వైద్యుడి నిర్లక్ష్యం.. బాలికకు వైకల్యం | Girl Handicapped Due To Doctor's Negligence In Adilabad | Sakshi
Sakshi News home page

వైద్యుడి నిర్లక్ష్యం.. బాలికకు వైకల్యం

Published Thu, Sep 5 2019 10:56 AM | Last Updated on Thu, Sep 5 2019 10:56 AM

Girl Handicapped Due To Doctor's Negligence In Adilabad - Sakshi

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌): ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా అభం..శుభం.. తెలియని ఆరేళ్ల బాలిక శాశ్వత వికలాంగురాలిగా మారిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని ప్రతాప్‌ నాయక్‌ అనే ఓ వైద్యుడు బోథ్‌ సివిల్‌ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ ఇచ్చోడలో ప్రైవేట్‌ క్లీనిక్‌ నడుపుతున్నాడు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన కళ్యాణ్‌కర్‌ బాబు కూతురు సారిక నాలుగునెలల క్రితం ఇంట్లో ఆడుకుంటూ పడిపోయింది. దీంతో చేయి వా పురావడంతో మండల కేంద్రంలో ఉన్న ప్రతాప్‌ నాయక్‌ క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. సారికకు ఎక్స్‌రే తీయించి చేతికి ఉన్న బొక్క విరిగిపోయిందని, సిమెంట్‌ పట్టి కట్టి పంపించాడు. నాలుగైదు రోజుల తర్వాత బాలిక చేయి వాచిపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. సిమెంట్‌ పట్టి తొలగించి చూస్తే చేయి పూర్తిగా కుళ్లిపోయింది.

దీంతో బాధితులు డాక్టర్‌ను నిలదీశారు. వైద్యఖర్చులు తానే ఇస్తానని ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అయినా చేయి నయం కాకపోగా మరింత ఇన్‌ఫెక్షన్‌ అయ్యింది. దీంతో హైదరాబాద్‌కు పంపించి అక్కడ ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వారంరోజుల పాటు చికిత్స చేయించాడు. అక్కడి వైద్యులు చేయి నయం కాదని, తిరిగి వెళ్లిపోవాలని తిప్పిపంపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ప్రతాప్‌ నాయక్‌ను మరోసారి నిలదీశారు. దీంతో సదరు వైద్యుడు జరిగిన పరిణామానికి పూర్తి బాధ్యత వహిస్తూ పాప కోలుకునేంత వరకు తానే ఖర్చులు భరిస్తానని ఒప్పంద పత్రం రాసిచ్చాడు. రోజురోజు కు పాప చేయి క్షీణించిపోయి వంకర్లు తిరుగుతుండడంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు రిమ్స్‌ వైద్యులను సంప్రదించారు.

అప్పటికే  60 శాతం మేర చేయి పనికిరాకుండా పోయిందని, భవిష్యత్‌లో చేయి కొట్టివేసే పరిస్థితి కూడా రావచ్చని సూచించారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు డాక్టర్‌ ప్రతా ప్‌ నాయక్‌ను మంగళవారం ఆసుపత్రికి వెళ్లి నిలదీయడానికి ప్రయత్నించారు. అతని అనుచరుడు డాక్టర్‌ను కలవకుండా చేసి దిక్కున్నచోట చెప్పుకొమ్మని వారిని ఆసుపత్రి నుంచి గెంటివేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బుధవారం ఇచ్చోడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వైద్యుడు ప్రతాప్‌నాయక్, అతని అనుచరుడు గణేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుల్లయ్య తెలిపారు. తమ కూతురుకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement