దర్జాగా భూములు కబ్జా | Government Lands occupied In srikaklum | Sakshi
Sakshi News home page

దర్జాగా భూములు కబ్జా

Published Sun, Oct 13 2019 10:51 AM | Last Updated on Sun, Oct 13 2019 10:51 AM

Government Lands occupied In srikaklum - Sakshi

సాక్షి, శ్రీకాకుళం :  ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న అక్రమార్కులు దర్జాగా అక్రమ కట్టడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వైపు పేదలకు పట్టాలు ఇచ్చేందుకు గాను రెవెన్యూ అధికారులు భూముల కోసం సర్వేలు చేస్తుండగా మరోవైపు రియల్టర్‌లు సర్వే నంబర్లు మార్చుస్తూ ప్రభుత్వ భూములకే పంగనామం పెడుతున్నారు. దీనికి తోడు ఆర్‌ఐ, వీఆర్వోలు సైతం చూసిచూడనట్టుగా వ్యవహారించడం, అక్రమార్కులకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ భూములను చాప కింద నీరులా రియల్డరంతా కలిసి  గెద్దెల్లా లాక్కోవడం ఎక్కడికక్కడే  జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేసే దిశగా భూములు కోసం రెవెన్యూ సిబ్బందితో మండలంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేపట్టగా, సెంటు భూము లేదని సర్వేయర్లు ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వడం నిత్యకృత్యంగా జరుగుతోంది. ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది ఆక్రమణదారులు పాగ వేస్తూ రెవెన్యూ యంత్రాంగాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకొని ఎంతో కొంతవారికి  ముట్టచెబుతూ దొడ్డిదారిన నిర్మాణాలు చేపడుతున్నారు. విలువైన స్థలాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ బిల్డింగ్‌లు వెలుస్తున్నా రెవెన్యు యంత్రాంగం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.  

మండల పరిధిలోని మునసబుపేటలో గల విధాత్రి స్కూల్‌ను ఆనుకొని సింగుపురం రెవెన్యూ పరిధిలో గల ల్యాండ్‌ సీలింగ్‌ భూమిలో ఓ మండల టీడీపీ నాయకుడు అనుచరుడు ఏకంగా 80 సెంట్లు విస్తీర్ణంలో ఓ భవంతిని అక్రమంగా నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. ఇది రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్‌ 446లో గల ప్రభుత్వ ల్యాండ్‌ సీలింగ్‌ భూముల పరిధిని చూపిస్తుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో ఇక్కడ సెంటు భూమి ధర రూ.5లక్షలు పలుకుతోంది. సుమారు నాలుగుకోట్లు విలువైన భూమిని కేవలం పక్క సర్వే నంబర్‌తో చేజెక్కించుకున్నారు. ఇప్పటికే మూడు ఫ్లోర్‌ల బిల్డింగ్‌ నిర్మాణం పూర్తయింది.

గత ప్రభుత్వ పాలనలోనే
ఈ బిల్డింగ్‌ వ్యవహారమంతా గత టీడీపీ ప్రభుత్వ పాలనలోనే జరిగింది. మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తన సమీప బంధువుకు సంబంధించినది కావడంతో ఆయన కనుసైగల్లోనే పూర్తిస్థాయిలో ఆమోదమైనట్టు సమాచారం. ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా కావడంతో ఆ పరిసర ప్రాంతంలో గల భూ ములకు మరింత గిరాకీ పెరిగింది. దీంతో ప్రభుత్వ భూములోనే ఆ బిల్డింగ్‌ నిర్మాణ పనులు ఆగమేఘాలపైన జరుగుతున్నాయి.   

చక్రం తిప్పుతున్న వీఆర్వో ఎవరు
వాస్తవంగా రెవెన్యూ రికార్డుల భూముల వ్యవహారంలో ఓ వీఆర్వో తనదైన శైలిలో చక్రం  తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వీఆర్వోల బదిలీల వ్యవహారంలో కుడా ఆయన చేతివాటం తీవ్రస్థాయిలో ప్రదర్శించినట్టు సమాచారం. ప్రభుత్వ భూముల సమాచారంపై ముందస్తుగా రియల్టర్లు ఈయన్నే సంప్రదిస్తారు. ప్రస్తుతం విదాత్రీ స్కూల్‌ పక్కన ఉన్న ల్యాండ్‌సీలింగ్‌ భూముల్లో వెలసిన మూ డంతస్తుల భవంతిలో కుడా ఈయన చేతివాటంతోనే సర్వే నంబర్‌లలో మార్పులు చేర్పు లు జరిగినట్టు పలువురు చెబుతున్నారు.

నా దృష్టికి రాలేదు
సింగుపురం రెవెన్యూ పరిధిలో గల ల్యాండ్‌ సీలింగ్‌ భూముల్లో ఓ భవంతిని అక్రమంగా నిర్మిస్తున్నారన్న విషయం నా దృష్టికి రాలేదు. మరో రెండు రోజుల్లో ఆయా భూములపై సర్వే నిర్వహిస్తాం. అక్రమంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఉగాది నాటికి పట్టాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భూమలు కోసం సర్వే చేయమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడా ఉన్నాయో ఆ దిశగా సర్వే చేస్తున్నాం.  
– ఐటి కుమార్, తహసీల్దార్, శ్రీకాకుళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement