Abu Dhabi
-
యువరాజు షేక్హ్యాండ్ ఇవ్వలేదు.. అంతకు మించి
అబుదాబి : అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కొద్దిరోజుల క్రితం ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతని షేక్హ్యాండ్ కోసం బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్లో నిలబడింది. అతని కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడసాగింది. అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన యువరాజు చివరకు ఆ చిన్నారికి షేక్హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. దీంతో బాలిక తీవ్ర నిరాశకు గురైంది. తనవంతు రాగానే యువరాజు షేక్హ్యాండ్ ఇవ్వలేదని ఎంతగానో బాధపడింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వెంటనే ఆ యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్ మషీత్ అల్ మజ్రౌవీ ఇంటికి వెళ్లి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. చిన్నారితో కరచాలనం చేయడమే కాకుండా నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. దీంతో బాలిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువరాజుది గొప్ప మనసు అంటూ ఆయన చేసిన పనికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. -
ఇదేం బౌలింగ్రా నాయనా.. ఆడమ్స్ను మించిపోయావే!
అబుదాబి: శ్రీలంకకు చెందిన కెవిన్ కొతత్తిగొడ తన బౌలింగ్ యాక్షన్తో వార్తల్లో నిలిచాడు. అబుదాబి టీ10 లీగ్లో భాగంగా బంగ్లా టైగర్స్ తరఫున ఆడుతున్న కొతత్తిగొడ.. డెక్కన్ గ్లాడియేటర్స్తో మూడు రోజుల క్రితం తన వైవిధ్యమైన బౌలింగ్తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. గతంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఇదే తరహాలో బౌలింగ్ వేస్తూ హాట్ టాపిక్గా మారగా, ఇప్పుడు పాల్ ఆడమ్స్నే మించిపోయి మరీ బౌలింగ్ వేశాడు ఈ 24 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్. 90 దశకాల్లోని క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బంతి విసిరడానికి ముందు తలను పూర్తిగా కిందకు వంచి రెండు చేతులూ పైకి చాస్తూ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్కు బంతులేసేవాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ తరహా బౌలింగ్ యాక్షన్ మనకు దాదాపు కరువైందనే చెప్పాలి. తాజాగా కొతత్తిగొడ.. ఆడమ్స్ను గుర్తు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో గాలే క్రికెట్ క్లబ్ తరుపున లిస్ట్-ఎ, టీ20 మ్యాచ్ల్లో అరంగేట్రం చేశాడు. లిస్ట్-ఎ మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీసిన అతడు నాలుగు టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 2017 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన శివం కౌశిక్ది కూడా ఈ విధమైన ప్రత్యేకమైన బౌలింగ్ శైలే కావడం విశేషం. ఇప్పుడు కెవిన్ కొతత్తిగొడ బౌలింగ్ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో అభిమానులు విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే బౌలింగ్రా నాయనా.. పాల్స్ ఆడమ్స్ను మించిపోయావే అంటూ కామెంట్లు పెడుతున్నారు. #NewFavePlayer Kevin Koththiigoda. Consonant in a blender pic.twitter.com/9EmOBFuNOW — Paul Radley (@PaulRadley) November 16, 2019 -
‘నన్నెవరు కిడ్నాప్ చేయలేదు’
అబుదాబి: కిడ్నాప్ చేసి.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చినట్లు ప్రచారం జరుగుతున్న కేరళ యువతి ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చారు. ప్రేమించిన వ్యక్తి కోసం తాను అబుదాబి వెళ్లానని.. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వివరాలు.. కేరళ కోజికోడ్కు చెందిన 19 ఏళ్ల సియానీ బెన్ని అనే యువతి ఢిల్లీలోని జీసస్ అండ్ మేరి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18 నుంచి సియానీ కనిపించకుండా పోయారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సియానీ అబుదాబి వెళ్లినట్లు గుర్తించారు. దాంతో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సియానీ మీడియా ముందుకు వచ్చారు. తనను కిడ్నాప్ చేశారంటూ వస్తోన్న వార్తల్ని ఖండించారు. ప్రేమించిన యువకుడి కోసం తాను అబుదాబి వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా సియానీ మాట్లాడుతూ.. ‘అబుదాబిలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తితో 9 నెలల క్రితం నాకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. అతడిని వివాహం చేసుకోవడం కోసమే నేను అబుదాబి వెళ్లాను. నా ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. భారత్కు చెందిన నేను మేజర్ని. నా జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు నాకుంది’ అని తెలిపారు. అంతేకాక తన ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారానని అబుదాబి కోర్టులో కూడా తెలిపానన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం తనను కలుసుకోవడానికి అబుదాబి వస్తున్నారని పేర్కొన్నారు సియానీ. తనకు ఇండియా వచ్చే ఉద్దేశం లేదని.. ఇక్కడే ఉంటానని.. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని సియానీ స్పష్టం చేశారు. అంతేకాక తనను కిడ్నాప్ చేశారంటూ ప్రచారం చేస్తోన్న వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్తకు చెప్పకుండా లాటరీ.. కానీ..!
తిరువనంతపురం: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..! యూఏఈలో నివాసముండే కేరళకు చెందిన సోప్నా నాయర్కు ఊహించని విధంగా జాక్పాట్ తగిలింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్వహించే లాటరీలో బుధవారం ఆమెను భారీ లాటరీ వరించింది. వివరాలు.. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వారు బిగ్ టిక్కెట్ లాటరీ నిర్వహిస్తున్నారు. సోప్నా గతంతో మూడునాలుగు సార్లు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి బహుమతి లభించలేదు. ఇటీవల మరోసారి తన అదృష్టం పరీక్షించుకొంది. తన భర్తకు తెలియకుండా ఐదోసారి టికెట్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డ్రా.. బుధవారం జరిగింది. డ్రాలో సోప్నాకు 3.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.22 కోట్లు) బహుమతి వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక లాటరీ గెలుచుకోవడం పట్ల సోప్నా, ఆమె కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. గెలుచుకున్న సొమ్ములో కొంత నిరుపేదలను ఆదుకోవడానికి, మిగతాది తన కుటుంబ పోషణకు కేటాయిస్తానన్నారు సోప్నా. -
లాటరీల్లో భారతీయులను వరిస్తున్న అదృష్టం
దుబాయి: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన భారతీయులకు ఈ మధ్య లాటరీలు బాగానే తగులుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన డ్రైవర్ జాన్ వర్గీస్ ఓ లాటరీలో రూ.80 కోట్లకుపైగా గెలుచుకున్నాడు. తాజాగా మరో భారతీయుడికి (4 మిలియన్ అమెరికా డాలర్ల) రూ.27.7 కోట్ల విలువైన లాటరీ తగిలింది. యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేసిన అబుదాబి డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ సిరీస్ డ్రాలో షార్జాలో నివసిస్తున్న భారతీయుడు షోజిత్ కేఎస్ భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. షోజిత్ గతనెల 1వ తేదీన ఆన్లైన్లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే లాటరీ తగిలిన విషయం షోజిత్కు తెలియక నిర్వాహకులను సంప్రదించనే లేదట. దీంతో నిర్వాహకులే స్వయంగా షోజిత్ ఇంటికి వెళ్లి, లాటరీ మొత్తాన్ని అందజేశారు. ఇక ఇదే లాటరీ లక్కీ డ్రాలో బహిష్కృత భారతీయుడు మంగేశ్ మైందె బీఎండబ్ల్యూ కారును దక్కించుకున్నాడు. మరో ఎనిమిదిమంది భారతీయులతోపాటు ఒక పాక్ పౌరుడు కూడా ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. -
రేణువులలో నారాయణుడు
అక్షరధామ్ రూపురేఖలు, హవా మహల్ వర్ణమిశ్రాల మేళవింపుతో అబూధాబిలో మన దేశం నిర్మిస్తున్న స్వామి నారాయణ్ ఆలయం పూర్తయేందుకు కొంత సమయం పట్టవచ్చు. అయితే సమయంతో నిమిత్తం లేకుండా ఇప్పటికే ఆ నిర్మాణ ప్రయత్నాల్లోంచి మత సామరస్యం గుడి గంటల ధ్వనిలా ప్రపంచమంతటా వినిపిస్తోంది! ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఇటీవలే మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కూడా. బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ‘సహన శాఖ’ను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఫిబ్రవరి నెల మూడు, నాలుగు తేదీల్లో క్రై స్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి క్రై స్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్ అజర్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్ అజర్ అల్ షరీఫ్లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అని. ఆ డిక్లరేషన్ను పోప్, ఇమామ్లు సంయుక్తంగా విడుదల చేశారు. పాశ్చాత్య దేశాల్లో క్రై స్తవులు, అరబ్ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడారు. ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కృతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే కుంటుపడిపోతాం’ అని! మారుతున్న దేశం గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారతదేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘానిస్తాన్’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగానే ఈ హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఇప్పటికే ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉన్నాయి. – వి.నరేందర్ రెడ్డి సాక్షి వెబ్ డెస్క్ -
అబుదాబిలో తొలి హిందూ ఆలయం
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్వాసి శ్రీ అక్షర్–పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు. -
మళ్లీ మెరిసిన ఫించ్.. ఆసీస్దే సిరీస్
అబుదాబి: పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ను ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఆసీస్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్పై హ్యాట్రిక్ విజయాలు సాధించి ఆసీస్ సిరీస్ గెలవడంలో కెప్టెన్ అరోన్ ఫించ్ కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన ఫించ్.. మూడో వన్డేలో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్గా పెవిలియన్ చేరినప్పటికీ ఫించ్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును నడిపించాడు. అతనికి జతగా మ్యాక్స్వెల్(71), పీటర్ హ్యాండ్స్ కోంబ్(47)లు రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని చవిచూసింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్(46),ఇమాద్ వసీమ్(43), ఉమర్ అక్మల్(36), షోయబ్ మాలిక్(32)లు మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు సాధించగా, ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. బెహ్రాన్డార్ఫ్, నాథన్ లయన్, మ్యాక్స్వెల్లు తలో వికెట్ తీశారు. -
అబు ధాబిలో హిందూ ఆలయం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్ ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఏప్రిల్ 13వ తేదీన మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో సహనం శాఖను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో క్రైస్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి క్రైస్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్ అజర్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్ అజర్ అల్ షరీఫ్లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అన్న డిక్లరేషన్ను పోప్, ఇమామ్లు సంయుక్తంగా విడుదల చేశారు. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు, అరబ్ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడుతూ ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే సర్వనాశనం అవుతాం’ అని చెప్పారు. ఒకప్పుడు కరడుగట్టిన దేశమే! గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారత దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘానిస్తాన్’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ప్రస్తుతం జబ్బు పడడంతో ప్రభుత్వ పాలనా వ్యవహారాలను కూడా యువరాజే చూసుకుంటున్నారు. కేవలం 12 శాతం దేశస్థులు, 88 శాతం ప్రపంచ వలసకార్మికులను కలిగిన దేశంలో ఇలాంటి సంస్కరణలు తప్పవనే వారూ ఉన్నారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉండగా, అబుదాబిలో నిర్మించబోయే ఆలయమే మొదటిది. -
దుబాయ్లో పర్యటించిన తొలి పోప్
అబుదాబీ: చరిత్రాత్మక పర్యటన కోసం దుబాయ్లో అడుగుపెట్టిన క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం రాత్రి దుబాయ్ చేరుకున్న పోప్కు మిలటరీ పరేడ్తో అధికారులు ఆహ్వానం పలికారు. దీంతో దుబాయ్లో పర్యటించిన తొలి పోప్గా పోప్ ఫ్రాన్సిస్కు చరిత్రకెక్కారు. పోప్ బసచేసిన అబుదాబీ అధ్యక్ష భవనం వద్ద అధికారులు గౌరవ సూచకంగా గాలులోకి కాల్పులు జరిపారు. దుబాయ్లో జరగనున్న ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్కు హాజరుకావాలన్న అబుదాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఆహ్వానం మేరకు పోప్ యూఏఈలో పర్యటిస్తున్నారు. ‘సోదరుడిగా.. యూఏఈతో కలసి పనిచేసేందుకు, శాంతి మార్గంలో పయనించేందుకు ఇక్కడకు వచ్చాను’ అని ఈ సందర్భంగా పోప్ అన్నారు. దీనిలో భాగంగా పోప్తో సోమవారం జరిగిన భేటీపై యూఏఈ ప్రిన్స్ స్పందిస్తూ.. ‘పోప్ను కలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. సమావేశంలో భాగంగా పరస్పర సహకార మెరుగుదల, సహనశీలత, ప్రజలు, సమాజం కోసం శాంతి, స్థిరత్వం, అభివృద్ధి సాధించడానికి చేయాల్సిన ముఖ్యమైన విషయాలపై చర్చించాం’అని ప్రిన్స్ ట్వీట్ చేశారు. 1219లో ఈజిప్ట్ మాలెక్ అల్ కమేల్, స్టెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి మధ్య సమావేశాన్ని పోప్ గుర్తు చేసుకున్నారు. -
ప్రియున్ని చంపి.. కూర వండేసింది..!
అబుదాబి : యూఏఈకి చెందిన ఓ మహిళ తన ప్రియున్ని చంపడమే కాక అతని మాంసంతో ఓ మొరాకో వంటకాన్ని తయారు చేసింది. అనంతరం అక్కడ పని చేస్తోన్న భవన నిర్మాణ కార్మికులకు ప్రియుడి మాంసంతో వండిన వంటని వడ్డించింది. అబుదాబికి చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. కానీ సదరు వ్యక్తి ఆమెను కాదని మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడు. దాంతో తనను తిరస్కరించిన వ్యక్తిమీద పగ తీర్చుకోవాలని భావించిన మహిళ అతన్ని హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతని శరీరంలో కొన్ని భాగాలను ముక్కలు చేసి వండింది. మిగిలిన మృత దేహాన్ని కుక్కలకు వేసినట్లు స్వయంగా సదరు మహిళే కోర్టు విచారణలో తెలిపిందని ‘ఖలీజ్ టైమ్స్’ పేర్కొంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన సోదరుడు కనిపించడం లేదని మృతుడి తమ్ముడు.. సదరు మహిళ ఇంటి వద్ద తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. తొలుత మహిళను ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని చెప్పింది. అయితే ఆమె ఇంట్లో ఓ మనిషి దంతాలు కనిపించడంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితురాలి ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్ఏ పరీక్ష కోసం పంపగా అవి మృతుడివేనని తేలడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అబుదాబి : అబుదాబిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పాటలు, పిల్లల కోలాటం, డప్పుల చప్పుళ్లతో అబుదాబి ఇండియా సోషల్ సెంటర్ శుక్రవారం భక్తి భావంతో పులకించిపోయింది. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆటా పాటలతో హోరెత్తించారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రజలంతా ఒక్కచోట బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అబుదాబి తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ప్రముఖ కళాకారులు కోకిల నాగరాజు, గాయని వరంలు తమ ఆటా, పాటలతో ఉర్రూతలూగించారు. ఉత్తమ బతుకమ్మలు పదింటికి ఈ సందర్భంగా బహుమతులతో సత్కరించారు. చక్కటి నృత్య ప్రదర్శనలతో మహిళలు, పిల్లలు ఆకట్టుకున్నారు. దుబాయి, అబుదాబి వివిధ క్యాంప్ల నుండి అధిక సంఖ్యలో తెలంగాణ, తెలుగు వారు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన దంపతులకు, పిల్లలకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాజశ్రీనివాస రావు, పృథ్వీరాజ్, గోపాల్, వంశీ, గంగన్న, రాజశేఖర్, మహిళ కమిటీ సభ్యులు పావని, సౌజన్య, లక్ష్మీ, రోజా, అర్చన, పద్మజలు పాల్గొని విజయవంతం చేశారు. -
కారం సరిపోయిందా?
షూటింగ్ లేని సమయాల్లో వేరే పనులేవీ లేకుండా ఖాళీగా ఉంటే స్టార్స్ ఫన్నీగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. కొందరు గొంతు సవరించుకుని పాట పాడతారు. శ్రుతీహాసన్, సోనాక్షి సిన్హా లాంటి వారు పెయింటింగ్తో బిజీ అయిపోతారు. ఇంకొందరు పుస్తకంలో తలదూర్చుతారు. మరికొందరు గరిటె పడతారు. సల్మాన్ ఖాన్ మల్టీ టాలెండెడ్. పాడతారు. అలాగే పెయింటింగ్, వంట కూడా చేస్తారు. నిన్న (ఆదివారం) సల్మాన్కి బాగా తీరిక చిక్కినట్లుంది. వంట చేసే పనిలో పడ్డారు. సల్మాన్ ఖాన్ వంట చేస్తున్నది ఇక్కడ కాదు.. అబుదాబిలో. ‘భారత్’ సినిమా కోసం అక్కడికి వెళ్లారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కత్రినా కైఫ్ కథానాయిక. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే.. కర్రీలో కారం సరిపోయిందా? అని సల్మాన్ ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ. -
ఘనీని విచారించిన ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల విచారణ నాలుగో రోజైన శుక్రవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అబ్దుల్లా బాసిత్ సహా ఎనిమిది మందితో పాటు కొత్తగా ఘనీ అనే యువకుడికి నోటీసులిచ్చి పిలిచి ప్రశ్నించింది. ఫలక్నుమా ప్రాంతానికి చెందిన ఘనీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఆన్లైన్ ద్వారా ఐసిస్కు ఆకర్షితుడయ్యాడు. అంతేకాకుండా నగరానికి చెందిన వారినీ ఆకర్షించి సిరియా వెళ్లేలా ప్రోత్సహించాడు. ఈ విషయం గుర్తించిన రాష్ట్ర పోలీసులు అతడిని డిపోర్ట్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరారు. అలా అక్కడి ప్రభుత్వం 2016లో ఘనీని డిపోర్ట్ చేసింది. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు వర్గాలు కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఆపై కొన్నాళ్లు ఊరుకున్నా ఘనీ మళ్లీ ఐసిస్కు సానుభూతిపరుడిగా మారినట్లు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో శుక్రవారం అతడిని పిలిపించి వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఘనీతో పాటు ఆ ఎనిమిది మందినీ ప్రశ్నిస్తున్న ప్రత్యేక బృందం వీరు చెప్తున్న అంశాలను సరిచూస్తోంది. ఫర్హతుల్లాకు సమీప బంధువు... ఘనీ నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీకి సమీప బంధువు. నగరంలోని మాదన్నపేట సమీప కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్ (జేఈఎం)కు సానుభూతిపరుడిగా ఉండి 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్పై జరిగిన దాడి, 2004లో జరిగిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర తదితర కేసుల్లో నిందితుడిగా మారాడు. 2005లో నగర కమిషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడు. ఇతడిపై రెండు కేసులే ఉన్నప్పటికీ... నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలక వ్యక్తిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. జేఈఎం నుంచి లష్కరేతోయిబా (ఎల్ఈటీ) వైపు మళ్లిన అతను దేశీయ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అమీర్ రజా ఖాన్కు సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. -
‘అబుదాబి మాడ్యుల్’పై రెండో రోజూ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఐసీస్ అనుబంధ సంస్థ అబుదాబి మాడ్యుల్ అనుమానితుల విచారణ రెండో రోజైన బుధవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ ఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అను మానితుల్ని ప్రశ్నిస్తోంది. అబ్దుల్లా బాసిత్, ఖదీర్ సహా మొత్తం 8 మందిని వరుసగా రెండో రోజూ విచారించారు. ఒక్కొక్కరిని దాదాపు 6 గంటల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. వీరి వాంగ్మూలాల్లో 4 కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీం తో వారిని ఎన్ఐఏ కార్యాలయానికి పిలిపించిన పోలీసులు కొన్ని అంశాల గురించి ప్రశ్నించారు. రాత్రి 7కి అందరినీ ఇళ్లకు పంపిన అధికారులు మళ్లీ గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ విచారణ ప్రక్రియ మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉంది. -
స్వదేశానికి వస్తుండగా.. కోట్లు వచ్చిపడ్డాయ్!
అబుదబీ : అదృష్టం అంటే అతడిదే. పొట్టకూటి కోసం వెళ్లిన పరాయి దేశాన్ని శాశ్వతం వదిలి స్వదేశానికి వచ్చేస్తున్న వేళ లాటరీ రూపంలో అదృష్టం వీడ్కోలు పలికింది. ఏకంగా రూ.13.5 కోట్లు వచ్చి ఒళ్లో పడ్డాయి! ఈ లక్కీమేన్ కేరళ వాసి టోజో మాథ్యూ(30). అబుదబీలో సివిల్ సూపర్వైజర్గా పనిచేసిన ఆయన దుబాయిని వదిలి స్వదేశానికి వచ్చేస్తుండగా అదృష్ట దేవత కరుణించింది. అబుదబీ విమానాశ్రయంలో ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెలవారీ బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో దాదాపు రూ. 13.1 కోట్లు(7 మిలియన్ల దిర్హమ్లు) గెల్చుకున్నట్టు‘ ఖలీజ్ టైమ్స్’ వెల్లడించింది. ‘భారత్కు పయనమవుతూ జూన్ 24న అబుదబీ విమానాశ్రయంలో టికెట్ కొన్నాను. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న నా భార్యతో కలిసుండాలన్న ఉద్దేశంతో దుబాయ్ను వదిలిపెట్టాలనుకున్నా. లాటరీలో భారీ మొత్తంలో డబ్బు వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కేరళలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నది నా చిరకాల స్వప్నం. ఈ లాటరీతో నా కల తీరనుంద’ని టోజో మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తీసిన డ్రాలో ఆయనతో మరో 9 మంది లాటరీ గెలుచుకున్నారు. విజేతల్లో ఐదుగురు భారతీయులు ఉండటం విశేషం. -
అబుదాబి రాయల్ ఫ్యామిలీతో ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో చిత్రీకరణ ప్రస్తుతం అబుదాబిలో జరుగుతోంది. 50 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, చేజ్ సీన్లు చిత్రీకరించనున్నారు. దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు ఈ షూటింగ్ కోసం అబుదాబి చేరుకున్నారు. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న ప్రభాస్ అక్కడి రాజకుటుంబీకులతో సమావేశమయ్యారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళతో ప్రభాస్ సమావేశానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్తో పాటు ఆయన సోదరుడు, యూవీ క్రియేషన్స్ నిర్మాత ప్రమోద్ కూడా రాయల్ ఫ్యామిలీని కలిసిన వారిలో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
దుబాయ్లో భారతీయుడికి రూ.21కోట్ల లాటరీ
దుబాయ్: భారత్కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్లో జాక్ పాట్ కొట్టాడు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో మంగళ వారం జరిగిన బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా రూ.21.2 కోట్లు(12 మిలియన్ల దిర్హామ్లు) గెలుచుకున్నాడు. కేర ళకు చెందిన జాన్ వర్గీస్ ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. లాటరీ గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చిందని, ఎవరైనా తనని ఏప్రిల్ ఫూల్ చేయడానికి కాల్చేసి ఉంటారని భావించా నని జాన్ చెప్పారు. డబ్బుతో తొలుత స్మార్ట్ఫోన్ కొనుక్కుంటానని తెలిపాడు. తర్వాత కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మిగతా మొత్తాన్ని పేదవారికి కేటాయిస్తానని చెప్పాడు. -
లక్కీ డ్రాలో.. భారతీయులకు జాక్పాట్
దుబాయి: అబుదాబి ‘బిగ్ టికెట్ లక్కీ డ్రా’లో భారతీయులకు జాక్పాట్ తగిలింది. ఈ లక్కీ డ్రా వరించిన 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు. సోమవారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది. కేరళకు చెందిన థాన్సిలాస్ బాబు మాథ్యూస్ 7 మిలియన్ల దినార్లు (దాదాపు 12.5 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ లాటరీ తగటడం నమ్మలేకపోతున్నానని థాన్సిలాస్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత నెలలో రాఫెల్ బొనాంజా బిగ్ లక్కీ మిలియనీర్ లాటరీ టికెట్ నెంబర్ 030202 కొనుగోలు చేయగా, డ్రాలో పెద్ద మొత్తమైన 12.5 కోట్లు గెలుచుకున్నాడు. ఇదే డ్రాలో మరో ఆరుగురు భారతీయులు ఒక్కొక్కరు దాదాపు 18 లక్షలు గెలుపొందారు. బిగ్ టికెట్ లక్కీ డ్రా విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, బెహ్రెయిన్ కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బిగ్ టికెట్ లక్కీ డ్రా విజేతలు వీరే.. -
‘అజ్ఞాతవాసి పరిహాసమేమో అనుకున్నా..!’
దుబాయ్ : అదృష్టదేవత ఎప్పుడు ఎవరికి ఎందుకు వరమిస్తుందో తెలియదు! ఒకవేళ వరమిచ్చినా అది నిజమని నమ్మాలనిపించదు!! పరాయి దేశంలో దర్జాగా సెటిలైన ఓ భారతీయుయ కుటుంబం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి స్థతిలోనే ఉంది. సరదాగా కొన్న లాటరీ టికెట్కు రూ.21కోట్ల జాక్పాట్ లభించింది. దుబాయ్ సహా ఇండియా అంతటా మారుమోగుతోన్న ఈ వార్త వివరాల్లోకి వెళితే.. అలెప్పి(కేరళ)కు చెందిన హరి కృషన్ దుబాయ్లో బిజినెస్ డెవలపర్గా సెటిలయ్యారు. అతనికి భార్యా,కొడుకు ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్టులో ఒకటిరెండుసార్లు లాటరీ టికెట్లు కొన్నా బహుమతి తగల్లేదు. హరికి అదేమంత పెద్ద విషయంకాదు. ఇటీవల 500 దిరామ్స్పెట్టి ఇంకో లాటరీ టికెట్ కొని ఆ సంగతి మర్చిపోయారు. రెండు రోజుల కిందటే లాటరీ ఫలితాలు వచ్చాయి. హరి కొన్న టికెట్ నంబర్కే రూ.12లక్షల దిరామ్స్(సుమారు రూ.21కోట్లు) జాక్పాట్ తగిలింది. ‘‘రూ.21కోట్ల బంపరాఫర్ కొట్టేశారని ఫోన్ వచ్చింది.. ఎవరో అజ్ఞాతవాసి పరిహాసం చేస్తున్నాడేమో అనుకున్నా. అలా నాలుగైదు కాల్స్ తర్వాత ఓ మీడియా మితృడి నుంచి ఫోనొచ్చింది, అటుపై ఓ రేడియో స్టేసన్ నుంచి!! వెంటనే నా భార్యకు చెప్పాను.. లాటరీ కంపెనీ వెబ్సైట్ చూడమని. చివరికి ఆమె కన్ఫార్మ్ చేస్తేగానీ నమ్మలేదు. ఇంతటి అదృష్టం ఇంకా కలగానే అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు హరి. ఈ సొమ్మును తన భవిష్యత్ అవసరాల కోసం అట్టిపెట్టుకుంటానని ఆయన తెలిపారు. -
ఒక్కరోజు పైలట్!
పైలట్ అవ్వడమే ఆ చిన్నారి లక్ష్యం. అందుకే.. వయసు ఆరేళ్లే అయినా.. ఓ పైలట్కు ఉండాల్సిన స్కిల్స్ అన్నీ ఆ చిన్నారి సొంతం. ఆ చిన్నారి పేరు ఆడమ్. చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనే ఆసక్తితో యూట్యూబ్లో పైలట్ శిక్షణకు సంబంధించిన వీడియోలన్నీ చూసేశాడు. అబుదాబీకి చెందిన ఆడమ్కు విమానాలకు సంబంధించిన నాలెడ్జ్ను చూసి ఆశ్చర్యపోయిన ఎతిహాద్ ఎయిర్వేస్ సిబ్బంది ఆడమ్కు ఒక్కరోజు పైలట్గా ఉండే అవకాశాన్ని కల్పించారు. దీంతో తన డ్రీమ్ను ఆరేళ్ల వయసులోనే తీర్చేసుకున్నాడు ఆడమ్. ఆడమ్ను ఎతిహాద్ ఎయిర్వేస్ ట్రెయినింగ్ సెంటర్కు పిలిచి.. పైలట్ యూనిఫాం వేసి, ఎయిర్బస్ ఏ380కు ఒక్కరోజు కోపైలట్గా అవకాశం ఇచ్చారు. ఇక... ఆడమ్కు ఉన్న నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్ సమెరె యాక్లెఫ్ ఆడమ్ విమానం నడిపిస్తుండగా వీడియో తీసి.. ఎయిర్వేస్ అధికారుల పర్మిషన్తో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతే కాదు.. ఆ చిన్నారి కచ్చితంగా భవిష్యత్తులో పైలట్ అవుతాడని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఏ380 ఎయిర్బస్కు కెప్టెన్ అవ్వడమే ఆడమ్ ఆశయమట. తప్పకుండా ఆడమ్ కోరుకున్న ఎయిర్బస్కు కెప్టెన్ అవ్వాలని మనమూ కోరుకుందాం. -
భారతీయులకు జాక్పాట్..
దుబాయ్: అబుదాబి ‘బిగ్ టికెట్ లక్కీ డ్రా’లో భారతీయులకు జాక్పాట్ తగిలింది. ఈ లక్కీ డ్రా వరించిన 10 మంది విజేతలల్లో 8 మంది భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు. ఒక్కొక్కరు రూ. కోటి 70 లక్షల (2.7లక్షల డాలర్లు) ప్రైజ్మనీ దక్కించుకున్నారు. విజేతల్లో ఒక కెనడియన్, పిలిప్పీన్ దేశస్థులు మినహా మిగతా వారంతా భారతీయులే కాగా ఓ మహిళా కూడా ఉంది. యూఏఈ రాజధానిలో ప్రతినెలా లగ్జరీ కార్ల, ప్రైజ్మనీ లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమాన కేంద్రంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ‘ప్రస్తుతానికి నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. చాలా ఎగ్జైట్గా ఉంది. డబ్బులు ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తున్నా’ అని చంద్రేశ్ మోతివారస్ అనే విజేత తెలిపారు. తనకు తొలిసారి కాల్ వచ్చినప్పుడు నమ్మలేదని, ఆటపట్టించడానికే స్నేహితులు ఎవరో ఇలా చేస్తారనుకున్నానని, రెండోసారి నిర్వహకులు ఫోన్ చేసినపుడు షాక్ గురయ్యానని అభయ కుమార్ క్రిష్ణన్ అనే మరో విజేత పేర్కొన్నారు. ‘ఈ డబ్బును నేను నా స్నేహితునితో పంచుకుంటా. మేమిద్దరం కలిసే ఈ టికెట్ కొన్నాం. కొంత డబ్బు కేరళలోని చారిటీలకు ఇచ్చేస్తామ’ని మరో విజేత చెప్పుకొచ్చారు. గత పది ఏళ్ల నుంచి టికెట్లు కొంటున్నా. కానీ ఈ లక్కీ డ్రా తీసే రోజు మాత్రం తనకు గుర్తులేదని ఇంకొక విజేత తెలిపారు. -
అబుదాబీలో బతుకమ్మ సంబరాలు
అబుదాబీ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు అబుదాబీలో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్లో ఉంటున్న తెలంగాణ వాసులందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అబుదాబీ నగరంలోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు సుమారు పదిహేను వందల మంది తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫిదా మూవీ ఫేమ్ టి శరణ్య వేడుకలను మరింత తారస్థాయికి చేర్చింది. డప్పులతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మలతో ప్రాంగణానికి చేరగా, ప్రార్థన గీతంతో కార్యక్రమం మెదలైంది. చిన్నారుల ఆట, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడపడుచుల బతుకమ్మ ఆట, పాటలతో ఐఎస్సీ ఆడిటోరియం మరో తెలంగాణను తలపించింది. బతుకమ్మ సాంప్రదాయకంగా నిమజ్జనం చేస్తూ ప్రసాదాలు పంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అందమైన బతుకమ్మలకు, సాంప్రదాయకంగా తయారైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి నిర్వాహకులు రాజ శ్రీనివాస్, వంశీ, పృథ్వీ, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
భారీకాయురాలు.. ఎమ్మాన్ మృతి
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత భారీకాయంతో రికార్డులకు ఎక్కిన ఎమ్మాన్ అహ్మద్ అబూదాబిలోని బుర్జీల్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందారు. తన 37వ బర్త్డే వేడుకలను పూర్తి చేసుకున్న వారానికే ఆమె కన్నుమూశారు. ఎమ్మాన్ మృతిని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. కిడ్నీలు పనిచేయకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన 20 మంది నిపుణులైన వైద్యులు ఆమెను నిత్యం పర్యవేక్షించారని బుర్జీల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈజిఫ్టుకు చెందిన ఎమ్మాన్ అహ్మద్ అరుదైన వ్యాధివల్ల శరీరం భారీగా పెరిగిపోయింది. మొదట చికిత్స కోసం ఎమ్మార్ ముంబైలోని సైఫీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో గోడలను బద్దలు కొట్టాల్సి వచ్చింది. అంతేకాక ప్రత్యేక విమానంలో ఆమెను ముంబై తరలించారు. ఆమెను క్రేన్ల సాయంతో సైఫీ ఆసుపత్రి లోని ప్రత్యేక గదికి తరలించారు. కొంతకాలం ముంబైలోని చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆమెను అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా బుర్జీల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎమ్మాన్ అక్కడే మృతి చెందారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
కొచ్చి: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కోచి విమానాశ్రయంలో అబుదాబి-కోచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 2.39 గంటలకు చేరుకున్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కొచ్చి విమానాశ్రాయానికి చేరుకున్న బోయింగ్ 737-800 విమానం ఎయిర్ పోర్టులోని టాక్సీవేనుంచి పార్కింగ్ వే వైపు దూసుకుపోయింది. దీంతో ముంగు బాగం బాగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(సీఐఏఎల్) అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ, అలాగే డిఐజిసి ఏవియేషన్ రెగ్యులేటర్ దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి అందుబాటులో లేరు.