పంచాయతీ బకాయిలు రూ.72 కోట్లు | Panchayat arrears of Rs 72 crore | Sakshi
Sakshi News home page

పంచాయతీ బకాయిలు రూ.72 కోట్లు

Published Fri, Jul 18 2014 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

పంచాయతీ బకాయిలు రూ.72 కోట్లు

- వేధిస్తున్న సిబ్బంది కొరత     
 - అదనపు బాధ్యతలతో సతమతం     
 - గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి

 హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నుల బకాయిలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. పన్నులు, పన్నేతర బకాయిలు మే చివరినాటికి జిల్లా మొత్తం గా రూ.72కోట్లు ఉన్నాయి. దీంతో పన్నుల వసూలుకు అధికారులు అదను చూసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. ఇందులో ఇంటిపన్నులు, నల్లా పన్నులు. రెండవది పన్నేతర ఆదాయం. ఇందులో సంతలు, ఆంగళ్లు, రహదారి శిస్తు, వేలంపాటలు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం ఉంటుంది.

జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా పంచాయతీ సిబంది పన్నులు వసూలు చేయడం పూర్తిగా మర్చిపోయారు. దీంతో ఇంటి పన్నులు, నల్లా పన్నులు కలిపి రూ.45కోట్లకు పైగా, పన్నేతర బకాయిలు రూ.26కోట్లకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించడంతో పంచాయతీ పాలనకు ప్రాధాన్యం పెరిగింది. దీనికి తోడు పంచాయతీల ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ముఖ్యం గా పన్నులు వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చెప్పడంతో పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది.
 
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
జిల్లాలో 962 పంచాయతీలు ఉండగా కార్యదర్శులు మాత్రం 342 మంది మాత్రమే ఉన్నారు. సగటున ఒక్కో కార్యదర్శికి మూడు పంచాయతీల బాధ్యతలున్నాయి. దీనికి తోడు రెండేళ్లుగా సర్పంచ్‌లు లేక ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు చేశారే తప్ప పన్నుల వసూళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వెరసి బకాయిలు తడిసి మోపెడయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 98 మంది కార్యదర్శులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతవరకు అదనపు బాధ్యల నుంచి వారికి విముక్తి కలిగి పన్నుల వసూళ్లపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఇబ్బందే...
ప్రస్తుతం ‘మన గ్రామం-మన ప్రణాళిక’ క్యాక్రమంలో చేసే ప్రతి ప్రణాళిక గ్రామ ఆదాయాన్ని బట్టే చేయాలి. అయితే పేరుకు పోయిన బకాయిలు నూరుశాతం వసూలవుతాయని ఊహించి ప్రణాళికలు సిద్ధం చేయడంటే ఇబ్బందికరమే. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం పంచాయతీ సిబ్బందికి కత్తిమీద సాములాంటిదే.

Advertisement
 
Advertisement
 
Advertisement