-
సామాజిక కళకు సై అంటున్నారు...
‘నా కాళ్లకు ప్రయాణ దాహం పట్టుకుంది’ అంటున్నారు యువ ఆర్టిస్ట్లు. ఆ ప్రయాణ అనుభవాలు వారి కళకు బలాన్ని ఇస్తున్నాయి. సమాజంతో కలిసి పనిచేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి. పబ్లిక్ ఆర్ట్గా ప్రాచుర్యం ΄పొందిన ‘మ్యూరల్ ఆర్ట్’ ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి మహిళాశక్తి వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నారు. కార్టూన్లతో నవ్వించడమే కాదు ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. కళకు సామాజిక ప్రయోజనాన్ని జోడించిన వారి క్రియేటివ్ జర్నీ గురించి....ముంబైకి చెందిన మేఘకు మ్యూరల్ ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో ప్రయాణాలు అంటే కూడా అంతే ఇష్టం. ఆ ప్రయాణాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఇష్టం.ఆమె దృష్టిలో ప్రకృతి అనేది విశాలమైన కాన్వాస్. అస్సాంలోని పచ్చటి కొండల నుంచి జమ్మూ కశ్మీర్లోని తెల్లటి మంచుల కొండల వరకు నదుల జలకళ నుంచి ఎడారుల ఇసుక మెరుపుల వరకు ఎన్నో ప్రాంతాల అందాలను ఆస్వాదించింది.తన కళకు ఇన్స్పిరేషన్ తాను వెళ్లిన ప్రాంతాలే. ‘ప్రయాణం అంటే ప్రతి రోజు ఒక కొత్త ఎనర్జీతో నిద్ర లేచే ఉత్సాహం. ఆ ఉత్సాహ శక్తి మన కళలో ప్రతి ఫలిస్తుంది’ అంటుంది మేఘ.మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి తన మ్యూరల్ ఆర్ట్ను సాధనంగా వాడుకుంటుంది స్నేహ చక్రవర్తి. ‘మైండ్ అండ్ మ్యాటర్’ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ‘ది ట్రావెల్ అండ్ పెయింట్: ఇండియా టూర్’ చేసింది. ఆల్ ఇండియా ఆర్ట్ టూర్లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది. అట్టడుగు వర్గాల పిల్లలతో సంభాషించి వారితో స్నేహం చేసే అవకాశం వచ్చింది.‘కళ’ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విస్తృతంగా ప్రచారం చేస్తోంది స్నేహ చక్రవర్తి.తిరువనంతపురానికి చెందిన అమితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే మరీ ఇష్టం. ‘మొదట్లో ప్రముఖ చిత్రకారుల ఆర్ట్వర్క్స్ను అనుసరిస్తూ ఆనందించేదాన్ని. అయితే అసలైన ఆనందం నాకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు దొరికింది. ఒక ప్రాంతానికి తనదైన అందాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలను నా కళ ద్వారా ప్రతిబింబించాలనుకుంటు న్నాను’ అంటుంది అమిత.చిత్రకళకు సంబంధించి నిర్దిష్టమైన శైలికి పరిమితం కావడం అంటే అమితకు ఇష్టం లేదు. ఐడియాల విషయంలో ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఆమెకు ఇష్టం. ‘యూనిక్ ఎక్స్ప్రెషన్’ను అమితంగా ఇష్టపడుతుంది.మేఘ, స్నేహ, అమితలుæమాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ కళాకారులు తమవైన కళారూపాలతో సమాజంతో కలిసి నడుస్తున్నారు. సామాజిక కళకు సై అంటున్నారు.జస్ట్ లోకల్...చెన్నైకి చెందిన పదహారుమంది యువ ఆర్టిస్ట్లు ఐశ్వర్య మణివణ్ణన్ మార్గదర్శకత్వంలో ‘లోకల్’ థీమ్తో వందకుపైగా కళారూపాలు ఆవిష్కరించారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం వల్ల కోల్పోతున్నది ఏమిటో తెలియజేస్తాయి ఈ చిత్రాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగే సంఘటనల గురించి తెలుసుకునే మనం, సమీపంలోని వాటి గురించి మాత్రం తెలుసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో విషయాల గురించి అన ర్గళంగా చెప్పగలిగే వాళ్లలో చాలామందికి లోకల్ విషయాలలో అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. ‘తమ స్థానికతతో కళాకారులు మమేకం కావడానికి లోకల్ అనే థీమ్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఐశ్వర్య. చెన్నైలోని వైబ్రెంట్ స్ట్రీట్ లైఫ్... అందులోని సాంస్కృతిక వైవిధ్యం అంటే ఐశ్వర్యకు ఇష్టం. తన స్టూడెంట్స్తో కలిసి నార్త్ చెన్నైలోని కాశిమేడుకు వెళ్లింది. గంభీరమైన సముద్రాన్ని చూసిన తరువాత స్టూడెంట్స్కు కొత్తప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఎంతోమంది జాలరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అక్కడి దృశ్యాలు స్టూడెంట్స్ ముందున్న కాన్వాస్లోకి నడిచొచ్చాయి. సహజత్వాన్ని ప్రతిబింబించాయి.ఈజ్ దట్ యూ? ‘టాలెంటెడ్ ఇలస్ట్రేటర్’గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది ముంబైకి చెందిన ప్రణిత కొచ్రేకర్. దైనందిన జీవిత దృశ్యాల నుంచి మానసిక ఒత్తిడి, ఆందోళన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలకు థీమ్గా ఉంటాయి. ఊహల్లో నుంచి కాకుండా సొంత అనుభవాల్లో నుంచి చిత్రాలు వేయడం అంటే ప్రణితకు ఇష్టం.‘కళకు సామాజిక ప్రయోజం ఉంది. అది శక్తిమంతమైన మాధ్యమం’ అంటున్న ప్రణిత తన కళ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలను తన కళకు వేదికగా ఉపయోగించుకుంటోంది.యాంగ్జయిటీ డిజార్డర్లపై ‘ఇజ్ దట్ యూ?’ టైటిల్తో వేసిన డ్రాయింగ్ సిరీస్కు మంచి స్పందన వచ్చింది. తన బొమ్మల ద్వారా నవ్వించడంతోపాటు ఆలోచించేలా చేయడం ప్రణిత ప్రత్యేకత.‘డా.ఇంటర్నెట్’ పేరుతో యాంగ్జయిటీని తగ్గించుకోవడానికి ఏంచేస్తే బాగుంటుందో చిత్రం చివర సలహా కూడా ఇస్తుంది ప్రణిత. -
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప. అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.⇒ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది. ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే. -
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది. -
ప్రాణమున్నగోడలు
బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.కూర్గ్ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్ అండ్ పెయింట్ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్తో మొదలెట్టి హిమాచల్ ప్రదేశ్ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.సొంత ఊరు ఢిల్లీఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్ను అయ్యాను. అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్లైన్స్ సంస్థలో ఇంటీరియర్ డిజైనర్గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్గా, స్ట్రీట్ ఆర్టిస్ట్గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.జటిలమైన చిత్రకళకాన్వాస్ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. స్త్రీలు– సందేశాలు‘నా మ్యూరల్స్తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్ సేల్ ఫర్ సేల్ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ. View this post on Instagram A post shared by Sneha Chakraborty (@lbc_sneha) -
ఆకాశంలోకి నిప్పుల నిచ్చెన వైరల్ వీడియో
‘అరోరా బొరియాలిస్’ ఆకాశంలో అద్భుతం సృష్టించగా తాజాగా మరో అద్భుతం విశేషంగా నిలుస్తోంది. ఎర్రని నిప్పుల సెగ కక్కుతున్న నిచ్చెన మెట్ల వెలుగులు ఆకాశం వైపు దూసుకెళ్లడం నెట్టింట చక్కర్లు కొడుతోంది.విషయం ఏమిటంటే..ఈ వీడిలో పదేళ నాటిదట. చైనీస్ బాణసంచా కళాకారుడు కాయ్ గువో-కియాంగ్ దీన్ని రూపొందించారు. ఆకాశంలోకి సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలుతూ అద్భుతంగా మారింది.As a tribute to his grandmother, a Chinese artist and pyrotechnic expert created this stairway to Heaven. Stunning. pic.twitter.com/aNmc7YGcKf— Juanita Broaddrick (@atensnut) May 13, 2024ఈ కళాకారుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టెయిర్ వే టు హెవెన్ పేరిట పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ చైనీస్ ఆర్టిస్ట్ క్రియేటివిటీకి మచ్చుతునక అంటూ నెటిజన్లు ప్రశంసించారు. కాయ్ తన అమ్మమ్మకు నివాళిగా దీన్ని తయారు చేశాడు. 1,650 అడుగుల ఎత్తు (లేదా 502 మీటర్లు) "స్కై ల్యాడర్" రాగి తీగలు, గన్పౌడర్తో తయారు చేశాడని వైస్ ఒక నివేదికలో తెలిపింది. అలా కళాకారుడిగా మారాలని కల నెరవేర్చుకోవడంతోపాటు, నివాళిగా కాయ్ గో క్వింగ్ అనే కళాకారుడు ఇలా నింగిలోకి టపాసులను కాల్చినట్లు వివరించింది. ఇలా కాయ్ ఎక్స్ప్లోజివ్ ఆర్టిస్ట్గా పేరొందాడు.1994లోనే తొలిసారిగా అతను ఈ తరహా ట్రిక్ కోసం ప్రయత్నించినప్పటికీ భారీ గాలుల వల్ల అది విజయవంతం కాలేదట. అలాగే 2001లో మరోసారి ప్రయత్నం చేయాలనుకున్నా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అందుకు అనుమతి లభించలేదట. కాగా 1957లో ఫుజియాన్ ప్రావిన్స్లోని క్వాన్జౌ నగరంలో జన్మించారు కాయ్ గువో-కియాంగ్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్లో నివసిస్తున్నారు. -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్లు ఉన్న పరికరంతో కాన్వాస్పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్వీర్సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్వీర్సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన కత్రికి ఇన్స్టాగ్రామ్లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
Grammy Awards 2024: భారత్కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్రామ్ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్రామ్ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
దశకుంచెల చిత్రకారుడు! ఏకాకాలంలో ఎడాపెడా..
ఎంతటి చేయితిరిగిన చిత్రకారుడైనా ఒకసారి ఒకే కుంచెను చేత్తో పట్టుకుని బొమ్మలు చిత్రించగలడు. అతి అరుదుగా కొందరు రెండు చేతులతోనూ చెరో కుంచె పట్టుకుని బొమ్మలు గీయడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఈ బెలారష్యన్ కళాకారుడు మాత్రం రెండు చేతులతోనూ పదికుంచెలు పట్టుకుని, వాటితో ఏకకాలంలో ఎడాపెడా కళ్లుచెదిరే బొమ్మలు చిత్రిస్తూ, చూసేవాళ్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. ఈ కళాకారుడి పేరు సర్జీ ఫీలింగర్. మొదట్లో అందరిలాగానే పద్ధతిగా ఒకసారి ఒక కుంచె పట్టుకునే బొమ్మలు వేసేవాడు. ఇలా బొమ్మలు వేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో కుంచెను మార్చాల్సి వచ్చేది. బొమ్మ గీసే ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఇదంతా చిరాకనిపించడంతో కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామనుకున్నాడు. రెండు చేతుల వేళ్లకూ పది కుంచెలను తగిలించుకుని, వాటిని రంగుల్లో ముంచి ఏకకాలంలో పది కుంచెలతోనూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లుగా సర్జీ బొమ్మలు అద్భుతంగా రావడం మొదలైంది. అతడు బొమ్మలు గీసే ప్రక్రియ మాత్రమే కాదు, అతడి బొమ్మలు కూడా సందర్శకులను ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే సెలబ్రిటీ పెయింటర్గా మారాడు. గడచిన రెండేళ్లలో సర్జీ తన బొమ్మలతో జర్మనీ, పోలండ్, ఇటలీల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ ప్రదర్శనల్లో అతడి పెయింటింగ్స్ కళ్లుచెదిరే ధరలకు అమ్ముడయ్యాయి. (చదవండి: ముక్కుతో 'ఈల' పాట విన్నారా? ఈ విలక్షణమే ఆమెను..) -
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
కళాకారుల జీవితాల్లో కాంతులు నింపిన జగనన్న ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్.కె. రోజా అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించగా మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ చైర్ పర్సన్ పి.శిరీష, సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీఈవో .మల్లిఖార్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. తోటి కళాకారులందరికీ గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. కానీ అధికారం చేపట్టిన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులకు అండగా నిలబడ్డారన్నారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని తెలిపారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. కళాకారుల వినతిపత్రాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని స్పష్టం చేశారు. సాంస్కృతిక సంబరాల్లో కళాకారుల డేటా సేకరణ ద్వారా నిజమైన కళాకారులను గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా అందజేస్తున్నామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కళాకారులు దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొందవచ్చన్నారు. ప్రతిష్ఠాత్మక జీఐఎస్, జీ20 కార్యక్రమాల్లో మన కళాకారుల ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర చరిత్రలో 99 శాతం హామీలను నాలుగున్నరేళ్లలో అమలు చేయడమే గాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యం ఇచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. ఇలా సంక్షేమమే లక్ష్యంగా ముందుకువెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. ఈ విషయంలో కళాకరులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఎమ్మార్వో, ఆర్డీవోల ద్వారా పారదర్శకంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. స్వతహాగా కళాకారుడైన తనకు క్రియేటివ్ హెడ్ గా పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్క్షతలు తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఆర్.కె.రోజా ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత మరింత వన్నె తెచ్చారన్నారు. కరోనా తర్వాత కళలు, క్రీడలు పునర్ వైభవాన్ని కోల్పోగా.. వాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పునరుత్తేజం వచ్చిందన్నారు. సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మనదేశాన్ని సాంప్రదాయ కళలు, సంస్కృతులే అత్యున్నత స్థాయిలో ఉంచాయన్నారు. కళలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తోందని.. అందుకే అన్ని అకాడమీలకు చైర్మన్లు, చైర్ పర్సన్ లను నియమించిందన్నారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుంచి చావు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కళ కల కోసం కాదని ప్రజల కోసమని తెలిపారు. గుర్తింపు కార్డులు అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో కళాకారులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా కళాకారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, రాయితీలు అందించేందుకు మంత్రి రోజా అహర్నిశలు కృషి చేశారన్నారు. సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి మాట్లాడుతూ.. స్వతహాగా వైద్యురాలు అయిన తనకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి, ప్రేమ, తగ్గింపు స్వభావం వంటి సుగుణాలు కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ.. చిత్ర కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేయాలని ఆకాంక్షించారు. కళాకారుల సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారులంతా అండగా నిలబడాలన్నారు. కార్యక్రమ అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన 4వేల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేలకుపైగా కళాకారుల ప్రదర్శనలు!
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకుపైగా కళాకారులు పాల్గొననున్నారు. రామకథా పార్కులో నేటి నుంచి రామకథ ప్రారంభం కానుంది. నేటి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నారు. రామోత్సవ్లో 35 వేల మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోయారు. త్వరలో అహ్మదాబాద్లో జరిగే కైట్ ఫెస్టివల్లో కూడా రామనామం వినిపించనుంది. రాముని చిత్రాలతో కూడిన గాలిపటాలు తయారు చేసి, ఆకాశంలో ఎగురవేస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి -
వెలుగులు చిమ్మిన నందులు
‘కళలు ఉన్నంతకాలం నా గుండెను వేదిక చేస్తా కళాకారుణ్ణి బతికిస్తా...’ ఇది ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కళాకారులకు ఇచ్చిన భరోసా. డిసెంబర్ 23 నుంచి 29 వరకు గుంటూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ 2022 వ సంవత్సర ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండీ వందల సంఖ్యలో కళాకారులు ఏడురోజులూ ఉత్సాహంగా వీటిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ’ ఆధ్వర్యంలో స్వర్గీయ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణం (శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం – ఎ.సి.) ఇందుకు వేదికైంది. ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పర్యవేక్షణలో విజయ కుమార్ రెడ్డి, శేషశాయి ఇత్యాది ఉన్నతాధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్ల పట్ల కళాకారులు సంతుష్టి వ్యక్తం చేశారు. కళాకారులకు, అతిథులకు, ప్రదర్శన లకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాల్లో ఈ ఉత్సవాలకూ గతంలో జరిగిన ఉత్సవాలకూ హస్తిమశకాంతరం ఉందనీ, ఇంత ఘనంగా, ఎంతో పారదర్శకంగా... మరీ ముఖ్యంగా టైమ్ ప్రకారం – గతంలో ఎన్నడూ జరగ లేదని పలువురు కళాకారులు అన్నారు. ఆర్టిస్టులకు, అతిథులకు స్టార్ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు. అల్పాహార, భోజన సదుపాయం పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం విశేషం. రెండు మూడు తరగతులు చదువుతున్న బుడతల నుండి... జీవితాన్ని కాచి వడపోసిన... డెబ్భైలు దాటిన సీనియర్ మోస్ట్ కళాకారుల వరకూ పాల్గొనడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ‘2022 నంది నాటక ఉత్సవా’లను ఇప్పుడు నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 115 ఎంట్రీలు రాగా ప్రాథమిక పరిశీలన అనంతరం– పద్య నాటకాలు 10 (ప్రదర్శన పారితోషికం రూ. 50 వేలు), సాంఘిక నాటకాలు 6 (రూ. 40 వేలు); సాంఘిక నాటికలు 12 (రూ. 25 వేలు); బాలల విభాగంలో 5 (రూ. 25 వేలు); కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థుల విభాగంలో 5 (రూ. 25 వేలు) మొత్తం 38 నాటక, నాటికలను ప్రద ర్శించారు. మొత్తం 72 బహుమతుల కోసం దాదాపు పన్నెండొందల మంది కళాకారులు హోరాహోరీ తల పడ్డారు. పద్య నాటక విభాగంలో మాధవవర్మ – విజయవాడ (ప్రథమ రూ. 80 వేలు, బంగారు నంది), శ్రీకాంత కృష్ణమాచార్య – విశాఖ (ద్వితీయ రూ. 60 వేలు, రజిత నంది); వసంతరాజీయం – హైదరాబాద్ (తృతీయ రూ. 40 వేలు, కాంస్య నంది) విజేతలుగా నిలిచాయి. అలాగే.. సాంఘిక నాటకాల విభాగంలో ఇంద్ర ప్రస్థం – గుంటూరు (రూ 70 వేల నగదు, బంగారు నంది), ఇంపోస్టర్స్ – హైదరాబాద్ (రూ. 50 వేల నగదు, రజత నంది); కలనేత – హైదరాబాద్ (రూ. 30 వేల నగదు, కాంస్య నంది); సాంఘిక నాటికల విభా గంలో అస్తికలు – పెదకాకాని (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కమనీయం – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), చీకటిపువ్వు – కరీంనగర్ (రూ. 20 వేల నగదు, కాంస్య నంది); బాలల విభాగంలో ప్రపంచతంత్రం – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), బాధ్యత – రాప్తాడు (రూ. 30 వేల నగదు, రజత నంది), మూడు ప్రశ్నలు – విజయవాడ (రూ. 20 వేల నగదు, రజత నంది); యువజన విభాగంలో ఇంకానా..? – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కపిరాజు – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), ఉద్ధంసింగ్ – తిరుపతి (రూ. 20 వేల నగదు, కాంస్య నంది) బహుమతులను గెలుచుకున్నాయి. నాటకరంగంపై రచనల్లో ‘రాయలసీమ నాటక రంగ వికాసం’ (రచయిత డా. మూల మల్లికార్జునరెడ్డి) ఉత్తమ రచనగా ఎంపికైంది. ‘ఎన్టీఆర్ స్మారక రంగస్థల పురస్కారా’న్ని డా. మీగడ రామలింగస్వామి – విశాఖకు (రూ. 1.5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక), ‘వైఎస్సార్ స్మారక రంగస్థల అవార్డ్’ను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్–కాకినాడ (రూ. 5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక)ను అందించారు. దర్శకత్వం, రచన సహా పలు అంశాల్లో వ్యక్తిగత అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. వ్యక్తిగత బహుమతుల నగదు మొత్తాన్ని ఐదురెట్లు పెంచుతున్నట్లు చైర్మన్ పోసాని ప్రకటించడంతో కళా కారుల ఆనందానికి అవధుల్లేవు. మైక్, లైటింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడం ఉత్సవాల విజయానికి దోహదపడింది. పక్కా ప్రణాళికతో... ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ సమీక్షలతో మొత్తం కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారంటూ పోసాని టీమును ఆర్టిస్టులు, అతిథులు మనఃపూర్వకంగా అభినందించడం ఈసారి ’నంది’ పండగ హైలైట్. – జి.వి. రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
ప్రఖ్యాత కవి ఇమ్రోజ్ కన్నుమూత
ముంబై: ఇమ్రోజ్గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ కవి, కళాకారుడు ఇందర్ జీత్(97) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. వయో సంబంధ రుగ్మతలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఇమ్రోజ్, రచయిత్రి అమృతా ప్రీతమ్ మధ్య నాలుగు దశాబ్దాల బంధం ఉంది. ముంబైలోని కాండివిలిలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు అమృతా ప్రీతమ్ కోడలు అల్కా క్వాట్రా చెప్పారు. ఇమ్రోజ్ చితికి ప్రీతమ్ మనవరాలు నిప్పంటించారు. 1926లో పంజాబ్లోని ల్యాల్పూర్లో ఇమ్రోజ్ జన్మించారు. పంజాబీలో రచయిత్రిగా మంచి పేరున్న అమృతా ప్రీతమ్తో 1950ల నుంచి ఆయన అనుబంధం కొనసాగింది. దాదాపు 40 ఏళ్లపాటు కలిసే ఉన్నారు. 2005లో అమృతా ప్రీతమ్ చనిపోయారు. ప్రీతమ్ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఇమ్రోజ్ కవితలు రాయడం ప్రారంభించారు. అమృతా ప్రీతమ్ చనిపోయాక కూడా కవితా వ్యాసంగం కొనసాగించి, ఆమెకు అంకితం చేశారు. -
నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు
యూపీలోని అయోధ్యలో నిర్మితమవుతున్న నూతన రామాలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రామలీల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో సినిమా ఆర్టిస్టులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. అలాగే పాకిస్తాన్తో సహా 14 దేశాలకు చెందిన కళాకారులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారు. రాముని కథను సజీవంగా ప్రదర్శించేందుకు వీరంతా ఇప్పటి నుంచే సాధన చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి జనవరిలో అత్యంత వైభవంగా రామలీలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా రామలీల కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజున జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 జనవరి 17 నుంచి 22 వరకు సరయూ తీరంలో ఉన్న రామకథా పార్క్లో రామలీలను ప్రదర్శించనున్నారు. రాబోయే జనవరిలో జరిగే రామలీలలో తొలిసారిగా సినీ కళాకారులతో పాటు విదేశీ కళాకారులు కూడా కనిపించనున్నారని రామలీల కమిటీ చైర్మన్ సుభాష్ మాలిక్ తెలిపారు. రష్యా, మలేషియా, అమెరికా, లండన్, దుబాయ్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా, థాయ్లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన కళాకారులు అయోధ్యలో జరిగే రామలీలలో కనిపించనున్నారని పేర్కొన్నారు. అనేక దేశాల కళాకారులు, సినీ కళాకారులతో సంయుక్తంగా రామలీలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. అది కూడా శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది. రామ్లీల కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ప్రారంభిస్తారని కమిటీ ప్రధాన కార్యదర్శి శుభమ్ మాలిక్ తెలిపారు. కాగా ఈ ఏడాది దసరా సందర్భంగా జరిగిన రామలీల కార్యక్రమాన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో 32 కోట్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ కన్నుమూత! -
విశ్వకవి జీవితంతో స్ఫూర్తి పొందిన జపాన్ కళాకారిణి..!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎంత చెప్పిన తక్కువ. ఆయన ఎందరికో స్ఫూర్తి. ఆయన సాహిత్య రచనలు, సిద్ధాంతాలు ఎందరినో కదిలించాయి. కానీ ఓ జపాన్ కళాకారిణి మన రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచనలకు ఫిదా అయ్యానని చెబుతోంది. పైగా ఆ కవి తన స్ఫూర్తి అని చెబుతోంది. ఓ విదేశీయురాలు మన విశ్వకవిని ఆరాధిస్తున్నాడంటే..ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలై సంఘటన. ఇంతకీ అతను ఎవరంటే.. కోల్కతాలోని జపాన్ కాన్సులేట్ ఒక సిటీ క్లబ్లో సంగీత వేడుకను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ఓ జపాన్ కళాకారిణి విశ్వకవి గురించి ఎంతగొప్పగానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగాల్ కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచన, సిద్ధాంతాలు తనను కదిలించాయని చెబుతోంది జపనీస్ కళాకారుడు పియానిస్ట్ యుకికో కుసునోకి. ఆయన ప్రేరణతోనే ఈ కార్యక్రమంలో ఎన్నో మధుర గీతాలను, ఇతర జపనీస్ ట్యూన్లను ప్లే చేశానని చెప్పింది. తన ఆదర్శాలు, ఆలోచనలు ఠాగూర్ తో మమేకమయ్యాయనని ఆనందంగా చెబుతోంది. ఇటీవలే ఠాగూర్ నివాసమైన శాంతినికేతన్ని సందర్శించినట్లు వివరించింది. అక్కడ ప్రజలను కలుసుకుని సంగీత ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషం అనిపించిందని చెబుతుంది. తనకెప్పటీ నుంచో శాంతినికేతన్ని చూడాలన్నేదే చిరాల కోరిక అని అది ఇప్పటికీ నెరవేరిందని సంతోషంగా చెప్పింది. నిజానికి సంగీతం అనేది హద్దులు లేనిది. దీంతో మానవజాతి మధ్య శాంతి సామరస్యలను, ప్రేమ వంటి వాటిని పెంపొందించొచ్చు. అంతేగాదు తాను 2022లో భారత్ సందర్శనానికి వచ్చినప్పుడే ఠాగూర్కి సంబంధించిన మెలోడి సంగీతాన్ని కనుగొన్నానని దానిని తాను ఎంతో కష్టబడి యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. (చదవండి: 56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు!ఏకంగా 23 సార్లు..) -
వెక్కిరింతలతో ఆత్మహత్య.. అనుపమ, చిన్మయి భావోద్వేగం!
పొగడ్త పన్నీరు వంటిది.. వాసన చూసి వదిలేయాలి అంటుంటారు. విమర్శ కూడా అంతే.. వినీవినపడనట్లు వదిలేయాలే కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవకూడదు. కానీ ఇక్కడ చెప్పుకునే మేకప్ ఆర్టిస్ట్ ప్రన్షు విమర్శలను తట్టుకోలేకపోయాడు. ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్లకే ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 'నా కొడుకు మేకప్ వేయడం సొంతంగా నేర్చుకున్నాడు. అతడిని చూసి నేను గర్వపడ్డాను. 12వ తరగతి పూర్తయ్యాక వాడిని ముంబైకి పంపిద్దామని ఇప్పటినుంచే డబ్బులు కూడా దాచిపెడుతున్నాను. 2019లో నేను విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ప్రన్షుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను. గతేడాది నుంచి వింతగా గతేడాది నా కొడుకు వింతగా ప్రవర్తించాడు. అమ్మా.. నేను అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి ఆకర్షణకు లోనవుతున్నానన్నాడు. నేను అతడిని తప్పుపట్టలేదు. తను మేకప్ వేసుకుంటే కూడా వద్దని వారించలేదు. సింగిల్ పేరెంట్గా ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ప్రన్షు ప్రతిరోజు ఎంతో కష్టపడేవాడు. యూట్యూబ్ నుంచి మేకప్ ఎలా వేయాలని నేర్చుకున్నాడు. జేమ్స్ చార్లెస్ను చూసి స్ఫూర్తి పొందాడు. అతడిలానే ఉంటాననుకునేవాడు. ఎప్పటికైనా అతడిని కలవాలనుకునేవాడు. అదే చివరి ఫోన్ కాల్.. ప్రన్షు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్గా ఆలోచించేవాడు. ద్వేషపూరిత కామెంట్లను ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి బాగా తెలుసు. అంతెందుకు, ట్రోలింగ్ చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం. తన తండ్రిని కూడా చాలా ఏళ్ల క్రితమే బ్లాక్ చేశాడు. మళ్లీ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించలేదు. ప్రన్షు చాలా కష్టపడేతత్వం ఉన్న పిల్లాడు. తనకు ఎగ్జామ్స్ ఉండటంతో ట్యూషన్ మధ్యలో నుంచి ఇంటికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. అదే తనతో చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత నా కొడుకు నాతో మాట్లాడలేదు. ఇంత పగ, ద్వేషమా? తను ఎక్కడున్నా రత్నమే. నా పిల్లాడిని నేను కోల్పోయాను. మీ పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి. వారిని ఎలా ఉంటే అలా అంగీకరించండి అని ప్రన్షు తల్లి ఎమోషనలైంది. ఈ నోట్ను సింగర్ చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ.. భారతీయుల్లో పగ, ద్వేషం వంటివి ఎప్పటినుంచో ఉన్నాయా? లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరకడం వల్ల దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా తెలియడం లేదు అని మండిపడింది. ఈ పోస్ట్పై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ గుండె బద్ధలైందని రాసుకొచ్చింది. చీర కట్టుకుని వీడియో కాగా ప్రన్షు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని తన నివాసంలో నవంబర్ 21న ఆత్మహత్య చేసుకున్నాడు. దీపావళి పండగ సమయంలో ప్రన్షు చీర కట్టుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశాడు. దీనికి విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ ట్రోలింగ్ను తట్టుకోలేకే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎల్జీబీటీక్యూలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by 𝙋𝙧𝙖𝙣𝙨𝙝𝙪. (@glamitupwithpranshu) నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ.. -
ఇన్స్టా రీల్కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య
భోపాల్: ఇన్స్టా రీల్కు ద్వేషపూరిత కామెంట్లు రావడంతో ఓ ట్రాన్స్జెండర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జెయినిలో జరిగింది. దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోకు అసభ్యకరమైన కామెంట్లు వచ్చాయని, ఆ కారణంగానే ఆర్టిస్టు మరణించాడని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అన్నారు. ప్రన్షు(16) ఉజ్జెయినికి చెందిన ట్రాన్స్ జెండర్ సొంతంగా మేకప్ కళను నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్స్టా అకౌంట్ను కూడా నడుపుతున్నాడు. మేకప్ కళ, బ్యూటీ కంటెంట్కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే.. ఈ వీడియోకు 4,000 ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. ట్రాన్స్జెండర్ వర్గానికి రక్షణ కల్పించడంలో ఇన్స్టా యాజమాన్యం విఫలమౌతోందని అన్నాడు. View this post on Instagram A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin) ప్రన్షు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వీడియోకు వచ్చిన కామెంట్ల కారణంగానే ప్రన్షు మరణించాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు -
Surekha Vani: 46 ఏళ్ల వయసులో సురేఖా వాణి స్టన్నింగ్ పిక్స్ (ఫోటోలు)
-
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్లోని స్కూల్పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
సినీ రచయిత కన్నుమూత.. విజయ్ సేతుపతి సినిమాతో..
తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మాటల రచయిత రాశితంగదురై (53) సోమవారం ఉదయం కన్ను మూశారు. వివరాలు.. ఆండిపట్టి సమీపంలోని కధిర్ నరసింగపురానికి చెందిన రాశితంగదురై చదువు పాఠశాల దశలోనే ఆగి పోయింది. అయితే కథలు, కవితలు రాయడంపై మక్కువ చూపిస్తూ రెండు వందలకు పైగా కథలు రాశారు. అలా సినీ రంగానికి మాటల రచయితగా పరిచయమయ్యారు. నటుడు విజయ్ సేతుపతి నిర్మించిన మేర్కు తొడర్చిమలై చిత్రానికి మాటలు రాయడంతో పాటు చిన్న పాత్రను సైతం పోషించారు. ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. తరువాత తేన్ అనే చిత్రానికి సంభాషణలు అందించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు కేవీ, తాక్కల్, ఆధారం తదితర చిత్రాలకు రాశి తంగదురై మాటలను రాశారు. మరో నాలుగైదు చిత్రాలకు కమిట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య మురుగేశ్వరి, కుమారులు రాశి ప్రియన్, సుఖదేవ్ దిలీపన్ ఉన్నారు. రాశి తంగదురై మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: ఆ సినిమాలో ఛాన్స్ కోసం బికినీ ఫోటోలు పంపితే డైరెక్టర్ ఏం చేశాడంటే: కస్తూరి -
ఎన్నికలకు కళ
రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఫేస్బుక్, యూ ట్యూబ్ మొదలు ఇన్స్టాగ్రామ్ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్లో ఆయా కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. సోషల్ జమానా ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్ లెవల్ వరకు సోషల్ మీడియా ఇన్చార్జ్లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. ర్యాలీలు, సభల్లో... బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కొమ్ము కోయ.. రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు. అలరిస్తున్న గుస్సాడీ.. ఆదిలాబాద్కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంజారా నృత్యం తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. డప్పు బృందాలు ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్గ్రీన్గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి. - తాండ్ర కృష్ణ గోవింద్ -
ఇష్టమైన కళ తీరిన వేళ
పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్ ఆర్టిస్ట్గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు. సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్ వేసింది. ఆమె ఆర్ట్వర్క్స్ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్ వాన్ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు. ‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత. సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు. ‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత. బెంగళూరు నుంచి సింగపూర్ వరకు సునిత ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్చైర్కే పరిమితమైన వారిలో విల్పవర్ పెంపొందించేలా సోదరుడు గణేష్తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది. కాలి వేళ్లే కుంచెలై... రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్స్ చేసింది. ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్’ ఆర్ట్ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది. ‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి. ‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది. ‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్ ఆర్టిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకుంది...