విద్యార్థిని మింగిన హోలీ | student died in tractor acident | Sakshi
Sakshi News home page

విద్యార్థిని మింగిన హోలీ

Published Thu, Mar 24 2016 3:54 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థిని మింగిన హోలీ - Sakshi

టేకులచెరువు(బూర్గంపాడు) :  పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. హోలీ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థిని ట్రాక్టర్ బలిగొంది. ఈ సంఘటన టేకులచెరువు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కువ్వారపు నాగేశ్వరరావు, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్(15) స్నేహితులతో కలిసి హోలీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో కిందపడిన ప్రవీణ్ పైనుంచి ట్రాక్టర్ వెళ్లింది. తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, ట్రాక్టర్ నడుపుతున్న తేజావత్ రవి కూడా ప్రవీణ్ స్నేహితుడే. ప్రస్తుతం ఇద్దరు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ప్రవీణ్ మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై రామకృష్ణ పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బూర్గంపాడు సివిల్ ఆస్పత్రికి తరలించి శవపంచనామా నిర్వహించారు.

 పలువురి సంతాపం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి.. సంతాపం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, సర్పంచ్ పాండవుల వినోద, పాండవుల దర్గయ్య తదితరులు సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement