Anilkumar singhal
-
బ్లాక్ ఫంగస్ నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. కేంద్రం ఈ జబ్బు నియంత్రణకు 1,650 వయల్స్ (ఇంజక్షన్లు) కేటాయించిందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో మూడు కంపెనీల (మైలాన్, భారత్ సీరం, సన్ఫార్మా) నుంచి 15 వేల ఇంజక్షన్లు కొనుగోలు చేస్తోందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంజక్షన్లు రానున్నాయన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఒక్కో పేషెంటుకు 60 ఇంజక్షన్ల వరకు అవసరం అవుతాయని చెప్పారు. ఇది ఖరీదైన చికిత్స కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీలో చేర్చిందన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉండగా, కేంద్రం 625 టన్నులకు ఆమోదం తెలిపిందన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే ఆక్సిజన్ కోటా తగ్గనుందన్నారు. గతంలో ప్రొడక్షన్ కెపాసిటీ నుంచే కాకుండా స్టోరేజీ నుంచి కూడా కలిపి మొత్తం 170 మెట్రిక్ టన్నులు తీసుకునే వాళ్లమని చెప్పారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోవడంతో ప్రొడక్షన్ కెపాసిటీ 130 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇందువల్ల అంగూల్, రూర్కెలా ప్లాంట్ల కేటాయింపులు పెంచారన్నారు. ఈనెల 23వ తేదీలోగా మరో 4 క్రయోజనిక్ ట్యాంకర్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటి ద్వారా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని చెప్పారు. 104 కాల్సెంటర్లో రిజిస్టర్ అయిన వైద్యుల సంఖ్య 4,293కు పెరిగిందని, వీరిలో 188 మంది స్పెషలిస్టులున్నారని తెలిపారు. బుధవారం 12,679 మంది హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులతో వైద్యులు మాట్లాడారని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లను బలోపేతం చేయడం వల్ల 104కు వచ్చే ఫోన్కాల్స్ తగ్గుముఖం పట్టాయని, త్వరలోనే వైరస్ అదుపులోకి వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. బ్లాక్ఫంగస్ను ఆరోగ్యశ్రీలో చేర్చడం, కోవిడ్తో తల్లిదండ్రులు మృతిచెండటం వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్కు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి.. ఫీవర్ సర్వే, హోం ఐసొలేషన్ కిట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. -
ఆరోగ్యశ్రీలోకి ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఫంగస్ జబ్బు వస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం తదితర కారణాల వల్ల ఫంగస్ ఎక్కువగా సోకుతుండటం, వైద్యం ఖరీదు కావడంతో రకరకాల వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు, శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చారు. సీటీ/ఎంఆర్ఐ, ఫంగల్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ (కిడ్నీ), షుగర్ టెస్ట్లు, హెచ్బీఏ1సీ, నాజల్ ఎండోస్కొపీ వంటివన్నీ ఉచిత చికిత్సలో భాగంగా చేయాలి. అంతేకాకుండా యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, లింఫొసొమాల్ (యాంపొటెరిసిన్ బి) లేదా ఓరల్ పొసకొనొజోల్ ఇవ్వాలి. వైద్య పరీక్షల ఆధారంగా 2 వారాల నుంచి 3 వారాల పాటు ఈ వైద్యం చేయాల్సి ఉంటుంది. చికిత్స అనంతరం ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా అదనంగా కూడా కేటాయిస్తామని ఉత్తర్వుల్లో చెప్పారు. సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొప్టొసిస్కు రూ. 50 వేలు, యాంటీబయోటిక్స్, మందుల ప్యాకేజీకి రూ. 41,968, ఆఫ్తాల్మాలజీ ఆర్బిటొటొమి చికిత్సకు రూ. 27,810, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీకి రూ. 16,932, ఎక్స్ంటరేషన్ ఆఫ్ ఆర్బిట్ చికిత్సకు రూ. 10,180 నిర్ణయించారు. లింఫొసొమాల్ (యాంఫొటెరిసిన్ బి), పొసకొనొజోల్ ఇంజక్షన్లకు ఎంఆర్పీ ధరలు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ చికిత్స ఉచితంగా చేయాలని స్పష్టం చేశారు. -
జ్వర బాధితులు 90 వేలమంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన ఫీవర్ సర్వేలో 90 వేల మంది జ్వర బాధితులను గుర్తించామని, వాళ్లందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. వారిలో 50 వేల మంది నమూనాలు సేకరించి కరోనా టెస్టులకు పంపించామని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో సర్వే నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ/వార్డు వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మన రాష్ట్రంలో ఉన్నంతగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏ రాష్ట్రంలో లేరని, అందుకే మూడు రోజుల్లోనే ఫీవర్ సర్వే పూర్తి చేయగలిగామన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతి పాజిటివ్ కేసునూ లెక్క చెబుతున్నామని, డెత్ కేసులకు రూ. 15 వేలు ఇవ్వాలని జీవో ఇచ్చామని, ఈ ప్రభుత్వానికి దాయాల్సిన అవసరం లేదని, అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ జాప్యం జరిగి మృతి చెందిన కేసులను కూడా ధైర్యంగా చెప్పామని గుర్తు చేశారు. ఇంకా అవాస్తవాలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు. రెమ్డెసివిర్ కొరత లేదని, అవసరం ఉన్నవారికే ఇవ్వాలనేది ముందు నుంచీ చెబుతున్నామన్నారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి ప్రతిరోజూ వైద్యులతో ఫోన్ చేయించి వైద్య సలహాలు అందిస్తున్నామని తెలిపారు. -
ఆరోగ్యశ్రీలోకి 'బ్లాక్ ఫంగస్'
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోనూ వైద్యం చేసే విధంగా ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్ఫంగస్ కేసులు నమోదైనా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొన్నింటిని కేంద్రం కేటాయించిందని, మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ టెండర్స్ నిర్వహించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కోవిడ్తో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కర్ఫ్యూ తర్వాత రెండు జిల్లాల్లో కేసులు తగ్గాయని, మరికొన్ని జిల్లాల్లో నిలకడగా ఉన్నాయని, అందుకే ఈ నెల 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటివరకూ 91 వేల మందికి జ్వర లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరి ఆరోగ్యంపై రోజువారి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 67 శాతం మంది బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. కోవిడ్ విధుల్లోకి 17,901 మంది సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని సింఘాల్ వెల్లడించారు. ఆక్సిజన్ వృథా కాకుండా నేవీ బృందాలు చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. సీమ జిల్లాల్లో 7 కేసులు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఈ పరిశీలన జరుగుతోంది. కేసులకు సంబంధించి ఇప్పటికే నిపుణుల అభిప్రాయాలతో చికిత్సలు చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ్యుకర్ మైకోసిస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయినా సరే దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. -
బ్లాక్ఫంగస్ కేసులపై పరిశీలన
సాక్షి, అమరావతి: కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్ఫంగస్పై పూర్తిస్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో కొంతమందిలో భయాందోళనలు ఉన్నాయన్నారు. ఇలాంటి కేసులపై పరిశీలన చేయాలని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించామని, దీనిపై నేటి సాయంత్రానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆయన ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిపై ఖచ్చితమైన వివరాలతో మాట్లాడాలన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి కేంద్రమే దానికి సంబంధించిన మందులు కేటాయించిందని, మన రాష్ట్రానికి 1,600 వయల్స్ కేటాయించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తగినంత స్టాకు ఉన్నాయని, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 18 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే జామ్నగర్, దుర్గాపూర్, జంషెడ్పూర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ చేరిందన్నారు. త్వరలోనే స్టోరేజీ కెపాసిటీకి చేరతామని చెప్పారు. 104 కాల్సెంటర్ ద్వారా వైద్యులు సుమారు 15 వేలమందికిపైగా హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులకు ఫోన్చేసి వివరాలు తెలుసుకుని, వైద్యసాయం చేశారని తెలిపారు. -
ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. నెల క్రితం రోజుకు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉండగా ఇప్పుడు 590 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. గతంలో 54 ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్ను ఇప్పుడు 78కి పెంచగలిగామన్నారు. ఆక్సిజన్ సామర్థ్యం పెంచుకునేందుకు ఇంకా ఎలాంటి వనరులున్నా వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. అవసరం మేరకు వినియోగిద్దాం.. తాజాగా కేంద్రం 3 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇచ్చిందని, ఒకటి ఇప్పటికే రాష్ట్రానికి చేరుకోగా మరో రెండు కోల్కతా నుంచి వస్తున్నాయని సింఘాల్ తెలిపారు. అక్కడి నుంచే ఒక్కో ట్యాంకర్లో 20 టన్నుల చొప్పున 40 టన్నుల ఆక్సిజన్తో రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెలాఖరుకు 25 కొత్త ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని, సరఫరాలో జాప్యం కాకుండా ప్లాంట్ల నుంచి నేరుగా ఆస్పత్రులకు కాకుండా ఒక సెంటర్లో ఆక్సిజన్ నింపి అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా ఆస్పత్రులకు చేరవేస్తామన్నారు. ‘రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లు 17 వేలు ఉన్నట్లు గుర్తించాం. వీటిలో 14,338 సిలిండర్లను మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లుగా మార్చాలని నిర్ణయించాం, ఇప్పటికే 6,917 సిలిండర్లను మార్చాం. మిగిలినవి కూడా త్వరగా పూర్తయితే ఆక్సిజన్ కొరత ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారులు ఒక్క రోజులో 30 శాతం ఆక్సిజన్ పొదుపు చేయగలిగారు. అవసరం మేరకు వినియోగిస్తే అన్ని ఆస్పత్రుల్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను కూడా తెరిచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాం’ అని సింఘాల్ తెలిపారు. 104కి ఒకే రోజు 17 వేల కాల్స్.. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంటు అక్టోబర్లో అందుబాటులోకి రానుందని సింఘాల్ చెప్పారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, కిట్లు, ఇతరత్రా విరాళాలు అందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక విభాగానికి అర్జా శ్రీకాంత్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సన్ట్రేటర్లు 8 వేలు, పది లీటర్ల కెపాసిటీ కలిగిన 10 వేల కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. 104 కాల్సెంటర్కు బుధవారం ఒక్కరోజే 17 వేల కాల్స్ వచ్చాయని, హోం ఐసోలేషన్లో ఉన్న 9 వేల మందికి పైగా బాధితులను వైద్యులు ఫోన్లో పరామర్శించి తగిన సూచనలు అందించినట్లు వివరించారు. -
ఆక్సిజన్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ను తీసుకురావడం, దాన్ని ఆస్పత్రులకు సరఫరా చేయడంపై ప్రతిక్షణం పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో ఉన్న ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు కలికాల వలవన్, అనంతరాములు, ఏకే పరిడాను నియమించామని తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు ఈ అధికారులు ఆయా ప్లాంట్లలోనే ఉండి పర్యవేక్షిస్తారన్నారు. మంగళవారం ఆయన ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తే మొత్తం కేటాయింపులను రాష్ట్రానికి తెచ్చామన్నారు. ట్యాంకర్ జాప్యం కారణంగా తిరుపతిలో ఘటన జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. మృతి చెందిన వారికి సీఎం జగన్ రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారన్నారు. ప్రతిరోజూ ఆక్సిజన్ వినియోగం పెరుగుతోందని, దీనికి తగ్గట్టు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని, సీఎం కూడా ప్రధానికి లేఖ రాశారని వివరించారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ప్రస్తుతం మైలాన్ కంపెనీ నుంచి కొంటున్నామని, అవి కాకుండా మరో 50 వేల ఇంజక్షన్లు వేరే కంపెనీ నుంచి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22,395 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్కు ఒక్కరోజులో 16వేలకు పైగా కాల్స్ వచ్చాయని చెప్పారు. హోం ఐసొలేషన్లో చికిత్స పొందుతున్న 9,796 మందికి ఫోన్ చేసి డాక్టర్లు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఈ సంఖ్యను రోజుకు 15 వేలకు పెంచాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ సెంటర్లకు 100 చొప్పున స్లిప్పులు ఇస్తున్నామని, దీనిపై కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. -
కోవిడ్ చికిత్సకు ఆరోగ్యశ్రీ రేట్లు పెంపు
సాక్షి, అమరావతి: కోవిడ్ చికిత్సలకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సీటీ స్కాన్లో కొరాడ్స్–4, సీటీ సివియారిటీ స్కోర్ 25 ఉండి, ఆర్టీపీసీఆర్ టెస్టు లేకపోయినా పేషెంట్లను అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ సాయంతో ఉన్న రోగులకు రోజుకు రూ. 2,500 చెల్లిస్తామన్నారు. గతంలో నాన్క్రిటికల్ ట్రీట్మెంట్కు రూ. 3,250, వెంటిలేటర్ లేని ఐసీయూకు రూ.5,480, ఐసీయూతో వెంటిలేటర్కు రూ.9,580, క్రిటికల్ పేషంట్లకు వెంటిలేటర్తో చికిత్సకు రూ. 10,380 ఇచ్చేవారు. -
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు: ఎ.కె.సింఘాల్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. రెమ్డెసివర్పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, హెల్ప్లైన్ ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అడ్మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రంలో 637 హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స అందిస్తున్నాం.13,461 ప్రవేట్ హాస్పిటల్స్లో రేమ్డేసివర్ అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్కు 16, 905 కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 2 లక్షలు 8 వేల మంది కాల్స్ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించుకున్నాం. కోవిన్ యాప్లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాం.. అంగీకరించింది. కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి రెగ్యులర్ రిక్రూట్ మెంట్లో ప్రాధాన్యత కల్పిస్తూ జీవో జారీ చేశాం. 15% వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించాం. చాలా చోట్ల మొదటి వ్యాక్సినేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనం ఎక్కువగా ఒకే చోట గుమికూడకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామ’’న్నారు. -
విదేశాల నుంచి ఆక్సిజన్ కొనుగోలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా విదేశాల నుంచి లిక్విడ్ ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఏ దేశంలో లిక్విడ్ ఆక్సిజన్ అందు బాటులో ఉన్నా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మని నేవీ అధికారులు చెప్పారన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్, నేవీ (తూర్పు నౌకాదళం) కోవిడ్ కష్టకాలంలో రాష్ట్రానికి అండగా నిలిచాయని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తే లోపాలను సరిదిద్దడానికి నేవీ అధికారులు నాలుగు స్పెషలిస్టు బృందాలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు యాజమాన్యం వెయ్యి ఆక్సిజన్ పడకలు ఇస్తామని తెలిపిందని, అందులో ఇప్పటికే 50 అప్పగించా రని, మరో 150 పడకలు మే 15 నాటికి ఇస్తారని చెప్పారు. నేవీ అధికారులు సైతం 200 పడకలు ఇవ్వ డానికి ముందుకొచ్చారని తెలిపారు. ఆ బెడ్లకు మెడికల్, పారామెడికల్ సిబ్బందిని విశాఖ జిల్లా కలెక్టర్ నియమిస్తారన్నారు. మరో 3 వారాల్లోగా రాష్ట్రం కొనుగోలు చేస్తున్న 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలపై కేసులు ప్రతి జిల్లాలోనూ ఐదారు ఆస్పత్రులను క్లస్టర్గా విభజించి ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం. నకిలీ రెమ్డెసివర్ కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా సెకండ్ డోస్ వారికే ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైంది. వ్యాక్సిన్ మొదటి డోసు పంపిణీలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, వార్డు/గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వారిని చైతన్య పరిచి టీకా వేశాం. ఇప్పుడు అందరూ ఒకేసారి టీకా కావాలని అంటున్నారు. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ సెకండ్ డోస్కు సరి పోతుంది. దానివల్ల కొత్తవారికి ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పాం. వ్యాక్సిన్ కోసం కేంద్రం రూపొందించిన కోవిన్ అప్లికేషన్లో మార్పు చేయాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా టీకా పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఇస్రో వద్ద 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్.. గడిచిన 24 గంటల్లో 491 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఆస్పత్రులకు సరఫరా చేశాం. కేసులు పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని, చెన్నై, బళ్లారి ప్లాంట్ల నుంచి సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం. ఇక్కడ నుంచి అయితే రవాణా సమయం కలిసొస్తుందని కేంద్రానికి తెలియజేశాం. నెల్లూరులోని సతీష్ ధావన్ (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగశాలలో 90 నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉన్నట్టు సమాచారం ఉంది. వాటిని కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు మేలు జరుగుతుంది. ఆక్సిజన్ ప్లాంట్ల బాధ్యత నౌకాదళానికి.. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళానికి (ఈఎన్సీ) అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సరఫరా బాధ్యతను ఈఎన్సీ తీసుకోనుంది. ఈ మేరకు స్టీల్ప్లాంట్, తూర్పు నౌకాదళాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు శనివారం భేటీ అయ్యారు. ముందుగా స్టీల్ప్లాంట్లోని ఆక్సిజన్ యూనిట్లను పరిశీలించారు. అనంతరం తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్తో భేటీ అయ్యారు. స్టీల్ప్లాంట్లో ఆక్సిజన్ యూనిట్స్ను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ముఖ్యంశాలివీ.. ► ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత ఈఎన్సీ నిర్వహించనుంది. ► ఆక్సిజన్ ప్లాంట్లలో లీకేజీ సమస్యల పరిష్కారం, ప్లాంట్ల పర్యవేక్షణ, అక్కడ తీసుకోవాలి్సన బాధ్యతల్ని నౌకాదళం నిర్వర్తించనుంది. ► ఇందుకోసం తూర్పు నౌకాదళం నాలుగు బృందాలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో బృందం 3 నుంచి 4 జిల్లాల్ని పర్యవేక్షిస్తుంది. ► అత్యవసరమైతే ఈ బృందాల సహకారంతో యుద్ధ విమానాలు, నేవల్ హెలికాప్టర్లను కూడా ఆక్సిజన్ సరఫరాకు వినియోగించనున్నారు. ► సింగపూర్, థాయ్లాండ్, మలేషియా మొదలైన దేశాల నుంచి వస్తున్న 25 క్రయోజనిక్ ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే బాధ్యత తీసుకునేందుకు ఈఎన్సీ అంగీకరించింది. ► లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లతో పాటు డీ–టైప్ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కోవిడ్ సంబంధిత వైద్య పరికరాలు, మందులు సరఫరా చేసేందుకు నౌకాదళ వాహనాలు వినియోగించాలని నిర్ణయించారు. ► విశాఖలోని ఐఎన్ఎస్ కళింగ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స కోసం 10 ఆక్సిజన్ బెడ్స్తో పాటు 60 సాధారణ పడకలు ఏర్పాటు చేసేందుకు తూర్పు నౌకాదళాధికారులు అంగీకరించారు. ► విశాఖలోని కంచరపాలెం సమీపంలో ఉన్న నేవీ షెడ్లో 150 పడకల తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేవీ స్పష్టం చేసింది. ► కోవిడ్ పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా 200 డీ–టైప్ ఆక్సిజన్ సిలెండర్లను సరఫరా చేయనున్నారు. స్టీల్ప్లాంట్లో ఆక్సిజన్తో 50 పడకలు.. ► కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు స్టీల్ప్లాంట్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. ► స్టీల్ప్లాంట్లోని గురజాడ కళాక్షేత్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం అధికారులు అంగీకరించారు. ► మే 15 నాటికి అదనంగా 150 పడకలు, 30 నాటికి 250, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. -
వ్యాక్సినేషన్లో అందరికీ ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. వారంలో నాలుగు రోజుల్లో 25 లక్షలు టీకాలు వేసేలా నెలకు కోటి టీకాలు కావాలని లేఖలో కోరారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. టీకా ఉత్సవ్లో భాగంగా రాష్ట్రంలో ఒక్క రోజులోనే 6.29 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రం సామర్థ్యాన్ని ప్రధానికి వివరించామన్నారు. అవసరం మేర కు రాష్ట్రానికి వ్యాక్సిన్ రావడం లేదని తెలి పారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్ప త్రుల్లో చికిత్స పొందే కరోనా బాధితులకు వైద్యం ఉచితమని, వీరి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్ చికిత్స, ఆక్సిజన్ సరఫరా, తదితర అంశాలపై శుక్రవారం మంగళగిరిలో అనిల్కుమార్ సింఘాల్ మీడియాకు వివరించారు. సెకండ్ డోస్గా వేస్తాం.. ఇప్పటివరకు కేంద్రం నుంచి 73,49,960 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వాటిలో 53,58, 712 టీకాలు వేశాం. వీటిలో 17,96,691 మం దికి రెండు డోసులు ఇచ్చాం. మొత్తంగా 71, 55,403 డోసులు వేశాం. శుక్రవారం ఉదయానికి ఇంకా దాదాపు 2 లక్షలు మిగిలి ఉన్నాయి. 45 ఏళ్లకు పైబడి ఉన్నవారికి వేయడానికి కేంద్రం మే 1 నుంచి 15లోగా 9 లక్షల డోసు లు కేటాయించింది. వీటిలో 6,90,000 కోవి షీల్డ్ డోసులు పూర్తిగా వచ్చాయి. ఇంకా 1,08, 000 డోసులు ఈ నెల 15లోగా రావాల్సి ఉంది. ఈ డోసులతోపాటు రాష్ట్రంలో మిగిలి ఉన్న దాదాపు 2 లక్షలతో కలిపి ప్రస్తుతం 3 లక్షలకు పైబడి డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల రెండో పక్షానికి కూడా కేంద్రం వ్యాక్సిన్లు అందిస్తుంది. ఈ డోసులు మే 15 తర్వాత వస్తాయి. 35 లక్షల మందికిపైగా సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉండగా.. ఈ నెలా ఖరుకు 23,89,000 మందికి సెకండ్ డోస్ గడువు ముగుస్తుంది. వీరిలో 12,93,000 మం దికి మే 15లోగా సెకండ్ డోస్ వేయాల్సి ఉండగా.. ఇప్పటికే 4,63,000 మందికి వ్యాక్సిన్ వేసేశాం. ఇంకా 8,23,000 మందికిపైగా వేయాలి. కేంద్రం నుంచి వచ్చే డోసులు సెకండ్ డోసుకు సరిపోతాయి కాబట్టి కొత్తవారికి ఫస్ట్ డోస్ ఇచ్చే అవకాశం లేదు. శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు రాష్ట్రంలో 49 ఆస్పత్రుల్లో రూ.309 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్ల (పీఎస్ఏ) ఏర్పాటుకు పరిపాలన ఆమోదం తెలిపాం. పీఎస్ఏ ప్లాంట్లను ఆయా ఆస్పత్రుల్లో ఉన్న బెడ్ల సామర్థ్యాన్ని బట్టి నిర్మించనున్నాం. మూడు నెలల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి. రూ.180 కోట్లతో ప్లాంట్లు, సివిల్ వర్కులకు రూ.25 కోట్లు, 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్లైన్ల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తాం. 50 క్రయోజెనిక్ ట్యాంకర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించగా 25 ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. వీటికి రూ.46 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంతో ఇక రవాణా, స్టోరేజ్ ఇబ్బందులు ఉండవు. పోస్టుభర్తీలో కోవిడ్ హెల్త్ వర్కర్లకు వెయిటేజ్ కోవిడ్ సేవల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత కరోనా వ్యాప్తి కాలంలో పనిచేసిన హెల్త్ వర్కర్లకు 15 శాతం మేర వెయిటేజ్ ఇవ్వాలని మెమో జారీ చేశాం. ప్రస్తుతం విధులు నిర్వరిస్తున్న హెల్త్ వర్కర్లకు కూడా వెయిటేజ్ ఇస్తాం. ఈ జీవో, విధివిధానాలను శనివారం ప్రకటిస్తాం. కోవిడ్ కేర్ సెంటర్లలో 14,654 మంది.. కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రస్తుతం 14,654 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు కొరత లేదు. గత 24 గంటల్లో 13,150 ఇంజక్షన్లు అందజేశాం. ప్రభుత్వాస్పత్రుల్లో 22,105 అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో 104 కాల్ సెంటర్కు 17,062 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో 9,210 కాల్స్ వివిధ రకాల సమాచారం, 3,004 కాల్స్ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు, 1,706 కాల్స్ పరీక్షల ఫలితాల కోసం చేశారు. ఇంకా 2 లక్షల డోసులు రావాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం 9,91,000 కోవిషీల్డ్, 3,43,000 కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.45 కోట్లు చెల్లించింది. ఇప్పటికే కేటాయించిన కోవిషీల్డ్ డోసులతోపాటు మరో మూడున్నర లక్షల డోసులు అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, వాటిని మే మూడో వారంలో అందిస్తామని సీరం యాజమాన్యం ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. ఈ అదనపు డోసులకు కూడా చెల్లింపులు చేయడానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. 3,43,000 కోవాగ్జిన్ వ్యాక్సిన్లలో 1,43,000 డోసులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 2 లక్షల డోసులు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్లను 45 ఏళ్లకు పైబడినవారికే వేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాం. ఇదే విషయమై మరోసారి కేంద్రాన్ని కోరతాం. -
కరోనా రోగులకు మరింత అందుబాటులోకి ఉచిత వైద్యం
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తి ఉచితంగా చికిత్సను అందించడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. ► కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించిన అన్ని ప్రైవేటు, బోధనాస్పత్రుల్లో పూర్తిగా 100 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కింద కేటాయించి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. పరిస్థితులు, అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్లు మరికొన్నిటిని కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించాలి. ► కోవిడ్ చికిత్స కోసం ప్రకటించిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా కనీసం 50 శాతం బెడ్లను కేటాయించాలి. 50 శాతం కోటా పూర్తయినప్పటికీ, సంబంధిత ఆస్పత్రిలో ఇతర బెడ్లు ఖాళీగా ఉంటే వాటిని కూడా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఇవ్వాలి. ► అలాగే తాత్కాలికంగా కోవిడ్ చికిత్స కోసం మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్ హాస్పిటల్స్గా జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. వీటిలో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి. వీటి చికిత్సా వ్యయాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ భరిస్తుంది. ► తాత్కాలికంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్ ఆస్పత్రులుగా గుర్తించిన వాటి వివరాలను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి అందించాలి. ► ప్రతి సమయంలోనూ 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఖాళీగా ఉంచాలని చెప్పి నాన్ ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్ల చికిత్సను తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరీక్షల ఆధారంగా బెడ్ కేటాయించవచ్చు. ► సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులు ఈ నిబంధనలు పాటించాలి. ► ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చిన రోగులను పాజిటివ్ టెస్టు లేదంటూ తిరస్కరించకూడదు. ► ఆస్పత్రిలో చేరిక అనేది పూర్తిగా అవసరాన్ని బట్టి లేదా డాక్టర్ లేదా రోగుల పరీక్షల నిర్ధారణపై ఆధారపడి ఉంటుంది. ► వివిధ కారణాలను చూపుతూ ఒక్క రోగి కూడా చికిత్స లేదా కావాల్సిన ఔషధాలకు దూరం కాకుండా చూడాలి. చదవండి: కరోనా కన్నా వారికి భయంకరమైన లక్షణాలు: కొడాలి నాని ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు -
కోవిడ్ కట్టడికి ప్రజా ప్రతినిధులతో సమీక్ష కమిటీలు
సాక్షి, అమరావతి: జిల్లా స్థాయిలో కోవిడ్–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రుల అధ్యక్షతన కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తి నివారణ, వ్యాక్సినేషన్పై రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన మంత్రుల బృందం సూచన మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన నిర్ణయాలను సకాలంలో తీసుకోవడంతో పాటు అధికారులకుతగిన సూచనలు, సలహాలతో మార్గనిర్దేశం చేయనున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రుల అధ్యక్షతన గల కమిటీల్లో సభ్యులుగా జడ్పీ చైర్పర్సన్, జిల్లాకు చెందిన మంత్రులందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు ఉంటారు. సభ్య కన్వీనర్గా జిల్లా కలెక్టర్ ఉంటారు. -
ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: కోవిడ్తో చికిత్స పొందుతున్న బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఒక్కో ట్యాంకర్ సామర్థ్యం 20 టన్నులు ఉంటుందని, వీటి ద్వారా మొత్తం 500 టన్నుల ఆక్సిజన్ సరఫరా లేదా స్టోరేజీ కెపాసిటీ సమకూరుతుందని చెప్పారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అనుమతి ఇచ్చారని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ల వద్ద వినియోగించేందుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఎంప్యానల్(నెట్వర్క్) ఆస్పత్రులు, తాత్కాలికంగా 3 నెలలకు ఆరోగ్యశ్రీ కింద అనుమతి పొందిన ఆస్పత్రులన్నీ 50 శాతం పడకలను తప్పనిసరిగా కోవిడ్ బాధితులకు ఇవ్వాలని సింఘాల్ పేర్కొన్నారు. 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రస్తుతం 349 ఉండగా వీటిలో 25,058 పడకలున్నాయి. తాత్కాలిక ఎంప్యానెల్మెంట్ పరిధిలో 47 ఆస్పత్రులు ఉండగా ఇందులో 1,949 పడకలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో సగం పడకలు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాల్సిందే. వారికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆస్పత్రులకు చెల్లిస్తాం. పడకలు పూర్తిగా కేటగిరీల వారీగా విభజిస్తున్నాం. ఈ వివరాలన్నీ 104 కాల్సెంటర్ వద్ద, జిల్లా కలెక్టర్ల వద్ద ఉంటాయి. దీని ప్రకారం పడకల కేటాయింపు సులభమవుతుంది. వివరాలన్నీ వీలైనంత త్వరగా సేకరించాలని కలెక్టర్లను కోరాం. ఆరోగ్యశ్రీ బాధితులకు ఇచ్చే పడకలు నిండిన తరువాత ఖాళీగా ఉంటే పేషెంటును కాదనకుండా ఇవ్వాలి. ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స జరుగుతోంది. ఇందులో 16,962 పడకలున్నాయి. ఇప్పటివరకూ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 16,871 మంది చేరగా 8,647 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. ఆక్సిజన్కు ఇబ్బంది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో సరఫరా సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్ పీఏఎస్లు ఏర్పాటవుతాయి. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశాం. ఇప్పటికే టెండర్లు పిలిచాం. మరోవైపు థర్డ్వేవ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సమస్యలు లేకుండా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. 104కు ఒక్కరోజే 17,649 కాల్స్ గురువారం ఒక్కరోజే 104 కాల్సెంటర్కు 17,649 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకూ 3,365 మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకోగా వీరిలో 608 మంది స్పెషలిస్టులున్నారు. ఆస్పత్రి దగ్గరే కోవిడ్ కేర్ సెంటర్ ఆస్పత్రుల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో వీలును బట్టి 100 నుంచి 200 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి. కోవిడ్ కేర్లా ఉపయోగపడుతుంది, ఆస్పత్రిలాగా కూడా ఉంటుంది. వీలైనంత త్వరలో వీటిని ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కోరాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.100 కోట్లు ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం మరో రూ.45 కోట్లు విడుదల చేసింది. చదవండి: ఎన్440కె ఏపీలో వచ్చిన వేరియంట్ కాదు.. సీసీ ఫుటేజ్లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! -
గడువులోగా టీకా రెండో డోసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. ఈనెల 15వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం 9 లక్షల డోసులు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల డోసులు కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇందులో 19 లక్షల డోసులను సెకండ్ డోసు వారికే వేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ జీవనానికి ఆటంకం లేకుండా కోవిడ్ మార్గదర్శకాలు (144 సెక్షన్), ఆ తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో బ్యాంకులు పనిచేస్తాయన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా అధికారులతో మాట్లాడి సీఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరత రాబోతోందన్న సమాచారం రాగానే అక్కడి కలెక్టర్.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి 12 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను తెప్పించి ఆస్పత్రులకు సకాలంలో అందజేసినట్లు తెలిపారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. 104 కాల్ సెంటర్లో ప్రస్తుతం 3,220 మంది డాక్టర్లు కరోనా బాధితులకు ఫోన్ ద్వారా సేవలందిస్తున్నారని చెప్పారు. రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు, పెళ్లి తదితర కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైన మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని.. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు పంపిస్తోందని, దీని పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘ సమావేశం అంతకుముందు కరోనా నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై తాము చర్చించిన అంశాలను నివేదించనుంది. -
కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందులో 7 ట్రైబల్ పీహెచ్సీలు కూడా ఉన్నాయన్నారు. ఒకే పీహెచ్సీ ఉన్న మండలంలో రెండోది కూడా ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా పీహెచ్సీల భవన నిర్మాణాలకు రూ.346 కోట్లు, సిబ్బంది వేతనాలకు ఏటా రూ.165 కోట్లు రికరింగ్ వ్యయమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు పెంచామని, డిశ్చార్జిల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 6,319 ఐసీయూ పడకలుండగా.. 5,743 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. చాలా జిల్లాల్లో ఐసీయూ పడకలు ఖాళీగా లేవన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 ఇంజక్షన్లు ఉన్నాయని, మరో 12 వేలు మంగళవారం వచ్చాయని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఒకే రోజు 14,030 ఇంజక్షన్లు ఇచ్చామన్నారు. గత 24 గంటల్లో 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని తెలిపారు. మరో 3 ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి అదనపు సరఫరాకు ఉపయోగిస్తామన్నారు. కాగా, 104 కాల్ సెంటర్కు ఒకేరోజు 16,856 కాల్స్ వచ్చాయన్నారు. రెండో డోస్ వారికే ప్రాధాన్యత రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తక్కువగా ఉన్న కారణంగా రెండో డోసు తీసుకునేవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ నెల 15లోగా కేంద్రం నుంచి 9 లక్షల డోసుల టీకా వస్తుందని.. ముందుగా రెండో డోసు తీసుకునేవారికి జాప్యం కాకుండా చూస్తామని తెలిపారు. ప్రజా సంబంధాల్లో (ఆర్టీసీ, బ్యాంకు, మీడియా ఉద్యోగులు) ఉన్నవారికి రెండో ప్రాధాన్యతగా టీకా వేస్తామన్నారు. వీరిలోనూ 45 ఏళ్లు దాటినవారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, అమరావతి: కోవిడ్ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5 (బుధవారం) నుంచి మే 18 వరకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపారాలకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ నుంచి మినహాయింపు వీటికే.. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, మెడికల్ షాపులు, ప్రింట్ –ఎల్రక్టానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ ఔట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు. ఇవన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. వీటన్నింటికీ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరికి కూడా మినహాయింపు ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు. ► వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు. ► వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్ టీకాలకు వెళ్లే వ్యక్తులు ► ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి ► రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్ ఉండాలి. అలాంటివారికి అక్కడకు వెళ్లడానికి స్థానిక అధికారులు రవాణా ఏర్పాటు చేయాలి. ► అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు. ► పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ► కర్ఫ్యూ అమలు బాధ్యతలను కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు అప్పగించారు. కర్ఫ్యూ లేని సమయంలో ప్రజలు ఎక్కువమంది గుమికూడకుండా 144 సెక్షన్ను అమలు చేస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. -
ఆంధ్రప్రదేశ్లో కరోనా కొత్త స్ట్రెయిన్ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతమున్న స్ట్రెయిన్ గతేడాది జూలై నుంచే రాష్ట్రంలో ఉందన్నారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కూడా కొత్త స్ట్రెయిన్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త స్ట్రెయిన్ వల్లే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనడం సరికాదన్నారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ సింఘాల్ ఇంకేమన్నారంటే.. 24 గంటల్లో 1,15,275 పరీక్షలు.. రాష్ట్రంలో 24 గంటల్లో 1,15,275 కరోనా పరీక్షలు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 447 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను వినియోగించాం. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆక్సిజన్ స్టోరేజ్, రవాణాకు కావాల్సిన క్రయోజనిక్ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చించాం. అన్ని బోధన, ప్రభుత్వాస్పత్రుల్లో పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్) ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాం. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, పైప్లైన్ల కొనుగోలుకు మూడు నాలుగు రోజుల్లో టెండర్లు ఖరారు చేస్తాం. అత్యవసర సర్వీసులకు మినహాయింపు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు వ్యాపారాలకు, సాధారణ జీవనానికి ఎటువంటి ఆటంకాలు, ఆంక్షలు ఉండవు. ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువమంది గుమికూడకుండా ఉదయం వేళల్లో144 సెక్షన్ అమలు చేస్తాం. నిత్యావసరాలు, ఇతర సరుకులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. వైద్య సేవలు, అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపులుంటాయి. మీడియా, ఉద్యోగులకు కూడా ఎటువంటి ఆటంకం ఉండదు. 45 ఏళ్లు పైబడినవారికే ప్రాధాన్యత టీకా పంపిణీలో 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యత ఉంటుంది. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. -
అనుమతి లేకుండా కరోనా చికిత్స చేస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడైనా సరే అనుమతి లేకుండా కరోనా వైద్యసేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్సింఘాల్ చెప్పారు. ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అనుమతి లేకుండా వైద్యం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై నిఘా పెంచామని చెప్పారు. అలా జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ మొదలు మందుల వరకు కొనుగోలుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 558 ఆస్పత్రుల్లో 55,719 పడకలను అందుబాటులో ఉంచామన్నారు. గుంటూరులో 869, కృష్ణాలో 684 ఐసీయూ బెడ్లు ఉన్నాయని, చాలా జిల్లాల్లో బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 27,576 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 18,299 మంది పేషెంట్లు ఉన్నారని చెప్పారు. 81 కోవిడ్ కేర్ సెంటర్లలో 10,100 మందికి సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 27,615 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఉన్నట్లు చెప్పారు. 104 కాల్సెంటర్కు రోజురోజుకు కాల్స్ సంఖ్య పెరుగుతోందన్నారు. ఎక్కువ మంది కోవిడ్ టెస్టులకు, కోవిడ్ టెస్టు ఫలితాల కోసం, పడకల కోసం ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది 18 వేలమంది వైద్య సిబ్బందిని నియమించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 16,019 మందిని నియమించినట్లు చెప్పారు మరో మూడువేల పోస్టులను భర్తీచేస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్ వినియోగం పెరుగుతోందని, అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ఎక్కడా పడకల కొరత లేదని, రెమ్డెసివిర్ తగినన్ని ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు రెమ్డెసివిర్, ఆక్సిజన్ ప్రభుత్వం సరఫరా చేయడం కష్టతరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
కోవిడ్ చికిత్సకు 551 ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 551 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో మొత్తం 43,498 బెడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ బెడ్లలో శనివారం వరకు 32,301 బెడ్లు నిండాయని.. ఇంకా 11 వేలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆస్పత్రులను గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించామన్నారు. కరోనా పరీక్షలు, అంబులెన్సు సౌకర్యం, ఆస్పత్రుల్లో పడకలు, వైద్య సేవలు, సందేహాలు, ఫిర్యాదులు ఇలా కరోనాకు సంబంధించిన సమస్త సమాచారం కోసం 104 కాల్ సెంటర్కు ఫోన్ చేయాలని సూచించారు. బాధితులు ఫోన్ చేసిన మూడు గంటల్లోనే అధికారులు ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలో సేవలు అవసరం లేదన్నారు. ఇంటిలో లేదా కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు పొందొచ్చన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికే ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. స్వల్ప లక్షణాలున్నవారికి కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డిశ్చార్జి పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా కోలుకున్నవారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసి, వారి స్థానంలో వేరొకరికి అవకాశమిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 500 మంది డిశ్చార్జయ్యారన్నారు. ఇలా డిశ్చార్జి అయినవారు అవసరమనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్లలో ఉండొచ్చని.. లేకుంటే ఇంటికి వెళ్లొచ్చన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ ఇంకేమన్నారంటే.. పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు రాష్ట్రమంతా మంగళవారం నుంచి కరోనా పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 24 గంటల్లోనే ఫలితాలు ఇస్తున్నారు. సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. రోజు రోజుకూ కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నాటికి కోవిడ్ కేర్ సెంటర్లలో 8,709 మంది ఉన్నారు. రాబోయే రెండు మూడ్రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరుకోవచ్చు. వీటిలో కరోనా టెస్టులు చేయడంతోపాటు అక్కడే ఫలితాలు కూడా ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఆపలేదు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న శాంపిళ్ల ఫలితాలను రెండ్రోజుల్లో ఇవ్వాలని ఆదేశించాం. అంబులెన్సుల కొరత ఉన్నచోట వాటిని పెంచుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. రోగులకు ఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు టెలీమెడిసిన్ కాల్ సెంటర్కు 2,668 మంది వైద్యులు నమోదు చేసుకున్నారు. హోం ఐసోలేషన్లో 88,898 మంది ఉన్నారు. వీరందరికీ వైద్యులు ఫోన్ చేసి ఆరోగ్య సమాచారంతోపాటు సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరోవైపు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికెళ్లి కరోనా బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన మేర రెమ్డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో 5,371 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించగా.. ఇంకా 27,615 ఇంకా అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్కు ఒక్కరోజే 13,898 మంది ఫోన్ 104 కాల్ సెంటర్కు శనివారం ఒక్కరోజే 13,898 మంది ఫోన్ చేశారు. వారిలో 3,356 మంది పరీక్షల కోసం, 3,359 మంది వివిధ అంశాలపై సమాచారానికి, 304 మంది ఆస్పత్రుల్లో అడ్మిషన్ కోసం, 2,678 మంది పరీక్షల ఫలితాల కోసం ఫోన్ చేశారు. గత రెండు రోజుల కంటే శనివారం ఆక్సిజన్ను ఎక్కువగా సరఫరా చేశాం. గత 24 గంటల్లో 443 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను అందించాం. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కేటాయింపులు మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. విజయవాడ నుంచి ఒడిశాలోని అంగుల్ ఆక్సిజన్ ప్లాంట్కు 2 ఖాళీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేశాం. 2 ట్యాంకర్ల ద్వారా 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి వస్తుంది. సోమవారం మళ్లీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేస్తాం. ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో 64 ట్యాంకర్లను వినియోగిస్తున్నాం. ఐయూసీఎల్ కంపెనీ కేటాయించిన రెండు సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలు రావాల్సి ఉంది. వాటి వల్ల 20 నుంచి 25 టన్నుల సామర్థ్యం పెరిగే అవకాశముంది. వైద్య సిబ్బంది నియామకం అధికారం కలెక్టర్లకే.. జిల్లాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియామకాలు పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలను కూడా అదే రీతిలో చేపట్టాం. గత ఏడాది కాలంలో 9 వేల మందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, బాధితుల సమాచారం సేకరించడానికి ఆరోగ్యమిత్రలను, సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను వాడుకుంటున్నాం. -
108, 104 Ambulance: ఊపిరి పోస్తున్నాయ్
సాక్షి, అమరావతి: కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ అంబులెన్సులు నిరంతరాయంగా తిరుగుతున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న ఈ తరుణంలో బాధితులకు ఈ కుయ్..కుయ్ శబ్దం కొండంత భరోసానిస్తోంది. కాల్ అందుకున్న నిమిషాల్లో 108, లేదా 104 అంబులెన్స్ ప్రత్యక్షమౌతోంది. పైసా ఖర్చులేకుండా క్షణాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది ఒకేసారి 1,088 కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయడం యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది. ప్రతిమండలంలోనూ 108 అంబులెన్సులు, 104 వాహనాలు అందుబాటులో ఉండడంతో మండలంలోని ఊళ్లన్నిటికీ ఉపయోగంగా ఉంది. ఉచితంగా లభిస్తున్న ఈ 104, 108 అంబులెన్సు సర్వీసు కోవిడ్ రోగులకు పెద్ద ఊరటనిస్తోంది. గతంలో నిర్వహణా ఖర్చులు ఇవ్వక, రిపేర్లు జరక్క, డీజిల్కు దిక్కులేక, డ్రైవర్లకు జీతాల్లేక పూర్తిగా మూలన పడ్డ అంబులెన్స్ వ్యవస్థను జగన్ రాగానే సమూలంగా ప్రక్షాళన చేశారు. సమస్యలన్నీ తీర్చడంతో పాటు డ్రైవర్లకు జీతాలూ పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇపుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ అంబులెన్సులే అపర సంజీవనిలా మారాయి. కరోనా రోగులను వేగంగా తరలిస్తూ సకాలంలో వైద్యం అందడానికి ఉపయోగపడుతున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే మొత్తం 86,754 మంది రోగులను ఆస్పత్రులకు తరలించారంటే అంబులెన్సులెంతగా ఉపయోగపడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మారుమూల పల్లెలకు వెళ్లి రోగులకు ఉచితంగా వైద్య సేవలను, మందులను అందించేందుకు 104 వాహనాలు ఉపయోగపడుతున్నాయి. ఇదీ లెక్క.. ► మొత్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్ల్లో 15,242 మంది కోవిడ్ రోగులను ఆసుపత్రులకు తరలించారు. అలాగే, 71,512 మంది సాధారణ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు. అంటే మొత్తం 86,754 మంది రోగులను తరలించారన్నమాట. కోవిడ్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా 108 అంబులెన్స్లు 124 ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 6,640 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రులకు తరలించారు. ► ఈ అంబులెన్స్లు బిజీగా వున్న పరిస్థితుల్లో నాన్ కోవిడ్ పేషంట్లకు వినియోగించే 108 అంబులెన్స్లను కూడా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా 8,602 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు. కరోనా తొలివేవ్లోనే అంబులెన్సుల కొనుగోలు 2020 మార్చి 10వ తేదీన తొలికరోనా కేసు నమోదైంది. అప్పటికి రాష్ట్రంలో అంబులెన్సు వ్యవస్థ అత్యంత దారుణంగా ఉండేది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 జులైలో కొత్తగా 108 అంబులెన్సులు 412 , 104 వాహనాలు 656 కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్సులు 748 వున్నాయి. ఇందులో 731 వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నాయి. హైకోర్టు, సచివాలయం, గవర్నర్ (వీఐపీ లొకేషన్స్)బంగళా వద్ద మొత్తం మూడు ఉన్నాయి. మరో 14 వాహనాలు బ్యాకప్..అంటే ఏవైనా మరమ్మతులకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. గతేడాది ఈ వాహనాలు కొనుగోలు చేయకపోయినా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా.. ఇపుడు చాలా సమస్య ఎదుర్కోవలసి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ కోవిడ్ పేషెంట్లకు వినియోగించిన అంబులెన్సులను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో హైపోక్లోరైట్ సొల్యూషన్తో శానిటైజ్ చేస్తున్నారు. అనంతరం వైద్యులు ధ్రువీకరించిన తరువాతే వాటిని మళ్లీ సాధారణ పేషెంట్ల కోసం వినియోగిస్తున్నారు. అలాగే పేషెంట్కు వినియోగించిన పరికరాలను ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్తో శుభ్రపరుస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై ఇప్పటికే ఎమర్జెన్సీ మెడికల్ టీంలకు, అంబులెన్స్ పైలెట్కు అవసరమైన శిక్షణ ఇచ్చారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ల్లో పూర్తిగా నింపిన రెండు ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్, డెఫ్రిబులేటర్లు అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లను కాపాడేందుకు వినియోగిస్తున్నారు. 104తో ఇంటి ముంగిటకే వైద్యం గ్రామ సచివాలయాన్ని ప్రాతిపాదికగా తీసుకుని రాష్ట్రంలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా గత నెల (ఏప్రిల్) 1 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో 104 వాహనాల ద్వారా 6,64,108 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించింది. వీరిలో 6,30,513 మందికి అవసరమైన మందులు పంపిణీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆ గ్రామంలోనే వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. అలాగే మంచానికే పరిమితమైన 77,396 మంది పేషంట్లకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి చికిత్స అందించారు. మధుమేహం, హైపర్ టెన్షన్ పేషెంట్లకు ఇంటివద్దకే వెళ్లి మందులు ఇస్తున్నారు అవసరమైతే మరిన్ని కోవిడ్కు కోవిడ్ పేషెంట్ల రవాణా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. అవసరమైతే మరిన్ని పెంచుకోవాలని చెప్పాం. ఇవికూడా సరిపోకపోతే ప్రైవేటు అంబులెన్సులనైనా తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. దేశంలోనే అంబులెన్సుల నిర్వహణలో మనం ముందంజలో ఉన్నాం. –అనిల్కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ -
ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు ఫీజుల నిర్ధారణ
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు, యాజమాన్యాలతో చర్చించి ధరలు నిర్ధారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిడేటెడ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్), నాన్ ఎన్ఏబీహెచ్లుగా విభజించి రేట్లు నిర్ణయించింది. రోగికి సంబంధించి అన్నీ కలిపే పై ధరలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కన్సల్టేషన్, నర్సింగ్ చార్జీలు, రూమ్ అద్దె, భోజనం, కోవిడ్ టెస్టింగ్, రక్తపరీక్షలు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ పరీక్షలు, పీపీఈ కిట్లు, మందులు, యూరినరీ ట్రాక్ట్ కేథటరైజేషన్ వంటివన్నీ ఇందులోనే ఉంటాయన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి కోవిడ్ రోగిని అడ్మిట్ చేసుకోవాల్సిందేనన్నారు. అడ్మిషన్ సమయంలో ముందస్తు సొమ్ము (అడ్వాన్స్)కు డిమాండ్ చేయకూడదన్నారు. సీటీ స్కాన్కు రూ.3 వేలు అలాగే సీటీ స్కాన్కు రూ.3 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం పేర్కొంది. రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కోదానికి రూ.2,500, తోసిజుమాంబ్ ఇంజక్షన్కు రూ.30 వేలు తీసుకోవచ్చు. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా వైద్యాధికారులు, తదితరులకు కల్పించారు. తక్షణమే ఈ రేట్లు అమల్లోకి వస్తాయని, జిల్లా కలెక్టర్లు నిరంతరం వీటిని పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
స్వల్ప లక్షణాలుంటే కోవిడ్ కేర్ సెంటర్లకు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్లు ఆస్పత్రులకు అవసరం లేదని, వారు కోవిడ్ కేర్ సెంటర్లలో చేరితో ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ అన్నారు. దీనివల్ల సీరియస్గా ఉన్న పేషెంట్లకు కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 60 కోవిడ్ కేర్సెంటర్లలో మెరుగైన వసతులతో 33,427 పడకలున్నాయని, స్పల్ప లక్షణాలున్న బాధితులను ఇక్కడకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. కోవిడ్ సోకి, లక్షణాలు లేని వాళ్లను హోం ఐసొలేషన్లోనే ఉంచి, ఏఎన్ఎంలు వారిని నిత్యం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. రెమ్డెసివిర్ల లెక్క తేలుస్తాం రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు 3 రోజుల్లో 30 వేల రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని, ఇందులో ప్రభుత్వం కొన్ని ఇవ్వగా, వాళ్లే కొన్ని కొనుక్కున్నారని సింఘాల్ తెలిపారు. వీటి వినియోగంపై ఆరా తీస్తున్నామని, రెండ్రోజుల్లో పూర్తి లెక్కలు బయటకు వస్తాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28 వేలకు పైగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరిపడా∙నిల్వలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది పీక్ దశలోనే 260 మెట్రిక్ టన్నులకు మించి వాడలేదని, ఇప్పుడు వృథా అవుతోందని, దీన్ని అరికట్టాలని అధికారులకు సూచించామన్నారు. గుంటూరు, అనంతపురం, వైఎస్సార్, కృష్ణా జిల్లాల్లో మూత పడిన ఆక్సిజన్ యూనిట్లను పునరుద్ధరించి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరో ఐదు యూనిట్లలో తయారవుతున్న గ్యాస్ను లిక్విడ్ ఆక్సిజన్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. 104 కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేస్తోందని, కోవిడ్కు సంబంధించి అన్ని వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచామని వివరించారు. సెకండ్ వేవ్ కరోనా తగ్గే వరకూ వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. -
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో 50 మందికే అనుమతి
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు హాజరయ్యేవారిని 50 మందికి మాత్రమే పరిమితంచేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని నిబంధనలు విధించింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, శానిటైజ్ చేసుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ క్లబ్బులు, స్పాలను మూసివేస్తున్నామని తెలిపారు. సినిమా హాళ్లు, బస్సులను 50 శాతం సీట్లతోనే నడపాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఐదు అడుగుల భౌతిక దూరం పాటించి విధులు నిర్వహించుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింఘాల్ ఏమన్నారంటే.. పేషెంట్ల సంఖ్య కంటే ఇంజక్షన్ల వినియోగం ఎక్కువగా ఉంది.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య కంటే ఒక రోజులో వినియోగించిన రెమ్డెసివిర్ ఇంజక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో 11,453 డోసులు వాడారు. అన్ని పడకలే లేనప్పుడు ఇన్ని ఇంజక్షన్లు ఎలా వాడారనే దానిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నాం. ఏ రోజు ఎంత స్టాకు వచ్చింది.. ఎన్ని వేశారు.. ఎవరికి వేశారు వంటి వివరాలు సేకరిస్తున్నాం. దుర్వినియోగమైనట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రులకు వచ్చిన రోగులను బయట రెమ్డెసివిర్ తెచ్చుకోండి అంటున్నారు. ఇది సరికాదు. ఇకపై ప్రైవేటు ఆస్పత్రులు ఇండెంట్ ఇస్తే పరిశీలించి మేమే ఇంజక్షన్లు తెప్పిస్తాం. ఇకపై ప్రతి రెమ్డెసివిర్ ఇంజక్షన్ వినియోగాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాం. కోవిడ్ అనుమతి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలోనూ హెల్ప్లైన్ నంబర్ పెడతాం. రెండు రోజుల్లో రెమ్డెసివిర్ కొరత అనే మాట లేకుండా చేస్తాం. ఆక్సిజన్ దుర్వినియోగం మా దృష్టికి వచ్చింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ చాలా ముఖ్యం. ఎవరికంటే వారికి ఆక్సిజన్ పెడుతున్నారు. విజయనగరంలో 96 శాతం ఆక్సిజన్ శాచురేషన్ ఉన్న పేషెంట్కు ఆక్సిజన్ పెట్టారు. రాత్రిపూట కొన్నిచోట్ల ఆక్సిజన్ పెట్టి వదిలేస్తున్నారు. ఇలాంటివి ఇక జరగవు. దీనికి ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ పెడతాం. దుర్వినియోగానికి అవకాశం లేకుండా చేస్తాం. ప్రస్తుతం 341 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. గతేడాది ఇంతకంటే ఎక్కువ మంది ఇన్పేషెంట్లు ఉన్నప్పుడు 261 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వినియోగమైంది. ప్రస్తుతం దుర్వినియోగమైందా, బయట అమ్ముకుంటున్నారా అనేదానిపై నిఘా పెట్టాం. విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ అందక ఎవరూ మృతి చెందలేదు. ఆస్పత్రుల నిర్వహణ బాధ్యత జేసీలకు.. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ విధులు చూస్తున్న జాయింట్ కలెక్టర్లకు పూర్తిగా ఆస్పత్రుల నిర్వహణ అప్పజెప్పాం. కోవిడ్ విధులు మాత్రమే వాళ్లు పర్యవేక్షిస్తారు. ఆస్పత్రుల నిర్వహణ, వసతులు, సీసీ టీవీలు, 104 కాల్సెంటర్, రోగి బంధువులకు సమాచారం అందుతోందా లేదా వంటివన్నీ ఇక జేసీలే చూస్తారు. 376 ఆస్పత్రులు అందుబాటులోకి.. ఈ నెల 26 నాటికి 376 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 4,395 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తే 2,022 పడకలు మాత్రమే నిండాయి. 16,352 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి తేగా ఇందులో 7,943 మాత్రమే నిండాయి. రెమ్డెసివిర్ అవసరం ఉన్నవారికి మాత్రమే వేయాలని చెప్పాం. అవసరం ఉంటేనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని, మిగతా వారిని కోవిడ్కేర్ సెంటర్లకు పంపించాలని సూచించాం. 104 కాల్సెంటర్ నిర్వహణపై గంట గంటకూ పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా జిల్లాలో ఐదారు ఆస్పత్రులను ఒక క్లస్టర్గా చేసి, ఒక ప్రత్యేక అధికారిని పెడుతున్నాం. దీంతోపాటు ముగ్గురు అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ను నియమించి జిల్లాలో ఆస్పత్రులను తనిఖీలు చేయిస్తాం. ప్రైవేటు ఆస్పత్రుల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ పనిచేస్తుంది. -
అందుబాటులో అరలక్ష బెడ్స్
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి పడకల సంఖ్యను భారీగా పెంచుతోంది. ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో కలిపి 50,751 పడకలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 24,548 పడకలు, కోవిడ్ కేర్ సెంటర్లలో 26,203 పడకలు ఉన్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా అవసరమైన మేరకు పడకల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం నవంబర్ తర్వాత కేసులు తగ్గడంతో కోవిడ్ ఆస్పత్రులను నాన్ కోవిడ్ ఆస్పత్రులుగా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో మళ్లీ ఒక్కసారిగా కేసులు విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. శుక్రవారం నాటికి 218 ఆస్పత్రులను సిద్ధంగా ఉంచింది. ఈ ఆసుపత్రుల్లో 24,548 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులూ ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో విధిగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బాధితులకు కోవిడ్ వైద్యం అందించాల్సి ఉంటుంది. సిద్ధంగా 3,462 ఐసీయూ పడకలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండేవారి చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,462 ఐసీయూ పడకలు సిద్ధం చేశారు. కేసులు ఎక్కువగా ఉన్న చిత్తూరు జిల్లాలో 430 ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచారు. అవసరమైతే మరిన్ని పడకలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాధితులకు క్రిటికల్ కేర్ చికిత్స అందించేందుకు నిపుణులైన వైద్యులందరూ సిద్ధంగా ఉండాలని, వారికి అండగా నిలవాలని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కోవిడ్ కేర్ సెంటర్లలో 26,203 పడకలు హోం ఐసొలేషన్లో ఉండటానికి అవకాశం లేక.. స్వల్ప లక్షణాలు లేదా ఓ మోస్తరు లక్షణాలతో ఉన్న వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తారు. ఇలాంటి వారి కోసం తాజాగా 26,203 పడకలు రెడీ చేశారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5వేల పడకలు కోవిడ్ కేర్ సెంటర్లలో సిద్ధంగా ఉంచారు. ఈనెల 24 ఉదయం నాటికి కోవిడ్ కేర్ సెంటర్లలో 3,083 మంది పేషెంట్లు ఉన్నారు. ఇంకా 23,120 పడకలు మిగిలి ఉన్నాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 43 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిని ఇంకా పెంచుతామని, ఈ సెంటర్లలో మరిన్ని పడకలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కేసుల సంఖ్యను బట్టి మరిన్ని ఆస్పత్రులు అన్ని జిల్లాల్లో అవసరాన్ని బట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని కలెక్టర్లను ఆదేశించాం. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని కోవిడ్ కేర్ సెంటర్లను పెంచుతాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 104కు కాల్ చేసి వైద్య సేవలు పొందే అవకాశం కల్పించాం. అక్కడ వైద్యులు 3 షిఫ్ట్లూ పనిచేస్తున్నారు. –అనిల్కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ