నిప్పంటుకుంటే అంతే.. | No Fire Station In Ganneruvaram | Sakshi
Sakshi News home page

నిప్పంటుకుంటే అంతే..

Published Tue, Mar 26 2019 9:58 AM | Last Updated on Tue, Mar 26 2019 9:58 AM

No Fire Station In Ganneruvaram - Sakshi

సాక్షి, గన్నేరువరం (కరీంనగర్‌): వేసవికాలంలో ప్రారంభమైంది. ఈ ఏడాది నిప్పు కొలిమిలా ఎండలు ఉంటాయని ప్రభుత్వం, అధికారులు ముందస్తు ప్రకటనల్లో పేర్కొంటున్నారు. ఏమాత్రం ఏమారుపాటు ఉన్న అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. రానున్న రోజుల్లో ఏప్రిల్, మేనెలల్లో ఎండల తీవ్రత అధిక ఉంటుంది. ఈ సమయాల్లోనూ వరికోతలు ప్రారంభమై ధాన్యం, గడ్డివాములు తరలింపులు ఉంటాయి. అలాగే కొన్నిచోట్ల రహదారుల పక్కనే గడ్డవాములను రైతులు ఏర్పాటు చేసుకుంటారు. రైతులు, వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించడానికి వివిధ ప్రాంతాలకు వాహనాల్లో వాటిని తరలిస్తుంటారు. అంతేకాకుండా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనుకొని ప్రమాదాలు చోటుచేసుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సందార్భాల్లో రైతులకు, ప్రజలకు, వ్యాపారులకు అపార నష్టం జరుగుతుంది. అందుబాటులో ఫైర్‌ ఇంజిన్లు లేకపోవడంతో పాటు అందుబాటులో నీటివసతి లేక అగ్నిప్రమాదాలను అరికట్టానికి బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో జరిగిన ప్రమాదాలు 
మండలంలోని గుండ్లపల్లి స్టేజీ రాజీవ్‌ రహదారి పక్కన గల ఎస్‌బీఐలో 2014లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని నివారించేందుకు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కాని అక్కడి నుంచి ఇక్కడికి ఫైర్‌ఇంజిన్‌ వచ్చేవరకూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంత సమయానికి ముందుగా వచ్చిఉంటే నష్టం తగ్గి ఉండేందని స్థానికులు పేర్కొంటున్నారు. ఖాసీంపేటలో ఒక రైతు ట్రాక్టర్‌లో గడ్డివాముతో వ్యవసాయ బావి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్‌ లూజ్‌లైన్ల కారణంగా వైర్లు ట్రాక్టర్‌పై ఉన్న గడ్డివాముకు తగిలి మంటలు అంటుకున్నాయి. దగ్గరలో ఫైర్‌స్టేషన్‌ లేకపోవడంతో కాపాడే పరిస్థితి లేకపోయింది. 2017 ఏప్రిల్‌లో జంగపల్లి గ్రామం గుట్టపై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ప్రారంభమైన సమయంలో ఫైర్‌ ఇంజిన్‌కు సమాచారం అందించారు.

కరీంనగర్‌లో అందుబాటు లేక రాజన్నా సిరిసిల్లా జిల్లా నుంచి ఫైర్‌ ఇంజిన్‌ వచ్చింది. కాని అప్పటికే నష్టం జరిగిపోయింది. ఈ గుట్టపై జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో వేలమొక్కలు నాటారు. ఈ ప్రమాదంలో మొక్కలు మొత్తం మంటలకు బుడిదైపోయాయి. ఇలా మండలంలో ఏడాది పొడవునా అనేక అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడల్లా కరీంనగర్, సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాల కేంద్రాల్లోని అగ్ని మాపకకేంద్రాలకు ఫోన్‌చేస్తే ఫైర్‌ ఇంజిన్‌ రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి వచ్చే సరికి ప్రమాదం స్థాయి పెరిగి భారీనష్టం చోటు చేసుకుంటుంది. అయితే రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న గన్నేరువరం మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రజలు, పాలకులు డిమాండ్‌ చేస్తున్నా  నేటికి అది నేరవేరడం లేదు. 

అగ్ని మాపక కేంద్రాన్ని మంజూరు చేయాలి
మండలంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇటు కరీంనగర్‌ అటు సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల  జిల్లాల నుంచి రావాల్సి ఉంటుంది. ఏటుచూసిన మండలకేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గన్నేరువరం మండలం మెట్టప్రాంతం కావడంతో ఎక్కువ స్థాయిలో పశుగ్రాసాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటా యి. ఈ ప్రమాదాలు జరిగాయంటే క్షణాల్లో బుడిదవుతున్నాయి. ఇళ్లల్లో పత్తి సైతం మం టల్లో కాలిపోలినా ఘటనలు అనేకం ఉన్నాయి. మండలకేంద్రంలో ఇటీవల ఒక పూరిగుడిసెకు మంటలంటుకుని దగ్ధమైంది. ఇందు లో రూ.30వేల నగదుతో పాటు దుస్తువులు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. గతేడాది మండలకేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు సంభవించి 5 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. 40 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్‌ ఇంజిన్లు రావడం అలస్యమవుతుండడంతో వచ్చేలోపు పెద్ద ఎత్తున నష్టం చవిచూడాల్సి వ స్తుందని ప్రజలు వాపోతున్నారు.

మండలంలోని పత్తి రైతులు తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంట, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామ శివారులోని పత్తి జిన్నింగ్‌ మిల్లుకు పత్తిని రైతులు తీసుకెళ్తుంటారు. అనుకొని పరిస్థితుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్‌ ఇంజిన్‌ చేరుకోవడంలో అలస్యమైతే భారీనష్టాలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. మండలంలోని రాజీవ్‌ రహదారి సమీప గ్రామం గుండ్లపల్లి స్టేజీ కేంద్రంగా ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తే ఇటు బెజ్జంకి, ఇల్లంతకుంట అటు కోహెడ మండలాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మండలకేంద్రానికి అగ్ని మాపక కేం ద్రాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

ఎస్‌బీఐలో జరిగిన అగ్ని ప్రమాదం (ఫైల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement