-
టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్పర్సన్గా మానసి టాటా.. ఎవరీ మానసి?
సాక్షి,ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్పర్సన్గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా నియమితు లయ్యారు. ఆమె తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ అకాలమరణం తరువాత, కంపెనీ JV కంపెనీల బోర్డులో డైరెక్టర్ అయిన మానసి టాటాను టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాల (TKAP) వైస్ చైర్పర్సన్గా నియమించింది. తక్షణమే వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ప్రకటించింది. మానసి టాటా ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే కంపెనీ కార్పొరేట్ నిర్ణయాలు ,వ్యూహాత్మక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఇంక్లూజివ్ థినింగ్ , పీపుల్ సెంట్రిక్ ఔట్లుక్"ని తీసుకొచ్చి, భారతీయ ఆటో పరిశ్రమపై ఆమెకున్న పదునైన అవగాహనతో పాటు, 'అందరికీ మాస్ హ్యాపీనెస్' అందించడంలో కంపెనీ నిబద్ధతను ఆమె నియామకం మరింత బలోపేతం చేస్తుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీఎండీ మసకాజు యోషిమురా అన్నారు" మానసి టాటా అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. కేరింగ్ విత్ కలర్ అనే ఎన్జీవో ద్వారా కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై పనిచేస్తున్నారు ఆమె 2019లో నోయెల్ టాటా (రతన్ టాటా సవతి సోదరుడు)కుమారుడు నెవిల్లే టాటాను వివాహం చేసుకున్నారు. కిర్లోస్కర్ సామ్రాజ్యం ఐదోతరం ప్రతినిధిగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మానసి తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ గతేడాది నవంబర్లో గుండెపోటుతో కన్నుమూశారు. డిసెంబరులో, కిర్లోస్కర్ సిస్టమ్స్ కంపెనీ యొక్క JV కంపెనీలైన టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కిర్లోస్కర్ టయోటా టెక్స్టైల్ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ (KTTM), టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (TMHIN), DNKI బోర్డులో మానసి టాటాను డైరెక్టర్గా నియమించింది. -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
చైనాకు 2 రోజులు.. భారత్కు రెండేళ్లు.. మరీ ఇంత వ్యత్యాసమా?
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు పర్యాటక వీసా రావాలంటే దాదాపు రెండేళ్లకుపైగా వేచి ఉండాల్సిందే. అయితే.. చైనా వంటి దేశాల ప్రజలకు ఆ సమయం రెండు రోజులుగానే ఉండటం గమనార్హం. పర్యాటక వీసా పొందాలనుకునే ఢిల్లీ వాసులు అపాయింట్మెంట్ కోసం సుమారు 833 రోజులు వేచి చూడాలి. అలాగే ముంబయి ప్రజలకు 848 రోజులుకుపైగా వేయింట్ లిస్ట్ ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ సూచిస్తోంది. అయితే.. బీజింగ్కు రెండు రోజులు, ఇస్లామాబాద్కు 450 రోజులు సమయం పడుతోంది. విద్యార్థి వీసాల కోసం వెయిటింగ్ టైమ్ ఢిల్లీ, ముంబైవాసులకు 430 రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా విద్యార్థి వీసాల విషయంలో పాకిస్థాన్కు కేవలం ఒకే రోజు సమయం ఉంది. అలాగే చైనాకు రెండు రోజులు పడుతోంది. ఢిల్లీ వాసులకు 833 రోజులుగా చూపిస్తున్న అమెరికా వెబ్సైట్ అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వద్ద లేవనెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని తెలిపారు బ్లింకెన్. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు తగిన ప్రణాళిక చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. కరోనా సమయంలో తక్కువ దరఖాస్తులు రావటం వల్ల సిబ్బందిని తొలగించటమూ ప్రస్తుత సమస్యకు ఒక కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా తర్వాత పర్యటక, విద్యార్థి వీసాల దరఖాస్తులు భారీగా పెరిగినట్లు వెల్లడించాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్మెంట్కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్సైట్లో పొందుపరుస్తుంటుంది. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్డేట్ చేస్తుంది. తాజాగా వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్సైట్లో పరిశీలించగా ఢిల్లీ ఎంబసీ నుంచి పర్యటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారు అపాయింట్మెంట్ కోసం 833 రోజులు వేచి ఉండాల్సిన ఉంటుందని తెలియజేస్తోంది. అలాగే.. మిగతా వివరాలు పరిశీలిద్దాం. బీజింగ్వాసులకు కేవలం 2రోజుల వెయిటింగ్ టైమ్ ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
పేటీఎం బాస్గా శర్మ నియామకాన్ని ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: పేటీఎం ఎండీ, సీఈవోగా విజయ్ శేఖర్ శర్మ పునర్ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఇన్స్టిట్యూషనల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ (ఐఐఏఎస్) కీలక సూచన చేసింది. లిస్టెడ్ కంపెనీలు వాటాదారుల ముందు ఓటింగ్కు పెట్టే తీర్మానాలపై ఈ సంస్థ తన సలహా, సూచనలు చేస్తుంటుంది. పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాధుర్ దియోరా పారితోషికానికి వ్యతిరేకంగా సూచన చేసింది. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ప్రెసిడెంట్, గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా దియోరా నియామకానికి (2022 మే 20 నుంచి ఐదేళ్లపాటు) అనుకూలంగా సూచించింది. ‘‘వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎం) షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.2,150 నుంచి 63.6 శాతం పడిపోయింది. ఇది వాటాదారుల సంపదను హరించివేసింది. 2021–22 సంవత్సరంలో రూ.1,200 కోట్ల నగదు నష్టాలను ప్రకటించింది. 2022–23 మొదటి త్రైమసికంలోనూ నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తానంటూ విజయ్ శేఖర్శర్మ గతంలో పలుమార్లు ప్రకటించారు. కానీ, అవేవీ ఆచరణలో కనిపించలేదు. కనుక కంపెనీకి నిపుణులతో కూడిన బోర్డు ఉండాలని మేము నమ్ముతున్నాం’’అని ఐఐఏఎస్ తన నివేదికలో పేర్కొంది. పదవీకాలంపై ఆందోళన విజయ్ శేఖర్ శర్మ రొటేషన్ పద్ధతిలో రిటైర్ కావాల్సిన అవసరం లేకపోవడం పట్ల ఐఐఏఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఎండీగా పదవీకాలం తర్వాత శర్మ నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో కొనసాగేట్టు అయితే బోర్డులో శాశ్వతంగా ఉండొచ్చు’’అని పేర్కొంది. బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల సీఈవోలతో పోలిస్తే అతడి పారితోషికం ఎక్కువగా ఉందని తెలిపింది. దీనిపై పేటీఎం సీనియర్ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ.. ప్రాక్సీ సంస్థలు తమ సేవలు తీసుకుంటున్న క్లయింట్లకు కేవలం సూచనలు మాత్రమే చేస్తాయన్నారు. -
కొత్త జిల్లాలకు డీఈవోల నియామకం
సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన జిల్లాలన్నిటికీ విద్యాశాఖ అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో క్యాడర్ సంఖ్యకు సంబంధించి కూడా జీవో విడుదల చేసింది. ప్రస్తుతం డీఈవోలుగా ఉన్న వారికి స్థానచలనంతో పాటు కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ ఈవో, సీటీఈ ప్రిన్సిపాల్, డిప్యూటీ డైరెక్టర్లకు డీఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. -
పాస్పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిలిపివేసిన అపాయింట్మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) -
సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు
న్యూఢిల్లీ: క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా ఇద్దరు మహిళా డైరెక్టర్లను నియమించుకుంది. కార్పొరేట్ పాలన నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర డైరెక్టర్ల హోదాలో మంజు అగర్వాల్, ఎస్.వసంత్ కారన్జ్కర్లను ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్టెక్ విభాగాలలో వీరికి సీనియారిటీ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బోర్డులో మహిళా డైరెక్టర్ల సంఖ్య మూడుకు చేరినట్లు తెలియజేసింది. ఆరుగురు సభ్యుల బోర్డుకు చైర్పర్శన్, నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామలా గోపీనాథ్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ సుపరిపాలన విషయంలో కంపెనీ పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు తాజా ఎంపికలు నిదర్శనాలని సీఎంఎస్ ఇన్ఫో పేర్కొంది. తద్వారా ముగ్గురు లేదా అంతకుమించి మహిళా డైరెక్టర్లు కలిగిన ఎన్ఎస్ఈ టాప్–10 శాతం లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించినట్లు వివరించింది. బ్యాక్గ్రౌండ్..: అగర్వాల్ ఎస్బీఐలో 34ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. దేశ, విదేశాలలో రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీసులు, వ్యూహాలు, నిర్వహణ తదితర విభాగాలలో విధులు చేపట్టారు. ఇక వసంత్ కారన్జ్కర్ కన్జూమర్ లెండింగ్ సంస్థ పేసెన్స్కు సహవ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. బిజినెస్, వృద్ధి, నిర్వహణ విభాగాలకు అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. పేయూ క్రెడిట్ ఇండియాకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. పేసెన్స్ పురోగతి సాధించాక పేయూ ఇండియాకు చెందిన నాస్పెర్స్కు విక్రయించారు. -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
ప్రధాని అపాయింట్మెంట్ కేసీఆర్ అడగలేదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలే దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే గత సెప్టెంబర్ 1వ తేదీన అపా యింట్మెంట్ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడం, సీఎం కేసీఆర్ వారిని కలవడం జరిగిం దని గుర్తు చేశాయి. నీటి పంపకాలు, వరి ధాన్యం కొను గోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవ డానికి ఢిల్లీ వెళ్తామని, అవసరమైతే తాను ప్రధానిని కలు స్తానని గత శనివారం సీఎం విలేకరుల సమా వేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆ మరు సటి రోజే ఢిల్లీ బయ ల్దేరి వెళ్లిన సీఎం బుధవా రం సాయంత్రం హైదరా బాద్ తిరిగి చేరు కున్నారు. అయితే నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. మోదీని, అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చా యి. ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ తమకు ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాయి. -
ఫలించని నిరీక్షణ.. ప్రధానితో ఖరారు కాని సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు, నదీ జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా, ఇతర కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నాలుగు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ తిరిగివెళ్లారు. ధాన్యం కొనుగోలు విషయంలో వార్షిక పరిమితిని ముందుగానే ప్రకటించే అంశంపై ప్రధానితో చర్చించాలని భావించినా ఆయన నిరీక్షణ ఫలించలేదు. ఉత్తరప్రదేశ్లో అభివృధ్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, వ్యవసాయ చట్టాల రద్దు అంశాలపై కేబినెట్ భేటీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల సన్నద్ధత నేపథ్యంలో ప్రధానితో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నందున డిసెంబర్ రెండు లేక మూడో వారంలో ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వచ్చి మోదీని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇక నదీ జలాల అంశం, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉన్నా, షెకావత్ రాజస్థాన్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వీలుపడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్తో సీఎం సమావేశమవుతారని భావించినా అలాంటిదేమీ జరగలేదు. 26న వచ్చే స్పష్టతను బట్టి కార్యాచరణ ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు మాత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయుష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంత సానుకూలత వ్యక్తమయ్యింది. ఈ వానాకాల సీజన్కు సంబంధించి గతంలో నిర్ణయించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కన్నా కొంత అధికంగా సేకరించేందుకు ప్రయత్నిస్తామని గోయల్ చెప్పారు. అదే సమయంలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేశారు. యాసంగిలో కొనే పంటలపై వ్యవసాయ శాఖతో చర్చించి 26 నాటికి స్పష్టత ఇస్తామని చెప్పిన నేపథ్యంలో.. దానిని బట్టి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖల మంత్రులతో గోయల్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తి, వినియోగం, కేంద్రం కొనుగోలు, వన్నేషన్–వన్రేషన్ అంశాలపై చర్చించనున్నారు. -
రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉన్నతోద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమేమిటని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తూ మళ్లీ వారిని నియమించడం వల్ల దుబారా ఖర్చు తప్ప ఏమీ ఉండదని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కీలకమైన పోస్టుల్లో పాత వారినే నియమించడంతో ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను పదవీ విరమణ తర్వాత సలహాదారులుగా నియమించడం చూస్తుంటే వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. వీరే కాక రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారని, ఇది సమర్థనీయం కాదని అన్నారు. సలహాదారులు, వారి సిబ్బందిపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడమంటే ప్రజా ధనాన్ని వృథాచేయడమేని స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: ‘సోషల్మీడియాను గుడ్డిగా నమ్మొద్దు’ -
ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా
-
ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో గత్తర లేపుతానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. టీడీపీ అధ్యక్షుడిని కేంద్ర పెద్దలు, జాతీయ మీడియా పట్టించుకోలేదని సమాచారం. రెండు రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులుగాస్తున్నప్పటికి చంద్రబాబుకు చుక్కెదురైనట్లు తెలిసింది. కశ్మీర్ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి వచ్చినప్పటికి.. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో బీజేపీ అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. కానీ గతంలో అమిత్ షా కుటుంబంతో తిరుమలకు వస్తే.. ఆయన కాన్వాయ్పై చంద్రబాబు రాళ్లు వేయించిన ఘటనను బీజేపీ మరచిపోలేదు. అంతేకాక నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంభోదించడాన్ని కూడా కాషాయ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. రెండున్నరేళ్లయినా చంద్రబాబు కుట్రను బీజేపీ పెద్దలు మర్చిపోలేదు. (చదవండి: ఎందుకు దాడిచేశారో చెప్పాల్సింది) ఇప్పుడు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లను బీజేపీ, జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని తెలిసింది. ఏపీ డ్రగ్స్కు అడ్డాగా మారుతోందని రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబును కలవాలని టీడీపీ నేతలు జాతీయ మీడియాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారట. అయినప్పటికి వారు బాబును పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. (చదవండి: Twitter: చంద్రబాబుపై వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు ) ఇటు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరక్క, అటు జాతీయ మీడియా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు వెనుదిరిగారు. ఆర్టికల్ 356 అంటూ హడావిడి చేద్దామనుకున్న చంద్రబాబు వ్యూహం తుస్సుమనడమే కాక జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిష్ట ఎంతలా దిగజారిందో మరోసారి బహిర్గతం అయ్యింది. చదవండి: ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్ -
అన్నీ పరిశీలించాకే జడ్జీల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: అనుభవం, అర్హత, ప్రభుత్వం నుంచి సేకరించిన వివరాలు ఇలా అన్నింటినీ పరిశీలించాకే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం నిర్దిష్ట ప్రక్రియ మేరకు జరుగుతుందని, హైకోర్టు కొలీజియం అన్ని వివరాలు పరిశీలించాకే సిఫారసు చేస్తుందని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్రెడ్డిని న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను సవాల్ చేస్తూ బి.శైలేష్ సక్సేనా అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం సక్సేనాకు రూ.5 లక్షల జరిమానా విధించింది. చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం గత ఆగస్టు 17న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం... తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డి సహా ఆరుగురు న్యాయమూర్తుల నియామకంపై హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసును ఆమోదించిన విషయం విదితమే. కాగా న్యాయమూర్తిగా వెంకటేశ్వర్రెడ్డిని నియమించాలన్న ప్రతిపాదనకు సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు రిజిస్ట్రార్ (నిఘా, పాలన)లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సక్సేనా 2020లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సక్సేనా పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. ‘ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డిపై పిటిషనర్ పలు ఆరోపణలు చేశారు. అయితే పిటిషనర్పై పలు ఫిర్యాదులు ఉన్నాయనే అంశాన్ని మేం పరిగణనలోకి తీసుకున్నాం. ఈ మేరకు నాడు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్న జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డి చేసిన ఫిర్యాదుతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన ప్రక్రియను పిటిషనర్ దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించాం. సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ వెల్ఫేర్ ఫండ్కు నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు జమ చేయాలని ఆదేశిస్తూ రిటి పిటిషన్ కొట్టేస్తున్నాం..’అని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. -
మణిపూర్ కొత్త గవర్నర్గా లా గణేషన్
ఇంఫాల్: మణిపూర్ కొత్త గవర్నర్గా లా గణేషన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 20న గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న నజ్మా హెప్తుల్లా స్థానంలో లా గణేషన్ ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన లా గణేషన్ బీజేపీ పలు కీలక పదవులు నిర్వహించారు. చదవండి: యూపీ మాజీ సీఎం కల్యాణ్సింగ్కు ప్రధాని మోదీ నివాళి President Ram Nath Kovind appoints La Ganesan as the Governor of Manipur. — ANI (@ANI) August 22, 2021 -
సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరిన సినీ పెద్దలు
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కోసం టాలీవుడ్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసి సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరారు. కాగా, గతంలో థియేటర్ల ఎలక్ట్రిసిటీ బిల్లులపై పరిశ్రమకు అనుకులంగా సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. దాంతో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తదితరులు సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ♦పి.మురళీమోహన్(అరకు) ♦ఆర్.చిరంజీవి(శ్రీకాకుళం) ♦కె.నిరంజనరావు(విజయనగరం) ♦కె.కృష్ణ(విశాఖపట్నం) ♦జె.ఆనంద్(అనకాపల్లి) ♦పి.శ్రీనివాస్(కాకినాడ) ♦కె.త్రినాథరావు(అమలాపురం) ♦ఎస్ఎంఎస్ హుస్సేన్(రాజమండ్రి) ♦వి.డేవిడ్రాజు(నరసాపురం) ♦డీవీ రామాంజనేయులు(ఏలూరు) ♦కేఎం ప్రసాద్(మచిలీపట్నం) ♦సీహెచ్ విష్ణువర్ధన్రావు(విజయవాడ) ♦వి.రాజశేఖర్రెడ్డి(గుంటూరు) ♦కె.కోటేశ్వరరావు(నర్సరావుపేట్) ♦ఎ.శ్రీనివాస్రావు(బాపట్ల) ♦వై.వెంకటేశ్వర్లు(ఒంగోలు) ♦కె.రామసుబ్బయ్య(నంద్యాల) ♦పి.సువర్ణరెడ్డి(కర్నూల్) ♦జి.ఉమాపతిరావు(అనంతపురం) ♦ఎ.కృష్ణమూర్తి(హిందూపురం) ♦జీవీ రాఘవరెడ్డి(కడప) ♦వై.మురళీధర్రెడ్డి(నెల్లూరు) ♦దొరబాబు అలియాస్ ముని బాలసుబ్రమణ్యం(తిరుపతి) ♦ఏబీ సుదర్శన్రెడ్డి(రాజంపేట్) ♦జి.సూర్యప్రతాప్రెడ్డి(చిత్తూరు) -
రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ లేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఏడాదిన్నరగా రెగ్యులర్ వైస్ చాన్స్లర్లు(వీసీ) లేరని, వెంటనే వీరి నియామకానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాసినట్లు తెలిసింది. ఇటీవల వీసీలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా వీసీలను నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 నాటికే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే ఏడాది జూలైలో ఈ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, 984 దరఖాస్తులు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నియామకాల్లో జాప్యంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సెర్చ్ కమిటీల సమావేశాలు త్వరగా నిర్వహించాలని, వీసీల నియామకాలూ వేగంగా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
కోటక్ బ్యాంక్ ఎమ్డీ ఉదయ్ కోటక్కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్డీగా ఉదయ్ కోటక్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. మరో మూడేళ్ల పాటు ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగుతారు. కోటక్ ఇప్పటికే గత 17 సంవత్సరాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతిగా పనిచేశారు. ప్రకాష్ ఆప్టేను పార్ట్టైమ్ ఛైర్మన్గా, దీపక్ గుప్తాను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమించడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని కోటక్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 జనవరి నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. (జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!) (చదవండి : స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్) -
స్టాఫ్నర్సు నియామకాల్లో అక్రమాలు
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్టాఫ్నర్సు అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. లోకల్ అభ్యర్థులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి మెరిట్ లిస్ట్ తయారు చేశారు. నాన్లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టి జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. ఫలితంగా అర్హుత ఉండీ ఉద్యోగాలు దక్కని వారంతా లబోదిబోమంటున్నారు. అనంతపురం హాస్పిటల్: స్టాఫ్నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఆరోగ్యశాఖ, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉండే పోస్టుల నియామకాలు, ప్రొవిజినల్ మెరిట్ లిస్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో మన జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా అర్హులకు మొండిచేయి చూపారన్న విమర్శలున్నాయి. పొరుగు జిల్లాలైనా వైఎస్సార్, కర్నూలులో లోకల్, నాన్లోకల్ కేటగిరిలో పోస్టులను పక్కాగా భర్తీ చేస్తుంటే ‘అనంత’లో మాత్రం నిబంధనలకు నీళ్లొదిలారు. కాంట్రాక్టు పోస్టుల భర్తీకి... కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పీహెచ్సీలు, సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ, ఏరియా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్టాఫ్నర్సు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. లోకల్ కాకపోయినా... ఈ నెల 14న 92 స్టాఫ్నర్సు పోస్టుల మెరిట్ లిస్టును డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్ విడుదల చేశారు. మొదటి 28 పోస్టులు అన్రిజర్వ్ కేటగిరికి కేటాయించారు. మరో రెండు పోస్టులు పీహెచ్ – హెచ్హెచ్ (వికలాంగులు)కు కేటాయించారు. ఇక మిగతా 62 పోస్టులు స్థానికంగా ఉండే వారికి కేటాయించాలి. కానీ వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎ.అమరావతి (జాబితాలో 28వ నంబర్)కి పోస్టింగ్ ఇచ్చారు. అర్హుల జాబితాలోనూ ఈమెను లోకల్గానే చూపించారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ (సీరియల్ నెంబర్ 64 )ను అర్హుల జాబితాలో లోకల్గా చూపించారు. ఇదే విధంగా మరో నలుగురు నాన్లోకల్ వారిని లోకల్గా చూపించి పోస్టులను కేటాయించారు. ఆరోగ్యశాఖలోనూ... ఈ నెల 5న డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్టాఫ్నర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు కేటాయించారు. మొత్తం 77 పోస్టులను భర్తీ చేశారు. అందులో వైఎస్సార్ జిల్లా గాలివీడుకు చెందిన కే.శైలజ (మెరిట్ నంబర్ 43) వర్కింగ్ ప్లేస్గా చూపించి పోస్టింగ్ కేటాయించారు. అలాగే మదనపల్లికి చెందిన ఉమాదేవి (సీరియల్ నంబర్ 65 ) , కర్నూలు జిల్లాకు చెందిన టి.సునీత (సీరియల్ నంబర్ 68)ను లోకల్ కేటగిరిలో చూపించారు. మెరిట్, ఫైనల్ మెరిట్ లిస్టుల్లో అభ్యర్థి ఏ ఊరు అనే అంశాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అదేబాటలో వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీలోనూ వైద్య కళాశాల డీఎంహెచ్ఓ, వైద్య విధానపరిషత్ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని అవలంభిస్తుండం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మెరిట్ జాబితా ఎంపికపై అవగాహన లేకపోవడంతో పాటు కొందరు అధికారుల అనుయాయులకు పోస్టులు కట్టబెట్టడానికే ఈ అడ్డగోలు బాగోతానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని జిల్లా అభ్యర్థులు కోరుతున్నారు. 92 పోస్టులకు 39 మంది హాజరు అనంతపురం హాస్పిటల్: డీసీహెచ్ఎస్ కార్యాలయంలో డీసీహెచ్ఎస్ రమేష్నాథ్ ఆధ్వర్యంలో గురువారం స్టాఫ్నర్సు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించారు. 92 పోస్టులకు గానూ కేవలం 39 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. అభ్యర్థుల మెరిట్ లిస్టు ప్రాతిపదికన స్థానాలను కేటాయించారు. అనంతరం డీసీహెచ్ఎస్ రమేష్నాథ్ అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. భర్తీ చేయాల్సిందిలా.. స్టాఫ్నర్సు పోస్టుల భర్తీలో 70 శాతం స్థానికులతోనే భర్తీ చేయాలి. 30 శాతం మాత్రం నాన్లోకల్ తో పాటు స్థానికులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. భర్తీ చేసిందిలా... 70 శాతం లోకల్ కేటగిరీలోనే నాన్లోకల్ వారికి అవకాశమిచ్చి ఉద్యోగాలిచ్చారు. ఫలితంగా జిల్లాకు చెందిన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. నాన్ లోకల్లోనూ మెరిట్ పక్కన పెట్టి జాబితా తయారు చేశారు. తప్పులుంటే సరిచేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతుంది. స్టాఫ్నర్సు పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విషయంపై మరోసారి జాబితాను పరిశీలిస్తాం. ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనూ ఇలాంటి సమస్య తలెత్తితే సరి చేసేలా చర్యలు తీసుకున్నాం. – సిరి , జాయింట్ కలెక్టర్ -
పరేష్ రావల్కు కీలక పదవి
సాక్షి, న్యూఢిల్లీ : విలక్షణ నటుడు పరేష్ రావల్ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. పరేష్ రావల్కు నూతన బాధ్యతలను కట్టబెట్టినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నిర్ధారించారు. పరేష్ నియామకం పట్ల నటుడికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఈ నియామకంతో కళాకారులు, విద్యార్ధులకు మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్ధాలకు పైగా తన సినీ ప్రస్ధానంలో పరేష్ రావల్ జాతీయ ఫిల్మ్ అవార్డు సహా పలు అవార్డులు అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. సినిమాలతో పాటు నాటక రంగంలోనూ పరేష్ రావల్ చురుకుగా ఉండేవారు. సినిమాల కంటే నాటకాలనే తాను అమితంగా ప్రేమిస్తానని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. చదవండి : అబ్దుల్ కలాం ఫిక్స్ -
టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన రద్దు!
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే, వారికి ఢిల్లీలో ఎవరి అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టాలనుకున్న ప్రజాచైతన్య యాత్రలపైనా తర్జనభర్జన పడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారిపై ఐటీ దాడులు జరగటం, రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడికావడంతో ఆందోళనలో ఉన్న టీడీపీ నేతలు యాత్ర నిర్వహించాలా వద్దా అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిసింది. ఒకవేళ యాత్ర చేసినా నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా చేయాలని సూచించినట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్సీలకు అమిత్ షా ఝలక్
సాక్షి, విజయవాడ : ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. శాసనమండలి రద్దు నిర్ణయంపై అమిత్ షాను కలవాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ పర్యటన ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్మెంట్ మాత్రమే ఖరారైంది. దీంతో ఇక చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మండలి రద్దుకు సహకరించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. (మండలి రద్దును ఆమోదించండి) -
నెలాఖరున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో సంస్థాగత ఎన్నికలకు ఫుల్స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇటు పార్టీ పదవుల్లో నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. జాతీయ పార్టీ అధ్యక్షుడి నియామకం పూర్తయిన నేపథ్యంలో జిల్లాల్లో అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇక ఎన్నికలుండే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే వారం రోజుల్లో జిల్లా కమిటీలకు అధ్యక్షులను నియమించేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్ ప్రకారం బూత్, గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆపై రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు, అనంతరం జాతీయ అధ్యక్షుడి నియామకం ఉండాల్సి ఉం ది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మండల కమిటీలకు కూడా పూర్తి స్థా యిలో ఎన్నికలు జరగలేదు. మరోవైపు జాతీయ అధ్యక్షుడి నియమా కం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కాకుండా సంప్రదింపులు జరిపి నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తె లిసింది. దీంతో వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాలకు, జిల్లాలకు కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియమించే అవకా శం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్తోపాటు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ప్రయత్నాల్లో ఉన్నా రు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు.. ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అ ధ్యక్ష పదవిని ఎవరికిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. -
ఢిల్లీలో పవన్ కల్యాణ్ నిరీక్షణ
సాక్షి, ఢిల్లీ: బీజేపీ నేతలతో అపాయింట్ ఖరారు కాకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరిన పవన్... బీజేపీ నేతలను కలుస్తారంటూ జనసేన ప్రచారం చేసింది. జేపీ నడ్డా తో పాటు హోంమంత్రి అమిత్షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చింది. ఎవరితోనూ అపాయింట్మెంటు లభించకపోవడంతో ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. గత పర్యటనలోనూ పవన్ కల్యాణ్ ఇదే పరిస్థితి చవిచూశారు.