-
భారత్లో భారీగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఇదే..
ధర ఎక్కువైనప్పటికీ భారతీయ మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు డిమాండ్ భారీగానే ఉంది. గత అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రికార్డ్ సేల్స్ సాధించి, 7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు కెనాలిస్ పరిశోధనలో వెల్లడైంది. ఇందులో కూడా అత్యధికంగా 15 సిరీస్ మోడళ్లకు గిరాకీ ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో సులభ ఫైనాన్సింగ్ ఎంపికలు, రిటైలర్లకు ప్రోత్సాహక పథకాల కారణంగా.. పండుగ సీజన్లో అమ్మకాలు బాగా పెరిగాయి. అంతే కాకుండా గతేడాది ఐ15 సిరీస్ లాంచ్ అవ్వడంతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్ మీద కూడా సంస్థ తగ్గింపులు ప్రకటించడంతో ఈ మొబైల్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. యాపిల్ మొబైల్స్ అమ్మకాల తరువాత శాంసంగ్, షావోమి, వివో, రియల్మీ, ఒప్పో వంటి కంపెనీలు మంచి అమ్మకాలను పొందాయి. భారతదేశంలో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్ల సంఖ్య 14.86 కోట్లు కావడం గమనార్హం. ఈ ఏడాది 5జీ పరికరాల ధరలు పెరుగుదల కారణంగా.. తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. కానీ కెనాలిస్ అంచనా ప్రకారం ఈ ఏడాది కూడా అమ్మకాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయవచ్చని తెలుస్తోంది. అయితే అమ్మకాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సిన విషయమే.. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి.. -
స్మార్ట్ఫోన్స్ ఆదాయాల్లో యాపిల్ టాప్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గతేడాది (2023) అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తొలిసారిగా ఆదాయాలపరంగా అగ్రస్థానం దక్కించుకుంది. అమ్మకాల పరిమాణంపరంగా శాంసంగ్ నంబర్వన్గా ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నెలవారీ స్మార్ట్ఫోన్ ట్రాకర్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో భారత్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ..దాదాపు అంతక్రితం ఏడాది స్థాయిలోనే 15.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. కొరియన్ దిగ్గజం శాంసంగ్, చైనా మొబైల్స్ తయారీ సంస్థలు వివో, ఒప్పో తమ మార్కెట్ వాటాలను పెంచుకోగలిగాయి. భారత్పై ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా యాపిల్కి కలిసి వస్తోందని కౌంటర్పాయింట్ తమ నివేదికలో తెలిపింది. స్థూల ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా గతేడాది ప్రథమార్ధం సవాళ్లతో గడిచిందని, డిమాండ్ పడిపోయి, నిల్వలు పెరిగిపోయాయని పేర్కొంది. 5జీ అప్గ్రేడ్లు, పండుగ సీజన్ అమ్మకాలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో ద్వితీయార్ధంలో మార్కెట్ క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టిందని వివరించింది. మొత్తం ఫోన్ల మార్కెట్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 52 శాతం దాటిందని, వార్షిక ప్రాతిపదికన 66 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మరోవైపు, 2023 నాలుగో త్రైమాసికంలో దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ 25 శాతం వృద్ధి చెందినట్లు కౌంటర్పాయింట్ తెలిపింది. మరిన్ని విశేషాలు.. ► స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు ప్రీమియం ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2023లో రూ. 30,000 పైన రేటు ఉన్న ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు 64 శాతం పెరిగాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ స్కీములు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి ఫైనాన్స్ మీదే కొన్నారు. ► ప్రీమియం సెగ్మెంట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు మరింతగా ఆదరణ పెరగవచ్చు. వాటి అమ్మకాలు 2024లో 10 లక్షలు దాటవచ్చని అంచనా. ► స్మార్ట్ఫోన్లలో ఆడియో–వీడియోపరంగా డాల్బీ అటా్మస్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు మరింతగా పెరగవచ్చు. -
యాపిల్ ఇండియాకు ఐఫోన్ల జోష్
న్యూఢిల్లీ: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇండియా అక్టోబర్–డిసెంబర్ కాలానికి టర్నోవర్లో సరికొత్త రికార్డ్ సాధించింది. 2 శాతం వృద్ధితో 119.6 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. ఇందుకు ఐఫోన్ విక్రయాల జోరు దోహదపడింది. వెరసి దేశీ అమ్మకాలలో కంపెనీ సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. యాక్టివ్ డివైస్ల సంఖ్య 2.2 బిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని ప్రొడక్టులలోనూ ఇది అత్యధికంకాగా.. ఐఫోన్ల నుంచి ఆదాయం 6 శాతం ఎగసి 69.7 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. మలేసియా, మెక్సికో, టర్కీ తదితర వర్ధమాన మార్కెట్లలోనూ కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు అందుకున్నట్లు కుక్ పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ రీసెర్చ్ వివరాల ప్రకారం తొలిసారి 2023లో యాపిల్ అత్యధిక ఆదాయం అందుకోగా.. అమ్మకాల పరిమాణంలో శామ్సంగ్ ముందుంది. కోటి యూనిట్ల షిప్మెంట్ల ద్వారా యాపిల్ ఆదాయంలో టాప్ ర్యాంకును కొల్లగొట్టింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో ఐప్యాడ్ అమ్మకాలు 25 శాతం క్షీణించి 7 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. వేరబుల్, హోమ్, యాక్సెసరీస్ విభాగం విక్రయాలు సైతం 11 శాతం నీరసించి 11.95 బిలియన్ డాలర్లను తాకాయి. ఇక మ్యాక్ పీసీ అమ్మకాలు ఫ్లాట్గా 7.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సర్వీసుల ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని 23.11 బిలియన్ డాలర్లకు చేరింది. -
అంతా ఐఫోన్ల చలవే! టిమ్కుక్ ఫుల్ హ్యాపీ
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్.. గత డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ కంపెనీ తయారు చేసిన ఐఫోన్లు భారీగా అమ్ముడుపోవడంతో అత్యధిక లాభాలు వచ్చాయి. యాపిల్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 119.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.9 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 2 శాతం అధికం. ఈ త్రైమాసికంలో ఐఫోన్లు 6 శాతం అధికంగా అమ్ముడుపోయాయి. మొత్తం ఆదాయంలో ఐఫోన్ల ద్వారా వచ్చిన ఆదాయం 69.7 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.5.7 లక్షల కోట్లు). యాపిల్ యాక్టివ్ డివైజ్ బేస్ ఆల్టైమ్ హైని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులను వాడుతున్నవారి సంఖ్య 220 కోట్లను దాటింది. భారత్లో ఆదాయ పరంగా వృద్ధిని సాధించామని, డిసెంబర్ త్రైమాసికంలో బలమైన రెండంకెల వృద్ధిని, ఆదాయ రికార్డును తాకినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. భారత్తో పాటు మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో యాపిల్ రికార్డు ఆదాయాలను నమోదు చేసింది. 2023లో ఆదాయ పరంగా యాపిల్ భారతీయ మార్కెట్లో అగ్రగామిగా ఉందని, ఎగుమతులలో కోటి యూనిట్లను అధిగమించిందని ‘కౌంటర్పాయింట్ రీసెర్చ్’ పేర్కొంది. -
‘నా జీవితాన్ని నాశనం చేయొద్దు నాన్న’!
ఐఫోన్! పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యాపిల్ తయారు చేసిన ఐఫోన్లను అంటే మక్కువ. కానీ సెలబ్రిటీలు ఐఫోన్ను కొనుగోలు చేస్తున్నా దాని ధర కారణంగా సామాన్యులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అలాంటి కాస్ట్లీ ఐఫోన్ని కావాలని ఓ 11 ఏళ్ల అమ్మాయి మారం చేస్తోంది. అందుకు ఆ చిన్నారి తండ్రి ఏం చేశాడు. గత దశాబ్దకాలంగా లేటెస్ట్గా మార్కెట్లో విడుదలవుతున్న గాడ్జెట్లు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ పిల్లలు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో యాపిల్ తయారు చేసిన ఐఫోన్తో పాటు ఇతర ఉత్పత్తులు ప్రత్యేకం. నాకు ఐఫోన్ 15 కావాలి తాజాగా, ఓ తండ్రిని తన 11 ఏళ్ల కుమార్తె ఐఫోన్ 15 కొనిపెట్టమని అడిగింది. అందుకు అతను సున్నితంగా తిరస్కరించాడు. అంత ధర పెట్టి ఫోన్ కొనుగోలు చేయకూడదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. సరే కుమార్తె అడిగింది కదా.. పోనీలే అని కెమెరా పనితనం, బ్యాటరీ లైఫ్టైం బాగుందనే ఉద్దేశ్యంతో ఐఫోన్ 13 ఫోన్ని కొనుగోలు చేస్తానని మాటిచ్చాడు. ఐఫోన్ 13 కొనిస్తా నాన్న అందుకు కుమార్తె ససేమిరా అన్నది. ‘నాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం ఆమెకు నా పాత ఐఫోన్ 8ని ఇచ్చాను. ఆ ఫోన్తో తన స్నేహితులతో మాట్లాడుకునేందుకు, సోషల్ మీడియాను వాడుతుంది. ఇటీవల ఆమె స్నేహితులు కొత్త ఫోన్లను కొనుగోలు చేశారు. తనకి కూడా కొత్త ఫోన్ కావాలని మారం చేస్తోంది. నా ఫోన్ పాతది. నా స్నేహితులు కొత్త ఫోన్లు కొనుక్కున్నారు. నా క్కూడా కొత్త ఫోన్ కొనిపెట్టమని అడుగుతుంది. సరే నా కూతురు ఫోన్ అడిగిందని ఐఫోన్ 13ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డా. ఇతర లేటెస్ట్ ఐఫోన్ సిరీస్లు ఎలా ఉన్నాయో.. ఆ ఫోన్ కూడా అలాగే ఉంది. ధర కూడా 600 డాలర్లు. అయితే, ఆఫోన్ 120హెచ్జెడ్ డిస్ప్లే ఉందని, గేమ్స్ ఆడుకునేందుకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ని కోరుకుంటుంది. ఆ ఫోన్ కూడా అంతే 120 హెచ్జెడ్ డిస్ప్లేగా ఉందిగా. ఐఫోన్ 15 కొనడం డబ్బు వృధా అని భావించాను. కానీ నా నిర్ణయాన్ని నా 11 ఏళ్ల కుమార్తె విభేదించింది. మీరే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని అంటోంది. గడుగ్గాయ్.. చివరికి అనుకున్నది సాధించింది ‘నా కుమార్తె గేమర్. పాతది అయినందున తన ఫోన్ సరిగ్గా గేమ్ చేయడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె ఐఫోన్ 13ని కొనిస్తానని నేను ఇప్పటికే చెప్పాను. కానీ ఆమె ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కావాలని మొండిగా ప్రవర్తిస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ సోషల్ మీడియాలో వాపోయాడు తండ్రి. చివరికి తన కుమార్తెకు ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోని కొనిచ్చి సంతోష పెట్టిందని అన్నాడు. ఈ పోస్ట్పై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సు అంత ఖరీదైన ఫోన్ కొనొద్దని, పిల్లలకు అతిగారాభం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. -
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. యాపిల్కు ఈయూ వార్నింగ్!
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారుచేసే ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ను యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. యాపిల్ యాప్స్టోర్లో చేస్తున్న మార్పులు యూరోపియన్ యూనియన్ తీసుకువచ్చే నిబంధనలకు అనుగుణంగా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ తీసుకువస్తున్న డిజిటల్ మార్కెట్ల చట్టానికి (DMA) అనుగుణంగా యాపిల్.. సాఫ్ట్వేర్ డెవలపర్లు ప్రత్యామ్నాయ యాప్ స్టోర్ల ద్వారా యాపిల్ పరికరాలలో తమ అప్లికేషన్లను ఉంచడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్లలో యాప్స్టోర్ కాకుండా ప్రత్యామ్నాయ యాప్ స్టోర్లను అందించడానికి మార్చి ప్రారంభం నుంచి డెవలపర్లకు అవకాశం ఉంటుంది. యాపిల్ యాప్ స్టోర్లో ప్రస్తుతం డెవలపర్లు 30 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సి ఉంది. ఈ సర్దుబాట్లు ఉన్నప్పటికీ యాపిల్ ఫీజు విధానం అన్యాయంగా ఉందని, ఇదిడిజిటల్ మార్కెట్ల చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. యాపిల్ ప్రణాళికల గురించిన విచారణలకు ప్రతిస్పందిస్తూ ఈయూ ఇండస్ట్రీ చీఫ్ థియరీ బ్రెటన్.. ‘డిజిటల్ మార్కెట్లు సజావుగా.. బహిరంగంగా పోటీకి ఇంటర్నెట్ గేట్లను డిజిటల్ మార్కెట్ల చట్టం తెరుస్తుంది. మార్పు ఇప్పటికే జరుగుతోంది. మార్చి 7 నుంచి థర్డ్ పార్టీల అభిప్రాయంతో కంపెనీల ప్రతిపాదనలను అంచనా వేస్తాం" అని రాయిటర్స్తో అన్నారు. కంపెనీల ప్రతిపాదిత పరిష్కారాలు చట్టానికి అనుగుణంగా లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి యూరోపియన్ యూనియన్ వెనుకాడదని బ్రెటన్ ఉద్ఘాటించారు. యాపిల్ యాప్స్టోర్ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించకుండా డెవలపర్లకు ఎంపిక ఉన్నప్పటికీ ఒక యూజర్ అకౌంట్కు సంవత్సరానికి 50 యూరో సెంట్ల "కోర్ టెక్నాలజీ రుసుము" మాత్రం తప్పనిసరి. అయితే కొత్త వ్యాపార నిబంధనలను ఎంచుకున్న డెవలపర్లకు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది. -
భారీగా పెరిగిన షేర్స్.. కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మైక్రోసాఫ్ట్!
గ్లోబల్ ఐటీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మార్కెట్ విలువ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్ను సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కంపెనీ ఈ పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి యూఎస్ స్టాక్ ఎక్సేంజ్లో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 1.3 శాతం పెరిగి 403.78 డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్ విలువ పెరగడంతో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకుంది. గతంలో 3 ట్రిలియన్ మార్కెట్ విలువను సాధించిన మొదటి కంపెనీగా యాపిల్ చేరింది. ఇప్పుడు అలాంటి రికార్డును తాజాగా మైక్రోసాఫ్ట్ కైవసం చేసుకుంది. ఇక యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 3.03 ట్రిలియన్ డాలర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా? మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం.. కంపెనీ ముందుకు దూసుకెళ్లడానికి, వృద్ధి సాధించడానికి కారణమవుతోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధిని సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ, యాపిల్ కంపెనీని అధిగమిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
ఐఫోన్ 16 సిరీస్ డిజైన్లు.. తెరపైకి మరో రూమర్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి ఏడాది ఐఫోన్ సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఇప్పటికే గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసిన యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ను మార్కెట్కు పరిచయం చేయనుంది. అయితే, ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ డిజైన్పై రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 16తో తీసుకునే ఫోటోలు, వీడియోల కోసం యాపిల్ సంస్థ కొత్త బటన్పై పనిచేస్తుందని, ప్రోటోటైప్లపై దాని వినియోగం ఎలా ఉందో పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ బటన్ను ఐఫోన్లపై అమర్చితే సింగిల్ క్లిక్తో ఫోటోలు, వీడియోలు తీసుకునే వెసులు బాటు కలగనుంది. నివేదిక ప్రకారం.. కెమెరా బటన్ ఫోన్కు కుడి దిగువన ఉండవచ్చని, అంటే ల్యాండ్స్కేప్ మోడ్లో ఫోటోలు ,వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా, గత సంవత్సరం సెప్టెంబర్లో లాంచ్ చేసిన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ను పాత ఫోన్ సిరీస్ల కంటే భిన్నంగా మ్యూట్ బటన్ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్తో వచ్చింది. మాక్ రూమర్స్ ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్లో ప్రాజెక్ట్ నోవా పేరుతో కొత్త కెమెరా బటన్ మెకానికల్కు బదులుగా కెపాసిటివ్ బటన్గా ఉంటుందని అంచనా వేయబడింది. ఐఫోన్ ఎస్ఈ లోని హోమ్ బటన్ను పోలి ఉండేలా కొత్త బటన్ ఉండవచ్చని తెలుస్తోంది. -
ప్రపంచ టెక్ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇటీవల తన బాయ్ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్ఫేక్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి. శామ్ ఆల్ట్మన్, ఓపెన్ ఏఐ సీఈవో హైస్కూల్లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్తో పెళ్లికి ముందు లూప్ట్ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆల్ట్మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్తో డేటింగ్ గురించి పబ్లిక్గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ త్వరలో మల్హెరిన్తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస్లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. టిమ్ కుక్, యాపిల్ సీఈవో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్ను బిలియనీర్గా మార్చింది. క్రిస్ హ్యూస్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్తో పాటు ఫేస్బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్డ్రిడ్జ్ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్బుక్, మార్క్ జుకర్బర్గ్పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్గా ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో యాపిల్, గూగుల్, ఇన్టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్ప్రాఫిట్ సంస్థ కాండిడ్లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు. -
‘సంపాదన తగ్గింది’.. సీఈఓ టిమ్కుక్కు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు వచ్చే ఆదాయం తగ్గడంతో ఆ సంస్థ సీఈఓ టిమ్కుక్ సంపాదించే సంపాదన తగ్గించింది. 2022తో పోలిస్తే 2023లో ఆయన సంపాదన భారీగా తగ్గినట్లు యాపిల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. టిమ్కుక్ గత ఏడాది భారీ మొత్తంలో సంపాదించారని, కానీ అది 2022లో కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో ఆయన సంపాదించిన మొత్తం 99.4 మిలియన్లు కాగా 2023లో 63.2 మిలియన్లగా ఉందని నివేదికలో పేర్కొంది. రిపోర్ట్లో ఏముందంటే? ఇటీవల యాపిల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. అందులో టిమ్ కుక్కు అందించే పరిహారం, షేర్ హోల్డర్స్ సలహాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మార్పులు వంటి అంశాలను ప్రధానంగా చర్చించింది. అందులో యాపిల్ సీఈఓ సంపాదన తగ్గినట్లు హైలెట్ చేసింది. టిమ్కుక్ విమాన ఖర్చులు యాపిల్ 2022లో సీఈఓ కుక్కి అందించే శాలరీ, స్టాక్ అవార్డ్స్, నాన్ ఈక్విటీ బోనస్ (పరిహారం) 84 మిలియన్లగా నిర్దేశించింది. అయితే అతను అంచనాలను మించి 99.4 మిలియన్లను సంపాదించాడు. కానీ 2023కి కుక్ పరిహారం 40 శాతం తగ్గి 49 మిలియన్లకు పడిపోయింది. కుక్ అందించే పరిహారంలో 3 మిలియన్ల జీతం, స్టాక్ అవార్డులు మొత్తం 46,970,283 డాలర్లు, నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్ పరిహారం మొత్తం 10,713,450 డాలర్లు, ఇతర పరిహారం 2,526,112 డాలర్ల వరకు పొందారు. 2023లో కుక్ కోసం యాపిల్ వ్యక్తిగత విమాన ప్రయాణ కోసం 1,621,468 డాలర్లు ఖర్చు చేసిందని, 2022లో వెచ్చించిన మొత్తం కంటే రెండింతలు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. కంపెనీ కుక్ కోసం వ్యక్తిగత భద్రత కోసం 820,309 డాలర్లు పెట్టుబడి పెట్టింది యాపిల్ సగటు ఉద్యోగి వేతనం ఎంతంటే? 2023లో తన సగటు ఉద్యోగికి సగటు వార్షిక మొత్తం పరిహారం 94,118 డాలర్లు అని యాపిల్ తెలిపింది. ఇక టిమ్కుక్తో పాటు మిగిలిన ఎగ్జిక్యూటీవ్లకు యాపిల్ భారీ మొత్తాన్ని అందించింది. వారిలో సీఎఫ్ఓ లూకా మాస్త్రి : 26,935,883 డాలర్లు జనరల్ కౌన్సెల్ అండ్ సెక్రటరీ కేట్ ఆడమ్స్ : 26,941,705 డాలర్లు రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబ్రెయిన్ : 26,937,010 డాలర్లు సీఓఓ జెఫ్ విలియమ్స్ : 26,961,221 డాలర్లను అందిచినట్లు యాపిల్ తన నివేదికలో వెల్లడించింది. -
వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్
యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మరో సారి రికార్డ్ క్రియేట్ చేసింది. 2024 ప్రారంభం నుంచి మార్కెట్లో యాపిల్ డిమాండ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ యాపిల్ని బీట్ చేసి ఆ స్థానం కైవసం చేసుకుంది. వాషింగ్టన్కు చెందిన మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5% పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏఐ మైక్రోసాఫ్ట్ వృద్ధికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2021 తర్వాత మొదటి సారి యాపిల్ వాల్యుమేషన్ మైక్రోసాఫ్ట్ కంటే తక్కువకు పడిపోయింది. కరోనా మహమ్మారి సమయంలో సప్లై చైన్ కొంత నిరాశపరచిన సమయంలో కూడా యాపిల్ని మైక్రోసాఫ్ట్ అధిగమించింది. ప్రస్తుతం, వాల్ స్ట్రీట్ మైక్రోసాఫ్ట్ మరింత సానుకూలంగా ఉంది. ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న కారణంగా యాపిల్ బలహీనపడింది. ఇదీ చదవండి: కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. చైనాలో యాపిల్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది, రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ వృద్ధి గతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి కారణం మైక్రోసాఫ్ట్ చాట్జీపీటీ మేకర్ ఓపెన్ఏఐతో టై ఆప్ కావడమని తెలుస్తోంది. -
డేంజర్ యాప్స్పై డాట్ పంజా.. డిలీట్ చేసిన గూగుల్, యాపిల్
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోవడంతో.. 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఈసిమ్ యాప్లను గూగుల్, యాపిల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్లో (Airalo), హోలాఫ్లై (Holafly), eSIM వంటి యాప్లను తొలగించాయి. భారతదేశంలో ఈసిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని, అప్పుడు మాత్రం అధీకృత డీలర్లు విక్రయించుకోవచ్చని, విక్రయించే ముందు తప్పకుండా పాస్పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్ను కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించింది. విక్రేత కూడా గ్లోబల్ సిమ్ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈసిమ్ విషయాన్ని పక్కన పెడితే.. సింగపూర్కు చెందిన ఎయిర్లో, స్పెయిన్కు చెందిన హోలాఫ్లై రెండు యాప్లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు, దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం ఈసిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈసిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి DoT ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అలాస్కా విమాన ప్రమాదం, మరో ఆశ్చర్యకరమైన విషయం
అలాస్కా ఎయిర్లైన్స్ ASA 1282 విమానంలో ఊహించని పరిణామంలో ప్రయాణీకులు అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా నమోదైంది. అలాస్కా ఎయిర్లైన్స్ విమానం నుండి 16వేల అడుగుల కింద పడిపోయిన ఆపిల్ ఐఫోన్ చిన్న గీత కూడా పడకుండా , చెక్కు చెదరకుండా ఉండటం విశేషంగా నిలిచింది. పోర్ట్లాండ్కు చెందిన సీనాథన్ బేట్స్ ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేశారు. విమానం శిధిలాలను గుర్తించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న బార్న్స్ రోడ్లో నడుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఐఫోన్ను కనుగొన్నానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఎన్టీఎస్బీ సమాచారం ప్రకారం ఆ ఘటనలో కనుగొన్న రెండో ఐఫోన్ అని, కానీ డోర్ మాత్రం దొరకలేదు అంటూ కమెంట్ చేశారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటు దీనిపై నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. 16వేల అడుగుల ఎత్తునుంచి పడినా దానికి గీతలు పడలేదని, కవర్ , స్క్రీన్ ప్రొటెక్టర్ చెక్కుచెదరకుండా ఉన్నాయని బేట్స్ వెల్లడించారు. ఐఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లో ఉందని , దానిని కనుగొన్నప్పుడు అన్లాక్ చేసినట్టు వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఎన్టీఎస్బీ ఇచ్చినట్లు ట్విటర్(ఎక్స్)లో షేర్ చేశారు. దీన్ని అలాస్కా ఎయిర్లైన్ ప్యాసింజర్కు చెందినదని నిర్ధారించారు. అయితే ఇది ఏ మోడల్ ఐఫోన్ అనే వివరాలు అందుబాటులో లేవు. Found an iPhone on the side of the road... Still in airplane mode with half a battery and open to a baggage claim for #AlaskaAirlines ASA1282 Survived a 16,000 foot drop perfectly in tact! When I called it in, Zoe at @NTSB said it was the SECOND phone to be found. No door yet😅 pic.twitter.com/CObMikpuFd — Seanathan Bates (@SeanSafyre) January 7, 2024 కాగా పోర్ట్ల్యాండ్, ఒరెగాన్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోలో చెందిన అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లతోపాటు, కొన్ని వస్తువులు కూడా ఆ విమానం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చివరకు అదే ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
లాంచ్కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు
భారతీయ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సంస్థ త్వరలో వర్చ్యువల్ రియాల్టీ హెడ్సెట్ 'విజన్ ప్రో' (Vision Pro) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. యాపిల్ సంస్థ లాంచ్ చేయనున్న ఈ కొత్త హెడ్సెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్లూమ్బెర్గ్ నివేదికల ప్రకారం, యాపిల్ కంపెనీ తన వర్చ్యువల్ రియాల్టీ హెడ్సెట్ను లాంచ్ చేయడానికంటే ముందు రిటైల్ స్టోర్లకు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫిబ్రవరిలో అధికారికంగా లాంచ్ అయిన తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం. యాపిల్ సంస్థ ఈ విజన్ ప్రో హెడ్సెట్ సేల్స్ కోసం ఉద్యోగులకు ప్రత్యేకమైన శిక్షణ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి డెలివరీలు ప్రారంభమయ్యే సమయంలో శిక్షణ పొందిన ఉద్యోగులు రిటైల్ స్టోర్ల వద్ద ఇద్దరు లేదా ముగ్గురు ఉండే అవకాశం ఉంది. వారు కొనుగోలుదారులకు హెడ్సెట్కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారు. ధర (Price) 2023 WWDC ఈవెంట్లో మొదటి సారి కనిపించిన యాపిల్ విజన్ ప్రో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ హెడ్సెట్లో ఎమ్2 చిప్ సెట్, రెండు హై-రిజల్యూషన్ 4K ఐపీస్ వంటివి ఉంటాయి. దీని ధర 3499 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.90 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. ఇదీ చదవండి: ట్రెండ్ మార్చిన వర్కింగ్ ఉమెన్స్.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్ ఈ లేటెస్ట్ హెడ్సెట్తో వర్చ్యువల్ రియాల్టీ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. ఇది మొదట కేవలం అమెరికాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఆ తరువాత చైనా, కెనడా, యూకే వంటి దేశాల్లో విక్రయాలు ఉంటాయి. అయితే భారతదేశంలో ఈ హెడ్సెట్ ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. I’d expect a Vision Pro related announcement sometime this upcoming week. Start writing your “Apple Wins CES” headlines. https://t.co/A41ayEKe6o — Mark Gurman (@markgurman) January 7, 2024 -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త.. నష్టపరిహారం చెల్లిస్తున్న యాపిల్!
మీరు పాత ఐఫోన్లను వినియోగిస్తున్నారా? వాటిల్లో ఏమైనా బ్యాటరీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ తరహా ఇబ్బందులు తలెత్తుంటే ప్రముఖ టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నష్టపరిహారం చెల్లిస్తుంది. సుమారు 8 ఏళ్ల క్రితం నమోదైన యాపిల్పై ‘బ్యాటరీగేట్’ క్లాస్-యాక్షన్ లాసూట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఐఫోన్లను వినియోగిస్తుంటే యాపిల్ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. అసలేంటి యాపిల్ ‘బ్యాటరీగేట్’ వివాదం 2016లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, 7 సిరీస్తో పాటు ఎస్ఈ మోడల్ ఫోన్లపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐఫోన్ సిరీస్ మోడళ్లు స్లో అవ్వడంతో వాటిని ఆపరేట్ చేయలేపోతున్నామంటూ అమెరికాకు చెందిన సుమారు 33 రాష్ట్రాల యూజర్లు మూకుమ్మడిగా సంబంధిత రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించారు. యాపిల్ సంస్థ ధనార్జన కోసం కావాలనే తమ ఫోన్లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిందని, తద్వారా మేం వినియోగించే ఫోన్లు పనిచేయడం మందగిస్తే.. కొత్త ఫోన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కొనుగోలు చేస్తే ఐఫోన్ల అమ్మకాలు జరిగి.. యాపిల్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు. యాపిల్ అనాలోచిత నిర్ణయం వల్లే వినియోగదారుల హక్కుల కోసం పోరాడే జస్టిన్ గుట్మాన్ సైతం యాపిల్కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్లతో పాటు పవర్ మేనేజ్మెంట్ టూల్ వల్ల ఐఫోన్లు అకస్మాత్తుగా షట్డౌన్ అవ్వడం, బ్యాటరీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. యాపిల్ నిర్ణయంతో ఐఫోన్ 6, 6ప్లస్, 6 ఎస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ,7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ను వినియోగిస్తున్న యూకేలో 25 మిలియన్ల ఐఫోన్ యూజర్లకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తం విలువ 768 మిలియన్లని కోర్టుకు ఆధారాల్ని అందించారు. తెరపైకి బ్యాటరీగేట్ వివాదం ఈ వివాదాన్ని మరింత ఉదృతం చేసేలా.. యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఉద్దేశపూర్వకంగా ప్రాసెసర్ పనితీరు మందగించేలా వ్యవహరించిందని తెలిపేలా ‘బ్యాటరీగేట్’ అనేపదాన్ని అనే పదాన్ని రూపొందించారు. ‘బ్యాటరీగేట్’ పేరును ట్రెండింగ్లోకి తెచ్చారు. బాధిత యూజర్లకు 92 డాలర్ల నష్టపరిహారం ఈ వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. వినియోగదారుల ఫిర్యాదు దెబ్బకు యాపిల్ దిగొచ్చింది. 2020లో బాధిత యూజర్లకు 500 మిలియన్ల నష్టపరిహారం చెల్లిస్తామని అంగీకరించింది. ఒప్పందం ప్రకారం.. యాపిల్ ఇటీవల ప్రతి ఒక్క బాధిత యూజర్కు 92 డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..!
ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీనే. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని పక్షంలో సీనియర్ డైటీషియన్నిగానీ, వైద్యుణినిగానీ సంప్రదించడం ఉత్తమం. అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్య కాలంలో బాగా వినిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్. వెయిట్ లాస్కు ఇది అద్భుతంగా పనిచేస్తుందనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే అసలేంటీ ఏబీసీ జ్యూస్. దీని లాభ నష్టాలేంటి ఒకసారి చూద్దాం. ABC జ్యూస్ అంటే ఏమిటి? ఈ అద్భుత పానీయం (సోషల్ మీడియాలో బాగా పాపులర్) నిజానికి మూడింటి రసాల మిశ్రమం. యాపిల్(A) బీట్రూట్(B) క్యారెట్ (C) అలా టోటల్గా ఇది ABC జ్యూస్ అయిందన్నట్టు. వీటిని ప్రయోజనాలను విడివిడిగా చూస్తే. యాపిల్స్ అధిక పోషకాలు, యాపిల్స్ చాలా పోషకమైనవి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ శక్తివంతమైన ,రుచికరమైన వెజిటబుల్. శరీరంలోని టాక్సిన్స్ను తొలగించే లక్షణం ఇందులో ఉంది. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, బాడీ మెటబాలిజానికి ఉపయోగ పడుతుంది. క్యారెట్ పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్లో బీటా-కెరోటిన్ విటమిన్ A ఎక్కువ లభిస్తుంది. కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ పుల్కంగా ఉన్నాయి. క్యారెట్లో యాంటీఆక్సిడెంట్లు , మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు. ABC జ్యూస్ ఆరోగ్యకరమైనదేనా? ఈ జ్యూస్లో వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవే అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఈ పండ్లు , కూరగాయల కలయిక ఆరోగ్యకరమైన దేనా అన్నదే ప్రశ్న. ఇందులో అధిక పోషకాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి అలాగే ఫైబర్ కూడా మెండుగా ఉంది కాబట్టి, ABC డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అని న్యూట్రిషన్ అండ్ డైటీషయన్ల అభిప్రాయం. దీనికి తోడు ఇవి సులభంగా, చవకగా అందుబాటులో ఉంటాయంటున్నారు. ABC జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే, మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిలోని నేచురల్ సుగర్ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. రోజంతా ఇదే పానీయం తీసుకోవడం కాకుండా ABC జ్యూస్తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ABC జ్యూస్ దుష్ప్రభావాలు పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు, కిడ్నీ రోగులు లేదా తక్కువ FODMAP డైట్లో ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు ABC జ్యూస్కు దూరంగా ఉండాలి. ఎలా చేసుకోవాలి రెండు యాపిల్స్, చిన్న క్యారెట్లు, ఒక బీట్ రూట్ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని, జ్యూసర్లో బాగా మెత్తగా అయ్యాక, రసం తీసుకోవాలి. దీన్ని వడపోసుకుని తాగవచ్చు. కావాలంటే రుచికి నిమ్మరసం, చిన్న అల్లంముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్లలో టెలిఫోటో లెన్స్లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
యాపిల్కు మరో భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డజనకు పైగా సీనియర్ ఉద్యోగులు ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా, యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చారు. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ డిజైనర్లలో ఈయన ఒకరు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క్లార్క్ యాపిల్ కంపెనీలో ప్రముఖ డిజైనర్. ముఖ్యంగా యాపిల్ ప్రొడక్ట్లు ఐమాక్,ఐపాడ్ నానో,మాక్ బుక్ ప్రో, మాక్ బుక్ ఎయిర్ తో పాటు ఇతర ప్రొడక్ట్లలోని హార్డ్వేర్లను డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు యాపిల్ హెడ్ క్వార్టర్స్, ఇతర యాపిల్ రీటైల్ స్టోర్ల డిజైన్లలో పీటర్ రస్సెల్ క్లార్క్ భాగస్వామ్యం ఉంది. యాపిల్ కంపెనీలో సుమారు 1000కి పైగా పెటెంట్ రైట్స్ క్లార్క్ పేరుమీదే ఉన్నాయి. అలాంటి డిజైనర్ కుపెర్టినో దిగ్గజం కోల్పోవడం పెద్ద ఎదురు దెబ్బేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్లో యాపిల్కు రిజైన్ చేసిన క్లార్క్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ వాస్ట్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్లపై సలహాలు ఇచ్చేలా సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు. క్లార్క్ మాత్రమే కాదు ప్యాషన్ కోసం యాపిల్ విడిచి పెట్టిన వారిలో జోనీ ఐవ్తో సహా అనేక ఇతర ఆపిల్ డిజైనర్లు 2019లో తన స్వంత డిజైన్ కంపెనీ లవ్ఫ్రమ్ని స్థాపించడానికి యాపిల్కి గుడ్బై చెప్పారు. ఐవ్ యాపిల్లో 1992 నుండి 2019 వరకు 27 సంవత్సరాలు పని చేశారు. 1990ల చివరిలో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2015లో చీఫ్ డిజైన్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టి జూలై 2019లో కంపెనీని విడిచిపెట్టారు. -
యూజర్లకు అలెర్ట్.. టెక్ దిగ్గజం యాపిల్కు కొత్త తలనొప్పి!
అవును. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ కంపెనీ సీఈఓ టిమ్కుక్ ఆలోచనలో పడ్డారు. వెంటనే యూజర్లకు అలెర్ట్ జారీ చేశారు. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదే’ ఈ సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఇదే అంశం టిమ్ కుక్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ మార్కెట్లో యాపిల్ కంపెనీ పేరు చెప్పి.. నకిలీ ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ రాయుళ్లు. దీంతో నకిలీ ఉత్పత్తుల నుంచి యూజర్లను అప్రమత్తం చేశారు టిమ్కుక్. తమ సంస్థ తయారు చేస్తున్న స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్స్లకు ఉపయోగించే ఛార్జర్ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల స్మార్ట్ మార్కెట్లో ఫేక్ ఛార్జర్ల బెడద ఎక్కువైంది. ఫలితంగా యాపిల్ ఉత్పత్తులకు ఛార్జింగ్ వెంటనే అయిపోవడంతో పాటు బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నట్లు యాపిల్ గుర్తించింది. యూజర్లకు సూచనలు ఈ నేపథ్యంలో కస్టమర్లకు యాపిల్ సంస్థ కొన్ని సూచనలు ఇచ్చింది. యూజర్ల భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఛార్జర్లను తయారు చేస్తామని, తద్వారా ఉత్పత్తుల పనితీరు, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు, యాపిల్ ఛార్జర్లు యాపిల్ ఎఫ్ఐ సర్టిఫైడ్ గుర్తింపుతో పాటు యాపిల్ వాచ్ బ్యాడ్జ్లు ఉంటాయని చెప్పింది. యాపిల్ ఛార్జర్లు ఈ రంగులోనే ఉంటాయ్ దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్ల కోసం కంపెనీ తయారు చేసిన ఛార్జర్లు ఏ రంగులో ఉంటాయి. మార్కింగ్, రెగ్యులేటరీ సమాచారం ఎలా ఉంటుందో వివరించింది. కుపెర్టినో (యాపిల్) కేవలం తెలుపు రంగు ఛార్జర్లనే కస్టమర్లకు అందిస్తుంది. తెలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో ఉంటే ఖచ్చింతంగా అవి ఫేక్ ఛార్జర్లేనని గుర్తించాలి. ఛార్జర్లపై యాపిల్ బ్యాడ్జి సైతం ఉంటుంది. ఒకవేళ నిజమైన ఛార్జర్లకు, నకిలీ ఛార్జర్లను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన యాపిల్.. సంస్థ తయారు చేసే ఒరిజినట్ ఛార్జర్ల సిరీస్ వివరాల్ని వినియోగదారులకు అందించింది. ఇవి మాత్రమే ఒరిజినల్ ఏ1570, ఏ1598, ఏ1647, ఏ1714, ఏ1768,ఏ1923, ఏ2055, ఏ2056,ఏ2086, ఏ2255, ఏ2256, ఏ2257, ఏ2458, ఏ2515, ఏ2652, ఏ2879లను మాత్రమేనని చెప్పింది. ‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’ నకిలీ ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ ఛార్జర్లకు యాపిల్ ఎంఎఫ్ఐ ఛార్జర్లకు పోలికలు చూడాలి. ఛార్జర్లపై ‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’ అని ఉంటుంది. ఐఫోన్, ఐపాడ్, ఐపోడ్, యాపిల్ వాచ్లపై ఎంఎఫ్ఐ లోగో, మ్యాగ్నెటిక్ టెక్నాలిజీతో మ్యాగ్సేఫ్ ఉంటుందని, వీటిని మాత్రమే వినియోగించాలని యాపిల్ సంస్థ యూజర్లకు విజ్ఞప్తి చేసింది. -
టెక్ దిగ్గజం యాపిల్ను గడగడలాడిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్!?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ను గడగడలాడిస్తున్నాడా? తమ దేశం కాదని ఇతర దేశాల్లో యాపిల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జిన్ పింగ్ నిర్ణయాలను చూస్తుంటే. ఇటీవల జిన్ పింగ్ ప్రభుత్వం దేశంలో మేడిన్ ఇన్ చైనా ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఐఫోన్లాంటి ఇతర దేశాలకు చెందిన ఉత్పత్తులను దేశంలో వినియోగించడాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డ్రాగన్ కంట్రీ స్థానికంగా తయారవుతున్న విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థలైన బ్యాంక్లు ఇతర రంగాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే సాఫ్ట్వేర్లను దేశీయ సంస్థల నుంచి పొందాలని, అదే సమయంలో సెమీ కండక్టర్ పరిశ్రమ వృద్దిలో పాలు పంచుకోవాలని కోరింది. ఈ తరుణంలో కనీసం ఎనిమిది ప్రావిన్సుల్లోని పలు రాష్ట్ర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఉద్యోగులు స్థానికంగా తయారైన స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. అంతవరకూ బాగున్నా..ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఉన్న జెజియాంగ్, షాన్డాంగ్, లియోనింగ్, సెంట్రల్ హెబీ వంటి ప్రావిన్సులకు చెందిన నగరాల్లోని సంస్థలు, ఏజెన్సీలకు ఈ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. మేడిన్ ఇన్ చైనా నినాదం దేశ వ్యాప్తంగా అమలు చేయాలి గానీ.. కేవలం ఐఫోన్ తయారీ ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయడం ఏంటని ఐఫోన్ లవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సెప్టెంబర్ నెలలో కనీసం మూడు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లోని సిబ్బందికి కార్యాలయాల్లో ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. చివరిగా ఐఫోన్ల బ్యాన్ అంశంపై యాపిల్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
యాపిల్కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్ డిజైనర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్లు, యాపిల్ వాచీల డిజైన్ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు. కీలకమైన టాన్ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్ వర్గాలు బ్లూమ్బెర్గ్కి వెల్లడించాయి. యాపిల్కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు. మరిన్ని నాయకత్వ మార్పులు కంపెనీకి చెందిన ఇతర మ్యాక్ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్వేర్ ఎగ్జిక్యూటివ్లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి. -
రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత!
ప్రపంచంలోనే నంబర్వన్ బ్రాండ్గా ఎదిగిన యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఒక సంతకం విలువ ఏకంగా రూ.20 లక్షలు! అవును.. ఇది నిజమే 47 ఏళ్లు నాటి చెక్కుపై ఆయన పెట్టిన సంతకం కోసం తన అభిమానులు ఎంతైనా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. కేవలం నాలుగు డాలర్లు(రూ.333) రాసిఉన్న ఆ చెక్కుకు ఎందుకు అంత క్రేజో తెలుసుకుందాం. ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ అనే సంస్థ తాజాగా ఓ చెక్కును వేలానికి ఉంచింది. ఇప్పటికే ఈ చెక్కును కొనేందుకు అనేక మంది బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ప్రకారం చూస్తే.. ఈ చెక్కు 25,000 వేల డాలర్ల (రూ.20 లక్షలకు పైనే)కు అమ్ముడయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే ఆ చెక్కుపై 4 డాలర్లే రానుండడం విశేషం. ప్రస్తుతం డాలర్ విలువతో పోలిస్తే దాని విలువ కేవలం రూ.333గా ఉంది. 1976లో కాలిఫోర్నియాలో స్టీవ్జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి యాపిల్ సంస్థను స్థాపించారు. యాపిల్-1 కంప్యూటర్ కోసం వీరిద్దరూ పనిచేస్తున్న సమయంలో అదే ఏడాది జులై 23న జాబ్స్ ఓ చెక్కుపై సంతకం చేశారు. తాజాగా అమెరికాకు చెందిన ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ సంస్థ స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన ఈ చెక్కును ఇటీవల వేలానికి ఉంచింది. వేలం ప్రక్రియ డిసెంబరు 6న ముగియనుంది. అయితే ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ఆధారంగా చూస్తే స్టీవ్ సంతకానికి రూ.20 లక్షలకు పైనే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదీ చదవండి: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్ ఇంతకీ స్టీవ్ జాబ్స్ చేసిన సంతకానికి ఎందుకంత క్రేజ్ అనే సందేహం రావొచ్చు. సాధారణంగా జాబ్స్ ఎవరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చేవారు కాదట. దాంతో ఆయన పూర్తి పేరుతో చేసిన సంతకం కావడంతో ఈ చెక్కుకు ఇంత క్రేజ్. ఇప్పటికే స్టీవ్ జాబ్స్కి సంబంధించిన అనేక వస్తువులను ఎన్నో సంస్థలు వేలానికి పెట్టాయి. యాపిల్ సంస్థ ప్రకటన కోసం ఆయన రాసిన పత్రాన్ని వేలం వేయగా.. 1,75,759 డాలర్ల(రూ.1.45 కోట్లు)కు అమ్ముడయింది. -
దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్కాన్ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇదీ చదవండి: తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే.. చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది. -
ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!
చాలా రకాల వెరైటీ ఇడ్లీలు చూసి ఉంటారు. స్వీట్ ఇడ్డీ కూడా చూసుంటారు. కానీ ఇది అలా ఇలా కాదు ఏకంగా పండుతో చేసిన ఫ్రూట్ ఇడ్లీ. పళ్లతోనా అని ఆశ్చర్యపోవద్దు. నిజం! చూస్తే మీరే షాకవ్వుతారు. ఎలా చేశాడంటే.. కుక్కపిల్ల, సబ్బు బిళ్ల..కాదేది కవితకు అనర్హం! అన్నట్టుగా వంటవాడికి పళ్లా, కాయగూరలా మరేదైనా అని కాదు వంట చేయడం వస్తే చాలు. దేన్నైనా వండి.. వార్చేస్తాడు. అది కూరగాయా! పండు అని కాదు. జస్ట్ తన పాక నైపుణ్యంతో రుచికరంగా మార్చేస్తాడు. ఇక ఈ ఫ్రూట్ ఇడ్డీ ఎలా చేశాడంటే..యాపిల్ని సన్నగా తరిగి ఇడ్లీ పిండి మిశ్రమంలో కలిపాడు. ఆ తర్వాత పిండిని ఇండ్లీల ట్రైలో పోసి ఆవిరిపై ఉడికించాడు. అంతే ఫ్రూట్ ఇడ్లీ రెడీ. పైగా రెండు రకాల చట్నీలు, ఓ సాంబర్ కూడా పెట్టి భలే అందంగా పండ్లతో గార్నిష్ చేశాడు. చూస్తే మాత్రం వామ్మో బాగుటుందా ? అని డౌటొస్తోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Sukrit jain (@thegreatindianfoodie) (చదవండి: ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా? డైనోసర్ని చూసొండొచ్చా?)