-
అగ్నిపథ్పై రాహుల్ గాంధీ విమర్శలు..
ఆర్మీ రిక్రూట్ మెంట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకం పీఎంఓ కార్యాలయంలో రూపొందించారని ఆరోపించారు. కేంద్రంలో భారత కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, అగ్నిపథ్ సైనిక పథకాన్ని రద్దు చేసి, పాత శాశ్వత నియామక ప్రక్రియను తిరిగి తీసుకువస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అగ్నిపథ్ పథకంపై ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అగ్నిపథ్ పథకం భారత సైన్యాన్ని, దేశాన్ని రక్షించాలని కలలు కంటున్న వీర యువతను అవమానించడమేనని అన్నారు. ఈ పథకం భారత సైన్యం కాదు. నరేంద్ర మోదీ రూపొందించిన పథకం. అమరవీరులను వేర్వేరుగా చూడలేమని, దేశం కోసం అత్యున్నత త్యాగం చేసే ప్రతి ఒక్కరికీ అమరవీరుడి హోదా కల్పించాలని అన్నారు. ఇండియా కూటమి వెంటనే ఈ పథకాన్ని రద్దు చేస్తాము.పాత శాశ్వత నియామక ప్రక్రియను తిరిగి తీసుకువస్తాము అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. -
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
కొండంత సమస్యలు.. గోరంత హామీలు
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సమస్యలివీ... నిరుద్యోగం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్ ప్రదేశ్లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. యాపిల్ రైతుల దుస్థితి దేశంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యాపిల్ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది రోడ్డు కనెక్టివిటీ కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. అగ్నిపథ్ త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్గా ఇస్తారు. కొత్త స్కీమ్లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్ పాత పథకం తెస్తామంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘డబుల్ ఇంజన్’కు అగ్నిపరీక్ష
సాధారణంగా ప్రశాంతంగా సాగే హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మాత్రం అక్షరాలా యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ ‘డబుల్ ఇంజన్’ నినాదానికి అగ్నిపరీక్షగా మారాయి. అంతేగాక బీజేపీ, విపక్ష కాంగ్రెస్లోని ముఖ్య నేతల ప్రతిష్టకూ సవాలుగా పరిణమించాయి. మోదీ కరిష్మాతో అధికారం నిలబెట్టుకుంటామని కమలనాథులు ఆశిస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకతే గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. 1985 నుంచి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని రివాజు ఈసారీ కొనసాగుతుందని ఆశిస్తోంది. మూడో పార్టీగా ఆప్ ఉనికి పోటీని మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అన్ని పార్టీలూ హోరాహోరీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ రెండుసార్లే ప్రచారం చేసినా రాష్ట్రమంతా కలియదిరిగారు. రాహుల్గాంధీ కూడా భారత్ జోడో యాత్రకు బ్రేకి చ్చి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉద్యోగుల్లోనూ అసంతృప్తి మోదీ వ్యక్తిగత ఆకర్షణకు తిరుగు లేకపోయినా కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వముంటే డబుల్ ఇంజన్ ప్రగతి సాధ్యమన్న బీజేపీ మాటలను హిమాచల్ జనాలు ఎంతవరకు నమ్ముతున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీన్ని రాష్ట్ర ప్రజలు పెద్దగా నమ్మడం లేదని హిమాచల్కు చెందిన శశికుమార్ అనే రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. ధరల పెరుగుదల మొదలుకుని ఏ సమస్యకూ గత ఐదేళ్లలో పరిష్కారం దొరికింది లేదన్నది వారి ఆరోపణగా ఉంది. దీనికి తోడు పాత పెన్షన్ స్కీం కోసం రెండు లక్షలకు పైగా ప్రభుత్వోద్యోగులు చేస్తున్న డిమాండ్ కూడా బీజేపీకి కాస్త ప్రతికూలమేనంటున్నారు. దీన్ని తనకు అనువుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రెబెల్స్ను కట్టడి చేయడంలో కమలనాథులు విఫలమవుతున్న తీరు విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా 24కు పైగా సీట్లలో వాళ్లు స్వతంత్రులుగా బరిలో దిగుతున్నారు. ఇది కూడా బీజేపీ విజయావకాశాలను బాగా దెబ్బ కొడుతుందన్నది కాంగ్రెస్ ఆశ. తమకు రెబెల్స్ బెడద మరీ అంతగా లేకపోవడం మరింత కలిసొచ్చే అంశమని పార్టీ నమ్ముతోంది. కాకలు తీరిన నాయకుడు వీరభద్రసింగ్ గత ఏడాది మరణించాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బలహీనంగానే మారింది. సీఎం పోస్టుకు కనీసం అర డజను మంది పోటీదారులు ఉండటంతో ఇంటి పోరు నానాటికీ పెరిగిపోతోంది. ఆప్ కూడా రంగంలో ఉన్నా ప్రధానంగా రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అయితే గత ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 12 స్థానాల్లో నోటాదే మూడో స్థానం! ఈ ఓట్లన్నీ ఈసారి ఆప్ ఖాతాలోకి వెళ్లే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ పోటీ బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. కింగ్మేకర్ కాంగ్రా: కాంగ్రా జిల్లా మరోసారి కింగ్మేకర్గా అవతరించే అవకాశం కన్పిస్తోంది. 1993 నుంచి ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీయే అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లు, 2017 ఎన్నికల్లో బీజేపీ 11 గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ‘‘రెండు పార్టీలకూ ఇక్కడ అటూ ఇటుగా 40 శాతం చొప్పున ఓటు బ్యాంకుంది. 3 నుంచి 5 శాతం ఓట్లరు మాత్రమే ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఓటేస్తూ కీలకంగా మారుతున్నారు’’ అని హిమాచల్ వర్సిటీలో పొలిటికల్ ప్రొఫెసర్ హరీశ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. కాంగ్రాలో కులం చాలా ప్రభావం చూపుతుందన్నారాయన. మిగతా రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడా రాజ్పుత్లదే ప్రాబల్యం. జిల్లా జనాభాలో వారు 34 శాతముంటారు. 32 శాతమున్న ఓబీసీలు, 20 శాతమున్న బ్రాహ్మణులు కూడా ప్రభావం చూపుతారు. గద్దీ తదితర పర్వత ప్రాంతీయులది 14 శాతం వాటా. దాంతో బీజేపీ, కాంగ్రెస్ రెండూ రాజ్పుత్, గద్దీ నేతలకు ఎక్కువ టికెట్లిచ్చాయి. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తుండటం కలవరపెడుతోంది. ధరల పెరుగుదలపై జనంలో ఆగ్రహం ఉంది. అందుకే అభ్యర్థిని కాకుండా తనను చూసి ఓటేయాలని ప్రధాని ప్రచార సభల్లోనూ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వతంత్రులే కీలకం? ఈసారి 20కి పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్రులు నెగ్గారు. ఈసారి ఈ సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే చివరికి స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటును శాసించే శక్తిగా అవతరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం విన్పిస్తోంది. ఎన్నికల అంశంగా అగ్నిపథ్ రాష్ట్రంలో సగం అసెంబ్లీ సీట్లున్న కాంగ్రా, హమీర్పూర్, ఉనా, మండీ జిల్లాల్లో అగ్నిపథ్ పథకం పెద్ద ఎన్నికల అంశంగా మారింది. ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల్లో ఏకంగా 1.3 లక్షల మంది మాజీ, 40 వేల మంది సర్వీసులో ఉన్న సైనికులున్నారు! అంటే ప్రతి మూడిళ్లకు ఒకరన్నమాట!! ఈ జిల్లాలకు ప్రధాన ఉపాధి వనరు సైన్యమే. ఈ నాలుగు జిల్లాల నుంచి ఏటా కనీసం 4 వేల మంది యువకులు సైన్యంలో చేరుతుంటారు. అగ్నిపథ్ రాకతో రెజిమెంట్వారీ భర్తీ విధానం రద్దవడంతో రాష్ట్రం నుంచి నియామకాలు మూడో వంతు తగ్గనున్నాయి. ఇది కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమవుతుందని కాంగ్రాకు చెందిన మేజర్ జనరల్ (రిటైర్డ్) రాణా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్
‘చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయి ఉండాలి’ అని ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షా చెప్పేవారు. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. స్వాతంత్య్ర కాలం నుంచీ వీరు భారత సైన్యంలో విడదీయలేని శక్తిగా ఉంటున్నారు. సాహసానికి పేరొందిన నేపాలీ గోర్ఖాలకు ఇప్పటికీ తొలి ప్రాధాన్యం సైన్యంలో చేరడమే. వీరంతా నేపాల్లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. 1947లో భారత్, బ్రిటన్, నేపాల్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్ను భారత్ సంప్రదించలేదు. గోర్ఖా జానీ, గోర్ఖా సాథీ, లహురే... పేరు ఏదైనా కావొచ్చు; కీర్తి, సంపద ఆర్జించడం కోసం వీరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో చేరడానికి అప్పట్లో లాహోర్ వరకు వెళ్లారు. వీరిని నేపాలీ అమ్మాయిలు ఏరికోరి పెళ్లాడేవారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు. ‘గోర్ఖాలు మీతో యుద్ధానికి దిగారు’ అనేది వీరి సమర నినాదం. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. అలా వీరి పేర్లలో బహదూర్ (సాహసి), జంగ్ (సమరం) అనేవి వచ్చి కలిసేవి. ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షాకు ‘శామ్ బహదూర్’ అని గుర్తింపు ఉండటం తెలిసిందే. తాను చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా మీతో అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయివుండాలి అని మానెక్షా చెప్పేవారు. ఇండియన్ మిలిటరీ అకాడెమీలో నన్ను ఇష్టమైన మూడు ఆయుధాలు ఎంచుకొమ్మ న్నప్పుడు... నేను గోర్ఖాలు, గోర్ఖాలు, గోర్ఖాలు అని చెప్పేవాడిని. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా వారిని అగ్నిపథ్ గోర్ఖాలు అని పిలవనున్నారు. ఈ బిరుదు, లేదా గుర్తింపు వారికి ఏమాత్రం సరిపోనిది అనే చెప్పాలి. ‘కిరాయి’ సైనికులు కాదు దేశ విభజనకు ముందు భారతీయ అధికార్లను గోర్ఖాల్లో చేరడానికి బ్రిటిష్ అధికార్లు అనుమతించేవారు కాదు. 1947 తర్వాత అంటే గోర్ఖా ట్రూప్ కమాండ్ను భారతీయ అధికారులు ప్రారంభించిన తర్వాతే బ్రిటిష్, ఇండియన్ ఆర్మీల మధ్య గోర్ఖా రెజిమెంట్లను విభజించారు. 1947లో కుదిరిన త్రైపాక్షిక రిక్రూట్మెంట్ ఒప్పందం... బ్రిటిష్, ఇండియన్, నేపాలీ సైన్యాల్లో నేపాలీ గోర్ఖాలను చేరడానికి అనుమతించింది. అయితే వేతనాలు, పెన్షన్లలో తేడాలు ఉండేవి. గోర్ఖాలను కిరాయి సైనికులు అని పిలవవద్దని నేపాల్ షరతు పెట్టడమే ఈ ఒప్పందంలోని చివరి అంశం. నేపాలీ గోర్ఖాలు ఇప్పుడు ఫ్రెంచ్ ఆర్మీలో చేరుతున్నారు. అనేకమంది రిటైరయిన గోర్ఖాలు ప్రైవేట్ కాంట్రాక్టర్లుగా చేరుతున్నారు. సారాంశంలో, మాతృ బెటాలియన్లతో సాంప్రదాయ వారసత్వ బంధం కారణంగా గోర్ఖాలు ఇప్పటికీ భారతీయ రెజిమెంట్లలో చేరుతున్నారు. మన సైన్యంలోని 1,3,4,5,8 సంఖ్యలు గల గోర్ఖా రెజిమెంట్లు ప్రధానంగా మాగర్లు, గురుంగులతోనూ; 9వ గోర్ఖా రెజిమెంట్ ఛెత్రీలు, ఠాకూర్లతోనూ; 11వ గోర్ఖా రెజిమెంట్ రాయిలు, లింబూలతోనూ ఉంటున్నాయి. వీళ్లందరూ భారతీయ సైన్యంలో భాగంగా ఉంటున్నారు. దివంగత భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 11వ గోర్ఖా రైఫిల్స్కి చెందిన 5వ బెటాలియన్కి నాయకత్వం వహించేవారు. బ్రిటిష్ ఆర్మీ నాయకత్వం 1947 తర్వాత 2, 6, 7, 10 రెజిమెంట్లను తమతో తీసుకుపోయింది. వాటిని ఇప్పుడు కేవలం రెండు బెటాలియన్లుగా కుదించారు. గోర్ఖా రెజిమెంట్లలోకి నియామకాలను ప్రారంభంలో భారత్–నేపాల్ సరిహద్దులోని భైర్హవా సమీపంలోని నౌతన్వాలో జరిగేవి. తర్వాత కుంరాఘాట్, గోరఖ్పూర్, డార్జిలింగ్ సమీపంలోని ఘూమ్ ప్రాంతాలను శాశ్వత ప్రాంతాలుగా ఎంపిక చేశారు. ఈ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లకు యువ గోర్ఖాలను తీసుకురావడానికి గల్లా వాలాస్ అని పిలిచే నేపాలీ రిక్రూటర్లను ఉపయోగించుకునే వారు. భారతీయ సైన్యంలో భర్తీ కావడం కోసం వీరు 20 నుంచి 24 రోజులపాటు ట్రెక్కింగ్ చేసి వచ్చేవారు. శారీరక, వైద్య పరీక్షలు అనంతరం ఎంపికైన∙వారిని రెజిమెంటల్ శిక్షణా కేంద్రాలకు పంపించేవారు. వ్యూహాత్మక సంపద తర్వాతి కాలంలో భారతీయ సైన్య నియామక బృందాలు నేపాల్ మారుమూల ప్రాంతాలకు వెళ్లి రాటుదేలిన యువత కోసం ప్రయత్నించడంతో సైనిక రిక్రూట్మెంట్ వ్యవస్థ మారిపోయింది. నేపాల్ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని పోఖ్రా, ధరాన్ తదితర చోట్ల రిక్రూట్మెంట్ ర్యాలీలను నిర్వహించేవారు. నియామక వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దానికి రాత పరీక్షను కూడా చేర్చారు. మొదట్లో నేపాల్ నుంచే 100 శాతం చేర్చుకునేవారు. తర్వాత దీన్ని కాస్త మార్చి, నేపాల్ దేశస్థులైన గోర్ఖాల నుంచి 70 శాతం, భారతీయ గోర్ఖాల నుంచి 30 శాతం రిక్రూట్ చేస్తూ వచ్చారు. కోవిడ్ మహమ్మారి రిక్రూట్మెంట్ను అడ్డుకున్నప్పుడు రిక్రూట్మెంట్ విభాగాలు 60:40 నిష్పత్తిలో చేర్చుకున్నాయి. 2018లో 6/1 గోర్ఖా రైఫిల్స్ని పూర్తిగా భారతీయ గోర్ఖాల నుంచే తీసుకున్నారు. సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో నేపాల్కు రాజకీయ సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశం. నేపాల్లోని కమ్యూనిస్టులు కూడా 1990లో పాలక పక్షానికి విధించిన తమ 40 పాయింట్ల డిమాండ్లలో ఒకటి, భారత సైన్యంలో నేపాలీల చేరికను ఆపడం. కానీ సైనికుడు కావాలన్న కోరిక గోర్ఖాల్లో ఇప్పటికీ అలాగే ఉంది. 1970లలో భారత సైన్యం నుంచి గోర్ఖాలను తొలగించాలంటూ వచ్చిన సంకుచిత ప్రతిపాదనను భారత్ తోసి పుచ్చింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ గోపాల్ బెవూర్ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి గోర్ఖాలు మనకు వ్యూహాత్మక సంపద అని నొక్కి చెప్పారు. భారత అనుకూల బృందం రెజిమెంటల్ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అగ్నిపథ్ పథకం నేపాలీ గోర్ఖాలకు కూడా వర్తిస్తుంది. భారతీయ సైన్యంలో 38 ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, రెండు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లు, రెండు టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు, ఆర్టిల్లరీకి చెందిన 64 ఫీల్డ్ రెజిమెంట్లు మొత్తం గోర్ఖాలతో కూడి ఉన్నాయి. అందుకే భారత గోర్ఖా బ్రిగేడ్ అతిపెద్ద రెజిమెంట్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతీయ సైన్యంలో పనిచేస్తున్న, రిటైర్ అయిన గోర్ఖాలు 17 లక్షల మంది ఉన్నారని అంచనా. వీరంతా నేపాల్లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. చైనా ప్రభావంలో ఉన్న నేపాల్తో ప్రత్యేక సంబంధాలు కొనసాగించడానికి, ఆ దేశంతో పూర్వ ప్రాధాన్యతా స్థానం పొందడానికి ఈ బృందం చాలా అవసరం. మాజీ సైనికులు నేపాల్ వ్యాప్తంగా ఇండియన్ రెజిమెంటల్ అసోసియేషన్లను ఏర్పర్చుకున్నారు. బెటాలియన్లలో తాము ఎదిగిన రోజులను తల్చుకుంటూ, యుద్ధ గౌరవాలను అందుకుంటూ ఇండియా సైనికులతో వీరు పరస్పర సంబంధాలు కొనసాగిస్తున్నారు. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నేపాల్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 1947లో త్రైపాక్షిక ఒప్పందంపై తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్ను భారత్ సంప్రదించలేదు. అగ్నిపథ్ ఒక పెద్ద అసంతృప్తి పథకంగా కనబడుతోంది. నాలుగేళ్లపాటు నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖల వద్ద ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో పనిచేయటం కంటే, ఏ దుబాయ్లోనో మరింతగా సంపాదించగలరు. మొత్తం మీద చూస్తే, ఏదో ఒకరోజున గోర్ఖా వారసత్వానికి ముగింపు పలకాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. 2014లో నేపాల్ని తొలిసారిగా సందర్శించినప్పుడు గోర్ఖా సైనికుల త్యాగాలను ఎత్తిపడుతూ తానాడిన మాటల్ని ప్రధాని నరేంద్రమోదీ అప్పుడే మర్చిపోయినట్లు కనబడుతోంది. భారత్తో గోర్ఖా బంధాన్ని అగ్నిఫథ్ బలహీనపరుస్తుంది. అశోక్ కె. మెహతా వ్యాసకర్త ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్) (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Agnipath Recruitment: అగ్నిపథ్లో ‘కుల’కలం?
న్యూఢిల్లీ: అగ్నిపథ్ నియామకాలకు సైన్యం కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటోందన్న వార్తలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను సైన్యం కులం, మతం సర్టిఫికెట్ అడుగుతోందని విపక్షాలు మంగళవారం ఆరోపించాయి. అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) కూడా వాటితో గొంతు కలిపింది. వీటిని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఖండించగా, సైన్యం వద్ద ఇలాంటి సమాచారముంటే సైనికుల అంత్యక్రియల వంటి సమయంలో సహాయకారిగా ఉంటుందంటూ అధికార బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించడం విశేషం! అగ్నిపథ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిని కులం, మతం సర్టిఫికెట్లు జతపరచాలని అడుగుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్సింగ్తో పాటు అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీ(యూ) నేత ఉపేంద్ర కుశ్వాహా కూడా ఆరోపించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కులమతాలను అడగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ట్వీట్ చేశారు. బీసీలు, దళితులు, గిరిజనులు సైన్యంలో చేరేందుకు అనర్హులని ప్రధాని మోదీ భావిస్తున్నారా అని సంజయ్సింగ్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం.. ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. సైన్యంలో స్వాంతంత్య్రానికి ముందునుంచీ వస్తున్న నియామక పద్ధతులే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. సైన్యంపై వివాదాలు పుట్టించే ప్రయత్నాలు విపక్షాలకు పరిపాటేనన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ను ఆప్ చీఫ్ కేజ్రివాల్ అనుమానించడాన్ని గుర్తు చేశారు. నియామకాల్లో కులమతాలను ఏ విధంగానూ పరిగణనలోకి తీసుకోవడం జరగదంటూ 2013లో యూపీలో హయాంలో సుప్రీంకోర్టులో సైన్యం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదీ చదవండి: IAF Agnipath Recruitment 2022: భారత వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ షురూ -
హనుమకొండలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
హనుమకొండ: కాంగ్రెస్, బీజేపీ పరస్పర దాడులతో హనుమకొండలోని హంటర్ రోడ్డు ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో సీఐ గన్మన్ గాయపడ్డారు. బీజేపీ తెలంగాణ సంపర్క్ అభియాన్లో భాగంగా అనుబంధ సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అడ్వకేట్స్ కాలనీ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షురాలి క్యాంపు కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయం కింద ఉన్న హాల్లో అప్పటికే బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశం జరుగుతోంది. దీనికి రాజ్యసభ సభ్యుడు ఓంప్రకాశ్ మాథూర్ హాజరయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలుసుకున్న సుబేదారి, కేయూసీ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, దయాకర్ పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజేందర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షురాలి క్యాంపు కార్యాలయం వద్దకు చొచ్చుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు రావడంతో ఇరువర్గాలవారు కర్రలతో దాడి చేసుకుంటున్న సమయంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారులో వచ్చి దిగారు. బీజేపీ కార్యకర్తలు ఆమె కారును చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. ఇరువర్గాల దాడితో ఈ ప్రాంతం రణరంగంగా మారింది. దాడిలో సుబేదారి ఇన్స్పెక్టర్ గన్మేన్ అనిల్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, టీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒక్కటై తమ కార్యాలయంపై దాడికి దిగారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మాత్రమే వచ్చామని, బీజేపీ నేతలే కావాలని దాడి చేశారని రాజేందర్రెడ్డి ప్రత్యారోపణ చేశారు. -
సికింద్రాబాద్ ఘటన: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారమారు చేశారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించే విధంగా ప్లాన్ చేశారన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో 8 మంది ఉండగా, పరారీలు మరో 8 మంది ఉన్నారు. అగ్నిపథ్ స్కీంతో ఆర్థికంగా నష్టపోతామనే ఆందోళనలకు అకాడమీలను ప్రోత్సహించినట్లు గుర్తించారు. మరొకవైపు పోలీసుల అదుపులో మహబూబ్నగర్, కరీంనగర్కు చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్లు ఉన్నారు. మరో ఇద్దరు మల్లారెడ్డి, శివసాయి డిఫెన్స్ అకాడమీ ఉద్యోగులు, రెడ్డప్ప, హరి సహా మరొకరు ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొన్నట్లు గుర్తించారు. 12 అకాడమీ అభ్యర్థులతో 8 వాట్సాప్ గ్రూప్ల ఏర్పాటు చేసి విధ్వంసానికి కుట్ర చేశారు.ఈ 8 వాట్సాప్ గ్రూపుల్లో 2 వేల మంది ఆందోళనకారులు ఉన్నారు. రైల్వే స్టేషన్ అల్లర్ల వెనుక అసలు సూత్రధారి సుబ్బారావును ఏ-64గా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనగా, ఏ-65 మల్లారెడ్డి, ఏ-66 శివ కుమార్, ఏ-67 బూరెడ్డిలుగా పేర్కొన్నారు. సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు వీరంతా బోడుప్పల్లోని ఎస్వీఎం హోటల్లో అల్లర్లకు ప్లాన్ చేసినట్లు రిపోర్ట్లో వెల్లడించగా, శివ కుమార్తో కలిసి సుబ్బారావు రూ. 35వేలు ఖర్చు చేసి విద్యార్థులను అల్లర్లకు పురి కొల్పాడు. అదే సమయంలో సీఈఈ సోల్జర్స్ గ్రూపు, సోల్జర్స్ టూ డై పేరుతో వాట్సాప్ గ్రూపులు సృష్టించి విద్యార్థులను అల్లర్లకు ప్రోత్సహించాడు. బిహార్లో జరిగినట్లు రైలును తగటబెట్టాలని సుబ్బారావు చెప్పగా, శివ దానిని అమలు చేశాడు. ఆవుల సుబ్బారావుతో నిరంతరం శివ టచ్లో ఉన్నాడని, శివ ఆదేశాలతోనే రైలును తగులుబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. -
వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్.. రిజిస్ట్రేషన్ షురూ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘అగ్నివీర్వాయు’ ద్వారా రిజిస్ట్రేషన్ మొదలైందని ఐఏఎఫ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అగ్నిపథ్ పథకం ద్వారా 17.5–23 ఏళ్ల మధ్య యువతను నాలుగేళ్ల సర్వీసులోకి తీసుకుంటారు. వీరిని అగ్నివీర్గా పిలుస్తారు. వీరిలో 25% మందిని రెగ్యులర్ సేవలకు వినియోగించుకుంటారు. ఈ పథకం వల్ల సైనిక బలగాల కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందంటూ దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం తెలిసిందే. Registration window to apply for #Agniveervayu is operational from 10 am today. To register, candidates may log on to https://t.co/kVQxOwkUcz#Agnipath#भारतीयवायुसेनाकेअग्निवीर pic.twitter.com/2ZQl8Ak6nn — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
రైల్వే స్టేషన్ ఘటన: సాయి డిఫెన్స్ అకాడమీదే కీలక పాత్ర!
హైదరాబాద్: గత వారం జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ కీలక పాత్ర పోషించింది. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయి డిఫెన్స్ అకాడమీ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనకు ముందు రోజు ఇన్స్టిట్యూట్లోనే మకాం వేసి పథకం రచించారు. ఈ మేరకు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. టాస్క్ఫోర్స్ పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రధాన పాత్ర పోషించాడు.అనుచరులతో విధ్వంసానికి రచన చేసినట్లు గుర్తించారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే నలుగురు అనుచరులతో విద్యార్థులను పురిగొల్పినట్లు, దీనిలో భాగంగా హోటల్ అనుచరులతో కలిసి విధ్వంసానికి ప్లాన్ చేశాడు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశాడు. -
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధ్వంసం రోజున ఆవుల సుబ్బారావు ఉప్పల్ అకాడమీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు, శివ ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. హకీంపేట సోల్జర్స్ గ్రూపులో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్లు పెట్టినట్లు గుర్తించారు. ఆందోళనకు కావాల్సిన లాజిస్టిక్స్ సమాకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. విధ్వంసం కేసులో కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. కేసులో A2గా ఉన్న పృధ్విరాజ్ సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థిగా గుర్తించారు. నరసారావుపేటలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ ఇస్తున్నారు. విధ్వంసంలో పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 55 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మరో ఎనిమిది మంది.. A7, A8, A9, A10, A11, A12, A62, A63 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. చదవండి: (కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి) -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్యంసం కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
-
హైదరాబాద్ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు
సాక్షి, గుంటూరు: అగ్నిపథ్ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు. సికింద్రాబాద్ అటాక్లో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లర్లలో 10 బ్రాంచ్ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసులో బుధవారం నుంచి సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు విచారించనున్నారు. చదవండి: (అగ్నిపథ్ స్కీమ్పై ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు) -
అగ్నిపథ్ స్కీమ్పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ స్కీమ్ను కేంద్ర వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ వల్ల భారత ఆర్మీ బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ తలదూర్చదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంపై జరిగిన సమావేశానికి శరద్పవార్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే పవార్ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర తక్కువ అంచనా వేయొద్దు అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చదవండి: (ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?) -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి.. బయటపడ్డ సూత్రదారులు
-
విద్యార్థుల ఆందోళన పట్టించుకోరా
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో వారంరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సమస్యలు సిల్లీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హేళనగా మాట్లాడటం విచారకరమని అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ‘బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మాలాంటి వారు వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి బాసర వరకు పోలీసులను మోహరించి అరెస్టులకు పాల్పడుతున్నారు’అని పేర్కొన్నారు. మరోవైపు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ జూన్ 15న చేసిన ట్వీట్కు ఇప్పటివరకు అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని పారిశ్రామికవేత్తలతో ఫొటో లు దిగే కేటీఆర్కు విద్యార్థుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరు వల్ల ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ న్యాక్ దృష్టిలో సి గ్రేడ్కు పడిపోయిందని పేర్కొన్నారు. న్యాక్ గ్రేడ్ ఆధారంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయని, యూజీసీ నుంచి పరిశోధనలకు నిధులు వస్తాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవన్నీ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. హాస్టళ్లలో ఉంటూ ఆందోళన చేస్తున్న దాదాపు 8 వేల మంది విద్యార్థులకు భోజనం పెట్టబోమని హెచ్వోడీలు బెదిరింపులకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీకి రెగ్యులర్ వీసీని నియమించి, వీసీ క్యాంపస్లోనే ఉండాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణలో భాగమే: రేవంత్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో సైన్యంలోనూ ప్రైవేటీకరణను ప్రోత్సహించే ఉద్దేశంతోనే కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. ఇక కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు బనాయించిందని విమర్శించారు. -
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఓ వైపు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలపై తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది. చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు 📢 #Agniveer aspirants, get ready! Notification dates for recruitments under #AgnipathScheme 👇 🇮🇳 Indian Army @adgpi - June 20, 2022. 🇮🇳 Indian Navy @indiannavy - June 21, 2022. 🇮🇳 Indian Air Force @IAF_MCC - June 24, 2022.#AgnipathRecruitmentScheme #Agnipath #Agniveers pic.twitter.com/ZFPxcOZTcX — Ministry of Information and Broadcasting (@MIB_India) June 20, 2022 పథకం స్వరూపం... ►ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ►త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ►ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ►వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ►త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ►సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ►విధుల్లో చేరేవారిని అగ్నివీర్గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ►వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ►నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ►సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ►గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ►మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. -
భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు
అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రాజకీయ పార్టీల నేతలు నేడు(సోమవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బంద్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా రైల్వేశాఖ ఆర్పీఎఫ్ బలగాలను అప్రమత్తం చేసింది. అంతే కాకుండా భారీగా రైళ్లను రద్దు చేసింది. జూన్ 20న బయల్దేరాల్సిన 736 రైళ్ల ప్రయాణాలను నిలిపివేసినట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహం చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్ప్రెస్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ పోలీసులు హెచ్చరించారు. పంజాబ్లో అగ్నిపథ్పై తప్పుడు ప్రచారం చేస్తే ఆందోళనలను ప్రేరేపించే సమాచారాన్ని సోషల్ మీడియా వ్యాప్తి చెందనివ్వకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక, బీహార్ ప్రభుత్వం పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచింది. ప్రస్తుతం బీహార్లోని 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు.. అగ్నిపథ్కు నిరసనగా భారత్ బంద్ నేపథ్యంలో జార్ఖండ్లో విద్యా సంస్థలను మూసివేసి, ఈరోజు జరిగే పరీక్షలను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్లలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఫరీదాబాద్, నోయిడాలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ పోలీసులు 144 సెక్షన్ విధించారు. Agnipath protest: Railways cancel over 700 trains amid Bharat Bandh, check full list here#Railways #CancelledTrains #Agnipath #BharatBandh https://t.co/26vMAOhrIn — APN NEWS (@apnnewsindia) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్
అగ్నిపథ్.. పేరుకు తగ్గట్టే దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువకుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిరసనలు మరో రూపం దాల్చి హింసాత్మక రంగు పులుముకున్నాయి. గత నాలుగు రోజుల క్రితం రాజుకన్న అగ్గి ఇప్పటి వరకు చల్లారడం లేదు. 700 వందల కోట్ల ఆస్తి హాంఫట్ నిరసనకారుల ఆందోళనలో ఇప్పటి వరకు 60 రైళ్లకు నిప్పంటించారు. బిహార్లో 11 ఇంజిన్లను తగలబెట్టారు. గత నాలుగు రోజుల అల్లర్లలో ఇప్పటి వరకు ఆందోళనకారులు సుమారు 700 వందల కోట్ల రూపాయల ఆస్తిని అగ్నికి ఆహుతి చేశారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్లలో స్టాళ్లను తగులబెట్టడంతోపాటు రైల్వేకు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ఆస్తి నష్టం కేవలం అధికారులు అంచనా వేసినవి మాత్రమే.. అధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత వార్త: సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు 718 మంది అరెస్ట్ దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బిహార్ నిరసనలు విధ్వంసానికి దారి తీశాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లు లక్ష్యంగా దాడి జరుగుతోంది. బిహార్లో హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. మొత్తం 250 మందిని అరెస్టు చేశారు. అగ్నిపథ్ నిరసనలు ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 15 జిల్లాలకు విస్తరించాయి. రైల్వే అధికారుల ప్రకారం.. ఒక జనరల్ బోగిని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు అవుతుంది., అదే స్లీపర్ కోచ్కు 1.25 కోట్లు, ఏసీ కోచ్ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్ల ట్రైన్ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. ఆస్తి నష్టం వాటిల్లిన రాష్ట్రాల్లో బిహార్లో ఎక్కువగా ఉంది. ఇది కూడ చదవండి: Agnipath Scheme: అనుమానాలు, వివరణలు 60 కోట్ల మంది టికెట్లు రద్దు ఇప్పటి వరకు సుమారు రూ. 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తూర్పు-మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆస్తి నష్టంపై పూర్తి నివేదికను రైల్వే రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు అధికారిక సమాచారం మేరకు 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. ట్రాక్లు దెబ్బతిని రైళ్ల రద్దు ఫలితంగా రైల్వేకు భారీ ఆర్థిక దెబ్బ తగిలింది. అయినప్పటికీ వీటన్నిటిపై రైల్వే శాఖ అధికారిక అంచనాను విడుదల చేసే పరిస్థితిలో లేనట్లు కనిపిస్తోంది. చదవండి: ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు! -
కేంద్రం నిర్ణయంతో అగ్గి రాజుకుంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సైనిక నియామకాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టాలన్న కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దేశవ్యాప్తంగా అగ్గి రాజుకుందని, యువత రగిలిపోతున్నా రని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రప్రభు త్వం వెంటనే అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డి శనివారం తొలిసారి ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికి.. ర్యాలీగా ఖమ్మం లోని సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం ఏర్పాటుచేసిన ‘కేసీఆర్కు కృతజ్ఞత సభ’కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ యువతను మోసం చేస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదం చేసిన ఖమ్మం గడ్డను ఎప్పటికీ మరువబోనని అన్నారు. బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో ముఖ్య మంత్రిగా కేసీఆర్ సాధించిన ప్రగతి అద్భుత మని కొనియాడారు. సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
‘డిఫెన్స్’లో చర్చిస్తాం.. పార్లమెంట్లో నిలదీస్తాం
గాంధీ ఆస్పత్రి(హైదరాబాద్): అగ్నిపథ్ కారణంగా గత 48 గంటల్లో దేశవ్యాప్తంగా 24 మంది యువకులు మృతి చెందారని, యువతకు కాంగ్రెస్పార్టీ అండగా ఉంటుందని, ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కోరారు. పార్లమెంటు సభ్యులమైన రాహుల్గాంధీ, తాను డిఫెన్స్ స్టాండింగ్ కమిటీలో చర్చిస్తామని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నిస్తామని రేవంత్రెడ్డి అన్నారు. ఆర్మీ అభ్యర్థులపై బనాయించిన కేసులను, అనర్హత ప్రకటనను ఉపసంహరించుకోవాలని, మృతి చెందిన రాకేశ్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అగ్నిపథ్ను రద్దు చేసి సాధారణ పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్పై ప్రధాని మోదీ అవగాహనలోపం, యువకుల భావోద్వేగమే హింసకు దారితీసిందన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో గాయపడి గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారంరాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, ఆర్మీ ఉద్యోగార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్ కాపాడేందుకు సీఎం కేసీఆర్ కంటే ప్రతిపక్షనేతగా తనకు ఎక్కువ బాధ్యత ఉందని పేర్కొన్నారు. సైన్యంలో చేరాలనుకునే యువతను నిరాశపరుస్తున్న అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ డిమాండ్ చేశారు. వెనుక గేటు నుంచి దర్జాగా.. పద్మారావునగర్ వైపు ఉన్న గేటు నుంచి రేవంత్ గాంధీ ఆస్పత్రిలోకి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. గతంలో ప్రగతిభవన్ ముట్టడికి, ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీల్లోకి వేర్వేరు మార్గాల ద్వారా చేరుకున్న రేవంత్రెడ్డి గాంధీ ఆస్పత్రిలోకి ఎలా ప్రవేశిస్తారోనని కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు, వాహనాలు, అంబులెన్స్లను కూడా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో వెనుకగేటు నుంచి రేవంత్రెడ్డిని పోలీసులే సాదరంగా ఆహ్వానించడం గమనార్హం. గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ సీఐ నరేశ్లు దగ్గరుండి రేవంత్ను క్షతగాత్రుల వద్దకు తీసుకువెళ్లడం విశేషం.