-
ఇండియా కూటమికి ఎదురుదెబ్బలు?
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఇండియా కూటమి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎంపీలోని ప్రముఖ ఖజురహో స్థానం నుండి ఇండియా అలయన్స్కు చెందిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఖజురహో లోక్సభ స్థానాన్ని సమాజ్వాదీ పార్టీకి కేటాయించింది. ఇప్పుడు సమాజ్వాదీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇండియా కూటమికి నష్టమని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీడి శర్మ ఖజురహో స్థానం నుండి గిలిచి ఎంపీ అయ్యారు. ఈ విధంగా చూస్తే ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ఒక స్థానాన్ని కోల్పోయినట్లయ్యింది. ఇండియా అలయన్స్ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ సహా నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పన్నా సురేష్ కుమార్ ఈ విషయమై మాట్లాడుతూ ఎస్పీ అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ పత్రాలలో సంతకాలు లేవన్నారు. అలాగే ఓటరు జాబితా కాపీ కూడా లేదన్నారు. పలు కారణాలతో ఖజురహో లోక్సభ నియోజకవర్గం నుంచి మొత్తం నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయని తెలిపారు. ఖజురహో సీటుకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ ఇద్దరు అభ్యర్థులను మార్చింది. మొదట మనోజ్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. రెండు రోజుల తర్వాత మనోజ్ యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మీరా యాదవ్ను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు మీరా యాదవ్ నామినేషన్ రద్దు కావడంతో కాంగ్రెస్, ఎస్పీల ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. -
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
‘ఇండియా’ ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఆదివారం(మార్చ్ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్ పాల్గొని మాట్లాడారు.‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్బెంగాల్లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పై క్రికెటర్ యూసఫ్ పటాన్ను రంగంలోకి దింపింది. ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది. Modi's guarantee has zero warranty! Zero warranty when it comes to price rise, jobs and protecting India's institutions. After the Pulwama tragedy, former Governor Satya Pal Malik ji publicly said that Narendra Modi ji did not even want the truth to come out. What did Narendra… pic.twitter.com/qeb0fgA5xS — Congress (@INCIndia) March 31, 2024 ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా -
జనసేనను చిదిమేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది మరి! ఆయన పార్టీ టీడీపీ తప్ప మిత్రపక్షంలోని ఏ పార్టీకి అయినా ఆ తర్వాత పట్టేది అధోగతే. గతంలో వామపక్షాలు, బీజేపీ.. ఇప్పుడు జనసేన. పార్టీ ఎదుగదల దశలోనే జనసేనను చంద్రబాబు చిదిమేశారు. పొత్తుల పేరుతో ఆ పార్టీని రెండు ఉమ్మడి జిల్లాలకే పరిమితం చేశారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ను ఓ బొమ్మలా మార్చేసుకొని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 మాత్రమే ఇచ్చి, మమ అనిపించేశారు. రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గంలో ఎక్కువ మంది రాజకీయాల్లో ప్రాధాన్యత కోసం పవన్ కళ్యాణ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అలాంటి పార్టీని చంద్రబాబు వ్యూహాత్మకంగా దెబ్బతీసి, పొత్తుల పేరుతో ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉండగా, జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలు తిరుపతి, రైల్వే కోడూరు మాత్రమే. ఉమ్మడి శ్రీకాకళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు.. ఈ ఆరు జిల్లాల పరిధిలో 74 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 4 మాత్రమే జనసేనకు వచ్చాయి. ఈ నాలుగింటిలోనూ నెల్లిమర్ల, తెనాలి సీట్లను మాత్రమే జనసేన అధికారికంగా ప్రకటించింది. ఇంకా పాతపట్నం, అవనిగడ్డ స్థానాలు జనసేనకే అని చెబుతున్నప్పటికీ, అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇలా 126 స్థానాలు (70 శాతానికి పైగా అసెంబ్లీ స్థానాలు) ఉన్న ఈ 10 ఉమ్మడి జిల్లాల్లో జనసేనకు వచ్చిన నియోజకవర్గాలు ఆరు మాత్రమే. అంటే.. కనీసం జిల్లాకు ఒకటి కూడా ఇవ్వలేదు. మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 స్థానాలు ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో 12 చోట్ల జనసేన పోటీ చేస్తోంది. ఈ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చింది ఈ రెండు జిల్లాల్లోనే. అదీ.. ఉన్న సీట్లలో మూడో వంతుకంటే తక్కువే. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 15 స్థానాల్లో మూడు చోట్ల మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. అంటే ఐదో వంతు స్థానాలతో సరిపెట్టారు. నాయకుల గోడు పార్టీ అధినేత సైతం వినే పరిస్థితి లేక.. పొత్తులో జనసేన పార్టీకి దక్కినవే 21 అసెంబ్లీ సీట్లు. వీటిలోనూ జనసేన నేతలకు అన్యాయమే జరిగింది. ఇటీవలి కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఈ స్థానాల్లో ఎక్కువ భాగం దక్కాయి. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి 2019 ఎన్నికల్లో పవన్కు ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేతే కావడం గమనార్హం. మరోవైపు జనసేన పార్టీకి రెండు లోక్సభ స్థానాలు కేటాయించగా, అందులో మచిలీపట్నం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బాలÔౌరి రెండు నెలల క్రితమే పార్టీలో చేరారు. ఇలా సీట్ల సంఖ్యలోనే కాదు.. పార్టీ నేతలకు న్యాయం చేయడంలోనూ జనసేన దెబ్బతింది. దీంతో పార్టీలో నియోజకవర్గ, ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇంతకాలం పార్టీకి పనిచేస్తే తమకు ఉన్న ప్రాధాన్యత ఏమిటంటూ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, నాయకులు మౌనం వహిస్తున్నారు. 2019లో 24,248 ఓట్లు వచ్చిన భీమిలి నియోజకవర్గంలో ఈసారి జనసేన ఎందుకు పోటీ చేయడంలేదని అక్కడ టికెట్ ఆశించిన నాయకుడిని స్థానిక కార్యకర్తలు ఓ సమావేశంలో నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక ఆయన సమావేశం కొనసాగినంత సేపు తలదించుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా హల్చల్ చేస్తోంది. అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు గత ఎన్నికల్లో 22 వేలకు పైగానే ఓట్లు వచ్చాయి. ఆ స్థానంలో అప్పుడు పోటీ చేసిన నాయకుడే మరోసారి పోటీ చేయాలని భావించారు. పొత్తులో ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో గత 15 రోజులుగా నిరసన దీక్షలు, ఆందోళనలు చేశారు. అయినా, పార్టీ నుంచి ఎవరూ పట్టించుకోకపోవడంతో ‘ఇంకేమి చేయాలి. ఎంత ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోకపోతే చివరకు ఆ ఏసుక్రీస్తుకే చెవిలో బాధ చెప్పుకున్నా’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తమ గోడును కనీసం పార్టీ అధినేత పవన్ కూడా వినే పరిస్థితి లేక చాలా నియోజకవర్గాల్లో నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొంటున్నారు. మిత్రపక్షాలను మింగే అనకొండ.. అవకాశం ఉంటే... తెలుగుదేశం పార్టీ అంటే మిత్రపక్షాలను మింగే అనకొండ అన్నది అందరికీ తెలిసిన విషయమే. 1998 లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆ«ంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచిందని.. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 12 లోకసభ స్థానాలు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలోనూ ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడు సార్లు బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేశాయి. అయితే, 1998 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ, ఉమ్మడి ఏపీలో 18 శాతానికి ఓట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా రెండు విడతలు టీడీపీతో పొత్తు పెట్టుకొని, 2009 కల్లా మూడు శాతం ఓట్లకు దిగజారిపోయిందని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. మళ్లీ ఐదేళ్ల విరామం అనంతరం 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఒక శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని ఆ నాయకులు తెలిపారు. పలుసార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టులు సైతం రాష్ట్రంలో ప్రతి ఎన్నికలకు తమ ఓటు బ్యాంకు కోల్పోయారని విశ్లేíÙస్తున్నారు. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని, అధికారంలోకి వచ్చాక ఆ మిత్రపక్ష పార్టీలను వారికి సైతం తెలియకుండా మింగేసే చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. ఇప్పుడు పొత్తులకు ముందే జనసేనను రెండు మూడు జిల్లాల ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత ఆ జిల్లాల్లోనూ జనసేనకు ఉనికే లేకుండా చేసే పరిస్థితే ఉంటుందని ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బీసీలకు బాబు పోటు
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలపై మొసలి కన్నీళ్లు కురిపించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. పొత్తులో టీడీపీ పోటీ చేసే 144 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం 34 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించారు. తన సొంత సామాజిక వర్గానికి మాత్రం ఏకంగా 32 సీట్లు ఇచ్చారు. బీసీలతో సమానంగా కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు అన్ని జిల్లాల్లో సీట్లు దక్కించుకోవడం గమనార్హం. ఇక మైనారిటీలకు నామమాత్రంగా మూడు సీట్లతో సరిపెట్టారు. న్యాయంగా వారికి దక్కాల్సిన సీట్లను కూడా పొత్తులో వదిలేయడంతో టీడీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబు కేవలం 9 సీట్లు మాత్రమే వారికి కేటాయించారు. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నా సీట్లు మాత్రం ఇవ్వలేదు. ఎంపీ సీట్లలోనూ అదే తీరు.. ఎంపీ సీట్లలోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. బీసీలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు ఎంపీ సీట్లు ఇవ్వగా తన సొంత సామాజిక వర్గానికీ ఆరు సీట్లు ఇచ్చారు. పొత్తులతో దక్కిన 17 ఎంపీ స్థానాల్లో కాపులకు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీన్నిబట్టి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. తన ప్రసంగాల్లో పేదల గురించి, సామాజిక న్యాయం గురించి డప్పు కొట్టే చంద్రబాబు రాజకీయంగా మాత్రం వారిని అణగదొక్కుతూనే ఉన్నట్లు మరోసారి తేలిపోయింది. -
లక్షల గళాల గర్జన
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ ఎమ్మిగనూరు వేదికగా లక్షలాది గొంతుకలు సింహగర్జన చేశాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుఇవ్వడంతో లక్షల మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమైతే సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్ఫోన్లలో టార్చ్ లైట్ వెలిగించడంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో కనిపించిన దృశ్యాలివీ.. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని ఎమ్మిగనూరు సభ మరోసారి చాటిచెప్పిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది ప్రతీకగా నిలిచిందని అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది. గురువారం పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్ రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు సిటీ, పాణ్యం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఎన్నికల్లో విజయానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించి రామచంద్రాపురం మీదుగా కోడుమూరుకు చేరుకున్న సీఎం జగన్కు భారీ గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోడుమూరులో సీఎం జగన్ రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి సీఎం జగన్పై బంతి పూలవర్షం కురిపించారు. చేనేత కార్మికులు చీరను, మగ్గాన్ని బహూకరించి సీఎం జగన్కు మద్దతు పలికారు. బుడగ జంగం సామాజికవర్గ ప్రజలు సీఎం జగన్ను కలిసిసంఘీభావం తెలిపారు. కురుబ సామాజికవర్గానికి చెందినవారు సీఎం జగన్కు మేకను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోడుమూరు నుంచి హంద్రీ కైరవాడి చేరుకునే సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ... నినదించారు. గోనెగండ్లలోనూ సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. ఎమ్మిగనూరులో జన సునామీ.. భోజన విరామం అనంతరం రాళ్లదొడ్డి నుంచి బయలుదేరిన సీఎం జగన్ బస్సు యాత్రకు ఎర్రకోటలో జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ బస్సుపై బంతిపూలవర్షం కురిపించారు. షెడ్యూలు ప్రకారం బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, ప్రజలు అడుగడుగునా నీరాజనాలుపలకడంతో రెండుగంటలు ఆలస్యంగా 5.30 గంటలకు చేరుకుంది. సీఎం జగన్ ఎమ్మిగనూరుకు చేరుకునేసరికి కర్నూలు జిల్లా నలుమూల నుంచి లక్షల సంఖ్యలో జనవాహిని తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 11 గంటల నుంచి ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మొదలైన జనప్రవాహం సాయంత్రం 4.30 గంటలకు సునామీని తలపించింది. 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు, ఇరువైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మిగనూరు చరిత్రలో సీఎం జగన్ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జననేత కోసం నిరీక్షణ.. ఎమ్మిగనూరు సభ రాత్రి 7.20 గంటలకు ముగిసింది. అనంతరం బస్సుయాత్ర హనుమాపురం చేరుకుంది. సీఎం జగన్ను చూసేందుకు అవ్వతాతలు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. సీఎం జగన్ రాగానే బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాపురం నుంచి ఆస్పరి చేరుకునే సరికి రాత్రి 8.30 గంటలైంది. బస్సు యాత్ర అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. జన నీరాజనాల మధ్య చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా రాతన వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి రాత్రి 9.47 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో సాగిన బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉప్పొంగిన భావోద్వేగం ఐదేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేయడంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి పేదరికాన్ని రూపుమాపడం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫొటోతోపాటు సంతకం చేసిన లేఖను ఇంటింటికీ పంపిన చంద్రబాబు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోభృతిగా ఇస్తానని, చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ చేస్తానని, అర్హులందరికీ మూడు సెంట్ల భూమి ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తాననే ముఖ్యమైన హామీలతోపాటు 650 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా వంచించటాన్ని ప్రస్తావించినప్పుడు లక్షల మంది ప్రజలు ఔనంటూ.. చేతులు ఎత్తి ఏకీభవించారు. ఇప్పుడు మళ్లీ అదే పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సూపర్ సిక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, వాటిని ఎదుర్కొని పేదల భవిష్యత్తును మరింతగా గొప్ప మార్చేందుకు వైఎస్సార్సీపీని గెలిపిచేందుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో మేమంతా సిద్ధమే.. అంటూ లక్షల గొంతుకలు ప్రతిస్పందించాయి. శింగనమలలో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు వైఎస్సార్సీపీ టికెట్ ఇస్తే చంద్రబాబు ఎద్దేవా చేసి తన పెత్తందారీ పోకడలను రుజువు చేసుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పేదవాడు పైకి ఎదిగితే ఎందుకంత మంట? అని నిలదీశారు. మడకశిరలో ఈర లక్కప్ప అనే ఉపాధి కూలీకి టికెట్ ఇచ్చామని, దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా బాబూ? అని ప్రశ్నించారు. ‘‘నా...’’ అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 200 శాసనసభ, లోక్సభ స్థానాల్లో వంద సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పేదల పార్టీ కాబట్టే సగం సీట్లు ఇచ్చామన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవహేళన చేయడంతోపాటు తోకలు కత్తిరిస్తానంటూ బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు తోకను కత్తిరించేలా తీర్పు ఇవ్వాలని సీఎం జగన్ పిలుపునిచ్చి నప్పుడు మేమంతా సిద్ధమే అంటూ లక్షల గొంతుకలు నినదించాయి. -
India Alliance: బిహార్లో కాంగ్రెస్ పోటీ చేసే సీట్లు ఎన్నంటే..
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఇండియా కూటమి సీట్ షేరింగ్ ఫైనల్ అయింది. పొత్తులో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ పార్టీ 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు శుక్రవారం(మార్చ్ 29) వెల్లడించాయి. బీహార్లో మొత్తం 40 సీట్లకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న ఏడవ విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్ రామ్ మాంజీ పార్టీ హెచ్ఏఎమ్ ఒక సీటు, ఆర్ఎల్ఎస్పీ ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ లోక్జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లో బీజేపీకి 24.1 శాతం ఓట్లు రాగా జేడీయూకు 22.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 7.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. అయినా ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఆర్జేడీ 9 సీట్లు ఇవ్వడం విశేషం. ఇదీ చదవండి.. కాంగ్రెస్కు మరో బిగ్ షాక్ -
కూటమి విచ్ఛిన్నం.. ఒంటరిగానే జేజేపీ పోటీ
Haryana: వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని జననాయక్ జనతా పార్టీ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. “రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని జననాయక్ జనతా పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని చౌతాలా ఏఎన్ఐకి చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (BJP-JJP) కూటమి విచ్ఛిన్నమైన కొన్ని రోజులలోనే జేజేపీ నుంచి ఒంటరి పోటీ నిర్ణయం వచ్చింది. ఈ కూటమి విచ్ఛిన్నం మార్చి 12న మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాకు దారితీసింది. నయాబ్ సింగ్ సైనీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నయాబ్ సైనీ కురుక్షేత్ర నుండి బీజేపీ లోక్సభ ఎంపీగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్లో ఆయన పార్టీ రాష్ట్ర చీఫ్గా నియమితులయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలోని మొత్తం 10 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. అయితే ఆప్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన జేజేపీ పోటీ చేసిన 7 స్థానాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాగా హర్యానాలో 2024 సార్వత్రిక ఎన్నికలు మే 25న ఆరో దశలో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్ఖాన్తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్ను కలిశారు. టికెట్పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
బీజేపీలో సీనియర్లకు సీటులేదు!
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : పొత్తులో భాగంగా రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ లోక్సభ ఎన్నికల ఇంచార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మాజీ ఎంపీ, ఇద్దరు మాజీమంత్రులు, ఒక జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటుదక్కింది. కానీ, రెండు మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తీవ్ర నిరాశే మిగిలింది. మొన్న పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలోనూ టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్థన్రెడ్డి, పరిపూర్ణానంద స్వామికి కూడా ఈ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో రిక్తహస్తమే మిగిలింది. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలమన్న వ్యక్తులుగా పేరున్న నాయకులకు మాత్రం సీట్లు దక్కాయని అసలైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నచ్చిన వారికి అనుకూలంగా పురందేశ్వరి నివేదికలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తనకు నచ్చిన వలస నేతలకు.. నిన్న మొన్నటి వరకు పార్టీతో సంబంధంలేని వారికి టికెట్లు ఇప్పించుకున్నారని ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న అసలైన బీజేపీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాను అనుకున్న వారికి అనుకూలంగానే ఆమె జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపి వారికి టికెట్లు దక్కేలా చేసుకున్నారని వారు మండిపడుతున్నారు. నిజానికి.. బీజేపీ జాబితాలో బద్వేలు అభ్యర్థిగా ప్రకటించిన రోశన్న అభ్యర్థుల ప్రకటనకు ఒకరోజు ముందే పార్టీలో చేరారని వారు చెప్పారు. అలాగే, రెండు మూడ్రోజుల క్రితం వరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడిగా కొనసాగారని.. అసలు పొత్తులో బద్వేలు స్థానాన్ని బీజేపీ ఎందుకు కోరుకోవాల్సి వచ్చిందో.. టీడీపీ నేతను హడావుడిగా పార్టీలో చేర్చుకుని అతనికెందుకు సీటు ఇవ్వాల్సి వచ్చిందో రాష్ట్ర పార్టీలో చాలామందికి అంతుబట్టడంలేదు. ఇప్పుడు బీజేపీలో ఇది హాట్టాపిక్గా మారింది. నిజానికి.. చాలా నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బీజేపీ నాయకులు రెండు మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కష్టపడిన వారి స్థానాలను పట్టించుకోకుండా.. చంద్రబాబు ఇస్తామన్న స్థానాల్లో తనకు అనుకూలమైన వారి పేర్లను పురందేశ్వరి జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపారని వారు ఆరోపిస్తున్నారు. పదిలో ఆరుగురు వలస నేతలే.. ఇక 2019 ఎన్నికలు వరకు తెలుగుదేశంలో ఉండి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే తాత్కాలిక పునరావాసం కోసం బీజేపీలో చేరిన చంద్రబాబు సొంత మనుషులు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి వంటి నాయకులు పొత్తులో బీజేపీకి దక్కిన స్థానాల్లో సీట్లు ఎగరేసుకెళ్లారని ఆ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు మరో నమ్మినబంటు కామినేని శ్రీనివాస్ సైతం 2014 ఎన్నికల సమయంలో బీజేపీ–టీడీపీ పొత్తు ఖాయమని తెలిశాక కమల దళంలో చేరి ఆ ఎన్నికల్లో గెలుపొందాక ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించారన్నారు. అలాగే.. 2019లో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తులేకపోవడంతో ఆయన తిరిగి బీజేపీ తరఫున పోటీచేసేందుకు విముఖత వ్యక్తంచేసి ఎన్నికలకు దూరంగా ఉన్నారని తాజాగా సీట్లు దక్కని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇక పార్టీ ప్రకటించిన పది స్థానాల్లో అరకు, అనపర్తి, విశాఖ పశ్చిమ స్థానాల అభ్యర్థులు మినహా మిగిలిన ఏడు స్థానాల అభ్యర్థులు కేంద్రంలో బీజేపీ అధికారం ఖాయమని స్పష్టంగా తెలిసిన తర్వాత పదేళ్ల క్రితం పార్టీలో చేరిన నాయకులని చెబుతున్నారు. ధర్మవరం అభ్యర్థిగా ప్రకటించిన సత్యకుమార్ మొదట నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తి. అప్పట్లో ఆయన అసలు పార్టీ నాయకుడిగా పనిచేయలేదని, ఒకవేళ అతణ్ణి మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వ్యక్తిగా పరిగణించినా మిగిలిన ఆరుగురు వలస నేతలేనని బీజేపీలో చర్చ సాగుతోంది. -
టీడీపీ, బీజేపీ పొత్తుకు అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్
-
తమ్ముళ్ల తిరుగుబాటు
అవనిగడ్డ/పెందుర్తి/పెద్దతిప్పసముద్రం/ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ నాయకులనుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఎన్నో ఏళ్లుగా సీటుపై ఆశలు పెంచుకుని పార్టీ కార్యక్రమాలకోసం డబ్బు తగలేసుకుని, కష్టకాలంలో జెండా మోస్తే తీరా ఎన్నికలు వచ్చేసరికి పొత్తులో భాగంగా వేరొకరికి ఇస్తామంటే ఎందుకు సహకరించాలని వారు నిలదీస్తున్నారు. అక్కడ టికెట్ దక్కించుకున్నవారికి సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోనైతే ఒక అడుగు ముందుకేసి 30మంది నాయకులు తమ పార్టీ పదవులకు ఏకంగా రాజీనామా చేస్తూ ఆ లేఖలను పార్టీ అధిష్టానానికి పంపించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శాసన సభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు అక్కడి టికెట్ కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ 30 మంది పార్టీ నాయకులు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేసి, ఆ లేఖలను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. నియోజకవర్గంలో గెలిచే సత్తా బుద్ధప్రసాద్కే ఉందని, పొత్తుని పక్కన పెట్టి ఆయనకే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారనీ, కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయనకు కనీసం టికెట్ గురించి సమాచారం కూడా ఇవ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. రాజీనామా చేసిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి కర్రా సుధాకర్, అశ్వరావుపాలెం సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, క్లస్టర్ ఇన్చార్జి బండే రాఘవ, మాజీ ఉపసర్పంచ్లు ఘంటసాల కన్నయ్య, అడపా శ్రీనివాసరావు తదితరులున్నారు.కాగా పొత్తు ధర్మం పాటిస్తామంటూనే టీడీపీ నాయకులు రాజీనామాలు చేస్తూ బ్లాక్ మెయిల్కు పాల్పడటంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారుకు అన్యాయంపై రగులుతున్న కేడర్ 40 ఏళ్లుగా టీడీపీ జెండాను మోస్తూ పార్టీ మనుగడకోసం పాటుపడిన బండారు సత్యనారాయణమూర్తిని కాదని ఎక్కడి నుంచో పార్టీలు మారుతూ వచ్చిన వ్యక్తికి పెందుర్తి టికెట్ ఇస్తారా అంటూ అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ కేడర్ మండిపడుతోంది. టీడీపీ నుంచి జనసేనకు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడి జనసేన అభ్యర్థి పంచకర్ల తలకిందులుగా తపస్సు చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దానికి ప్రతిగా జనసేన నాయకులు పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు సహకరించడం న్యాయమని భావిస్తున్నాం. తామేమీ టీడీపీ నాయకుల ఓట్ల మీద ఆధారపడి పోటీ చేయడం లేదని సమాధానమిస్తున్నారు. మొత్తమ్మీద పెందుర్తిలో కూటమి వికటిస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులైన బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్బాబు కలసి పనిచేయడం ఇక కల్లే అని అక్కడి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు ధర్మంలో జనసేనకే టికెట్ ఇవ్వవలసి వస్తే టి.శివశంకర్కు టికెట్ ఇవ్వాలని, పంచకర్లకు వద్దని మొదటినుంచీ చెబుతున్నారు. కానీ వారి డిమాండ్ను జనసేన అధినేత పట్టించుకోకపోవడాన్ని వారు అవమానంగా భావిస్తున్నారు. తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డికి చుక్కెదురు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. సోమవారం రాత్రి ఆయన మండలంలోని బూర్లపల్లి పంచాయతీ కొత్తపల్లిలో ఇంటింటా తిరిగి ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంలో ఇదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు జయచంద్రారెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్కు మద్దతుగా జై శంకర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో జయచంద్రరెడ్డి తీవ్ర అసహనానికి లోనై వెను తిరిగారు. గిద్దలూరు జనసేనకుఇవ్వాల్సిందే ఒంగోలు జిల్లా గిద్దలూరు సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ నాయకుడు, కాపు సంఘం జిల్లా అ«ధ్యక్షుడు ఆమంచి స్వాములు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కల్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 శాతం కాపు జనాభా ఉన్నారని, వైఎస్సార్సీపీ 31 సీట్లు ఇస్తే కనీసం అన్ని సీట్లు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రకటించకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తెనాలిలో జనసేనకు కేటాయించినా అది కాపు సామాజిక వర్గం కాదన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాపులకు కూటమి టికెట్ కేటాయించలేదని, ఈ నేపథ్యంలో గిద్దలూరు సీటును జనసేనకు కేటాయించాల్సిందేనన్నారు. ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాల్సిందే అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కాపు సంఘం నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి మనసు మార్చుకుని గిద్దలూరు టికెట్ను జనసేనకు కేటాయించకపోతే కాపులు బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జి.వెంకటేశ్వర్లు(కొండపి), బి.బ్రహ్మయ్య(అద్దంకి), ఆర్.శ్రీనివాసరావు(పర్చూరు) తదితరులు పాల్గొన్నారు. -
పొత్తు కోసం నేను వెళ్లలేదు
సాక్షి, తిరుపతి: బీజేపీ కోరితేనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్నానని, పొత్తును తాను కోరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం కుప్పంలో ముస్లింలు, యువత, ఆ తర్వాత హంద్రీ నీవా వద్ద జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ముస్లింలతో సమావేశం సందర్భంగా బీజేపీ కోరితేనే పొత్తు పెట్టుకున్నట్లు మాట్లాడారు. ‘పొత్తు కావాలని నేను వెళ్ళలేదు. వాళ్లు వస్తేనే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ ఆ సమావేశానికి వచ్చిన వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఎన్డీయే ఉన్నప్పుడు, లేనప్పుడు మైనార్టీలకు అండగా నిలిచింది తామేనని చెప్పారు. పొత్తు సీట్ల కోసం కాదని అన్నారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా బెంగళూరు నుంచి కొంతమంది ప్రొఫెషనల్స్ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్ళు నింపుతానని, కుప్పాన్ని బెస్ట్ టౌన్గా చేస్తానని అన్నారు. వైఎస్సార్సీపీ వాళ్లు ఒక ట్యాంకర్లో నీళ్లు తెచ్చి సినిమా సెట్టింగులు వేసి కుప్పానికి నీళ్ళిచ్చేశానంటూ ప్రజలను ఏమార్చారని ఆరోపించారు. తెచ్చిపోసిన నీళ్ళు తెల్లారేసరికి ఇంకిపోయాయని, అద్దె గేట్లు సాయంత్రం ఎత్తుకెళ్ళారని విమర్శలు చేశారు. త్వరలో డ్రామా కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. వలంటీర్ వ్యవస్థ పూర్తిగా రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారని, దాని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తామన్నారు. వారి వద్ద ఉన్న డేటాను ఈసీ కలెక్ట్ చేసుకోవాలని కోరతామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయలేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హంద్రీ–నీవా కాలువకు నీటిని తీసుకువస్తామన్నారు. ఇప్పటి వరకు కుప్పంను అభివృద్ధి చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కుప్పం భూమిపై నడిస్తే అరిగిపోతారని రెండు హెలిక్యాప్టర్లలో తిరిగారని సీఎం జగన్పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్టిఫికెట్లపై సీఎం జగన్ ఫోటో పెట్టుకున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పడు ఇజ్రాయిల్ టెక్నాలజీ నిలిపివేశారని, ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాక మొత్తం నాశనం చేశారని విమర్శించారు. గుండిశెట్టిపల్లి వద్ద మన్యం భూములు కొట్టేయాలని చూస్తున్నారని అన్నారు. నేర సామ్రాజ్యానికి విజయసాయిరెడ్డి వరల్డ్ ఫిగర్ అని, తప్పులు చేసి ఎదుటి వారిని నిందిస్తుంటారని అన్నారు. కుప్పానికి ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్ యువతతో జరిగిన సమావేశంలో బాబు గొప్పలను యువకులు నిలదీశారు. కుప్పంలో ఎయిర్పోర్టు కడతానిని చంద్రబాబు దశాబ్దాలుగా హామీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఇటుకరాయి ముక్క వేయలేదు. పైగా, ‘కుప్పం ఎయిర్పోర్ట్ ద్వారా పండ్లు, కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేస్తా’ అంటూ మరోసారి అదే హామీ ఇచ్చారు. దీంతో ఓ యువకుడు లేచి ‘కుప్పం నుంచి కూరగాయలు ఇతర దిగుబడులను విదేశాలకు ఎగుమతులు చేస్తానని చెబుతున్నారు. మీరు గతంలోనూ పలుసందర్భాల్లో కుప్పంలో విమానాశ్రయం నిర్మిస్తానని చెప్పారు. కుప్పానికి ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్’ అని చంద్రబాబును ప్రశ్నించారు. దీంతో ఓ క్షణం నివ్వెరబోయిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విమానాశ్రయాన్ని నిర్మిస్తానని అని ఆ అంశాన్ని ముగించారు. బాబును నిలదీసిన వృద్ధురాలు కుప్పం పట్టణం బాబునగర్లో ఇంటింటా ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు ఓ వృద్ధురాలి నుంచి ఎదురైన ప్రశ్నతో షాక్ తిన్నారు. టీడీపీ హయాంలో రోడ్డు విస్తరణలో తన ఇల్లు కొట్టేశారని, ఇల్లు ఎప్పుడు కట్టిస్తారంటూ వెంకటమ్మ అనే వృద్ధురాలు బాబును నిలదీసింది. ఈ ప్రచారాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయోనని ఆరు ఇళ్లు మాత్రమే తిరిగి 20 నిమిషాల్లోనే ఆ కార్యక్రమాన్ని ముగించి రామకుప్పం మండలం రాజుపేటకు వెళ్లిపోయారు. -
దిక్కుతోచని ‘కూటమి’!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మల్లగుల్లాలు పడుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. రోజులు గడుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం మాగుంట కుటుంబానికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ కుటుంబం పాత్ర ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. ఈ ఎన్నికల్లో తప్పకుండా బీసీ నేతకు ఎంపీగా టికెట్ ఇస్తానని ఇచ్చిన హామీని బాబు గాలికొదిలేశారు. ఎన్నికలు వేడెక్కుతున్నా అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో మూడు పార్టీల నేతలు, కేడర్ అయోమయంలో పడ్డారు. వాస్తవంగా రెండు నెలల ముందు వరకూ ఈ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి కరువయ్యారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు ముందుంచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బాలాజీ పేరు మరుగున పడిపోయింది. బీసీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. తొలుత రాఘవరెడ్డి పేరు.. టీడీపీలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలని జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడ్డం పడింది. దాంతో రాఘవరెడ్డి స్థానంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని రాఘవరెడ్డి ఒక ప్రకటన కూడా విడుదలచేశారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు మాత్రం ఏ ఒక్కరి పేరూ ప్రకటించకపోవటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. మాగుంట రాఘవరెడ్డిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో అరెస్ట్ చేయగా తీహార్ జైలులో కొంతకాలం రిమాండ్లో ఉండి ప్రస్తుతం బెయిల్పై వచ్చారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా తిహార్ జైలుకు పంపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. మాగుంట కుటుంబం విషయంలో డోలాయమానంలో పడ్డాడన్న ప్రచారం సాగుతోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి ఇరువురూ ఈడీ ముందు అప్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే. మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న లిక్కర్ స్కాం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దన్ను ఉన్న వ్యక్తి కోసం టీడీపీ గాలింపు మొదలెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేరు బయటకు రావడంతో అప్పటినుంచే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వారిని పక్కనపెట్టిన విషయం విధితమే. ఒంగోలు ఎంపీ సీటు ఆ కుటుంబానికి ఇచ్చేదిలేదని కూడా ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. దీంతో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వంపై నేటికీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ ఇస్తే ప్రధాని మోదీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనన్న సందిగ్ధంలో బాబు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రచారంలో దూసుకుపోతున్నచెవిరెడ్డి భాస్కరరెడ్డి టీడీపీ, ఎన్డీఏ కూటమి పరిస్థితి కుడితో పడిన ఎలుకల చందంగా ఉంటే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను సీఎం జగన్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి గ్రామ గ్రామాన ఆయన ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్సభ సెగ్మెంట్కు జహంగీర్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
కూటమిలో టిక్కెట్ల పంచాయితీ
-
బాబు ఇచ్చిందే జనసేనకు ప్రాప్తం
సాక్షి, అమరావతి: టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు చంద్రబాబు ఇచ్చిందే ప్రాప్తం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తానంటే అవే మహా ప్రసాదంగా, ఏ సీటు ఇస్తానంటే దానినే పవన్కళ్యాణ్ స్వీకరించే పరిస్థితి కొనసాగుతోంది. నెల కిత్రం టీడీపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన పి. గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని ఇప్పుడు చంద్రబాబు వద్దనుకొని, జనసేనకు కేటాయించారు. ఆ స్థానంలో ప్రకటించిన టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడ తప్పనిసరిగా పార్టీ అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు పి.గన్నవరం సీటును జనసేనకు ఇచ్చేశారు. అదీ అదనంగా కాదు.. అంతకు ముందు కేటాయించిన 21లో దీనినీ ఒకటిగా చేశారు. మరోవైపు.. క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు బలంగా కోరుకుంటున్న స్థానాలను మాత్రం ఆ పార్టీకి కేటాయించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. వాటిపై ఎటూ తేల్చడంలేదు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిలో ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాని భీమిలి, విజయవాడ వెస్ట్ వంటి స్థానాల కోసం జనసేన నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జనసేన టికెట్టు కోరుకుంటున్న నాయకులే గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేశారు. పొత్తులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావాలని బీజేపీ కోరితే, చంద్రబాబు అది కాకుండా వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి ఇచ్చి, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో బీజేపీ, జనసేన నాయకుల మధ్య చిచ్చుపెట్టారు. భీమిలి స్థానాన్ని జనసేన గట్టిగా కోరుకుంటున్నా, చంద్రబాబు తేల్చడంలేదు. ఇలా జనసేన గానీ, పవన్ గానీ కోరుతున్న సీట్లను కాకుండా కేవలం టీడీపీ వద్దనుకునే సీట్లను మాత్రమే మిత్రపక్షాలుకు కేటాయిస్తున్నారని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. ఇంకా తేల్చని స్థానాలు 19 బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలతో కలిపి కూటమిలో ఇప్పటికీ 19 స్థానాలపై అస్పష్టత నెలకొంది. బీజేపీకి ఏ స్థానాలన్నది ఇప్పటికీ తేలలేదు. పాలకొండ, ఎచ్చెర్ల, పాడేరు, విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, బద్వేలు, ఆదోని, ధర్మవరం స్థానాలు బీజేపీకి కేటాయించారన్న ప్రచారం సాగుతోంది. అయితే, ఈ స్థానాల్లో కనీసం రెండింటిలో మార్పులు ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇంకా.. చీపురుపల్లి, భీమిలి, అవనిగడ్డ, దర్శి, అలూరు, గుంతకల్లు, రైల్వే కోడూరు, రాజంపేట, అనంతపురం అర్చన్ స్థానాల్లో ఎక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందన్నదీ తేలాల్సి ఉంది. వీటిలో చీపురుపల్లిలో టీడీపీనే పోటీ చేస్తుందని ఖాయంగా పార్టీ వర్గాలు చెబుతుంటే.. అవనిగడ్డలో జనసేనే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కూటమిలో ఎవరికేమిటో తేలింది 156 సీట్లే.. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. టీడీపీ మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో 34, మూడో జాబితాలో మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, మొదట ప్రకటించిన పి. గన్నవరం స్థానాన్ని ఇప్పుడు జనసేనకు కేటాయించింది. జనసేన 21 స్థానాల్లో ఏడింటికి అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది. అనధికారికంగా మరో 11 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. గత నెల 24న చంద్రబాబుతో కలిసి నెల్లిమర్ల, తెనాలి, అనకాపల్లి, రాజానగరం, కాకినాడ రూరల్కు జనసేన అభ్యర్థులను పవన్ అధికారికంగా ప్రకటించారు. తర్వాత నిడదవోలుకు అభ్యర్థిని ప్రకటించారు. పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. విశాఖ దక్షిణ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పెందుర్తి, యలమంచిలి, ఉంగుటూరు, తిరపతి, రాజోలు స్థానాల్లో అభ్యర్థులను అనధికారికంగా నిర్ణయించి, వారికి మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ లెటర్ హెడ్పై పవన్ సంతకం చేసిన లెటర్లు అందజేశారు. కొత్తగా జనసేనకు వచ్చిన పి. గన్నవరానికి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ఖరారు చేసి, ఆయన్ని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించారు. పోలవరం స్థానంలోనూ జనసేనే పోటీ చేస్తుందని చెప్పి, అక్కడ చిర్రి బాలరాజును ఖరారు చేసి, ఆయనకూ ఎన్నికల నియమావళి, నిబంధనల పత్రాలను పవన్ శనివారం అందజేశారు. దీంతో జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో ఇంకా మూడు స్థానాలు, వాటిలో అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. టీడీపీ ప్రకటించిన 138 స్థానాలకు, జనసేన అధికారికంగా, అనధికారికంగా ఖరారు చేసిన 18 స్థానాలు కలిపి మొత్తం 156 స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. -
ఒంటరిగానే బరిలోకి సీపీఎం!
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి గానే లోక్సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరి లోకి దిగాలని సీపీఎం భావిస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని భావించినా, ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. బుధారం జరిగిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణ యం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హైదరాబాద్లో విలేకరుల కు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రేవంత్రెడ్డి వంద రోజుల పాలన, పార్లమెంటు ఎన్నికలు, పార్టీ వైఖరిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్లగొండల్లో తమకు బలముందని, భువనగిరి కాకుండా మిగతా మూడింటిలో ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించినా తాము సిద్ధమని ప్రకటించారు. కలిసి పనిచేద్దామని బీఆర్ ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.జహంగీర్ భువ నగిరి జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశా రని చెప్పారు. మూసీ సమస్యను పరిష్కరించాలంటూ పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. తమ్మినేనికి బదులు వీరయ్య నిర్ణయాలు అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బదు లుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా జహంగీర్ పేరును కూడా వీరయ్యే ప్రకటించారు. ఇలావుండగా రాష్ట్రంలో పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో సీట్ల సర్దుబాటు ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. ఈ విషయాన్ని తాము ఇదివరకే ప్రతిపాదించామని చెప్పారు. బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రగులుతున్న పొత్తు కుంపట్లు
సాక్షి, చిత్తూరు/సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షిప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో పొత్తు పొసగడం లేదు. కార్యకర్తలు, నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటనా ఇంకా కాలేదు. ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ సీట్లలోనూ మూడు పార్టీలూ ఏకతాటిపైకి రావడం లేదు. బాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ చేతులెత్తేసింది. ఇక్కడ టీడీపీ తీరుతో విసిగి జనసేనలో చేరిన నేతలు ఇప్పుడు ఇరుపార్టీల మధ్య పొత్తు కుదరడం, బాబే మళ్లీ పోటీ చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ నాయకులూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పూతలపట్టు, నగరి, పుంగనూరు, జీడీ నెల్లూరు, పలమనేరుల్లోనూ టీడీపీ అభ్యర్థులకు మిత్రపక్షాల నుంచి సహకారం లేదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్నాయుడు పట్టుకోసం పార్టీ నాయకులపై స్పై ఆపరేషన్ చేస్తున్నట్టు సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిని బాబు ఇంకా తేల్చలేదు. ఐఆర్ఎస్ అధికారి ప్రసాద్రావుతోపాటు ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వెంకటరమణా.. ఎంపీ సీటూ గోవిందా! రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన బొడ్డు వెంకటరమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పేలా లేదు. అప్పట్లో రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశ చూపిన అధిష్టానం ఇప్పుడు మొండిచేయి ఇచ్చేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఎంపీగా పురంధరేశ్వరి బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీడని బీజేపీ ‘సీటు’ముడి శ్రీకాకుళం జిల్లాలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీటుపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం, ఎచ్చెర్లలో ఒక నియోజకవర్గం బీజేపీకి కేటాయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ ఈ రెండింటిలో ఏదడిగినా ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ‘కొండ’ఎక్కిన సీటు ఆశలు తెలుగుదేశం పార్టీలో కాకినాడ సిటీ సీటు పంచాయితీ ఎటూ తేలడం లేదు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) ఆశలు కొండెక్కాయనే ప్రచారం జరుగుతోంది. అన్న సత్యనారాయణ రూపంలో కొండబాబుకు ఇంటిపోరు ఎదురుకావడంతోపాటు పార్టీలోనూ వ్యతిరేకత ఉండడంతో బాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం. కొండబాబు స్థానంలో అతని అన్న సత్యనారాయణ పెద్ద కోడలు సుస్మిత పేరును ఐవీఆర్ఎస్ సర్వేలో చేర్చారని చర్చ జరుగుతోంది. పశ్చిమలో పోరు పశ్చిమగోదావరి జిల్లాలో కూటమిలో సెగ రగులుతోంది. జనసేన పార్టీ నాయకుడు బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాలు ఎడముఖంపెడముఖంగా ఉండడంతో శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ఉండి టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించడం శ్రేణుల్లో చీలిక తెచ్చింది. తణుకు టికెట్పై గంపెడాశలు పెట్టుకున్న జనసేన నేత విడివాడ రామచంద్రరావు పార్టీకి దూరంగా ఉన్నారు. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు జనసేన టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు , రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్కస్థానాన్నీ ఎన్డీఏ కూటమి మహిళలకు కేటాయించలేదు. అధికార వైఎస్సార్ సీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది. పోలవరం, గోపాలపురం అసెంబ్లీ స్థానాలతోపాటు, నరసాపురం ఎంపీ స్థానాన్ని మహిళలకు కేటాయించింది. -
‘‘2 సీట్ల కోసం పొత్తా..? సొంతగానే గెలుస్తాం’’
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత కుమారస్వామి అన్నారు. బీజేపీతో పొత్తు విషయమై మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులో భాగంగా మేం ఆరు, ఏడు సీట్లు అడగడం లేదు. మూడులేదా నాలుగు సీట్లు మాత్రమే అడుగుతున్నాం. మా బలమేంటో బీజేపీకి తెలుసు. మాకు బీజేపీపై నమ్మకం ఉంది. రెండు సీట్ల కోసం నేను పొత్తు పెట్టుకోవాలా’ అని కుమారస్వామి ప్రశ్నించారు. పొత్తు లేకుండా పోటీ చేసినా మాండ్యా, హసన్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మాండ్యా, హసన్, కోలార్ ఎంపీ సీట్లు తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీని అడిగినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే బీజేపీ కర్ణాటకలో ఉన్న 28 సీట్లకు గాను 26 మంది అభ్యర్థులను మార్చ్ 13న రిలీజ్ చేసిన రెండో జాబితాలో ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడులో బీజేపీ వ్యూ హం -
తేలని సీట్లు.. బాబుకు పాట్లు
అధికారంకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు పడుతున్నారు. కూటమిని కూడగట్టడానికి అడ్డదారులు తొక్కి టిక్కెట్ల ఖరారులో విఫలమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఇప్పటికీ 16 స్థానాల్లో సరైన వ్యక్తులు దొరక్క సతమతమవుతున్నారు. ఇప్పటికే తాము గెలవలే మని నిర్ణయించు కున్న స్థానాలు మిత్ర ధర్మం అంటూ జనసేన, బీజేపీకి అప్పగించిన ఆయన సొంత స్థానాలకు వచ్చేసరికి చతికిలబడుతున్నారు. రకరకాల సర్వేల పేరుతో నాన్చుడు ధోరణి అవలంబిస్తూ... ఆశావహులను డోలాయమానంలో పడేస్తున్నారు. సాక్షి, అమరావతి: పొత్తుల ఎత్తుల్లో తలమునకలైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెండింగ్లో ఉన్న 16 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో చెమటోడుస్తున్నారు. ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఎక్సర్సైజ్ చేశానంటూ రెండో విడత అభ్యర్థుల ప్రకటన సమయంలో చెప్పుకున్న ఆ ఫార్టీ ఇండస్ట్రీస్ మిగిలిన స్థానాల ప్రకటనకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పొత్తులో సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడం, కొన్నిచోట్ల పార్టీ బలహీనంగా ఉండడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బీజేపీ, జనసేనకు 31 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. మిగిలిన 144 స్థానాలకు 128 చోట్ల మాత్రమే ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 16 సీట్ల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సీట్లపై మల్లగుల్లాలు పడుతున్నారు. పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం సీట్లలో టీడీపీ పోటీ చేసేవి ఏవన్న దానిపై ఇంకా సందిగ్ధం నెలకొంది. మిత్రులకు కేటాయించిన స్థానాల్లోనూ అభ్యర్థులు కరువవ్వడంతో ఆపసోపాలు పడుతున్నారు. సీనియర్లకే దిక్కులేదు ♦ శ్రీకాకుళం, ఎచ్చెర్లలో ఒక స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎచ్చెర్ల ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ స్థాయి నాయకుడికే దిక్కు లేకపోతే ఎలాగని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ♦ పాతపట్నం, పలాస సీట్లపై అయోమయం రాజ్యమేలుతోంది. పలాస సీటుపై మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష గట్టిగా పట్టుబడుతున్నా ఆమెకు ఖరారు చేయలేదు. పాతపట్నం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. పొత్తుల్లో పోటీ చేసే సీట్లపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ సీట్ల సంగతి తేలేలా కనిపించడంలేదు. జటిలంగా మారిన చీపురుపల్లి ♦ విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానం టీడీపీకి కత్తిమీద సాములా మారింది. అక్కడ పోటీ చేసేందుకు ఆ పార్టీ తరఫున ఎవరూ ముందుకు రావడంలేదు. ఓడిపోయే సీటు కావడంతో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు వంటి నేతలూ అక్కడకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. ♦ ఎస్ కోట సీటు కోసం కోళ్ల లలితకుమారి, ఎన్ఆర్ఐ గొంప కృష్ణ పోటీ పడుతుండగా... పొత్తులో ఆ స్థానాన్ని వదులుకోవాల్సివస్తుందనే ఉద్దేశంతో దాన్ని పెండింగ్లో పెట్టారు. భీమిలిస్థానంపై గంటా పట్టుపడుతున్నా... దానిని జనసేనకు కేటాయించాల్సి ఉంటుందేమోనని దానిపైనా నానుస్తున్నారు. సందిగ్ధంలో పెనమలూరు, మైలవరం ♦ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, మైలవరం సీట్లపైనా సందిగ్ధం వీడటంలేదు. మైలవరం సీటు కోసం దేవినేని ఉమామహేశ్వరరావు గట్టిగా పట్టు పడుతుండడంతో వలస నేత వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి ఇరకాటంగా మారింది. వీరిద్దరిలో ఒకరిని పెనమలూరు పంపుతారనే ప్రచారం జరుగుతుండడంతో అక్కడి ఇన్ఛార్జి బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ♦ నర్సరావుపేట, చీరాల, దర్శి నియోజకవర్గాల్లో సరైన నేతలు దొరకలేదు. ధన బలం ఉన్నవారికోసం అక్కడ వెదుకులాడుతున్నారు. వెంటాడుతున్న సోమిరెడ్డి భయం ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి సీటు విషయం పెండింగ్లో ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తే ఓడిపోతామన్న భయం ఉంది. ఆ స్థానంలో ఆయన కుటుంబంలో ఎవరికైనా ఇవ్వాలా, బయట వ్యక్తులను చూడాలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ♦ ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు, బద్వేలు సీట్లలో ఒక సీటును బీజేపీకి ఇచ్చే ఉద్దేశంతో పెండింగ్లో పెట్టారు. జమ్మలమడుగు సీటుపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, ఆయన కుటుంబానికే చెందిన భూపే‹Ùరెడ్డి మధ్య వివాదం నెలకొంది. రైల్వేకోడూరు, రాజంపేట సీట్ల విషయంలోనూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పొత్తులో వీటిలో ఒకదాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఒక నిర్ధారణకు రావడం లేదు. ♦ గుమ్మనూరు జయరాం టీడీపీలోకి మారడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆలూరు, గుంతకల్లు సీట్లపై అయోమయం నెలకొంది. ఆయనకు గుంతకల్లు సీటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆలూరు అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అనంతపురం అర్బన్ సీటు పొత్తులో పోతుందనే అంచనాతో ఆ స్థానాన్ని ఖరారు చేయలేదు. దీనిపై అక్కడి నేత ప్రభాకర్ చౌదరి ఇతరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బాబు బలవంతం
-
పొత్తుకు బ్రేక్.. బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నందినగర్లో కేసీఆర్తో ప్రవీణ్కుమార్ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్ఎస్, కేసీఆర్తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్కుమార్ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్కుమార్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్కు బీఆర్ఎస్లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్ కేసీఆర్తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్ఎస్తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు. పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో చర్చించాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్కుమార్ చెప్పారు. ఆది నుంచీ ఊగిసలాటే... లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్ మాట్లాడారని కూడా పేర్కొన్నారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ ప్రకటించి కేసీఆర్తో భేటీ అయ్యారు.ఐపీఎస్ అధికారి నుంచి... సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు. గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్కుమార్ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్ఎస్తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. -
ఇది టీడీపీ మరో వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా ఓడిపోయే సీట్లనే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిందని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కమలదళంలో చాలా కాలంగా కొనసాగుతూ, ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొందరు రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసి అందులో వివిధ అంశాలను వివరించారు. పొత్తులో భాగంగా ఎక్కువచోట్ల మొదట నుంచి పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులకు కాకుండా 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారికే టికెట్లు దక్కేలా పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి నివేదికలు సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ వీరు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం వీరు పొత్తు సందర్భంగా తమ దృష్టికొచ్చిన అంశాలను పేర్కొంటూ గురువారం జాతీయ నాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ ప్రతులు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు, మహిళా మోర్చా జాతీయ మాజీ కార్యదర్శి మాలతీరాణి ఆ లేఖలో సంతకాలు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖ నకళ్లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవహరాలు పర్యవేక్షించే సంఘటనా కార్యదర్శి మధుకర్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు కూడా పంపారు. పొత్తులకు వ్యతిరేకం కాదు, కానీ.. నిజానికి.. కేంద్ర నాయకత్వంపై తమకు చాలా నమ్మకం ఉందని.. పొత్తు నిర్ణయాన్ని తామేమీ వ్యతిరేకించడంలేదని వారు ఆ లేఖలో స్పష్టంచేశారు. అందులో వారు ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ♦ తాము కూటమి ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కానీ, పొత్తుల పేరుతో జరుగుతున్న పరిణామాలతో మేం విభేదిస్తున్నాం. ♦ పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాలను బీజేపీనే కాదు టీడీపీ కూడా గెలిచే అవకాశంలేదు. ♦ బీజేపీకి కేటాయించిన సీట్లలో గతంలో టీడీపీ గెలవలేదు. అంత బలహీనమైన అసెంబ్లీ సీట్లు మన పార్టీకి ఇచ్చారు. ♦ బీజేపీకి కేటాయించిన ఈ సీట్లు పరిశీలిస్తే టీడీపీ మరో విడత మన పార్టీకి వెన్నుపోటు పొడుస్తోందన్న అభిప్రాయమే కనిపిస్తోంది. ♦ పొత్తులో పార్టీకి కేటాయించిన సీట్లలోనూ అనేక దశాబ్దాలుగా పార్టీ భావజాలంతో పనిచేసి, గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ♦ బీజేపీ సీట్లకు అభ్యర్థుల పరిశీలనలో సైతం టీడీపీ ప్రభావమే ఎక్కువగా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ♦ టీడీపీ మన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ముందస్తు ఎజెండాతోనే ఆ పార్టీ నేతలను మన బీజేపీలోకి బదలాయించింది. తద్వారా ఇప్పుడు ఆ పార్టీ తమ నాయకులను సంతృప్తపరచడంతో పాటు మొదట నుంచి బీజేపీలో కొనసాగే నేతలను కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ♦ కాబట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మా విజ్ఞప్తిని దయతో పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ అసలైన నేతలకే సీట్లు దక్కేలా చూడాలి.. నిజానికి.. బాధ్యతాయుతమైన పార్టీ నాయకులుగా పార్టీ నిర్ణయాన్ని మేం వ్యతిరేకించడంలేదు. అయితే, గతంలో మనకున్న చేదు అనుభవాల దృష్ట్యా.. భవిష్యత్తులో మన పార్టీని పటిష్టం చేసేందుకు సుదీర్ఘ కాలంగా పార్టీలో కొనసాగుతున్న హార్డ్కోర్ నాయకులకే అత్యధిక సీట్లు దక్కేలా చూడాలని మేం అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది పార్టీ అభిమానులు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్న విషయం అధిష్టానానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లు ఆ నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు. -
వచ్చాడు జాదూగాడు
సాక్షి, అమరావతి: నక్క జిత్తులు, నకిలీ వేషాలకు ప్రతిరూపం తానేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! జనసేనతో జత కట్టి ఎన్ని మారీచ వేషాలు వేసినా గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా గ్రహించిన చంద్రబాబు కనీసం అవినీతి కేసుల నుంచైనా బయటపడాలనే వ్యూహంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తు కుదుర్చుకున్నారు. జాతీయ పార్టీతో పొత్తు కుదిరిన వెంటనే వ్యవస్థలను జయప్రదంగా మేనేజ్ చేయడంలో తనకున్న అద్వితీయమైన ప్రతిభను జాతీయ మీడియాలో కొన్ని సంస్థల ముందు ప్రదర్శించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయంటూ మొన్న సీ–ఓటర్ సంస్థ ఓ నకిలీ సర్వేను వెల్లడించగా న్యూస్–18 నిన్న మరో ఫేక్ సర్వేను వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని నకిలీ సర్వేలు ఇదే రీతిలో వెల్లడి కానున్నాయి. నకిలీ సర్వేల ద్వారా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పుంజుకున్నట్లు కృత్రిమ బలాన్ని చూపించి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అయితే వైఎస్సార్సీపీ 50 శాతానికిపైగా ఓట్లతో 24–25 లోక్సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 0–1 లోక్సభ స్థానాలకే పరిమితం కానుందని టౌమ్స్ నౌ, చాణక్య లాంటి ప్రముఖ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని తేలింది. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరిన రెండు మూడు రోజుల్లోనే ఆ కూటమి గెలుస్తుందంటూ సీ–ఓటర్, న్యూస్–18 ఒపీనియన్ సర్వేలు ఆదరాబాదరాగా ప్రకటించడంపై రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ప్రజాభిప్రాయం ఎలా తారుమారు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి అవి నకిలీ సర్వేలన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నారు. 2019లోనే అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ–ఓటర్, న్యూస్–18 అంచనాలు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. సర్వేల పేరుతో చంద్రబాబు ఎన్ని మాయ వేషాలు వేసినా సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి చరిత్రాత్మక విజయం సాధించడం ఖాయమని, వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని పేర్కొంటున్నారు. సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం చెప్పారు. గత 58 నెలల్లో 99 శాతం హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.65 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.44 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రభుత్వ ఆర్థిక చేయూతను వినియోగించుకున్న పేదలు పేదరికాన్ని అధిగమించడమే ఇందుకు నిదర్శనం. 2015–16లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం. గ్రామ వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో గత 58 నెలల్లో 2.13 లక్షల నియామకాలు చేపట్టడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న వైఎస్సార్సీపీ గ్రాఫ్.. సంక్షేమ పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని చాటి చెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 24–25 లోక్సభ స్థానాల్లో ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ 0–1 లోక్సభ స్థానాల్లో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని, జనసేన, బీజేపీ, కాంగ్రెస్లు ఉనికి కూడా చాటుకోలేవని మూడు నెలల క్రితం టౌమ్స్నౌ సర్వే వెల్లడించింది. జీన్యూస్ మారిటైజ్, జీవనాధర్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్, చాణక్య లాంటి డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైంది. కేసుల భయంతో కాళ్ల బేరం.. ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని, సీఎం వైఎస్ జగన్ను ఎదుర్కోలేమని గ్రహించిన చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో జత కలిశారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేశారు. జెండా సభ అట్టర్ ప్లాప్ కావడంతో మళ్లీ ఘెర పరాజయం తప్పదని ఆందోళన చెందిన చంద్రబాబు స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి భూకుంభకోణం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పాల్పడిన ఐఎంజీ భారత్ కుంభకోణం వరకూ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ పొత్తు కోసం పాకులాడారు. ఢిల్లీ వెళ్లి మూడు రోజులు పడిగాపులు కాసి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తుకు ఒప్పించుకున్నారు. బీజేపీతో జతకట్టినా డజను సర్వేలది ఒకే మాట ♦ బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ౖటౌమ్స్ నౌ–ఈటీజీ సంస్థ భారీ సర్వే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించింది. 49 శాతం ఓట్లతో 21–22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, 45 శాతం ఓట్లతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 3–4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని తేల్చింది. ♦ 48 శాతం ఓట్లతో 19 లోక్సభ, 133 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 44 శాతం ఓట్లతో 6 లోక్సభ, 42 శాసనసభ స్థానాలకు పరిమితం అవుతుందని జీన్యూస్–మారిటైజ్ సర్వే వెల్లడించింది. ♦ 49.5 శాతం ఓట్లతో 121 శాసనసభ (ఐదు అటూఇటుగా) స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 43 శాతం ఓట్లతో 54 (ఐదు అటూఇటుగా) శాసనసభ స్థానాలతో సరి పెట్టుకుంటుందని పొలిటికల్ క్రిటిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ♦ రాష్ట్రంలో 49 శాతం ఓట్లతో 17 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకుంటుందని, 44 శాతం ఓట్లతో 8 లోక్సభ స్థానాలకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పరిమితం అవుతుందని చాణక్య సర్వే తేల్చింది. జనాధార్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్ తదితర డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థల సర్వేలదీ అదే మాట.