ఐసన్హోవర్, 1959 డిసెంబర్ 9 – 14 సరిగ్గా 60 ఏళ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 21 సార్లు తుపాకులు గాల్లో పేల్చి సైనిక వందనంతో ఐసన్హోవర్కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్మహల్ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రిచర్డ్ ఎం నిక్సన్, 1969 జూలై–31 1969లో రిచర్డ్ ఎం నిక్సన్ తన ఆసియా పర్యటనలో భాగంగా భారత్కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు మాత్రమే గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్కు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన అమెరికా వెళ్లిపోయాక భారతీయులపై నీచమైన కామెంట్లు కూడా చేశారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో నిక్సన్ పాకిస్తాన్కే కొమ్ముకాశారు. జిమ్మీ కార్టర్, 1978 జనవరి 1 – 3 1978 జనవరిలో జిమ్మీ కార్టర్ భారత్కు వచ్చారు. అప్పట్లో మొ రార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. వివిధ రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సిందిగా భారత్పై ఒత్తిడి తెచ్చారు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కార్ తిరస్కరించడంతో ఆయన పర్యటన ఫలప్రదం కాలేదు. బిల్ క్లింటన్, 2000 మార్చి 19–25 ఆ తర్వాత రెండు దశాబ్దాలు భారత్, అమెరికా సం బంధాల మధ్య స్తబ్ధత నెలకొంది. దానిని తొలగించడం కోసం 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బిల్ క్లింటన్కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్కి కూడా క్లింటన్ వచ్చారు. ప్రతీచోటా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. జార్జ్ డబ్ల్యూ బుష్, 2006 మార్చి 1–3 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, లెఫ్ట్ పార్టీలు అధ్యక్షుడి రాకను వ్యతిరేకించడంతో బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు. అప్పుడే రెండు దేశాల మధ్య అణు ఒప్పందం ఖరారైంది. బరాక్ ఒబామా 2010, 2015 2010, నవంబర్ 6–9 2015, జనవరి 25–27 అమెరికా, భారత్ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు బరాక్ ఒబామా హయాంలోనే నెలకొన్నాయి. మహాత్మాగాంధీ బోధనల నుంచి స్ఫూర్తిని పొందిన ఆయన తన ఎనిమిదేళ్ల పాలనలోనూ భారత్తో సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చారు. మన్మోహన్ హయాంలో 2010లోనూ , తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2015లో పర్యటించి భారత్తో సంబంధాలు తమకెంత కీలకమో చాటి చెప్పారు. తొలిసారి పర్యటనలో రక్షణ రంగంలోనూ , అంతరిక్ష పరిశోధనల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులోనూ భారత్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాలు బలపడడానికి ఒబామాయే చొరవ తీసుకున్నారు. అంతేకాదు నిరంతరం మన్మోహన్ సింగ్తో టచ్లో ఉంటూ సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా ఒబామా 400 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్కు ప్రకటించారు. -
ట్రంప్ ట్వీట్పై నెటిజన్ల మండిపాటు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమెరికా లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్, అతని కుమార్తె గియానా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బ్రియాంట్, గియానా మృతిపై ప్రపంచంలోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్రియాంట్ మృతి పట్ల ట్రంప్తోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో బ్రియాంట్కు నివాళులర్పిస్తూ.. ట్రంప్ చేసిన ట్వీట్పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘గొప్ప బాస్కెట్బాల్ ఆటగాళ్లలో బ్రియాంట్ ఒక్కరిగా నిలిచిపోతారు. బ్రియాంట్కు కుటుంబం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తుపై అతనికి బలమైన నమ్మకం, ప్రేమ ఉండేది. బ్రియాంట్తో పాటు అతని కుమార్తె గియానా కూడా ఈ ప్రమాదంలో మరణించడం మరింత బాధను పెంచింది. మెలానియాతో పాటు నేను.. బ్రియాంట్ భార్య వెనెస్సాకు, అతని కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం. దేవుడు వారితో ఉండాలని ఆశిస్తున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందే ట్వీట్ చేసిన ఒబామా బ్రియాంట్ మృతికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. అలాగే తన భార్య మిషెల్తోపాటు తన తరఫున వెనెస్సాతోపాటు బ్రియాంట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయతే ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు.. ఒబామా, ట్రంప్ ట్వీట్ల మధ్య సారూప్యత ఉందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొద్దిపాటి మార్పులతో ఒబామా ట్వీట్ను ట్రంప్ కాపీ చేశారని ఆరోపిస్తున్నారు. ఒబామా చేసిన ట్వీట్కు సంబంధించిన స్ర్కీన్ షాట్లను షేర్ చేస్తూ ట్రంప్పై విమర్శలు చేస్తున్నారు. ‘మీరు ఎప్పటికీ ఒబామా కాలేరు.. కనుక ఇలాంటి పనులను ఆపేయండి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. Kobe Bryant, despite being one of the truly great basketball players of all time, was just getting started in life. He loved his family so much, and had such strong passion for the future. The loss of his beautiful daughter, Gianna, makes this moment even more devastating.... — Donald J. Trump (@realDonaldTrump) January 26, 2020 Kobe was a legend on the court and just getting started in what would have been just as meaningful a second act. To lose Gianna is even more heartbreaking to us as parents. Michelle and I send love and prayers to Vanessa and the entire Bryant family on an unthinkable day. — Barack Obama (@BarackObama) January 26, 2020 -
బాస్కెట్బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికా లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్ బాస్కెట్బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం ఎన్బీఏకు తీరని లోటని తెలిపింది. ‘బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ దిగ్గజ ఆటగాడి మృతితో యావత్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ దిగ్గజ క్రీడాకారుడి మరణావార్త విని అమెరికా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడి అన్ని టీవీ ఛానళ్ల న్యూస్ రీడర్లు అతడి మరణవార్తను తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా అనేకచోట్ల అతడికి సంతాపం తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. 'బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడు.. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ఆటతో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా అత్యధిక గోల్స్ సాధించిన టాప్ ప్లేయర్స్లలో కోబ్ బ్రియంట్ ఒకడిగా నిలిచాడు. -
ఒబామా కొత్త ప్యాలెస్ చూశారా?
న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది. 2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్తోపాటు అవుట్డోర్ ఫైర్ పిట్, సన్బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు. -
ఒబామాను వదిలేద్దామనుకున్నా: మిచెల్
వాషింగ్టన్ : ‘కొన్ని కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉండదు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు’ అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తాను మ్యారేజ్ కౌన్సిలింగ్కు వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పీపుల్ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... ‘మేము రోల్ మోడల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు వివాహ బంధం నుంచి వైదొలగాలని అన్పిస్తుంది. ఎవరికైనా ఇది సహజం. నాకు కూడా చాలాసార్లు అలాగే అన్పించింది. అందుకే మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలని కోరానని మిచెల్ పేర్కొన్నారు. కౌన్సిలింగ్ జరిగిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టామని, అందుకే చాలా విషయాల్లో తాను చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలిసొచ్చాయని మిచెల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి నుంచే తన భర్తతో పాటుగా ఇతరులను కూడా సహాయం అడిగే చొరవ లభించిందని పేర్కొన్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి, ఆ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్కు వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడవద్దని మిచెల్ సూచించారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా- మిచెల్ల వివాహం 1992లో జరిగింది. వీరికి మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. -
ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నివాసాలకు గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు పంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బుధవారం వాటిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ మధ్యలోనే అడ్డగించి పేల్చివేసింది. రోజువారీ బట్వాడా చేయడానికి ముందు పార్సిల్స్ను తనిఖీచేస్తుండగా ఒబామా, హిల్లరీ పేరిట వచ్చిన ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. అవి వారికి చేరడానికి మందే పేల్చివేశామని, ఒబామా, హిల్లరీకి ఎలాంటి ముప్పులేదని స్పష్టంచేసింది. ఒబామా పేరిట వచ్చిన ప్యాకేజీని వాషింగ్టన్లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్లో గుర్తించారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో న్యూయార్క్లోని బ్యూరో భవనాన్ని ఖాళీచేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, అధికారులను పంపినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నింటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఎన్ఎన్ అధ్యక్షుడు జెఫ్ జుకర్ చెప్పారు. అనుమానాస్పద పేలుడు పదార్థాలు బయటపడటంపై అధ్యక్షుడు ట్రంప్కు వివరించినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒబామా, హిల్లరీపై దాడులకు జరిగిన ప్రయత్నాలను శ్వేతసౌధం ఖండించింది. ఇలాంటి వాటికి బాధ్యులైన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తెలిపింది. -
అత్యుత్తమ అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్గా పేర్కొన్నారు. 33 శాతంతో రెండో స్థానంలో బిల్ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్ రీగన్ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు. 2011లో ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నిర్వహించిన సర్వేలో 20 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 2018 జూన్ 5 నుంచి 12 మధ్య తమ జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షులపై 2,002 మంది వయోజనుల అభిప్రాయాలు సేకరించారు. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఆధారంగా విశ్లేషణ చేశారు. ఫస్ట్ చాయిస్లో 31 శాతం, సెకండ్ చాయిస్లో 13 శాతంతో మొత్తం 44 శాతం ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. ట్రంప్ తమకు ఫస్ట్ చాయిస్ అని 10 శాతం మంది చెప్పగా, 9 శాతం మంది సెకండ్ చాయిస్ అని పేర్కొన్నారు. -
నిర్మాతలుగా ఒబామా దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ‘నెట్ఫ్లిక్స్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్ నిర్మించి నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఒబామా దంపతులు నిర్మించే డాక్యుమెంటరీల్లో ముందస్తు స్క్రిప్టు రాసుకున్నవి, స్క్రిప్టు అవసరంలేని డాక్యుమెంటరీలు ఉంటాయని నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల అనుభవాలను కూడా నెట్ఫ్లిక్స్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నెట్ఫ్లిక్స్తో ఒబామా దంపతులకు త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత మార్చి నెలలోనే ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ కోసం ఒబామా దంపతులు ‘హయ్యర్ గ్రౌండ్ ప్రొడక్షన్స్’ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించబోతున్నామని, వారి విలువైన అభిప్రాయలను, అభిరుచులను తెలుసుకోవడంతోపాటు వాటిని ప్రపంచ ప్రజలతో పంచుకునేలా చేయడం కోసమే తాము ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ వర్గాల ప్రజల్లో నిగూఢంగా దాగున్న నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసి ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. -
న్యూజిలాండ్ ప్రధానికి ఒబామా పాఠాలు
ఆక్లాండ్ : బరాక్ ఒబామా అంటే అమెరికా మాజీ అధ్యక్షుడి గానే కాకుండా గొప్ప తండ్రి అని ప్రపంచానికి తెలుసు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కుమార్తెలు మాలియా, సాశాలను సాధారణ తండ్రిలాగే పెంచారు. అధ్యక్షుని బిడ్డలమనే గర్వం కూడా వారిలో ఎప్పుడూ కనిపించలేదు. అంతేకాకుండా అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒబామా కూతుళ్లు ఓ రెస్టారెంట్లో పార్ట్టైమ్ జాబ్ చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఎలా పెంచాలో ఒబామాకు బాగా తెలుసని ఆయన సన్నిహితులు చెబుతూ ఉండేవారు. అధ్యక్ష పదవి కాలం ముగిసిన తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న ఒబామా అప్పుడప్పుడు ప్రజలకు అవసరమయ్యే ప్రసంగాలు చేస్తుంటారు. తాజాగా ఓ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా న్యూజిలాండ్లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒబామా.. ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్కు పిల్లల పెంపకంపై పాఠాలు చెప్పారు. జెసిందా గత జూన్లో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఒబామా చెప్పిన సూచనలు తనకు, తన బిడ్డ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని కివీస్ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. -
ఒబామా మాటలు – ముత్యాల మూటలు
అవలోకనం ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కనబడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసుకున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లాడటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రపంచం గుర్తించి గౌరవించే మేధావి. వీరిద్దరూ విఫల నేతలేనని కొందరనుకుంటారు. అందుకు ఒక కారణం ఉంది. మన్మోహన్ వలే జనాకర్షణ శక్తిగానీ, సొంతబలంగానీ లేకపోవడం... ఒబామాలా జాతిపరంగా మైనారిటీ నేతలన్న భావం వీరిపట్ల ఉండటం ఆ కారణమని నేననుకుంటాను. అయితే ఈ నాయకులిద్దరూ ఇతర నేతల్లా తరచు మాట్లాడకపోవచ్చుగానీ చాలా తెలివైన వారు. వారు మాట్లాడినప్పుడు వినడం అనివార్యంగా మనకు ప్రయోజనకరమవు తుంది. కొన్ని రోజులక్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీకి ఒబామా అద్భుత మైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన సామాజిక మాధ్యమాల గురించి, ఆధునిక ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. ఉమ్మడి ప్రయోజనాలుండే వారందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికీ, సంబంధబాంధవ్యాలు నెలకొల్పుకోవడానికీ ఈ మాధ్యమాలు నిజంగా శక్తివం తమైన ఉపకరణాలన్న సంగతిని ఆయన అంగీకరించారు. ‘అయితే ఇలాంటి వారంతా ఏ పబ్లోనో, ప్రార్థనాలయం వద్దనో, మరెక్కడైనా కలుసుకోవాలి. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు గల కారణం కూడా చెప్పారు. ‘ఇంటర్నెట్లో ఏర్పడ్డ సంబంధాల్లో అంతా సూక్ష్మంగా, సాధారణంగా కనిపిస్తుంది. కానీ ముఖాముఖీ కలిసినప్పుడు మాత్రమే అవ తలివారెంత సంక్లిష్టమైనవారో అర్ధమవుతుంది’ అని ఆయన వివరించారు. ‘ఇంటర్నెట్తో ఉన్న మరో ప్రమాదమేమంటే తమకు దానిద్వారా పరిచయమయ్యే వారిలో వేరే రకమైన వాస్తవాలు దాగి ఉండొచ్చు. పర్యవసానంగా వారు తమ కుండే దురభిప్రాయాలను బలపర్చుకునే సమాచారంలోనే కూరుకుపోతారు’ అని కూడా ఒబామా అభిప్రాయపడ్డారు. మనం ఇంటర్నెట్ ఉపయోగించే తీరుకు సంబంధించి ఆయనొక ముఖ్యమైన, అవసరమైన విషయాన్ని పట్టుకున్నారని నాకనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఏ సామాజిక మాధ్యమాల్లో లేను. ఎందుకంటే అవి మన ఏకాగ్రతను భంగపరుస్తాయి. నా ఆన్లైన్ వ్యాసాలపై వచ్చే వ్యాఖ్యలను గమనించినప్పుడు నా మనసెంతో వ్యాకులపడుతుంది. ఆ వ్యాఖ్యల్లో కనబడే ఆగ్ర హమూ, దుర్మార్గమూ, మితిమీరిన భాష గమనిస్తే ఎవరినైనా దూరం పెట్టక తప్ప దనిపిస్తుంది. ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కన బడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసు కున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లా డటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరు స్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. ఒబామా చెప్పిన మరో ముఖ్యాంశమేమంటే మనం ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటే తప్ప లేదా కోరుకుంటే తప్ప అతడు/ఆమె వైఖరేమిటో మనకు తెలిసే అవకాశం లేదు. నిజజీవితంలో ఎవరితోనైనా మనం వ్యవహరిస్తున్నప్పుడు వారు చెప్పేది కూడా మనం విని తీర వలసి వస్తుంది. అది మన నిశ్చయాన్ని, మన ప్రతికూల అభిప్రాయాలను పల్చ బారుస్తుంది. ఒబామా మనకిచ్చిన లోచూపు నుంచి మనం కొన్నిటిని గ్రహిం చవచ్చు. అందులో మొదటిది–తమ పని ద్వారా మార్పునాశించే క్రియాశీలవా దులు, రాజకీయ నాయకులు ఇంటర్నెట్ ద్వారా కాక నేరుగా ప్రజలను కలుసు కోవాలి. వారితో సంబంధాలు నెలకొల్పుకోవాలి. నేను పనిచేసే చోటుకు కొన్ని వారాల క్రితం దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ వచ్చారు. ఆయన తన దృక్కో ణాన్ని, ఆశలను వివరించారు. ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అది తన స్వల్ప కాల లక్ష్యమేమీ కాదని, పదిపదిహేనేళ్లుగా అందులో విజయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే బలంగా ఉండే గుజరాత్లాంటి రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా సులభంగా నెగ్గుతానని ఆయన ఎప్పుడూ అనుకుని ఉండరు. పైగా ఆయనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎన్నికల గుర్తు లేదు. కేవలం తన సొంత విశ్వసనీయతే ఆధారం. మరి ఇదెలా సాధ్యమైంది? తెలివిగా మాట్లాడటం, ఒప్పించే గుణం ఉండే ప్రసంగాలు చేయ డం... వేలాదిమందిని వ్యక్తిగతంగా కలవడం వల్లే మేవానీ గెలుపు సాధించగలి గారని నేననుకుంటున్నాను. నావంటి మానవ హక్కుల కార్యకర్త కూడా ఇదేవిధంగా జనాన్ని కలుసు కోవాలి. ఇది నేనెందుకు చెబుతున్నానంటే క్రియాశీల ప్రపంచం సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతుంది. దానిద్వారా భారీ సంఖ్యలో ప్రజలకు చేరువ కావొచ్చునన్నది అందులో పనిచేసేవారి అభిప్రాయం. కానీ ఒబామా చెప్పినట్టు ఆ మాధ్యమాలు కృత్రిమంగా విభజితమై ఉంటాయి. నిరాదరణకు లోనయ్యే ముస్లింలు, దళితులు, ఆదివాసీలు లేదా కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పనిచేసే వారికి మీరు సైనికుల హక్కుల గురించి మాట్లాడరేమన్న ప్రశ్న తరచుగా ఎదుర వుతుంది. ఇంటర్నెట్లో అయితే ఇలాంటి తప్పుడు ద్వంద్వాలను సులభంగా కొనసాగేలా చూడొచ్చు. ముఖాముఖీలో అవతలి వ్యక్తి ఆందోళనల్ని కొట్టిపారే యడం అంత సులభం కాదు. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి నిరాశ పడనవసరం లేదని (తరచు నాకు అలా అనిపిస్తుంటుంది) ఒబామా అంతర్దృష్టి చెబుతుంది. అంతమాత్రాన సామాజిక మాధ్యమాలు ఉత్త చెత్త అని ఒబామా అన్నారని మనం అర్ధం చేసుకోకూడదు. ‘బహుళ విధ స్వరాలను అనుమతించేలా, అదే సమయంలో సమాజంలో చీలికలు తీసుకు రాకుండా, ఒక ఉమ్మడి భూమికను కనుగొనేలా రూపొందడం కోసం మనం ఈ సాంకేతికతను ఎలా నియంత్రణలోకి తెచ్చుకుంటామన్నదే ప్రశ్న’ అని ఆయన చెప్పిన సంగతిని గుర్తుచేసుకోవాలి. అత్య ద్భుతమైన ఈ మాటలు మన దేశానికి ఎంతో కీలకమైన ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకోదగ్గవి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఒబామా
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ ట్రెండింగ్గా ఉండేందుకు ఒబామా ప్రయత్నించేవారు. అలాగే అధ్యక్ష పదవినుంచి వైదొలిగిన తరువాత కూడా ఆయన వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇతర మాజీ అధ్యక్షులకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తాజాగా.. 2017లో తనకు నచ్చిన పుస్తకాలు, పాటల టాప్-12 జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. ఫిక్షన్ రచనలతో పాటు పలు రకాల రచనలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అందులో మొదటి స్థానంలో నయోమి అల్డెర్మ్యాన్ రచించిన ‘ది పవర్’ నిలిచింది. అలాగే 2017లో తన మనసును చూరగొన్న పాటల జాబితాను ఆయన విడుదల చేశారు. ఇదిలావుండగా.. ఒబామా మనసుకు నచ్చిన పుస్తకాలు, పాటల జాబితాపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. I️ CANT BELIEVE OBAMA SAID HAVANA WAS ONE OF HIS FAVORITE SONGS OF THE YEAR I️ AM REALLY CRUYING OH MY GOD DONT LOOKA T ME — camila (@Camila_Cabello) 31 December 2017 Obama posted his favorite songs of ‘17 and one of them was Broken clocks by @sza and since I also love that song i think we should just give this man a third term 🤷🏽♀️ — Lloyd (@unBRE_lievable) 1 January 2018 My goal is to someday have a book that I wrote on Obama’s reading list 🙏 https://t.co/HSVS2hcdjO — Brinley (@brinlliance1) 1 January 2018 -
విభిన్న నేత.. అసాధారణ వక్త..!
పిరమిడ్లలో కనుగొన్న మమ్మీలకు 1920లు, 30లలో అత్యంత ప్రాచుర్యం లభిస్తున్న కాలంలో, ప్రసిద్ధి పొందిన ఒక పాటలో తొలి పంక్తి ఇలా ఉండేది: ‘నేనొక మనిషితో డ్యాన్స్ చేశాను, అతడు ఒక బాలికతో డ్యాన్స్ చేశాడు, ఆమె ప్రిన్స్ ఆఫ్ వేల్స్తో డ్యాన్స్ చేసింది’. ఈ వారం అలాంటి స్థితే నా అనుభవంలోకి వచ్చింది. ఈ శుక్రవారం బరాక్ ఒబామాతో కలిసి హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో నేను పాల్గొన్నాను. అద్భుతమైన వక్త, గొప్ప మేధావి అయిన ఒబామా నిజంగానే, చిన్న విషయాలను గుర్తుపెట్టుకుని వాటి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించే ప్రత్యేక వ్యక్తిగా నాకు కనిపించారు. గొప్ప రాజకీయవేత్తలకు అలాంటి సున్నిత విషయాలను ప్రస్తావించే సమయం ఉండదు మరి. కానీ అలాంటి వారిలో అతి గొప్ప వ్యక్తి అయిన ఒబామా ఈ విషయంలో కాస్త విభిన్నంగానే ఉన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు నిర్వాహకులు నన్ను ఒబామాకు పరిచయం చేశారు. ఒబామాతో గౌరవపూర్వకంగా కరచాలనం చేయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి కొద్దిమందిని ఆహ్వానించారు. ఆ అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని. మాలో ప్రతి ఒక్కరికీ బరాక్ ఒబామాతో ఫొటో దిగే అవకాశం వచ్చింది. సాధారణంగా తమ అసహనంతో, సుస్పష్టంగా కనిపించే చికాకుతో సెలబ్రిటీలు పాల్గొనే చిల్లరమల్లర కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. కానీ బరాక్ ఒబామా అలాంటివారు కాదు. ఈ సదస్సుకు హాజరైన తొంభైమందిలో ప్రతి ఒక్కరితో ఆయన ఒకటి లేదా రెండు మాటలను పంచుకున్నారు. మాలో ఎవరినీ అయన కలిసి ఉండలేదు కానీ ప్రతి ఒక్కరినీ తాము ప్రత్యేక వ్యక్తులుగా భావించేలా చేశారు. తనతో కరచాలనం చేస్తుండగా ఆయన నన్ను పలకరిస్తూ, నేను టై కట్టుకుని ఉండటాన్ని గమనించారు. ‘మీరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు, నేను కూడా టై ధరించి ఉంటే బాగుండేదని ఇప్పుడే భావిస్తున్నాను. ఫరవాలేదా? లేక నేను తప్పిదం చేశానా?’ అన్నారు ఒబామా. సదస్సు కొనసాగుతుండగా ఈ ప్రత్యేక వ్యక్తిలో మరో కోణాన్ని కనుగొన్నాను. తాను కోరుకోని ప్రశ్నలు కొన్నింటిని శ్రోతలు సంధించారు. కానీ ఆయన వాటిని జోక్గా తీసుకున్నట్లుగా కనిపించింది. కానీ ఆయన విషయాన్ని పక్కకు తప్పించి ప్రశ్నకు పూర్తి భిన్నమైన అంశంగురించి మాట్లాడారన్న విషయాన్ని మీరు కనుగొనేంతవరకు ఆ ప్రశ్నలకు పూర్తి సమాధానం చెబుతున్నట్లే కనిపించారు. నేను పలువురు ప్రభుత్వాధినేతలను ఇంటర్వ్యూ చేశాను. తమకు అసౌకర్యంగా భావించే అంశంపై మీరు లోతుగా ప్రశ్నిస్తున్నపుడు వారి ముఖం ఒకవైపునకు గుంజుకుపోవడం లేక వారి కళ్లు దొంగ చూపులు చూడటం మీరు స్పష్టంగా గమనించవచ్చు. కానీ బరాక్ ఒబామా అలాంటి వ్యక్తి కాదు. అనుచితమైన అంశంలోకి తనను లాగడానికి నేను ప్రయత్నించిన ప్రతి సమయంలోనూ ఒబామా నవ్వేసేవారు. ఎప్పుడైనా ఆయన కనుబొమలు ముడిపడవచ్చు కానీ అది శ్రోతలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించే ఒక కామిక్ ఉద్రేకానికి సంబంధించిన భంగిమగా మాత్రమే కనిపిస్తుంది. మైక్లు విఫలమైనప్పుడు సదస్సుకు భంగం కలిగింది కానీ, పప్పును ఎలా వండుతారు అనే చమత్కార ప్రశ్నను ఒబామా ఎదుర్కొన్నారు. మీరు వేసిన బలమైన పంచ్ ఎవరికైనా ఉద్రేకాన్ని తెప్పిస్తుందేమో కానీ ఒబామా విషయంలో అలా జరగదు. అలాంటి పరిస్థితిని కూడా ఒబామా చిరునవ్వుతోనే స్వీకరించారు. సత్వరం వివేకంతో వ్యవహరించే మాజీ అమెరికన్ అధ్యక్షుడిలాగా కాకుండా, నేను ఒక ఆహ్లాదభరితమైన కథను కూడా అల్లలేకపోయాను. అందుచేత మేం, గత సెప్టెంబర్లో కన్జర్వేటివ్ పార్టీ సదస్సులో బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే ఎదుర్కొన్న దురవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి దగ్గు ముంచుకు రావటంతో ఆమె తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ‘అది అంత భయంకరమైనది కాదా మరి?’ అన్నారు ఒబామా... ‘ఏ రాజకీయనేత అయినా ప్రసంగించడానికి పూర్తిగా సిద్ధమైన దశలో ఉన్నట్లుండి గొంతు పెగలని స్థితి ఏర్పడితే అంతకుమిం చిన దురవస్థ మరొకటి ఉండదు’ అంటూ ఒబామా నిశ్శబ్దంగా నవ్వారు. బరాక్ ఒబామాను మాలో ఎవరైనా మళ్లీ కలవడం అసంభ వమే కావచ్చు. కానీ ఆయన కలిగించిన అపారమైన ప్రభావాన్ని మాత్రం కొందరు మర్చిపోలేరు. నామట్టుకు నాకు మహదానందం కలిగింది. పైగా మా ఇద్దరి సంభాషణ గురించి నేను ఇకపై కూడా కథలు కథలుగా చెప్పగలను. 1920ల నాటి ఆ సుప్రసిద్ధ గీతం ఈ పదాలతో ముగుస్తుంది. ‘సంతోషించు, సంతోషించు, హల్లెలూజా! స్త్రీలలో అత్యంత అదృష్టవంతురాలిని నేనే!’ ఈ పాటలో లింగాన్ని కాస్త మారిస్తే.. అది నేనే కావచ్చు! - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత పర్యటన సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పరమత సహనం, వ్యక్తిగత మత విశ్వాసాల హక్కుల ఆవశ్యకతను భారత ప్రధాని మోదీతోనూ గతంలో ప్రస్తావించానని చెప్పారు. భారతీయ ముస్లింలు మొదట తాము భారతీయులమనే భావిస్తారని ప్రశంసించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో, ఆ తరువాత ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ ప్రసంగించారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. భిన్న సంస్కృతులకు నిలయమైన భారత్ను మత ప్రాతిపదకన విభజించొద్దని సదస్సులో ఒబామా అన్నారు. ఇక్కడి ముస్లిం లు తాము భారతీయులమనే భావిస్తారని, ఈ నిజాన్ని మనసులో ఉంచుకోవాలన్నారు. మోదీతోనూ ప్రస్తావించా.. ‘ఓ దేశం మత ప్రాతిపదికన విడిపోవొద్దు. ఇదే విషయాన్ని మోదీకి, అమెరికా ప్రజలకు చెప్పా’ అని ఒబామా తెలిపారు. ‘2015లో భారత్కొచ్చినపుడు మోదీతో ఈ విషయమై మాట్లాడానన్నారు. ఆ సందర్భంలో మోదీ ఎలా స్పందించారని ప్రశ్నించగా, ఒబామా సూటిగా సమాధానం ఇవ్వకుండా.. ఆ వ్యక్తిగత సంభాషణలను వెల్లడించడం తనకిష్టం లేదన్నారు. ‘ఇతర దేశాలకు భిన్నంగా భారత్లో ముస్లిం వర్గం ఎన్నో విజయాలు సాధించింది. తమను తాము భారతీయులుగా పరిగణిస్తూ ఈ దేశంలో అంతర్భాగంగా ఉంది’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాని కార్యాలయమో, అధ్యక్షుడి కార్యాలయమో ముఖ్యమైనవి కావని, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపి ఏ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నానని తనను తాను ప్రశ్నించుకునే పౌరుడే కీలకమని పేర్కొన్నారు. ఓ నాయకుడు ఏదైనా చేయకూడనిది చేస్తుంటే, దాన్ని సమర్థిస్తున్నానో లేదో పౌరుడు ప్రశ్నించుకోవాలని సూచించారు. మత సామరస్యం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చేసినవి కావని, అమెరికా, యూరోప్ల్లోనూ పలు సందర్భాల్లో ఇవే విషయాలను చెప్పానని వివరణ ఇచ్చారు. ఆ విషయం పాక్కు తెలియదేమో... 9–11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాక్లోనే దాక్కున్న సంగతి ఆ దేశానికి తెలుసని నిరూపించే ఆధారాలు అమెరికా వద్ద లేవని ఒబామా అన్నారు. 2008లో ముంబైలో దాడుల తర్వాత ఉగ్ర స్థావరాలను నిర్మూలించాలని భారత్లాగే అమెరికా కూడా బలంగా కోరుకుందని, భారత్కు తమ నిఘా అధికారుల సేవలు అందించామని పేర్కొన్నారు. ట్వీట్ చేసేముందు జాగ్రత్త... సోషల్ మీడియా శక్తి ఏంటో తెలుసుకున్నాకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ట్వీట్లు, కామెంట్లు చేయాలన్నారు. టైపింగ్, స్పెల్లింగ్ దోషాలు ఎక్కువగా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ...‘పోస్ట్ చేసే ముందు నేను స్పెల్లింగ్, విరామ చిహ్నాలను సరిచూసుకుంటా. జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఆ ట్వీట్ను తొలగించాల్సిన అవసరం రాదు’ అని అన్నారు. పర్యావరణ మార్పు ఓ బూటకమని ట్రంప్ చేసిన ట్వీట్ను గుర్తుచేస్తూ.. కీలక విషయాలపై బాధ్యతా రాహిత్యంగా ట్వీట్ చేస్తే చర్చలకు తలుపులు మూసుకుపోతాయన్నారు. ప్రతి మీడియా సంస్థ తనదైన అభిప్రాయాలతో పనిచేస్తోందని అన్నారు. యువ నాయకుల శిక్షణపై దృష్టిసారిస్తా... 21వ శతాబ్దపు భాగస్వామ్యాన్ని నిర్ణయించేది భారత్–అమెరికాల సంబంధాలే అని ఒబా మా పేర్కొన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యువ నాయకులకు శిక్షణ ఇవ్వడంపైనే ఇకపై దృష్టిపెడతానన్నారు. యువత ఎక్కువగా ఉన్న భారత్లోనే తనకు ఎక్కువ పని ఉంటుందని తెలిపారు. కాగా, బరాక్ ఒబామాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కలుసుకున్నారు. ఒబామాను మరోసారి కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆ తరువాత రాహుల్ ట్వీట్ చేశారు. పప్పు బాగా చేస్తా... యువకుడిగా ఉన్నప్పుడు తనకు రూమ్ మేట్లుగా భారతీయులు, పాకిస్తానీయులు ఉండేవారని, వారి తల్లుల నుంచి పప్పు వండటం నేర్చుకున్నానని ఒబామా చెప్పారు. ఇప్పుడు తాను పప్పు బాగా చేస్తానని తెలిపారు. కీమా బాగానే వండుతానని, చపాతీలు చేయడం రాదని చెప్పారు . ‘ బుధవారం రాత్రి ఓ డిన్నర్కు వెళ్లా. అక్కడ పప్పు కూడా వడ్డిస్తున్నారు. దాని గురించి నాకు కొందరు వివరించే ప్రయత్నం చేశారు. కానీ నాకు పప్పు చేయడం వచ్చని, నా రూమ్మేట్ల తల్లుల నుంచి నేర్చుకున్నానని వారికి చెప్పా. పప్పు వండటం నేర్చుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే అనుకుంటున్నా’ అని ఒబామా సరదాగా వ్యాఖ్యానించారు. -
అయ్యో పప్పా.. నాకు కూడా తెలుసు!
న్యూఢిల్లీ: భారత్లో ఎక్కువ మంది ఇష్టంగా తినే పప్పు కూర ఎలా చేయాలో తనకు తెలుసని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొనడానికి ఒబామా ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్తో ఒబామా ముచ్చటించారు. ఇండియా ఫేవరెట్ డిష్ అయిన పప్పు ఎలా చేయాలో తెలిసిన ఏకైక అమెరికా అధ్యక్షుడిని తానే అని ఒబామా పేర్కొన్నారు. గురువారం హోటల్లో ఉన్న సమయంలో మిగతా వంటకాలతో పాటూ పప్పును ఓ వెయిటర్ తనకు వడ్డించారని ఒబామా తెలిపారు. అంతేకాకుండా పప్పు ఎలా చేస్తారో చెప్పే ప్రయత్నం చేశాడని చెప్పారు. అది తనకు తెలుసని, తాను స్టూడెంట్గా ఉన్న సమయంలోనే ఓ ఇండియన్ రూమ్మేట్ ద్వారా పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నానని ఒబామా చెప్పడం విశేషం. అంతేకాదు తాను కీమా కూడా బాగా చేస్తానని, చికెన్ కూడా వండటం వచ్చని తెలిపారు. మరి చపాతీ చేయడం వచ్చా అని కరణ్ థాపర్ ఆయనను ప్రశ్నించగా.. అది అస్సలు రాదు.. చపాతీ చేయడం చాలా కష్టమంటూ ఒబామా చెప్పారు. -
ఒకే వేదికపై.. ఐదుగురు మాజీలు
వాషింగ్టన్ : ఇటీవల కాలంలో అమెరికాను వణికించిన హార్వీ, ఇర్మా, మరియా తుఫాను బాధితులను ఆదుకేనుందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు నడుంబిగించారు. తుఫానుల కారణంగా టెక్సాస్, ఫ్లోరిడా, లూసియానా, పోర్టారికో, వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తుపాను బాధితుల నిధుల సేకరణకు రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ (సీనియర్) జిమ్మీ కార్టర్లు శనివారం టెక్సాస్లోని ఏఅండ్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. డెమోక్రాట్ పార్టీ నుంచి బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మి కార్టర్లు, రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జి హెచ్డబ్ల్యూ బుష్, జార్జి డబ్ల్యూ బుష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిన్ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్డబ్ల్యూ బుష్ (93) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూనే చక్రాల కుర్చీలోనే కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామీ అవార్డే విజేత లేడీ గాగా తన డ్యాన్స్తో అలరించారు. నిధుల సేకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 నుంచి ఐదుగురు మాజీ అధ్యక్షులు చేపట్టారు. ఇప్పటివరకూ 31 మిలియన్ డాలర్ల నిధులను వీరు సమకూర్చినట్లు జార్జి హెచ్డబ్ల్యూ బుష్ అధికార ప్రతినిధి జిమ్ మెక్గ్రాత్ తెలిపారు. తుఫాను బాధితుల కోసం నిధుల సమకూరుస్తున్న ఐదుగురు మాజీ అధ్యక్షులను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అమెరికా అత్యున్నత ప్రజా సేవకులుగా వారిని ట్రంప్ అభివర్ణించారు. మాజీలెవరూ.. తమ ప్రసంగంలో ట్రంప్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.