-
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)కు చెందిన సిరిల్ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో, డెమోక్రాటిక్ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. -
స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థ
గోఎయిర్ విమాన సంస్థ స్లాట్లు, విదేశీ ద్వైపాక్షిక హక్కులను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు కట్టబెడుతూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది.గోఎయిర్కు చెందిన స్లాట్లు, దైపాక్షిక హక్కులను ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీటిని సాధారణ పూల్లో ఉంచి ఆపై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, అకాసా సంస్థ గోఎయిర్ దుబాయ్ విమానయాన హక్కులను కోరినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం అకాసాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గోఎయిర్ స్లాట్లు, దైపాక్షిక హక్కుల కోసం గతంలో బిడ్డింగ్ వేసిన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి ఇటీవల తన బిడ్ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈజ్మైట్రిప్ స్థిరమైన వృద్ధి సాధించేందుకు వనరులను ఉపయోగించనున్నామని నిశాంత్ చెప్పారు. మళ్లీ గోఎయిర్ కోసం కొత్తగా ఎవరు బిడ్ వేయలేదు. దాంతో సంస్థకు చెందిన స్లాట్లు, ఇతర హక్కులను మంత్రిత్వశాఖ ఇతర సంస్థలకు తాత్కాలికంగా కేటాయించింది.స్లాట్లు, దైపాక్షిక హక్కులు..ఒక నిర్దిష్ట దేశానికి చెందిన విమానయాన సంస్థలు మరొక దేశానికి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఇది ఒక దేశం నుంచి వారానికి ఎన్ని విమానాలు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అయితే విమానయాన సంస్థ ఈ హక్కులు కలిగిఉన్నా విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎయిర్పోర్ట్ల్లో స్లాట్లను కలిగి ఉండాలి. ఒక ఎయిర్లైన్స్ విమానం బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతించే తేదీ, సమయాన్ని స్లాట్గా పేర్కొంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీబీసీఏ అధికారులు, విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలతో కూడిన కమిటీ ఈ స్లాట్లను కేటాయిస్తుంది.టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రతి వారం దాదాపు ఒక కొత్త విమానాన్ని తమ ఫ్లీట్లో చేరుస్తున్నాయి. ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్, అకాసా ఈరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో గోఎయిర్కు ఈ స్థితి రావడంపట్ల మార్కెట్ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.ఇదీ చదవండి: మరో ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!వాడియా గ్రూప్ యాజమాన్యంలో గో ఫస్ట్ రుణదాతలకు రూ.6,200 కోట్లకు పైగా బకాయిపడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్లకు వరుసగా రూ.1,934 కోట్లు, రూ.1,744 కోట్లు, రూ.75 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. -
మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..?
టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలు ఉన్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ గుర్తించింది. దాంతో ఈస్ట్ఆఫ్రికాలోని టాంజానియాలో ‘కేజీఎఫ్’ తరహా తవ్వకాలు జరుపనున్నట్లు తెలిసింది. బంగారంతోపాటు లిథియం వంటి విలువైన ఖనిజాలను వెలికి తీయడంలో ఇదొక కీలక పరిణామమని సంస్థ తెలిపింది. డెక్కన్ గోల్డ్ మైన్స్కు చెందిన డెక్కన్ గోల్డ్ టాంజానియా ప్రైవేట్ లిమిటెడ్ న్జెగా-టబోరా గ్రీన్స్టోన్ పరిధిలోని పీఎల్ బ్లాక్ 11524లో ఈ నిల్వలను గుర్తించింది. అక్కడ బంగారంతోపాటు లిథియంకు చెందిన ముడిపదార్థాలు ఉన్నట్లు తేలింది. విద్యుత్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీకి లిథియం ఎంతో ముఖ్యమైనది. అంతర్జాతీయంగా విస్తరించేందుకు ఈ లిథియం నిల్వల గుర్తింపు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ మొదాలి తెలిపారు. ఇదీ చదవండి: మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్ మీడియా సాయమెంత..? లిథియం, ఇతర అనుబంధ లోహాల కోసం ప్రాస్పెక్టింగ్ లైసెన్సు(పీఎల్) ఆర్డరు కోసం చూస్తున్నట్లు మోదాలి పేర్కొన్నారు. టాంజానియాలో కీలక ఖనిజాల కోసం అధ్యయనాలను కొనసాగించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 100.49 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి పీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. డెక్కన్ గోల్డ్ మైన్స్కు ఐదు అధునాతన బంగారు గనుల ప్రాజెక్టులున్నాయి. -
అక్కడ ఇద్దరమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సిందే!..లేదంటే జైలు శిక్ష!
వివాహాలకు సంబంధించి పలు దేశాల్లో పలు ఆచారాలు ఉంటాయి. కొన్ని చూడటానికి, వినటానికి చాలా వింతగా ఉంటాయి. ఎంతలా అంటే..ఇదేం ఆచారం రా ! బాబు అని నోటిపై వేలేసుకునేలా ఉంటాయి. పైగా వాళ్లు ఆ ఆచారాలను చాలా నిబద్ధతతో ఆచరించడం మరింత విస్తుపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ గమ్మతైన వింత ఆచారం ఏదేశంలో ఉంది? ఏంటా వింత ఆచారం అంటే..? ఇలాంటి వింత ఆచారాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఏరిత్రియ అనే తెగ ఒకటి ఉంది. ఈ తెగల ప్రజలు వివాహ సమయంలో చాలా వింతైన ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తారు. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకునే ఆచారమే ఏ సంప్రదాయంలోనైనా ఉంటుంది. కానీ ఇక్కడ సంప్రదాయంలో మాత్రం ఇద్దరు మహిళలను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలట. ఏంటీ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనుకుంటున్నారా..? కానీ ఆఫ్రికా ఖండంలోని ఈ ఎరిత్రియ తెగ మాత్రం ఈ సంప్రదాయన్ని నేటికి పాటిస్తోంది. ఒక వేళ అలా గనుకు ఎవరైన చేయకపోతే దాన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి వారిని జైల్లో వేయిస్తారట. అందేకాదండోయ్ ఏకంగా జీవత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందట. అందువల్లే అక్కడ ప్రాంతంలోని ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో స్త్రీతో పంచుకునేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ తెగలో దశాబ్దకాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభానే ఎక్కువగా ఉటుందట. దీంతో ఆ తెగ పెద్దలు స్త్రీ-పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారట. (చదవండి: ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!) -
నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. -
వూడూ ఫెస్టివల్! ఈ వేడుకకు దెయ్యాలొచ్చి నృత్యాలు చేస్తాయట!
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ? పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్ డాన్స్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట. అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి. అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక. ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్గా నిర్వహిస్తుంటాయి. ---సంహిత నిమ్మన (చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్వుడ్ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
‘ఐఎస్ఐఎస్’కి అడ్డాగా ఆఫ్రికా దేశాలు?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
హౌతీ అటాక్స్.. ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న నౌకలు!
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది. దాంతో ప్రపంచ వాణిజ్యానికి వేలకోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా. తాజాగా ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంతో షిప్పింగ్ ధరలు 60 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మరో 20 శాతం పెరగొచ్చని జీటీఆర్ఐ నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రం, మెడిటేరియన్ సముద్రం, హిందూ మహాసముద్రానికి కలిపే కీలక జలసంధి బాబ్ ఎల్ మండెబ్ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. యెమెన్ హౌతీ మిలిటెంట్లు దూకుడు పెంచడంతో ఈ రూట్లో రవాణా కష్టంగా మారినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. దాంతో నౌకా సంస్థలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేలా ప్రయాణం మొదలుపెట్టాయి. ఫలితంగా భారత్కు సరుకు రవాణా కావాలంటే అదనంగా 20 రోజుల వరకు సమయం పడుతుందని జీటీఆర్ఐ తెలిపింది. హౌతీ దాడులతో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్తో ఇండియాకు జరుగుతున్న వ్యాపారంపై ప్రభావం పడుతోందని పేర్కొంది. క్రూడాయిల్, ఎల్ఎన్జీ దిగుమతుల కోసం ఇండియా ఎక్కువగా బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై ఆధారపడుతోంది. ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికాతో భారత్కు జరుగుతున్న సరుకు రవాణాలో ఏటా 50 శాతానికి పైగా దిగుమతులు, 60 శాతం ఎగుమతులు ఉన్నాయి. దాంతో మొత్తం 113 బిలియన్ డాలర్(దాదాపు రూ.9 లక్షల కోట్లు)ల వ్యాపారానికి ఈ రూట్ చాలా కీలకమని జీటీఆర్ఐ వెల్లడించింది. ఫలితంగా భారత్ ఇతర మార్గాల వైపు చూడాల్సి వస్తోందని తెలిపింది. ఎర్ర సముద్రంలోని షిప్ల కోసం ఇండియా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీటి రవాణాను ముఖ్యంగా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు చేపడుతున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇదీ చదవండి: డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం! హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెబ్పై హౌతీ రెబల్స్కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. -
వామ్మో ఆఫ్రికన్ నత్తలు! ఇవి ఎంత ప్రమాదమో తెలుసా?
ఆఫ్రికన్ నత్తలు(జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్) మార్కాపురం–తర్లుపాడు రోడ్డులోని మాగుంట పార్కులో ప్రత్యక్షమయ్యాయి. గత మూడు రోజులుగా సుమారు 100 నత్తలు పార్కులో సంచరిస్తూ వాకర్లను ఆకర్షిస్తున్నాయి. మన ప్రాంతంలో కనిపించే సాధారణ నత్తల కంటే ఇవి భిన్నంగా ఉండటమే అందుకు కారణం. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈ నత్తలు వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఇవి మామూలు నత్తలు కావు.. అచాటినిడే కుటుంబానికి చెందిన ఈ ఆఫ్రికన్ నత్తలు ప్రపంచ వ్యాప్తంగా చీడ సమస్యలకు ప్రధాన కారణం. వ్యవసాయ పంటలతోపాటు స్థానిక మొక్కలకూ నష్టం కలిగిస్తాయి. అత్యంత హానికరమైన ఇన్వాసివ్(ఆక్రమిత) జాతుల్లో ఒకటైన ఈ ఆఫ్రికన్ నత్తలు మానవుల్లో మెనింజైటిస్కు కారణమవుతున్నాయి. ప్రపంచంలో టాప్ 100 ఆక్రమిత జాతుల్లో ఈ నత్తలూ ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్పష్టం చేసింది. ఇవి చదవండి: వర్షం పడని వింత గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా? మేఘాలను దగ్గర్నుంచి.. -
దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు!
ఆఫ్రికాలోని పెద్ద సరస్సులో ఒకటైన నొకోవే సరస్సు దయ్యాల సరస్సుగా పేరుమోసింది. అయినా కొందరు ఆ సరస్సు నడిబొడ్డున తేలియాడే ఊరును నిర్మించుకున్నారు. ఈ ఊరి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశమైన బెనిన్లో ఉంది ఈ ఊరు. దీని పేరు గాన్వీ. నాలుగు శతాబ్దాల కిందట యూరోప్ నుంచి వివిధ దేశాల వలస వర్తకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండేవారు. ప్రస్తుతం బెనిన్గా పిలుచుకుంటున్న దేశంలో అప్పట్లో ఫోన్, దహోమి రాజ్యాలు ఉండేవి. ఈ రెండు రాజ్యాల సైన్యాల్లోనూ చాలా క్రూరులైన సైనికులు ఉండేవారు. వారు ఇక్కడి టొఫిను తెగకు చెందిన వారిని బందీలుగా పట్టుకుని, ఇక్కడకు వర్తకం కోసం వచ్చే పోర్చుగీసు వారికి బానిసలుగా అమ్మేసి, వారు తమ దేశం నుంచి తీసుకువచ్చే వస్తువులను ప్రతిఫలంగా తీసుకునేవారు. అయితే, ఫోన్, దహోమీ రాజ్యాల్లో నొకోవే సరస్సు దయ్యాల సరస్సు అనే నమ్మకం ఉండేది. సైనికులకు చిక్కకుండా తప్పించుకోవడానికి ఈ సరస్సు ఒక్కటే తగిన ప్రదేశమని నిర్ణయించుకున్న టొఫిను తెగ ప్రజలు చెక్క తెప్పలపై గుడారాలను నిర్మించుకుని, సరస్సులోనే నివసించడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ సరస్సలోనే వారు తేలియాడే ఇళ్లను నిర్మించుకున్నారు. జనాభా పెరగడంతో సరస్సులో ఏకంగా తేలియాడే ఊరు తయారైంది. కాలం తెచ్చిన మార్పుల్లో ఫోన్, దహోమి రాజ్యాలు అంతరించాయి. తర్వాతికాలంలో ఇక్కడ అధికారం చలాయించిన ఫ్రెంచ్ పాలన కూడా అంతరించింది. ఈ ప్రాంతం ‘బెనిన్’ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినా అప్పట్లో ఇక్కడ స్థిరపడిన టొఫిను తెగ ప్రజలు తిరిగి నేల మీదకు రాకుండా, ఈ సరస్సులోని ఊరినే తమ శాశ్వత నివాసంగా చేసుకుని, తరతరాలుగా కొనసాగు తున్నారు. (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్కు మోడలింగ్ చేసింది. మోడల్గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాలు, రక్తహీనత సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ను దేశంలోనే అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్పై మంగళగిరిలో గురువారం ఒక వర్క్షాప్ జరిగింది. దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో నిర్వహించిన ఈ వర్క్షాప్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాది పొడవునా వరి సాగవుతోందని, బియ్యం నిల్వల్లో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అవసరాలకు తగ్గట్టు విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సైతం ఫోర్టిఫైడ్ బియ్యం ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులతో పాటు మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విటమిన్లతో కూడిన ఈ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్/చైనా బియ్యంగా అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి... ముందుగా వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యత నిర్వహణ వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రతి దశలోనూ పరిశీలించిన తర్వాతే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. లిక్విడ్ టెస్టింగ్ ద్వారా మోతాదు ప్రకారం విటమిన్ల శాతం లేకుంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను అప్పటికప్పుడే తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారతీ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఉప కార్యదర్శి ఎస్హెచ్.లలన్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత మహమ్మారిని అరికట్టడంలో భాగంగా 2019లో 11 రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ.. ప్రస్తుతం 27 రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. మెక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థ (ఎంఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వర్క్షాప్లో ఎంఎస్సీ సహవ్యవస్థాపకుడు కుంజ్ బిహారీ, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు తేజస్ ఆచారీ, ఆహార భద్రత–ప్రమాణాల సంస్థ జేడీ కె.బాలసుబ్రహ్మమణ్యం, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, లద్దాఖ్, లక్షద్వీప్ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. -
అరుదైన వింత వ్యాధి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..!
కరోనా టైంలో లాక్డౌన్, హోం క్యారంటైన్ వంటి పదాలని విని హడలిపోయాం. ఆ కరోనా మహమ్మారికి భయపడి అంతా స్వీయనిర్బంధంలో బిక్కుబిక్కుమని గడిపాం. అయిన వారితో సహా ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా గడపాల్సిన దారుణమైన దుస్థితితో ఎన్నో అవస్థలు పడ్డాం. హమ్మయ్యా! అని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. చాలా వరకు పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఆ గడ్డు రోజులు తల్చుకుంటునే వామ్మో! అని హడలిపోతాం. అలాంటిది ఈ వృద్ధుడు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే జీవిస్తున్నాడు. అది కూడా అతనికి ఎలాంటి అంటు రోగం లేకపోయిన ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా తనను తాను నిర్బంధించుకుని ఎందుకు ఉంటున్నాడంటే.. వివరాల్లోకెళ్తే..71 ఏళ్ల ఆఫ్రికన్ వ్యక్తి తనను తాను నిర్బంధించుకుని ఎవ్వరితోనూ సంబంధాలు లేకుండా ఏకాకిగా బతుకుతున్నాడు. అతను ఎందుకిలా జీవిస్తున్నాడో వింటే ఇలాంటి భయాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. జంతువులు, నీళ్లు, నిప్పు తదితర భయాలు గురించి వాటి తాలుకా ఫోబియాల గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత అరుదైన ఫోబియా గురించి విన ఉండే అవకాశమే లేదు. ఐతే ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్న విచిత్రమైన భయం ఏంటంటే ఆడవాళ్లు. మహిళలా!.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అతడికి మహిళలంటేనే చచ్చేంత భయం. మహిళ గాలి సైతం తనను తాకకూడదని ఇలా 55 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. పైగా ఇంటి చుట్టూ కంచె కూడా వేసుకున్నాడు. ఇలా ఆ వృద్ధుడు 16 ఏళ్ల ప్రాయం నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు. విచిత్రం ఏంటంటే అతడికి మహిళలంటే భయం కానీ అతడు ఆ మహిళల సాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి సాయం చేసేది ఇరుగుపొరుగు మహిళలే. అ వ్యక్తి తన చిన్నతనం నుంచి ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడని, బయటకు అస్సలు రాడని చెబుతున్నారు చుట్టుపక్కల మహిళలు. పొరపాటున ఏ మహిళ అయినా అతడి ఇంటి ఆవరణలోకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించిన నిమిషం ఆలస్యం చేయకుండా తలుపువేసేసుకుంటాడని తెలిపారు. అతనికి మహిళలంటే చచ్చేంత భయం అని చెబుతున్నారు స్థానికులు. ఈ భయం కారణంగా ఆ వ్యక్తి 77 ఏళ్ల వచ్చినా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చివరికి అతడు ఏ పని చేయలేని స్థితికి వచ్చేశాడు. అతడి దుస్థితిని చూసి చుట్టుపక్కల మహిళలు తమకు తోచిన రీతలో ఆహారపదార్థాలను అతడి వాకిట్లో ఉంచి వెళ్లిపోతారు. అతడు మాత్రం వారు వెళ్లిపోయాక మెల్లిగా వాటిని తీసుకుంటాడు. ఇలా వేరొక జెండర్ని చూస్తే భయపడే మానసిక స్థితిని గైనోఫోబియా అంటారు. అతడు తీవ్రమైన గైనోఫోబియాతో బాధపడుతున్నాడు. దీన్ని వైద్య పరిభాషలో డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్గా పిలుస్తారు. దీన్ని క్లినికల్ పరంగా ఓ నిర్ధిష్ట భయంగా చెబుతారు వైద్యులు. ఈ ఫోబియ ఉన్నవాళ్లు స్త్రీల పట్ల అహేతుకమైన భయంతో ఉంటారట. తరుచుగా వారి గురించి ఆలోచించడంతో ఒక విధమైన ఆందోళనకు దారితీసి క్రమంగా మరింత తీవ్రమైపోతుంది. ఫలితంగా ఆయా వ్యక్తులు పొరపాటున మహిళలను చూడగానే చెమటలు పట్టేసి, శ్వాస ఆడనట్లుగా అయిపోయి ప్రాణాలు కోల్పేయే పరిస్థితికి వచ్చేస్తారని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!) -
ఆడవాళ్లను చూస్తే ఊపిరాడదు: అందుకే 55 ఏళ్లు ..!
CallitxeNzamwita Gynophobia మనుషులను రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, కౄర జంతువులు, పాములు, బల్లులు, నిప్పు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి అన్నా కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంది. అయితే తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడిన వ్యక్తి వార్తల్లో నిలిచాడు. తాజా నివేదికల ప్రకారం రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్ నజాంవిటా (Callitxe Nzamwita)ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసపుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. కాలిటెక్స్ నజాంవిటా స్టోరీ ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్ ఆహారం, కిరాణా సామాన్లు లాంటి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళితే..వారు వెళ్లిపోయాక అపుడువాటిని తీసుకుంటాడు. ఫోబియా Phobia అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. వాస్తవానికి దాన్నించు మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోవడం.సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా, రిలేషన్షిప్లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. గైనోఫోబియా అంటే ఏమిటి? స్త్రీల పట్ల ఉండే అహేతుక భయమే గైనోఫోబియా గైనోఫోబియా అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5)లో అధికారికంగా గుర్తించనప్పటికీ, ది క్లినికల్ సెట్టింగ్లో "నిర్దిష్ట భయం"గా వర్గీకరించారు. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల అహేతుకమైన, తీవ్రమైన భయం. వారి గురించిన ఆలోచనే వారిలో ఆందోళనకు దారితీస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఫోబియాల్లో కనిపించేవిగానే ఉంటాయి. ముఖ్యంగా తీవ్ర భయాందోళనలు, ఛాతీ పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి. -
వేస్ట్ అనుకొంటే..రూ. 36 కోట్లు పలికింది: షాకైన జంట కోర్టుకు
ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్లోని నిమెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్ను కూడా స్థానిక డీలర్కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్పై దావా వేశారు. ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్లో నిమ్స్లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్పెల్లియర్లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. -
ప్రకృతి వ్యవసాయం భేష్
చిలమత్తూరు: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చాలా బాగుందని ఆఫ్రికా దేశాల ప్రతినిధుల బృందం ప్రశంసించింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ పరిధిలోని యగ్నిశెట్టిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బృందం శనివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.విజయకుమార్ ఆధ్వర్యంలో సెనగల్, టునీషియా, మడగాస్కర్, జాంబియా, బెనిన్, మలవాయి తదితర ఆఫ్రికా దేశాల నుంచి 27 మంది ప్రతినిధులు యగ్నిశెట్టిపల్లిలోని పంట పొలాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభిస్తున్న నందీశ్వర, నరసింహప్ప అనే రైతులకు చెందిన వేరుశనగ, నవీన్కు చెందిన పత్తి పంటలను పరిశీలించారు. పంటల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ విధానం తదితర వాటిని రైతులు, అధికారులు సమగ్రంగా వివరించారు. అనంతరం గ్రామంలోని కల్పవల్లి గ్రామ సంఘం, మహేశ్వరి మహిళా సంఘ సభ్యులు ప్రధాన పంటలు ఐదు రకాలు వేయటం, 20 రకాల జీవ వైవిధ్య పంటల సాగు, 5శాతం విత్తనాలు వేసుకోవడం వల్ల వచ్చిన ఫలితాలు, మార్కెటింగ్ వంటి వాటిని విదేశీ బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)కు చెందిన ఆన్నె సోఫియా, సీఐఆర్ఏడీకి చెందిన బ్రూనో, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్, అధికారులు విజయ్కుమార్, బాబు పాల్గొన్నారు. -
దోమలను ఎందుకు ఇష్టంగా తింటారు? ఒక టిక్కీకి ఎన్ని దోమలు కావాలి?
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు. వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? -
అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం!
గతంలో లిబియాలో సంభవించిన వరదలు, మొరాకోలో వచ్చిన భూకంపం చాలామంది ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారాంతం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వీధులన్నీ జలమయమైపోయాయి, ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, కొన్ని వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. వర్షాలు తగ్గిన తరువాత ఇలాంటి వాహనాలను (కార్లను) ఉపయోగిస్తారా? లేదా ఎక్కడికైనా ఎగుమతి చేస్తారా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వరదల్లో మునిగిన కార్లను కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేసి రిపేర్ చేసుకుని మళ్ళీ ఉపయోగిస్తారు. అది కూడా కారు ఖరీదుని బట్టి, రిపేరుకి అయ్యే ఖర్చుని బట్టి ఉంటుంది. అయితే అమెరికా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఒకసారి వరద నీళ్లలో కారు ఇంజిన్ తడిస్తే.. దాన్ని అమెరికాలో ఎవరూ ముట్టుకోరు. సాధారణంగా లగ్జరీ కార్ల ధరలు లక్షన్నర డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఉంటాయి. ఇంత ఖరీదైన కార్లు ఒక్కసారి వరద నీళ్లలో తడిచినా.. దాని విలువ దారుణంగా పడిపోతుంది. బురద నీళ్లలో ఇంజిన్ తడిస్తే.. ఎంత గొప్ప కారయినా 5 వేల డాలర్లకు మించి విలువ రాదు. ఇలాంటి కార్లన్నింటిని ఓనర్లు ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పగించి కొత్త కార్లు తీసుకుంటారు. కార్లను వేలం ద్వారా విక్రయించడం నిజానికి అమెరికా వరదల్లో మునిగిన కార్లను.. అది ఎంత ఖరీదైన కారైనా చాలా తక్కువ ధరకు జంక్యార్డ్లు లేదా వెహికల్ రీబిల్డర్లకు సాల్వేజ్ వేలంలో విక్రయిస్తారు. అయితే ఇలాంటి వాటిని కొనుగోలు చేసిన కంపెనీలు.. లేదా వ్యక్తులు కెన్యా, జింబాంబ్వే, నైజీరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. కారు వరదల్లో మునిగితే ఇంటీరియర్ & ఇంజిన్ వంటి వాటిలో మాత్రమే సమస్యలు తలెత్తుతాయి. కొంత మేర సీట్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అక్కడి కంపెనీలు పరిష్కరించి, వాటి స్థానాల్లో చైనా వస్తువులను ఉపయోగించి, కొంత యధా స్థితికి తీసుకువస్తారు. ఇలా మళ్ళీ కొత్తగా తయారైన కార్లను సుమారు 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు విక్రయిస్తారని తెలుస్తోంది. అంటే 2లక్షల డాలర్ల విలువ చేసే కార్లు కేవలం 40వేల డాలర్లకే విక్రయిస్తారన్న మాట. వరదల్లో మునిగిన కార్లకు పైపై మెరుగులు దిద్ది ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నాయి. ఇక మధ్యలో బ్రోకర్లు ఒక్కో కారుకు కనీసం 25వేల డాలర్లు సంపాదిస్తారు. ఆఫ్రికాలో లాభాల పంట ఇలాంటి కార్లు ఎన్ని రోజులు పనిచేస్తాయని కచ్చితంగా చెప్పలేరు. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. మొత్తం మీద దీన్ని బట్టి చూస్తే అమెరికాలో వరదలు వస్తే ఆఫ్రికాలో లాభాల పంట పండినట్లే. ముఖ్యంగా కెన్యా, నైగర్, జింబాబ్వే, నైజిరియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కాసింత ఖర్చు పెట్టి కొత్తగా తీర్చిదిద్దుతున్నాయి. సాధారణంగా వరదల్లో మునిగిన కారు ఇంజిన్ కొంత మేరకు దెబ్బతింటుంది, వాహనానికి గుండెలాంటి ఇంజిన్లో సమస్య తలెత్తితే దాన్ని మళ్ళీ బాగుచేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నపని, కావున అమెరికాలో ఇలాంటి కార్లను వెనుకాడకుండా విక్రయించేస్తారు. ఇదీ చదవండి: వేగం పెంచిన ఇండియా.. డౌన్లోడ్ స్పీడ్ గ్లోబల్ ర్యాంకింగ్లో ఇలా.. ఇంజిన్తో పాటు కార్పెట్లు, సీట్-మౌంటు స్క్రూలు, లైట్స్, ఎయిర్ ఫిల్టర్ వంటివన్నీ సమస్యకు గురవుతాయి. అంతే కాకుండా కొన్ని రోజులకు తుప్పు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను గుర్తించే వాటిని తక్కువ ధరలను విక్రయిస్తారు. ఇక సాఫ్ట్వేర్ విషయంలోనూ ఇప్పుడు చాలా పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఆడి, బెంజ్, BMW, లెక్సస్, ఫోర్డ్ ఫోక్స్ వాగన్.. బ్రాండ్ ఏదైనా అందులో ఉండే సాఫ్ట్వేర్ను చైనా కంపెనీలు క్రాకర్ వర్షన్లలో అమ్ముతున్నాయి. కాబట్టి ఈ వరద కార్లు అన్ని హంగులు సమకూర్చుకుని బురదను వదిలి మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. మరి ఈ కార్లు ఇండియాకు రావా.. అనుకుంటున్నారా? మన ప్రభుత్వం ఎందుకనో ఈ డీల్స్కు నో చెబుతోంది. కాబట్టి ఆ అదృష్టమేదో అఫ్రికన్లకే చేరని. Consumer caution is rising as flood-damaged cars enter the used car market, often appearing in auto auctions, dealerships and classified ads. The @WisconsinBBB joined us this morning for tips on how to avoid being scammed by these vehicles: https://t.co/wN3xPmoTDR — CBS 58 News (@CBS58) October 2, 2023 -
కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా?
కెనడాలో చోరీ అయిన వాహనాలు చివరికి ఆఫ్రికాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కెనడాలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఈ సమస్యను పట్టించుకోకపోవడమే దీనికి కారణమని ఆఫ్రికా దేశాల్లోని అధికారులు ఆరోపిస్తున్నారు. సీబీసీ మీడియా ఇటీవల జరిపిన పరిశోధనలో పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన ఘనాలో డజన్ల కొద్దీ చోరీకి గురయిన వాహనాలు అంటారియో, క్యూబెక్ లైసెన్స్ ప్లేట్లతో కనిపించాయి. ఈ వాహనాలలోని కొన్నింటికి కెనడియన్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. కొనుగోలుదారులు మార్కెట్ ధరకు దగ్గరగా వీటికి ధరను చెల్లిస్లున్నారని తేలింది. సోషల్ మీడియాతో సహా వివిధ ఆన్లైన్ ఛానళ్ల ద్వారా ఈ కార్ల విక్రయాలకు సంబంధించిన ప్రకటలు వెలువడుతున్నాయి. కెనడాలో 2022లో పెరిగిన కార్ల చోరీలు ‘తాము చోరీ అయిన వాహనాల విషయంలో ప్రపంచ దాతగా మారామని కెనడియన్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ అసోసియేషన్ ప్రతినిధి మైఖేల్ రోత్ సీబీసీకి చెప్పారు. కాగా బీమా పరిశ్రమ గ్రూప్ ఈక్విటీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాలో వాహనాల దొంగతనాలు 2022లో పెరిగాయి. క్యూబెక్, అంటారియోలో దాదాపు 50 శాతం మేరకు కార్ల చోరీలు పెరిగాయి. అట్లాంటిక్ కెనడాలో కార్ల చోరీ 34 శాతానికిపైగా పెరిగింది. దీనివెనుక మాంట్రియల్లోని వ్యవస్థీకృత నేరగాళ్లు కారణమనే ఆరోపణలున్నాయి. చోరీ అయిన వాహనాలు మాంట్రియల్ పోర్ట్ నుంచి విదేశాలలోని గమ్యస్థానాలకు తరలిపోతున్నాయి. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస చోరీలు ఈ సంవత్సరం ప్రారంభంలో పీల్ ప్రాంతీయ పోలీసులు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ సంయుక్తంగా పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ అండ్ ఎక్విట్ అసోసియేషన్ సహాయంతో 10 మిలియన్ డాలర్లకు మించి విలువచేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస దొంగతనాల నేపధ్యంలో ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ పేరుతో విచారణ మొదలయ్యింది. ఈ వాహనాలను షిప్పింగ్ కంటైనర్లలోకి ఎక్కించి, ట్రక్కులు లేదా రైళ్ల ద్వారా మాంట్రియల్ పోర్ట్కు తరలిస్తున్నట్లు విచారణతో తేలింది. 300 శాతం మేరకు పెరిగిన వాహన చోరీలు నెల రోజుల క్రితం హాల్టన్ పోలీసులు చోరీకి గురయిన 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఆరు నిమిషాలకు ఒక వాహనం చోరీకి గురవుతుండటంతో రికవరీలు సమస్యగా పరిణమిస్తున్నాయి. గత జూన్లో కెనడియన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ అసోసియేషన్ అందించిన వచ్చిన ఒక నివేదిక ప్రకారం టొరంటోలో 2015 నుండి 2022 వరకు వాహనాల దొంగతనాలు 300 శాతం మేరకు పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. 2022లో ఒక్క టొరంటోలోనే 9,600 వాహనాలు చోరీ అయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత సమన్వయంతో జాతీయస్థాయిలో ప్రయత్నాలు జరగాలని నివేదిక పిలుపునిచ్చింది. వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్ను అప్డేట్ చేయాలి కెనడాలో వాహనాల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవస్థీకృత నేరాగాళ్లు చోరీ చేసిన వాహనాలతో తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో మరింత ప్రవీణులుగా మారారు. దొంగతనాల నివారణకు తక్షణమే పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లు నిర్వహించడం అవసరం అని సీఎఫ్ఎల్ఏ ప్రెసిడెంట్ మైఖేల్ రోతే అన్నారు. అలాగే ఈక్విట్ అసోసియేషన్ వంటి ఇతర సంస్థలు.. కెనడాలోని ఫెడరల్ మోటార్ వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్ను అప్డేట్ చేయాలని కెనగా ట్రాన్స్పోర్ట్ విభాగానికి పిలుపునిచ్చాయి. విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు నేరస్తులు ఇప్పుడు పాత ప్రమాణాలను సద్వినియోగం చేసుకుంటున్నారని విచారణాధికారి బ్రయాన్ గాస్ట్ పేర్కొన్నారు. వారు వ్యవస్థలోని లోపాలను త్వరగా , సులభంగా ఉపయోగించుకుంటున్నారని, ఇది కెనడా అంతటా వాహనాల దొంగతనాల పెరుగుదలకు దారితీస్తున్నదన్నారు. అంటారియో ప్రభుత్వం వాహనాల దొంగతనాలను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు సంవత్సరాల్లో 51 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా క్రిమినల్ సంస్థలపై దర్యాప్తు , విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. చాలా తక్కువ మాత్రమే రికవరీ కెనడియన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్కు చెందిన హువ్ విలియమ్స్ మాట్లాడుతూ కెనడాలో గృహాలు, డీలర్షిప్ షోరూమ్ల నుండి కార్లు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. వీటిలో చాలా తక్కువ మాత్రమే రికవరీ అవుతున్నాయని తెలిపారు. యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ పనిని సమర్థవంతంగా చేస్తోంది. కానీ కెనడాలో అలా జరడం లేదన్నారు. కాగా ఘనాకు చెందిన ఎకనామిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దులై బషీరు దపిలా మాట్లాడుతూ వాహన దొంగతనాలకు సంబంధించి ఏ కెనడియన్ ఏజెన్సీ కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించలేదని, నేరుగా అధికారిక ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కార్లను వెదుక్కుంటున్న వాహనయజమానులు కొన్ని సందర్భాల్లో కెనడియన్లు చోరీకి గురయిన కారు కోసం తామే ప్రయత్నిస్తున్నారు. గత జూలైలో టొరంటోకు చెందిన ఒక వ్యక్తికి చెందిన రేంజ్ రోవర్ చోరీ జరిగాక అతను దానిని ట్రాక్ చేసి, మాంట్రియల్లో ఉందని, దానిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వెళ్లారు. 64 ఏళ్ల స్టీఫెన్ టౌబ్ రేడియో-ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ పరికరం సాయంతో తన కారు వాహనం టొరంటో తూర్పు చివరలో ఉందని తెలుసుకున్నారు. తరువాత పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ వద్ద షిప్పింగ్ కంటైనర్లోకి చేరుకుందని తెలిపారు. ట్రాకింగ్ డివైజ్ ప్రొవైడర్ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ కారు లొకేషన్ను షేర్ చేసిందని టౌబ్ కెనడియన్ ప్రెస్కు తెలిపారు. అయితే సిబ్బంది కొరత కారణంగా కంటైనర్ను తెరవడానికి నాలుగు నెలల సమయం పట్టవచ్చని, ఈలోపునే కంటైనర్ను రవాణా జరగవచ్చని టౌబ్ పేర్కొన్నాడు. ఈ నేపధ్యంలో టౌబ్ మాంట్రియల్లోని సంబంధింత కార్యాలయానికి వెళ్లి అక్కడి ఏజెన్సీని కలిశాడు. మరుసటి రోజు తన రేంజ్ రోవర్ను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తాను అక్కడికి వెళ్లకపోతే తన కారును తిరిగి పొందేవాడిని కాదని టౌబ్ మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: విటమిన్ టాబ్లెట్ అనుకుని ఎయిర్పాడ్ మింగేసింది.. తరువాత? -
ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్గా కరువుకు చెక్!
కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశాల్లో దేశాల్లో ఎడారీకరణను ఎదుర్కొనేందుకు రైతులు వాన నీటి సంరక్షణకు అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. వాటిలో ‘అర్ధ చంద్రాకారపు గుంతలు’ తవ్వటం ఒక పద్ధతి. చెట్టు చేమ కరువైన ప్రదేశాల్లో అరుదుగా కురిసే కొద్దిపాటి వర్షపు నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేసి భూమిలోకి ఇంకింపజేయటంలో ఈ వినూత్న ఇంకుడు గుంతలు ఉపయోగపడుతున్నాయి. వెస్ట్ సహెల్లో రైతులు భూసారం కోల్పోయిన భూములను పునరుజ్జీవింపజేయటం కోసం, ఎడారీకరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ పద్ధతిలో లోతు తక్కువ గుంతలు తవ్వి సత్ఫలితాలు సాధించారు. వాలుకు అడ్డంగా అర్థ చంద్రాకారంలో గుంతలు తవ్వి, తవ్విన మట్టిని లోతట్టు వైపు గట్టుగా వేస్తే.. వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూమిలోకి ఎక్కువగా ఇంకుతోంది. నీరు ఇంకడంతో పాటు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల భూమి పైపొర మట్టి కోతకు గురికాకుండా కాపాడుకున్నట్లు కూడా అవుతోంది. ఎడారీకరణ బారిన పడిన రైతుల మొహాల్లో ఆనందాన్ని నింపుతుండటంతో వీటికి ‘జాయ్ పిట్స్’ అని కూడా పేరొచ్చింది! ఖర్చు, శ్రమ తక్కువ.. ఫలితం ఎక్కువ! అర్థ చంద్రాకార గుంతలు నిర్మించడం సులభం, ఖర్చు స్వల్పం. వాలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న భూముల్లో నేల కోతను నియంత్రించేందుకు, వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించడానికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ఎత్తులో వ్యత్యాసం దాదాపుగా బెత్తెడు ఎక్కువ ఉంటే వాలు 5% కంటే ఎక్కువగా ఉంటుంది. నిర్మించేదెలా? మొదట భూమిపై వాలు వైపు తిరిగి నిలబడి అర్ధ చంద్రుని ఆకారాన్ని రెండు మీటర్ల వెడల్పుతో గీయాలి. రెండు పిడికిళ్ల (10 సెంటీమీటర్ల) లోతు మట్టిని తవ్వి, ఆ మట్టిని దిగువ వైపున కట్టగా వేయండి. కట్ట బలంగా ఉండాలంటే కట్ట కింది వైపు ఇరవై అంగుళాల వెడల్పు ఉండాలి. పైభాగం కనీసం సగం (10 అంగుళాల) వెడల్పు ఉండాలి. ఎత్తు అడుగు సరిపోతుంది. వర్షాకాలంలో చివరి నెలన్నరలో అర్ధ చంద్రాకార కందకాలను తవ్వాలి. అప్పుడు నేల తేమగా ఉంటుంది. తవ్వటం, గట్లు వేయటం సులభం అవుతుంది. ఎండా కాలంలో వానకు ముందు దీన్ని ఏర్పాటు చేయాలంటే కష్టం. అర్ధ చంద్రాకారపు గుంతలు తీయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. పార, పలుగు చాలు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: సుప్రీంకోర్టు నిషేధించిన కొర్రమీను డూప్లికేట్.. తిన్నారా? అంతే సంగతి!) -
పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం
పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కేప్ వెర్డే దీవుల్లో పడవ బోల్తా పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారని,38 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధికారులు తెలిపారు. దీనిని అల్ జజీరా వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలోమీటర్ల (385 మైళ్లు) దూరంలోని ద్వీప దేశమైన కేప్ వెర్డే నుంచి ఒక ఫిషింగ్ బోట్ నెల రోజుల క్రితం సెనెగల్ నుండి బయలుదేరింది. మీడియా తెలిపిన వివరాల ప్రకారం గినియా-బిస్సౌకు చెందిన ఒక పౌరునితో సహా 38 మందిని అర్థరాత్రి వేళ పడవ ప్రమాదం నుండి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్ ద్వీపానికి 320 కిలోమీటర్ల (200 మైళ్లు) దూరంలో స్పెయిన్ ఫిషింగ్ బోట్ ఈ ఓడను గుర్తించింది. స్పానిష్ మైగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ ఈ ఓడను భారీ ఫిషింగ్ బోట్గా పేర్కొంది. ఈ పడవను పిరోగ్ అంటారు. ఇది 100 మంది శరణార్థులు, వలసదారులతో జూలై 10న సెనెగల్ నుండి బయలుదేరింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేప్ వెర్డేలో నెలకొన్న పేదరికం, యుద్ధ వాతావరణం కారణంగా వేలాదిమంది ఇక్కడి నుంచి బయటపడేందుకు ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏమాత్రం రక్షణలేని పడవలు లేదా స్మగ్లర్లు అందించే మోటరైజ్డ్ పడవలలో వీరంతా ప్రయాణిస్తుంటారని అల్ జజీరా తెలిపింది. ఇది కూడా చదవండి: ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్ మాస్టర్ స్టోరీ! -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్టైమ్గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
బోటుల్లో ఐరోపాకు చేరిన ఆఫ్రికా అక్రమ చొరబాటుదారులు
ఇటలీ: గడిచిన 24 గంటల్లో ఆసియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుండి వేల సంఖ్యలో వలసదారులు బోటుల్లో ఐరోపాలోని ఆయా దేశాలకు చేరుకున్నట్లు తెలిపాయి ఇటలీ ఇమిగ్రేషన్ వర్గాలు. ఇటలీ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన శరణార్థులు పడవల్లో తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. కిక్కిరిసిన బోటులో ప్రయాణం చేసిన కారణంగా కొంతమంది బోటులోనే చనిపోగా మిగిలినవారు కాలాబ్రియా కోస్తాకు, లంపెడుసా తీరానికి చేరుకున్నారని అన్నారు. Meanwhile, another overloaded boatload of illegal immigrants from North Africa is making its way across the Mediterranean to Europe and the UK. pic.twitter.com/pDOagytGr6 — UK Justice Forum 🇬🇧 Latest Video News Updates! (@Justice_forum) June 29, 2023 ఇటీవలే భారీగా వలసదారులను ఎక్కుంచుకుని ఐరోపా వైపుగా వచ్చిన ఇలాంటి ఒక పడవ బోల్తాపడి నీటమునిగిన విషయం తెలిసిందే. తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు వలసలను ఆపి ప్రమాదాలను నివారించే ప్రయత్నమైనా చేయడం లేదు. Boats full of African invaders landing straight onto the beach in Italy today. pic.twitter.com/ZaylKNpps6 — Faith (@Sarah77929529) June 28, 2023 ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు