-
ఏమైపోయారో?
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరావడం లేదు. నెలలు..సంవత్సరాలైన వారి జాడ తెలియడం లేదు. అసలు బతికున్నాడో..మరే ప్రమాదంలో చిక్కుకున్నాడో అంతుపట్టడం లేదు. ఇలా అదృశ్యమైన వ్యక్తుల్లో అధికంగా మహిళలే ఉంటున్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ఏళ్ల తరబడి వీరి జాడ తెలియక అయిన వా రు మానసిక వేదనకు గురవుతున్నారు. మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ దొరుకుతుండగా.. మరికొంత మంది ఏమైపోతున్నారో తెలియడం లేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,502 మంది తప్పిపోగా ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,502 మంది అదృశ్యం కాగా 1,379 మంది దొరికారు. ఇంకా 123 మంది ఆచూకీ లభించక ఆ కుటుంబాలు తీరని క్షోభను అనుభవిస్తున్నాయి. అదృశ్యమైన వారిలో చిన్నారుల నుంచి యువత వరకు ఉన్నారు. ఇందులో 18 ఏళ్లలోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధిక శాతం మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. ఇటీవల భద్రాద్రి జిల్లాలోని హాజీపూర్ ఘటనతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. వివాహం చేసుకుంటున్నారు.. యువతుల మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే అధికంగా ఉంటున్నాయి. సాధారణంగా యువతులు ఆదృశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెడుతుంటారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనర్ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొంత మంది యువతుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమ వివాహం చేసుకున్నారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడున్నర ఏళ్లలో మహిళల మిస్సింగ్ కేసులే అధికంగా నమోదవుతున్నాయి. మొత్తం 1,502 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఇందులో సుమారు 600లకుపైగా మహిళలు అదృశ్యమయ్యారు. కొందరుల ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తిరిగి వచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఇలా ఇందులో 500మంది ఆచూకీ లభించింది. ఇంకా 100 మంది మహిళల ఆదృశ్యం మిస్టరిగానే మిగిలిపోయింది. ఏదేమైనా చేతికందిన పిల్లలు కనిపించకుండా పోతున్నారనే బాధ తల్లిదండ్రులను వేధిస్తోంది. ఒక వేళా అదృశ్యమై పెళ్లిళ్లు చేసుకున్నా ఇంటికి రాకుండా బయటనే ఉండే పిల్లల గురించి తెలియక తల్లితండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనకు గురవుతున్నారు. పిల్లల అక్రమ రవాణా.. ఉమ్మడి జిల్లాలో అదృశ్యమైన కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుసుస్తోంది. అదృశ్యమైన 18 ఏళ్లలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు ఇటీవల తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబై, నాగ్పూర్, హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం. బాలబాలికల్లో కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతోనే ఇంటిని విడిచి వెళ్లిపోగా.. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్, చెన్నూర్ వంటి పట్టణాల నుంచి మనుషుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి కొంత మందిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ తిరిగి వదిలేయడం, మరికొంత మందిని వ్యభిచార గృహాలకు తరలించడం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలకు డబ్బు ఏరగా వేసి ఇలాంటి పడుపు రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మచ్చుకు కొన్ని సంఘటనలు æ మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్కు చెందిన ఓ బాలిక( 18) తమకు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉచుకొని దగ్గరి బందువైన ఓ యువకునికి తెలిసిన వారి ఇంట్లో పని చేసేందుకని 2014 డిసెంబర్ 21న హైదరాబాద్కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సదరు యువతి, యువకుడు కనిపించకుండా పోయారు. కొంత కాలం వేతికి ఎక్కడ ఆచుకి లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. æ 2018 అక్టోబర్ 14న మంచిర్యాల గోదావరిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని కుళ్లిపోయిన మృతదేహం లభించింది. తలకు తీవ్రమైన గాయం ఉండడంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 నెలలు అవుతున్న మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఎవరు హత్య చేసి ఉంటారు అనేది ఇంక మిస్టరీగానే మిగిలిపోయింది. మిస్సింగ్ కేసులపైదృష్టి సారిస్తాం జిల్లాలో మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మంచిర్యాల జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశమై ఈ కేసులపై చర్చిస్తాం. ఇప్పటికే సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు అన్ని కేసుల్లో దృష్టి సారిస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో పురోగతి సాధించేందుకు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోనూ, జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లాలో మహిళల అక్రమ రవాణా ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీçసులకు సమాచారం అందించాలి. 100 కాల్ చేస్తే పోలీసులు క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుంటారు. – రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల -
ప్రేమ వేధింపులకు బాలిక బలి
మంచిర్యాలక్రైం: ప్రేమికుని వేధింపులు భరించలేక ఓ బాలిక (17) తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిని బూర్ల రాజయ్య, స్వరూప దంపతుల కూతురు సంధ్యకు అదే గ్రామానికి చెందిన ఎండీ.అక్బర్ కొంతకాలం క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ వెంట పడుతున్నాడు. ఏడాదిన్నర క్రితం సంధ్య సీసీసీ నస్పూర్లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికెళ్లింది. ఆ సమయంలో అక్బర్ సంధ్యను కిడ్నాప్ చేశాడు. ఈ విషయంలో అక్బర్పై సీసీసీ పోలీస్స్టేషన్లో నాన్బెయిలేబుల్ కేసు నమోదైంది. అక్బర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అక్బర్ను మరిచిపోవాలని కుటుంబసభ్యులు సంధ్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మూడు నెలల జైలుశిక్ష అనంతరం బెయిల్పై వచ్చిన అక్బర్.. సంధ్యను వివాహం చేసుకుంటానంటూ మళ్లీ వేధించసాగాడు. అతడి వేధింపులు భరించలేని సంధ్య కుటుంబం ఇటీవల మంచిర్యాలలోని సున్నంబట్టివాడకు మకాం మార్చారు. అయినా అక్బర్ నుంచి వేధింపులు ఆగలేదు. ఇటీవల ఇంటికి వెళ్లి సంధ్యను తానే పెళ్లి చేసుకుంటానని, తనను కాదని ఎవరు చేసుకున్నా వారి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబస భ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తు న్నట్లు మంచి ర్యాల ఎస్సై ఓంకార్యాదవ్ తెలిపారు. -
నయా మోసగాళ్లు!
బెల్లంపల్లి: జనాల్లో ఉన్న మూఢనమ్మకాలే ఆ యుధంగా ఓ ముఠా టోపీ పెట్టేందుకు సిద్ధమైంది. ‘మరుగుమందు విక్రయం’ అంటూ పన్నాగం పన్నింది. కానీ, పోలీసుల అప్రమత్తతతో ఆ న యా మోసగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. కట్ చేస్తే.. ఆ ముఠా కటకటాలపాలైంది. ఈ సంఘటన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ వి.బాలు జాదవ్ గురువారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇలా వెల్లడించారు. మరుగుమందు పేరుతో కొందరు జనాలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారమందింది. దీంతో రామగుండం టాస్క్ఫోర్స్ సీఐ సాగర్ టీమ్తోపాటు తాళ్లగురిజాల పోలీసులు సంయుక్తంగా బెల్లంపల్లి మండలం దుగినేపల్లి గ్రామ శివారులోని ఓ మామిడితోటలో బుధవారం ఆకస్మిక దాడి చేశారు. తోటలో మరుగుమందును అమ్మడానికి ప్రయత్నిస్తున్న తుమ్మిడ మల్లేష్ (చిన్న రాస్పల్లి, దహెగాం మండలం), ఎలుకారి అంజన్న(చిన్న రాస్పెల్లి, దహెగాం మండలం), చింతకింది రమేష్ (నవభారత్కాలనీ, రామకృష్ణాపూర్), పాగిడి మధుకర్ (దుగినేపల్లి, బెల్లంపల్లి), కొండగొర్ల రాజేష్(జన్కాపూర్, కన్నెపల్లి మండలం), జాడి స్వామి (బొప్పారం, నెన్నెల మండలం), కరెకొండ రామన్న(బొప్పారం, నెన్నెల మండలం), జావీద్ (ఐబీ, తాండూర్ మండలం), వొడ్నాల సాయివిజయ్( 24 డీప్ ఏరియా, బెల్లంపల్లి మున్సిపాలిటీ), టేకం గంగు (మాలగొండి, ఆసిఫాబాద్)ను అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు. వారి నుంచి చెట్ల పసరు సీసాలు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పన్నాగమేమిటంటే.. ఈ మోసగాళ్లు తాము తయారు చేసిన మందును ముందు కోడిపై ప్రయోగిస్తారు. అప్పుడు మందు రాసినవారు చెప్పినట్లు నడుచుకుంటుందని నమ్మిస్తారు. ఆ తర్వాత ఈ కుట్రను తమ ప్రయోగంగా చెప్పుకుంటూ మందును ప్రజలకు అమ్ముతారు. అంటే, మనుషులకు కూడా ఈ మందు రాస్తే.. రాసినవారి చుట్టూ రాయించుకున్న వారు తిరుగుతారని నమ్మిస్తారు. ఇలా నమ్మించి మందును అమ్మి కోట్లలో దండుకోవడమే వారి వ్యూహం. కేవలం ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో మరుగుమందు పేరుతో సదరు ముఠా ఈ పథక రచన చేసినట్లు ఏసీపీ వివరించారు. మూఢనమ్మకాలు వీడాలి.. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ప్రజలు నమ్మినంతా కాలం ఇలాంటి నయా మోసగాళ్లు పుడుతూనే ఉంటారని, ఇప్పటికైనా వీరితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ సీఐ సాగర్, కానిస్టేబుళ్లు రాజేందర్, దేవేందర్, శేఖర్, సదానందం, హోంగార్డులు హైదర్, మహాంకాళితోపాటు తాళ్లగురిజాల పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. పట్టుబడ్డ నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ అల్లం నరేందర్, తాళ్ల గురిజాల ఎస్సై సీహెచ్.కిరణ్కుమార్ పాల్గొన్నారు. బాలుజాదవ్, ఏసీపీ -
బైక్ అదుపు తప్పి ఇద్దరు మృతి
ఆదిలాబాద్రూరల్: కార్యాలయ విధులు ముగించుకొని ఇంటికి వస్తున్నామని చెప్పిన యువకులు బైక్ అదుపు తప్పి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై హరిబాబు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బేల మండలకేంద్రానికి చెందిన జిలిపెల్లివార్ శుభం (25), అదే మండలం మనీయర్పూర్కి చెందిన తన మిత్రుడు మునేశ్వర్ దినేశ్ (27)తో కలిసి మంగళవారం శుభం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్కు వచ్చారు. ఇద్దరు మిషన్ భగీరథలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్లో భగీరథపై జరిగిన సమావేశం ముగించుకొని బేలకు వస్తుండగా చాందా (టి) శివారు ప్రాంతంలోని వంతెన వద్ద బైక్ అదుపు తప్పి వంతెన కింద పడిపోయారని తెలుస్తోంది. ఇద్దరి తలకు తీవ్రగాయాలుకావడంతో అక్కడిక్కడే మృతిచెందారు. బుధవారం అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులకు మృతదేహాలు కనిపించడంతో ఆరా తీయగా బేల మండల యువకులుగా గుర్తించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. శుభం తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా ఇద్దరు యువకుల తల్లులు అంగన్వాడీ టీచర్లుగా పని చేస్తున్నారు. యువకుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే రామన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ప్రియురాలి మరణం తట్టుకోలేక..
వాంకిడి(ఆసిఫాబాద్): ఇంట్లో పెద్దలు ప్రేమకు ఒప్పుకోలేదని తీవ్ర మనస్థాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడగా.. అది చూసి ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వాంకిడి మండలంలోని మహాగాంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్సెంగ్ గౌరుబాయి(18) అదే గ్రామానికి చెందిన మడపచ్చి భరత్(22) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వరుసకు బావమరుదళ్లు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గౌరుబాయిని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. అప్పటి నుంచి మనస్థాపానికి గురైన గౌరుబాయి తన ప్రేమకు తల్లిదండ్రులు ఇక ఒప్పుకోరన్న బాధతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇంటి పక్కవారు గమనించి మహారాష్ట్రలోని చికిలి పాటన్ గ్రామానికి చెందిన గౌరుబాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో గౌరుబాయి మృతిచెందింది. బహిర్భూమికి వెళ్లి ప్రియుడు.. ప్రియురాలి మరణ వార్త తెలుసుకున్న ప్రియుడు మడపచ్చి భరత్(22) శనివారం ఉదయం బహిర్భూమికి అని వెళ్లి ఇంటి పక్కనే గల చేనులో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే భరత్ స్పృహా కోల్పోతున్న భరత్ జరిగిన విషయాన్ని అన్నయ్య తిరుపతికి చెప్పాడు. దీంతో వెంటనే భరత్ను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆసిఫాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో భరత్ కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చిన్న వయసులోనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదచాయలు కమ్ముకున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. -
వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి
మంచిర్యాలఅర్బన్(చెన్నూర్): జాతీయ జంతువు, అత్యంత అరుదైన జాతికి చెందిన రాయల్ బెంగాల్ టైగర్ వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి నేలకొరిగింది. మందమర్రిలో స్వాధీనం చేసుకున్న పులి చర్మానికి సంబంధించిన చిక్కుముడి వీడింది. చెన్నూర్ అటవీ డివిజన్ శివ్వారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన పులి అవశేషాల(కళేబరం)ను శుక్రవారం కనుగొన్నారు. గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని చంద్రపూర్కు చెందిన స్వచ్ఛంద సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా దాడి నిర్వహించి మందమర్రి రామన్కాలనీలో గురువారం పులిచర్మాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పులి చర్మం విక్రయించే ముఠాకు చెందిన పెద్దపల్లి జిల్లా రామరావుపేట్కు చెందిన నర్సయ్యతోపాటు ముగ్గురిని, చర్మం, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని మంచిర్యాల అటవీశాఖ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసు టాస్క్పోర్సు, అటవీశాఖ అధికారులు శివ్వారం గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పులి మృతి విషయం వెలుగుచూసింది. పులి చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్లి చూడగా కళేబరం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. పక్షం రోజుల క్రితం అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చగా మరో వన్యప్రాణిని తరుముకుంటూ వచ్చి పులి విద్యుత్ షాక్తో మృతిచెందినట్లు నిందితుడు చెబుతున్నాడని అటవీ అధికారులు తెలిపారు. దుండగులు విలువైన పెద్దపులి చర్మాన్ని, గోళ్లను తీసుకుని అటవీ ప్రాంతంలో కళేబరాన్ని వదిలి వెళ్లారు. ఇదే కేసులో శివ్వారం గ్రామానికి చెందిన మల్లయ్య, బుచ్చిరాజయ్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనికి చెందిన టాక్సీ డ్రైవర్తోపాటు మొత్తం ఎనిమిది మంది పాత్ర ఉన్నట్లు అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అటవీశాఖ అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ పులి చనిపోయిన సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల్, అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం, మంచిర్యాల ఎఫ్డీవో వెంకటేశ్వరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. పదిహేను రోజుల క్రితం పులి చనిపోయిందని భావిస్తున్నట్లు మంచిర్యాల ఎఫ్డీవో వెంకటేశ్వరావు తెలిపారు. నాలుగేళ్ల వయస్సు కలిగి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశువైద్యులతో పులి కొంత భాగాన్ని కత్తిరించి పులికి సంబం«ధించిన పూర్తి వివరాల సేకరణకు ఫోరెనిక్స్ ల్యాబ్, సీసీఎంబీలకు పంపిస్తామని తెలిపారు. ఇంకా కేసుపై విచారణ సాగుతోందని, రెండు మూడు రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్, అటవీశాఖ సంయుక్తంగా పెద్దపులి మరణంపై విచారణ చేపడుతున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అటవీ ప్రాంతంలో ఉందా లేదా అన్న అంశాలపై విచారణ చేపట్టి కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగేళ్ల వయస్సు గల పెద్దపులి 12నుంచి 13 ఫీట్ల పొడవు ఉందని, దీనికి మార్కెట్లో విలువ ఉంటుందని భావించిన దుండగులు చర్మం, గోళ్లు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ ఉచ్చులతో చనిపోతే హత్య కేసులుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో తొమ్మిది మంది దుండగులను గుర్తించగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
నార్కట్పల్లి(నకిరేకల్): రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్ర ంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీలింగోటం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన స్రవంతి(25), హైదరాబాద్కు చెందిన రమ్య, నాగజ్యోతి ఇక్కడి కామినేని వైద్యకళాశాలలో హౌస్ సర్జన్ విద్య అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. ఆదివారం కావడంతో ఉదయం టిఫిన్ చేసేందుకు ముగ్గురు కలిసి హాస్టల్ నుంచి స్కూ టీపై సమీపంలోనే ఉన్న ఏపీ లింగోటం గ్రామాని కి వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత స్కూటీపై సూర్యాపేట వైపు బయలుదేరారు. మరో కిలోమీటర్ దూరంలో యూటర్న్ తీసుకుని హాస్టల్కు వచ్చేందుకు ప్రయాణిస్తున్నా రు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న గుర్తుతెలి యని వాహనం వీరి స్కూటీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో స్రవంతి డివైడర్పై పడింది. స్రవంతి తలకు బలమైన గాయం తగిలింది. స్థానికులు గమనించి వెంటనే 108లో కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి స్రవంతి మృతిచెందింది. నాగజ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబా ద్కు తరలించారు. రమ్య ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఇచ్చోడలో విషాదచాయలు.. ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ టీచర్స్ కాలనీకి చెందిన సామన్పల్లి సుదర్శన్ రెండో కుమార్తె స్రవంతి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్రవం తి చిన్నప్పటి నుంచే చదువులలో చురుకుగా ఉం డేది. కూతురును డాక్టర్ చేయాలని సుదర్శన్ కష్టపడి చదివించాడు. రెండు నెలలో చదువు పూర్తి చేసుకునే లోపే మృతిచెందడం అందరినీ కలచివేసింది. స్రవంతి మృతితో టీచర్స్కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రెండోవిడతకు నేడే ఆఖరు
ఆదిలాబాద్అర్బన్: రెండోవిడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ సమయం నేటితో ముగియనుంది. ఆదివారం చివరి గడువుకావడంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొదటి, రెండురోజులు దాదాపు సరాసరి సంఖ్యలో దాఖలైన నామినేషన్లు మూడోరోజు ఎన్ని నమోదవుతాయో వేచి చూడాలి. కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం యథావిధిగా కొనసాగింది. ఆయానామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కేంద్రాల వద్ద బారులు తీరడంతో స్వీకరణ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోపు కేంద్రంలోకి వెళ్లిన వారు నామినేషన్ వేసి బయటకురావాలంటే రాత్రి 7 గంటల వరకు సమయం పట్టింది. తలమడుగు మండలంలోని కుచులాపూర్, సుంకిడి, దేవాపూర్ గ్రామంలో అధికారులు రాత్రి వరకు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. రెండోరోజు.. జిల్లాలోని తలమడుగు, బజాహత్నూర్, బోథ్, గుడిహత్నూర్, నేరడిగొండ మండలాల్లోని 149 పంచాయతీలకు, 1208 వార్డులకు రెండోవిడతలో ఈనెల25న ఎన్నికలు జరగనున్నాయి. ఐదు మండలాల్లోని పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 162 నామినేషన్లు రాగా, వార్డుస్థానాలకు 553 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే రెండోరోజు కూడా అధికంగా బోథ్ మండలంలో 33 జీపీలకు 44 నామినేషన్లు రాగా, తక్కువగా నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల్లోని జీపీలకు 29 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 147 నామినేషన్లు, వార్డుస్థానాలకు 197 నామినేషన్లు దాఖలైన విష యం తెలిసిందే. కాగా రెండురోజులపాటు జరి గిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలిస్తే.. ఐదు మండలాల్లోని 149 సర్పంచ్ పదవులకు 309 నామినేషన్లు రాగా, 1208 వార్డులకు 750 నామినేషన్లు వచ్చాయి. నేడు తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే పంచా యతీలకు ఈనెల7 నుంచి 9 వరకు మూడురో జులపాటు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేష న్లు స్వీకరించారు. అయితే 10న నామినేషన్లను పరిశీలించిన అధికారులు నాలుగు వార్డు, ఒక సర్పంచ్ స్థానానికి వచ్చిన నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించిన విషయం తెలిసిం దే. తొలివిడత పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల13 ఆఖరు గడువు కావడంతో అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నామినేషన్ కేంద్రాల్లోనే ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. అనంతరం బరి లో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారు. తద్వారా ఏకగ్రీవ పంచాయతీ లెక్క తేలనుంది. -
బాలుడిపై వార్డెన్ లైంగికదాడి
ఆదిలాబాద్రూరల్: మావల మండలంలోని మావల శివారు ప్రాంతంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న బాలుడిపై అక్కడే విధులు నిర్వహిస్తున్న వార్డెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మావల ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..మావల శివారు ప్రాంతంలోని ఎస్ఆర్ ప్రైం కార్పొరేట్ స్కూల్ బాలుడిపై మంగళవారం రాత్రి అదే పాఠశాలలో రాత్రి విధుల్లో ఉన్న వార్డెన్ లైంగిక దాడి చేయగా విషయాన్ని బాలుడు తోటి విద్యార్థులకు, వసతి గృహాం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం పాఠశాలకు చేరుకున్న వారు జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆగ్రహించిన పోషకులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మావల ఎస్సై పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడి పోషకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో కొరవడుతున్న పర్యవేక్షణ.. పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు ఎంత అడిగితే అంతా ఫీజులు చెల్లిస్తున్నా, తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనపై ఆందోళన చెందుతున్నారు. నిర్వాహకుల పర్యవేక్షణ లోపంతో పాఠశాల, కళాశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెళ్లింట విషాదం
ఆదిలాబాద్రూరల్: ఎన్నో ఆశలతో.. మరెన్నో కలలతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన బోతున్న సమయంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకమైన ఈ రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం దేవాపూర్ ఫారెస్టు చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఘటన నవ దంపతుల కుటుంబాల్లో విషాదం నింపింది. కారులో ప్రయానిస్తున్న పెళ్లి కూతురు సోదరి మెట్పల్లి స్వాతి, స్థానికంగా ఉన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. మావల మండలంలోని రాంనగర్లో నివాసం ఉంటున్న మెట్పల్లి ముత్తమ్మ, అశోక్ దంపతుల పెద్ద కు మార్తె ప్రియాంకకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డెడ్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయి కుమార్తో గురువారం వడ్డేడ్లో పెద్దలు వి వాహం జరిపించారు. శుక్రవారం మావల మం డలంలోని రాంనగర్లో (పెళ్లి కూతురు ఇంటివద్ద) రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందులో పాల్గొనేందుకు నవదంపతులు బంధువులతో కలిసి వడ్డేడ్ నుంచి ఉదయం 9గంటలకు ఆదిలాబాద్కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో దేవాపూర్ చెక్పోస్టు వద్ద జాతీయ రహదారి 44పై ఉదయం 10.24 గంటల ప్రాంతంలో బరంపూర్ వైపు నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్న్ అవుతున్న క్రమంలో కారు అదుపుతప్పి బస్సును సైడ్నుంచి ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ప్రియాంక, ఆమె సోదరీ మణులు స్వాతి, ప్రణవి, కజిన్ బ్రదర్ సాయికు మార్, బంధువు రాజేశ్తో పాటు పెళ్లి కుమారుని మేనత్త దొనకంటి రాజమణి ఉండగా పెండ్లి కుమారుడు సాయికుమార్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఫారెస్టు అధికారులు, సిబ్బంది, స్థానికులు కారు అద్దాలను ధ్వం సం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో అడెపల్లి సాయికుమార్తో పాటు ఆయన మేనత్త రాజమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మావల ఎస్సై తెలిపారు. నిలిచి పోయిన ఫంక్షన్.. వివాహం జరిగిన మరుసటి రోజు పెళ్లి కూతురు ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో గంటలోపు భోజనాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇంతలో రోడ్డు ప్రమా దం చోటు చేసుకోవడంతో రిసెప్షన్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని రోదిం చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడ్డ వారికి నాణ్య మైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, తదితరులు ఉన్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
నిర్మల్టౌన్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్లో బుధవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ జాన్దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్కు చెందిన కుంట మోహన్రెడ్డి– భారతి దంపతుల కుమారై సోనికారెడ్డి(31)కి మూడేళ్ల క్రితం భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్కిరణ్రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక దంపతులు కొంత కాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో కుంగిపోయిన సోనిక ఇటీవలే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. కాగా బుధవారం శాస్త్రినగర్లోని ఓ అపార్ట్మెంట్లో తెలిసిన బంధువులను కలిసివస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సోనిక ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైకి ఎక్కి చెప్పులు, చేతిసంచి, చున్నీని అక్కడే వదిలేసి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా భవనంపైన కూల్డ్రింక్ సీసా ఉండడంతో ఏదైనా రసాయనం కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతియ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
తానూరు(ముథోల్): మండలంలోని మొగ్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం వివరాలు.. గ్రామానికి చెందిన పశువుల కాపరులు శనివారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఓ సంచిలో ఉన్న అస్థిపంజరం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంçఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించారు. మూడు నెలల క్రితం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సంచిలో మృతదేహన్ని తీసుకువచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముథోల్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర వాసిగా అనుమానం ... నాందేడ్ జిల్లా నాయేగావ్ తాలూకా కుంబర్గావ్ గ్రామానికి చెందిన సంతోష్తో తానూరు మండలం మొగ్లి గ్రామానికి చెందిన రుక్మాణి బాయితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. రుక్మిణిబాయి ఏడాది నుంచి మొగ్లి గ్రామంలోని తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. మూడు నెలల క్రితం సంతోష్ మొగ్లికి వచ్చి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సంతోష్ అచూకీ తెలియడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని అస్తిపంజరాన్ని పరిశీలించారు. సంతోష్ మృతదేహం కావచ్చని అనుమానిస్తున్నారు. అస్థిపంజరాన్ని ల్యాబ్కు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలని బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన రూ.ఐదు వేల అప్పు
రెబ్బెన(ఆసిఫాబాద్): అవసరం నిమిత్తం తీసుకున్న రూ.5వేల అప్పే ఆ యువకుడిని తనువు చాలించేలా చేసింది. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక యువకుడు పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకోగా శనివారం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన ఎస్సై దీకొండ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బొడ్డు కిరణ్బాబు(20) స్థానికంగా ఉన్న జిరాక్స్ సెంటర్లో పని చేస్తుండేవాడు. అవసరం నిమిత్తం రూ.5వేలను మండల కేంద్రానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రవితేజ వద్ద అప్పు తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం సకాలంలో చెల్లించడంలో విఫలం కావటంతో రవితేజ డబ్బుల కోసం అతడిని వేధించాడు. ఈ క్రమంలో గత నెల 30న మోటర్సైకిల్పై వస్తున్న కిరణ్ను అడ్డగించి బైక్ను లాక్కోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశాడు. ఈ క్రమంలో కిరణ్ ఇంటికి వెళ్లిన రవితేజ కుటుంబ సభ్యుల ఎదుటే అసభ్య పదజాలంతో ధూషించి అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్ క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్కడి నుంచి మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కిరణ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారగా హైదరాబాద్కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. మృతుడి నానమ్మ వెంకటనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బైక్ కొనివ్వలేదని..
కెరమెరి(ఆసిపాబాద్): బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో మండలంలోని ఖైరీ గ్రామానికి చెందిన వాడై వాసుదేవ్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. కెరమెరి ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలివీ..వాడై శంకర్–కమలాబాయి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దకు కూతుర్లు. వారిలో రెండో వాడు వాసుదేవ్ కెరమెరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా బైక్ కొనివ్వాలని తండ్రిని ఆడుగుతున్నాడు. కాని ఈ సంవత్సరం కుదరదని, వచ్చే సంవత్సరం కొనిస్తానని తండ్రి చెప్పడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు రెఫర్ చేయగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నకిలీ మావోయిస్టుల అరెస్ట్
కాగజ్నగర్ (ఆదిలాబాద్): కాగజ్నగర్ పట్టణంలో వ్యాపారులు, వివిధ సంస్థల వద్ద బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్నగర్ డీఎస్పీ సాంబయ్య తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం కిర్డీ గ్రామానికి చెందిన తిరుపతి, సూర్యపేట జిల్లా గుంజలూరు గ్రామానికి చెందిన సైదయ్య సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ పేరుతో పెట్రోల్పంపులు, జిన్నింగ్ మిల్లులు, విద్యాసంస్థలు, ఇతర వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేస్తున్నారని, కార్మిక సంఘాన్ని స్థాపిస్తామని చెబుతూ వేల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తుండడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత 6 నెలల క్రితం ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారని అప్పటి నుంచి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పట్టణ సీఐ వెంకటేశ్వర్, క్యాట్ టీం సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పట్టున్నారని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుస్తామని స్పష్టం చేశారు. అసభ్యకరంగా పోస్టు చేసిన ఇద్దరిపై కేసు ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేసి కించపరిచినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయడంతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామన్నారు. సంబంధిత గ్రూపుల అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా కాకుండా అసభ్య పదజాలంతో కూడిన పోస్టులు, బరిలో ఉన్న అభ్యర్థులపై కామెంట్ చేయడం సరికాదన్నారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. -
విషాదం నింపిన విహారం
ఉట్నూర్రూరల్: సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా పిక్నిక్ వెళ్లారు. మత్తడి ప్రాజెక్టు వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఎంజాయ్ చేశారు. ఇంటికి వెళ్లే సమయంలో ఫొటోలు దిగేందుకు ప్రాజెక్టులోకి దిగడంతో ప్రమాదవశాత్తు తమ్ముడు నీట మునిగాడు. కాపాడబోయిన అన్న కూడా నీటి మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ హృదయ విదారక సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరే సంతానం కావడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలివీ.. ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ గ్రామానికి చెం దిన జాదవ్ ప్రహ్లద్–బిజ్జుబాయిలకు అరుణ్(14), తరుణ్ (16) ఇద్దరు సంతానం. సెలవులు కావడంతో ఉట్నూర్లో ఉంటున్న పెద్దమ్మ కూతు రు శిల్ప ఇంటికి వచ్చారు. వారి పిల్లలతో కలిసి ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని మత్తడిగూడ చెరువు వద్దకు పిక్నిక్కు వచ్చారు. దినమంతా సరదాగా గడిపారు. అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాక మధ్యాహ్నం ఇంటికి వెళ్దామనుకునే సమయంలో కాసేపు నీళ్లతో ఆడుకుంటూ ఫొటోలు దిగుదామని ప్రాజెక్టులో దిగారు. లోతు తెలియక..ఈతరాక ఒక్కసారిగా అన్నదమ్ముళ్లలో అరుణ్ మునిగి పోతుండగా తమ్ముని కాపాడబోయి తరుణ్ కూడా నీట మునిగాడు. కుటుంబ సభ్యులు అరుపులు.. కేకలు వేయడంతో మత్తడిగూడ గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ప్రాజెక్టు లోతు ఉండటంతో మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు దాదాపు గంటసేపు గాలించి బయటకు తీశారు. కాగా అరుణ్ మండల కేంద్రంలోని సన్షైన్ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, తరుణ్ స్థానిక పూలాజీ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సైలు ఎల్వీ రమణ, జగన్మోహన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ప్రçహ్లద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద రక్షణ కరువు మండల కేంద్రంలోనే పేరుగాంచిన ఈ ప్రాజెక్టు వద్ద రక్షణ కరువైంది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా తవ్వకాలు జరపడంతో చెరువు లోతు తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో కనీసం కం చెలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు
జైపూర్(చెన్నూర్): తాను నమ్ముకున్న నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదని మనస్తాపం చెందిన రేగుంట గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి తన కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చాడు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ మలక్పేట్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందాడు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ను టీఆర్ఎస్ చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడంతో ముందు నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేగుంట గట్టయ్య మనస్తాపం చెందాడు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా, కేసీఆర్ సేవా దళం జిల్లా ఉపాధ్యక్షులుగా, ఇందారం 13వ వార్డు సభ్యులుగా ఉన్న గట్టయ్య ఓదెలు, ఆయన కుటుంబానికి దగ్గరయ్యారు. గట్టయ్య అనారోగ్యపరిస్థితుల్లో ఓదెలు ఆయనను ఆదుకోవడం అన్నివిధాలుగా సహకరించడంతో అభిమానం మరింత పెరిగింది. మరో సారి ఓదెలుకు టికెట్ వచ్చి మళ్లీ ఆయన గెలిస్తే తనకు కూడా ప్రాధాన్యతపెరుగుతుందని భావించిన గట్టయ్య టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ బాల్క సుమన్ 12న(బుధవారం) తొలిసారి నియోజకవర్గానికి రావడం ఇందారం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న గట్టయ్య తన నిరసనను వ్యక్తం చేయడానికి ప్రచార ర్యాలీ ప్రారంభించే ముందు ఎంపీ సుమన్ రాజీవ్ రహదారి పక్కన డీఎంఎఫ్టీ నిధులతో నూతనంగా నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా జై..కేసీఆర్..జై ఓదెలు అంటూ గట్టయ్య తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాను ఒంటిపై పోసుకోగా దాన్నిఅడ్డుకునే ప్రయత్నంలో అక్కడే ఎంపీకి స్వాగతం పలకడానికి మంగళహారతులతో వచ్చిన మహిళలపై పెట్రోల్ పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇందారం, రామారావుపేట, టేకుమట్ల, భీమారం గ్రామాలకు చెందిన 12మంది ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతోపాటు 3 రిపోటర్లకు గాయాలయ్యాయి. ముందు గట్టయ్య తనపై పెట్రోల్ పోసుకోవడంతో ఆయన 80శాతం కాలిపోయాడు. హుటాహుటిన మంచిర్యాలకు తరలించి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి తరలించి వైద్యం అందించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య మంగళవారం మృతి చెందాడు. ఇందారంలో విషాదం.. అందరితో కలివిడిగా ఉండే గట్టయ్య మృతి చెందడంతో ఇందారంలో విషాదం నెలకొంది. గట్టయ్య మరణ వార్త తెలిసి ఇందారం వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. గట్టయ్య మృతితో ఆయన కుటుంబ రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోధించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయి విజ్ఞేశ్(3) ఉన్నారు. బుధవారం ఇందారంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజ సేవలో గట్టయ్య.. ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య తన నాన్నమ్మ బుచ్చమ్మ దగ్గర పెరిగిన గట్టయ్య ఆమె మృతితో 2010లో గ్రాండ్ మా యూత్ స్థాపించారు. గ్రాండ్ మా యూత్ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రక్తదాన శిబిరాలు, దాతల సహకారంతో ఉచిత వైద్యశిబిరాల ఏర్పాటు, నిరుపేద విద్యార్థులకు విద్యాసామగ్రి తదితర సేవకార్యక్రమాలు చేపట్టి జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది పలుమార్లు అవార్డులు సైతం అందుకున్నారు. ఇందారం ఓపెన్కాస్టుకు వ్యతిరేకంగా గట్టయ్య ఉద్యమించారు. జేఏసీ నేతృత్వంలో తలపెట్టిన ఓపెన్కాస్టు వ్యతిరేక పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు మంచి మనస్సున గట్టయ్య మృతి చెందడం చాలా బాధకరమని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గట్టయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని ఆయన కుమార్తె సాయినివేదిత, కుమారుడు సాయివిజ్ఞేశ్పై రూ.5 లక్షల చొప్పున ఇద్దరిపై రూ.10లక్షలు బ్యాంకులో ఫిక్స్డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. అంత్యక్రియల ఖర్చు మొత్తం బరించుకుంటామని కుటుం బానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
మూడు నెలల క్రితమే ప్రేమపెళ్లి..
జైనథ్(ఆదిలాబాద్): కట్నం వేధింపులు తాళలేక జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన ఆవుల అంకిత(25) పెన్గంగలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దీపాయిగూడలోని లోక రవీందర్ రెడ్డి, అనురాధల కుమార్తె అంకిత, అదే గ్రామానికి చెందిన సాయి నాలుగు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ఆదిలాబాద్లో కాపురం పెట్టారు. కాగా సాయి తనకు రూ.3లక్షల కట్నం ఇవ్వాలని తరుచూ భార్య అంకితను వేధించేవాడు. అంకిత కుటుంబ సభ్యులకు ఫోన్చేసి, కట్నం ఇస్తేనే కూతురితో కాపురం చేస్తానని, లేదంటే తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు కలిసి ఆదిలాబాద్ నుంచి భోరజ్ గ్రామానికి వచ్చారు. అక్కడి నుంచి సాయి దీపాయిగూడకు వెళ్లగా, అంకిత మహారాష్ట్రలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి పిప్పల్కోటికి బయలు దేరింది. మార్గమధ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు బ్రిడ్జిపై నుంచి పెన్గంగ నదిలో దూకింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకుండాపోయింది. శనివారం ఉదయం మండలంలోని ఆనంద్పూర్ సమీపంలో బ్రిడ్జికి కూతవేటు దూరంలో మృతదేహం కనిపించగా జాలర్లు ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్సై తోట తిరుపతి శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. ఆపధర్మ మంత్రి జోగు రామన్న, డీఎస్పీ నర్సింహా రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్ మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. దీపాయిగూడలో అంత్యక్రియలు నిర్వహించగా మంత్రి జోగు రామన్న పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిండు జీవితాలు బలి వాస్తవంగా అంకిత, సాయి ఇద్దరిదీ రెండో వివాహమే. నాలుగు సంవత్సరాల క్రితం అంకితను జైనథ్ మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆవుల సాయికి అదే గ్రామానికి చెందిన యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. వీరి ఇద్దరు కూడా పెళ్లి జీవితాల్లో ఇమడలేకపోయారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినా వీరి మధ్య సంబంధం కొనసాగడంతో పాత జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చేశారు. అనంతరం పెద్దలను ఎదిరించి ఇద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. కాగా వీరి పెళ్లి జీవితం ఎంతో కాలం నిలవలేదు. కట్నం కోసం సాయి, అంకితను వేధించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మొదటి పెళ్లి కాదని, పెద్దలను ఎదిరించి రెండో వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాలకు దూరమయ్యారు. భర్త వేధింపులు అధికమవడంతో అంకిత తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సాయిపై 498(ఏ), 304(బి) సెక్షన్ల కింద వరకట్నం వేధింపులు, గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
తెల్లారితే పెళ్లి... అంతలోనే
జన్నారం(కరీంనగర్): పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రానికి వెళ్లడం ఇష్టం లేక నవవధువు సూపర్వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంటా విషాదం చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన టేకుమంట్ల రాజన్న, పంకజ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో రెండో కూతురు ఆమని(28) ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఎస్బీఐలో క్యాషియర్గా పనిచేస్తోంది. ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ నెల 4న నిశ్చితార్థం కూడా జరిపారు. గురువారం(నేడు) వివాహం జరగాల్సి ఉంది. ఆమనిని వివాహం చేసుకునే వ్యక్తి ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకుని ముంబయికి వెళ్లాల్సి ఉందనే బెంగతో ఉండేది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అయిన దూరంగా వెళ్లి ఉండటం ఇష్టలేక బుధవారం ఉదయం ఇంట్లో ఉన్న సూపర్వాస్మోల్ తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. పెళ్లికి అంతా సిద్ధం.. ఆమని వివాహం కోసం తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. సామగ్రి తెచ్చారు. పెళ్లి పత్రికలు పంచారు. టెంట్లు వేశారు. వంటమనిషిని మాట్లాడారు. వంట సామగ్రి తీసుకువచ్చారు. పచ్చనిపందిరి కోసం పొరకకు వెళ్దామనే సమయంలో అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులతోపాటు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతురాలి తల్లి పంకజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైద్యం అందక చిన్నారి మృతి
మంచిర్యాలక్రైం: ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో ఓ చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతిచెందిన సంఘటన మంచిర్యాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన వైద్యం అందకపోవడంతోదంపతుల కూతురు తనుశ్రీ (2)కి మూడు రోజులుగా జ్వరం వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు మంచిర్యాలలోని స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన గంటలోపే చిన్నారి మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులతో మాటాడి ఆందోళన విరమింపజేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. తనుశ్రీ చనిపోయే గంట ముందే ఆస్పతికి తీసుకువచ్చారని, అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపాడు. వైద్యం అందించలోపే మృతిచెందిందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదన్నారు. కాగా, చిన్నారి మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
శ్రీరాంపూర్(మంచిర్యాల): కృష్ణాకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు కనవేని పోషయ్య(56) ఆర్కే 5గని సమీపంలో నీలగిరి తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పోషయ్య మేడిపల్లి ఓసీపీలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య రాధ, కూతుర్లు మల్లేశ్వరి, మౌనిక, కొడుకు మహేందర్ ఉన్నారు. స్వస్థలం వరంగల్ జిల్లా గొల్లపల్లి మండలం. సింగరేణిలో పని చేస్తూ కృష్ణాకాలనీలోని కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 31న కుటుంబంతో సహా సొంతూరికి వెళ్లాడు. తరువాత ఒక్కడే ఇంటికి వచ్చి సోమవారం డ్యూటీకని బయలు దేరాడు. కాని తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తరువాత అతని ఇంటికి తిరిగిరాని విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతని ఆచూకీ కోసం వెతకగా అతని బైక్ శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఉన్న వైన్స్షాప్ వద్ద లభించింది. దీంతో బెక్ను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అతని కోసం గాలించగా శనివారం నీలగిరి తోటలో చెట్టుకు ఉరివేసుకొని శవమై కనిపించాడు. మృతుడు మద్యానికి బానిస అని, డ్యూటీలు కూడా సక్రమంగా చేసే వాడుకాదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ కారణంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానం కలుగుతోంది. ఈ మేరకు శ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోథ్ టు హైదరాబాద్..
బోథ్ : బోథ్ మండలం నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. కొంతమంది యువకులు హైదరాబాద్కు వెళ్తున్నానంటూ బ్యాగుల్లో గంజాయి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పబ్బుల వద్ద విక్రయిస్తున్నారు. పబ్బులకు వచ్చే ధనికులు, యువకులు, సెలబ్రటీలకు గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం. వీకెండ్లలో హైదరాబాద్ వెళుతూ విక్రయిస్తున్నారు. మరికొందరు హైదరాబాద్లో వాచ్మెన్లుగా ఉండి గంజాయి విక్రయాలు చేస్తున్నారు. వారానికి దాదాపు 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో గంజాయి రవాణ వారికి వృత్తిగా మారింది. వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాచ్మెన్లుగా పనిచేస్తూ.. బోథ్ మండలంలో సొనాల గ్రామ చుట్టు పక్కల గ్రామాల్లోని దాదాపు 20 నుంచి 30 మంది యువకులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజరా హిల్స్, దిల్సుఖ్నగర్, అమీర్పేట్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్సీటీ తదితర ప్రాంతాల్లో వివిధ పబ్బులల్లో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. వీరంతా 18 నుంచి 30 సంవత్సరాలలోపు యువకులే..ఈ ప్రాంతాల్లో చాలా మంది ధనికులు, సెలబ్రటీస్లు తిరుగుతూ ఉంటారు. పబ్బుల్లో రాత్రిపూట గంజాయిలు విక్రయిస్తూ వేల కొద్ది డబ్బును సంపాదిస్తున్నారు. అపార్ట్మెంట్లల్లో ఉండే ధనికులకు ప్రతీవారం గంజాయిని సరఫరా చేస్తున్నారు. తమ వాచ్మెన్ తన గ్రామం నుంచి గంజాయి తెచ్చివ్వడంతో తక్కువ ధరలకు కొంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రవాణా గంజాయిని హైదరాబాద్కు గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్తుతున్నారు. తాము తీసుకెళ్లే బ్యాగులో గంజాయిని ఉంచి వాసన రాకుండా దానికి సెంట్ కొడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బోథ్ మండల కేంద్రం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక వారం, మరోవారం నిర్మల్ నుంచి హైదరాబాద్కు బయలు దేరుతున్నారు. రాత్రుల్లో పబ్బుల వద్ద ఒక వ్యక్తికి విక్రయించి డబ్బులు తీసుకుని వచ్చేస్తున్నారు. మరోవైపు వాచ్మెన్లుగా , సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్న వ్యక్తులు తమ ఇంటి వద్ద నుంచి యువకులతో గంజాయిని తెప్పించుకుని గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ తతంగం గత సంవత్సర కాలంగా నడుస్తోందని తెలుస్తోంది. అయితే హైదరాబాద్కు సరఫరా చేసే యువకుల్లో ఎక్కువగా ఇంటర్, డిగ్రీలు చేస్తున్న విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం.. వీరికి గంజాయిని హైదారాబాద్కు తీసుకువస్తే డబ్బులు ఇస్తామంటూ వల వేస్తున్నారు. దీంతో గంజాయిని తీసుకువెళ్లి అక్కడ ఉండే వాచ్మెన్లకు సరఫరా చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి.. చాలా మంది యువకులు గంజాయినీ సరఫరా చేస్తే డబ్బులు రావడం గమనించడంతో ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడి రవాణా చేస్తున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఓ యువకుడు తమ ఇంటి వద్ద తన తండ్రి కూలీ పనులకు వెళుతుంటే తాను మాత్రం బైక్పై స్మార్ట్ఫోన్తో జల్సా చేస్తున్నాడు. అదేంటి అని ఓ వ్యక్తి అడిగితే..‘అన్న హైదరాబాద్కు గంజాయి ఇచ్చి వస్తే వారానికి 4 వేలు ఇస్తున్నారు.’’ అని సమాధానం చేప్పి వెళ్లిపోయాడు. దీన్ని బట్టి చూస్తే గంజాయి రవాణా ఎలా సాగుతోందో అర్థం అవుతోంది. బోథ్ మండలానికి చెందిన ఓ వ్యక్తి బంజారాహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్లో ఉండే కొంత మంది వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తులకు గంజాయిని బోథ్ మండలం నుంచి సరఫరా చేస్తున్నాడు. ప్రతీవారం తన గ్రామం నుంచి కొంతమంది యువకులతో గంజాయిని తెప్పించుకుని సరఫరా చేస్తూ వారానికి 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. అక్కడే ఉన్న పబ్బులో ఓ వ్యక్తి ద్వారా గంజాయి సప్లై చేస్తున్నారు. అంతర పంటగా సాగు... హైదరాబాద్లో గంజాయికి భారీ డిమాండ్ ఉండటంతో బోథ్ మండలంలోని కొన్ని చేలల్లో గంజాయని అంతరంపంటగా సాగు చేస్తున్నారు. దీన్ని యువకులతో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మూడు నుండి ఐదుగురు వ్యక్తులు బస్సుల్లో హైదరాబాద్కు తీసుకువెళుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు గంజాయి పంటను వేసినా.. గంజాయిని హైదరాబాద్ వంటి ఇతర ప్రదేశాలకు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, క్రిమినల్ కేసులు పెడతాం. యువకులు గంజాయిని రవాణా చేసి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఆయా గ్రామాల్లో తనిఖీలు చేపడతాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఎవరైనా గంజాయిని తరలిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలి. - జయరాంనాయక్, సీఐ -
సాయి దీక్షలోనే తుదిశ్వాస
జైనథ్(ఆదిలాబాద్): సాయి దీక్ష స్వీకరించి తన బైక్పై ఇంటికి వస్తున్న జైనథ్ మండలం సావాపూర్ గ్రామానికి చెందిన అరిగెల రవి (22)ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. బుధవారం ఉదయం అదిలాబాద్లోని క్రాంతినగర్ సాయిబాబా ఆలయంలో సాయి దీక్ష తీసుకునేందుకు అదే గ్రామానికి చెందిన బాలుడు వైభవ్ కృష్ణతో కలిసి వచ్చాడు. పూజాది కార్యక్రమాలు ముగించుకొని మాలధారణ తర్వాత ఇద్దరు కలిసి సావాపూర్కు తిరిగి పయనమయ్యారు. భోరజ్–బేల అంతర్రాష్ట్రీయ రహదారిపై తరోడ బ్రిడ్జి మరమ్మతుల కోసం రోడ్ను మూసివేయడంతో ఆదిలాబాద్ మండలం లాండ సాంగి రూట్లో బయలు దేరారు. కాగా జైనథ్ మండలం అడ గ్రామ సమీపంలో ఎదురుగా గుర్తుతెలియని వాహనం వచ్చి వీరిని ఢీకొంది. దీంతో రవి తలికి దెబ్బతగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వైభవ్ కృష్ణ కుడి కాలు విరిగింది. అటుగా వెళ్తున్న వారు వెంటనే 108లో రిమ్స్కు తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా రిమ్స్లో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. రవి తండ్రి ఆశన్న 8 సంవత్సరాల క్రితమే చనిపోవడంతో తల్లి విమల కుటుంబాన్ని పోశిస్తూ రవిని చదివిస్తోంది. రవికి ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నారు. కాగా రవి ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతూ.. కుటుంబానికి ఆసరా ఉండేందుకు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం కోసం రవి శవాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. గ్రామస్తులు, యువకులు చివరి చూపుకోసం భారీగా తరలివచ్చారు. కాగా> ఎదిగిన కొడుకును కళ్లముందే రక్తపు మడుగులో చూసిన తల్లి విమల హతాశురాలైంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదని...
నార్నూర్(ఆసిఫాబాద్): ఉన్నత చదువులు చదివింది. ఉద్యోగం కోసం అనేకసార్లు పోటీ పరీక్షలు రాసింది. అయినా జాబ్ రాలేదు. బతుకుదెరువు కోసం భర్తతో కలిసి ఖరీఫ్లో పత్తి సాగు చేస్తే ఆ పంట అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఉపాధి లేక జీవితంపై విరక్తి చెందిన రాథోడ్ జ్యోతి (30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మండలంలోని భీంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...జాదవ్ కమలాబాయి, జాను దంపతుల కూతురు జ్యోతికి అదే గ్రామానికి చెందిన రాథోడ్ బాగుబాయి–శేషరావుల కూమారుడు రాథోడ్ రాజేశ్తో గత పదేళ్ల క్రితం వివాహమైంది. ఆమె ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐటీడీఏ ద్వారా భర్తీ చేస్తున్న సీఆర్టీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. అది రాకపోవడంతో విద్యావలంటీర్ కోసం దరఖాస్తు చేసుకుంది. అదికూడా రాలేదు. దీంతో భర్త రాజేశ్తో కలిసి తనకు ఉన్న మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం దెబ్బతినడంతో ఆవేదనకు గురైంది. భర్త రాజేశ్ గత ఆదివారం తిరుపతికి వెళ్లగా ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఉంటున్న జ్యోతి ఉద్యోగం, ఉపాధి లేక పంట దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం తెల్లావారుజామున పురుగుల మందు తాగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వాంతులు కావడంతో మృత్యురాలి తల్లి కమలాబాయి హుటహూటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ తరలించగా అక్కడి వైద్యులు రిమ్స్కు రెఫర్ చేశారు. అక్కడికి వెళ్తుండగా మృతి చెందింది. మృత్యురాలికి ఎనిమిదేళ్ల బాబు, 12 ఏళ్ల పాప ఉంది. ఆమె తల్లి కమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. -
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
తాండూర్(బెల్లంపల్లి): అప్పటిదాక ఇంటి పనులు చేసుకుంటూ తమముందే కదలాడిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నీటి కోసమని రోడ్డుదాటుతున్న ఆమెను మృత్యువు బొగ్గుటిప్పర్ రూపంలో వచ్చి కబళించడం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే...తాండూర్ మండల కేంద్రానికి సమీపంలోని రాజీవ్నగర్లో నివాసం ఉండే షేక్ మహెబూబ్ అలీ, రైసా సుల్తానా (50) దంపతులు సోమవారం ఉదయం ఇంటి అవసరాల కోసం నీళ్లకు ఉపక్రమించారు. రైసా సుల్తానా రోడ్డు దాటి నీటి కోసం వెళ్తుండగా తాండూర్ ఐబీ ప్రాంతం నుంచి మాదారం వైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్ వేగంగా ఢీకొట్టి ఆమె మీద నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో రైసా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందింది. క్షణాల్లో ఆ మహిళ ఆకాల మరణం చెందడంతో చూపరులు, మృతురాలి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహంపై పడి కూతుళ్లు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. దీంతో అక్కడికి చేరుకున్న టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సాబీర్ హుస్సెన్ తదితరులు అక్కడికి చేరుకుని మృతురాలి కుటుంబీకులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. అర గంటపాటు రాస్తారోకో జరిగింది. సమాచారం అందుకుని సీఐ ఉపేందర్, ఎస్సై కె.రవి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని చేసుకుని తాండూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.