Advertisement
Bad debt collection
-
ChatGPT: మొండి బకాయి రాబట్టింది!
వాషింగ్టన్: కృత్రిమ మేథ అందుబాటులోకి వచ్చాక ఎన్నో పనులు అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో జరిగిపోతున్నాయి. చాట్బాట్లలో దూసుకుపోతున్న చాట్జీపీటీ కొత్త మరో ఘనత సాధించింది. ఒక డిజైనింగ్ సంస్థకు క్లయింట్ నుంచి రావాల్సిన దాదాపు రూ.90లక్షల(1,09,500 డాలర్లు) మొండి బకాయిని రాబట్టింది. అమెరికాకు చెందిన ఒక డిజైనింగ్ సంస్థకు సీఈవో అయిన గ్రెన్ ఐసన్బర్గ్ అనే వ్యక్తి తనకు చాట్జీపీటీ ఎలా సాయపడిందనే విషయాన్ని సంతోషంతో ట్విట్టర్లో షేర్చేశారు. ‘‘ గత ఏడాది ఒక ప్రముఖ బ్రాండ్కు డిజైన్లు చేసి ఇచ్చాం. అవి వారికి నచ్చాయి. అంతా సవ్యంగా సాగుతోందనే సమయానికి హఠాత్తుగా అటు నుంచి సంప్రదింపులు ఆగిపోయాయి. ఏం జరిగిందని కనుక్కుందామని సమాధానం లేదు. చేసిన డిజైనింగ్ పనికి డబ్బులు అడిగితే రిప్లై లేదు. ఐదుసార్లు మెయిల్ పెట్టినా ఇలుకూపలుకూ లేదు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘ఇక లాభం లేదు. లాయర్ల ద్వారా చట్టప్రకారం ముందుకెళ్దాం’ అని నా కింది ఉద్యోగులు నాకు సలహా ఇచ్చారు. చాట్బాట్ల హవా కొనసాగుతోంది. ఒకసారి చాట్జీపీటీతో ప్రయత్నిద్దామని నిర్ణయించుకుని వివరాలను పొందుపరిచా. క్లయింట్ను బెదిరిస్తూనే చక్కని దౌత్యం నెరిపేలా ఒక మెయిల్ను సిద్ధంచేసి ఇచ్చింది. దానికి చిన్నపాటి నా సొంత మార్పులు చేసి క్లయింట్కు పంపించాను. అద్భుతం. కేవలం రెండు నిమిషాల్లోనే అటు నుంచి స్పందన వచ్చింది. ‘బాకీ పడిన సొమ్మును చెల్లిస్తున్నాం. చూసుకోండి’’ అంటూ సమాధానమొచ్చింది. నా డబ్బూ వచ్చింది’’ అని ట్విట్టర్లో ఐసన్బర్గ్ తెగ సంబరపడ్డాడు. భవిష్యత్తులో సంస్థల వ్యాపార లావాదేవీలు ఇలా ఆటోమేషన్ అవుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఎన్పీఏల వసూలుకు గట్టి చర్యలు చేపట్టండి
బ్యాంకులకు జైట్లీ సూచన న్యూఢిల్లీ: దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకులు మొండి బకాయిల వసూలుకు తమ అధికారాలను వినియోగించుకుని పటిష్ట చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోవడాన్ని దేశ ఆర్థిక రంగం ముందున్న అతిపెద్ద సవాలుగా ఆయన అభివర్ణించారు. అవినీతి నిరోధక చట్టంలో మార్పులతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎన్పీఏల వసూలులో వెసులుబాటు లభిస్తుందన్నారు. ఢిల్లీలో కాగ్ నిర్వహించిన ఓ సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ఎన్పీఏల విషయంలో చట్టపరంగా, నిబంధనల పరంగా ఎన్నో పటిష్ట చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. ‘‘ఎన్పీఏల వసూలుకు బ్యాంకులు తమ అధికారులను వినియోగించుకోవాలి. భారీ మొత్తంలో నగదు ఒకే వర్గం వద్ద నిలిచిపోతే, ఇతరులకు రుణాలిచ్చే అవకాశాలు దెబ్బతింటాయి. కొన్ని కేసుల విషయంలో బ్యాంకులు గట్టి చర్యలు చేపట్టేందుకు వీలుగా తగిన వీలు కల్పించాం. దీని ద్వారా ప్రజా ధనాన్ని నిరవధికంగా కలిగి ఉండరాదనే విషయాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బ్యాంకుల ధనం ప్రజాధనమే’’ అని స్పష్టం చేశారాయన. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రుణాల్లో 9.32 శాతానికి పెరిగిపోయి రూ.4.76 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే.