-
డబ్బులివ్వండి...ఆడి వస్తాం!
భారత ఐస్ హాకీ జట్టు విజ్ఞప్తి న్యూఢిల్లీ : అంతర్జాతీయ మ్యాచ్ ఆడితే చాలు కనకవర్షం కురిసే క్రీడలున్న మన దేశంలో... ఒక టోర్నీలో పాల్గొనేందుకు జాతీయ జట్టు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తోంది. తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తోంది. వివరాల్లోకెళితే... భారత ఐస్ హాకీ జట్టు ఈ నెలాఖరులో కువైట్లో జరిగే ఆసియా చాంపియన్షిప్ (డివిజన్-1)కు అర్హత సాధించింది. అయితే ఆ టోర్నీలో పాల్గొనేందుకు అయ్యే మొత్తం జట్టు వద్ద లేదు. జట్టులో మొత్తం 26 మంది సభ్యులున్నారు. కనీస ఖర్చు రూ. 12 లక్షల వరకు అవుతుంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరు రూ. 20 వేలు చొప్పున వేసుకోగా...మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్, మరికొందరు సన్నిహితులు సహకరించడంతో ఈ మొత్తం రూ. 5 లక్షలకు చేరింది. అయితే జట్టుకు ఇంకా రూ. 7 లక్షలు కావాలి. దాంతో ఆటగాళ్లు భారత ఐస్ హాకీ వెబ్సైట్ ద్వారా తమకు సహాయం అందించమని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి టోర్నీ ఆడాలన్న వారి కోరిక ఎలా తీరుతుందో చూడాలి. -
చైనా చమక్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో తొలి రెండు రోజులు ఆతిథ్య దక్షిణ కొరియా నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న చైనా మూడో రోజు మాత్రం జూలు విదిల్చింది. స్వర్ణాల సంఖ్యను 26కు పెంచుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మహిళల బ్యాడ్మింటన్, ట్రాక్ సైక్లింగ్, ఫెన్సింగ్, జూడో, షూటింగ్, స్విమ్మింగ్, సింక్రనైజ్డ్ స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్, వుషు క్రీడాంశాల్లో చైనా క్రీడాకారులు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో యి సిలింగ్ (418.7), జాంగ్ బిన్బిన్ (418.4), వూ లీజి (416.8)లతో కూడిన చైనా బృందం కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. క్వాలిఫయింగ్లో ఈ ముగ్గురు కలిసి 1,253.8 పాయింట్లు స్కోరు చేసి... గతేడాది టెహ్రాన్లో ఆసియా చాంపియన్షిప్ సందర్భంగా 1,253.7 స్కోరుతో చైనా జట్టే నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. క్వాలిఫయింగ్ పోటీల సందర్భంగా ‘డ్రామా’ చోటు చేసుకుంది. చైనా షూటర్ జాంగ్ బిన్బిన్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బరువు ఉన్న రైఫిల్ను వాడినందుకు ఆమెపై అనర్హత వేటు వేశారు. అయితే చైనా బృందం ఈ నిర్ణయంపై వెంటనే అప్పీలు చేసింది. అరగంట విచారణ తర్వాత ఆమెపై అనర్హత వేటును తొలగించడంతో జాంగ్ బిన్బిన్ వ్యక్తిగత ఫైనల్స్లోనూ పోటీపడి కాంస్య పతకాన్ని సాధించింది. -
క్వార్టర్స్లో సింధు, గురుసాయిదత్
జ్వాల జోడి కూడా... కశ్యప్కు చుక్కెదురు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గిమ్చియోన్ (కొరియా): భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు... ఆసియా చాంపియన్షిప్లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్లో క్వార్టర్ఫైనల్కు చేరుకుని సత్తా చాటింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-18తో హిరోస్ ఎరికో (జపాన్)పై విజయం సాధించింది. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయి తొలి గేమ్లో ఓడినా... మిగతా రెండు గేమ్ల్లో స్థాయి మేరకు రాణించింది. క్వార్టర్స్లో ప్రపంచ 18వ ర్యాంకర్ బుసానన్ ఆంగ్బుమ్రాంగపన్ (థాయ్లాండ్)తో సింధు తలపడుతుంది. గతంలో ఈమెతో తలపడిన రెండుసార్లూ ఏపీ అమ్మాయి పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్లో చాలా కాలం తర్వాత ప్రపంచ 38వ ర్యాంకర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ జోరు కనబర్చాడు. ప్రిక్వార్టర్స్లో అతను 17-21, 21-13, 21-19తో వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వార్టర్స్కు చేరుకున్నాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఏపీ కుర్రాడు చాలా ఓపికగా ఆడాడు. తొలి గేమ్ ఓడిన తర్వాత రెండో గేమ్లోనూ 3-7తో వెనుకబడ్డాడు. కానీ నెట్ వద్ద భిన్నమైన ఆటతీరుతో అదరగొట్టాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి తర్వాత బలమైన స్ట్రోక్స్తో వరుసగా పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ 23-25, 17-21తో సు జెన్ హో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్లో జ్వాల గుత్తా-అశ్విని పొనప్ప జోడి (భారత్) 21-11, 21-18తో డుంగానోంగ్-కుంచాల ఉర్విచెత్చైకుల్ (థాయ్లాండ్)పై గెలిచి క్వార్టర్స్కు అర్హత సాధించింది.