-
ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!
-
ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!
చిలకలగూడ: ఆమె కోట్ల రూపాయలకు అధిపతి.. కానీ దేవుని ప్రసాదంతో కడుపు నింపుకోవాల్సిన దైన్య స్థితి. చిన్నతనంలో తన చేతి గోరుముద్దలు తిన్న బిడ్డలు... వృద్ధాప్యంలో ఆదరించకపోవడంతో పదిహేనేళ్లుగా ఆలయం చెంతనే ఆశ్రయం పొందుతోంది. కష్టాలు భరించలేని ఆ తల్లి చివరకు తనకు రావాల్సిన ఆస్తి కోసం కొడుకులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె మెట్టుగూడకు చెందిన కిమాబాయి పునేరియా (72). బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన ద్వారకదాసు, కిమాబాయి పునేరియాలు భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తితోపాటు వ్యాపారంలో రూ.కోట్ల విలువైన చర, స్థిరాస్థులను సంపాదించిన ద్వారకదాసు 2001లో మృతిచెందాడు. అప్పటికే భార్య కిమాబాయితో పాటు బిడ్డలకూ ఆస్తిని సమానంగా పంచి పెట్టాడు. భర్త మరణంతో కిమాబాయికి సమస్యలు మొదలయ్యాయి. ఒత్తిడి చేసి ఆస్తిని చేజిక్కించుకున్న కుమారులు ఆనక అమ్మ ముఖం చూసేందుకు నిరాకరించారు. కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆ తల్లి యాదగిరిగుట్టకు వెళ్లి దైవసేవలో గడుపుతోంది. భక్తులు పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకుంటోంది. కుమారులు జల్సాలు చేస్తుంటే...రూ.కోట్లకు అధిపతినైన తానెందుకు కష్టాలు పడాలని భావించింది. తన ఆస్తి ఇవ్వాలని కోరుతూ మెట్టుగూడలో కుమారులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు బుధవారం సాయంత్రం ధర్నాకు దిగింది. ‘నా ఆస్తి ఇస్తే... ఇటువంటి కుమారుల చేతిలో బాధ పడుతున్న తల్లుల కోసం ఏర్పాటు చేసే వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాలకు విరాళంగా అందజేస్తానని కిమాబాయి మీడియాకు తెలిపింది. «సన్నిహితుల సలహాతో ధర్నా విరమించి... కుమారులపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని ఆస్తులపై వివాదం కోర్టులో పెండింగ్లో ఉందని... కొంతమంది కావాలనే తమ తల్లితో కలిసి ఈ విధంగా చేస్తున్నారని ఆమె కుమారులు తెలిపారు. -
వేదం..ఆర్తనాదం!
కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో అర్చకుడు శస్త్రచికిత్స చేసుకోలేక అవస్థలు దాతల కోసం ఎదురుచూపు టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ ఆదుకొనేనా? ‘బతకాలని ఉంది. వృద్ధాప్యంలోని తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలని ఉంది. గొంతులో ప్రాణమున్నంత వరకు భగవంతుడికి వేద మంత్రాలతో సేవ చేసుకోవాలని ఉంది. కానీ ఏం చేయను. రెండు కిడ్నీలు పాడయ్యాయి. వీటిని బాగుచేసుకునే స్థోమతలేదు. కనీసం మందులూ కొనలేని స్థితి. మనసున్న దాతలు కనికరించండి. ఆర్థిక చేయూతనందించి ప్రాణభిక్ష పెట్టండి’ అంటూ ఈ ఫొటోలోని అర్చకుడు సాయిప్రకాష్ చెమర్చిన కళ్లతో స్విమ్స్కు వచ్చిపోయే వారిని దీనంగా అర్థించడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తిరుపతి మెడికల్: రాజమండ్రికి చెందిన కందాడి, ఇందుమతి దంపతులకు కె.సాయిప్రకాష్ ఆచార్యులు (26) ఏకైక సంతానం. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉపాధికోసం హైదరాబాద్కు వచ్చిన కందాడి తన బిడ్డ సాయిప్రకాష్కు 14వ ఏటనే ‘ఉపనయనం’ చేశారు. 18 ఏళ్ల వయసులో వేదంపై మక్కువతో సాయిప్రకాష్ పుట్టపర్తి వేదపాఠశాలలో యజు ర్వేద స్మార్థంలో, తిరుమల ధర్మగిరిలోని వేదపాఠశాలలో ‘రుగ్వేద స్మార్థం’ అంశంలో అర్చకత్వం, పౌరోహిత్యం విద్యను అభ్యసించా డు. కొంతకాలానికి తండ్రి చనిపోయాడు. 2011లో భద్రాచలం సా రపాక గ్రామంలోని శ్రీ సత్యనారాయణ ఆలయ అర్చకుడిగా ఉద్యో గం వచ్చింది. బతుకు గాడిలో పడిందనుకున్న తరుణంలో అనారోగ్యం వెంటాడింది. పరీక్షలు నిర్వహిస్తే రెండు కిడ్నీలు చెడిపోయాయి. 6 నెలల్లో రూ.9లక్షలతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసుకుంటే తప్ప ప్రాణాలు దక్కవని వైద్యులు తెలిపారు. గత ఏడాది ఉద్యోగం కూడా పోయింది. తల్లిని తీసుకుని అదే ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు నెలల పాటు అర్చక విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం తిరుపతి రూరల్ తుమ్మలగుంట చామండేశ్వరి అమ్మవారి ఆలయంలో సేవలు అందిస్తున్నాడు. అన్నప్రసాదంతోనే దేవుడికి సేవ చేసుకునేందుకైనా ప్రాణభిక్ష పెట్టాలని సాయిప్రకాష్ టీటీడీ ఈవోకు లేఖ రాసినా స్పందన రాలేదని సమాచారం. టీటీడీ అన్నప్రసాదంతోనే కడుపు నింపుకుంటున్న ఈ అర్చకుడిని చూసి తోటి రోగులే అయ్యో పాపం అంటున్నారు. ప్రాణాలు నిలబెట్టవచ్చు టీటీడీ నిధులతో స్విమ్స్ ఆస్పత్రిలో నిరుపేదల కోసం టీటీడీ ప్రాణదాన పథకాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ఎంత పెద్ద ఆపరేషన్లు అయినా ఉచితంగా నిర్వహిస్తున్నారు. సాయిప్రకాష్కు మానవతా దృక్పథంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉచితంగా నిర్వహించ వచ్చు. లేకుంటే బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ నుంచి అయినా సరే ఆపరేషన్కు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించి, అర్చకుడి ప్రాణాలను నిలబెట్టవచ్చు. -
వృద్ధులకు ఆసరా... ప్రశాంతి వృద్ధాశ్రమం
ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆలన..పాలన వృద్ధాప్యాన్ని చాలా మంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. ఎంతోమంది తల్లితండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్లు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని భావిస్తుంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడక పోవడంతో తల్లితండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా వారిని అక్కున చేర్చుకుంటున్న వృద్ధాశ్రమాల్లో రాయవరం మండలం పసలపూడి ప్రశాంతి వృద్ధాశ్రమం ఒకటి. కాకినాడ-రావులపాలెం రహదారిని ఆనుకుని పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న ప్రశాంతి ఆశ్రమం వృద్ధుల పాలిట దేవాలయంగా ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు... పసలపూడిలో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు ప్రశాంతమైన జీవితం... ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి ఇది దేవాలయంలా ఉంది. ప్రశాంతి ఆశ్రమంగా వృద్ధుల పాలిట ప్రశాంత వృద్ధాశ్రమంగా మారింది. ఇక్కడ బ్రహ్మకుమారీ అక్కయ్యలు ఇచ్చే రాజయోగ శిక్షణ, మెడిటేషన్, ఆధ్యాత్మిక తరగతుల కారణంగా ఇక్కడ శేష జీవితం గడుపుతున్న వారికి ఆధ్యాత్మిక తరగతులు ఒక మందులా పనిచేస్తాయి. ఇక్కడివారికి మనఃశాంతి లభించడంతో పాటు.. రేపు నా భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న చింత లేదు. 16 ఏళ్లుగా వృద్ధుల సేవలో... అమ్మా.. వెనుకా ముందూ ఎవ్వరూ లేరు. మేమూ మీతోనే ఉంటాం.. అంటూ వచ్చిన పేదలను చూసి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినట్లు బ్రహ్మకుమారి మాధవి తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రశాంతి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వృద్దాశ్రమంపై వివరించి ఇక్కడకు రావాలని అప్పట్లో నిర్వహకులు ఆహ్వానించారు. ఒకరిద్దరితో ప్రారంభమైన వృద్ధాశ్రమం ఇప్పుడు 25 మందితో కొనసాగుతోంది. ఉదయం మెడిటేషన్తో ప్రారంభమైన అనంతరం ఆధ్యాత్మిక తరగతులు కొనసాగుతాయి. అవసరమైన సమయంలో వైద్య సదుపాయం కూడా అందిస్తున్నారు. ప్రశాంతి వృద్ధాశ్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరికొకరు తోడుగా... ఇక్కడ ఉంటున్న వృద్ధాశ్రమంలో ప్రతీ ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే బ్రహ్మకుమారీ అక్కయ్యలకు తెలియజేసి తమ కష్టాలను నివృత్తి చేసుకుంటారు. ప్రశాంతి వృద్ధాశ్రమం నిర్వాహకుల సెల్ నెంబర్లు 9290100871, 9441006599 - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఐదేళ్లుగా ఉంటున్నా... ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఆశ్రమంలో చాలా బాగుంటుంది. బ్రహ్మకుమారీ అక్కలు ప్రేమగా మా ఆలనా పాలన చూస్తున్నారు. - వై.రమణమ్మ, రాజమండ్రి ఇక్కడ నుంచి వెళ్లను... ఆధ్యాత్మిక బోధనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అందుకే దూరాభారం అని ఆలోచించకుండా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదు. - ఆరుమిల్లి బాలాత్రిపురసుందరి మహబూబ్నగర్ -
అరవై దాటాక.. నడిపించే కాన్ఫిడెన్స్
ఉమెన్ ఫైనాన్స్ / అటల్ పెన్షన్ యోజన ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా తప్పనిసరిగా పింఛను రూపేణా పొందాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ‘అటల్ పెన్షన్ యోజన’ పథకాన్ని 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. అసలు ఏమిటీ పథకం. వివరాలు చూద్దాం.18 సంవత్సరాలు మొదలుకొని 40 సంవత్సరాల వరకు ఈ పథకంలో చేరవచ్చు. చేరిన దగ్గర్నుంచి 60 సం. వయసు వచ్చే వరకు చందా చెల్లించవలసి ఉంటుంది.ఈ పథకంలో వెయ్యి మొదలుకొని, ఐదు వేల రూపాయల వరకు (వెయ్యి, రెండు వేలు. మూడు వేలు... ఇలా) గ్యారెంటీ పెన్షన్ ఎంత కావాలో ఆ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. చందా అనేది ఖాతాదారుడు ఈ పథకంలో చేరే నాటికి ఉన్న వయసు, ఎంచుకునే గ్యారెంటీ పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఖాతాదారుని వయసు 18 సం. అయితే 1000 రూపాయల గ్యారెంటీ పెన్షన్కు ప్రతి నెలా 42 రూపాయలు చెల్లించాలి. అదే 5000 రూపాయల గ్యారెంటీ పెన్షన్ కావాలంటే ప్రతి నెలా 210 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ ఖాతాదారుని వయసు 35 సం. అయితే వెయ్యి రూపాయల గ్యారెంటీ పెన్షన్కు ప్రతి నెలా 181 రూపాయలు, అదే ఐదు వేల రూపాయల గ్యారెంటీ పెన్షన్ అయితే ప్రతి నెలా 902 రూపాయలు చెల్లించాలి. చందాను నెలవారీ, 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి కట్టే సదుపాయం ఉంది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని ప్రభుత్వం వారు సూచించిన పెట్టుబడి సూత్రాలకు అనుగుణంగా పి.ఎఫ్.ఆర్. డి.ఎ. (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) చేత నియమితులైన పెన్షన్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు.ఖాతాదారులకు పెట్టుబడి మార్గాలను లేదా పెన్షన్ ఫండ్ మేనేజర్లను ఎంచుకునే వెసులుబాటు లేదు. ఖాతాదారులు 60 సం. వయసు నిండిన తర్వాత నుంచి ఎంత గ్యారెంటీ పెన్షన్ ఎంచుకుంటారో అంత మొత్తాన్ని ప్రతి నెలా పొందవచ్చు. అంతే కాకుండా చందా మొత్తం మీద రాబడి ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ పెన్షన్ని కూడా పొందవచ్చు. ఒక వేళ తక్కువ రాబడి ఉంటే కనుక గ్యారెంటీ పెన్షన్ను తగ్గించరు. ఆ మొత్తాన్ని కచ్చితంగా ఇస్తారు. 60 సం. నిండాక ఖాతాదారుడు మరణించినట్లయితే వారి భార్య /భర్త కు పెన్షన్ అంద జేస్తారు. ఒకవేళ ఇద్దరూ మరణించినట్లయితే ఖాతాదారునికి 60 ఏళ్లు వచ్చే వరకు జమ అయిన మూలనిధి మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.60 సం. నిండకముందే ఖాతాదారుడు మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామికి, ఖాతాదారునికి 60 ఏళ్లు వచ్చే వరకు చందా కట్టే వెసులుబాటు ఉంది. 60 సం. నిండాక గ్యారెంటీ పెన్షన్ను జీవిత భాగస్వామి మరణం వరకు పొందవచ్చు. ఒకవేళ జీవిత భాగస్వామికి ఖాతాను పొడిగించే ఉద్దేశం లేకపోతే అప్పటి వరకు జమ అయిన మూలధన మొత్తాన్ని జీవిత భాగస్వామికి లేదా నామినీకి అందజేస్తారు. ఈ పథకంలో ఖాతాదారుడు ఒకే ఒక ఖాతాని ప్రారంభించే అవకాశం ఉంటుంది. పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకునే, పెంచుకునే సదుపాయం ఉంటుంది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
మెదడు ఏజింగ్ ను తగ్గించే స్లో జాగింగ్!
వయసు పైబడటం వల్ల వచ్చే పరిణామాలను ఇంగ్లిష్లో ఏజింగ్ అని వ్యవహరిస్తుండటం మామూలే. ఈ ఏజింగ్ ప్రక్రియకు ఏ అవయవమూ అతీతం కాదు. కాకపోతే చర్మం వంటి కొన్ని భాగాల్లో ముడుతల పడటం, వెంట్రుకలు అయితే తెల్లబడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే మెదడు కూడా ఏజింగ్కు గురవుతుంది. కానీ స్లో జాగింగి ఆ ప్రక్రియను స్లో చేస్తుంది. ఈ విషయాన్ని ఒకటి రెండేళ్లు కాదు... సరిగ్గా 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు కొందరు న్యూరాలజీ నిపుణులు. ఈ అధ్యయనం కోసం దాదాపు 1,500 మందికి పైగానే ఆరోగ్యకరమైన వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఎంపిక చేసుకున్న వారందరూ 40 ఏళ్ల వయసు వారే. ఎంపిక సమయంలో వారికి బీపీ, గుండెజబ్బుల వంటి సమస్యలతో పాటు మతిమరుపు (డిమెన్షియా) వంటివి ఏమీ లేవని నిర్ధారణ చేసుకున్నారు. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న వారికి తొలుత ఎమ్మారై పరీక్షతో పాటు కొన్ని మెదడుకు సంబంధించిన పరీక్షలూ చేశారు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు వారు క్రమం తప్పకుండా ట్రెడ్మిల్పై స్లో జాగింగ్ చేయించారు. అయితే వీళ్లలో కొందరు వ్యాయామం చేసినప్పటికీ అడపా దడపా మాత్రమే దాన్ని కొనసాగించారట. ఇక రెండు దశాబ్దాల తర్వాత ఈ రెండు గ్రూపుల వారికీ మళ్లీ మెదడుకు సంబంధించిన ఎమ్మారై వంటి పరీక్షలు మళ్లీ చేయించారు. అడపాదడపా మాత్రమే వ్యాయామం చేసిన వారితో పోలిస్తే... క్రమం తప్పకుండా జాగింగ్ చేసిన వారందరిలోనూ సాధారణంగా 60 ఏళ్ల తర్వాత సహజంగా కనిపించే డిమెన్షియా వంటి సమస్యలు కనిపించలేదని గుర్తించారు పరిశోధకులు. ఇదే అంశాన్ని పరిశోధకులు ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్లో పొందుపరిచారు. -
దారి మలుపులో పొదుపు దీపం
ఉమన్ ఫైనాన్స్ వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తం నిర్ణీత కాలంలో అందే విధంగా ఉంటూ, వారి ఖర్చులకు ఉపయోగపడటమనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం 2004లో ‘సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్’ ప్రారంభించింది. ఈ స్కీమును పోస్ట్ ఆఫీస్లో, వివిధ బ్యాంకులలో నిర్ణీత బ్రాంచీల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ స్కీములో డిపాజిట్ చేయడానికి అర్హతలు భారతీయులై ఉండాలి. అయితే ఎన్.ఆర్.ఐ.లు, హెచ్.యు.ఎఫ్.లు (హిందూ అన్ డివెడైడ్ ఫ్యామిలీ) డిపాజిట్ చేయడానికి వీలుండదు. 60 సం.లు, ఆ పై వయసు గలవారు అయివుండాలి. అయితే రిటైరై లేదా వి.ఆర్.ఎస్. (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) తీసుకుని 55 నుండి 60 సం. మధ్య వయసు గల వారైనా డిపాజిట్కు అర్హులే. కానీ వారు రిటైర్మెంట్ సొమ్ము తీసుకున్న నెల లోపు స్కీమును ప్రారంభించాలి. అలాగే డిపాజిట్ చేసే సొమ్ము రిటైర్మెంటు సొమ్మును మించకూడదు. ఈ ఖాతాను వ్యక్తిగతంగాను, జాయింట్ గానూ; భార్యాభర్తలిద్దరి పేరు మీద కూడా ప్రారంభించవచ్చు. ఈ స్కీము ఎలా పని చేస్తుంది? రు. 1000 మొదలుకుని రు. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ ఒకేసారి చెయ్యాలి. ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలనైనా ప్రారంభించవచ్చు. కానీ అన్ని ఖాతాలలోనూ డిపాజిట్ చేయబడిన మొత్తం కలిపి గరిష్ట పరిమితిని మించకూడదు. ఈ స్కీములో డిపాజిట్ మొత్తానికి 5 సం. కాలపరిమితి ఉంటుంది. {పతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని ఖాతాదారుని సేవింగ్స్ ఖాతాకు బదలీ చేస్తారు. {పస్తుతం 9.3 శాతం వడ్డీని అందజేస్తున్నారు. డిపాజిట్ చేసే సొమ్ము లక్ష లోపు ఉంటే సొమ్మును డెరైక్టుగా డిపాజిట్ చేయవచ్చు. ఒక వేళ లక్షకు పైగా అయితే చెక్కు రూపంలో డిపాజిట్ చేయాలి. ఖాతాను రద్దు చేసుకుని సొమ్మును వెనక్కు తీసుకోవాలి అనుకుంటే ఏడాది వరకు వీలు కాదు. సంవత్సరం తర్వాత కూడా డిపాజిట్ సొమ్ము మీద 1.5 శాతం పెనాల్టీ, 2 సం. తర్వాత ఐతే 1 శాతం పెనాల్టీని చెల్లించి సొమ్మును వెనక్కి తీసుకోడానికి వీలవుతుంది. ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగిసిన తర్వాత ఇంకా ఖాతాని పొడిగించదలచుకుంటే మరొక 3 సం. వరకు పొడిగించవచ్చు. ఇందుకోసం చివరి సంవత్సరంలో పొడిగింపునకు సంబంధించిన పత్రాలను అందజేయాలి. ఖాతాను పొడిగించిన తర్వాత గడువు తీరకముందే వెనక్కి తీసుకోవాలి అంటే ఒక సంవత్సరం తర్వాత ఎటువంటి పెనాల్టీ లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద మినహాయింపు పొందవచ్చు. కానీ ఈ సొమ్ముపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. వడ్డీ కనుక ఒక సంవత్సరానికి 10,000 రూపాయలకు మించితే టి.డి.ఎస్. (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తిస్తుంది. ఖాతాను ప్రారంభించేటప్పుడు లేదా ప్రారంభించిన తర్వాత కూడా నామినీని నమోదు చేసుకునే సదుపాయం ఉంది. వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తం ఎటువంటి రిస్క్ లేకుండా గ్యారెంటీగా రావాలని కోరుకునే వారికి ఈ స్కీము చక్కగా ఉపయోగపడుతుంది. డిపాజిట్ చేయాలనుకునే సొమ్ము కనీసం రెండు ఖాతాలలో డిపాజిట్ చేసే విధంగా చూసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో సొమ్ము అవసరమై తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఖాతాను కొనసాగిస్తూ మరొక ఖాతాలోంచి సొమ్ము తీసుకోవచ్చు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
ఫేస్బుక్లో ఓ బామ్మ సంచలనం!
ఆమె వయసు 92.. జీవితాన్ని ఎంతో చదివింది. ఎన్నో అనుభవాలు ఆ కళ్లతో చూసింది.. వాటిలో కొన్నింటిని మాటలుగా మార్చి.. కవితరూపంలో తీసుకొచ్చింది. ఆ కవిత.. కర్కశ హృదయులనూ కన్నీరు పెట్టిస్తోంది. గిఫ్ట్ ప్యాక్లో బంగారు ఆభరణాలు ఉంటాయని మీరు చూస్తున్నారా? అంటూ వృద్ధాప్యంపై వాండా బి. గోయిన్స్ అనే మహిళ కవిత వల్లిస్తున్న వీడియో ఫేస్బుక్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ వీడియోను 40 లక్షల మంది చూశారు. ప్రపంచజ్ఞానాన్నిపదుగురికీ పంచే ప్రయత్నంలో భాగంగా... 'యు ఆర్ లుకింగ్ ఎట్ ది గిఫ్ట్ ర్యాప్... అండ్ నాట్ ద జ్యుయెల్ ఇన్ సైడ్' అంటూ ఆమె జీవితానుభవాలను వల్లె వేస్తుండగా.. ఆమె సంరక్షకురాలు కేథరిన్ క్లాస్ నిట్జర్ విల్సన్ తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సంపూర్ణాయుష్షుతో జీవించిన విండా.. తన జీవితకాలంలో ప్రపంచయుద్ధం, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులతో పాటు ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. ప్రస్తుతం పోర్ట్ ల్యాండ్ ఆరిజన్లో నివసిస్తున్న ఆమె... తన జీవనసారాన్ని, అనుభవాల దొంతరను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తన కవితను కేర్ టేకర్ విల్సన్కు వినిపించింది. కవిత వింటూనే కరగిపోయిన ఆమె... వెంటనే దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇటువంటి గొప్ప మహిళకు తాను కేర్టేకర్గా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ఫేస్ బుక్ లో ఈ వీడియోను 40 లక్షల మంది పైగా వీక్షించారు. లక్షా 84 వేల సార్లు షేర్ చేశారు. -
ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ జోషీ
నాగ్పూర్: ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా సురేశ్ భయ్యాజీ జోషీ (67) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వృద్ధాప్యం వల్ల జోషీ ఈసారి బరిలో ఉండరని, ఆయన స్థానంలో ప్రధాని మోదీకి సన్నిహితుడిగా పేరున్న దత్తాత్రేయ హొసబలే(ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి)ను ఎన్నుకుంటారన్న ఊహాగానాలకు దీంతో తెరపడింది. వరుసగా మూడోసారి ఎన్నికైన జోషీ 2018 మార్చి వరకు పదవిలో కొనసాగుతారని సంఘ్ నేత నంద్ కుమార్ వెల్లడించారు. సంఘ్లో విధాన నిర్ణయాలు తీసుకునే అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో 1,400 మంది ప్రతినిధులు జోషీని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు చెప్పారు. -
సెంచరీ కొట్టే వయస్సు మాది..
బలివాడ ఆదిలక్ష్మి..ఈ మధ్యనే నూరేళ్ల జన్మదిన వేడుకను జరుపుకుంది. మనమలు..మునిమనమల మధ్య వందేళ్ల బర్త్డే కేకునూ కూడా కోసింది. ఆనందోత్సాహాల మధ్య శతవసంతాల పండుగను చేసుకుంది. ఇలాంటి వేడుక ఎంతమందికి సాధ్యమవుతుంది..వందేళ్లు ఆరోగ్యంగా బతికేవారు ఎంతమంది ఉన్నారు..నిజమేమరి..వృద్ధాప్యం భారమైన రోజుల్లో తమ పని తాము చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించడమంటే వరమే. ఇలాంటి వారిని చూస్తే వయోభారమనే పదాన్నే నిఘంటువు నుంచి తొలగించాలనిపిస్తుంది. ఒక్క ఆదిలక్ష్మేనా..మరికొందరూ ఉన్నారు..సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ వందేళ్ల పండగలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారిని ఒకసారి పలకరిద్దామా..వారి ఆరోగ్య రహస్యమేమిటో తెలుసుకుందామా.. కోడి కూయక ముందే నిద్ర లేచేవారు..పొద్దు కుంకిన వెంటనే నిద్రపోయేవారు. (ఎర్లీ టు బెడ్ ఎర్లీటు రైజ్ మేక్స్ ఎ మన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్) పనిని ఆస్వాదిస్తూ కాయకష్టం చేసేవారు. శారీరక శ్రమతో పాటు చక్కటి ఆహారం, అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఇదీ ఆనాటి వారి జీవనం. అందుకే వందకు చేరువవుతున్నా, సెంచరీ చేసినా భువిపై నాటౌట్గా నిలిచారు. నేడు దానికి విరుద్ధంగా జీవనం కొనసాగుతోంది. అందుకే అరవై ఏళ్లకే ఆయుష్షు తీరుతోంది. వందేళ్లకు చేరువయ్యే, దాటిన అవ్వా తాతలను పలకరించగా... వారి ఆరోగ్య రహస్యం, జీవన విధానాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. వేళకు ఆహారం...సమయానికి నిద్ర అరకులోయ: వేళకు ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర పోవడంతోనే వందేళ్లు బతికి ఉన్నాను. నాకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె, వారందరికీ పెళ్లిళ్లు చేశాను. చిన్నతనం నుంచి ఉదయం పూట అంబలి తాగేవాళ్లము. మాంసం కన్నా కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాను. పొగ, మద్యం వంటి చెడు అలవాట్లులేవు. సుమారు 30 ఏళ్లుగా వృధాప్య ఫించన్ తీసుకుంటున్నాను. -సరోజిని సాహు, ఎస్బీఐ కాలనీ, అరకు వేళకు దినచర్య సాగాలి గోపాలపట్నం: వేళకు దినచర్య సాగాలి. వేళకు భోంచేయాలి. నిద్రపోవాలి. సదుపాయాలు ఉన్నాయని సుఖపడితే ఆరోగ్యం ఎలా బాగుంటుంది. జీవితం సాధారణంగానే సాగాలి. అతిసుఖం మంచిదికాదు. మనం బాగున్నామన్న సంతృప్తితో ముందుకెళ్లాలి. ఇతరుల కోసం అనవసర ఆలోచనలు కూడదు. అన్నిటికీ ఇతరులపై ఆధారపడటం వల్ల బద్ధకం పెరిగి ఆత్మస్థైర్యం కోల్పోతాం. నాకు 101 ఏళ్లు. భర్త 60 ఏళ్ల వయసులో మృతిచెందారు. వేకువజామున నాలుగున్నర గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుంటాను. టీ తాగుతాను. కొడుకు కోడలు వద్దన్నా ఇంటి పనుల్లో కలియజేసుకుంటాను. ఇల్లు, వాకిలి తుడుస్తాను. నీళ్లు పడతాను. వంట చేస్తాను. ఉదయం 11 గంటలకల్లా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను. మూడు గంటలకు టీ, స్నాక్స్ తీసుకుంటాను. సూర్యాస్తమయం కల్లా భోంచేస్తాను. రాత్రి 7 గంటల కల్లా నిద్రపోతాను. ఇప్పటికీ రోగమంటే ఏంటో తెలీదు. బీపీ, షుగర్లు రాలేదు. దృష్టి లోపం లేదు. తీరిక సమయంలో బియ్యం గింజల్లో రాళ్లేరుతుంటాను. -బలివాడ ఆదిలక్ష్మి, శ్రీరామనగర్ ఆరోగ్య సమస్యలు లేవు నక్కపల్లి/ఎస్రాయవరం : నాకు 104 సంవత్సరాలు. ఇప్పటికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో నిత్యం 20 కిలోమీటర్లు నడిచేవాణ్ని. గంటి, వరి, చోడి అన్నం తినేవాణ్ని.ఇప్పటికీ పేపరు చదువుతుంటాను.తెల్లదొరల స్థావరాలను చూశాను. వారిని ఎదిరించిన అల్లూరి సీతారామరాజును పాయకరావుపేట మండలం సీతమ్మవారిమెట్టపై చూశాను. ఆయన చేసే తపస్సు,ధ్యాన కార్యక్రమాలను దగ్గర నుంచి చూశాను. మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో భాగంగా ఉప్పలం, రేవుపోలవరం, పెనుగొల్లు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వారితోపాటు కొంతదూరం యాత్రలో పాల్గొన్నాను. 1942లో రాజ రాజేశ్వరితో వివాహం అయింది. ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమంటే ఇష్టం. దాదాపు 80 ఏళ్ల కిందట మట్టి, సున్నంతోకట్టిన పెంకుటింట్లోనే నివశిస్తున్నాను. -పత్సబట్ల అప్పలకొండరాజు, గుడివాడ ఆధారం లేదు..అయితేనేం.. పాడేరు: నాకు 98 ఏళ్లు. నాకు 3 ఏళ్ల వయసులో8 ఏళ్ల వయసు ఉన్న కామేశ్వరరావు అనే దగ్గరి బంధువుతో బాల్య వివాహం జరిపించారు. తండ్రి ఒడిలోనే వివాహం జరిగింది. నాకు ఐదేళ్ల వయసు వచ్చే సరికి భర్త కామేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందాడు. బ్రాహ్మణ ఆచారం ప్రకారం చిన్న తనం నుంచి ఇంటి బయటకు రావడం మానేశాను. తల్లిదండ్రులు కూడా కొంతకాలానికి కాలం చెందారు. 1965లో పాతపాడేరులో ఉన్న సోదరుడు గంటి జగన్నాథస్వామికి ఇంటికి వచ్చి జీవనం సాగించాను. సోదరుడు మృతి చెందడంతో ప్రస్తుతం మేనల్లుడు గంటి గోపాలరావు ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాను. బంధువులు, మేనల్లుడు కుటుంబం కొంత చేదోడు వాదోడుగా ఉంటుండటంతో వారు కల్పించే సహాయ సహకారాలతో ఒంటరిగానే జీవిస్తున్నాను.ఎవరిమీదా ఆధారపడకుండా పనులు చేసుకుంటాను. పూర్వం నుంచి ఒంటిపూట భోజనమే చేస్తున్నాను. రాత్రి వేళ ఆకలి అన్పిస్తే బియ్యం నూకతో ఉప్మా చేసుకుంటాను. 20 ఏళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నాను. పైసా ఆదాయం లేదు. పాలకులు దయ ఉంచి పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. -తాతా కామేశ్వరమ్మ, పాత పాడేరు వందేళ్ల ‘వరం’ తగరపువలస : 1913లో జన్మించాను. అయిదో తరగతి వరకూ చదువుకున్నాను. భీమిలిలోని కుమార్తె శిల్ల సావిత్రమ్మ (75), మనవడు, మనవరాళ్లు, మునిమనమలతో కలిసి ఉంటున్నాను.1972 నుంచి నలభై ఏళ్లుగా కీటిన్పేటలో రేషన్ డిపో నిర్వహిస్తున్నాను. అప్పట్లో 8 బస్తాలతో ప్రారంభమైన రేషన్ దుకాణం ఇప్పుడు 150 బస్తాలకు చేరుకుంది. అప్పట్లో దమ్మిడి ఇప్పటి రూపాయితో సమానం. భర్త సూర్యనారాయణ 70 ఏళ్ల కిందట మృతిచెందాడు. ఉదయం మూడు ఇడ్లీ, మధ్యాహ్నం కాయగూరలతో అన్నం, సాయంత్రం చపాతి, తీసుకుంటాను. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ దుకాణానికి నడిచివెళ్లి వస్తుంటాను. అది కూడా ఆరోగ్య రహస్యానికి కారణం కావచ్చు. గొప్పులు తవ్వడం తదితర వ్యవసాయ పనుల్లో కూడా పాలుపంచుకుంటాను.స్వాతంత్య్రోద్యమ కాలంలో భీమిలి విచ్చేసిన మహాత్ముడిని చూశాను. - నీలాపు వరహాలమ్మ(102), భీమిలి మా పనులు మేమే చేసుకుంటాం అనకాపల్లిరూరల్: 101వ సంవత్సరంలో అడుగిడుతున్నాను. నా భార్య రమణమ్మకు 95 ఏళ్లు. ఈ వయసులో కూడా మేమిద్దరం ఉత్సాహంగా ఉంటున్నాం. మేము ఎవరి మీదా ఆధారపడకుండా మా పనులు మేమే చేసుకుంటాం. వేళకు భోజనం చేస్తుంటాను. ఉదయం 8 గంటల సమయంలో ఒక టీ మాత్రమే తాగుతాను. ఉదయం 11 గంటలకు కాయగూరలు, చారుతో కూడిన అన్నం తీసుకుంటాను. సాయితం 6 గంటలకు ఒక టీ మాత్రమే తాగుతాను. రాత్రి పూట భోజనం మానేసి సుమారు 15 ఏళ్లు అవుతుందన్నారు. మాంసాహారం తప్పని సరి కాదు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి పేపర్ చదువుతాను. తహశీల్దారు కార్యాలయానికి నడుచుకుని వెళ్లి అర్జీలు ఇస్తుంటాను. మాకు 8 మంది సంతానం. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. -భార్యతో చింతా ధర్మారావు వ్యాయామంతో చక్కటి ఆరోగ్యం నర్సీపట్నం: నాకు 90 ఏళ్లు పూర్తయ్యాయి. నేను ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందాను. ఇద్దరు అమ్మాయిలు, కొడుకు ఉన్నారు. ముగ్గురు పిల్లలూ ఉపాధ్యాయులే. చిన్ననాటి నుంచి క్రమం తప్పకుండా వ్యాయమం చేయటంతో పాటు క్రీడల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేవాణ్ని. చిన్న నాటి నుంచి శాకాహారం తీసుకోవడంతో పాటు పరిమిత ఆహారం తీసుకునేవాణ్ని. రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి, గంటపాటు ఇంటి చుట్టూ వాకింగ్ చేస్తాను. సంగీతం వింటాను. వాకింగ్ అనంతరం కళ్ల అద్దాల అవసరసరమే లేకుండా దినపత్రికలు చదువుతాను. -కొర్తి సత్యనారాయణ మూర్తి, విశ్రాంత ఉపాధ్యాయుడు -
పింఛన్.. టెన్షన్!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తయారైంది పింఛన్ల పరిస్థితి. బోగస్ పింఛన్లను ఏరివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న పింఛన్లకు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఏంచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటూనే దరఖాస్తులను వడపోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్తగా రాబోయే పింఛన్లపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని షేక్పేట మండల కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన చర్చావేదికలో మహిళలు తమ మనోగతాన్ని వెల్లడించారు. బంజారాహిల్స్: వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ల కోసం ప్రభుత్వం ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించగానే పెద్ద సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తరలివచ్చి ధ్రువపత్రాలు జతపరిచి దరఖాస్తులను అందజేశారు. ఊహించినదానికంటే భిన్నంగా దరఖాస్తులు రావడంతో ఇందులో ఎంతమందికి అర్హత కల్పిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వితంతు, వృద్ధాప్య పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు అందినట్లు షేక్పేట మండల రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. షేక్పేట మండల పరిధిలో వృద్ధాప్య పింఛన్ల కోసం 2,614, వితంతు పింఛన్ల కోసం 2,679, వికలాంగుల పింఛన్ల కోసం 1027. మొత్తం కలిపి 6320 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు మండల పరిధిలో కేవలం 3,100 మందికి మాత్రమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందడంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు లభిస్తాయా ఇందులో కూడా వడపోత ఉంటుందా అనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాల్సిందేనని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలని ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్కు చెందిన రమణమ్మ అనే వృద్ధురాలు డిమాండ్ చేసింది. కొత్త పింఛన్ల కోసం ఎప్పటి నుంచో చూస్తున్నామని ఈ సారి తప్పకుండా అర్హత కల్పించాలని బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్ బస్తీకి చెందిన రాములు అనే చిరు వ్యాపారి కోరారు. పింఛన్ల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని పాత సంఖ్య తరహాలోనే ఇస్తానంటే చాలా మంది నష్టపోతారని పంజగుట్ట రామకృష్ణానగర్ బస్తీకి చెందిన మొగులయ్య అనే వృద్ధుడు తెలిపారు. దాదాపు చర్చలో పాల్గొన్న వారంతా దరఖాస్తుదారులందరికీ అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. షేక్పేట మండల పరిధిలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పింఛన్లు ఇస్తామని వెల్లడిస్తే మాత్రం చాలా మంది నష్టపోవాల్సి వస్తుందని జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని నందగిరిహిల్స్, గురుబ్రహ్మనగర్కు చెందిన నారాయణ అన్నారు. వృద్ధులను కనికరించాలి ఈ సారి పింఛన్ పెరగడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు ఇవ్వాలి. వృద్ధులను కనికరించాలి. కొంత మందికే ఇస్తామంటే కుదరదు. - మొగులమ్మ వస్తాయనే ఆశిస్తున్నాం ఈసారి ప్రతి ఒక్కరికీ పింఛన్లలో మేలు చేకూరుతుందని భావిస్తున్నాం. పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో ఈ సారి అక్రమాలు, అవినీతి చోటు చేసుకునే అవకాశాలు లేవని విన్నాం. పకడ్బందీగా దరఖాస్తుల విచారణ కూడా చేపడుతుండటంతో అర్హత ఉన్నవారందరూ లబ్ధిపొందుతారని అనుకుంటున్నాం. - గంగారపు లక్ష్మి -
పెరిగిన పింఛను తీసుకోకనే..
తప్పని వృద్ధాప్యం, వెంటాడే ఆయాసం ఆయన పాలిట శాపంగా మారాయి. పెరి గిన పింఛను డబ్బులు తీసుకుని మందులు కొనుక్కోవాలనుకున్నాడు. మంగళవారం గ్రామసభలకు హాజరయ్యాడు. తొందరలో మాత్రలు వెంట తెచ్చుకోలేదు. సభ జరుగుతుండగానే ఆయాసం వచ్చింది. వైద్యులు పరీక్షిస్తుండగానే కన్నుమూశాడు. ఈ విషాద సంఘటన మదనపల్లె మండలం పోతపోలులో చోటు చేసుకుంది. మదనపల్లె రూరల్: మదనపల్లె మండలం పోతపోలులో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోతపోలు గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటలకు జన్మభూమి గ్రామసభ సర్పంచ్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 27 పల్లెల నుంచి రెండు వేల మందికిపైగా ప్రజలు వచ్చారు. గ్రామ సభకు వస్తే పింఛను ఇస్తామని చెప్పడంతో మందుల ఖర్చుకు ఉంటుందని ఆశపడి పోతపోలు హరిజనవాడకు చెందిన పిచ్చోళ్ల చెన్నప్ప(65) సభకు వచ్చాడు. ఆయాసంతో బాధపడుతున్న ఆయన స్పృహ కోల్పోయాడు. వైద్యులకు సమాచారం అందించారు. అదే సభకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ దేశాయితిప్పారెడ్డి చెన్నప్పను పరీక్షిస్తుండగానే కన్నుమూశాడు. భర్త మరణవార్త విన్న చెన్నప్ప భార్య వెంకటమ్మ గుండెలు బాదుకుంది. ‘నన్నూ నీతో పాటే తీసుకెళ్లి పోరాదా..’ అంటూ ఏడ్వడం స్థానికుల హృదయాలను కలచివేసింది. రావద్దంటే వచ్చాడు.. ‘ఆరోగ్యం బాగలేదు. గ్రామ సభకు రావద్దు అంటే వినలేదు. పింఛన్ రద్దు చేస్తారేమోనన్న భయంతో ఇక్కడికి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు’ అంటూ మృతుని కుమారుడు రెడ్డెప్ప తెలిపారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నామని, అక్కడే ఉంటే బతికేవాడని అన్నాడు. పరామర్శించిన సబ్ కలెక్టర్ జన్మభూమి గ్రామసభలో మృతిచెందిన పిచ్చోళ్ల చెన్నప్ప కుటుంబాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.తలెత్తినా వీరు గమనించడం లేదు. కొందరైతే ఇళ్ల వద్దకు వెళ్లకుండానే నెలలపాటు యావరేజ్ రీడింగ్ను వేస్తూ ఒక్కసారిగా కొంపకొల్లేరు చేస్తున్నారు. ఈ విషయమై పలమనేరు ట్రాన్స్కో ఏడీ రాజశేఖర్రెడ్డిని వివరణ కోరగా ప్రైవేటు ఏజెన్సీల వల్ల ప్రతినెలా తమకు ఇలాంటి తలనొప్పులు వస్తూనే ఉన్నాయన్నారు. 180 వచ్చే బిల్లు 1,300 వస్తే ఎట్ల కట్టేది మాకు ప్రతినెలా 180 రూపాయల నుంచి ఇన్నూరు దాకా బిల్లొచ్చేది. ఇప్పుడు 1,300 వచ్చింది. ఇదేమని రీడింగ్ తీసే వాళ్లని అడిగితే ఆఫీసులో పోయి మాట్లాడుకోండి అంటూ దురుసుగా చెప్పి వెళ్లారు. అక్కడికెళ్లి బిల్లు చూపిస్తే దాంతో మాకు సంబంధం లేదు మొత్తం డబ్బు కట్టాల్సిందేఅంటారు. మా కోడలోళ్లకు రూ.2,700 వచ్చింది. -తవ్వమణి, డ్రైవర్స్ కాలనీ, గంగవరం మండలం రెండు బల్బులకు నాలుగొందలా.. మాకు ప్రతినెలా రూ.140 బిల్లోస్తా ఉన్నింది. పగటి పూట కూలి పనులకెళతాం. సాయంత్రం వచ్చి అన్నం చేసుకుని తిని లైట్లు ఆఫ్ చేసి పడుకుంటాం. ఇంత పొదుపుగా కరెంటు వాడుకున్నా ఈనెల రూ.451 బిల్లొచ్చింది. నెలనెలా రీడింగ్కొచ్చే వాళ్లు ఒక్కోసారి రానే రారు. వాళ్లిష్టానుసారంగా రీడింగ్ తీసుకొనిపోతే దానికి మేం బాధ్యులమా? -శాంతమ్మ, డ్రైవర్స్ కాలనీ, గంగవరం మండలం -
కోత పడింది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బేస్తవారిపేటకు చెందిన నక్కా తిరుపతయ్యకు ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు. రేషన్ కార్డులో 35 సంవత్సరాలు అని తప్పుగా నమోదయింది. నిలువెత్తు మనిషే ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ... అదంతా మాకు తెలియదు నీవు యువకుడివే ... పింఛన్ కట్ అంతే...పొమ్మన్నారు. అర్ధవీడు మండలం అయ్యవారిపల్లికి చెందిన పగడాల బుస్సమ్మకు ఎనభై ఏళ్లు. వృద్ధాప్యం మీద పడితే కాదు ... పక్కాగా ఆధారాలుండాలి. నీకు కూడా పింఛన్ గల్లంతేనంటూ ఛీత్కరించుకున్నారు. 75 సంవత్సరాల గాదం వెంకటయ్యకు పక్షవాతం కూడా తోడయింది. ఎటూ కదలలేని పరిస్థితి. బాబూ అని బతిమలాడుకున్నా మా పద్ధతి మారదని కసురుకున్నారు. ఈయనలాగేనే మరో 60 మంది పేర్లను తొలగించారు. రాచర్లకు చెందిన మండ్ల వెంకటయ్య. ఈయన వయసు ఎంతో తెలుసా. 90 ఏళ్లు. గత 20 ఏళ్ల నుంచి ఠంఛన్గా పింఛన్ తీసుకుంటున్నా సర్వే పేరుతో మంగళం పాడారు. కాటికి కాళ్లు చాపుకుని ఉన్న వారు తమ పేర్లు పింఛన్ల జాబితాలో నుంచి తొలగించి వేయడంతో ఇక దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రెండు వందలు వచ్చే పింఛన్ను వెయ్యి రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన బాబు సర్కారు గత కొంతకాలంగా కొనసాగుతున్న పింఛన్పై వేటేసి నోటికాడ కూడు లేకుండా చేసిందని ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతలతో నింపేసిన కమిటీలు నిర్థాక్షిణ్యంగా పక్షపాత ధోరణితో జాబితాలోని పేర్లను తలగించడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సెర్ఫ్ అధికారులు ఆధార్లో లోపాలను వెతికి వ్యవసాయ భూమి ఉందన్న పేరుతో ఏకంగా 42 వేల పింఛన్లను నిలిపేశారు. ప్రకాశం జిల్లాలో 3,12,000 పింఛన్లుండగా, గ్రామ కమిటీలు 37 వేల పింఛన్లు తొలగించాయి. సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పూర్) ఆదేశాలతో మొత్తం 79 వేల మందికి పింఛన్ ఆగిపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పింఛన్ వచ్చిన వారికి కూడా ఈ నెలలో ఐదో తేదీలోగా అందే పరిస్థితి కనపడటం లేదు. పింఛన్ ఎప్పుడు ఇచ్చేది తాము చెబుతామని, అప్పటి వరకూ ఆపాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో 426 మందికి వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్లు వస్తుండగా అందులో 132 మంది పేర్లను తొలగించారు. ఇందులో 70 మందికి పూర్తి అర్హత ఉన్నా వినిపించుకునే నాధుడే లేడు. దీంతో ఆగ్రహించిన బాధితులు గ్రామానికి వచ్చిన అధికారులను నిర్బంధించి నిరసన తెలిపారు. 13 సంవత్సరాల నుంచి వికలాంగ పింఛన్ అందుకుంటున్న కోటేశ్వరరావుతోపాటు 80 శాతం అంగవైకల్య సర్టిఫికెట్ ఉన్నవారికి కూడా పింఛన్ తొలగించారు. గిద్దలూరులో సగానికిపైగా పింఛన్లు తొలగించివేశారు. గిద్దలూరు పట్టణంలోని పెద్ద పోస్టాఫీసుకు గతంలో 1,300 పింఛన్లు వస్తుండగా ప్రస్తుత జాబితాలో 672 మందికి మాత్రమే వస్తున్నాయి. ఆధార్, రేషన్ కార్డులో 70, 80 సంవత్సరాల వయస్సున్న వృద్ధుల పింఛన్లు సైతం తొలగించివేశారు. పోస్టాఫీసుల్లో సంతకాలు, వేలిముద్రలు తీసుకొని ఆన్లైన్ ద్వారా పింఛన్లు పొందుతుంటే అవి బోగస్ అని ఎలా చెబుతారని లబ్థిదారులు ప్రశ్నిస్తున్నారు. జీవితకాలం తగ్గుతున్న తరుణంలో పింఛన్ వయోపరిమితిని పెంచడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పేరుతో ఉన్న పొలం కుమారులకు పంచి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయని వారికి కూడా వేటుపడింది. కొంతమంది పొలం అమ్ముకున్నా అవి ఆధార్ రికార్డులలోకి ఎక్కకపోవడంతో తొలగించారు. వితంతువులకు కూడా వయస్సును సాకుగా చూపించి తప్పించారు. బేస్తవారి పేటకు చెందిన నక్కా తిరుపతయ్యకు ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు కాగా, రేషన్ కార్డులో 35 సంవత్సరాలు అని తప్పుగా నమోదు కావడమే శాపమయింది. అర్ధవీడు మండలం అయ్యవారి పల్లిలో పగడాల బుస్సమ్మ(80), పక్షవాతం వచ్చిన గాదం వెంకటయ్య(75) తోపాటు 60 మంది పేర్ల తొలగించారు. రాచర్లలో గత 20 ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్న మండ్లా వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడి పింఛన్ కూడా తొలగించారు. -
అనర్హులను తొలగించండి
అనంతపురం రూరల్: ‘మా ఊళ్లో సర్వే సరిగా చేయలేదు.. కొన్నేళ్లుగా కొందరు అనర్హులు వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్నారు.. వారందరినీ తొలగించండి’ అని టీడీపీ నేతలు మంత్రి పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ 3 వేలకు వికలాంగల సర్టిఫికెట్లను అందజేస్తున్నారన్నారు. బొటన వేలు పోయిన వాళ్లు, చేతికి గీత పడినవారు కూడా సర్టిఫికెట్లతో హాజరవుతున్నారని మంత్రికి వివరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల స్పెషలాఫీసర్లు, ఎంపీడీఓలు, పింఛన్ల కమిటీలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఓబులేసు, నారాయణస్వామి, ప్రసాద్, తదితరు మాట్లాడుతూ పింఛన్ల జాబితాలో ఇంకా అనర్హులున్నారని, వారిని ఎందుకు తీసివేయలేదని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సర్వే కమిటీలో మీరూ ఉన్నారు కదా? అప్పుడెందుకు స్పందించలేదని ప్రశ్నించడంతో వారు సమాధాన చెప్పలేకపోయారు. మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కమిటీలను వేసిందన్నారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లను మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో పింఛన్లకు రూ. 40 కోట్ల నుంచి రూ.50 కోట్ల దాకా ఖర్చు అవుతందని తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిందిపోయి కమిటీ సరిగా లేదు.. అనర్హులున్నారని తెలపడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అధికారుల ప్రవర్తనపై మంత్రి ఆగ్రహం మంత్రి సునీత సమావేశం నిర్వహిస్తుండగా రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, స్పెషాలాఫీసర్ నారాయణస్వామి, జెడ్పీటీసీ వేణుగోపాల్ పదే పదే ముచ్చటిస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ కార్యక్రమానికి అంతరాయం కల్పించారు. ఓ వైపు తెలుగు తమ్ముళ్లు విసుగు తెప్పిస్తుండగా, మరోవైపు స్టేజ్పై ఉన్నవారు అంతరాయం కల్గించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమైనా పనిలేకుండా వచ్చానా?.. ఏదైనా పని ఉంటే బయటికెళ్లండి అంటూ ఆదేశించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. కార్యక్రమంలో అనంతపురము ఎంపీపీ కన్నేగంటి మాధవి, వైఎస్ ఎంపీపీ శిల్ప, టీడీపీ నేత చంటి, ఎంపీడీఓ లక్ష్మినరసింహ శర్మ, ఆత్మకూరు, రామగిరి, సీకేపల్లి, రాప్తాడు, కనగానిపల్లి ఎంపీడీఓలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 2033 పింఛన్ల తొలగింపు రాప్తాడు నియోజవర్గంలోని ఆరు మండలాల్లో 30,505 పింఛన్లు ఉండగా, ఇందులో 2033 మందిని అనర్హులుగా తేల్చామని పీడీ నీలకంఠారెడ్డి తెలిపారు. పారదర్శకంగా సర్వే నిర్వహించామని, అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. -
తప్పిన వేలిముద్రల తిప్పలు
సామాజిక పింఛన్ దారులకు శుభవార్త. గత ప్రభుత్వం సామాజిక పింఛన్ దారులకు వేలిముద్రల నమోదు తప్పనిసరి చేసింది. దీంతో చేతిపై గీతలు అరిగిపోయిన వృద్ధులు పింఛన్ పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించనుంది. గ్రామ కమిటీల పర్యవేక్షణలో నేరుగా లబ్ధిదారులకే పింఛన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పింఛన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనుకుంటుంది. -చిలుకూరు వృద్ధాప్యంలో ఉన్న వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. వీటిని ప్రతినెలా పోస్టాఫీసుల ద్వారా అందజేస్తున్నారు. అయితే లబ్ధిదారుల లో కొంత మంది వేలిముద్రలు పడకపోవడం, అనారోగ్యంతో మంచానికే పరిమితమైనవారు, కుష్టువ్యాధితో బాధపడుతున్న వారు, ప్రమాదాల్లో చేతులు పోగొట్టుకున్న వారు పింఛన్ పొందేందుకు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి లబ్ధిదారులు సూచించిన వ్యక్తి యొక్క వేలిముద్రలు తీసుకుని పింఛన్ పంపిణీ చేస్తున్నారు. అక్రమాలకు చెక్... లబ్ధిదారుడి తరఫున ప్రతి నెలా పింఛన్ పొందుతున్న వ్యక్తి సదరు లబ్ధిదారుడికి పింఛన్ మొత్తం ఇస్తున్నాడా లేదా, లబ్ధిదారుడు జీవించి ఉన్నాడా లేదా చనిపోయినా అతని పేరు మీదా పింఛన్ పొం దుతున్నాడా అనే అనుమాలను నివృత్తి చేసుకునేందు కు ప్రభుత్వం కమిటీలు వేసింది. కమిటీ సభ్యులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి వేలిముద్రలు పడని, ఇతర ఇతర కారణాలతో వేరే వ్యక్తుల ద్వారా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల వివరాలు సేకరించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్న వారు 3,93,133 మంది ఉండగా వీరిలో ఇతర వ్యక్తుల ద్వారా పింఛన్లు పొందుతున్న వారు 14వేల మంది ఉన్నట్లు గుర్తించారు. గ్రామ కమిటీల ఏర్పాటు పింఛన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటు ఇద్దరు గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు, పట్టణ స్థాయిలో కౌన్సిలర్, బిల్ కలెక్టర్, ఐకేపీ అర్బన్ ఇద్దరి సిబ్బందిని నియమించారు. ఈ కమిటీ పర్యవేక్షణలో వచ్చే నెల నుంచి పింఛన్లు చెల్లించనున్నారు. నేరుగా లబ్ధిదారుడికే.. కమిటీ సభ్యులు ప్రతి నెల 9 లేదా 10వ తేదీన ప్రత్యేకంగా గుర్తించిన పింఛన్దారుల డబ్బులు డ్రా చేసి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి అందజేస్తారు. ఈ మేరకు కమిటీ సభ్యుల వేలిముద్రలను నమోదు చేశారు. బయోమ్రెటిక్ ద్వారా డబ్బులు తీసుకునే క్రమంలో కమిటీలో ఏ ఇద్దరు ఉన్నా సరిపోతుంది. -
వీళ్లకా.. వృద్ధాప్యమా?
నూరేళ్లూ నిండటం అనే మాట దేనికి చిహ్నమో తెలిసిందే... కాటికి కాళ్లు చాపడం అంటే దాన్నుంచి దూరంగా పరుగెత్తడమే అంటూ ‘నూరేళ్లూ నిండాక’ మారథాన్ సాధించాడో మహాసాహసి. భాషతో భాసిస్తూ ధగధగలాడే మహాశ్వేతసౌధంలా నిలిచిందో నవకవన యువతి. తాతే కదా అని పంచ్ ఇస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించాడో వృద్ధయువకుడు. కష్టాలు కత్తిగట్టి, నష్టాలు నడిచివచ్చి హలో అంటే చెలో, చెలో అంటూ వాటిని చెండాడుతూ తరిమాడు హనీబీ కంటే ఎక్కువగా కష్టపడి తెరపై తేనెలూరించిన బిగ్ బీ! ఏ యువతకూ తీసిపోని ఈ యువతరాన్నిచూసి. వీళ్ల నుంచి స్ఫూర్తి పొందడానికే... వీళ్ల వృత్తాంతాలు! బామ్మమాట బంగారు బాట... హాబి ఆస్ట్రేలియాకు చెందిన జాన్ బాయ్డ్ వయసు 71 సంవత్సరాలు. వేగంగా సైకిల్ తొక్కే తీరును చూస్తుంటే... ఆమె వయసును ఎక్కువ చేసి చెప్పారేమో అనే భ్రమ కలుగుతుంది.‘‘ఈ వయసులో ఈ సాహహం ఎందుకు బామ్మా’’ అని ఇంటివారు, పొరుగు వారు వారించినా వేల మైళ్ల దూరం సైకిల్ మీద ప్రయాణం చేసి, విజయవంతంగా తిరిగివచ్చింది. బామ్మకు ఏడు మంది సంతానం. ఇరవై మంది మనవళ్లు, మనవరాళ్లు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ‘సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ అందుకున్న ఈ బామ్మ ‘మనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని అందులో తలమునకలవుతుంటే, అనారోగ్యం ఎప్పుడూ దరిచేరదు’’ అంటున్నారు. గాల్లో తేలినట్లుందే...వయసు తగ్గినట్లుందే! సాహసం వస్త్రప్రపంచ రారాజుగా పేరు గాంచిన విజయపథ్ సింఘానియా (67)కు ఇంట్లో నుంచి కాలు కదపకుండా సుఖాలు అనుభవించేంత ఆస్తి ఉంది. అయితే ఆయన ఏదో ఒక రూపంలో కష్టపడడానికే ఇష్టపడతారు. ‘హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా కొన్ని గంటల పాటు గాలిలో ప్రయాణించాలనుకుంటున్నాను’ అని ఆయన అన్నప్పుడు ఈ వయసులో రిస్క్ అవసరమా? అని కొందరు గొణుకున్నారు. ముంబాయిలోని 22 అంతస్తుల బిల్డింగ్ నుంచి హాట్ బెలూన్కు అమర్చిన క్యాబిన్ ద్వారా ఆయన 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి 5 గంటల తరువాత తిరిగి వచ్చారు.‘సాహసంతో చెలిమి చేయడానికి వయసు ఆటంకం కాదని చెప్పడానికే ఈ పని చేశాను’ అని సగర్వంగా చెప్పారు సింఘానియా. ఆరోగ్యంగా... ఆనందంగా! మిస్టర్ యూనివర్స్ మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడుగా మనోహర్ 102 సంవత్సరాల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బగైహతి (పశ్చిమబెంగాల్)లో నివసిస్తున్నారు. బాడీబిల్డింగ్ అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని దానిలో మనసు కూడా నిమగ్నమవుతుందని అంటారు మనోహర్. పొగతాగడం, పొగాకు నమలడం లాంటి అలవాట్లను ఎప్పుడూ దరి చేరనివ్వలేదు.‘‘ఎంత ఎక్కువ కాలం జీవించాం అనేదికాదు, జీవించినంత కాలం చురుకుగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇదే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది’’ అంటున్నారు మనోహర్. వయసు సగం అవుతుంది... సేవ ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటే, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది... అని చెబుతుంటారు సింధుతాయి. కష్టాల కారడవిని దాటి వచ్చిన సింధుతాయి ‘అనాథల తల్లి’గా మహారాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆమె చదివింది నాలుగో తరగతే అయినా... ఆమె పెంచిన పిల్లలు మాత్రం మెడిసిన్, ఇంజనీరింగ్లాంటి చదువులు చదివారు.‘ఈ వయసులో విశ్రాంతి తీసుకోవచ్చు కదా’’ అని ఆమెను అభిమానించేవాళ్లు అంటే... ‘నేను విశ్రాంతి తీసుకుంటే నా వయసు రెట్టింపు అవుతుంది, పిల్లలతో తీరిక లేకుండా గడిపితే సగం అవుతుంది’’ అంటారు 68 సంవత్సరాల సింధుతాయి. ఒక్క పంచ్తో ఆటకట్టించాడు... బాక్సింగ్ లండన్లోని తన నివాసంలో ఒకరోజు తీరిగ్గా దినపత్రిక చదువుకుంటున్న జాన్ కొకెలె (72) ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. వృద్ధుడు అనే కనికరం లేకుండా జాన్ ముఖం మీద ఒక బలమైప పంచ్ ఇచ్చాడు ఆ దొంగ. మరో పంచ్ ఇచ్చే లోపే దొంగోడికి ఒకే ఒక పంచ్ ఇచ్చాడు జాన్. ఈ దెబ్బతో దొంగోడు కుప్పకూలి పోయాడు. మరో పంచ్ కొసరుగా ఇచ్చి వాడిని పోలిసులకు అప్పజెప్పాడు జాన్. ఈ మాజీ బాక్సర్ గురించి చెప్పుకోవడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పటికీ ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉండే జాన్ దగ్గరికి బాక్సింగ్ టిప్స్ తెలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో వస్తుంటారు. ఎనభై ఎనిమిదిలోనూ ఎంతో చురుగ్గా... సాహిత్యం మహాశ్వేతాదేవి... సాహిత్య అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె రాసిన నవలలు, కథలు, వ్యాసాలలో గిరిజన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఆమె పుస్తకాలు తెలుగులో అనువాదమై పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆమె సెకండ్ హ్యాండ్ సమాచారం మీద ఆధారపడకుండా తాను ఏ సమూహం గురించి రాస్తున్నారో, వారితో ప్రత్యక్షంగా మాట్లాడతారు. ఈ క్రమంలో దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. సామాజిక కార్యకర్తగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ‘‘రాయడమనేది ఉత్తేజపరిచే పని’’ అని చెబుతున్న మహాశ్వేతాదేవి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులోనూ చురుగ్గా ఉండడానికి రచనా వ్యాసంగమే కారణం అంటారు. మృత్యువును జయించాడు... స్ఫూర్తి పంజాబ్కు చెందిన వరల్డ్ ఓల్డెస్ట్ మారథన్ రన్నర్ ఫౌజాసింగ్ వయసు 101 సంవత్సరాలు. అయిదు నెలల క్రితం జరిగిన హాంకాంగ్ మారథన్లో పదికిలోమీటర్ల దూరాన్ని 92 నిమిషాల వ్యవధిలో చేరుకొని తన సత్తా చాటారు. 1994లో ఫౌజా కుమారుడు చనిపోయాడు. ఈ విషాదంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. విషాదం నుంచి ఫౌజాను బయటికి తీసుకురావడానికి హర్మేందర్సింగ్ అనే గురువు పరుగుపందేలలో పాల్గొనేలా చేశాడు. ఎన్నో జాతీయ,అంతర్జాతీయ పరుగు పందేలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ఫౌజా.‘‘పరుగెత్తడం అనేది లేకపోతే... విషాదంలో మునిగిపోయేవాడిని.’ అంటారు ఫౌజా. నిలువెత్తు ఉత్తేజిత చిత్రం! చిత్రకళ అంతర్జాతీయ చిత్రకారుడు యస్.హెచ్.రజా వయసు 92. కుంచె పట్టుకున్నప్పుడు మాత్రం ఆ 92 కాస్తా 29 అవుతుంది.‘‘నాలోని అంతర్గత అనుభూతులకు చిత్రరూపం ఇవ్వడమే నా పని’’ అంటారు రజా. అయితే ఆ పని తన చిత్రకళకు మాత్రమే పరిమితమైపోలేదు. ఆయన్ను నిరంతర యవ్వనుడిగా ఉంచుతుంది.‘ధ్యానం చేసిన వ్యక్తి మునపటి కంటే కొత్త ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాడు. చిత్రకళలో నాకు ఆ శక్తి కనిపించింది. యవ్వన ఆలోచనలు, వయసు పైబడిన ఆలోచనలు అంటూ ఉండవు. ప్రతి సృజనాత్మక ఆలోచనా వయసుకు అతీతమైనదే. సరికొత్తదే’’ అంటున్న రజా గీసిన బొమ్మలు చూస్తే ఆయన చెప్పింది ఎంత నిజమో తెలుస్తుంది. -
సాయం వచ్చే స్మార్ట్ఫోన్ అప్లికేషన్స్!
భలే ఆప్స్ స్మార్ట్ఫోన్ కేవలం వినోదం కోసమే కాదు... సాయంగా కూడా నిలుస్తుంది. ప్రత్యేకించి ముదిమి వయసులో ఉన్న వారికి అవసరార్థం చాలా అప్లికేషన్లే అందుబాటులో ఉన్నాయి. వ్యక్తి అవసరాలను కనుగొంటాయవి. అలా ఉపయుక్తమైన, ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అప్లికేషన్లు కొన్ని... పిల్బాక్సీ... వృద్ధాప్య జీవనశైలిలో మందులు మింగడం కూడా భాగమై పోయినప్పుడు మెడిసిన్ వాడటానికి సంబంధించి అలర్ట్లా ఉంటుంది ఈ అప్లికేషన్. ఒక్కసారి ఈ అప్లికేషన్లో మెడిసిన్స్కు సంబంధించి సమాచారం ఎంటర్ చేస్తే.. తగు సమయంలో అదే గుర్తుచేస్తూ ఉంటుంది. ఈ పనికోసమే సాయంగా ఉండాల్సిన ఒక మనిషి అవసరాన్ని కొంతవరకూ ఇది నిరోధిస్తుంది. ఐ రీడర్... అక్షరాల సైజు చిన్నగా ఉండి కనపడకపోయిన సమయంలోనూ... దీర్ఘదృష్టిలో సమస్యతోనూ బాధపడుతున్న సమయాల్లో ఈ అప్లికేషన్ ఉపయుక్తమైనది.అప్లికేషన్ ఆన్ చేసి ఫోన్ను కాగితానికి దగ్గరగా తీసుకెలితే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కొనుగోలు చేయాల్సిన అప్లికేషన్. దీని ధర రెండు డాలర్లు. క్లెవర్మైండ్... వృద్ధాప్యంలో ఆల్జిమర్స్తో బాధపడుతున్న వాళ్లకు ఉపయుక్తమైనది ఈ అప్లికేషన్. అల్జిమర్స్ సంబంధ సమస్యలతో ఉన్న వారికి ఈ అప్లికేషన్ అవసరానికి తగ్గట్టుగా ఉపయోగపడుతుందని రూపకర్తలు పేర్కొన్నారు. ఇన్ స్టంట్ హార్ట్ రేట్... ఐ ఫోన్ కెమెరాను డిటెక్టర్గా ఉపయోగించుకొంటూ హృదయస్పందన వేగాన్ని కొలుస్తుంది ఈ అప్లికేషన్. ఐఓఎస్ వినియోగదారుల కోసం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఐ బీపీ... బ్లడ్ప్రెజర్ విషయంలో మానిటర్లా ఉంటుంది ఈ అప్లికేషన్. బ్లడ్ప్రెజర్ స్థాయిని సమీక్షిస్తూ, విశ్లేషిస్తూ తేడాలను తెలియజేస్తుంది. వెమ్ ఎమ్డీ... వృద్ధాప్యంలో పలకరించే వివిధ ఆరోగ్య సమస్యల గురించి, వాటి గురించిన ముందస్తు సూచనలను ఇస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేదే ఈ అప్లికేషన్. లుమొసిటి... ఖాళీగా ఉన్నప్పుడు అనవసరమైన ఆలోచనలు పలకరిస్తూ ఉంటాయి. వాటి నుంచి దూరం జరగడానికి... మెదడుకు మేతపెట్టడానికి ఉపయోగపడే గేమ్ అప్లికేషన్ ఇది. వృద్ధాప్యంలో ఏకాగ్రతను పెంపొదించుకోవడానికి ఈ అప్లికేషన్ సాయంగా ఉంటుంది. -
అందరికీ ఆసరా ‘స్వావలంబన్’
18-60 ఏళ్ల వారు చేరితే వృద్ధాప్యంలో పింఛను ఎన్పీఎస్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ యోగేశ్వరరావు వెల్లడి మాకవరపాలెం : వృద్ధాప్యంలో ఆసరా కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వావలంబన్’ పథకంలో అన్ని వర్గాల వారూ చేరవచ్చని న్యూ పింఛన్ సబ్స్క్రైబర్ సర్వీసెస్ (ఎన్పీఎస్) రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ పి.యోగేశ్వరరావు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటివరకు 50 వేల మంది ఈ పథకంలో చేరారని వెల్లడించారు. మాకవరపాలెం మండల కేంద్రంలోని కొత్తవీధిలో బుధవారం స్వావలంబన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో అన్ని మండలాల్లోనూ కార్యాలయాలు ప్రారంభించామని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ ఆర్నెల్లలో ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వారు చేరవచ్చని వివరించారు. వారు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తే కేంద్రం మరో రూ.వెయ్యి వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. అరవయ్యేళ్లు పూర్తయిన తరువాత వారికి పింఛను అందజేస్తామన్నారు. అలాగే రూ. 200 చెల్లిస్తే హెల్త్ కార్డు ఇస్తామని, దీంతో ఏడాది పాటు రూ. 2 లక్షల వరకు ఆ కుటుంబంలోని వారు వైద్యం చేయించుకోవచ్చని వివరించారు. ఈ హెల్త్కార్డు పథకానికి 18 నుంచి 55 ఏళ్ల లోపు వయసువారు అర్హులన్నారు. ఈ పథకాల్లో చేరదలచినవారు మండల కేంద్రాల్లోని ‘స్వావలంబన్’ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. అలాగే ఈ పథకాలపై నియమితులైన డివిజినల్ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. అలాగే గృహ వినియోగానికి 40 శాతం, వ్యవసాయ అవసరానికి 30 శాతం రాయితీపై సోలార్ ఇన్వెర్టర్లు అందజేస్తామని ఆయన చెప్పారు. స్థానిక డీవో ఆర్.బంగార్రాజు, నిర్వాహకుడు ఆర్.నాని, సర్పంచ్ ఇనపసప్పల మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు. -
ఇచట వృద్ధాప్యం అమ్మబడును...
సాంకేతికం అవును. మీరు చదివింది నిజమే. స్పెషల్ డిజైన్డ్ ఏజింగ్ సూట్ను కొంటే చాలు వృద్ధాప్యాన్ని కొన్నట్లే. ఈ ప్రత్యేకమైన దుస్తువులతో స్వయంగా వృద్ధాప్య సమస్యలను తెలుసుకోవచ్చు. మన వయసును చా...లా ముందుకు జరుపుకోవచ్చు. ‘‘నా వయసు 50 సంవత్సరాలు. స్పెషల్ డిజైన్డ్ ఏజింగ్ సూట్ ధరించగానే 80 సంవత్సరాల స్త్రీ దేహంలోకి ప్రవేశించినట్లయింది’’ అని ఆశ్చర్యంగా చెబుతోంది అమెడ అనే బ్యాంకు ఉద్యోగి. వృద్ధాప్యపు బాధలను అర్థం చేసుకోవడం ద్వారా వృద్ధులను సరిగా చూసుకోగలమనేది ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. దీన్ని మిడ్ యార్క్షైర్ హాస్పిటల్స్ (ఇంగ్లండ్)లో పనిచేసే వైద్యబృందం తయారుచేసింది. వినికిడి, మతిమరుపు, దృష్టికి సంబంధించినవి మాత్రమే కాకుండా రకరకాల సమస్యలు ఈ సూట్ ద్వారా అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు ఏజింగ్ సూట్కు ఎంత డిమాండ్ పెరిగిందంటే గరీబు నుంచి అమీర్ వరకు అందరూ దీన్ని ధరించడానికి తహతహలాడుతున్నారు. ‘‘ఇది వినోదం కోసం మాత్రం కాదు..’’ అంటున్నారు వైద్యులు. కొందరు వినోదం కోసం ఈ సూట్ ధరించినా ఆ తరువాత మాత్రం వారి వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చిందట. వృద్ధుల మీద సానుభూతి పెరిగిందట. మరి మన దేశానికి ఎప్పుడొస్తుందో! -
ఆసరా కోసం వేదన
జోగిపేట, న్యూస్లైన్: వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచిన పింఛన్ను అధికారులు ఏవో సాకులు చెబుతూ ఇవ్వకపోవడంతో పండుటాకులు రోడ్డెక్కారు. పోస్ట్ ఆఫీస్లో వద్దు, పంచాయతీలోనే ఇవ్వాలంటూ రాస్తారోకో చేపట్టారు. వీరికి తోడుగా వికలాంగులు, వితంతువులు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. వివర్లాకి వెళ్తే... జోగిపేట పట్టణంలోని పోస్టాఫీసులో పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శుక్రవారం వచ్చారు. అయితే బయోమెట్రిక్ మిషన్ పనిచేయడంలేదని వెళ్లిపోవాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన వృద్ధాప్య పింఛన్దారులు పోస్టాఫీసు ముందు ఆందోళనకు దిగారు. తమకు పింఛన్లు పోస్టాఫీసులో వద్దు నగర పంచాయతీలో చెల్లించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెన్షన్దారులు రాస్తారోకో చేపట్టడంతో సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊస మానిక్యం వారికి మద్దతు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి వృద్ధులకు నచ్చజెప్పి ఈ విషయమై అధికారులతో మాట్లాడారు. దీనిపై పోస్టల్శాఖ అధికారి ఎంజిఎస్ ప్రసాద్ వివరణ ఇస్తూ శుక్రవారం కొద్దిమందికి ఇచ్చిన తర్వాత మిషన్ పనిచేయలేదని, అందుకే ఇవ్వలేదన్నారు. మున్సిపల్ ఉన్న చోట కమిషనర్ సిబ్బందే చెల్లిస్తున్నారని, ఇక్కడ కూడా అలాగే చెల్లిస్తే బాగుంటుందన్నారు.