-
అగస్టా రహస్యాలు బట్టబయలు..
జైపూర్ : యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్ నోటివెంట ఇప్పుడు రహస్యాలు బయటికొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన బుధవారం ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగస్టాలో రాజకీయ నేతలకు ముడుపులు ముట్టచెప్పిన మధ్యవర్తి మైఖేల్ను దుబాయ్ నుంచి భారత్ రప్పించామని, ఈ కుంభకోణంలో ఇప్పుడు రహస్యాలు బట్టబయలు కానున్నాయని అన్నారు. మైఖేల్ వెల్లడించే అంశాలతో కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలన్నారు. కాగా, అగస్టా కేసుకు సంబంధించి మైఖేల్ను దుబాయ్ ప్రభుత్వం భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిన క్రమంలో మంగళవారం రాత్రి మైఖేల్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మైఖేల్ను బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. కాగా, రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్ల్యాండ్తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
మోదీజీ ఉపాధి ఊసేది..?
జైపూర్ : రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ నిజంగా ఉద్యోగాలు ఇచ్చిఉంటే ఆల్వార్లో నలుగురు యువకులు ఇటీవల ఎందుకు ఆత్మహత్యకు పాల్పడేవారని ఆయన నిలదీశారు.రాజస్ధాన్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ గత నెలలో ఆల్వార్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి దూకి ఈ యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. నిరుద్యోగ సమస్యతోనే వారు బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాధమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాధనంతో పారిశ్రామికవేత్తల ఖజానాలను నింపుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ తన ప్రసంగంలో భారత్ మాతాకీ జై అంటారని, వాస్తవగా ఆయన అనిల్ అంబానీకి, మెహుల్ చోక్సీ, నీరవ్, లలిత్ మోదీలకు జై కొట్టాలని ఎద్దేవా చేశారు. అనిల్ అంబానీ వంటి సంపన్నుల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కాగా, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల ఏడున జరగనుండగా, 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
నోట్లరద్దుతో సీన్రివర్స్..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో నోట్ల రద్దు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.గతంతో పోలిస్తే ఎన్నికల్లో బ్లాక్మనీ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికల్లో భారీఎత్తున నగదు వాడకం పెరిగిపోయిందని స్వయంగా ఈసీ అత్యున్నత వర్గాలే వెల్లడించాయి. ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపలేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పెదవివిరిచారు. నోట్ల రద్దు అనంతరం ఎన్నికల్లో నల్లధనం వాడకం తగ్గుతుందనే అభిప్రాయం కలిగినా నగదు స్వాధీనాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నగదు పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో వాడే నల్లధనంపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికి నగదు కొరత ఎంతమాత్రం లేదన్నారు. ఎన్నికల్లో నగదు వాడకం, సోషల్ మీడియాలను నియంత్రించేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసేలా న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ సిఫార్సు చేయకపోవడం బాధాకరమని ప్రధాన ఎన్నికల కమిషనర్గా గత వారం పదవీ విరమణ చేసిన రావత్ విచారం వ్యక్తం చేశారు. -
స్ర్టాంగ్ రూంలో పనిచేయని సీసీటీవీలు
భోపాల్ : ఉత్కంఠభరితంగా సాగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపూ డిసెంబర్ 11న జరిగే కౌంటింగ్ వైపు మళ్లింది. ఈవీఎంల భద్రతపై విపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీటిని భద్రపరిచిన స్ర్టాంగ్ రూంలో గంటపాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోవడంతో శుక్రవారం స్ర్టాంగ్రూంలో అమర్చిన సీసీటీవీలు పనిచేయలేదని ఈసీ వర్గాలు అంగీకరించాయి. ఓటింగ్ యంత్రాలు సురక్షితంగా ఉంచేందుకు జనరేటర్లు, ఇన్వర్టర్లను తెప్పించామని ఈసీ పేర్కొంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్ రూం వద్ద పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను నియోగించామని తెలిపింది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ సత్నాలోని స్ర్టాంగ్ రూంలోకి ఓ వ్యక్తి కార్టన్ను తీసుకువెళుతున్న వీడియో వైరల్గా మారడంతో కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు స్ర్టాంగ్ రూం వెలుపల ఆందోళన చేపట్టారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
వారు పేదలను పొట్టనబెట్టుకుంటున్నారు..
జైపూర్ : కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను గ్యాంగ్స్టర్లుగా అభివర్ణించారు. ఉదయ్పూర్లో బీజేపీ ప్రచార ర్యాలీలో రాజ్బబ్బర్ మాట్లాడుతూ పేద ప్రజలను హతమార్చే హంతక ముఠా గుజరాత్ నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు. గ్యాంగ్స్టర్ ముఠాలో ఒకరు బీజేపీ చీఫ్ కాగా, మరొకరు దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రోజురోజుకూ రూపాయి విలువ దిగజారుతున్న క్రమంలో రూపాయి విలువను ప్రధాని మోదీ తల్లి 90 ఏళ్ల హీరాబెన్తో పోల్చడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వయసు స్ధాయిలో ఉంటే ప్రస్తుతం రూపాయి బలహీనపడుతూ ప్రధాని తల్లి వయసుకు క్షీణిస్తోందని రాజ్బబ్బర్ వ్యాఖ్యానించారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ ఏడున జరగనుండగా, డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
కాంగ్రెస్ నేతతో నేలకు ముక్కు రాయించిన యువకులు
జైపూర్ : రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాంగ్రెస్ నేతకు ఘోర అవమానం ఎదురైంది. నిర్లక్ష్యంగా కారు నడిపి తమపై బురద పడేసాడంటూ కొంత మంది యువకులు... ఆయనను అడ్డగించి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. అసలేం జరిగిందంటే.... కాంగ్రెస్ పార్టీకి చెందిన భగవతి లాల్.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ సాగ్వారా పట్టణంలో ర్యాలీకి హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. జోసావా గ్రామం చేరుకోగానే అక్కడ ఉన్న నీటి గుంటను గమనించకుండా కారును వేగంగా పోనిచ్చారు. ఈ సమయంలో రోడ్డు పక్కన ఉన్న నలుగురు యువకులపై బురద పడింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు ఆయన కారును చేజ్ చేసి మరీ ఆపారు. హడావుడిగా వెళ్తున్న కారణంగానే ఇలా జరిగిందని చెప్పినా వినకుండా.. ఆయనను మోకాళ్లపై నిలబెట్టి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై దుగన్పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ కుమార్ గురువారం స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘భగవతి లాల్తో దురుసుగా ప్రవర్తించిన ఆ యువకులను వారి సామాజిక వర్గానికి(పాటీదార్) చెందిన పెద్దలు పిలిచి మందలించారు. అంతేకాకుండా భగవతిని ఎలా అయితే అవమానించారో అదే రీతిలో(వాళ్లతో నేలకు ముక్కు రాయించి) వారికి క్షమాపణ కూడా చెప్పించారు’ అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యప్రదేశ్లో 65.5 శాతం పోలింగ్ నమోదవగా, మిజోరంలో 73 శాతం పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్దానాలకు గాను మొత్తం 2899 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా 1094 మంది స్వతంత్ర అభ్యర్ధులుగా తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో 5.4 కోట్ల మంది ఓటర్లు ఆయా పార్టీల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. వరుసగా నాలుగోసారి పాలనాపగ్గాలు అందుకునేందుకు పాలక బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో తలపడగా, ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్ష కాంగ్రెస్ సర్వశక్తలూ ఒడ్డింది. ఇక మధ్యప్రదేశ్లో బీజేపీ నాలుగోసారి తిరిగి అధికారం చేపడుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు లక్ష్యంగా ఈసారి తమ పార్టీ పోరాడిందని, ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు తమ కార్యకర్తలు కృషిచేశారన్నారు. మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించాయి. మధ్యప్రదేశ్లో దాదాపు 100కుపైగా ఈవీఎంలను మార్చినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈవీఎంల్లో సమస్యలు తలెత్తడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని అధికారులు తెలిపారు. కాగా సెంధ్వా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జాప్డి పడ్లా గ్రామంలో ఇతరులు పోలింగ్ బూత్ల వద్దకు వచ్చారని ఆరోపిస్తూ స్దానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు రెండు బైక్లకు నిప్పంటించారు. పోలింగ్ విధుల్లో అధికారుల మృతి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధుల్లో భాగంగా గుణలో ఓ ఎన్నికల కమిషన్ అధికారి, ఇండోర్లో ఇద్దరు అధికారులు గుండె పోటుతో మరణించారు. మరణించిన అధికారులకు రూ 10 లక్షల పరిహారం ప్రకటించారు. మిజోరంలో.. మిజోరం అసంబ్లీ ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ నమోదైంది. నాలుగు గంటలకే పోలింగ్ ముగిసినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి లాల్ తన్వాలా పోటీ చేస్తున్న సెర్చిప్ స్ధానంలో అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అశిష్ కుంద్రా తెలిపారు. త్రిపుర సరిహద్దులోని కన్హుమన్ గ్రామంలో త్రిపుర క్యాంప్స్లోని బ్రూ శరణార్ధులు 52 శాతం మేర ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. -
‘తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది’
జైపూర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పుష్కర్లోని బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించినప్పుడు రాహుల్ గాంధీ తన గోత్రానికి బదులు తన నానమ్మ తండ్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గోత్రం చెప్పారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ర్యాలీలో రాజే మాట్లాడుతూ ‘రాహుల్ తన గోత్రం ఏంటో చెప్పలేదు. ఆయన పేర్కొన్నది నెహ్రూ గోత్రం. పూజ సందర్భంగా రాహుల్ తన తండ్రి రాజీవ్ గాంధీ, తాత ఫిరోజ్ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన ఎందుకనో అలా చేయలేదు’ అని రాజే వ్యాఖ్యానించారు. కాగా పుష్కర్ ఆలయంలో రాహుల్ తన గోత్రం ‘దత్తాత్రేయ’ అని, తాను కశ్మీరీ బ్రాహ్మణుడిని అని తెలిపినట్లు ఆ పూజ నిర్వహించిన పూజారి వెల్లడించిన విషయం తెలిసిందే. -
ఆ తప్పులను చక్కదిద్దండి..
న్యూఢిల్లీ : గత పదిహేను సంవత్సరాల్లో జరిగిన తప్పులను చక్కదిద్దాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఆ రాష్ట్ర ఓటర్లను కోరారు. తప్పుడు వాగ్ధానాలతో ఒకటిన్నర దశాబ్ధాలుగా బీజేపీ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, పేదలను హింసిస్తూ మధ్యప్రదేశ్ ప్రతిష్టను బీజేపీ ప్రభుత్వం మసకబార్చిందని దుయ్యబట్టారు. మద్దతు ధర పెంచాలని అడిగిన రైతులను కాల్చివేశారని, యువతకు అవకాశాలు మృగ్యమయ్యాయని ఫేస్బుక్ పోస్ట్లో రాహుల్ పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ యువత భవిష్యత్తో ప్రభుత్వం చెలగాటమాడిన తీరును గుర్తుచేశారు. ఇసుక మాఫియా, ఈ ట్రేడర్ స్కామ్, బుందేల్ఖండ్ ప్యాకేజ్ స్కామ్లను తన పోస్ట్లో రాహుల్ ప్రస్తావించారు. కాంగ్రెస్ వాగ్ధానాలను మధ్యప్రదేశ్ ప్రజలు విశ్వసించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, ఇళ్లకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి తెస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపారాల వృద్ధి, పేదలకు భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి బాగుపడితే ఆర్థిక వ్యవస్థ సైతం మెరుగవుతుందని రాహుల్ పేర్కొన్నారు. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
‘ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు’
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర భవిష్యత్కు బీజేపీ ఎన్నికల ప్రణాళిక దిక్సూచీగా మారుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక రాజస్ధాన్లో రానున్న ఐదేళ్లలో ప్రైవేట్ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి వసుంధరా రాజె హామీ ఇచ్చారు. ఏటా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 2013లో ఇచ్చిన హామీలను 94 శాతం మేర రాజస్ధాన్ ప్రభుత్వం నెరవేర్చిందని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, సీఎం వసుంధర రాజె సమక్షంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికతో రాజస్ధాన్ అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని జైట్లీ పేర్కొన్నారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా పాగా వేయాలని విపక్ష కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచగా, అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. డిసెంబర్ 7న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
కులగోత్రాలు వెల్లడించిన రాహుల్
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్లోని పుష్కర్ బ్రహ్మ ఆలయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుడిగా చెబుతున్న రాహుల్ గాంధీ తన గోత్రం ఏమిటో వెల్లడించాలని బీజేపీ కోరుతున్న క్రమంలో కాంగ్రెస్ చీఫ్ నుంచి ఆ వివరాలు వెల్లడయ్యాయి. బ్రహ్మ ఆలయంలో పూజల సందర్భంగా గోత్రం గురించి పూజారి అడిగిన మీదట తన గోత్రం దత్తాత్రేయ అని, తాను కౌల్ బ్రాహ్మణుడినని రాహుల్ బదులిచ్చారు. పూజలో భాగంగా గాంధీ కుటుంబానికి చెందిన తన పూర్వీకుల వివరాలనూ ఆయన వెల్లడించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్లో రాహుల్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించిన సందర్భంలో రాహుల్ కులగోత్రాలపై బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా ప్రశ్నించారు. రాహుల్ జంధ్యం ధరిస్తే అది ఎలాంటిదో చెప్పాలని, ఆయన గోత్రం ఏంటో వెల్లడించాలని కోరారు. ఇక బ్రహ్మ ఆలయంను సందర్శించే ముందు రాహుల్ సోమవారం ఉదయం అజ్మేర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో జియారత్ నిర్వహించారు. రాహుల్ వెంట రాజస్ధాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. -
రాహుల్ అనుమతితోనే చెలరేగుతున్నారు..
జైపూర్ : తన ప్రభుత్వంపై మాట్లాడేందుకు అంశాలు కరువైనందునే కాంగ్రెస్ నేతలు రాహుల్ అనుమతితో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మూడు దశాబ్ధాల కిందట మరణించిన తన తండ్రిని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. రాజస్ధాన్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. వంద తరాలుగా తన కుటుంబానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గుజరాత్లోని మారుమూల గ్రామంలోని ఓ పేద చిన్నకుటుంబం తమదని మోదీ చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని బయటకు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించిన మోదీ మోదీ కూడా తమ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని రాహుల్ చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కుటుంబ సభ్యుల గురించి తానేమీ మాట్లాడటం లేదని, దేశ మాజీ ప్రధానులు, కాంగ్రెస్ పార్టీ మాజీ నేతల గురించే తాను ప్రస్తావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కాగా ప్రధాని మోదీ తన తండ్రి ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్ నేత విలాస్రావు ముత్తెంవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రాజ్బబ్బర్ రూపాయి విలువ మోదీ తల్లి వయసు స్ధాయికి క్షీణిస్తోందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
సీఎం బామ్మర్ది అయితే!
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వారాసివని నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యోగేంద్ర నిర్మల్నే బీజేపీ మళ్లీ బరిలో దించింది. మాములుగా అయితే ఈ స్థానంపై పెద్ద ఆసక్తేమీ ఉండదు. కానీ.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బావ (మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్)కు హ్యాండిచ్చి.. కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్న సంజయ్ సింగ్ మసానీ బీజేపీపై పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. వృత్తిరీత్యా వైద్యుడైన మసాని వారాసివని నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో మసాని ఈ నెల 3వ తేదీన కమల్నాథ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమల్నాథ్ కృషి ఫలితంగా కాంగ్రెస్ నాలుగో జాబితాలో మసానీకి చోటు దక్కింది. బావ పార్టీపై బామ్మర్ది ఆగ్రహం బీజేపీలో బంధుప్రీతి హద్దులు దాటిందని, వారసులకే పెద్ద పీట వేస్తున్నారని 60 ఏళ్ల మసాని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, కూతుళ్లకే ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చౌహాన్ కంటే కమల్నాథ్ అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే, మసానీకి టికెట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మసానీ అక్రమాలను పలుమార్లు కాంగ్రెస్ పార్టీయే అసెంబ్లీలో ఎత్తిచూపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మద్దతుగా ఎలా ప్రచారం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ బలమెక్కువ మధ్యప్రదేశ్లో బాలఘాట్ జిల్లా పరిధిలోకి వచ్చే వారాసివనిలో.. 2013లో ఆరెస్సెస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి యోగేంద్ర నిర్మల్.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్పై 17,755 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2008లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జైస్వాల్ గెలిచారు. 10మంది పోటీలో ఉన్నా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నప్పటికీ బీఎస్పీ కూడా తీవ్రమైన పోటీనిస్తోంది. -
కౌన్ బనేగా..టోంక్పతి!
రాజస్తాన్తోపాటు యావద్భారతం దృష్టిని ఆకర్శిస్తున్న స్థానం రాజస్తాన్లోని టోంక్ నియోజకవర్గం. తొలిసారి అసెంబ్లీ బరిలో దిగిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల్లో ఒకడైన సచిన్ పైలట్కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఇన్నాళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న టోంక్లో గెలవడం సచిన్కు ఆవశ్యకం కూడా. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా చివరి నిమిషంలో సచిన్ను టోంక్నుంచి పోటీ చేయించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు, గుజ్జర్లు ఎక్కువగా ఉండే టోంక్లో గుజ్జర్ నేతగా సచిన్ గెలవడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ భావించింది. అయితే.. బీజేపీ కూడా ఆఖరి నిమిషంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్ను బరిలోకి దింపింది. ఇప్పటికే ఇక్కడ బీజేపీకి గణనీయమైన ఓటుబ్యాంకు ఉంది. దీనికితోడు ముస్లింను బరిలో దించడం ద్వారా సచిన్కు సరైన సవాల్ విసరాలనేది బీజేపీ వ్యూహం. సచిన్ కరిజ్మాపై విశ్వాసం తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సచిన్కు పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాజేశ్ పైలెట్ కుమారుడిగా ఆయనకో ఇమేజ్ ఉంది. అందుకే ఎక్కడ నుంచి పోటీ చేసినా నెగ్గడం సచిన్కు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ.. బీజేపీ చివరి నిముషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్సింగ్ను పక్కన పెట్టి యూనస్ ఖాన్కు టిక్కెట్ ఇవ్వడంతో రసవత్తర పోటీకి తెరలేచింది. ఇద్దరూ కొత్తవారే టోంక్లో కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్లుగా ముస్లిం అభ్యర్థినే నిలబెడుతూ వస్తోంది. ఈ సారి ఆ సంప్రదాయాన్ని కాదని సచిన్ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గానికి సచిన్ పైలెట్ పూర్తిగా కొత్త. కానీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో టోంక్లో ‘మేరా బూత్, మేరా గౌరవ్’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొంత పట్టు సాధించారు. 2004లో దౌసా నుంచి 2009లో అజ్మీర్ నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాతో ఓటమిపాలయ్యారు. లోక్సభకు ఆయన ప్రాతినిధ్యం వహించిన దౌసా, అజ్మీర్లకు సరిగ్గా మధ్యలో టోంక్ నియోజకవర్గం ఉంది. సచిన్ తన చిన్నతనంలో టోంక్ జిల్లాలోని దేవ్నారాయణ్ ఆలయానికి (గుజ్జర్ల తమ కులదైవంగా భావిస్తారు) వస్తూ ఉండేవారు. ఈ ఏడాది సెప్టెంబర్లో తన ఇద్దరు కుమారులతో కలిసి సచిన్ ఈ దేవాలయాన్ని సందర్శించారు. బీజేపీ తరఫున బరిలో ఉన్న యూనస్ ఖాన్ కూడా నియోజకవర్గానికి కొత్తవారే. ముస్లిం ఓటర్లే అండగా ఉంటారన్న నమ్మకంతో బీజేపీ ఆయన్ను బరిలో దింపింది. రాష్ట్రంలో బీజేపీ టిక్కెట్ ఇచ్చిన ముస్లిం అభ్యర్థి యూనస్ మాత్రమే. దీద్వానా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన యూనస్ ఖాన్.. సీఎం రాజేకు సన్నిహితుడు. రాజస్థాన్ ప్రభుత్వంలో రాజే తర్వాతి స్థానంలో ఉన్నారు. అటు పైలెట్, ఇటు ఖాన్ ఇద్దరూ టోంక్కి కొత్తవారే. దీంతో వారి వ్యక్తిగత కరిజ్మా, కులసమీకరణలే కీలకం కానున్నాయి. మామ అండ కలిసొచ్చేనా? సచిన్ అభ్యర్థిత్వం స్థానిక ముస్లింలలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. మెజార్టీ ఓట్లు ఉన్న తమని కాదని గుజ్జర్కు టిక్కెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు. మైనార్టీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కూడా. అయితే సచిన్ పైలెట్కు పిల్లనిచ్చిన మామ, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫారుఖ్ అబ్దుల్లా అల్లుడికి అండగా నిలిచారు. ఫారుఖ్ అబ్దుల్లాకి టోంక్లోని సైదీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈ ఇంటి పెద్ద డాక్టర్ అజ్మల్ సైదీ, ఫరూక్ అబ్దుల్లా ఒకే కాలేజీలో చదువుకున్నారు. దీంతో ఫరూక్ తరచూ టోంక్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ముస్లిం కుటుంబమంతా సచిన్ను తమ అల్లుడిగా భావిస్తోంది. ఒక పేరున్న నేత తమ నియోజకవర్గంలో విజయం సాధిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశపడుతోంది. సచిన్కు అండగా ఉంటామని ఆ కుటుంబం హామీ ఇచ్చింది. అజ్మల్ సైదీ కుమారుడు సాద్ సైదీ మొన్నటివరకు టోంక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో మంచి పట్టున్న మరో నవాబు అఫ్తాబ్ అలీఖాన్ కూడా సచిన్ పైలట్కే మద్దతు తెలిపారు. -
నేడు ఛత్తీస్ రెండో దశ
రాయిపూర్: ఛత్తీస్గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. లక్షమందికి పైగా భద్రతాబలగాలను మోహరించారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్పూర్, బల్రామ్పూర్ జిల్లాల్లో నేడు పోలింగ్ జరగనుంది. రమణ్సింగ్ ప్రభుత్వం లోని 9 మంది మంత్రులు, స్పీకర్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ 72 సీట్లలో 46 జనరల్, 9 ఎస్సీ, 17 ఎస్టీలకు కేటాయించారు. 2013లో ఈ 72లో 43 స్థానాలను బీజేపీ, 27 సీట్లకు కాంగ్రెస్ చెరో సీటును బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కనీసం 65 స్థానాలు గెలుచుకుని వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. -
మాల్యా, అంబానీల నుంచి వస్తాయి!
కొరియా(ఛత్తీస్గఢ్): అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. అందుకు అవసరమైన నిధులు నీరవ్ మోదీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా వంటి వారి నుంచి వస్తాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ మాల్యా రూ.10 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయారని, నీరవ్మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 35 వేల కోట్లతో పరారయ్యారని రాహుల్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో రూ. 36 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి రమణ్సింగ్పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో చివరిదైన రెండో దశలో 72 స్థానాలకు పోలింగ్ 20న జరగనుంది. -
రాజ్పుత్ వర్సెస్ రాజ్పుత్
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేసేందుకు తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కొడుకు, శివ్ ఎమ్మెల్యే మాన్వేంద్ర సింగ్ పేర్కొన్నారు. రాజ్పుత్ నాయకుడిని అవమానించినందుకు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ టికెట్పై గెలుపొందిన మన్వేందర్ సింగ్ ఇటీవలే ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలరాపటాన్ నుంచి మన్వేంద్ర పోటీ చేస్తారని పేర్కొంది. ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు.. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన మన్వేందర్ సింగ్కు ఏ సీటు కేటాయించాలో అర్థం కాకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఆయనను నిలబెట్టారని వసుంధర రాజే అన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని ఆమె వ్యాఖ్యానించారు. 2003 నుంచి మూడు పర్యాయాలు అక్కడి నుంచి గెలిచిన విషయాన్ని మరోమారు గుర్తుచేశారు. కాగా వసుంధర రాజే నాయకత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్వేంద్ర సింగ్ను ఆమెపై పోటీకి దించడం ద్వారా సీఎంను చాలా తేలికగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ సంకేతాలు జారీ చేస్తోంది. అంతేకాకుండా ఈ టికెట్ను రాజ్పుత్కే కేటాయించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
46 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి!
జైపూర్ : రాజస్థాన్లోని చారిత్రక టోంక్ నియోజకవర్గంలో ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలికింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ను ఆ స్థానంలో తమ అభ్యర్థిగా రంగంలోకి దించనుంది. తద్వారా గత 46 ఏళ్లుగా టాంక్ సీటును మైనార్టీలకు కేటాయించే సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఈ విషయమై సచిన్ పైలట్ మాట్లాడుతూ.. తనకు తానుగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పలేదని పేర్కొన్నారు. పార్టీ అధినాయత్వం ఆదేశాల మేరకే టోంక్ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా టోంక్ ప్రజలను కోరారు. కాగా ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్ మెహతా సచిన్పై పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సచిన్ పైలట్ను ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ఔట్సైడర్లకు టోంక్లో చోటు లేదని పేర్కొన్నారు. అయినా సచిన్ పైలట్ ఎన్ని నియోజక వర్గాలు మారుతారని ప్రశ్నించారు. ఇక శుక్రవారం 152 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్కడ సగానికి సగం ముస్లిం ఓటర్లే నవాబులు పాలించిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన టోంక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,22,000. వీరిలో సగానికి సగం అంటే 40 నుంచి 50 వేల వరకు ముస్లిం ఓటర్లే ఉన్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్ గత 46 ఏళ్లుగా అక్కడ మైనార్టీలనే నిలబెడుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రాబల్యం కలిగి ఉన్న సైదీ అనే ముస్లిం కుటుంబం కాంగ్రెస్కు ప్రధాన బలంగా ఉంది. అయితే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన సాద్ సైదీ 2008, 2013లో ఇక్కడి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మైనార్టీ నేత, కాంగ్రెస్ అభ్యర్థి జకియాపై రెబల్గా పోటీ చేసి ఓడిపోయారు. కాగా 1985 నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జకియా 1985, 98, 2008 ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రాంతంపై తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం టాంక్ నుంచి సచిన్ పైలట్ పోటీ చేయనుండటంపై జకియా ఇంతవరకు స్పందించలేదు. సద్ సైదీ మాత్రం సచిన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గెలుపు కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ స్థానంలో ఆరెస్సెస్కు చెందిన బలమైన నాయకులను నిలబెడుతోంది. ‘టోంక్’ చారిత్రక నేపథ్యం రాజస్థాన్లోని టోంక్ సంస్థానాన్ని పరిపాలించిన నవాబులది ప్రత్యేక వ్యక్తిత్వం. మిగతా రాజవంశీకులందరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. వీరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా బ్రిటీషర్లకు, అఫ్గాన్లకు కుదిరిన ఒప్పందం కింద 1808లో టోంక్ సంస్థానం ఆవిర్భవించింది. 19వ శతాబ్దిలో ఈ రాజవంశం బలమైన మిలటరీ శక్తిగా పేరొందింది. అయితే ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చి రాజభరణాల రద్దు, లాండ్ సీలింగ్ చట్టం తెచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నవాబు వంశ మూల ఆర్థిక వనరులపై ఈ రెండు అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ మార్పు తర్వాత ప్రధాన పార్టీల తరఫు అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడానికే నవాబులు పరిమితం అయ్యారు. బైరాన్సింగ్ షెకావత్కు వీరి మద్దతు ఉండేది. ప్రస్తుత నవాబు ఢిల్లీలో నివసిస్తుండగా, కుటుంబంలోని వారంతా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన దాదాపు 615 మంది ప్రస్తుతం టోంక్ స్టేట్ ఖాందాన్ నిబంధనలు–1944 కింద నెలకు వెయ్యిరూపాయల పింఛను అందుకుంటున్నారు. జైపూర్, అల్వార్, భరత్పూర్, జోధ్పూర్, బికనీర్, జైసల్మేర్, పాలి తదితర సంస్థానాధీశులంతా నేతలవుతున్నా టోంక్ నవాబులు మాత్రం రాజకీయాలపై ఆసక్తి కనబరచలేదు. -
మత మార్పిడికి వచ్చిన ‘ఇటలీ ఏజెంట్లు’
జాష్పూర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటలీ నుంచి వచ్చిన ఏజెంట్లు గిరిజనులను మత మార్పిడులకు ప్రోత్సహించారన్నారు. ఛత్తీస్గఢ్లోని జాష్పూర్లో గురువారం ప్రచార సభలో ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇటలీ ఏజెంట్లు’ అని పరోక్షంగా సోనియా గాంధీ మూలాల్ని ప్రస్తావించారు. ‘ఇటలీ ఏజెంట్లు..గిరిజనులు మతమార్పిడులకు పాల్పడాలని ఒత్తిడి పెంచి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రోడ్లు, విద్య, విద్యుత్ వంటి సౌకర్యాలు లేకున్నా మతమార్పిడుల జాడ్యం మరింత ఎక్కువైంది. దివంగత బీజేపీ ఎంపీ దిలీప్సింగ్ జుదేవ్ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని జాష్పూర్ మరో బస్తర్ కాకుండా అడ్డుకున్నారు. కరుస్తుందని తెలిసినా హిందువులు పాముకు పాలు పోస్తారు. త్యాగాల్ని విశ్వసించే హిందూ మతం ప్రపంచంలోనే చాలా అత్యంత గొప్పది. ఇతరుల మాదిరిగా బలవంతపు మతమార్పిడులను హిందువులు నమ్మరు. ఛత్తీస్గఢ్లో రామరాజ్యం నెలకొల్పే ప్రభుత్వం రావాలి’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వలసదారులు వెనక్కే: షా లోక్సభ ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మధ్యప్రదేశ్లో ప్రచార సభలో మాట్లా డుతూ 1971 నుంచి భారత్లోకి చొరబడిన వలసదారులు కాంగ్రెస్, తృణమూల్ లాంటి పార్టీలకు ఓటుబ్యాంకుగా మారారన్నారు. -
ఆ రాష్ట్రాలకు సుస్తీ చేసింది!
ఆరోగ్య రంగ పనితీరు ప్రాతిపదికపై నీతి ఆయోగ్ ఈ యేడాది ఇచ్చిన ర్యాంకుల ప్రకారం – మొత్తం 21 రాష్ట్రాల్లో రాజస్తాన్ది 20వ స్థానం. మధ్యప్రదేశ్ స్థానం 17. చత్తీస్గఢ్ (12) తెలంగాణ (11) కాస్త ముందున్నాయి. చిన్న రాష్ట్రాల్లో మిజోరం మెరుగైన పని తీరు కనబరచింది. హెల్త్ స్కోర్పరంగా రాజస్తాన్ ఒక్క ఉత్తరప్రదేశ్ను మాత్రమే అధిగమించగలిగిందని ‘హెల్తీ స్టేట్స్ – ప్రోగ్రెసివ్ ఇండియా’ శీర్షికన నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక చెబుతోంది. రాజస్తాన్లో ఐదేళ్ల లోపు పిల్లల లింగ నిష్పత్తిపరంగా తీవ్ర అంతరం చోటుచేసుకుంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 887 మంది బాలికలు మాత్రమే వున్నారు (జాతీయ సగటు 919). ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 28 మంది పుట్టిన నాలుగు వారాల్లోనే మరణిస్తున్నారు (జాతీయ సగటు 24). 2010 – 17 మధ్య అదనంగా ఒక్క జిల్లా ఆసుపత్రి మాత్రమే ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. వైద్యులు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఈ కాలంలో 70 నుంచి 167కి చేరింది. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో సర్జన్ల కొరత 218 నుంచి 452కి పెరిగింది. మధ్యప్రదేశ్లోనూ శిశు, ప్రసూతి మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువే. ఆరోగ్య కేంద్రాల్లో జ్యోతిష్కుల్ని నియమిస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చి ఆ తర్వాత ఉపసంహరించుకుంది. శాకాహార సెంటిమెంట్ను ముందుకు తెస్తూ.. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లను నిషేధించింది. చత్తీస్గఢ్లో ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 32మంది పుట్టిన 4వారాల్లోనే చనిపోతున్నారు. ప్రసూతి మరణాలు రేటూ ఎక్కువే (ప్రతి లక్షకు 173). నిపుణుల కొరత తీవ్రంగా వున్నప్పటికీ, 2010–18 మధ్య ఇక్కడ తొమ్మిది జిల్లా ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. పీహెచ్సీల్లో విద్యుత్, నీటి సరఫరా కొరతను కూడా ఈ రాష్ట్రం కొద్దిమేరకు అధిగమించింది. ‘ఆయుష్మాన్ భారత్’లో భాగంగా తొలి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటైంది ఇక్కడే. -
బలమే బలహీనతై
మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్సింగ్ చౌహాన్ పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. అత్యంత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. అన్నిరంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర పగ్గాలు తీసుకున్న సమయంలో ఉన్న పప్పు అని ఇమేజ్ నుంచి రాష్ట్రమంతా మామ అని ఆప్యాయంగా పిలిపించుకునే స్థాయికి ఎదిగిన చౌహాన్ గత రెండు ఎన్నికల్లో బీజేపీని సులభంగా గట్టెక్కించారు. అయితే ఏకంగా మూడుసార్లు అధికారంలో ఉండటంతో ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత కాస్తంత ఎక్కువగానే కనబడుతోంది. వరుసగా నాలుగోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అంత సులభం కాదనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌహన్కు బలం అనుకున్న అంశాలే ఇప్పుడు బలహీనతలుగా మారుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, రైతులు శివరాజ్పై తిరుగుబాటు బావుటీ ఎగరేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు.. మధ్యప్రదేశ్లో పార్టీకి నష్టం చేస్తాయనే భావన వినిపిస్తోంది. ఈ చట్ట సవరణలతో అటు దళితులు, ఇటు అగ్రవర్ణాలు కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. బీజేపీకి సంప్రదాయంగా మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలు సొంతం పార్టీలు పెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్ఏపీఏకేఎస్ ఏర్పాటు మధ్యప్రదేశ్లో అగ్రవర్ణాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలే కాదు, ప్రభుత్వంలో పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం వారిలో అసంతృప్తిని పెంచింది. దీంతో వారు ఓబీసీలతో చేతులు కలిపి సామాన్య పిఛ్డా ఔర్ అల్పసంఖ్యాక వర్గ కర్మచారి సంస్థ (ఎస్ఏపీఏకేఎస్) ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. ఓటర్లలో అగ్రవర్ణాలు 15%, ఓబీసీ ఓటర్లు 37%. గత 30 ఏళ్లుగా బీజేపీకే మద్దతుగా ఉన్నాయి. దళితుల్లో అసంతృప్తి బీజేపీ ప్రభుత్వం దళితులకు పలు పథకాలు తీసుకొచ్చినా.. రోహిత్ వేముల ఉదంతం, గుజరాత్లోని ఉనాలో దళిత యువకులపై దాడుల వంటి ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్ ఓటర్లలో 16% దళితులే. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ సమయంలో మధ్యప్రదేశ్లో ఎక్కువగా నిరసన స్వరాలు వినిపించాయి. జై ఆదివాసీ యువ సంఘటన్ మధ్యప్రదేశ్లో ఆదివాసీ ఓటర్లు 23%. గత రెండు సార్లు వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. గత ఎన్నికల్లో ఎస్టీల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఆదివాసీల సంక్షేమం కోసం డాక్టర్ హీరాలాల్ ఏర్పాటు చేసిన జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) బీజేపీకి పక్కలో బల్లెంలా మారుతోందనే అంచనాలున్నాయి. ఒక సామాజిక సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా మారిన జేఏవైఎస్తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అన్నదాతల ఆగ్రహం శివరాజ్సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. అయినా ఆ రైతులే ఆయనకు వ్యతిరేకంగా మారారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది మందసౌర్ నిరసనల్లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించడం బీజేపీకి తీవ్ర నష్టం చేయనుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటించడంతో రైతులు కాంగ్రెస్ వైపు మరలుతారని భావిస్తున్నారు. కేంద్రంపై వ్యతిరేకత గత ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోదీ మ్యాజిక్ ప్రధాన కారణం. యూపీఏపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి ఓటేశారు. కానీ ఈ సారి కేంద్రంపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అంచనా. ఈ వ్యతిరేకత ఈ సారి చౌహాన్కు నష్టం చేకూరుస్తుందంటున్నారు. బలాలు ♦ ప్రజలతో మమేకం కావడం ♦ పని రాక్షసుడని పేరు ♦ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బలహీనతలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ♦ రైతుల్లో అసంతృప్తి ♦ వ్యాపమ్ సహా పలు కుంభకోణాలు ♦ బంధుప్రీతి ఎక్కువన్న ఆరోపణలు చెక్ పెట్టగలరా? చౌహాన్ జోరును ఆపేందుకు విపక్షం విశ్వప్రయత్నం ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ భరోసా పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మధ్యప్రదేశ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి సొంత ఇమేజ్తో మళ్లీ గెలవాలని శివరాజ్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ప్రవేశపెట్టిన పథకాలు గట్టెక్కిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అటు, ఇంటిపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే.. అది ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప కాంగ్రెస్ నేతల గొప్పదనమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరుపార్టీల్లోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్లో అగ్రనేతలే తమ వర్గానికి టికెట్లు ఇవ్వాలంటూ బహిరంగంగా విమర్శలు చేసుకుంటుంటే.. టికెట్ల పంపిణీ బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ప్రజలతో ఆప్యాయంగా మామా అనిపించుకుంటున్న చౌహాన్ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. వివాదంలో కాషాయ నేతలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం ఏ మాత్రం కనిపించడం లేదు. సీనియర్ నాయకులెందరో వివాదాల్లో ఇరుక్కున్నారు. నరోత్తమ్ మిశ్రా పెయిడ్ న్యూస్ కేసులో ఇరుక్కుంటే, ఎమ్మెల్యే మఖాన్ సింగ్ జాటవ్ హత్య కేసులో.. లాల్ సింగ్ ఆర్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణాలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న సురేంద్ర పాత్వా, కోడలు ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్పాల్ సింగ్.. ఇలా కాస్త పేరున్న నాయకులందరూ వివాదాల్లో చిక్కుకొని పార్టీకున్న ఇమేజ్ను చెరిపేస్తున్నారు. ఇతర సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, సర్తాజ్ సింగ్, కుసుమ్ మహ్దెలేలు టిక్కెట్లు నిరాకరించడంతో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. బహిరంగంగానే పార్టీకి డ్యామేజ్ జరిగేలా వ్యాఖ్యలుచేశారు. తన కోడలు కృష్ణకు టిక్కెట్ ఇచ్చిన తర్వాత బాబూలాల్ గౌర్ శాంతించారు. సర్తాజ్ సింగ్ ఏకంగా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు, పార్టీకి గట్టిపట్టున్న ఇండోర్, విదిశ, మహూ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీలో అంతర్గత పోరు పెరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ, పార్లమెంటు స్పీకర్ సుమిత్ర మహాజన్లకు పడడం లేదు. కాంగ్రెస్ విశ్వప్రయత్నం ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారాయి. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేయడానికి ఈ రాష్ట్రంలో గెలుపు చాలా ముఖ్యం. అందుకే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను ప్రకటించింది. రైతులు, మహిళలు, యువత, పారిశ్రామిక రంగం ఇలా అత్యధిక జనాభా ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలు పన్నుతోంది. ఆ ముగ్గురిపై నమ్మకం కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. కానీ మధ్యప్రదేశ్లో పరిస్థితి వేరు. ఒక్కరిద్దరు కాకుండా ముగ్గురు బలమైన నేతలుండటం పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతర్గత పోరు ఉన్నప్పటికీ.. ఒక్కో నాయకుడికి ఒక్కో ప్రాంతంలో పట్టుండడం విశేషం. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్కు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో మంచి పట్టు ఉంది. పీసీసీ చీఫ్ కమల్నాథ్కు మహాకౌశల్ ప్రాంతంలో తిరుగేలేదు. ఇక ఎన్నికల ప్రచార సారథి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో మంచి ఇమేజ్ ఉంది. టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ప్రాంతీయ, కుల సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకొని నేతలందరూ ఇంచుమించుగా సంతృప్తి చెందేలా టిక్కెట్లు ఇచ్చింది. -
‘మోదీ, అంబానీ పేర్లు బయటకొస్తాయి’
కబీర్దాం/కోర్బా: రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అంబానీల పేర్లు త్వరలో బయటకు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్గఢ్లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. ‘రఫేల్ కుంభకోణంపై సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ దర్యాప్తు ప్రారంభించారు. అయితే అర్థరాత్రి 12 గంటలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధానమంత్రి ఆయనను తొలగించారు. ఒకరోజు తప్పకుండా ఆ రెండు పేర్లు బయటకు వస్తాయి. ఆ పేర్లు ప్రధాని నరేంద్రమోదీ, అనిల్ అంబానీ’’అని రాహుల్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
రాజస్ధాన్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ!
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమలనాధులకు గట్టిషాక్ తగిలింది. వసుంధర రాజె నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందనే ప్రచారంతో కలవరపడుతున్న బీజేపీకి తాజాగా ఆ పార్టీ ఎంపీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దౌసా ఎంపీ, మాజీ డీజీపీ హరీష్ మీనా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. మరికొన్ని వారాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీకి మీనా నిష్క్రమణ భంగపాటుగా మారింది. మీనా సోదరుడు నమో నారాయణ్ మీనా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజస్ధాన్లో ప్రాబల్యం కలిగిన మీనాలు తూర్పు రాజస్ధాన్లో గణనీయ సంఖ్యలో ఉన్నారు. మీనా వర్గీయులు రాజకీయాల్లో, ప్రభుత్వ సర్వీసుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2009-13 మధ్య హరీష్ మీనా రాజస్థాన్ పోలీస్ చీఫ్గా దీర్ఘకాలం సేవలు అందించారు. కాగా రాజస్ధాన్లో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అధికారం నిలుపుకునేందుకు బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. -
మహిళా అభ్యర్ధులపై కమల్నాథ్ వ్యాఖ్యల కలకలం
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ తలపడుతున్న కాంగ్రెస్కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. మహిళా అభ్యర్ధుల ఎంపికపై ఆ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టికెట్ల పంపిణీపై విలేకరుల సమావేశంలో కమల్నాథ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహిళా అభ్యర్ధులకు కాంగ్రెస్ పెద్దపీట వేయకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా గెలుపు ప్రాతిపదికనే తాము వారికి టికెట్లు కేటాయించామని, కేవలం కోటా కోసమో, డెకరేషన్ కోసమో ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించారు. దీంతో మహిళలను అలంకారప్రియులుగా కమల్నాథ్ చిత్రీకరించారంటూ బీజేపీ భగ్గుమంటోంది.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు కమల్నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు ఆరెస్సెస్ శాఖా సమావేశాలకు ప్రభుత్వ అధికారులు హాజరు కావడాన్ని నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడంపై కూడా బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. -
బెయిల్పై ఉండి.. నన్ను విమర్శిస్తారా?
బిలాస్పూర్: కాంగ్రెస్ పార్టీ, గాంధీల కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఛత్తీస్గఢ్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం బిలాస్పూర్లో పర్యటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలను ప్రస్తావిస్తూ ‘బెయిలుపై బయట ఉన్న తల్లీ కొడుకుల నుంచి నాకు నిజాయితీ ధ్రువపత్రమేమీ అవసరం లేదు’ అని మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నోట్లరద్దు నిర్ణయాన్ని సోనియా, రాహుల్లు వ్యతిరేకిస్తూ మోదీ అవినీతికి పాల్పడ్డారని వారు చేసిన ఆరోపణలకు సమాధానంగానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంస్థలో ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి 2015 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్లకు బెయిలు మంజూరు చేయడం గమనార్హం. ‘నోట్లరద్దు నిర్ణయానికి మీకు సమాధానం కావాలా? ఆ చర్య వల్లే నకిలీ కంపెనీలను గుర్తించాం. అందువల్లే మీరు బెయిలు కోరాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మీరెందుకు మర్చిపోతున్నారు’ అంటూ సోనియా, రాహుల్లపై మోదీ విరుచుకుపడ్డారు. మోదీ వ్యాఖ్యలు ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ అన్నారు. ఒకే కుటుంబంతో ఆరంభం, అంతం.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒకే కుటుంబంతో ఆరంభమై, అంతమవుతాయని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఓ అవినీతి పార్టీ అనీ, ఛత్తీస్గఢ్ను ఇప్పుడున్న స్థితికి తీసుకురావడానికి ఆ పార్టీకైతే 50 ఏళ్లు పట్టేదని పోల్చారు. మాజీ ప్రధాని, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ 1985లో అన్న మాటలను గుర్తుచేస్తూ.. ‘ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయిలో 15 పైసలే ప్రజలకు చేరుతోందని రాజీవ్ గాంధీయే అన్నారు. 85 పైసలను అదృశ్య హస్తం (కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం) లాగేసింది? ఆ డబ్బంతా నోట్ల రద్దు తర్వాత బయటకొచ్చింది’ అని మోదీ ఆరోపించారు. జల మార్గాలపై తొలి టర్మినల్ వారణాసి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాను లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో అభివృద్ధి వేగాన్ని ప్రధాని మోదీ పెంచారు. మొత్తం రూ. 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను ఇంతకు ముందే ఎందుకు చేపట్టలేదంటూ గత ప్రభుత్వాలను దుయ్యబట్టారు. దేశీయ జల మార్గాలపై దేశంలోనే తొలి మల్టీ–మోడల్ టర్మినల్ను మోదీ ప్రారంభించారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం పరిధిలో గంగా నదిపై ఈ టర్మినల్ను నిర్మించారు. జాతీయ జల రహదారి–1 ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తం నాలుగు టర్మినళ్లను గంగా నదిపై నిర్మిస్తుండగా, సోమవారం ప్రారంభమైన టర్మినల్ వాటిలో మొదటిది. ప్రభుత్వాధీనంలోని భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ – ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ బ్యాంకు సాయంతో ‘జల్ మార్గ్ వికాస్’ ప్రాజెక్టును చేపడుతుండటం తెలిసిందే. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 5,369.18 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం, ప్రపచం బ్యాంకు చెరి సగం భరించనున్నాయి. జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తొలి నౌకకు స్వాగతం పలికిన మోదీ టర్మినల్ను ప్రారంభించిన అనంతరం కోల్కతా నుంచి ఆహార, పానీయాలను మోసుకుంటూ జలమార్గంలో వచ్చిన తొలి సరకు రవాణా నౌకకు మోదీ స్వాగతం పలికారు. ఈ నౌక అక్టోబర్ చివరి వారంలో కోల్కతా నుంచి వారణాసికి బయలుదేరింది. కాగా, తన నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన, మొత్తంగా 34 కి.మీ. పొడవైన రెండు రహదారులను కూడా మోదీ ప్రారంభించారు. వీటిలో 16.55 కి.మీ. పొడవైన వారణాసి రింగ్రోడ్డు తొలి దశ రహదారి కూడా ఉంది.