‘అగ్రిగోల్డ్’ పర్యవేక్షణ కమిటీకి సౌకర్యాలు కల్పించాల్సిందే | Agrigold Monitoring committee facilities | Sakshi
Sakshi News home page

‘అగ్రిగోల్డ్’ పర్యవేక్షణ కమిటీకి సౌకర్యాలు కల్పించాల్సిందే

Published Fri, Apr 8 2016 1:43 AM | Last Updated on Mon, May 28 2018 3:04 PM

Agrigold Monitoring committee facilities

సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల వేలానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందేనని ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. పర్యవేక్షణ కమిటీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకోవద్దని, అలా చేస్తే కేసులో వాదనలు వినిపించేందుకు అనుమతించబోమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది.

ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు వసూలు చేసి, వాటిని చెల్లించకుండా ఎగవేసిందని.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement