![Prime Minister Modi Speaks To Indian Soldiers In Ladakh - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2020/07/3/prime%20minister.jpg.webp?itok=yaXa_15j)
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడ్డారు. విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని చెప్పారు. భారత్ శాంతి యత్నాలకు స్పందించని చైనాపై మండిపడుతూ బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు.భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు భారత్లో లడఖ్ అంతర్భాగమని స్పష్టం చేశారు.
కష్టసమయంలో మనం పోరాటం చేస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని అన్నారు. శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు. మీ కసిని పోరాట పటిమను ప్రత్యర్ధులకు రుచిచూపించారని అన్నారు. లడఖ్ నుంచి కార్గిల్ వరకూ మీ ధైర్యం అమోఘమని సైనికులను ప్రశంసించారు. దేశమంతా సైనికులను చూసి స్ఫూర్తి పొందుతోందని అన్నారు. మీ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని, మీ త్యాగాలను దేశం మరువదని జవాన్ల సేవలను కొనియాడారు.
సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం నిశ్చింతంగా ఉందని అన్నారు. మన సైనికులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. మనం పిల్లనగ్రోవిని ప్రేమిస్తాం..విష్ణుచక్రాన్నీ ప్రేమిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ప్రధానమంత్రి మోదీ అంతకుముందు గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత జవాన్లను సైనిక స్ధావరం నిములో పరామర్శించారు. సరిహద్దు వివాదంపై భారత్-చైనా కమాండర్ స్ధాయి సమావేశాల్లో పాల్గొన్న సైనికాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గల్వాన్ ఘటనపై స్ధానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు. చదవండి : చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్
Comments
Please login to add a commentAdd a comment