Published
Fri, Mar 22 2019 1:14 PM
| Last Updated on Mon, Mar 25 2019 1:23 PM
మాకవరపాలెం: దివ్యాంగులు ఒక్కటయ్యారు. కులమతాలు పక్కనపెట్టారు. ప్రాంతం వర్గం వేరైనా అందరి సమక్షంలో వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే. చింతపల్లికి చెందిన షేక్.దర్గాబాబు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. దీంతో దర్గాబాబును మోహన్ అనేవ్యక్తి కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో చేర్చాడు. అప్పటినుంచి సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్రాయ్ సంరక్షణలోనే ఉంటూ ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందాడు. ఇక ఇమ్మానుయేలు ఎడ్యుకేషనల్ క్యాంపస్లో బీఈడీ కూడా పూర్తి చేసిన దర్గాబాబు ఇక్కడే ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు.
దర్గాబాబు బాగోగులు చూసుకునే జీవన్రాయ్ దంపతులు వివాహ విషయంలోనూ కూడా శ్రద్ధ తీసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సిగనం కృష్ణవేణితో వివాహం కుదిచ్చారు. ఈ మేరకు గురువారం తామరంలో జీవన్రాయ్, నలినీరాయ్ చేతుల మీదుగా వీరిద్దరి ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు ఏ విషయంలోనూ తక్కువ కాదని, వారికి ప్రోత్సాహం, సహాయ సహకరాలు అందిస్తే వారికాళ్లమీద వారు నిలబడతారన్నారు. ఇలాంటి వివాహాల ద్వారా సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగ శాఖ ప్రతినిధులు, ఇమ్మానుయేలు సిబ్బంది నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment