-
అమ్మానాన్న బొమ్మను రక్తంతో గీసి...
యాక్రలిక్, ఆబ్స్ట్రాక్ట్, పాప్ ఆర్ట్, పెయింటర్లీ, వాటర్ కలర్, ఆయిల్ పెయింట్, పేస్టల్స్ కాదేదీ పెయింటింగ్కు అనర్హం అన్నట్లు... విచిత్రంగా రక్తంతో బొమ్మలు గీసి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. నగరానికి చెందిన అనిల్ కుమార్. కొందరు కాన్వాస్పై యాక్రిలిక్తో అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తే మరికొందరు మట్టిముద్దలతో శిల్పాలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఈ క్రియేటివిటీ మరింత పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో వైవిధ్యమైన రీతిలో కళాకారులు మ్యాజిక్ చేస్తున్నారు. నగరానికి చెందిన యువ చిత్రకారుడు అనిల్ కుమార్ దీని కోసం బ్లడ్ను ఉపయోగిస్తూ... ‘రక్త’ సంబంధాలను సరికొత్తగా పునర్నిర్వచిస్తున్నాడు. అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. బ్లడ్ ఆర్ట్ అనే పదం వినడానికి ప్రత్యేకంగా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ‘బ్లడ్ పెయింటింగ్ భావోద్వేగాలను పంచుకునేందుకు సాటిలేని మార్గం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ప్రేమికులు...తమ మధ్య ఉన్న బలమైన సంబంధాలను తెలియజెప్పేందుకు ఓ శక్తివంతమైన సాధనమని’ అనిల్ అంటున్నాడు. దైవకృపతో అబ్బిన కళ... దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అనిల్ కుమార్కు ఎటువంటి చదువు, సాధన లేకుండా చిత్రకళ అబ్బింది...అతని కళాత్మక ప్రయాణం 2019లో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం హాబీ..అలా అలా పోట్రెయిట్స్ గీయడం అలవాటైంది. బీటెక్ పూర్తి చేసినా ఏదో ఒక ఉద్యోగంలో ఇమడలేక పోట్రెయిట్ (పెన్సిల్ స్కెచింగ్) కళలో ప్రావీణ్యం సంపాదించాను. అప్పుడు నేను పెన్సిల్స్ (మైక్రో ఆర్ట్) మీద పేర్లు చెక్కడం ప్రారంభించాను’ అని అనిల్ చెప్పాడు. అయితే ఫేస్ డ్రాయింగ్లు మైక్రో ఆర్ట్ ద్వారా ప్రొఫెషనల్ అనిపించుకున్నప్పటికీ సరైన ఆర్డర్స్ లేక ఏదో ఒక ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమ్మాయి ‘కళ్ల’తో పుట్టిన కళ... బెంగుళూర్కు చెందిన మైక్రో ఆర్ట్ కస్టమర్ తన సోదరి కళ్లను తన రక్తంతో గీయమని అడిగారు. ‘తొలుత నేను ఒప్పుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో చేసిన ఆ వర్క్ని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. అయినా అప్పుడు కూడా బ్లడ్ ఆర్ట్ని సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మానాన్నల మ్యారేజ్ డే రోజున నా రక్తాన్ని ఉపయోగించి వారిద్దరి చిత్రాలనూ గీశాను. అది వారి మనసుకు హత్తుకోవడం మాత్రమే కాదు నా భవిష్యత్తును మార్చేసింది’ అని అనిల్ గుర్తు చేసుకున్నాడు. దేశవిదేశాల నుంచి... అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. వేలాది మంది తమ ప్రియమైన వారి బ్లడ్ పెయింటింగ్స్ కోసం నాకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. ‘దాంతో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనీసం కొన్ని వారాల పాటు సమయం తీసుకోవాల్సి వస్తోంది’ అని అనిల్ చెప్పాడు. జాగ్రత్తలు తప్పనిసరి..‘ఈ మాధ్యమాన్ని ఉపయోగించి చిత్రాలు గీసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రభావితమయ్యే మొదటి వ్యక్తి చిత్రకారుడే.. కాబట్టి.. గ్లవ్స్, మాస్క్ ధరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి’ అని అనిల్ కుమార్ స్పష్టం చేశాడు. రక్తాన్ని సేకరించడం నుంచి గోడపై కళాకృతిని అలంకరించడం వరకూ... ప్రతీది కఠినమైన పరిశుభ్రతతో జరుగుతుందని చెప్పాడు. తమకు కావాల్సిన పోట్రెయిట్ను గీయించుకోవాలనుకున్న కస్టమర్స్... అనుభవజ్ఞులైన ల్యాబ్ టెక్నీషియ సాయంతో చిన్న ట్యూబ్ ద్వారా సేకరించిన బ్లడ్ (సుమారు 3 నుంచి 4గ్రా) అనిల్కు అందిస్తారు. దానిని కనీసం వారం రోజుల వరకూ భద్రంగా నిల్వచేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పోర్ర్టెయిట్ను మాత్రమే పూర్తి చేస్తున్నానని అనిల్ చెబుతున్నాడు. కస్టమర్ తీసుకెళ్లేవరకూ దుర్వాసన లేదా తేమను గ్రహించకుండా ఆర్ట్వర్క్ను సంరక్షించడానికి ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగిస్తామన్నాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతితో వేసిన సిసలైన చిత్రకళ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఏఐ కూడా రీ క్రియేట్ చేయలేని బ్లడ్ ఆర్ట్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది’ అంటున్నాడు అనిల్. -
నేటి నుంచి ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్..
గచ్చిబౌలి: మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజులపాటు ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు రూపొందించిన ఫొటోలను ప్రదర్శిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఆదివారం వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కార్యదర్శి శృతిఓజా, సాంస్కృతిక, భాషాశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఇంటరీ్మడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఆర్జేడీ బి జయప్రదబాయి, ఎస్ఐవీఈ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ జ్యోష్ణారాణి పాల్గొంటారు. 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
గీసుకునే బొమ్మలివి! ఇదే నా ప్రేయసి, ఆస్తి..!
వెన్నెల ఎందుకు కాస్తుంది? కృష్ణశాస్త్రి పొయెట్రీ ఎందుకు రాస్తాడు? ముళ్ళపూడి అప్పారావు ఎందుకని అప్పులు చేస్తాడు? డబ్బులు రాలవని తెలిసినా మా నూనెపల్లె జెండాచెట్టు కింద కూచుని గుడ్డి మగ్బుల్ ‘బహారో ఫూల్ బర్సావో…’ అని నవ్వుతూ పాటను తగులుకుంటూ ఉండేవాడెందుకు? ఏమో! ఎవడికి తెలుసో నాకేం తెలుసు? కానీ ఇలా అకారణంగా నేనెందుకు స్కెచింగ్ చేస్తానో నాకు మాత్రం తెలీదు. ఏం వస్తుంది ఇలా గీస్తే? ఏం తెస్తాయి ఈ స్కెచ్లు? పుస్తకాలు పుస్తకాలుగా నిలువుగా పెరుగుతూ పోతే? ఎప్పటికీ చేతరాని బొమ్మల గురించి వ్రాయరాని మాటలు ఇలా అల్లుకుంటూ పోతే? ఏం తెలీదు. ఈ పని ఒక్క మనసుకు ఇష్టమని తెలియడం తప్ప. జీవితం అంతం వరకు ఇలా గీతలపై గీతలు అకారణంగా గీసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఆకలేసినపుడు కాసింత అన్నం చాలు. చెవులకు కొంచెం సంగీతం చాలు, పుస్తకాల గూళ్ళో ఏరి దాచుకున్న కాసిని పుస్తకాలు చాలు. ఇంకేం, ఇంతకన్నా మరింకేం గీతల వెంట సాగడానికి? జీవితాన్ని ఇలా కొద్దికొద్దితో నింపుకుని భద్రంగా అపురూపంగా రేఖల్ని, రంగుల్ని ఏరుకుని మరీ ‘నేనొక పుష్పాన్ని, నీ కోమల పాదాలతాగ్రాల పూచిన పుష్పాన్ని నేనని, తొట్టతొలి రుషులు అగ్నికీలల్లో మంత్రగ్రామాలు దర్శించినట్లు నీ కౌగిట్లో ప్రేమ జ్యోతిని చూసినట్లు, నీ వలలో చిక్కిన శబలవర్ణసంచాలిత శఫరి నేనేనని…’ గీసుకునే బొమ్మలివి. వట్టి గాలి వేళ్ళు సుడులు సుడులుగా శూన్యంలో తిప్పి వేసిన వందల వేల బొమ్మలు జేబులో దాచుకోలేక ఆ ఊహలన్నిటిని గాలిపటం కట్టి ఆ మఖ్మల్ దారం వెంటపడి సాగిన స్కెచ్ల లేఖలివి.ఫైనల్ డ్రాయింగ్ పెళ్ళాం వంటిది. బొమ్మ పూర్తికాగానే మోహం నశిస్తుంది. మాయ ఆవిరవుతుంది. ఈ నా గీసుకునే స్కెచ్లన్నీ దరిచేరని నా ప్రేయసికి వ్రాసుకునే ప్రేమ లేఖలే! ఎందాకా ఎందాకా ఎగిరేవంటూ తన వెంట అనంతకాలం తరమనిస్తుంది. మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి, నా నాస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహారం కథ ఇది. తాళం చెవి పుట్టని, కనిపెట్టని నా బొమ్మల ప్రపంచపు తలుపు తెరుచుకోడానికి నేను దొంగిలించి తెచ్చిన జవరాలి పక్క పిన్ను కథ ఇది. ఓపిక ఉంటే వినండి. ఎందుకు స్కెచింగ్ అంటే, అక్షరమాలలో ముందు ‘అ’ నేర్చుకుంటాం కదా! కొంత తరువాత ‘మ’ కూడా నేర్చుకుంటాం. ఇంకా వత్తులు, దీర్ఘాలు గట్రా గట్రా… ఆ పై ‘అ’ పక్కన ‘మ’ వ్రాసి ‘మ’కు ‘మ’ వత్తు ఇచ్చి ‘అమ్మ’ అని నేర్చుకున్నదాన్ని ఏం చేస్తాం? అమ్మ వస్తుంది, అమ్మ పోతుంది, అమ్మ కూచుంటుంది, అమ్మ తల దువ్వుకుంటుంది, అమ్మ చదువుకుంటుంది, అమ్మ నాన్నకు ప్రయివేట్ చెబుతుంది… ఇట్లా బోలెడు మాటలు అక్షరాల్లో నేర్చుకుని వ్రాసినంత అంతే ఇదిగా బొమ్మల్లో కూడా గీతల అమ్మ ఈ పనులన్నీ చేస్తుంది. కాదు… చచ్చినట్లు మీరు చేయించాలి. ఊరికే మాటలు చెప్పినట్లు పుట్టుకతోపాటు బొమ్మలు తెచ్చుకోడం, దేవుడు ప్రత్యేక శ్రద్దతో మన మునివేళ్ళని తీర్చిదిద్దడం, భూమ్మీదకు పంపడం అంతా హంబక్, వట్టి సొల్లు మాటలు, పంచదార పూతల కవిత్వపు కబుర్లు. నిజానికి సత్యం అనునది సత్యప్రమాణకంగా ఏవిటంటే, చచ్చేదాకా 24 ఇంటూ 7 బై 365 అనే కాలమానంలో ఇలలో కలలో స్కెచింగ్ చేస్తూనే ఉండాలి. బొమ్మని రకరకాలుగా ఊహల్లో చిలుకుతూనే ఉండాలి. ఆర్టిస్ట్గా పుట్టడం ఈజీ, అది డిఫాల్ట్. కానీ క్రాఫ్ట్మన్ కావడం కఠినాతి కష్టం. ఆర్టిస్ట్గా ప్రపంచాన్ని నమ్మించడం పరమ ఈజీ. దునియా మూర్ఖపుది, అది దేన్నయినా నమ్మేస్తుంది. బట్ ఆర్టిస్ట్గా సిసలు క్రాఫ్ట్మన్గా నిన్ను నువ్వు ఒప్పించుకోడం కుదరని కార్యం, అది అందని ఎత్తు. ఆ విషయం ఎరిగి సాధన చేయడమే నువ్వు కనీసం ఎక్కగలిగిన ఎత్తు. ‘టు హూమ్ ఇట్ మే కన్సర్న్’ వోలె ఎవరికి వారికి వారి స్కెచింగ్ అర్థం ఏమైనా కాని, కానీ నేనదేవిటంటే స్కెచింగ్ అంటే గీస్తూనే వుండు అని అర్థం. గీతని ముచ్చటపడమని కూడా ఒక అర్థం. కదులుతున్న పిల్లి తోకపై ముచ్చటపడ్డం ఆరంభించి దాని మీసాల దాకా గీత గీసి చటుక్కున ఆపడం ఒక ముచ్చట. యూఅన్ అగ్లో (Euan Uglow) పెయింటింగ్ పనితనంపై మనసు పారేసుకుని ముని వేళ్ళతో కుంచెని తడిగా సాపుచేసి సుతారంగా అతనిలా రంగుని అద్దడానికి ప్రయత్నం చెయ్యడం ఒక ముచ్చట అన్నమాట. ఆర్టిస్ట్ మిన్యోలా (Mike Mignola)లాగా పలకలు పలకలుగా నల్ల రంగుని పులిమేసి హెల్బాయ్ అనే ఒక కామికి క్యారెక్టర్ పెదవి చివర, ఓవర్ కోటు అంచున చిన్న ఎరుపుని మరకలా అంటించడం కూడా అచ్చం ముచ్చటే. చూపుడు వేలు చివరని గుండ్రంగా గులాబి గోరు గీసేసి ఆ పై చిన్న స్కిన్ ముద్దని సున్నితంగా బాపు గీసినట్టు గీయాలని చూడటం అదో ముచ్చట; వేలి ముద్రల, కాగితపు అచ్చుల, ఎండుటాకుల ముద్రలని భద్రంగా కాగితంపైకి తర్జుమా చెయ్యడం కూడా బత్తాల్యా వోలె (Dino Battaglia) ఒక ముచ్చటే. ఇదంతా స్రష్టల వారి వారి పనితనంపై నా వంటి బుడత బుడిబుడి అడుగుల మర్యాద ముచ్చట. స్కెచింగ్ అంటే నాకు బొమ్మ నుంచి బొమ్మ కాపీ చెయ్యడం. (అనగా, నచ్చిన బొమ్మ ఏదైనా దాన్ని చూసి అలాగే గీసెయ్యడం అన్నమాట.) పత్రికల్లో అచ్చయిన ఫోటోలని రేఖాచిత్రాలుగా, రంగు నకళ్ళుగా గీసుకోడం. అలా బయటికి వెళ్ళి కదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, సభల్లో కవి కవిత్వ పఠనం వినలేక చచ్చినట్లు వినే పాపం వాళ్ళు, ఫేస్బుక్లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఔఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్ల మధ్య తేడా, ఇదీ అదని కాదు, సమస్తాన్ని చూస్తూనే ఉంటూ బుర్రలోని బోల్దంత ఖాళీని, స్కెచ్బుక్ లోని పేజీల ఖాళీని వీలయినంత నింపుతూనే ఉండాలి. ఇదంతా స్కెచింగే. ఇక్కడ ప్రస్తావించిన ఏ విషయం కూడా నేను ఇతరులనుండి విన్నది కాదు, చదివినదీ కాదు; నాకు నేనుగా తెలుసుకున్నవివన్నీనూ. ఇన్నేళ్ళ బొమ్మల జీవితంలో ప్రత్యక్షంగా ఏ గురువూ తగిలింది లేదు, తట్టింది లేదు. ఇదిగో ఇదే దారీ అదే చెట్టు అక్కడే పిట్ట అని గురి చూపించిందీ లేదు. నాకు నేను గురువునై శిష్యుడనై నేర్చుకున్న చాలా చిన్నచిన్న పాఠాలు ఇవన్నీ. మొన్నటికి మొన్న కూడా అత్యంత మొదటిసారిగా ‘ఇది ఇలా కదా’ అని తట్టినపుడు అమితాశ్చర్యంతో ‘అరే అవును కదా’ అనుకోవడం. మనం మళ్ళీ మళ్ళీ ఎంత ఫూలిష్ అని తెలుసుకోడం. ఇవన్నీ పాఠాలే. ఇక్కడే కొన్ని బొమ్మలు భోజనం చేస్తున్న వారివి. గుర్తులేదు దేనికని వేసుకున్న స్కెచ్లో ఇవి. భోజనం అంటే ఏవుంది, ఒకణ్ణి కూచోబెట్టి వాడి ముందు కంచంతో సహా రకరకాల గిన్నెలుగా వడ్డించడం, అంతే కదా! పరమ మెకానికల్గా గీసుకున్న స్కెచ్లు. బుర్ర ఏమాత్రం వాడకుండా వేసుకెళ్ళిన బొమ్మలు. అలా వేస్తూ ఉండగా మధ్యలో తట్టింది! “ఏవిరా ఫూలిష్ ఫెలో! మనిషి కుడి చేత్తో అన్నం తింటున్నాడు. నువ్వు వాడి ముందు పెట్టిన నీళ్ల గ్లాసు కుడి చేతి వైపే వుంది. గిన్నెలు, గరిటలు అన్నీ కుడి చేయి వైపే పెడితే వాడు ఆ ఎంగిలి చెయ్యే ఉపయోగించి, ఎంగిలి చేత్తో పనులన్నీ చేసుకోవాలా!” అనుకున్నా. అరే, ఎంత బుద్దితక్కువ బొమ్మలు! ఆ పక్కనే పచ్చ చొక్కావాడు పద్దతిగా తింటున్నాడు. వాడు కూచున్న తీరు, పళ్ళెం, చెంబూ అన్నీ గ్రామర్ని అనుసరించి ఉన్నాయ్. ఇక్కడ ఇది ఓ మంచి పాఠం. ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ నేను ఎక్కడో ఫోటోగ్రాఫ్ చూసి వేసుకున్నది, స్వంతంగా గీసినది కాదు. మన మూలాలు మన బొమ్మల్ని డిసైడ్ చేస్తాయి. అదెలా అనడుగుతే, నేను ముసల్మానుల ఇంట పుట్టి పెరిగిన వాణ్ణి. నేను మసలిన వాతావరణంలో పీట వేసుకుని భోజనం చేసే సంప్రదాయం లేదు కాబట్టి, నాకు స్పృహ కలిగి ఎన్నడూ నా బొమ్మల్లో పీట తేను. ఇంకోటి మానసికమైనది. నాకు మొహమాటం చాలఎక్కువ. కొన్ని చెడ్డ అనుభవాల వలన జనానికి అనునిత్యం స్పృహలో ఉండే స్థాయీభేదం వల్ల ఎవరి ఇంటికి వెళ్ళినా భోజనం చెయ్యను. అత్యంత బలవంతం మీద వెళ్ళినా అక్కడి తిండి తినాల్సి వచ్చినా ప్రాణం పోతున్నంత గాభరాగా నిముషాల్లో విషయం ముగించి ప్రాణవాయువు కొరకు బయటపడతాను. ఈ గందరగోళంలో అక్కడ ఆ వాతావరణం, ఆ కప్పులు, స్పూన్లు, చెంబులు, లోటాలు, డైనింగ్ టేబుల్, నాప్కిన్ గుడ్డలు గమనించేదెక్కడా? నిజానికి ఇది ఒక ఆర్టిస్ట్గా నా పెద్ద లోపం. మనం ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వేషన్ అనే స్కెచింగ్ చెయ్యాలి. అందుకని ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ టెక్నికల్గా కరెక్ట్. కానీ ఆ పీట, ఆ చెంబు, ఆ మనిషి నావాడు కాదు. ఇంత చెబుతున్నందుకైనా నా పాఠం నేనే నేర్చుకుంటూ విషయాన్ని గ్రహించుకునే సామర్ధ్యం పెంచుకోవాలి, శక్తి ఏర్పరుచుకోవాలి. మరోటి, నెలలు నిండిన గర్భిణి స్త్రీ బొమ్మ వేయబోతాం. గట్టిగా గమనిస్తే ఆయమ్మ బ్రస్ట్ లైన్, కడుపు ఆ సమయంలో దాదాపూ వేరు వేరుగా ఉండవు. ఛాతీదాక దిగిన గీత సుతారంగా మర్యాదగా చాలా చిన్న జర్క్ ఇచ్చి పెద్ద కడుపు ఆర్క్ అల్లా దిగాలి. కానీ చాలామంది ఆ పెద్ద నిండు వక్షోజాలు వేరుగా, కడుపు వేరుగా అలా వేసేస్తారు. ఎప్పుడైనా చొక్కా లేని బ్రాహ్మణుల బొమ్మ గీయాలంటే నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే, జంధ్యం ఏ వైపునుండి ఏ వైపుకు వేసుకుంటారబ్బా అని. ఇలా రకరకాల డిటైళ్ళ గురించి ఆలోచించుకోవాలి. సిగరెట్ ముట్టించుకున్నవాడు తదనంతరం అగ్గిపుల్లని గాల్లో ఆర్పేసి ఎలా చెయ్యిని మెలితిప్పి విసిరి పడేస్తాడో అలాంటి వాళ్ళని ఊహించుకుని స్కెచ్లు గీసుకుని మన బంధుమిత్రసపరివారంలో ఎవరైనా పనీపాటా లేకుండా దొరికినపుడు అలాంటి అగ్గిపుల్ల పడేసే యాక్షన్ వాడితో చేయించి, దాన్ని మనం గీసుకున్న ఊహాచిత్రాల పక్కని గీసుకుని తేడా చూసుకోవాలి ఇక్కడో గులాబీ చొక్కా వాడు వున్నాడు, ఊరికే పని వున్నా లేకపోయినా ఒక క్యారెక్టర్ని అనుకునో, చదివో, ఊహించో వాడిని రకరకాలుగా వేయ ప్రయత్నించండి. ఆ పక్కనే కప్పు కాఫీనో ఉగ్గెడు పెగ్గో పుచ్చుకునేవాణ్ణి కూడా గీయండి. బొమ్మ అంటే అన్నిసార్లు తలనుంచి కాళ్ళదాక గీయనక్కరలేదు. ఆ మొహం, ఆ చేతులు, వాడి మూడ్ చూపించగలిగితే చాలు- అదే మజా ఇస్తుంది కొన్నిసార్లు. ఆ తరువాత ఆ పైన కార్నర్లో చిన్న మురిపమైన ముద్దు బొమ్మ, ఈ కింద ఒక నాగుపాము బుసలవంటి కురుల అందం. తొలినాళ్ళల్లో ఈ శ్రమ అంతా తెగ శ్రమ అనిపిస్తుంది. కానీ అలా వేసి వేసి మీరు మరిచిపోయిన ఈ బొమ్మలు అకస్మాత్తుగా ఓ రోజు మీ కంటపడి ఒక వెర్రి ఆనందం అవుతుంది. శ్రమైకజీవనసౌందర్యం అనేది రంపపు మిల్లులో రిక్షా చక్రంలోనే కాదు, అరిగిన పెన్సిల్ ములుకులో కూడా వుంటుంది. ఎటొచ్చీ ఈ అందం శ్రీశ్రీతో సహా ఎవరికీ అందనిది, మీకు మాత్రమే ఎరుకైనది. అందుకు కంగ్రాట్స్! ఇక్కడ పక్కకు ఒత్తిగిలించి పడుకున్న ముసలివాడి బొమ్మ మళ్ళీ మళ్ళీ వేసుకున్నది, అలా సాధన చేసుకున్నది. అయితే మళ్ళీ మళ్ళీ అదే బొమ్మని సాధన చెయ్యడం మా చెడ్డ బోరింగ్ కావచ్చు. కానీ ఒకదాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే దాన్ని ఆధారం చేసుకునే మిగతా అంతా కథ నడుస్తుంది. రెండు రెక్కలు, ఒక ముక్కు, కాసింత కడుపు, బారచాచిన కాళ్ళు ఇంత ఆకాశం చాలు. కాకి, చిలుక, కంజు, పిట్ట అంతా ఒకే సూత్రం. పిల్లి బొమ్మ వచ్చినవాడికి పులి కూడా తెలుస్తుంది. లెజెండ్ బ్రూస్ లీ ఇలా అన్నాడు: “నేను పదివేల కరాటే విన్యాసాల్ని సాధన చేసినవాడిని లెక్కచెయ్యను కానీ ఒకే విన్యాసాన్ని పదివేలసార్లు సాధన చేసిన వాడంటే భయభక్తులు చూపిస్తాను.” ఎంత గొప్ప సూత్రం! అయితే అన్నిసార్లు వద్దు కానీ ఒక బొమ్మని పదిసార్లో ముప్ఫై సార్లో గీద్దాం రండి. మరి ఇంకా బొమ్మలు వేసేవాళ్ళు ముఖ్యంగా ఏం చెయ్యాలంటే, మానవుడి వెన్నెముకకు ఫెవికాల్, గంజి కలిపి పెట్టి ఇస్త్రీ చేయించినట్లు వాడిని నీలిగినట్లు వేయకండి. మీ బొమ్మల్లో కొద్దిగా యాక్షన్ జోడించండి. నటుడు అమోల్ పలేకర్ తెలుసుగా, తను తన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జ్ఞాపకాలు చెబుతూ ఇట్లా అంటాడు: “నేను నటుడిగా శిక్షణ పొందిన సమయంలో హావభావాలు ఎలా పలికించాలో, డైలాగ్ని ఏ ఏ సంధర్భాల్లో ఎట్లా చెప్పాలో, నవరసాలు ఎట్లా ఒలికించాలో అన్నీ శుభ్రంగా చేసేవాణ్ణి. కానీ నా ఈ రెండు చేతులు వున్నాయే, వాటిని మాత్రం ఏంచెయ్యాలో నాకు అర్థంకాలేదు. చేతులు ఖాళీగా ఉన్నాయి కదాని తెగ ఊపుతూ మాట్లాళ్ళేను, అండర్ ప్లే అనేది ఒకటి ఉంటుంది కదా! అప్పుడు నేనేం చేశానంటే నా చేతులకు పెన్నునో, పెన్సిల్నో, సిగరెట్నో ఆ సన్నివేశానికి తగినట్లు అలవాటు చేశాను. ఇక అంతే, నా సమస్య తీరిపోయింది. రెండు చేతులు పెన్నుతో ఆడుతూ తన పని చేస్తుంటే మిగతా శరీరంతో నా నటన నేను కానిచ్చాను.” ఈ చిన్న ఎక్సర్సైజ్ తెలీక ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. నటుడు కాలేదు. మీ బొమ్మ సూపర్ స్టార్ కావడానికి మీరు పెద్ద కష్టపడనక్కరలేదు. ఆల్రెడీ తెలుగులో బొమ్మలు వేసేవారు చాలా మంది సూపర్ స్టార్లే. అయితే మీ బొమ్మని నటుడిగా మలచడానికి మాత్రం మీరు తెగ కష్టపడక తప్పదు. ఆ సదరు బొమ్మ వాడిని ఊరికే నిలబెట్టకండి, వాడికో బొమ్మల చొక్కా తొడగండి, చేతిలో సిగరెట్ అంటించండి, భుజాన సంచో ఫ్లాస్కో తగిలించండి, నెత్తి మీద మూట ఎక్కించండి, ఆ బరువుకు తగిన నడక అలవాటు చెయ్యండి, ఆ పై వాడిని ఒక పరుగు తీయించండి… ఇదంతా సోది అంటారా? అయితే ఓకే. నో ప్రోబ్లెమ్! మామూలుగా ఎప్పటిలాగే మీ బొమ్మకి కృష్ణలాగే చంకలు గట్టిగా అంటించండి, ఏం భయం లేదు. పోలీసులు ఎన్కౌంటర్ కాదు కదా, కనీసం ఉరి కూడా వెయ్యరు. కడమకి మీ అభిమానులెవరూ మిమల్ని ఫేస్బుక్ నుంచి అన్ఫ్రెండ్ కూడా చెయ్యరు, నో వర్రీస్. లైఫ్ ఈజ్ గుడ్ పైగా ఇగ్నోరెన్స్ బ్లెస్సు కూడానూ. ఇంకా, స్కెచ్ పుస్తకాలు మూడు రకాలువి ఏ3, ఏ4, ఏ5 అని ఎప్పుడూ వెంట వుంచుకోడం మంచిదంటాడు రాన్ టైనర్ (Ron Tiner) అనే ఒక చిత్రకళా గురువు. నేను రెండు చాల్లే నాకు అనుకున్నా. ఒకటి ఏ5, ఇంకా జేబులో పట్టే పాకెట్ స్కెచ్ పుస్తకానికే పరిమితమయ్యా; అదీ కాదూ అనుకుంటే మడతలుగా పెట్టుకున్న తెల్ల కాగితం కూడా మోర్ దాన్ ఎనఫ్. నిజానికి ఓ అయిదారు సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో మంచి స్కెచ్ బుక్లు మార్కెట్లో అందుబాట్లో వుండేవి కావు. ఇప్పుడు చాలా నయం, ఆన్లైన్లో అమెజాన్లో, హైద్రాబాద్లో అయితే పంజాగుట్ట హిమాలయలో చాలా రకాల స్కెచ్ బుక్లు అందుబాటులో వున్నాయి. ఆ స్కెచ్ పుస్తకాల పక్కనే బోల్డని పెన్నులు కూడా వుంటాయి. ఒకటో రెండో పద్నాలుగో మీ పర్స్ ఓపిక మేరకు ఎన్నుకోవచ్చు. సరే ఈ సరంజామా మంచి చెడ్డలు చాలా విస్తృతంగా తరువాతెప్పుడయినా తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు. చివరగా, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువేనంటారు. ఇలా నాకు తెలిసీ తెలీని సంగతులు బోల్డన్ని ఈ కచేరీలో వెయ్యొచ్చు. కానీ దానికి కూడా ఒక ఓపికుండాలి. అదీ కాక నాకు ఈ చెవిటి ప్రపంచం మీద చాలా నమ్మకం, నేను చచ్చుకుంటూ వ్రాసే ఇదంతా వినడానికి చదవడానికి కోరి ఈ జన్మ మీరు ఎత్తలేదు. జానేభీదో యార్! సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం “ప్రియం చ న అనృతం బ్రూయాత్”ఏషా ధర్మః సనాతనః అనగా… ఈ భగవంతుని సృష్టిలో కరీనా కపూర్ బొడ్డుని మించిన మాస్టర్ పీస్ గీయబడలేదు, ఇది సత్యం. కింబర్లీ కేన్ క్లియవేజ్ని బోలిన ప్రకృతి సృష్టించబడలేదు, ఇదీనూ సత్యమే. పరనిందని మించిన పరమగాంధర్వమగు రాగం పాడబడలేదు, దీని సంగతి అతి సత్యమని కొత్తగా చెప్పనక్కరయే లేదు. శుభమ్ భూయాత్! చిట్టి సలహా: నిజానికి ఈ రాతలు చాలా కాలం క్రితం, నేను బొమ్మలు మొదలెట్టిన సమయంలో, నా ఊహకు బొమ్మలు, పుస్తకాలు అందిన సమయంలోనే ఎవరైనా ఒక మంచి చిత్రకారుడు, కాస్త నాలెడ్జ్ షేరింగ్ మీద నమ్మకం ఉన్నవాడు, ముందు తరాల బొమ్మల పిల్లలపై కరుణ, దయ ఉన్నవాడు ఎవరో అప్పుడే వ్రాసిపెట్టి ఉండాల్సింది. అవి చదుకుని అన్వర్ అనే కాసింత మంచి చిత్రకారుడు ఇప్పుడు నాకు తగిలేవాడు. అటువంటి వాడెవడూ మనకు రాసిపెట్టి ఉండలేదు కాబట్టి కనుకొలను చివరి వెచ్చని చిరు చెమ్మంత స్కెచ్ బుక్ సలహా ఏవిటంటే, నాకు మల్లే పుస్తకాన్ని ర్యాండమ్గా నింపొద్దు . సబ్జెక్ట్కు కొన్ని పేజీలు వదులుకోండి. నిలబడ్డ మనుషులంతా ఒక చోట, కుక్కలు పిల్లులు వంటి జంతుజాలం ఒక చోట, కుర్చీలు మేజాలు భోజనాల బల్ల ఇత్యాది ఒక దగ్గర, మసీదులు గుళ్ళు గోపురాలు ఒకే సైడునా… ఇది అవసరమైనప్పుడు మీ సబ్జెక్ట్ని ఎక్కువ కష్టపడి వెదుక్కునేట్టు చెయ్యదు. ఆ స్కెచ్లోంచి మీరు మీకు కావాల్సిన రిఫరెన్స్ను అనాయాసంగా పొందగలరు. ప్రస్తుతానికి ఇదింతే భశుం.--అన్వర్(చదవండి: రవి పరంజపే : చిత్రకారుల సంపద..!) -
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
హింసకు కళాత్మక ప్రతీకారం!
న్యూయార్క్లోని చౌటక్వా ఇన్స్టిట్యూషన్లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్: మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్: మెడిటే షన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు. ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. ‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’ బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ. ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్ యెన్తోబ్తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. మెక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు), బైడెన్ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్ జాన్సన్ (ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ. ఎంత సిగ్గుచేటు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
సంతకాన్ని జంతర్మంతర్ చేసినచో...
శూన్యంలో నుంచి కూడా కళను సృష్టించే నైపుణ్యం ఆర్టిస్ట్ల సొంతం. తాజా విషయానికి వస్తే... ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ తెల్లకాగితంపై చేసిన సంతకాన్ని క్షణాల్లో అందమైన చిత్రంగా మార్చాడు రాబిన్ బార్. సంతకం నుంచి అప్పటికప్పుడు ప్రేయసీప్రియులను సృష్టించిన రాబిన్ బార్ ఇలాంటి అలాంటి ఆర్టిస్ట్ కాదు...రికార్డ్ హోల్డర్ స్పీడ్ పెయింటర్. జస్ట్...కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వీడియో క్లిప్ 21 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. రాబిన్ బార్పై నెటిజనుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. -
నేడు వరల్డ్ థియేటర్ డే
పెద్దలు ఇష్టపడే కళగా గుర్తింపు పొందిన ‘నాటక కళ’పై యువత ఆసక్తి ప్రదర్శించడమే కాదు అందులో ఇష్టంగా భాగం అవుతోంది. పాశ్చాత్య నాటకాల పరిశీలన నుంచి మన నాటకాలలో ప్రయోగాల వరకు నాటకరంగంపై యువ సంతకం మెరుస్తోంది.... తిరువనంతపురంలోని ‘నిరీక్షణ ఉమెన్స్ థియేటర్’ వారి నాటకమహోత్సవానికి హాజరైన రోజు నుంచి నందినికి నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దేశ నలుమూలల నుంచి ఎనిమిది మంది మహిళా దర్శకుల నాటకాలను ఈ నాటక మహోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో మూడు స్ట్రీట్ప్లేలు కూడా ఉన్నాయి. ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళాప్రియులను ఆకట్టుకుంటున్న ‘నిరీక్షణ’ నిర్వహించే వర్క్షాప్లకు యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘నాటకాలు చూడడం తప్ప ఎప్పుడూ ఆడలేదు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిరీక్షణ నిర్వహించిన వర్క్షాప్కు హాజరైన తరువాత నటనపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మనీష. ఎంబీఏ చేస్తున్న మనీష రంగస్థల పాఠాలపై కూడా దృష్టి పెడుతోంది.నాటకరంగంపై యువతకు ఆసక్తి కలిగించడానికి భూపేష్ రాయ్, ప్రియాంక సర్కార్లు లక్నోలో నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్కు మంచి స్పందన లభించింది. ‘ఒకప్పుడు థియేటర్ ఫెస్టివల్ అంటే పెద్దవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకాలపై చర్చించుకుంటున్నారు’ అంటున్నాడు భూపేష్ రాయ్. బెంగళూరులోని ఆల్–ఉమెన్ ట్రూప్ ‘ది అడమెంట్ ఈవ్స్’ యువతలో నాటకరంగంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ట్రూప్లో సభ్యురాలైన బాలశ్రీ యూఎస్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు నాటకాలకు సంబంధించిన ఒక వర్క్షాప్కు హాజరైంది. ఇక అప్పటినుంచి నాటకరంగం ఆమెకు ఇష్టంగా మారింది. ఒకవైపు అనలిస్ట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాల్లో నటిస్తోంది. పిల్లల నుంచి యువతకు వరకు ఎంతోమందిలో నాటకరంగంపై ఆసక్తి కలిగిస్తోంది కావ్య శ్రీనివాసన్. ఆమె థియేటర్ యాక్టర్, ప్లేరైటర్, స్టోరీ టెల్లర్. మధు శుక్లా థియేటర్ ప్రాక్టీషనర్, కోచ్, స్టోరీ టెల్లర్. వృత్తిరీత్యా అనలిస్ట్ అయిన లక్ష్మీ ప్రియా మంచి నటి. ఉద్యోగ సమయం తరువాత ఈ బృందం రిహార్సల్స్, ప్లానింగ్, ఇంప్రూవ్డ్ షోలు చేస్తుంది. ప్రతి మంగళ, గురువారాల్లో ఏదో ఒక మెంబర్ ఇంట్లో రిహార్సల్ కోసం సమావేశం అవుతారు. ‘వేదికపై ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తమ నైపుణ్యాలను నటులు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అవసరం’ అంటుంది బాలశ్రీ. కావ్య శ్రీనివాస్ నుంచి బాలశ్రీ వరకు ఎంతోమంది నాటకరంగ కళాకారులు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.నాటకరంగంలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు క్వాసర్ ఠాకూర్ పదంసీ. ఇరవై సంవత్సరాల వయసులో సెక్యూర్డ్ జాబ్ను వదిలేసి నాటకరంగానికి అంకితం అయ్యాడు ‘వ్యక్తుల జీవిత కథలను మరింత శక్తిమంతంగా చెప్పే దిశగా భారతీయ నాటకరంగం ప్రయాణిస్తోంది. మన నాటకం కాలంతోపాటు పయనిస్తూ ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటుంది. లైవ్ కెమెరాలు, ప్రొజెక్షన్లు నాటకరంగంలో భాగం అయ్యాయి’ అంటాడు పదంసీ. మన నాటకరంగ విశిష్ఠతను ఒకవైపు చెబుతూనే మరోవైపు... ‘కష్టాలు ఉంటాయి. ఇదేమీ లాభసాటి వృత్తి కాదు’ అంటాడు. అయితే అభిరుచులు, ఆసక్తులను వాణిజ్య కొలమానాలతో చూడడానికి ఇష్టపడని యువత నాటకరంగాన్ని అమితంగా ప్రేమిస్తోంది. నాటక సమాజాలతోపాటు అవి చేస్తున్న ప్రయోగాల గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటోంది. రేపటి నాటకానికి తమ వంతుగా సన్నద్ధం అవుతోంది. తమాషాగా సంతోషంగా... ముంబైకి చెందిన సపన్ శరణ్ పోయెట్, రైటర్, యాక్టర్. థియేటర్ కంపెనీ ‘తమాషా’ ఫౌండింగ్ మెంబర్లలో ఒకరు. కొత్త రకం ఐడియాలకు ‘తమాషా’ పుట్టిల్లుగా మారింది. శరణ్ మొదటి నాటకం క్లబ్ డిజైర్. క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శించే శరణ్ మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో నటిస్తుంది. కవితలు కూడా రాస్తుంటుంది. నాటకరంగానికి సంబంధించి కొత్త ప్రయోగాలు చేయడంలో యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న వారిలో సపన్ శరణ్ ఒకరు. తోడా ధ్యాన్ సే... సమకాలీన సామాజిక అంశాలను చర్చించడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్న వారిలో దిల్లీకి చెందిన థియేటర్ ప్రాక్టీషనర్ మల్లికా తనేజా ఒకరు. పురుషాధిక్యత నిండిన కళ్లతో స్త్రీని ఎలా చూస్తారు? స్త్రీ భద్రతకు వస్త్రధారణకు ఎలా ముడిపెడతారు? అదృశ్య అణచివేతరూపాలు... మొదలైన అంశాలను తన సోలో నాటకం ‘తోడా ధ్యాన్ సే’ ప్రతిబింబిస్తుంది. మల్లిక వ్యక్తిగత అనుభవాలే ఈ నాటకానికి పునాది. రంగస్థలమే పాఠశాల మన దేశంలోని ప్రతిభావంతులైన యువనటులలో ఐరా దూబే ఒకరు. ‘యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకుంది. ‘9 పార్ట్స్ ఆఫ్ డిజైర్’ లో ఆమె సోలో పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది. దూబే కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారు. అందుకే సరదాగా ‘నాటకాల ఫ్యామిలీ’ అని పిలుస్తారు.‘‘థియేటర్ ఆర్ట్స్పై యంగ్ పీపుల్ ఆసక్తి ప్రదర్శించడమే కాదు నాటకకళ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. యువనటులకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నాటకం చేస్తే ఏ కారణం కోసం చేస్తున్నామో, ఏ ప్రేక్షకుల కోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. టార్గెట్ ఆడియెన్స్ గురించి అవగాహన కూడా ముఖ్యం. యాక్టింగ్ స్కూల్ ద్వారా మాత్రమే నటన వస్తుంది అనే దాన్ని నేను నమ్మను. రంగస్థలమే పాఠశాల. అక్కడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటుంది ఐరా దూబే. -
నిజమైన కళకు నీరాజనాలు
‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత, మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు విశ్వనాథ సత్యనారాయణ. నాటక, సాహిత్యాది రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. అయితే తెలుగునాట నాటక రంగానిది మహా వైభవోపేత చరిత్ర. అవి జనజీవితాన్ని ఎల్లెడలా ప్రభావితం చేశాయి. జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పాయి. నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అని చాటాయి. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో! మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో!! ఆ మహానుభావులకు వందనం!!! నాటక, సాహిత్యాది రంగాలకు చెందిన వివిధ రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో 1930లలో భారత పర్యంతం వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ సారథ్యంలోని ‘మా భూమి’ ఇత్యాది కళా రూపాలను ప్రస్తావిస్తూ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది. ప్రజాకళలు ఎలా ఉండాలో ‘మా భూమి’, ‘అంతా పెద్దలే’ నాటకాలు నిరూపించా’’యని ప్రశంసల వర్షం కురిపించారు! ఈ కితాబు నాటికీ, నేటికీ మరపురాని సందేశంగా నిలిచిపోయింది. ఆ ఒరవడిలో ముందుకు సాగి, అఖిల భారత స్థాయిలోనే ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ రాష్ట్రీయ విశిష్ఠ శాఖలలో ఒకటి గుంటూరు జిల్లా ‘ప్రజా నాట్యమండలి’. భారత ప్రజానాట్య మండలికి ఆంధ్ర ప్రజానాట్య మండలి ఎలా ‘ఒజ్జ బంతి’ అయిందో, అలాగే గుంటూరు ప్రజా నాట్యమండలి వివిధ శాఖలతో పరిఢవిల్లింది. మానవ జీవన దర్పణంగా పలువురు ఆంధ్ర పండితుల, కవుల ఆశీస్సులతో ముందుకు సాగుతోంది. సందేశాలు సమకాలీనం విశ్వనాథ వారు ఎంతటి మహాకవో, అంతటి సరసుడు, ‘గడగ్గాయి’ కూడా! పెళ్లయి, కాపురాలకు వెళ్లబోయే నూతన దంపతులందరికీ కంటికి కనిపించినా, కనిపించకపోయినా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూపడానికి మన పెద్దలు ప్రయత్నిస్తారు. కానీ విశ్వనా«థను ఒకరు మీరెప్పుడైనా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూశారా అని ప్రశ్నించగా... నాకైతే ‘అరుంధతి కనిపించలేదుగానీ చేసిన ‘అప్పులయితే’ కనిపించి, వేధించాయని చమత్కరించారు. బహుశా కొన్ని జీవితానుభవాల తర్వాత, ‘చింతామణి’ నాటక కర్తగా సుప్రసిద్ధుడైన మహాకవి కాళ్లకూరి... భార్యాభర్తల మధ్య ఉదాత్తమైన సంసార అవగాహన ఎలా ఉండాలో చెప్పడానికి ఒక పద్యాన్ని రాశారు. సందేశాత్మకంగా ఉండటానికి సరళమైన భాషలో రాసి మనకు అందించారు! ఆరోజుల్లో వేశ్యా లంపటత్వం వల్ల సంసార జీవితాలు ఎలా బుగ్గిపాలవుతున్నాయో చెప్పి, ఆ వినాశం వల్ల సంసార జీవితాల్ని రక్షించడం అవసరమని భావించి కాళ్లకూరి ఆ నాటకం రాశారు! ఫలితంగా గంభీర సంసార జీవితాల అవగాహనకు ఆ పద్యం ద్వారా సమకాలీన సందేశం అందింది. కనుకనే కాళ్లకూరి రచనకు అంత విలువ పెరిగింది. ‘కష్ట ఫలితంబు బహుళ దుఃఖ ప్రదంబు సార రహితమైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనంబు చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషులుండు!’ ప్రశ్నించే సంస్కారం బుద్ధి జీవుల్లో పెరగనంతవరకూ మనిషికి వికాసం ఉండదని కవి మీగడ రామలింగస్వామి స్పష్టం చేస్తాడు. ఎందుకని? ఆయన మాటల్లోనే నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అంటారు. ‘ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచు ప్రశ్న లేనిదే మనిషికి ప్రగతి లేదు ప్రశ్న యందే సకల దిశా ప్రగతి యుండు కాన, ప్రశ్నయే వ్యక్తి వికాసమౌను’ అంటారు. అంతేగాదు, ‘ఈర్ష్య’ అనేది ఏ కళకూ, నాటకానికీ పనికి రాదనీ, ఈర్ష్య అనారోగ్యం, హానికరమని స్పష్టం చేశారు! ఇలా ఎన్నెన్నో దృశ్య మాలికలను ‘దర్పణం’ పేరిట గుంటూరు కళా పరిషత్ 1997–2022 సంవత్సరాల మధ్య కార్యక్రమాలన్నింటిని రసవత్తరమైన రచనా శైలిలో ‘కళ ప్రజలది’ అన్న మకుటం కింద రజతోత్సవ ప్రత్యేక సంచికగా అందించింది. ‘దర్పణం’ సంపాదకులు, సహ సంపాదకులు వల్లూరు శివప్రసాద్, వల్లూరు తాండవకృష్ణ అభినందనీయులు. నాటక రంగంలో ప్రజాకళలకు ప్రాధాన్యం కల్పించడంలో సుప్రసిద్ధులైన నవీన పథకులుగా ఖ్యాతి పొందిన నటశేఖరులు బళ్లారి రాఘవ, గరికపాటి రాజారావు ప్రఖ్యాతులకు ఈ ప్రత్యేక సంపుటిని అంకితమిచ్చారు. గుంటూరు కళాపరిషత్ కార్యక్రమాల ప్రత్యేక దృశ్యమాలిక ఈ సంచికకు ప్రత్యేక కళాకాంతులు అందించింది. ఎందరో మహానుభావులు జీవితాంతం ఆధునికులను వెన్నుతట్టి ప్రోత్సహించినవారు... కందుకూరి, తిరుపతి కవులు, చిలకమర్తి, బలిజేపల్లి, పరబ్రహ్మ పరమేశ్వరి, ఒద్దిరాజు సోదరులు, కోదాటి నరసింహం, రామరాజు, గురజాడ, బళ్లారి రాఘవ, వాసిరెడ్డి, సుంకర, ఆత్రేయ, గరికపాటి, ఆత్రేయ ఇత్యాదులు. ఇలా తెలుగు నాటక పరిణామానికి దోహదం చేసినవారి గురించి మేడిచర్ల సత్యనారాయణమూర్తి కవితాత్మకంగా కురిపించిన ప్రశంస ద్వారా దర్పణం సంచిక వైశిష్ట్యం తెలుస్తుంది. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో, మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో, నటనకు జీవం పోసి దైవాలుగా పూజలంది శిలారూపమందిన పాత్రధారులెందరో, ఎవని కళకు, యువనికలకు ఊపిరినిచ్చెనో ఈ రంగస్థలి చిత్రకారులెందరో ఆ మహానుభావులకు వందనం సాష్టాంగ వందనం!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ముత్యమే.. కదులుతూంటుంది!
-
'మైండ్ బ్లోయింగ్ ఆర్ట్'! ఏకంగా సూది రంధ్రంలోని బబుల్పై కళాఖండం!
ఎన్నో ఆర్ట్లు చూసి ఉంటాం. ఇలాంటి నెవ్వర్ బీఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఆర్ట్ని చూసి ఉండటం అసాధ్యం. ఎందుకంటే..? ఇంతలా సూక్షంగా వేయడం ఒక ఎత్తైతే..పైగా బబుల్ పగిలిపోకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా వేయడం అనితర సాధ్యం. సుసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ అసాధారణ వ్యక్తి. ఇతనేం అందరిలాంటి వ్యక్తి కాదు కూడా. ఎందుకంటే? ఇతను చిన్నతనంలో ఆటిజంతో బాధపడిన వ్యక్తి. తస ఆర్ట్తో అందర్నీ విస్మయపరచడమే కాదు శభాష్ అని ప్రసంశలు అందుకున్నాడు. ఆ వ్యక్తి ఆర్ట్ జర్నీ ఎలా సాగింది? అనితర సాధ్యమైన ఆర్ట్ ఎందుకు వేశాడో అతని మాటాల్లో తెలుసుకుందామా! విల్లార్డ్ విగాన్ ఇంగ్లాండ్లోని వెడ్నెస్ఫీల్డ్లోని అష్మోర్ పార్క్ ఎస్టేట్కు చెందిన బ్రిటిష్ శిల్పి. అతడు సూక్ష్మ శిల్పాలను రూపొందిస్తాడు. చాలామంది ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మ శిల్పలు రూపొందిస్తారు కానీ అతడు కేవడం సూదీ తల భాగంలో లేదా రంధ్రంలో వేస్తాడు. ఈసారి సూదీ రంధ్రంలో ఓ బబుల్పై ముగ్గురు వ్యక్తులు ఒంటెలపై ప్రయాణిస్తున్నట్లు వేశాడు. బబుల్ పగలకుంటా అత్యంత జాగ్రత్తగా వేయాలి. అందుకోసం అతడు రోజూకు 16 గంటలకు పైగా శ్రమను ఓర్చీ మరీ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. దీన్ని వేసేందుకు కంటి రెప్ప వెంట్రుకలతో తయారు చేసిన పెయింట్ బ్రెష్ని వినియోగించడం విశేషం. నిజం చెప్పాలంటే ప్రతి నిమిషం ఉత్కంఠంగా ఊపిరి బిగబెట్టి గుండె లయలను వింటూ వేయాల్సింది. ఎందుకంట? ఆ ఆర్ట్ వేస్తున్నప్పుడూ ఏ క్షణమైన బబుల్ పగిలిందే మొత్తం నాశనమైపోతుంది. పడిన శ్రమ వృధా అయిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆర్ట్ అనితరసాధ్యమైన ఫీట్ అనే చెప్పాలి. ఆ ఆర్ట్లో ఒంటెలను నైలాన్తో రూపొందించగా, వాటిపై రాజుల్లా ఉన్న వ్యక్తుల కిరిటీలను 24 క్యారెట్ల బంగారంతో మెరిసేట్లు రూపొందించాడు. సూదీ రంధ్రంలో బుడగ పగిలిపోకుండా ఆధ్యంతం అత్యంత ఓపికతో శ్రమతో వేశాడు. చూసిన వాళ్లు సైతం ఇది సాధ్యమాఝ అని నోరెళ్లబెట్టేలా వేశాడు విల్లార్డ్ విగాన్. ఈ అసాధారణ కళా నైపుణ్యానికి గాను విల్లార్డ్ని 2007లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ సభ్యుడిగా నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. విల్లార్డ్ సుమారు 5 ఏళ్ల ప్రాయంలోనే చీమలకు ఇళ్లను కట్టే మైక్రో శిల్పాన్ని వేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఆర్ట్ వైపుకి ఎలా వచ్చాడంటే.. విల్లార్డ్ ఆటిజం కారణంగా చిన్నతనంలో అన్నింటిలోనూ వెనుకబడి ఉండేవాడు. దీంతో స్నేహితులు, టీచర్లు పదేపదే ఎగతాళి చేసేవారు. ఈ అవమానాల కారణంగా అతడి చదువు సరిగా కొనసాగలేదు. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు చదవడం, రాయడంలో చాలా వెనబడి ఉంటారు. ఈ రకమైన పిల్లలకు బోధించడం టీచర్లకు కూడా ఓ పరీక్ష లేదా సవాలుగానే ఉంటుంది. ఇక్కడ విల్లార్డ్ ఈ అవమానాలకు చెక్పెట్టేలా ఏదో ఒక టాలెంట్తో తానెంటో చూపించాలి. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని బలంగా అనుకునేవాడు. ఆ జిజ్ఞాశే విల్లార్డ్ని మైక్రో ఆర్ట్ వైపుకి నడిపించింది. చిన్న వయసు నుంచే ఈ మైక్రో ఆర్ట్లు వేసి టీచర్లను తోటి విద్యార్థులను ఆశ్చర్యపరిచేవాడు. దీంతో క్రమంగా వారు కూడా అతడిని అవమానించటం, ఎగతాళి చేయటం మానేశారు. ఈ కళ అతడికి మంచి పేరునేగాక అందరీ ముందు విలక్షణమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. మనకు కొన్ని విషయాల్లో రోల్ మోడల్స్ ఉండాలి గానీ నాలాంటి వాళ్లకు రోల్మోడల్స్ ఉండరు. అందుకుని వారికీ తాను స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా ఉండాలనుకున్నాను. అని చెబుతున్నాడు విల్లార్డ్. మనం నిత్యం ఎన్నో సమస్యలు, బాధలతో సతమతమవుతాం. దాన్ని మనలో దాగున్న ఏదో నైపుణ్యంతో వాటిని పారద్రోలాలి. ఆ స్కిల్ తెయకుండానే.. మీకు ఎదురైన చేదు అనుభవాలను సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకు తానే ప్రేరణ అని విల్లార్డ్ చెబుతుంటాడు. అంతేగాదు ప్రపంచానికి సరికొత్త వెలుగునిచ్చేందుకు తాను ఈ కష్టతరమైన మైక్రో ఆర్ట్ వైపుకి వచ్చానంటున్నాడు. ఈ ఆర్ట్ ప్రతి ఒక్కరిలో ఆశ అనే ఒక మ్యాజికల్ కాంతిని, శాంతిని అందజేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు విల్లార్డ్. దీని అర్థం చిన్న చిన్న సమస్య లేదా పర్వతం లాంటి సమస్య అయినా నువ్వు తల్చుకుంటే సాధ్యమే! అని విల్లార్డ్ తన ఆర్ట్తో చెప్పకనే చెబుతున్నాడు కదా!. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
ఆ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది! అదే!..ఆర్ట్ ఆఫ్ జోషిగా..
‘ఈ పనికి నేను తగను’ అనుకునే వాళ్లు కొందరు. ‘తగ్గేదే లే’ అని ముందుకు వెళ్లే వాళ్లు కొందరు. రెండో వర్గం వారికి తమ దారిలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయితే వారిలోని ఉత్సాహ శక్తి ఆ అవరోధాలను అధిగమించేలా చేసి విజేతను చేస్తుంది. సౌరవ్ జోషి ఈ కోవకు చెందిన కుర్రాడు. 24 సంవత్సరాల జోషి ఫోర్బ్స్ ‘టాప్ డిజిటల్ స్టార్స్–2023’లో చోటు సంపాదించాడు...జోషి స్వస్థలం ఉత్తరాఖండ్లోని ఆల్మోర. హరియాణాలోని హన్సిలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేశాడు. తండ్రి కార్పెంటర్. తల్లి గృహిణి. ఇంటర్మీడియెట్లో ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్లో తన స్కెచ్–మేకింగ్ వీడియోలను పోస్ట్ చేసేవాడు. తొలి రోజుల్లో ‘హౌ ఐ డ్రా యంఎస్ ధోనీ’ టైటిల్తో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే లాక్డౌన్ టైమ్లో ఈ వీడియో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఉత్సాహంతో ‘365 వీడియోస్ ఇన్ 365 డేస్’ ఛాలెంజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జోషి. ఈ చాలెంజ్ అతడి జీవితానికి టర్నింగ్ పాయింట్గా మారింది. సౌరవ్ జోషిని డిజిటల్ స్టార్ను చేసింది. ఏ వీడియో చేసినా లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం మొదలైంది. పన్నెండు మిలియన్ల సబ్స్క్రైబర్లతో జోషి చానల్ ‘ఫాస్టెస్ట్–గ్రోయింగ్ యూట్యూబ్ చానల్’జాబితాలో చేరింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు జోషి. జోషి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరిచాడు జోషి. ‘ఇప్పటికీ ఇది నిజమా? కలా? అని అనుకుంటాను. మొదట్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చాలా నిరాశగా అనిపించేది. 365 డేస్ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది’ అంటాడు జోషి. షేడింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్, హౌ టూ డ్రా ఏ పర్ఫెక్ట్ ఐ, హూ టూ యూజ్ చార్కోల్ పెన్సిల్, డ్రాయింగ్ టూల్స్ ఫర్ బిగినర్స్... ఒకటా రెండా జోషి చానల్కు సంబంధించి ఎన్నో వీడియోలు పాపులర్ అయ్యాయి. ఎంతోమందిని ఆర్టిస్ట్లను చేశాయి. ‘మీరు వయసులో నా కంటే చాలా చిన్నవాళ్లు. నేను అప్పుడెప్పుడో బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత ఉద్యోగ జీవితంలో పడి డ్రాయింగ్ పెన్సిల్కు దూరమయ్యాను. మీ వీడియోలు చూసిన తరువాత మళ్లీ పెన్సిల్, పేపర్ పట్టాను. నేను మళ్లీ ఆర్టిస్ట్గా మారడానికి మీరే కారణం’ .....ఇలాంటి కామెంట్స్తో పాటు ‘ఇది ఎందుకూ పనికి రాని వీడియో’లాంటి ఘాటైన కామెంట్స్ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంటాయి. అయితే ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు కృంగిపోవడం అంటూ జోషి విషయంలో జరగదు. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆర్ట్లోనే కాదు ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్లోనూ దూసుకుపోతున్నాడు సౌరవ్ జోషి. ఒక్క ఐడియా చాలు మనం వెళ్లగానే ‘సక్సెస్’ వచ్చి షేక్హ్యాండ్ ఇవ్వాలనుకుంటాం. అది జరగకపోయేసరికి నిరాశ పడతాం. ‘ఇది మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు’ అని వెనక్కి వెళ్తాం. సక్సెస్ కావడానికి, కాకపోవడానికి అదృష్టం ప్రమేయం ఎంత మాత్రం ఉండదు. మన టాలెంట్ మీద మనకు ఎంత నమ్మకం ఉంది, విజయం కోసం ఎదురుచూడడంలో ఎంత ఓపిక ఉంది అనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. అందరిలాగే నేను కూడా మొదట్లో బాగా నిరాశపడిపోయాను. అయితే వెనక్కి మాత్రం పోలేదు. మరో సారి ట్రై చేసి చూద్దాం...అని ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఐడియాతో నా జీవితమే మారిపోయింది. – సౌరవ్ జోషి (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!
ఆర్ట్ సైంటిస్ట్ ఆర్ట్, ఫ్యాషన్ను కలిపి తనదైన కళను ఆవిష్కరించింది ఢిల్లీకి చెందిన పాయల్ జైన్. ఫ్యాషన్ రంగంలో పేరుగాంచిన పాయల్ జైన్ మంచి ఆర్టిస్ట్ కూడా. ఆమె తాజా ఎగ్జిబిషన్....సోల్ ఆఫ్ ఏ ఉమెన్. ఎగ్జిబిషన్లో కనిపించే 30 పీస్లలో ప్రతిదాంట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చరిత్ర నుంచి కవిత్వం వరకు ఏదో ఒక అంశ ధ్వనిస్తుంది. ‘ఆర్ట్లో సైన్స్ ఉంటుంది. సైన్స్లో ఆర్ట్ ఉంటుంది’ అనే పాయల్ జైన్ను ఆర్ట్ సైంటిస్ట్గా పిలుచుకోవచ్చు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన మూడు దశాబ్దాల ప్రయాణానికి ‘సోల్ ఆఫ్ ఏ ఉమెన్’ ప్రతిబింబం అంటుంది పాయల్. ఈ ఎగ్జిబిషన్లోని ముప్ఫై పీస్లలో ప్రతి పీస్కు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మెక్సికన్ పెయింటర్ ప్రీదా ఖాలోను స్ఫూర్తిగా తీసుకొని ‘ఫర్బిడెన్ లవ్’ కలెక్షన్ రూపొందించింది. పాయల్ అభిమానించే ఖాలో పెయింటర్, మ్యాజికల్ సర్రియలిస్ట్, ఫెమినిస్ట్, రెవల్యూషనరీ. పాయల్ ఆర్కిటెక్చర్ నుంచి ఫ్యాషన్ రంగంలోకి రావడానికి కారణం చిత్రకళ పట్ల తనకు ఉన్న అనురక్తి. స్కెచ్చింగ్ తనకు ఇష్టమైన పని. ఆమె తల్లి కూడా ఆర్టిస్టే. సితార్ అద్భుతంగా వాయించేది. తన కలల గురించి తల్లిదండ్రులకు చెప్పిప్పుడు ‘ ఏదో ఒక డిగ్రీ నీ చేతిలో కనిపించాలి. ఆ తరువాతే ఏదైనా’ అన్నారు. అలా బీకామ్ పూర్తి చేసింది. పాయల్ స్కెచ్చింగ్ నైపుణ్యాన్ని చూసి ‘నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రయత్నించవచ్చు’ అని సలహా ఇచ్చారు సన్నిహితులు. మొదట ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించి పుస్తకాలు, మ్యాగజైన్స్ విరివిగా చదివేది. అలా ఫ్యాషన్ కూడా తన ప్యాషన్గా మారింది. శాన్ఫ్రాన్సిస్కోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ‘ఫ్యాషన్కు ఆర్ట్, సైన్స్ అనే రెండు కోణాలు ఉంటాయి. ఆర్ట్ అనేది సృజనాత్మకతకు సంబంధించిన కోణం, సైన్స్ అనేది సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన కోణం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నా దృష్టిని విశాలం చేసింది. ప్యాటర్న్మేకింగ్, డ్రాపింగ్, గ్రేడింగ్, ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ మార్కెటింగ్...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను’ అంటున్న పాయల్ ఎన్నో కార్పొరేట్ హోటల్స్కు ఆకట్టుకునేలా ‘హోటల్ యూనిఫామ్’ను డిజైన్ చేసి ఇచ్చింది. ‘డిజైనర్స్ అంటే గొప్ప ఏమీ కాదు. గ్లోరిఫైడ్ టైలర్స్ మాత్రమే’ అని చాలామంది అనుకొని అపోహపడే కాలంలో డిజైనర్గా కెరీర్ ప్రారంభించింది పాయల్. ఆమె వెస్ట్రన్ క్లాతింగ్ మొదలుపెట్టినప్పుడు దానికి మార్కెట్ లేదు. అయితే ఆ తరువాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. పాయల్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆమె మాటల్లోనే చెప్పాలంటే...‘చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే ధోరణిలో కాకుండా మనం చేస్తున్న పనిని మనసారా ప్రేమించాలి. నిద్ర, శ్వాస, కలలో మన లక్ష్యం కనిపించాలి. ఫెయిల్యూర్కు చోటివ్వకుండా సాంకేతిక జ్ఞానంపై గట్టి పట్టు సంపాదించాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో కొత్తదనం వచ్చేలా చూసుకోవాలి. ప్రశంసలు ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోకుండా అన్ని కోణాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మార్పులు చేర్పులు చేసుకోవాలి. సానుకూల శక్తి, సంకల్పబలం ఎప్పటికీ మనకు తోడుగా ఉండాలి’ కెరీర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది పాయల్. చేదుజ్ఞాపకాలుగా కాదు...ఆ సమయంలోనూ తాను ఎంత ధైర్యంగా ఉందో మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి. ‘విజయం ధైర్యవంతులను వెదుక్కుంటూ వస్తుంది’ అని చెప్పడానికి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆమె తెచ్చుకున్న పేరే నిదర్శనం. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
ఎన్నికలకు కళ
రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఫేస్బుక్, యూ ట్యూబ్ మొదలు ఇన్స్టాగ్రామ్ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్లో ఆయా కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. సోషల్ జమానా ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్ లెవల్ వరకు సోషల్ మీడియా ఇన్చార్జ్లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. ర్యాలీలు, సభల్లో... బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కొమ్ము కోయ.. రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు. అలరిస్తున్న గుస్సాడీ.. ఆదిలాబాద్కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంజారా నృత్యం తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. డప్పు బృందాలు ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్గ్రీన్గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి. - తాండ్ర కృష్ణ గోవింద్ -
మ్యాథ్స్తో ఆర్ట్ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!
‘ఆర్టిస్ట్గా అన్నీ కుమారి ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు ఒక ముక్కలో జవాబు చెప్పాలంటే... ‘మాథ్స్, ఆర్ట్ను మిళితం చేసి సరికొత్త ఆర్ట్ను సృష్టించింది’ జీవితం కూడా గణితంలాంటిదే. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొన్ని ఎంతకీ కావు... ఈ సారాంశం కుమారి చిత్రాల్లో ప్రతిఫలిస్తుంది... మనం పుట్టి పెరిగిన వాతావరణం ఆలోచనల్లో, ఆచరణలో, చివరికి ఆర్ట్లో కూడా ప్రభావం చూపుతుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం అన్నీ కుమారి ఆర్ట్. గణితం, సంగీతం, క్రాఫ్ట్ల గురించి విలువైన చర్చలు జరిగే ఇంట్లో పెరిగింది కుమారి. చిన్నటిప్పటి నుంచి తనకు లెక్కలు అంటే ఇష్టం. లెక్కలంటే భయపడే పిల్లలకు భిన్నంగా అన్నీ కుమారి గంటల తరబడి లెక్కలు చేస్తూ కూర్చునేది. అంకెలు, సంఖ్యలు తన ప్రియ నేస్తాలుగా మారాయి. ‘ఆర్ట్కు లెక్కలకు దోస్తు కుదరదు’ అంటారు. అయితే అన్నీకి లెక్కలు అంటే ఎంత ఇష్టమో, ఆర్ట్ అంటే కూడా అంతే ఇష్టం. అయితే ఆర్ట్ స్కూల్లో మాత్రం అంకెలు నచ్చినంతగా చిత్రాలు నచ్చలేదు. తనకు కావాల్సినదేదో ఆ చిత్రాల్లో లోపించినట్లుగా అనిపించేది. ఆ సమయంలో రకరకాల ప్రయోగాల గురించి ఆలోచించేది. విజువల్ వకాబులరీ సృష్టించాలనే ఆలోచన అలా వచ్చిందే. ఆర్ట్ స్కూల్ తరువాత... బొమ్మలు గీస్తూ కూర్చోలేదు. తనలోని శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయాణాన్ని సాధనంగా ఎంచుకుంది. జార్ఖండ్లోని హజరీబాగ్కు వెళ్లి సోరాయి మ్యూరల్ ఆర్ట్ సంప్రదాయాన్ని, తమిళనాడు వెళ్లి కోలమ్ ఫ్లోర్ డ్రాయింగ్ సంప్రదాయాన్ని అధ్యయనం చేసింది. ఆ కళలో చుక్కలు, గీతలు, వంకలు చూస్తుంటే రకరకాల గణిత సూత్రాలు కంటిముందుకు వచ్చేవి. దీనికితోడు ప్రాచీన భారతీయ ఆలయాలలోని ఆర్కిటెక్చర్లో గణితం ఒక భాగమై ఉందనే విషయాన్ని అర్థం చేసుకుంది. ప్రకృతి ప్రపంచానికి, గణిత సూత్రాలకు మధ్య ఉండే అంతర్లీన సంబంధం కుమారిని ఆకట్టుకుంది. సైన్స్కు ఉండే శక్తి అది సృష్టించే వస్తువుల్లో కనబడుతుంది. ఇక ఆర్ట్కు ఉండే శక్తి మానవ ఉద్వేగాలను, అనుభవాలను ప్రతిఫలించే వేదికలో కనబడుతుంది. ముఖ్య అంశం ఏమిటంటే గణితానికి సంబంధించిన సంక్లిష్ఠతను సరళీకరించి జనాలలోకి తీసుకువెళ్లే శక్తి ఆర్ట్కు ఉంది. అందుకే ఈ రెండు బలమైన మాధ్యమాలను ఒకేచోటుకి తీసుకురావాలనుకుంది. తను సృష్టించే ఆర్ట్ ఎలా ఉండాలంటే... మన సంస్కృతీ, సంప్రదాయాలలోకి తిరిగి ప్రయాణించేలా, మన కళలను పండగలా సెలబ్రేట్ చేసుకునేలా, మన మూలాలతో ఆత్మీయంగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి అనే లక్ష్యంతో బయలుదేరింది. ఆ లక్ష్యసాధనలో విజయం సాధించి ఆర్టిస్ట్గా తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. తాజాగా అన్నీ కుమారి ఆర్ట్ ఎగ్జిబిషన్ ముంబైలోని తావో ఆర్ట్ గ్యాలరీలో జరుగుతోంది. (చదవండి: ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!) -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్గా కనిపిస్తుంటాయి. -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
చిత్రకారుల్లో ఇతడు వేరయా..! సైన్సుకే చిత్ర రూపం ఇచ్చి..
బొమ్మల భాషఅక్షరం పుట్టక ముందే చిత్రం రూపుదిద్దుకుంది. ప్రపంచంలో సైగల తర్వాత భాష బొమ్మలదే. పది వాక్యాల విషయాన్ని ఒక బొమ్మ చెప్తుంది. ఆ బొమ్మలతోనే శాస్త్రాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం వినోద శాస్త్రమవుతుంది. ఆనందంగా మెదడుకు చేరుతుంది. మరిచిపోలేని జ్ఞానంగా మిగులుతుంది. అధ్యయనానికి అక్షర రూపమిస్తే మహాగ్రంథమవుతుంది. అధ్యయనానికి చిత్రరూపమిస్తే అద్భుతమైన చిత్రకావ్యం అవుతుంది. అలాంటి వందల చిత్రకావ్యాలకు రూపమిచ్చారు అబ్దుల్ మన్నాన్. డెబ్బై ఏళ్ల మన్నాన్ ఐదు వేలకు పైగా బొమ్మలు వేశారు. ‘‘నా వయసులో నుంచి మూడేళ్లు తగ్గిస్తే నాలోని చిత్రకారుడి వయసది. నా బొమ్మల్లో ఒక్కొక్క థీమ్తో కొన్ని వందల చిత్రాలున్నాయి. ఆ చిత్రాల్లో ఒక్కటి చేజారినా చిత్రకావ్యంలో అనుసంధానత లోపిస్తుంది. అందుకే నా బొమ్మలను ఎవరికీ ఇవ్వలేదు, డబ్బు కోసం అమ్మనూ లేదు’’ అన్నారు అబ్దుల్ మన్నాన్. బొమ్మల చదువు! మా సొంతూరు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, బంటుమిల్లి దగ్గర చిన పాండ్రాక. ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నా చదువు గుడివాడలో సాగింది. ఏఎన్నార్ కాలేజ్లో బీఎస్సీ చదివాను. బొమ్మల మీదున్న ఆసక్తి కొద్దీ చెన్నైకి వెళ్లి ‘శంతనుస్ చిత్ర విద్యాలయం’లో ఆర్ట్ డిప్లమో చేశాను. చెన్నైలోనే బాలమిత్ర, బాలభారతి, బుజ్జాయి వంటి పిల్లల పత్రికల్లో ఇలస్ట్రేటర్గా ఐదారేళ్లపాటు ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి నా అడుగులు సినీఫీల్డ్ వైపు పడ్డాయి. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా సుమారు ఐదేళ్లు చేశాను. చెన్నైలో కవి సమ్మేళనాలు ఎక్కువగా జరిగేవి. మహాలక్ష్మి క్లబ్లో తెలుగు వాళ్ల కార్యక్రమాలు జరిగేవి. దాదాపుగా అన్నింటికీ హాజరయ్యేవాడిని. అలా శ్రీశ్రీ,, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి కవులతోపాటు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆర్ నారాయణమూర్తి వంటి చాలామందితో పరిచయాలయ్యాయి. దక్షిణాది భాషలు వచ్చాయి. ఇలా కొంత వైవిధ్యంగానే మొదలైంది నా కెరీర్. వైవిధ్యత ఆకట్టుకుంది! సైన్స్ చిత్రాల చిత్రకారుడిగా మారడానికి బీజం పడింది మాత్రం ఇంటర్లోనే. డార్విన్ సిద్ధాంతం ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ చదవడం నా మెదడులో కొత్త ప్రపంచానికి ఆవిష్కారం జరిగింది. అలాగే మరో పుస్తకం ‘ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’. ప్రపంచంలోని చిత్రకారులను చదివినప్పుడు పికాసో నుంచి డావిన్సీ వరకు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులెవ్వరూ సైన్స్ ఇతివృత్తంగా బొమ్మలు వేయలేదని అవగతమైంది. దాంతో ఆ ఖాళీని పూరించాలనుకున్నాను. అలా నా చిత్రాలకు సైన్స్, నేచర్ ప్రధానమైన టాపిక్స్ అయ్యాయి. జీవ వైవిధ్యత నన్ను కట్టి పడేసే అంశం. దాంతో ప్రతి జీవి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. డార్విన్ సిద్ధాంతం చదివినప్పుడు కలిగిన సందేహాలకు సమాధానాల కోసం లెక్కలేనన్ని పుస్తకాలు చదివాను. ఉదాహరణకు క్యాట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ ఖండంలో ఎలాంటి జాతి క్యాట్లుంటాయో అనర్గళంగా చెప్పగలను. శిలాజాలను అధ్యయనం చేసి ఆ ప్రాణి ఊహాచిత్రాన్ని వేయడం, ఎండమిక్ స్పీసీస్ బొమ్మలేయడంలో అనంతమైన సంతృప్తి కలగడం మొదలైంది. ఇక ఆ అలవాటును కొనసాగించాను. సైన్స్ పాఠాల బోధన! నా వృత్తి ప్రవృత్తి రెండూ సైన్స్లోనే వెతుక్కున్నాను. ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవాడిని. నా భార్య గవర్నమెంట్ టీచర్. నేను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ట్యూటోరియల్స్ నిర్వహించాను. స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్గా పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించాను. నేను అందుకున్న అవార్డులకంటే నా విద్యార్థులు అందుకున్న అవార్డులే ఎక్కువ. నేను పీటీరెడ్డి అవార్డు, మూడు జాతీయ స్థాయి అవార్డులందుకున్నాను. నా బొమ్మలు ఆహ్లాదం కోసం చూసేవి కాదు. అవి అధ్యయన మాధ్యమాలు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలు, వైజాగ్లో కాలేజీలు, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్, చాలాచోట్ల స్కూళ్లలోనూ ప్రదర్శనలు నిర్వహించాను’’ అని తన చిత్రప్రస్థానాన్ని వివరించారు అబ్దుల్ మన్నాన్. ‘చిత్ర’ ప్రమాదాలు చిత్రకారుడు తన దేహానికి గాయమైనా పట్టించుకోడు. కానీ తన బొమ్మలకు ప్రమాదం వాటిల్లితే ప్రాణం పోయినట్లు విలవిలలాడుతాడు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా చిత్రకార జీవితంలో మూడు ప్రమాదాలను ఎదుర్కొన్నాను. గుడివాడలో ఇల్లు అగ్నిప్రమాదానికి గురయ్యి చిన్నప్పటి నుంచి వేసిన బొమ్మలన్నీ కాలిపోయాయి. మరోసారి చెన్నైలో ఇంట్లో దొంగలు పడి నా పెయింటింగ్స్ పెట్టెను కూడా దోచుకుపోయారు. ఇక మూడవది హైదరాబాద్లో. ఈ ఏడాది వరదల్లో టోలిచౌకిలోని మా ఇంట్లో మూడు రోజులు నీళ్లు నిలిచిపోయాయి. అప్పుడు తడిసిపోయినవి పోగా మళ్లీ వేసిన బొమ్మలు ఐదు వందలు ఎగ్జిబిషన్కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదం తర్వాత నాలోని చిత్రకారుడు మళ్లీ మళ్లీ పుట్టాడు. – అబ్దుల్ మన్నాన్, సైన్స్ చిత్రకారుడు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్గా..
ప్రతి మనిషికి ఏదోఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని జయించి ముందుకెళ్తుంటారు చాలామంది. మినీషా భరద్వాజ్ మాత్రం భయంతో ఇంట్లో గదికే పరిమితమైపోయింది. మినీషాకు ఉన్న ‘అఘోరా ఫోబియా’తో... కొత్త వ్యక్తుల్ని కలిసినా, తెలియని ప్రాంతాలకు వెళ్ళినా తెగ భయపడిపోయేది. గుంపుగా ఉన్న జనాలను చూసి ‘‘అమ్మో అంతా నా వైపు చూస్తున్నారు’’ అని వణికి పోయేది. చిన్నప్పటి నుంచి ఈ భయంతో పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికీ వెళ్లనే లేదు. ఇక స్నేహితులు కూడా ఎవరు లేరు. జీవితాంతం ఇలానే ఉంటానేమో అనుకునే మినీషా..బొమ్మలు వేసే అలవాటు ద్వారా తన ఫోబియాను అధిగమించడమేగాక, ఆర్టిస్ట్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బొమ్మలు వేస్తూ తన భయాన్ని ఎలా పోగొట్టుకుందో తన మాటల్లోనే..... మాది గురుగావ్. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా బాల్యమంతా డెహ్రాడూన్లో గడిచింది. చిన్నప్పటి నుంచి తెల్లని పేపర్ మీద పెన్సిల్తో రకరకాల బొమ్మలు గీసేదాన్ని. ఏడో తరగతిలో ఉండగా ఒక మ్యాగజీన్లో ఉన్న తెల్లటి పేపర్పై నటి రేఖ చిత్రాన్ని గీసాను. అప్పుడు మా అమ్మానాన్నలు నా టాలెంట్ను చూసి ఆశ్చర్యపోయారు. పదోతరగతి వరకు పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను. ప్రతి నోట్బుక్ చివరి పేజీలో నా పెయింటింగ్ ఒకటి కచ్చితంగా ఉండేది. కొన్నిసార్లు పరీక్షపేపర్లో జవాబు తెలియని ప్రశ్నకు బాధపడుతోన్న అమ్మాయి చిత్రాన్ని గీసేదాన్ని. పదో తరగతిలో అంతర జిల్లా పోటీలలో పాల్గొని డెహ్రాడూన్ మొత్తంలోనే మొదటి బహుమతి అందుకున్నాను. అలా ఎక్కువ సమయం బొమ్మలు గీస్తూ ఉంటే అఘోరా ఫోబియా కూడా గుర్తు వచ్చేది కాదు. ప్రత్యేకమైన కోర్సు చేయలేదు... నేను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని అమ్మావాళ్లు సీఏ చదివించారు. కానీ నా మనస్సంతా ఆర్ట్మీదే ఉండేది. చదువు పూర్తి అయినప్పటికీ కార్పోరేట్ ప్రపంచంలో కాలుపెట్టలేదు. 1995 లో పెళ్లి అయ్యింది. ఆయన ఉద్యోగం దుబాయ్లో కావడంతో అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పబ్లిషింగ్ హౌస్లో ఉద్యోగం చేసేదాన్ని. ఒకసారి ఖాళీ సమయం దొరకడంతో..పేపర్ మీద బొమ్మను గీసాను. బొమ్మ పూర్తయ్యే సమయానికి మా ఆయన, ఆయన స్నేహితుడు వచ్చారు. ఆ బొమ్మను చూసి.. ‘‘చాలా బావుంది. బొమ్మలు గీయడంలో మంచి ప్రతిభ ఉంది. ఎందుకు దాచుకుంటావు. బొమ్మలు గీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యచ్చు కదా...’’ అని ప్రోత్సహించారు. అప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆర్ట్కు ప్రాణం పోస్తున్నాను. చార్కోల్ పెన్సిల్స్తో.. ఆయన ప్రోత్సాహంతో స్కెచ్లు గీయడం మొదలు పెట్టాను. ఆయన ఒక ఆర్ట్గ్రూప్ను పరిచయం చేయడంతో అక్కడకు వెళ్లి స్కెచ్లు గీసేదాన్ని. కమ్యూనిటీకి వెళ్లిన రెండేళ్లలోనే ‘జి ఆర్ట్ కమ్యూనిటీ’ వాళ్లు నన్ను కలిసి ఆర్ట్ఎగ్జిబిషన్లో పాల్గొనమని ఆహ్వానించారు. ఆ ఎగ్జిబిషన్కు అంతర్జాతీయ ఆర్టిస్ట్లు వస్తున్నారు. మీరు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించండి’’అన్నారు. అది నాకు చాలా పెద్ద అవకాశం. కానీ ‘‘అందరూ రంగులతో స్కెచ్లు గీస్తున్నారు. నేను మాత్రం పెన్సిల్, చార్కోల్తో గీస్తాను. నేను నిలబడగలనా’’ అని నిర్వాహకులను అడిగాను. అందుకు వాళ్లు ... నువ్వుతప్ప ఎవరూ చార్ కోల్ వాడడం లేదు. అందరికంటే భిన్నంగా నీ స్కెచెస్ ఆకర్షిస్తాయి అని చెప్పి ‘డేర్ టు డ్రీమ్’ ఎగ్జిబిషన్కు ఎంపిక చేశారు. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రమంగా వాటర్ కలర్స్ కూడా వేయడం ప్రారంభించాను. చార్కోల్ పెయింటింగ్స్కు అనేక అవార్డులు అందుకున్నాను. రోలెక్స్ టవర్పై నేను వేసిన పెయింటింగ్ను ఇప్పటికీప్రదర్శిస్తున్నారు. దీనికి గుర్తింపుగా ‘పీపుల్స్ ఛాయిస్ ఆవార్డు’ వచ్చింది. అబుదాబిలోని లువురే మ్యూజియంలో నా పెయింటింగ్స్ ఉన్నాయి. ఏడు వేలమంది ముందు... దుబాయ్ మాల్స్లో ఏడు వేలమంది ముందు చార్కోల్తో పెయింటింగ్ వేశాను. ఆ పెయింటింగ్ వెంటనే అమ్మడు పోయింది. ‘స్పెషల్ నీడ్ దుబాయ్ కేర్’ తో కలిసి చికిత్స పొందుతోన్న పిల్లలకోసం ‘లిటిల్ పికాసో’పేరిట పెయింటింగ్స్ వేసి వారికి సాయం చేశా. 2017లో గుర్గావ్ వచ్చేసి, ఇక్కడ పెయింటింగ్స్ నేర్పిస్తున్నాను. ఇండియా ఆర్ట్ కమ్యూనిటీ, ఇండియా స్పీకింగ్ ఆర్ట్ ఫౌండేషన్, వారి సాయంతో పెయింటింగ్ నేర్పిస్తున్నాను. దుబాయ్లో వేలమందికి నేర్పిన నేను, నా అనుభవాల ద్వారా నేర్చుకున్న ట్రిక్స్ను ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్నాను’’ అలా నా భయాన్ని అధిగమించడంతోపాటు నా విద్యను అందరికీ నేర్పించగలగడం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది అని చెప్పింది మినీషా. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్గా మార్చింది! అదే ఆమెను..) -
పోస్ట్పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు వ్యాపారం మొదలుపెట్టింది
‘ఇదేమీ జీవితం’ అనే మాట సంప్రీత్ కౌర్ నోటి నుంచి ఎన్నోసార్లు వచ్చేది. నరకాన్ని తలపించే ప్రదేశంలో ఆమె బందీగా లేదు. ఎప్పటిలాగే, అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యుల మధ్య ఉంది. ‘ఇదేమీ జీవితం నుంచి ఎందుకీ జీవితం’ వరకు కౌర్ ఆలోచనలు వెళుతున్న చీకటి కాలంలో ఆమె ముందు ఒక వెలుగు కిరణం పడింది. దాని పేరు... మక్రామీ! స్కూల్ నుంచి కాలేజీ వరకు స్టార్ స్టూడెంట్గా పేరు తెచ్చుకుంది హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన సంప్రీత్కౌర్. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిదేళ్ల కెరీర్కు గుడ్బై చెప్పింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థల్లో క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేసిన కౌర్కు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. కాని అనివార్య పరిస్థితులలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత కౌర్ ప్రసూతి వైరాగ్యానికి అంటే పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు గురైంది. తాను తనలాగా ఉండలేకపోయేది.ఏవేవో ప్రతికూల ఆలోచనలు. ఎప్పుడూ సందడిగా ఉండే కౌర్కు ఎవరితో మాట్లాడాలనిపించే కాదు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటారు. అయితే ఆమె మనసు చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ ఆ మనసు ఒక మార్గాన్ని వెలుతురుగా ఇచ్చింది... అదే మక్రామీ ఆర్ట్. ఆ ఆర్ట్కు దగ్గరవుతున్నకొద్దీ తనలోని డిప్రెషన్ మూడ్స్ దూరంగా వెళ్లిపోయేవి. చివరికి అవి కనిపించకుండా పోయాయి. కౌర్ గతంలోలాగే చురుగ్గా ఉండడం మొదలుపెట్టింది.‘మక్రామీ’లో నేర్పు సాధించిన కౌర్ ఆ కళను గాలికి వదిలేయలేదు. తాను ఎంటర్ప్రెన్యూర్ కావడానికి దాన్ని ఒక దారిగా చేసుకుంది. ‘అబ్బాయి పుట్టిన తరువాత, తరచుగా డిప్రెసివ్ మూడ్స్ వచ్చేవి. నా కాలేజి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. ఉద్యోగ జీవితాన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండడం ఏమిటీ అని ఆలోచించేదాన్ని. గుంపులో ఉన్నా ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని. పిల్లాడితో ఆడుకుంటూ ఆనందించడం కంటే, పిల్లాడు ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేదాన్ని. పిల్లాడు నిద్రపోగానే ఒంటరిగా కూర్చొని ఏవేవో ఆలోచించేదాన్ని. ‘పిల్లాడి మీద శ్రద్ధ పెట్టు. వృథాగా ఆలోచించకు’ అని అమ్మ మందలించేది. ఎప్పుడూ సరదాగా ఉండే నేను సీరియస్గా మారిపోవడం చూసి మా ఆయన అయోమయానికి గురయ్యేవారు. ఆయనకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు యూట్యూబ్లో పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు సంబంధించిన వీడియో చూశాను. తల్లి మూడ్స్వింగ్స్ పిల్లాడిపై ప్రభావం చూపుతాయనే విషయం విన్న తరువాత భయమేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెదుక్కున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్.‘జస్ట్ ఏ హాబీ’గా పరిచయం అయిన మక్రామీ ఆర్ట్ కౌర్ను పూర్తిగా మార్చివేసింది. మునపటి చురుకుదనాన్ని, హాస్యచతురతను తెచ్చి ఇచ్చింది. ‘మక్రామీ ఆర్ట్ ద్వారా అర్థం లేని ఆలోచనకు అడ్డుకట్ట పడింది. మనసు చాలా తేలిక అయింది. కొన్ని ఫ్లవర్ పాట్ హోల్డర్స్ను తయారుచేసి వాటి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇది చూసి తనకు ఆరు పీస్లు కావాలని అడిగింది. ఆమె నా ఫస్ట్ కస్టమర్. నా హాబీ అనేది విజయవంతమైన వ్యాపారంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేని నాకు ఇది చాలా గర్వంగా అనిపించింది’ అంటుంది కౌర్. కౌర్ ఆర్ట్వర్క్కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు... రెగ్యులర్ కస్టమర్ అయిన అర్చన. ‘కౌర్ ఆర్ట్వర్క్ అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత కఠిన సమయంలో ఆర్ట్ ద్వారా ఎలా బయటపడిందో తెలుసుకున్నాక ఆమె మీద అభిమానం రెట్టింపు అయింది. గోరంత సమస్యనే కొండంత చేసుకొని బాధపడే వారికి కౌర్ గురించి చెబుతుంటాను. ఆమె ఆర్ట్ వర్క్లో క్వాలిటీ, చూడగానే ఆకట్టుకునే సృజన నాకు ఇష్టం’ అంటుంది అర్చన.బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నుంచి కౌర్కు పెద్ద ఆర్డర్ వచ్చింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. దేశ, విదేశాల నుంచి ప్రతి నెల పదిహేను వందలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ‘నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న తల్లుల దగ్గరకు వెళ్లి నేను పడిన ఆందోళన, దానినుంచి బయటపడడానికి చేసిన కృషి గురించి చెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేదాన్ని. ఎంటర్ప్రెన్యూర్గా సాధించిన విజయం కంటే వారిలో మార్పు తీసుకువచ్చాననే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది’ అంటుంది సంప్రీత్ కౌర్. View this post on Instagram A post shared by Atinytwisted| MacrameIndia (@atinytwisted) -
ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!
కవితకేదీ కాదు అనర్హం అన్న చందాన మెటల్, ప్లాస్టిక్, పాత గాడ్జెట్స్ ఏదైనా ఆయన చేతిలో పెట్టారంటే అందమైన శిల్పంగా మారాల్సిందే. అరవైఏళ్ల వయసులో చిన్నప్పటి హాబీని కెరీర్గా మలుచుకున్నాడు విశ్వనాథ్ మల్లాబ్డి దావంగిరె. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్గా మార్చి అబ్బురపరుస్తున్నాడు ఈ పెద్దాయన. బెంగళూరుకు చెందిన విశ్వనాథ్ తండ్రి డీఎమ్ శంభు ప్రముఖ శిల్పి ఇంకా పెయింటర్ కూడా. విశ్వనాథ్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని శంభు కలలు కనేవారు. చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ వస్తువులను సరికొత్తగా మార్చడమంటే విశ్వనాథ్కు ఆసక్తి ఎక్కువ. ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూరై్తన తరువాత తరువాత మీడియాలోకంప్యూటర్ వీడియో గ్రాఫిక్ ఆర్టిస్ట్గా చేరాడు. అలా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్ ఒక్కోమెట్టు ఎదుగుతూ విప్రోలో చేరాడు. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూనే ఖాళీ సమయం, వారాంతాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకోఆర్ట్గా ఎలా మార్చాలని పరిశోధిస్తుండేవాడు. రకరకాల ప్రయోగాల తరువాత.. గాడ్జెట్స్ వ్యర్థాలను ఉపయోగించి చిన్నచిన్న జంతువులు తయారు చేశాడు. అవి ముద్దుగా ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో తన ఇకో ఆర్ట్ను పెంచుకుంటూ పోయాడు. ఫ్యాషన్ జ్యూవెలరీ నుంచి అందమైన శిల్పాలు, రోబోలదాకా అన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నాడు. ఏరికోరి ఎంచుకుని... ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ప్రాణాంతకంగా మారాయని తెలుసుకుని ఇకో ఆర్ట్ను మరింత సీరియస్గా తీసుకున్నాడు విశ్వనాథ్. ఈ క్రమంలోనే ఈ వ్యర్థాలను కొనుక్కునేవాడు. అన్నింటిని గంపగుత్తగా కొనకుండా కంప్యూటర్ విడిభాగాలు, ల్యాప్టాప్స్, డేటా కార్డులు, డీవీడీ, వీసీఆర్, ఫ్లాపీ డ్రైవ్స్, సెట్–టాప్బాక్స్లు, ల్యాండ్లైన్, కార్డ్లెస్ ఫోన్లు, గ్లూకో మీటర్లను ఏరికోరి ఎంచుకుని తీసుకునేవాడు. వీటిలో కూడా రాగి, బంగారం, రంగురంగుల వైర్లు, కీబోర్డులను ప్రత్యేకంగా సేకరించి రకరకాల బొమ్మల రూపకల్పనకు ఉపయోగిస్తున్నాడు. ఆరు అడుగుల అమ్మాయి రూపంతో విగ్రహం, ప్రముఖ వ్యాపారవేత్త అజీం ప్రేమ్జీ ఫోటో, ఇకో జ్యూవెలరీ, కీబోర్డు కామధేనువు వంటి బొమ్మలు ఐదు వందలకు పైగానే తయారు చేశాడు. హాబీని కెరీర్గా... విశ్వనాథ్ తయారు చేసిన బొమ్మలు ఆకర్షణీయంగా అందంగా ఆకట్టుకుంటుండడంతో విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం రిటైర్ అయిన విశ్వనాథ్.. తొలినాళ్లల్లో హాబీగా ఉన్న ఇకోఆర్ట్ను పూర్తి సమయం కేటాయిస్తూ ఇకోఆర్ట్ వస్తువులు విక్రయిస్తూ సరికొత్త కెరీర్ను సృష్టించుకున్నాడు. ఇకోఆర్ట్ వస్తువులు కొనే కస్టమర్లు ఢిల్లీలోనేగాక, యూరప్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో ఇకో ఆర్ట్ కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. దేశంలోనేగాక విదేశాల్లో తన ఇకో ఆర్ట్ను ప్రదర్శిస్తూ మంచి ఆదరణ పొందుతున్నాడు. వందల కేజీలపైనే... కీబోర్డు కీల నుంచి గోడగడియారంలో భాగాల వరకు అన్నీ సేకరించి ఇకో ఆర్ట్ రూపొందిస్తోన్న విశ్వనాథ్ ఇప్పటిదాకా రెండువందల కేజీల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్స్గా మార్చాడు. అయితే ఈ ఇకో ఆర్ట్ అంత సులభం కాదని విశ్వనాథ్ చెబుతున్నాడు. ‘‘ఈ – వ్యర్థాల నుంచి ఆర్ట్ కావాల్సిన భాగాలను సేకరించి వాటికి ఆకారం, రంగు వేసి తుదిమెరుగులు దిద్దడానికి చాలా సమయం పడుతుంది. జ్యూవెలరీ తయారు చేయడానికి రెండు మూడు నిమిషాలు పడితే, శిల్పాలు తయారు చేయడానికి వారాలు, నెలలు పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇటు కస్టమర్ల మనసు దోచుకోవడంతోపాటూ, పర్యావరణానికి హానీ కలగకుండా ఈ ఇకోఆర్ట్ ఎంతో సంతృప్తినిస్తుంది. ముందు ముందు మరిన్ని కళారూపాలు తీసుకురానున్నాను’’అని విశ్వనాథ్ చెబుతున్నాడు. (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
చందామామ శంకర్! పిల్లలకు మాత్రం బొమ్మల మామ!
చాలా ఏళ్ల క్రితం మాట. దారులు గూగుల్ ని పరవని రోజులు, మొబైళ్ళు ఊబర్ ని పిలవని కాలాలు. " పెరియ ఓవియ శంకర్ వీటిర్కు సెల్లుమ్ వలి?" అని అడుగుతూ అడుగుతూ మదరాసులోని చందమామ శంకర్ గారి ఇల్లు చేరుకున్నాము మిత్రుడు విజయవర్దన్ గారూ, నేనూను. దాదాపు నాలుగయిదు గంటలు ఆయనతో గడిపాము. ఇదంతా పన్నెండు సంవత్సరాల క్రితపు మాట . అప్పుడు ఆయన దాదాపు తొంబయ్ సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. తొంబయ్ అనేది ఒక సంఖ్య మాత్రమే అంతులేని ఆయన ఉత్సాహానికి, ఆరోగ్యానికి తగిలించడానికి ఏ అంకె లేదు. మానవుడు మిల మిలా మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన బుర్ర ఉన్న వారి శరీర లక్షణమది. చందమామ, యువ, రామకృష్ణ ప్రభ పత్రికల్లో బొమ్మలు తప్పా ఈయన ది గ్రేట్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి శిష్యుడని, ఇంకా నూనుగుమీసాల ప్రాయంలో మహత్మా గాంధీ ఎదురుగా ఒక్కడు నిలబడి తగువుపెట్టుకున్నవాడని అప్పటికి తెలియనే తెలియదు. ఆ మిలాఖత్ అంతా మా ప్రెండ్ విజయ్ వర్దన్ గారు అప్పట్లో వీడియో ఎక్కించినట్లు కూడా గుర్తు నాకు. అది దొరికితే ఇంకా బావుణ్ణు. బోల్డన్ని కొత్త కబుర్లు వ్రాయవచ్చు. ఇప్పుడు చెప్పేదంతా, నా బుర్రలో మిగిలి ఉన్నా జ్ఞాపకాల గుర్తులే . చదువుకున్నదేమో పెయింటింగ్! జీవితాంతం రేఖా చిత్ర కళను గీచి దేశంలో ఉన్న అతి గొప్ప రేఖా చిత్రకారుల్లో ఒకడిగా నిలబడి చందమామ శంకర్ గా భారతదేశంలోని కొన్ని తరాల పిల్లలకు బొమ్మల మామ అయినవాడు. చందమామ శంకర్’ గారిని అడిగితే ఆర్టిస్ట్ చిత్రా గారికి కడుపులో అల్సర్ అయ్యిందని, దాని వల్ల ఆయన మరణం సంభవించిందని చెప్పినట్లు నాకు గుర్తు. అప్పుడంతా ఆయనని చూసిన ఆనందంలో ఉన్నాము కాబట్టి ఏం అడిగింది! ఏం అడగాలి, మేము అడిగినది, ఆయన చెప్పింది అంతా రాసి పెట్టుకోవాలి అని కూడా నాకేమి కోరిక లేదు. ఆయనని చూడటమే ఒక భాగ్యంగా అక్కడికి వెళ్ళాము. నాకు ఉన్న కొరిక అల్లా, శంకర్ గారు, అటువంటి గొప్ప గొప్ప మానవులను, ఆయన అభిమానులుగా మనమందరం సత్కరించుకొవాలి , వారికి ఆ సత్కారం గొప్ప మధురానుభవంగా జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనే వెర్రి అత్యాశ మాత్రమే. ఇక్కడ మనం అనేది కేవలం మాటకు మాత్రమే బహువచనం. ముందు దారులు వేసి మన నడకకు అడుగు మెత్తగా పరిచినవారిని గౌరవించుకోవాలనే సంస్కారం ఎప్పుడు ఎంతగా చూసినా నాకు ఇక్కడెవరూ కనపడలేదు. ఓపిక ఉన్నంత కాలం అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేసీ చేసీ ఇదిగో ఇప్పుడు ఇలా శుష్క వ్యాసాలు రాసుకునే స్థాయికి దిగింది జీవితం. ప్రాధమిక విద్య తరువాత బొమ్మలు నేర్చుకుందామని శంకర్ గారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం కోసం పరీక్ష కు హాజరయ్యారట. అక్కడ పెయింటింగ్ పరీక్షలో బొమ్మలు వేయడానికి తన దగ్గర సరైన సామాగ్రి లేక అక్కడే కాలేజీ ఆవరణ లో పడి ఉన్న పడి ఉన్న పాత ఎండి పోయిన కుంచెతో బొమ్మ వేశారట. ఆయన వేసిన బొమ్మ చూసి కాలేజీ ప్రిన్సిపల్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి గారి డంగై పోయి " ఉరేయ్ నాయనా, ఇది పెన్ అండ్ నైఫ్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో బొమ్మలు వేసిన వాడికి తిరుగేముంది? ఇక్కడ చేరడానికి నీకు ఇక్కడ అడ్డం ఏముంది" అని కాలేజి లో సీట్ ఇచ్చేసారట. శంకర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా అంటారు " నాయానా! అది టెక్నిక్ కాదూ నా మొహమూ కాదు. బ్రష్ చివరలన్ని రాలి పోయి మొండి అయి పోయింది. అటువంటి దానితే గీస్తే ఎలా వస్తుందో అలానే గీశా నేను, అందులో నా ప్రతిభ ఏం లేదు, ఆ విషయం డి పి చౌధురి గారికి తెలీదు, నా భాగ్యం ఆయనవంటి గొప్ప గురువుదగ్గర చదువుకోడం" అంటూ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టుకున్నాడు. కాలేజిలో ఆయన చదువుకున్నది పెయింటింగ్. మరి ఇంత ప్రతిభావంతంగా లైన్ డ్రాయింగ్ ఎలా గీసారు అని అడిగిన మాటకు చందమామ లో చేరే వరకు రేఖ మీద సాధన చేసింది లేదు, అవసరార్థం అభ్యాసం చేసాను నా గీతకు గురువులు బర్న్ హోగార్త్, హాల్ ఫోస్టర్. బాపు గారి గురించి ఏమైనా చెప్పండి అని అడిగాను" ఆయన దర్శకుడుగా ఉండవలసిన అర్హతలు ఉన్న ఆర్టిస్ట్ బాబు, అలా అందరూ కాలేరు" మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నారు ఆయన. అదేంటో నాకు అర్థం కాలేదు. " మరి బాపు గారిని కలిసేవారా?" "లేదండి, కుటుంబరావు గారు ఆయన్నీ, మమ్మల్ని కలవనిచ్చేవారు కాదన్నాడు. బహుశా తెలుగు-తమిళ అనుకునే గొడవలు ఏమైనా వస్తాయని అనుకునే వారో ఏమిటో. బాపు ఎప్పుడు వచ్చే వారో ఎలా వెళ్ళేవారో తెలీదు. వచ్చి కుటుంబరావు గారిని కలిసి అలానే కనపడకుండా వేరే వైపు నుండి వెళ్ళిపోయేవారు. వడ్డాది పాపయ్య గారిని కూడా మాతో పాటు ఉండనిచ్చే వారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయన దగ్గర అవీ ఇవీ చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు ఉండేవాడు. నాకు పాపయ్య గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ కార్యాలయంలో స్నేహం కుదరలేదు. ఒక రోజు రోడ్డు మీద పాపయ్య గారు ఒక పుస్తకాల కొట్టు దగ్గర బయట తాడుకు వేలాడ గట్టిన పుస్తకాలు తిరగేస్తూ కనపడ్డారు. పుస్తకాలు కొనకుండా అలా తిరగేసి నలిపేస్తు ఉన్నాడని కొట్టువాడు ఆయన్ని విసుక్కుంటున్నాడు. ఆ కొట్టువాడు నాకు బాగా పరిచయస్తుడే, నేను గబా గబా అక్కడికి వెల్లి "ఒరేయ్ ఆయన ఎవరనుకున్నావురా? నువ్వూ, నీ కుటుంబం ఈ రోజు నాలుగు ముద్దల అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుడు వేసిన బొమ్మల పుస్తకాలు అమ్ముడు పోతున్నందుకే. ఆయన వడ్డాది పాపయ్య" అని చెప్పి మందలించారట. ఆ షాపతను కొట్టు దిగి కిందికి వచ్చి పాపయ్య గారి కాళ్ళకు దండం పెట్టుకున్నాట్టా. ఇక ఎప్పుడు పాపయ్య గారు అటు వచ్చినా ఒక కుర్చీ వేసి కావలసిన పుస్తకాలు ఆయన ముందు ఉంచేవారని చెప్పుకుంటూ పోయారు. పాపయ్య గారికి చేపలు అంటే చాలా ఇష్టమని , ఇక్కడ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయని అడిగారట. శంకర్ గారు మద్రాసు పైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడే ఒకసారి గాంధి గారు మద్రాసుకు వచ్చారుట ఒక బహిరంగ సభ నిమిత్తం. ఈ బొమ్మలేసే కుర్రాళ్ళతో ఆయనకు పనిపడింది. వారు ఆ సభా ప్రాంగణాన్ని, ఆ మైదానాన్ని, ఆ గోడలను రంగులతో, రంగ వల్లులతో, తోరణాలతో తమ సమస్త చిత్రకళతో అలంకరించారు. పనంతా అయిపోయింది. ఈ చిత్రకళా రత్నాలకు గాంధి గారి ఆటోగ్రాఫ్ కావాలి. చిన్న దేహాలు ముక్కలు చెక్కలు చేసుకుని మరీ బాపు సేవకు అంకితం అయ్యారు కదా, "అదెంత పనర్రా పిల్లలూ రండ్రండి నా దగ్గరకు" అని బోసినవ్వుతో పిలుస్తారనుకున్నారు. సంతకం కోసం సందేశం తీసుకెళ్ళిన పెద్ద మనిషితో అన్నారుట. "నా సంతకం అయిదు రూపాయలు. అటు నోటు ఇచ్చి ఇటు దస్తఖత్ అందుకోవచ్చు" అని బాపు మాట. పిల్లలకు వళ్ళు మండింది. ఎండనక నీడనెరుగక ఇంత పని చేసాం కదా, మాకు ఇవ్వాల్సిందిపోయి పైగా మా దగ్గరే ఎదురు వసూలా? అని అన్నిరంగుల పిల్లలు ఒకే ఎర్ర రంగై పోయి నానా గోల చేస్తే " ఇలా గోల కూడదురా , మీలో మీ తరుపున ఎవరో ఒకరు రండి, పెద్దాయనతో మాట్లాడండి" అని కాలేజీ ప్రిన్సిపాల్ గారు నచ్చచెప్పారు. పిల్లల తరపున యువ నాయకుడు శంకర్. ఆటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ గాంధీ గారి గదిలో చేరారుట. శంకర్ గారు ఇలా అన్నారు "లోపల ఆ గదిలో ఆ మధ్య కూచుని ఉన్నాడండీ మహాత్ముడు. పచ్చని శరీర ఛాయ, పోతపోసిన బంగారు విగ్రహం వంటి మనిషి . నా కోపం గీపం, మనిషిని ఎగిరెగిరి పడ్డం అదంతా ఎలా పోయిందో నాకు తెలీదు. చేతులు రెండూ ఒకటై ఆయనకు నిలువెల్లా దండం అవ్వడం మాత్రం ఎరుగుదును" గాంధి గారు ఆయనతో అన్నారుట. "బాబూ నేను మిమ్మల్ని డబ్బు ఆడిగానంటే నాకోసమనా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఆ ఉద్యమానికి ధనం అవసరం! ఆ ధనం కోసమని అమ్ముకోడానికి నాకు నేనే మార్గం" అంతా ఐపోయాకా నా బుద్ది తక్కువ బుర్రకు ఒక అనుమానం వచ్చి ఇలా అడిగా "మరే శంకర్ గారు, బాపు మహాత్ముడు పచ్చని పసిమి అయితే ఆ ఫోటోల్లో ఆలా నల్లగా ఉంటారే?" అని. " లేదు నాయనా ఆయన ఈశ్వరుడి సాక్షిగా పచ్చని మనిషి. కాంతులీనే దేహం" . తరువాత బల్బు వెలిగింది. మనం చూసిన గాంధి అల్లా , పాత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫిల్ముల్లో, పాత పత్రికల్లోని తెలుపూ తెలుపూ ఫోటోగ్రాఫుల్లోనే కదా ఆ రెండు రంగుల ముద్రణ ముందు ఎర్రని ఎరుపయినా , పచ్చని పసిమయినా నలుపూ తెలుపేగా! పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఇంకో సంగతి శంకర్ గారి స్నేహితుడు ఒకాయన- పెద్ద స్థాయికి చేరుకున్న అధికారితో మాటా మాటా మాట్లాడుతూ శంకర్ గారు తన బొమ్మల జీవితం కన్నా తన మిత్రుడు ఆర్థికంగా చాలా బావున్నారని అసంతృప్తి వెల్లడిస్తే ఆయన ఒక విషయం చెప్పారట. తన ఉద్యోగ బాధ్యత నిమిత్తం ఈయన ఒక అతి మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని కాకులూ, చీమలు చొరబడని ఒక పల్లె వంటి పల్లె లో ఆవులు కాచుకునే కుర్రాడొకడికి ఒక పుస్తకం ఎలా దొరికిందో తెలీదు కానీ దొరికిందట. వాడు ఆ పుస్తకాన్ని చెట్టు తొర్రలో దాచుకుని, అప్పుడప్పుడూ ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న బొమ్మలని చూసి మురిసి పోతున్నాడట. ఈయన వెళ్ళి చదువు రాని కుర్రవాడు ఆ పుస్తకం లో ఏమి చూసి అంత మైకం ఎక్కించుకుంటున్నాడు అని చూస్తే ఆ పుస్తకం పేరు చందమామ, పిల్లాడు మైకం ఎత్తించుకున్న ఆ బొమ్మల రేఖామాంత్రికుడు పేరు శంకర్. "నేను ప్రజల దృష్టిలో ఒక హోదా గల అధికారిని మాత్రమే, నువ్వు అలాంటి లక్షలాది పిల్లల మనసు తొర్రలలో ఆనందానివిరా శంకరా" అన్నాడని చెబుతూ ఎంత సంతోషపడ్డారో ఆ మహా చిత్రకారులు.(చదవండి: 'మా తెలుగు తల్లికి' రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు) నేను కలిసేనాటికి కనీసం ఆయనకు తొంబయ్ సంవత్సరాల వయసు. ఎంత లేదనుకున్నా అంతకు మునుపు డెబ్బయ్ సంవత్సరాలుగా బొమ్మలు వేస్తూ వస్తున్నారు. ఆయన బొమ్మల ఒరిజనళ్ళు చూద్దామని ఉంది. ఆయన మమ్మల్ని లోపలి గదిలో కి తీసుకెళ్ళారు. అక్కడ ఎప్పటిదో ఒక పాత బొమ్మ, కొండమీద తపస్సు చేసుకుంటున్న మహర్షి ఇంక్ డ్రాయింగ్ అది. చిక్కని రేఖలు, తిన్నని హేచింగ్, "ఈ బొమ్మ అనుకునట్టుగా కుదరలేదు నాయనా అందుకని పాడయి పోయిన ఈ బొమ్మ మాత్రము ఇక్కడ అట్టి పెట్టుకున్నా. వేసిన బొమ్మలన్నీ సంస్థకు ఇచ్చేశా" కర్మ యోగము అంటే ఏమిటో అర్థమయ్యింది. పని చేస్తున్నంత వరకే ఆయన ఒక చిత్రకారుడు. పని పూర్తయ్యాక ఆయన చిత్రకారుడు కాదు, ఆ పని ఆయనదీ కాదు. ఆయన మొహంలో ఉన్న కాంతికి అర్థం తను చేసిన పనిది కాదు. తను ఏమి అవునో తెలిసిన ఎరుకది. ఆయన పెక్కు శంకరులు. మేము ఆ రోజు కలిసింది ఆనాటి ఒక శంకరుడిని మాత్రమే, ఆ శంకరుడు ఎవరు అన్నది కాదు ప్రశ్న. అసలు నేను ఎవరిని. నన్ను నేను ఎన్ని రకాలుగా వదిలించుకుంటాను అన్నదే నేను వెతుక్కోవలసిన జవాబు. ఆ రోజు ఆ శంకరుడి సతీమణి గిరిజమ్మ చేతి కాఫీ తాగాము. ఎన్నదగిన భాగ్యము . మా మిత్రుడు విజయవర్దన్ గారు తన పాత కలెక్షన్ లోనుండి ఆ నాటి వీడియో వెతికి తీస్తే మరిన్ని మాటలు పంచుకోవచ్చు. ఏదో ఒక రోజు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
రంగులతో ఎంత మాయో.?
-
అను చౌహాన్.. ఆర్ట్వర్క్కి బోలెడంత ఫాలోయింగ్
పంజాబీ–కెనడియన్ అను చౌహాన్ ఇలస్ట్రేటర్, వీడియో గేమ్ ఆర్టిస్ట్. సాంస్కృతిక–సాహిత్య వైభవాన్ని కళలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది అను. ఆమె చిత్రాల్లో ఎన్నడూ చూడని మొక్కల నుంచి గ్లోబల్ ఫ్యాషన్ వరకు కనువిందు చేస్తాయి... కెనడాలో పుట్టి పెరిగిన అను చౌహాన్కు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాలుగు సంవత్సరాల వయసులో స్క్రీన్పై కనిపిస్తున్న డిస్నీ కార్టూన్ను చూస్తూ బొమ్మ వేయడానికి ప్రయత్నించింది. హైస్కూల్ రోజులకు వచ్చేసరికి ఇలస్ట్రేషన్ను సీరియస్గా తీసుకుంది. ఆ సమయంలోనే ఇలస్ట్రేటర్ కావాలని బలంగా అనుకుంది. అను అభిరుచికి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇంటరాక్టివ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ చేసి, యానిమేషన్ సబ్జెక్ట్ చదువుకున్న అను చౌహాన్ తనలోని సృజనాత్మకతను కాపాడుకోవడానికి నిత్యనూతనంగా ఆలోచించేది. చిత్రకళలో తనదైన శైలిని రూపొందించుకునే ప్రయత్నం చేసేది. చదువు పూర్తయిన తరువాత మొబైల్ గేమ్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టింది. అంతర్జాలంలో పోస్ట్ చేసిన ఆమె ఆర్ట్వర్క్స్కు మంచి స్పందన లభించేది. కొద్ది కాలంలోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య వందలు దాటి వేలల్లోకి వచ్చింది. ‘నా ప్రతి చిత్రం ఒక కథ చెప్పాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నా కథలోని పాత్రలు దక్షిణ ఆసియాకు చెందినవి. ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లు కాకుండా ఆ పాత్రలు మనకు సుపరిచితమైనవి అన్నట్లుగా ఉండాలి. బొమ్మల ద్వారా కూడా స్త్రీ సాధికారతకు సంబంధించిన విషయాలను ప్రచారం చేయవచ్చు’ అంటుంది అను. ప్రపంచంలో ఏ మూల ఏ కొత్త డిజైన్ వచ్చినా దాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంటుంది అను. 1960– 1970లలో వచ్చిన ఫ్యాషన్ అండ్ ఆర్ట్ వర్క్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ‘వీడియో గేమ్స్, డిస్నీ, బాలీవుడ్...ఇలా ఎన్నో అంశాలు నా ఆర్ట్పై ప్రభావం చూపాయి’ అంటున్న అను చౌహాన్ తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కూడా స్ఫూర్తి పొందుతుంది. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్సెల్లింగ్ బుక్ ‘అరు షా అండ్ ది ఎండ్ ఆఫ్ టైమ్’ గ్రాఫిక్ ఎడాప్షన్ కోసం వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. మహక్ జైన్ రాసిన ‘భరతనాట్యం ఇన్ బాలెట్ షూస్’ పుస్తకానికి అను చౌహాన్ వేసిన బొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పిల్లల కోసం అను రూపొందించిన ‘ఏ దుపట్టా ఈజ్’ ‘హెన్నా ఈజ్’ పుస్తకాలు సూపర్హిట్ అయ్యాయి. ‘క్రియేటిక్ వర్క్ ద్వారా జీవితాన్ని సంతోషంగా గడపాలనేది నా కోరిక. వెబ్కామిక్ చేయాలనేది నా కల. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుందో తెలియదు అనే ఎరుకతో చిత్రకళ ద్వారా ప్రతి క్షణం ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది అను.