బీఎస్‌–6 వాహనాలకు పెట్రోల్‌ కూడా ప్రత్యేకం | BS 6 Vehicles Ready For Transport From April | Sakshi
Sakshi News home page

బీఎస్‌–6 వాహనాలు రెడీ

Published Wed, Mar 18 2020 1:21 PM | Last Updated on Wed, Mar 18 2020 3:44 PM

BS 6 Vehicles Ready For Transport From April - Sakshi

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏప్రిల్‌ నెలలో బీఎస్‌–6 వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 (భారత్‌ స్టాండర్డు–6) వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం విదితమే. కాలుష్యానికి కారణమవుతున్న బీఎస్‌–4 వాహనాలు విక్రయాలు ఈ నెల 31 నుంచి నిలిపి వేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ ఇప్పటికే డీలర్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చింది. ఈ నెల 31 లోగా బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని డీలర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గడువు తీరిన తర్వాత రిజిస్ట్రేషన్లు అంగీకరించేది లేదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషను లేకుండా వాహనాలు తిరిగితే సీజ్‌ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.

భారత్‌ స్టాండర్డ్‌ వాహనాలు వచ్చాయి ఇలా..
వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్య ఉద్గారాలను బట్టి, ఇంజన్‌ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నారు. దీన్నే భారత్‌ స్టాండర్డ్‌ వాహనాలుగా చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు బీఎస్‌–2,3,4...తాజాగా బీఎస్‌ 6 వాహనాలు వచ్చాయి. 2001 నుంచి 2005 మధ్యలో బీఎస్‌–2 వాహనం రోడ్లపై హల్‌చల్‌ చేశాయి. 2005లో బీఎస్‌–3 వాహనాలు మార్కెట్లోకి వచ్చింది. 2017లో బీఎస్‌–4 ఇప్పుడు ఏప్రిల్‌లో బీఎస్‌–6 వాహనం అందుబాటులోకి రానుంది. ఇది ఇప్పటికే మార్కెట్‌లో వాహన ప్రియులను ఊరిస్తోంది.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో..
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బీఎస్‌–6 వాహనం వస్తోంది, ఇంజిన్‌ సామర్థ్యం మెరుగ్గా ఉండి వేగం తగ్గకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రధానంగా కాలుష్యం తక్కువగా వదిలే విధంగా దీన్ని తయారు చేశారు. వీటిలో మైలేజ్‌ పరంగా 15 శాతం అధికంగా ఉన్నా ట్యాంకులో 2 నుంచి 3 లీటర్లు నిల్వ ఉంచుకుంటేనే వాహనం నడుస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో పలు షోరూంలో బీఎస్‌–6 వాహనాలు అమ్మకాలకు సిద్ధం చేశారు.

పెట్రోల్‌ కూడా ప్రత్యేకమే
బీఎస్‌–6 వాహనాలకు పెట్రోల్‌ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్‌ నాటికి ఈ ఇంధనం పెట్రోల్‌ బంకులోకి అందుబాటులోకి రానుంది. అయితే ఈ పెట్రోల్‌ బీఎస్‌–4 వాహనాలకు కూడా వాడే విధంగా తయారు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ల జోరు..
బీఎస్‌–4 వాహనానను వదిలించుకునేందుకు డీలర్లు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాయితీలు అందిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 వరకు వాహనాలకు రిజిస్ట్రేషన్లు జరుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బీఎస్‌–4వాహనాలు వందల సంఖ్యలో ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. ఈ నెలాఖరు కల్లా వాహనాల అమ్మకాలు పూర్తవుతాయని చెబుతున్నారు.

మార్చి 31 వరకే బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్‌
ఈ నెల 31 వరకే బీఎస్‌–4 వాహనాలను రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వాహనం అందుబాటులోకి వస్తోంది. మార్చి 31 తర్వాత బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తాం. రిజిస్ట్రేషన్‌ లేకుండా రోడ్డుపై వచ్చే వాహనాలను సీజ్‌ చేస్తాం–శాంతకుమారి, ఆర్టీఓ, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement