Australia tour
-
‘రోహిత్ గాయం పెరిగే ప్రమాదం ఉంది’
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ గాయం తీవ్రతకు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంపై వివాదం కూడా నెలకొంది. అయితే జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి దీనిపై మొదటిసారి పెదవి విప్పాడు. అతను గాయం మరింత పెద్దది కాకూడదనే కారణంతోనే జాగ్రత్త పడుతున్నామని వెల్లడించాడు. తొందర ప్రదర్శించి బరిలోకి దిగితే రోహిత్కు మరింత సమస్య ఎదురు కావచ్చని రవిశాస్త్రి అన్నాడు. ‘బీసీసీఐ వైద్య బృందం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ టీమ్ తమ నివేదికను సెలక్టర్లకు అందజేసింది. అందులో మా పాత్ర ఏమీ లేదు. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత గాయానికి విశ్రాంతి అవసరమని, తొందరపడి ఆడే ప్రయత్నం చేస్తే అతను మళ్లీ తనను తాను గాయపర్చుకునే ప్రమాదం ఉందని ఆ నివేదికలో ఉంది. నేను సెలక్షన్ కమిటీలో సభ్యుడిని కాను. అతడిని పక్కన పెట్టడంలో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. -
కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం తెలిపింది. రెండున్నర నెలల పాటు సాగనున్న ఈ పర్యటనలో కుటుం బ సభ్యుల్ని కూడా అనుమతించాలని సీనియర్ క్రికెటర్లు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో తొలుత బీసీసీఐ ఈ అంశాన్ని వ్యతిరేకించింది. ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న భారత క్రికెటర్లు ఫైనల్ ముగియగానే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇప్పటికే నెలకు పైగా కుటుంబాలకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా లాంటి కొందరు సీనియర్ క్రికెటర్లు... ఆసీస్ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ వచ్చేసరికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది. -
'ఆ అవకాశం ఇలా వస్తుందని ఊహించలేదు'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. లీగ్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన రాహుల్ 595 పరుగులతో టాప్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఒక దశలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన పంజాబ్.. తర్వాత అనూహ్యంగా ఫుంజుకొని వరుసగా ఐదు విజయాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. కెప్టెన్ అనే పదానికి నిర్వచనం చెబుతూనే బ్యాట్సమెన్గా నిలకడగా రాణిస్తున్న రాహుల్ తాజాగా ఆస్ట్రేలియా టూర్కు అన్ని ఫార్మట్లలో ఎంపికయ్యాడు. కాగా రోహిత్శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. (చదవండి : ఇలాంటి కీపర్ ఉంటే అంతే సంగతులు) ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికవడం పట్ల స్పందించాడు.'ఆసీస్ టూర్లో టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో ఇది గర్వించదగిన విషయం. అసలు నేను వైస్ కెప్టెన్ అవుతానని ఊహించలేదు. ఈ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా.. నా వంతు బాధ్యతగా జట్టును విజయవంతగా నడిపించడానికి ప్రయత్నిస్తా. అని తెలిపాడు. అయితే వైస్ కెప్టెన్గా రాహుల్ ఎంపిక సంతోషమే అయినా.. అతని ముందున్న లక్ష్యం మాత్రం కింగ్స పంజాబ్ను చాంపియన్గా నిలపడమే. కింగ్స్ పంజాబ్ ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్లు చాలా కీలకం. ఇప్పటికే పంజాబ్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. కాగా కింగ్స్ పంజాబ్ రాజస్తాన్, సీఎస్కేలను ఎదుర్కోనుంది. (చదవండి : 'బయోబబుల్ నరకం.. కౌంట్డౌన్ మొదలెట్టా') -
నవంబర్ 27న తొలి పోరు
భారత క్రికెట్ జట్టు చివరిసారిగా మార్చి 2న మైదానంలోకి దిగింది. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నా... కరోనా కారణంగా ప్రపంచం తలకిందులై పోయింది. బయో బబుల్లో ఐపీఎల్ వినోదం పంచుతున్నా... సగటు భారత అభిమాని అంతర్జాతీయ క్రికెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగే టీమిండియా పర్యటన అధికారికంగా ఖరారైంది. మూడు ఫార్మాట్లలో కలిపి 10 మ్యాచ్లతో ఈ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. కోవిడ్–19 కఠిన పరిస్థితులను అధిగమించి సరిగ్గా 269 రోజుల విరామం తర్వాత భారత జట్టు సిడ్నీ వేదికగా నవంబర్ 27న జరిగే తొలి వన్డేతో మళ్లీ బరిలోకి దిగనుంది. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీమిండియా సుదీర్ఘ ఆసీస్ టూర్కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కరోనా పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలతో చర్చించిన తర్వాత తమ అంగీకారాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. గతంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు సీఏ సిద్ధమైనా... ఆంక్షల కారణంగా ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు స్వల్ప మార్పులతో మొత్తం పర్యటన వివరాలను సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కేవలం 14 కేసులు మాత్రమే నమోదు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 1500 మాత్రమే. ఈ సిరీస్లో భారత్–ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు జరుగుతాయి. మెల్బోర్న్లో రోజూ 25 వేల ప్రేక్షకులకు అనుమతి! నాలుగు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు అడిలైడ్ వేదిక కానుంది. ఇది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ కావడం విశేషం. భారత్ తమ ఏకైక డే–నైట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించగా... ఆసీస్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు, ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు రోజుల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడుతుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో కూడా దాదాపు అంతా ప్రధాన జట్టు ఆటగాళ్లే ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ మైదానమే వేదిక కానుంది. అయితే విక్టోరియా రాష్ట్రంలోనే కరోనా ప్రభావం ఉండటంతో లక్ష సామర్థ్యం గల ఈ స్టేడియంలో రోజూ నాలుగో వంతు సుమారు 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని సీఏ పరిశీలిస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో సీఏ, బీసీసీఐతో చర్చిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 14 రోజుల క్వారంటైన్... బీసీసీఐ ఎన్ని విధాలా విజ్ఞప్తి చేసినా క్వారంటైన్ విషయంలో మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రికెటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంగా చెప్పింది. నవంబర్ 10న దుబాయ్లో ఐపీఎల్ ముగిసిన అనంతరం భారత బృందం ప్రత్యేక విమానంలో సిడ్నీకి బయలుదేరి వెళుతుంది. నిజానికి భారత్ ముందుగా బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉన్నా, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు. సిడ్నీ ఒలింపిక్ పార్క్కు దగ్గరిలోనే ఒక హోటల్లో వీరికి బస ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోటల్ను ఇతర అతిథులు ఎవరూ ఉండకుండా ప్రత్యేకంగా టీమిండియా కోసం సిద్ధం చేశారు. ఆటగాళ్లంతా నవంబర్ 12 నుంచి హోటల్లోనే 14 రోజుల క్వారంటైన్ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలోనే ఉన్న బ్లాక్టౌన్లో టీమ్ ప్రాక్టీస్ చేస్తుంది. క్వారంటైన్ ముగిసిన సరిగ్గా రెండు రోజుల తర్వాత టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
భారత క్రికెట్ జట్టుకు కరోనా సెగ!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు తాజాగా కరోనా సెగ తగిలింది. ఆటగాడికి కాకపోయినా... సహాయ సిబ్బందిలో ఒకరికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ఇదివరకు ఐపీఎల్లో కరోనా కేసులున్నాయి. కానీ టీమిండియా, సిబ్బందికి సంబంధించి మాత్రం ఇదే తొలి మహమ్మారి కేసు. దీంతో కరోనా బాధితుడు రవిశాస్త్రి బృందంతో పాటు దుబాయ్కి వెళ్లలేదు. ఆదివారం అక్కడికి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 సోకడంతో ‘అతడు’ 14 రోజుల క్వారంటైన్కు పరిమితమయ్యాడు. చికిత్స, రెండు వారాల ఐసోలేషన్ ముగిశాక నెగెటివ్ రిపోర్టు వస్తేనే అతడిని దుబాయ్ విమానం ఎక్కిస్తారు. (చదవండి: నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి) దుబాయ్లో రవిశాస్త్రి... ఆసీస్ పర్యటన కోసం భారత జట్టు ఐపీఎల్ ముగిసిన వెంటనే అక్కడి నుంచే ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, మేనేజర్ గిరీశ్ డోంగ్రేలతో పాటు టెస్టు స్పెషలిస్టులు హనుమ విహారి, చతేశ్వర్ పుజారా ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. తాజాగా వీరికి కోవిడ్ పరీక్షలు, ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో బయో బబుల్లోకి తీసుకున్నారు. పుజారా, విహారిలకు దుబాయ్లో ఉన్న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తారు. కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ పర్యటన కోసం తమ భార్యలను వెంటతీసుకు వెళ్లేందుకు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు నెలలుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో వారిని దుబాయ్కి రావాల్సిందిగా పలువు రు ఆటగాళ్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. (చదవండి: భారత టెస్టు స్పెషలిస్ట్లు దుబాయ్కి) -
వచ్చే వారంలో ఆసీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక!
ముంబై: మరో మూడు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ పూర్తిస్థాయి సిరీస్లలో పాల్గొననుంది. కానీ జట్టు ఎంపికపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. వచ్చే వారం ఆయా జట్లను ప్రకటించే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆదివారం బీసీసీఐ చీఫ్ గంగూలీ మాట్లాడుతూ తేదీలు మినహా వేదికలు, మ్యాచ్లు ఖరారయ్యాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో క్వీన్స్లాండ్ రాష్ట్రం నుంచి ఆమోదం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎదురుచూస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తిస్థాయి షెడ్యూల్ను తేదీలతోసహా సీఏ ప్రకటిస్తుంది. రెండున్నర నెలల పాటుసాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 12న అక్కడికి బయల్దేరనుంది. అనంతరం 14 రోజుల క్వారంటైన్ ముగిశాక కసరత్తు ప్రారంభిస్తుంది. ఐపీఎల్ వర్క్లోడ్, ఆటగాళ్ల గాయాలను దృష్టిలో పెట్టుకొని త్వరలో జట్టును ఎంపిక చేసే అవకాశముంది. ఇప్పటికే భువనేశ్వర్, ఇషాంత్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు గాయపడి లీగ్కు దూరమైన సంగతి తెలిసిందే. -
అడిలైడ్లో ఆసీస్తో భారత్ డేనైట్ టెస్టు
కోల్కతా: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తొలి టెస్టును అడిలైడ్ వేదికగా డేనైట్లో ఆడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని క్రికె ట్ ఆస్ట్రేలియా (సీఏ) తమకు పంపిందని ‘దాదా’ చెప్పాడు. ‘ఆసీస్తో భారత్ మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టుల సిరీస్లో తలపడుతుంది. తొలి టెస్టును ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆడుతుంది. అడిలైడ్లో ఈ పింక్బాల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది’ అని గంగూలీ వివరించాడు. ‘దాదా’ ఐసీసీ చైర్మన్ రేసులో నుంచి తప్పుకున్నాడా? గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే! భారత బోర్డు నుంచి ఐసీసీకి నామినేషన్లే రాలేదని తెలిసింది. భారత్కే చెందిన శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పదవి కోసం నామినేషన్లను ఈ నెల 18లోపే దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఆదివారంతో గడువు ముగిసినా బీసీసీఐ నుంచి నామినేషన్లు రాలేదని ఐసీసీ తెలిపింది. నామినేషన్ల స్క్రూటిని అనంతరం డిసెంబర్లో ఎన్నిక జరుగనుంది. -
సెప్టెంబర్లో ఇంగ్లండ్లో ఆసీస్ పర్యటన!
మెల్బోర్న్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్లో పర్యటించే అవకాశం ఉంది. రెండు వారాల్లోపే ముగిసే ఈ పర్యటనలో ఇంగ్లండ్తో ఆసీస్ జట్టు మూడు టి20లు, మూడు వన్డేలను ఆడనుంది. సెప్టెంబర్ 4, 6, 8 తేదీల్లో టి20 మ్యాచ్లను... అనంతరం సెప్టెంబర్ 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్లు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ మ్యాచ్లన్నీ సౌతాంప్టన్, మాంచెస్టర్లలోనే జరిగే అవకాశం ఉంది. -
ఆస్ట్రేలియా పర్యటన ఆలస్యం!
ముంబై: కోవిడ్–19 కారణంగా సహజంగానే ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగం స్తబ్దుగా మారిపోయింది. ఇందుకు భారత క్రికెట్ కూడా అతీతం కాదు. కరోనా భయంతో మార్చి ఆరంభంలో అర్ధాంతరంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు కావడం మొదలు మళ్లీ ఆట జరగలేదు. ఇక ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏదోలా క్రికెట్ను ప్రారంభించాలని భావిస్తోంది. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకునే ప్రయత్నంలో ఉంది. కరోనా వల్ల భారత క్రికెట్ 2020–21 సీజన్ షెడ్యూల్ అంతా తారుమారైంది. ఇందులో కొన్ని మార్పుచేర్పులతో క్రికెట్ కార్యకలాపాలు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. అటు క్యాంప్...ఇటు ఐపీఎల్... బీసీసీఐ ప్రణాళికల్లో అన్నింటికంటే ముందుగా భారత సీనియర్ జట్టుకు శిక్షణా శిబిరం నిర్వహించడం కీలకంగా మారింది. ముందుగా జూలై మూడో వారంలో అనుకున్నా... దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అది సాధ్యం కావడంలేదు. ఇప్పుడు ఆగస్టుకల్లా పరిస్థితి చక్కబడుతుందని బోర్డు ఆశిస్తోంది. అదే జరిగితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సరైన వేదిక అని బోర్డు అధికారులు చెబుతున్నారు. లేదంటే మరో ప్రత్యామ్నాయంగా హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలను అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వసతి, ఇతర సౌకర్యాల గురించి కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఐపీఎల్ జరిగే అవకాశం ఉంటే ఆయా జట్ల ఆటగాళ్లు కనీసం 21 రోజుల ముందు తమ జట్లతో చేరాల్సి ఉంటుంది. ప్రేక్షకులను అనుమతించకపోయినా టీవీ వీక్షకుల కోసమే ఐపీఎల్ జరపాలని బోర్డు పట్టుదలగా ఉంది. పూర్తి స్థాయిలో లీగ్ నిర్వహిస్తే నవంబర్ చివరినుంచి ప్రారంభం కావాల్సిన ఆస్ట్రేలియా పర్యటన కనీసం వారం రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ‘క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3 నుంచి తొలి టెస్టు జరగాలి. దానికి ముందు టి20, వన్డే సిరీస్లు ఉన్నాయి. అయితే ప్రపంచకప్ కోసమే టి20 సిరీస్ పెట్టారు. ఇప్పుడు వరల్డ్కప్ జరిగే అవకాశం లేదు కాబట్టి టి20 సిరీస్ రద్దు చేసుకుంటే నష్టమేమీ లేదు. టెస్టు సిరీస్ కూడా వారం ఆలస్యం అవుతుంది’ అని బోర్డు అధికారి వెల్లడించారు. ఈ పర్యటన తర్వాత ఇంగ్లండ్ జట్టు కూడా భారత్కు రావాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సహజంగానే ఆలస్యం కానుంది. -
ధోనికి కోపమొచ్చింది
అడిలైడ్: టీమిండియా మిస్టర్ కూల్కు కోపమొచ్చింది. అవును టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని.. యువ ఆటగాడు ఖలీల్ అహ్మద్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి శతకంతో పాటు ధోని చిరస్మరణీయ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతున్న సమయంలో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో టీమిండియా 12వ ఆటగాడు ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడు యజువేంద్ర చహల్లు ధోని, దినేశ్ కార్తీక్లకు డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. అయితే ఖలీల్ పిచ్పై పరుగెత్తుకుంటూ రావడంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఎక్కడ నడుస్తున్నావ్? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా అంటూ ఖలీల్పై ధోని గుస్సా అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక దీనిపై ‘ఖలీల్ జాగ్రత్త.. మిస్టర్ కూల్కు కోపం తెప్పించకు’.. ‘ఏమైంది ఈ యువ ఆటగాళ్లకు.. మొన్న కుల్దీప్, నిన్న ఖలీల్.. ధోనికి కోపం తెప్పించినందుకు తప్పదు భారీ మూల్యం’అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
రిటైరయ్యాక మళ్లీ బ్యాట్ పట్టను
సిడ్నీ: తాను ఒక్కసారి ఆటకు గుడ్బై చెబితే తిరిగి బ్యాట్ పట్టబోనని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం చాలామంది ఆటగాళ్లు లీగ్ టోర్నీలు ఆడుతుండటం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఆ కోవలోకి చేరబోనని పేర్కొన్నాడు. ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ఇక మ్యాచ్ల వైపు కన్నెత్తయినా చూడనని అంటున్నాడు. ఆసీస్తో వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లీ పాల్గొని మాట్లాడాడు. ‘అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాక తిరిగి మైదానం వైపు కన్నెత్తయినా చూడను. లీగ్ టోర్నీలు ఆడటానికి నాకు ఆసక్తి లేదు. ఇప్పటివరకు సరిపడా క్రికెట్ ఆడేశాను. గత ఐదేళ్లలో నేను ఆడాలనుకున్న దానికంటే ఎక్కువే ఆడాను. రాబోయే మ్యాచ్లనూ బాగానే ఆడతాను. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా ఏం మాట్లాడలేను. వీడ్కోలు పలికాక మాత్రం ఇక బ్యాట్ ఎత్తుకోను’ అని తెలిపాడు. -
కేఎల్ రాహుల్ ఇంకెందుకు?
సిడ్నీ : గత కొద్దిరోజులుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా గడ్డపై సైతం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాహుల్పై మండిపడుతున్నారు. ఇంకెన్నీ అవకాశాలిస్తారని, రాహుల్ తమ ఓపికను పరీక్షిస్తున్నాడని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేఎల్ రాహుల్ మంచి బ్యాట్స్మనే కానీ అతను నెట్స్లో మాత్రమే ఆడుతాడని సెటైర్లేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నా అతనికి అవకాశం ఎందుకిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో 20 బంతులాడిన కేఎల్ రాహుల్ కేవలం 14 పరుగులే చేసి ఔటయ్యాడు. అది కూడా.. మ్యాచ్లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ బాదినా.. ఆ తర్వాత 18 బంతుల్లోనూ చేసిన పరుగులు 8 మాత్రమే. అయితే.. రాహుల్ విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి (61 నాటౌట్: 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), ఓపెనర్ శిఖర్ ధావన్ (41: 22 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్లు) దూకుడుగా ఆడటంతో 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. ఇక బ్రిస్బేన్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కూడా రాహుల్ విఫలమయ్యాడు. 12 బంతుల్లో 13 పరుగులు చేసి స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మూడో టీ20లోనూ రాహుల్ విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో అతను సాధించిన అద్భుత సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ లేదు. అయినా టీమిండియా మేనేజ్మెంట్ రాహుల్పై నమ్మకం ఉంచి అవకాశం కల్పించగా.. అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో కేఎల్ రాహుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. Don't know what KL Rahul is doing in team. I agree he is fit and has quality. But he is not making the chances count since long time...#INDvAUS @BCCI @klrahul11 — Rakshak S (@naanuunknownu) November 25, 2018 Why KL Rahul continues to play after failing all time ? Far better players are not given enough chances. #INDvAUS #INDvsAUS @BCCI #AusvIndOnSonyTen3 #AUSvIND — Malay kumar (@mformalay) November 25, 2018 KL Rahul Is So Talented He Bats Only In Nets. Talent 👌🏻 — Anai Komagan (AK) (@AnaiKomagan) November 25, 2018 -
‘అప్పటి వరకు డే/నైట్ టెస్ట్ ఆడేదిలేదు’
ముంబై : ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ప్రతిపాదనను నిరాకరించిన బీసీసీఐ నిర్ణయాన్ని బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ వెనకేసుకొచ్చాడు. డే/నైట్ టెస్టు ఆడితే ఓడిపోతామన్న భయంతోనే బీసీసీఐ స్వార్థంగా ఈ మ్యాచ్కు అంగీకరించట్లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయ్ మాట్లాడుతూ.. ‘‘అన్ని మ్యాచ్లూ గెలవాలనుకోవడంలో తప్పేం ఉంది? 30 ఏళ్ల క్రితం డ్రా చేసుకునేందుకు భారత్ మ్యాచ్లాడుతోంది అనేవారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. టీమిండియా ఆటగాళ్లు ఎప్పుడైతే డే/నైట్ టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతారో అప్పుడే దానికి అంగీకరిస్తాం’’ అని స్పష్టం చేశాడు. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి సైతం బోర్డు నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చాడు. ఎవరితో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆడాలనేది తమ వ్యవహారమని, తాము భారత్ విజయాల కోసం కృషి చేస్తామని రాహుల్ జోహ్రి తెలిపాడు. డే/నైట్ టెస్టు ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డాడు. ఇక డే/నైట్ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ డే/నైట్ టెస్టు ఆడాలని హర్భజన్ సూచించాడు. ‘డేనైట్ టెస్టుల్ని భారత్ ఎందుకు ఆడనంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఓసారి ఆడిచూస్తే బాగుంటుంది. పింక్ బాల్ ఐతే ఏంటి. ఆడితే తప్పకుండా అలవాటు అవుతుంది. అదేమీ కష్టం కాదు... ఆడితే వచ్చే నష్టమూ లేదు’ అని అన్నాడు. -
నేడు ఆస్ట్రేలియా పర్యటనకు లక్ష్మీపార్వతి
సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఆస్ట్రేలియాలో 20 రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఆస్ట్రేలియాకు బయల్దే రనున్నారు. 9న సిడ్నీలో గ్లోబల్ ఉమెన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో న్యూ సౌత్వేల్స్ పార్లమెంట్ హాల్లో లక్ష్మీపార్వతిని వివిధ మహిళా సంఘాలు సన్మానిస్తాయి. 14న మెల్ బోర్న్లోని తెలుగు సంఘాలు, అక్కడి తెలుగు వారు సన్మానించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని 23న ఆమె తిరుగు ప్రయాణమవుతారు. -
ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి కోదండరాం
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ యం. కోదండరాం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి దాదాపు 12 గంటలకు హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తారని టీజేయేసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ మీడియాకు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు ఎన్ఆర్ఐ సంస్థల ఆహ్వానం మేరకు ఈనెల 8వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లిన కోదండరాం ఆ దేశంలోని వివిధ పట్టణాలలో అక్కడి తెలంగాణా సంస్థలు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి విచ్చేయనున్నట్లు రవీందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
కార్పొరేట్ పన్ను వ్యవస్థ ప్రక్షాళన: జైట్లీ
సిడ్నీ: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ నాలుగు రోజుల ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమైంది. భారత్ పన్ను వ్యవస్థ పట్ల అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న సందేహాలను తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల వృద్ధికి వ్యాపార పరిస్థితులను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల దిశగా భారత పన్నుల వ్యవస్థను సంస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. పన్నులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న పలు సమస్యలను పరిష్కరించామని, ఇతర సమస్యల పరిష్కారంపైసైతం దృష్టి పెట్టామని అన్నారు. త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు.భారత్ భారీ పెట్టుబడులను కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్
గాయం కారణంగా పది నెలలు భారత జట్టుకు దూరమై తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పేసర్ మొహమ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా అతనికి కనీసం 4 నుంచి 6 వారాలు విశ్రాంతి అవసరమని, అందుకే స్వదేశానికి వెళుతున్నాడని జట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా వెళ్లాక తొలి ప్రాక్టీస్ సెషన్లోనే అతను గాయపడ్డాడు. షమీ స్థానంలో పేసర్ భువనేశ్వర్ భారత జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేలు, మూడు టి20ల ఈ సిరీస్ ఈనెల 12 నుంచి జరుగుతుంది. -
‘ప్రాక్టీస్’లో బాదేశారు
► ఆసీస్ పర్యటనలో భారత్ శుభారంభం ► వెస్టర్న్ ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం ► చెలరేగిన కోహ్లి, ధావన్ నేడు ప్రాక్టీస్ వన్డే మ్యాచ్ పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనను ధోని సేన భారీ గెలుపుతో మొదలు పెట్టింది. వన్డే సిరీస్కు ముందు సన్నాహకంగా జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 74 పరుగుల తేడాతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ను చిత్తు చేసింది. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (46 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు రెండో వికెట్కు 14.1 ఓవర్లలోనే 149 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వెస్టర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రెవిస్ బర్త్ (60 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్... పేసర్ బరీందర్ శరణ్ తలా 2 వికెట్లు తీశారు. శనివారం జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్లో భారత్... ఇదే జట్టుతో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్లో అనవసరపు సింగిల్కు ప్రయత్నించి రోహిత్ శర్మ (6) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ధావన్, కోహ్లి కలిసి తమదైన శైలిలో ఆడారు. ఇద్దరు బ్యాట్స్మెన్ తమ టి20 నైపుణ్యం, అనుభవాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ముందుగా ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మూడీ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 బాదిన కోహ్లి 35 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ధావన్ మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్లో కూడా 22 పరుగులు రాబట్టిన భారత్... అదే ఓవర్లో కోహ్లి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో ధావన్, అజింక్య రహానే (2) అవుటైనా, చివర్లో ధోని (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఆకట్టుకున్న శరణ్ భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) జట్టును ఆరంభంలోనే బరీందర్ శరణ్ కట్టి పడేశాడు. తన రెండో ఓవర్లో షార్ట్ (5)ను అవుట్ చేసిన అతను, మూడో ఓవర్లో బొసిస్టో (1)ను వెనక్కి పంపాడు. ఒకవైపు బర్త్ చక్కటి షాట్లతో దూసుకుపోయి 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నా... మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పూర్తిగా కట్టడి చేయడంతో డబ్ల్యూఏ బ్యాట్స్మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లిస్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. జడేజా తన వరుస ఓవర్లలో 2 వికెట్లు తీయగా, అక్షర్ కూడా అదే తరహాలో 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బర్త్ చివరకు అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 6; శిఖర్ ధావన్ (సి) షార్ట్ (బి) కెల్లీ 74; విరాట్ కోహ్లి (సి) ఇంగ్లిస్ (బి) నికోలస్ 74; ధోని (నాటౌట్) 22; అజింక్య రహానే (సి) ఇంగ్లిస్ (బి) డఫీల్డ్ 2; గుర్కీరత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-12; 2-161; 3-173; 4-185. బౌలింగ్: డఫీల్డ్ 4-0-21-1; నికోలస్ 4-0-44-1; కెల్లీ 4-0-31-1; మూడీ 3-0-40-0; కానర్ 3-0-34-0; ముర్హెడ్ 2-0-17-0. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్: బర్త్ (నాటౌట్) 74; షార్ట్ (సి) అశ్విన్ (బి) శరణ్ 5; బొసిస్టో (సి) అశ్విన్ (బి) శరణ్ 1; ఇంగ్లిస్ (సి) శరణ్ (బి) జడేజా 11; హాబ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 5; మోర్గాన్ (సి) రహానే (బి) అక్షర్ 3; కెల్లీ (స్టంప్డ్) ధోని (బి) అక్షర్ 2; నికోలస్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-20; 2-26; 3-61; 4-73; 5-83; 6-92. బౌలింగ్: శరణ్ 4-0-24-2; ఉమేశ్ 3-0-23-0; రిషి ధావన్ 3-0-22-0; జడేజా 3-0-13-2; అశ్విన్ 4-0-20-0; అక్షర్ 3-0-13-2. -
'కంగారూ'ల వేటకు సిద్ధం!
-
'కంగారూ'ల వేటకు సిద్ధం!
నేటినుంచి ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో భారత్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్ వన్డే ప్రపంచకప్లు, ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో మినహా భారత్, ఆసీస్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగలేదు. తొలిసారి టీమిండియా టెస్టులు ఆడకుండా కేవలం వన్డేలు, టి20 మ్యాచ్ల కోసం కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. వరల్డ్ కప్ సెమీస్లో ఓటమి జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగానే అదే వేదికలో వన్డే సిరీస్కు సిద్ధమైంది. ధోని సేన తన సత్తా చాటి ఈసారైనా కంగారూలను వేటాడుతుందా..! పెర్త్: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు ముందు శుక్రవారం టీమిండియా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. అయితే ఇది టి20 ప్రాక్టీస్ మ్యాచ్ కావడం విశేషం. టి20 జట్టు కోసం ఎంపిక చేసిన కొంత మంది ఆటగాళ్లు లేకుండా వన్డే జట్టుతోనే ధోని సేన వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్తో భారత్ తలపడుతుంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో... బుధవారం ఆస్ట్రేలియా చేరుకున్న భారత క్రికెటర్లు గురువారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్లో పాల్గొన్నారు. కెప్టెన్ ధోనితో పాటు కోహ్లి, ధావన్ ఎక్కువ సేపు నెట్స్లో బ్యాటింగ్ సాధన చేశారు. చాలా కాలం తర్వాత జట్టుతో చేరిన పేసర్ షమీ కూడా నిర్విరామంగా బౌలింగ్ చేశాడు. 43 డిగ్రీల తీవ్రమైన ఎండలో కూడా మన ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. భారత్ తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్ను ఈ నెల 9న ఆడుతుంది. జట్టునుంచి రైనాలాంటి సీనియర్ స్థానం కోల్పోవడంతో పాటు కొంత మంది కొత్త ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో టీమ్ కాంబినేషన్పై ఒక అంచనాకు వచ్చేందుకు ధోనికి ఈ మ్యాచ్లు ఉపయోగపడతాయి. ఆసీస్ బయల్దేరే ముందు 6, 7 స్థానాల్లో గుర్కీరత్, మనీశ్ పాండేలకు అవకాశం ఇవ్వడం గురించి మాట్లాడిన ధోని వారిని ప్రాక్టీస్ మ్యాచ్లో పరీక్షించే అవకాశం ఉంది. మరో వైపు ప్రధాన ఆటగాళ్లు ఉన్న పెర్త్ జట్టు ఒక వైపు బిగ్బాష్ లీగ్లో పాల్గొంటుండగా... ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడుతున్న వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్లో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. -
స్టువర్ట్ బ్రాడ్.. ఆసీస్ కు బ్యాడ్
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకుని చెత్త రికార్డు మూట గట్టుకున్న స్టువర్ట్ బ్రాడ్.. నేడు ప్రపంచ నంబర్ వన్ స్థాయికి ఎదిగిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై తొలి ఓవర్ నుంచే దాడి చేశాడు. తాను వేసిన 9.3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. అంతే కాకుండా బ్రాడ్ విసిరిన 57 బంతుల్లో 50 బంతులు డాట్ పడ్డాయి. రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు అంతే. ఈ దెబ్బకు ఆసీస్ 18.3 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. ఇంతటి ఉత్తమ గణాంకాలు నమోదు చేస్తానని బ్రాడ్ కూడా ఊహించి ఉండడేమో. కసి అంటే అలా ఉండాలి. చెత్త రికార్డులు మూట గట్టుకున్నా.. ఉత్తమ గణాంకాలు నమోదు చేయగల బౌలర్గా నేడు మరో రికార్డు నెలకొల్పాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తొలి వికెట్ పడగొట్టడంతోనే టెస్టుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. ఆ ఆనందంలోనే అతడు మరో ఏడు వికెట్లు తీసి.. ఆస్ట్రేలియాను కోలుకోకుండా చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. నేటి మ్యాచ్ లో ఆసీస్ కు బ్యాడ్గా నిలిచాడని చెప్పవచ్చు. -దివిటి రాజేష్ -
ఫామ్పై ఆందోళన లేదు
ఎప్పుడూ బాధ్యతగానే ఆడాను టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య చెన్నై: ఇటీవలి కాలంలో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి నుంచి అభిమానులు ఆశిస్తున్న మెరుపులు లేవన్నది నిజం. గతేడాది ఆసీస్ పర్యటనలో బాగానే రాణించినా ఆ తర్వాత మాత్రం తన బ్యాట్ ద్వారా అందరినీ నిరాశపరుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’పై కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అయితే తన ఫామ్పై మాత్రం ఎలాంటి ఆందోళన లేదని ఈ టెస్టు కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు కోసం తానెప్పుడూ బాధ్యతగానే ఆడినట్టు గుర్తుచేశాడు... మున్ముందు కూడా సహజ శైలి లోనే ఆడతానని స్పష్టం చేశాడు. ఈ ఏడాది భారత టెస్టు జట్టు ఎక్కువగా మ్యా చ్లు ఆడకున్నా... వన్డేల్లోనూ అతడి ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఫిబ్రవరిలో చివరి శతకం సాధించాడు. తన బ్యాటింగ్ వైఫల్యంతో పాటు రాబో యే శ్రీలంక పర్యటన గురించి కోహ్లి చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే.... ప్రతిసారీ నూరుశాతం: ఓ బ్యాట్స్మన్గా నేనెప్పుడూ బాధ్యతాయుతంగానే ఆడాను. ప్రతిసారీ జట్టు గెలుపు కోసమే నూటికి నూరు శాతం ప్రయత్నించాను. అందుకే నా బ్యాటింగ్ మెరుగుకు అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడి కోచింగ్లో భారత్ ‘ఎ’ జట్టుకు ఆడడంతో నాకు మంచి శిక్షణ లభించినట్టయ్యింది.దూకుడే బలం: ఫామ్ను అందుకోవడానికి నా దూకుడైన బ్యాటింగ్ను మార్చుకోవాలని అనుకోవడంలేదు. వాస్తవానికి దూకుడే బోర్డు నన్ను కెప్టెన్గా ఎంపిక చేసేందుకు కారణమని అనుకుంటున్నాను. లంక పర్యటన: శ్రీలంక పర్యటన నా కెప్టెన్సీలో తొలి పూర్తిస్థాయి టెస్టు సిరీస్. అందుకే చాలా ఉద్వేగంగా ఉంది. జట్టు ఆటగాళ్లు సరైన దృక్పథంతో ఆడితే లంకలో విజయం సాధిస్తాం.పేసర్లూ కీలకమే: ఓపెనర్గా మురళీ విజయ్ జట్టుకు నిలకడైన ఆరంభాలను అందిస్తున్నాడు. అశ్విన్, మిశ్రాలతో పాటు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ ఆలోచనలు జట్టుకు ఉపయోగపడతాయి. అలాగే పేసర్లు కూడా లంక పర్యటనలో కీలకం కానున్నారు. -
ఉత్తమ భారత క్రికెటర్గా రహానే
‘సియట్’ అవార్డుల ప్రదానం ముంబై: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో నిలకడైన ఆటతీరు కనబర్చిన అజింక్య రహానే ‘సియట్’ వార్షిక అవార్డుల్లో ఉత్తమ భారత క్రికెటర్గా ఎంపికయ్యాడు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల కార్యక్రమం సోమవారం ఇక్కడ జరిగింది. కుమార సంగక్కర (శ్రీలంక) ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. భారత దిగ్గజం కపిల్దేవ్ను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఉత్తమ బ్యాట్స్మన్, బౌలర్లుగా హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా), హెరాత్ (శ్రీలంక), ఉత్తమ టి20 ఆటగాడిగా డ్వేన్ బ్రేవో (వెస్టిండీస్) పురస్కారాలు స్వీకరించారు. పొలార్డ్ (వెస్టిండీస్)కు పాపులర్ చాయిస్, వన్డే డబుల్ సెంచరీకి రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డు, ఉత్తమ దేశవాళీ ఆటగాడు అవార్డు వినయ్కుమార్కు, యువ ఆటగాడి అవార్డు దీపక్ హుడాకు లభించాయి. జ్యూరీ చైర్మన్ గవాస్కర్తో పాటు సియట్ అంబాసిడర్ బ్రెట్లీ (ఆస్ట్రేలియా) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారత్కు గాయాల బెడద!
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించాడు. కీలకమైన ఓపెనింగ్ స్థానంలో ఆడుతూ అతను పదే పదే విఫలం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపిస్తోంది. మరి ముక్కోణపు వన్డే సిరీస్లో అతడిని పక్కన పెట్టవచ్చు కదా అనేది సగటు అభిమాని భావన. కానీ టీమిండియాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక వైపు ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండగా, మరో వైపు ప్రధాన బ్యాట్స్మన్గా మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేకపోవడం కూడా ధోని సేనకు ఇబ్బందిగా మారింది. ఇషాంత్ సాధన, రోహిత్ డుమ్మా భారత జట్టు తమ తదుపరి లీగ్ మ్యాచ్లో సోమవారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత శుక్రవారం జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ముగ్గురు మినహా దీనికి ఆటగాళ్లంతా హాజరయ్యారు. రోహిత్ శర్మ, కోహ్లి, అశ్విన్ సాధన చేయలేదు. తొడ కండరాల గాయంతో ఇంకా కోలుకోకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్కు రాలేదు. తొలి వన్డేలో చక్కటి సెంచరీతో విదేశీ గడ్డపై కూడా ఓపెనింగ్లో చెలరేగగలడని నిరూపించుకున్న రోహిత్... తర్వాతి మ్యాచ్కే దూరమయ్యాడు. అతను ఎప్పటికి ఫిట్గా మారతాడో ఇంకా చెప్పలేని పరిస్థితి. మోకాలి నొప్పితో నాలుగో టెస్టు ఆడని ఇషాంత్... ఆ తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సాధన చేయలేదు. ప్రస్తుతం ప్రపంచ కప్ జట్టులో నలుగురు ప్రధాన పేసర్లు మాత్రమే ఉండటంతో అతను త్వరగా కోలుకోవడం జట్టుకు అవసరం. జడేజా కూడా... గత ప్రపంచ కప్కు, ఈ సారి టోర్నీకి మధ్య భారత జట్టులో ఎంతో ఎదిగిన ఆటగాడు రవీంద్ర జడేజా. వన్డేల్లో ఏడో స్థానంలో అతను కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఇటీవల కెప్టెన్ ధోని కూడా అవసరం ఉన్నా, లేకపోయినా జడేజా గురించే మాట్లాడుతూ, అతను లేకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తోందంటూ పదే పదే అతడి ప్రాధాన్యతను గుర్తు చేస్తూ వస్తున్నాడు. భుజం గాయంతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతను శుక్రవారం కొద్దిగా ఎక్కువ సేపు బౌలింగ్ చేయగలిగాడు. అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు. ప్రస్తుత జట్టులో రాయుడు ఒక్కడే రిజర్వ్ బ్యాట్స్మన్గా జట్టులో ఉన్నాడు. గత మ్యాచ్లో అతడిని ఆడించారు. ఒక వేళ ధావన్ను తప్పించాలని భావించినా, మరో అవకాశం లేదు. జడేజా వస్తే పరిస్థితిలో మార్పు రావచ్చు. రోహిత్ ఫిట్గా లేకపోతే సోమవారం మ్యాచ్లో కూడా ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. -
465 పరుగులకే టీమిండియా ఆలౌట్
భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 65 పరుగులు వెనకబడినట్లయింది. అజింక్య రహానే, విరాట్ కోహ్లీ బ్రహ్మాండమైన సెంచరీలు సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి వికెట్ ను 57 పరుగుల వద్ద కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఓపెనర్ వార్నర్.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికేశాడు. రోజర్స్, వాట్సన్ క్రీజులో ఉన్నారు.